31, జులై 2016, ఆదివారం

ఊ అంటే వస్తుందా......


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో టీవీల్లో జరుగుతున్న చర్చల తీరుతెన్నులు చూస్తున్నప్పుడు విషయం గుర్తుకు వచ్చింది.
వెనుకటి రోజుల్లో ఇళ్ళల్లో నాయనమ్మలుఅమ్ముమ్మలు మునిమాపు వేళల్లో చిన్నపిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని కధలు చెప్పేవాళ్ళు. పిల్లలు 'కొడుతూకధలు వింటూనే నిద్రలోకి జారుకునే వాళ్లు. అలాటి ఒక కధ ఇది.
'అనగనగా ఊళ్ళో ముసలామె వుండేదికధ మొదలు పెట్టేది బామ్మ.
'అనేవాళ్ళు పిల్లలు.
' ముసలావిడ రోజు బావి గట్టు మీద కూర్చుని బట్టలు కుడుతుంటే చేతిలో సూది జారి నూతిలో పడిపోయింది'
'అనేవాళ్ళు పిల్లలు ఇంకా చెప్పు అన్నట్టుగా.
' అంటే వస్తుందా?' అనేది బామ్మ.
'అనేవాళ్ళు పిల్లలు నోరు తెరిచి.
'అంటే వస్తుందాఅడిగేది బామ్మ.
బావిలో పడ్డ సూది సంగతేమో కాని,   కధ మాత్రం అలా  అనంతంగా సాగిపోయేది.
ఇక విషయానికి వస్తే-
ఆంధ్ర ప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ రావాలి. అంటే ఏం చేయాలి?
'వై ఎస్ ఆర్ సీపీ వాళ్ళు బందులు చేస్తే  వస్తుందా?
'ముఖ్యమంత్రి చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్లలో ఢిల్లీ వెళ్ళి మహాజర్లు ఇచ్చి వస్తే వస్తుందా? అమరావతిలో  కూర్చుని  ప్రెస్  వాళ్ళతో  ఆగ్రహాలు, నిరసనలు వ్యక్తం చేస్తే వస్తుందా?కేంద్ర ప్రభుత్వానికి రాం రాం చెబితే వస్తుందా 
'రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు తమ అధిష్టానంపై ఒత్తిడి తెస్తే వస్తుందా
'అసలు వస్తుందా రాదావస్తే ఎప్పుడు వస్తుంది?'
'ఎప్పుడాబావిలో పడ్డ సూది ముసలమ్మ చేతికి  దొరికినప్పుడు'
ఉపశృతి
ప్రమోషన్ రాగానే కంచి పట్టు చీరె కొనిపెడతామన్నారు. రెండేళ్ళయింది. అది ఒట్టి మాటేనా?”
భలేదానివే. దాని విషయమే కదా నేను ఇన్నాళ్ళు ఆలోచిస్తోంది. కాకపోతే ఒక సంగతి చెప్పాలి. చీరెదేముందిఈరోజు కడతావుకలరు మాసిపొతే  రేపు బయట పడేస్తావు. అదే నెక్లెసు కొన్నాననుకో. నాలుగు కాలాలపాటు వుంటుంది. నీకూ నలుగుర్లో గొప్పగా  వుంటుంది. ఏమంటావ్!” 



మార్పు

మంచివాడు చెడ్డవాడుగా మారడానికీ, మంచివాడు అనిపించుకోవడానికీ పెద్దగా కష్టపడనవసరం లేదు. కానీ చెడ్డవాడు మంచివాడుగా మారాలన్నా, మంచివాడు అనిపించుకోవాలన్నా చాలా కష్టపడాలి. ఎందుకంటే ఆ మార్పును గమనించేవారి చూపుల్లో అనుమానపు ఛాాయలే ఎక్కువ. వీటిని అడుగడుగునా ఎదుర్కుంటూ, మడమ తిప్పకుండా,మనసు మార్చుకోకుండా ముందుకు సాగాల్సివుంటుంది.

రేడియో భేరి - 9

విశ్వనాధ స్వరంతో ‘బద్దన్న సేనాని’

తెలుగు ప్రసారాలకు సంబంధించి – హైదరాబాదు, విజయవాడ కేంద్రాలు చాలా ఎక్కువ కృషి చేసాయి. అన్ని తరగతుల శ్రోతలను ఆకర్షించడానికి ఈ రెండు కేంద్రాలు ఎన్నో కార్యక్రమాలు రూపొందించాయి. సాహిత్య విభాగం తీసుకుంటే ప్రసిద్ధుల ప్రసంగాలు, గోష్టులు, సంచికా కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు. సమస్యా పూరణాలు ఇలా ఎన్నో ప్రసారమయ్యాయి. అవుతున్నాయి కూడా. భద్రాచలంలో జరిగే సీతారామ కళ్యాణం, శ్రీశైలంలో జరిగే శివరాత్రి ఉత్సవాలు, తిరుమల బ్రహ్మోత్సవాలు మొదలయిన సందర్భాలలో ప్రత్యక్ష వ్యాఖ్యానాలతో కూడిన కార్యక్రమాలు వినిపిస్తూ రేడియో కొత్తదారులు తొక్కింది.
కధలు, నవలలు మొదలైనవాటిని ప్రసారం చేయడం లోను ఆకాశవాణి తనదైన ప్రత్యేకతను నిలుపుకుంటూ వస్తోంది. ఏ కొందరో తప్ప ఆధునిక కదారచయితల కధలను ఆ రచయితల సొంత గొంతుతోనే వినిపించడంలో ఆకాశవాణి విజయవంతం అయింది. కాకపొతే కొన్ని కొన్ని సందర్భాలలో కొందరు ప్రముఖుల కధలను నిలయ కళాకారుల ద్వారా చదివించడం జరుగుతుంటుంది.
విశ్వనాధ సత్యనారాయణ తమ ‘బద్దన్న సేనాని’ నవలను విజయవాడ కేంద్రం నుంచి ఆయనే స్వయంగా వినిపించడం రేడియో చరిత్రలో ఒక అపూర్వ విషయం. 1979 తరువాత హైదరాబాదు కేంద్రం ‘నవలాస్రవంతి’ పేరిట నవలల ప్రసారం ప్రారంభించింది. తద్వారా ప్రసిద్ధికెక్కిన ఎన్నో తెలుగు నవలలు రేడియో ద్వారా శ్రోతలు వినగలిగారు. తక్కిన కేంద్రాలనుంచి కూడా కొన్ని నవలలు ప్రసారం అయ్యాయి.
1956 జనవరి 25 నాడు మొట్టమొదటి జాతీయ కవి సమ్మేళనం ప్రసారమయింది. ప్రతి ఏడాది జనవరి 25 నాడు ప్రసారం అయ్యే ఈ జాతీయ కవి సమ్మేళనంలో చోటుచేసుకునే తెలుగు కవితలను తక్కిన భారతీయ భాషల్లోకి అనువదించి ప్రసారం చేయడం అలాగే తక్కిన భాషల కవితలను తెలుగులోకి అనువదించి ప్రసారం చేయడం జరుగుతోంది. ప్రముఖ కవుల కవితల్ని వాళ్ల నోట పలికించి పదిలపరచడంలోను ఆకాశవాణి ముందంజ వేసింది. ఉదాహరణకు హైదరాబాదు కేంద్రం సి. నారాయణ రెడ్డి గానం చేసిన ‘విశ్వంభర’ను ఆవిధంగానే పదిలపరచింది.
అలాగే వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ‘గళాల’ను పదిలపరిచే కృషిలో ఆకాశవాణి నిమగ్నమై వుంది. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఎందరితోనో చేసిన సంభాషణలను ఆకాశవాణి భద్రపరచింది. ఇటీవల కొన్ని సంవత్సరాలుగా రేడియోకోసం ప్రముఖుల జీవితఘట్టాలను వారితో సంభాషణల రూపంలో నిక్షిప్తం చేస్తూ వస్తోంది. అటువంటి కొన్ని సంభాషణలు ప్రసారం చేసే ప్రయత్నం కూడా మొదలయింది.
శాస్త్రీయ సంగీత సంప్రదాయ పరిరక్షణ ఆకాశవాణి కర్తవ్యాలలో ఒకటి. అన్నమాచార్య కీర్తనలు, రామదాసు కీర్తనలు, క్షేత్రయ్య పదాలు, ఆధ్యాత్మ రామాయణ కృతులు, భక్తి తత్వాలు, భక్తి గీతాలు – ఆకాశవాణి ద్వారా బహుళ ప్రచారం పొందాయి. ప్రముఖ వాగ్గేయకారుల రచనలను పదిలపరిచే ఉద్దేశ్యంతో శ్రీ త్యాగరాజస్వామి వారి ఉత్సవ సంప్రదాయ కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు మొదలైన వాటిని బాలమురళీకృష్ణ వంటి ప్రముఖ విద్వాంసుల ద్వారా పాడించింది ఆకాశవాణి. అరుదైన రచనలను సంగీత శిక్షణ కార్యక్రమాల ద్వారా ఔత్సాహికులకు నేర్పించడం విజయవాడ రేడియో కేంద్రం పెట్టిన ఓ కొత్త వొరవడి. వోలేటి వెంకటేశ్వర్లు నేర్పిన తెలుగు కృతులను దక్షిణ భారత దేశంలోని ఎందరో నేర్చుకోవడానికి ఆకాశవాణి చేసిన ఈ ప్రయత్నం ఎంతగానో దోహదపడింది. (ఇంకా వుంది)
(డాక్టర్ పీ.ఎస్.గోపాలకృష్ణ సౌజన్యంతో)

30, జులై 2016, శనివారం

రేడియో భేరి - 8

నూరవ ఆకాశవాణి కేంద్రం వరంగల్

రెండో ప్రపంచ యుద్ధం రోజుల్లో మద్రాసు నగరం నుంచి షార్ట్ వేవ్ ట్రాన్స్ మిటర్  ను ఢిల్లీ తరలించారు. 1942 నుంచి 1945 దాకా తెలుగు, తమిళ కార్యక్రమాలు ఢిల్లీ నుంచి కూడా ప్రసారం అయ్యాయి. మద్రాసు నుంచి కొంత బలహీనపడిన ప్రసార వ్యవస్థ ద్వారా తెలుగు, తమిళ ప్రసారాలు కొనసాగినా, శ్రోతలు ఢిల్లీ నుంచి వెలువడే కార్యక్రమాలపట్ల ఎక్కువ ఆకర్షితులయ్యేవారు.
1947లో దేశం స్వాతంత్రం సాధించేనాటికి - ఆలిండియా రేడియో వ్యవస్థలో ఢిల్లీ, కలకత్తా (కోల్ కతా), బొంబాయి(ముంబై), మద్రాసు(చెన్నై), లక్నోతిరుచిరాప్పళ్లి రేడియో కేంద్రాలు మాత్రమే వుండేవి. మద్రాసు నుంచే కాక డెక్కన్ రేడియో నుంచి, మైసూరు నుంచి(చాలా అరుదుగా) తెలుగు ప్రసారాలు జరిగేవి. స్వాతంత్రం వచ్చిన తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్ సమాచార, ప్రసార శాఖల మంత్రి అయ్యారు. ఆయన పర్యవేక్షణలో దేశంలో రేడియో వ్యాప్తికి కృషి మొదలయింది. 1956 నుంచి ఆలిండియా రేడియో సంస్థను ‘ఆకాశవాణి’గా పేర్కొంటున్నారు.
1948 అక్టోబర్ 12 నాడు విజయవాడలో రేడియో కేంద్రం మొదలయింది. దీనితో మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి.
డెక్కన్ రేడియో (హైదరాబాదు, ఔరంగాబాదు) రేడియో కేంద్రాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. 1950 ఏప్రిల్ ఒకటో తేదీన హైదరాబాదు రేడియో కేంద్రం ‘ఆలిండియా రేడియో’ వ్యవస్థలో భాగంగా పనిచేయడం ప్రారంభించింది. 1955 నవంబర్ రెండో తేదీన మొదలయిన బెంగలూరు రేడియో కేంద్రం, 1963 జూన్ లో మొదలయిన పోర్ట్ బ్లేయర్ కేంద్రం కూడా తెలుగులో ప్రసారాలు చేస్తున్నాయి. 1957 అక్టోబర్ మూడో తేదీన మొదలయిన ‘వివిధ భారతి’ ప్రసారాలలో తెలుగు పాటలు రోజూ అరగంట సేపు వేసేవారు. 1969 సెప్టెంబర్ లో ఢిల్లీ, పాట్నా, రాంచీ, సిమ్లా రేడియో కేంద్రాల నుంచి తెలుగు నేర్పే పాఠాలు ప్రారంభించారు. 1991 మార్చి రెండో తేదీన హైదరాబాదు, విజయవాడలలో వాణిజ్య ప్రసారాలు మొదలుపెట్టారు.
కాలక్రమేణా కడపలోను, విశాఖపట్నంలోను ఆకాశవాణి కేంద్రాలు ఏర్పాటయ్యాయి. స్థానికంగా అంటే జిల్లా స్థాయిలో రేడియో సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో మొదలు పెట్టిన తొలి స్థానిక రేడియో కేంద్రాలలో ఆదిలాబాదు కేంద్రం ఒకటి. వరంగల్లులో 1990 ఫిబ్రవరి 17 వ తేదీనాడు ప్రారంభమైన ఆకాశవాణి కేంద్రం – ఆకాశవాణి వ్యవస్థలో ఏర్పడ్డ నూరవ కేంద్రంగా చరిత్రకెక్కింది. ప్రస్తుతం ఆకాశవాణి వ్యవస్థలో మన రాష్ట్రంలో హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, కడప, ఆదిలాబాదు, కొత్తగూడెం, వరంగల్లు, నిజామాబాదు, తిరుపతి, అనంతపురం, కర్నూలు, మార్కాపురం మొదలైన చోట్ల తెలుగులో కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. మాచెర్ల, కరీంనగర్, సూర్యాపేట మొదలయిన చోట్ల ప్రసార వ్యవస్థలు వున్నాయి. వంద వాట్ల సామర్ధ్యం కలిగిన ట్రాన్స్ మిటర్లను ఒంగోలు, నెల్లూరు, కామారెడ్డి, బాన్స్ వాడ, నంద్యాల, ఆదోని, కాకినాడ మొదలయిన చోట్ల ఏర్పాటు చేశారు. (ఇంకా వుంది)
(డాక్టర్ పీ.ఎస్.గోపాలకృష్ణ సౌజన్యంతో)

29, జులై 2016, శుక్రవారం

రేడియో భేరి - 7

రేడియో అక్కయ్య, రేడియో అన్నయ్య

పీవీ రాజమన్నార్, కొడవటిగంటి కుటుంబరావు, గోరాశాస్త్రి మొదలయిన వారు ఆ రోజుల్లో రేడియో కోసం నాటకాలు రాసేవారు. 1939 నాటికే మద్రాసు కేంద్రం స్త్రీలకోసం పిల్లల కోసం కార్యక్రమాలు మొదలుపెట్టింది. బాలల కార్యక్రమాలను ఒక వారం దుర్గాబాయమ్మ (దుర్గాభాయి దేశముఖ్) నిర్వహిస్తే మరో వారం న్యాయపతి కామేశ్వరి నడిపేవారు. కొన్నాళ్ళకు దుర్గాబాయమ్మ తమకున్న ఇతర పనుల తొందర వల్ల రేడియోకి రాలేకపోయేవారు. అప్పుడు కామేశ్వరితో పాటు ఆమె భర్త న్యాయపతి రాఘవరావు రేడియోలో బాలల కార్యక్రమాల నిర్వహణకు పూనుకున్నారు. ఆ దంపతులు ‘రేడియో అన్నయ్య’, ‘రేడియో అక్కయ్య’ అనే పేర్లతో ప్రసిద్ధులయ్యారు. తెలుగులో బాల సాహిత్యం వర్దిల్లడానికి వారిద్దరూ చేసిన సేవ చిరస్మరణీయం. బాలలకోసం పాటలు, నాటికలు రాయడంతోపాటు వాటిని బాలలతోనే నిర్వహించడం ‘ఆటవిడుపు’ అనే ఆదివారం కార్యక్రమం సాధించిన విజయం అపూర్వం. ఆ తరువాత బాలానందం పేర శనివారాలలోను పిల్లల కార్యక్రమాలు ప్రసారం చేసేవారు.
రెండు రోజులకోసారి ‘మహిళామండలి’ కార్యక్రమాలు మధ్యాహ్న సమయంలో ప్రసారం అయ్యేవి. ఆ కార్యక్రమాల చివర వినిపించే ‘మంగళ హారతి’ ని ఆ రోజుల్లో చాలా ఇళ్ళల్లో శుభకార్యాల్లో పాడుతూ వుండేవారు. స్త్రీల పట్ల వివక్ష ఎక్కువగా వున్న ఆ కాలంలో ‘మహిళా మండలి’ ఎందరో స్త్రీలకు ‘వాణి’ కాగలిగింది.
అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వున్న తెలుగు జిల్లాలలో వున్న సంగీత కళాకారులెందరో మద్రాసు రేడియో కేంద్రం నుంచి తమ సంగీతాన్ని వినిపించినవారే. తెలుగు పాట విలువను, ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన ప్రముఖ గాయకుల తొలి కార్యక్రమాలు మద్రాసు రేడియో కేంద్రం నుంచే ప్రసారం అయ్యాయి. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ – పదకొండేళ్ళ వయస్సులో 1941 జులై రెండో తేదీన తమ మొదటి రేడియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తరువాత కొన్నేళ్లకు ఆయన విజయవాడ, మద్రాసు, హైదరాబాదు రేడియో స్టేషన్లలో ఉద్యోగం చేశారు. రేడియో సంగీత చరిత్రలో ఇదో గొప్ప అధ్యాయంగా చెప్పుకోవచ్చు. అలాగే ఘంటసాల వేంకటేశ్వర రావు 1944 సెప్టెంబర్ ఇరవైన మొదటిసారి రేడియోలో పాడారు. ఆ తరువాత అనేక సార్లు ఆయన లలితసంగీత కార్యక్రమాల్లో, సంగీత నాటకాల్లో పాల్గొంటూ వచ్చారు. దీపావళి పండుగ కోసం సముద్రాల రాఘవాచార్యులు రాసిన ‘వెలుగు వెల్లువ’ అనే సంగీత నాటకంలో ఘంటసాల, భానుమతి ప్రధాన పాత్రధారులు. విశ్వనాధ రాసిన ‘కిన్నెరసాని’ సంగీత నాటకానికి ఘంటసాల సంగీతం సమకూర్చారు. ‘లైలా మజ్నూ’ నాటకంలో ఘంటసాల మజ్నూ పాత్ర పోషించారు. అందులో ఆయన పాడిన ‘గుడారమెత్తివేశారు’, ‘ఎందు చూచినగాని లైలా...’ అనే పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.(రచన: యండమూరి సత్యనారాయణ, సంగీతం : రజని). 1945 లో ఘంటసాల పాడిన రజని గేయం ‘ఘనాఘనా గర్జింపవొ..’ అనే పాట ఢిల్లీ నుంచి జాతీయ కార్యక్రమంలో ప్రసారమయింది. (ఇంకా వుంది)
(డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ సౌజన్యంతో)

28, జులై 2016, గురువారం

రేడియో భేరి -6

గ్రామఫోను రికార్డులా తిరుగుతాడు

1954 దాకా మద్రాసు కేంద్రంలో లలిత సంగీత విభాగం ప్రత్యేకంగా ఏర్పడకపోయినా ప్రధానమైన నాలుగు దక్షిణ భారతీయ భాషల్లో లలిత గీతాల ప్రసారం 1939 నుంచీ తరచుగానే సాగుతుండేది. ‘బిల్హణీయం’ విశేషమైన ఆదరణ పొందడంతో ప్రముఖులైన కవులతో రాయించిన సంగీత నాటకాలు ఎన్నింటినో మద్రాసు కేంద్రం ప్రసారం చేసింది. వాటిలో కొన్ని: కృష్ణ శాస్త్రి రాసిన ‘శర్మిష్ట’, ‘వూర్వశి’, ‘శబరి’, ‘గుహుడు’, ‘అతిధిశాల’, ‘దక్ష యజ్ఞం’, ‘కృష్ణాష్టమి’, విశ్వనాధ సత్యనారాయణ రాసిన ‘కిన్నెరసాని’, ‘కోకిలమ్మపెళ్లి’, ‘సుమిత్ర’, ‘ఊర్మిళ’, ‘’మారీచుడు’, ‘గోదావరి’. అలాగే రజని (బాలాంత్రపు రజనీకాంతారావు రాసిన ‘మధురానగర గాధ’, ‘చండీ దాసు’, ‘మేఘ సందేశం’, శివశంకర శాస్త్రి (స్వామి) రాసిన ‘పద్మావతీ చరణ చారణ చక్రవర్తి’, శ్రీ శ్రీ రాసిన ‘వ్రేపల్లె’.
ఉమర్ ఖయ్యాం జీవితాన్ని, అతని తత్వాన్ని ఆవిష్కరించినది ‘అతిధి శాల’. ఉర్దూ, అరబ్బీ, పారశీక పదాలతో కృష్ణశాస్త్రి సృష్టించిన మధ్య ప్రాచ్య వాతావరణాన్ని, అందుకు తగిన సంగీతాన్ని సమకూర్చి శ్రావ్యకావ్యంగా తీర్చిదిద్దినవారు ‘రజని’. అలాగే కృష్ణ శాస్త్రి విరచిత ‘దక్ష యజ్ఞం’ - సాలూరి రాజేశ్వరరావు సంగీతంలో రూపుదిద్దుకున్న మరో అద్భుతం.
టేప్ రికార్డింగ్ సదుపాయాలు లేని ఆ రోజుల్లో రేడియో కార్యక్రమాలన్నీ అప్పటికప్పుడు ప్రసారం అయ్యేవి. (LIVE BROADCASTS). అందువల్ల ఎన్నో గొప్ప కార్యక్రమాలు – రేడియో పరిభాషలో చెప్పాలంటే- ఇప్పుడు లభ్యం కాకుండా గాలిలో కలిసిపోయాయి.
శ్రీ శ్రీ రాసిన ‘బలి’, ‘గ్రామఫోను రికార్డులా తిరుగుతాడు’ అనే రేడియో నాటికలు 1939-40 లలో ప్రసారమయ్యాయి. రేడియో నాటక రచనలు యెలా చేయాలో తెలిసిన రచయితలు కొందరే. అటువంటివారిలో శ్రీ శ్రీ ఒకరు. మనకు లభిస్తున్న ఆధారాలనుబట్టి, 1939 నుంచి 1984 దాకా శ్రీ శ్రీ రేడియో కోసం 14 నాటికలు రాశారు. వీటిల్లో ‘మరో ప్రపంచం’ ఒకటి. అందులో ప్రధాన పాత్ర పేరు ‘కనుపాప’. ఇరవై ఒకటో శతాబ్దానికి చెందినవాడు. ఇరవై ఐదో శతాబ్దంలోకి వెళ్ళబోయి యాంత్రికలోపంతో ఇరవయ్యవ శతాబ్దిలోకి వస్తాడు. ఆ పాత్ర చేత శ్రీ శ్రీ ఒకచోట ఇలా పలికిస్తాడు. ‘భాష చాలా అసమగ్రమైన పనిముట్టు. ఏ వూహనీ అది విస్పష్టంగా, అసందిగ్ధంగా తెలియచెయ్యలేదు’. (ఇంకా వుంది)
(డాక్టర్ పీ.ఎస్.గోపాలకృష్ణ సౌజన్యంతో)

27, జులై 2016, బుధవారం

రేడియో భేరి - 5

పడమటి కొండలా? పశ్చిమ కొండలా?

1938 అక్టోబర్ 3 నుంచి పాఠశాల విద్యార్ధుల కోసం ప్రసారాలు మొదలయ్యాయి. తరగతి గదుల్లో చెప్పే పాఠాలను మరింత బాగా తెలుసుకోవడానికి ఈ రేడియో ప్రసారాలు తోడ్పడాలని ఆశించారు. పిల్లలకు ఆసక్తి కలిగించే తీరులో ఆటపాటలనూ, నాటికలను వాడి పాఠాలు చెప్పడానికి ప్రయత్నం జరిగింది. 1938 నవంబర్ 2 నుంచి తెలుగులో గ్రామస్తుల కార్యక్రమాలు మొదలయ్యాయి. విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందించాలన్నది ఈ కార్యక్రమాల ధ్యేయం. వ్యవసాయం, పశు పోషణ, పారిశుధ్యం, సహకారం మొదలయిన అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. పురాణ పఠనం, జానపద గేయాలు ఈ కార్యక్రమాలలోని తక్కిన అంశాలు. వ్యవసాయానికి సంబంధించిన విషయాలను వ్యవసాయ శాఖ నిర్దేశకుల పర్యవేక్షణలో రూపొందించేవారు. అప్పట్లో మద్రాసు రాజధానిలో వ్యవసాయ నిర్దేశకులుగా వున్న సీ.హెచ్. రామరెడ్డి, రేడియోలో ప్రసారం కోసం తాము ఆమోదించిన ప్రసంగాలు రాసిన అధికారులకుప్రభుత్వ సొమ్ము కాకుండా తానే స్వయంగా ఒక్కొక్క వ్యాసానికీ ఐదేసి రూపాయల చొప్పున ఇచ్చేవారు. ఒకటి రెండు సందర్భాలలో ఆయనే స్వయంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
1939 సెప్టెంబర్ 5 నుంచి ఉదయం, మధ్యాహ్నం ప్రసారాలు మొదలు పెట్టారు. 1939 అక్టోబర్ 1 నుంచి తెలుగులో వార్తాప్రసారాలు మొదలుపెట్టారు. 1939 నవంబర్ 2 నుంచి కళాశాల విద్యార్ధులకోసం ప్రసారాలు ప్రారంభించారు.
ఇన్ని కార్యక్రమాల నేపధ్యంలో – రేడియోకు కొన్ని బాధ్యతలు ఏర్పడ్డాయి. ఉచ్చారణకు సంబంధించి ఓ వొరవడి దిద్దుకోవడంతో పాటు శాస్త్ర సాంకేతిక విషయాల ప్రసారంలో పదాల వాడుకను స్థిరపరచాల్సి రావడం, శ్రోతల స్థాయిని బట్టి వారి వయస్సునుబట్టి అనువైన వాడుక భాషను అలవాటు చేయడం, సంగీత సాహిత్యాలకు సంబంధించి శ్రోతలలో అభిరుచిని పెంపొందించడం, జాపదకళారూపాలను, పాటలను గుర్తించడం, ఔత్సాహికులకు తమ ప్రతిభను కనబరచడానికి అవకాశాలు కల్పించడం, సామాన్య ప్రజల అభిప్రాయాలనూ, అనుభవాలనూ వినిపించడం, శాస్తీయ దృక్పధాన్ని పెంచడం వంటివి ఆ బాధ్యతలలో కొన్ని.
తెలుగుకు సంబంధించి రేడియో వాడుకలోకి తెచ్చిన కొన్ని పదాలు సరైన అవగాహనతో వాడినట్టు కనిపించదు. ఉదాహరణకు- ‘relay’ అనే ఆంగ్ల పదానికి దగ్గరగా ఉండే తెలుగు మాట ‘అంచె’. తమిళంలో నేటికీ ఆ తెలుగుమాటను పోలిన ‘అంజల్’ అనే మాట వాడినా, ఆకాశవాణి తెలుగు కేంద్రాలు మాత్రం ‘రిలే’ అనే ఇంగ్లీష్ పదాన్నే వాడుతుంటాయి. ఉష్ణోగ్రతల విషయంలో - Maximum అనే మాటకు ‘గరిష్ట’ అనీ, minimum అనే మాటకు ‘కనిష్ట’ అనీ వాడుతుంటాయి. కానీ ఇలా చెప్పడంవల్ల ‘ఎక్కువలో ఎక్కువ, తక్కువలో తక్కువ’ అనే అర్ధాలు స్పురించవు. అలాగే, వ్యవసాయానికి సంబంధించి ‘ఆశించడం’ అనే పదాన్ని ‘సోకడం’’ అనే అర్ధంలో వాడకంలో వుంది. ‘పడమటి గోదావరి జిల్లా’ అని ఎంచక్కా అనకుండా ‘పశ్చిమ గోదావరి’ అని అనేస్తుంటారు. పడమటి కొండల్ని పశ్చిమ కొండలు అనడం ఎక్కడయినా విన్నారా? కాకుంటే దేశాల పేర్లు వూర్ల పేర్లు, వ్యక్తుల పేర్లు సరిగా పలకడానికి ఆకాశవాణి ఎప్పటికప్పుడు సూచనలు రూపొందించుకుంటూ వుంటుంది. ఒకరకంగా నేటి తెలుగు ప్రసార మాధ్యమాలు అన్నింటికీ ఆకాశవాణి ‘మూలపుటమ్మ’ అనవచ్చు. (ఇంకా వుంది)
(డాక్టర్ పీ.ఎస్.గోపాలకృష్ణ సౌజన్యంతో)