30, మే 2012, బుధవారం

తేరా భారత్! మేరా మహాన్!!


తేరా భారత్! మేరా మహాన్!! 

ఇటాలియన్ మంత్రిగారొకరు హడావిడిగా ఇండియా వచ్చి భారత విదేశాంగ మంత్రితో సమావేశం అయ్యారు. దీనికి కొంత నేపధ్యం వుంది. ఇటలీ నౌకాదళ సైనికులు ఇద్దర్ని అంతకు కొన్ని రోజులముందు కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మత్స్యకారులను సముద్రపు దొంగలుగా భ్రమపడి  ఇటలీ సైనికులు కాల్చి చంపారని అభియోగం. వారిని విడిపించే ప్రయత్నంలో భాగంగా ఇటలీ మంత్రి ఇండియా మంత్రి చర్చలు జరుపుతున్నారు.
పట్టుబడిన  ఇద్దరినీ ఇండియాలోనే వుంచి విచారణ జరపడం మంచిదని ఇండియా మంత్రి ఇటలీ మంత్రికి సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని వివరించే క్రమంలో ఆయన ఇటలీ మంత్రికి కొన్ని విషయాలు విశదం చేశారు.
ఇటలీలో పుట్టి పెరిగి ఇండియా కోడలిగా వచ్చి ఇప్పుడు ఏకంగా మొత్తం ఇండియానే శాసిస్తున్న సోనియా గాంధీకి జాతీయ అంతర్జాతీయ నేరస్తులపట్ల యెనలేని  కనికరం వున్న సంగతి యాదాలాపంగా బయట పెట్టారు. అందుకు దృష్ట్యాంతంగా   యూనియన్ కార్బైడ్ వ్యవహారం గురించీ, ఆయుధాల వ్యాపారి ఖత్రోచీ గురించీ, చివరాఖరుకు పాక్ ఉగ్రవాది కసబ్ పట్ల చూపుతున్న అపూర్వఆదరణ  గురించీ  ఇటలీ మంత్రికి వివరించి చెప్పి, ఇటాలియన్ సైనికుల విచారణ ఇండియాలోనే జరగడం వల్ల వాళ్లకు మంచే కాని చెడు జరగదన్న విషయాన్ని విడమరచి చెప్పారు.
అంతేకాదు స్పెక్ట్రం కుంభకోణం గురించీ, అందులో పీకల్లోతు ఇరుక్కున్న రాజా, కనిమొళి గురించీ ఇటలీ మంత్రి చెవిలో వేసారు. స్విస్  బ్యాంకుల్లో  కోట్లకు కోట్లు డబ్బు దాచుకున్న వారి సంగతి కూడా చెప్పి అలాటివారంతా భారత దేశంలో ఎలాటి  చీకూ చింతా లేకుండా యెలా రోజులు వెళ్ళదీస్తున్నారో సయితం అంకెలతో సహా చెప్పిచూసారు.        
ఎంతచెప్పినా ఆ ఇటలీ మంత్రికి చెవికెక్కిన దాఖలాలు లేవు.  భారత దేశంలో తన వారిపై విచారణ జరపడానికి సుతరామూ ఆయన  అంగీకరించలేదు. నేరస్తులకు రక్షణ పూర్తిగా వుంటుందని యెంత చెప్పినా అర్ధం చేసుకోని ఇటలీ మంత్రిపై ఇండియా మంత్రికి పట్టలేని కోపం వచ్చింది.
అయితే ఇంతలో ఒక అద్భుతం జరిగిపోయింది.
మంత్రి గదిలో వున్న టెలివిజన్ తెరపై అప్పుడు ఒక స్క్రోలింగ్ వస్తోంది.
ఇటలీ నౌకను పాతిక లక్షల రూపాయల పూచీకత్తుపై విడిచిపెట్టాలని కేరళ న్యాయమూర్తి ఆదేశించారన్నది  ఆ వార్త సారాంశం.
పాతిక లక్షల రూపాయలంటే యెంత అని ఇటలీ మంత్రి అడిగాడు. సుమారుగా ముప్పయ్ ఎనిమిది వేల   యూరోలని ఇండియా మంత్రి జవాబు చెప్పాడు.
భారత దేశ పౌరసత్వం దొరకాలంటే ఏం చెయ్యాలని ఇటలీ మంత్రి ఆసక్తిగా అడిగాడు.
నెహ్రూ కుటుంబంతో వియ్యం అందితే ఇట్టే  దొరుకుతుందని ఇటునుంచి సమాధానం.
‘వాళ్ల కుటుంబంలో  ‘పెళ్ళికాని ప్రసాద్’ రాహుల్ ఒక్కడే కదా! అదెలా సాధ్యం?’ అని ఇటాలియన్ మరో ప్రశ్న సంధించాడు.
అనవసరంగా రాహుల్ ప్రసక్తి తెచ్చానే అని నీళ్ళు నమిలిన ఇండియా మంత్రి ‘సిటిజన్ షిప్ లాంటి తతంగాలన్నీ అత్యల్ప స్వల్ప విషయాలు. వాటిని గురించి కనుక్కుని ఏర్పాట్లు చేయడానికి కోటరీ చాలా వుంది. ముందు మీ సంగతి  తేల్చండి’ అన్నాడు.          
ఇటలీ మంత్రి కూర్చున్న చోటి నుంచి కదలకుండా రోముకు ఫోను చేసి తాను ఇప్పట్లో ఇటలీ రావడం లేదని చెప్పాడు. మరో ఫోను సిసిలీకి చేసి అక్కడి మాఫియా అధినేతతో మాట్లాడాడు.
‘ఇన్నాళ్లబట్టి మీరంతా ఏదో పోటుగాళ్లన్న భ్రమలో వున్నాం. ఒకసారి ఇండియా వచ్చి చూడండి. ఇక్కడివాళ్ళు చాలా తెలివిమీరిపోయారు. మీరింకా పాత రాతి యుగంలోనే  వున్నారన్న సంగతి అర్ధమవుతుంది.’
(30-05-2012)
(ఇంటర్నెట్ లో సంచారం చేస్తున్న ఇంగ్లీష్ ‘జోకు’ కు స్వేచ్ఛానువాదం)   

29, మే 2012, మంగళవారం

పెద్దరికంలో వున్న మజా!


పెద్దరికంలో వున్న మజా!

“జీవితమంటే శక్తి. బలహీనతకు మరోపేరే మృత్యువు. మన వూహలు,ఆలోచనలు,ఆశలు,ఆశయాలు అన్నీ మన జీవితాల్లో భాగమే!” – స్వామి  వివేకానంద



అరవయ్యో పడిలో పడ్డ చాలామంది ఏదో తెలియని అభద్రతా భావంతో కలత చెందుతుండడం కద్దు. వయసు మీద పడుతోందన్న భావన కావచ్చు. జీవితం మలిసంధ్యలో అడుగు పెడుతున్నామన్న భయం కావచ్చు. సంఘంలో, కుటుంబంలో తమకున్న ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోతున్నదేమో అన్న  బాధ  కావచ్చు. కారణం ఏదయినా వయసు మీరుతున్నవారిలో ఈ రకమయిన ఆందోళనలు  సహజం. అయితే వీటిని అధిగమించి జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకోవడం అసాధ్యమేమీ కాదంటున్నారు జీవితాన్ని కాచి వడబోసిన వాళ్లు.       

ముందు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే ముసలితనం వచ్చేసిందని చెప్పుకోకపోవడం.
వయసుల్లో మూడు రకాలున్నాయి.జనన తేదీ ప్రకారం చెప్పుకునే వయసు ఒకటయితే,రెండోది శారీరిక ఆరోగ్యం ఆధారంగా అంచనా వేసేది. ఇక మూడో వయస్సు అనేది మన భావనలు  బట్టి ఆలోచనలు బట్టి నిర్ధారణ అవుతుంది. ‘కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు’ అని శ్రీ శ్రీ రాసింది ఇలాటి వారి గురించే.
ఇందులో మొదటి దానిమీద మనకు కంట్రోల్ వుండని మాట నిజమే. నిజానికి ఆ వయసును ఏమాత్రం మార్చలేము, ఏమార్చలేము.
కాకపోతే రెండోదాన్ని మానవ ప్రయత్నంతో  కొంతవరకు అడ్డుకోవడానికి వీలవుతుంది. అంటే సరయిన  పోషకాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మనసును ఉల్లాసంగా వుంచుకోవడం ద్వారా కొంతమేరకు వయసు ప్రభావం శరీరం మీద పడకుండా చూసుకోవచ్చు. సానుకూల వైఖరి, ఆశావహ దృక్పధం పెంపొందింపచేసుకోవడం వల్ల మూడో రకం వయస్సును అదుపుచేసుకోవడానికి  కుదురుతుంది.
ఆరోగ్యమే మహా భాగ్యం అనే సూక్తి చిన్నప్పటినుంచి వింటున్నదే. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ సూక్తిలోని ‘భాగ్యానికి’ నిర్వచనాన్ని మార్చుకోవాల్సి వుంటుంది.
భాగ్యం అంటే సంపద కాదు. బ్యాంకుల్లో వుండే డబ్బు కాదు. కుటుంబం అందరూ ఆనందంగా సంతోషంగా వుండడం. వయసు మళ్లి  పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ ఆలోచించుకోవాల్సింది డబ్బు గురించి  కాదు. ఆరోగ్యంగా వుండేట్టు చూసుకోవడం ముఖ్యం. వెనుకటి మాదిరిగా ఉమ్మడి కుటుంబాలకు కాలం చెల్లిపోయింది. ఉద్యోగాలు, ఉపాధులు వెతుక్కుంటూ పిల్లలు దూర ప్రాంతాలకు, ప్రదేశాలకు తరలివెడుతున్న కాలమిది. రోగం రొష్టూ పేరుతొ వారిని ఇబ్బందుల పాలు చేయకుండా ఆరోగ్యాలను మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఈనాటి పెద్దతరంపై వుంది. కొద్దిపాటి క్రమశిక్షణ అలవరచుకుంటే ఇదేమంత పెద్దపని కాదు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్య భీమా పాలసీ తీసుకోవడం, డాక్టర్ రాసిచ్చిన మందులు సక్రమంగా  వేసుకోవడం – ఇలా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోగలిగితే పిల్లల్ని అనవసర శ్రమలనుంచి రక్షించినవాళ్ళవుతారు.            
ధనమూలం ఇదం జగత్!
డబ్బుతో ఆనందాన్ని కొనడం వీలుకాదు కాని ఆనందంగా జీవించడానికి  డబ్బు కావాలి.
అందుకే పశువుకు తిన్నది దండి మనిషికి వున్నది దండి అన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, సమాజంలో గౌరవంగా జీవించడానికి, కుటుంబ సభ్యులనుంచి ప్రేమాదరాలు పొందడానికి, ఎంతో కొంత సొంత సొమ్ము ప్రతి ఒక్కరికీ అవసరం. వయస్సు మీదపడ్డ తరువాత శారీరిక శ్రమ చేసి సంపాదించడానికి వీలులేని రోజుల్ని ముందుగానే అంచనా వేసుకుని  భద్రమయిన భవిష్యత్ జీవితం కోసం తమకంటూ కొంత మొత్తాన్ని  కూడబెట్టుకోవడం చాలా అవసరం. దీన్ని స్వార్ధం అని ఎవ్వరూ అనుకోరు. మీ పిల్లలు మీ అవసరాలను కనుక్కోగలిగితే అది బోనసుగా భావించాలి. మీ అవసరాలు కనుక్కోలేని అవసరాలు వాళ్లకు వుంటే దాన్ని పెద్దమనసుతో అర్ధం చేసుకునే పెద్దరికం మీకుండాలి. అప్పుడే ముదిమి వయస్సులో చీకూ చింతా లేని జీవితం మీ సొంతమవుతుంది.

హాయిగా మనసెంతో తీయగా
మనసును హాయిగా వుంచుకోవాలి. ఇతరులను హాయిగా వుంచాలి. కుర్రవాళ్లల్లో కుర్రవాళ్ళుగా మసలగలగాలి. అంటే టీ షర్టులు వేసుకోవడం, షార్టులు ధరించడం కాదు. ‘మా రోజుల్లో అయితే...’ అంటూ నస పెట్టకుండా వాళ్లకు నచ్చేరీతిలో మీ రోజుల్లోని సంగతులను మనసుకు హత్తుకునే పద్దతిలో చెప్పడం  అలవరచుకోవాలి. వేళకు నిద్రపోవడం, చక్కటి సంగీతం వినడం, మంచి పుస్తకాలు చదవడం, నిత్య జీవితంలో హాస్యాన్ని ఆస్వాదించగలగడం – ఇవన్నీ మనసుకు హాయినిచ్చి వయసును తగ్గిస్తాయి.      
సమయం అమూల్యం
ఈ జీవన యానంలో సంపాదించింది యెంత వున్నా పోగొట్టుకున్నది, పోగొట్టుకునేది  మాత్రం అమూల్యమయిన సమయాన్నే అని గుర్తు పెట్టుకోవాలి. ఇకనుంచీ ప్రతి రోజూ కొత్తగా మళ్ళీ పుట్టామని అనుకోవాలి. నిన్న అనేది క్యాన్సిల్ చేసిన చెక్కు. రేపనేది ప్రామిసరీ నోటు. పోతే,  ఈ రోజు అనేది వుంది చూసారూ అది మాత్రం  చేతిలో వున్న పైకం. దాన్ని జాగ్రత్తగా ప్రయోజనకరంగా వాడుకోగలగాలి. ప్రతి క్షణాన్ని జీవించడం, ఆస్వాదించడం  నేర్చుకోవాలి.
మార్పు శాశ్వితం.
మారుతూ  వున్నప్పుడు అది శాశ్వితమెలా అవుతుందన్న అనుమానాలు పెట్టుకోకూడదు. మార్పును అంగీకరించడం అంటే వరద వాలులో కొట్టుకుంటూపోవడం కాదు. మార్పు అనివార్యం. ఈ సత్యం అంగీకరించగలిగితేనే యువ తరంతో, రానున్న తరంతో  సంబంధాలు బాగుంటాయి. పిల్లలు చెప్పేదేమిటి అని కొట్టిపారేయకుండా ఆ చెబుతున్న దానిలో కొత్తదనాన్ని గ్రహించగలిగితే ‘ముసలి వాసనలు’ మన నుంచి తప్పుకుంటాయి.   కాలక్రమంలో చోటుచేసుకున్న మార్పుల ఫలితంగానే మన జీవితాలు  ఇప్పుడిలా  సుఖప్రదంగా గడుస్తున్నాయన్న  వాస్తవాన్ని గుర్తు పెట్టుకోవాలి.  
నాకేమిటి?
స్వార్ధం లేని మనిషంటూ వుండడు.ఏమిచేసినా దీనివల్ల ‘నాకేమిటి’ అనేవాళ్ళే ఎక్కువగా తారసపడుతుంటారు.కానీ వున్న ఈ చిన్ని జీవితంలో అవసరంలో వున్నవాడికి సాయపడడం వల్ల కలిగే సంతృప్తికి ఏదీ సమానం కాదు.ఇచ్చుటలో వున్న హాయిని కనీసం జీవితం చరమాంకంలో కూడా అనుభవించలేకపోతే ఇక దానికి సార్ధకత లేనట్టే. ఆ జీవితానికి అర్ధం లేనట్టే.

మరచిపో !మన్నించు!!
ఈ రెండుపదాలు చాలా చిన్నవే అయినా నిజానికి  ఎంతో గొప్పవి.ఇతరుల తప్పిదాలు గురించి అస్తమానం ఆలోచించడం వల్ల వొరిగేదేమీ వుండదు.ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపడానికి మనం గాంధీలం కాకపోవచ్చు.  కానీ వయసు మీదపడుతున్న దశలో మన ఆరోగ్యం కోసం, మన ఆనందం కోసం ఈ మాత్రం సర్దుబాట్లు అవసరం. లేకపోతే పెరిగేది మన ‘బీపీ’నే.
ఇక ఆఖరుదీ అతి ముఖ్యమైనదీ ఏమిటంటే
మరణ భయం
జాతస్య మరణం ధృవం. పుట్టిన ప్రతి వ్యక్తీ గిట్టక తప్పదు. ఇది తెలియని వాళ్లు వుండరు. కానీ తెలియనట్టుగా వుంటారు. రేపు పదవీ విరమణ చేసే వ్యక్తి కూడా చేస్తున్న ఉద్యోగం  శాశ్వతమే అన్న భ్రమలో వుంటాడు. అలాగే మరణం తధ్యమని తెలిసీ అది తన జోలికి రాదన్న భ్రాంతిలో మనుషులు బతుకుతారు. శరీరం బలహీనపడి, అభద్రతాభావం బలపడి ఒక్కసారి మరణ భయం పట్టుకున్నదంటే చాలు ఇక ఆ మనిషి మరణానికి చేరువయినట్టే. మనం చనిపోతే భార్యా పిల్లలు తట్టుకోలేరన్న మరో అర్ధం లేని అనుమానం మనిషిని పీడిస్తుంది. కానీ సక్రుత్తుగా తప్ప ఇది జరిగే పని కాదు. ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి కుటుంబంలోని వారు బాధ పడడం సహజం. కానీ  ఆ బాధ, ఆ ఆవేదన  శాశ్వితంగా అలాగే వారిని అంటుకుని వుండవు. కాలమే అలాటి గాయాలు మానిపోయేలా చేస్తుంది. అది ప్రకృతి ప్రసాదించిన వరం.
అందుకే మరణం గురించి ఆలోచించడం శుద్ద దండుగ.
జీవితాన్ని అరవైల్లో కూడా మళ్ళీ మొదలు పెట్టవచ్చు. అది మన చేతుల్లోనే వుంది.
వయస్సు మళ్ళిన స్నేహితుల్లారా రండి. దర్జాగా  వెనుకడుగు వేద్దాం పదండి. వెనుకటి జీవితాన్ని మళ్ళీ ఆస్వాది
ద్దాం రారండి.
(29-05-2012) 

23, మే 2012, బుధవారం

ఐయ్యేయస్లంటే మాటలా ? మరి ‘మాటలే!’



ఐయ్యేయస్లంటే మాటలా ? మరి మాటలే!

(ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్.,ఐ.ఎఫ్.ఎస్. వంటి అఖిలభారత సర్వీసు అధికారులను ఎంపిక చేసే యూపీఎస్సీ ఇంటర్వ్యూ లలో అడిగే ప్రశ్నలు జవాబులు ఇలా వుంటాయిట.)

ప్రశ్న: పదిమంది కూలీలు కలసి పదిగంటల్లో ఒక గోడ కట్టారు. ఆ గోడ కట్టడానికి నలుగురు కూలీలకు యెంత టైం పడుతుంది?
జవాబు: పదిమంది కలిసి  ఆ గోడ అప్పటికే కట్టేశారంటున్నారు కదా! ఇక కొత్తగా పట్టే  టైం ఏముంటుంది? (యూపీఎస్సీ ఇరవై మూడో రాంకర్. ఇతగాడు  ఐ.ఎఫ్.ఎస్. సర్వీసును ఎంచుకున్నాడు.

ప్రశ్న: ఒక చేతిలో మూడు యాపిల్స్ నాలుగు బత్తాయిలు వున్నాయనుకో. రెండో చేతిలో నాలుగు యాపిల్స్ మూడు బత్తాయిలు వుంటే నువ్వు ఏది కోరుకుంటావు?
జవాబు: ఇంకా పెద్ద చేతులు వుంటే బాగుంటుందని.(యూపీఎస్సీ పదకొండో ర్యాంకు. ఐ.పీ.ఎస్. ను  ఎంచుకున్నాడు.) 

ప్రశ్న:  నిద్రపోకుండా మనిషి ఎనిమిది రోజులు గడపగలడా?
జవాబు: తప్పకుండా. రాత్రిపూట నిద్రపోతే సరి. (యూపీఎస్పీ  ఐ.ఏ.ఎస్.  98 వ ర్యాంకు)

ప్రశ్న: యెర్ర రాయిని నీలం సముద్రం లోకి విసిరితే ఏమవుతుంది?
జవాబు: మునిగిపోతుంది.(యూపీఎస్సీ ఐ.ఏ.ఎస్. రెండో ర్యాంకు)

ప్రశ్న: సగానికి కోసిన యాపిల్  పండు యెలా కనబడుతుంది?
జవాబు: సగం యాపిల్ మాదిరిగా.(యూపీఎస్సీ -  ఐ.ఏ.ఎస్. టాపర్)

ప్రశ్న : బ్రేక్ ఫాస్టులో నువ్వు తినలేనిది ఏమిటి?
జవాబు: డిన్నర్

ప్రశ్న: పది తేలిక ప్రశ్నలు అడగమంటావా లేక ఒక్క గొట్టు ప్రశ్నకు జవాబు చెబుతావా ?
అభ్యర్ధి: ఒక్క గట్టి ప్రశ్నే అడగండి.
ప్రశ్న: అయితే ఈ ప్రశ్నకు తడుముకోకుండా జవాబు చెప్పు. రాత్రి ముందు వస్తుందా? లేక  పగలా?
జవాబు: పగలే సర్.
ప్రశ్న: యెలా?
జవాబు: మీరు ఒక్క ప్రశ్నే అడుగుతామన్నారు సర్.

1987 ఆక్స్ ఫర్డ్  ఫిలాసఫీ పరీక్షలో ఒక ఎస్సే ప్రశ్న ఇచ్చారు. యాభయి మార్కులు.
‘ధైర్యమంటే ఏమిటి?’
ఒక  అభ్యర్ధి పది సమాధాన పత్రాలు తీసుకుని తొమ్మిది ఖాళీగా వొదిలి పదో దాంట్లో  చివర్న ఇలా రాసాడు.
ధైర్యమంటే ఇదే!  (23-05-2012)

21, మే 2012, సోమవారం

ఎవరికి నష్టం? ఆలోచించండి!



ఎవరికి నష్టం?  ఆలోచించండి!
ఎస్సెస్సీ లో ప్రధమ శ్రేణి. పీయూసీ లో కూడా మళ్ళీ మొదటి ర్యాంకే. ఐఐటీ ఎంట్రెన్స్ లో సేమ్ టు సేం ఫస్ట్ ర్యాంకే. ఆల్ ఇండియా ఐఐటీ కంప్యూటర్ సైన్స్ లో అదే వరస. అదే మొదటి ర్యాంకు. ఐఏఎస్ ఎంట్రెన్స్ పరీక్ష రాస్తే తిరిగి ఫస్ట్ ర్యాంకు. ఐఏఎస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో కూడా మళ్ళీ మొదటి ర్యాంకే.


శ్రీ నారాయణస్వామి, ఐ.ఏ.ఎస్.

చదువుల్లో  ఎక్కడా ఎప్పుడూ ‘ఫస్ట్ ర్యాంక్’ మిస్సు కాని ఈ చెన్నై ఐఐటీ కుర్రాడి పేరు నారాయణస్వామి. అక్కడ పట్టా పుచ్చుకున్న వెంటనే స్వామికి అమెరికా లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ – మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఆహ్వానం అందింది. స్కాలర్ షిప్ తో కూడిన సీటు వచ్చింది.
కానీ నారాయణ స్వామి రూటే వేరు. అతడు ఆలోచించే తరహానే వేరు. అందుకే అతడు నారాయణ స్వామి అయ్యాడు. ఈనాడు ఇంతగా చెప్పుకోదగ్గ మనిషి అయ్యాడు.
స్వామిది మధ్య తరగతి కుటుంబం. తన ఐఐటీ చదువుపై  ప్రభుత్వం  లక్షలు ఖర్చు పెట్టిందని తెలుసు. ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో కూడా తెలుసు. తనలాటి వాళ్లు, తన కంటే పేద వాళ్లు ప్రత్యక్షంగా పరోక్షంగా సర్కారుకు చెల్లించిన పన్నులు తన చదువుకు ఉపయోగపడ్డాయని తెలుసు. అందుకే రెక్కలొచ్చిన పక్షి మాదిరిగా స్వదేశాన్ని వొదిలి విదేశాలకు  పోకుండా ఇక్కడే వుండిపోయి  ‘తల్లి పాల రుణం’ కొంతయినా తీర్చుకోవాలని సంకల్పించుకున్నాడు. అందుకే ఐఏఎస్ ఆఫీసర్ అయి ప్రజలకు తన చేతనయిన  సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే, ఐఏఎస్ అనే మూడు అక్షరాలను  తన పేరుకు జోడించుకోవడం ద్వారా ప్రజాసేవకు ద్వారాలు తెరుచుకుంటాయని అనుకున్నాడే కాని, ఆ పదవిని వాడుకుని తన ద్వారా  నల్ల ధనం సంపాదించాలనే  నల్ల తాచులు తన చుట్టూ  పొంచి వుంటాయని మాత్రం వూహించలేక పోయాడు.
సబ్  కలక్టర్ గా మొదటి పోస్టింగ్ లోనే అతడికి ఐఏఎస్ గురించిన కన్న కలలన్నీ  కల్లలేనని తేలిపోయింది.తను అనుకున్నది అనుకున్నట్టు  చేయడం కాకుండా ఎవరో అనుకున్నది వాళ్లు అనుకున్నట్టు చేయడమే  అధికారిగా తన విధి అని అర్ధం అయింది. అయినా స్వామి తన తీరు మార్చుకోలేదు. తన దారి మార్చుకోలేదు. తనను తమ అదుపాజ్ఞల్లో వుంచుకోవాలని చూసిన అనధికార శక్తులకు పంటి కింద రాయిలా మారాడు. వారికి కంటి మీద కునుకు లేకుండా చేసాడు.
ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారితో మొదలయిన ఈ కయ్యం స్వామిని పేద ప్రజల దృష్టిలో దేవుడిని చేస్తే, రాజకీయనాయకుల దృష్టిలో ఎందుకూ పనికిరాని అధికారిగా ముద్ర వేసింది.
అల్లుడు జిల్లా కలెక్టర్ కాబట్టి తనని ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో స్వామి మామగారు తన ఇంటి స్థలం చుట్టూ అనుమతి లేకుండా  ప్రహరీ గోడ కట్టాడు. ఆ గోడ కారణంగా తమ కాలనీ నుంచి రాకపోకలకు వీలులేకుండా పోతోందని కొందరు బీదా  బిక్కీ కలెక్టర్ కు అర్జీ పెట్టుకున్నారు. తనిఖీ చేసిన స్వామి, మామగారు కట్టించిన గోడను పడగొట్టించాడు. ఫలితం. ఇంట్లో గొడవలు, భార్యతో కలతలు. చివరికి విచ్చిన్నమయిన కాపురం.        
పేద ప్రజలు నివాసం వుండే ఒక ప్రాంతంలో వరదల వల్ల భయం లేకుండా ఒక కరకట్ట నిర్మించారు. కట్ట నిర్మించిన కంట్రాక్టర్ ఎనిమిది కోట్లకు బిల్లు పెట్టాడు. నిర్మాణంలో లొసుగులు వున్నాయని అనుమానించిన నారాయణ స్వామి బిల్లును చెల్లించకుండా వర్షాకాలం వచ్చేవరకు నిలుపు చేయించాడు. నాలుగు వానలు పడ్డాయో లేదో కరకట్ట ఆనమాలు లేకుండా పోయింది. కంట్రాక్టర్ పత్తా లేకుండా పోయాడు. ఆవిధంగా   ప్రజాధనం ఎనిమిది కోట్లు కాపాడి ప్రజల అభిమాన ధనం సంపాదించుకోగలిగాడు కానీ  అదేసమయంలో అనేక మంది శత్రువులను కూడా సంపాదించుకున్నట్టయింది.       
     ఇంతలో మరో పరిణామం. వూళ్ళో ఒక  మద్యం వ్యాపారి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పదకొండు కోట్ల రూపాయలు ఎగగొట్టాడు. స్వామి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి అతడి గోళ్ళూడగొట్టి బాకీ వసూలు చేసాడు. అవతల వాడు సామాన్యుడు కాదు. నిమిషాల మీద ఓ మంత్రి ఫోను. కుదరదని స్వామి సమాధానం. పర్యవసానం క్షణాల మీద బదిలీ,  పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాల సంరక్షకాధికారిగా.
విసుగు చెందిన స్వామి కేంద్ర సర్వీసులకు వెళ్ళాలని దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం ఆ అభ్యర్ధనను కూడా తిరస్కరించింది.
ఎంతో చేద్దామనుకుని వచ్చి  ఏమీ చేయలేని నిస్సహాయ స్తితిలో స్వామి ఉద్యోగం వొదిలి పెట్టాలని నిర్ణయానికి వచ్చాడు. పారిస్ లో ఐక్యరాజ్యసమితి ఉద్యోగం ఆఫర్ కూడా వచ్చింది. స్వామిలాంటి  వారికి ఉద్యోగాల కొరత వుండదు. బయట ఎక్కడయినా వారిని నెత్తిమీద పెట్టుకుంటారు.
స్వామి లాటి అధికారి వెళ్లిపోతున్నాడంటే  రాజకీయులకు చీమకుట్టినట్టుకూడా వుండదు. పైపెచ్చు తమ ఆటలకు అడ్డూ అదుపూ వుండదని సంతోషిస్తారు కూడా.
అయితే జనాలకు ఏదో చేద్దామని ఆశ పడ్డ స్వామి లాటి అధికారులను కాపాడుకునేందుకు మనం ఏమీ చెయ్యలేమా? అన్నదే ప్రశ్న. వారి బదిలీ ఆపే అధికారం జనాలకు లేకపోవచ్చు. అలా బదిలీ చేసే రాజకీయులు  తిరిగి  ఎన్నిక కాకుండా చేయగల -  ‘వోటు’ అనే ‘పాశుపతాస్త్రం’ - జనం చేతిలోనే వుందన్న విషయం మాత్రం మరచిపోకూడదు.
ఏమంటారు? కాస్త ఆలోచించండి. (21-05-2012)     

