29, సెప్టెంబర్ 2018, శనివారం

సంచలన వార్తల సునామీలో తెలుగు మీడియా – భండారు శ్రీనివాసరావు

  
(Published in SURYA telugu daily on 30-09-18, SUNDAY)
గత కొద్ది రోజులుగా పట్టిన ‘వార్తల ముసురుతో’ తెలుగు రాష్ట్రాల్లో మీడియా తడిసి ముద్దవుతోంది.
ఒకదాని వెంట మరో వార్త ఎవరో తరుముతున్నట్టు వస్తూ ఉండడంతో మీడియా ఉడ్డుగుడుచుకుంటోంది.
మరో రెండు రోజుల్లో, అక్టోబరు రెండో తేదీన  పదవీవిరమణ చేయబోతున్న భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, కొద్ది రోజుల వ్యవధానంలోనే అతి ముఖ్యమైన అంశాలలో కీలకమైన పలు తీర్పులను వరసగా  వెలువరించి మీడియాకు మరింత పని ఒత్తిడి కలిపించారు.
స్వలింగ సంపర్కం  తప్పు కాదంటూ ఇచ్చిన తీర్పుపై రగిలిన రగడ చల్లారక ముందే వివాహేతర సంబంధాలు శిక్షార్హమైన నేరం కాదంటూ సుప్రీం ఇచ్చిన మరో తీర్పు అయోధ్య వివాదం పై తాజాగా  ఇచ్చిన మరో తీర్పును మరుగున పడేసింది. ఇదిలా ఉండగానే శబరిమల దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై వున్న నిషేధాన్ని సుప్రీం కొట్టివేయడం సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలకు ఊపిరి ఊదింది. భీమా కొరేగాం కేసుకు సంబంధించి వరవరరావు గృహ నిర్బంధాన్ని మరో మాసం పాటు పొడిగిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న నిర్ణయం కూడా ఈ వరుస లోనిదే.
దీనికి తోడు రెండు తెలుగు రాష్ట్రాలలో నియోజక వర్గాల పెంపు గురించి ఎప్పుడో పాతరేసిన మరో అంశానికి ఊపిరి పోస్తూ కేంద్రహోం శాఖ ఎన్నికల కమీషన్ ను నివేదిక కోరడం,  తెలంగాణలో ముందస్తు ఎన్నికల  ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ దాఖలయిన కేసులో వారం రోజుల లోగా వివరణ ఇవ్వాలని  తెలంగాణా ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి సుప్రీం నోటీసులు ఇవ్వడం, దరిమిలా ముందు అనుకున్న ప్రకారం ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అంశంపై అనుమాన మేఘాలు ముసురుకోవడం, ఇది ఇలా ఉండగానే,  నాలుగు ఇతర రాష్ట్రాలతో కలిపి తెలంగాణలో ఎన్నికలు నిర్వహించడానికి అన్నీ సక్రమంగా వున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు నివేదిక ఇవ్వడం ఇలా పరస్పర విరుద్ధమైన సమాచారాలు ఇప్పటికే  బాగా పేరుకుపోయిన  అయోమయ పరిస్తితిని మరింత పెంచుతూ పోతున్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్, టీడీపీ శాసన సభ్యుడు చింతమనేని ప్రభాకర్ నడుమ సాగుతున్న మాటల యుద్ధం రోజురోజుకూ తన స్వరూప స్వభావాలను మార్చుకుంటూ కొత్త వివాదాలకు, సరికొత్త రాజకీయ ఆరోపణలకు తెర తీస్తోంది. తనపై భౌతిక దాడులు జరుగుతున్నాయని, చంపడానికి కుట్ర జరుగుతోందని స్వయంగా పవన్ ప్రకటించడం ఆయన పార్టీ కార్యకర్తల్లో, అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆ స్థాయి నాయకుడు చేసిన ఇటువంటి ఆరోపణలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవడం అవసరమనిపిస్తోంది.
అలాగే విశాఖ ఒడిసా సరిహద్దుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు,  అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ ఇరువురూ ఒకేచోట, ఒకేరోజు మావోయిస్టుల  తుపాకుల బారినపడి , ఒకేసారి  అసువులు బాయడం ఆ ప్రాంతంలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో సయితం ప్రకంపనలు సృష్టించింది. ఒక గిరిజన ఎమ్మెల్యేను  మావోయిస్టులు మట్టుబెట్టడంలో పోలీసుల వైఫల్యం వుందని భావించిన గిరిజనులు ఒక్క పెట్టున అరకు పోలీసు స్టేషన్ పై దాడి చేసి దాన్ని ధ్వంసం చేయడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు.
ఈ నేపధ్యంలో అమెరికాలో జరిపిన ప్రతిష్టాత్మక  పర్యటన నుంచి స్వరాష్ట్రానికి తిరిగివచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇటువంటి సమస్యలు స్వాగతం పలకడంతో తన  పర్యటనలో సాధించిన విజయాలను, విశేషాలను ప్రజలకు తెలియప్పాలనే   ఉత్సాహంపై నీళ్ళు చల్లినట్టు వుండవచ్చు.  పులిమీద పుట్రలా  పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో, ఒకప్పుడు తమ పార్టీలో ఒక వెలుగు వెలిగి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న రేవంతరెడ్డి ఇంటిపైనా, ఆయన బంధువుల ఇళ్ళ మీదా  ఆదాయపు పన్ను(ఐటీ), ఎన్ఫోర్స్ మెంటు విభాగం (ఈడీ)  అధికారులు దాడులు జరపడం,  ఒక్క రేవంతరెడ్డి ఇంట్లోనే దాదాపు రెండు రోజులు ముమ్మరంగా సోదాలు చేయడం, అనేక గంటలపాటు రేవంత్ రెడ్డిని విచారించడం,  కోట్లరూపాయల్లో సాగిన   బినామీ లావాదేవీలకు సంబంధించిన సమాచారాలు బయటకు పొక్కుతూ వుండడం, అదే సమయంలో మరుగున పడిపోయిన ‘ఓటుకు కోట్లు’ కేసు మరోసారి తెర మీదికి వస్తూ వుండడం తెలుగుదేశం అధినేతకు ఈ తరుణంలో అంతగా రుచించని విషయాలే.
అందుకే ఆయన తన మనసులోని మాటను ఆచితూచినట్టుగా మాట్లాడుతూనే  బయట పెట్టారు కూడా. ‘దొంగలు, నేరగాళ్ళను పట్టుకోలేరు కానీ రాజకీయ వేధింపులకు మాత్రం ముందుంటున్నారు’ అని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టారు. ‘ఎన్నికలు రాగానే మొదలు పెడుతున్నారు. ఈ పద్దతులు దేశానికి మంచిది కావు. అవినీతిపరుల తాట తీస్తానని చెప్పిన ప్రధాని మోడీ ఇప్పుడు అదే అవినీతిపరులను కాపాడే ప్రయత్నం చేయడం వల్ల మోడీ విశ్వసనీయత కోల్పోయారని విమర్శించారు.
అయితే, అంతకు ఒక రోజు ముందే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ అధినేతపై ఇదే విధమైన విమర్శ చేయడం గమనార్హం. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు రౌడీలుగా ప్రవర్తిస్తున్నా అధినాయకుడు  పట్టించుకోవడం లేదని పవన్ తన ప్రజాపోరాటయాత్రలో ప్రసంగిస్తూ ఆరోపించారు. అవినీతిపరులను ముఖ్యమంత్రి కాపాడుతున్నారు అని అర్ధం వచ్చే రీతిలో ఆయన ప్రసంగం సాగింది.     
పొతే, రేవంతరెడ్డి ఉదంతం తెలంగాణలో భారీ స్థాయిలో  రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణా కాంగ్రెస్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో తలమునకలుగా వున్నప్పుడు ఐటీ, ఈడీ దాడులు గురించిన సమాచారం టీవీ ఛానళ్ళు ప్రసారం  చేయడం మొదలు పెట్టిన దాదిగా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి, సీనియర్  కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, దామోదర రాజ నరసింహ,  వీ. హనుమంతరావు, మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డాక్టర్ మల్లు రవి, డి. అరుణతో   సహా అనేకమంది   నేతలు రేవంతరెడ్డికి సంఘీభావం తెలిపారు. ఈ మొత్తం వ్యవహారాన్ని బీజేపీ, టీఆర్ఎస్ కలిసి చేస్తున్న  ఒక రాజకీయ కుట్రగా అభివర్ణించారు. లేనిపోని కేసులు పెట్టి తమ నాయకులను టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులను వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఇందుకు మద్దతుగా గండ్ర వెంకట రమణా రెడ్డి, జగ్గారెడ్డి కేసులను ఉదహరిస్తున్నారు.
కాంగ్రెస్ నాయకుల ఆరోపణలను టీఆర్ఎస్ నాయక శ్రేణులు ఖండిస్తున్నాయి. ఐటీ, ఈడీ విభాగాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి కావని, అవి కేంద్రప్రభుత్వ ఆధీనంలోనే పని చేస్తాయని పేర్కొంటూ రేవంత్ రెడ్డి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, తమ పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదని, కేవలం రాజకీయ లబ్దికోసం కాంగ్రెస్ నాయకులు ఇలాంటి ఆధార రహిత ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ బాల్క సుమన్ వంటి టీఆర్ఎస్ నాయకులు  ఎదురు దాడి మొదలు పెట్టారు.
ఇలాంటి సందర్భాలు గతంలో కూడా ఎదురయ్యాయి. అప్పుడూ రాజకీయాల రంగు అంటుకుని అవీ ఈనాటికీ కూడా ఒక దరీదాపూ చేరని అంశాలుగానే  ఉండిపోతున్నాయి.
ఏదైనా ఒక కేసు రాజకీయ రంగు పులుముకుందంటే ఇక అది  ఒక పట్టాన తేలదు అనే భావన సామాన్య ప్రజల్లో వుంది. రాజహంసలు పాలను, నీళ్ళనీ విడదీయగలిగిన చందంగా,  రాజకీయాల నుంచి  శిక్షార్హమైన కేసులను విడదీసి చూడగలిగిన  విజ్ఞత రాజకీయాల్లో రానంత కాలం  ప్రస్తుతం రాజకీయ రంగంలో కానవస్తున్న ఇటువంటి పెడ ధోరణులకు ముకుతాడు వేయడం సాధ్యం కాదన్నది అత్యధికుల అభిప్రాయంగా తోస్తున్నది. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని రాజకీయ కక్షలను తీర్చుకోవడం, లేదా పార్టీలను అడ్డు పెట్టుకుని  చట్టం నుంచి తమను తాము కాపాడుకోవడం ఈనాటి రాజకీయుల వైఖరిగా వుందని, అంచేతే నేరస్తులు తాము చేసిన నేరాలకు శిక్ష పడకుండా తప్పించుకోగలుగుతున్నారని, అదేసమయంలో   ప్రత్యర్ధులు చేయని నేరాలకు కూడా  తమ అధీనంలో ఉన్న  రాజ్యాంగ వ్యవస్థలను వాడుకుంటూ వారిని వేధింపులకు గురిచేస్తున్నారనీ  ఇలా రెండు రకాల అభిప్రాయాలు ప్రజల మనస్సులో నాటుకుపోయేలా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయనే  ఓ అపప్రధ కూడా వుంది. ‘చట్టం ఎవరికీ చుట్టం కాదని, అది తన పని తాను  చేసుకు పోతుందని అధికారంలో వున్నప్పుడు వ్యాఖ్యలు చేసిన నోటితోనే, అధికారంలో లేనప్పుడు అటువంటి కేసులను ‘రాజకీయ కుట్రగా అభివర్ణించడం’ గత కొన్నేళ్లుగా రాజకీయాలను శ్రద్ధగా గమనిస్తూ వచ్చేవారికి అనుభవైకవేద్యమే.    ఇటువంటి రాజకీయ ఎత్తుగడల కారణంగా నష్టపోయేది మన ప్రజాస్వామ్యమే. వ్యవస్తల పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లితే పరిణామాలు దారుణంగా ఉంటాయనే వాస్తవాన్ని ఈనాటి రాజకీయ పార్టీలవాళ్ళు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.  
జనాలకు ఏదీ కలకాలం జ్ఞాపకం వుండదనే ధీమా వారినిలా మాట్లాడిస్తుంది కాబోలు.
పరిస్తితులకు తగ్గట్టు  స్వరం మార్చడమే రాజకీయమా!
ఏమో! రాజకీయులే చెప్పాలి. కానీ వాళ్ళు చెప్పరు.Top of Form
                                                        
మనది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమని చెప్పుకుంటూ వుంటాం. నిజమే.  పెద్దప్రజాస్వామ్య దేశమే. కానీ అతి పెద్ద  రుగ్మతలతో అది కునారిల్లుతోందనే వాస్తవాన్ని విస్మరిస్తున్నాము. ప్రజాస్వామ్యానికి ఎన్నికలే మూలం. ఆ మూలంలోని లోపాలను సవరించుకోకపోగా , వాటిని రాజకీయ పార్టీలు తమ స్వార్ధానికి వాడుకోవడం మౌనంగా చూస్తూ వుండడం కూడా మన ప్రత్యేకత.
నేరం చేసినట్టు అభియోగాలు వున్నవాళ్ళు చట్ట సభల్లో ప్రవేశించకుండా, వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆంక్షలు విధించాలనే ప్రతిపాదన చాలాకాలంగా వుంది. నేరం రుజువై న్యాయ స్థానాల్లో శిక్షలు పడిన వాళ్ళకే ఈ అనర్హత నిబంధన వర్తింప చేయాలని మరి కొందరు అంటున్నారు. లేనిపక్షంలో అధికారంలో వున్నవాళ్ళు తమ ప్రధాన ప్రత్యర్ధులను ఏదో ఒక కేసులో ఇరికించి వారి బెడదను శాశ్వతంగా తొలగించుకునే ప్రయత్నం చేస్తారని వారి వాదన. అది సబబు అనుకుంటే మరో సమస్య వచ్చి పడుతుందని వారి ప్రత్యర్ధుల వాదన. న్యాయ స్థానాలలో ఏళ్ళతరబడి కేసులు పరిష్కారానికి నోచుకోకుండా ఉంటున్న విషయాన్ని వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. కేసులు ఒక కొలిక్కి వచ్చేలోగా వాటిని ఎదుర్కుంటున్న వ్యక్తుల రాజకీయ జీవితం ఎన్నేళ్ళు సాగినా దానికి  అడ్డంకి ఉండదని వాళ్ళ భావన.
మరి పాము చావకుండా, కర్ర విరక్కుండా పరిష్కారం ఎలా! అనేది మరో ప్రశ్న.
చట్టసభల్లో  సభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధాన మంత్రులు కావచ్చు ఒకటి రెండు పర్యాయాలకు మించి పదవుల్లో కొనసాగకుండా రాజ్యాంగ సవరణ చేసుకోవడం ద్వారా ఈ ప్రశ్నకు జవాబు లభిస్తుందని మరి కొందరి అభిప్రాయం. అలా చేసినా వారసుల సంగతేమిటి, వారసత్వంగా వాళ్ళ  అధికారం కొనసాగేలా చేసుకుంటే అప్పుడు ఏమి చేయాలి అనేది మరో జవాబు లేని ప్రశ్న.
ఇవన్నీ ప్రజాస్వామ్యప్రియులు మధన పడే విషయాలు. ప్రజాస్వామ్యం పేరుతొ పదవులు, అధికారాన్ని అనుభవించే రాజకీయుల అభిప్రాయాలు ఖచ్చితంగా ఇలా ఉండవని మాత్రం ఘంటాపధంగా చెప్పవచ్చు.     
ఎందుకంటే వారికి గమ్యం ముఖ్యం, మార్గం కాదు.

16, సెప్టెంబర్ 2018, ఆదివారం

రణతంత్ర రాజకీయ గణితం – భండారు శ్రీనివాసరావు


(PUBLISHED IN ‘SURYA’ TELUGU DAILY ON SUNDAY, 16-09-2018)
రాజకీయాల్లో కూడికలు, తీసివేతలు, హెచ్చవేతలు వుంటాయి. అయితే గణిత శాస్త్రంలో మాదిరిగా ఇవి స్థిరంగా వుండవు. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మారుతుంటాయి. లెక్కల్లో రెండును  రెండుతో  కలిపితే నాలుగు అవుతుంది. అది మారదు. కానీ రాజకీయాల్లో అలా కాదు. ఆ  ప్రశ్నకు జవాబు నాలుగు కావచ్చు, కాకపోవచ్చు. అయినా రాజకీయులు గణితాన్నే నమ్ముకుని ముందుకు సాగుతుంటారు. వాళ్ళ లక్ష్యం గణితంలో పాసు మార్కులు తెచ్చుకోవడం కాదు, ఎన్నికల పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడం.
ఇందులోనుంచి పుట్టుకొచ్చిన ప్రక్రియే పొత్తులు, అవగాహనలు, సీట్ల సర్దుబాట్లు. కాస్త ముదిరితే ఈ పొత్తులే కూటములు, మహా కూటములుగా రూపు మార్చుకుంటాయి.  ఈ కూటముల సృష్టికర్తలు ముందుగా వేసుకున్న అంచనాలు నిజమైన సందర్భాలు వున్నాయి, వికటించిన అనుభవాలు వున్నాయి. కనుకే,  ఇది లెక్కల వ్యవహారమే అయినా లెక్క తప్పే అవకాశం కూడా లేకపోలేదు.  
కొన్ని రాజకీయ పార్టీలు కలసి ఇలా కూటములు కట్టే వ్యవహారం కొత్త విషయమేమీ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది అనుభవైకవేద్యమే. రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయిన తర్వాత    కొత్తగా ఏర్పడ్డ పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014లో నిర్వహించిన ఎన్నికల్లో, ఒక  కూటమి అనే పేరుతో యేర్పడ లేదు కానీ టీడీపీ, బీజేపీలు పొత్తు కుదుర్చుకునే పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో పోటీకి దిగని పవన్ కళ్యాణ్ జనసేన ఆ పొత్తును బలపరచి వాటి విజయానికి తన వంతు పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే దేశంలో ఏ కూటమి కూడా తాను  సాధించిన విజయాలను సుస్థిరం చేసుకోలేక పోయింది. అధికారానికి వచ్చిన దరిమిలా తలెత్తిన వివాదాల కారణంగా ఆ స్నేహాలు మూన్నాళ్ళ ముచ్చటగా మిగిలి పోతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన అయిదేళ్ళ పదవీ కాలం పూర్తయ్యే వరకు కూడా కలిసి వుండలేకపోయాయి. ఎన్నికల సమయంలో కలయికకు కారణాలు తెలిసినవే అయినా, విడి పోవడానికి మాత్రం ఎవరి కారణాలు వారు చెబుతున్నారు. ఈ పరిణామాలకు తగ్గట్టే పాత సమీకరణాల స్థానంలో కొత్తవి రావడం రాజకీయ అనివార్యతగా మారింది. వచ్చే ఏడాది ఎన్నికల నాటికి కలిసున్నవాళ్ళు విడిపోయినట్టే, ఇప్పటివరకు విడిగావున్న  వాళ్ళు కలిసే అవకాశం ఎలాగూ వుంటుంది. సిద్ధాంతాలు, సూత్రాలు అని ఎవరయినా సుద్దులు చెప్పబోతే వాళ్ళని వెర్రివాళ్ళ లాగా జమ కట్టే ప్రమాదం వుంది.
నేటి రాజకీయాల్లో పైకి  పార్టీ పేరు ఏమైనా, అన్ని పార్టీల  రంగూ రుచీ వాసనా ఒక్కటే. అధికారం. ఏమిచేసైనా సరే  ఆ పీఠాన్ని అధిరోహించడం. దీనికి వాళ్ళు చెప్పే భాష్యం ఒక్కటే, మార్గం ఎలాంటిదైనా అనుకున్న గమ్యాన్ని చేరుకోవడం.
ముందు నగారా తెలంగాణలో మోగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికల ఆలోచనతో మెరుపు వేగంతో ముందుకు దూసుకుపోతున్నారు. అసెంబ్లీ రద్దుకావడం, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కసరత్తును ఎన్నికల సంఘం ప్రారంభించడం అన్నీ ఆఘమేఘాల మీద సాగుతున్నాయి. ‘ఇదేమీ సబబుగా లేదు, ప్రభుత్వం ప్రజాస్వామ్య స్పూర్తికి తూట్లు పొడుస్తోంద’నే  ప్రతిపక్షాల వాదనలు ఈ హోరులో కొట్టుకుపోతున్నాయి. ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందనే’ సామెతలాగా కేసీఆర్  చాలా ముందస్తుగానే నూట అయిదు మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించడం ఇతర పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే మంట పెట్టిన వారికి కూడా ఎంతోకొంత ఆ సెగ తగులుతుందన్నట్టు, పాలకపక్షం టీఆర్ఎస్ కు కూడా ఈ ముందస్తు ప్రకటన కొన్ని ఇబ్బందులను కలగచేస్తోంది. అసంతృప్తుల బెడద రాజుకుంటోంది. మొదట మెల్లగా మొదలయినా రోజులు గడుస్తున్న కొద్దీ అసంతృప్తి జ్వాలలు తమిళనాడు రాజకీయాలను తలపిస్తున్నాయి. కొందరు కార్యకర్తలు తమ నాయకులకు సీటు రాలేదన్న మనస్తాపంతో తీవ్రమైన చర్యలకు పూనుకోవడం పరిస్తితిలోని తీవ్రతను తెలుపుతోంది. అయితే, ఎన్నికల ఘడియ దగ్గర పడేసరికి ఇవన్నీ సర్దుకుంటాయని, బుజ్జగింపులు, లాలింపులు ఎన్నికల వేళ ఏ రాజకీయ పార్టీకయినా సహజమేనని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
వాళ్ళు చెబుతున్నట్టు, నిజానికి  ఇదేమీ కొత్త విషయం కాదు, అధికారం కోసం రాజకీయ పార్టీలే తమ సిద్ధాంతాలను పక్కన బెట్టి కానివారితో చెలిమికోసం చేయి చాపుతున్నప్పుడు పార్టీలలోని దిగువశ్రేణి నాయకులు కూడా అదేరకం ఆలోచన చేస్తుంటారు. ‘ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదు’ కదా! గత వారం రోజులుగా అనేకమంది ఛోటా, బడా నాయకులు ‘ఆస్మాసిస్’ పద్దతిలో అటూ ఇటూ పార్టీలు మారుతున్నారు. ‘ఎవరు ఏ పార్టీకి సలాం చెప్పారు, ఎవరు ఏ పార్టీకి సలాం కొట్టారు’ అనే జాబితాను విశ్లేషించడం అనవసరం. ఎందుకంటే, ముందు ముందు ఈ ‘మార్పిళ్ల’ వేగం, పరిమాణం మరింత పెరిగే వీలుంది. ఒక పద్దతి అంటూ లేకుండా సాగిపోతున్న ఈ వికృత రాజకీయ క్రీడ గురించి ఇప్పటికే కుప్పలుతెప్పలుగా సాంఘిక మాధ్యమాల్లో అనేక వ్యాఖ్యానాలు వెలుగు చూస్తున్నాయి.
ఈసారి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ లు పెట్టుకోబోయే పొత్తు గురించి అనేక ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ ఆవిర్భావమే కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై జరిగింది. ‘అలాంటి ఆగర్భ ప్రత్యర్ధితో కలయికా’ అంటూ కొందరు ఆక్షేపిస్తున్నారు. పొత్తును సమర్ధించేవారు గతంలో జరిగిన ఉదంతాలను ఉదహరిస్తున్నారు. ‘రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మితృలు ఉండరని, తాము కలిస్తే అది ఎంతమాత్రం అపవిత్ర కలయిక కాబోద’ని అంటున్నారు. ఇది ఇలా ఉండగానే, మహాకూటమి గురించిన వార్తలు వెలుగు చూశాయి. బలమైన ప్రత్యర్ధిని ఎదుర్కోవాలంటే నలుగురు కలిస్తేనే సాధ్యం కాగలదన్న నమ్మకంతో మహా కూటమి దిక్కుగా చూస్తున్నారు. కొన్ని అడుగులు పడ్డాయి కూడా. సీపీఐ, జనసేన, కోదండరామిరెడ్డిగారి కొత్త పార్టీ ఇలా అందరూ కలసి ఏకోన్ముఖ దాడికి సిద్ధం అవుతున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వున్నప్పుడు తెలంగాణా ప్రజలకు ఈ మహాకూటముల సంగతి ఎరుకే కాని, కొత్త తెలంగాణా రాష్ట్రానికి మాత్రం కొత్త సంగతే. అందులోనూ, కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తరువాత మొట్టమొదటి సారి జరుగుతున్న ఎన్నికలు. అంచేతే వీటికి ఇంతటి  ప్రాముఖ్యత.
ఈనాటి రాజకీయ రణతంత్ర నీతి ప్రకారం కూటముల ఏర్పాటు తప్పుకాకపోవచ్చు. అయితే, అందులో రాజకీయ అవసరాలు ఉన్నప్పటికీ జత కట్టే పార్టీలలో నిజాయితీ  వుండాలి. భారతంలో కురుక్షేత్ర మహా సంగ్రామానికి ముందు సామంత రాజులతో కౌరవ, పాండవులు పొత్తులు ఏర్పాటు చేసుకున్న ప్రస్తావనలు వున్నాయి. కృష్ణుడి తరపున వున్న సైన్యం యావత్తూ, కృష్ణ భగవానుడు దుర్యోధనుడికి ఇచ్చిన మాట ప్రకారం కురుక్షేత్రంలో కౌరవుల తరపున నిబద్ధతతో కూడిన యుద్ధం చేస్తాయి. సహజంగా పాండవ పక్షపాతులు అయిన భీష్మ, ద్రోణాదివీరులు కూడా తమ అంతరాత్మను యుద్ధ రంగానికి ఆవలే విడిచిపెట్టి దుర్యోధనుడి విజయం కోసమే ఎంతో నిబద్ధత, నిజాయితీతో పోరాడతారు. కూటముల ఆలోచన చేసేవాళ్ళు ఈ విషయం కూడా గమనంలో వుంచుకోవాలి.
అలాకాకుండా తాత్కాలిక ప్రయోజనాలకోసం కలిపే  చేతులు, కలిసే మనుషులు, అనుకున్న  లక్ష్యం నెరవేరగానే అంత సులభంగానూ  విడిపోయే పరిస్తితి రాకూడదు. నిజాయితీతో కూడిన రాజకీయ  కూటములను  ఏర్పరచగలిగితే వాటి మనుగడ ప్రశ్నార్ధకం కాబోదు.                        
తోకటపా: విజేతలు  తమ పరిమితులు ముందు తెలుసుకుంటారు. తరువాత తమ శక్తి సామర్ధ్యాలపై దృష్టి పెడతారు.
పరాజితులకి తమ బలహీనతలేవిటన్న దానిపై ఒక అవగాహన వుంటుంది. కాకపోతే దృష్టంతా వారి తమ బలహీనతలపైనే వుంటుంది.
(EOM)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్: 98491 30595



12, సెప్టెంబర్ 2018, బుధవారం

కాపురం చేసే కళ (కధానిక) - భండారు శ్రీనివాసరావు

డాక్టర్ చెబుతున్నది వింటుంటే నాకెందుకో పాత సంగతులు గుర్తుకు వచ్చి నవ్వు వచ్చింది. అది చూసి ఆయన మరోలా అనుకున్నాడు.
‘చూడమ్మా! నేను చెప్పేది కాస్త సీరియస్ గా తీసుకో, చెప్పింది చెయ్యి’
నేను తలూపాను. కానీ మనసులో సుళ్ళు తిరుగుతున్న ఆలోచనలని ఆపుకోలేక పోయాను. మా వాడు కార్లో ఇంటికి తీసుకువస్తున్నప్పుడు తోవ పొడుగునా అవే.
నేను కాపురానికి వచ్చి అరవై ఏళ్ళు అయింది. అత్తారింటికి పంపించేటప్పుడు మా అమ్మ చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి.
“చూడమ్మా చిట్టీ! నువ్వు కాలు పెడుతోంది పెద్ద కుటుంబంలోకి. అత్తా, మామా మీ ఆయనే అయితే ఇంత చెప్పాల్సిన పని లేదు. కానీ మీ మెట్టింటి నిండా బావగార్లు, మరదులు, తోటి కోడళ్ళు. వాళ్ళది చూస్తే గంపెడు సంసారం. మనది చూస్తే గుప్పెడు. మాకు లేకలేక పుట్టింది నువ్వొక్క దానివే. కొడుకువయినా, కూతురివి అయినా ఒకటే అనుకుని గారాబంగా పెంచాము. అతి ముద్దు కారణంగా నీకన్నీ మగరాయుడి వేషాలు అబ్బాయి. మీ తాత బుద్ధులు వచ్చాయి. ఆయన కూడా నట్టింట్లో మడత మంచం మీద కూర్చుని విలాసంగా కాళ్ళు ఊపుతూ కబుర్లు చెప్పేవారు. నువ్వూ అంతే. కుర్చీలో కూర్చున్నా, సోఫాలో కూర్చున్నా కాళ్ళు ఊపడం ఆపవు. అలవాటుగా ఇలాగే మీ అత్తగారింట్లో చేస్తే బాగుండదు. పైగా నా పెంపకాన్ని ఆడిపోసుకుంటారు. కాపురం చేసే కళ కాళ్ళు చెబుతాయంటారు. మా తల్లివి కదా! ఈ అమ్మ చెప్పే ఈ ఒక్క మాట వినమ్మా. ఇలా కాళ్ళు ఊపడం మానేసెయ్యి’
అమ్మకు మాట ఇవ్వకపోయినా, అమ్మ చెప్పిన మాట నా మనసులో అలాగే ముద్ర పడిపోయింది. ఎప్పుడో ఓసారి కధాచిత్ గా కాళ్లూపే అలవాటు అప్పుడప్పుడూ తొంగిచూసినా, మొత్తం మీద అది ఎవరి కంటాపడక ముందే సర్దుకునేదానిని. పిల్లలు పుట్టి, పెద్దవాళ్ళయ్యారు. అప్పటిదాకా ఇంట్లో పెద్దవాళ్ళుగా వున్నవాళ్ళు దాటిపోయి, ఇప్పుడు నేనే ఇంటికి పెద్ద దిక్కు అయ్యాను. కానీ, కుర్చీలో కూర్చుని కాళ్ళు ఊపే అలవాటును పూర్తిగా మానుకున్నాను.
ఇదిగో మళ్ళీ ఇన్నాల్టికి ఈ డాక్టర్ సలహా వింటుంటే నవ్వు రాక ఏం చేస్తుంది.
అప్పుడు అమ్మ వద్దన్నదాన్నే డాక్టర్ గారు ఇప్పుడు చెయ్యమంటున్నాడు.


కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు కూడా కాసేపు కాళ్ళూచేతులూ ఊపమంటున్నాడు. అలా చేయడం ఇప్పుడు నా వంటికి అవసరమట.

10, సెప్టెంబర్ 2018, సోమవారం

అమెరికా ఉలిక్కిపడ్డ రోజు



భయపెట్టడమే తప్ప భయమంటే ఏమిటో తెలియని అగ్రరాజ్యం అమెరికా మొట్టమొదటిసారి ఉలిక్కి పడింది 2001  సెప్టెంబర్ పదకొండవ తేదీన.
కారణం, అమెరికా గడ్డమీద ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం వలస వచ్చిన వారికీ, నేటివ్ రెడ్ ఇండియన్లకు నడుమ జరిగిన పోరాటాలు మినహాయిస్తే అభివృద్ధిచెందిన దేశంగా, అన్ని దేశాల్లో తలమానికంగా రూపొందిన తర్వాత అక్కడ యుద్ధాలు జరిగింది లేదు. ఆ దేశంపై ఒక దాడి జరిగిందీ లేదు. అమెరికన్ సైన్యాలు ఎక్కడో సుదూరంగా ఉన్న వియత్నాం, కొరియావంటి చిన్న దేశాలపై జరిగిన దాడుల్లో పాల్గొన్నాయి కానీ ఆ దేశం మీద దండెత్తిన దేశం అంటూ లేదు, ఎప్పుడో మొదటి ప్రపంచ యుద్ధంలోనో, ద్వితీయ ప్రపంచ సంగ్రామంలోనో అరుదుగా జరిగిన సంఘటనలు తప్ప.
అలాంటి దేశంపై ఇటీవలి కాలంలో జరిగిన మొటమొదటి విదేశీ దాడి రెండువేల ఒకటో  సంవత్సరం సెప్టెంబర్ పదకొండో తేదీన. అమెరికాకు గర్వకారణంగా నిలచిన  వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఆకాశ హర్మ్యాల జంటను విమానాలతో  డీకొట్టి కూల్చివేయడం ఒక్కటే అయితే దాడి అనలేము కానీ, అమెరికా రక్షణ శాఖకు చెందిన ప్రతిష్టాత్మక కార్యాలయం ‘పెంటగాన్’ పై జరిగిన దాడితో కలిపి చూస్తే ఇది నిస్సంశయంగా అమెరికా దేశంపై శత్రు మూకల దాడిగానే పరిగణించాలి.
ఈ దాడితో బెంబేలెత్తిపోయిన అగ్రదేశం ఇటువంటివి పునరావృతం కాకుండా అనేక భద్రతా చర్యలు తీసుకుంది.
 ఫలితంగా స్వేచ్చా ప్రియులయిన అమెరికన్ పౌరులు భద్రత పేరుతొ తీసుకుంటున్న అనేక చర్యలతో విసుగెత్తి పోతున్నారు.
పొతే, అమెరికన్ ప్రభుత్వం తనపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకుంది. దాడికి కారకుడయిన ఉగ్రవాద నాయకుడు లాడెన్ ను మట్టుబెట్టేంత వరకు నిద్రపోలేదు. పాకీస్తాన్ లో తలదాచుకున్న లాడెన్ ఆచూకీ పట్టుకుని అతడ్ని కాల్చి చంపడమే కాకుండా లాడెన్ భౌతిక కాయాన్ని సముద్ర జలాల్లో ముంచేసి ఇక అతడి శవాన్ని జలచరాలకు ఆహారంగా చేసింది. లాడెన్ ను అమెరికన్ సీక్రెట్ పోలీసులు వేటాడి వధిస్తున్న లైవ్ దృశ్యాలను ఆనాటి అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్ లో కూర్చుని చూడడం జరిగిందంటే తనపై జరిగిన దాడికి ఆ దేశం ఎంతగా కక్ష పెంచుకున్నదో అర్ధం అవుతుంది.
అప్పటిదాకా ప్రపంచంలో అన్ని దేశాలను, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలను పట్టి పీడిస్తున్న ఉగ్రవాదభూతం  ఎంత ప్రమాదకరమో అమెరికాకు కూడా తెలిసివచ్చింది. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో నలిపివేస్తామని ప్రకటనలు చేసే దేశాల జాబితాలో అమెరికా చేరిపోయింది.
అయితే ఇవన్నీ షరా మామూలు ప్రకటనలుగా మిగిలిపోకూడదు. ఉగ్రవాదం ఒక దేశాన్ని బలహీన పరచడం తమకు రాజకీయంగా మంచిదే అని అనేక దేశాలు తలపోస్తూ వుండడం అంతగోప్యమేమీ కాదు. తమ ప్రత్యర్ధి దేశం ఉగ్రవాదపు కబంధ హస్తాలలో నలిగిపోవడం కొందరికి కొంత ఉపశమనం కలిగించవచ్చు. కానీ అది తాత్కాలికమే. పెంచి పోషించే ఉగ్రవాద భూతానికి కృతజ్ఞత ఉంటుందని ఆశించడం అత్యాశే అని అనేక దేశాల విషయంలో పలుమార్లు రుజువయింది. ఎందుకంటే ఉగ్రవాద ఉన్మాదులకు వివేచన పూజ్యం. వారికి తలకెక్కిన తలతిక్క మినహా మరేదీ తలకెక్కదు. నాశనం, వినాశనం అనే రెండు పదాలే తప్ప వారికి శాంతి వచనాలు తెలవ్వు. ‘చంపులేదా చచ్చిపో’ అనే రెండే రెండు పదాలు వంటబట్టించుకున్న మరమనుషుల వంటి వాళ్ళు ఈ ఉగ్రవాదులు.
ఈ ఉగ్రవాదుల బలం అవతలి వాళ్ళలోని చావు భయం. చావు భయం లేకపోవడం వారికున్న మరో బలం. సంఖ్యాబలం రీత్యా చూస్తే అత్యంత బలహీనులయిన వీరు ఇంతగా రెచ్చిపోవడానికి ప్రధాన కారణంవారిని ఎదురించాల్సిన శక్తుల మధ్య  ఐకమత్యం లేకపోవడం.
ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదులు జెడలు విదిల్చినా వీరందరూ గళం కలిపి చెప్పే మాట ఒక్కటే. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచి వేస్తామని. కానీ కార్యాచరణ శూన్యం.
అధిక సంఖ్యలో వున్న మంచివారి మౌనమే అల్పసంఖ్యలో వున్న ఉగ్రవాదుల బలం. కలిసికట్టుగా అందరూ కృషి చేస్తే ఉగ్రవాద భూతాన్ని ప్రపంచం నుంచి తరిమివేయడం అంత అసాధ్యమేమీ కాదు. కానీ ఈ విషయంలో ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి స్వార్ధాలు వారివి.
వీటి నుంచి ప్రపంచ దేశాలు బయట పడనంత వరకు ఉగ్రవాదులు తోకలు ఝాడిస్తూనే వుంటారు.
       

మాయమై పోతున్న మా ఇల్లు

కంభంపాడులో మా ఇల్లు
ఇప్పటికి ఎనభయ్ ఏళ్ళు దాటినవాళ్ళు కూడా కంభంపాడు ఇంట్లోనే పుట్టారు అంటే ఇక ఆ ఇంటి వయసు ఎంతో, ఎప్పుడు కట్టారో ఊహించుకుంటే దానికి నూరేళ్ళు నిండాయనే అనిపిస్తోంది. నిజంగానే ఆ ఇంటికి త్వరలో నూరేళ్ళు నిండబోతున్నాయి. పదేపదే మరమ్మతులు వస్తూ వుండడం, శిధిల ఛాయలు కానరావడం బహుశా ఆ ఇంటి కూల్చివేతకు కారణం అనుకుంటున్నాను.
ఏమైనా ఈ ఇంటికి ఓ ఘన చరిత్ర వుంది. పందిరి గుంజను ముట్టుకుంటే పిల్లలు పుడతారన్న నానుడి కలిగేంతగా ఈ ఇంట్లో అనేకమంది జన్మించారు. అందుకే ఈ ఇంటి గురించిన జ్ఞాపకాలు పంచుకోవాలనే ఈ ప్రయత్నం:


కంభంపాడులో మా ఇల్లు పెద్ద భవంతి ఏమీ కాదు. ఈ ఇల్లు కట్టడానికి ముందు ఉన్న ఇల్లు మాత్రం చాలా పెద్దది, మండువా లోగిలి అని చెబుతారు. మా తాతగారి కాలంలో ఆ ఇల్లు అగ్ని ప్రమాదానికి గురయింది. ఆ సంఘటనలో కాలిపోగా మిగిలిన కలపతో కొత్త ఇల్లు కట్టారని చెబుతారు. ఇప్పటికీ వసారాలో వేసిన పైకప్పులో కాలిన నల్లటి మచ్చలు కానవస్తాయి. ముందు వసారా. పక్కన దక్షిణాన ఒక పడక గది, మధ్యలో పెద్ద హాలు, దానికి ఆనుకుని ఒక పెద్ద గది, వెనుకవైపు మళ్ళీ ఓ వసారా, పక్కన వంటిల్లు. వెనుక వసారాలో పాలు కాచుకునే దాలి గుంట, పక్కనే మజ్జిగ చిలికే కవ్వం. అక్కడక్కడా గోడల్లోనే చిన్న చిన్న గూళ్ళు, వంటింట్లో రెండు ఇటుకల పొయ్యిలు, గోడకు రెండు చెక్క బీరువాలు, ఒకటి మడి బీరువా, ఆవకాయ కారాల జాడీలు పెట్టుకోవడానికి, రెండో బీరువాలో పెరుగు కుండలు, కాఫీ పొడి పంచదార మొదలయినవి దాచుకునే సీసాలు. వాటితో పాటే పిల్లలకోసం తయారు చేసిన చిరు తిళ్ళు. ఈ రెండు బీరువాలు తాకడానికి కూడా పిల్లలకు హక్కు వుండేది కాదు. మడి బీరువా మరీ అపురూపం. దానికి తాళం కూడా వుండేది కాదు, అందులోనే చిల్లర డబ్బులు దాచి పెట్టేవారు. పొరబాటున కూడా ఇంట్లో ఎవ్వరూ మైల బట్టలతో వాటిని తాకే సాహసం చేసే వాళ్ళు కాదు. వంటింటి వసారాలోనుంచి పెరట్లోకి గుమ్మం వుండేది. దానికింద వలయాకారంగా మెట్లు. కింద తులసి కోట. ఒక వైపు బాదం చెట్టు. అక్కడ అంతా నల్ల చీమలు. ఎర్రగా పండిన బాదం పండ్లు కొరుక్కు తింటే భలే బాగుండేవి. ఇక బాదం పప్పు రుచే వేరు. దానికి పక్కనే పున్నాగ చెట్టు. నేలరాలిన పూలు భలే మంచి వాసన వేసేవి. మా అక్కయ్యలు వాటిని సుతారంగా మడిచి మాలలు కట్టుకునే వాళ్ళు. మేము వాటితో బూరలు చేసి వూదేవాళ్ళం. దగ్గరలో ములగ చెట్టు. కొమ్మల నుంచి ములక్కాడలు వేలాడుతూ కనిపించేవి. అక్కడే రెండు బొప్పాయి చెట్లు కవల పిల్లల్లా ఉండేవి.
రెండో వైపు కొంచెం దూరంలో గిలక బావి. ఆ బావి చుట్టూ చప్టా. పక్కనే రెండు పెద్ద గాబులు (నీటి తొట్టెలు). ఒకటి స్నానాలకి, రెండోది బట్టలు ఉతకడానికి, అంట్లు తోమడానికి. స్నానాల గాబు పక్కనే వేడి నీళ్ళ కాగు. అక్కడే చెంబుతో వేడి నీళ్ళు, గాబు లోని చల్ల నీళ్ళు సరిపాట్లు చేసుకుంటూ పిల్లలు స్నానాలు చేసేవాళ్ళు. పెద్ద వాళ్ళు బావిదగ్గర నిలబడి, పనివాళ్ళు నీళ్ళు తోడి ఇస్తుంటే పిండితో వొళ్ళు రుద్దుకుంటూ స్నానాలు చేసేవాళ్ళు. నాకు బాగా బుద్ధి తెలిసే వరకు ‘సబ్బు’ గృహ ప్రవేశం చేయలేదు. బావి దగ్గర నుంచి వెనుక పెరట్లోకి చిన్న చిన్న కాలువలు ఉండేవి. ఇంట్లోకి అవసరం అయ్యే కాయగూరల్ని, ఆకు కూరల్ని అక్కడే పండించే వాళ్ళు. చుట్టూ కంచెగా వున్నా ముళ్ళ కంపకు కాకర పాదులు పాకించే వాళ్ళు. తేలిగ్గా ఓ పట్టాన తెంపుకు పోవడానికి వీల్లేకుండా. అక్కడే మాకు పెద్ద పెద్ద బూడిద గుమ్మడి కాయలు, మంచి గుమ్మడి కాయలు కనబడేవి. అంత పెద్దవి అక్కడికి ఎలా వచ్చాయో అని ఆశ్చర్యపడేవాళ్ళం. నాకు పొట్ల పందిరి ఇష్టం. పందిరి మీద అల్లుకున్న తీగె నుంచి పొట్ల కాయలు పాముల్లా వేలాడుతుండేవి. పొట్లకు పొరుగు గిట్టదు అనేది మా బామ్మ. పొరుగున మరో కూరగాయల పాదు వుండకూడదట.
బచ్చల పాదులు అంటే కూడా పిల్లలకు ఇష్టం. ఎందుకంటె వాటికి నల్ల రంగుతో చిన్న చిన్న పళ్ళు (విత్తనాలు) కాసేవి. వాటిని చిదిమితే చేతులు ఎర్రపడేవి. నెత్తురు కారుతున్నట్టు ఏడుస్తూ పెద్దవాళ్ళని భయపెట్టే వాళ్ళం. బెండ కాయలు, దొండ కాయలు దొడ్లోనే కాసేవి. దొండ పాదు మొండిది అనేవాళ్ళు. ఒకసారి వేస్తే చచ్చినా చావదట. ఇందులో యెంత నిజం వుందో తెలవదు. పాదుల గట్ల మీద ఆ పెరడు మధ్యలో రాణీ గారి మాదిరిగా కరివేపాకు చెట్టు వుండేది. నిజంగా చెట్టే. చాలా పెద్దగా, ఎత్తుగా వుండేది. ఊరి మొత్తానికి అదొక్కటే కరివేపాకు చెట్టు కావడం వల్లనేమో ఊరందరి దృష్టి దానిమీదనే. మా బామ్మగారిది నలుగురికీ పంచి పెట్టె ఉదార స్వభావమే కాని, మడి పట్టింపు జాస్తి. మైల గుడ్డలతో కరివేపాకు చెట్టును ముట్టుకోనిచ్చేది కాదు. దాంతో ఎవరూ చూడకుండా ఎవరెవరో దొంగతనంగా కరివేపాకు రెబ్బలు తెంపుకు పోయేవాళ్ళు.

బావి పక్కనే కంచెను ఆనుకుని విశాలమైన ఖాళీ స్థలం వుండేది. వెనుక వైపు దక్షిణం కొసన బండ్లు వెళ్ళడానికి రాళ్ళు పరచిన ఏటవాలు దారి వుండేది. అక్కడే జుట్టు విరబోసుకున్న రాక్షసి లాగా పెద్ద చింత చెట్టు. పగలల్లా ఆ చెట్టు కిందనే ఆడుకునే వాళ్ళం కాని పొద్దుగూకేసరికి చిన్న పిల్లలం ఎవరం ఆ ఛాయలకు పోయేవాళ్ళం కాదు. చింత చెట్టుకు ఓ పక్కన ఎరువుల గుంత వుండేది. గొడ్ల సావిట్లో పోగుచేసుకు వచ్చిన చెత్తనూ, పేడను అందులో వేసేవాళ్ళు. సాలు చివర్లో వాటిని జల్ల బండ్లకు ఎత్తి పంట పొలాలకు ఎరువుగా వేసేవాళ్ళు. కనీసం యాభయ్, అరవై బండ్ల ఎరువు పోగు పడేది.


ఇప్పుడు అవన్నీ గతంలోకి వేగంగా జారిపోతున్న తీపి జ్ఞాపకాలు

అస్పష్ట స్పష్ట చిత్రం తెలంగాణా రాజకీయం


  
ఇప్పుడు అన్ని పార్టీలదీ కేసీఆర్ బాటే.
‘అవసరమైతే లక్ష్య సాధన కోసం గొంగళి పురుగును అయినా ముద్దాడతాను’
ఈమాట ఆయన అన్నది తెలంగాణా సాధించడం కోసం. కానీ ఇప్పుడు ఈ పద ప్రయోగం  చేస్తున్న వారి ధ్యేయం వేరే!
పేకాట ఆడేవారి విషయంలో ఒక జోకు ప్రచారంలో వుంది. ‘మనకు పడ్డ ఆట ఎలా వుందో మనం ఎప్పుడయినా చూసుకోవచ్చు, ముందు పక్కవాడికి ఎలాటి ఆట పడిందో చూద్దాం’
ప్రస్తుతం రాజకీయ క్రీడల్లో మునిగితేలుతున్న పార్టీల పరిస్తితి కూడా చూడబోతే అలాగే వుంది.
‘మన వ్యూహాలు మనకెలాగో వుంటాయి, ముందు ప్రత్యర్ధి పార్టీల ఆలోచనలు, కదలికలపై ఓ కన్నేసి వుంచడం మంచిదని అనుకుంటున్నట్టుగా వుంది.
ముందస్తు ఎన్నికలు తప్పవని తేలిపోయిన తెలంగాణలో రాజకీయ పరిస్తితులలో  కొంత వరకు స్పష్టత వచ్చింది.
తెలంగాణలో బీజేపీ బలపడడం కానీ, కేంద్రంలో మోడీ మళ్ళీ అధికారంలోకి రావడం కానీ  కాంగ్రెస్  పార్టీకి ఇష్టం వుండదు.
‘తెలంగాణలో కాని, ఆంధ్రప్రదేశ్ లో కానీ బీజేపీ బలపడకూడదు,   కేంద్రంలో ఎట్టి పరిస్తితుల్లోను మోడీ ప్రభుత్వం తిరిగి రాకూడద’ని టీడీపీ (అధిష్టానం) భావన.
‘కేంద్రంలో ఎవరు గద్దె ఎక్కుతారో అనేది తరువాతి మాట. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడకూడదు, అలాగే తమ పార్టీ మళ్ళీ ముందుగానే అధికారంలోకి వచ్చి తీరాలి’ ఇది టీఆర్ఎస్ అధినేత మనసులోని మాట.
‘తెలంగాణాలో కాంగ్రెస్, టీడీపీలు బలపడకూడదు’ అనేది బీజేపీ (అధిష్టానం) ఉద్దేశ్యం.     
ఇప్పటికి తెలంగాణలో రాజకీయ పరిస్తితి ఇది.
‘రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారానికి వచ్చే పరిస్తితి ఎలాగూ  లేదు. కేంద్రంలో బీజేపీని  రాకుండా చేయడానికి బద్ధ శత్రువు కాంగ్రెస్ తో చేయి కలపడానికి కూడా సిద్ధం’ అంటున్న టీడీపీ, తెలంగాణా విషయానికి వచ్చేసరికి డోలాయమానంలో పడుతోంది. స్థానిక నాయకత్వం కోరుకుంటున్నట్టుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కలుపుకుంటే టీఆర్ ఎస్ దూకుడును నిలవరించడం సాధ్యం కావచ్చు. కానీ తమ పార్టీకి యేవో కొన్ని సీట్లు తప్పిస్తే అధికారానికి వచ్చే చాన్స్ లేదు. వస్తే గిస్తే ఆ అవకాశం కొంత కాంగ్రెస్ పార్టీకు ఉండవచ్చు. అలాంటప్పుడు ఈ ‘తనకుమాలిన ధర్మం’ ఎందుకని పార్టీలోనూ, పార్టీ శ్రేయోభిలాషుల్లోను తలెత్తుతున్న ధర్మసందేహం. కేసీఆర్ తో లేని పోని  కీచులాట మినహా ఇందువల్ల సాధించేది పెద్దగా ఉండదని తెలంగాణాలో స్థిరపడిన ఆంధ్రప్రాంతపు శ్రీమంతుల (కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు) మన్ కీ బాత్.
బహుశా అందుకే కేసీఆర్ నరనరాన ద్వేషిస్తున్న కాంగ్రెస్ తో బాహాటంగా జట్టు కట్టడానికి అధినేత తటపటాయింపు అని కొందరి భాష్యం.
తెలంగాణలోనే పుట్టి, ఎన్టీఆర్ హయాములో బడుగు, బలహీన వర్గాల ఆదరణను చూరగొన్న తెలుగు దేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావాలని, అందుకు అసెంబ్లీ ఎన్నికలను అవకాశంగా వాడుకోవాలని, కేడర్ బలమున్న తమ పార్టీ, లీడర్ బలమున్న కాంగ్రెస్ వంటి మరో పార్టీతో జత కడితే బాగుంటుందని  ఆ పార్టీ స్థానిక నేతలు భావించడంలో తప్పేమీలేదు. కానీ అసలు చిక్కల్లా, ఏదైనా అనుకోనిది జరిగితేనో,  లేదా అనుకున్నట్టుగా జరగని పక్షంలోనో  టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల నడుమ అది మరికొన్ని కొత్త చిక్కులకు కారణం అయ్యే  ప్రమాదం వుంది. అందుకే కాబోలు, ఏ విషయాన్ని అయినా సాకల్యంగా, ముందు వెనుకలు, సాధ్యాసాధ్యాలు అన్నీ పూర్తిగా  పరిశీలించుకుని కానీ అడుగు వేయడం అలవాటులేని చంద్రబాబునాయుడు, ఈ పొత్తుల అంశాన్ని ప్రస్తుతానికి స్థానిక నాయకులకు వదిలేసి, ఎన్నికల  ప్రచారానికి కూడా తాను  రాబోవడం లేదన్న సంకేతాలు ఇవ్వడం. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకు కనీసం 50:50 అవకాశాలు వున్నాయని నిర్ధారణకు రానిదే చంద్రబాబు ఈ విషయంలో స్పష్టంగా ఏ నిర్ణయమూ ప్రకటించక పోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం టీడీపీతో పొత్తుపెట్టుకోవడానికే తహతహలాడుతున్నట్టుంది. ఒక్క టీఆర్ఎస్ తోనే కాదు, అటు బీజేపీని, ఇటు కేసీఆర్ ని వ్యతిరేకించే ఇతర రాజకీయ పార్టీలను కూడా కలుపుకుని మహా కూటమి ఏర్పాటు చేయాలనే యోచనతో ఆ పార్టీ ముందుకు సాగుతోంది.
పొతే కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తు ఏ రూపంలో అంటే బహిరంగంగానా లేక లోపాయకారీగానా అనేది టీడీపీ అధినాయకుడి ఆలోచనకు అనుగుణంగా వుంటుంది.           

9, సెప్టెంబర్ 2018, ఆదివారం

త్వరిత గతిన మారుతున్న తెలంగాణా రాజకీయ చిత్రం

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 09-09-18)
‘ఇలా జరగొచ్చని అనుకున్నవాళ్ళు వున్నారు కానీ ఇలానే జరుగుతుంద’ని
అన్నవాళ్లు తక్కువ.
అయితే కేసీఆర్ ఎలా జరగాలని అనుకున్నారో అక్షరాలా అలాగే జరిగింది.
తెలంగాణా ప్రభుత్వపు ఆఖరి మంత్రివర్గ సమావేశం నిమిషాల్లో ముగిసింది. శాసన
సభను రద్దు చేయాలనే ఏకవాక్య తీర్మానాన్ని క్షణాల్లో ఆమోదించింది. ఆ
తీర్మానాన్ని తీసుకుని ముఖ్యమంత్రి నేరుగా రాజ్ భవన్ కు వెళ్ళారు.
గవర్నర్ ని కలిసారు. తీర్మానం ప్రతిని అందచేశారు.
మంత్రివర్గ రాజీనామాను అక్కడికక్కడే గవర్నర్ నరసింహన్ ఆమోదించారు.
సాయంత్రం అయిదు గంటలకు టీబీజేపీ ప్రతినిధివర్గం తనను కలవడానికి వస్తున్న
దృష్ట్యా గవర్నర్ తన నిర్ణయాన్ని వెంటనే ప్రకటించక పోవచ్చని టీవీ
చర్చల్లో కొందరు మాట్లాడుతున్నప్పుడే వారిని నిబిడాశ్చర్యానికి
గురిచేస్తూ గవర్నర్ నరసింహన్ మంత్రివర్గ నిర్ణయాన్ని ఎలాంటి జాప్యం
చేయకుండా తక్షణం
ఆమోదించడం మాత్రమే కాకుండా, కే. చంద్రశేఖర రావును ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా
కొనసాగమని కోరినట్టు టీవీ తెరలపై స్క్రోలింగులు పరుగులు తీశాయి.
అక్కడినుంచి పరిణామాలు చకచకా సాగాయి.
తెలంగాణా తొలి అసెంబ్లీ రద్దయినట్టు శాసనసభ సచివాలయం గెజిట్ జారీ
చేసింది. గెజిట్ ప్రతిని శాసన సభ కార్యదర్శి నరసింహాచార్యులు రాష్ట్ర
ఎన్నికల సంఘం ప్రధాన అధికారికి అందచేయడం, ఆ విషయాన్ని కేంద్ర ఎన్నికల
సంఘానికి తెలియచేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం హుటాహుటిన ఢిల్లీకి వర్తమానం
పంపడం వెనువెంటనే జరిగిపోయాయి.
ముందుగా రాసుకున్న సినిమా స్క్రిప్ట్ మాదిరిగా ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు,
అవాంతరాలు లేకుండా జరగాల్సిన విధి విదానాలన్నీ సాగిపోయాయి.
అప్పటివరకు ఈ విషయంలో అలముకున్న అనుమాన మేఘాలన్నీ పటాపంచలు అయ్యాయి.
నిన్నమొన్నటి వరకు కేసీఆర్ అనే పేరుకు ముందున్న ‘ముఖ్యమంత్రి’ అనే పదానికి
‘ఆపద్ధర్మ’ అనే పదం జోడు కలిసింది.
తాను కోరుకున్న విధంగానే కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే తెలంగాణా రాష్ట్రంలో మొట్టమొదటి పర్యాయం అసెంబ్లీ
ఎన్నికలు జరగబోతున్నాయి.(2014లో అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణాకు విడిగా
జరిగినా ఆ ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినట్టే లెక్క)

విశేషం ఏమిటంటే ఈ పరిణామాలన్నీ మెరుపువేగంతో జరిగిపోవడం.
అంతేనా! అంటే అంతటితో అయిపోలేదు.
శాసనసభ రద్దు నిర్ణయాన్ని వెల్లడించిన విలేకరుల సమావేశంలోనే, ఎవరూ
ఊహించని రీతిలో ఏకంగా రానున్న ఎన్నికల్లో పోటీచేసే నూట అయిదుమంది పార్టీ
అభ్యర్ధుల పేర్లను ప్రకటించి అందర్నీ మరింత విస్మయానికి గురిచేసారు
కేసీఆర్. ముందస్తు ఎన్నికల మాట
ఇదమిద్ధంగా తేలకముందే ఆయన మాత్రం చాలా ముందుగానే అభ్యర్ధుల తొలి జాబితా
విడుదల చేసి ఒక రికార్డు నెలకొల్పారు.
అంటే ఏమన్నమాట. ఈ విషయంపై ఆయన చాలా కాలంగా, చాలా లోతుగా కసరత్తు
చేస్తున్నారని అర్ధం చేసుకోవాలి.
సరే! నూట అయిదుమంది అభ్యర్ధులు ఎవరన్నది తేలిపోయింది. సంతోషం. వాళ్లకి
కూడా టికెట్ వస్తుందా రాదా అన్న అనుమాన, భయాలు ‘ప్రస్తుతానికి’ లేకుండా పోయాయి.
మరి తరువాత ఏమిటి? మళ్ళీ ఈ ప్రశ్న సహజంగానే ముందుకువస్తుంది. దానితో
పాటుగా మరికొన్ని ఉప ప్రశ్నలు.
‘కేసీఆర్ భావిస్తున్నట్టు డిసెంబరులోగా తెలంగాణా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయా?
‘ఏదైనా కారణంతో జరక్కపోతే ఏం జరుగుతుంది?
‘కొత్త రాష్ట్రంగా తెలంగాణా ఏర్పడ్డ తర్వాత తొట్టతొలిసారి రాష్ట్రపతి
పాలన వస్తుందా?’

ఇలా అన్నమాట.
అయితే, ఈలోగా మరో పరిణామం చోటుచేసుకుంది. లేకపోతె ఇది జవాబు దొరకని
ప్రశ్నలాగా మిగిలిపోయేది, ఎవరో అన్నట్టు ‘డౌటింగ్ థామస్’ లకు
చేతినిండా పని పెడుతూ.
ఈరకం ప్రశ్నలపై టీవీల్లో చర్చలు మొదలవుతుండగానే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పిలుపు వచ్చింది, ఖుద్దున ఢిల్లీ
బయలుదేరి రావాల్సిందని.
మరో నాలుగు రాష్ట్రాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, చత్తీస్
ఘడ్ లకు ఎన్నికల ఘడియ దగ్గర పడింది. వాటి విషయం చూడడానికి కేంద్ర ఎన్నికల
కమీషన్ వారానికి రెండుమార్లు, మంగళవారం. శుక్రవారం సమావేశం అవుతూ
వస్తోంది. ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులతో పాటు తెలంగాణా
అధికారిని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు అంటే తెలంగాణాలో ముందస్తు
ఎన్నికలు గురించి కేంద్ర కమీషన్ లో కూడా కొంత కదలిక కనబడుతోందని కొందరు భాష్యం
చెబుతున్నారు.
అదీ నిజమనే అనిపిస్తోంది, ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం చూస్తే.

ఈ పరిణామాల నేపధ్యంలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తధ్యం అనే మాటలు
ఎల్లెడలా వినిపిస్తున్నాయి.
ఇది ఇలా ఉండగానే టీఆర్ఎస్ ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి తెలంగాణా కాంగ్రెస్
పార్టీ కూడా ముందస్తు ప్రకటనలు చేస్తూ తానూ రేసులో ఉన్నాననే సంకేతాలు
బలంగా పంపిస్తోంది. సాధారణంగా ప్రతి విషయానికీ ఢిల్లీ వైపు చూస్తూ,
నిర్ణయాలు తీసుకుకోవడంలో జాప్యం చేస్తారనే అపప్రధను మోస్తున్న కాంగ్రెస్ పార్టీ
ఈ పర్యాయం చాలా ముందుగానే ఎన్నికల ప్రణాళిక వెల్లడిచేసింది. ఆకాశమే
హద్దుగా చేసిన ఎన్నికల వాగ్దానాలు, ఓటర్లకు ఇవ్వచూపిన తాయిలాలు,
కేసీఆర్ ముందస్తు ఎన్నికల ఆలోచనను మరింత ముందుకు నెట్టాయని కూడా
కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. త్వరితగతిన స్పందించడంలో ఏమాత్రం
వెనుకబడిలేమనే సంకేతం ఇవ్వడానికి కాబోలు ఎంతమాత్రం కాలయాపన చేయకుండా విలేకరుల
సమావేశాలు వెనువెంటనే పెట్టి కేసీఆర్ ఏ నిర్ణయం ప్రకటించినా దాన్ని
ఖండించే కొత్త పద్దతికి కాంగ్రెస్ స్వీకారం చుట్టడం ఆ పార్టీలో వచ్చిన
కొత్త మార్పు. ‘ప్రజలను మంచి చేసుకుని అధికారంలోకి తిరిగిరావడం కన్నా
వ్యవస్తలని మేనేజ్ చేసుకుని అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కేసీఆర్ కి
వెన్నతో పెట్టిన విద్య’ అని కాంగ్రెస్ నాయకులు ఘాటయిన విమర్శలకు
దిగుతున్నారు.
రాజకీయాలను, ముఖ్యంగా ఎన్నికలను, అవి ఏ ఎన్నికలయినా సరే, అత్యంత
ప్రతిష్టాత్మకంగా, ఎంతో పట్టుదలగా తీసుకుని చావోరేవో తేల్చుకునే విధంగా
వ్యవహరించే రాజకీయ నాయకుడని కేసీఆర్ కు పేరుంది. దాన్ని నిజం చేస్తూ యాభై రోజుల్లో
వంద ప్రజాశీర్వాద సభలను నిర్వహించి తమ పరిపాలనపై ప్రజల తీర్పును కోరాలని నిర్ణయం
తీసుకోవడం, వేయబోయే ఆ అడుగును తనకు గతంలో కలిసొచ్చిన హుస్నాబాదు నుంచే ఆ
మరునాడే మొదలు పెట్టడం కూడా జరిగింది.
‘ఔర్ ఏక్ బార్ కేసీఆర్’, ‘కంటి ముందే అభివృద్ధి, ఇంటి ముందే అభ్యర్ధి’
అనే ఎన్నికల నినాదాలను బలంగా జనంలోకి తీసుకు వెళ్లేందుకు టీఆర్ఎస్
శ్రేణులు ఫేస్ బుక్, వాట్సప్ వంటి సాంఘిక మాధ్యమాల్లో
ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాయి కూడా. కాంగ్రెస్ పార్టీకి కూడా
ఇటువంటి హైటెక్ ప్రచారాన్ని సమన్వయం చేసే గట్టి యంత్రాంగం లేకపోలేదు. ఆ
మాటకువస్తే, మిగిలిన రాజకీయ
పార్టీలు కూడా ఈ విషయంలో ఎవరికీ తీసిపోలేదనే చెప్పాలి. అయితే ఆయా పార్టీల
అభిమానులు, కార్యకర్తలు తమ పార్టీలని సమర్ధించడానికి, ప్రత్యర్ధి
పార్టీలను బద్నాం చేయడానికి ఈమాధ్యమాలను వాడుకుంటున్న తీరు కొన్ని
విమర్శలకు గురవుతున్న మాట కూడా యదార్ధమే.
‘ఏది మాట్లాడాలి ఏది కూడదు’ అనే విషయంలో నాయకులే స్పష్టత లేక
నోటికివచ్చినట్టు మాట్లాడుతుండడం చూస్తుంటే ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున
మేస్తుందా’ అనే సామెత గుర్తు రాకమానదు.
రానున్న ఎన్నికల్లో ఎన్ని పార్టీలు పోటీకి దిగినా ప్రధాన పోరాటం
టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నడుమే అన్నది బహిరంగ రహస్యం.

కాంగ్రెస్ లో బహునాయకత్వం. ఇది ఒక రకంగా ఆ పార్టీకి బలమూ, బలహీనత. పార్టీ
గుర్తు తోడయితే తమ సొంత బలంతో సునాయాసంగా గెలవగలిగిన వాళ్ళు ఆ పార్టీలో
చాలామంది వున్నారు. అయితే అంతర్గత కలహాల కారణంగా అనేక సందర్భాలలో ఈ బలం
నిర్వీర్యం అయిపోతోంది.
టీఆర్ఎస్ పరిస్తితి వేరు. ప్రాంతీయ పార్టీలకు అధినాయకుడే అసలు బలం. అతడి
శక్తిసామర్ధ్యాలను బట్టే జయాపజయాలు చాలావరకు నిర్ధారణ అవుతాయి. కేసీఆర్
నాయకత్వపటిమే ఆ పార్టీకి శ్రీరామరక్ష. అయినా ఏదోవిధంగా బలమయిన
అభ్యర్ధులను వేరే పార్టీల నుంచి ఆకర్షించే ప్రయత్నం కేసీఆర్
చేస్తున్నారంటే, ఎన్నికల వంటి అతిముఖ్యమైన విషయాల్లో ఆయన ఏమాత్రం చాన్స్
తీసుకునే వ్యక్తి కాదని అర్ధం చేసుకోవచ్చు.

ప్రత్యర్ధి శిబిరాలు కూడా ఈసారి ఛాన్స్ తీసుకోకూడదనే ఆలోచనల్లో వున్నాయి.
కేసేఆర్ అనే ఉమ్మడి రాజకీయ ప్రత్యర్ధిని నిలువరించేందుకు ఆగర్భ రాజకీయ
ప్రత్యర్దులయిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు చేతులు కలిపే ప్రయత్నాలను
ముమ్మరం చేశాయి. ఈ దిశలో సంప్రదింపులను మరింత ముందుకు తీసుకుపోవడానికి
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హైదరాబాదు వచ్చారు. పొత్తులపై
చర్చలు జరపడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధి కూడా ఒక
కమిటీని ఏర్పాటు చేసారు. మరికొన్ని పార్టీలను కలుపుకుని ఒక మహా కూటమి
ఏర్పాటు చేయాలన్నధ్యేయంతో ముందుకు సాగుతున్నట్టు తోస్తోంది. మరి కొద్ది
రోజుల్లో ఈ పొత్తులపై ఒక స్పష్టత వచ్చే అవకాశం వుంది. ఈ సందర్భాలలో పైకి
భావసారూప్యం అనే పడికట్టు పదాలు వినబడుతుంటాయి.కానీ ఇలాంటి కూటములది ఒకే
ధ్యేయం, అధికారంలో ఉన్న ప్రత్యర్ధి పార్టీని గద్దె దింపడం. తమ రాజకీయ
ప్రయోజనాలను తాత్కాలికంగా అయినా కాపాడుకోవడం. గతం చెబుతున్న సత్యం ఇది.

మన ప్రజాస్వామ్యంలో ఉన్న చమత్కారం ఏమిటంటే, అన్ని పార్టీలు ప్రజాస్వామ్య
పరిరక్షణే తమ ఆశయం అంటూనే, మరో పక్క అవకాశం దొరికినప్పుడల్లా ఆ
స్పూర్తికి తూట్లు పొడవడం.

నిజానికి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షకులు ఎవరయ్యా అంటే వాళ్ళు మన సాధారణ
ఓటర్లు. రాజకీయ పార్టీలు కాదు.

పార్టీలు ఎరచూపే ప్రలోభాలకు గురవుతున్నారన్న అపప్రధను మోస్తూ కూడా కేవలం
‘ఓటు’ అనే ఆయుధంతో ప్రభుత్వాలను మార్చగలుగుతున్నది మాత్రం ఆ ఓటర్లే.



రచయిత ఈమెయిల్: bhandarusr@gmail.com, మొబైల్: 98491 30595