29, మే 2020, శుక్రవారం

జగన్ ఓ సీతయ్య...ఎవరిమాటా వినడు – భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily on 30-05-2020, Saturday)

వై.ఎస్. జగన్ మోహన రెడ్డి గురించి తెలియనివాళ్ళు చెప్పుకునే మాట ఇది.  దీనికి కారణం ఆయన్ని గురించి పూర్తిగా తెలిసినవాళ్ళు లేకపోవడమే. చుట్టూ చాలామంది వుంటారు. కానీ ఎవర్నయినా అడిగి చూడండి. ఒకటే మాట, ‘ఆయన చాలా లోతయిన మనిషి.  జనం చెప్పేది  తప్ప పరిజనం మాట  ఆయనకు పట్టదు”.
ఒక నిజం చెప్పుకుందాం. ఎవరి మాటయినా వినాల్సిన అవసరం ఏముంది? ఆయనకు తన గమ్యం తెలుసు. వెళ్ళాల్సిన మార్గం తెలుసు. కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి సొంత పార్టీ పెట్టుకున్నప్పటి నుంచి ఏమి చేయాలి? ఎలా చేయాలి అనే విషయంలో ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఆయన సిద్ధంగా ఉంచుకుని ముందుకు సాగుతున్నట్టు ఆయన వ్యవహార శైలి గమనించిన వారికి అర్ధం అవుతుంది.
జగన్ మోహన రెడ్డి జనాలకు కొన్ని వాగ్దానాలు చేశారు. ప్రజలు నమ్మి అధికారం అప్పగించారు. వాటిలో చేయగలిగినవి ఏమిటి? చేయలేనివి ఏమిటి అని ఆయనే ఆలోచించుకుని ఒక కాల పట్టిక తయారు చేసుకుని పలానా రోజులోగా ఈ పనులు చేయాలి అని వాటిని చేసుకుంటూ, చేసిన వాటిని టిక్కు పెట్టుకుంటూ, చేయాల్సిన వాటిని ఎప్పుడు చేసేది ప్రజలకు చెప్పుకుంటూ పాలన సాగిస్తున్నారు. ఇక తనకూ ప్రజలకూ నడుమ ఎవరూ లేరని, వారికి తానే జవాబుదారుననీ అనుకుంటూ ముందుకు పోతున్నారు. ఇక ఒకరి మాట వినాల్సిన అవసరం ఏమిటనే ధీమా ఆయన్ని సీతయ్యని చేసివుంటుంది.
గుర్తుండే వుండాలి. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న తొలిరోజుల్లో ఆయన ధోరణి కూడా అచ్చు ఇదే విధంగా వుండేది.  ప్రజలకు తప్ప ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అగత్యం తనకు లేదనే పద్దతిలో శ్రీ రామారావు వ్యవహరించేవారు. నిజానికి ప్రజల అభిమానంతో విజయాలను మూటగట్టుకున్న ఏ రాజకీయ నాయకుడి తరహా అయినా ఇదే విధంగా వుంటుంది. జరిగే తప్పులకీ, ఒప్పులకీ తనదే బాధ్యత అనే తీరులో వుంటుంది. గతంలో ఇందిరా గాంధీ, ప్రస్తుత కాలంలో నరేంద్ర మోడీ కేవలం తమ వ్యక్తిగత ఆకర్షణతో, ప్రతిభతో, ప్రజాభిమానంతో గద్దె ఎక్కారు. తమను నమ్ముకున్న ప్రజానీకానికి ఏది మేలు చేస్తుందని వాళ్ళు నమ్ముతారో అదే చేస్తూ పోతారు. ఈ విషయంలో ఏవిధమైన శషభిషలకు, సమాలోచనలకు తావు లేదనే దోవ వారిది.
ఇప్పుడు జగన్ మోహన రెడ్డిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించేవారు ఈ కోణంలో ఆలోచించాలి. అప్పుడే ఆయనలో తెలియని కోణాలు తెలుసుకోగల అవకాశం లభిస్తుంది.
సరే! ఇదొక కోణం.
చెప్పిన వాటిలో తొంభయ్ శాతం పూర్తి చేశాను అనేది ఫుల్ పేజి పత్రికాప్రకటనలకు పనికొస్తుంది. ఏడాది పాలనలే కాదు, వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భాలలో కూడా పాలకులు గతంలో ఇలాంటి ప్రచార ఆర్భాటాలే చేసారు. అది కాదు విషయం. ప్రభుత్వ పధకాల వల్ల ప్రయోజం పొందేవారికి మళ్ళీ ఇలా ప్రకటనల ద్వారా చెప్పుకోవాల్సిన పనిలేదు. వాళ్లకి ప్రభుత్వ పనితీరే కొలమానం. సాధారణ ప్రజలకు నిత్యం ప్రభుత్వంతో పని పడని పాలన అందించ గలిగిన ప్రభుత్వం ఉత్తమ ప్రభుత్వం అవుతుందని చాణక్యుడు ఏనాడో చెప్పాడు.
గత ఏడాది పాలనలో జగన్ మోహన రెడ్డి తలెత్తుకుని చెప్పుకోగల పనులు  కొన్ని చేసారు. తల బొప్పికట్టే పనులు కూడా చేసారు. ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను న్యాయస్థానాలు తప్పుపట్టాయి. రాజకీయ నాయకుల  నిర్ణయాలు రాజకీయ కోణంలో వుంటాయి. కోర్టు తీర్పులు న్యాయశాస్త్ర పరిధికి లోబడి వుంటాయి. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కాబట్టి రాజకీయులు తమ చర్యలు ధర్మ బద్ధం అనుకుంటారు. కానీ ఒక్కోసారి అవి చట్టబద్ధం కాకపోవచ్చు. ఇలాంటి తేడాలే వ్యవస్థల నడుమ ఘర్షణలకు దారితీస్తాయి.  ఇది ఒక్క జగన్ ప్రభుత్వానికి మాత్రమే పరిమితంకాదు. ఇందిరాగాంధీ, మోడీ, కేసీఆర్ వంటి వారికి సైతం ఈ తలనొప్పులు తప్పలేదు. అయితే ఒకేరోజు అనేక వ్యతిరేక తీర్పులు కోర్టులు వెలువరించిన రికార్డు జగన్ మోహన రెడ్డి ఖాతాలో చేరడం వల్లనే  ఈ అంశానికి ఇంతటి ప్రాధాన్యం. 
ఇక గత ఏడాదిగా జగన్ మోహన రెడ్డి ప్రభుత్వ సాఫల్య, వైఫల్యాల జాబితా వేస్తే అది ఇలా వుంటుంది.
విజయాలు: తాను ప్రజలకు వాగ్దానం చేసిన నవరత్నాల అమలుపై పూర్తి దృష్టి పెట్టడం. ఇంతవరకు ఏ రాష్ట్ర చరిత్రలో ఎరుగని గ్రామ సచివాలయ వ్యవస్థను అమల్లోకి తీసుకురావడం. విద్య, వైద్య రంగాల్లో నాడు నేడు పధకం ద్వారా గుణాత్మకమైన మార్పులు తీసుకురావడం, పెన్షన్లను ఖచ్చితంగా ప్రతినెలా నిర్దిష్టమైన తేదీన బట్వాడా చేయడం, గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో మొహల్లా క్లినిక్ ల పద్దతిలో క్లినిక్కులు ఏర్పాటు చేయడం, స్కూలు పిల్లలకు మధ్యాన్న భోజన పధకంలో నాణ్యతకు ప్రాధాన్యత లభించేలా చూడడం, ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన బాధితులకు కనీ వినీ ఎరుగని ఉదార పరిహారాన్ని ప్రకటించి అందచేయడం, సమీక్షల పేరుతొ పొద్దుపోయేవరకు అధికారుల సహనానినికి పరీక్షలు పెట్టకపోవడం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పేదల ఇళ్ళ స్థలాలకోసం భూసేకరణ విషయంలో వచ్చిన కొన్ని ఆరోపణలు మినహాయిస్తే పెద్ద పెద్ద కుంభకోణాలు వెలుగు చూడకపోవడం   మొదలైనవి వున్నాయి.
మైనస్ పాయింట్ల జాబితా కూడా చిన్నదేమీ కాదు.
పార్టీ మార్పిళ్ళకు సంబంధించి తొలి రోజుల్లో చేసిన గంభీరమైన ప్రకటనకు కట్టుబడి వ్యవహరించడం లేదేమో అన్న అనుమానాలు కలగడం, అల్లాగే అసెంబ్లీ నిర్వహణలో గత అనుభవాలు పునరావృతం కావని సభాముఖంగా ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండకపోవడం,  గడప దాటిన ముగ్గురు ప్రతిపక్ష ఎమ్మెల్యేల విషయంలో జగన్ మోహనరెడ్డి అనుసరించిన వైఖరి సాంకేతికంగా తప్పుపట్టలేనిది కావచ్చేమోకానీ నైతికంగా సమర్ధించుకోలేని పరిస్తితి తలెత్తడం, అధికారులకు సముచిత స్థానాలు కల్పించడంలో ఒక సామాజికవర్గానికి మాత్రమే పెద్ద పీట వేస్తున్నారనే విమర్శలకు సరయిన రీతిలో సమాధానం చెప్పలేని స్తితిలో వుండడం,  రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటి ఆసక్తిని అధికారంలోకి వచ్చిన తర్వాత కనబరచకపోవడం, ఇలా అనేకం. ముందే చెప్పినట్టు ఈ జాబితా కూడా పెద్దదే.
జగన్ మోహన రెడ్డికి  గతంలో అధికార పీఠానికి దగ్గరగా మెసలగలిగిన అనుభవం వుంది. కానీ అధికార పీఠం అధిష్టించిన సందర్భం కానీ అవకాశం కానీ లోగడ లేదు. అంచేత కొన్ని పొరబాట్లు దొర్లడం సహజం. కాబట్టి, కాసేపు ఆగి, నిలబడి, వెనక్కి తిరిగి చూసి, విషయాలను సాకల్యంగా పునః సమీక్ష చేసుకుని  మళ్ళీ ముందుకు సాగడానికి ఇది చక్కటి అవకాశం. పొరబాట్లు తప్పులుగా, తప్పులు తిరిగి సరిదిద్దుకోలేని  ఘోర తప్పిదాలుగా మారకముందే జాగ్రత్త పడడానికి కూడా ఇదొక మహత్తర అవకాశం.    
జగన్ మోహన రెడ్డి 2014లో ఓటమి అంటే ఏమిటో రుచి చూసారు. అదే జగన్ మోహన రెడ్డి 2019లో ఒక అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. పరాజయం నుంచి నేర్చుకున్న గుణపాఠాలతో విజయాన్ని సాధించారు. విజయం నేర్పే పాఠాలను కూడా ఒంటబట్టించుకుంటే మరో విజయం సాధ్యం అవుతుంది. రాజకీయ పార్టీ అన్నాక రాజకీయం తప్పదు. కానీ రాజకీయమే సర్వస్వం కాకూడదు.
చివరిగా ఒక మాట.
అనుభవాన్ని మించిన సలహాదారుడు ఈ లోకంలో వుండరు. (EOM)

“చేసేది ఏమిటో..చేసెయ్యి సూటిగా...” – భండారు శ్రీనివాసరావు


(Published in Andhra Prabha  daily on 30-05-2020, Saturday)
“చేసేది ఏమిటో..చేసెయ్యి సూటిగా...”

ఏడాదిగా ఏపీలో జగన్ మోహన రెడ్డి పాలన ఏ తీరుగా సాగుతున్నదో తెలపడానికి ఈ ఒక్క వాక్యం చాలు.
ఐ.ఏ.ఎస్.,ఐ.పి.ఎస్. వంటి పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సంపాదించినవాళ్ళు మీడియా ఇంటర్వ్యూలలో ఒక మాట చెబుతుంటారు.
“లక్ష్యాన్ని సాధించితీరాలి అనే గమ్య నిర్దేశనం చేసుకున్న తర్వాత మేము బాహ్య ప్రపంచాన్ని దాదాపు మరచిపోయాము. సినిమాలు, షికార్లకి స్వస్తి చెప్పాము. రోజువారీ సరదాలు మరచిపోయాము. ఏమైనా సరే, అనుకున్నది  సాధించితీరాలని  దృఢంగా చేసుకున్న నిర్ణయం ముందు ఇవన్నీ అత్యంత స్వల్పవిషయాలనే  నిర్ధారణకు వచ్చాము. అంచేతే మా జీవిత ధ్యేయాన్ని నెరవేర్చుకోగలిగాము”
బహుశా జగన్ మోహన రెడ్డి ఈ కోవకు చెందినవాడయి ఉండవచ్చు. అంచేతే, కేవలం తన కష్టాన్ని నమ్ముకుని తన పార్టీని ఎన్నికల్లో గెలిపించి, ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యాన్ని చేరుకోగలిగారు. ఇదంత సులభమైన వ్యవహారం కాదు. అయినా సరే, మొక్కవోని పట్టుదలతో, తన రెక్కల కష్టంతో దాన్ని సాధించగలిగారు. ముఖ్యమంత్రి అయిన తరవాత కూడా ఆయన తన లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకున్నారు. ఒక పద్దతి ప్రకారం ప్రాధాన్యతలను నిర్ణయించుకున్నారు. వాటికి అనుగుణమైన మార్గాన్ని ఎంచుకుని ముందుకు సాగుతున్నారు. ఈ ప్రయాణంలో ఇతరేతర విషయాలను వేటినీ  ఆయన చెవికి ఎక్కించుకోవడం లేదు.
ఈ నేపధ్యంలో, అఖండ విజయం ఆయనను అహంకారిగా, ఎవరి మాటను ఖాతరు చేయని మనిషిగా మార్చివేసిందని ఆరోపించేవారు కూడా వున్నారు.    
నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, చెల్లుబాటయిన మొత్తం ఓట్లలో అప్పటికి అయిదేళ్లుగా పాలిస్తున్న టీడీపీకి, కొత్తగా ఎన్నికల బరిలోకి దిగి పోటీ చేసిన జనసేనకు, కాంగ్రెస్, బీజేపీ లకు కలిపి వచ్చిన ఓట్ల కంటే వైసీపీకి ఆరులక్షల ఓట్లు అధికంగా వచ్చాయి. ఈ గణాంకాలనే  ప్రాతిపదికగా తీసుకుంటే అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా వాటిపై వైసీపీ విజయం సాధించి వుండేది అనేది  ఒక వాదన.
అయితే ఇంతటి బహుళ ప్రజాదరణతో అధికారంలోకి వచ్చిన ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు, ప్రజాస్వామ్య సూత్రాలను పట్టించుకోకుండా  తన చిత్తం వచ్చినట్టు పాలన సాగించవచ్చా అనేది ఆదినుంచి  ప్రతిపక్షాలు లేవదీస్తున్న ప్రశ్న. కరోనా పూర్వరంగం నుంచి తొలుస్తూ వచ్చిన ఈ సందేహాన్ని,  కరోనాను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆ పార్టీలు  ఒకటికి పదిసార్లు ప్రజలకు చెబుతూ మరింత పెద్దది చేస్తూవచ్చాయి. కేవలం సందేహం అయితే పర్వాలేదు, జగన్ పాలనాపరంగా పూర్తిగా వైఫల్యం చెందారు అనేది జనం నమ్మేలా  చేయడానికి వాళ్ళు శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు.
జగన్ మోహన రెడ్డిపై ముందు నుంచీ ఒక అపోహ వుంది, అయన ఎవ్వరి మాట వినని సీతయ్య అని. నిజమే కావచ్చు. కానీ 1956 లో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ నాటినుంచి  పరిపాలించిన ముఖ్యమంత్రులలో ఒకరో ఇద్దరో, దామోదర సంజీవయ్య, టి. అంజయ్య వంటి వారిని మినహాయిస్తే అందరూ ఈ సీతయ్య కోవలోకి వచ్చేవారే. కాకపోతే వారిలో చాలామంది తమలోని ఈ స్వభావం బయట జనాలకు తెలియకుండా జాగ్రత్త పడేవారు. జగన్ మోహన రెడ్డికి ఆ శషభిషలు వున్నట్టులేదు. అందుకే ఆయన మీద ఈ అపోహలు తేలిగ్గా ముసురుకుంటున్నాయి కాబోలు.
అటు రాష్ట్ర పరిపాలకుడుగా, ఇటు రాజకీయ పార్టీ అధినేతగా జగన్ మోహన రెడ్డి తన రెండు చేతుల్లోను రెండు పగ్గాలు ధరించి పాలనారధాన్ని ముందుకు నడుపుతున్నారనేది కూడా సుస్పష్టం. పాలనాపరంగా, రాజకీయంగా తొలిరోజుల్లోనే  ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రకటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఒకపక్క సెహభాష్ అనిపించుకునే ప్రకటనలు. మరో పక్క తొందర పడుతున్నారేమో అనిపించే రాజకీయ నిర్ణయాలు.
ఉద్దేశ్యం మంచిదే. పెట్టుకున్న లక్ష్యం గొప్పదే. కానీ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఆచరణలో దోవతప్పి మరో బాట పట్టడం కొత్త విషయం ఏమీ కాదు. ఎంత మంచి పధకం అయినా ప్రజల మద్దతు లేనిదే విజయవంతం కానేరదు. కొన్ని కొన్ని విషయాల్లో పాలకులు తమ పట్టుదలలకు కొంత వివేచన జత చేస్తే బాగుంటుందేమో ఏలికలు ఆలోచించాలని విజ్ఞులు పదేపదే సూచనలు చేసేది ఇందుకే.    
కిందటేడాది ఏప్రిల్ 11 వ తేదీన అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు ఆయన పాలిట అగ్ని పరీక్ష వంటివి. సరిగ్గా నలభయ్ రెండు రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, మే 23న ఫలితాలు వెలువడ్డాయి.  నిజానికి ఆ ఎన్నికల్లో గట్టెక్కడం అనేది ఆయన రాజకీయ భవిష్యత్తుకు  ఎంతో కీలకం. ఎందుకంటే ఆయనది ఒక ప్రాంతీయ పార్టీ. వరసగా రెండు ఎన్నికల్లో పరాజయం పాలయితే మూడోసారి ప్రజా పరీక్షకు సిద్ధం కావడం అనేది ఒక ప్రాంతీయ పార్టీకి, అందులో ఏనాడు అధికార పీఠం ఎక్కని రాజకీయ  పార్టీకి  అసాధ్యం అని అంటారు.  అయితే, జగన్ మోహనరెడ్డి ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మొత్తం 175 స్థానాల్లో  151 సీట్లలో తన అభ్యర్ధులను గెలిపించుకుని కొత్త రాష్ట్ర చరిత్రలో నూతన  అధ్యాయం లిఖించారు. ఈ విజయాల్లో అధికభాగం ఆయన తన సొంత రెక్కల కష్టంతో సాధించుకున్నవే.
గత ఏడాది కాలంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలన్నీ అనాలోచితమైనవి, తొందరపాటుతో కూడినవి కాకపోయినా చాలావరకు వివాదాస్పదంగా మారుతున్నాయి. అదే సమయంలో కొన్ని నిర్ణయాలు మొదట్లో దుందుడుకుతనంగా అనిపించినా తర్వాత తర్వాత వాటిల్లో సహేతుకత లేకపోలేదని జనమే ఒప్పుకునేలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు కరోనాతో సహజీవనం చేయక తప్పదని జగన్ చేసిన వ్యాఖ్య పెద్ద దుమారాన్నే లేపింది. అందరూ ఆక్షేపించేలా చేసింది. చివరికి పాలకులు అందరూ అదేమాట చెప్పాల్సిన పరిస్తితి ఏర్పడింది. కానీ ఈలోపలే ఆ ప్రకటనను జగన్ అనుభవరాహిత్యానికి గీటురాయిగా ముద్ర వేయడం జరిగిపోయింది.    
ఈ కరోనాకు తోడు పులిమీది పుట్రలా విరుచుకుపడిన వైజాగ్ విష వాయువు దుర్ఘటన దరిమిలా ప్రతిపక్షాల వాదన సరయినదేమో అనే శంక సమాజంలోని  కొన్ని వర్గాలవారికి కలిగేలా ఈ ప్రయత్నాలు తారాస్థాయికి చేరాయి.
తనపై దుష్ప్రచారం ఎంత పెద్ద ఎత్తున సాగితే అంత మంచిదని జగన్ మోహన రెడ్డి భావిస్తున్నారేమో తెలవదు. దీన్ని బలంగా తిప్పికొట్టే ప్రయత్నాలు ఏవీ ఆయన వైపు నుంచి కానరావడం లేదు. బహుశా గతంలో ఇలాగే అన్ని  రాజకీయ పక్షాలు ఏకమై తనను ఒంటరివాడిని చేసినప్పుడు ప్రజలకు తనపట్ల సానుభూతి వెల్లువెత్తిన సంగతిని దృష్టిలో పెట్టుకుని ఇలా ప్రతిస్పందించకుండా మిన్నకుంటున్నారేమో తెలవదు. ముందే చెప్పుకున్నట్టు ఆయన ఎవరి అంచనాలకు అందని లోతైన మనిషి.
చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఒక అభిమాన నాయకుని పట్ల అయన  అభిమానులు పెంచుకున్న అభిమానం ఎల్లవేళలా ఒకేలా వుండదు. అంతగా అభిమానించిన ఎన్టీఆర్ వంటి మహానాయకుడినే ఒక నియోజకవర్గం, కల్వకుర్తిలో ఓడించారు. పూచిక పుల్లను నిలబెట్టి గెలిపించుకునే సత్తా తనకుందని అహంకారపూరిత ప్రకటనలు చేయడం, ఓ చిన్న కారణం చూపెట్టి తన మంత్రివర్గంలోని మంత్రులను అందరినీ ఒక్క కలంపోటుతో  తొలగించడం వంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను ప్రజలు హరాయించుకోలేక పోయారు. 
కాకపొతే, గతంతో పోలిస్తే కొట్టవచ్చినట్టు కనబడుతున్న తేడా ఒకటుంది. అది ప్రచార ఆర్భాటం భారీగా తగ్గిపోయిన మాట నిజం. అలాగే, అధికారుల సమీక్షా సమావేశాల్లో కొత్త ముఖ్యమంత్రి మార్కు మార్పు స్పుటంగా కానవస్తోంది. ప్రత్యేకంగా విలేకరుల సమావేశాలు అంటూ నిర్వహించకుండా వారికి అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వమే విడుదల చేసే పద్దతిని కూడా ప్రవేశపెట్టినట్టు ఈ ఏడాది పాలన తీరుతెన్నులు చూసేవారికి అర్ధం అవుతోంది. కరోనా కట్టడి కాలంలో అది కొద్దిగా రూపు మార్చుకుంది. ముఖ్యమంత్రి నేరుగా విలేకరులతో మాట్లాడకుండా ముందుగా రికార్డు చేసుకున్న వీడియోని మీడియాకు విడుదల చేస్తున్నారు.

ఏడాది కాలం కళ్ళముందే కాలగర్భంలో కలిసిపోయింది. కానీ రెండు కొత్త తెలుగు  రాష్ట్రాల నడుమ పరిష్కారం కావాల్సిన అనేక సమస్యలు వున్నాయి. ప్రతియేటా సముద్రంలో వృధాగా కలుస్తున్న గోదావరి నదీ జలాల సమగ్ర వినియోగం, నానాటికీ తగ్గిపోతున్న కృష్ణానదీ జలాల గరిష్ట వాడకం. వీటిని సుసాధ్యం చేసుకోగలిగితే ఆంధ్రప్రదేశ్. తెలంగాణా రాష్ట్రాలకు సేద్యపు నీటి సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది. చినుకు పడితేనే బతుకు అనే రైతాంగం దుస్తితికి తెర పడుతుంది. ఈ రెండు నదుల అనుసంధానానికి ఉన్న అవకాశాలను పరిశీలించి ఆచరణలోకి తేగలిగితే రెండు తెలుగు రాష్ట్రాల ఆర్ధిక స్తితిగతులు ఊహించలేనంతగా మారిపోతాయి. కానీ కొత్త రాష్ట్రాలు ఏర్పడి దాదాపు ఆరేళ్ళు దగ్గరపడుతున్నప్పటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనేమాదిరిగా కొన్ని ఇంకా అపరిష్కృతంగానే వున్నాయి. పోతిరెడ్డిపాడు వంటి అంశాలు ఇటీవల చిలికి చిలికి గాలివానగా మారడం గమనిస్తున్న వారికి ఈ ఇరువురు నాయకుల మధ్య సయోధ్య మూడునాళ్ళ ముచ్చట అవుతుందేమో అనే సందేహం కలిగితే ఆశ్చర్యపడాల్సింది లేదు. ముఖ్యమంత్రుల స్థాయిలో చొరవ చూపిస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరకడం అసాధ్యమేమీ కాదు.   
చేసినవి ఎన్నో కనిపిస్తున్నా, చేయాల్సినవి ఇంకా చాలా మిగిలే వున్నాయి. ‘ఏడాదేగా గడిచింది ఇంకా నాలుగేళ్ల వ్యవధానం వుందిగా’ అనుకోవడానికి, ‘అయ్యో అప్పుడే ఏడాది పుణ్యకాలం గడిచిపోయింది, మిగిలింది కేవలం నాలుగేళ్లే’  అనుకోవడానికి చాలా తేడా వుంది. ఇది ముఖ్యమంత్రి గమనంలో వుంచుకోవాలి.
ఈ రెంటిలో జగన్ మోహన రెడ్డి దేనికి మొగ్గు చూపుతారు అనేదానిపై ఆయన పార్టీ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు రెండూ ఆధారపడివున్నాయి. (EOM)  

సంబరాల వేళ సమీక్షాసమయం


వై.ఎస్.జగన్మోహనరెడ్డి ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసి రేపటితో అంటే మే ముప్పయ్యో తేదీకి ఏడాది కాలం పూర్తవుతుంది. రాజకీయ పార్టీలకి ఇలాంటి సందర్భాలు సంబరాలు చేసుకునే సమయాలు. కరోనా కట్టడుల కారణంగా అట్టహాసంగా ఉత్సవాలు చేసుకునే వీలు  ఎలాగు లేదు. పైగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తొలగింపు, కొత్త కమిషనర్ నియామకాల విషయంలో జగన్ ప్రభుత్వం లోగడ ఇచ్చిన జీవోలను కొట్టేస్తూ  హైకోర్టు ఆదేశాలు కూడా ఏడాది ఉత్సవాలకు ఒక్క రోజు ముందే వెలువడడం అనేది ఆశానిపాతమే. మానసికంగా కలచి వేసే అంశమే. గత కొద్ది రోజులుగా న్యాయస్థానాల నుంచి జగన్ ప్రభుత్వం తీర్పుల రూపంలో ప్రతికూల పరిస్తితులను ఎదుర్కుంటున్న మాట నిజమే. కానీ తాజా తీర్పు ప్రభుత్వాన్ని పూర్తి ఆత్మరక్షణలో పడవేసేదిగావుంది. వైసీపీ ఏడాది  సంబరాల మాటేమో కానీ ఈ తాజా తీర్పు ప్రతిపక్షాలకు సంబరాలు చేసుకునే అవకాశం కల్పించింది.
హైకోర్టు పైన సుప్రీం కోర్టు ఉండవచ్చు. అప్పీలు చేసుకునే అవకాశం న్యాయమూర్తులు ఇచ్చారో లేదో తీర్పు పూర్తి పాఠం వెలువడితేకాని తెలియదు. ఆ ప్రక్రియ మరికొంత సమయం తీసుకోవడానికి (Purchasing Time) పనికిరావచ్చు. అయితే, సర్వోన్నత న్యాయస్థానం తీర్పు కూడా అనుకూలంగా వస్తుందనే పూచీలేదు.
ఎలాగూ, ఏడాది పాలన ముగియవచ్చే ముందు అన్ని శాఖలతో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సమీక్షలు నిర్వహిస్తూనే వున్నారు. అందులో కొంత సమయాన్ని ఈ కోర్టు తీర్పులకు కేటాయించి, భేషజాలకు పోకుండా ఆత్మవిమర్శ చేసుకోవాలి.
తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి. ప్రభుత్వంలోనా, ప్రభుత్వ నిర్ణయాలను సరయిన విధంగానే వున్నాయి అని ముఖ్యమంత్రికి తెలియబరచే బాధ్యత వున్న అధికారుల స్థాయిలోనా, లేక వాటిని ప్రతిభావంతంగా సమర్ధించి రాజ్యంగబద్ధంగానే వున్నాయని న్యాయమూర్తులను ఒప్పించడంలో ప్రతిభ చూపాల్సిన ప్రభుత్వ న్యాయవాదుల స్థాయిలోనా.
ముందు నిర్మొహమాటంగా ఈ విషయాలను కూలంకషంగా చర్చించుకోవాలి. ప్రభుత్వంలోనే పొరబాట్లు జరుగుతున్నాయి అనుకుంటే, టీటీడీ ఆస్తుల అమ్మకాల విషయంలో వెనక్కి తగ్గినట్టుగా, కోర్టు కాదన్న నిర్ణయాలను హుందాగా మార్చుకోవాలి. అధికారులది బాధ్యత అనుకుంటే వారిని తప్పించాలి. ప్రభుత్వ న్యాయవాదులే కారణం అనుకుంటే వారి స్థానంలో సమర్ధులను ఎంపిక చేసుకోవాలి.
ఇక ఈ విషయాల్లో చేసే ఎలాంటి కాలయాపన అయినా  ప్రభుత్వానికి మునుముందు ఓ గుదిబండలా తయారవుతుంది.
లేదా రాజకీయ ప్రత్యామ్నాయం ఎంచుకుని కొత్తగా ప్రజా తీర్పుకు వెళ్ళాలి. కానీ మధ్యంతర ఎన్నికల నిర్ణయం అనేది  ఒక్క రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదు.  వెనుక ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా శాసనసభను రద్దు చేసి తాజాగా ప్రజల  తీర్పును కోరినప్పుడు ఆయన అభిలాషకు అనుగుణంగా ఎన్నికలు జరిగాయి. అది ఆయనకు కలిసివచ్చింది. ఇప్పుడలాంటి పరిస్తితులు లేవు.
ఇప్పటి రాజకీయ వాతావరణంలో అలాంటి నిర్ణయాలు ఆత్మహత్యాసదృశమైనవి కూడా కావచ్చు.

28, మే 2020, గురువారం

Senior NTR Jayanthi Special || Sr.Journalist Bhandaru Srinivasa Rao On S...

మహానాడు – ఓ జ్ఞాపకం – భండారు శ్రీనివాసరావు


చంద్రబాబునాయుడు అవిభక్త  ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రిగా వున్నప్పుడు  ఓసారి తెలుగుదేశం మహానాడు కాకినాడలో జరిగింది. హైదరాబాదు నుంచి విలేకరులను తీసుకువెళ్ళారు. ప్రారంభానికి ముందు రోజు అక్కడికి చేరుకున్నాం. ప్రైవేటు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు ప్రయోగాత్మక దశలో వున్నాయి. టీవీ  9 వారికి ఓ  ఆలోచన కలిగింది. ప్రారంభోత్సవానికి ముందు ఎవరయినా జర్నలిస్టుతో మాట్లాడించాలని అనుకున్నారు. పొద్దున్నే(మహానాడు జరిగే ప్రదేశం దగ్గరికి) పోదాం రెడీగా ఉండమని చెప్పారు. బ్రేక్ ఫాస్ట్ చేయకుండానే వెళ్లాం. మహానాడు వెన్యూ దగ్గర తిరుగుతూ నేనూ రజనీకాంత్ మాట్లాడుకుంటున్నాం. ఆయన ఏవో అడుగుతున్నారు. నేను ఏదో చెబుతున్నాను.
‘ప్రతి రాజకీయ పార్టీ తమ కేడర్ ను ఉత్సాహ పరచడం కోసం ఇలాంటి తంతులు నిర్వహిస్తుంటారు. ఏదో మొక్కుబడి తీర్మానాలు ప్రవేశపెడతారు. ఏదో చర్చ జరిగిందని అనిపిస్తారు. తర్వాత ఆ తీర్మానాలు ఏమయ్యాయో ఎవరూ పట్టించుకోరు. కాకపోతే నాయకులకి గ్రౌండ్ లెవెల్ రియాలిటీలు తెలుసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. గ్రామ స్థాయి కార్యకర్తల్ని పిలిచి మాట్లాడితే, హైదరాబాదులో కూర్చుని తెలుసుకోలేని విషయాలు  వాళ్లకు తెలుస్తాయి. కానీ అంత తీరిక వాళ్ళకి వుండదు. అందుకే ఇదంతా ఒక తంతు అనేది. టీడీపీ అనే కాదు ఏ పార్టీ సమావేశాలు  అయినా ఇదే తంతు”
ఏదో ఇలా చెప్పుకుపోతున్నాను. కాసేపు అలా తిరిగి మళ్ళీ హోటల్ కు వచ్చాము. బ్రేక్ ఫాస్ట్ టేబుల్ దగ్గర మంత్రి యనమల రామకృష్ణుడు కనిపించారు. ఆయన మోహంలో ఎప్పుడూ కనిపించే ప్రసన్నత కానరాలేదు. ప్లేటు చేతికి ఇస్తూ అన్నారు నా మొహం లోకి చూస్తూ.
“అంతే లెండి! ఇంతింత శ్రమ పడి చేసినదంతా మీకు ఓ తంతులాగా కనిపిస్తోంది అన్నమాట”
ముందు నాకు అర్ధం కాలేదు ఆయన అలా ఎందుకు అంటున్నారో.
తర్వాత తెలిసింది, అంతకు ముందు నేను మాట్లాడినదంతా ఆ టీవీలో లైవ్ లో చూపించారట!         

27, మే 2020, బుధవారం

దిండు కింద మూట – భండారు శ్రీనివాసరావు


చాలా చిన్నతనం. బామ్మ దిండు కింద ఓ రోజు చిన్న మూట కనబడింది. అందులో ఏముంది?
తెలుసుకోవాలని ఆత్రుత.
ఒకరోజు ఆమెనే  అడిగేశాను ‘ఈ ముల్లెలో ఏముంది బామ్మా’ అని.
‘దానిమీదపడ్డాయి ఏమిట్రానీ కళ్ళు. అందులో ఏముందిరా అప్పుడప్పుడూ పోగేసుకున్న నాలుగు రాళ్ళుతప్ప’
‘రాళ్ళా! రాళ్ళను దిండు కింద ఎందుకు  పెట్టుకున్నట్టు’
నా మనసులో మాట కనుక్కున్నట్టు౦ది.
‘రాళ్లంటే గులక రాళ్ళు కాదురా సన్యాసీ. డబ్బులు’
‘డబ్బులా నీకెందుకు? సినిమాకు పోతావా షికార్లు పోతావా. చాక్లెట్లు బిస్కెట్లు నీకక్కరలేదు కదా!’
‘ఇవి  వాటికి కాదు లేరా! కాటికి పోవడానికి’
‘కాటికా! అంటే ఏదైనా గుడా”
‘గుడిలాంటిదే. చివరికి ఎవరైనా ఆ గుడికి వెళ్ళాల్సిందే’
‘గుడికి ఇన్ని డబ్బులెందుకే’
‘నీకెలాచెబితే అర్ధం అవుతుందిరా ఈ వయసులో. కాటికి పోవడం అంటే చనిపోయిన తర్వాత తీసుకువెళ్ళే చోటు. బతికుండగా మనం ఎవరినైనా అడిగితే డబ్బులు ఇస్తారు, వాళ్ళ దగ్గర వుంటే. అదే ఇంట్లో ఎవరైనా  చనిపోయిన తర్వాత అడిగితే, వాళ్ళ దగ్గర  వున్నా ఇవ్వరు.  దహన సంస్కారాలకు ఎవ్వరూ డబ్బు సర్దరు. అలా చేస్తే కీడు అని నమ్మకం. అందుకని ముందుగానే  ఈ ముల్లెలో ఆ డబ్బులు దాచుకున్నాను’
బామ్మ మాటలు అప్పుడు అర్ధం కాలేదు.
ఇప్పుడు అర్ధం అయింది. కానీ బామ్మ ఆరోజుల్లో  ముల్లెలో దాచుకున్న డబ్బులు ఈరోజుల్లో ఆ కార్యక్రమాలకు ఏ మూలకూ సరిపోవు అని కూడా అర్ధం అయింది.
ఇప్పుడు పుట్టినా, గిట్టినా అన్నీ లక్షల్లోనే.

24, మే 2020, ఆదివారం

స్థిర చిత్తంతో కూడిన జగన్ ఏడాది పాలన – భండారు శ్రీనివాసరావు




(Published in the edit page of SAKSHI daily dated 24-05-2020, SUNDAY) 


2014 లో జగన్ మోహన రెడ్డి అధికారానికి అడుగు దూరంలో ఆగితే, 2019 లో చంద్రబాబు నాయుడు అధికార పీఠానికి ఆమడ దూరంలో ఆగిపోవడం ప్రజాస్వామ్యంలో ఉన్న చమత్కారం అనిపిస్తుంది.
నూతన ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన రెడ్డి పదవిని స్వీకరించి మే 30 వ తేదీకి  సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. అయిదేళ్ళు పరిపాలించడం కోసం ప్రజాతీర్పు పొందిన వ్యక్తి పనితీరును ఏడాదికి కుదించి పోల్చిచూసి సమీక్షించడం సబబు అనిపించుకోదు. అయినా ఆయన ఏ దిశగా సాగుతున్నారు, ఏ మార్గంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అనేది స్థాలీపులాక న్యాయంగా పరిశీలించుకోవడానికి ఈ సంవత్సర కాలం అక్కరకు వస్తుంది.
తమది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అనిపించుకునే నిర్ణయాలను ఎన్నింటినో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి జగన్ మోహన్ రెడ్డి ప్రకటిస్తూ వచ్చారు. పదవిని చేపట్టిన కొద్ది గంటల్లోనే డీజీపీతో సహా ఉన్నతాధికారుల బదిలీ ప్రక్రియ చేపట్టారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు నవరత్నాల పేరుతొ ఇచ్చిన హామీలను అమలుచేసేందుకు సమర్దులయిన అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ముందే రాసిపెట్టుకున్న స్క్రిప్ట్ మాదిరిగా,  జరిగేవన్నీ ఒక పద్దతి ప్రకారం చకచకా సాగిపోతూవుండడం జగన్ పాలనలోని ఓ ప్రత్యేకత. అసెంబ్లీ సమావేశం, మంత్రివర్గ నిర్మాణం, శాఖల పంపిణీ, స్పీకర్ ఎన్నిక, పదమూడు జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు, గ్రామ సచివాలయాల ఏర్పాటు, గత ప్రభుత్వం ఎన్నికలకు కొద్ది ముందు అమలు చేసిన అన్నదాతా సుఖీభవ పధకం రద్దు, దాని స్థానంలో రైతు భరోసా పధకం, పారిశుధ్య పనివారు, అంగన్ వాడీ మహిళల వేతనాల పెంపు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అనే వివక్ష లేకుండా ఇంటర్ విద్యార్ధులకు కూడా అమ్మవొడి పధకం వర్తింపు, పొరుగురాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ తో సత్సంబంధాలు పెంపొందించుకునే ప్రయత్నాలు, ఢిల్లీ యాత్రలు, ప్రధాని నరేంద్ర మోడీ ఇతర కేంద్ర మంత్రులతో భేటీలు ఇలా అలుపూసొలుపు లేని పనులతో, ప్రతి రోజూ ఏదో ఒక కొత్త నిర్ణయం ప్రకటిస్తూ మొదటి నెల ఇట్టే గడిచిపోయింది. గతంతో పోలిస్తే కొట్టవచ్చినట్టు కనబడుతున్న తేడా ఒకటుంది. అది ప్రచార ఆర్భాటంలో తగ్గుదల. అధికారుల సమీక్షా సమావేశాల్లో కొత్త ముఖ్యమంత్రి మార్కు మార్పు స్పుటంగా కానవస్తోంది. ప్రత్యేకంగా విలేకరుల సమావేశాలు అంటూ నిర్వహించకుండా వారికి అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వమే విడుదల చేసే పద్దతిని కూడా ప్రవేశపెట్టినట్టు ఈ ఏడాది పాలన తీరుతెన్నులు చూసేవారికి అర్ధం అవుతోంది. కరోనా కట్టడి కాలంలో అది కొద్దిగా రూపు మార్చుకుంది. ముఖ్యమంత్రి నేరుగా విలేకరులతో మాట్లాడకుండా ముందుగా రికార్డు చేసుకున్న వీడియోని మీడియాకు విడుదల చేస్తున్నారు.
పార్టీ మార్పిళ్ల విషయంలో అసెంబ్లీ సాక్షిగా జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ప్రజాస్వామ్య ప్రియులను ఎంతగానో అలరించింది. తమ పార్టీలోకి వేరేవారు ఎవరు రావాలన్నా ముందు పదవులకు రాజీనామా చేయాలని పునరుద్ఘాటించారు. అలా గీత దాటే వారిని ఏమాత్రం ఉపేక్షించకుండా వారిపై అనర్హత వేటువేయాలని కొత్తగా స్పీకర్ గా ఎన్నికయిన తమ్మినేని సీతారాంకు సభానాయకుడి స్థానం నుంచి ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి సూచించడం ముదావహం. ప్రజాస్వామ్యానికి చెదపురుగుల్లా తయారయిన పార్టీ మార్పిళ్ళకు, ఈ సాహసోపేత నిర్ణయం అడ్డుకట్ట వేయగలిగితే అంతకంటే సంతోషించాల్సింది లేదు. చట్టంలోని లొసుగులను నిస్సిగ్గుగా వాడుకుంటూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ వచ్చిన  పార్టీలు కూడా జగన్ సూచించిన ఈ విధానాన్ని పాటిస్తే, చట్ట సవరణ అవసరం లేకుండానే ఈ అనైతిక చర్యలను చాలావరకు అరికట్టవచ్చు. అయితే,  తదనంతర కాలంలో ఒకరిద్దరు  ప్రతిపక్ష ఎమ్మెల్యేల విషయంలో ఈ నియమం ఒకింత పట్టు  సడలిందేమో అన్న సందేహం కలిగేలా జగన్ ప్రభుత్వ వైఖరి వుండడం ప్రజాస్వామ్య అభిమానులకు రవంత బాధ కలిగించిన మాట కూడా నిజం. అది అక్కడితో ఆగడం కొంతలో కొంత ఉపశమనం.  
అటు రాష్ట్ర పరిపాలకుడుగా, ఇటు రాజకీయ పార్టీ అధినేతగా జగన్ మోహన రెడ్డి తన రెండు చేతుల్లోను రెండు పగ్గాలు ధరించి పాలనారధాన్ని ముందుకు నడుపుతున్నారనేది కూడా సుస్పష్టం. పాలనాపరంగా, రాజకీయంగా తొలిరోజుల్లోనే  ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రకటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఒకపక్క సెహభాష్ అనిపించుకునే ప్రకటనలు. మరో పక్క తొందర పడుతున్నారేమో అనిపించే రాజకీయ నిర్ణయాలు.
విచ్చలవిడిగా పెరిగిపోతున్న అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలనే గట్టి నిర్ణయానికి ఆయన వచ్చినట్టు తోస్తోంది. ఈ విషయంలో శషభిషలకు తావు లేకుండా ఏకంగా జిల్లా కలెక్టర్ల సమావేశంలోనే జగన్ మోహన రెడ్డి కుండబద్దలు కొట్టారు. సమావేశం జరుగుతున్న ప్రజావేదిక కట్టడమే ఒక అక్రమ నిర్మాణమని చెబుతూ, వీటి తొలగింపు అనేది ప్రజావేదికను నేలమట్టం చేయడంతోనే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆ వేదిక సాక్షిగానే ఆదేశించారు. సదస్సు అలా ముగిసిందో లేదో అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి ఆదేశాలను తుచ తప్పకుండా అమలు చేసింది. కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ప్రజావేదిక కట్టడం కూల్చివేత కార్యక్రమాన్ని రాత్రికి రాత్రే పూర్తిచేసింది. ఈ చర్య సహజంగానే రాజకీయ వర్గాల్లోనే కాక సాధారణ ప్రజల్లో కూడా సంచలనాన్ని కలిగించింది. అక్రమ నిర్మాణాలు చేసిన వారి గుండెల్లో అలజడి రేపింది. కొందరు దీనికి రాజకీయ ఉద్దేశ్యాలు ఆపాదిస్తే, మరికొందరు తొందరపాటు, దుందుడుకు  చర్యగా పరిగణించారు. ఆయన అనుకున్నట్టుగానే కృష్ణానది కరకట్ట మీద నిబంధనలకు విరుద్ధంగా అనేకమంది శ్రీమంతులు నిర్మించుకున్న భవంతులను కూల్చివేసే ప్రయత్నంలో భాగంగా అధికారులు అనేకమందికి నోటీసులు కూడా ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నివసిస్తున్న గెస్ట్ హౌస్ కూడా వీటిలో ఒకటి కావడం రాజకీయ కలకలానికి కేంద్ర బిందువుగా మారింది. అవతల ప్రభుత్వం నిబంధనలకు లోబడి చర్యలు తీసుకుంటూ ఉన్నందున పరిపాలనాదక్షుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశాన్ని మరింత వివాదం చేయకుండా విజ్ఞతతో వ్యవహరిస్తే బాగుండేది. ఇదే దృఢ సంకల్పంతో ముందుకు సాగి అక్రమ నిర్మాణాలకు ముకుతాడు వేయగలిగివుంటే  ప్రజల మద్దతు ప్రభుత్వానికి పుష్కలంగా లభించి వుండేది. కానీ దురదృష్టం, ఈ ఏడాది కాలంలో ఈ రెండూ జరగలేదు.
ఉద్దేశ్యం మంచిదే. పెట్టుకున్న లక్ష్యం గొప్పదే. కానీ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఆచరణలో దోవతప్పి మరో బాట పట్టడం కొత్త విషయం ఏమీ కాదు. ఎంత మంచి పధకం అయినా ప్రజల మద్దతు లేనిదే విజయవంతం కానేరదు. కొన్ని కొన్ని విషయాల్లో పాలకులు తమ పట్టుదలలకు కొంత వివేచన జత చేస్తే బాగుంటుందేమో ఏలికలు ఆలోచించాలని విజ్ఞులు పదేపదే సూచనలు చేసేది ఇందుకే.
వై.ఎస్. జగన్ మోహన రెడ్డి పాలన కొన్ని శుభశకునాలతో మొదలయింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీతోనూ, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తోనూ చక్కటి స్నేహపూర్వక సంబంధాలు గత ఏడాది కాలంలో పెరుగుతూ రావడం ఆహ్వానించదగిన పరిణామం. ఢిల్లీలో ప్రధానమంత్రిని తొలిసారి కలిసి వచ్చిన తర్వాత మోడీ చేసిన ట్వీట్ ఇందుకు చక్కని ఉదాహరణ. జగన్ మోహన రెడ్డితో తన సమావేశం అద్భుతంగా జరిగిందని ప్రధాని వర్ణించడం మోడీ వ్యవహార శైలి తెలిసిన వారికి గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించి వుంటుంది. కొత్తగా ఏర్పడ్డ  రాష్ట్రానికి తనకుతానుగా పరిష్కారం చేసుకోలేని సమస్యలు కొన్ని వుంటాయి. ఇటువంటివాటి విషయంలో కేంద్ర సహకారం అత్యంత ఆవశ్యకం. ఈదిశగా ముఖ్యమంత్రి తొలిఅడుగులు పడడం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మంచిది. అలాగే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో అయన  చంద్రబాబు నాయుడితో వ్యవహరించిన తీరు గుర్తున్న వారికి, ఇప్పుడు వై.ఎస్. జగన్ తో ఆయన వ్యహరిస్తున్న విధానం ఒకింత అచ్చెరువు కొలిపేదిగా వుంది. ఒక విధంగా ఉభయ రాష్ట్రాలకు ఈ మార్పు ప్రయోజనకరం. రెండు కొత్త రాష్ట్రాల నడుమ పరిష్కారం కావాల్సిన అనేక సమస్యలు వున్నాయి. ప్రతియేటా సముద్రంలో వృధాగా కలుస్తున్న గోదావరి నదీ జలాల సమగ్ర వినియోగం, నానాటికీ తగ్గిపోతున్న కృష్ణానదీ జలాల గరిష్ట వాడకం. వీటిని సుసాధ్యం చేసుకోగలిగితే ఆంధ్రప్రదేశ్. తెలంగాణా రాష్ట్రాలకు సేద్యపు నీటి సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది. చినుకు పడితేనే బతుకు అనే రైతాంగం దుస్తితికి తెర పడుతుంది. ఈ రెండు నదుల అనుసంధానానికి ఉన్న అవకాశాలను పరిశీలించి ఆచరణలోకి తేగలిగితే రెండు తెలుగు రాష్ట్రాల ఆర్ధిక స్తితిగతులు ఊహించలేనంతగా మారిపోతాయి. కానీ కొత్త రాష్ట్రాలు ఏర్పడి దాదాపు ఆరేళ్ళు దగ్గరపడుతున్నప్పటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనేమాదిరిగా కొన్ని ఇంకా అపరిష్కృతంగానే వున్నాయి. పోతిరెడ్డిపాడు వంటి అంశాలు ఇటీవల చిలికి చిలికి గాలివానగా మారడం గమనిస్తున్న వారికి ఈ ఇరువురు నాయకుల మధ్య సయోధ్య మూడునాళ్ళ ముచ్చట అవుతుందేమో అనే సందేహం కలిగితే ఆశ్చర్యపడాల్సింది లేదు. ముఖ్యమంత్రుల స్థాయిలో చొరవ చూపిస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరకడం అసాధ్యమేమీ కాదు.   
కిందటేడాది ఏప్రిల్ 11 వ తేదీన జగన్ మోహన రెడ్డి పెద్ద పరీక్ష రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. సరిగ్గా నలభయ్ రెండు రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, మే 23న ఫలితాలు వెలువడ్డాయి.  నిజానికి ఆ పరీక్షలో గట్టెక్కడం అనేది ఆయన రాజకీయ భవిష్యత్తుకు  ఎంతో కీలకం. ఎందుకంటే ఆయనది ఒక ప్రాంతీయ పార్టీ. వరసగా రెండు ఎన్నికల్లో పరాజయం పాలయితే మూడోసారి ప్రజా పరీక్షకు సిద్ధం కావడం అనేది ఒక ప్రాంతీయ పార్టీకి, అందులో ఏనాడు అధికార పీఠం ఎక్కని రాజకీయ  పార్టీకి  అసాధ్యం అని అంటారు.  అయితే, జగన్ మోహన రెడ్డి గత మార్చిలో పెద్ద పరీక్షే రాసి పాసయ్యారు. అదీ అత్తెసరు మార్కులతో కాదు, మొత్తం 175 స్థానాల్లో  151 సీట్లలో తన అభ్యర్ధులను గెలిపించుకుని కొత్త రాష్ట్ర చరిత్రలో నూతన  అధ్యాయం లిఖించారు. ఈ విజయాల్లో అధిక భాగం ఆయన తన సొంత రెక్కల కష్టంతో సాధించుకున్నవే.
ఏడాది తిరుగుతూనే తిరిగి మార్చి నెలలోనే మరో ఊహించని పరీక్ష కరోనా రూపంలో ముఖ్యమంత్రికి ఎదురయింది.
రాష్ట్రం ఆర్ధిక పరిస్తితి అంతంత మాత్రం. ఆదాయపు వనరులు కుంచించుకుపోయేవే కానీ పెరిగే అవకాశాలు అద్యతన భావిలో కానరాని పరిస్తితి. చేసిన వాగ్దానాలు కొండంత. నవరత్నాలు ఏమైనా సరే నెరవేర్చి తీరాల్సిందే అనే పట్టుదల. మరో పక్క పెరుగుతున్న విపక్షాల స్వరం. చేసే ప్రతిపనిలో తప్పులు ఎన్నేవారే కానీ, ఇదిగో ఇదీ పొరబాటు సవరించుకోమని చెప్పేవారే లేరు. నిజానికి అది వారి పని కూడా కాదు. 
వెళ్ళాల్సిన మార్గాన్ని నిర్ణయించుకుని, చేయాల్సిన పనులను నిర్దేశించుకుని, అందుకు అవసరమైన కాలపట్టికను రూపొందించుకుని, ఇదిగో ఈ నెలలో ఇది చేయగలిగాను అని టిక్కు పెట్టుకుని, ఆ పని పూర్తి చేసినట్టు  తను మాటిచ్చిన జనాలకు  చెప్పుకుంటూ పోతున్న తరుణంలో ఈ కరోనా భూతం ఆకస్మికంగా  విరుచుకుపడి అధ్వాన్నంగా మారుతున్న రాష్ట్ర ఆర్ధిక పరిస్తితిని మరింత అస్తవ్యస్తం చేసింది.  
జగన్ మోహన రెడ్డిపై ముందు నుంచీ ఒక అపోహ వుంది, అయన ఎవ్వరి మాట వినని సీతయ్య అని. నిజమే కావచ్చు. కానీ 1956 లో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ నాటినుంచి  పరిపాలించిన ముఖ్యమంత్రులలో ఒకరో ఇద్దరో, దామోదర సంజీవయ్య, టి. అంజయ్య వంటి వారిని మినహాయిస్తే అందరూ ఈ సీతయ్య కోవలోకి వచ్చేవారే. కాకపోతే వారిలో చాలామంది తమలోని ఈ స్వభావం బయట జనాలకు తెలియకుండా జాగ్రత్త పడేవారు. జగన్ మోహన రెడ్డికి ఆ శషభిషలు వున్నట్టులేదు. అందుకే ఆయన మీద ఈ అపోహలు తేలిగ్గా ముసురుకుంటున్నాయి కాబోలు.   
నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, చెల్లుబాటయిన మొత్తం ఓట్లలో అప్పటికి అయిదేళ్లుగా పాలిస్తున్న టీడీపీకి, కొత్తగా ఎన్నికల బరిలోకి దిగి పోటీ చేసిన జనసేనకు, కాంగ్రెస్, బీజేపీ లకు కలిపి వచ్చిన ఓట్ల కంటే వైసీపీకి ఆరులక్షల ఓట్లు అధికంగా వచ్చాయి. ఈ గణాంకాలనే  ప్రాతిపదికగా తీసుకుంటే అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా వాటిపై వైసీపీ విజయం సాధించి వుండేది అనేది  ఒక వాదన.
అయితే ఇంతటి బహుళ ప్రజాదరణతో అధికారంలోకి వచ్చిన ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు, ప్రజాస్వామ్య సూత్రాలను పట్టించుకోకుండా  తన చిత్తం వచ్చినట్టు పాలన సాగించవచ్చా అనేది ఆదినుంచి  ప్రతిపక్షాలు లేవదీస్తున్న ప్రశ్న. కరోనా పూర్వరంగం నుంచి తొలుస్తూ వచ్చిన ఈ సందేహాన్ని,  కరోనాను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆ పార్టీలు  ఒకటికి పదిసార్లు ప్రజలకు చెబుతూ మరింత పెద్దది చేస్తూవచ్చాయి. కేవలం సందేహం అయితే పర్వాలేదు, జగన్ ప్రభుత్వ నిర్వహణలో పూర్తిగా వైఫల్యం చెందారు అనేది జనం నమ్మేలా  చేయడానికి వాళ్ళు శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు.
గత ఏడాది కాలంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలన్నీ అనాలోచితమైనవి, తొందరపాటుతో కూడినవి కాకపోయినా చాలావరకు వివాదాస్పదంగా మారుతున్నాయి. అదే సమయంలో కొన్ని నిర్ణయాలు మొదట్లో దుందుడుకుతనంగా అనిపించినా తర్వాత తర్వాత వాటిల్లో సహేతుకత లేకపోలేదని జనమే ఒప్పుకునేలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు కరోనాతో సహజీవనం చేయక తప్పదని జగన్ చేసిన వ్యాఖ్య పెద్ద దుమారాన్నే లేపింది. అందరూ ఆక్షేపించేలా చేసింది. చివరికి పాలకులు అందరూ అదేమాట చెప్పాల్సిన పరిస్తితి ఏర్పడింది. కానీ ఈలోపలే ఆ ప్రకటనను జగన్ అనుభవరాహిత్యానికి గీటురాయిగా ముద్ర వేయడం జరిగిపోయింది.    

ఈ కరోనాకు తోడు పులిమీది పుట్రలా విరుచుకుపడిన వైజాగ్ విష వాయువు దుర్ఘటన దరిమిలా ప్రతిపక్షాల వాదన సరయినదేమో అనే శంక సమాజంలోని  కొన్ని వర్గాలవారికి కలిగేలా ఈ ప్రయత్నాలు తారాస్థాయికి చేరాయి.
తనపై దుష్ప్రచారం ఎంత పెద్ద ఎత్తున సాగితే అంత మంచిదని జగన్ మోహన రెడ్డి భావిస్తున్నారేమో తెలవదు. దీన్ని బలంగా తిప్పికొట్టే ప్రయత్నాలు ఏవీ ఆయన వైపు నుంచి కానరావడం లేదు. బహుశా గతంలో ఇలాగే అన్ని  రాజకీయ పక్షాలు ఏకమై తనను ఒంటరివాడిని చేసినప్పుడు ప్రజలకు తనపట్ల సానుభూతి వెల్లువెత్తిన సంగతిని దృష్టిలో పెట్టుకుని ఇలా ప్రతిస్పందించకుండా మిన్నకుంటున్నారేమో తెలవదు. ముందే చెప్పుకున్నట్టు ఆయన ఎవరి అంచనాలకు అందని లోతైన మనిషి.
చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఒక అభిమాన నాయకుని పట్ల అయన  అభిమానులు పెంచుకున్న అభిమానం ఎల్లవేళలా ఒకేలా వుండదు. కాకపోతే బహుళ ప్రజాదరణ కలిగిన నాయకులకు ఒక రక్షాకవచం వుంటుంది. వారిపై వచ్చే విమర్శలను, ఆరోపణలను జనం తేలిగ్గా తీసుకుంటారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన గురించి వెలువడిన నిందాప్రచారాలు అన్నీ ఇన్నీ కావు. అయినా ప్రజలు  పట్టించుకోలేదు. పరిపాలనలో లోటుపాట్లని లెక్కపెట్టకుండా ప్రతిసారీ ఆయన్ని గెలిపిస్తూ వచ్చారు.  అలాంటి నాయకుడికి 1989 లో ఏం జరిగిందో అందరికీ తెలుసు.  అంతగా అభిమానించిన ఎన్టీఆర్ వంటి మహానాయకుడినే ఒక నియోజకవర్గం, కల్వకుర్తిలో ఓడించారు. పూచిక పుల్లను నిలబెట్టి గెలిపించుకునే సత్తా తనకుందని అహంకారపూరిత ప్రకటనలు చేయడం, ఓ చిన్న కారణం చూపెట్టి తన మంత్రివర్గంలోని మంత్రులను అందరినీ ఒక్క కలంపోటుతో  తొలగించడం వంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను ప్రజలు హరాయించుకోలేక పోయారు. కాబట్టి మంచి ప్రజాదరణ కలిగిన జగన్ వంటి నాయకులు గతం బోధించే పాఠాలను గుర్తుచేసుకుంటూ భవిష్యత్తుకు గట్టి పునాదులు వేసుకోవాలి. 
తోకటపా:
జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలి గురించి సోషల్ మీడియాలో కనబడిన వ్యాఖ్య:
"రైల్వే ప్లాటుఫారం ప్రయాణీకుల సందడితో, తినుబండారాలు అమ్మేవారి కేకలతో  నానా గోలగా వున్నా, వచ్చిపోయే రైళ్ళు రణగొణధ్వనులు చేస్తున్నా ఆ గోలని (ప్రతిపక్షాల వ్యతిరేక ప్రచారం) ఏమాత్రం  పట్టించుకోకుండా ఏకాగ్రతతో తన పని తాను చేసుకునే స్టేషన్ మాష్టర్ వంటివాడు జగన్ మోహన్ రెడ్డి” (EOM)



23, మే 2020, శనివారం

పెద్దలకు పొద్దెలా గడుస్తోంది


కరోనా లాక్ డౌన్ కట్టడి కాలంలో సినిమా తారలు ఎలా కాలం గడుపుతున్నారో ఏ ఛానల్ పెట్టినా తెలుస్తుంది. ఎప్పుడూ అలవాటు లేని వంటలు చేస్తూనో, ఇల్లు ఊడుస్తూనో కాలక్షేపం చేస్తున్న తారల కధనాలకు, ఛాయా చిత్రాలకు, టిక్ టాక్ చిట్టి పొట్టి చిత్రాలకు కొదవేలేదు.
ఈ సమయంలో ఆంధ్రజ్యోతి సంపాదక వర్గానికి ఓ మంచి ఆలోచన వచ్చి, తొమ్మిది పదుల వయసు దాటిన పెద్దలకు పొద్దెలా గడుస్తోంది అనే విషయాన్ని వారినే అడిగి తెలుసుకుని నిన్నా మొన్నా ఈరోజూ కొన్ని కధనాలు ప్రచురించారు. కరోనాకు ముందు, కరోనాకు తర్వాత వారి జీవనశైలి ఎలా వుందో వివరించారు.
ముందుగా ప్రసిద్ధ విద్యావేత్త తొంభయ్ అయిదు సంవత్సరాల  చుక్కా రామయ్య గారితో మొదలు పెట్టారు. వారిలా  చెప్పారు.
“ఒంట్లో ఓపిక మునుపటిమాదిరిగా లేదు. నేను డయాబిటీస్ పేషెంటుని. అంచేత మరింత జాగ్రత్తగా ఉంటూ డాక్టర్ల సలహాలు ఖచ్చితంగా పాటిస్తున్నాను. ఉదయం ఏడు గంటలలోపే రెండు ఇడ్లీలు. కాస్త మినప్పొడితో బ్రేక్ ఫాస్ట్. మధ్యాన్నం ఒంటి గంటకి ఒకపుల్కా, చిన్నకప్పు అన్నంతో భోజనం. సాయంత్రం ఓ గ్లాసు మజ్జిగ. రాత్రి ఏడు లోపల భోజనం. చిన్న కప్పు రైసు, ఓ చపాతి. అంతే! తర్వాత  గంట వాకింగ్ చేసి తొమ్మిదింటికల్లా పడక.   
 “నా సొంతూరు జనగామ జిల్లా గూడూరు. 1920లో గత్తర (కలరా)వచ్చిందని పెద్దలు చెప్పగా విన్నాను. అప్పుడు చాలామంది చనిపోయారట. తర్వాత అయిదేళ్లకు నేను పుట్టాను. డిగ్రీ చదువుల కోసం  1946లో హైదరాబాదు వచ్చాను. అప్పటికే ప్లేగు విలయతాండవమాడుతోంది. ఎలుకలు ఉన్న ఇళ్ళు ఖాళీ చేసేవారు. ప్లేగుతో ఎవరైనా చనిపోతే వారి ఇళ్ళకు ఎవ్వరూ వెళ్ళకపోయేది. వ్యాధి భయంతో శవాలను దహనం చేయకుండా ఖననం చేసేవాళ్ళు. ఏదైనా గల్లీలో ప్లేగు ప్రబలితే అక్కడ వుండే ఆరోగ్యవంతులను ప్లేగు క్యాంపులకు తరలించేవాళ్ళు. విద్యానగర్ లో ప్రస్తుతం దుర్గాబాయి హాస్పిటల్ ఉన్న చోట ప్లేగు క్యాంపు వుండేది.
“నలుగురు పిల్లలూ అమెరికాలో స్థిరపడ్డారు. ఇంట్లో నేను, నా సహాయకుడు వుంటాం. ఒకప్పుడు ఈ ఇంట్లో ఆరుట్ల కమలాదేవి, రామచంద్రారెడ్డి, గురువారెడ్డి, వాసుదేవ్ వంటి మహానీయులు వుండేవారు. నాకు ఈ ఇల్లంటే ప్రాణం.  పిల్లలు రమ్మని బతిమాలినా వెళ్లకపోవడానికి ప్రధాన కారణం ఇదే.”     
     

16, మే 2020, శనివారం

వెతుకులాటలో దొరికిన ఆణిముత్యం


శ్రీ సీతారామాంజనేయ సంవాదం
నిజానికిది రామాయణంలోని కాదు.
ఆధ్యాత్మిక రామాయణంలోని సంవాదానికి ఆనంద స్వరూపంగా తానిది రాసానని గ్రంధకర్త పరశురామ పంతుల లింగమూర్తి అను గురుమూర్తిగారే పేర్కొన్నారు. దీనికి రచయిత, వ్యాఖ్యాత, ఆనంద బంధువు ''లింగమూర్తి'' గురుమూర్తిగారే.  తదనంతరం కాలంలో వజ్ఘల నారాయణ శాస్త్రులుగారు, శ్రీ పరశురామ పంతులుగారి ఆనందానికి, బ్రహ్మానందంగా తమ వ్యాఖ్యానం జతచేసి భక్తులకు అందించారు.
రచయిత ఈ గ్రంధంలో కొన్ని సాహిత్యపరమైన చమక్కులు చేసారు. ద్వితీయాశ్వాసము 350 వ పుటలో ఒక కంద పద్యం వుంది. సంవాదంలో భాగంగా సీతమ్మ వారు ఆంజనేయునితో ఇలా అంటారు. ఈ కందం ఏకాక్షర పద్యం. కేవలం ‘న’ అనే అక్షరంతో ఈ పద్యం నడక సాగుతుంది.
 “నానానానుని ననిన, న్నేనే నననిన్ను నన్ను నేనన ననినన్
నేనను నేనన్నానా, నేనను నన్నెన్ని నన్ను నిను నేనరా”
గతంలో ఆంధ్రసారస్వత పరిషత్ (ఇప్పుడు తెలంగాణా సారస్వత పరిషత్) వారు   ఈ గొప్ప రచయిత లింగమూర్తి అను గురుమూర్తి  జీవితమూ – సాహిత్యము పై ఒక గ్రంధాన్ని ప్రచురించారు. ఆచార్య దివాకర్ల వెంకటావధాని, శ్రీ కేశవపంతుల నరసింహ శాస్త్రి ఈ పుస్తకాన్ని రచించారు. వీరేశలింగ గ్రంధాలయంలో ఈ పుస్తకం దొరికే అవకాశం వుంది. ఆన్ లైన్ లో కూడా లభ్యం అని కొందరు చెప్పగా విన్నాను. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకారులు బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు తమ నవ జీవన వేదంలో కూడా ఈ రచయిత ప్రస్తావన చేసారు.  

