30, మే 2021, ఆదివారం

సంక్షేమానికి పెద్దపీట జగన్ రెండేళ్ళ పాలన

 

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఓటమి అనుభవం నుంచి నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏమైనా గుణ పాఠం నేర్చుకున్నారా అంటే

 ఈ రెండేళ్ల పాలన తీరుతెన్నులు గమనించిన తర్వాత చప్పున ఔనని చెప్పడం కష్టం.

అయితే ఈ రెండేళ్లలో పాలనా సంబంధమైన విషయాల్లో ఆయన నవ్యత్వం   ఏమీ చూపించలేదా అంటే లేదు అని చెప్పడం కూడా కష్టమే.


అర్జునుడి దృష్టి పక్షి కన్ను మీద కేంద్రీకృతం అయినట్టు ఈ రెండేళ్లలో జగన్ మోహన రెడ్డి ధ్యాస, శ్వాస యావత్తూ తన ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలు మీదనే పెట్టారు. మేనిఫెస్టో తనకు ఓ భగవద్గీత, ఓ ఖురాన్, ఓ బైబిల్ అని పలుసార్లు ఆయనే స్వయంగా చెప్పుతూ వచ్చారు. అలానే చేస్తూ వచ్చారు. ఇది తప్పా ఒప్పా అంటే జవాబు వుండదు. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే ప్రభుత్వాలను ఎలా తప్పు పట్టగలం? అలా అని,  అవే సర్వస్వంగా భావించి మిగిలిన అవసరాలను పక్కన పెడుతూ పొతే అభివృద్ది కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ఖజానాలో మిగిలే మొత్తమెంత? అభివృద్ధి లేని సంక్షేమం వల్ల రాష్ట్ర పురోభివృద్ధి ఎలా సాధ్యం? 

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఆయనకు ఉన్నప్పటికీ నైతిక బాధ్యత మాత్రం లేదు. కారణం ప్రజలు ఆయన పెట్టుకున్న  ప్రాధాన్యతలు  గుర్తెరిగి, ఏరికోరి మరీ అధికారం ఒప్పచెప్పారు.


ప్రతి ప్రజాప్రభుత్వం కొన్ని ప్రాధాన్యతలు నిర్దేశించుకుంటుంది. అలా ఏర్పరచుకున్న ప్రాధాన్యతల ప్రకారం తనకు తాను దిశానిర్దేశం చేసుకుంటుంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇందుకు మినహాయింపు కాదు.


అయితే వచ్చిన చిక్కల్లా ఎక్కడ అంటే సంక్షేమం, అభివృద్ధి అనే పదాలకు అన్వయం చెప్పుకోవడంలో ఎవరి పద్దతులు వారికి వున్నాయి. ఒకరి భాష్యాన్ని మరొకరు అంగీకరించరు.

‘పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే ముఖ్యమంత్రిగా నా కర్తవ్యమ్’ అని ఆనాడు ఎన్టీ రామారావు బహిరంగంగా ప్రకటించేవారు. అలా అమల్లోకి వచ్చినవే రెండు రూపాయలకు కిలో బియ్యం వంటి పధకాలు.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సుదీర్ఘ కాలంలో పాలన కొత్త పుంతలు తొక్కింది. ఒక యువ ముఖ్యమంత్రిగా ఆనాడు అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించుకుని యువతరానికి ఒక ఆశాదీపికగా మారారు. ఇప్పటికీ వారిలో ఆ ఆరాధనా భావం చెక్కుచెదరకుండా వుంది.

ఆయన పరిపాలన ఫలితాలను, ఆయన ప్రాధాన్యతలను  ప్రజల్లో కొన్ని వయసుల వాళ్ళు, ముఖ్యంగా  యువకులు, మధ్య తరగతి, ప్రైవేటు ఉద్యోగ వర్గాల వాళ్ళు గుర్తించి గౌరవించారు. అభిమానించారు. ఇంకా ఆయనపట్ల వారిలో ఇలా పెంచుకున్న ఆరాధనా భావం అలాగే వుంది. అయితే ఆయనకు మాత్రం  రాజకీయంగా అచ్చిరాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదును అద్భుతంగా అభివృద్ధి చేసిన ఆయన కృషిని మునిసిపల్ ఎన్నికలలో ప్రజలు గుర్తించలేదని ఆయనే బాధ పడ్డారు. అభివృద్ధి అంటే పైకి కానవచ్చే రోడ్లు, సుందరమైన భవనాలు కాదని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించాయి. భుజానికి ఓ కంప్యూటర్ బ్యాగ్ తగిలించుకుంటే చాలు, ముఖ్యమంత్రిని సులభంగా కలవచ్చు అని ఎద్దేవా చేసాయి కూడా. ఆ అపప్రథ తొలగించుకోవడానికి ఆయన  2014 ఎన్నికలకు ముందు ‘నేను మారాను, నన్ను నమ్మండి’ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

  

ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకుని గెలుపు సాధించాలి అంటే సంక్షేమమే తారకమంత్రం అని రాజకీయనాయకులు  నమ్మే పరిస్థితి వచ్చింది. దాంతో తమ తమ ఎన్నికల ప్రణాళికల్లో సాధ్యమైనన్ని తాయిలాలను దట్టించి వదలాల్సిన అవసరాన్ని అన్ని పార్టీలు దేశ వ్యాప్తంగా గుర్తించి అందుకు అనువైన పధకాలను ఆకర్షణీయమైన పేర్లతో రూపొందించే పనిలో పడ్డాయి.

ఈ క్రమంలో వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మస్తిష్కంలో ‘నవ రత్నాలు’ పేరిట  రూపుదిద్దుకున్న  పధకం కూడా అటువంటిదే. తాను అధికారంలోకి రాగానే వాటిని తుచ తప్పకుండా అమలుచేస్తానని ఎన్నికల ప్రచార సభల్లో పలుసార్లు ఆయన ప్రజలకు హామీలు ఇస్తూపోయారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం, 2019 లో జరిగిన ఎన్నికల్లో కనీవినీ ఎరుగని ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తండ్రి, కొడుకుల(వై యస్ ఆర్, జగన్) చేతుల్లో ఓడిపోయిన రికార్డు చంద్రబాబు ఖాతాలో చేరింది.

జగన్ ఆ ఏడాది మే ముప్పయ్యవ తేదీన నూతన ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.  పూర్తిగా సంక్షేమానికి పెద్ద పీట వేసిన నవరత్నాలు హామీ ఆయన విజయానికి చాలావరకు దోహదం చేసివుండవచ్చు.  అయితే ఎన్నికల్లో జయాపజయాలకు సంక్షేమ పధకాలు అనే ఒక్క అంశమే కొలమానం కాదు. పాలక పక్షంపై ప్రజల్లో కలిగిన అసంతృప్తి అసహనంగా మారి, అసహనం ఆగ్రహంగా పెచ్చరిల్లి, ఆగ్రహం అవధులు ఎరుగని కసిగా రూపొందినప్పుడు ఎంతటి ప్రభుత్వాలయినా పేకమేడల్లా కుప్ప కూలుతాయి. ఈ కఠోర వాస్తవాన్ని జగన్ మోహనరెడ్డి ఖచ్చితంగా గమనంలో వుంచుకోవాలి. 


మొన్నీమధ్య ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో అనేక పధకాలకు కేటాయింపులు ప్రకటించినప్పుడు రెండేళ్లుగా ఇన్ని పధకాలు అమలవుతున్నాయా అని అనిపించింది. 

“నాడు, నేడు, జగనన్న విద్య దీవెన, వై.ఎస్.ఆర్. ఆరోగ్య శ్రీ, జగనన్న వసతి దీవెన, వై.ఎస్.ఆర్. కాపునేస్తం. జగనన్న నేతన్న నేస్తం, లా నేస్తం, ఈ.బీ.సీ. నేస్తం, అమ్మ ఒడి, వై.ఎస్.ఆర్. చేయూత, వై.ఎస్.ఆర్. ఉచిత పంటల బీమా, జగనన్న గోరు ముద్ద, వై.ఎస్.ఆర్. సంపూర్ణ పోషణ, ఇలా ఎన్నో, ఎన్నెన్నో. ఇవన్నీ ఒకేసారి విన్నప్పుడు పేర్ల విషయంలో తొందరపాటుతనం కానవస్తుంది ఎవరికయినా. 

వీటిల్లో కొన్ని కొత్తవి ఉండవచ్చు, మరికొన్ని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు పాత పధకాలకు కొత్త పేర్లు పెట్టి అమలు చేస్తున్నవి కావచ్చు. ఏవైనా ఒకటి మాత్రం ఒప్పుకుని తీరాల్సిన వాస్తవం. ప్రతి పధకానికి ఒక కాల నిర్ణయ పట్టిక పెట్టుకుని, నెలలు, తేదీల ప్రకారం ఒక పద్దతిగా ప్రతి పధకాన్ని అమలు చేస్తున్న మాట నిజం. సాధారణంగా రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఎన్నో వాగ్దానాలు చేస్తుంటాయి. ఆ వైతరణి దాటి, అధికారంలోకి రాగానే ‘బోడి మల్లయ్య’ సామెత మాదిరిగా వ్యవహరిస్తుంటాయి అనే అపప్రథ వుంది. కానీ జగన్ మోహన రెడ్డి ఈ ఒక్క విషయంలో పాత బాణీని పక్కన పెట్టి కొత్త బాట ఎంచుకున్నట్టుగా వుంది. 

సంక్షేమం సరే, అభివృద్ధి మాటలేమిటి అనే విపక్షాల విమర్సలకు ఆయన బడ్జెట్ సమావేశంలోనే అన్యాపదేశంగా ఇలా జవాబు చెప్పారు.

“అభివృద్ధి అంటే ఆకాశ హర్మ్యాల నిర్మాణం కాదు, సమాజంలో అట్టడుగున ఉన్న పేదవాళ్ల కనీస అవసరాలను తీర్చడం కూడా అభివృద్దే”

తోకటపా : పూర్వం జనతా ప్రభుత్వ హయాములో మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో రైల్వే మంత్రిగా పనిచేసిన మధు దండావతే ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పటివరకు రైలు బోగీల్లో  రెండో తరగతి ప్రయాణీకులు నిద్రించడానికి చెక్కబల్లలు ఉండేవి. వాటికి మెత్తటి  కుషన్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించడంతో రైల్వే శాఖ వారు దేశ వ్యాప్తంగా  ఆ ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. రెండో తరగతి ప్రయాణీకులకు పెద్ద ఉపశమనం లభించింది. ఎంతగానో సంతోషపడ్డారు. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. ఎప్పుడూ ఆ తరగతిలో ప్రయాణించని ఉన్నత తరగతుల వాళ్ళు ఈ మార్పులోని మంచిని గుర్తించలేకపోయారు. సమాజంలో వివిధ వర్గాల వారి మనస్తత్వాలు భిన్నంగా ఉంటాయనడానికి ఇదో ఉదాహరణ.  

(30-05-2021

బెయిల్ మీద ఒక రోజు

 చాలా ఏళ్ళుగా ఉంటున్న ఇల్లే. అలవాటయిన ఇల్లే. కానీ ఏడాదిగా చూసి, చూసి, ఎక్కడికి బయటకి పోకుండా అక్కడే  వుండి, వుండి బోర్ కొట్టడం లేదా అని మావాడు అడిగాడు.

మళ్ళీ వాడే అన్నాడు, రేపు శనివారం ఊరి బయట మా ఫ్రెన్ వాళ్ళ ఫార్మ్ హౌస్ కి వెళ్లి మళ్ళీ ఆదివారం ఉదయానికి వచ్చేద్దాము, అని.

రిస్కేమో అనబోయి మానేసి సరే అన్నాను.

ఈ కాలపు పిల్లలకు నచ్చని ఒకే మాట ‘రిస్కేమో అనేది. నేనూ నా కాలంలో రిస్క్ అంటే ఏమాత్రం భయం భక్తీ లేనివాడినే. ఇక పిల్లలకు ఏం చెబుతాను.

శనివారం అంటే ఈ ఉదయం ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ చేసి లాక్ డౌన్ ముగిసే సమయానికల్లా అక్కడికి చేరుకున్నాను. గేటు బయట, 1960 ల నాటి ఓ పాత సీలింగ్ ఫ్యాన్ విరిగిన రెక్కమీద వింటేజ్ వనం అని ఇంగ్లీష్, తెలుగు అక్షరాల్లో రాసి గోడకు కొట్టి వుంది. విలేకరి చూపుకదా ఏమిటో మాసిపోయినట్టు కనిపించింది ఆ బోర్డు. పరికించి చూస్తే అది ఓ సీలింగు ఫ్యాన్ రెక్క. (అది 1960 ల నాటి ఓ పాత సీలింగ్ ఫ్యాన్ విరిగిన రెక్క అని  తరువాత తెలిసింది) ఇలాంటి ప్రదేశంలో ఒక పగలూ, ఓ రాత్రీ గడపడం ఎల్లా అనే అనుమానం మనసు మూలల్లో తొంగి చూసిన మాట వాస్తవం. కానీ పైకి అనలేదు. ఆ గేటు దగ్గర కాపలావాడు మావాడు తన  ఫ్రెండ్ పేరు అనిరుద్ అని  చెప్పగానే గేటు బార్లా తెరిచి పొమ్మన్నాడు. బాటకు రెండు వైపులా వ్యవసాయ క్షేత్రాలు. పెద్ద పెద్ద చెట్లు. కొంత దూరం పోయిన తర్వాత మరో గేటు. అక్కడ ఎప్పుడో మాంధాతల కాలంనాటి, శిధిలావస్థలోవున్న  పాత కారు. వెనక పెళ్లి ఊరేగింపుల్లో కనబడేవి ఈ  ఓపెన్ టాప్ ప్లిమత్ కార్లు.

ఇచ్చిన రెండు కాటేజీలు బాగున్నాయి. అక్కడ పనిచేసే ఆశారాం వచ్చి తాళం తీశాడు. శుద్ధ హిందీ మనిషి.

ఆ కాటేజీ యావత్తు చెక్కతో చేసినట్టు పైకి కనబడింది. ముందు చెక్కతో చేసిన చిన్న వసారా  నాలుగుకుర్చీలు, ఓ మేజా బల్ల. తలుపు తెరిస్తే, ఉడెన్ ఫ్లోర్, ఒకటే డబల్ కాట్ బెడ్ రూమ్, ఏసీ, ఓ వ్రాత బల్ల, రెండు కుర్చీలు. స్ప్లిట్ ఏసీ, అటాచ్డ్ బాత్ రూమ్. మెయింటెనెన్స్ బాగుంది. లోపల ఉడుక్కుంటున్న ఆత్మారాముడు ఆ ఏర్పాట్లు చూసి చల్లబడ్డాడు. మా కోడలు వచ్చి ముందు ఆ పరుపు మీద వేసి వున్న చద్దరు తీసేసి ఇంటి నుంచి తెచ్చిన బెడ్ షీట్ వేసింది. అలాగే దిండ్లు కూడా. గది, బాత్ రూమ్ సానిటైజ్ చేశారు.

కాసేపు విశ్రాంతి తీసుకుని బయటకు వచ్చాము. కారులో వస్తున్నప్పుడు పూర్తిగా కనబడలేదు. చుట్టూ పచ్చటి చెట్లు, పచ్చిక బయళ్ళు. ఏదో సినిమాలో మాదిరిగా ఇంటి నుంచి తెచ్చినవే..

ఒక చోట ఓ పాత కాలపు సింహ ద్వారం. దానికి ఇరువైపులా ‘అనగనగా అని తెలుగులో, ఇంగ్లీష్ లో రాసిన బోర్డులు వున్నాయి. చిన్నప్పుడు కధలన్నీ అనగనగా అనే వాక్యంతో, ఇంగ్లీష్ లో Once upon a time  అని మొదలు పెట్టారు. గడప దాటి లోపలకు వెడితే, అదేదో ఇంగ్లీష్ సినిమా Back to the future మాదిరిగా  మళ్ళీ నా చిన్నప్పటి రోజులకు వెళ్లినట్టు ఎక్కడ చూసినా పాత సామగ్రి. బాయిలర్లు, జాడీలు, ఇత్తడి గుండీలు, పాత కాలపు మేనాలు, గుర్రపు బగ్గీలు, ఈ కాలపు తరానికి ఆ మాటకు వస్తే నాకే తెలియని అనేక పాత కాలపు వస్తువులు. లాంతర్లు, చిమ్నీలు,  రేడియోలు, టేప్ రికార్డర్లు, చేటలు, విసన కర్రలు, కెమెరాలు, ఎప్పుడో అరవై ఏళ్లనాటి  బాంబే హల్వా స్వీట్ డబ్బాలు, బీహైవ్ బ్రాండీ ట్రేలు, సన్ లైట్ సోప్ కేలండర్లు, పిఠాపురం రాణి వాసం వారు వాడిన టేకు మేనా, చాలా పాత కాలం నాటి ఇంగ్లీష్ పుస్తకాలతో నింపిన బీరువాలు ఇలా అనేక వస్తువులు.

చిత్రలేఖనం, సంగీతం మీద ఆసక్తి కలిగిన వారు ప్రశాంతంగా తమ కళలకు మెరుగు పెట్టుకోవడానికి ఏర్పాట్లు.

ఇవన్నీ చూసిన తర్వాత పర్వాలేదు, రిస్క్ తీసుకుని అయినా మంచి చోటుకే వచ్చాను అనిపించింది.   (29-05-2021]

    



28, మే 2021, శుక్రవారం

ప్రజలకిచ్చిన మాటే వై.ఎస్. జగన్ బాట

 మే 30 వ తేదీకి ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి రెండేళ్ళు అవుతుంది. 

రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్  రెండో ముఖ్యమంత్రిగా జగన్ మోహన రెడ్డి గారు ఏమి సాధించారు?

జగన్ మోహన రెడ్డి గారి రెండేళ్ల పరిపాలన ఎలా వుంది ?

వినడానికి రెండు ప్రశ్నలు ఒకే మాదిరిగా వున్నా రెండింటిలో స్థూలమైన తేడా ఒకటి వుంది.

మొదటి దానికి జవాబు ఒక్క వాక్యంలో కూడా చెప్పవచ్చు. కాళ్ళూ చేతులూ కట్టేసి కబాడీ ఆడమన్నట్టు వుంది ఆయన పరిస్థితి.

శాసనసభలో అతి ఘనమైన మెజారిటీ వుంది. ఏ నిర్ణయం తీసుకున్నా కాదనే వారు లేరు. కానీ గత రెండేళ్లుగా పరిస్థితులను గమనిస్తుంటే వాటిని అమలు చేయడం ఆయన ఒక్కరి చేతిలో లేదని అర్ధం అవుతోంది. ఏ అడుగు వేసినా అది న్యాయ సమీక్షకు వెడుతోంది. నాకు తెలిసి గత కొన్ని దశాబ్దాల కాలంలో ఒక ప్రభుత్వ నిర్ణయాలు ఈ స్థాయిలో కోర్టుల పరిధిలో తిరస్కరణకు గురి కావడం ఎన్నడూ చూడలేదు. నిర్ణయాలలో లోపం అయినా వుండాలి. వాటిని న్యాయ సూత్రాలకు అన్వయించడంలో పొరబాటు అయినా జరిగి వుండాలి. అయితే, దీనిని త్వరితగతిన సరిదిద్దుకోవాల్సిన బాధ్యత, అవసరం కూడా ప్రభుత్వానికే వుంది.

ఇక రెండో ప్రశ్నకు జవాబు ఎక్కడో నగరాల్లో వుండి చెబితే కుదరదు. ఆయన పాలన వల్ల మంచో చెడో ఆ ఫలితాలను  అనుభవించిన వాళ్ళు చెప్పాలి. వాళ్ళు అధిక సంఖ్యలో వుండేది నగరాల్లో కాదు, పల్లెల్లో. నిజానికి జగన్ మోహన్ రెడ్డి గారు అమలుచేస్తున్న నవ రత్నాలలో అధికభాగం వారి సంక్షేమానికి సంబంధించినవే కావడం వల్ల ఈ  ప్రశ్నకు జవాబు గ్రామాల్లో ఒక మాదిరిగా, నగరాల్లో మరో మాదిరిగా వచ్చే అవకాశం వుంది. అభివృద్ధి ఫలాలను నేరుగా రుచి చూసిన వారి అభిప్రాయమే నిఖార్సయినది. నగరాల్లో కొందరు దీనితో ఏకీవభించకపోవచ్చు. అభివృద్ధికి వారు చెప్పే భాష్యం వేరేగా వుంది. దానికి జవాబు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ మధ్య జరిగిన ఒకరోజు అసెంబ్లీ సమావేశంలో చెప్పినట్టున్నారు. అభివృద్ధి అంటే  కేవలం ఆకాశహర్మ్యాల నిర్మాణం కాదు, పేదవాడి కనీస అవసరాలు తీర్చడం కూడా అభివృద్దే అని.

ఇదలా ఉంచితే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఓటమి అనుభవం నుంచి నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏమైనా గుణ పాఠం నేర్చుకున్నారా అంటే

 ఈ రెండేళ్ల పాలన తీరుతెన్నులు గమనించిన తర్వాత చప్పున ఔనని చెప్పడం కష్టం.

అయితే ఈ రెండేళ్లలో పాలనా సంబంధమైన విషయాల్లో ఆయన నవ్యత్వం   ఏమీ చూపించలేదా అంటే లేదు అని చెప్పడం కూడా కష్టమే.

చంద్రబాబునాయుడు నవ్యాంధ్రప్రదేశ్  ప్రధమ  ముఖ్యమంత్రిగా ఉన్న అయిదేళ్ళ కాలంలో, తన సమయంలో చాలావరకు అధికారుల సమీక్షా సమావేశాల్లో గడిపేవారనే మాట వినబడేది. అందువల్ల పరిపాలన చేయాల్సిన అధికారుల విలువైన సమయం కొంత వృధా అయ్యేది. గంటల తరబడి సాగే ఈ సమీక్షల కారణంగా అధికారులు, సిబ్బంది అసహనానికి గురయ్యేవారు కూడా. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇబ్బందులు తగ్గుతాయని అనుకున్నవారికి నిరాశే మిగిలింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా సమీక్షల బాట పట్టడం ఆశ్చర్యంతో పాటు, అసహనాన్ని కూడా పెంచుతోంది. నిజానికి ఈ సమీక్షలు కొత్తవేమీ కాదు. ప్రతి ముఖ్యమంత్రి అనుసరించిన విధానమే ఇది. కాకపొతే దాన్ని అమలుచేయడంలో తేడాలు ఉండేవి. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు సమీక్షలు జరిగేవి కానీ అవి చాలా సంక్షిప్తంగా సాగేవి. ఏదైనా కార్యక్రమం లేదా పధకం లేదా ప్రాజెక్టు వివిధ శాఖల మధ్య సమన్వయ లోపంతో ఆలస్యం అవుతోంది అనుకున్నప్పుడు  వై.ఎస్. ఇటువంటి సమావేశాలు నిర్వహించేవారు. విభిన్న శాఖల అభ్యంతరాలు,  వాటికి పరిష్కారాలు ఆ సమావేశంలో అక్కడికక్కడే కనుగొనేవారు. దానివల్ల చాలా సమయం ఆదా అయ్యేది. సమస్యకు సానుకూల పరిష్కారం లభించింది అని  తెలియగానే వై.ఎస్. సమావేశాన్ని ముగించి వెళ్ళిపోయేవారు. ఇటువంటి పద్దతులను జగన్ మోహన రెడ్డి   అనుసరిస్తే  ఆయన తలపెట్టిన అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల అమలు మరింత వేగం  పుంజుకునే  అవకాశం  వుంటుంది.

గత రెండేళ్ల కాలంలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాలన మీద ప్రతిపక్షాలు, అనేక మీడియా సంస్థలే కాకుండా సోషల్ మీడియాలో సైతం వినవస్తున్న విమర్శ ప్రధానంగా ఒకటి వుంది. జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా కేవలం సంక్షేమ పధకాల మీదనే ప్రజాధనం ఖర్చుచేస్తూ  ప్రభుత్వ ఖజానా ఖాళీ  చేస్తున్నారు అన్నదే ఆ విమర్శ. ఇదే లెక్కన రాబోయే  మూడేళ్లు వ్యవహరిస్తే రాష్ట్రం  అప్పుల ఊబిలో కూరుకు పోతుందని వాళ్ళ అంచనా.

ప్రతిపక్షాలు అన్నీ ఒక్కటై చేస్తున్న విమర్శలు, ఆరోపణలను  జగన్ మోహన్ రెడ్డి పెద్దగా పట్టించుకున్న దాఖలా కనబడడం లేదు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటకే ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారు. మౌనంగా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ‘మా విమర్శలకు ముఖ్యమంత్రి ఎందుకు స్పందించరు?’ అంటూ టీవీ వేదికల మీద ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ప్రకటనలే ఇందుకు నిదర్శనం.

ప్రతిపక్షాల విమర్శలను, మీడియా సలహాలను జగన్ మోహన రెడ్డి ఖాతరు చేయడం లేదు అనే అభిప్రాయం జనంలో ఉన్నమాట మిజమే. జగన్ పాలనను నిశితంగా పరిశీలిస్తూ వచ్చిన ఓ విశ్లేషకుడు ఇలా అన్నారు.

“రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం మహా కోలాహలంగా వుంటుంది. వచ్చే పోయే ప్రయాణీకులు, తినుబండారాలు అమ్మేవారి కేకలు, రైళ్ళ కూతలు, పోర్టర్ల హంగామా. వీటన్నిటి నడుమ ఒక వ్యక్తి ఏమీ పట్టించుకోకుండా, బయటి గందరగోళాన్ని చెవిన పెట్టకుండా దీక్షగా తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు. అతడే స్టేషన్ మాస్టరు.

జగన్ మోహన రెడ్డి వ్యవహారశైలి దూరం నుంచి పరిశీలిస్తున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చేది ఈ స్టేషన్ మాస్టరే!”

అయితే, ఈ విషయంలో  జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయం వేరుగా వుంది. ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలు తన మాటలు నమ్మి తన చేతికి అధికార పగ్గాలు అప్పగించారని, అంచేత తన పార్టీ ఎన్నికల ప్రణాళికే తనకు భగవద్గీత, బైబిల్ ఖురాన్ అని, ప్రజలకు ఇచ్చిన మాటే తనకు వేదమని  సందర్భం వచ్చిన ప్రతి చోటా ఆయన  చెబుతూ వస్తున్నారు.

ఇందులో వాస్తవం లేకపోలేదు. 2019 ఎన్నికల్లో వైసీపే ఘన విజయానికి దోహదం చేసిన అనేక కారణాల్లో, వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మస్తిష్కంలో ‘నవ రత్నాలు పేరిట  రూపుదిద్దుకున్న  పధకం కూడా  వుంది. తాను అధికారంలోకి రాగానే వాటిని తుచ తప్పకుండా అమలుచేస్తానని ఎన్నికల ప్రచార సభల్లో పలుసార్లు ఆయన ప్రజలకు హామీలు ఇస్తూపోయారు.  సుదీర్ఘ నిరీక్షణ అనంతరం,  ఆ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని ఘన విజయాన్ని  తన ఖాతాలో వేసుకున్నారు. తండ్రి, కొడుకుల(వై యస్ ఆర్, జగన్) చేతుల్లో ఓడిపోయిన రికార్డు చంద్రబాబు ఖాతాలో చేరింది.

సంక్షేమం గురించి జనం స్పందనలు విభిన్నంగా వుంటాయి అనడానికి ఓ ఉదాహరణ.

పూర్వం జనతా ప్రభుత్వ హయాములో మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో రైల్వే మంత్రిగా పనిచేసిన మధు దండావతే ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పటివరకు రైలు బోగీల్లో  రెండో తరగతి ప్రయాణీకులు నిద్రించడానికి చెక్కబల్లలు ఉండేవి. వాటికి మెత్తటి  కుషన్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించడంతో రైల్వే శాఖ వారు దేశ వ్యాప్తంగా వాటిని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. దానితో  రెండో తరగతి ప్రయాణీకులకు పెద్ద ఉపశమనం లభించింది. ఎంతగానో సంతోషపడ్డారు. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. ఎప్పుడూ ఆ తరగతిలో ప్రయాణించని ఉన్నత తరగతుల వాళ్ళు ఈ మార్పులోని మంచిని గుర్తించలేకపోయారు. సమాజంలో వివిధ వర్గాల వారి మనస్తత్వాలు భిన్నంగా ఉంటాయనడానికి ఇదో ఉదాహరణ. 

(28-05-2021)

 


దటీజ్ ఎన్టీఆర్

 దాదాపు ముప్పై ఎనిమిదేళ్ల క్రితం సంగతి

టీడీపీ ఆవిర్భావం తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల దరిమిలా రాష్ట్రంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వ పాలన మొదలయింది. కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో టీడీపీ అధికారంలో వుండడంతో రాజకీయ క్రీనీడలు అన్ని వ్యవస్థల్లో మాదిరిగానే రేడియో, దూరదర్శన్ ల మీద కూడా పడ్డాయి. ఆ రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని అనావృష్టి ప్రాంతాల్లో పర్యటించి వచ్చిన ముఖ్యమంత్రి ఎన్ టీ రామారావు, ప్రెస్ మీట్ పెట్టి రేడియో, దూరదర్శన్ లకు కూడా కబురు పంపారు. కరవు ప్రాంతాలలో ప్రభుత్వం తీసుకునే చర్యలు గురించి ముఖ్యమంత్రి ప్రసంగ పాఠాన్ని రికార్డ్ చేసి సందేశం రూపంలో ప్రసారం చేయాలని కోరారు.

ఆబిడ్స్ లోని ముఖ్యమంత్రి నివాసాన్ని చేరుకున్న మా సిబ్బంది రికార్డింగ్ పరికరాలను సిద్ధం చేసుకున్నారు. కొద్దిసేపటికి ఎన్టీఆర్ కిర్రు చెప్పులు చప్పుడు చేసుకుంటూ మెట్లు దిగివచ్చారు. పీ ఆర్ వొ, (మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాలరావు) తయారు చేసిన సందేశం ప్రతిని ఆమూలాగ్రం ఓ మారు తిరగేసి, తాము సిద్ధం అన్నట్టు తలపంకించారు. రికార్డింగు మొదలయింది.

"ప్రియమైన రాష్ట్ర ప్రజలారా!..." అని ప్రసంగం ప్రారంభించారు. అదే స్పీడులో కొనసాగుతుందని అంతా అనుకున్నాం. కానీ ఆయన హఠాత్తుగా ఆపి, 'కట్ వన్ - టేక్ టు' అన్నారు. మా వాళ్ళు రికార్డింగు ఆపేశారు. వందల సినిమాల్లో అనర్ఘళంగా డైలాగులు చెప్పిన అనుభవం ఆయనది. ఏ పదాన్ని ఎక్కడ వొత్తి పలకాలో, ఏ వాక్యాన్ని ఎక్కడ విరిచి చెప్పాలో ఆయనకు కొట్టిన పిండి. కానీ, ఇక్కడే ఎదురయింది మాకు వూహించని, ఆ మాటకు వస్తే అంతవరకూ అనుభవంలో లేని ఇబ్బంది. ఈ కట్లు, టేకుల విషయం తెలియకుండా రికార్దింగుకు రావడం వల్ల, తెచ్చిన టేపులు సరిపోలేదు. ఆఘమేఘాల మీద పంపించి స్టూడియో నుంచి అదనపు టేపులు తెప్పించి రికార్డింగు ముగించామనిపించారు.

అసలు కధ స్టూడియోకు చేరిన తర్వాత మొదలయింది. ఏ టేపు విన్నా కట్లూ, టేకులూ అన్న రామారావుగారి స్వరమే. ఆరాత్రే ప్రసారం కావాల్సి వుండడంతో సిబ్బంది అంతా టెన్షన్ కు గురయ్యారు. సీ ఎం గారి మొదటి ప్రసంగం కావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ కమీషనర్ (పూర్వాశ్రమంలో తపాలా శాఖ డైరెక్టర్) సైదులు గారు, డైరెక్టర్ సీ,వీ, నరసింహారెడ్డి గారు అంతసేపూ మాతోపాటే రేడియో డబ్బింగు గదిలోనే వుండిపోయారు. కట్లూ టేకుల మధ్య వున్న ముఖ్యమంత్రిగారి సందేశాన్ని మా వాళ్లు కష్టపడి మాస్టర్ టేపు మీదకు ఎక్కించి డబ్బింగు పని పూర్తి చేసి ప్రసారం నిమిత్తం అనౌన్సర్ కి అప్పగించి వూపిరి పీల్చుకున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే, డబ్బింగు పూర్తయిన తరువాత చూసుకుంటే మాకెంత నిడివి అవసరమో ముఖ్యమంత్రి సందేశం అంతే వ్యవధికి అతికినట్టు ఖచ్చితంగా సరిపోయింది.

దటీజ్ ఎన్టీఆర్.

 

27, మే 2021, గురువారం

అంతరంగంలో ఆధ్యాత్మికం

 

భండారు శ్రీనివాసరావు అనే నేను ...
బాగానే వుంది, నువ్వే శ్రీనివాసరావువి. మరి ఆ ఆ పేరు తీసేస్తే నీవెవరు?
నిన్ను గుర్తు పట్టేది ఎల్లా? నీ రూపం చూశా? నీ మాటలు వినా? నీ రాతలు చదివా? ఎలా?
ఈ శరీరానికి ఆ పేరు ఉందా! లేదా పేరును బట్టి శరీరానికి శ్రీనివాసరావు అనే అస్తిత్వం వచ్చిందా!
ఈ నేను కాని దాన్ని నేను, నేను అనుకోవడం అజ్ఞానం అవుతుందా!
అంటే ఈ నేను, నేను కాదని బోధపరచుకోవాలా!
సత్యం బోధ పడడానికి ఎంత దూరం దృష్టి సారించాలి. అంత దూరం దృష్టి ఆనుతుందా!
పెంజీకటి కావల అన్నాడు పోతన,
అంటే పెనుచీకటికావల వెలుగు ఉంటుందా! అసలు ఈ కటిక చీకటిని చీల్చి చూడడం ఎల్లా!
దేహంలో ఆరు కోశాలు అని అంటారు.
అన్నమయ కోశం (అన్నంతో జీవించేది), ప్రాణమయ కోశం ( శరీరంలో వున్న వ్యవస్థ), మనోమయ కోశం(ఆలోచింప చేసేది), విజ్ఞానమయ కోశం ( జ్ఞానం కలిగించేది), ఆనందమయ కోశం ( దివ్యానుభవం కలిగించేది).
మొదటి అయిదు దాటి చూస్తే చివరిదానికి చేరుకుంటాడు మానవుడు. దాన్ని కూడా దాటి చూడగలిగితే సర్వం ఆనందమయం. అక్కడ గోచరిస్తుంది ప్రకాశంతో విరాజిల్లే ఆత్మ.
అదే అసలయిన నేను అంటారు భగవాన్ రమణ మహర్షి.
గీతలో చెప్పినట్టు చంపేదెవరు? చచ్చేదెవరు?
అంతా నీ భ్రమ.
అన్నీ నేనే అనే పరమాత్మ ఒకటి వుంది. మిగిలినవన్నీ భ్రాంతులే.
నేనెవరు అని ఓమారు మనల్ని మనం ప్రశ్న వేసుకుని నిశ్చల ధ్యానంతో జవాబు వెతుక్కుంటే ..
ప్రతి మనిషి శరీరంలో మూడు భాగాలు. ఒకటి ఉపాధి (శరీరంతో కూడిన నేను), రెండోది స్థూల శరీరం (రక్తమాంసాలు కలిగినది), మూడోది సూక్ష్మ శరీరం (జీవుడు)
కంటికి కనబడే స్థూల శరీరాన్నే నేను అనే ఓ మిథ్యా భావనలో, భ్రమలో ఉంటాము.
జీవుడు అనే సూక్ష్మ శరీరము, జన్మజన్మల కర్మఫలాలను అనుభవించడానికి స్థూల శరీరాన్ని ధరిస్తుంది. ఆ కర్మ ఫలాలు కూడా మూడు.
ప్రారబ్ధం, ఆగామి, సంచితం.
ప్రస్తుత శరీరంలో జీవుడు అనుభవిస్తున్న కర్మని పుణ్యం, ప్రారబ్ధం అంటారు.
అనాదిగా తెచ్చిపెట్టుకున్న కర్మని ఆగామి అంటారు.
కర్మశేషం వుంటే అది సంచితంగా మరో జన్మలో దఖలు పడుతుంది.
కర్మశేషం తొలగిన రోజున జన్మరాహిత్యం సిద్ధిస్తుంది. అంటే పాపపుణ్యాలు రెండింటినీ క్షయం చేసుకోవడం అన్నమాట.
ఏమి అర్ధం అయింది? అంత తేలికగా అర్ధం కానిది, అంతం లేనిది కనుకే వేదాంతం అన్నారు.
అర్ధం అయినా కాకపోయినా ఈ వయస్సులో అప్పుడప్పుడైనా కొన్ని ఆముష్మిక విషయాలు గురించి ఆలోచించడం మంచిదనిపించి ఈ రాతలు. అంతే!
(27-05-2021)

మహానాడు


తెలుగుదేశం పార్టీ వార్షిక సదస్సుకు ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్టీఆర్ మహానాడు అని తొలుత నామకరణం చేసినప్పుడు అందరు ఇదెక్కడి పేరు అని ఆశ్చర్యపోయారు. కానీ తదాదిగా మహానాడు అనేది తెలుగునాట బాగా ప్రాచుర్యం పొందింది.
మాస్కోలో వున్న అయిదేళ్లు మినహాయిస్తే తెలుగుదేశం పార్టీ నిర్వహించిన అన్ని మహానాడు కార్యక్రమాలకు నేను రేడియో విలేకరిగా హాజరయ్యాను.
చంద్రబాబునాయుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఓసారి తెలుగుదేశం మహానాడు కాకినాడలో జరిగింది. హైదరాబాదు నుంచి విలేకరులను తీసుకువెళ్ళారు. ప్రారంభానికి ముందు రోజు అక్కడికి చేరుకున్నాం. ప్రైవేటు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు ప్రయోగాత్మక దశలో వున్నాయి. టీవీ 9 వారికి ఓ ఆలోచన కలిగింది. ప్రారంభోత్సవానికి ముందు ఎవరయినా జర్నలిస్టుతో మాట్లాడించాలని అనుకున్నారు. పొద్దున్నే(మహానాడు జరిగే ప్రదేశం దగ్గరికి) పోదాం రెడీగా ఉండమని చెప్పారు. బ్రేక్ ఫాస్ట్ చేయకుండానే వెళ్లాం. మహానాడు వెన్యూ దగ్గర తిరుగుతూ నేనూ రజనీకాంత్ మాట్లాడుకుంటున్నాం. ఆయన ఏవో అడుగుతున్నారు. నేను ఏదో చెబుతున్నాను.
‘ప్రతి రాజకీయ పార్టీ తమ కేడర్ ను ఉత్సాహ పరచడం కోసం ఇలాంటి తంతులు నిర్వహిస్తుంటారు. ఏదో మొక్కుబడి తీర్మానాలు ప్రవేశపెడతారు. ఏదో చర్చ జరిగిందని అనిపిస్తారు. తర్వాత ఆ తీర్మానాలు ఏమయ్యాయో ఎవరూ పట్టించుకోరు. కాకపోతే నాయకులకి గ్రౌండ్ లెవెల్ రియాలిటీలు తెలుసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. గ్రామ స్థాయి కార్యకర్తల్ని పిలిచి మాట్లాడితే, హైదరాబాదులో కూర్చుని తెలుసుకోలేని విషయాలు వాళ్లకు తెలుస్తాయి. కానీ అంత తీరిక వాళ్ళకి వుండదు. అందుకే ఇదంతా ఒక తంతు అనేది. టీడీపీ అనే కాదు ఏ పార్టీ సమావేశాలు అయినా ఇదే తంతు”
ఏదో ఇలా చెప్పుకుపోతున్నాను. కాసేపు అలా తిరిగి మళ్ళీ హోటల్ కు వచ్చాము.

బ్రేక్ ఫాస్ట్ టేబుల్ దగ్గర మంత్రి యనమల రామకృష్ణుడు కనిపించారు. ఆయన మోహంలో ఎప్పుడూ కనిపించే ప్రసన్నత కానరాలేదు. ప్లేటు చేతికి ఇస్తూ అన్నారు నా మొహం లోకి చూస్తూ.
“అంతే లెండి! ఇంతింత శ్రమ పడి చేసినదంతా మీకు ఓ తంతులాగా కనిపిస్తోంది అన్నమాట”
ముందు నాకు అర్ధం కాలేదు ఆయన అలా ఎందుకు అంటున్నారో.
తర్వాత తెలిసింది, అంతకు ముందు నేను మాట్లాడినదంతా ఆ టీవీలో లైవ్ లో చూపించారట!

జవహర్లాల్ నెహ్రూ, కొన్ని జ్ఞాపకాలు

 ఈరోజు భారత ప్రధమ ప్రధాని నెహ్రూ వర్ధంతి. 1964 మే 27 న పండిత జవహర్ లాల్ నెహ్రూ పరమపదించారు. ఆ వార్త తెలిసిన దేశప్రజానీకం శోకాబ్దిలో మునిగిపోయింది.

ఆ రోజు నాకు బాగా గుర్తుంది. నెహ్రూ మరణించిన వార్త రేడియోలో విన్నప్పుడు మా వూళ్ళో అనేకమంది భోరున విలపించారు. చాలా తక్కువ మంది ఆ రాత్రి భోజనాలు చేశారు. ఇంటిమనిషిని పోగొట్టుకున్న విషాదం వారిలో కానవచ్చింది.
‘మన సారధి, మన సచివుడు మన జవహరు మనకిక లేడంటూ ఆ మరునాడు ఆంధ్రప్రభ మొదటి పుటలో ఎనిమిది కాలాలతో పతాక శీర్షిక పెట్టింది.
నెహ్రూ గురించిన అనేక జ్ఞాపకాలు నా మదిలో పదిలంగా వున్నాయి.
ఒకసారి బెజవాడలో ప్రధానమంత్రి మీటింగు జరిగింది. చుట్టుపక్కల నుంచే కాదు, ఇరుగు పొరుగు జిల్లాలనుంచి సొంత ఖర్చులతో రైళ్లల్లో, బస్సుల్లో వెళ్ళిన వాళ్ళలో నేనూ వున్నాను. ఓపెన్ టాప్ కారులో ప్రయాణిస్తూ, ప్రజలు అభిమాన పురస్సరంగా ఆయనపై విసురుతున్న పూలదండలను నెహ్రూ ఒడుపుగా పట్టుకుని తిరిగి జనాలమీదకే విసరడం బాగా గుర్తుండిపోయింది.
నెహ్రూ ప్రధానిగా వున్న రోజుల్లో ఆయన యెంత నిరాడంబరంగా వుండేవారో తెలుసుకోవడానికి ఒక ఫోటో చూస్తే తెలిసిపోతుంది. నెహ్రూ అధికార నివాసంలో జరిగిన విలేకరుల గోష్టికి సంబంధించిన ఫోటో ఇది. అ గదిలో కూర్చోవడానికి వీల్లేక నిలబడి, సోఫా అంచుల మీద కూలబడి విలేకరులు ప్రశ్నలు అడుగుతుంటే ఎదురుగా ఒక సోఫాలో తలపట్టుకు కూర్చున్నది నెహ్రూ అంటే ఒక పట్టాన నమ్మడం కష్టం. తలపై గాంధీ టోపీ లేకుండా జవహర్లాల్ ని చప్పున గుర్తుపట్టడం తేలిక కాదు. (అదేం చిత్రమో గాంధీ ఎప్పుడూ ఆలాంటి టోపీ పెట్టుకున్న సందర్భం లేదు, అయినా దానికి గాంధీ టోపీ అనిపేరు)
నెహ్రూ గారు ప్రధానమంత్రిగా వున్న రోజుల్లో నాటి సోవియట్ యూనియన్ అధినాయకుడు కృశ్చెవ్ అధికార పర్యటనపై ఢిల్లీ వచ్చారు. పాలం విమానాశ్రయంలో స్వాగతం పలకడానికి నెహ్రూ స్వయంగా వెళ్ళారు. అనంతరం విదేశీ అతిధిని వెంట బెట్టుకుని జవహర్ లాల్ నెహ్రూ కారులో నగరానికి వస్తున్నారు. మార్గ మధ్యంలో అక్కడక్కడా కొందరు పౌరులు ముంగాళ్ళ మీద కూర్చుని కాలకృత్యాలు తీర్చుకోవడం కృశ్చెవ్ కంట పడింది. అదేమిటని అడిగిన కృశ్చెవ్ ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పడానికి నెహ్రూ గారికి తల కొట్టేసినంత పనయింది.
1951లో ఒక వార్తాపత్రికలో 'పాకిస్తాన్ తో మనకు యుద్ధం తప్పదు' అని ఒక జ్యోతిష్కుడు రాసిన వ్యాసాన్ని ప్రచురించారు. అది చదివిన అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూకు చాలా కోపం వచ్చింది. జ్యోతిష్యం, హస్తసాముద్రికం వంటి వాటికి వ్యతిరేకంగా ఒక చట్టం చేయాలని సంకల్పించేంత వరకు వెళ్ళింది ఆయన ఆగ్రహం.
నెహ్రూ ప్రజాస్వామ్య వాది అనేందుకు చరిత్రలో మరికొన్ని ఉదాహరణలు వున్నాయి. స్వాతంత్ర్యం రావడానికి పూర్వమే గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో జవహర్ మాటకు ఎదురుండేది కాదు. జవహర్ లాల్ నెహ్రూ పట్ల పార్టీలో వ్యక్తి ఆరాధన శృతి మించుతోందనీ, దానిని అరికట్టకపోతే ఆయనలోని అహంభావం మరింత పెరిగి ఒక సీజర్ మాదిరిగా తయారవుతాడనీ, ఇది పార్టీకి ఎంతమాత్రం మేలు చేయదనీ కలకత్తా నుండి వెలువడే ఒక పత్రికలో వ్యాసాలు వెలువడుతుండేవి. వాటిని 'చాణక్య' అనే కలం పేరుతొ రాస్తున్నది ఎవరో కాదు, జవహర్ లాల్ నెహ్రూనే అన్న నిజం చాలా ఏళ్ళవరకు ఎవ్వరికీ తెలియదు. నెహ్రూను తీవ్రంగా వ్యతిరేకించేవారెవ్వరో ఆ పేరుతో ఆ వ్యాసాలు రాస్తున్నారని అనుకునేవారు.
అప్పట్లో కలం కూలీ జీ. కృష్ణ గారు ఢిల్లీలో ఆంధ్ర పత్రిక విలేఖరిగా పనిచేస్తుండేవారు. ఆ రోజుల్లో పార్లమెంటు సభ్యులయిన బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి నివాసానికి నారాయణ దొరగారు వచ్చారు. సాలూరు ప్రాంతీయుడయిన కునిసెట్టి వెంకట నారాయణ దొర పాత కాలపు కాంగ్రెసువాది.
అప్పటి సంగతులను గురించి శ్రీ జీ. కృష్ణ తమ ‘విలేఖరి లోకం’లో ఇలా గుర్తు చేసుకున్నారు.
“దొరకు ఇంగ్లీష్ రాదు. హిందీ కూడా రాదు. వచ్చీ రాగానే జవహర్ లాల్ నెహ్రు గారితో మాట్లాడాలన్నాడు. వెంటనే వచ్చి కలవవచ్చని ప్రధాని కార్యాలయం నుంచి వర్తమానం వచ్చింది. పదిహేను నిమిషాలు టైం ఇచ్చారు.
“దొరగారు ఖద్దరు దుస్తులు ధరించి వెళ్లారు. వెంటనే దర్శనం లభించింది. దొరగారు గదిలోకి వెళ్ళగానే గులాబీ పువ్వు నెహ్రూ షేర్వాణీకి తగిలించడానికి ముందుకు కదిలాడు. నెహ్రూ గారు అమాంతం అతడిని పట్టి ఎత్తి సోఫా మీద పడేశాడు. అప్పటినుంచి కాసేపటిదాకా ఇద్దరూ నవ్వులే నవ్వులు. దీనికి కొంత నేపధ్యం వుంది.
1936 లో ఎన్నికలు జరుగుతుంటే ఆంధ్రాలో ప్రచారానికి వచ్చిన నెహ్రూకు అంగరక్షకుడిగా అప్పటి ఆంధ్ర కాంగ్రెస్ కార్యదర్శి బులుసు సాంబమూర్తి గారు వెంకట నారాయణ దొరను నియమించారు. నెహ్రూకు తెలుగు రాదు.. దొరకు హిందీ రాదు. అయినా సైగలతో గడిపేశారు. బొబ్బిలిలో నెహ్రూ పై జస్టిస్ పార్టీవాళ్లు రాళ్లవర్షం కురిపించారు. అంతే! దొర అమాంతం నెహ్రూను ఎత్తుకుని ఫర్లాంగు దూరం తీసుకువెళ్లాడు. జవహర్ లాల్ యెంత గింజుకున్నా దొర వొదలలేదు.
మళ్ళీ 1953 లో ఢిల్లీలో తనను చూడవచ్చిన దొరను కూడా నెహ్రూ అమాంతం ఎత్తి సోఫాలో కుదేసి పాత స్మృతులను నెమరువేసుకున్నారని కృష్ణ గారు రాశారు.
మా రెండో బావగారు కీర్తిశేషులు కొలిపాక రామచంద్రరావు గారు. ఖమ్మం జిల్లా రెబ్బవరం కాపురస్తులు. గతించి కూడా చాలా కాలం అయ్యింది. స్వాతంత్రోద్యమ కాలంలో పద్నాలుగు మాసాలకు పైగా కఠిన కారాగార శిక్ష అనుభవించారు. మా పెద్ద బావగారు అయితరాజు రాం రావు గారు కూడా ఆయనతో పాటే జైల్లో వున్నారు. ఈ ఇద్దరు గర్భంతో వున్న భార్యలను పుట్టింట్లో (అంటే మా ఊరు కంభంపాడులో మా అమ్మానాన్నల వద్ద వొదిలి) దేశం కోసం జైలుపాలయ్యారు. సరే! అది అలా వుంచితే –
'స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో నెహ్రూ గారు ఆంధ్రాలో ఓ మీటింగులో మాట్లాడడానికి వచ్చారు. ఖమ్మం నుంచి నలభై యాభయ్ మందిమి బయలుదేరి రైల్వే స్టేషన్ కు వెళ్లాము. టిక్కెట్లు కొనడానికి వెడితే అక్కడి స్టేషన్ మాస్టారు అన్నారట 'నెహ్రూ గారి మీటింగుకు టిక్కెట్లు ఎందుకండీ' అని. బహుశా ఆరోజు గట్టిగా 'కాదుకూడదు' అని గట్టిగా వాదించి వుంటే దేశం ఈనాడు ఈ స్తితిలో వుండేది కాదేమో! ఫ్రీ ఇండియా అంటే జనాలకు అన్నీ ఫ్రీ అనే భావన ప్రబలేది కాదు. ఇది మనదేశం, దీని లాభనష్టాలన్నీ మనవే అన్న అభిప్రాయం బలపడకుండా పోయింది. మేము కోరుకున్న దేశం ఇదా అంటే ఇది కాదని చెప్పగలను కానీ కోరుకున్న ఆ దేశం యెలా వస్తుందో, ఎప్పుడూ వస్తుందో మాత్రం చెప్పలేను. బహుశా నేనయితే చూస్తానన్న ఆశలేదు'
ఇదీ మా బావగారు రామచంద్రరావు గారు చెప్పిన మాట.
1964 తర్వాత జన్మించిన వారిలో చాలా మందికి నెహ్రూ అనే పేరు వినబడగానే అవినీతితో కునారిల్లిన కాంగ్రెస్ పార్టీ గుర్తుకువస్తుంది. ఒకప్పుడు పసికూనగా వున్న స్వతంత్ర భారతానికి దిశానిర్దేశం చేసిన మహా నాయకుడని స్పురణకు రాదు. బహుశా భారత దేశ రాజకీయ నాయకుల్లో నెహ్రూ మీద వచ్చినన్ని గ్రంధాలు కానీ, రచనలు కానీ ఒక్క గాంధీ ని మినహాయిస్తే ఎవరి మీద రాలేదు. కానీ నేటి యువతరానికి నాటి రచనలు చదివే తీరికా ఓపికా లేవు. ప్రతిదీ రెడీ రికనర్ లాగా ఇలా మీట నొక్కితే అలా కళ్ళ ముందు కనబడాలి. ఒకసారి గూగుల్ లోకి వెళ్లి తెలుగుదేశం అధినేత గురించిన వివరాలు తెలుసుకోవడం కోసం ఎన్టీయార్ అని నొక్కి చూడండి, మచ్చుకు ఒకటో ఆరో పెద్దాయనవి, మిగిలినవి జూనియర్ ఎన్టీయార్ వి కనబడతాయి. దీన్నే మనం చరిత్ర అనుకుంటున్నాం.
ఒకప్పుడు పీ.ఎల్. 480 కింద అమెరికా పంపే గోధుమలు, పాల పిండితో పేదల కడుపు నింపుకునే దేశం చూస్తుండగానే సస్య విప్లవం, శ్వేత విప్లవం సాధించింది. ఆరోజుల్లో వి.ఎల్.డబ్ల్యు. అనే అతి చిన్న అధికారి ప్రతి ఊరికీ వచ్చి ఏపంటలు ఎప్పుడు వేసుకోవాలి అనే విషయాలను పల్లెటూరివాళ్ళకు వివరిస్తుంటే అందరూ చెవులు ఒప్పగించి వినేవాళ్ళు. ప్రతి ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా ప్రసారం అయ్యే పాడిపంటలు కార్యక్రమాలు పంచాయతి రేడియోలో వింటూ దేశం పంటల దిగుబడిలో స్వయం సమృద్ది సాధించింది. భాక్రానంగల్ నాగార్జునసాగర్, శ్రీశైలం ఒకటా రెండా ఈనాడు దేశాన్ని పచ్చటి పైర్లతో కళకళ లాడిస్తున్న ప్రాజెక్టులు అన్నీ నెహ్రూ పుణ్యమే. అంతెందుకు, ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించిన సర్దార్ సరోవర్ డాం కు శంఖుస్థాపన చేసింది ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అని ఈ తరం మరచిపోకూడదు.
నెహ్రూ నుంచి మోడీ వరకు స్వతంత్ర భారతం అభివృద్ధి పధంలో ముందుకు సాగుతూనే వుంది. ఒక్కొక్క ప్రధాని తమదయిన శైలిలో జాతి నిర్మాణానికి తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈనాడు మోడీ చేసే మంచిపనులను భావి భారతం గుర్తుపెట్టుకోవాలి. అలాగే గతంలో నెహ్రూ వంటి నాయకులు చేసి వెళ్ళిన గొప్ప పనులను ఈ తరం గుర్తు పెట్టుకోవాలి.
దేశ ప్రగతికి మన వంతు కృషి ఏమీ చేయలేనప్పుడు కనీసం కృతజ్ఞతను వ్యక్తం చేయడం ద్వారా ఆ పని ఓ మేరకు చేయవచ్చు.
నెహ్రూ ను విమర్శించడానికి ఆయన వ్యక్తిగత జీవితంలో అనేక కోణాలు వున్నాయి. కానీ ఒక దార్సనికుడిగా వేలెత్తి చూపలేని వ్యక్తిత్వం ఆయనది.
చివరిగా ఒక మాట.
గాంధి, నెహ్రూ, పటేల్, అంబేద్కర్, వాజ్ పాయ్ వంటి వారిని ఒక పార్టీకి చెందినవారిగా గుర్తిస్తున్నంత కాలం వాళ్ళ వ్యక్తిత్వాలను నిజాయితీగా అంచనా వేయడం కష్టం.
(కింది ఫోటో: నెహ్రూ ప్రధానిగా వున్న రోజుల్లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు తల పట్టుకు కూర్చున్న దృశ్యం)