25, మార్చి 2013, సోమవారం

పాత యెంత మధురం!



ముందుకు చూస్తూ నడవడం మంచిదే.
కానీ జీవన గమనంలో ఒక్క సారి ఆగి వెనక్కు తిరిగి చూసుకుంటే ఆ జ్ఞాపకాల దారిలో కానవచ్చే మధుర దృశ్యాలు ఎన్నో. ఎన్నెన్నో.
అలాటిదే ఈ రోజు ఫేస్ బుక్ ధర్మమా అని తారస పడింది.
పెళ్ళిళ్ళు శుభలేఖలు మనకు కొత్తేమీ కాదు. బహుశా ఈ రోజుల్లో శుభలేఖల మీద పెడుతున్న ఖర్చు చూస్తుంటే వెనకటి రోజుల్లో ఆ డబ్బుతో ఒక పెళ్ళే జరిగివుండేదేమో. అంత ఖరీదయిన కార్డులు కూడా రోజులు తిరక్కుండానే డస్ట్ బిన్ లలోకి చేరిపోతున్నాయి. ఈ నేపధ్యంలో నాటి పెళ్లి పత్రిక ఒకటి కళ్ళబడింది. ఇదిగో! అదే ఇది.


ఈ శుభలేఖకు షష్టిపూర్తి దాటిపోయింది. వధూవరులిద్దరూ ఎక్కడో అక్కడ చిరంజీవులుగా పిల్లా పాపలతో క్షేమంగా వుండివుంటారని, వుండాలని భవదీయుడి ఆశ.  అభిలాష.
ఈ పెళ్లి రెండో ప్రపంచ యుద్ధకాలంలో జరిగింది. ఆ రోజుల్లో నిత్యావసర వస్తువులకు యెంత కటకటగా వుండేదో ఈ పత్రికలో చేసిన ‘మనవి’ చదివితే బోధపడుతుంది. పెళ్ళికి వచ్చేవారు ఎవరి రేషను బియ్యాన్ని వారే ముందుగా పెళ్ళివారికి పంపాలన్న విజ్ఞప్తి ఇందులోవుంది.
అలాగే నాటి స్వాతంత్ర సమరం స్పూర్తి కూడా ఈ ఆహ్వానపత్రికలో కొట్టవచ్చినట్టు కనబడుతుంది. ఆహ్వానం మొదట్లో వున్న దేశభక్తి నినాదాలు గమనించండి.
ఈ పెళ్లి పత్రిక 'కాపీని' రామినేని భాస్కరేంద్ర రావు గారు పంపించారని కూడా వారు పేర్కొన్నారు.
'పంచుటలో వున్న హాయి వేరెచ్చట లేనేలేదని' మరోమారు తేటతెల్లం చేసిన  వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. 
(25-03-2013)

కామెంట్‌లు లేవు: