30, ఏప్రిల్ 2020, గురువారం

మార్పు చూడని కళ్ళు - ఆరవ ఆఖరి భాగం

చరిత్ర గతిని మార్చిన గోర్భచేవ్
సోవియట్ యూనియన్ అధినేతలలో చాలామంది పదవిలో ఉండగానే మరణించారు. నికితా కృశ్చెవ్ విషయంలో వేరేగా జరిగింది. ఆయన జీవించి ఉండగానే పదవి నుంచి తొలగించారు. మిహాయిల్ గోర్భచేవ్ మాత్రం ఆరేళ్ళు అధికారంలో కొనసాగిన తర్వాత 1991 లో తన పదవికి రాజీనామా చేసారు.  రాజీనామా ప్రకటించిన తర్వాత బల్లపై కాగితాలు సర్దుకుంటూ కళ్ళజోడు తీసి వాటిపై పెట్టి, పక్కనే వున్న కప్పూ సాసరు వంక సాలోచనగా  చూస్తారు. అది ఖాళీగా కనిపిస్తుంది. క్రెమ్లిన్ లో ఆయనకు టీ సర్వ్ చేయకపోవడం అది మొదటిసారి. అధికారానికి అంతిమ ఘడియలకు అది సూచన.
గోర్భచేవ్ స్వతహాగా హాస్య ప్రియుడు. తర్వాత ఎప్పుడో ఆ సంఘటన గురించి చెబుతూ, ‘రాజీనామా పత్రంపై సంతకం చేస్తున్నప్పుడు నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే నన్ను నేనే తుపాకీతో కాల్చుకున్న అనుభూతి కలిగింది” అన్నారాయన మందహాసంతో.
సోవియట్ యూనియన్ విచ్చిన్నం అనంతరం దేశంలో సంభవిస్తూ వచ్చిన పరిణామాలను ఆయన దగ్గర నుంచి గమనిస్తూ వచ్చారు. మిహాయిల్ ఖోదోర్కొవిస్కి తన కళ్ళ ముందే దేశంలో అత్యంత సంపన్నుడిగా ఎదగడం ఆయన చూసారు. ఒకప్పుడు ఆయన్ని పట్టుకుని సైబీరియా జైలుకి  పంపారు. ఆ సమయంలో గోర్భచేవ్ కల్పించుకుని సాయపడకపోతే ఆయన జీవితం అక్కడితో ముగిసివుండేది.
రాజకీయంగా తన ప్రధమ ప్రత్యర్ధి అయిన బోరిస్ ఎల్త్సిన్ అనారోగ్యంతో మరణించినప్పుడు గోర్భచేవ్ ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆ సమయంలో వీఐపీ గేటు ద్వారా వెళ్ళడానికి అవకాశం ఉన్నప్పటికీ ఒక సాధారణ పౌరుడి మాదిరిగా జనంలో నిలబడి తన ఒకప్పటి సహచరుడికి అంతిమ వీడ్కోలు చెప్పారు. ప్రస్తుత అధినేత పుతిన్ తో సంబంధాలు మొదట్లో అద్భుతంగా ఉండడాన్ని, ఆ తర్వాత  పోను పోను నిరాసక్త ధోరణికి మారడాన్ని  కూడా ఆయన గమనించారు. అయినా తామరాకు మీద నీటిబొట్టులా వ్యవహరించే స్తితప్రజ్ఞత అలవరచుకున్నారు. ఎనిమిది పదులు దాటిన వయస్సులో, భార్య చనిపోయి ఊరి బయట వ్యవసాయ క్షేత్రంలోని ఇంటి నుంచి ప్రతిరోజూ క్రమం తప్పకుండా నగరం నడిబొడ్డున వుండే తన ఫౌండేషన్ కార్యాలయానికి వెళ్లి పనిచేసుకోవడం దినచర్యగా మార్చుకున్నారు.
1999 సెప్టెంబరులో  రైసా గోర్భచేవ్ కన్నుమూసినప్పటి నుంచి 89 ఏళ్ళ గోర్భచేవ్ ప్రస్తుతం ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. 
మరో సందర్భంలో బీబీసీ ప్రతినిధికి  ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన  ఇలా చెప్పారు.
“నేను మొదటిసారి 1985లో సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత సోవియట్ యూనియన్ లోని అన్ని రిపబ్లిక్ లలో విస్తృతంగా పర్యటించాను. గ్రామీణ ప్రజలతో దగ్గరగా మాట్లాడాను. నేను కలిసినప్పుడల్లా వాళ్ళు ఒకే మాట చెప్పేవాళ్ళు.
“మనకు చాలా ఇబ్బందులు వున్నాయి. తిండి గింజలకు కటకటఉన్న మాట నిజమే. అయితే  ఏమవుతుంది. మరి కాస్త కష్టపడితే వాటిని పండించుకుంటాము. ఇబ్బందులను అధిగమిస్తాము. కానీ మిమ్మల్ని కోరేది ఒక్కటే. యుద్ధం రాకుండా చూడండి”
“యుద్ధం వల్ల మా దేశం ఎన్ని కష్టాలు పడిందో, ఎంత నష్టపోయిందో వాళ్లకు గుర్తున్నట్టుంది. అందుకే వాళ్ళు ఆ కోరిక కోరారు.  బెర్లిన్ గోడ కూల్చి వేస్తున్నప్పుడు జోక్యం చేసుకోవాలని ఎంత వత్తిడి వచ్చినా నేను ఒప్పుకోలేదు. ఈనాటి ప్రపంచానికి యుద్ధాలు పనికిరావు”
“ప్రజల్లో అధిక సంఖ్యాకులు ఏమి కోరుకుంటున్నారో దాన్ని నెరవేర్చడమే నిజమైన ప్రజాస్వామ్యం” అని చెప్పారాయన.
సోవియట్ యూనియన్ విచ్చిన్నం అయిన ఇరవై ఏడేళ్లకు మెదుజా పత్రిక విలేకరి ఇల్యా జెగులేవ్ మిహాయిల్ గోర్భచేవ్ తన వృద్ధాప్యాన్ని ఎలా గడుపుతున్నారు అనే దానిపై ఒక వ్యాసం రాసారు.
అదిలా మొదలవుతుంది.
“మిస్టర్ గోర్భచేవ్! నేనెవరినో గుర్తున్నానా!”
గోర్భచేవ్ ఎదుట చాలా ఖరీదైన సూటు ధరించిన వ్యక్తి నిలబడిఉంటాడు. అతడి పేరు మిహాయిల్ ఖోదోర్కొవిస్కి. రష్యాలో అత్యంత సంపన్నుడు. మొత్తం దేశంలో అతిపెద్ద ముడిచమురు కంపెనీ ‘యూకోస్’ అధినేత.
“అవును. మీరు గుర్తున్నారు. ఇంతకీ నేనెవరన్నది తమరికి గుర్తు ఉందా?” అని గోర్భచేవ్ ఎదురు ప్రశ్నిస్తాడు.
ఇంటర్వ్యూ చేయడానికి ఆ విలేకరి ఇల్యా ఆయన ఇంటికి  వెళ్ళినప్పుడు గోర్భచేవ్ చెప్పిన మాట వింటే చాలా బాధ వేస్తుంది. 

“నిన్న బయటకు వెళ్ళడానికి బయలుదేరుతూ పైకి చూసాను. పై కప్పు నుంచి నీళ్ళు కారుతున్నాయి” (EOM)

మార్పు చూడని కళ్ళు (5)- భండారు శ్రీనివాసరావు


(చరిత్ర గతిని మార్చిన గోర్భచేవ్)

ప్రెసిడెంట్ గోర్భచెవ్ ని నిజంగా అరెస్టు చేశారా లేక ఆయన స్వచ్చందంగానే ఈ అరెస్టుకు అంగీకరించారా అనే విషయంలో ఇప్పటికీ అనుమానాలు వున్నాయి. సోవియట్  యూనియన్ ని రిపబ్లిక్ ల సమాఖ్యగా ప్రకటించే కొత్త డిక్రీపై మరో రెండు రోజుల్లో అంటే ఆగస్టు ఇరవైన ప్రెసిడెంట్ గోర్భచెవ్ సంతకం చేయాల్సి వుంది. అదే జరిగితే సోవియట్ యూనియన్ విచ్చిన్నం ఖాయం అని నమ్మే వారిలో కొందరు ఒక బృందంగా ఏర్పడి ఆ ఒప్పందంపై సంతకాలు జరిగే కార్యక్రమాన్ని వాయిదా వేయించాలని తలపోశారు. అందులో భాగంగా దేశంలో ఎమర్జెన్సీ (మార్షల్ లా)  ప్రకటించాల్సిందిగా ప్రెసిడెంట్ గోర్భచెవ్ ని ఒప్పించడం కోసం ఆ బృందం కేజీబీ అధికారులని నల్లసముద్ర తీరంలోని వేసవి విడిదికి పంపిందని ఓ కధనం ప్రచారంలో వుండేది. అప్పటికే ప్రెసిడెంట్ గోర్భచెవ్ రాజకీయ ప్రత్యర్ధి బోరిస్ ఎల్త్సిన్ రష్యన్ సోవియట్  రిపబ్లిక్ అధ్యక్షుడిగా పెద్ద మెజారిటీతో ఎన్నికయ్యారు. ఆయన ఆర్ధిక సంస్కరణల విషయంలో గోర్భచేవ్ కంటే రెండడుగులు ముందున్నారు. యువతలో మంచి అభిమానం సంపాదించుకున్నారు.
సోవియట్ యూనియన్ సమగ్రతను కాపాడాలని అనుకున్నవారి ప్రయత్నాలు ఫలించలేదు. అనుకున్నట్టే నాలుగు మాసాల అనంతరం సోవియట్ యూనియన్ చరిత్ర గర్భంలో కలిసిపోయింది. ఆగస్టు పద్దెనిమిది నుంచి ఆగస్టు ఇరవై వరకు అసలు ఏం జరిగింది అన్నది ఇన్నేళ్ళ తర్వాత కూడా ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది.
ఆ రోజు ఆ విడిదిలో ఏమి జరిగింది అనేదానిపై వాలెరీ బోల్దిన్ కధనం వేరుగా వుంది. ఈయన కూడా కుట్రదారుల్లో ఒకరు.
ప్రెసిడెంట్ గోర్భచెవ్ చాలా కోపంగా కనిపించారు. అన్నింటికీ మించి ఏమైనా సరే బోరిస్ ఎల్త్సిన్ బెడద వదిలిపోవాలి అనే భావం అయన మాటల్లో ధ్వనించింది.
చివరికి గోర్భచేవ్ ఇలా అన్నారు. పొండి. ఏం చేసుకుంటారో చేసుకోండి
అయితే ఎమర్జెన్సీ ఎలా విధించాలి అనే దానిపై మాకు కొన్ని సూచనలు కూడా చేసారు అని బోల్దిన్ చెప్పారు.
గోర్భచేవ్ దంపతులు నల్ల సముద్ర తీరంలో గృహ నిర్బంధంలో వున్నప్పుడు అనేక సందేహాలు చుట్టుముట్టాయి. వాళ్ళని బందీగా ఉంచారు అన్నమాటే కానీ వాళ్ళ కదలికల మీద గట్టి కాపలా లేదు. ఇంట్లో ఫోను డిస్కనెక్టు చేశారు కానీ బయట కారులో ఫోను తొలగించలేదు. గృహ నిర్బంధంలో వున్నప్పుడు గోర్భచేవ్ అనేకమందితో మాట్లాడినట్టు రుజువులు వున్నాయి.
1991 కుట్రపై సాధికార సమాచారం కలిగిన అమెరికన్ చరిత్రకారుడు జాన్ డన్లప్ అబిప్రాయం ప్రకారం గోర్భచేవ్ రెండు రకాల ఆలోచనల్లో వున్నారు. కుట్ర విజయవంతం అయితే మళ్ళీ తనకు నాయకత్వం  వహించే అవకాశం లభిస్తుంది. ఒకవేళ అది విఫలం అయితే తన పాత్ర అంతటితో ముగుస్తుంది.  అంచేత కుట్రకు బహిరంగంగా మద్దతు తెలపక పోయినా, అది విజయవంతం కావాలని ఆయన మనసులో కోరిక వుండేది. అయితే ఈ అభిప్రాయాన్ని గోర్భచేవ్ తరువాతి రోజుల్లో ఖండించారు.
2006లో రష్యన్ టెలివిజన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోరిస్  ఎల్త్సిన్  చేసిన ఆరోపణ డన్లప్ అభిప్రాయానికి దగ్గరగా వుంది.
కుట్ర జరిగే సమయంలో అన్ని విషయాలు ఆయన (గోర్భచేవ్) కు చెప్పారు.
అయితే ఈ క్రీడలో నేనా? వాళ్ళా? (కుట్రదారులు) ఎవరు విజేతలు అవుతారు అన్నది  తెలిసేదాకా ఆయన  బయటపడదలుచుకోలేదుఅనేది  డన్లప్ కధనం.
అయితే గోర్భచేవ్ ఫౌండేషన్  ఈ ఆరోపణని తీవ్రంగా ఖండించింది. గోర్భచేవ్ పేరు చెడగొట్టడానికి ఈ నిందారోపణలు చేస్తున్నారని, సోవియట్ యూనియన్ విచ్చిన్నంలో తన పాత్రను మరుగుపరచుకోవడానికి ఎల్త్సిన్ ఈ పనికి పూనుకున్నారని ఫౌండేషన్ పేర్కొన్నది. నిజానిజాలు తేలకముందే ఆ తర్వాత కొద్ది రోజులకే ఎల్త్సిన్ అనారోగ్యంతో మరణించారు. (ఇంకావుంది)

మార్పు చూడని కళ్ళు (4)- భండారు శ్రీనివాసరావు


(చరిత్ర గతిని మార్చిన గోర్భచేవ్)

గోర్భచేవ్ ని  అరెస్టు చేసిన 1991, ఆగస్టు 18 న ఏమి జరిగింది అనే దానిపై విభిన్న కధనాలు ప్రచారంలో వున్నాయి. ఎందుకంటే  ఆ రోజుల్లో పత్రికలు ప్రభుత్వం కనుసన్నల్లో నడుస్తుండేవి.
బాగా విస్తృతంగా ప్రచారం పొందిన ఒక కధనం ప్రకారం, ఆరోజు  క్రైమియా నల్ల సముద్ర తీరంలో సోవియట్ యూనియన్ అధ్యక్షుడి వేసవి విడిది ఫోరొస్భవనపు గేట్ల దగ్గర అయిదు ఓల్గా కార్లు వచ్చి ఆగాయి. అప్పటి సోవియట్ ప్రెసిడెంట్ మిహాయిల్  గోర్భచెవ్ ఆ భవనంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. గట్టి భద్రత ఉన్న ప్రాంతం. ఎవరైనా ఆగంతకులు వాహనాల్లో దూసుకువస్తే వాటి టైర్లు పంక్చర్ చేయడానికి ఆ మార్గంలో ఏర్పాట్లు వున్నాయి. మొదటి కారు నుంచి కేజీబీ అత్యున్నత అధికారి యూరి ప్లీకనోవ్ దిగారు. సోవియట్ అధ్యక్షుడి భద్రతా ఏర్పాట్లు కనిపెట్టి చూసే బలగాలు ఆయన పర్యవేక్షణలోనే పనిచేస్తాయి. ఆయన్ని చూడగానే  రెడ్ స్టార్లు కలిగిన ఆ భారీ పచ్చటి ఇనుపగేట్లు తెరుచుకున్నాయి. పీకనోవ్ తో పాటు అయిదుగురు కేజీబీ అధికారులు, సైనికాధికారులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, వారి అంగరక్షకులు ఆ విడిది గృహంలోకి దూసుకు వెళ్ళారు. ఆ సమయంలో వాళ్ళు వస్తారని ఏమాత్రం సమాచారం లేని ప్రెసిడెంట్ గోర్భచెవ్, ఆశ్చర్యపోతూ కేజీబీ చీఫ్  వ్లాదిమిర్  కృశ్చెవ్ తో మాట్లాడడానికి ఫోను చేయడానికి ప్రయత్నించారు. కానీ లైన్ కట్టయింది. ఒకనాటి సోవియట్ అధినేత నికితా  కృశ్చెవ్ ఉదంతం గుర్తుకువచ్చింది. 1964 లో కృశ్చెవ్ ఇలాగే నల్ల సముద్ర తీరంలో విశ్రాంతిగా రోజులు గడుపుతున్నప్పుడు ఆయన్ని హఠాత్తుగా పదవి నుంచి తొలగించారు.
తన ఇంటికి హఠాత్తుగా వచ్చిన కేజీబీ అధికారులని చూసి మొదట్లో ప్రెసిడెంట్ గోర్భచెవ్  కంగారు పడ్డారని అధికారిక వర్గాల సమాచారం.
నన్ను అరెస్టు చేస్తున్నారా?” అని గోర్భచేవ్ ఆ అధికారులని ప్రశ్నించారు. అలాంటిది ఏమీ లేదని వాళ్ళు బదులు చెప్పారు. అరెస్టుచేసి తీసుకుపోవడంలేదని హామీ ఇచ్చిన తరువాత ఆయన కొంత స్థిమితపడ్డట్టు కనిపించింది. దానితో వాళ్ళు తనముందు పెట్టిన డిమాండ్లని అంగీకరించడానికి అయన నిర్ద్వందంగా  తిరస్కరించారు.
మీరు నమ్మక ద్రోహులు. దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు, తప్పదుఅంటూ ఆయన వారిని హెచ్చరించారు. వాళ్ళు మాస్కో తిరిగి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు గోర్భచేవ్ దంపతులు ఫోరొస్ విడిదిలోనే గృహ నిర్బంధంలో  వుండిపోయారు. ఇంట్లో ఉన్నారన్న మాటే కానీ వారిద్దరూ చాలా భయం భయంగా రోజులు గడిపారు.  ఏది తిందామన్నా భయమే. ఏది తాగాలన్నా భయమే.  దేంట్లో విషం కలిపారో తెలవదని రైసా తర్వాత ఒక దర్యాప్తు అధికారితో చెప్పారు.
మరునాడు, ప్రెసిడెంట్ గోర్భచెవ్ వద్ద వైస్ ప్రెసిడెంటుగా పనిచేసిన గెన్నదీ యనఏవ్ మాస్కోలో  విలేకరులతో మాట్లాడారు. ప్రెసిడెంట్ మిహాయిల్ గోర్భచెవ్ సెలవులో వున్నారు. అందుచేత తాను  ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరిస్తున్నట్టువెల్లడించారు.
ప్రెసిడెంట్ సెలవులో వున్నారుఅని యనయేవ్ ప్రకటిస్తున్నప్పుడు ఆయన గొంతు కంపించడం,  చేతులు వణకడం టీవీ తెరలపై ప్రపంచం యావత్తు చూసింది.
ప్రెసిడెంట్ గోర్భచెవ్ నల్ల సముద్ర తీరంలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ప్రస్తుతం కులాసాగానే వున్నారు. త్వరలోనే మళ్ళీ విధులకు హాజరవుతారుఅని ఆయన చెప్పారు.
ఆగస్టు పరిణామాలపై రష్యన్ అధికారిక వార్తాసంస్థ టాస్ కధనం:
1991 ఆగస్టు  పరిణామాలను గురించి టాస్ విలేకరి జమ్యతినా తమారా తన కధనంలో ఇలా పేర్కొన్నారు.
1991 ఆగస్టు 19 వ తేదీ ఉదయం సోవియట్ న్యూస్ చానళ్ళలో మామూలు వార్తా కార్యక్రమాలను నిలిపివేసి స్వాన్ లేక్ బాలే ప్రసారం చేస్తూ వుండడం చూసిన  ప్రజలు, దేశ నాయకుడు ఎవరైనా చనిపోయారేమో అని భావించారు. కానీ ఇంతలోనే మరో ఊహించని వార్త బయటకు వచ్చింది. సోవియట్ ప్రెసిడెంట్ మిహాయిల్ గోర్భచేవ్ ఆరోగ్యం బాగాలేక, ప్రభుత్వాన్ని నడిపే స్థితిలో లేరన్నది ఆ వార్తసారాంశం. అత్యవసర పరిస్తితుల్లో ఏర్పాటయిన అధినాయక సంఘానికి ప్రెసిడెంట్ బాధ్యతలు బదిలీ అవుతాయని కూడా వెల్లడించారు. కొత్తగా ఏర్పాటయిన ఈ కమిటీ దేశంలో రాజకీయ పార్టీల కార్యకలాపాలను, ర్యాలీలు, ప్రదర్శనలను నిషేధించింది. పత్రికలపై ఆంక్షలు విధించింది.
రష్యన్ రిపబ్లిక్ మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయిన బోరిస్ ఎల్త్సిన్ ఈ ఉత్తర్వులను తిరస్కరించారు. ఎల్త్సిన్ అయన అనుయాయులు మకాం చేసిన రష్యన్ పార్లమెంటు భవనానికి వెళ్ళే అన్ని దారులను వీధుల్లోకి వచ్చిన వేలాదిమంది రష్యన్లు దిగ్బంధనం చేసారు. బోరిస్ ఎల్త్సిన్ కు మద్దతుగా నిలిచారు.  కమిటీకి ఈ పరిణామాలు మింగుడు పడలేదు. వారిలో నైతిక స్తైర్యం దెబ్బతిన్నది. రక్తపాతాన్ని నివారించడం మంచిదనుకుని తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.
ఆగస్టు 21 వ తేదీన అప్పటి సోవియట్ వైస్ ప్రెసిడెంట్ అలెక్జాండర్ రుత్స్కోయ్ గోర్భచేవ్ సెలవులు గడుపుతున్న క్రైమియా లోని ఆయన గెస్ట్ హౌస్ కి వెళ్ళారు. ఆ రాత్రికే వారు మాస్కో తిరిగివచ్చారు కానీ అప్పటికే గోర్భచేవ్ భవితవ్యం, సోవియట్ యూనియన్ భవితవ్యం రెండూ  నిర్ధారణ అయ్యాయి. తర్వాత జరిగిన పరిణామాలలో సోవియట్ రిపబ్లిక్కులు ఒక్కొక్కటిగా స్వాతంత్రం ప్రకటించుకుంటూ పోయాయి. 1991 డిసెంబరు కల్లా సోవియట్ యూనియన్ చరిత్ర పుటల్లో చేరిపోయింది (ఇంకావుంది)

29, ఏప్రిల్ 2020, బుధవారం

ఇదేదో బాగానే వుంది మరి


కరోనా కాలంలో ఆడవాళ్ళూ, మగవాళ్ళు తమకుతోచిన రీతిలో వంటలూ గట్రా చేస్తూ వాటిని పోస్టు చేస్తూ పొద్దుపుచ్చుతున్నారు. గరిటె తిప్పడం కాదుకదా, అట్లకాడ పట్టుకోవడం కూడా రాదనే నా బలహీనత నాకు తెలుసు కనుక నేనూ ఒక ప్రయోగం చేస్తున్నాను, వేరే విధంగా.
పూర్వపు రోజులకు వెళ్ళిపోయాను. అంటే వెనుకటి దూరదర్సన్ కాలానికి అన్నమాట. టీవీ చూసే సమయం బాగా తగ్గించాను. ఉదయం ఓ గంటా, సాయంత్రం ఓ మూడు గంటలు, అదీ ఏ ఛానల్ వాడయినా మంచి పాత సినిమా వేస్తేనే సుమా, టీవీ ఆన్ చేస్తున్నాను. వెనుకటి రోజుల్లో అయితే, పగలల్లా మేజా మీద ఠీవిగా కూర్చున్న టీవీ మీద ఓ గుడ్డ కప్పిఉంచితే, అది శివుడి గుడిలో నందివాహనంలా ఓ చోట కదలకుండా వుండేది. ఇప్పుడు గోడకు అతుక్కు పోయిన బల్లిలా నోరుమూసుకుని పడుంటోంది.
అది ఎలా వుందని కాదు, నేను మాత్రం నిక్షేపంలా కొత్త నెత్తురు పట్టిన మనిషిలా తయారవుతున్నాను. బీపీ గట్రా చూసుకోలేదు కానీ ఖచ్చితంగా నార్మల్ గానే వుండివుంటాయి. మనసు ప్రశాంతంగా వుంటే మనిషి కూడా ప్రశాంతంగానే ఉంటాడు. ఉండక చస్తాడా ఏమిటి.


నిన్ననే ద్వితీయ విఘ్నం కూడా గడిచింది కాబట్టి ఈరోజు మూడో రోజు ధైర్యంగా ఈ పోస్టు.

28, ఏప్రిల్ 2020, మంగళవారం

నచ్చడు! నచ్చడంతే!!



అదేదో సినిమాలో ఓ క్యారక్టర్ అంటుంది ‘నాకు నీ ఫేస్ నచ్చలేదు’ అని.
అంటే అతడి మొహం నచ్చకపోతే ఆ వ్యక్తిలో నచ్చదగిన ఏ లక్షణాలు లేనట్టేనా!
ఈ మానసిక వ్యాధికి ఏదన్నా పేరు ఉందేమో తెలియదు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గురించి సాంఘిక మాధ్యమాల్లో వస్తున్న విపరీత వ్యాఖ్యానాలు చూస్తుంటే ఒకటి మాత్రం సత్యం అనిపిస్తోంది. చంద్రబాబును నచ్చని వారు ఈ జన్మలో అతడ్ని మెచ్చరు. అలాగే జగన్ మోహన రెడ్డి. ఇతడ్ని ద్వేషించేవారికి అందుకు ప్రత్యేకమైన కారణం అక్కరలేదు. ఆ సినిమాలో చెప్పినట్టు జస్ట్ జగన్ మాకు నచ్చడు, నచ్చడంతే! అంతే కాదు, అతడేమి చేసినా మంచయినా సరే మాకు నచ్చదు, నచ్చదు నచ్చదంతే. చంద్రబాబును నరనరాన ద్వేషించేవారిది కూడా ఇదే తరహా! ఆయన ఏ పని చేసినా మాకు నచ్చదు, నచ్చదు గాక నచ్చదు. మరో మాట లేదు.
మరో విషయం ఏమిటంటే వీరెవ్వరూ వాళ్ళపార్టీల కార్యకర్తలు కాదు, వారి అనుచరులు కాదు. వాళ్ళు గెలిచినా, ఓడినా వీళ్ళకు ఒరిగేది లేదు, తరిగేది లేదు. ఏదో ప్రయోజనం ఆశించి పెంచుకున్న అభిమానం కాదు వీరిది.
అయినా సరే! మేమింతే మేము మారం అనేది వీరి నినాదం. నాకో డౌటనుమానం. అదేమిటంటే వీరిలో ఎవరికయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు హక్కు వుందా!


(ఎవరి ఫోటో ముందు పెట్టాలి అనేదానిపై వాదులాట మొదలయినా ఆశ్చర్యం లేదు)

27, ఏప్రిల్ 2020, సోమవారం

అక్షరాలా తొమ్మిది లక్షలు


900000
కరోనా లాక్ డౌన్ వల్ల దొరికిన వెసులుబాటు కావచ్చు, నా బ్లాగు “భండారు శ్రీనివాసరావు వార్తావ్యాఖ్య’’ ను చూసేవారి సంఖ్య అక్షరాలా తొమ్మిది లక్షలకు చేరుకున్నది.
అక్షర లక్షాధికారిని చేసిన పాఠక మిత్రులకు ధన్యవాదాలు.
బ్లాగు లింకు:



మార్పు చూడని కళ్ళు (మూడో భాగం)



గోర్భచెవ్ అరెస్టు
1991, ఆగస్టు 18.
క్రిమియా నల్ల సముద్ర తీరంలో సోవియట్ యూనియన్ అధ్యక్షుడి వేసవి విడిది ఫోరొస్ భవనపు గేట్ల దగ్గర అయిదు ఓల్గా కార్లు వచ్చి ఆగాయి. అప్పటి సోవియట్ ప్రెసిడెంట్ మిహాయిల్  గోర్భచెవ్ ఆ భవనంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. గట్టి భద్రత ఉన్న ప్రాంతం. ఎవరైనా ఆగంతకులు వాహనాల్లో దూసుకువస్తే వాటి టైర్లు పంక్చర్ చేయడానికి ఆ మార్గంలో ఏర్పాట్లు వున్నాయి. మొదటి కారు నుంచి కేజీబీ అత్యున్నత అధికారి యూరి ప్లీకనోవ్ దిగారు. సోవియట్ అధ్యక్షుడి భద్రతా ఏర్పాట్లు కనిపెట్టి చూసే బలగాలు ఆయన పర్యవేక్షణలోనే పనిచేస్తాయి. ఆయన్ని చూడగానే  రెడ్ స్టార్లు కలిగిన ఆ భారీ పచ్చటి ఇనుపగేట్లు తెరుచుకున్నాయి. పీకనోవ్ తో పాటు అయిదుగురు కేజీబీ అధికారులు, సైనికాధికారులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, వారి అంగరక్షకులు ఆ విడిది గృహంలోకి దూసుకు వెళ్ళారు. ఆ సమయంలో వాళ్ళు వస్తారని ఏమాత్రం సమాచారం లేని ప్రెసిడెంట్ గోర్భచెవ్, ఆశ్చర్యపోతూ కేజీబీ చీఫ్  వ్లాదిమిర్  కృశ్చెవ్ తో మాట్లాడడానికి ఫోను చేయడానికి ప్రయత్నించారు. కానీ లైన్ కట్టయింది. ఒకనాటి సోవియట్ అధినేత నికితా  కృశ్చెవ్ ఉదంతం గుర్తుకువచ్చింది. 1964 లో కృశ్చెవ్ ఇలాగే నల్ల సముద్ర తీరంలో విశ్రాంతిగా రోజులు గడుపుతున్నప్పుడు ఆయన్ని హఠాత్తుగా పదవి నుంచి తొలగించారు.
ప్రెసిడెంట్ గోర్భచెవ్ ని నిజంగా అరెస్టు చేశారా లేక ఆయన స్వచ్చందంగానే ఈ అరెస్టుకు అంగీకరించారా అనే విషయంలో ఇప్పటికీ అనుమానాలు వున్నాయి. సోవియట్  యూనియన్ ని రిపబ్లిక్ ల సమాఖ్యగా ప్రకటించే కొత్త ఒప్పందంపై ఆగస్టు ఇరవైన ప్రెసిడెంట్ గోర్భచెవ్ సంతకం చేయాల్సి వుంది. అదే జరిగితే సోవియట్ యూనియన్ విచ్చిన్నం ఖాయం అని నమ్మే వారిలో కొందరు ఒక బృందంగా ఏర్పడి ఆ ఒప్పందంపై సంతకాలు జరిగే కార్యక్రమాన్ని వాయిదా వేయించాలని తలపోశారు. అందులో భాగంగా దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించాల్సిందిగా ప్రెసిడెంట్ గోర్భచెవ్ ని ఒప్పించడం కోసం ఆ బృందం కేజీబీ అధికారులని నల్లసముద్ర తీరంలోని వేసవి విడిదికి పంపిందని ఓ కధనం ప్రచారంలో వుండేది. అప్పటికే ప్రెసిడెంట్ గోర్భచెవ్ రాజకీయ ప్రత్యర్ధి బోరిస్ ఎల్త్సిన్ రష్యన్ సోవియట్  రిపబ్లిక్ అధ్యక్షుడిగా పెద్ద మెజారిటీతో ఎన్నికయ్యారు. ఆయన ఆర్ధిక సంస్కరణల విషయంలో గోర్భచేవ్ కంటే రెండడుగులు ముందున్నారు. యువతలో మంచి అభిమానం సంపాదించుకున్నారు.
సోవియట్ యూనియన్ సమగ్రతను కాపాడాలని అనుకున్నవారి ప్రయత్నాలు ఫలించలేదు. అనుకున్నట్టే నాలుగు మాసాల అనంతరం సోవియట్ యూనియన్ చరిత్ర గర్భంలో కలిసిపోయింది. ఆగస్టు పద్దెనిమిది నుంచి ఆగస్టు ఇరవై వరకు అసలు ఏం జరిగింది అన్నది ఇన్నేళ్ళ తర్వాత కూడా ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది.
ఆరోజు ప్రెసిడెంట్ గోర్భచెవ్ వేసవి విడిదిలో ఏమి జరిగింది అనే విషయంలో కూడా విభిన్న కధనాలు వున్నాయి. తన ఇంటికి హఠాత్తుగా వచ్చిన కేజీబీ అధికారులని చూసి మొదట్లో ప్రెసిడెంట్ గోర్భచెవ్  కంగారు పడ్డారని అధికారిక వర్గాల సమాచారం.  అయితే అరెస్టుచేసి తీసుకుపోవడంలేదని హామీ ఇచ్చిన తరువాత ఆయన కొంత స్థిమితపడ్డట్టు కనిపించింది. ఆ తరువాత వాళ్ళు తనముందు పెట్టిన డిమాండ్లని అంగీకరించడానికి మాత్రం  తిరస్కరించారు.
“మీరు నమ్మక ద్రోహులు. దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు, తప్పదు” అంటూ ఆయన వారిని హెచ్చరించారు. వాళ్ళు మాస్కో తిరిగి వెళ్ళిన తర్వాత ఫోరొస్ విడిదిలోనే గోర్భచేవ్ దంపతులు గృహ నిర్బంధంలో  వుండిపోయారు. తరువాత రైసా గోర్భచేవ్ మరణించారు. ఇంట్లో ఉన్నారన్న మాటే కానీ వారిద్దరూ చాలా భయం భయంగా రోజులు గడిపారు.  ఏది తిందామన్నా భయమే. ఏది తాగాలన్నా భయమే.  దేంట్లో విషం కలిపారో తెలవదని రైసా తర్వాత ఒక దర్యాప్తు అధికారితో చెప్పారు.
మరునాడు, ప్రెసిడెంట్ గోర్భచెవ్ వద్ద వైస్ ప్రెసిడెంటుగా పనిచేసిన గెన్నదీ యనఏవ్ మాస్కోలో  విలేకరులతో మాట్లాడారు. ప్రెసిడెంట్ మిహాయిల్ గోర్భచెవ్ సెలవులో వున్నారు. అందుచేత తాను  ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు వెల్లడించారు.
‘ప్రెసిడెంట్ సెలవులో వున్నారు’ అని యనయేవ్ ప్రకటిస్తున్నప్పుడు ఆయన గొంతు కంపించడం,  చేతులు వణకడం టీవీ తెరలపై ప్రపంచం యావత్తు చూసింది.
“ప్రెసిడెంట్ గోర్భచెవ్ నల్ల సముద్ర తీరంలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ప్రస్తుతం కులాసాగానే వున్నారు. త్వరలోనే మళ్ళీ విధులకు హాజరవుతారు” అని ఆయన చెప్పారు.
ఆ రోజు ఆ విడిదిలో ఏమి జరిగింది అనేదానిపై వాలెరీ బోల్దిన్ కధనం వేరుగా వుంది. ఈయన కూడా కుట్రదారుల్లో ఒకరు.
“ప్రెసిడెంట్ గోర్భచెవ్ చాలా కోపంగా కనిపించారు. అన్నింటికీ మించి ఏమైనా సరే బోరిస్ ఎల్త్సిన్ బెడద వదిలిపోవాలి అనే భావం అయన మాటల్లో ధ్వనించింది.
చివరికి ఇలా అన్నారు. “పొండి. ఏం చేసుకుంటారో చేసుకోండి”
అయితే ఎమర్జెన్సీ ఎలా విధించాలి అనే దానిపై మాకు కొన్ని సూచనలు కూడా చేసారు అని బోల్దిన్ చెప్పారు.
(ఇంకా వుంది)

ప్రాయంలో అడుగిడుతున్న ప్రాంతీయ పార్టీ

(టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని 'నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురితం)

పందొమ్మిదేళ్ళ క్రితం 2001లో తెలంగాణా రాష్ట్ర సమితి పేరుతో ఒక ప్రాంతీయ పార్టీ ఏర్పాటు అయినప్పుడు తెలంగాణా ప్రాంతానికి చెందినవారు కూడా అనేకమంది మెటికలు విరిచారు. గతంలో  తెలంగాణా ఉద్యమ నేపధ్యంలో పుట్టిన పలు రాజకీయ పార్టీల గాటనే  టీఆర్ఎస్ పార్టీని కూడా కట్టి, ఆ పార్టీ భవిష్యత్తుపై  నైరాశ్యంతో  కూడిన ప్రకటనలు చేసారు. అయితే ఇటువంటి అనేకానేక  ఊహాగానాలను, అన్నిరకాల బాలారిష్టాలను అధిగమించి తెలంగాణా ప్రజానీకం పరచిన వెచ్చటి పొత్తిళ్ళలో ఈ పచ్చటి పసికూన పెరిగి పెద్దదయి ఇరవై ఏట అడుగు పెట్టింది.
సహజమైన బాలారిష్టాలను తట్టుకుని నిలబడ్డం వేరు, కావాలని పసికందును పసిగుడ్డుగానే చిదిమి వేయాలనే దుష్ట పన్నాగాలు వేరు. భాగవతంలో చిన్ని కృష్ణుడిని మట్టుబెట్టడానికి కంసాదిదానవులు అనేకవిధాలుగా ప్రయత్నాలు చేసినట్టు టీఆర్ఎస్ పార్టీని కూడా ఆదిలోనే అంతం చేయడానికి అన్ని రకాల రాజకీయ కుట్రలు జరిగాయి. కుట్రదారుల  ఉద్దేశ్యం ఒక్కటే. తెలంగాణా అనే భావన తెలంగాణా ప్రజల్లో లేదని, అది కొందరు అవకాశవాద లేదా నిరుద్యోగ రాజకీయ నాయకుల దుష్టపు ఆలోచన అని రుజువు చేసి, ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని శాశ్వతంగా సమాధి చేయడం. ఇక ముందు ముందు ఎవరి నోటా ఆ మాట వినిపించకుండా చేయడం.
అయితే ఈసారి ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి ఊపిరులూదిన టీఆర్ఎస్ పార్టీకి కర్తా, కర్మా, క్రియా అయిన నాయకుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కావడం వల్ల ఆ ప్రయత్నాలన్నీ  నిరర్ధకం అయిపోయాయి. కడకంటా కాడిని కింద పడవేయకుండా శ్రీ కేసీఆర్ తనదైన శైలిలో విలక్షణ౦గా ఉద్యమాన్ని నడుపుకు రావడంతో ఆ ఎత్తులన్నీ చిత్తయిపోయాయి. పుష్కరకాలానికి పైగా సాగిన ఈ మహోద్యమం వాడి, వేడి ఎక్కడా, ఎప్పుడూ, ఏమాత్రం  తగ్గకుండా చూడడానికి, దారితప్పకుండా కనిపెట్టి చూడడానికి  ఆయన ఎన్నో రకాల శ్రమదమాదులకు గురికావాల్సి వచ్చింది. అటు కేంద్రాన్ని,  ఇటు రాష్ట్రంలోని ఇతర రాజకీయ  పార్టీలను రాజకీయంగా ఏకకాలంలో ఎదుర్కుంటూ, ఉద్యమదీప్తి కొడిగట్టకుండా చూడడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇతరేతర రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తూ, తెలంగాణా ఉద్యమాన్ని దారితప్పించాలని ప్రయత్నించే ‘విభీషణులను’ సయితం నిలువరించాల్సిన పరిస్తితి. అటువంటి వారి కారణంగా ఉద్యమంపై నీలినీడలు కమ్ముకుంటున్నప్పుడు లక్ష్యసాధన కోసం గొంగళి పురుగులను సయితం  ముద్దాడ వలసిన దుస్తితి.  వెలుగుతున్న పెట్రోమాక్స్ లైట్ లో వెలుగు తగ్గి, వత్తి ఎర్రబడుతున్నప్పుడల్లా,  పంపుతో గాలికొట్టి మళ్ళీ వత్తిని తెల్లగా  ప్రకాశవంతం చేసినట్టు, ఉద్యమకాలంలో కేసీఆర్ తన వ్యూహాలను, ఎత్తుగడలను  తాజా రాజకీయ పరిణామాలకు, పర్యవసానాలకు  తగినట్టుగా మార్చుకుంటూ ప్రత్యేక తెలంగాణా ఆకాంక్ష ప్రజల్లో సజీవంగా వుండిపోయేట్టు చేయగలిగారు.  అందుకు ప్రధానంగా తోడ్పడ్డది అనర్ఘలమైన ఆయన ప్రసంగనైపుణ్యం ఒకటి కాగా, తెలంగాణా పట్ల ఆయనకు ఉన్న పరిపూర్ణమైన అవగాహన మరొకటి. ఆకాంక్ష నెరవేరి, తెలంగాణా స్వప్నం సాకారమై  ప్రత్యేక రాష్ట్రంగా  ఏర్పడ్డప్పుడు దాన్ని బంగారు తెలంగాణాగా రూపొందించడానికి ‘ఏమిచేయాలి, ఎలా చేయాలి’ అనే విషయంలో ఆయన కన్న కలలు, వాటిని సాకారం చేసుకోవడానికి రూపొందించుకున్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాలికలు అన్నీఇన్నీ కావు.  ఇలా బహుముఖంగా ఆలోచించి చేసిన ప్రయత్నాలు కాబట్టే, పార్టీపరంగా చేపట్టిన  రాజకీయ ఉద్యమానికి ఇవన్నీ అవసరమైన ఊతాన్నీ, ఉత్తేజాన్నీ  ఇవ్వగలిగాయి. తెలంగాణా స్వప్నాన్ని సాకారం చేయగలిగాయి.
తెలంగాణా పురపాలక,  ఐ.టీ. శాఖల మంత్రి  కల్వకుంట్ల తారక రామారావు, తండ్రి కేసీఆర్  లాగే చక్కని మాటకారి.  గతంలో ఒకసారి హైదరాబాదు ప్రెస్ క్లబ్  ఏర్పాటు చేసిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన ఒక మాటన్నారు, ‘కోటి  ఆశలు, కోటి  అనుమానాల నేపధ్యంలో కొత్త రాష్ట్రంగా తెలంగాణా  ఆవిర్భవించింద’ని. నిజమే. తెలంగాణ కోరుకున్నవారు కోటి ఆశలు పెట్టుకున్నారు. కోరుకోనివారు కోటి  అనుమానాలు పెంచుకున్నారు. ఆశలు, అనుమానాల సంగతేమో కానీ, తెలంగాణా రాష్ట్రం ఏర్పడడం మాత్రం జరిగిపోయింది. నీటి  మీద రాత కాకుండా  రాతి మీద గీత మాదిరిగా  తెలంగాణా అనేది ఇప్పుడు  ఒక చెరగని నిజం. చెరపలేని సత్యం. ఎదురుగా నిలబడి, కనబడుతున్న ఓ వాస్తవం.
తెలంగాణా రాగానే కొత్త రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకు పోతుందని అనుకున్నవారు వున్నారు. కరెంటు కొరతతో కొత్త రాష్ట్రం చీకటిమయం  అవుతుందని  అంచనాలు కూడా వేసారు. కానీ కొత్త రాష్ట్రం ఏర్పడి ఏళ్ళు గడుస్తున్నా కూడా ఒక్క అనుమానం కూడా నిజం కాలేదు. సందేహాస్పదులు కోరుకున్నది జరగలేదు. పైపెచ్చు,  కనీవినీ ఎరుగని విధంగా వచ్చి పడ్డ కరోనా లాక్  డౌన్ ఎండాకాలంలో కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతోంది. ప్రత్యర్ధులు కూడా పరోక్షంలో అంగీకరిస్తున్న,  కేసీఆర్ సాధించిన ‘అద్భుతం’ ఇది.
అయితే, తెలంగాణా సాధన ఒక ఎత్తయితే, సాధించిన దానిని సమర్ధవంతంగా అనుకున్న రీతిలో మలచడం మరో ఎత్తు.
దీనికి  ప్రత్యక్ష సాక్ష్యం తెలంగాణాలో అనేక ప్రాంతాలలో గలగలా పారుతున్న గోదావరి నీళ్ళు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పుడు కనుబొమలు ముడిచినవాళ్ళే, ఇప్పుడు ఉప్పొంగి ఉరకలు పెడుతూ పరుగులు తీస్తున్న గోదావరమ్మను కళ్ళార్పకుండా చూస్తూ మురిసిపోతున్నారు.
టీఆర్ఎస్ ఇన్నేళ్ళ ప్రస్థానంలో అధికార పగ్గాలు అందుకోవడం అనేది ఒక అద్భుతమైన ఘట్టం. గతంలో ప్రత్యేక రాష్ట్రాల కోసం ఉద్యమాలు చేసి సాధించుకున్న రాజకీయ పార్టీలు ప్రజలు అందించిన అధికారాన్ని నిలబెట్టుకోలేక చతికిలపడ్డ వైనాలు తెలుసు. కానీ తెలంగాణా రాష్ట్ర సమితి దీనికి మినహాయింపు. ప్రత్యేక తెలంగాణా ఏర్పడ్డ తర్వాత రెండోసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మునుపటి కంటే ఎక్కువ స్థానాలు కట్టబెట్టి టీఆర్ఎస్ నాయకత్వం పట్ల ప్రజలు తమకున్న నమ్మకాన్ని మరోసారి నిరూపించి చూపారు.
మరోసారి అధికార పీఠం అధిరోహించిన కేసీఆర్ తనదైన పద్దతిలో ముందుకు వెడుతున్న తరుణంలో కరోనా వైరస్ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు పెనుసవాలుగా మారింది. అయినా ప్రజల ప్రాణాలు ముఖ్యం అనుకున్న ప్రభుత్వం, దేశంలో అన్ని రాష్ట్రాలకంటే ముందుగానే స్పందించి లాక్ డౌన్ వ్యవధిని పొడిగించింది. కరోనాని కట్టడి చేయడానికి తెలంగాణా  ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను, చర్యలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం ప్రశంసించారు.
ఈ నేపధ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గతంలో మాదిరిగా ఘనంగా జరుపుకోలేని పరిస్తితి.
అయితే, రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో గలగలా పారుతున్న గోదావరి జలాల్లోనే పార్టీ ఆవిర్భావ దినోత్సవ ఆనందాలను తిలకించే అవకాశం ఈసారి లభించింది.   

26, ఏప్రిల్ 2020, ఆదివారం

యాదమ్మ సొంతిల్లు


ఈ కరోనా గొడవ లేకపోతె తప్పక వెళ్ళాల్సిన శుభ కార్యం.
యాదమ్మ పిల్లలు కొత్త ఇల్లు కట్టుకుని ఆ ఇంటి ఫోటోలు వాట్సప్ లో పంపారు. లాక్ డౌన్ కారణంగా ఫంక్షన్ ఏమీ చేయడం లేదని, మీ ఆశీస్సులు కావాలని కోరారు. అంతటితో అయితే ఈ పోస్టు పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడో ఏనాడో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఈనాడు, ఇల్లు కట్టుకున్నామని, అసలీ ఇల్లు అమ్మ (మా ఆవిడ) పట్టు పట్టి కట్టేదాకా ఊరుకోలేదని, కానీ ఇది పూర్తయిన తర్వాత చూడడానికి అమ్మలేదని వాళ్ళు బాధ పడ్డారు. 



ఈ యాదమ్మ ఎవరంటే....
199
1 లో మేము మాస్కోనుంచి వచ్చేసి హైదరాబాదులో అద్దెకు  ఇల్లు వెతుక్కుంటున్న రోజులు. వెంట తెచ్చుకున్న అయిదారు సూటుకేసులు మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారి పంజాగుట్ట క్వార్టర్ లో వదిలేసాము. కంటైనర్లో వేసిన మిగిలిన సామాను, రష్యా నుంచి ఓడలో మద్రాసు వచ్చి మళ్ళీ రోడ్డు మార్గంలో హైదరాబాదు చేరడానికి రెండు మూడు నెలలు పడుతుంది. కాబట్టి ఇల్లు వెతుకులాట కార్యక్రమం కాసింత నెమ్మదిగానే సాగింది, హడావిడి లేకుండా.
మా అన్నయ్యగారి ఇంటికి దగ్గరలోనే ఇటు పంజాగుట్ట మెయిన్ రోడ్డు, అటు రాజ భవన్ రోడ్డు నడుమ దుర్గానగర్ అనే కాలనీలో ఓ ఇల్లు దొరికింది. అద్దె పద్దెనిమిది వందలు. మా నలుగురి కోసం కాకపోయినా, రష్యా నుంచి ఓడలో  వచ్చే సామాను కోసం అంత కిరాయి పెట్టక తప్పలేదు.
మా ఇంటి సందు మొదట్లో ఓ గుడిసెలో కాపురం ఉంటున్న యాదమ్మ మా ఇంట్లో పనికి కుదిరింది. మొగుడు మల్లయ్యకు సొంత ఆటో వుంది. ఆ బండే వీరి బతుకు బండికి ఆధారం. ఆ దంపతులకు అందరూ ఆడపిల్లలే. కళ, భాగ్య, సంపూర్ణ, తిరుమల అందరూ మా ఇంట్లోనే దాదాపు పెరిగారు. బిడ్డల్ని వెంటేసుకుని యాదమ్మ పనికి వచ్చేది. వీళ్ళు కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేవరకు మా ఇంట్లోనే పనిపాటులు చూస్తుండేవారు. కాలక్రమంలో మేము అనేక ఇళ్ళు మారుతూ వచ్చినా, ఆ కుటుంబం మాత్రం మమ్మల్ని వదిలిపెట్టలేదు. కళకు పెళ్ళయి ఇద్దరు పిల్లలు పుడితే వారిద్దరికీ మా పిల్లల పేర్లే సందీప్, సంతోష్ అని పెట్టుకుంది. సందీప్ ప్రభుత్వ పాఠశాలలో చేరి మంచి మార్కులు తెచ్చుకుంటూ, బాగా చదువుకుంటున్నాడు. అతడికి ఓ  ఏడాది తెలంగాణా ప్రభుత్వం పదిహేను వేల రూపాయల స్కాలర్ షిప్ కూడా ఇచ్చింది. అతడే వాళ్ళింట్లో కంప్యూటర్ మాస్టర్. అతడే ఇంటి ఫోటోలు పంపాడు.
మరో అమ్మాయి కుమార్తెకు మంచి సంబంధం దొరికింది. ఆ అబ్బాయికి ఏదో మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం. నలభయ్ లక్షలు పెట్టి ఫ్లాటు కొనుక్కుని ఆ గృహ ప్రవేశానికి మమ్మల్ని కూడా పిలిచారు.
మా ఇంట్లో పారాడుతూ పెరిగిన తిరుమలమ్మకు కూడా పెళ్లయింది. కూకట్ పల్లిలో ప్రభుత్వం కేటాయించిన ఫ్లాటులో వుంటున్నారు. మొగుడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు.
నువ్వేం చేస్తున్నావని తిరుమలమ్మను అడిగితే, ‘నేనిప్పుడు పూర్తిగా హౌస్ వైఫ్. ఇంట్లోనే వుండి నా పిల్లల మంచీచెడూ చూసుకుంటున్నాను అనేది నవ్వుతూ.
పెద్ద ఆశలు పెట్టుకోకుండా పిల్లల్ని పెంచిన మల్లయ్య దంపతుల ఆశలపై వాళ్ళు నమ్ముకున్న యాదాద్రి నరసింహుడు నీళ్ళు చల్లలేదు. సరికదా, వారిని చల్లగా చూస్తున్నాడు. శుభం!

మార్పు చూడని కళ్ళు (రెండో భాగం)



చరిత్ర గతిని మార్చిన గోర్భచేవ్

నేను మాస్కో రేడియోలో పనిచేస్తున్నప్పుడు సోవియట్ అధినాయకుడిగా  గోర్భచేవ్ ఒక వెలుగు వెలిగారు. ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడినా ఆ రోజుల్లో  టీవీల్లో, పత్రికల్లో పతాక శీర్షికలలో వచ్చేది. సోవియట్ యూనియన్ లో ఆయన ప్రారంభించిన ఆర్ధిక, రాజకీయ ప్రయోగాలతో పాశ్చాత్య దేశాల్లో కూడా ఆయన పేరు మారుమోగుతుండేది. మీడియాలో అనుదినం కనబడాలనే చాపల్యం ఆయనకున్న బలహీనతల్లో ఒకటని చెవులు కొరుక్కునేవారు.
అధికారం పోయిన తర్వాత కూడా గోర్భచేవ్ ఈ అలవాటును వదులుకోలేదని  ఆయన తర్వాత అధికార పగ్గాలు స్వీకరించిన  బోరిస్ ఎల్త్ సిన్ దగ్గర  ప్రెస్ సెక్రెటరీగా పనిచేసిన  వ్యాచెస్లావ్ కోస్తికొవ్ తన జ్ఞాపకాల పుస్తకంలో రాసుకున్నారు.
కోమ్సమాలొస్కయా ప్రావ్దా అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోర్భచెవ్ ఒకసారి  బోరిస్ ఎల్త్సిన్ విధానాలను తూర్పారబట్టారు. ఆ ఇంటర్వ్యూ చేసింది దిమిత్రీ మురతోవ్. ఆ విలేకరి అంటే గోర్భచెవ్ కు చాలా ఇష్టం. సోవియట్ అధినేతగా రాజీనామా చేసిన తర్వాత గోర్భచెవ్ మురతోవ్ కి ఫోన్ చేసి ఆ పత్రికలో తాను కూడా  నెలకోమారు ఒక ఫీచర్ రాస్తానని అడిగారు. అప్పటికే ఆ పత్రిక యాజమాన్యం ముఠాలుగా విడిపోయి, వాళ్ళలో వాళ్ళు కీచులాడుకుంటూ వుండడం వల్ల గోర్భచెవ్ కోరిక నెరవేరలేదు.  గోర్భచెవ్  ఆ పత్రికను ఎంచుకోవడానికి కారణం దానికి  పాఠకుల్లో ఉన్న ఆదరణ. 1990 ప్రాంతాల్లోనే ఆ పత్రిక సర్క్యులేషన్ రెండుకోట్ల ముప్పయి లక్షలు. అయినా ఆ పత్రికలో పనిచేసేవారిలో ఏర్పడ్డ లుకలుకల కారణంగా క్రమంగా మురతోవ్ వంటి జర్నలిస్టులు ఆ పత్రికను వదిలేశారు. వదిలేసి నొవయా గజేత (న్యూ గెజిట్) అనే పేరుతొ ఒక కొత్త పత్రికను ప్రారంభించారు. పత్రిక అయితే పెట్టారు కానీ దాన్ని నిలబెట్టే ఆర్ధిక స్థోమత వారికి లేదు. సాయం చేసే వారికోసం వాళ్ళు ఎదురుచూపులు చూస్తున్న సమయమది.
అధ్యక్ష పదవిని వీడిన తర్వాత, గోర్భచెవ్ తన ప్రసంగాలు, రచనల ద్వారా సంపాదిస్తున్న సొమ్ముతో  ఒక ఫౌండేషన్ స్థాపించారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. గోర్భచెవ్ కు ఆయన స్వదేశంలో మాట ఎలా వున్నా అంతర్జాతీయంగా చక్కటి పేరు ప్రఖ్యాతులు వున్నాయి. 1991లో ఆయనకు నోబుల్ శాంతి పురస్కారం లభించింది. ఆయన తన అనుభవాలతో రాసిన ఒక గ్రంధం దాదాపు ఎనభై ప్రపంచ భాషల్లోకి అనువదించి ప్రచురించారు. కోట్ల సంఖ్యలో ఆ పుస్తకాలు  అమ్ముడు పోయాయి. అమెరికాకి పోటీగా నిలచిన సోవియట్ యూనియన్ ఆయన హయాములోనే అంగవంగ కళింగ దేశాల మాదిరిగా విచ్చిన్నం కావడం, రెండు జర్మనీల ఏకీకరణ జరగడం,  అణ్వాయుధాల సంఖ్యను భారిగా కుదించడంలో ఆయన పోషించిన పాత్ర ఇలా అనేకానేక కారణాల వల్ల గోర్భచెవ్ కు విశ్వ విఖ్యాతి లభించింది. అంచేత ఆయన అధికారం  చేజారిపోయినా భార్య రైసాతో కలసి నిరాడంబరంగా  జీవిస్తూ, విశ్వవిద్యాలయాల్లో ప్రసంగాలు చేస్తూ, రచనావ్యాసంగం సాగిస్తూ కాలక్షేపం చేస్తున్న రోజులవి. అయినా ఏదో విధంగా మళ్ళీ అధికార పగ్గాలను చేపట్టాలనే కాంక్ష ఆయనలో చావలేదని, అందుకే టీవీలు, పత్రికల ద్వారా తనకు జనంలో ఉన్న ఆదరణను మరింత పెంచుకుని మరోసారి  అధికార పీఠం చేజిక్కించుకోవాలనే కోరిక ఆయనలో పాతుకుపోయి  వుందని, అందువల్లే పత్రికలను ప్రోత్సహించే పని పెట్టుకున్నారని కూడా గోర్భచెవ్ మీద అపనిందలు వచ్చాయి.
“పత్రికను ఎలా నడపాలి? నడపడానికి ఏం చెయ్యాలి” అని మేము మల్లగుల్లాలు పడుతున్న సమయంలో 20 IBM 286-x కంప్యూటర్లు మా ఆఫీసుకు వచ్చాయి” అని చెప్పాడు మురతోవ్ ఆనందంగా. 1993 నాటికి  ఆ కంప్యూటర్లు అత్యంత ఆధునికమైనవి. గోర్భచెవ్ పంపిన ఆ కంప్యూటర్లతోనే మేము పత్రికను నడపడం  ప్రారంభించాము. అంతేకాదు, గోర్భచెవ్ స్వయంగా నొవయ గజిత పత్రికలో మూడు లక్షల  డాలర్లు పెట్టుబడి పెట్టారు”అని మురతోవ్ చెప్పారు. అలాగే మరోసారి డబ్బు అవసరం పడ్డప్పుడు లక్ష డాలర్లు మా పత్రిక బ్యాంకు ఖాతాకు జమ చేసారని కూడా ఆయన వెల్లడించారు.
“1995లో రష్యాలో సెల్ ఫోన్లు చాలా అరుదు. ఒకసారి గోర్భచెవ్ దంపతులను కలవడానికి వారింటికి  వెళ్లాను. మాటామంతీ అయిన తర్వాత రైసా గోర్భచెవా  ఒక అందమైన పెట్టెను నా చేతిలో పెట్టారు. తెరిచి చూస్తే అందులో అత్యంత ఆధునికమైన మొబైల్ ఫోను వుంది.
“అవసరమైన సందర్భాలలో లాండ్ లైన్ కి ఫోను చేసి మాట్లాడడం ఇబ్బందిగా ఉంటోందని అంచేత మొబైల్ ఫోను వుంటే ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చని గోర్భచెవ్ మీతో చెప్పమన్నారు” అందావిడ నాతో. నాపట్ల ఆయన చూపించిన వాత్సల్యంఎప్పటికీ  మరవలేను” అని చెప్పుకొచ్చారు మురతోవ్.
“ఇప్పటికీ ఆ మొబైల్ ఫోను మా పత్రికాఫీసులో మ్యూజియంలో భద్రంగా వుంది” అన్నారాయన.
“పత్రికల్లో పనిచేసేవారంటే  కూడా గోర్భచెవ్ ఎంతో ఆదరణ చూపేవారు. ఒక రిపోర్టర్ ఆసుపత్రిలో వుంటే యాభయ్ వేల డాలర్లు ఆర్ధిక సాయం చేసి ఆదుకున్నారు. ఆయన ఇలాంటి సాయాలు జర్నలిస్టులకి అనేకం చేస్తుండేవారు” అని మురతోవ్ చెప్పారు కృతజ్ఞతగా.
(ఇంకా వుంది)

