8, జులై 2016, శుక్రవారం

వై ఎస్ ఆర్ చెప్పిన గానుగెద్దు కధ


2004 జులై 21 న అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఒక కధ చెప్పారు.
“బాగా చదువుకున్న పండితుడు ఒకాయన నూనె గానుగ వద్దకు వెళ్ళాడు. అక్కడ గుండ్రంగా తిరుగుతున్న ఎద్దు తప్ప ఎవరూ కనిపించలేదు. ఆ ఎద్దు మెడలోని గంటల చప్పుడు తప్ప ఏ అలికిడీ లేదు. పండితుడు గానుగ మనిషిని పేరు పెట్టి పెద్దగా పిలిచాడు. ఆ పిలుపు విని అతడు బయటకు వచ్చాడు.
నూనె కొన్న తరువాత పండితుడు అడిగాడు.
‘ఎప్పుడు వచ్చినా నువ్వుండవు.  గానుగ పని మాత్రం నడుస్తూనే వుంటుంది. ఎలా’ అని.
‘ఎద్దు మెడలో గంట కట్టిందే అందుకోసం. గంట చప్పుడు వినబడుతున్నదీ అంటే ఎద్దు తిరుగుతున్నట్టే లెక్క. తిరగడం మానేస్తే గంట చప్పుడు వినబడదు. నేను ఏ పనిలో వున్నా బయటకు వచ్చి ఎద్దుకు మేత వేస్తాను. నీళ్ళు పెడతాను. మళ్ళీ దాని పని మొదలు. నాపనిలో నేనుంటాను’ గానుగవాడు చెప్పాడు.
పండితుడు కదా! అనుమానాలు ఎక్కువ.
‘అలా అయితే ఎద్దు ఒకచోటనే నిలబడి తల ఊపుతుంటే గంటల శబ్దం వినబడుతుంది. కాని పని సాగడుదు. అప్పుడెలా?’ అడిగాడు. 
‘నా ఎద్దు అలా చేయదు’ అన్నాడు గానుగ మనిషి.
‘అంత నమ్మకంగా ఎలా చెప్పగలవు?’ అని గుచ్చి  అడిగాడు పండితుడు.
‘ఎందుకంటే, నా ఎద్దు మీలా చదువుకోలేదు కాబట్టి’
ఆ జవాబుతో పండితుడి కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి.”   


వై.ఎస్.ఆర్. హెల్త్  సీక్రెట్
ఆయనోసారి ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూ లో తన ఆరోగ్య రహస్యం చెప్పారు.

“మితాహారం, యోగ. అంతకు మించి ఏమీ లేవు. నేను ఉదయం తీసుకునే అల్పాహారంలో ఇడ్లీ, కానీ దోశ కానీ వుంటాయి. నూనె వస్తువులకు దూరం. ఫ్రూట్ సలాడ్ తప్పనిసరి. మధ్యాన్న భోజనంలో రెండు పుల్కాలు, రెండు వెజిటేరియన్  కూరలు, కొంచెం పెరుగన్నం. సాయంత్రం కూడా ఇంతే.  మధ్య మధ్యలో కీరా ముక్కలు తింటుంటాను. నీళ్ళు ఎక్కువ తాగుతాను. వారానికి రెండు సార్లు రాగి సంకటి తప్పనిసరి. నాన్ వెజ్ అప్పుడప్పుడు మాత్రమే” 

కామెంట్‌లు లేవు: