27, జనవరి 2017, శుక్రవారం

గీత దాటుతున్న నేతలు


(PUBLISHED IN THE EDIT PAGE OF 'SURYA' TELUGU DAILY ON 29-01-2017,SUNDAY)
కాలం ఎవరికోసం ఆగదు, ఎవరికోసం నిలవదు. అయినా మనిషికి తనమీద తనకు విశ్వాసం అధికం. అందుకే కాలాన్ని జయించాలని కలలు కంటుంటాడు. అధికారంలో వున్నప్పుడు దానికి ఎదురులేదనుకుంటాడు. ఎదురు వుండకూడదని ఆశ పడుతుంటాడు. అందిన అధికారం శాశ్వతం అనే భావనలో ఉంటాడు.  పదవిలో  లేకపోతే, సాధ్యమైనంత త్వరగా అధికార అందలం ఎక్కాలని  ఆత్రుత పడుతుంటాడు. రాజకీయాల్లో ఈ ధోరణి మరింత ప్రస్పుటం.   
గత గురువారం  సాయంత్రం విశాఖ విమానాశ్రయంలో ఎంతో  హడావిడి. ఏం జరగబోతోందో అనే ఆందోళన. ఏదైనా జరక్కపోతుందా అనే ఆసక్తి. ఇక మీడియా దృష్టి మొత్తం అక్కడే. కానీ ఏమీ జరగకుండానే అక్కడికది ముగిసింది.
ఆ మరునాడే అదే విశాఖలో, ప్రభుత్వ ఆధ్వర్యంలో నలభయ్ దేశాల ప్రతినిధులు  పాల్గొనే  భాగస్వామ్య సదస్సు మొదలయింది. రెండు రోజులపాటు సందడే  సందడి. మీడియాలో గంటల గంటలతరబడి సమాచార ప్రవాహం.
సదస్సు ప్రారంభానికి  ముందు రోజు,   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని కోరుతూ విశాఖ సాగర తీరంలో కొవ్వొత్తుల ర్యాలీకి సన్నాహాలు. దానికి చెన్నై మెరీనా తీరంలో జరిగిన జల్లికట్టుతో ముడి. జల్లికట్టుకు, ప్రత్యేకహోదాకు సంబంధం ఏమిటని పాలకపక్షం ఎద్దేవా.
‘కొవ్వొత్తుల ర్యాలీ  భాగస్వామ్య సదస్సుకు అడ్డంకి. అటువంటి చర్యలతో అభివృద్ధికి ఆటంకం కలిగించవద్దంటూ’ ర్యాలీపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం. విశాఖ తీరం పొడవునా రహదారుల దిగ్బంధం. డేగ కన్నులతో పోలీసు పహరా. 
శాంతియుతంగా జరిపే కొవ్వొత్తుల ర్యాలీకి, భాగస్వామ్య సదస్సుకు ముడి పెట్టి మాట్లాడం విడ్డూరంగా వుందని ప్రతిపక్షాల విమర్శ.
చివరికి ఏమి జరిగింది?
కొవ్వొత్తుల ర్యాలీకి ప్రతిపక్ష నేత  హాజరు కాకుండా ప్రభుత్వం నిరోధించగలిగింది. కానీ ఎయిర్ పోర్ట్ ఉదంతంతో జగన్ కు దక్కిన దేశవ్యాప్త ప్రచారానికి అడ్డుకట్ట వేయలేకపోయింది.
ప్రభుత్వం కోరుకున్నట్టుగానే విశాఖలో భాగస్వామ్య సదస్సు అట్టహాసంగా మొదలై, విజయవంతంగా ముగిసింది, కొవ్వొత్తుల ర్యాలీని అనుమతించినా ఇలానే జరిగి వుండేదన్న వ్యాఖ్యానాల నడుమ.
జగన్ ర్యాలీకి రాకూడదని ప్రభుత్వం కోరుకుంది. ప్రభుత్వం కోరుకున్నట్టుగానే  జగన్ ర్యాలీకి హాజరుకాలేకపోయారు. అది ప్రభుత్వ వ్యూహాత్మక విజయం.
జగన్ కోరుకున్నట్టుగా మీడియాలో విస్తృత ప్రచారం లభించింది. అది ఆయనకు అయాచితంగా  దక్కిన గెలుపు.
ప్రత్యేకహోదా అంశంపై జరుగుతున్న రాజకీయ పోరులో తాత్కాలికంగానే అయినా  విజయం ఎవరిని వరించింది? ఎవరు జితులు? ఎవరు పరాజితులు? చంద్రబాబు వ్యూహం ఫలించిందా? జగన్ ఎత్తుగడ జయించిందా? ఈ ప్రశ్నలకు ఎవరి జవాబులు వారు చెప్పుకుంటున్నారు. కానీ నిజానికి గెలిచింది  మాత్రం రాజకీయం.
వర్తమానం నుంచి గతంలోకి తొంగి చూస్తే ఇందుకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. మరెన్నో  పోలికలు కానవస్తాయి.              
ముందు గత గురువారం ఏం జరిగిందో చూద్దాం.  
విశాఖ విమానాశ్రయం.
ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహనరెడ్డి తన బృందంతో విమానం దిగగానే అడ్డుకున్న పోలీసులు. నిరసనగా రన్ వే  పైనే భైఠాయించిన జగన్ బృందం. పోలీసులతో వాగ్వివాదం. అధికారంలోకి రాగానే సంగతి గుర్తు పెట్టుకుంటామని పోలీసులకు హెచ్చరికలు. చివరికి జరిగింది ఏమిటి. ర్యాలీలో పాల్గొనకుండానే విశాఖ నుంచి నేరుగా విమానంలో హైదరాబాదుకు తిరుగు ప్రయాణం.
‘రన్ వే పై నిరసనలా!’ అసహనం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.
ఏడేళ్ళు వెనక్కివెడదాం.
ఔరంగాబాదు విమానాశ్రయం.
బాబ్లీ ప్రాజెక్టు ఆందోళనలో భాగంగా బస్సు యాత్రలో తెలుగుదేశం నేత, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు బృందం అరెస్టు.  వారిని స్వరాష్ట్రం పంపడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానం ఎక్కడానికి చంద్రబాబు నిరాకరణ. ఎయిర్ పోర్ట్ టార్మాక్ మీదనే  భైఠాయింపు. నచ్చచెప్పి వెనక్కి తిప్పి పంపిన పోలీసులు.
‘ఎయిర్ పోర్ట్ లో నిరసనలా? ఏవిటీ విడ్డూరం?’ నాటి పాలకపక్షం కాంగ్రెస్ నాయకుల సన్నాయి నొక్కులు.
ఆనాటి సంఘటన గురించి సుప్రసిద్ధ సంపాదకులు, పత్రికారచయిత ఐ. వెంకటరావు,  చంద్రబాబుపై  రాసిన ‘ఒక్కడు’ అనే గ్రంధంలో గుర్తు చేసుకున్నారిలా.
“మహారాష్ట్ర పోలీసులు వచ్చి ధర్మాబాద్ ఐ.టి.ఐ. ఆడిటోరియంలో వున్న టీ.డీ.పీ. నాయకులను లాగి పడేశారు. కొందరిని చితక బాదారు. ఎం.ఎల్.ఏ.లు, ఎంపీలని చూడకుండా పిడి గుద్దులు గుద్దారు.   పోలీసులు చంద్రబాబునాయుడుతో సహా ఆయన బృందాన్ని బస్సులో ఎక్కించి తీసుకువెళ్ళారు. ఎటు వెడుతున్నారో తెలియని అయోమయం. మంచి నీళ్ళు ఇవ్వలేదు, అల్పాహారం ఇవ్వలేదు. నేరుగా ఔరంగాబాదు విమానాశ్రయానికి తీసుకువెళ్ళారు. మీడియాను రానివ్వలేదు. చంద్రబాబు, మరికొందరు విమానం దగ్గరే బైఠాయింపు జరిపారు. నినాదాలు చేసారు”
దీన్నిబట్టి తెలుస్తున్నదేమిటంటే, పోలీసులు నిమిత్తమాతృలు. ఎవరు అధికారంలో వుంటే వారికి నిబద్దులు. అలా అని అందర్నీ ఒక గాటన కట్టడం కాదు. కర్తవ్యానికి ప్రాధాన్యత ఇచ్చి పోస్టింగులను గురించి  పట్టించుకోనివారు వారిలో కూడా చాలామంది  లేకపోలేదు.
మరి కొంచెం గతాన్ని తడిమితే.
ఎన్నికలకు ముందు ‘వస్తున్నా మీకోసం’ పేరుతొ చంద్రబాబునాయుడు సుదీర్ఘ పాదయాత్ర.
తన పాదయాత్రకు కాంగ్రెస్ ప్రభుత్వం  ఆటంకాలు కల్పిస్తున్నదంటూ పలు సందర్భాలలో ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.  తాము మళ్ళీ అధికారంలోకి వస్తామన్న సంగతిని తమతో సరిగా వ్యవహరించని పోలీసులు గుర్తు పెట్టుకోవాలని టీ.డీ.పీ. నాయకుల హెచ్చరికలు.
ఇంకొంచెం లోతుకుపోయి గతాన్ని మరింత స్పృశిస్తే.
టీ.డీ.పీ. హయాములో వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రతిపక్షనాయకుడిగా వున్నప్పుడు ఆయన తలపెట్టిన పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు కల్పించిన పోలీసులు. ఒక దశలో సహనం కోల్పోయి, నిజామాబాదు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన వై.ఎస్.ఆర్.
ఇలా గుర్తు చేసుకుంటూ పొతే ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో దృశ్యాలు.
వీటన్నిటినీ గమనంలో వుంచుకుంటే అర్ధం అయ్యేది ఏమిటి?
రాజకీయ ప్రకటనలు, స్పందనలు, వ్యాఖ్యలు, విమర్శలు, ఆరోపణలు  అనేవి అధికారంలో వున్నప్పుడు ఒకరకంగా వుంటాయని. ప్రతిపక్షంలో వున్నప్పుడు వేరే విధంగా సాగుతాయని.
రాజకీయ నాయకులు మారరు. మారిందల్లా అధికార మార్పిడి ఒక్కటే. అదే వారినలా మారుస్తుంటుంది.
విచిత్రం ఏమిటంటే రాజకీయ నాయకులకు సమస్తం గుర్తు వుంటుంది. అయితే  వీలునుబట్టి కొన్నింటిని  మరిచిపోయినట్టు కనిపిస్తారు.
వున్న అధికారం శాశ్వతం అని పాలకపక్షం, రానున్న కాలంలో మాదే అధికారం అని ప్రతిపక్షం అనుక్షణం అనుకుంటూ, ఎదురు చెప్పిన వాళ్లకు తస్మాత్ జాగ్రత్త అంటూ  తర్జని చూపిస్తుంటాయి. అలా లేకపోతే రాజకీయాల్లో నిభాయించుకురావడం చాలా కష్టం. బడా నాయకులకే ఇది పరిమితం కాదు, గ్రామస్థాయిలో కూడా ఈ ధోరణి హెచ్చు స్థాయిలోనే వుంటుంది.
సరే! ఈ కధ ఎలాగూ ఇలాగే నడుస్తూవుంటుంది. కాకపొతే,        
‘ఆగండాగండి, మాకూ సమయం వస్తుంది, అప్పుడు మా తడాఖా చూపిస్తాం’ అని ప్రజలు అనకుండా నేతలు జాగ్రత్త పడడం అవసరమేమో! (28-01-2017)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్:  98491 30595  

24, జనవరి 2017, మంగళవారం

ఇంకొక్క నిచ్చెన


654321
ఆరు, అయిదు, నాలుగు, మూడు, రెండు, ఒకటి – అంటే ఆరు లక్షల యాభయ్ నాలుగువేల మూడు వందల ఇరవై ఒకటి.
నా బ్లాగు (https://bhandarusrinivasarao.blogspot.in/)వీక్షకుల సంఖ్య,ఈ అంకెకు చేరింది.
చేర్చిన వారందరికీ అక్షరాలా ఆరు లక్షల యాభయ్ నాలుగువేల మూడువందల ఇరవై ఒక్క వందనాలు.


భండారు శ్రీనివాసరావు 

(654321 అనే ఈ సంఖ్య వెరైటీగా వుందనిపించి ఈ సరదా అన్నమాట) 








‘ఊ’ అంటే వస్తుందా!

2015 లో రాసింది

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ఎక్స్ ప్రెస్ టీవీలో గురువారం  సాయంత్రం  చర్చ జరుగుతోంది.
వై.ఎస్.ఆర్.సీ.పీ. ప్రతినిధి చెబుతున్నారు. 'పుష్కరాలకోసం పదిహేను రోజులు రాజమండ్రిలో మకాం వేసినట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మఠం వేసుకుని కూర్చుని యెందుకు కేంద్రం పై ఒత్తిడి తేవడం లేదన్నది ఆయన ప్రశ్న. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే తమ నాయకుడు జగన్ మోహన రెడ్డి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయాల్సి వస్తోందని ఆయన వివరణ.
టీడీపీ ప్రతినిధి మాట్లాడుతూ, 'తమ నాయకుడు చంద్రబాబు నాయుడు స్పెషల్ స్టేటస్ కోసం అహరహం శ్రమ పడుతున్నారనీ, ఆయనా, కొందరు  మంత్రులు అనేక పర్యాయాలు ఢిల్లీ వెళ్ళి, విజ్ఞాపన పత్రాలు ఇచ్చి వస్తున్నారనీ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం బాబు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదని ఆ ప్రతినిధి ఉవాచ.
బీజేపీ ప్రతినిధి మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చిత్తశుద్దితో కట్టుబడి వున్నారని, రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా తమ పార్టీపై బురద  చల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
ఈ చర్చ తీరుతెన్నులు చూస్తున్నప్పుడు ఓ విషయం గుర్తుకు వచ్చింది.
వెనుకటి రోజుల్లో ఇళ్ళల్లో నాయనమ్మలు, అమ్ముమ్మలు సాయంత్రం  కాగానే పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని కధలు చెప్పేవాళ్ళు. పిల్లలు '' కొడుతూ, కధలు వింటూనే నిద్రలోకి జారుకునే వాళ్లు. అలాటి ఒక కధ ఇది.
'అనగనగా ఓ ఊళ్ళో ఓ ముసలామె వుండేది' కధ మొదలు పెట్టేది బామ్మ.
'' అనేవాళ్ళు పిల్లలు.
'ఆ ముసలావిడ ఓ రోజు బావి గట్టు మీద కూర్చుని బట్టలు కుడుతుంటే చేతిలో సూది జారి నూతిలో పడిపోయింది'
'' అనేవాళ్ళు పిల్లలు ఇంకా చెప్పు అన్నట్టుగా.
'ఊ అంటే వస్తుందా?' అనేది బామ్మ.
'' అనేవాళ్ళు పిల్లలు నోరు తెరిచి.
'' అంటే వస్తుందా' అడిగేది బామ్మ.
బావిలో పడ్డ సూది సంగతేమో కాని,  ఆ కధ మాత్రం అలా  అనంతంగా సాగిపోయేది.
ఇక విషయానికి వస్తే-
ఆంధ్ర ప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ రావాలి. అంటే ఏం చేయాలి?
'జంతర్ మంతర్ లో ధర్నా చేస్తే వస్తుందా?'
'ముఖ్యమంత్రి చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్లలో ఢిల్లీ వెళ్ళి మహాజర్లు ఇచ్చి వస్తే వస్తుందా?'
'బీజేపీ నాయకులు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడి వుంటే వస్తుందా?'
'అసలు వస్తుందా రాదా? వస్తే ఎప్పుడు వస్తుంది?'
'ఎప్పుడా? బావిలో సూది ముసలమ్మ చేతికి  దొరికినప్పుడు'


(30-07-2015)       


మన్ కీ బాత్

ఎక్కడో ఎప్పుడో విన్నట్టుగా వున్న కొన్ని మాటల్ని మళ్ళీ ఓసారి విందాం.మరోసారి మననం చేసుకుందాం.
'విడిపోతున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి'
'అయిదేళ్ళు కాదు పదేళ్లు ఇవ్వాలి'
'ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామనే హామీకి కట్టుబడి వున్నాం'
'ఈ విషయంలో మా చిత్తశుద్ధిని శంకించాల్సిన పనిలేదు, ప్రతిపక్షాలు కావాలనే మా మీద బురద చల్లుతున్నాయి'
'ప్రత్యేక హోదా సాధించేవరకు మేము నిద్రపోము'
'ప్రత్యేక హోదా కోసం మా నాయకుడు అనేక పర్యాయాలు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి మహాజర్లు ఇచ్చివచ్చిన సంగతి ప్రతిపక్షాలు మరిచిపోతున్నాయి'
'మేము అధికారంలోకి రాలేక పోవడం వల్ల గత పార్లమెంటు సాక్షిగా మేము ఇచ్చిన ఈ హామీని నిలబెట్టుకోలేకపోయాము. ఈసారి అధికారంలోకి రాగానే ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చి మా మాట నెరవేర్చుకుంటామని మరో హామీ ఇస్తున్నాము'
'ఇచ్చిన హామీని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు, కేంద్రంపై ఒత్తిడి తేవడంలో బీజేపీ మిత్రపక్షం అయిన టీడీపీ ఘోరంగా విఫలం అయ్యింది'
'పద్నాలుగవ ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు ఇప్పుడు ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్తితిలేదు. విభజన చట్టంలోనే ప్రత్యేక హోదాను కాంగ్రెస్ పొందుపరచి వున్నట్టయితే ఇప్పుడీ పరిస్తితి వచ్చేదే కాదు'
'మేము ఇవ్వలేదు సరే. ఇప్పుడు పార్లమెంటులో బిల్లు ఆమోదింపచేయగల మెజారిటీ వుంది. ప్రత్యేక హోదాకు వీలు కల్పిస్తూ చట్ట సవరణ చేయవచ్చు కదా'
'ప్రత్యేక హోదా కుదరదు అన్న కేంద్ర మంత్రి ప్రకటన ఆంధ్ర ప్రదేశ్ కు వర్తించదు'
'ప్రత్యేక హోదా కుదరని పక్షంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం'
'రాజీనామాల వల్ల ప్రత్యేక హోదా వచ్చేటట్టయితే అందుకు మేము సిద్ధం'
ఇవన్నీ ఏడాది కాలంగా వినీ వినీ ప్రజల చెవులకు తుప్పు పట్టింది. అవే మాటలు పదేపదే వింటూ రావడం వల్ల పట్టిన చెవుల తుప్పు ఒదిలిపోయింది కూడా. అందుకే ప్రజలకు ఇప్పుడు సర్వం అర్ధం అవుతోంది. రాజకీయ పార్టీల అసలు తత్వం బోధపడుతోంది.
నిజానికి ఈ మాటలు అన్నీ పైకి చెప్పేవి. మనసులోని మాటలు వేరే.
'ఇవ్వచ్చు. కానీ దగ్గర్లో ఎన్నికలు లేవు. ఇప్పుడు ఇస్తే ఏమిటి లాభం?'
'ఇప్పుడే ఇవ్వాలి. ఎన్నికలకు ముందు ఇస్తే మాకేమిటి లాభం'
'ఇవ్వడం వల్ల మా పార్టీకి ప్రస్తుతం ఎలాటి లాభం లేదు. పైగా నష్టం కూడా. కానీ రాజకీయ ప్రయోజనాలకోసం పోరాడక తప్పదు. రోడ్డెక్కక తప్పదు'
మనసులో మాట అనండి, మన్ కీ బాత్ అనండి. అసలు విషయం ఇది.
(ఏడాది క్రితం రాసింది)

20, జనవరి 2017, శుక్రవారం

శ్వేతసౌధం నుంచి ‘నల్ల సూరీడు’ నిష్క్రమణ

(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 22-01-2017, SUNDAY)

యావత్ ప్రపంచానికి అధికార కేంద్రంగా చెప్పుకునే అమెరికాలో భారత కాలమానం ప్రకారం జనవరి ఇరవయ్యవ తేదీ, శుక్రవారం రాత్రి పదిన్నర గంటలకు అధికార మార్పిడి జరిగింది. సంచలనాలకు మారు పేరుగా మారిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది నవంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధి మిసెస్ హిల్లరీ క్లింటన్ పై అనూహ్య విజయం సాధించిన దరిమిలా ఆ దేశంలో ఒబామా నేతృత్వంలో సాగుతున్న ఎనిమిదేళ్ళ పాలనకు తెర పడింది. అయితే అమెరికా రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నవంబరులో ముగిసి ఫలితాలు వెల్లడి అయినప్పటికీ, కొత్త అధ్యక్షుడు పదవీ ప్రమాణ స్వీకారం చేసి అధికార బాధ్యతలు స్వీకరించడం మాత్రం జనవరిలోనే జరగాల్సివుంటుంది. ఆ ప్రకారమే  ప్రజలు ఎంపిక చేసుకున్న కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20వ తేదీన శ్వేతసౌధంలో అడుగు పెట్టారు. రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా ఎన్నికయి, అదే  భవనంలో నివాసం వుంటున్న ప్రెసిడెంట్  బరాక్  ఒబామా ఒక సాధారణ పౌరుడిగా వైట్ హౌస్ నుంచి బయటకు అడుగు పెట్టారు.
రెండు పర్యాయాలు, అంటే  మొత్తం ఎనిమిది సంవత్సరాలు అత్యున్నతమైన అమెరికా అధ్యక్ష పదవిలో వుంటూ, ఆ దేశపు రాజ్యాంగం ప్రకారం పదవినుంచి తప్పుకుంటూ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా చేసిన సాంప్రదాయ  వీడ్కోలు ప్రసంగం ప్రపంచ వ్యాప్తంగా బహుళ ప్రచారం పొందింది.  ఈ సందర్భంగా ఒబామా,  తన పదవీ కాలంలో సాధించిన విజయాలను, చేయాలని గట్టిగా అనుకుని కూడా చేయలేని కొన్ని  పనులను ఏకరవు పెట్టారు. ఉద్వేగం ఆపుకోలేక  ఒక దశలో కంట తడిపెట్టారు కూడా.  

      
వర్ణ వివక్ష మూలాలు కలిగిన  అత్యంత సంపన్న దేశానికి ఒబామా  ఎనిమిదేళ్ళు తిరుగులేని అధినేతగా వున్నారు. కంటి చూపుతో ప్రపంచ దేశాలను శాసించగల అపరిమిత అధికారాలను అనుభవించారు. జన్మతః ఆఫ్రికన్ అమెరికన్  అయిన ఒబామా అమెరికా  దేశాధ్యక్షుడు కాగలిగారంటే అది అమెరికన్ల  ప్రజాస్వామ్య స్పూర్తికి అద్దం పడుతుంది. అయితే, ఒబామా తన వీడ్కోలు ప్రసంగంలో అమెరికన్ సమాజంలో ఈనాటికీ అవశేషాలుగా మిగిలివున్న జాత్యహంకార ధోరణులను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం.
సాధారణంగా రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షపీఠాన్ని అధిరోహించిన వారు ఆ పదవిని వీడిపోయే సమయానికి ఏదో ఒక విధమైన ఆరోపణల మరకలు అంటించుకోవడం పరిపాటిగా మారిన అమెరికాలో ఈ నల్ల సూరీడు మాత్రం  ఎటువంటి మచ్చా లేకుండా పదవీ విరమణ చేయడం ఆయన వ్యక్తిత్వ శోభని తెలియచెప్పుతుంది. అమెరికా అధ్యక్షులగురించి గతంలో  అనేక రకాల ఆరోపణలు, అధికార దుర్వినియోగం, వివాహేతర సంబంధాలు ఇలా ఎన్నో కధనాలు, ఊహాగానాలు  వెలువడిన ఘన చరిత్ర కలిగిన ఆ దేశంలో ఒబామా మాత్రం పులుకడిగిన ముత్యంలా పదవికి గుడ్ బై చెప్పడం విశేషం. ఒబామా కానీ, ఆయన భార్యాపిల్లలు కానీ నలుగురి నోళ్ళలో నానే విధంగా వైట్ హౌస్ లో ఏనాడూ ప్రవర్తించలేదు. మాటా మన్ననా వారి వ్యక్తిత్వ శోభని మరింత పెంచాయి. 
అభిజాత్య అమెరికన్ సమాజంలో అధికారం కూడా తోడయితే ఆ వ్యక్తుల ప్రవర్తన ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. కానీ ఈ సాధారణ అభిప్రాయానికి భిన్నంగా ఆయన అసాధారణ రీతిలో తన నడవడికను ప్రదర్శించి అమెరికా అధ్యక్షులు ఇలాగా కూడా వుంటారు అని నిరూపించారు. ఎనిమిదేళ్ళ పదవీ కాలంలో ఇలాటి సందర్భాలు, సన్నివేశాలు కొల్లలుగా కనిపిస్తాయి.
మచ్చుకి కొన్ని.
నిజమా! నిజంగా నిజమని నమ్మలేం అనిపించే ఈ సంఘటన నిజంగానే  జరిగింది. ప్రెసిడెంట్ ఒబామా స్వయంగా చెప్పకపోతే అసలీవిషయం  బయటకు పొక్కేదే కాదు. నమ్మడానికి వీల్లేని ఈ కధా కమామిషూ ఏమిటంటే-
ఒకసారి న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశాల్లో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షులవారు సతీ సమేతంగా వాషింగ్టన్ నుంచి బయలుదేరి ఆ నగరం వెళ్ళారు. అక్కడ గడిపిన రోజుల్లో  ఓ రోజు వీలుచేసుకుని హోటల్లో భోజనం చేయడానికి  భార్యను వెంటబెట్టుకుని వెళ్ళారు. అమెరికా ప్రెసిడెంటు ఏమిటి? హోటల్లో భోజనం ఏమిటి? అనే సన్నాయి నొక్కుళ్ళు మనదేశంలోనే.
సరే! హోటల్లో దంపతులిద్దరూ  మాట మంతీ చెప్పుకుంటూ భోజనం ముగించిన తరువాత బిల్లు చెల్లించడానికి క్రెడిట్  కార్డు తీసిచ్చారు. అది తీసుకువెళ్ళిన బేరర్ అంతే వేగంతో తిరిగొచ్చి, 'ప్రెసిడెంట్! మీ క్రెడిట్  కార్డు చెల్లదు' అని చావు కబురు చల్లగా చెప్పాడు.   పక్కన భార్య వుండబట్టీ, ఆవిడ తన కార్డు తీసి ఇవ్వబట్టీ ప్రెసిడెంట్ ఒబామా గారి పరువు ఆ పూటకు నిలబడింది. అయితే ఈ వ్యవహారం వెంటనే బయటకు పొక్కలేదు. తరువాత ఎప్పుడో  ఒక  మీటింగులో మాట్లాడుతూ ఒబామా మహాశయులే మాటవరసకు అన్నట్టు ఈ మాట బయటపెట్టారు. క్రెడిట్ కార్డ్లు, వాటి భద్రత గురించి జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయం స్వయంగా ఒబామా గారే వెల్లడించడంతో ఈ కధనం  మీడియాలో గుప్పుమంది.
బరాక్ హుస్సేన్ ఒబామా అమెరికా  అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అన్నది – 2001 సెప్టెంబర్ 11వ తేదీన అల్ ఖయిదా విసిరిన పంజా దెబ్బకు ఆ దేశం గడగడ లాడిన తరువాతనే జరగడం గమనార్హం. తమ పోరు ఉగ్రవాదం మీదనే కాని ఒక మతం మీద కాదన్న పద్ధతిలో అమెరికన్ వోటర్లు తీర్పు ఇచ్చినట్టు అప్పట్లో పత్రికలు పొగడ్తల వర్షం కురిపించాయి. శ్వేత జాతీయులకు వర్ణ వివక్ష ఎక్కువ అనే అపప్రదని సమూలంగా తొలగించుకుంటూ అమెరికా దేశీయులు బరాక్ హుస్సేన్ ఒబామాను అధ్యక్షుడిగా ఎన్నుకున్నప్పుడు యావత్ ప్రపంచం ఎంతగానో పులకించిపోయింది. వొంటి రంగు మూలంగా పాశ్చాత్య దేశాలలో అదేమాదిరి వివక్షను ఎంతోకొంత ఎదుర్కొంటున్న భారతీయులు సయితం ఒబామా విజయాన్ని తమ గెలుపుగా భావించి పండగ చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి  ముందూ, ఆ తరువాతా నేను క్రైస్తవుడినేఅని బరాక్ హుస్సేన్ ఒబామా బహిరంగంగా ప్రకటించుకున్నప్పటికీ, ముస్లింగా ధ్వనించే తన పేరును మాత్రం మార్చుకోలేదు. అధ్యక్షుడిగా ఎన్నికయిన తరువాత టర్కీలో జరిపిన తొలి విదేశీ పర్యటనలో మసీదులోకి పాదరక్షలతో ప్రవేశించడం అప్పట్లో వివాదాస్పదమయింది కూడా. అయినా ఒబామా విశ్వ శాంతికి చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.

అలాగే మరొక  స్వానుభవం.
ఇది జరిగి కొన్నేళ్ళు అవుతోంది.
అమెరికా పశ్చిమతీరంలోని  సియాటిల్ నగరంలో కాపురం వుంటున్న మా పెద్దబ్బాయి సందీప్ కుటుంబంతో కొన్నాళ్ళు గడపడానికి నేనూ మా ఆవిడా వెళ్ళాము. అక్కడ కూడా టీవీ ఛానళ్ళ హడావిడి ఎక్కువే. ఒకరోజు పర్యటనపై  ఆ నగరానికి వచ్చివెడుతున్న  అమెరికా ప్రెసిడెంట్ -  ఎయిర్ ఫోర్స్ వన్ విమానానికి అధికారులు క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఒబామా  ఎయిర్ పోర్ట్ లోనే కొద్దిసేపు  వుండిపోవాల్సివచ్చిందని స్క్రోలింగులు పరుగులు పెట్టాయి. అయితే అసలు విషయం మరునాడు పేపరు చూస్తే తెలిసింది. ఒక రోగిని తీసుకువస్తున్న హెలికాప్టర్  దిగడానికి వీలుగా అధ్యక్షుడి విమానాన్ని కొద్దిసేపు ఆపేశారని ఒక  వార్త సారాంశం.
ఉపశృతి:
అమెరికా నలభయ్ అయిదవ అధ్యక్షుడిగా పదవిని స్వీకరించిన డోనాల్డ్ ట్రంప్, ఎనిమిదేళ్ళ తరువాత శ్వేతసౌధం వీడిన బరాక్ ఒబామా, వీరిద్దరికీ తమ భార్యల గురించి వింతయిన అభిప్రాయాలు వున్నాయి.  ఇటువంటి సరదా వ్యాఖ్యలు సరదాగా చేస్తారు కాబట్టి వాటిని సరదగా తీసుకుంటే ఏ ఇబ్బందీ వుండదు. 
రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాను అన్నమాటేకాని నిజానికి సుఖపడిందేమీ లేదు. మొదటి భార్య నన్ను వొదిలేసింది. రెండో ఆవిడ ఆ పని చెయ్యకపోగా ముగ్గురు పిల్లలకు తండ్రిని చేసింది.” – డొనాల్డ్ ట్రంప్
మంచి భార్యకో మంచి లక్షణం వుంటుంది. తప్పు తనదైనప్పుడు భర్తను ఉదారంగా క్షమిస్తుంది.”- బరాక్ ఒబామా



17, జనవరి 2017, మంగళవారం

రెండు చావులు


నిజానికి ఇది జనవరి మొదట్లోనే రాయాలి.
తెలుగు సినిమాలు, తెలుగు జీవితాలు సెంటిమెంటు మీద ఆధారపడి నడుస్తున్నాయి. కొత్త ఏడాది ఆరంభాన్ని చావులతో మొదలు పెట్టడం ఎందుకనే సందేహం నన్ను నిలువరించింది. అంచేతే ఈ కాలయాపన.
పుట్టిన ప్రతివారికీ మరణం తప్పదు. ఎవరు ఎప్పుడు అనేదే తెలియదు. ఎలా అన్నదే ఆ మనిషి ఎటువంటి బతుకు బతికాడు అన్నది తెలుపుతుంది.
ఈరోజు ఆమె చనిపోయి పన్నెండో రోజు. చుట్టపక్కాలు అందరూ వచ్చారు. ఆమె అనాయాస మరణం గురించి మననం చేసుకున్నారు. కోటికొక్కరికి మాత్రమె  దొరికే వరం అది.
ఆ రోజు రాత్రి భార్యా భర్తా ఇద్దరూ భోంచేసి చెరో సోఫాలో పడుకుని  టీవీ చూస్తున్నారు. కాసేపటి తరువాత భార్య సోఫానుంచి చేతులు వేలాయడం భర్త కళ్ళ పడింది. చుట్టుపక్కల వారిని లేపి దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకు వెళ్ళే సరికి అంతా అయిపొయింది. విగత జీవిగా ఆవిడ ఇంటికి తిరిగొచ్చింది.
ఇక రెండో సంఘటన.
కొత్త  సంవత్సరం  కనిపెంచిన వారితో గడుపుదామని ఆమె అమెరికా నుంచి ఇండియా వచ్చింది. హైదరాబాదు విమానాశ్రయంలో తండ్రిని చూడగానే ఆమెకు కళ్ళనీళ్ళు తిరిగాయి. ఆయనలో ఏదో తేడా.
ఆందోళన వున్నా అత్తవారింటికి ముందు వెళ్ళడం కోడలిగా తన విధి. తప్పదు. అలాగే వెళ్ళింది.
మర్నాడు పొద్దున్నే  ఫోను. నిన్న కనపడ్డ తండ్రి ఈ రోజు లేడు. ఇది జరిగే పనా.
అయినా జరిగింది.

విధి వైపరీత్యం అంటే ఇదే!  

ప్రచారాలు


ఈ రోజు ఉదయం ఊబెర్ లో వెడుతున్నాను. డ్రైవర్ పేరు పెండ్యాల సత్యనారాయణ. మా ఊళ్ళో కూడా పెండ్యాల ఇంటి పేరుకలవాళ్ళు వున్నారు. మాటల్లో చెప్పాడు. రెండేళ్ళ క్రితం ఈ కారు కొనుక్కున్నాడట. అంతకు పూర్వం తను డ్రైవరుగా పనిచేసిన యజమాని మాట సాయం వల్ల కారు లోన్ లభించిందనీ, ఆయన పేరు రామచంద్ర మూర్తిగారనీ చెప్పాడు. స్టీరింగు ముందు కూర్చోగానే  సాయం చేసిన  ఆయన్ని ప్రతిరోజూ  గుర్తు చేసుకుంటానని  చెప్పాడు. సంభాషణ కొనసాగిస్తే తేలింది ఏమిటంటే ఆ రామచంద్ర మూర్తిగారు, ఇప్పుడు సాక్షిలో ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్ర మూర్తి గారు ఒక్కరేనని. మూర్తిగారు హెచ్.ఎం.టీ.వీ. లో పనిచేసేటప్పుడు ఈ సత్యనారాయణ గారు  అయిదేళ్లపాటు ఆయన కారు డ్రైవరుగా వున్నాడట.
ఇది ఎందుకు చెబుతున్నాను అంటే, చేసిన పని గురించి గొప్పలు చెప్పుకునే ప్రచార యుగంలో ప్రస్తుతం  జీవిస్తున్నాము. అందుకే చిత్రంగా అనిపించింది. మంచి పని చేసి కూడా దాన్ని చెప్పుకోని కాలాన్ని చూసినవాడిగా కొన్ని విషయాలు రాయాలనిపించి రాస్తున్నాను.
మొన్నీ మధ్య ఒక పెద్దమనిషి చెప్పాడు, పెన్షనర్ల కోసం మోడీ జీవన్ ప్రమాణ్ అనే పేరుతొ ఒక మంచి పధకం ప్రవేశ పెట్టారని. నిజమే. నేనూ వెళ్లి నా పేరు నమోదు చేసుకున్నాను.



తాము ఇంకా బతికే వున్నామని, అందుకు  రుజువుగా పెన్షనర్లు ప్రతియేటా తమ బ్యాంకుకు వెళ్లి అక్కడి అధికారి ఎదుట హాజరయి ఒక సర్టిఫికేట్ సమర్పించుకోవాలి. పెద్దతనంలో ఎక్కడో ఏ ఊళ్లోనో పిల్లల  దగ్గర శేష జీవితం గడిపే పెన్షనర్లు ఇలా బ్యాంకుల చుట్టూ తిరగడం ప్రయాసే. ఈ జీవన్ ప్రమాణ్ వల్ల ఆ ఇబ్బంది వుండదు. ఉంటున్న ఊళ్లోనే ఏదైనా బ్యాంకుకు వెళ్లి బొటనవేలి ముద్ర ద్వారా ఈ పని పూర్తి చేసుకోవచ్చు. దేశంలో ప్రస్తుతం పనిచేసే సిబ్బంది కంటే పదవీ విరమణ చేసి పించను పుచ్చుకుంటున్న వాళ్ళ సంఖ్యే ఎక్కువ. కాబట్టి అలాంటి వాళ్లకి ఇది వరప్రసాదమే. ప్రయోజనం పొందిన వాళ్ళే చెబుతారు, ఇది మోడీ పుణ్యం అని. కానీ అలా జరగడం లేదు, ఇది మోడీ ప్రవేశపెట్టిన పధకం అంటూ ప్రచారం చేయడం విడ్డూరం అనిపిస్తుంది. మోడీ చేస్తున్న పెద్దపెద్ద పనులు ఇంకా చాలా వుంటాయి. ఇలా ప్రతి పనిని ఆయన ఖాతాలో వేయడం వల్ల ఆయన వ్యక్తిత్వ శోభ ఇనుమడిస్తుందని నేనయితే అనుకోను. ఇందుకు ఒక ఉదాహరణ చెబుతాను. గతంలో ఒకసారి కొన్ని మందుల కోసం సీ.జీ.హెచ్. క్లినిక్ కి వెళ్లాను. కొన్ని మందులు ఇచ్చారు. మరి కొన్ని స్టాక్ లో లేవన్నారు. బయటకు వస్తుంటేనే సెల్ లో ఎస్సెమ్మెస్ వచ్చింది. ‘మీరు ఇన్ని మందులు  తీసుకున్నారు, మిగిలిన మందుల కోసం ఇండెంటు పెట్టారు, పలానా రోజున వచ్చి వాటిని పట్టుకెళ్ళమని’. నేను ఎంతో ఆశ్చర్య పోయాను. ఆ రోజుల్లో ప్రధాని మన్మోహన్ సింగ్. కానీ ఎవ్వరూ ఈ మంచి పని చేసింది ఆయన అని ప్రచారం చేయలేదు. జనత ప్రభుత్వ హయాములో రైల్వే మంత్రి మధు దండావతే  స్లీపరు కోచీల్లో చెక్క బల్లల స్థానంలో మెత్తగా వుండే పరుపుల బెర్తులు వేయించారు. సాధారణ రైల్వే ప్రయాణీకులకు అదొక పెద్ద ఊరట. కానీ ఆయన ఎప్పుడూ తను ఈ పనిచేశానని చెప్పుకోలేదు. ఆయన అనుయాయులూ చెప్పలేదు. అలాగే రైల్వేలలో రిజర్వేషన్లు కంప్యూటరైజ్ చేసిన తరువాత ఒనగూరిన ప్రయోజనాలు చెప్పక్కర లేదు. కానీ ఏ ప్రభుత్వం వాటికి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేయలేదు. అలా ఒక్కొక్క ప్రభుత్వ హయాములో ఒక్కొక్క మంచి పని జరుగుతూనే వుంటుంది. అలా మంచి పనులు చేస్తూ పోవడం తమ బాధ్యతగా భావించాలి కానీ తామే అన్నీ చేస్తున్నాం అని పదేపదే చెప్పుకోవడం, ప్రచారం చేసుకోవడం వల్ల ప్రజల దృష్టిలో పలచన పడే అవకాశం వుంటుంది.
కొన్ని ప్రధానమైన విధాన నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటికి సంబంధించి ప్రభుత్వాలు కానీ వాటి నేతలు కానీ, వారి అనుయాయులు, అభిమానులు కానీ  ప్రచారం చేసుకుంటే అభ్యంతర పెట్టాల్సింది ఏమీ వుండదు.
మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు ఒక గేయంలో రాశాడు ఇలా:

“ప్రచారాల తెరలుడుల్చి ప్రతిభ చూపనోపకు!”                              

16, జనవరి 2017, సోమవారం

ఒక పూట కోటీశ్వరుడు

దాదాపు నలభయ్ ఏళ్ళయింది కోటు వేసుకుని. అదీ మాస్కో చలికోసం.


మళ్ళీ ఇన్నాల్టికి ఓ టీవీ పుణ్యమా అని కోటు వేసుకోవాల్సిన పని పడింది. బ్లూ మాట్ నేపధ్యంలో బ్లూ కలర్ అక్కడ నిషిద్దం. మామూలుగా షూట్ చేసే స్టూడియో కాకుండా వేరే స్టూడియోలో చర్చ పెట్టడం వల్ల నేను వేసుకున్న బ్లూ కలర్ బుష్ షర్ట్ అక్కడి కెమెరా కంటికి బొత్తిగా  నచ్చలేదు. అంచేత అప్పటికప్పుడు వాళ్ళ వాడ్రోబ్ నుంచి ఒక కోటు తెచ్చి నాకు కప్పారు. చలికాలం బాగానే వుంది కానీ మాట్లాడింది రైతుల ఆత్మహత్యల మీద. ఆ చర్చాంశానికి ఈ కోటు అవతారం బొత్తిగా పొసగదని నాకనిపించింది. కానీ ఏం చేస్తాం విధికి తలవంచక తప్పలేదు.

అదృష్టం ఏమిటంటే మా ఆవిడ ఇటువంటి చర్చలు బొత్తిగా చూడదు. లేకపోతే ఈ చొక్కా మార్పిడి వ్యవహారం మా ఇంట్లో పెద్ద చర్చనీయాంశం అయ్యేది. మనలో మాట. ఆవిడ ఈ ఫేస్ బుక్ వైపు కూడా కన్నెత్తి చూడదు. అదన్నమాట. 

లాభ శాతమెంత? నష్ట శాతమెంత?


“నాలుగు పెంచు, మూడు తగ్గించు, మరో రెండు తగ్గించి అయిదు పెంచు. అలానే ఒకటి తగ్గించి ఇంకోటి పెంచు. ఆరు తగ్గించి అయిదు పెంచు.”
“ఏవిటీ లెక్క అర్ధం లేకుండా!”

“అర్ధం చేసుకోవాలి నాయనా! ఈ లెక్కల్ని తెలుగులో పెట్రో ధరలు అంటారుష”   

15, జనవరి 2017, ఆదివారం

వార్తలు చదువుతున్నది దుగ్గిరాల పూర్ణయ్య


నా రేడియో సహోద్యోగి నాగసూరి వేణుగోపాల్ ఈరోజు ఒక ఫోటో పోస్ట్ చేశారు. అది చూడగానే సంతోషం, విచారం ఏకకాలంలో ముప్పిరిగొన్నాయి.
మాస్కో రేడియోలో పనిచేయడానికి వెళ్ళే ముందు దుగ్గిరాల పూర్ణయ్య గారిని ఢిల్లీలో కలిసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నాను. గంభీరమైన స్వరం. వార్తలు విరిచినట్టు చదవడంలో ఒక ప్రత్యేకమైన బాణీ. రేడియో వార్తలు సగంలో విన్నా కూడా చప్పున చెప్పేయొచ్చు వార్తలు చదివేది పలానా అని. ఎందరో శ్రోతలు, ఎందరో అభిమానులు. అలా గడిచి పోయింది వారి రేడియో జీవితం.
ఇప్పుడు గుడివాడ దగ్గర అంగలూరులో శేష జీవితం గడుపుతున్నట్టు వేణుగోపాల్ వల్ల తెలుస్తోంది. వారి ఫోటో చూసినప్పుడే గుండె బరువెక్కింది.
కాలం తెచ్చే మార్పులు తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు.

(కింద ఫోటోలో: దుగ్గిరాల పూర్ణయ్య, కర్టెసీ: నాగసూరి వేణుగోపాల్, ఆలిండియా రేడియో)  

   


ఫేస్ బుక్కు కలిపింది ఇద్దరినీ...


ఆవిడ పేరు దుర్గ. బాండ్ జేమ్స్ బాండ్ మాదిరిగా దుర్గ, కనకదుర్గ.
ఆవిడ పేరు సీత.
ఓ యాభయ్ ఏళ్ళ క్రితం బెజవాడ గవర్నర్ పేట లో పాటిబండ అప్పారావు వారింట్లో అద్దెకు వుండేవాళ్ళు. మాంటిసొరీ స్కూల్లో ఆడుతూ పాడుతూ చడువుకుంటూ వుండేవాళ్ళు. ఆ ఇద్దరి స్నేహం  అంతా ఇంతా కాదు, చదువయినా, ఆటలయినా ఇద్దరూ కలిసే.
చదువు అయిపొయింది అని అనుకునే లోగా ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అవడం షరా మామూలు. అల్లాగే  పెరిగి పెద్దయిన తరువాత జరిగిన పెళ్ళిళ్ళు చిన్నప్పటి స్నేహితులను విడదీశాయి. అప్పటి నుంచీ ఎక్కడా కలిసింది లేదు, ఎదురుపడ్డదీ లేదు. అలా యాభయ్ ఏళ్ళు గడిచిపోయాయి.
ఫేస్ బుక్ లో నా రాతలు, పెట్టే మా ఆవిడ  ఫోటోలు చూసి సీతగారికి మనసు మూలల్లో అనుమానం, తన చిన్ననాటి స్నేహితురాలు కాదు కదా! అని. అనుకోవడం తడవు వారి భర్త  గౌరవరం సుబ్బారావు గారి సహకారంతో ఫేస్ బుక్ లో నా నెంబరు పట్టుకుని ఈ సాయంత్రం ఫోను చేశారు. అంతే! చిన్నప్పటి స్నేహితురాండ్రు ఫోనుకు అతుక్కుపోయారు.
చిన్నతనంలో పాటిబండ వారి మేడపై తొక్కుడు బిళ్ళల ఆటలు,  అప్పారావు గారి భార్య తన పిల్లల్ని, అద్దెకు ఉండేవారి పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని గోరుముద్దలు తినిపించిన వైనాలు అన్నీ వారి ముచ్చట్ల నడుమ గిర్రున తిరిగాయి.
సుబ్బారావు గారితో నేనూ మాట్లాడాను. ఆయన ఎన్ ఎఫ్ సీ ఎల్ లో పని చేసి రిటైర్ అయ్యారు. భార్యాభర్తలు ఇద్దరూ సత్యసాయి భక్తులు. తరచుగా పుట్టపర్తి వెళ్లి సాయి ఆశ్రమంలో సేవలు చేస్తుంటారు.

ఏది ఏమైనా అరవై ఏళ్ళు దాటిన తరువాత మా ఆవిడకు ఒసేయ్, ఏమే అనే ఫ్రెండు దొరికింది. శుభం!    

14, జనవరి 2017, శనివారం

అమరుడు జంధ్యాల


ఈరోజు ఉదయం నుంచి వందల ఫోన్లు. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడం కోసం కాదు, ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన  జంధ్యాలపై నా  వ్యాసం గురించి.
ఇంతటి అభిమాన ధనం కూడబెట్టుకున్న జంధ్యాల అమరుడు. కాబట్టే ఇంతటి స్పందన.  
పోతన పద్యం గుర్తుకు వచ్చింది, ‘కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ...’
జంధ్యాల గురించి రాయడం వల్లనే నా రచనకి ఇంతటి గుర్తింపు.
ఆంధ్రజ్యోతి సంపాదకవర్గానికి కృతజ్ఞతలు.

-భండారు శ్రీనివాసరావు      

9, జనవరి 2017, సోమవారం

జంధ్యాలకో నూలుపోగు


(PUBLISHED IN 'ANDHRA JYOTHY' TELUGU DAILY ON 14-01-2017, SATURDAY)
(జనవరి 14 జంధ్యాల జయంతి) 
జంధ్యాల వీర వేంకట దుర్గా శివ సుబ్రమణ్య శాస్త్రి. ఇంగ్లీష్ అక్షరాల్లో పొడి పొడిగా రాస్తే జే.వీ.డీ.ఎస్. శాస్త్రి. ఇంకా పొడి చేసి  క్లుప్తంగా  చేస్తే జంధ్యాల. 
మొదటి పొడుగాటి  పేరు బారసాలనాడు బియ్యంలో రాసి పెట్టింది. రెండోది, కాస్త పొట్టిపేరు, స్కూలు, కాలేజీ రికార్డుల్లో రాసుకున్నది. ముచ్చటగా మూడోది ‘జంధ్యాల’ అనే ‘కలం పేరు’ చిరస్థాయిగా  వెండి తెరపై స్థిరపడిపోయిన పేరు. తెలుగు హాస్యానికే వన్నె తెచ్చిన పేరు. అందుకే,  తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకుని అలా  వుండిపోయింది.
ఈ భూమ్మీద పడ్డ ప్రతి బిడ్డా ఏడుస్తూనే కళ్ళు తెరుస్తుంది. 1951లో నరసాపురంలో  జంధ్యాల పుట్టినప్పుడు బొడ్డు కోసిన మంత్రసాని జాగ్రత్తగా గమనించి వుంటే, ఏడుస్తున్న ఆ పిల్లాడి పెదవుల నడుమ సన్నటి నవ్వుతెర కనిపించి వుండేదేమో.
జంధ్యాల  నాన్నగారు జంధ్యాల నారాయణమూర్తి బెజవాడలో పేరుమోసిన వ్యాపారి. అనేక జిల్లాలకు బుష్ రేడియో డీలరు. ఆ రోజుల్లో రేడియోలకి మంచి గిరాకి. అంచేత నారాయణ మూర్తిగారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగిపోయింది.
పుటకల నాటికే జంధ్యాల బంగారు పిచిక. బీసెంటు రోడ్డులో ఏడంతస్తుల భవనం.
(ఏడంటే ఏడు అనికాదు, పెద్ద భవనం అని కవి హృదయం. నిజంగానే చాలా  పెద్ద ఇల్లు. ఎదురుగా వున్న మోడరన్ కేఫ్ కంటే ఎత్తుగా వుండాలని నారాయణమూర్తిగారు ముచ్చట పడి కట్టించుకున్నారని ఆరోజులనాటి ముచ్చట) అది కట్టుకున్నాక వాళ్ళ నివాసం, క్షీరసాగర్  కంటి ఆసుపత్రి దగ్గర నుంచి బీసెంటు రోడ్డుకి మారింది.
మాచవరం ఎస్సారార్ కాలేజీలో మేము, అంటే జంధ్యాల, నేను ఒకే బెంచిలో కూర్చుని బీకాం చదువుతున్నట్టు నటిస్తున్నరోజుల్లో  కాలేజీ   ప్రిన్సిపాల్ తో సహా అయ్యవార్లందరూ సైకిళ్ళమీద కాలేజీకి వస్తుండేవారు.  మన జేవీడీఎస్ శాస్త్రి  మాత్రం, అంబాసిడర్ కారులో వెనక సీట్లో కూర్చుని  దర్జాగా వచ్చేవాడు. డ్రైవరు డోరు తెరిచి నిలబడితే కారు దిగి కాలేజీలో కాలు పెట్టే జంధ్యాలకు  ‘కారున్న కుర్రకారు’ అని పేరు పెట్టింది కూడా నేనే.
చదువులోనే కాకుండా  శాస్త్రి, ఇతర విషయాల్లో కూడా  ముందుండేవాడు. కాలేజీ కల్చరల్ అసోసియేషన్ కు ఆయనే మకుటంలేని కార్యదర్శి. కవితలు, గేయాలు గిలికే అలవాటున్న నాకు కూడా  ఆ మకుటంమీద కన్నుపడింది. వెనకాముందూ చూసుకోకుండా ఏకంగా  ఆయనపైనే  పోటీ చేశాను. అయితే ఆయన మకుటం గట్టిది, నేను కొట్టిన దెబ్బ ఓటిది అని ఇట్టే తేలిపోయింది. ఓడిపోతే పోయాను కానీ, ఆయనతో నా స్నేహం  గట్టిపడింది. ఆయన మిత్ర బృందంలో నాకూ స్థానం దొరికింది. ఇక ఆ మూడేళ్ళూ కలిసే తిరిగాము చదువయినా, సంధ్యయినా.


(జంధ్యాల కాలేజి రోజుల్లో ఫోటో)

జంధ్యాల రాసిన ‘సంధ్యారాగంలో శంఖారావం’  నాటకం రిహార్సల్స్  హనుమంతరాయ గ్రంధాలయంలో వేస్తుంటే  వెంట నేనూ  వుండేవాడిని,  ఏ వేషమూ వేయకపోయినా. ఏదో కవితలు గిలకడం వచ్చనే పేరు నాకూ వుండేది. దాంతో మా స్నేహం మరింత చిక్కబడింది. డిగ్రీ తరువాత మా దారులు వేరయ్యాయి. నేను ఆంధ్రజ్యోతిలో చేరాను. ఆయన కధ సినిమా మలుపులు తిరుగుతూ  చెన్నై చేరింది.
కట్ చేస్తే...
మద్రాసులో చందమామ రామారావు గారింట్లో ఒక ముందు గదిలో జంధ్యాల  అఫీసు తెరిచాడు. నేనొకసారి వెళ్లాను. గది బయట ‘జంధ్యాల, స్క్రిప్ట్ రైటర్’  అనే నేమ్ ప్లేటు. గదిలో ఒక మేజా బల్ల. దాని వెనుక  కుర్చీలో కూర్చుని రాసుకుంటున్న  జంధ్యాల అనే  జేవీడీఎస్ శాస్త్రి. వెనుకటి రోజుల్లోల్లా లేడు. మామూలుగానే మంచి ఛాయ కలిగిన మనిషి. కాకపోతే   జుట్టు కాస్త పలచబడింది.  మోహంలో నవ్వు, ఆ నవ్వులో అందం ఏమాత్రం చెక్కుచెదరలేదు. హాయిగా పలకరించాడు. హాయిగా కబుర్లు చెప్పుకున్నాము. హాయిగా నవ్వించాడు. హాయిగా నవ్వుకున్నాను. ఆ హాయి మనసంతా నింపుకుని బెజవాడ తిరిగొచ్చాను.
మళ్ళీ కట్ చేస్తే...
నేను బెజవాడ ఆంధ్రజ్యోతిని ఒదిలి, హైదరాబాదు రేడియోలో చేరాను. జంధ్యాల మద్రాసులో సినిమాల్లో బిజీ అయిపోయాడు. పదేళ్ళలో రెండువందల సినిమాలకు మాటలు రాశాడంటే ఎంతపని రాక్షసుడిగా మారివుండాలి!
ఒకసారి హైదరాబాదు వచ్చాడు. రేడియో స్టేషన్ కు వచ్చాడు. తన దర్శకత్వంలో మొదటి సినిమా ‘ముద్దమందారం’ తీస్తున్నట్టు చెప్పాడు. ఒక గ్రామ ఫోను రికార్డు ఇచ్చి తన సినిమా పాటలు రేడియోలో వచ్చేలా చేయడం కుదురుతుందేమో చూడమన్నాడు. ఎలాగూ వచ్చాడు కదా అని రేడియోలో ఇంటర్వ్యూ రికార్డు చేసాము. స్టేజి నాటకానికీ, రేడియో నాటకానికీ వుండే తేడా ఆయన అందులో విడమరచి చెప్పిన తీరు నన్ను విస్మయపరిచింది. నాకు తెలిసిన జంధ్యాల, ఇప్పుడు చూస్తున్న జంధ్యాల ఒకరేనా అనిపించింది. ఒకటి రెండు హోటళ్ళలో ఆయనకు పర్మనెంటు గదులు ఉండేవి. ఇంకోసారి కట్ చేస్తే...
ఓసారి ఢిల్లీలో కలిశాడు. హైదరాబాదుకు చెందిన ఓ లాయర్ తో కలిసి, నేనూ జ్వాలా  ఫైవ్ స్టార్ హోటల్లోని పుస్తకాల షాపులో తిరుగుతుంటే, తెలుగులో మాట్లాడుతున్న మమ్మల్ని గుర్తుపట్టి అదే హోటల్ ల్లోని తన గదికి తీసుకుపోయాడు.
గదికి వెళ్ళగానే, మాతో వచ్చిన లాయరు గారు ఎలాటి మొహమాటం లేకుండా, కొత్త చోటనికానీ, కొత్త మనిషని కానీ  సందేహించకుండా ఒకసారి మీ బాత్రూం వాడుకోవచ్చా అని అడుగుతూనే జవాబుకోసం ఎదురుచూడకుండా అందులో దూరిపోయి స్నానం చేసి బయటకు వచ్చారు. రావడం రావడమే ఆ గదిలో పరచిన తివాచీ పై తల కిందకు పెట్టి కాళ్ళు పైకి లేపి లిప్త మాత్రంలో శీర్షాసనంలో దర్శనమిచ్చారు. మా అందరికీ కళ్ళు తిరిగిపోయాయి. చిన్న తల, పెద్ద బొజ్జ, అంత భారీ కాయంతో ఆయన వేసిన ఈ ఆసనం చూసి జంధ్యాల కూడా నివ్వెర పోయారు.
తరువాత వారిరువురి నడుమ సాగిన కవి పండిత చర్చ విని తీరాలి. అప్పటికే  ‘శంకరాభరణం సినిమాకి సంభాషణలు సమకూర్చిన జంధ్యాల, విశ్వనాద్ గారిదే మరో సినిమా సప్తపదికి మాటలు రాస్తున్నాడు. అనేకానేక అంశాలను స్పృశిస్తూ జరిగిన సంభాషణ నిజానికి ఇద్దరు పండిత శ్రేష్ఠుల మధ్య జరిగే వాదోపవాదాన్ని తలపించింది. ఏమాత్రం స్వరం పెంచకుండా, ఎదుటివారి వాదాన్ని పూర్వపక్షం చేస్తూ ఒకర్ని మించి మరొకరు అక్షర లక్షలు చేసే తర్కవిన్యాసాలు ప్రదర్శించారు. సప్తపది సినిమా క్లైమాక్స్ లో ధర్మాధర్మ విచక్షణకు సంబంధించిన ఈ అంశాలలో  కొన్నింటిని   జంధ్యాల పొందుపరచినట్టున్నారు కూడా.
ఈ చర్చ సాగిన తీరు గమనిస్తే, నాకు కాలేజీలో తెలిసిన శాస్త్రి, ఇప్పుడు చూస్తున్న  ఈ జంధ్యాల, ఈ ఇద్దరూ  ఒకరేనా అన్న సందేహం కలిగింది. అంతటి పరిణతి ఆయనలో కనబడింది.
మరోసారి కట్ చేస్తే....
నా మకాం మాస్కోకి మారింది. జంధ్యాల  మద్రాసుకి అతుక్కుపోయాడు. క్షణం తీరిక లేని జీవితచట్రంలో ఒదుగుతూ, ఎదుగుతూ   ఏళ్ళతరబడి ఉండిపోయాడు. కధా చర్చలు జరపడం కోసం, రాసుకోవడం కోసం ఒకటి రెండు పెద్ద పెద్ద హోటళ్ళలో ఆయనకు పర్మనెంటు గదులు ఉండేవి. మాస్కో నుంచి   విశ్వప్రయత్నం చేస్తే  మద్రాసులో ఏదో ఒక అయిదు నక్షత్రాల హోటల్లో దొరికేవాడు. అంత దూరం నుంచి ఫోను చేస్తున్నందువల్లనో ఏమో, కాసింత తీరిక చేసుకుని లైన్లోకి వచ్చి మాట్లాడేవాడు. అప్పటికే ఆయన బిజీ డైరెక్టర్ల కోవలోకి చేరిపోయాడు.  మాస్కో థియేటర్లో శంకరాభరణం చూశానని చెబితే ఎంతో సంబరపడ్డాడు.  మాస్కో రమ్మని, అక్కడి మంచు వాతావరణంలో ఒక తెలుగు సినిమా తీయమని అనేక మార్లు చెప్పాను. రెండేళ్ళదాకా కొత్త సినిమాలు గురించి ఆలోచించే తీరుబాటు లేదని చెప్పేవాడు.
సోవియట్ యూనియన్ పతనానంతరం నేను హైదరాబాదు తిరిగి వచ్చిరేడియోలో చేరాను. జంధ్యాల మకాం కూడా చెన్నై నుంచి భాగ్యనగరానికే  మారింది. సినిమాల హడావిడి కొంత తగ్గినట్టు వుంది. ఎప్పుడయినా వెళ్లి కలిసినా తీరిగ్గానే కనిపించేవాడు.
తరువాత చాలా సార్లు కలుసుకున్నాము. భక్త రామదాసు ప్రాజెక్టు కోసం తరచూ ఖమ్మం వెడుతుండేవాడు. ఆయన కారులోనే అప్పుడప్పుడు ఖమ్మం వెళ్లి వస్తుండేవాణ్ని. దోవలో ఎన్నో జోకులు చెప్పేవాడు. చెప్పే సంగతులు మారేవి కానీ చెప్పే తీరులో మాత్రం తేడాలేదు.   
ఇరవైనాలుగు గంటలు బిజీ బిజీగా అనేక సంవత్సరాలు గడిపిన మనిషి ఖాళీగా వుండడం ఎంత బాధాకరంగా  వుంటుందో ఎప్పుడూ నవ్వుతుండే ఆయన మోహంలో అప్పుడప్పుడూ లీలగా కానవచ్చేది.
నిండు నూరేళ్ళ జీవితం అనుకుంటే జంధ్యాల బతికింది యాభయ్ యేళ్ళే. కానయితేనేమి నూరేళ్ళకు సరిపడా  నవ్వులు నలుగురికీ పంచి పెట్టిపోయాడు.
ఆరోజు నాకు బాగా జ్ఞాపకం వుంది. నేను రేడియోలో వుంటే, రాంపా ఫోను చేసి జంధ్యాల పోయాడని చెప్పాడు. నేను వెంటనే వార్త రాసి ఇచ్చేసి రాజభవన్ రోడ్డులోని వాళ్ల ఇంటికి వెళ్లాను. అప్పుడే కబురు  తెలిసి ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఓ కుర్చీలో జంధ్యాల నాన్నగారు నారాయణమూర్తి గారు కూర్చుని వున్నారు. కానీ ఆయనకు ఏదీ తెలియని పరిస్తితి. జ్ఞాపక శక్తి పూర్తిగా పోయింది. ఏమి జరిగిందన్నది, ఒక్కగానొక్క కొడుకు పోయాడన్నది  అర్ధం చేసుకునే స్తితి కాదు. ఏమిటో ఈ జీవితం అనిపించింది.
జంధ్యాల చనిపోయిన రెండేళ్లకు వేటూరి సుందరరామమూర్తి ఇలా గుర్తుచేసుకున్నారు.
హాస్యం,సంగీతం కలిసి ఒకే జన్మ ఎత్తిన హాసంనిన్నటి దరహాసం జంధ్యాల ఇతిహాసంలో చేరిపోయి రెండేళ్ళు గడిచాయి.ఎన్నేళ్ళు  గడిచినా ఆయన మధుర స్మృతికి మరణం లేదు. ఎంత కాదనుకున్నా కన్నీళ్ళు  కళ్ళతోనే మింగటం కన్నా శరణ్యం లేదు”.
తెలుగుజాతి ‘చిరునవ్వు’, జంధ్యాల అన్నారు వేటూరి.
ఆ వేటూరిగారు కూడా ఇప్పుడు లేరు.  జంధ్యాలను వెతుక్కుంటూ వెళ్ళిపోయారు.
కాని, ఆయన అన్నట్టు జంధ్యాల మార్కు  నవ్వుకు మాత్రం   మరణం లేదు.
తోక టపా :
" నేను వంటింట్లోకి వేరే పనిమీదవెళ్ళినాకూడా, వంట చేస్తున్న మా అమ్మగారు. పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు నిముషాలు  అనేవారు నొచ్చుకుంటూ- నేను అన్నం కోసం వచ్చాననుకుని. 
ఎంతయినా అమ్మ అంటే అన్నం. అన్నం అంటే అమ్మ ! అంతే !”
అమ్మ ప్రేమ గురించి ఇంత గొప్పగా చెప్పడం ఆ జంధ్యాలకే సాధ్యం!


(09-01-2017)