6, మే 2026, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (304): భండారు శ్రీనివాసరావు

ఎర్రటి ఎండలో పుట్టింటికి ప్రయాణం
75 ఏళ్ళక్రితం నాటిన మొక్క ఈనాడు ఒక మహావృక్షంగా తయారయింది. ఆ శీతలతరుచ్ఛాయలో మూడు దశాబ్దాలకు పైగా సేదతీరినవాడిని. మహామహులు తచ్చాడిన ఆ ప్రదేశంలో నేను సైతం అంటూ, 1975 లో ప్రవేశించి ఆడుతూ పాడుతూ హాయిగా ఉద్యోగం చేసిన వాడిని.
2025 ఏప్రిల్ మాసం
నేను పనిచేసిన ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం 75 వ వార్షికోత్సవం ఏప్రిల్ పదిహేనున.
హైదరాబాదు కేంద్రం వార్తావిభాగంలో చాలా సంవత్సరాలు పనిచేశాను. చేరిన చోటనే రిటైర్ కావాలన్న నా అభిలాష నెరవేరకుండానే చివరాఖరి సంవత్సరంలో నన్ను హైదరాబాదు దూరదర్సన్ వార్తా విభాగానికి బదిలీ చేశారు. అదొక్కటే అసంతృప్తి.
అన్ని సంవత్సరాల అనుబంధం ఉన్న హైదరాబాదు ఆకాశవాణి కేంద్రానికి డెబ్బయ్ అయిదేళ్ళ పండుగ అంటే అందులో పనిచేసిన వారికి పుట్టింటి పండుగే. మరీ ముఖ్యంగా నాకు.
రేడియో పట్ల నా అనురాగం తెలిసిన వాళ్ళు కనుక, నాలుగు ముక్కలు మాట్లాడాలని వారినుంచి పిలుపు. వాళ్ళు పంపిన కారులోనే ఎగురుకుంటూ వెళ్లాను.
పుట్టింటి ఆరాటం అంటే ఏమిటో ఆనాడు ఆకాశవాణికి వెళ్ళినప్పుడు అర్ధం అయింది. రిటైర్ అయి, అడుగు బయట పెట్టి ఇరవై ఏళ్ళు. కానీ బయట గేటు దగ్గర సెక్యూరిటీ వాళ్ళ దగ్గర నుంచి అక్కడ పనిచేస్తున్న డ్యూటీ ఆఫీసర్లు, ఇంజినీర్లు, ప్రోగ్రాం అధికారులు, అన్ని విభాగాల సిబ్బంది గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించడం, యోగక్షేమాలు ఆరా తీయడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఎవర్నీ కాదనలేక ఎన్ని సార్లు, ఎన్ని టీలు తాగానో లెక్కేలేదు.
అప్పుడు న్యూస్ యూనిట్ లో మాతో పనిచేసి, ఇప్పుడు స్టేషన్ డైరెక్టర్ వద్ద పీ ఎస్ గా పనిచేస్తున్న మా న్యూస్ యూనిట్ ‘చిట్టి చెల్లెలు’ శైలజ ఆనందానికి అంతులేదు. మా ఆవిడని అమ్మా అని పిలిచేది. శైలజ లాంటి ఆడపిల్ల వుంటే ఇంట్లో దీపం అక్కరలేదు అనేది మా ఆవిడ.
ఒకప్పుడు నేను పనిచేసినప్పుడు అచ్చు ప్రభుత్వ కార్యాలయం మాదిరిగా ఉన్న అదే ఆఫీసు ఇప్పుడు కార్పొరేట్ హంగుల్ని సమకూర్చుకుంది. మా న్యూస్ రూమ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అంతా డిజిటలైజ్ చేసారు. ప్రసారం అయిన ప్రతి బులెటిన్ ని ఏ.ఐ.ఆర్. వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేస్తున్నారు. ఏవిటో, అందరూ వినే రోజుల్లో ఇన్ని భోగాలు లేవు.
రికార్డింగు జరిగింది కాసేపే. ఎక్కువ సమయం, నేను పనిచేసిన రోజుల్లో వున్న తోటి సహోద్యోగులతో, నేను రిటైర్ అయిన తర్వాత చేరిన వారితో మాటా ముచ్చట్లతో గడిచింది.
నిజానికి ముప్పయి ఏళ్ళ పైచిలుకు కాలంలో నేను చేసింది కూడా ఇదే.
‘శ్రీనివాసరావు అసలు ఆఫీసుకు రావడమే గగనం. వచ్చాడంటే చాలు, ఆయన చుట్టూ అందరూ, అందరి మధ్యా ఆయన’ అనే పేరొకటి.
ఇక రేడియో గురించి నేను కొత్తగా చెప్పేది ఏముంటుంది? వార్తకు ప్రాణం విశ్వసనీయత. అదే ఇన్నేళ్ళుగా రేడియో వార్తల్ని బతికిస్తోంది. అప్పటికి ఎవరం ఉంటామో ఉండమో తెలియదు కానీ, ఇదే రేడియో కేంద్రం నూరేళ్ళ పండుగ జరుపుకోవడం తథ్యం. అది నా కోరిక.
నిజానికి నేను చేసింది చాలా చిన్న ఉద్యోగం. అంత చిన్న మనిషిని ఇంత పెద్దవాడిని చేసింది రేడియోనే అనే విషయం నేను ఎప్పటికీ మరిచిపోలేను.
నా ఉద్యోగం హోదా ఏమైనప్పటికి, ఆలిండియా రేడియో హైదరాబాదు కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్, హెడ్ ఆఫ్ ఆఫీస్ బి. హరి సింగ్, కేంద్రం ప్రోగ్రాం హెడ్, ఎస్. రమేశ్ సుంకసారి, డిప్యూటీ డైరెక్టర్ న్యూస్ ఎం.ఎస్. మహేష్, అసిస్టెంట్ డైరెక్టర్ న్యూస్ సురేశ్ ధర్మపురి, న్యూస్ కరస్పాండెంట్ లక్ష్మి తమ హోదాలను పక్కనబెట్టి బయట వరకు వచ్చి సాదరంగా నాకు వీడ్కోలు చెప్పారు. వారి గొప్ప మనసుకు మనసారా ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుని కారెక్కాను.
పుట్టింటిని మరిచిపోవచ్చేమో కానీ, పుట్టిల్లు ఎన్నటికీ మరవదు.
తోకటపా: డ్రైవర్ చిన్నా దోవలో నాతో అనేక ముచ్చట్లు చెప్పాడు. నేను రేడియోలో చేరినప్పటికి అతడు పుట్టనే లేదట. పెరిగి పెద్దయినప్పుడు రేడియోలో నా గొంతు వినేవాడట. అలా నన్ను గుర్తు పట్టాను అన్నాడు. మాటల మధ్యలో అడిగి నా వయసు తెలుసుకున్నాడు.
' చూసారా! మన రేడియో స్టేషన్ కంటే వయసులో మీరే నాలుగేళ్లు పెద్ద' అనడం నాకు నవ్వు తెప్పించింది.
థాంక్స్ చిన్నా!
కింది ఫోటోలు: ఆలిండియా రేడియోలో తీసినవి.






(11-04-2025)
ఇంకా వుంది

5, మే 2026, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (303): భండారు శ్రీనివాసరావు

 

హాఫ్ పోస్తుమస్ అవార్డ్
‘ఎప్పుడూ ఆ కంప్యూటర్ ముందు కూర్చుని టిక్కు టిక్కుమంటూ టైప్ చేస్తుంటారు, గూడలు అరిగిపోయేలా?’ (ఏమిటి ఉపయోగం? కూటికా! గుడ్డకా! సినిమాకా!) అనేది నా భార్య బతికున్న రోజుల్లో. బ్రాకెట్లో రాసినవి నా సొంత కపిత్వం.
రిటైర్ అయిన తర్వాత నేను రాస్తూ వచ్చిన వ్యాసాలను కొన్ని పత్రికల వాళ్ళు వేస్తూ వచ్చారు కానీ రచయితకు విదిలించింది ఏమీ లేదు. ఎక్కడో అక్కడ నేను రాసిన అక్షరాలకు, నలుపూ తెలుపూ రంగులు అంటుతున్నాయి కదా అని నేనూ పట్టించుకోలేదు.
పొతే, నా బ్లాగుకు హిట్లు అన్ని లక్షలు అని చంకలు కొట్టుకోవడం తప్పిస్తే దాని రాతలవల్ల నాకు అంటుకున్నవి మెడ నొప్పులు, గూడ నొప్పులు మాత్రమే.
కొన్నాళ్ళ క్రితం అమెరికాలో ఉంటున్న మా అన్నయ్య కుమారుడు సత్య సాయి కష్టపడి నా బ్లాగును Google Adsense తో అనుసంధానం చేశాడు. పాత వాటిని ఆ సంస్థ లెక్కలోకి తీసుకోదట. పోనీలే అనుకున్నాను.
ఆ మధ్య ఎప్పుడో చూస్తే రెండు అమెరికన్ డాలర్లు నా ఖాతాలో పడ్డట్టు కనిపించింది. అవి నా బ్యాంకు ఖాతాకు చేరి, జీ ఎస్ టి పోను ఎంత మిగులుతుందో అది నాకనవసరం.
డెబ్బయి అయిదేళ్ళ వయసులో నా రాతల ద్వారా నేను రెండు డాలర్లు సంపాదించాను, అంతే నాకు కావాల్సింది.
నా భార్య బతికి వుంటే, నేనో మిలియన్ డాలర్లు సంపాదించినంత సంతోషపడి వుండేది.
ఈసారి అమెరికా వెళ్ళినప్పుడు నా మనుమరాళ్లకు నా డబ్బులతో చిన్న చాకలేట్ కొనివ్వగలను అనే ఊహే నాకు ఆనందాన్ని ఇచ్చింది.
కానీ మా ఆవిడతో కలిసి మరోసారి, అదే ఆఖరు సారి, కలిసి వెళ్ళడం, అప్పటికి మా మనుమరాళ్లే ప్రయోజకులై, మా అవసరాలను వాళ్ళే కనుక్కునే స్థాయికి చేరారు.
ఇది జరిగి చాలా కాలం అయింది.
నా బ్యాంకు ఖాతాలో, చాలా కొద్ది మొత్తంలోనే అనుకోండి, మరిన్ని డాలరు డబ్బులు, జి ఎస్.టి మినహాయించుకుని, రూపాయల రూపంలో చేరాయి. ఇది ఇలా వుండగా META నుంచి మరికొన్ని డాలర్లు వచ్చాయి. నా పెన్షన్ డబ్బులు బొటాబొటిగా నా అవసరాలను తీరుస్తున్నాయి. ఇలా అదనంగా వచ్చే ఈ డబ్బులు అవసరంలో ఉన్నవారి అవసరాలను తీర్చడానికి సరిపోయేవి కాదు. పర్సులో చిల్లర డబ్బుల మాదిరి.
‘సిరి దావచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి దాఁ బోయిన బోవును కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!
అన్నట్టు, వచ్చినా పోయినా పట్టించుకోని స్థిత ప్రజ్ఞత వున్న వాడే నిజమైన ఆనందాన్ని పొందగలుగుతాడు. ఒక వయసు దాటిన తర్వాత డబ్బు అవసరం ఉండవచ్చు కానీ, అదే ప్రధానం కాదు.
కిందటి ఆదివారం కాక, అంతకు ముందు ఆదివారం నాడు ఒక తెలియని నెంబరు నుంచి ఫోన్ వచ్చింది. గ్యాస్ సిలిండర్ కోసం ఏమో అని రాంగ్ నెంబర్ అనే లోగా అవతలి గొంతు, ‘నా పేరు రాజగోపాల్! హై బిజ్ టీవీ సీ ఈ ఓ’ అని పలకరించింది.
వారు ఫోనులో చెప్పిన విషయం ఏమిటంటే ఈ ఈ ఏడాది వారి సంస్థ తరపున ఇచ్చే లెజెండ్ ఇన్ జర్నలిజం అవార్డ్ కు నన్ను ఎంపిక చేశారట. అదీ రేడియో జర్నలిజం రంగంలో. చిత్రం ఏమిటంటే, మా ఆవిడ పోయిన తర్వాత ఈ గుర్తింపులు. హాఫ్ పోస్తుమస్ అవార్డ్ అంటే ఇదే!
లొకేషన్ తీసుకుని మా ఇంటికి వచ్చారు. ‘వ్యక్తిగతంగా ఆహ్వానించడానికి వచ్చాను’ అని చెప్పారు చాలా మర్యాదగా. ఎండన పడి ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయడానికి మా ఇంట్లో వసతి లేదు.
‘నా గురించి మీరు ఎలా తెలుసుకున్నారు’ అనేది నా ప్రశ్న. ‘ఫేస్ బుక్ రీడర్ని’ అని జవాబు.
ఓహో! జీరో ముందు ఒకటి చేరుతోంది అన్నమాట.
‘మీరిచ్చే ఈ అవార్డ్ నాకు హాఫ్ పోస్తుమస్’ అన్నాను. నివ్వెరపోతుంటే ‘మా ఆవిడ వుండుంటే సంతోషపడేది’ అన్నాను.
కాసేపు కూర్చుని వెళ్ళిపోయారు.
ఆ ఆదివారం వచ్చింది. మా పెద్దన్నయ్య కుమారుడి గృహ ప్రవేశం అంతకు ముందు రాత్రే జరిగింది. అక్కడికి వెళ్లి వచ్చాను. మర్నాడు ఆదివారం పగటిపూట సత్యనారాయణ వ్రతం.
హైబిజ్ టీవీ వాళ్ళు పంపించిన కారులో శిల్పారామం దగ్గర సైబర్ గార్డెన్స్ కన్వెన్షన్ సెంటర్ కు వెళ్లాను. పాత్రికేయ మితృలు అనేకమంది కలిసారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన సుశీల్, రచయిత్రి మృణాలిని, సాక్షి రెంటాల జయదేవ్, ఆలిండియా రేడియో గోపీచంద్ సాటి అవార్డు గ్రహీతల్లో వున్నారు. మరో పాత్రికేయ మిత్రుడు ములుగు సోమశేఖర్, రేడియో సహచరుడు రాంబాబు ఇలా చాలా మంది కలిసారు. అవార్డు కన్నా ఇంతమంది పాత మిత్రులను కలవడం మరింత సంతోషం కలిగించింది.
అవార్డు ప్రదానం చేసిన రాష్ట్ర ఐ.టీ. శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆప్యాయంగా పలకరించారు. నిజానికి వారి నాన్నగారు, ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ శ్రీపాదరావు గారితో నాకు మరింత అత్యంత సన్నిహిత పరిచయం. అన్యాయంగా నక్సలైట్ల చేతిలో మరణించారు.
ముసలితనంలో వసంతం జరిపించిన హైబిజ్ టీవీ రాజ్ గోపాల్ గారికి, వారి బృందానికి కృతజ్ఞతలు.














