30, ఏప్రిల్ 2020, గురువారం

మార్పు చూడని కళ్ళు - ఆరవ ఆఖరి భాగం

చరిత్ర గతిని మార్చిన గోర్భచేవ్
సోవియట్ యూనియన్ అధినేతలలో చాలామంది పదవిలో ఉండగానే మరణించారు. నికితా కృశ్చెవ్ విషయంలో వేరేగా జరిగింది. ఆయన జీవించి ఉండగానే పదవి నుంచి తొలగించారు. మిహాయిల్ గోర్భచేవ్ మాత్రం ఆరేళ్ళు అధికారంలో కొనసాగిన తర్వాత 1991 లో తన పదవికి రాజీనామా చేసారు.  రాజీనామా ప్రకటించిన తర్వాత బల్లపై కాగితాలు సర్దుకుంటూ కళ్ళజోడు తీసి వాటిపై పెట్టి, పక్కనే వున్న కప్పూ సాసరు వంక సాలోచనగా  చూస్తారు. అది ఖాళీగా కనిపిస్తుంది. క్రెమ్లిన్ లో ఆయనకు టీ సర్వ్ చేయకపోవడం అది మొదటిసారి. అధికారానికి అంతిమ ఘడియలకు అది సూచన.
గోర్భచేవ్ స్వతహాగా హాస్య ప్రియుడు. తర్వాత ఎప్పుడో ఆ సంఘటన గురించి చెబుతూ, ‘రాజీనామా పత్రంపై సంతకం చేస్తున్నప్పుడు నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే నన్ను నేనే తుపాకీతో కాల్చుకున్న అనుభూతి కలిగింది” అన్నారాయన మందహాసంతో.
సోవియట్ యూనియన్ విచ్చిన్నం అనంతరం దేశంలో సంభవిస్తూ వచ్చిన పరిణామాలను ఆయన దగ్గర నుంచి గమనిస్తూ వచ్చారు. మిహాయిల్ ఖోదోర్కొవిస్కి తన కళ్ళ ముందే దేశంలో అత్యంత సంపన్నుడిగా ఎదగడం ఆయన చూసారు. ఒకప్పుడు ఆయన్ని పట్టుకుని సైబీరియా జైలుకి  పంపారు. ఆ సమయంలో గోర్భచేవ్ కల్పించుకుని సాయపడకపోతే ఆయన జీవితం అక్కడితో ముగిసివుండేది.
రాజకీయంగా తన ప్రధమ ప్రత్యర్ధి అయిన బోరిస్ ఎల్త్సిన్ అనారోగ్యంతో మరణించినప్పుడు గోర్భచేవ్ ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆ సమయంలో వీఐపీ గేటు ద్వారా వెళ్ళడానికి అవకాశం ఉన్నప్పటికీ ఒక సాధారణ పౌరుడి మాదిరిగా జనంలో నిలబడి తన ఒకప్పటి సహచరుడికి అంతిమ వీడ్కోలు చెప్పారు. ప్రస్తుత అధినేత పుతిన్ తో సంబంధాలు మొదట్లో అద్భుతంగా ఉండడాన్ని, ఆ తర్వాత  పోను పోను నిరాసక్త ధోరణికి మారడాన్ని  కూడా ఆయన గమనించారు. అయినా తామరాకు మీద నీటిబొట్టులా వ్యవహరించే స్తితప్రజ్ఞత అలవరచుకున్నారు. ఎనిమిది పదులు దాటిన వయస్సులో, భార్య చనిపోయి ఊరి బయట వ్యవసాయ క్షేత్రంలోని ఇంటి నుంచి ప్రతిరోజూ క్రమం తప్పకుండా నగరం నడిబొడ్డున వుండే తన ఫౌండేషన్ కార్యాలయానికి వెళ్లి పనిచేసుకోవడం దినచర్యగా మార్చుకున్నారు.
1999 సెప్టెంబరులో  రైసా గోర్భచేవ్ కన్నుమూసినప్పటి నుంచి 89 ఏళ్ళ గోర్భచేవ్ ప్రస్తుతం ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. 
మరో సందర్భంలో బీబీసీ ప్రతినిధికి  ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన  ఇలా చెప్పారు.
“నేను మొదటిసారి 1985లో సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత సోవియట్ యూనియన్ లోని అన్ని రిపబ్లిక్ లలో విస్తృతంగా పర్యటించాను. గ్రామీణ ప్రజలతో దగ్గరగా మాట్లాడాను. నేను కలిసినప్పుడల్లా వాళ్ళు ఒకే మాట చెప్పేవాళ్ళు.
“మనకు చాలా ఇబ్బందులు వున్నాయి. తిండి గింజలకు కటకటఉన్న మాట నిజమే. అయితే  ఏమవుతుంది. మరి కాస్త కష్టపడితే వాటిని పండించుకుంటాము. ఇబ్బందులను అధిగమిస్తాము. కానీ మిమ్మల్ని కోరేది ఒక్కటే. యుద్ధం రాకుండా చూడండి”
“యుద్ధం వల్ల మా దేశం ఎన్ని కష్టాలు పడిందో, ఎంత నష్టపోయిందో వాళ్లకు గుర్తున్నట్టుంది. అందుకే వాళ్ళు ఆ కోరిక కోరారు.  బెర్లిన్ గోడ కూల్చి వేస్తున్నప్పుడు జోక్యం చేసుకోవాలని ఎంత వత్తిడి వచ్చినా నేను ఒప్పుకోలేదు. ఈనాటి ప్రపంచానికి యుద్ధాలు పనికిరావు”
“ప్రజల్లో అధిక సంఖ్యాకులు ఏమి కోరుకుంటున్నారో దాన్ని నెరవేర్చడమే నిజమైన ప్రజాస్వామ్యం” అని చెప్పారాయన.
సోవియట్ యూనియన్ విచ్చిన్నం అయిన ఇరవై ఏడేళ్లకు మెదుజా పత్రిక విలేకరి ఇల్యా జెగులేవ్ మిహాయిల్ గోర్భచేవ్ తన వృద్ధాప్యాన్ని ఎలా గడుపుతున్నారు అనే దానిపై ఒక వ్యాసం రాసారు.
అదిలా మొదలవుతుంది.
“మిస్టర్ గోర్భచేవ్! నేనెవరినో గుర్తున్నానా!”
గోర్భచేవ్ ఎదుట చాలా ఖరీదైన సూటు ధరించిన వ్యక్తి నిలబడిఉంటాడు. అతడి పేరు మిహాయిల్ ఖోదోర్కొవిస్కి. రష్యాలో అత్యంత సంపన్నుడు. మొత్తం దేశంలో అతిపెద్ద ముడిచమురు కంపెనీ ‘యూకోస్’ అధినేత.
“అవును. మీరు గుర్తున్నారు. ఇంతకీ నేనెవరన్నది తమరికి గుర్తు ఉందా?” అని గోర్భచేవ్ ఎదురు ప్రశ్నిస్తాడు.
ఇంటర్వ్యూ చేయడానికి ఆ విలేకరి ఇల్యా ఆయన ఇంటికి  వెళ్ళినప్పుడు గోర్భచేవ్ చెప్పిన మాట వింటే చాలా బాధ వేస్తుంది. 

“నిన్న బయటకు వెళ్ళడానికి బయలుదేరుతూ పైకి చూసాను. పై కప్పు నుంచి నీళ్ళు కారుతున్నాయి” (EOM)

కామెంట్‌లు లేవు: