30, జూన్ 2013, ఆదివారం

జనహితమే సర్వజన సమ్మతం - భండారు శ్రీనివాసరావు



(గమనిక ఇది 2008 మే నెలలో రాసిన వ్యాసం) 


రాష్ట్ర విభజనని ప్రజలు మనస్పూర్తిగా కోరుకుంటే ఏ రాజకీయ శక్తీ దాన్ని ఆడ్డుకోలేదు. ఈ ఆకాంక్ష జనానిదయితే మన్నించాల్సిందే. రాజకీయమైనదయితే ఆలోచించాల్సిందే'. ఇటీవలికాలంలో - దాదాపు అన్ని పార్టీలు - ఏదో ఒక రూపంలో - ఏదో ఒక స్థాయిలో తెలంగాణా సెంటిమేంట్‌ని కొద్దో గొప్పో పులుముకోవాలని ప్రయత్నిస్తూనే  ఉన్నాయి. ఒక్క సీపీఎం ను మినహాయిస్తే,  ఒకప్పుడు ససేమిరా అన్న పార్టీలు కూడా ఇప్పుడు సరే అంటున్నాయి.  ఈ పార్టీల్లోని కొందరు పెద్దలకి ఇది తక్షణ రాజకీయ అవసరం.  అదే ఇందులోని విషాదం.
దేశం స్వాతంత్ర్యం పొందిన దరిమిలా - అనేక కొత్త రాష్ట్రాలు పురుడు పోసుకున్నాయి. పొరుగున ఉన్న అనాటి మద్రాసు(తమిళనాడు) రాష్ట్రం నుంచి విడిపోయి ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం - తరువాత కొద్ది కాలానికే - భాషా ప్రయుక్త రాష్ట్రాల సిద్దాంత ప్రాతిపదిక పై - తెలంగాణా ప్రాంతాన్ని(హైదరాబాదు స్టేట్ లోని ప్రధాన భాగాలు) కలుపుకుని - ఆంధ్ర ప్రదేశ్ గా ఆవిర్భవించింది. ఒకే భాష మాట్లాడే వారికి కూడా, విడివిడిగా రాస్ట్రాలు వున్నప్పుడు - ఆంధ్ర ప్రదేశ్ ని కూడా ప్రజాభిష్టం మేరకు విభజించడంలో తప్పేమి లేదు. అయితే తప్పల్లా - ప్రజల ఆకాంక్షని అంచనా వేయడంలో చేస్తున్న తప్పులే. రాష్ట్ర విభజన అన్నది ఎవరో కొందరి రాజకీయావసరాల కోసం కాకుండా మెజారిటీ ప్రజల అబీష్టం మేరకు జరగాలి.

ఏ వేర్పాటు ఉద్యమానికయినా, వెనుకబడినతనమే ప్రాతిపదిక. దీని ఆధారంగా పెచ్చరిల్లే భావోద్వేగాలే విభజన ఉద్యమాలకు ఊపిరిపోస్తాయి. ఈ విధంగా ప్రజ్వరిల్లే శక్తిని అడ్డుకోవడం అతికష్టం అని గతంలో తెలంగాణా ప్రజా సమితి నిరూపించింది కూడా. అయితే, అప్పటికి అంటే 1969 నాటికి ఇప్పటికీ పరిస్థితుల్లో ఇసుమంత కూడా మార్పు రాలేదంటే నమ్మడం కష్టం. తెలంగాణాలో ఇంకా కొన్ని ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదంటే నమ్మచ్చుకాని తెలంగాణాలో అసలు అభివృద్ధి  జరగలేదని వాదించడం కేవలం రాజకీయమే అవుతుంది. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. 1969 నాటికి వూహకు సయితం అందని ఉదార ఆర్ధిక విధానాలు ఈనాడు శరవేగంగా అమలవుతున్నాయి. ప్రపంచీకరణ సిద్దాంతం నేల నాలుగు చెరగులా బలంగా వేళ్ళూనుకుంటున్న నేపధ్యంలో - అసలు దేశాల  మధ్యనే హద్దులు చెరిగిపోతున్నాయి. 

పొట్ట గడవక కొందరూ - డాలర్ల వేటలో మరికొందరూ - ఉపాథి కోసం ఇంకొందరూ ఉన్నవూరు, కన్న దేశం  వదిలిపెట్టి వెళ్ళడం అన్నది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కావడంలేదు. అవకాశాలు వెతుక్కుంటూ అన్ని ప్రాంతాలవారు అన్ని చోట్లకీ వలస వెడుతున్నారు.
ఏదో ఒకనాడు - తెలుగువాడే అమెరికాకి అధ్యక్షుడు కాగలడని ఆ దేశంలో ఉంటున్న తెలుగువారే భరోసాగా చెబుతున్నారంటే ఇక భౌగోళిక రేఖలకి, దేశాల సరిహద్దులకీ - అర్థమేముంటుంది? పోతే - ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని - భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు ఏపాటి మిగులుతాయో అర్ధం చేసుకోలేని విషయమేమి కాదు. 
ఆ మాటకి వస్తే - దేశాలయినా, రాష్ట్రాలైనా, ప్రజలైనా విడిపోవడం - కలిసిపోవడం పెద్ద విషయమేమి కాదు. విభజన కుడ్యాన్ని కూలగొట్టుకుని - రెండు జర్మనీలు కలిసిపోయాయి. అమెరికాని సయితం శాసించగలిగిన స్థాయికి ఎదిగిన సోవియెట్ యూనియన్ - అంగ, వంగ, కళింగ దేశాల మాదిరిగా విచ్చిన్నమయింది. 

కాబట్టి - చరిత్ర నుంచి నేర్చుకున్నవారు - చరిత్ర హీనులు కాలేరు. మనసులూ - మనుషులూ కలుషితం కావడం ఏ సమాజానికి క్షేమకరం కాదు. విడీపోయినా చేతులు కలిసే వుండాలి. మనసులు మసి బారకుండా ఉండాలి .
సర్వేజనాః సుఖినోభవంతు! 
(మే - 2008 )

అబద్ధం చెప్పడం అంటే




చిన్న పిల్లాడు అబద్దం చెబితే  అబద్ధాలు ఆడకురా పాపంరా అంటాం.
ఎదిగిన వయస్సులో అబద్ధం చెబితే వొద్దురా  తప్పురా అనేస్తాం.
అదే ప్రేమికుడు అబద్ధం చెబితే ప్రేమలో  బొంకడం కూడా  ఓ  కళ అంటాం.
రాజకీయనాయకుడివిషయంలో అబద్ధం అనేది అతగాడికి  తప్పనిసరి అవసరం అని సమాధానపడతాం
పొతే న్యాయవాదికి అబద్ధం అతడి  వృత్తిలో ఒక భాగం అని సరిపుచ్చుకుంటాం.
ఆఫీసులో పై అధికారికి అబద్ధం అనేది  సిబ్బందిపై పట్టు చిక్కించుకునే ఓ పని ముట్టు అనుకుంటాం 
మన కింద పనిచేసేవాడికి మాత్రం అది  సమయానికి పనికొచ్చే ఓ కుంటి సాకు అని భావిస్తాం 
ఇక పెళ్ళయిన మగవాడివిషయంలో  అంటారా!

అబద్ధాలు జీవితంలో ఓ భాగం. ఆడకపోయాడో అతడి ఆట కట్టు. అతడి మనుగడకే ముప్పు. 

28, జూన్ 2013, శుక్రవారం

ఏం చెప్పను? యేమని చెప్పను? (కధానిక)




ఆ వృద్ధాశ్రమంలో పదేళ్లుగా పనిచేస్తూ ఇరవై లోనే అరవై ఏళ్ళు పైపడ్డ వాడిగా తయారయ్యాను.  ఇన్నేళ్ళ బట్టి చూస్తున్నాను కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా నవ్వు మొహంతో వున్నవారెవ్వరూ నాకు ఆ ఆశ్రమంలో తారస పడలేదు. ఎవరిని కదిలించినా కన్నీటి కధలే. అన్నీ వుండి  కూడా ఏమీ లేని వారి వ్యధలే.  తల్లీ తండ్రీ లేని అనాధను కనుక ఆ వృద్ధులు పడే  వేదనలుఆవేదనలు మొదట్లో నాకేమీ అర్ధం అయ్యేవి కావు. ఇక్కడ రూమ్ బాయ్ గా చేరినప్పటినుంచి వయసు మీద పడ్డ వారి బాధలేమిటో,వారి సమస్యలేమిటో కొద్ది కొద్దిగా అవగతం కావడం మొదలయింది
.
ఆశ్రమం అన్న మాటే కానీ వున్న దానికీతిన్న దానికీ అణా పైసలతో సహా వసూలు చేస్తారు. ఆ డబ్బులు కట్టడానికి వచ్చే వారి పిల్లల మొహాల్లో కూడా  ఏ ఒక్కనాడు నాకు సంతోషం అన్నది కానవచ్చేది కాదు. తలితండ్రుల్ని  అలా చూడాల్సి వచ్చినందుకు కాదు వారి  బాధకన్న వారి బాధ్యతలు ఇలా ఇంకా  ఎన్నాళ్ళు మోయాలో అన్నదే వారి అసహనానికి కారణం అని మెలమెల్లగా బోధపడుతూ వచ్చింది. ఈ నేపధ్యంలో - 

ఒక రోజు ఓ పెద్దాయన ఆశ్రమంలో చేరాడు. అతడొచ్చినప్పుడు నేనే డ్యూటీ లో వున్నాను. వయస్సు తొంభై అని  రిజిస్టర్లో వివరాలను బట్టి  తెలుసుకున్నాను. పైకి చూస్తే  అన్నేళ్ళ వాడిగా అనిపించలేదు. బోసినోరే అయినా అతడి నవ్వులో ఒకరకమైన ఆకర్షణ. చూడగానే లేచి నిలబడాలని అనిపించే పెద్దరికం.ఎలాటి దిగులూ దైన్యం కనిపించని ఆయన వదనం నాకు కొత్తగాగమ్మత్తుగా  అనిపించింది.

మరోసారి వివరాలు చూసాను. పెద్ద ఉద్యోగం చేసాడు. పెద్ద పెద్ద హోదాలు అనుభవించాడు. భార్య ఏడాది  క్రితమే కన్ను మూసింది. లంకంత కొంపలో ఒకే ఒక్కడు. ఇద్దరు కొడుకులూముగ్గురు అమ్మాయిలూ అందరూ కట్టుకున్నవాళ్ళతోపుట్టిన సంతానంతో  కలసి విదేశాల్లో సెటిల్ అయ్యారు. వాళ్లు రమ్మంటారు. ఈయన పోనంటారు. తలచుకుంటే ఇంత కంటే మంచి సౌకర్యాలు వున్న ఓల్డ్  ఏజ్ హోంలో దర్జాగా చేరగల స్తోమత వున్నట్టే వుంది. దీన్నే ఎందుకు ఎంచుకున్నాడో తెలవదు.
ఆయన వుండబోయే గది ఎలావుంటుందో నాకు తెలుసు. ఆ గదిలో మొన్న మొన్నటి వరకు వున్న వృద్ధురాలు మొన్నీమధ్యనే  కాలం చేసింది.  చిన్న గది. ఓ మేజా. ఓ పక్కగా కిటికీ. దానికి వేలాడుతూ పాత కర్టెన్. దాన్నిమార్చండి బాబూ అని  పోరు పెడుతూనే ఆ వృద్ధురాలు ఏమారి పోయింది. తెలియని లోకాలకు తరలిపోయింది. ఎందుకయినా మంచిదని ఆయన వుండబోయే గది తీరుతెన్నులు గురించి ముందే చెవిలో వేసాను. బదులుగా ఆయన చిన్నగా  నవ్వాడు.

గది చూపించడానికి నేను ముందు నడిచాను. చేతి కర్రను ఊతంగా తీసుకుని ఆయన నా వెంట నడిచాడు.

గదిని చూసి ఆయన నిరాశ పడతాడనుకున్నాను. అదేమిటో విచిత్రం! పదేళ్ళ పిల్లాడు ఆటబొమ్మ చేతిలో పెడితే మురిసిపోయినట్టు ఆనందంగా  చుట్టూ చూస్తూ బాగుంది. నాకిది బాగా నచ్చింది అన్నాడు.                 
అర్ధం కానట్టు పెట్టిన నా మొహాన్నిఅందులోని భావాలను గమనించి ఆయన మెల్లగా చెప్పాడు.
గదిలో  ఫర్నిచర్ ఎలావుందిఫాన్ వుందాఏసీ వుందాఅన్న వాటిని బట్టి చూస్తేనిజమే ఈ గది అంత బావోలేదు. ఇలాగే వుండాలని నేను వచ్చేముందు అనుకోలేదు. అందువల్లనే నాకు నచ్చింది. ఇలా వుండాలి అని ముందు  అనుకుని  అలా లేకపోతే తరువాత  మిగిలేది నైరాశ్యమే.

ముసలాళ్ళు ధోరణిలో పడితే యెలా మాట్లాడుతారో నాకు తెలుసు. అందుకే నేనేమీ కల్పించుకోకుండా మౌనంగా వుండి పోయాను.
కానీ ఆయన మాటలు కొనసాగించాడు. ముందు అంతగా పట్టించుకోకపోయినా ఆయన మాటల్లోని ఆకర్షణ శక్తి నన్ను కట్టిపడేసింది.
భార్య చనిపోయిన తరువాత కొన్నాళ్ళ పాటు ఈ లోకం  శూన్యం అనిపించింది. ఆవిడతో పాటే నేనూ పోయి వుంటే యెంత బాగుండేదో అనుకునే వాడిని. కానీ క్రమంగా మళ్ళీ నలుగురిలో  పడ్డాను. ఈ లోకానికి నేను చేయగలిగినదేమయినా వున్నదా అని ఆలోచించాను. పిల్లలు వాళ్ల మానాన  వాళ్లు స్తిరపడ్డారు. ఒక్కడికీ  అంత ఇల్లు అనవసరం అనిపించింది. చిన్న పిల్లలకు ఉచితంగా చదువు  చెప్పే ఓ సంస్తకు రాసిచ్చాను. అనాధ బాలలను పెంచి పోషించే మరో సంస్తకు వున్న డబ్బంతా ఇచ్చేసాను. సంపాదించిన దానికి సార్ధకత లభించింది. సంపాదన మళ్ళీ మొదలు పెట్టాలి. కాకపొతే అది డబ్బు కాదు. నలుగురితో మంచిగా వుండడడంమంచి  అనిపించుకోవడం. నిజానికి ఇది డబ్బు సంపాదించడం కన్నా కష్టం.
చిన్నదో పెద్దదో ఆ మంచంలో పడుకుంటాను. నా వొంట్లో ఏ అవయవం సరిగ్గా పనిచేయడం లేదోదానివల్ల  పడాల్సిన బాధలేమిటో ఆ మంచంలో పడుకుని ఆలోచిస్తాను.  పొద్దున్న లేచిన తరువాత  అవయవాలన్నీ సరిగ్గా వుంటే వాటిని అలా సక్రమంగా పనిచేయిస్తున్న ఆ సర్వేశ్వరుడికి ఓ దణ్ణం పెట్టుకుంటాను. ఇప్పుడు నాకు కావాల్సింది నా ఆరోగ్యం. మరొకరికి భారంగా మార్చే అనారోగ్యాన్ని దూరంగా వుంచడం. ఇది నా  చేతిలో వుందనుకోను. అయినా మానవ ప్రయత్నం చేయాలి కదా.        
       
ప్రతి ఉదయం ప్రతి ఉషోదయం నాకు అదనంగా దేవుడిచ్చిన వరమనే భావిస్తాను. పొద్దున్నే  లేచి లోకాన్ని మళ్ళీ  చూడగలగడం కంటే ఈ వయస్సులో కావాల్సింది ఏముంటుంది? అలా వచ్చిన ఆ  కొత్త రోజుకు స్వాగతం చెబుతాను. నా జీవిత కాలంలో నాకు సొంతమయిన మధుర క్షణాలనన్నింటినీ  మరో సారి మననం చేసుకునే మహత్తర  అవకాశం దొరికిందని ఆనందిస్తాను.

‘ వృద్ధాప్యం బ్యాంక్ ఎక్కౌంట్ లాంటిది. జీవన యానంలో సంపాదించి కూడబెట్టుకున్న దాన్ని  అందులో  డిపాజిట్ చేసుకోవచ్చు. జీవితం చరమాంకంలో తిరిగి తీసుకోవచ్చు. అది డబ్బే కానక్కర లేదు సుమా! నీవంటివారి నుంచి పొందే  వాత్సల్యం కూడా అలాటిదే.

ఈ రోజున ఇలా తారసపడి నీ ప్రేమాభిమానాలతో నా బ్యాంక్ ఖాతాను పెంచుతున్నావు. అంటే నేను తిరిగి తీసుకునే ఆనందాన్ని మరింతగా పెంచుతున్నావన్న మాట. అందుకు నేను నీకు సదా రుణపడివుంటాను.
ఆ వృద్ధుడి మాటలు వింటుంటే నాకు నోట మాట రాకుండా అయిపోయింది.


చక్కనమ్మైతే చిక్కినా అందం

కానీ ఇదేవిటి?

ఒకప్పుడు మన రూపాయికి పదమూడు అమెరికన్ డాలర్లు. ఇప్పుడో.
ఒక డాలరుకు అరవై రూపాయలు.
హతోస్మి.
(28-06-2013)

27, జూన్ 2013, గురువారం

మ్యూజియంలో కృతజ్ఞత - భండారు శ్రీనివాసరావు



( జూన్ 28-  మాజీ ప్రధాన మంత్రి శ్రీ పీవీ నరసింహారావు గారి జయంతి)


గూగుల్ ఇమేజ్ సెర్చ్ సర్ఫ్ చేసుంటే ఒక కార్టూన్ కనిపించింది.
 అందులో -




కంప్లెయంట్స్ (ఫిర్యాదులు), గ్రాటిట్యూడ్ (కృతజ్ఞత) అనే రెండు కౌంటర్లు వుంటాయి.
పిర్యాదుల కౌంటర్ వద్ద పెద్ద క్యూ వుంటుంది.
కృతజ్ఞతలు తెలపాల్సిన కౌంటర్ దగ్గర మాత్రం ఒక్క మనిషీ కనబడడు.

వర్తమాన ప్రపంచానికి ముఖ్యంగా భారత దేశానికి అద్దం పట్టే కార్టూన్ అని నాకు అనిపించింది.
ఎనభయ్యవ దశకంలో నేను మాస్కోలో వున్నప్పుడు వేల సార్లు విన్న పదం – ‘స్పసీబా’ – అంటే ఇంగ్లీష్ లో థాంక్స్’ – మన తెలుగులో ధన్యవాదాలు’. బహుశా ఈ పదం ఇంత పెద్దగా వుండడం వల్లనో ఏమో ఇది పలకడానికి జనం కొంత సంకోచిస్తున్నారనుకోవాలి.


రష్యన్లు - ఆ మాటకు వస్తే ప్రపంచం లోని అనేక దేశాలవాళ్ళు కృతజ్ఞతను బాహాటంగా వెల్లడిస్తుంటారు. అది వారి జీవన విధానంలో ఒక భాగమై పోయింది. పైకి వ్యక్త పరిస్తేనే కృతజ్ఞతా భావం వున్నట్టని చెప్పడం నా వుద్దేశ్యం కాదు. తెలుగు సినిమాల్లో అన్నాచెల్లెళ్ళు ఒకరినొకరు పెనవేసుకుని అన్నయ్యా ! చెల్లెమ్మా!అంటూ చెప్పుకునే డైలాగులు వింటే కంపరం కలుగుతుంది కానీ, వారి నడుమ వున్న ఆత్మీయతా భావం అవగతం కాదు. అయితే చేసిన మంచిని మరచిపోవడం మనుషులకు వుండాల్సిన లక్షణమని అనుకోలేము.
కృతజ్ఞతఅన్న పదానికి ఈనాటి రాజకీయాల్లో స్తానం వున్నట్టులేదు. రాజకీయనాయకులకు వడ్డించేవాడుప్రధానం కాని వడ్డించినవాడు కాదు.


పీవీ నరసింహారావుగారి విషయమే తీసుకుందాం. ప్రధానిగా వున్నంతకాలం ఆహా! ఓహో!!అన్నారు. ఆర్ధిక సమస్యలతో పీకలలోతు మునిగిపోయివున్న దేశాన్ని నూతన సంస్కరణలతో ఒడ్డున పడేసిన మేధావిగా కీర్తించారు. బొటాబొటి మెజారిటీ తో వున్న పాలక పక్షాన్ని అయిదేళ్ళ పాటు పూర్తి కాలంఅధికార పీఠం పై వుంచిన అపర చాణ క్యుడని వేనోళ్ళ పొగిడారు. అధికారం దూరం కావడంతోనే ఆ నోళ్ల తోనే – ‘అధికారాంతమునందు చూడవలె అని పద్యాలు పాడడం ప్రారంభించారు. ఆయన తరవాత కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన వ్యక్తికి ఆయన్ని మించిన గొప్ప లక్షణాలేమీ లేవు. కానీ పదవేసర్వస్వమయిన వారికి ఆయన భజనేసర్వస్వమయిపోయింది. పీవీని విమర్శించిన పత్తిత్తులకుఆయన చేసిన మేళ్ళుకానరాలేదు. అయిదేళ్ళు తెలుగువాడిలోని వాడినీ వేడినీలోకానికి చాటిచెప్పిన వృద్ధ రాజకీయవేత్త న్యాయస్తానాలలో నిస్సహాయంగా బోనులోనిలబడ్డప్పుడు ఆయన పార్టీ వాళ్ళెవ్వరూ ఆయనను పట్టించుకోక పోగా ఏమీ తెలియనట్టు కళ్ళుమూసుకున్నారు. ప్రధానిగా పీవీ ని సమర్ధించడం ఈ వ్యాసకర్త వుద్దేశ్యం కాదు. రాజకీయాల్లో కృతజ్ఞతఅనే పదానికి తావు లేకుండాపోయిందన్న విషయాన్ని విశదం చేయడానికే ఈ ఉదాహరణ. పీవీ మరణించడానికి కొన్ని నెలలముందు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్ లో బస చేసారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు హడావిడి ఒక విలేఖరిగా నాకు తెలుసు. ఆకాశవాణి ప్రతినిధిగా కలుసుకోవాలన్నా ఎంతో కష్టంగా వుండేది. అధికారులు, అనధికారులు, మందీ మార్భాలాలు, ఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయనాయకులు ఆ వైభోగం వర్ణించ తరమా? అన్నట్టు వుండేది.

మాజీ ప్రధానిగా పీవీ రాజ భవన్ లో బస చేసినప్పుడు  నేనూ , ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్, న్యూస్  ఎడిటర్ ఆర్వీవీ కృష్ణారావు గారు గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం  వెళ్లి -  పని పూర్తిచేసుకున్నతరవాత - రాజ్ భవన్  గెస్ట్ హౌస్ మీదుగా వెడుతూ అటువైపు తొంగి చూసాము. సెక్యూరిటీ మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడంతో మేము లోపలకు వెళ్ళాము. అక్కడవున్న భద్రతాదికారిని  'పీవీ గారిని చూడడం వీలుపడుతుందాఅని అడిగాము. అతడు తాపీగా  'లోపలకు వెళ్ళండి' అన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూ లోపలకు అడుగు పెట్టాము.
పెట్టిన తరవాత మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే టీవీలో ఫుట్ బాల్  మాచ్  చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేసామేమో అన్న ఫీలింగుతోనే - మమ్మల్ని పరిచయం చేసుకున్నాము.లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు  నా వైపు చూస్తూ- 'మీ అన్నయ్య పర్వతాలరావు ఎలావున్నాడయా!' అని అడిగేసరికి నాకు మతి పోయినంత పనయింది. ఎప్పుడో  పీవీగారు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు - మా అన్నయ్య పర్వతాలరావు గారు సమాచారశాఖ అధికారిగా ఆయనకు పీఆర్వో గా కొద్దికాలం పనిచేసారు. అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అప్పటి విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు.  అదీ  పీవీగారి గొప్పతనం. ఆ తరవాత కూడా  ఆయన ఏదో మాట్లాడుతున్నారు కానీ మాకు కలయో వైష్ణవ మాయయోఅన్నట్టుగావుంది. మేము కలసి కూర్చుంది కొన్నేళ్ళ క్రితం వరకు దేశాన్ని వొంటి చేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ వుండడం వల్ల కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరవాత కొణిజేటి రోశయ్య గారు వచ్చారు. ఆయన్ని చూడగానే  పీవీ గారి మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది.
ఇలాటి నేపధ్యాలున్న మన రాష్ట్ర రాజకీయ రంగంలో -

అధికారం చేజారితేనే పట్టించుకోని రాజకీయ నాయకులు - ప్రాణాలు విడిచిన తమ నాయకులను పట్టించుకుంటారనుకోవడం భ్రమ. రామారావయినా, రాజశేఖరరెడ్డి అయినా అంతే.

కొన్నాళ్ళ తరవాత పిల్లలకు కృతజ్ఞతగురించి తెలియచేప్పాలంటే మ్యూజియం కు తీసుకు వెళ్ళాలేమో!

26, జూన్ 2013, బుధవారం

బెజవాడ సొగసు చూడ తరమా!



(బెజవాడ మీద రాసిన బ్లాగు చదివి ఎంతోమంది స్పందించారు. అందరికీ ధన్యవాదాలు. పోతే, ప్రత్యేకించి దాసు కృష్ణ మూర్తి గారు బెజవాడతో తన అనుబంధాన్ని, జ్ఞాపకాలను వివరంగా పేర్కొంటూ ఇంగ్లీష్ లో సుదీర్ఘంగా రాశారు. దాన్ని తెలుగులో అనువదించి అందరితో పంచుకోవాలని అనిపించింది.నాకు రాసిన లేఖలో  కృష్ణమూర్తి గారు తనని తాను పరిచయం చేసుకుంటూ - I live in the United States. I am a migratory bird with three migrations, first to Hyderabad, second to Delhi and the third to America. I stayed in Bezwada for 27 years, Hyderabad 29 years, Delhi 20 years and the U.S. 11 years.- అని రాశారు. దీనిబట్టి ఇక వారి వయస్సును, అనుభవాన్ని అర్ధం చేసుకోవచ్చు. వారి ఫోటో ఒకటి సంపాదించగలిగితే ఈ వ్యాసానికి మరింత పరిపూర్ణత్వం సిద్ధించేది. కాని తొలి పరిచయంలోనే ఫోటో పంపమని అడిగే చనువు తీసుకోలేకపోయాను – భండారు శ్రీనివాసరావు )
   
“బెజవాడ నగర సందర్శనను సినిమా హాళ్ళు, హోటళ్ళతో మొదలు పెడదాము.
అప్పట్లో బెజవాడలో రెండంటే రెండే సినిమా హాళ్ళు వుండేవి. ఒకటి మారుతీ సినిమా, రెండోది నాగేశ్వరరావు హాలు.(బహుశా నాగేశ్వరరావు హాలంటే  కృష్ణ మూర్తి గారి ఉద్దేశ్యం దుర్గాకళా మందిరం కావచ్చేమో!) ఇది ముప్పయ్యవ దశకంలో మాట. ఈ సినిమా హాళ్ళకు ఆ రోజుల్లోనే సొంత జెనరేటర్లు వుండేవి.

“సాయం సమయాల్లో ఈ సినిమా హాళ్లనుంచి ఎడ్లబండ్లు సినిమా ప్రచారానికి  బయలుదేరేవి. వాటిల్లో కొందరు కూర్చుని వాయిద్యాలు వాయిస్తూ వుండేవారు. నలుగురు చుట్టూ  చేరగానే సినిమాల తాలూకు కరపత్రాలు పంచుతూ వుండేవారు. ఆ బళ్ళు కనబడగానే వెంట పరిగెత్తుకెళ్ళి ఆ కరపత్రాలు వీలయినన్ని పోగేసుకోవడం మాకు సరదాగా వుండేది. ఎన్ని ఎక్కువ పాంప్లేట్లు పోగేస్తే అంత గొప్ప.

1937 లో పరిస్తితి కొంత మారింది. నాగేశ్వరరావు గారు ఎడ్లబండి స్తానంలో మోటారు వ్యాను ప్రవేశపెట్టారు. దాన్ని రంగురంగుల సినిమా పోస్టర్లతో అందంగా ఆకర్షణీయంగా అలంకరించేవారు. లౌడ్ స్పీకర్ల ద్వారా సినిమా పాటలు వినిపించేవారు. టంగుటూరి సూర్యకుమారి పాడిన రికార్డులను ప్రత్యేకంగా వేసేవారు. ఇలా సాగే సినిమా ప్రచారం కొన్నాళ్ళ తరువాత కొత్త పుంతలు తొక్కింది. సాలూరు రాజేశ్వరరావు, శ్రీరంజని, రామతిలకం నటించిన ‘కృష్ణ లీల’ సినిమా విడుదల అయినప్పుడు ఆ సినిమా నిర్మాత -  కరపత్రాలను విమానం నుంచి వెదజల్లే ఏర్పాటు చేశారు. నిజంగా ఆ రోజుల్లో అదొక సంచలనం.    
“సినిమా నిర్మాతల నడుమ పోటీలు పెరగడం నాకు బాగా గుర్తు. ఒకాయన ద్రౌపది వస్త్రాపహరణం నిర్మిస్తే మరొకరు పోటీగా ద్రౌపదీ మాన సంరక్షణ పేరుతొ మరో సినిమా తీసి విడుదల చేశారు. ఒకరు మాయాబజారు (పాతది) తీస్తే ఆయన ప్రత్యర్ధి శశిరేఖా పరిణయం పేరుతొ అదే కధను తెరకెక్కించారు. అలాగే సినిమాలు ఆడే ధియేటర్ల నడుమ కూడా పోటీ తత్వం వుండేది.

“అప్పటిదాకా పౌరాణిక చిత్రాలదే హవా. రెండో ప్రపంచ యుద్ధానికి కొద్ది ముందు సాంఘిక చిత్రనిర్మాణానికి నిర్మాతలు చొరవ చూపడం మొదలయింది. ముందు భానుమతి, పుష్పవల్లి తో ‘వరవిక్రయం’ వచ్చింది. తరువాత వైవీ రావు, రామబ్రహ్మం, హెచ్ ఎం రెడ్డి, బీఎన్ రెడ్డి వంటి హేమాహేమీలు  రంగ ప్రవేశం చేసి సాంఘిక చిత్ర నిర్మాణాన్ని ముమ్మరం చేశారు. రైతు బిడ్డ, మాలపల్లి,ఇల్లాలు, గృహలక్ష్మి.వందేమాతరం, దేవత వంటి పలు చిత్రాలు ఈ పరంపరలో రూపుదిద్దుకున్నవే. చలనచిత్రాలను పంపిణీ చేసే డిస్ట్రిబ్యూటర్లు  అందరికీ బెజవాడలోని గాంధీనగర్ రాజధాని. సినిమాలు మద్రాసులోనో, కొల్హాపూర్, కలకత్తాలలోనో  తయారయినా వాటిని విడుదల చేయడానికి అవసరమయిన అన్ని హంగులూ, ఏర్పాట్లు చేయాల్సింది మాత్రం  బెజవాడలోనే.

“ఆ రోజుల్లో ఇలా ఇబ్బడిముబ్బడిగా సినిమాలు తీసేవాళ్ళు కాదు. చిత్రానికి చిత్రానికీ నడుమ కనీసం పదిహేనురోజులో,నెల రోజులో వ్యవధానం వుండేట్టు చూసుకునేవారు. సినిమా విడుదలలు లేని ఖాళీ రోజుల్లో ఆ ధియేటర్లలో డ్రామాలు ఆడేవాళ్ళు.
        
“నలభయ్యవ దశకంలో మరో ధోరణి కనబడింది. తెలుగు సినిమాలు దొరక్కపోతే అరవ చిత్రం వేసేవాళ్ళు. హాలు మధ్యలో అనువాదకుడు నిలబడి కొన్ని డైలాగులను తెలుగులో అనువదించి చెబుతుండేవాడు. ఇంటర్వెల్ సమయంలో సినిమా సాంగ్స్ పేరుతొ ఆ సినిమా పాటల పుస్తకాలను అమ్మేవాళ్ళు. వాటికి మంచి గిరాకీ వుండేది.

“బుకింగ్ కౌంటర్ల దగ్గర ఒక వరుసలో నిలబడి టిక్కెట్లు తీసుకునే సంప్రదాయం వుండేది కాదు. కౌంటర్ తెరవగానే అంతా ఒక్కసారిగా మీదపడేవారు. సినిమా టిక్కెట్టు కొనడం అంటే దాదాపు ఒక యుద్ధం చేసినట్టు వుండేది. టిక్కెట్టు తీసుకుని బయటపడేసరికి చొక్కాలు చినిగి పోయేవి. వొళ్ళంతా చెమటలు  పట్టి బట్టలు తడిసిపోయేవి.

“సినిమాహాళ్లలో పారిశుధ్యం పూజ్యం అనే చెప్పాలి. ఆ రోజుల్లో నేల క్లాసు అని ఒక  తరగతి వుండేది. ఆ క్లాసులో  పైన నేల మీద  కూర్చున్న వారిలో ఎవరి పిల్లవాడయినా మూత్రం చేస్తే అది కింద దాకా పారుతుండేది. కింది వైపు కూర్చున్న వారి లాగూలు తడిసేవి. మరుగు దొడ్ల సౌకర్యం వుండేది కాదు. “ఇంటర్వెల్  కాగానే ప్రేక్షకులు ఒక్కమారుగా గుంపులు గుంపులుగా బయటకు వచ్చి సినిమా హాలు గోడల్ని ప్రక్షాళన చేసేవాళ్ళు.

1939 లో అనుకుంటా బెజవాడలో కొత్తగా రామా టాకీసు వచ్చింది. తరువాత వరుసగా గవర్నర్ పేటలో  లక్ష్మీ టాకీసు, వన్ టౌన్ లో  సరస్వతీ మహలు వచ్చాయనుకుంటాను.
     
“ఇక రెస్టారెంట్ల విషయానికి వస్తే-

“వూళ్ళో దాదాపు అన్నీ శాఖాహార భోజన హోటళ్ళే! బ్రాహ్మణ హోటళ్ళు.  చాలావరకు ఉడిపి అయ్యర్లవే. బాగా ప్రాచుర్యం పొందిన వెల్కం హోటల్, మోడరన్ కేఫ్ లాటి హోటళ్ళు కూడా ఉడిపి వారివే. ఒక్క అణా (రూపాయిలో పదహారో వంతు) పెడితే రెండు ఇడ్లీలు, వేడి వేడి సాంబారు, కారప్పొడి, కొబ్బరి చట్నీ, అల్లప్పచ్చడి – అన్నీ లేదు అనకుండా వడ్డించే వాళ్లు.      

”గవర్నర్ పేటలోని బీసెంటు రోడ్డు దగ్గర మొదలు పెడితే గాంధీనగరం వరకు అన్నీ హోటళ్ళే!  మాంసాహారం లభించే హోటళ్ళను మిలిటరీ భోజన హోటళ్ళు అనేవారు. వాటిని  ఎక్కువగా కేరళ వాళ్లు నడిపే వాళ్లు. అలాగే, బయట నుంచి  బెజవాడకు వచ్చిన వాళ్ల చేతుల్లో కొన్ని వృత్తులు వుండేవి. పాల వ్యాపారం చాలావరకు విజయనగరం నుంచి వచ్చిన వారు చూసుకునేవారు. ఒరిస్సా నుంచి వచ్చిన వారు - పాయిఖానాలు  శుభ్రం చేసే పని చూసేవారు. దర్జీ పని, జట్కాలు (గుర్రబ్బండ్లు) ముస్లింల  ఇలాకాలో వుండేవి. రాకపోకలకు రిక్షాలే గతి. సైకిల్  రిక్షాలు రాకపూర్వం వాటిని మనుషులు లాగేవారు. సిటీ బస్సులు వుండేవి కావు. కాకపొతే, బెజవాడ, ఏలూరు, బందరు, గుడివాడల మధ్య బస్సులు తిరిగేవి. ఆ బస్సులకు పై కప్పుమాత్రమే వుండేది. పక్కన ఏమాత్రం ఆచ్చాదన లేకపోవడంతో వర్షం వస్తే అంతే సంగతులు. ప్రయాణీకులు పూర్తిగా తడిసిపోయేవాళ్ళు. కృష్ణా నది మీద రోడ్డు వంతెన లేని కారణంగా బెజవాడ నుంఛి  గుంటూరుకూ, ,తెనాలికీ  బస్సు సర్వీసు వుండేది కాదు. 
అధికారుల పెత్తనం జోరుగా వుండేది. పోలీసు అధికారి కానీ రెవెన్యూ అధికారి కానీ బస్సు ఎక్కాల్సి వస్తే బస్సును ఏకంగా ఆయన ఇంటి దాకా తీసుకువెళ్ళేవాళ్ళు.

“మా ఇల్లు గవర్నర్ పేటలో వుండేది. ఇంటి నుంచి కొత్తపేటలోని హిందూ హై స్కూలు వరకూ నడిచే వెళ్ళే వాళ్ళం. తరువాత మేము చేరిన ఎస్ ఆర్ ఆర్ అండ్ సీ వీ ఆర్ కాలేజీ మాచవరం లో వుండేది. అప్పుడు కూడా మాది నటరాజా సర్వీసే. స్కూల్లో టీచర్లు, కాలేజీలో లెక్చరర్లు అంతా కాలినడకనే వచ్చేవాళ్ళు. దుర్గాగ్రహారంలో వుండే విశ్వనాధ సత్యనారాయణ గారు, చతుర్వేదుల నరసింహం గారు కాలేజీకి నడిచే వచ్చేవాళ్ళు. మాకు వాళ్లు లెక్చరర్లు. దోవలో ఇంగ్లీష్ సాహిత్యం  గురించి చర్చించుకునే వారు. కొత్తగా విడుదలయ్యే ఇంగ్లీష్ సినిమా మొదటి ఆట చూడడం కోసం ప్లాన్లు వేసుకునేవాళ్ళు. కాలేజీ ప్రిన్సిపాల్ పుట్టపర్తి శ్రీనివాసాచారి గారు మాత్రం జట్కా బండిలో వచ్చేవారు. కొందరు లెక్చరర్లు సైకిళ్ళపై చేరుకునే వారు. (వీలు దొరికితే మరి కొన్ని సంగతులు మరోసారి)