19, ఆగస్టు 2023, శనివారం

ఫోటో – భండారు శ్రీనివాసరావు

 

నా చిన్ననాటి స్నేహితుడు, సహాధ్యాయి ప్లస్ మేనల్లుడు అయిన తుర్లపాటి సాంబశివరావు (శాయిబాబు) దగ్గర ఒక డబ్బా డొక్కు కెమెరా వుండేది. అది పనిచేసేదా కాదా తెలుసుకోవాలి అంటే పదో పదిహేనో రూపాయలు కావాలి. రీలు కొనడానికి ఓ పది, కడిగించి ప్రింట్లు వేయడానికి మళ్ళీ కొంతా ఇల్లాగన్న మాట.  అంత మొత్తం మాదగ్గర ఎలాగూ వుండదు కాబట్టి, అదో టాయ్ కెమేరాలాగా శాయిబాబు వద్ద చాలా కాలం ఉండిపోయింది.

ఒకరోజు దాని అవసరం వచ్చింది. అప్పటికి చదువు  పూర్తి కాకుండా, ఉద్యోగం సద్యోగం కనుచూపుమేరలో లేదన్న సంగతి నిర్ధారణగా తెలిసిన రోజుల్లో, పక్కింటి అమ్మాయితో (అంటే తదనంతర కాలంలో మా ఆవిడ) నా ప్రేమ వ్యవహారం నిరాఘాటంగా సాగిపోతున్న అద్భుత కాలంలో నాకు ఆ కెమెరా కావాల్సి వచ్చింది. కృష్ణా  బ్యారేజి దాకా నడుచుకుంటూ వెళ్లి అక్కడి నుంచి గూడు రిక్షాలో మంగళగిరి పానకాల స్వామి దర్శనం చేసుకుని రావాలనేది నా ప్లాను. మరో మేనల్లుడు రామచంద్రం మన కూడా వస్తేనే నేను వస్తానని నాకు కాబోయే ఆవిడ  షరతు పెట్టడంతో,  ముగ్గురం కలిసి వెళ్ళాము.  దర్శనం అదీ అయిన తర్వాత అక్కడి కొండపై ఇదిగో ఈ కింది ఫోటో దిగాము. తీసింది రామచంద్రం. కెమెరా ఇచ్చేటప్పుడే చెప్పాడు. రీల్లో ఆల్రెడీ తీసిన ఫోటోలు కొన్ని వున్నాయి. డబ్బులు లేక కడిగించలేదు, కాబట్టి ఒకటీ లేదంటే రెండు, అంతే అంతకంటే ఎక్కువ దిగకండి అని. దాంతో ఒక్కటంటే ఒక్క ఫొటోనే దిగి కెమెరా తిరిగి ఇచ్చేశాను. 

ఆ రీలు కడిగించే డబ్బులు కూడ బెట్టడానికి మరి కొన్ని నెలలు ఆగాల్సివచ్చింది. వీరన్న స్టూడియోలో ఇచ్చాము. రెండు రోజుల తర్వాత చూస్తే రీల్లో చాలా ఫోటోలు  ప్రింటుకు పనికిరానివని తేలింది. చివరికి ఐదో ఆరో బాగున్నాయి. కానీ అన్నీ ప్రింటు వేయించాలి అంటే డబ్బులు సరిపోవు. అంచేత ఓ మూడు వేయించాము. అందులో ఇదొకటి.



పెళ్ళికి ముందు ఫోటో కదా! అదో స్వీట్ మెమొరి.

(ఈరోజు, ఆగస్టు 19, వరల్డ్  ఫోటోగ్రఫీ డే అట కదా!)

6, ఆగస్టు 2023, ఆదివారం

రష్యన్ కనెక్షన్ – భండారు శ్రీనివాసరావు

 మిహాయిల్ గోర్భచెవ్ లక్ష్మణ కుమార్

అరవై పడిలో పడిన వారికి గోర్భచెవ్ ఎవరో తెలిసే వుండొచ్చు. కానీ లక్ష్మణకుమార్ అనే అచ్చ తెలుగు పేరున్న కన్నడిగుడైన వ్యక్తికి ఏం సంబంధం?
తొంభయ్యవ దశకంలో రేడియో మాస్కోలో పనిచేస్తూ వున్నప్పుడు ఆ అయిదేళ్ళ పాటు సోవియట్ ప్రైం టైం టీవీలో అస్తమానం ప్రముఖంగా కనిపించే వ్యక్తులు ఎవరయ్యా అంటే సోవియట్ యూనియన్ అధినాయకుడు మిహాయిల్ గోర్భచెవ్, ఆయనతో పాటు ఇదిగో ఈ లక్ష్మణకుమార్ గారు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో పనిచేసే సిబ్బంది పిల్లల చదువు సంధ్యల కోసం ఎంబసీ వారు నెలకొల్పిన ఇండియన్ సెంట్రల్ స్కూల్లో యోగా టీచర్. అలనాటి అంటే దాదాపు ముప్పయ్ ఆరేళ్ల క్రితమే సోవియట్ పౌరులకు యోగాలో శిక్షణ ఇచ్చేందుకు వారానికి ఒకరోజు సోవియట్ ప్రైం టైం టీవీ ఛానల్ లో నిర్విరామంగా ఒక గంటకు పైగా యోగా పాఠాలు చెబుతూ కానవచ్చే వారు. బహుశా ఒక విదేశీ ప్రైం ఛానల్లో ప్రముఖంగా కనిపించే అవకాశం సకృత్తుగా కొందరికే లభిస్తుందేమో. అలాంటిది సోవియట్ యూనియన్ వంటి ఇనుపతెరల దేశంలో ఇది మరీ అసాధ్యం. అలాంటి అరుదైన మహత్తర అవకాశం లక్ష్మణ కుమార్ గారికి అయాచితంగా దొరికింది.
మా ఇద్దరు పిల్లలు మాస్కోలో అదే కేంద్రీయ పాఠశాలలో చదువుతున్నప్పుడు లక్ష్మణకుమార్ గారి పిల్లలు గిరిజ, గీతేశ్ మా పిల్లలు సందీప్, సంతోష్ క్లాస్ మేట్స్.
సరే! మా జీవితంలో ఒక అద్భుత ఘట్టానికి, సోవియట్ యూనియన్ అంగ వంగ కళింగ దేశాల మాదిరిగా విడిపోవడానికి ఒకేసారి తెర పడింది. దాంతో ఎక్కడివాళ్ళం అక్కడ తట్టా బుట్టా సర్దుకుని స్వదేశానికి తరలి వచ్చాం.
మాస్కోలో కలిసి మెలిసి ఉన్న మా రెండు కుటుంబాలు మళ్ళీ కలవడం అన్నది పాతికేళ్ళ తర్వాత ఒకసారి జరిగింది. ఏదో పనిమీద హైదరాబాదు వచ్చిన లక్ష్మణ కుమార్ దంపతులు మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. అప్పుడు మా ఆవిడ వుంది. మళ్ళీ నిన్న కలిశాము ఆవిడ లేకుండా. చాలా బాధ పడ్డారు విషయం తెలిసి. ఏమీ చేయగలిగింది లేదు వాళ్ళు, నేనూ కూడా.
ఆయనకు 88, మనిషిలో తేడా లేదు, కొంచెం వినికిడి శక్తి తగ్గింది. నాకు 78. చిన్నప్పటి నుంచి ఎవరి మాటా వినే అలవాటు లేదు. అంచేత నాకూ చెవుడే. కులాసాగా పాత కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశాము. భోజనం చేస్తూ పాత విషయాలు నెమరేసుకున్నాము.
తోకటపా
డెక్కన్ సేరాయ్ స్టార్ హోటల్ వాళ్ళు అతి ఖరీదైన డిష్ వడ్డించారు. అదే టమాటా పప్పు.
కింది ఫోటోల్లో : లక్ష్మణకుమార్ దంపతులను శాలువాలతో సత్కరిస్తూ నేను, గూపు ఫోటోలో అందరం. ఈ ఫోటోలో ఓ రష్యన్ గృహిణి వున్నారు. అపోలో ఆసుపత్రిలో పనిచేసే గుండె వైద్యుడు డాక్టర్ సతీష్ గారి నాన్నగారు భారత మిలిటరీలో అధికారి. రష్యన్ యువతి జోయా (ZOYA) అప్పుడు వారి నాన్నగారి ఉద్యోగ రీత్యా (ఆయన గారు కూడా రష్యన్ మిలిటరీ అధికారే, సోవియట్ ఎంబసీలో అధికారి) ఢిల్లీలో వుండగా పరిచయం. గుండె డాక్టర్ కదా, సతీష్ గారు, ఆవిడా గుండెలు మార్చుకుని ప్రేమించుకుని మరీ పెళ్లి చేసుకున్నారు. 1992 నుంచి ఇక్కడే వుంటూ తెలుగు బాగా నేర్చుకుని తెలుగు జోయా గారు అయిపోయారు. అదన్న మాట.






(04- 08- 2023)

20, జులై 2023, గురువారం

అన్ని రోడ్లు అటువైపే - భండారు శ్రీనివాసరావు


ఈ కింది సంభాషణలు చిత్తగించండి:
ఇంటర్వ్యూ బోర్డ్ సభ్యుడు:
“ఐ.ఐ.టి. టాపర్ మీరు. ఐ.ఏ.ఎస్. కావాలని ఎందుకు అనుకుంటున్నారు?”
“ఐ.ఏ.ఎస్. అధికారిగా ప్రజలకు ఎక్కువ సేవ చేయడానికి వీలుంటుందని భావించాను”
విలేకరి:
“మీరు ఒక ఐ.ఏ.ఎస్. అధికారి అయివుండి ఎందుకు రాజీనామా చేసి రాజకీయాల్లో చేరదామని అనుకుంటున్నారు?”
“రాజకీయాల్లో వుంటే మరింత ఎక్కువగా ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉంటుందనే నమ్మకంతో రాజీనామా చేసి రాజకీయాల్లో చేరుతున్నాను”
విలేకరి:
“రాజకీయాల్లోకి వచ్చారు సరే! కొత్తగా ఒక పార్టీ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?”
“అలా అయితేనే మనం అనుకున్న విధంగా ప్రజాసేవ చేయవచ్చని నాకు గట్టిగా అనిపించింది”
విలేకరి:
“దేశంలోనే కాదు ప్రపంచంలోనే మీరు పెద్ద పారిశ్రామికవేత్త. అనేక స్వచ్చందసంస్థలకు కోట్ల రూపాయలు భూరి విరాళాలు ఇస్తుంటారు. మరి రాజకీయ ప్రవేశం చేయాల్సిన అవసరం ఏమివచ్చింది”
“మనం కోరుకున్న విధంగా ప్రజాసేవ చేయాలంటే రాజకీయాలను మించిన మార్గం లేదు కనుక”
విలేకరి:
“సినిమా రంగంలో మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు. ఒక్కసారి మిమ్మల్ని తాకితే చాలు, జన్మ ధన్యం అనుకునే అభిమానులు మీకు లక్షల్లో వున్నారు. ఏ సినిమా వేసినా కాసుల వర్షం కురుస్తుంది. ఈ వయసులో ఎండ అనకా, వాన అనకా ప్రజాసేవ కోసం అంటూ ఈ తిరుగుళ్ళు ఏమిటి?”
“ఎంత సంపాదించినా, ఎంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నా సమాజానికి తిరిగి ఎంతోకొంత ఇవ్వాలని ఈ మార్గం ఎంచుకున్నా. నా దృష్టిలో ప్రజాసేవ చేయాలంటే ఇదొక్కటే మార్గం”
విలేకరి:
“మీ నాన్నగారు రాజకీయ రంగంలో పేరెన్నిక కన్నవారు. మీరేమో విదేశాల్లో ఉన్నత చదువులు చదివారు. గొప్ప కంపెనీకి సీ.ఈ.ఓ. వృత్తి పరంగా అనేక దేశాలు అలవోకగా చుట్టి వస్తుంటారు. ఆ జీవితం వదులుకుని ఇప్పుడు రాజకీయ అరంగేట్రం ఎందుకు చేసినట్టు”
“నాన్నగారికి రాజకీయ వారసుడిగా కాదు, ఆయన ఆలోచనలకు, తలపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజాసేవకు ఇది ఉత్తమ మార్గంగా నాకు తోచింది”
విలేకరి:
“మీరు గొప్ప జర్నలిష్టు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు మీ మాట శిరోధార్యం.అలాంటిది మీరు కూడా రాజకీయ తీర్థం పుచ్చుకోవడం ఆశ్చర్యంగా వుంది”
“మనం ఎన్ని రాసినా, ఎన్ని హితోక్తులు చెప్పినా సమాజాన్ని మార్చాలి అంటే రాజకీయాలు తప్పిస్తే వేరే దోవ కనిపించలేదు. అందుకే ఈ మార్గం పట్టాను”
ఇలాంటి సంభాషణలు తరచుగా వింటున్నప్పుడు సామాన్యుడికి కలిగే అభిప్రాయం ఒక్కటే!
చివరికి ప్రజాసేవ కూడా సోషలిజం లాగా అర్ధంపర్ధం లేకుండా వాడే పదంగా మారిపోయిందని.
తోకటపా:
తపస్సు చేసుకోవడానికి అడవుల్లోకి వెళ్ళనక్కరలేదు. ఉన్నచోట వుండే భగవధ్యానం చేసుకోవచ్చు.

19, జులై 2023, బుధవారం

మౌనమే నీభాష – భండారు శ్రీనివాసరావు

 మొన్న జ్వాలా ఫోన్ చేశాడు.

‘ ఎప్పుడూ మేము చేయడమేనా! నువ్వు ఫోన్ చేయవా?

నిజమే! కాల్ లిస్టు తీసి చూస్తే అవుట్ గోయింగ్ ఒకటి రెండు కూడా లేవు. అన్నీ ఇన్ కమింగే.

సాయంత్రం అన్నయ్య కుమార్తె వేణి ఖమ్మం నుంచి ఫోన్ చేసింది.

ఏమిటి విశేషం అన్నాను మామూలుగా.

అదే బాబాయ్ నేను చెబుదామని అనుకున్నది. విశేషం ఉంటేనే ఫోన్ చేయాలా! మామూలుగా  ఫోన్ చేసి క్షేమ సమాచారాలు కనుక్కుంటే చాలా బాగుంటుంది అన్నది. అంతే కాదు చిన్నతనం నాటి ఒక వృత్తాంతం  చెప్పింది. అన్నయ్య ఉద్యోగ రీత్యా వైజాగ్ లో వున్నప్పుడు పోస్టాఫీసు నుంచి ఓ డజన్ కార్డులు కొనుక్కు వచ్చి వేణి చేతికి ఇచ్చి చెప్పాడుట. ‘అడ్రసు కూడా రాసి పెట్టాను. నువ్వు చేయాల్సింది అల్లా వారానికి ఒక కార్డు కంభంపాడులో ఉన్న బామ్మకు పోస్టు చేయి. పెద్ద విశేషాలు రాయక్కరలేదు. మేము క్షేమం, మీరు కులాసాగా వున్నారని భావిస్తాను అని రాయి చాలు. పల్లెటూళ్ళో ఉంటున్న ఆమెకు ఈ సమాచారం ఎంతో ఊరట ఇస్తుంది. మనమంతా తనకు మానసికంగా దగ్గరగా వున్నామనే భావన పెద్దవాళ్లకు చాలా సంతోషం కలిగిస్తుంది. ఈ వయసులో వారికి కావాల్సింది ఇంతకంటే ఏమీ వుండదు అని.

‘నాన్న చెప్పింది నా మనసులో ముద్ర పడింది. అందుకే మీ వంటివారికి తరచుగా ఫోన్  చేసి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను’

 మంచి నిర్ణయం వేణీ అన్నాను.

జ్వాలా చెప్పింది, వేణి చెప్పింది ఒకటే.

నిజానికి ఇలాంటి మాటలు అన్నీ నేనే ఒకప్పుడు ఫేస్ బుక్ లో పోస్టు చేస్తూ వచ్చాను.

‘మధ్య మధ్య కలుస్తూ వుంటేనే కుటుంబ బంధాలు, మధ్య మధ్య  మాట్లాడుకుంటూ వుంటేనే స్నేహ సంబంధాలు’ అంటూ గొప్పగా నీతులు చెప్పాను. కానీ నేను చేస్తున్నది ఏమిటి?

పక్కవారికి చెప్పేటందుకే నీతులు వున్నాయి  అనుకోవాలా!

చేతిలో ఫోన్ అస్తమానం వుంటుంది. వెనుకటి మాదిరిగా గుండె గుభిల్లుమనే చార్జీల బాధ లేదు. మరి ఎందుకీ నిర్లిప్తత.

నాకూ చిన్నతనం గుర్తుకు వచ్చింది. సొంతంగా ఇంట్లో ఫోన్ లేకపోయినా మిత్రులతో, చుట్టాలతో మాట్లాడాలని తాపత్రయ పడేవాళ్ళం.  పుట్టిన రోజు సందర్భాల్లో  ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలుపుకునే వాళ్ళం. ఇప్పుడూ చెబుతున్నాం. ఫేస్ బుక్ లోనూ, వాట్సప్ లోనూ  మొక్కుబడిగా షరా మామూలు గ్రీటింగ్ పెట్టి ఊరుకుంటున్నాం. అదీ ఫేస్ బుక్ వాడు గుర్తు చేస్తేనే సుమా. వాళ్ళు చూస్తారో తెలియదు. ఒక పని అయిపొయింది అనుకుంటాం. అలా కాకుండా ఆ ఒక్కరోజు ఫోన్ చేసి శుభకామనలు తెలియచేస్తే ఎంత బాగుంటుంది.

అంత తీరికలేని పనులు ఏమీ లేవు కదా!

కానీ ఇంత చిన్న చిన్న పనులు ఎందుకు చేస్తాం!    



Courtesy Cartoonist

 

శ్రీ రమణ ఇక లేరు

 1975 లో ఆంధ్ర జ్యోతి నుంచి నా నిష్క్రమణ అనంతరం ఎడిటర్ నండూరి రామమోహనరావు గారి కోరికపై శ్రీ రమణ గారు జ్యోతిలో చేరారు. తర్వాత కాలంలో శ్రీ రమణ గారు హైదరాబాద్ వచ్చారు. వారిని ఐ. వెంకట్రావు గారు నాకు మహా టీవీలో పరిచయం చేశారు. రాతల్లో వుండే శ్లేష, వ్యంగం ఆయన మాటల్లో కూడా తొంగి చూసేది. నేనంటే ఇష్టపడేవారు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం. నిజానికి ఆయన మాట్లాడేవారు నేను వింటూవుండేవాడిని. అలా వినడం నాకు ఇష్టం. ఇక మిధునం విడుదల అయినప్పుడు హైదరాబాద్ లో వున్న పది కుటుంబాల వాళ్ళం కట్టకట్టుకుని ఫస్ట్ డే ఫస్ట్ షో కి వెళ్ళాం. బహుశా శంకరా భరణం తర్వాత అలా ఇంటిల్లపాది కలిసి చూసిన చిత్రం మిథునం మాత్రమే. ఆ సినిమాకు నేను ఫేస్ బుక్ లో రాసిన రివ్యూ చదివి శ్రీ రమణ గారు నాకు ఫోన్ చేసి అభినందించడం గర్వంగా ఫీలవుతాను. బాపు గారి చూసి రాతతో పబ్లిష్ చేసిన మిథునం పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు.

పొద్దున్నే V Chowdary Jampala గారు శ్రీ రమణ గారు చనిపోయారు అని పెట్టిన పోస్టు చూసి నిర్ఘాంత పోయాను. అంత నిశ్శబ్దంగా దాటి పోవడం ఆయనకే చెల్లు. బాపు రమణల సాన్నిధ్యంలో స్వర్గంలో ఆయనకు ఏ లోటు వుండక పోవచ్చు. కానీ ఆయన లేని లోటు తెలుగు పాఠకులకే.
వారికి సద్గతులు కలగాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏




17, జులై 2023, సోమవారం

తట్టిలేపే జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు

 

మధ్య తరగతి వాళ్ళు అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఒక పగటి కల కంటూ వుంటారు. ఏదో ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని.(చిన్నిల్లు, పెద్దిల్లు అనే పాడు అపార్థాలు చేసుకోవద్దు ప్లీజ్)

అలా నేనూ మా ఆవిడా విడివిడిగా, కలివిడిగా  కలలు కనే రోజుల్లో కలలో మేము కట్టుకోబోయే  ఆ కొత్త ఇంటికి పూజ గది విడిగా వుండాలని కోరుకునేది తాను. అద్దె ఇళ్ళు మారుస్తూ హైదరాబాదును ఏళ్ళ తరబడి చుట్టబెడుతున్న తరుణంలో పూజ గది వుండే అద్దె ఇల్లు దొరకడం అసాధ్యం. అంచేత చిక్కడపల్లి దాకా వెళ్లి ఇదిగో ఈ కింద ఫోటోలోని పూజ అల్మరా ఒకటి కొనుక్కొచ్చుకుంది.  అందులో దేవుళ్ల విగ్రహాలు, ఫోటోల సంచితాన్ని భద్రపరచుకుంది. నేనెప్పుడూ  లెక్కపెట్టలేదు కాని ముక్కోటి దేవతలు అందులో కొలువు తీరారు అనిపించేది. 

ఈరోజు జులై 17. అంచేతే కాబోలు ఓ జ్ఞాపకం మనసుని తట్టి లేపింది.

నాలుగేళ్ల క్రితం అంటే 17-07-2019 నాడు పొద్దున్నే ఏదో ఛానల్ డిబేట్ కి వెళ్లి ఇంటికి తిరిగొచ్చేసరికి మా ఆవిడ పూజ అల్మరాలో దేవుళ్ళు అందరూ కట్టగట్టుకుని మాయం అయిపోయారు. ఏమిటీ విష్ణు మాయ అనుకుని ఆశ్చర్య పోతూ ఉండగానే శుభ్రంగా తోమిన దేవుడి విగ్రహాలను మరింత మెరిసేలా తుడుస్తూ మా ఆవిడ ప్రత్యక్షం అయింది.

“ అమ్మయ్య! దేవుళ్ళు అందరూ  తలంట్లు పోసుకుని గూటికి చేరుతున్నారు “ అని ఓ జోకు జోకాను.

ఈ జోకు మా ఆవిడ విన్నదో లేదో కాని ఆమె చేతిలో ఉన్న దేవుళ్ళు విన్నారు, విని కోపగించుకున్నారు  అన్న సంగతి నెల తర్వాత తెలిసి వచ్చింది.

సరిగ్గా నెలలోపే ఆగస్టు 18న, ఇంట్లో  దేవుళ్ళు అందరూ అలాగే  వున్నారు. వాళ్లకు నిత్య పూజలు చేసే దేవతే లేకుండా వెళ్లి పోయింది.

దేవుళ్లా! మజాకా!



17-07-2023

13, జూన్ 2023, మంగళవారం

సన్ ఆర్ సన్ ఇన్ లా పాలసి – భండారు శ్రీనివాసరావు

 

నేను రేడియోలో చేరిన కొత్తల్లో సచివాలయంలో ఓ ఉన్నతాధికారి పరిచయం అయ్యారు. మంచి స్నేహశీలి. అడగనివాడిదే పాపం అన్నట్టు ఎవరు ఏది అడిగినా అది తన చేతిలో పనయితే వెంటనే చేసిపెట్టేవారు. ఉద్యోగం, బదిలీ ఇలా ఎవరు ఏ పని కోరినా, ‘కాదు, కుదరదు’ అని చెప్పే అలవాటు ఆయనకు లేదు. అలా అని డబ్బు కోసం సాయం చేయడం ఇంటావంటా లేదు. నిక్కచ్చి మనిషి. నిజాయితీ పరుడు.
సాయం కోరి నా దగ్గరకు వచ్చిన వారిని నేను ఆయన దగ్గరకు తీసుకువెళ్ళే వాడిని. ఏం కావాలో కనుక్కుని ఆ పని ఏమిటో ఆ వివరాలు ఓ చిన్న పుస్తకంలో రాసుకునేవారు. ‘రేపు రండి చెబుతాను’ అనేవారు. ఎన్నిసార్లు ఆయన దగ్గరకు పోయినా ఇదే వరస. ‘రేపు రండి’ అని పంపించేసేవారు. మరునాడు వెడితే పనిచేసి పెట్టడమో, లేక ఆ పని అయ్యేది కాదు అని మొహం మీద చెప్పడమో జరిగేది. చాలా సందర్భాలలో వచ్చిన వాళ్లకు ఆశాభంగం కలగకుండా పనిచేసి పంపించేవారు. మరి, ఇంత మాత్రం దానికి రేపు రమ్మనడం దేనికి అనే మీమాంస నన్ను వెంటాడేది.
తర్వాత విచారించగా తెలిసింది ఏమిటి అంటే ఆయనది ‘సన్ ఆర్ సన్ ఇన్ లా పాలసి’.
ముందు ఏ సాయం అయినా కొడుకు లేదా అల్లుడు. తర్వాతే ఎవరయినా అనేది ఆయన పెట్టుకున్న పద్దతి.
వచ్చిన వాడు బదిలీ అడిగాడు అనుకోండి. ఆ సాయంత్రం ఇంటికి వెళ్లి కొడుకు, అల్లుడు లేదా కోడలు, కుమార్తెతో సంప్రదించేవాడు. పనిమీద వచ్చిన వాళ్ళ పని చేసి పెడితే, దానివల్ల తన పిల్లలకు ఏమైనా ఇబ్బంది ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకునే వారు. ఉదాహరణకు ఉద్యోగం అనుకోండి, అదే ఉద్యోగానికి తన కొడుకు, లేదా అల్లుడికి సాయం కోరినవారు పోటీ అవరు అనేది తేల్చుకున్న తర్వాతనే, వారి పని చేసి పెట్టేవారు. అలాగే బదిలీ. బదిలీ అడిగిన వాళ్ళకు చేసిపెడితే దానివల్ల తన పిల్లలకు ఏమీ తభావతు రాదు అని నిర్ధారించుకున్న తర్వాత కానీ వచ్చిన వారి విషయం పట్టించుకునే వాడు కాదు. వినడానికి విడ్డూరంగా ఉండవచ్చు కానీ ఈ నియమాన్ని ఆ అధికారి చాలా కాలం పాటించడం నాకు తెలుసు.
అడిగినవాడికి లేదనకుండా సాయం చేస్తూ వచ్చిన ఆయన, తనపై ఏ మచ్చా పడకుండా ఉద్యోగ విరమణ చేశాడు. ఆ తర్వాత కొద్దికాలానికి ఆయన పోయినట్టు తెలిసింది. ఆయన వల్ల సాయం పొందిన అనేకమంది, తమ ఇంట్లో మనిషి పోయినట్టుగా బాధ పడ్డారు.
ధృతరాస్ట్రుడికే కాదు, పుత్రప్రేమ అనేది మనుషులకు పుట్టుకతోనే వస్తుందేమో.

25, మే 2023, గురువారం

ఎం.వి.ఎస్. ప్రసాద్ (ఐ.ఏ.ఎస్.) ఇక లేరు

 

గత మార్చి పదకొండో తేదీన ఎం.వి.ఎస్. ప్రసాద్ గారు ఫేస్ బుక్ లో ఈ కింది కవిత రాశారు. అది చదివిన మావంటివాళ్ళం నివ్వెరపోయాము. ఏమిటి సార్ ఇలా రాసారు అని అడిగాము కూడా. కానీ ఆయన గారి దగ్గరనుంచి సమాధానం లేదు.  అది ఇలా సాగింది.  


“అలసిపోయాను ధైర్యం పూర్తిగా మరుగునపడింది 

అధఃపాతాళంకి దిగజారిన ఆలోచనా స్రవంతి 

జీవితంలో బుస్సుమని పొంగి పొర్లిన ధారాపాతం 

నేలపాలయి బురద బురద చేసి కకావికలైంది 

బురదపాలైన కాళ్ళు కడుగుదామంటే నీరింకిపాయే 

ఎన్నాళ్లీ ఇష్టంలేని ప్రయాణం ఇక ఆగిపోతే బాగుండు”

చివరి వాక్యం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఏమిటి ఈ నిర్వేదం అనిపించింది.

ఆయన రాసుకున్నట్టే  ఆయనకు ఇష్టం లేని ప్రయాణం ఈరోజు అంటే  మే 25 మధ్యాన్నం  నిజంగానే ఆగిపోయింది.

1975 లో నేను ఆలిండియా రేడియోలో చేరినప్పుడు నాకు తారసపడిన మొదటి ప్రభుత్వ అధికారి ఏమ్వీఎస్ గారు. అప్పుడు ఆయన SFDA (Small Farmers Development Agency) కి ఆయన అధికారి. ఎమర్జెన్సీ లో కావాల్సినవి డెవలప్ మెంట్ వార్తలే కాబట్టి ఆయన్ని కలిసాను. అలా అప్పుడు ఏర్పడ్డ  పరిచయం ఇప్పటిదాకా కొనసాగింది. ఆయన ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ చాలా కీలకమైన పదవులు నిర్వహించారు. టీటీడీ ఈవో, దేవాదాయ శాఖ కమిషనర్, జీఏడి సెక్రెటరి  ఇలా ఎన్నో. కానీ ఎక్కడా తన మంచి పేరు చెడగొట్టుకోలేదు. రిటైర్ అయిన తర్వాత తన ఇంటి పేరుతొ మేళ్లచెరువు ఫౌందేసన్ స్థాపించి అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఆయన స్వగ్రామం కూడా మేళ్లచెరువు (ప్రకాశం జిల్లా). కనిపినప్పుడు లేదా ఫోన్ చేసినప్పుడు మా దేవాలయం ఒకసారి వచ్చి చూడండి అనేవారు. ఇక అలాంటి ఆహ్వానం ఆయన నుంచి రాదు.  

Madhavi Kolli కొల్లి మాధవి గారు కొంతసేపటి క్రితం ఫేస్ బుక్ లో ఈ సమాచారం ఇచ్చినప్పుడు నా సమాధానం UNBELIEVABLE. గబాగబా అన్ని ఛానల్స్ తిప్పాను. ఎక్కడా ఈ వార్త జాడలేదు.  

చాలా వార్తలు తర్వాత నిజం కాదని  తేలిపోతాయి. కానీ ఇది అలా కాదే! 

బహుశా ఎల్లుండి అంత్యక్రియలు జరగొచ్చని ఏమ్వీఎస్ గారి అబ్బాయి ద్వారా తెలిసిందని  ఇప్పుడే పాత్రికేయ మిత్రుడు చిర్రావూరి కృష్ణా రావు  మెసేజ్ పెట్టాడు.



(Shri M>V>S>Prasad, IAS)


(25-05-2023)


20, మే 2023, శనివారం

ఒకటోసారి..రెండోస్సారి.. మ్మూడోస్సారి... భండారు శ్రీనివాసరావు

 (Published in ANDHRAPRABHA today, 20-05-2023, Saturday)

 

1978 వ సంవత్సరం. జనవరి నెల. 14 వ తేదీ ఉదయం.

ముంబై (అప్పుడు బొంబాయి) లో వున్న రిజర్వ్ బ్యాంకు  చీఫ్ అక్కౌంట్స్ కార్యాలయంలో సీనియర్ అధికారి ఆర్. జానకి రామన్ ఇంట్లో ఫోను మోగింది. వెంటనే ఢిల్లీ రావలసిందని ఒక ప్రభుత్వ అధికారి ఆదేశం.

జానకి  రామన్ బొంబాయి నుంచి బయలుదేరి  ఢిల్లీ వెళ్ళీ వెళ్ళగానే అక్కడి ఉన్నతాధికారులు ఒక ఆర్డినెన్స్  ముసాయిదాను ఒకే ఒక్క రోజులో తయారు చేయాలని ఆయన్ని కోరారు. పెద్ద విలువకలిగిన  కరెన్సీ నోట్లని చెలామణి నుంచి తప్పించాలని ప్రభుత్వం సంకల్పించిందనిఅందుకు తగిన ఆర్డినెన్స్ సిద్ధం చేయాలనిఇదంతా చాలా గోప్యంగా జరగాలని  రామన్ ను ఆదేశించారు.

ఇప్పట్లా ఆరోజుల్లో సెల్ ఫోన్ వంటి కమ్యూనికేషన్ సదుపాయాలు లేవు. అయినా ఆర్బీఐ  కేంద్ర కార్యాలయం నుంచి ఎటువంటి సమాచారం బయటకి పొక్కకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

అనుకున్న పద్దతిలోనే ఆర్డినెన్స్ ముసాయిదా తయారయింది. జనవరి 16 తెల్లవారుఝాముకల్లా రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సంతకం కోసం పంపారు. అదే రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆకాశవాణి ద్వారా పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ ప్రజలకు తెలిసిపోయింది.  ముందు జాగ్రత్తగా జనవరి పదిహేడునాడు దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులుప్రభుత్వ ట్రెజరీలు మూసివేశారు.

అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఐ.జీ. పటేల్ కు ఈ పెద్ద నోట్ల రద్దు వ్యవహారం నచ్చలేదు. సంకీర్ణ జనతా ప్రభుత్వంలోని కొందరు నాయకులు పెద్ద నోట్ల రద్దుకు పట్టుబట్టడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందన్నది ఆయన అభిప్రాయం. అంతకు పూర్వం దేశాన్ని పాలించిన నాయకుల అవినీతి పనులను లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుందని పటేల్ చెప్పారు.

భారతీయ ఆర్ధిక విధానాలు అనే అంశంపై పటేల్ రాసిన పుస్తకంలో ఇంకా ఇలా పేర్కొన్నారు.

పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేయాలనే నిర్ణయం గురించి ఆర్ధిక మంత్రి హెచ్.ఎం.పటేల్ నాతొ ప్రస్తావించారు. అటువంటి సంచలన నిర్ణయాలతో అద్భుత ఫలితాలు రాబట్టడం చాలా అరుదుగా జరుగుతుందని నేను మంత్రితో స్పష్టంగా చెప్పాను.

సాధారణంగా అవినీతిఅక్రమ  పద్ధతుల్లో భారీఎత్తున  డబ్బు పోగేసుకునేవాళ్ళలో అత్యధికులు ఆ సంపదను  కరెన్సీ రూపంలో  ఎక్కువ కాలం దాచిపెట్టుకోరు” అన్నది నాటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పటేల్ అభిప్రాయం. పిచ్చి పిచ్చిగా డబ్బు పోగేసుకున్న  ఖామందులవాళ్ళు  నల్ల డబ్బు దాచుకునే మార్గాలు వేరే ఉంటాయని ఆయన మనోగతం కావచ్చు.

నల్ల డబ్బును సూట్ కేసుల్లోదిండ్లకవర్లలో కుక్కి దాస్తారని అనుకోవడం అజ్ఞానమే అవుతుంది” అని కూడా పటేల్ మహాశయులు అభిప్రాయపడ్డారు.

ఇది జరిగి  45 ఏళ్ళు అవుతోంది.

2016, నవంబరు,8, న్యూ ఢిల్లీ

ఆ సాయంత్రం ఢిల్లీలో కేంద్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. అంతకు ముందు ప్రధాని త్రివిధ సైనిక దళాల అధిపతులతో సమావేశం అయ్యారు. సరిహద్దుల్లో ఇప్పటికే యుద్ధ వాతావరణం ఏర్పడి వుండడం చేత ప్రధాని అనుకు సంబంధించి ఏదో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. క్యాబినెట్ ఎజెండాలో ఈ నిర్ణయానికి సంబంధించి కానీసరిహద్దులలో తీవ్రత గురించిన అంశం కానీ ఏదీ లేదు. సమావేశం ముగిసే సమయంలో ప్రధానమంత్రి మోడీ పెద్ద నోట్ల చెలామణి రద్దు నిర్ణయాన్ని క్లుప్తంగా తెలియచేసి మంత్రులనందరినీ సమావేశ మందిరంలోనే కూర్చోబెట్టి ప్రభుత్వ సంకల్పాన్ని రాష్ట్రపతికి తెలియచేడానికి వెళ్ళారు. ఆ తరువాత నేరుగా దేశ ప్రజల నుద్దేశించి రేడియోదూరదర్సన్ లలో ప్రసంగించారు. ఆ సంస్థల అధికారులకి కూడా ముందస్తు సమాచారం ఇవ్వలేదు. మంత్రులు సయితం సమావేశ మందిరం నుంచే ప్రధాని ప్రసంగం విన్నారు. ఆ తరువాతనే వారు బయటకు వెళ్ళారు.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మోడీ ఆరుమాసాల క్రితమే తీసుకున్నారనిఅప్పటినుంచి దాన్ని అమలు చేయడానికి దశలవారీ ప్రణాళిక రూపొందించుకున్నారని భోగట్టా. ఈ విషయంలో గోప్యత చాలా కీలకం అని భావించిన నరేంద్ర మోడీచాలా కాలంనుంచే మంత్రివర్గ సమావేశాలకు మంత్రులు ఎవరూ తమవెంట సెల్ ఫోన్లు తెచ్చుకోకుండా కట్టడి చేసారు.

నోట్ల రద్దు నిర్ణయం గురించి మొత్తం దేశంలో తెలిసిన వాళ్ళు పది మంది మాత్రమే అనిరిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న రఘురాం రాజన్ అందులో ఒకరని తెలుసుకుని ఆశ్చర్యపోవడం మీడియా వంతయింది. మొత్తం వ్యవహారాన్ని అత్యంత రహస్యంగా ఉంచినా ఇలాంటిది ఏదో జరగబోతోందన్న సంకేతాలు మాత్రం గత కొద్ది కాలంగా వెలువడుతూనే వున్నాయి. కొత్త రెండువేల రూపాయల నోటు నమూనా తయారుచేయడంఆమోదించడంఆ నోట్లను పెద్ద మొత్తంలో ముద్రించడం జరిగిపోయాయి. అయితే ఆ విషయం తెలిసిన వాళ్ళు ఇది షరా మామూలుగా జరిగే నోట్ల ముద్రణగా భావించారు కానీ దీని వెనుక ఇంత భారీ నిర్ణయం వుందని అంచనా వేయలేకపోయారు.

ప్రధాని ప్రసంగం ముగించిన వెంటనేదాన్ని విన్న ఆసేతుహిమాచలం ప్రజలందరికీదేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న నల్ల ధనం పిశాచి భరతం పట్టడానికి మోడీ ఎంతో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్న ఒకే అభిప్రాయం కలిగింది. మొనగాడంటే మోడీ అనే రీతిలో సాంఘిక మాధ్యమాల్లో మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. “కొద్ది రోజులు కటకటపడితే పడదాముకష్టాలు శాశ్వతంగా తీరిపోతున్నప్పుడు తాత్కాలిక ఇబ్బందులను పట్టించుకోవద్దు” అనే భావన సర్వత్రా కనబడింది.

గతంలో నాటి జనత ప్రభుత్వానికి నేతృత్వం వహించింది గుజరాత్  కు చెందిన మొరార్జీ దేశాయ్. మళ్ళీ చాలా ఏళ్ళ తరువాత పెద్ద నోట్లని రద్దు చేయాలని నిర్ణయించింది కూడా అదే రాష్ట్రానికి చెందిన నేటి ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఇది కాకతాళీయం కావచ్చు. అలాగే ఈ రెండు నిర్ణయాలు, కాంగ్రెసేతర ప్రభుత్వాలు కేంద్రంలో కొలువు తీరి వున్నప్పుడు తీసుకోవడం కొట్టవచ్చినట్టు కానవచ్చే మరో పోలిక.

ఇప్పుడు, అంటే తాజాగా కొద్ది సేపటి క్రితమే  మ్మూడో స్సారి.

రెండువేల రూపాయల నోట్లకు మంగళం!

కాకపొతే ప్రకటన బాధ్యత ఈసారి రిజర్వ్ బ్యాంక్ కు అప్పగించారు.

NOTE: Courtesy Image Owner)



19-05-2023

 

16, మే 2023, మంగళవారం

పొత్తు పొడిచినా ఫలితం దక్కుతుందా! – భండారు శ్రీనివాసరావు

 రేపు ఎన్నికలు పెట్టినా మేము సిద్ధంగా వున్నామని రాజకీయ నాయకులు తరచూ చెప్పే మాటల్లో ఎంత వాస్తవం వుందో తెలియదు కానీ, రేపే ఎన్నికలు అనే స్పృహలోనే పార్టీలు అనుక్షణం అప్రమత్తంగా వుంటాయి అనడం మాత్రం నిజం.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది వ్యవధానం ఉన్నప్పటికీ, అప్పుడే ఎన్నికలు వచ్చిపడ్డట్టు రాజకీయ పార్టీలు హడావిడి పడుతున్నాయి. పొత్తులు, ఎత్తులు, జిత్తుల మీద చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సంవత్సరం తర్వాత జరగబోయే ఎన్నికల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకునే వ్యూహాలకు తెర తీస్తున్నాయి.

రాజకీయ పార్టీలకి అనేక లక్ష్యాలు వుంటాయి. కానీ అన్నింటిలో ఉమ్మడిగా కానవచ్చేది ఒక్కటే. అది విజయం వైపు పయనం.

2019లో జరిగిన ఎన్నికల్లో తన పార్టీని అధికార అందలం ఎక్కించిన వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, పరాజయం పాలయిన టీడీపీ నాయకుడు చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ మువ్వురు  కూడా 2024లో జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల వ్యూహాలను రూపొందించుకునే కార్యక్రమంలో తలమునకలుగా వున్నారు.  ఈ లక్ష్యసాధన కోసం వారు ఏ మార్గాన్ని ఎంచుకున్నా ఆశ్చర్య పోవాల్సింది ఏమీ ఉండదు. రాజకీయ సమీకరణాలు  పూర్తిగా మారిపోతాయని నాలుగేళ్ల క్రితం ఎవరయినా అంటే ఎవరూ నమ్మేవాళ్ళు కాదు. అంటే రోజులు గడుస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల వ్యూహ, ప్రతివ్యూహాలు ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్తితులకు అనుగుణంగా, వారి వారి రాజకీయ అవసరాలకు, ప్రయోజనాలకు తగ్గట్టుగా మారిపోతూ ఉంటాయనడానికి ఏపీలో  రోజురోజుకి మారుతున్న పరిణామాలే   మంచి ఉదాహరణ. కానీ ఈ విషయాలు వారెవ్వరూ బయటకి ఒప్పుకోరు. అది వారి రాజకీయ జాణతనంలో ఒక భాగం. చెప్పీ చెప్పనట్టుగా కొన్ని చెబుతుంటారు, వాటిల్లో దాగున్న అర్ధాన్ని విశ్లేషిస్తూ చర్చలు సాగుతాయి. ప్రజలని తాము కోరుకున్న పద్ధతిలోనే ఆలోచించేలా చేయడం వీటి అంతిమ లక్ష్యం.

నేటి రాజకీయాల పట్ల కనీస అవగాహన ఉన్నవారికి ఈ పరిణామాలు గొప్ప విషయంగా అనిపించకపోవచ్చు. ఎందుకంటే గతంలో సిద్ధాంతాల ప్రాతిపదికపై నడిచిన రాజకీయాలు, ఈనాడు అవసరాల పునాదులపై నిలదొక్కుకుంటున్నాయని వారికి తెలుసు కాబట్టి.

2024లో జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్నదే ఈ ముగ్గురు నాయకుల ధ్యేయం. కాకపోతే ఈ లక్ష్యసాధన దిశలో వేసే అడుగులు ఎలాటివన్నదే చర్చనీయాంశం. విధానాల ద్వారా విజయం సాధించాలని అనుకోవడం ఒక పద్దతి. విజయం ఒక్కటే పరమావధిగా విధానాలను మార్చుకోవడం మరో పద్దతి.

పాలకపక్షం వైసీపీ పూర్తిగా బలహీన పడిందని  నమ్ముతూ  తద్వారా ఏర్పడ్డ రాజకీయ శూన్యతను ఆక్రమించుకునే ఉద్దేశ్యంతో కొత్త పొత్తుల ఆలోచన రూపుదిద్దుకుని ఉండవచ్చు. పొత్తులు ఫలితం ఇస్తాయి అనడానికి శాస్త్రీయ ప్రాతిపదిక ఏమీ లేదు. అవసరాలకోసం రాజకీయ నేతలు సర్దుబాటు చేసుకున్నట్టుగా ఆ పార్టీల కార్యకర్తలు అంత సులభంగా కలిసిపోరు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఓట్ల బదలాయింపుకు అవకాశాలు తక్కువ.  

రాజకీయ శూన్యత వున్నప్పుడు రాజకీయ ప్రత్యామ్నాయాల వికాసానికి అవకాశం వుంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత అనేదాన్ని ఏ అధికార పక్షం అయినా ఎన్నికల్లో ఎదుర్కోక తప్పదు. అయితే వ్యతిరేకత ఒక్కటే పాలక పక్షం ఓటమికి దోహదం చేయదు. వ్యతిరేకత అసంతృప్తిగా మారి, ఆ అసంతృప్తి అసహనంగా మారి, ఆ అసహనం ఆగ్రహంగా మారినప్పుడే ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తారు. ఆ పరిస్థితిలో బలమైన ప్రత్యామ్నాయంగా కనపడిన పార్టీకి, ఏ పార్టీ అని కూడా చూడకుండా ఓట్లేసి గెలిపిస్తారు.

రాజకీయ పార్టీల మాదిరిగా ప్రజలు తమ ఆగ్రహాన్ని అనునిత్యం ప్రదర్శించరు. తమలోనే దాచుకుంటారు. సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు. 

బ్రహ్మాండంగా విజయవంతమైన సినిమా ఫార్ములాతోనే, అందుకు ఏమాత్రం తగ్గకుండా మరో సినిమా తీస్తే అది విజయవంతమైన సందర్భాలు చాలా తక్కువ. అలాగే ఈ పొత్తులు. మళ్ళీ వీటిలో కొన్ని రకాలు. ఎన్నికలకు ముందు పెట్టుకునేవి కొన్ని అయితే, ఎన్నికల తరవాత, ఎవరికీ సరైన మెజారిటీ రానప్పుడు  కుదుర్చుకునేవి మరి కొన్ని. ఎన్నికలకు ముందు ప్రతి పార్టీ తాను బలమైన పార్టీ అనే నమ్ముతుంది. కనుక సీట్ల సర్దుబాటు ఒక సమస్యగా మారుతుంది. వామపక్షాల వైఖరి కొంత విచిత్రంగా వుంటుంది. పలానా నియోజక వర్గంలో గెలిచే అవకాశం లేకపోయినా, కేడర్ ని సుస్తిరం చేసుకోవడానికి ఆ సీటు కోసం పట్టు పడతాయి.

1982 ఎన్టీ రామారావు, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా  తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు, కాంగ్రెసేతర పార్టీలతో పొత్తుల ప్రతిపాదనలు వచ్చాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలసి 120  సీట్లు కావాలని కోరాయి. సంప్రదింపులు జరిగిన తర్వాత కనీసం 90 సీట్లు ఇవ్వాలని పట్టుబట్టాయి. ఎన్టీఆర్  80 ఇస్తామన్నారు. కమ్యూనిస్టులు తమకు అలవాటయిన చారిత్రక తప్పిదం చేశారు. ఒక్క సీటు తగ్గినా ఒప్పుకోమని తేల్చి చెప్పారు. చర్చలు విఫలం అయ్యాయి. మరో పక్క జనతా పార్టీ తరపున బాబుల్ రెడ్డి ఎన్టీఆర్ ని కలిసి  60 సీట్లు అడిగారు.  20 వరకు ఒప్పుకోవాలని ఎన్టీఆర్ యోచన. ఈలోగా లోక్ దళ్, రిపబ్లికన్ మొదలైన పార్టీలు మరికొన్ని అడిగాయి. ఈ పార్టీల వైఖరితో విసుగుచెందిన ఎన్టీఆర్, అసలు పొత్తులకే స్వస్తి చెప్పి ఒంటరిగా వెళ్ళాలని నిర్ణయించారు. ఆఖర్లో మాత్రం సంజయ్ విచార్ మంచ్ కి అయిదు సీట్లు ఇచ్చారు. మిగిలిన అన్ని సీట్లలో టీడీపీ పోటీ చేసింది.

అప్పటికే కాంగ్రెస్ పాలనతో విసిగి  ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న తెలుగు ప్రజలకు టీడీపీ వెలుగు రేఖలా  కనిపించింది. ఎన్టీఆర్ తొందరపడి ఇతర పార్టీలకు వారు అడిగిన సంఖ్యలో సీట్లు ఇచ్చి వుంటే,  ప్రజలు టీడీపీని కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా భావించి వుండేవారు కాదని ఓ అభిప్రాయం. ఓ పది సీట్ల కోసం కమ్యూనిస్టులు పట్టిన పట్టు, రాష్ట్ర రాజకీయాల తీరుతెన్నులనే మార్చివేసింది.

ఇక ప్రస్తుతానికి వస్తే.       

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ప్రాంతీయ పార్టీలు ఒకేమారు తలపడితే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు గణనీయంగా చీలిపోయి అధికార వైసీపీ లాభపడుతుందని కొందరి ఉద్దేశ్యం.  ఈసారి ఏదీ ఊహకు అందకుండా ఉంటుందని మరికొందరు అంటున్నారు. అంచేత బరిలో ఉన్న అన్ని పార్టీల వాళ్ళూ ఏ అవకాశాన్నీ వదులుకోకుండా ప్రయత్నాలు చేస్తారు. హామీలు, ప్రలోభాలు, ఎత్తులు, పొత్తులు, అవగాహనలు, పైకి ఒకటి చెబుతూ మరొకటి చేసే రాజకీయ రణతంత్రాలు, మిత్రబేధాలు, ఇలాటివన్నీ ఆ జాబితాలో వుంటాయి. డబ్బు ప్రాధాన్యం ఎలాగూ వుంటుంది. అయితే తమను ఎవరు పరిపాలించాలో ప్రజలు ముందే ఒక నిర్ణయానికి వస్తే మాత్రం, ఈ టక్కు ఠమారవిద్యలు అన్నీ కొరగాకుండా పోతాయి.

ప్రతి రాజకీయ పార్టీకి చెప్పుకోవడానికి కొన్ని మూలసిద్ధాంతాలు ఉన్నప్పటికీ, కాలమాన పరిస్తితులను బట్టి ఆ సిద్ధాంతాలను కొంత పక్కన బెట్టి వ్యవహరించే పరిస్తితి ఈనాడు చూస్తున్నాము. ఇప్పుడు ప్రతి అంశాన్ని, విజయావకాశాలు, రాజకీయంగా ఒనగూడే లాభనష్టాల నిష్పత్తి కోణం నుంచే ఆయా రాజకీయ పార్టీలు పరిశీలిస్తున్నాయి. అధికారమే పరమావధి అయినప్పుడు సిద్ధాంతాలకు నీళ్ళు వదిలి, అవకాశవాద రాజకీయాలకు పెద్ద పీట వేయడంలో ఆశ్చర్యం లేదు. ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటుతో మొదలయ్యే ఈ కప్పదాట్లు అధికార పీఠం అధిరోహించిన తరువాత మరింత వికృత రూపాన్ని, స్వభావాన్ని సంతరించుకుంటున్నాయి. ఎదుటి పక్షాన్ని ఎదిరించడం కోసం, నిలువరించడం కోసం పలు విపక్షాలతో రాజీపడి దానికి భావసారూప్యం అనే అందమైన అర్ధంలేని పదాన్ని అడ్డు పెట్టుకోవడం రాజకీయాలను గమనించేవారికి అనుభవమే. అలా మొదలయ్యే ఈ అవకరం క్రమంగా రాజకీయ కూటముల ఆవిర్భావానికి మార్గం వేసింది. అయితే, అధికారంలో పై చేయి కోసం వెంపర్లాటలు, పదవుల పంపిణీలో కీచులాటలు, సిద్ధాంత ప్రాతిపదికలేని ఈ రాజకీయ కూటముల అస్తిత్వానికే ముప్పు తెచ్చిన సందర్భాలు కూడా గతంలో అనేకం.

పాలకపక్షాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రతిపక్షాలు ఏకమైనట్టు,  ప్రతిపక్షాలను కనుమరుగు చేయడానికి పాలక పక్షాలు అంతే పట్టుదలగా పనిచేస్తున్నాయి. ప్రతిపక్షాలను గౌరవించడం సంగతి అటుంచి, అసలు వాటి ఉనికిని గుర్తించడానికి కూడా విముఖత చూపుతున్నాయి. ఉనికే లేకుండా చేయాలని యోచించడం ఇందుకు పరాకాష్ట.  చట్టసభల్లోనే కాకుండా చట్ట సభల వెలుపల కూడా ప్రతిపక్షాల పొడగిట్టని తత్వాలు, ఎదుటి పార్టీలను చీల్చి సొంత బలం పెంచుకునే ప్రయత్నాలు కొత్త రాజకీయ సంస్కృతిగా రూపుదిద్దుకుంటున్నాయి. కొద్ది హెచ్చు తగ్గులు మినహా ఏపార్టీ కూడా దీనికి మినహాయింపు కాదనే చెప్పాలి.

రాజకీయులు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే సాధించిన విజయాలు  ఎప్పటికీ శాశ్వతం అని భావించకూడదు. పరాజయం పొందినవారు అది శాశ్వతం అనుకోకూడదు. శిఖరం ఎక్కిన వాడు అక్కడే వుండిపోడు. ఎప్పుడో ఒకప్పుడు కిందికి దిగకతప్పదు. అలా దిగినప్పుడు మళ్ళీ ఎక్కే ప్రయత్నం మానుకోకూడదు.

అధికారం దక్కినప్పుడు కాలయాపన చేయకుండా, జనం తమకు అధికార పగ్గాలు అందించిన నిర్దిష్ట కాల వ్యవధిలోనే ప్రజలకు చేసే నాలుగు మంచి పనులే శాశ్వతంగా మిగిలిపోతాయి.

ఇది నిజం. కానీ ఈ నిజాలు ఈనాటి రాజకీయ నాయకులకు పట్టవు. నిజానికి వారికి ఆ అవసరం ఉన్నట్టు కూడా లేదు.

Below Photo: Courtesy Google Images