31, ఆగస్టు 2022, బుధవారం

మిహాయిల్ గోర్భచెవ్ ఇక లేరు – భండారు శ్రీనివాసరావు

 


తారాజువ్వలా దూసుకుపోయి చాలా తక్కువ సమయంలో విశ్వవ్యాప్త ప్రచారం పొందడంలోనూ, అలాగే నేలకు రాలిపోయి, జీవించి వుండగానే దుర్భరమైన నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురయ్యే దారుణ పరిస్తితికి చేరుకునే విషయంలోనూ మాజీ సోవియట్ అధినేత మిహాయిల్ సెర్గీవిచ్ గోర్భచేవ్ తో పోల్చదగిన మరో రాజకీయవేత్త ఇటీవలి కాలంలో మరొకరు కానరారు.
1985 లో సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రెటరి గా నియమితులయినప్పుడు నుదిటికి కొంచెం ఎగువన లేత ఊదా రంగు పుట్టుమచ్చ కలిగిన ఈ బట్టతల పెద్ద మనిషి ఎవరన్న సందేహాలు స్వదేశంలోనే తలెత్తాయి. అప్పటికి ఆయన వయసు యాభయ్ నాలుగు సంవత్సరాలు మాత్రమె. సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీలో ఆయనకు పూర్వం ఈ పదవిని అలంకరించిన వయసుడిగిన నాయకులతో పోలిస్తే ఆయన చాలా చిన్నవయసులోనే ఈ అత్యున్నత పదవికి చేరుకున్నట్టు లెక్క. పొలిటిబ్యూరోలో గోర్భచేవ్ తో అతి సన్నిహితంగా మెలిగే తలనెరిసిన పెద్ద తలకాయలు ఎవ్వరూ రానున్న ఆరేళ్ళ కాలంలో సోవియట్ యూనియన్ భవితవ్యం ఆయన నాయకత్వంలో ఊహాతీతమైన మార్పులకు గురవుతుందని పసికట్టలేకపోయారు. పదవిలోకి వచ్చీరాగానే ఏమాత్రం కాలయాపన చేయకుండా వరసగా అనేక సంస్కరణలకు గోర్భచేవ్ శ్రీకారం చుట్టారు. మానవతాకోణం కలిగిన సోషలిజం నిర్మాణం దిశగా, పాశ్చాత్య ప్రపంచంతో కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించి, ప్రచ్చన్నయుద్ధానికి ముగింపు పలుకుతూ విశ్వశాంతి లక్ష్యంగా తలపెట్టిన ఆ సంస్కరణల వేగం చూసి సోవియట్ కమ్యూనిస్ట్ నాయకులే ముక్కున వేలేసుకునే పరిస్తితి. ఒక్క నికితా కృశ్చెవ్ హయాములో మినహాయిస్తే, సోవియట్ యూనియన్ కి ఇది సరి కొత్త అనుభవం.
తాను తలపెట్టిన సమూల సంస్కరణలకు మరింత ఊతం కల్పించే ఉద్దేశ్యంతో గోర్భచేవ్ ‘పెరిస్త్రోయికా (పునర్నిర్మాణం), గ్లాస్ నోస్త్ (దాపరికం లేని పాలన)’ అనే ముద్దు పేర్లతో రెండు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. ఆనతి కాలంలోనే ఇవి రెండూ అత్యంత ప్రజాదరణకు నోచుకున్నాయి. గోర్భచేవ్ భావించినట్టే ఆయన ఈ వ్యూహం మొదట్లో మంచి ఫలితాలను ఇచ్చింది.
వాటిని గురించి దేశ వ్యాప్తంగా గోర్భచేవ్ ఇస్తూవచ్చిన ప్రసంగాల టేపులకు అపరిమితమైన గిరాకీ ఏర్పడింది. వాటిని నల్లబజారులో అధిక ధరలకు, అంటే అయిదువందల రూబుళ్ళు పెట్టి విరగబడి కొనే పరిస్తితులు జనంలో నానాటికీ పెరుగుతున్న అభిమానానికి కొలమానాలుగా మారాయి అని గోర్భచేవ్ జీవిత చరిత్ర రాసిన విలియం టాబ్ మాన్ పేర్కొన్నారు.
నేను 1987 నుంచి వరకు దాదాపు అయిదేళ్ళు మాస్కో రేడియోలో పనిచేశాను. ఆ రోజుల్లో మిహాయిల్ గోర్భచేవ్ పేరు మొత్తం సోవియట్ యూనియన్ లోనే కాదు యావత్ ప్రపంచదేశాల్లో మారుమోగుతూ వుండేది. అప్పటికి రెండేళ్ళ క్రితమే లో గోర్భచేవ్ సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. అంటే ఆ దేశంలో తిరుగులేని అధికారాన్ని చెలాయించగలిగే అధికారం ఉన్న ఏకైక పదవి. అంతటి ఎదురులేని అధికారం గుప్పెట్లో ఉందనే ధైర్యమే కాబోలు వారి చేత ఎక్కువ మాట్లాడిస్తుంది. ఈ విషయంలో గోర్భచేవ్ ఒక నాలుగాకులు ఎక్కువ చదివారని అనుకోవచ్చు. మాస్కోలోనే కాదు, యావత్ దేశంలో ఏ మూల టీవీ పెట్టినా, రేడియో పెట్టినా ఆయన ఏదో మాట్లాడుతూ కనిపించేవారు. గంటలు గంటలు ప్రసంగించినా సోవియట్ టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారం చేస్తూ వుండేది. ఆయనకు కూడా పత్రికలంటే ప్రాణం. ఏం చేసినా ఏం మాట్లాడినా అది నలుగురికీ తెలియడం అవసరమనే భావన ఆయనది. అధికారం పోయిన తర్వాత కూడా గోర్భచేవ్ ఈ అలవాటును వదులుకోలేదని అయన తర్వాత అధికార పగ్గాలు స్వీకరించిన బోరిస్ ఎల్త్ సిన్ దగ్గర ప్రెస్ సెక్రెటరీగా పనిచేసిన వ్యాచెస్లావ్ కోస్తికొవ్ తన జ్ఞాపకాల పుస్తకంలో రాసుకున్నారు.
కోమ్సమాలొస్కయా ప్రావ్దా అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోర్భచెవ్ ఒకసారి బోరిస్ ఎల్త్సిన్ విధానాలను తూర్పారబట్టారు. ఆ ఇంటర్వ్యూ చేసింది దిమిత్రీ మురతోవ్. ఆ విలేకరి అంటే గోర్భచెవ్ కు చాలా ఇష్టం. సోవియట్ అధినేతగా రాజీనామా చేసిన తర్వాత గోర్భచెవ్ మురతోవ్ కి ఫోన్ చేసి ఆ పత్రికలో తాను కూడా నెలకోమారు ఒక ఫీచర్ రాస్తానని అడిగారు. అప్పటికే ఆ పత్రిక యాజమాన్య బృందం గ్రూపులుగా విడిపోయి, వాళ్ళలో వాళ్ళు విబేధించుకుంటూ వుండడం వల్ల గోర్భచెవ్ కోరిక నెరవేరలేదు. గోర్భచెవ్ ఆ పత్రికను ఎంచుకోవడానికి కారణం దానికి పాఠకుల్లో ఉన్న ఆదరణ. 1990 ప్రాంతాల్లోనే ఆ పత్రిక సర్క్యులేషన్ రెండుకోట్ల ముప్పయి లక్షలు. అయినా ఆ పత్రికలో పనిచేసేవారిలో ఏర్పడ్డ లుకలుకల కారణంగా క్రమంగా మురతోవ్ వంటి జర్నలిస్టులు ఆ పత్రికను వదిలేశారు. వదిలేసి నొవయా గజేత (న్యూ గెజిట్) అనే పేరుతొ ఒక కొత్త పత్రికను ప్రారంభించారు. పత్రిక అయితే పెట్టారు కానీ దాన్ని నిలబెట్టే ఆర్ధిక స్థోమత వారికి లేదు. సాయం చేసే వారికోసం వాళ్ళు ఎదురుచూపులు చూస్తున్న సమయమది.
అధ్యక్ష పదవిని వీడిన తర్వాత, గోర్భచెవ్ తన ప్రసంగాలు, రచనల ద్వారా సంపాదిస్తున్న సొమ్ముతో ఒక ఫౌండేషన్ స్థాపించారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. గోర్భచెవ్ కు ఆయన స్వదేశంలో మాట ఎలా వున్నా అంతర్జాతీయంగా చక్కటి పేరు ప్రఖ్యాతులు వున్నాయి. 1991లో ఆయనకు నోబుల్ శాంతి పురస్కారం లభించింది. ఆయన తన అనుభవాలతో రాసిన ఒక గ్రంధం దాదాపు ఎనభై ప్రపంచ భాషల్లోకి అనువదించి ప్రచురించారు. కోట్ల సంఖ్యలో ఆ పుస్తకాలు అమ్ముడు పోయాయి. అమెరికాకి పోటీగా నిలచిన సోవియట్ యూనియన్ ఆయన హయాములోనే అంగవంగ కళింగ దేశాల మాదిరిగా విచ్చిన్నం కావడం, రెండు జర్మనీల ఏకీకరణ జరగడం, అణ్వాయుధాల సంఖ్యను భారిగా కుదించడంలో ఆయన పోషించిన పాత్ర ఇలా అనేకానేక కారణాల వల్ల గోర్భచెవ్ కు విశ్వ విఖ్యాతి లభించింది. అంచేత ఆయన అధికారం చేజారిపోయినా భార్య రైసాతో కలసి నిరాడంబరంగా జీవిస్తూ, విశ్వవిద్యాలయాల్లో ప్రసంగాలు చేస్తూ, రచనావ్యాసంగం సాగిస్తూ కాలక్షేపం చేస్తున్న రోజులవి. అయినా ఏదో విధంగా మళ్ళీ అధికార పగ్గాలను చేపట్టాలనే కాంక్ష ఆయనలో చావలేదని, అందుకే టీవీలు, పత్రికల ద్వారా (ప్రభుత్వ నిర్వహణలో నుంచి రష్యన్ టెలివిజన్, రేడియోలు బయట పడ్డాయి) తనకు జనంలో ఉన్న ఆదరణను మరింత పెంచుకుని మరోసారి అధికార పీఠం చేజిక్కించుకోవాలనే కోరిక ఆయనలో పాతుకుపోయి వుందని, అందువల్లే పత్రికలను ప్రోత్సహించే పని పెట్టుకున్నారని కూడా గోర్భచెవ్ మీద అపనిందలు వచ్చాయి.
“ఏం చెయ్యాలి, పత్రికను ఎలా నడపాలి అని మేము మల్లగుల్లాలు పడుతున్న సమయంలో 20 IBM 286-x కంప్యూటర్లు మా ఆఫీసుకు వచ్చాయి” అని చెప్పాడు మురతోవ్ ఆనందంగా. 1993 నాటికి ఆ కంప్యూటర్లు అత్యంత ఆధునికమైనవి. గోర్భచెవ్ పంపిన ఆ కంప్యూటర్లతోనే మేము పత్రికను నడపడం ప్రారంభించాము. అంతేకాదు, గోర్భచెవ్ స్వయంగా నొవయ గజిత పత్రికలో మూడు లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టారు”అని మురతోవ్ చెప్పారు. అలాగే మరోసారి డబ్బు అవసరం పడ్డప్పుడు లక్ష డాలర్లు మా పత్రిక బ్యాంకు ఖాతాకు జమ చేసారని కూడా ఆయన వెల్లడించారు.
“1995లో రష్యాలో సెల్ ఫోన్లు చాలా అరుదు. ఒకసారి గోర్భచెవ్ దంపతులను కలవడానికి వారింటికి వెళ్లాను. మాటామంతీ అయిన తర్వాత రైసా గోర్భచెవా ఒక అందమైన పెట్టెను నా చేతిలో పెట్టారు. తెరిచి చూస్తే అందులో మొబైల్ ఫోను వుంది. అవసరమైన సందర్భాలలో లాండ్ లైన్ కి ఫోను చేసి మాట్లాడడం ఇబ్బందిగా ఉంటోందని అంచేత మొబైల్ ఫోను వుంటే ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చని గోర్భచెవ్ మీతో చెప్పమన్నారు” అందావిడ నాతొ. నాపట్ల ఆయన చూపించిన వాత్సల్యం మరవలేను” అని చెప్పుకొచ్చారు మురతోవ్.
“ఇప్పటికీ ఆ మొబైల్ ఫోను మా పత్రికాఫీసులో మ్యూజియంలో వుంది” అన్నారాయన.
“పత్రికల్లో పనిచేసేవారన్నా కూడా గోర్భచెవ్ ఎంతో ఆదరణ చూపేవారు. ఒక రిపోర్టర్ ఆఉపత్రిలొ వుంటేయాభయ్ వేల డాలర్లు ఆర్ధిక సయం చేసి ఆదుకున్నారు. ఆయన ఇలాంటి సాయాలు జర్నలిస్టులకి అనేకం చేస్తుండేవారు” అని మురతోవ్ చెప్పారు కృతజ్ఞతగా.
గోర్భచెవ్ అరెస్టు
1991, ఆగస్టు 18.
క్రిమియా నల్ల సముద్ర తీరంలో సోవియట్ యూనియన్ అధ్యక్షుడి వేసవి విడిది ఫోరొస్ భవనపు గేట్ల దగ్గర అయిదు ఓల్గా కార్లు వచ్చి ఆగాయి. అప్పటి సోవియట్ ప్రెసిడెంట్ మిహాయిల్ గోర్భచెవ్ ఆ భవనంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. గట్టి భద్రత ఉన్న ప్రాంతం. ఎవరైనా ఆగంతకులు వాహనాల్లో దూసుకువస్తే వాటి టైర్లు పంక్చర్ చేయడానికి ఆ మార్గంలో ఏర్పాట్లు వున్నాయి. మొదటి కారు నుంచి కేజీబీ అత్యున్నత అధికారి యూరి ప్లీకనోవ్ దిగారు. సోవియట్ అధ్యక్షుడి భద్రతా ఏర్పాట్లు కనిపెట్టి చూసే బలగాలు ఆయన పర్యవేక్షణలోనే పనిచేస్తాయి. ఆయన్ని చూడగానే రెడ్ స్టార్లు కలిగిన ఆ భారీ పచ్చటి ఇనుపగేట్లు తెరుచుకున్నాయి. పీకనోవ్ తో పాటు అయిదుగురు కేజీబీ అధికారులు, సైనికాధికారులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, వారి అంగరక్షకులు ఆ విడిది గృహంలోకి దూసుకు వెళ్ళారు. ఆ సమయంలో వాళ్ళు వస్తారని ఏమాత్రం సమాచారం లేని ప్రెసిడెంట్ గోర్భచెవ్, ఆశ్చర్యపోతూ కేజీబీ చీఫ్ వ్లాదిమిర్ కృశ్చెవ్ తో మాట్లాడడానికి ఫోను చేయడానికి ప్రయత్నించారు. కానీ లైన్ కట్టయింది. వెంటనే ఒకనాటి సోవియట్ అధినేత నికితా కృశ్చెవ్ ఉదంతం గుర్తుకువచ్చింది. 1964 లో కృశ్చెవ్ ఇలాగే నల్ల సముద్ర తీరంలో విశ్రాంతిగా రోజులు గడుపుతున్నప్పుడు ఆయన్ని హఠాత్తుగా పదవి నుంచి తొలగించారు.
ప్రెసిడెంట్ గోర్భచెవ్ ని నిజంగా అరెస్టు చేశారా లేక ఆయన స్వచ్చందంగానే ఈ అరెస్టుకు అంగీకరించారా అనే విషయంలో ఇప్పటికీ అనుమానాలు వున్నాయి. సోవియట్ యూనియన్ ని రిపబ్లిక్ ల సమాఖ్యగా ప్రకటించే కొత్త ఒప్పందంపై ఆగస్టు ఇరవైన ప్రెసిడెంట్ గోర్భచెవ్ సంతకం చేయాల్సి వుంది. అదే జరిగితే సోవియట్ యూనియన్ విచ్చిన్నం ఖాయం అని నమ్మే వారిలో కొందరు ఒక బృందంగా ఏర్పడి ఆ ఒప్పందంపై సంతకాలు జరిగే కార్యక్రమాన్ని వాయిదా వేయించాలని తలపోశారు. అందులో భాగంగా దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించాల్సిందిగా ప్రెసిడెంట్ గోర్భచెవ్ ని ఒప్పించడం కోసం ఆ బృందం కేజీబీ అధికారులని నల్లసముద్ర తీరంలోని వేసవి విడిదికి పంపిందని ఓ కధనం ప్రచారంలో వుండేది. అప్పటికే ప్రెసిడెంట్ గోర్భచెవ్ రాజకీయ ప్రత్యర్ధి బోరిస్ ఎల్త్సిన్ రష్యన్ సోవియట్ రిపబ్లిక్ అధ్యక్షుడిగా పెద్ద మెజారిటీతో ఎన్నికయ్యారు. యూనియన్ సమగ్రతను కాపాడాలని అనుకున్న బృందం ప్రయత్నాలు ఫలించలేదు. నాలుగు మాసాల అనంతరం సోవియట్ యూనియన్ చరిత్ర గర్భంలో కలిసిపోయింది. ఆగస్టు పద్దెనిమిది నుంచి ఆగస్టు ఇరవై వరకు అసలు ఏం జరిగింది అన్నది ఇన్నేళ్ళ తర్వాత కూడా ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది.
ఆరోజు ప్రెసిడెంట్ గోర్భచెవ్ వేసవి విడిదిలో ఏమి జరిగింది అనే విషయంలో కూడా విభిన్న కధనాలు వున్నాయి. తన ఇంటికి హఠాత్తుగా వచ్చిన కేజీబీ అధికారులని చూసి మొదట్లో ప్రెసిడెంట్ గోర్భచెవ్ కంగారు పడ్డారని అధికారిక వర్గాల సమాచారం. అయితే అరెస్టుచేసి తీసుకుపోవడంలేదని హామీ ఇచ్చిన తరువాత ఆయన కొంత స్థిమిత పడ్డట్టు కనిపించింది. ఆ తరువాత వాళ్ళు తనముందు పెట్టిన డిమాండ్లని అంగీకరించడానికి తిరస్కరించారు.
“మీరు నమ్మక ద్రోహులు. దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు, తప్పదు” అంటూ హెచ్చరించారు. వాళ్ళు మాస్కో తిరిగి వెళ్ళిన తర్వాత ఫోరొస్ విడిదిలోనే గోర్భచేవ్ దంపతులు గృహ నిర్బంధంలో వుండిపోయారు. తరువాత రైసా గోర్భచేవ్ మరణించారు. గృహంలో ఉన్నారన్న మాటే కానీ వారిద్దరూ చాలా బాహ్యం భయంగా రోజులు గడిపారు. ఏది తిందామన్నా భయమే. దేంట్లో విషం కలిపారో తెలవదు ని రైసా తర్వాత ఒక దర్యాప్తు అధికారితో చెప్పారు.
మరునాడు , ప్రెసిడెంట్ గోర్భచెవ్ వద్ద వైస్ ప్రెసిడెంటుగా పనిచేసిన గెన్నదీ యనఏవ్ విలేకరులతో మాట్లాడారు. ప్రెసిడెంట్ మిహాయిల్ గోర్భచెవ్ సెలవులో వున్నారు. అందుచేత తాను ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు వెల్లడించారు.
‘ప్రెసిడెంట్ సెలవులో వున్నారు’ అని యనయేవ్ ప్రకటిస్తున్నప్పుడు ఆయన గొంతు కంపించడం, చేతులు వణకడం టీవీ తెరలపై ప్రపంచం యావత్తు చూసింది.
“ప్రెసిడెంట్ గోర్భచెవ్ నల్ల సముద్ర తీరంలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ప్రస్తుతం కులాసాగానే వున్నారు. త్వరలోనే మళ్ళీ విధులకు హాజరవుతారు” అని ఆయన చెప్పారు.
ఆ రోజు ఆ విడిది లో ఏమి జరిగింది అనేదానిపై వాలెరీ బోల్దిన్ కధనం వేరుగా వుంది. ఈయన కూడా కుట్రదారుల్లో ఒకరు.
“ప్రెసిడెంట్ గోర్భచెవ్ చాలా కోపంగా కనిపించారు. అన్నింటికీ మించి ఏమైనా సరే బోరిస్ ఎల్త్సిన్ బెడద వదిలిపోవాలి అనే భావం అయన మాటల్లో ధ్వనించింది.
చివరికి ఇలా అన్నారు. “పొండి. ఏం చేసుకుంటారో చేసుకోండి”
అలా అనేక ఉద్దానపతనాలు చూసిన మిహాయిల్ గోర్భచేవ్, ప్రచ్చన్న యుద్ధ శకానికి చరమగీతం పాడిన తుట్టతుది సోవియట్ నాయకుడు మిహాయిల్ గోర్భచేవ్ తన తొంభయి ఒకటవ ఏట రాత్రి కన్ను మూశారు. (31-08-2022)

29, ఆగస్టు 2022, సోమవారం

హక్కులకు సైతం హద్దులు వుండాలి – భండారు శ్రీనివాసరావు

 

“పత్రికలు చదవను. టీవీ చూడను. ఇదే నా ఆరోగ్య రహస్యం” అన్నారు మాజీ ప్రధాని, కీర్తిశేషులు చరణ్ సింగ్.
భారత ప్రజాస్వామ్య సౌధానికి మూల స్తంభాలయిన వ్యవస్థల ప్రతినిధుల నిర్వాకాలు గమనిస్తుంటే చరణ్ సింగ్ మాటలు గుర్తుకొస్తున్నాయి.
“విద్యాసంస్థలు బంద్ అని టీవీల్లో స్క్రోలింగులు కనబడగానే మా అమ్మాయి బడికి వెళ్ళకుండా ఇంట్లో వుండిపోతుంది. యెంత చెప్పినా వినదు. ఇక స్కూళ్ళు కూడా అలాగే మూసేస్తున్నారు. ఇదంతా మీడియా సృష్టిస్తున్నభయాందోళనల వల్లే”.
ఈ మాటలు అన్నది సాక్షాత్తూ ఒకప్పటి ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ ఏకే ఖాన్ అంటే నమ్మశక్యం కాకపోవచ్చు కానీ ఇది నిజంగా నిజం.
అప్పుడు నగరంలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆయన తన మనసులోని మాటలను బయట పెట్టారు. ఈ క్రమంలో ఇజ్రాయల్ దేశాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. “ఆ దేశంలో యెంత పెద్ద హింసాత్మక సంఘటన జరిగినా అక్కడి మీడియా ఆ విషయాన్ని లోపలి పేజీల్లో ప్రచురిస్తుంది. అభివృద్ధికి సంబంధించిన వార్తల్ని ప్రముఖంగా మొదటి పేజీల్లో వేస్తుంది. మన దగ్గర మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా జరుగుతోంది. స్తానికంగా పరిమితమయిన సంఘటనలను సార్వత్రికం చేసి వార్తలు ప్రచారం చేయడం వల్ల లేనిపోని అనర్ధాలు జరుగుతున్నాయి.”
ఇతరుల హక్కులకు భంగం కలగకుండా ఉద్యమాలను నిర్వహించుకోవాలని హితవు పలికారు.
“రోడ్ల మీద భైఠాయించి ఇతరుల హక్కులకు భంగం కలిగించే స్వేచ్చ ఆందోళనకారులకు ఎక్కడిద”ని నిలదీశారు.
ఖాన్ గారి ఈ భావజాలంతో ఏకీభవించాల్సిన అవసరం వుందని కాదు కానీ, ఈ అంశాన్ని గురించి ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమయిందని మాత్రం చెప్పవచ్చు.

‘చేతులు బార్లా జాపుకునే స్వేచ్చ ప్రతి ఒక్కరికీ వుంటుంది. అయితే ఆ చేతివేలి కొనభాగం పక్కవాడి ముక్కునో, కంటినో తాకనంత వరకే ఆ స్వేచ్చ’ అని ఓ ఆంగ్ల సామెత వుంది. అంటే స్వేచ్చకు సయితం హద్దులు వున్నాయని చెప్పడం ఈ నానుడి తాత్పర్యం.


మేధావులమని అనుకుంటున్నవాళ్ళు గమనించాల్సిన విషయం మరోటుంది. ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టులయిన వ్యవస్థలన్నీ ఈ ఏడుదశాబ్దాల పైచిలుకు కాలంలో చెదలు పట్టిపోయాయి. ఒకదానికి మరొకటి దన్నుగా వుండాల్సిన ఈ వ్యవస్థలన్నీ ఆధిపత్య పోరులో కూరుకుపోయి తమని తాము నిర్వీర్యం చేసుకుంటున్నాయి. మీడియాలో, పత్రికల్లో, రాజకీయుల ప్రకటనల్లో, న్యాయస్థానాల్లో , చట్టసభల్లో చోటుచేసుకుంటున్న వార్తలు, వ్యాఖ్యలు, విమర్శలు, ప్రతి విమర్శలు, వాదోపవాదాలు, నీలాపనిందలు ఈ అంశాన్నే స్పష్టం చేస్తున్నాయి.

ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే-
పరిపాలన పేరుతొ పార్టీలు, పారదర్శకత ముసుగులో ప్రచార వూడిగం చేస్తూ పత్రికలూ,
వ్యాపారకళలో ఆరితేరి బలవత్తర శక్తులుగా రూపాంతరం చెందాయి. పరస్పరాధీనంగా పెరుగుతూ వచ్చిన ఈ వ్యవస్థలు, కాలక్రమేణా ప్రత్యర్ధులపై పైచేయి కోసం కత్తులు దూస్తున్నాయి.
పత్రికలను, మీడియాను అడ్డంపెట్టుకుంటూ, సంస్థలకు, వ్యవస్థలకు నాయకులమని సాకుగా చూపుతూ ప్రభుత్వాలను లొంగదీసుకోవాలనుకుని చేసే ప్రయత్నాలవల్ల ప్రజాస్వామ్యానికి వాటిల్లే ముప్పు తక్కువేమీ కాదు.
తాము ప్రాతినిధ్యం వహించే సంస్థల వల్ల సంక్రమించే ప్రత్యేక హక్కుల పేరుతొ లేని హోదాలని అనుభవిస్తూ, తమ రాతలతో, చేతలతో, చేష్టలతో, రెచ్చగొట్టే మాటలతో, వ్యాఖ్యలతో, ప్రవర్తనతో సమాజానికి సంకటంగా తయారయిన వారు, వారు ఎవరయినా సరే, ఆ వ్యక్తి -
గ్రామస్థాయిలో చిన్న ఉద్యోగి కావచ్చు, బాధ్యత కలిగిన పెద్ద అధికారి కావచ్చు, ఏదయినా పార్టీ కార్యకర్త కావచ్చు, రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించే అధినేత కావచ్చు, పార్ట్ టైం విలేకరి కావచ్చు, ప్రధాన సంపాదకుడు కావచ్చు,
ఏ స్తాయిలో వున్నా, ఏ హోదాలో వున్నా సరే! ఖండనకు అర్హులే. విమర్శకు పాత్రులే!
ఏదో ఒక పేరుతొ, ఏదో ఒక సాకుతో అలాటివారిని కాపాడాలని అనుకోవడం, వెన్ను కాయాలని తలపోయడం కూర్చున్న కొమ్మని చేజేతులా నరుక్కోవడమే అవుతుంది.

(ఘాటుగా ఉందా! ఏమో అలా రాయాలని అనిపించింది)

28, ఆగస్టు 2022, ఆదివారం

నాకు పరిచయం అయిన మొదటి జర్నలిస్టు

 కూచి గోపాల కృష్ణ.

పెద్ద పెద్ద మీసాలు. ఎవర్నీ లెక్కచేయనితనం. వాడెంత వీడెంత అనే మాటలు. ఆ గుబురు  మీసాల మాటున మందహాసం. లెక్కచేయని తనం చాటున మొక్కవోని ఆత్మ విశ్వాసం. అహంకారపు మాటల వెనక అతి సున్నితత్వం. ఇవన్నీ కలబోస్తే కూచి గోపాల కృష్ణ.

ఆయనతో యాభయ్ ఏళ్ళ పైచిలుకు పరిచయం. బెజవాడ గాంధి నగరం జింఖాన క్లబ్ దగ్గర నివాసం ఆయనది. పెద్ద పెద్ద సీనియర్ రిపోర్తర్లకి కూడా లేని సైకిల్ వైభోగం. బీటు కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐ.పి.ఎస్. అధికారి వరకు పరిచయాలు. కరకుతనం, భోళాతనం కలగలిపిన గొప్ప పీఆర్ వ్యక్తిత్వం.

ఒక జర్నలిస్టు సంఘంలో మంచి జర్నలిస్టు అనిపించుకున్నాడు అంటే దాని వెనుక అతడి కుటుంబ సభ్యుల మంచితనం కూడా వుంటుంది. కూచి గోపాల కృష్ణకు దక్కిన అదృష్టం అది. పిల్లలు ప్రయోజకులు అయ్యారు. వారిని కట్టుకున్న వాళ్ళు మరింత ప్రయోజకులు అయ్యారు.

నిన్న శనివారం హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో కూచి గోపాలకృష్ణ ప్రధమ వర్ధంతి  సందర్భంగా సంస్మరణ కార్యక్రమం జరిగింది. వల్లీశ్వర్, నందిరాజు రాధాకృష్ణ, రెంటాల జయదేవ్ మరికొందరు జర్నలిస్టు మితృలు కూచి గోపాలకృష్ణతో తమ అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. కుటుంబ సభ్యులు మధు, శోభ, జీవీ రాము, తురగా ఫౌండేషన్ సభ్యులు శారద, రాధిక  కార్యక్రమంలో పాల్గొన్నారు.






(28-08-2022)

 

రసరమ్య పుస్తకం – భండారు శ్రీనివాసరావు

(Published in Andhra Prabha today, 28-08-2022, Sunday)


చిన్నప్పుడు అల్లరి చిల్లరగా తిరుగుతూ, పెరిగిపెద్దయిన తరవాత కూడా ఎలాటి ఎదుగూ బొదుగూ లేకుండా అలాగే మిగిలిపోతే  పాతసంగతులు గుర్తుచేసుకునే చాన్సు వుండదు. ఒకవేళ గుర్తుచేసుకున్నావాటిని  విన్న జనం మొహానే నవ్వుతారు. అయితే,   చిన్నతనంలో ఏ గాలి  తిరుగుళ్ళు తిరిగినా, పెద్దయిన తరవాత కూడా అలాగే మిగిలిపోకుండా జీవితంలో ఒక స్తాయినీ,  సంఘంలో ఒక హోదాను అందుకోగలిగితే, చిన్నప్పటి చిల్లర జీవితానికి కూడా  ‘గ్లామరు’ దానంతట అదే వచ్చిపడుతుంది. అప్పటి సంగతులు చెబితే  వినేవాళ్ళుంటారు. పుస్తకాలు రాసుకుంటే అచ్చువేసే వాళ్ళుంటారు. కొనేవాళ్ళ సంగతి ఎలావున్నా, రివ్యూలు రాసేవాళ్ళు సిద్ధంగానే వుంటారు. కాకపొతే, ఈ మధ్య  వీటిని కూడా “రాయించి, వేయించు కోవాల్సి” వస్తోందని కొందరు గిట్టనివాళ్ళంటున్నారు. అందుకే ఇలాటి ఆత్మకధలు లేదా జీవిత కధలూ లేదా బయోగ్రఫీలూ, ఆటోబయోగ్రఫీలు, అనబడే, కొద్దోగొప్పో ఇచ్చి రాయించుకునే ‘జీవిత చరిత్రల’కు  ఈ రోజుల్లో మంచి గిరాకీ వుంది. సచ్చీలురయిన గొప్పవారి జీవితాలను కడిగి గాలించినా  ముచ్చటపడే రసకందాయఘట్టాలు మచ్చుకయినా కనిపించవు కాబట్టి , అలాటి వారి గురించి రాసినా చదివేవారు వుండరు కాబట్టీ, పైపెచ్చు రాసేవారికీ వేసేవారికీ గిట్టుబాటు కాదు కాబట్టీ, వాటి జోలికి ఎవరూ పోరు. పోతే, జీవిత చరిత్రలను వేయించుకోగలిగిన స్తాయికి చేరుకున్నారంటేనే, అటువంటి వారి ఘనమయిన గతంలో ‘ఏవో రసరమ్య ఘట్టాలు’ వుండే వుంటాయి. లేకపోయినా ‘చరిత్రలు’ రాసిపెట్టే వాళ్లకు ఆ తెలివితేటలు పుష్కలం. అవసరమైతే అలాటి ఆసక్తికర అంశాలను  తమ కల్పనాచాతుర్యంతో  సృష్టించగలరు. ఇంతవుంటే చాలు ఎంతో చేసి చూపగలరు. ఈ  సత్తా వున్నవారినే ఇందుకోసం ఎంపిక చేసుకుంటారు. అంతేకాదు, ఆ సన్నివేశాలకు తగిన మసాలాను  దట్టించి చదవాలనే ఉత్సుకతను చదువరులలో పెంచగలరు. ఆ రకమైన ముఖ్యాంశాలను  గ్రంధ ప్రచురణకు ముందుగానే, ఆకర్షణీయమయిన ప్రమోలుగా రూపొందించి,  పత్రికల్లో రివ్యూల ద్వారా, మీడియాలో ఇంటర్వ్యూల రూపంలో జనాలమీదకు వొదలగల టక్కుటమార విద్యల్లో ప్రచురణకర్తలు ఆరితేరిపోయారు. ఈ క్రతువులన్నీ ముగిసిన తరవాత కానీ అసలు పుస్తకం మార్కెట్లోకి రాదు. 

అభివృద్ధి చెందిన దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన ఈ మార్కెటింగ్ టెక్నిక్కులు ఇటీవల మనవైపు  కూడా విస్తరిస్తున్నాయి. 

బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి  టోనీ బ్లెయిర్, తన జీవితంలోని కొన్ని ఘట్టాలతో “ప్రయాణం” పేరుతొ  ఒక పుస్తకం రాసారు. ముందు చెప్పిన విధంగానే అమ్మకాలు పెంచే ప్రచార పర్వాన్ని  ‘సన్’ పత్రిక ప్రారంభించింది.  ఈ పుస్తకం గురించి సమీక్ష రాస్తూ అందులోని ఒక  ఆసక్తికరమయిన  విషయాన్ని బయట పెట్టింది.

టోనీ బ్లేర్ మహాశయులవారు, బార్లలో పనిచేస్తూ చదువుకుంటున్న రోజుల్లో,  ఒక ఫ్రెంచ్ యువతితో ప్రేమలో పడ్డారుట. ఆమెపై  మరులుపెంచుకున్న టోనీకి  ఆ వ్యామోహంనుంచి బయటపడడం ఒక పట్టాన సాధ్యం కాలేదుట.

“ఆలోచించడం మానుకో, ఆనందించడం నేర్చుకో’ అని ఆ ఫ్రెంచ్ అమ్మడు అతడికి సుద్దులు నేర్పిందట. తనంటే పడిచచ్చిపోతున్న ఆ పడుచువాడు, భవిష్యత్తులో బ్రిటన్ దేశానికి  ప్రధానమంత్రి కాగలడని  ఆ యువతి అప్పట్లో వూహించి వుండదు.

‘సన్’ పత్రికలో వచ్చిన ఈ ‘వేడి వేడి కబురు’ అందరినీ ఆకట్టుకుంది. ఏమయితేనేం,  మొత్తానికి ఈ చిట్కా పనిచేసింది.

 ఇంగ్లాండ్ పుస్తక దుకాణాలలో ఈ పుస్తకాన్ని జనం  హాటు కేకుల్లా ఎగరేసుకు పోయారుట. ఫ్రెంచ్ అమ్మాయితో బ్రిటన్ మాజీ ప్రధాని  ప్రేమాయణం కాబట్టి  పనిలో పనిగా ఫ్రాంకులు కూడా మూట కట్టుకోవాలని ఈ ప్రయాణం  పుస్తకాన్ని ఫ్రెంచి భాషలో సయితం  ప్రచురించారు.

 ఇంతకీ ఇందులో ఏముందని అనుకుంటున్నారా! యిరవై నాలుగు పౌండ్లు మీవి  కాదనుకుంటే ఆ అనుమానం తీరిపోతుంది.  

“భారత దేశపు తొలి మహిళా ప్రధాని శ్రీమతి గాంధి, 1984, అక్టోబర్ 31వ తేదీన ఢిల్లీలో తన అధికార నివాసం ప్రాంగణంలోనే అంగరక్షకుల తుపాకీ కాల్పులకు బలయ్యారు. ఈ దుర్ఘటన జరగడానికి కొద్ది రోజుల ముందుగానే తన తుది ఘడియలు దగ్గర పడుతున్నాయని ఆవిడకు తెలిసివచ్చింది (ట) దీనికి కారణం ఆవిడకు ఒక గుళ్ళో కనబడిన ఓ అపశకునం. హత్య జరిగిన అక్టోబర్ మాసంలోనే శ్రీమతి ఇందిరాగాంధీ చాలా మనసుపడి కాశ్మీర్ పర్యటన పెట్టుకున్నారు. కాశ్మీర్ ప్రకృతి సౌందర్యం అంటే ఆవిడ తెగ ముచ్చట పడేవారు. అంతేకాదు, కాశ్మీర్ లోయలోని ఒక హిందూ దేవాలయాన్ని, అలాగే ముస్లింల ప్రార్ధనా మందిరం అయిన ఒక ప్రముఖ మసీదును సందర్శించాలన్న కోరికతో కూడా ఆమె ఆ పర్యటనకు బయలుదేరివెళ్ళారు. ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆవిడకి ఒక అపశకునం కనబడింది. అది చూడగానే తన రోజులు దగ్గర పడ్డాయని తోచింది. ఆ సమయంలోనే ప్రియాంకా గాంధి తన రాజకీయ వారసురాలయితే బాగుంటుంది అని కూడా ఆమెకు అనిపించింది. కాకతాళీయం కావచ్చు కానీ, ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే ఆవిడ హఠాత్ మరణానికి గురయ్యారు. ప్రియాంక రాజకీయ వారసత్వం గురించి శ్రీమతి గాంధీ మనసులోని ఈ మాటను తదనంతర కాలంలో సోనియా గాంధి చెవిలో వేసినా, ఆవిడ దానికి ఇష్టపడలేదు.” (శ్రీమతి ఇందిరాగాంధీ మరణించే నాటికి ప్రియాంక గాంధి వయస్సు కేవలం పన్నెండేళ్ళే. మరి రాజకీయ వారసత్వం గురించిన ఆలోచన ఎలా వచ్చిందో!) 

ఇవన్నీ అక్షర సత్యాలు అవునో కాదో తెలియదు. కానీ ఈ సంగతులన్నీ, శ్రీమతి గాంధి అంతరంగికుడు  ఎం.ఎల్ ఫోతేదార్ రాసిన ఒక పుస్తకంలో అక్షరబద్ధం అయ్యాయి.

పెద్ద పెద్ద వ్యక్తులు రాసే ఆత్మకధలు అటుంచి, వారితో సన్నిహిత సంబంధాలు కలిగిన వాళ్ళు రాసే పుస్తకాల్లో మరిన్ని ఆసక్తికరమైన అంశాలు ఉండడానికి ఆస్కారం ఎక్కువ. అంచేతే పుస్తక ప్రచురణకర్తలు కూడా ఇటువంటి వారు రాసే ఆత్మకధలకు, జీవిత చరిత్రలకు ప్రాముఖ్యం ఇచ్చి ప్రచురిస్తున్నారు. వాటిల్లో ఇటువంటి కొన్ని సంచలన విషయాలకు మీడియా ద్వారా ముందుగానే  ప్రాచుర్యం కల్పించి సొంత పబ్బం గడుపుకుంటున్నారనే అపవాదు కూడా వారిపై వుంది. 

ప్రముఖులు జీవించి వున్నకాలంలో, వారితో సన్నిహితంగా మెలిగేవారికి ఆ ప్రసిద్దుల జీవితాల్లో, జనాలకు తెలియని కొన్ని ఆసక్తికర అంశాలను గమనించగలిగే అవకాశం వుంటుంది. అయితే దీన్ని అవకాశంగా తీసుకుని, వారు మరణించిన తరువాత వారికి సంబంధించిన విషయాలను ఇలా ఆత్మకధల ద్వారా బయట పెట్టడంలో నైతికత ఏమిటన్న ప్రశ్నకు వారివద్ద సమాధానం ఉండడంలేదు.

ఉపశృతి: జీవిత చరిత్రల నుంచి నేర్చుకునే విషయాలు వుండాలి. అంతేకాని, అమ్మకాలు పెంచుకోవడం కోసమే రాస్తే వాటిపై జనాలకు నమ్మకాలు తగ్గిపోతాయి. 






(28-08-2022)

24, ఆగస్టు 2022, బుధవారం

గాయత్రి మంత్రంలో చెప్పిందే నాసా కనుక్కున్నదా!



గాయత్రి మంత్రం అంతరార్ధం - భండారు శ్రీనివాసరావు 
ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం 
భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
‘న గాయత్ర్యాః పరం మంత్రం నమాతు: పరదైవతం’ అన్నది జగత్ప్రసిద్ధమయిన వృద్ధవచనం
గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
ఆదిశంకరాచార్యులు తమ భాష్యములో ఈ మంత్ర ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ’ అని పేర్కొన్నారు. ‘గయలు’ అంటే ప్రాణములు అని అర్ధం. అలాగే ‘త్రాయతే’ అంటే కాపాడడమని భావం. కాబట్టి ప్రాణాలను రక్షించే మంత్రం గాయత్రి మంత్రమని శంకర భాష్యం.
ఈ మంత్ర శక్తిని గుర్తించిన వాడు కనుకనే వాల్మీకి మహర్షి తన రామాయణ రచనలో గాయత్రి మంత్రంలోని బీజాక్షరాలను చక్కగా ఉపయోగించుకోవడం జరిగిందన్నది పండిత ప్రకర్షుల ఉవాచ. రామాయణంలోని ప్రతి వేయి శ్లోకాలకు ఆరంభంలోనే ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరాన్ని చేర్చి ఇరవై నాలుగు అక్షరాలతో మొత్తం ఇరవై నాలుగువేల శ్లోకాలతో రామాయణాన్ని పూర్తిచేశారని ప్రతీతి.
గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరం ఒక బీజాక్షరం మాత్రమే కాక మహా మహిమాన్వితమైనదన్నది మన పూర్వీకుల నమ్మకం. ఈ మంత్రంలోని ప్రతి పదానికి ఒక అర్ధం వుంది. ఒక పరమార్ధం వుంది. దీన్ని జపించడం ద్వారా సమస్త దేవతలను
స్తుతించినట్టు కాగలదని పెద్దల భావన. 
గాయత్రి మంత్రాన్ని శాస్త్రీయ కోణంలో నుంచి పరిశీలించినా అందులో ఎన్నో అంశాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సాంప్రదాయిక అనుసరణలలో ఈ మంత్రంలో దాగున్న శాస్త్రీయ ప్రాధాన్యత కొంత మరుగునపడిపోయిందనే అనుకోవాలి. 
ఆధునిక ఖగోళ శాస్త్రం చెబుతున్నదాని ప్రకారం మన నక్షత్ర మండలాన్ని పాలపుంత లేక ఆకాశ గంగ అంటారు. ఈ పాలపుంతలో మన భూమండలం కంటే లక్షల రెట్లు పెద్దవయిన లక్షల నక్షత్రాలు వున్నాయి. 
ఈ నక్షత్రాలన్నీ మనకు నిత్యం కనబడే సూర్యుడి లాంటివే. మళ్ళీ ఇందులో ఒక్కో నక్షత్రానికి మళ్ళీ ఒక్కో సౌరమండలం వుంది. చంద్రుడు భూమిచుట్టూ తిరుగుతుంటే, ఆ చంద్రుడితో పాటు భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ వుంటుంది. ఈ విధంగానే నక్షత్ర మండలంలోవున్న లక్షలాది గ్రహాలన్నీ తమ నిర్దేశిత కక్ష్యలో గతితప్పక పరిభ్రమిస్తుంటాయి.
మనకు నిత్యం గోచరమయ్యే సూర్యుడు తన సౌర కుటుంబం లోని ఇతర గ్రహాలతో కలసి పాలపుంతల కేంద్ర స్తానాన్ని ఒక్కసారి చుట్టి రావాలంటే ఇరవై రెండు కోట్ల యాభయ్ లక్షల సంవత్సరాల కాలం పడుతుంది. ఈ అనంత విశ్వంలో ఈ పాల పుంతలు పరిభ్రమిస్తున్న వేగం గమనిస్తే కళ్ళు తిరగక మానవు. సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో అవి కదులుతున్నాయంటే ఓ పట్టాన నమ్మడం కష్టం.
ఈ నేపధ్యాన్ని దృష్టిలో వుంచుకుని గాయత్రీ మంత్రాన్ని శాస్త్రీయ కోణం నుంచి పరిశీలిద్దాం.
• ఓం భూర్భు వస్వః - భూర్ అంటే భూమి, భువః – అంటే గ్రహాలు (సౌర కుటుంబం) స్వః - అంటే అసంఖ్యాక నక్షత్రాలతో కూడిన పాలపుంత (గెలాక్సీ)
ఇక్కడ ఓ చిన్న వివరణ – మనం ఇళ్ళల్లో వాడుకునే సీలింగ్ ఫాన్ రెక్కలు నిమిషానికి తొమ్మిదివందల సార్లు తిరుగుతాయి. ఆ వేగానికే అది చేసే చప్పుడు ఎలావుంటుందో అందరికీ అనుభవైకవేద్యమే. అలాటిది, ఈ అనంత విశ్వంలో అంతులేని సంఖ్యలో గెలాక్సీలు సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో పరిభ్రమిస్తున్నప్పుడు ఉద్భవించే శబ్దం ఏవిధంగా వుంటుందన్నది ఊహాతీతం.
గాయత్రి మంత్రంలో చెప్పిన - ఓం భూర్భుస్వః – అనే ఈ బీజాక్షరాలు – ఈ చరాచర విశ్వంలోని గ్రహరాసులన్నీ కలసి తమ పరిభ్రమణ సమయంలో సృష్టిస్తున్న మొత్తం ధ్వని ఓంకారాన్ని పోలివున్నదన్న వాస్తవాన్ని తెలియచేస్తున్నాయి. 
సృష్టికి ప్రతి సృష్టి చేయ సంకల్పించిన విశ్వామిత్ర మహర్షి తపో దీక్షలో వున్నప్పుడు ఈ ధ్వనిని విని తన తోటి మునులకు దానిని గురించి తెలియచేసాడని ఐతిహ్యం. అప్పుడు వారందరూ కలసి ఈ ధ్వనికి ‘ఓం’ అని నామకరణం చేశారు. త్రికాలాల్లో వినవచ్చే శబ్దం కనుక భగవంతుడి పేరు మీద ఆ ధ్వనికి ఓం అని పేరు పెట్టారు.
కాబట్టి నిరాకారుడు,నిర్గుణుడు అయిన ఆ పరమేశ్వరుడుకి ఒక నిర్దిష్ట నామం ప్రసాదించడం అన్నది మొదటిసారి జరిగిందని విశ్వాసుల విశ్వాసం. అప్పటిదాకా 
భగవంతుడికి ఒక రూపం అంటూ ఏమీ లేదని అందరు నమ్ముతూ వచ్చారు. అందుకే ఈ కొత్త వాస్తవాన్ని ఒక పట్టాన నమ్మడానికి ఎవరూ ముందుకు రాలేదు.
గీతాకారుడు కూడా అదే చెప్పాడు. “ ఓం ఏకాక్షరం బ్రహ్మ” అంటే ఈ అనంత కోటి బ్రహ్మాండ నాయకుడి ఏకాక్షర నామమే ఓం. 
అందుకే, ఋషులు ఈ శబ్దానికి ఉద్గితి అని కూడా పేరు పెట్టారు. అంటే స్వర్గం నుంచి వెలువడే సంగీత ఝరి అన్నమాట.
ఋషులు మరో విషయం కూడా కనుక్కున్నారు. అదేమిటంటే అనంత విశ్వంలో సెకనుకు ఇరవై వేలమైళ్ళ వేగంతో పరిభ్రమిస్తున్న గెలాక్సీలన్నీ కలిపి ½ MV2 కైనెటిక్ ఎనర్జీ ని ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే తద్వారా చరాచర విశ్వం లోని గ్రహరాసులన్నీ కలిపి వినియోగిస్తున్న ఎనర్జీ ఏదో ఒక మేరకు సమతుల్యం కావడానికి ఇది దోహద పడుతోంది. దీన్నే గాయత్రిలో ప్రణవంగా పేర్కొన్నారు. అంటే గెలాక్సీలన్నీ కలసి ఉత్పత్తిచేసే ఎనర్జీకి స్టోర్ హౌస్ వంటిదన్నమాట.
తత్స వితుర్వరేణ్యం
తత్ అంటే ఆ (భగవంతుడు) సవితుర్ అంటే సూర్యుడు (నక్షత్రం) వరేణ్యం అంటే వందనానికి, గౌరవానికి అర్హత కలిగివుండడం.
ఒక వ్యక్తి రూపం, పేరుతొ సహా తెలిసినప్పుడు ఆ వ్యక్తిని చూడగానే పలానా అని అవగతమవుతుంది. రూపం, నామం రెండూ తెలవడం మూలాన నిరాకారుడయిన ఆ దేవదేవుడిని గుర్తించడానికి సరయిన పునాది దొరుకుతుందని విశ్వామిత్ర మహర్షి వాక్రుచ్చాడు. 
ధ్వని ద్వారా (ఓంకార నాదం) కాంతి ద్వారా (సూర్యుడు, నక్షత్రాలు) మనకు తెలియని, మనకు కనబడని నిరాకారుడయిన భగవంతుడిని అర్ధం చేసుకోవచ్చు అని విశ్వామిత్ర మహర్షి చెప్పాడు.
ఇది యెలా అంటే- ఒక గణిత శాస్త్రజ్ఞుడు x2+Y2=4; if x=2 అనే కఠినమైన లెక్కకు ఇట్టే జవాబు చెప్పగలుగుతాడు. అలాగే, ఒక ఇంజినీర్ నది వొడ్డున నిలబడి తనవద్దవున్న ఉపకరణాల సాయంతో ఆ నది వెడల్పును అంచనా వేయగలుగుతాడు. వారి వారి రంగాలలో వారికున్న నైపుణ్యాన్ని బట్టి సాధ్యం అది అని ఎవరయినా ఒప్పుకుంటారు. విశ్వామిత్రుడు మనకు చెప్పింది ఇదే. 
గాయత్రి మంత్రం లోని తరువాయి భాగాన్ని ఇలా అర్ధం చేసుకోవచ్చు. 
భర్గో దేవస్య ధీమహి 
భర్గో అంటే కాంతి; దేవస్య అంటే దేవత; ధీమహి అంటే ఉపాసించడం.
అందుబాటులో వున్న రూపంలో (సూర్య కాంతి) నిరాకారుడయిన భగవంతుడుడిని కనుగొనవలసిందని విశ్వామిత్రుడు మానవాళికి బోధించాడు. ఓంకారాన్ని జపిస్తూ
దేవుడిని పూజించాలని కూడా ఆయన చెప్పారు. 
ఆయన చేసిన బోధ వినడానికి బాగానే వుంది. కానీ ఎల్లప్పుడు చంచలంగా వుండే
మనసుకు ఇది సాధ్యపడే పనేనా. అందుకే భగవంతుడిని ధ్యానించే విధానం కూడా గాయత్రి మంత్రంలో వుందని ఆ మహర్షే తెలియచేసాడు.
దియోయోనః ప్రచోదయాత్
ధియో (మేధావి), యో (ఎవరయితే),నః (మనమంతా), ప్రచోదయాత్ ( సరయిన తోవలో నడిపించే మార్గదర్శి) ఓ భగవంతుడా! సరయిన మార్గంలో నడిచేవిదంగా మా మేధస్సు మాకు ఉపయోగపడేలా చేయి.
ఈ నేపధ్యంలో గాయత్రి మంత్రాన్ని శాస్త్రీయ దృక్పధంలో చూసినట్టయితే అందులోని భావం ఇలా వుంటుంది.
భూమి(భుర్) గ్రహాలు (భువః) గెలాక్సీలు (స్వాః) అపరిమితమయిన వేగంతో సంచరిస్తున్నాయి. అవి ఆ క్రమంలో కనీ వినీ ఎరుగని ధ్వనికి కారణమవుతున్నాయి. నిరాకారుడయిన భగవంతుడుకి మరో రూపమే ఆ ధ్వని. దాని పేరే ఓం. ఆ (తత్) భగవంతుడే లక్షల కోట్ల సూర్యుల కాంతి (సవితుర్) రూపంలో తిరిగి ప్రభవిస్తున్నాడు. అలాటి దేవదేవుడు మన ఆరాధనకు (వరేణ్యం)అర్హుడు. 
కాబట్టి, మనమందరం ఆ దేవతారూపమయిన (దేవస్య) కాంతి (భర్గో) ని ధ్యానించాలి. అదే సమయంలో ఓంకారనాదంతో కూడిన భజనలు చేయాలి. (యో) అట్టి భగవానుడు మనం సరయిన మార్గంలో (ప్రచోదయాత్) నడవగలిగే విధంగా మన (నః) మేధస్సు (ధియో) ఉపయోగపడేలా చేయాలి.
ఆనో భద్ర క్రతవో యన్తు విశ్వతః –రిగ్వేద 
(అన్ని దిక్కులనుంచి మంచి ఆలోచనలు నాలోకి ప్రవేశించు గాక)

23, ఆగస్టు 2022, మంగళవారం

బిగ్ జీరో – భండారు శ్రీనివాసరావు

 

“ఏదో అనుకున్నాకానీ నువ్వో బిగ్ జీరో”
అన్నారు, నాకు జర్నలిజంలో అక్షరాలు దిద్దించిన ఆంధ్రజ్యోతి వారపత్రిక ఎడిటర్ పురాణం సుబ్రమణ్య శర్మ గారు.
అప్పుడు నేను ఆయన దగ్గర సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాను. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు సుదీర్ఘ సెలవులో పోవడం వల్ల నాకు అనుకోకుండా కలిగిన అదృష్టం అది. దినపత్రికలో సబ్ ఎడిటర్ గా ఉన్న నన్ను ఎడిటర్ నండూరి రామ్మోహన రావు గారు కొన్నిరోజులపాటు పురాణం గారికి సాయంగా ఉండమన్నారు.
ఆరోజుల్లో, పేరు జ్ఞాపకం రావడం లేదు కానీ ఒక తెలుగు చిత్రానికి కధ, మాటలు రాసే అవకాశం పురాణం గారికి వచ్చింది. బెజవాడ బీసెంటు రోడ్డులోని మోడరన్ కేఫ్ లో ఒక గది ఇచ్చారు నిర్మాతలు. పగలు ఆఫీసు పనిచూసుకుని సాయంత్రానికి పురాణం గారు అక్కడికి వచ్చేవారు. ఆ పని పూర్తికావస్తున్న దశలో కాబోలు నన్ను సాయంగా రమ్మన్నారు.
ఆయన గారి ఆలోచనలు జెట్ స్పీడు. దానికి తగ్గట్టుగా వాటిని కాగితాలపై పెట్టడం నా పని, నన్నయభట్టుకు నారాయణ భట్టు మాదిరిగా. ఆయన చెబుతూ వుండడం నేను రాస్తూ పోవడం. నేను పత్రికా విలేకరినే కానీ తెలుగు షార్ట్ హ్యాండ్ గట్రా ఏమీ తెలవ్వు. అంచేత కొన్ని నట్లు పడేవి. ఆ సందర్భంలో ఒక రోజు పురాణం వారు అక్షింతలు వేస్తూ అన్న మాట ఇది. పెద్దవారి అక్షింతలు ఆశీర్వాదాలే కదా!
ఇంతకీ ఆయన ఆ ఒక్క మాటే అని ఊరుకోలేదు.
ఆయన అన్నదేమిటంటే:
“శ్రీనివాసరావ్! నువ్వో జీరో లాంటివాడివి. నీ సంగతి నీకు తెలవదు. ఎవరన్నా నీకు దన్నుగా వుంటే నీ విలువ ఇంకా బాగా పెరుగుతుంది, ఒకటి పక్కన సున్నా లాగా”
ఆయన ఏక్షణంలో అన్నారో తెలవదు.
ఈ సున్నా పక్కన మా ఆవిడ వచ్చి నిలబడిన తర్వాత కానీ నా విలువ పెరిగిన విషయం బోధపడలేదు.
ఇప్పుడు మళ్ళీ సున్నా సున్నా అయింది, పక్కన దన్నుగా నిలబడ్డ మనిషి పోయాక.



20, ఆగస్టు 2022, శనివారం

కాశీ నిబద్ధతకు నా ప్రణామం

2012 – 2022

పదేళ్ల కిందట నేనూ నా భార్య కాశీ పుణ్య క్షేత్రాన్ని దర్శించాము. విశ్వనాధుడి దర్శనం అనంతరం అన్నపూర్ణ దేవాలయానికి వెళ్ళాము. నాకు తెలియకుండానే మా ఆవిడ నా పుట్టిన రోజు ఆగస్టు ఏడో తేదీన నా పేరు మీద అన్నదానం చేయడానికి కాశీ అన్నపూర్ణ అన్నక్షేత్ర ట్రస్ట్ లో తగిన విరాళం చెల్లించింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా ప్రతి ఏటా నా పేరు మీద అన్నదానం చేయడమే కాకుండా ఆ విషయాన్ని తెలియచేస్తూ ఉత్తరం పంపుతున్నారు. అంతే కాదు, అమ్మవారి కుంకుమ, అక్షింతలు, కాశీ దారాలు, ఒక రూపాయి బిళ్ళ పోస్టులో పంపుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు ఏడున అన్నదానం చేసినట్టు ఈ రోజు అందిన ఉత్తరంలో వుంది. విరాళం చెల్లించిన పుణ్యమూర్తి లోకంలో లేకపోయినా ఆ పుణ్యం నాకు ఏటా దక్కుతూనే వుంది.
ట్రస్ట్ అంటే నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న కాశీ అన్నపూర్ణ అన్నక్షేత్ర ట్రస్ట్ కు వేల వేల వందనాలు.



(20-08-2022)

17, ఆగస్టు 2022, బుధవారం

మూడేళ్ళయిందా నన్ను ఒంటరిని చేసి

 


సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు అర్ధరాత్రి చెప్పా పెట్టకుండా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు.
మళ్లీ మనుమరాలిగా జీవిక రూపంలో ఇంట్లో అడుగుపెట్టి ఎడారి జీవితంలో కొత్త చిగుళ్లు పూయిస్తున్నావు.
ఇంతటి దయకు నేను అర్హుడునని ఎలా అనుకున్నావ్!




16, ఆగస్టు 2022, మంగళవారం

పంద్రాాగస్ట్ ప్రభాత్ భేరీ - భండారు శ్రీనివాసరావు

 పంద్రాగష్టును మొదటిసారి పండుగ రూపంలో స్వతంత్ర భరత జాతి యావత్తు ఒక్కటై జరుపుకున్ననాటికి నేను ఏడాది శిశువుని. రెండో పండగ, రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవాన్ని తొలిసారి జరుపుకున్నప్పుడు నా వయస్సు అటూ ఇటుగా నాలుగేళ్ళు.

నాకు ఊహ తెలుస్తున్న వయస్సులో ఈ రెండు పండగలను యెంతో ఉత్సాహంతో జరుపుకున్న రోజులు యిప్పటికీ జ్ఞాపకం వున్నాయి. పొద్దున్నే లేచి బడికి వెళ్లి పంతులు గారు త్రివర్ణపతాకం చేతబట్టుకుని ముందు నడుస్తుంటే పిల్లలం అందరం ఊరేగింపుగా ఊరంతా తిరుగుతూ ప్రభాత్ భేరిలో పాల్గొనేవాళ్ళం.
ప్రభాత్ భేరి అనే మాటకు అర్ధం తెలియని వయసు. అయినా అలా ఊరేగింపుగా బయలుదేరి 'భారత్ మాతాకీ జై' అని నినాదాలు చేస్తూ వీధుల్లో తిరుగుతూ వుంటే ఊరంతా ఉత్సాహం ఉరకలెత్తేది. 'జనగణమన' గీతంలో, ఏ ఏ భాషల ప్రస్తావనవుందో, ఏ ఏ ప్రాంతాల ప్రసక్తి వుందో మాకు అప్పటికి తెలియదు. ఆ గీతాన్ని ఎవరు రాసారో, ఏ భాషలో రాసారో అంతకంటే తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే అది అందరి గీతం. జనగణమన చరణాలలోని, 'న' ను 'న' లాగా, 'ణ' ను 'ణ' లాగా, తప్పులు దొర్లకుండా ఎలా పాడాలన్న తపన ఒక్కటే మాకు తెలిసింది. ఢిల్లీ ఎక్కడ వుందో తెలియదు, ఎర్రకోట అంటే తెలియదు, కానీ దానిపై చాచా నెహ్రూ జండా ఎగురవేస్తాడని మాత్రం తెలుసు. ఏమీ తెలియని అజ్ఞానంలోని మధురిమను ఆస్వాదించడం కూడా ఒక మంచి అనుభవమే అని ఈనాడు ఆ రోజులను గుర్తుకు తెచ్చుకుంటే అనిపిస్తోంది.
అవును. ఎక్కడికి పోయాయి ఆ రోజులు?
'లేవరా నాన్నా! ఈరోజు స్కూల్లో జండా ఎగరేస్తారు తొందరగా వెళ్ళాలి' అని తల్లి అంటే- ‘కాసేపు పడుకోనీ మమ్మీ, ఈ రోజు సెలవే కదా!' అని పిల్లలు ముసుగేసి నసిగే రోజులు వచ్చేసాయి. పండగదినం స్తానంలో సెలవు రోజు వచ్చింది. తప్పులు లేకుండా ‘జనగణమన' పాడడం పోయి, ఆ గీతంలో తప్పులెన్నే రోజు వచ్చింది. ఏటేటా జరిగే పతాక ఆవిష్కరణలు మొక్కుబడిగా మారిపోయాయి. మర్నాడు ఆ జాతీయ పతాకాలను ఏ స్థితిలో చూడాల్సి వస్తుందో అనే బెంగ మాత్రం మిగిలిపోతుంది.
ఏమి చెప్పుదు సంజయా!
(16-08-2022)

15, ఆగస్టు 2022, సోమవారం

ఏం సాధించాం! – భండారు శ్రీనివాసరావు


స్వాతంత్ర అమృతోత్సవ సంబరాలు సరే, ఇన్నేళ్ళలో ఏం సాధించాం?

ఇలాంటి సాధింపులు ఈ పండగ పూట పక్కన బెట్టి, సాధించిన వాటిని గురించి ముచ్చటించుకుందాం. మనసుకు బాగుంటుంది.
గడచిన డెబ్బయ్ అయిదేళ్ళ కాలంలో ప్రపంచం గర్వించదగిన గొప్ప లక్షణాలను, విజయాలను స్వతంత్ర భారతం తన కొంగున ముడివేసుకుంది. 1947 లో మనదేశంతో పాటే స్వేచ్చా వాయువులు పీల్చుకున్న అనేక ఆసియా దేశాలు, ఇరుగు పొరుగు దేశాలు ఈ డెబ్బయి అయిదేళ్ళలో కొంతకాలం పాటయినా ప్రజాస్వామ్య పధాన్ని వీడి, నియంతృత్వపు బాటలో నడిచిన దాఖలాలున్నాయి. మన దేశం మాత్రం ఎన్ని వొడిదుడుకులకు లోనయినా, మరెన్ని వొత్తిడులకు గురయినా, ఎంచుకున్న మార్గంలోనే అప్రతిహతంగా పురోగమించి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటిగా తన స్తానాన్ని పదిలం చేసుకుంది.
జనాభాలో అత్యధిక భాగం నిరక్షరకుక్షులయినా 'వోటు' అనే ఆయుధంతో ప్రభుత్వాలను మార్చగల సత్తా వారి సొంతం.
అక్షర జ్ఞానం లేకపోయినా, కానులూ, ఏగానులనుంచి, బేడలూ అర్ధణాల నుంచి నయా పైసల లెక్కకు అలవోకగా మారగలిగిన 'మేధోతనం' మనవారి ఆస్తి.
గిద్దెలు, సోలలు, శేర్లు, సవాశేర్లు, మానికెల కొలతలనుంచి లీటర్లకు అతి తక్కువ వ్యవధిలో మారిన చరిత్ర మన వారిది.
అలాగే, వీసెలు, మణుగులనుంచి కిలోగ్రాములకు, బస్తాలనుంచి క్వింటాళ్లకు, 'మైలు రాళ్ళని' అధిగమించి కిలోమీటర్లకు ఎదిగారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా కిలోమీటర్ల లెక్కల్లోకి మారిపోకుండా పాతకాలంలోలా ఇంకా 'మైలు'రాళ్ళ దగ్గరే ఆగిపోయిన సంగతి ఇక్కడ గమనార్హం.
చదువూసంధ్యా లేని వాళ్లనీ, ఎందుకు పనికిరాని వాళ్ళనీ ఇతర దేశాల వారికి మనపై చిన్నచూపు. కానీ అలాటి మనవాళ్లు, దేశానికి స్వాతంత్రం రాగానే నిర్వహించిన తొలి ఎన్నికల్లో పార్టీల గుర్తులున్న పెట్టెలలో వోటు వేసే దశను అలవోకగా దాటేసారు. ఆ తరువాత ఒకే బాలట్ పేపరుపై ముద్రించిన అనేక పార్టీల గుర్తులనుంచి తాము ఎంచుకున్న అభ్యర్ధిని అతడి గుర్తుతోనే గుర్తుపట్టి వోటు వేయగల పరిణతిని అందుకున్నారు. ఇప్పుడు ఏకంగా అధునాతన ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను తడబడకుండా ఉపయోగించుకోగల సామర్ధ్యాన్ని అలవరచుకోగలిగారు.
'ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణం' అనే నిర్లిప్త స్తితిని అధిగమించి ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో భారతీయుల ముద్ర స్పుటంగా, ప్రస్పుటంగా ప్రపంచ వ్యాప్తంగా కానరాగల అత్యున్నత శిఖరాలకు మన దేశం చేరుకోగలగడం స్వతంత్ర భారతం సాధించిన మరో ఘనత.
'చందమామ రావే' అంటూ పాటలు పాడే స్తితి నుంచి 'చంద్రయాన్' వరకు ఎదగగలిగాము. అంతరిక్ష పరిశోధనల్లో అభివృద్ధి చెందిన దేశాల సరసకు చేరగలిగాము. సుదూర లక్ష్యాలను చేధించగలిగిన అధునాతన రక్షణ క్షిపణులను అంబుల పొదిలో చేర్చుకోగలిగాము. సస్య విప్లవం విజయవంతం చేసుకుని ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే దుస్తితి తప్పించుకుని స్వయం సమృద్ధిని సాధించుకోగలిగాము.
ఏ ఇంగ్లీష్ వారితో తలపడి, అహింసా మార్గంలో వారితో పోరాడి స్వతంత్రం సంపాదించుకున్నామో, ఆ ఇంగ్లీషు వారి భాషనే ఆయుధంగా చేసుకుని, దేశ దేశాలలో కంప్యూటర్ రంగాన్ని మన కనుసన్నలతో శాసించగలుగుతున్నాము.
ఇలాంటి విజయాలను ఈనాడు మనం చెప్పుకోవాలి. ఇలాంటి ఘనతలను గురించి మనం ఈనాడు ఘనంగా చెప్పుకోవాలి.
ఇంకా ఏమైనా చెప్పుకోవాలి అని వుంటే వాటికి మరో రోజు కేటాయించండి.
ఈరోజు మాత్రం ఇలాగే గడపండి.
(15-08-2022)

14, ఆగస్టు 2022, ఆదివారం

మూడో పేజీ చూశారా గురూగారూ! – భండారు శ్రీనివాసరావు

  

(Published in Andhra Prabha daily today, 14-08-2022)


నా చిన్నతనంలో చదివిన జోకు ఇది.

ఒకతను దినపత్రిక ఒకటి  చేతబట్టుకుని వీధిలో అందరి వెంటాపడుతూ, ‘మూడో పేజీ చూశారా’ అని వేధిస్తుంటాడు. విషయం ఏమిటంటే అతగాడు రాసిన ఉత్తరాన్ని ఆ రోజు ‘పాఠకుల లేఖలు’ శీర్షికలో ప్రచురించారు. దాన్ని గురించి నలుగురికీ తెలపడానికి అతడెన్నుకున్న మార్గం ఇది. (ఆదుర్తి వారు తీసిన సినిమాలో కూడా ఈ మాదిరి సన్నివేశం వున్నట్టు గుర్తు)

తాము చేసిన పనులు ( వారి దృష్టిలో ఘనకార్యాలు) నలుగురి దృష్టికి తీసుకురావడానికి రకరకాల పద్ధతులు అనుసరిస్తూ వుండడం మనకు కొత్తేమీ కాదు. కొందరు బాహాటంగా బయటపడి నిస్సిగ్గుగా చెప్పుకుంటే, మరికొందరు నర్మగర్భంగా పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. రాజుల కాలంలో ఈ పని చేయడానికి కొందరు ఉద్యోగులు వుండేవాళ్ళు. రాజు చేసిన పనులను గోరంతను కొండంత చేసి పొగడ్తలతో ముంచెత్తడం వీరి ప్రధాన విధి. కొండొకచో, వారి ఆస్తాన కవులు కూడా ప్రత్యేక సందర్భాలలో అన్యాపదేశంగా ఈ కర్తవ్య పాలన చేసి తమ రాజభక్తిని కవితాత్మకంగా చాటుకునేవారు. తదుపరి జమీందారుల కాలంలో సయితం కొనసాగిన ఈ విధానం, ప్రజాస్వామ్య యుగంలో ఉగాది కవి సమ్మేళనాల రూపంలో కొత్తపుంతలు తొక్కుతోంది. ఇక మీడియాలో అనుదిన  ప్రచార ప్రకటనలు సరేసరి. ‘ప్రచారం కోసం ఇన్నిన్ని కోట్లు ప్రజాధనం ఖర్చు చేస్తారా ? ఆయ్!’ అంటూ హుంకరించి, పత్రికలకెక్కి విమర్శలు గుప్పించిన ప్రధానప్రతిపక్షం వాళ్ళే, తాము అధికారంలోకి రాగానే ఆ విషయాన్ని వీలుచేసుకుని మరీ మరచిపోతారు. మరచిపోవడమే కాదు, పబ్లిసిటీ ఇచ్చుకునే విషయంలో తమ వైరిపక్షం కన్నా నాలుగాకులు ఎక్కువే చదివామని అనిపించుకుంటున్నారు. కాలక్రమంలో ఇది మరింతగా ముదిరిపోయి ప్రభుత్వ పధకాల ప్రచారం కాస్తా అధికారంలో కీలక స్తానాల్లో వున్న వారి వ్యక్తిగత ప్రచారంగా రూపుదిద్దుకోవడం, ఆ ఖర్చును పన్నుల రూపంలో ప్రజల మీద రుద్దడం,  ఇవన్నీ ప్రజాస్వామ్య యుగంలో సహజాతి సహజంగా జరిగిపోతున్నాయి.

వ్యక్తిగతం అంటే గుర్తుకొచ్చింది. వ్యవస్థలు, ఆ వ్యవస్థలను శాసించే వ్యక్తుల సంగతి అటుంచండి. ఇప్పుడీ ప్రచార ఉధృతి అనేది సామాన్య జనజీవనంలోకి కూడా ప్రవేశించింది. పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, పూజలు, పునస్కారాలు అన్నీ ప్రచార ప్రాతిపదికనే జరిగిపోతున్నాయి. సంస్కృతీ సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తున్నామన్న భావనకన్నా, ఎంత ఆడంబరంగా జరుపుకుంటున్నామన్న అభిజాత్యమే వీటిల్లో బాగా కానవస్తోంది.

కొత్తగా ఫ్రిజ్ కొనుక్కున్నావిడ ఇంటికొచ్చిన ప్రతి వాళ్లకు అడగకుండానే ‘మంచినీళ్ళు తాగుతారా పిన్ని గారు’ అని అడిగి, నీళ్ళ గ్లాసు చేతికిచ్చి, ‘చల్లగానే వుంటాయి లెండి, కొత్త ప్రిజ్ కదా’ అంటూ తాము ప్రిజ్ కొన్న సంగతి చల్లగా బయటపెట్టే సన్నివేశాలకు సినిమాల్లో కొదవ వుండదు. అలాగే కొన్న చీరెలు గురించీ, నగల గురించీ ఇరుగూ పొరుగుతో చెప్పుకుని తృప్తిపడే ఆడంగులు కొల్లలుగా కనిపిస్తారు. ఇక మగవాళ్లు తమ చేతికి పెట్టుకున్న వాచీ, చేతిలో వున్న మొబైల్  ఎంత ఖరీదూ అనే విషయాన్ని అడగకుండానే అన్యులకు తెలియచేస్తుంటారు. ఇలాటివాళ్ళతో పేచీ ఏమీ లేదు. ‘ఆహా ఒహో అలాగా!’ అంటే చాలు మురిసి ముక్కచెక్కలవుతారు.

మరోరకం వాళ్ళతోనే ఇబ్బంది. వాళ్లు ఏది కొన్నా అదే బెస్ట్ అంటారు. తాము ఏది చేసినా అది ఇతరులు ఎవ్వరూ చేయలేరన్న ధీమా అనండి, అతిశయం అనండి, వారి మాటల్లో పెల్లుబుకుతుంటుంది. వాళ్ల రూటే సపరేటు. వాళ్లు వెళ్ళిందే మంచిహోటలు. వాళ్లు చూసిందే భేషయిన సినిమా. వాళ్లు చదివిందే చక్కటి పుస్తకం. వాళ్లు చెప్పిందే వేదం. ఇంతెందుకు! వాళ్లు పట్టిన కుందేటికి నాలుగు కాళ్ళు వుంటే నా మీద వొట్టు.

దీన్ని ‘వన్ వే’ పబ్లిసిటీ అనాలేమో. ఇతరులకి ఎంత మాత్రం ఛాన్స్ ఇవ్వరు మరి.

ఈ మధ్య ఓ కొత్తరకం సెల్ఫ్ డబ్బా ఒకటి మొదలయింది. ‘పలానా టీవీ పలానా టైం కు పెట్టండి. నా ప్రోగ్రాం వస్తుంది’ అని తెలిసిన వాళ్లకు, తెలియని వాళ్లకు మొబైల్ ఫోన్లల్లో ‘ఎస్సెమ్మెస్’ లు ఇస్తుంటారు. ‘దయచేసి పలానా వారపత్రికలో/దినపత్రికలో నా వ్యాసం వచ్చింది చదవండి ప్లీజ్’ అని వచ్చే ఎస్సెమ్మెస్ ల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. టీవీ చర్చల్లో పాల్గొనే మేధావులలో కొందరు ‘పలానా పత్రికలో ఈ విషయం గురించి ఇప్పటికే రాసేసాను’ అని చెప్పుకోవడం సెల్ఫ్ పబ్లిసిటీకి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ఇక సోషల్ మీడియాలో ఆ రచనల కటింగులు, క్లిప్పింగులు పోస్టు చేయడం ఆనవాయితీగా మారింది. ఇప్పుడు వచ్చిపడ్డ  వాట్సప్ పుణ్యమా అని ఇక వీళ్ళని ఆపడం ఎవరి తరం కావడం లేదు.

‘నిన్ను గురించి నువ్వు ఎప్పుడూ చెప్పుకోకు. నిజం చెప్పుకుంటే ఎవ్వరూ నమ్మరు. అబద్ధం చెబితే మాత్రం ఇంకా యెంత వున్నదో అని సందేహిస్తారు’ అని  మా అన్నయ్య ఎప్పుడూ చెబుతుండేవాడు. కానీ ఈనాటి సూత్రాలకు ఇది పూర్తిగా విరుద్ధం. సిద్ధాంతాలయినా, ఆదర్శాలయినా దేశ, కాల, మాన పరిస్థితులను బట్టి మారిపోతుంటాయి. ఒకప్పుడు ఒక పార్టీలో వున్నవాడు ఎప్పటికీ అలాగే వుండిపోనక్కరలేదు. రాత్రికి రాత్రే తమ ప్రత్యర్ధి పార్టీలోకి మారిపోయి, కొత్త పార్టీ కండవా కొత్తగా కప్పుకుని మర్నాడు పొద్దున్నే ఏ టీవీ ఛానల్ చర్చావేదికపైనో  తమ వితండవాదాలతో కుండలు, బల్లలు బద్దలు కొడుతూ వుండవచ్చు. పొతే, మార్పు మానవులకు సహజం అన్న సిద్ధాంతం సమర్ధించుకోవడానికి ఎలాగూ వుంది. ‘తరచూ ఒపీనియన్స్ మార్చుకోకపోతే పొలిటీషియన్ కానేరడు’ అని గిరీశం ఏనాడో చెప్పాడు కూడా.

అంచేత మాస్టారూ, ప్రతివాడూ తన గురించి తానే చెప్పుకోవాలి. ఇతరుల గురించి నాలుగు మంచి మాటలు చెప్పే మంచితనం ఈనాడు కలికానికి కూడా దొరకని పరిస్తితి. అందువల్ల, ఏతావాతా చెప్పేదేమిటంటే మనకి మనమే పీఆర్వోలం. మన గురించి మనమే ప్రచారం చేసుకోవాలి. అవతల మనిషి నమ్మడం లేదని తెలిసినా మన గురించి మనం చెప్పుకుంటూనే పోవాలి. ఎదుటివాడు నమ్మకపోయినా కనీసం అతడి పక్కవాడు మన మాటల్ని నమ్మే ఛాన్సు కొంతయినా వుంటుంది. ఆలశ్యం ఎందుకు? స్వయం భజన బృందంలో చేరిపోదాం పదండి.

ఇక సిగ్గంటారా! దాన్ని వొదలకపోతే ఈ పాడు ప్రపంచంలో ఎదగడం కష్టం!!



11, ఆగస్టు 2022, గురువారం

రాజకీయాల్లో పెదరాయుడు వెంకయ్య నాయుడు – భండారు శ్రీనివాసరావు


(ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితం)


వెంకయ్య నాయుడు.

ఉపరాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి అంటూ పేరుకు ముందు విశేషణాలు అవసరం లేకుండా దేశమంతా తెలిసిన పేరు.

 

అలాంటి వెంకయ్యనాయుడు గురించిన ఒక విలేకరిగా నేను మరచిపోలేని కొన్ని జ్ఞాపకాలు వున్నాయి.


1972 – 73


ప్రత్యేక ఆంద్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులు. నేను బెజవాడ నార్లవారి ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాను. బందరు రోడ్డులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ఇప్పుడు స్వరాజ్ మైదానం అనుకుంటా, అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రధాన వక్తలు మాట్లాడిన తరువాత ఒక యువకుడు మైకు అందుకున్నాడు. నిమిషాల వ్యవధిలోనే సభికులను తన వాగ్దాటితో మైకంలో ముంచి తేల్చాడు. ఎవరని ఆరా తీస్తే వెంకయ్య నాయుడు అన్నారు. పేరు చూస్తే వయసుమళ్ళినవాడనిపించించేది కానీ, మనిషి మాత్రం చాలా చిన్నకారువాడే.
1975
లో హైదరాబాదు ఆలిండియా రేడియోలో విలేకరిగా చేరిన మూడు సంవత్సరాలకు వెంకయ్యనాయుడు ఎమ్మెల్యేగా శాసన సభలో అడుగుపెట్టారు. ఆయనకు జోడీ ఎస్. జై పాల్ రెడ్డి. ఇక వాళ్ళు సభలో ప్రసంగం మొదలు పెట్టినా, ప్రశ్నలు లేవనెత్తినా, ప్రభుత్వాన్ని నిలదీసినా మొత్తం ప్రెస్ గ్యాలరీ పూర్తిగా నిండిపోయేది. వింటూ రాసుకోవడం విలేకరులకి అలవాటే అయినా వాళ్ళిద్దరూ చెబుతున్నది ఆసక్తిగా వినాలా, శ్రద్ధగా వింటూ పొల్లుపోకుండా రాసుకోవాలా అనేది అందరికీ ఒక సమస్యగా వుండేది. ఆ రోజుల్లో శాసన సభలో ఛలోక్తులుఅనే శీర్షికతో ప్రతి పత్రికా ఒక కాలం ప్రచురించేది. వాటిల్లో సింహభాగం వారిద్దరివే ఉండేవి. ఈ విషయంలో ఇద్దరూ ఇద్దరే. వెంకయ్యనాయుడి విశ్వరూపం నేను చూసింది అసెంబ్లీలోనే. అంత్య ప్రాసలతో ఉపన్యాసాన్ని రక్తి కట్టించే ఆ సాంప్రదాయాన్ని ఆనాటి నుంచి ఈనాటివరకూ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ప్రసంగాల్లో కూడా ఆయన కొనసాగిస్తూ వస్తూనే వున్నారు.
ఆయనతో నా రేడియో అనుబంధం ఇంకా విచిత్రం. ఏదైనా వార్తను పత్రికలకు ఎలా చెప్పాలో, రేడియోకు ఎలా చెప్పాలో ఆయనకు కరతలామలకం. మాకు మధ్యాన్నం, మళ్ళీ సాయంత్రం ప్రాంతీయ వార్తలు ఉండేవి. ఆయన ఇరవై మూడు జిల్లాల్లో ఎక్కడ వున్నా ఫోనుచేసి వార్త చెప్పేవారు. మేము ప్రసారం చేసింది విని, మళ్ళీ ఫోను చేసి బాగానే చెప్పారు కానీ మరో వాక్యం జత చేస్తే బాగుండేది, సాయంత్రం వీలుంటే  చెప్పండిఅనేవారు, ‘కాదుఅనడానికి వీల్లేకుండా.
ఇక ఎన్టీఆర్  రోజుల్లో జరిగిన   ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో ఆయన పాత్ర ఇంతా అంతా కాదు. ప్రజల్లో రగిలిన అసహనానికి ఆయన వాగ్ధాటి ఆజ్యం పోసిందనడంలో అతిశయోక్తి లేదు.
మరోసారి కలిసింది ఢిల్లీలో. మాస్కో రేడియోలో పనిచేస్తూ సెలవుపై హైదరాబాదు వస్తూ ఢిల్లీలో దిగాను. పూర్వ పరిచయం పురస్కరించుకుని వెడితే, గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించారు. మాస్కో విశేషాలు అడిగి ఆసక్తిగా విన్నారు.
ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న రోజుల్లో నేనూ జ్వాలా నరసింహారావు ఒకసారి ఢిల్లీ వెళ్ళాము. ఏపీ భవన్ లో దిగిన మమ్మల్ని కలవడానికి సీనియర్ జర్నలిష్టులు చంద్రకాంత్, ఆనంద్ వచ్చారు. మాటల మధ్యలో వెంకయ్యనాయుడు గారి ఇంటికి వెడుతున్నట్టు చెప్పి మమ్మల్ని కూడా రమ్మన్నారు. ఆయన ప్రతి సంక్రాంతి పండక్కు కాబోలు తన ఇంట్లో చక్కటి విందు భోజనం ఏర్పాటుచేసి, ఢిల్లీ లోని తెలుగు కుటుంబాలను ఆహ్వానిస్తారు. పిలవని పేరంటంగా వెళ్లిన మా ఇద్దర్నీ కూడా వెంకయ్యనాయుడు చాలా ఆదరంగా కనుక్కున్నారు. అందరూ వెళ్ళిన తరువాత వెళ్లి కలిస్తే వచ్చిన పనేమిటనిఆయనే ఆరా తీసారు. అప్పుడు జ్వాలా 108 లో పనిచేస్తున్నాడు. రాజస్థాన్ రాష్ట్రంలో విస్తరణ గురించి జ్వాలా చెబితే అక్కడి ముఖ్యమంత్రితో మాట్లాడుతానని చెప్పి, అప్పటికప్పుడే మాట్లాడారు కూడా.
ఏడాది క్రితం ఒకసారి హైదరాబాదులో ఏదో కార్యక్రమానికి హాజరయి, జనాల హర్షద్వానాల నడుమ ఆసక్తికర ఉపన్యాసం ముగించుకుని, విమానం టైం అయిందని మధ్యలోనే వెడుతుంటే దారిలో నాకు కనిపించారు. ఎలా వున్నావు శ్రీనివాసరావుఅంటూ అదే ఆదరణతో కూడిన పలకరింపు. నడుస్తూనే నా గురించి మంచీచెడూ కనుక్కుంటూ కారెక్కి వెళ్ళిపోయారు.

 

 

ఉపశ్రుతి :

దేశాన్ని కరోనా పట్టి  పీడిస్తున్న రోజులు.  జనమంతా ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో తెలియక తమని గురించే మధన పడుతున్న రోజులు.

2020 మే నెల నాలుగో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఫోను రింగయింది.

భండారు శ్రీనివాసరావు గారా! లైన్లో వుండండి వైస్ ప్రెసిడెంటు గారు మాట్లాడుతారు”

వెంకయ్య నాయుడు గారు దేశంలో చాలామందికి ఇలా ఫోను చేసి మాట్లాడుతున్నారని తెలుసు, కానీ ఆ ఫోను నాకు వస్తుందని ఊహించలేక పోయాను. ఇంతలోనే నాయుడు గారు లైన్లోకి వచ్చారు.

శ్రీనివాసరావు గారు ఎలా వున్నారు? నేను వెంకయ్య నాయుడిని”

నమస్కారం సార్! నేను బాగున్నానండీ! మీరెలా వున్నారు?”

నేను బాగానే వున్నాను. మీ ఆవిడ చనిపోయిన తర్వాత ఫోను చేసి మాట్లాడలేకపోయాను, వెరీ సారీ”

“..........”

హైదరాబాదులో మన మిత్రులందరూ కులాసేనే కదా!”

అందరూ బాగున్నారండీ. నాకు అర్ధం కాని విషయం అండీ. పేపర్లో చదివాను. మీరు ఈ కరోనా సమయంలో ఇలా అందరితో ఫోను చేసి మాట్లాడుతున్నారని. ఇంత తీరిక ఎలా దొరికింది”

ఇలాంటి సమయాల్లోనే కదా మాట్లాడి యోగక్షేమాలు కనుక్కోవాల్సింది”

“....................”

ఇక్కడ నేను నా భార్య ఇద్దరమే. పిల్లలు దగ్గర లేరు. బహుశా పెళ్ళయిన తర్వాత ఇలా ఇద్దరం ఒక్కచోట ఇన్నాళ్ళు కలిసివుంది ఇప్పుడేనేమో”

చాలా సంతోషంగా వుందండీ మీతో మాట్లాడడం”

నాకూ అలానే వుంది. అందరం పెద్ద వయసులో పడ్డాం. ఆరోగ్యం జాగ్రత్త! వుంటాను శ్రీనివాసరావు గారు”

తర్వాత సిగ్గనిపించింది. ఈ కరోనా సమయంలో నేనూ ఖాళీనే. కానీ ఎంతమంది స్నేహితులను పలకరించగలిగాను?

దటీజ్ వెంకయ్యనాయుడు !

కింది ఫోటో: 


(వెంకయ్య నాయుడితో వ్యాసరచయిత)


(11-08-2022)