20, మే 2012, ఆదివారం

కాశీ సమారాధన – మూడో భాగం


కాశీ సమారాధన – మూడో భాగం
చూస్తుండగానే మూడో ఆదివారం తోసుకువచ్చింది. కాస్త వెనక్కి వెళ్లి తొంభయ్యో  దశకంలో మా అక్కయ్య శ్రీమతి అన్నపూర్ణ రాసిన ‘అమ్మ’ పుస్తకంలో ఉదహరించిన కొన్ని కాశీ యాత్ర ముచ్చట్లు మననం చేసుకుందాం.
“అమ్మ అపర క్రియలు కాశీలో చేయాలన్న నిర్ణయం యే అదృశ్య శక్తో మాచేత చేయించింది. అంతేకాదు, మాకంటే ముందుగా ఎవరో వెళ్లి అన్ని ఏర్పాట్లు ఆ శక్తే చేసింది అన్నట్టుగా అంత  సాఫీగా, హాయిగా మా యాత్ర సాగింది.” అని మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు ఈ పుస్తకం తొలి పలుకుల్లో పేర్కొన్నారు. అవి అక్షర సత్యాలు.
పోతే అన్నపూర్ణక్కయ్య  తన కధనంలో కాశీయాత్రకు ప్రోద్భల పరచిన విషయాల పూర్వాపరాలను కూడా స్పృశించారు.
“ మా అమ్మగారి పేరు వెంకట్రామమ్మ. ఆమె కృష్ణా జిల్లా గండ్రాయిలో 1907  నవంబర్ ఒకటో తేదీన జన్మించింది. తండ్రి కొండపల్లి శ్రీనివాసరావు. తల్లి వెంకటమ్మ. పుట్టింటి వారిది శ్రీవత్స గోత్రం. చిన్న తనంలోనే తల్లీ తండ్రీ గతించారు. బాల్యం చాలా ఇబ్బందులతో గడిచిందని  చెబుతారు. ఆమె పెద్దన్న గారు కొండపల్లి రామచంద్ర రావు కష్టపడి చదువుకుని   ప్లీడరుగా బెజవాడలో ప్రాక్టీసు పెట్టి పేరుమోసిన న్యాయవాదిగా కీర్తి  గడించారు. ఆయన నివాసం వున్న రోడ్డుకు ఆయన పేరే పెట్టారు. రెండో అన్న కృష్ణారావు గారు గండ్రాయి కరణీకం చేస్తుండేవారు.
“ మా నాన్న గారు భండారు రాఘవ రావు గారు. ఆయన కంభంపాడు కరణం. పర్వతాలయ్య గారి పెద్ద కుమారుడు. ఆయనకు వివాహం చేయడానికి మా తాతగార్లు ముగ్గురూ గుమ్మడిదుర్రో మరే వూరో గుర్తులేదు – వెళ్లి పిల్లను చూసి సంబంధం అనుకూలంగానే వుందనుకుంటూ ఇంటికి తిరిగి వచ్చారుట. అదేసమయానికి, అప్పటికింకా ప్రాక్టీసు మొదలుపెట్టని మా పెద్ద మేనమామ రామచంద్రరావు గారు మా వూరు వచ్చి ఇంటి అరుగు మీద కూర్చుని మా తాతల రాకకోసం ఎదురు చూస్తున్నారు. మా నాన్న గారికి, ఆయన చెల్లెల్ని అంటే మా అమ్మగారిని ఇవ్వాలని వచ్చిన సంగతి అర్ధం చేసుకున్న మా తాతగార్లు అప్పుడేం చేయాలన్న మీమాంసలో పడ్డారు. వారు వెళ్లి వచ్చిన  సంబంధం వాళ్లు చాలా కలిగిన వాళ్లు. పదెకరాల తోట, సొమ్ములు పెడతాం అని చెప్పారట. ఇటు చూస్తే మా మేనమామ వాళ్ళది వేలు విడిచిన మేనరికం. బాగా లేమిలో వున్న కుటుంబం. ‘యేది ఏమయినా రామచంద్రం వచ్చి కూర్చుని పిల్లను ఇస్తానంటున్నాడు. కనుక మేనరికం కాదని బయటకు పోవడం ఉచితం కాద’ని తీర్మానించుకున్న మా తాతగార్లు రామచంద్రరావును లోపలకు పిలిచి సంబంధం ఖాయం చేసారుట. అలా అయింది మా నాన్న గారితో మా అమ్మగారి పెళ్లి. ఈ నాటిలా కాసులకు కాకుండా బంధుత్వాలకు ప్రాధాన్యం ఇచ్చే రోజులవి.
“అలా కంభంపాడులో మా ఇంటి గడప తొక్కిన మా అమ్మ, దాదాపు అరవై ఏళ్ళపాటు ఆ ఇంటితో అనుబంధం పెంచుకుంది. మొత్తం పన్నెండు కాన్పులు. ఒక పిల్లవాడు (ఏడో కాన్పు) పురిటిలో పోగా, ఏడుగురు ఆడపిల్లలూ, నలుగురు మగపిల్లలు కలిగారామెకు.
“కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు, ముని మనుమలు, ముని మనుమరాళ్లనే కాకుండా ముని ముని మనుమరాళ్లను కూడా కళ్ళారా చూసుకోగలిగిన  పూర్ణ జీవితం గడిపింది.
1993 జులై 30 నాడు – ఆ రోజు శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం – శుద్ద త్రయోదశి, అంతా వరలక్ష్మీ వ్రతం నోచుకున్నారు. ముత్తయిదువలు రావడం, ఫలహారాలు చేయడం, వాయనాలు తీసుకుని వెళ్లడం అంతా అయిపోయింది. ఇల్లంతా సందడి ఓ పక్క. మరో వైపు మరణ శయ్యపై అమ్మ. ఆ రోజు ఉదయం నుండి అమ్మ ఆరోగ్యం క్షీణిస్తూ వుంది.  ఏ క్షణానికి యేమో అన్నట్టుగా వుండడంతో, అందరికీ కబురు వెళ్ళింది.  చివరకు ఆ రాత్రి ఎనిమిది గంటల ఇరవై అయిదు నిమిషాలకు, ఇచ్చిన ‘కీ’ అయిపోతే గడియారం దానంతట అదే ఆగిపోయినట్టు అమ్మ ప్రశాంతంగా తుది శ్వాస విడిచింది. మమ్మల్ని అందర్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సంవత్సరం క్రితం కనకాభిషేకం చేసుకున్న ఒక సుదీర్ఘ జీవితం ముగిసిపోయింది.  మర్నాడు పంజాగుట్ట శ్మశాన వాటికలో జరిగిన అంత్య క్రియలకు అశేష సంఖ్యలో బంధు మిత్రులు తరలి వచ్చారు.
 “మూడో రోజు ఉదయం, ఆస్తి నిమజ్జనం గురించిన ప్రస్తావన వచ్చింది. భారతి మొగుడు పాండురంగారావు గారు ‘కాశీ వెళ్లి  గంగలో కలిపితే బాగుంటుంద’ని సూచించారు. దానిపై చర్చ సాగి సాగి అసలు మొత్తం కర్మ కాండ కాశీలోనే చేస్తే బాగుంటుందన్న సలహాను అంతా సమర్ధించారు. ఆ విధంగా కాశీ ప్రయాణం దైవికంగా నిర్ణయం అయిపోయింది.” (20-05-2012)                               

19, మే 2012, శనివారం

అపర పరమానందయ్య శిష్యుల కధ


అపర పరమానందయ్య శిష్యుల కధ

అనగనగా ఒక వూరు. ఆ వూరు పేరు పుణే అనబడే పూనా.
ఆ నగరంలో ఇద్దరు గురువులు. ఒకరు పరమానందయ్య, మరొకరు ఆనందయ్య. పరమానందయ్య గారి దగ్గర ఏడుగురు, ఆనందయ్య గారి దగ్గర మరో ఏడుగురు శిష్యరికం చేస్తున్నారు.
గురువుల సంగతేమో కానీ వారి శిష్యులకు మాత్రం తమ తెలివితేటలపై అపరిమితమైన నమ్మకం. అలాగే  అవతల జట్టు శిష్యుల తెలివితేటలపై  అంతులేని అపనమ్మకం.
ఒక రోజు ఇద్దరు గురువులు తమ శిష్యులను పిలిచి ముంబై లో ఒక పని చక్కపెట్టుకుని రమ్మని ఆదేశించారు.
గురువాజ్ఞను శిరసావహించి ఆ పద్నాలుగుమంది రెండు జట్లుగా పుణే రైల్వే స్టేషనుకు వెళ్లారు.
ఆ శిష్యబృందానికి  ఒక మహత్తరమయిన ఆలోచన వచ్చింది. గురువులు ఎట్లాగో లేరు. ఎదుటి పక్షం వారు తమ సమక్షం లోనే వున్నారు. రెండు పక్షాలలో ఎవరి తెలివి తేటలు గొప్పవో తేల్చుకోవడానికి  ఈ ప్రయాణమే ఇదే సరయిన తరుణం  అనుకున్నారు.
ఆనందయ్య బృందం తమ ఏడుగురికీ ఏడు టిక్కెట్లు కొనుక్కున్నారు. పరమానందయ్య శిష్యులు మాత్రం  ఏడు కొనకుండా అందరికీ కలిపి ఒకటే ఒక  టిక్కెట్టు కొన్నారు. ఇంతలో టీసీ వచ్చాడు. పరమానందయ్య శిష్యుల తిక్క కుదిరిందని ఆనందయ్య బృందం  ఆనందిస్తుండగానే, పరమానందయ్య శిష్యులు ఏడుగురూ తటాలున  రైలు బోగీలో వున్న   టాయిలెట్లో దూరారు. టీసీ టాయిలెట్ తలుపు తట్టాడు. తలుపు ఓరగా తెరుచుకుని ఒక చేయి బయటకు వచ్చింది. అందులో ఒక టిక్కెట్టు వుంది. టీసీ సంతృప్తి పడి  వెళ్ళిపోయాడు. ఇది చూసిన ఆనందయ్య శిష్యులకు వొళ్ళు మండింది. పరమానందయ్య శిష్యులు చేసిన ట్రిక్కు అర్ధమయింది.
సరే రెండు జట్లూ ముంబాయ్ చేరాయి. గురువులు ఒప్పగించిన పనులు చక్కబెట్టుకున్నాయి. తిరుగు ప్రయాణంలో ముంబాయ్ నుంచి వారికి డైరెక్ట్ ట్రైన్ లో టిక్కెట్లు దొరకలేదు. లోనావాలా వరకు ట్రైన్ లో వెళ్లి అక్కడినుంచి లోకల్ ట్రైన్లో  పుణే వెళ్ళాలనుకున్నారు.
తిరుగు ప్రయాణంలో ‘ఒకే టిక్కెట్టు’ అనే  ట్రిక్కుతోనే  ఎదుటి పక్షం ఆట కట్టించాలని ఆనందయ్య శిష్యులు పధకం వేసారు. ఈసారి వారు ఏడు టిక్కెట్లకు బదులు ఒకే టిక్కెట్టు కొనుక్కుని లోనావాలా రైలెక్కారు. పరమానందయ్య శిష్యులు ఒక్క టిక్కెటు కూడా కొనలేదు.
టీసీ రావడాన్ని పసికట్టి రెండు జట్లూ చెరో టాయిలెట్లో దూరాయి. పరమానందయ్య శిష్యుల్లో  ఒకడు టాయిలెట్ నుంచి  బయటకు వచ్చి టీసీ మాదిరిగా ఎదుటి టాయిలెట్ తలుపు తట్టాడు. అలా తట్టింది  టీసీయే అని భ్రమపడి ఆనందయ్య  శిష్యులు తమ వద్ద వున్న ఒకే ఒక టిక్కెట్టును తలుపు ఓరగా తెరిచి   బయట పెట్టారు. అదను కోసం వేచి వున్న పరమానందయ్య శిష్యుడు తటాలున ఆ టిక్కెట్టు తీసేసుకుని తమ టాయిలెట్లోకి దూరిపోయాడు. మళ్ళీ పాత ట్రిక్కే వాడి టీసీ నుంచి తప్పించుకున్నారు. కొనుక్కున్న ఒకే ఒక్క టిక్కెట్టును  పోగొట్టుకున్న ఆనందయ్య శిష్యులు టీసీకి దొరికిపోయి పెద్ద జరిమానా చెల్లించుకున్నారు.  
ఏమయితేనేం, మొత్తం మీద వారంతా లోనావాలా చేరుకొని పుణే వెళ్ళే లోకల్ ఎక్కారు.
ఆనందయ్య శిష్యులు ఒక్క టిక్కెట్టు ట్రిక్ మళ్ళీ  ప్రదర్శించి వూరుచేరేలోగా ప్రత్యర్ధి జట్టుపై ఒక్కమారయినా ఆధిక్యత చూపాలని అనుకున్నారు.
పరమానందయ్య  శిష్యులు మాత్రం బుద్ధిగా ఏడు టిక్కెట్లు కొనుక్కుని లోకల్ ట్రైన్ ఎక్కారు. ఈ కధలో లెక్కప్రకారం రావాల్సిన టీసీ యధాప్రకారం  వచ్చాడు. పరమానందయ్య  శిష్యులు తాము కొన్న టిక్కెట్లు చూపారు. ఒక్క టిక్కెట్టుతోనే  రైలెక్కిన ఆనందయ్య శిష్యులు  టీసీ కళ్లబడకుండా దాక్కోవడానికి టాయిలెట్ కోసం వెతికారు. కానీ అది వారికి  దొరక్కపోగా వాళ్లు మాత్రం ఎంచక్కా టీసీకి దొరికిపోయారు. ఎదుటి పక్షాన్ని ఓడించాలనే ఆత్రుతలో లోకల్  ట్రైన్లలో టాయిలెట్లు వుండవన్న సంగతి వారు మరచిపోయారు.
అంటే నీతి ఏమిటంటే అనుసరణ  మంచిదే కావచ్చుకాని ఎంతో కొంత ఆలోచన కూడా దానికి తోడు కావాలి. అప్పుడే అది రాణిస్తుంది. (19-05-2012)

18, మే 2012, శుక్రవారం

గుర్తు రావడంలేదు



గుర్తు రావడంలేదు
ఎనభయ్యవ పడిలో పడ్డ పరమేశ్వరాన్ని ఆయన బాల్య స్నేహితుడయిన ఏకాంబరం చాలా  ఏళ్ళ తరువాత ఇంటికి  ఆహ్వానించాడు.
భోజనాలు అయిన తరువాత ముసలివాళ్లిద్దరూ ఆరుబయట మంచాలు వేసుకుని పిచ్చాపాటీ మొదలుపెట్టారు.
పైకి ఏదో మాట్లాడుతున్నాడన్న మాటే కాని పరమేశ్వరాన్ని మనసులో ఒక సందేహం తొలుస్తోంది.
వచ్చినప్పటినుంచీ చూస్తున్నాడు. ఏకాంబరం భార్య కొంగుపట్టుకుని తిరుగుతూ ‘చూడు కన్నా, చూడు బుజ్జీ’ అంటూ ఒకటే నస.
ఇన్నేళ్ళ సంసారం తరువాత కూడా ఏకాంబరం భార్య పట్ల చూపిస్తున్న ప్రేమానురాగాలు, ప్రేమతో పిలుస్తున్న తీరూ గమనించిన పరమేశ్వరానికి మతిపోయినట్టుగావుంది. 
వాళ్ల  పెళ్ళయి దాదాపు అరవై ఏళ్ళు దాటిపోయాయి. అయినా ఏదో నిన్ననో మొన్ననో పెళ్ళిచేసుకున్న జంటలా ఆ పిలుపులు ఏమిటో.
వుండబట్టలేక ఏకాంబరాన్నే నేరుగా అడిగేసాడు అదేమిట్రా ఇంకా చిన్నపిల్లాడిలా పెళ్ళాన్ని పట్టుకుని కన్నా, బుజ్జీ అంటూ ఆ పిలుపులేమిటి? ఎంచక్కా పెళ్ళాన్ని పేరుతొ పిలవచ్చుకదా! అంటూ.
ఏకాంబరం జవాబు చెప్పాడు.
నాకూ పేరుతొ పిలవాలనే  వుంది. కానీ అదేమిటో కాని,  ఆమె పేరు 
 మరచిపోయి పదేళ్లవుతోంది. ఇప్పుడు నీ పేరేమిటని పొరబాటున అడిగాననుకో ఆ రాక్షసి నా ప్రాణం తోడుకుతింటుంది.



(18-05-2012)

కార్టూనిస్ట్ మల్లిక్ కి కృతజ్ఞలతో 

14, మే 2012, సోమవారం

దేవుడా జాగ్రత్త!


దేవుడా జాగ్రత్త! 

హే భగవాన్!

మమ్మల్ని క్షమించు.నీ ముందు మోకరిల్లి మేము రోజూ చేసే ప్రార్ధన ఒకటి. కానీ అనుదినం మేము చేస్తున్న పనులు వేరు.

ప్రతి రోజు ప్రార్ధన సమయంలో ‘దేవుడి మాటలంటూ’ నువ్వు చెప్పే వాటన్నిటినీ బుద్ధిగా వల్లె వేస్తాం.

అడుగు జరగగానే వాటిని నీ గుడి వాకిటి లోనే  మరచిపోతాం.

ఆడపిల్లల్ని గురించి పెద్ద పెద్ద కబుర్లు చెబుతాం. కానీ, వారిని తల్లి గర్భంలో  
వుండగానే మట్టుబెట్టే ప్రయత్నం చేస్తాం.

 పైకి మాత్రం ఆడపిల్ల కావాలో మగపిల్లవాడు కావాలో తేల్చుకునే  హక్కువుందంటూ  లెక్కలు చెబుతాం. 

పిల్లల్ని క్రమశిక్షణలో పెంచం. పైపెచ్చు  వాళ్లను చిన్నతనం నుంచే స్వతంత్ర భావాలతో పెంచుతున్నామని చెప్పుకుని గర్వపడతాం.

అధికారం అందితే చాలు, ఇక దాన్ని అవధులు లేకుండా  దుర్వినియోగం చేస్తాం. దానికి రాజకీయం అని ముద్దు పేరు పెట్టుకుంటాం.

పరాయి సొమ్ము పాముతో సమానమని సుద్దులు చెబుతాం. కానీ పరుల సొమ్ముకు ఇట్టే  ఆశపడతాం.  అవకాశం దొరికినా దొరక్కపోయినా దొరకపుచ్చుకుని మరీ పక్క వారి డబ్బులు, ఆస్తీ కాజేయాలని చూస్తాం. అందుకు పధకాలు వేస్తాం. ధనం సంపాదించడం ముఖ్యం కాని దాన్ని యెలా సంపాదించావన్నది ముఖ్యం కాదని సిద్ధాంతాలు లేవదీస్తాం.
 
సభ్యసమాజంలో సభ్యతగా మెలగాలని అందరికీ సూక్తులు బోధిస్తాం. వీలు చిక్కిందంటే చాలు నీలి చిత్రాలు చూడాలని మనసు పడతాం. రాతల్లో, రచనల్లో నీతులు కుమ్మరిస్తాం. సమయం దొరికిందంటే చాలు, కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లి మాదిరిగా ఆ నీతుల చుట్టూ గీతలు గీసిఅసలు రూపాలతో పాపాలు చేస్తాం. అసభ్య చిత్రాలతో,అడ్డమయిన  రాతలతో సమాజాన్ని కలుషితం చేస్తాం. ఈ ఘనకార్యానికి భావప్రకటనా స్వేచ్ఛ అని ఘనమయిన పేరు పెట్టుకుంటాం.
 

తాతల తండ్రులనుంచి వారసత్వంగా మా చేతికందిన విలువలను కాలరాచేస్తాం. పాతతరం భావాలు పాతరవేసి కొత్తతరాన్ని ఆవిష్కరిస్తున్నామని ఆర్భాటాలు పోతూ,  
మానసిక పరిణతికి ఈ మార్పును కొలమానంగా పేర్కొంటాం.

అందుకే  ఓ భగవాన్.

ఓ విషయం తెలుసుకో. మాకు నిన్ను మెప్పించడం తెలుసు. వరాలు కోరుకోవడం తెలుసు. వాటిని  నీ నుంచి పొందడం తెలుసు. ఈఠక్కుఠమార విద్యలన్నింటిలో మేము పెద్ద పెద్ద పట్టాలే పుచ్చుకున్నాం. కానీ నీకిచ్చే మాటలను నిలుపుకోవడం మాత్రం తెలియదు. తెలియదని కాదు, తెలియనట్టు వుంటాం. అది తెలుసుకో ముందు.

చేసేవన్నీ చేసేసి అవన్నీ నీమీదకు తోసేసే తెలివితేటలు మాకు నువ్వే ఇచ్చావన్న సంగతి మాత్రం మరచిపోకు.

మమ్మల్నో కంట కనిపెట్టి చూడు.

మా మనుషుల తరహా చూస్తుంటే వాళ్ళల్లో ఒకడినయిన నాకే భయం వేస్తోంది. అందుకే సమయం చూసి నీకీ విషయాలు చెవిలో వేస్తున్నాను.

మా మాదిరిగానే నువ్వుకూడా నీ సృష్టినీ, నీ సంతానాన్ని  గాలికి  వొదిలేస్తే, మమ్మల్ని కనిపెట్టిచూడడానికి నువ్వున్నట్టు నీకెవ్వరూ లేరు. అది గుర్తుంచుకో. అప్పుడు – ‘ధర్మ సంస్థాప నార్ధాయ సంభవామి యుగే యుగేఅంటూ  మరో అవతారం ఎత్తినా  ఎలాటి ఫలితం వుండదు.
ఎందుకంటే, మేం మానవులం. సామాన్యులం కాదు.

తస్మాత్ జాగ్రతః 


(14-05-2012)

13, మే 2012, ఆదివారం

కాశీ సమారాధన – 2


కాశీ సమారాధన – 2
మేము హైదరాబాదులో ఉదయం పది గంటలకు  ఇండిగో ఫ్లయిట్ ఎక్కి మధ్యాహ్నం పన్నెండు గంటలకు కోల్ కతా చేరాము. అక్కడ ఆరోజు వుండి చూడదగ్గ ప్రదేశాలు చూసేసి మర్నాడు రైల్లో కాశీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాము. బహుశా ముందు ముందు ఈ ప్రయాణ కాలం మరింత తగ్గిపోయే అవకాశం వుంటుందేమో. కోల్ కతా నుంచి వారణాసికి కనెక్టింగ్ ఫ్లయిట్ వుందో లేదో తెలవదు. అలాగే  హైదరాబాదునుంచి కాశీకి నేరుగా విమాన సౌకర్యం వున్న పక్షంలో ఇంట్లో వొంట్లో పుష్కలంగా వున్నవారు మరింత త్వరగా కాశీ యాత్ర పూర్తిచేసుకు రావడానికి వీలుంటుంది.


కానీ ఏనుగుల వీరాస్వామయ్య గారు కాశీ యాత్ర చేసిన రోజుల్లో ఇలాటి వెసులుబాట్లు లేవు. ఆయన గారు తన బృందంతో కలసి చెన్నపట్నం నుంచి కాశీ వెళ్లి రావడానికి అనేక  రోజులు పట్టింది. ఆమాటకు వస్తే ఆయన చాలా స్తితిమంతుల కుటుంబానికి చెందినవారు. పైగా ఉద్యోగరీత్యా కూడా బాగా పలుకుబడి కలిగిన వ్యక్తి. అయినా కానీ కాశీ యాత్ర చేసిరావడానికి ఆయనకు అన్ని రోజులు పట్టిందంటే ఇక ఆ రోజుల్లో  మామూలు మనుషుల సంగతి అర్ధం చేసుకోవచ్చు. దారి మధ్యలో బందిపోట్ల భయం, కొత్తప్రదేశాల్లో  గాలీ నీరూ పడక నానా రకాల రుగ్మతలతో పడకేసే ప్రమాదం, దారిపొడుగునా దారిఖర్చులకయ్యే పైకాన్ని భద్రపరచుకోవడానికి సరయిన వసతులు లేకపోవడం, వేళకు అన్నపానాదులకు వీలువుండని పరిస్థితులు,    అంతకు ముందు ఎవ్వరూ వెళ్ళని మార్గాల్లో ప్రయాణాలు, అడవి బాటలో క్రూర జంతువుల తాకిళ్లు, ఒకటా రెండా అనేక అవరోధాల నడుమ కాశీ ప్రయాణం దినదిన గండంగా సాగేది. అందుకే కాబోలు కాశీకి వెళ్లినవాడు, కాటికి వెళ్లినవాడితో సమానం వంటి  సామెతలు పుట్టాయి.
స్త్రీజనంతో సహా దాదాపు నూరుమందితో కూడిన   పెద్ద పరివారాన్ని వెంటబెట్టుకుని రోజుకు పన్నెండు మైళ్ల చొప్పున  అనేక చోట్ల మజిలీలు చేస్తూ వీరాస్వామయ్య గారు కాశీయాత్ర పూర్తి చేశారు. దారి చాలా భాగం అడవులు, కొండలు. అడుగడుగున వాగులు, నదులు. మహా క్రూరులయిన దొంగల వలన ప్రతిక్షణం భయమే. వర్షం పడితే అనేకచోట్ల కాలుదిగబడిపోయే నేలల్లో, వర్షం లేకపోయినా సూదుల్లా గుచ్చుకునే నల్లరేగడి నేలల్లో, రాతిగొట్టు నేలల్లో కాలిబాటన ప్రయాణం. ఎక్కడో అక్కడ మజిలీ చేసినా అంతమంది జనాన్ని  భరాయించగల మకాము దొరకడం కష్టమే. చిన్న చిన్న వూళ్ళల్లో వేసే మకాముల్లో  అంతమందికి  కావలసిన పదార్ధాలు, కూరగాయలు, వంట చెరకు లభించడం కూడా కష్టమే.
వీరాస్వామయ్య గారు చెన్నపట్నంలో 1830 వ సంవత్సరం మే 18 వ తేదీన కాశీ బయలుదేరి  1831 సెప్టెంబర్ మూడో తేదీన తిరిగి చెన్నపట్నం చేరుకున్నారు. ఈ కాశీయాత్ర చేసి రావడానికి పట్టిన వ్యవధి  ఆయన గారి మాటల్లోనే చెప్పాలంటే, ‘15 మాసాల 15 దినాల 10 నిమిషాలు’.
మా బామ్మగారి టైముకు అది పదిహేను రోజులకు, మా అమ్మగారి హయాముకు పది రోజులకు తగ్గిపోయింది. అలాగే ప్రయాణ సమయంలో కడగండ్లు కూడా అదేవిధంగా తగ్గిపోయాయి. దానికి తగ్గట్టే  అనుభూతులు, అనుభవాలు  అదే మేరకు తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు. ఇక మేము కాశీ వెళ్లి వచ్చిన తరువాత చెప్పుకోవడానికి పెద్ద విశేషాలు ఏమీ మిగలలేదు. ‘ప్రయాణం అంతా బాగా జరిగింది కదా!’ అనే బంధు మిత్రుల ప్రశ్నలకు క్లుప్తంగా ‘అవును’ అనే సమాధానం తప్ప. (13-05-2012)
(కాశీ సమారాధన మూడో భాగం వచ్చే ఆదివారం)                

‘అరవై ఏళ్ళ’ బాలిక




అరవై ఏళ్ళ’ బాలిక  
నిజంగా ఆశ్చర్యం వేసింది అప్పటి’ కన్ను ఒకటి ఇంకా చూస్తున్నదని ఈ రోజు పత్రికల్లో చదివినప్పుడు. ఆనాటి మహత్తర చరిత్రను కళ్ళారా వీక్షించిన ఆ నేత్రం’ ఈ నాటి పరిస్తితులను చూస్తూ యెంత కన్నీరు పెట్టుకుంటున్నదో అన్న బాధ మనసును కలచి వేస్తోంది.
ఆయన వయస్సు ఇప్పుడు 92  ఏళ్ళు. పేరు కందాల సుబ్రహ్మణ్యం అలియాస్ తిలక్. భారత పార్లమెంటు ఏర్పడి రేపటికి అంటే మే 13  తేదీకి అరవై ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంలో తొలి సభలో సభ్యులుగా వున్నవారిలో ఇంకా ఎవరయినా బతికున్నారా అని కాగడా వేసి వెతుకుతుంటే అలాటి వారు మొత్తం దేశంలో నలుగురే నలుగురు  కనిపించారు. వారిలో ఒకరు  ఈ కందాల సుబ్రహ్మణ్యం గారు. విజయనగరం మాజీ ఎంపీ.
ఈ చారిత్రిక ఘట్టాన్ని పురస్కరించుకుని లోక సభ స్పీకర్ మీరా కుమార్ మే 13  వ తేదీ  కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని తలపెట్టారు. ఈ నేపధ్యం లోనే సుబ్రహ్మణ్యం గారికి ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. తెలుగు ప్రజలకు లభిస్తున్న అపూర్వ గౌరవం ఇది.
శ్రీ సుబ్రహ్మణ్యం తొట్టతొలి లోక్ సభకు ఎన్నికయిన 499  సభ్యులలో ఒకరు.  ఆనాటి సభ్యులలో వీరికి మరో విశిష్టత కూడా వుంది. అప్పుడు జరిగిన తొలి పార్లమెంటు ఎన్నికల్లో దేశం మొత్తం మీద అత్యధిక మెజారిటీ తో గెలిచిన మొదటి ముగ్గురిలో శ్రీ సుబ్రహ్మణ్యం కూడా ఒకరు. జవహర్లాల్ నెహ్రూ మొదటి స్థానం దక్కించుకోగా మన రాష్ట్రానికే చెందిన రావి నారాయణ రెడ్డి గారు రెండో స్థానాన్నిసోషలిస్టు పార్టీ తరపున నిలబడ్డ శ్రీ సుబ్రహ్మణ్యం అలియాస్ తిలక్ మూడో స్థానం సంపాదించు కున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యం ప్రత్యర్దులెవ్వరికీ డిపాజిట్లు కూడా దక్కలేదు. ఆ ఎన్నికల్లో నిలబడేటప్పుడే ప్రజలకు ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఆయన మరోసారి ఎప్పుడూ ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అప్పటినుంచి రాజకీయాలకు దూరంగా విశాఖ పట్నం దగ్గర సామాన్య జీవితం గడుపుతూ వస్తున్నారు.
అలాటి మహోన్నత వ్యక్తికి శిరసువంచి పాదాభివందనం చేయాలి.
అలాగే ఈ గౌరవ పురస్కారాన్ని అందుకుంటున్న మరో తెలుగు తేజం కానేటి మోహన రావు గారు.
పోతేఈ అరవై  ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో పార్లమెంటు సాధించిన విజయాలను సమీక్షించుకోవడంలోటుపాట్లను సరిదిద్దుకోవడం అవసరం. ఒక్కసారి ఆగి వెనక్కు తిరిగి చూసుకుంటే కనిపించే దృశ్యం ఏమిటి?

స్వాతంత్ర్య దినోత్సవాలుగణతంత్ర దినోత్సవాల సందర్భంలో  సైనిక కవాతులుశస్త్రాస్త్ర ప్రదర్శనలుభారీ టాంకులువైమానిక దళ విన్యాసాలతో ఎలాంటి పరిణామాలనయినా ఎదుర్కోగల యుద్ధ సన్నద్ధతనుజాతి సంసిద్ధతను ఒక పక్క ప్రదర్శిస్తూనే మరో పక్క బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుకనుంచి నాయకులు చేసే ప్రసంగాలు వినవలసి రావడం యెంతటి  విషాదం?
శాంతి భారతంగా పేరొందిన భారతదేశంలో ఈనాడు ఎక్కడ ఏమిజరుగుతుందోఎక్కడ ఏ బాంబు పేలుతుందో తెలియని పరిస్తితి పొటమరించడం యెంతటి  దారుణం?
మతమన్నది మనకంటికి మసకయితే
కులమన్నది మనకంటికి కురుపయితే
మతం వద్దు కులం  వద్దు మారణ హోమం వద్దు అన్న సూక్తులను వొంటబట్టించుకుని ఎదిగిన ఓ తరం ఈనాటి పరిస్తితులను చూసి – మనం కోరుకున్న స్వేఛ్చా భారతం ఇదేనా  అని మధనపడాల్సిరావడం మరెంతటి దుస్తరం?
మతాల దురభిమానాలతోకులాల కుంపట్లతోప్రాంతీయ ద్వేషాలతో దేశం  యావత్తు అడ్డంగా నిలువుగా చీలిపోతుంటే-
స్వార్ధమే పరమావధిగాసంపాదనే ఉపాధిగాఅడ్డదారుల్లో అందినంత స్వాహా చేయడమే అంతిమ లక్ష్యంగా నీతికి దూరంగాఅవినీతికి ఆలంబనగా తయారయిన రాజకీయ దళారులంతా కలసి కుమ్మక్కై  జాతి సంపదను నిస్సిగ్గుగా కొల్లగొడుతుంటే-
జనరంజకంగా పాలించాల్సిన అధికార  యంత్రాంగం లంచాల మత్తులోపడి ప్రజల రక్తం పీలుస్తుంటే -
రాజ్యాంగం ఏర్పరచిన అన్ని వ్యవస్తలు మారుతున్న కాలానికి అనుగుణంగా విలువలను నిలువు పాతర వేసి కుప్పకూలి  కునారిల్లుతున్న సమయంలో, ‘నేనున్నానంటూ’ జనాలకు వెన్నుదన్నుగా నిలబడాల్సిన మీడియా సయితంతానూ ఆ తానులో ఓ ముక్కగా మారిపోతుంటే 
నిస్సహాయంగా జనం చూడాల్సి రావడం యెంత విషాదంయెంత దారుణంయెంత దుస్తరం, యెంత బాధాకరం?  

అయితే ఏమిటట?

నాణానికి బొమ్మా బొరుసూ ఉన్నట్టేప్రపంచం గర్వించదగిన   గొప్ప లక్షణాలను కూడా స్వతంత్ర భారతం తన కొంగున ముడివేసుకుంది. 1947 లో మన దేశంతో పాటే స్వేఛ్చా వాయువులు పీల్చుకున్న అనేక ఆసియా దేశాలుఇరుగు పొరుగు దేశాలు ఈ అరవై ఏళ్ళలో కొంతకాలం పాటయినా ప్రజాస్వామ్య పధాన్ని వీడి నియంతృత్వపు బాటలో నడిచిన దాఖలాలున్నాయి. మన దేశం మాత్రం ఎన్ని వొడిదుడుకులకు లోనయినామరెన్ని వొత్తిడులకు గురయినాఅప్రతిహతంగా ఎంచుకున్న మార్గంలోనే పురోగమించి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటిగా తన స్తానాన్ని పదిలం చేసుకుంది.


జనాభాలో అత్యధిక భాగం నిరక్షర కుక్షులయినా 'వోటుఅనే ఆయుధంతో ప్రభుత్వాలను మార్చగల సత్తా వారి సొంతం. అక్షర జ్ఞానం లేకపోయినాకానులూఏగానులనుంచిబేడలూ అర్ధణాల నుంచి నయా పైసల లెక్కకు అలవోకగా మారగలిగిన 'మేధోతనంవారి ఆస్తి. గిద్దెలుసోలలు, శేర్లుసవాశేర్లు, మానికెల కొలతలనుంచి లీటర్లకు అతి తక్కువ వ్యవధిలో మారిన చరిత్ర వారిది. అలాగే, వీసెలుమణుగులనుంచి కిలోగ్రాములకుబస్తాలనుంచి క్వింటాళ్లకు,  'మైలు రాళ్ళనిఅధిగమించి కిలోమీటర్లకు ఎదిగారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా కిలోమీటర్ల లెక్కల్లోకి మారిపోకుండా పాతకాలంలోలా   ఇంకా మైలురాళ్ళదగ్గరే ఆగిపోయిన సంగతి ఇక్కడ గమనార్హం.
చదువూసంధ్యా లేని వాళ్లనీఎందుకు  పనికిరాని వాళ్ళనీ  ఇతర దేశాల వారికి మనపై చిన్నచూపు. కానీ అలాటి మనవాళ్ళు - దేశానికి స్వాతంత్రం రాగానే నిర్వహించిన తొలి ఎన్నికల్లో పార్టీల గుర్తులున్న పెట్టెలలో వోటు వేసే దశను అలవోకగా దాటేసారు. ఆ తరువాత  ఒకే బాలట్ పేపరుపై  ముద్రించిన అనేక పార్టీల  గుర్తులనుంచి తాము ఎంచుకున్న అభ్యర్ధిని అతడి గుర్తుతోనే   గుర్తుపట్టి  వోటు వేయగల పరిణతిని అందుకున్నారు. ఇప్పుడు ఏకంగా అధునాతన  ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను తడబడకుండా ఉపయోగించుకోగల సామర్ధ్యాన్ని అలవరచుకోగలిగారు.

'ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణంఅనే నిర్లిప్త స్తితిని అధిగమించి ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో భారతీయుల ముద్ర స్పుటంగాప్రస్పుటంగా ప్రపంచ వ్యాప్తంగా కానరాగల అత్యున్నత శిఖరాలకు మన దేశం చేరుకోగలగడం స్వతంత్ర భారతం సాధించిన మరో ఘనత.


'చందమామ రావేఅంటూ పాటలు పాడే స్తితి నుంచి 'చంద్రయాన్వరకు ఎదగగలిగాము. అంతరిక్ష పరిశోధనల్లో అభివృద్ధి చెందిన  దేశాల సరసకు చేరగలిగాము. సుదూర లక్ష్యాలను చేధించగలిగిన అధునాతన రక్షణ  క్షిపణులను అంబుల పొదిలో చేర్చుకోగలిగాము. సస్య విప్లవం విజయవంతం చేసుకుని ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే దుస్తితి తప్పించుకుని స్వయం సమృద్ధిని సాధించుకోగ లిగాము.       

ఏ ఇంగ్లీష్ వారితో తలపడిఅహింసా మార్గంలో వారితో  పోరాడి స్వతంత్రం సంపాదించుకున్నామోఆ ఇంగ్లీషు వారి భాషనే ఆయుధంగా చేసుకుని - దేశ దేశాలలో కంప్యూటర్ రంగాన్ని మన కనుసన్నలతో శాసించగలుగుతున్నాము.  

అయితే ,అంగట్లో  అన్నీవున్నా అల్లుడి నోట్లో శని అన్న సామెత మాదిరిగా ఎక్కడో ఏదో లోటు జనం మనస్సులని కుదిపేస్తోంది. ఆరు దశాబ్దాల పై చిలుకు కాలంలో సాధించిన అభివృద్ధి అంతా అడవిగాచిన వెన్నెల అవుతున్నదేమో అన్న శంక కలవరపెడుతోంది.

వెడుతున్న దోవ మంచిదే. కానీనడుస్తున్న కాళ్లే తడబడుతున్నాయి. ఒకదానికి మరొకటి అడ్డంపడి గమ్యాన్ని మరింత దూరం చేస్తున్నాయి.

వినిపిస్తున్న సందేశం మంచిదే. విభిన్న స్వరాలే అపస్వరాలతో అసలు అర్ధాన్ని మార్చి వేస్తున్నాయి.

అందరూ మంచివాళ్ళే. కానీ మానసిక కాలుష్యమే  వాళ్ళ మంచితనాన్ని మంచులా కరిగించి వేస్తోంది.

స్వార్ధం ముందు నిస్వార్ధం తలవంచుతోంది. అధికారం అన్నదే పరమావధిగాధనార్జన అన్నదే అంతిమ ధ్యేయంగా - అవలక్షణలక్షిత సమాజం రూపుదిద్దుకుంటోంది.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ రకమయిన పరిణామాలు అనివార్యంఅతి సహజం. అయితే అవి  తాత్కాలికం కావాలి. శాశ్వితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం అందరిదీ.

ఒకరిపై మరొకరు నెపాలు మోపకుండాతప్పులు దిద్దుకోగలిగితే మార్పు అనివార్యం.

ఈ శుభసమయంలో  మనమందరం జాతికి కలసికట్టుగా ఇవ్వాల్సిన కానుక అదే.

-భండారు శ్రీనివాసరావు  (13-05-2012)