25, ఏప్రిల్ 2020, శనివారం

మార్పు చూడని కళ్ళు (1)- భండారు శ్రీనివాసరావు


(చరిత్ర గతిని మార్చిన గోర్భచేవ్)
1991 లో నేను ఇండియా తిరిగి వచ్చిన తర్వాత రష్యా ఎలా వుంది? ఈ ఆసక్తి ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే వుంది.   
ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం సంగతులు. గుర్తుంచుకోవడము కష్టమే. గుర్తు చేసుకోవడమూ  కష్టమే. లాక్ డౌన్ కాలం ఇందుకు పనికొచ్చింది. స్పష్టాస్పష్టమైన దృశ్యాలు మనసులో కదలాడాయి. వాటికి స్పష్టత ఇవ్వడానికి మరికొంత ప్రయత్నం చేసాను. ఇరవై తొమ్మిదేళ్ళకు పూర్వం నాలుగేళ్ళకు పైగా రేడియో మాస్కో తెలుగు విభాగంలో పనిచేస్తూ  మాస్కోలో ఉండడమే ఈ ఆసక్తికి కారణం.
1991 ఆగస్టు రెండోవారం చివర్లో మొదలైన ఒక  అద్భుత, ఉత్కంఠపూరిత రాజకీయ నాటకానికి అదే ఏడాది చివర్లో తెర పడింది. సోవియట్ యూనియన్ సమగ్రతను కాపాడాలనే (Hard Liners) వర్గాలకు,  రిపబ్లిక్ లకు సర్వసత్తాక స్వేచ్చను ప్రసాదించాలని పట్టుబడుతున్న ( Reformers) వర్గాలకు నడుమ జరిగిన అధికార పోరులో అనేక అంకాలకు ఆ నాలుగున్నర నెలల కాలమే ఒక వేదికగా మారింది. అప్పటివరకు సోవియట్ యూనియన్ అధినాయకుడిగా ఓ వెలుగు వెలిగిన మిహాయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ ను ఆయన భార్య రైసా గోర్భాచేవాతో సహా నల్లసముద్ర తీరంలోని ప్రెసిడెంట్ వేసవి విడిదిలో గృహ నిర్బంధంలో వుంచడం, ఆయనకు పార్టీలోనే రాజకీయ ప్రత్యర్ధి అయిన బోరిస్ ఎల్త్సిన్ రష్యన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ గా ఎన్నికల్లో నెగ్గి అత్యున్నత అధికార పీఠానికి చేరువకావడం, సోవియట్ యూనియన్ స్థానంలో సోవియట్ రిపబ్లిక్ ల సమాఖ్య ఏర్పాటు కావడం, చివరికి రద్దయిన సోవియట్ యూనియన్ ఆఖరు అధ్యక్షుడిగా మిహయిల్ గోర్భచేవ్ రాజీనామా చేయడం, ఆయన స్థానంలో సమాఖ్య అధ్యక్షుడిగా బోరిస్ ఎల్త్సిన్ అధికార పగ్గాలు స్వీకరించడం అన్నీ మెరుపు వేగంతో జరిగిపోయాయి.   
మిహాయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్. ఒకానొక కాలంలో తన విధానాలతో, ప్రసంగాలతో యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకున్న సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ  అధినాయకుడు. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా పెత్తనాన్ని సవాలు చేస్తూ ఆవిర్భవించిన సోవియట్ యూనియన్ విచ్చిత్తికి బాటలు వేసిన వ్యక్తిగా చరిత్ర పుటలకు ఎక్కిన సోవియట్ నేత. 1985 నుంచి  1991 వరకు సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ అధినాయకుడిగా తిరుగులేని అధికారాన్ని చెలాయించిన ఆ ఎదురులేని నాయకుడు ప్రస్తుతం ఏం చేస్తున్నట్టు?
ఆ లెక్కకు వస్తే, ఒకప్పుడు తమ కంటి చూపుతో దేశాలను శాసించిన అంతర్జాతీయ నాయకులు అనేకులు  తమ ముదిమి వయస్సులో ఏం చేస్తున్నారు? ఏం చేస్తుంటారు? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి సహజంగా వుంటుంది.

(గోర్భచేవ్ అప్పుడు) 


(గోర్భచేవ్ ఇప్పుడు)



 (ఇంకా వుంది)

24, ఏప్రిల్ 2020, శుక్రవారం

మల్లాది గారికి క్షమాపణలతో

మల్లాది వేంకట కృష్ణమూర్తి గారు ఇప్పుడే ఫోన్ చేసి తన ఫొటో తీసేయమని చాలా మృదువుగా రిక్వెస్ట్ చేశారు. అందుచేత ఆ పోస్టును, వారి ఫొటోను తీసేస్తున్నాను. వారి మనోభావాలను గౌరవించడం నా విధి. అలాగే ఇప్పటికే ఈ ఫొటోను, పోస్టును షేర్ చేసినవారు ఎవరైనా వుంటే దయచేసి వాటిని తొలగించి మీ అభిమాన రచయిత మనసు గాయపడకుండా చూడండి. ఇది నా విజ్ఞప్తి - భండారు శ్రీనివాసరావు

22, ఏప్రిల్ 2020, బుధవారం

ట్రంప్ పిచ్చోడో గట్టోడో కొద్ది నెలల్లో తేలుతుంది


వాడో పిచ్చోడు. దేశాన్ని నాశనం చేయడానికే వచ్చాడు”
అమెరికాలో ఎవరినన్నా కదిలిస్తే చాలామంది ట్రంప్ గురించి చెప్పే మాటలు. నిజానికి ఇందులో నిజమెంత?
చూడడానికి పెద్ద తాగుబోతులా కనిపించే ఈ పెద్ద మనిషికి తాగుడు అంటే గిట్టదు. నోరు తెరిస్తే ఏం మాట్లాడుతున్నాడురా బాబూ  అని ముక్కుమీద వేలేసుకునేలా వుంటాయి అయన మాటలు. అమెరికా అధ్యక్షుడు కాకముందు, అయిన తర్వాతా ఆయన తీరింతే! మనసులో మాట పైకి అనేయడం తప్ప అలా అనడంవల్ల వచ్చే మంచీచెడుల గురించి పట్టించుకోని భోలాశంకరుడు.
కింది ఫోటో ట్రంప్ దే. 1987 లో ప్రసిద్ధ టీవీ యాంకర్ ల్యారీకింగ్,  సీఎన్ఎన్ ఛానల్ కు ఇంటర్వ్యూ చేసినప్పటిది. అప్పటికి ఆయనకు రాజకీయాల వాసన తెలియదు. తన వ్యాపారం తప్ప వేరే వ్యాపకాలు లేవు.
లారీ కింగ్ ఆ ప్రశ్నే అడిగాడు, రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అని.
ట్రంప్ ఇలా జవాబు చెప్పాడు.
“ఎంతమాత్రం లేదు. కానీ ఒక విషయం. నేను అమెరికా ప్రెసిడెంట్ కావాలని అనుకున్న మరుక్షణం ఆ పనిలోనే వుంటాను. మరో విషయం.  అలా నేను నిర్ణయించుకున్న తర్వాత నన్నెవ్వరూ ప్రెసిడెంట్ కాకుండా అడ్డుకోలేరు”     
అలానే అయ్యారు ఇరవై తొమ్మిదేళ్ళ తర్వాత. అదీ మొదటి ప్రయత్నంలోనే.
ప్రెసిడెంట్ ఎలక్షన్లకు ముందు ట్రంప్ మరో మాట చెప్పారు.
“మన దేశ ఆర్ధిక వ్యవస్థ, మనం గొప్పలు చెప్పుకునేంత గొప్పదేమీ కాదు. నిజం చెప్పాలంటే అదొక గాలి బుడగ. ఏ క్షణంలోనైనా పేలిపోవచ్చు”
“అమెరికా అమెరికన్లది. వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా తట్టాబుట్టా సర్దుకుపోవాల్సిందే” ఇలా సాగేవి ఆయన ఎన్నికల ప్రసంగాలు.
ఇప్పుడు కొరానా విషయంలో కూడా ఆయనది వేరే దారి. ప్రస్తుత దుస్తితికి కారణం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలే అని అభిప్రాయపడేవాళ్ళే ఎక్కువ ఆ దేశంలో.
ఈ నేపధ్యంలోనే అయన మరో బాంబు పేల్చారు.
బయటి దేశాల వాళ్లకి అమెరికాలోకి ‘నో ఎంట్రీ’ అని ప్రకటించారు.
ఆయనకి ఆత్మవిశ్వాసం ఎక్కువ అని 1987 లో ఇచ్చిన ఇంటర్వ్యూ లోనే తేలిపోయింది.
కాదు అది అహంకారం అంటుంది అక్కడి మెజారిటీ మీడియా. మీడియా విశ్వసనీయతని ఆయన గత ఎన్నికల్లోనే దెబ్బతీసారు.
ఆయనది  ఆత్మవిశ్వాసమా లేక అహంకారమా తేల్చుకోవడానికి మరి కొద్ది నెలల్లో జరిగే అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్నికలు వేదిక కాబోతున్నాయి.
ఈ సారి కూడా మీడియా ఓడిపోతే ఇక దాని విశ్వసనీయత పూర్తి ప్రశ్నార్ధకమవుతుంది..     


(1987లో ట్రంప్)