15, మే 2020, శుక్రవారం

కరోనా పులి – భండారు శ్రీనివాసరావు



నిన్న అంటే మే పద్నాలుగో తేదీ గురువారం నాడు దాదాపు అన్ని టీవీ ఛానళ్ళు ఒకే అంశాన్ని పదేపదే పలుసార్లు ప్రసారం చేశాయి, హైదరాబాదు మహా నగరంలో చిరుతపులి సంచారం అంటూ. ఆ చిరుత నగర రహదారులపై తచ్చాడుతున్న దృశ్యాలను అనేకసార్లు టీవీల్లో  చూపెట్టారు. పోలీసులు, జూ అధికారులు ఆ చిరుతను పట్టి బంధించడానికి నానా శ్రమ పడ్డారు. చివరికి అది, చెట్లూ చేమలతో నిండిన, ఎవరూ నివాసం ఉండని ఓ  విశాలమైన ఫాం హౌస్ ఆవరణలోకి తప్పించుకు వెళ్లిందని సమాచారం. పులివేట కొనసాగుతుందని అధికారులు చెప్పినట్టు ఓ స్క్రోలింగు వేసి  ఆ వార్తకు ఆ పూటతో మంగళం పాడేసి కొత్త వార్తల వేటలో పడిపోయారు ఛానళ్లవాళ్ళు.
చిన్నప్పుడు స్కూళ్ళలో మాస్టార్లు ఒక విషయాన్ని విశదంగా వివరించడానికి, లేదా పిల్లలకు దానిపై అవగాహన కలిగించడానికి ఏదో ఒక పోలిక చెప్పి దానికీ దీనికీ ముడిపెట్టి చెప్పేవాళ్ళు. నిజానికి అలా అరటిపండు ఒలిచినట్టు పాఠం చెప్పే అయ్యవార్లు అంటే పిల్లలకు కూడా అభిమానం వుండేది.
పులికీ, ఈ పాఠాలకు సామ్యం ఏమిటి అనే అనుమానం రావచ్చు. వుంది. కానీ,  ఎలాగూ ఇది చదివిన తర్వాత, ఇలా వివరణ ఇచ్చిన తర్వాత కూడా చాలామంది వెలిబుచ్చే సందేహం ఇదే. ఇదేం పోలిక బాబూ అని అన్నాఅనవచ్చు.
పులి ఊళ్లోకి వచ్చింది. అది పచ్చి నిజం. అందరూ టీవీల్లో చూసారు. అడవిలోకి వెళ్ళింది అన్నారు. ఎవరూ చూడలేదు. కానీ జనాలు నమ్మారు. అది ఆ అడవిలోనైనా వుండిఉండొచ్చు. లేదా నగరంలోనే ఎక్కడైనా దాక్కుని వుండిఉండొచ్చు. కానీ ఎవరూ చూసిన వాళ్ళు లేరు. అలాగే పులి తను నివాసం వుండే నిజమైన అడవిలోకి వెళ్లి ఉండవచ్చు. ఇదీ చూసిన వాళ్ళు లేరు. ఇవన్నీ ఊహాగానాలే.
ఒకవేళ పులి నిజంగా నగరం పొలిమేరల్లోని ఆ ఫాం హౌస్ లో వుంటే... అంటే అది మన పక్కలో ఉన్నట్టే. కానీ కనబడలేదు కాబట్టి దాని గురించి పట్టించుకోవడం లేదు.
ఇక్కడే మేస్టార్లు చెప్పిన పాఠంలో పేర్కొన్న పోలిక.
పులి కూడా కనబడకుండా పోయింది. కానీ పక్కనే ఎక్కడో  కనబడకుండా వుంది. అది పట్టుపడేదాకా లేదా పట్టుకునేదాకా  నగరం అలానే స్తబ్దుగా వుండిపోదు కదా! అందుకే పులి వుంది అనే అనుమానం ఉన్నప్పటికీ నగర ప్రజలు నిన్నా నేడూ కూడా తమ మానాన తమ జీవనం యధావిధిగా  కొనసాగించారు.
అలాగే కరోనా. కరోనా కూడా కనబడని శత్రువు. కానీ వుందని తెలుసు. మందు కనుక్కునేదాకా ఏమీ చేయలేమనీ తెలుసు.
అందుకే, కరోనాకు సరైన  వాక్సిన్ కనుక్కునేదాకా దానితో  యుద్ధమూ చేయాలి. దానితోనే  సహజీవనమూ సాగించాలి.         

మంచి నీళ్ళ కరెంటు – భండారు శ్రీనివాసరావు


“We cannot afford this sort of luxury there”
యూకే, అమెరికా వంటి సంపన్న దేశాల్లో విలాసవంతమైన జీవితాలు గడిపేవాళ్ళు కూడా ఇండియాలోని తమ చుట్టపక్కాలను చూడడానికి వచ్చినప్పుడు చెప్పే మాట ఇది.
మన ఇళ్ళను చూసి, మన ఇంట్లో ఫర్నిచర్ ని చూసి కాదు వాళ్ళు ఈ మాట చెప్పేది. మనం విచ్చలవిడిగా వాడుతున్న విద్యుచ్చక్తిని చూసి.
“ఆ గదిలో ఎవ్వరూ లేరు, అయినా  పంకా తిరుగుతోంది, ఆపేయవచ్చు కదా!’
“అందరం ఇక్కడే కూర్చున్నాం కదా! ఆ గదిలో ఏసీ ఎందుకు”
ఇలాంటి వ్యాఖ్యలు చేయడమే కాదు, కాస్త చనువు వున్నవాళ్ళు లేచి వెళ్లి ఆ పంకాని, ఆ ఏసీని ఆపేసి వస్తారు కూడా.
ఎందుకంటే ఆ దేశాల్లో కరెంటు చార్జీలు ముట్టుకోకుండానే కాలిపోయే రకం.
మన దగ్గర వంటింట్లో ఇల్లాలు వంట చేస్తుంటుంది. కొరియర్ వాడు వచ్చి బెల్ కొడతాడు. వెంటనే ఆవిడ ముందు గ్యాస్ ఆఫ్ చేసి వెళ్లి తలుపు తీస్తుంది. అంతేకాని అదే గదిలో తిరుగుతున్న ఫ్యాన్ ఆఫ్ చేయదు. అంతేకాదు, వంట చేస్తున్నంత సేపు డ్రాయింగు రూములో టీవీ మోగుతూనే వుంటుంది. కావాలంటే గమనించి చూడండి.
సాధారణ కుటుంబాల్లో కరెంటు వాడకం గురించి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చెప్పవచ్చు. ఎందుకంటే బిల్లు చూసిన తర్వాత కానీ చార్జీల సంగతి గుర్తుకు రాదు. నేనూ ఈ బాపతే. కానీ చార్జీల విషయంలో నా వాదన వేరు.
గతంలో ఎన్నో వ్యాసాలు రాసాను. ప్రతివాళ్ళం ఇళ్ళల్లో ఇంత హాయిగా వుంటున్నామంటే ఈ కరెంటు వల్లే. బయట ఎండ దంచుతున్నా ఫ్యాను గాలికి సేద తీరవచ్చు. రాత్రి వేళ గాలి బిగించి ఉబ్బతీసినా ఏసీ చల్లదనంతో హాయిగా కునుకు తీయవచ్చు. పగలూ రాత్రీ అనే తేడా లేకుండా పెద్దపెద్ద టీవీలతో ఇంటినే ఒక థియేటర్ గా మార్చుకుని చక్కగా కాలక్షేపం చేయవచ్చు.
కానీ కరెంటు చార్జీలు మాత్రం పెంచరాదు. నేను రాస్తున్నది బీదాబిక్కీ విషయం కాదు, తీరి కూర్చుని సాంఘిక మాధ్యమాల్లో సలహాలు, సూచనలు ఇచ్చేవాళ్ళ గురించి. వాడుకున్న దానికి చార్జి కట్టి తీరాలి. చేసిన పనికి తగిన వేతనం ఇచ్చి తీరాలి. ఏదీ ఉచితం కాదు.  ఈనాటి కార్పొరేట్ ప్రపంచాన్ని శాసిస్తున్న సూత్రాలు.
ఇదేదో కరెంటు చార్జీల పెంపుగురించి సాగుతున్న వివాదంలో ఎవరినో సమర్ధించడానికి ఇది రాయడం లేదు. చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వున్నప్పుడు నేరుగా ఆయనతోనే చెప్పాను, కరెంటు చార్జీలు పెంచితే పరవాలేదని. సందర్భం గుర్తు లేదు, ముఖ్యమంత్రి ఆ రోజు జూబిలీ హాల్ లాన్స్ లో విందు ఏర్పాటు చేసారు. నేను అప్పుడే మాస్కో నుంచి వచ్చాను. అయిదేళ్ళ పాటు కన్ను కొట్టని కరెంటు దీపాలు చూసివచ్చిన మత్తులో వున్నాను.
ఆ రోజుల్లోనే కరెంటు చార్జీల గొడవ ఊపందుకుంటోంది. మాటలమధ్యలో ఏమిటి రష్యా సంగతులు అంటే నేను చెప్పాను. మంచి నాణ్యత కలిగిన కరెంటు ఇవ్వండి. చార్జీలు పెంచినా జనం ఏమీ అనుకోరు. అలా కాకుండా ఇలా వచ్చి అలా పోయే కరెంటుకు ఎక్కువ చార్జీలు వేస్తేనే జనంతో  చిక్కొస్తుంది’ అనేది నా జవాబు.
చివరికి షాక్ ఆయనకు కొట్టింది. నేను బాగానే వున్నాను. కానీ నా అభిప్రాయం మాత్రం అప్పటి నుంచి ఇప్పటిదాకా మారకుండానే  వుంది.
అయినా నేనేమైనా రాజకీయాల్లో వున్నానా ఏమిటి తరచూ అభిప్రాయాలు మార్చుకోవడానికి.
''అప్పుడప్పుడు ఒపీనియన్స్‌ ఛేంజ్‌ చేస్తుంటే కానీ పొలిటీషియన్‌ కానేరడు''  - కన్యాశుల్కం లో గిరీశం