(ఇంకా వుంది)

30, ఏప్రిల్ 2026, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (302) – భండారు శ్రీనివాసరావు

 

తప్పులపై కత్తి దూసిన పాత్రికేయుడు
వేదిక మీద కూర్చొన్న కుర్చీలో నుంచి లేచి పది పదిహేను అడుగులు నడిచి, మైకు దగ్గరకు వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో అంతకంటే నా ప్రసంగానికి ఆరోజు తక్కువ సమయం పడుతుందని సభికులు కానీ, సభానిర్వహకులు కానీ ఊహించి వుండరు.
‘ఇంకా ఎంతసేపురా బాబూ ఈ సోది’ అని వినేవాళ్ళు అనుకోకముందే ప్రసంగం ముగించేవాడు, ‘అయ్యో! అప్పుడే అయిపోయిందా ఇంకా కాసేపు మాట్లాడితే బాగుండేది అని శ్రోతలు భావించేవాడు మంచి వక్త అని ఏనాడో నా ఈ సీరియల్ లోనే రాసుకున్న గుర్తు.
సందర్భం ప్రముఖ రచయిత, సంపాదకుడు శ్రీ ఎం వీ ఆర్ శాస్త్రి గారి డెబ్బయ్ అయిదవ పుట్టినరోజు వేడుక. ఇటీవలే, ఏప్రిల్ 22 బుధవారం నాడు, హైదరాబాదులో ఖత్రియ హోటల్లో ఆయన మిత్ర బృందం నిర్వహించారు. నగరంలోని చిన్నా పెద్దా, అతి పెద్ద పాత్రికేయులు, పురప్రముఖులు శాస్త్రి గారి మీది గౌరవంతో తరలి వచ్చారు. శాస్త్రి గారిని, వారి సతీమణి దుర్గ గారిని ఘనంగా, సముచితంగా సత్కరించారు.
ఆ సందర్భంగా చాలా మంది ఘనాపాటీలు శాస్త్రి గారి గురించీ, వారి విద్వత్ సంపద గురించీ చాలా ఘనమైన ప్రసంగాలు చేశారు. అవన్నీ పత్రికల్లో వచ్చాయి కూడా.
ఆ క్రమంలో శాస్త్రి గారిని గురించి నన్నూ నాలుగు మాటలు మాట్లాడమన్నారు. పై ప్రస్తావన అప్పటిది అన్నమాట.
‘సభకు నమస్కారం. నేను ప్రసంగాలు చేయను. ఓ కధ చెబుతాను. అదీ శాస్త్రి గారు చెప్పిందే సుమా!’ అని మొదలు పెట్టి కొనసాగించాను.
‘గతంలో వయోధిక పాత్రికేయ సంఘం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ శాస్త్రి గారు, తాను ఆంధ్రభూమిలో పనిచేసేటప్పుడు ఓ వింత ఆలోచన కలిగిందనీ, దాన్ని ఆచరణలో పెట్టడానికి వరదాచారి గారు ఒక్కరే సమర్ధులని నిర్ణయించుకుని ఆ బాధ్యత ఆయన భుజస్కంధాలపై వుంచామని చెప్పుకొచ్చారు.
అదేమిటంటే వివిధ తెలుగు దినపత్రికల్లో వస్తున్న భాషాదోషాలను, సంపాదకీయాల్లో దొర్లే గుణదోషాలను ఎత్తి చూపే ఒక శీర్షిక నిర్వహణ అన్నమాట. ‘దిద్దుబాటు’ అనుకుంటా ఆ కాలమ్ పేరు.
ఈ రోజుల్లో, శాస్త్రిగారు చెప్పిన సంగతి పెద్ద విషయం కాకపోవచ్చు. ఎందుకంటే పత్రికల నడుమ జరుగుతున్న కలంపోట్లని జనం అందరూ గమనిస్తున్నారు. కానీ ఇది పాతకాలం ముచ్చట. విలువలు, మశానము అంటూ దేవిరించే రోజులు అవి.
వరదాచారి గారి నాలుకకే పదును ఎక్కువ అనుకుంటే, ఇక ఆయన కలానికి ఉన్న పదును ఎలాంటిదో వేరే చెప్పాలా!
శాస్త్రి గారి మాటపై ఆయన తన కలాన్ని ఝలిపించారు.
అన్ని పత్రికలు ముందేసుకుని చిత్రిక పట్టారు. ఎక్కడ ఏ దోషం వున్నా దాన్ని ఉతికి ఆరేసే వారు.
పక్క పత్రికల మీద రాతలు కదా! ఆంధ్ర భూమిలో పనిచేసే వాళ్ళు, వరదాచారి గారి చెణుకులను బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ‘ఆ వరద హస్తం మన వైపు చూపిస్తే, కొంపలు అంటుకుంటాయి’ అనే భయం కూడా మనసు మూలల్లో వుండేది.
అన్నంత పనీ జరిగింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇంకా అనేక ఇతర ప్రముఖ పత్రికల భరతం పట్టిన తర్వాత, వరదాచారి గారు ఆంధ్రభూమి వైపు దృష్టి సారించడమే కాదు, బాణం ఎక్కుపెట్టి గురిచూసి కొట్టారు. భూమిలో వచ్చే అపభ్రంశపు రాతలను, చీల్చి చెండాడారు. దొర్లుతున్న స్ఖాలిత్యాలను ఎత్తి చూపారు. ఈ విషయంలో ఆయనకు స్వపరబేధం లేదు.
ఆ దూకుడు రాతలు చూసి భూమి సిబ్బందే నివ్వెరపోయారు.
ఇలాంటి రాతలు వరదాచారి గారు మాత్రమే రాయగలరు.
ఇలాంటి రాతలు ఎం వీ ఆర్ శాస్త్రి గారి లాంటి ఎడిటర్ మాత్రమే రాయించగలరు.
శాస్త్రి గారు ఇక ఎలాంటి ఆస్తిపాస్తులను కూడబెట్టాల్సిన అవసరం లేదు. రాదు. ఆయన అంతటి భాగ్యశాలి మరొకరు వుండబోరు అనడానికి ఈనాటి ఈ వేడుకే సాక్ష్యం. కేవలం ధనధాన్యాలు, సిరి సంపదలు మాత్రమే ఒక వ్యక్తిని సంపన్నుడిని చేయలేవు. అదే కొలమానం అయితే, వేదిక మీదా, కిందా వున్న వారిలో అధిక సంపన్నులు చాలామంది వున్నారు.
అయితే మీరు కూడబెట్టిన సంపదను లెక్కకట్టే కరెన్సీ కౌంటింగ్ మిషన్లను ఇంకా కనుక్కోలేదు, మీ ఖాతాలో పేరుకుపోయిన అభిమాన ధనంపై పన్ను వేయగల సామర్ధ్యం ఆదాయపు పన్ను శాఖకు వుంటుందని అనుకోను.
ఇంటికి వెళ్ళగానే మీకు దిష్టి తీయమని మీ శ్రీమతి గారికి నా విజ్ఞప్తి.
చివర్లో ఒక్క మాట. వృత్తి రీత్యా ఆయన శిఖర సమానుడు. ఆ విధంగా ఆయనకు శత సహస్ర వందనాలు. వయసు రీత్యా నాకంటే నాలుగయిదేళ్ళు చిన్న. అంచేత ‘శతమానం భవతి’ అని ఆశీర్వదిస్తున్నాను.”
కింది ఫోటోలు: శాస్త్రి గారి అమృతోత్సవంలో వేదికపై, శాస్త్రి గారు, షణ్ముఖ శర్మ గారి వంటి దిగ్గజాల పక్కన నేను.







(ఇంకా వుంది)

28, ఏప్రిల్ 2026, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (301) : భండారు శ్రీనివాసరావు

ఓ కధ చెప్పుకుందాం
నిజానికి ఇది కధ కాదు. నిజ జీవితమే.
కధల కోసం కంచికి పోనవసరం లేదు, జీవితాల్లోకి తొంగి చూస్తే కనబడతాయి, మనసును ఆర్ద్రం చేసే కధలు. అలాంటిదే ఇది.
మా స్వగ్రామంలో పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తి కొంత వుంది. వుందని తెలుసు కానీ వాటి ఆజాపజా మా అన్నదమ్ములు నలుగురికి కానీ, అన్నదమ్ముల సంతానం పది మందికి కానీ ఎవరికీ తెలియదు. కొంచెం తెలిసిన మా మూడో అన్నయ్య ఆకాలంగా కాలం చేశాడు. అల్లాగే మా పెద్దన్నయ్య కూడా. ఇప్పుడు ఇద్దరం మిగిలాము.
చిన్నవాడి నైన నాకే రేపోమాపో ఎనభయ్ నిండుతున్నాయి. మా రెండో అన్నయ్య ఎనభయ్ నాలుగు. ఇక ఆస్తి పాస్తులు గురించి తెలుసుకోవాల్సిన అగత్యం, అనుభవించాల్సిన అవసరం మా ఇద్దరికీ ఈ వయసులో ఉంటుందని అనుకోను.
ఈ నేపధ్యంలో, నాలుగేళ్ల క్రితం అనుకుంటాను, ఖమ్మంలో వుండే మా మూడో అన్నయ్య కొడుకు భండారు రమేశ్ వీటి విషయం తెలుసుకోవాలని నడుం కట్టాడు. అడ్డదిడ్డంగా పెరిగిన చెట్లూ పుట్టల్ని తొలగించి, పొలాలని కొత్తగా సర్వే చేయించే బృహత్తర కార్యక్రమాన్ని ఈ మండే ఎండల్లో నెత్తికి ఎత్తుకున్నాడు. ఈ క్రమంలో వాడి కంటికి కనిపించిన ఒక మానవీయ దృశ్యానికి ఇది అక్షర రూపం. అదే ఇది:
“కింది ఫోటోలో కనిపిస్తున్న మనిషి పేరు పిండిప్రోలు పిచ్చయ్య. భార్య పేరు పిచ్చమ్మ. వీరికి ఈడుకు వచ్చిన ఒక కూతురు కూడా ఉంది.
ఈ పిచ్చయ్య ఒకప్పుడు కంభంపాడు గ్రామం లోనే వుంటూ, కూలి పనులు చేసుకుని జీవించేవాడు. కూతురు కుట్టు మిషన్ పనిచేస్తూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేది.
అయితే అనుకోని సంఘటనతో వీరి కుటుంబ జీవనం తలకిందులైంది. కొంత మంది కామాంధుల పైశాచిక చేష్టలతో వీళ్ల కూతురు మానసికంగా దెబ్బతింది. దీంతో ఆమె తల్లి కూడా అనారోగ్యానికి గురైంది. తల్లీ కూతుళ్లు ఇద్దరూ కూడా, వంటి మీద బట్టలు వేసుకోకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడంతో, వీరు తమ ఇళ్ళ మధ్య ఉండటానికి గ్రామస్తులు ఇష్టపడలేదు.
దాంతో, ఊరికి దూరంగా, చెట్టు నీడ కూడా లేని ప్రదేశంలో ఒక రేకుల షెడ్డులోనే చాలా ఏళ్ళుగా ఉంటున్నారు. కనీసం తాగడానికి నీళ్లు లేక పోగా, కనుచూపు మేరలో విద్యుత్ వెలుగులు కూడా కనిపించవు. పిలిచినా పలికే నాధుడే ఉండడు. ఉన్నా పలకరు. గ్రామ బహిష్కారం లాంటి శిక్ష. పగలు మండుటెండలో, రాత్రుళ్లు కటిక చీకట్లో ఆ రేకుల షెడ్డు లోనే కాలం వెళ్లదీస్తున్నారు.
ప్రతిరోజు వాళ్లకు కావలసినవన్నీ పిచ్చయ్య సమకూర్చుతూ ఉంటాడు. రోజువారీ వాడే నీళ్ల నుంచి మంచినీళ్ల వరకు తానే స్వయంగా తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాడు. పిచ్చయ్య ఒక్కడి రెక్కల కష్టంతోనే వాళ్ళిద్దరూ అక్కడ ఒంటరిగా జీవిస్తున్నారు. పిచ్చయ్య కూడా పెద్దవాడు కావడంతో ఓపిక సన్నగిల్లి ఆదాయవనరులు తగ్గిపోయాయి. తల్లి కూతుర్లు ఆ రేకుల షెడ్డు దాటి బయటకు రారు, రాలేరు.
“ఈ విషయం మా రమేశ్ దృష్టికి వచ్చింది. ఒకరిద్దరు చెప్పడంతో, ఖమ్మంలో వుంటున్న వాడు, కంభంపాడు వెళ్లి మాకున్న ట్రాన్స్ఫారం పొలం ఆనుకుని, ఒక మూలన పొలానికి అడ్డు లేకుండా ఒక చివరన జాగా చూపెట్టి, తాత్కాలికంగా ఉండమని చెప్పాడు. . దీంతో వాళ్లు అక్కడ ఒక రేకుల షెడ్డు నిర్మించుకొని ఉంటున్నారు. వాళ్ళు వుంటున్న షెడ్డు అదే.
పిచ్చయ్య కోరిక ప్రకారం ఎక్కడో ఒకచోట వారికి ఒక గూడు ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. వాడు మొదలు పెట్టిన ఈ ప్రయత్నానికి మిత్రులు కొందరు సహకరించారు. మా మూడో అన్నయ్య పెద్ద కుమారుడు రఘు రెవెన్యూ డిపార్ట్ మెంటులో ఉద్యోగి. ఇంగువ అనంత రామయ్య గారి మనుమడు గోపాలకృష్ణ కలిసి, వీళ్ళకి పోరంబోకు స్థలం చూపించి శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఈ విషయంలో తలా ఒక చేయి వేస్తున్నారు.
ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకు వెళ్ళారు. వారికి స్థలం కేటాయించి, నివాస గృహం ఏర్పాటు చేయడానికి రెవెన్యూ అధికారులు సైతం సుముఖత వ్యక్తం చేశారు.
ఈ కధనానికి మా కుటుంబంలో వాళ్ళ స్పందన మొదలయింది. సోలార్ ద్వారా ఆ షెడ్డుకు ఒకటి, రెండు బల్బుల విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రతిపాదన వచ్చింది.
అతి త్వరలోనే ఆ కుటుంబానికి ఒక ఆధారం ఏర్పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మా భండారు సంతానం మేలిమి బంగారం. ఇలాంటి వాటిల్లో వాళ్ళు ఎప్పుడు ముందే వుంటారు. మేము సైతం అని ముందుకు వచ్చారు.
పిచ్చయ్య కుటుంబానికి ఆధారం దొరుకుతుంది. కానీ ఇలాంటి అభాగ్యులు ఈ దేశంలో ఎంతమంది వున్నారో!



(ఇంకావుంది)

27, ఏప్రిల్ 2026, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (300) : భండారు శ్రీనివాసరావు

 

రోడ్డు దాటగలవా ఓ నరహరి!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రోజులు.
హైదరాబాదులో ఎర్రమంజిల్ ఐ.ఎ.ఎస్. కాలనీ నుంచి జూబిలీ హాల్ కు బయలుదేరాను. (ముఖ్యమంత్రికి వున్న విచక్షణ అధికారాలతో, ఔట్ ఆఫ్ టర్న్ పద్దతిలో చంద్రబాబు నాయుడు నాకు ఆ ఐ.జే. 2 క్వార్టర్ అలాట్ చేశారు. సీనియర్ ఐ.ఎ,ఎస్, ఐపీఎస్ అధికారులు నివసించే ఆ కాలనీలో కారు లేని వాడిని, నేనొక్కడినే. ఇప్పుడు ఆ కాలనీ లేదు. మెట్రో కోసం నేలమట్టం చేశారు. మేము వున్న క్వార్టర్ స్థానంలో ఏదో పెద్ద షాపింగ్ మాల్ వచ్చింది)
అసెంబ్లీ సమావేశాలకు ముందు స్పీకర్ సంప్రదాయంగా ఇచ్చే అల్పాహార విందుకు వెళ్ళాలి. రోడ్డు దాటి అవతల వైపు వెళ్ళి ఆటో పట్టుకోవాలి. ఇవతల ఎక్కుదామంటే ఒక్కడూ రాకపోగా సనత్ నగర్ అయితే తీసుకుపోతా అంటాడు. వాళ్ళతో పని కాదనుకుని సగం రోడ్డు దాటాను. ఇంతలో ముఖ్యమంత్రి వస్తున్న దాఖలాగా పోలీసుల హడావిడి కనిపించింది. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడివాళ్ళను అక్కడే నిలిపేశారు. దాంతో నేను రోడ్డు మధ్యలో డివైడర్ మీదనే నిలబడిపోయాను. ఈ లోగా సీఎం కాన్వాయ్ రావడం పోవడం క్షణాల్లో జరిగిపోయింది. కాన్వాయ్ వెళ్లడం ఆలశ్యం, రోడ్డుమీద ఎక్కడలేని హడావిడి. అప్పటిదాకా నిలబడిపోయిన వాహనాలన్నీ ఒక్కమారుగా బయలుదేరాయి. అంతా అస్తవ్యస్తం. ఒకదానికొకటి అడ్డం. అడిగే నాధుడు లేదు. అప్పటిదాకా ట్రాఫిక్ కంట్రోల్ చేసిన పోలీసులందరూ మంత్రం వేసినట్టు మాయం అయిపోయారు. సీఎం వెళ్ళగానే తమ డ్యూటీ అయిపోయినట్టు వాళ్ల లెక్క కాబోలు. పోలీసులు మరికొద్ది నిమిషాలు వుండి వాహనాల రాకపోకలు అదుపుచేసి వుంటే ఈ పరిస్తితి వుండేది కాదు.
నేను ఆటో పట్టుకుని వెళ్ళేటప్పటికే అల్పాహార విందు మొదలయింది. విందు పూర్తి కావస్తుండగా సీఎం సెక్యూరిటీ అధికారి అబ్రహాం లింకన్ నాతో అన్నారు, ‘వస్తుంటే దారిలో డివైడర్ మీద నిలబడ్డ మిమ్మల్ని చూసాము, ఒక్కసారి సీఎం గారిని కలవండి’ అని. చంద్రబాబు నన్ను చూస్తూనే ‘వచ్చారా సంతోషం, బ్రేక్ ఫాస్ట్ చేశారా, ఎవరక్కడ, వీరిని కనుక్కోండి’ అంటూ రోడ్డు మీద నన్ను గమనించిన విషయాన్ని అన్యాపదేశంగా ప్రస్తావించారు. “సిటీలో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది, గట్టిగా ఏదైనా చేయాలి, చూద్దాం’ అన్నారు.
నేను మళ్ళీ సెక్యూరిటీ అధికారి దగ్గరికి వెళ్లి, 'మరికొద్ది నిమిషాలు పోలీసులు అక్కడ వుంటే కొంపలు మునగవు కదా' అన్నాను. ఆయన నవ్వుతూ, 'అవును మీ సలహా బాగానే వుంది, కమీషనర్ గారితో చెప్పి చూస్తాను' అన్నారు మర్యాదగా.
ఇది జరిగి కొంచెం అటూ ఇటుగా ముప్పయ్ ఏళ్ళు దాటాయి.
ఈ సమస్య పరిష్కారం కాకపోగా దాని తీవ్రత ముప్పయ్ రెట్లు పెరిగింది.
2014 లో రాష్ట్రం విడిపోయినప్పుడు హైదరాబాదులో కొంత కాలంపాటు, ఉమ్మడి గవర్నర్, ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇద్దరు డీజీపీలు, ఇలా ఇంతమంది వీ.వీ. ఐ.పీ. ల రాకపోకలతో ట్రాఫిక్ సర్దుబాటు చేయడానికి, సమన్వయం చేయడానికి పోలీసులు నానా అవస్థలు పడేవారు.
రద్దీ సమయాలని దృష్టిలో పెట్టుకుని నగరాల్లో 'వీ.ఐ.పీ.' ల పర్యటనలు, రాకపోకల సమయాల్లో మార్పులు చేయడం వల్ల వాహనదారులకు ఒకింత ఉపశమనం కలుగుతుంది. వారికోసం రోడ్లపై వాహనాలను అంతూపొంతూ లేకుండా నిలిపివేసే పద్దతికి స్వస్తి చెప్పడానికి అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలు వాడుకోవాలి.
ముఖ్యమంత్రులు కూడా తమ వ్యవహార శైలిలో కొంత మార్పు చేసుకోవాలి. సమయపాలన విషయంలో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావును ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన టైం అంటే టైం. వెళ్ళాల్సిన ప్రదేశానికి నిమిషం ఆలస్యం కాకుండా వెళ్ళే వాళ్ళు.
నేను విలేకరిగా చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను. ‘టైం అవుతోంది బయలుదేరాల’ని సంబంధిత అధికారి మర్యాదగా సూచిస్తారు. ముఖ్యమంత్రి సిద్ధం కాగానే సెక్యూరిటీ అధికారి ట్రాఫిక్ వారికి సమాచారం ఇస్తారు. అంతే, ఆయన వెళ్ళే మార్గంలో ట్రాఫిక్ నిలిపేస్తారు.
ముఖ్యమంత్రి అంజయ్య వున్నప్పుడు కళ్ళారా చూశాను. కారు ఎక్కబోతుంటే ఎవరో కలుస్తారు. తెరిచిన కారు డోరు పట్టుకుని ఆయన వారితో మాట్లాడుతూ ఆగిపోయేవారు. అంతసేపు దోవలో ట్రాఫిక్ నిలిపే వుంచేవారు. కాకపోతే ఆ రోజుల్లో ఇంత ట్రాఫిక్ లేదు. కాబట్టి ఇబ్బందుల తీవ్రత కూడా ఇంతగా వుండేది కాదు.
సమయానికి కూడా అంత విలువ వుండేది కాదు. బస్సులు, రైళ్లు కొంచెం ఆలస్యం అయినా జనం సర్దుకు పోయేవాళ్ళు. ఇప్పుడలా కాదు. సమయం అంటే డబ్బుకు మరో రూపం. కార్పొరేట్ ప్రపంచంలో జీవించేవారికి ఆలస్యాలు అసలు పనికి రావు. అలాగే ఆసుపత్రులకు వెళ్ళే వారికి కూడా సమయం అమూల్యం. అమృత ఘడియల్లో (గోల్డెన్ అవర్స్ అని డాక్టర్లు అంటారు) రోగికి చికిత్స అందిస్తే రోగి బతికి బట్టకట్టే అవకాశాలు ఎక్కువ. అటువంటి వారిని తీసుకువెళ్ళే అంబులెన్సులకు సయితం ఈ ట్రాఫిక్ సమస్య తప్పడం లేదు.
ప్రధానమైన ఆస్పత్రులు వున్న వీధుల్లో రాస్తారోఖోలు, ధర్నాలు, ఊరేగింపులను నిషేధించడం వంటి చర్యలను చేపడితే మంచిది.
తోకటపా:
హైదరాబాదు విలేకరులకు మంచి స్నేహితుడు అయిన సమ్మెట విజయకుమార్ Vijaya Kumar Sammeta గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వద్ద దాదాపు పదేళ్లు ప్రధాన పౌర సంబంధాల అధికారిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. నిన్ననో మొన్ననో మాదాపూర్ వంద అడుగుల రోడ్డు వద్ద పాదచారుల అవస్థలు గురించి ఫొటోలతో సహా ఒక పోస్టు పెట్టారు. అదే ఈ పోస్టుకు ప్రేరణ.
కింది లింక్ అదే!
(ఇంకావుంది)

24, ఏప్రిల్ 2026, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (299) : భండారు శ్రీనివాసరావు

“కాయ రూపాయ్ అయ్ పొతే, ఆవకాయను పెట్టుటెలా!
కూరనార లేనిరోజున బడికి పిల్లల పంపుటెలా!”
అప్పుడెప్పుడో 1975లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో నేను రాసిన రోజువారీ వాక్టూన్లలో ఒక పంక్తి ఇది.
"మా కోడలు సంగతి ఏం
చెప్పమంటారు పిన్నిగారు
అదిగో అవతల పిలుస్తున్నారు మా వారు
చెబుతా లెండి వివరంగా మరోమారు
అన్నట్టు ఆవకాయ కారాలు పెట్టారా మీరు"
"ఎడతెగని ముచ్చట్లు' పేరుతొ ఇది మరో వాక్టూన్.
2018లో, కారణం తెలవదు, ఎప్పుడూ ఇంట్లో ఇటు పుల్ల తీసి అటు పెట్టే అలవాటు బొత్తిగా లేని నేను మొట్టమొదటిసారి ఆవకాయ కారాల కార్యక్రమంలో చేయి పెట్టడమే కాదు, యావత్తు బాధ్యతను నేనే నెత్తిన వేసుకున్నాను.
దిగిన తర్వాత తెలిసింది ఇది ఆషామాషీ వ్యవహారం కాదని. ముందుగానే అటకల మీద వున్న జాడీలను దింపి, వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టాలి. పంజా గుట్టలో ఒక షాపు వుంది. అక్కడికి వెళ్లి పలానా బ్రాండు కారాలు, నూనెలు, ఆవపిండి, నువ్వులు, మెంతులు, వెల్లుల్లి పాయలు, ఉప్పు వగైరా వగైరా కొనుక్కోరావాలి. ఆ ఉదయం ఎర్రగడ్డ రైతు బజారుకు వెళ్లి పులుపుగా, గట్టిగా వున్న మామిడి కాయలను సెలక్టు చేసుకుని ముక్కలు కొట్టించి తీసుకురావాలి. బోలెడు చాకిరీ. ఏళ్ళ తరబడి ఆడవాళ్ళు ఇంత శ్రమకు ఓర్చి కారాలు పెడుతున్న విషయం నాకప్పుడు బోధ పడింది.
‘ఏడాది తర్వాత మీకెట్టాగు తప్పదులే ఇంటి చాకిరీ’ అనుకుందో ఏమో, మా ఆవిడ ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా తాను పక్కన కూర్చుని సూచనలు చేస్తుంటే నేను ఆ క్రతువును దిగ్విజయంగా పూర్తి చేశాను. (వెనుకటి రోజుల్లో అంటే మా తండ్రి, తాతల కాలంలో మొగవాళ్ళే ఈ బాధ్యత నిర్వర్తించేవారని విన్నాను)
కారాలు కలుపుతున్న చేతులు కాబట్టి నేను ఫోటో తీయలేకపోయాను. ఫోటోలు అంటే ఇష్టపడదు కనుక తను తియ్యలేదు. ఏతావాతా జరిగింది ఏమిటంటే నా జీవితంలో మొట్టమొదటిసారి ఇంటి పనుల్లో మా ఆవిడకు సాయం చేశాను అనే దానికి (అదీ ఆ ఒక్కసారే అనుకోండి) ఒకే ఒక్క రుజువు అంటూ లేకుండా పోయింది. అది నిజంగా నా దురదృష్టం. అమూల్యమైన, అపురూపమైన ఇటువంటి జ్ఞాపకాలు మనసులోనే దాచుకోవాలని రాసిపెట్టి వుంటే ఏం చేస్తాము చెప్పండి.
సీజనులో పండ్లు తినడం సరే, ఏడాది పొడుగునా తినే ఊరగాయ పచ్చళ్ళు జాడీల్లో నిండుగా వుండాలంటే సీజను తప్పిపోకముందే ఆవకాయ కారాలు పెట్టేసుకోవాలి. అంచేత ఈ రోజుల్లో ఏ ఇంట్లో చూసినా ఈ కొత్త కారాల గుబాళింపులే. అమ్మలక్కల నోట్లో కారాల గురించిన ముచ్చట్లే.
అయిత ఒక ఏడాది మాత్రం ఆ సీజనులో ఇంట్లో కాకుండా ఆసుపత్రిలో ఎక్కువ రోజులు వుండడం వల్ల, ఈ కొత్త కారాల బాధ్యతను మా ఆవిడ భుజం మీద నుంచి మా రెండో వదిన గారు, మేనకోడళ్ళు తమ భుజాలకు ఎత్తుకున్నారు. ఆ విధంగా మా ఇంట్లో పెట్టని కొత్త ఆవకాయ కారాలు మూతులు బిగించి, వాసెన కట్టిన జాడీల్లో మా ఇంట్లో కొలువు తీరాయి. దీన్నే కాబోలు ప్రాప్తం అంటారు.
ఇంట్లోనే పెరుగు చిలికి తీసిన వెన్న పూసతో కొత్త ఆవకాయ కారాన్ని వేడి వేడి అన్నంలో కలుపుకు తింటుంటే, అహో ఏమి రుచి. 'మిధునం' సినిమాలో పాట గుర్తుకు రాక తప్పదు.
మా అక్కయ్యల చేతి రుచి ఇలా ఇలవరసగా మా మేనకోడళ్లకు వచ్చింది. అది వాళ్ళను కట్టుకున్నవాళ్ల అదృష్టం.




(ఇంకా వుంది)

23, ఏప్రిల్ 2026, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (298) : భండారు శ్రీనివాసరావు

 

గద్దర్ టు గణేశా!
నాలుగేళ్ల క్రితం అంటే 2022లో ఒక రోజు.
'రెయిన్ బో ఇయర్స్'. ఇది ఒక తెలుగువాడు రాసిన ఇంగ్లీష్ నవల.
దీన్ని నవల అనాలా! లేక కాల్పనిక పాత్రలతో కూర్చిన ఒక వ్యక్తి వాస్తవ జీవన చిత్రం అనాలా!
రాసింది ఆషామాషీ వ్యక్తి అయితే ఇంత చర్చ అనవసరం. కర్నాటక కేడర్ లో అడిషినల్ చీఫ్ సెక్రెటరీ స్థాయి వరకు ఎదిగిన ఓ సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి రాయడం వల్ల, పుస్తకం టైటిల్ కు CONFLICTS TO CONTENTMENT అనే ట్యాగ్ లైన్ జోడించడం వల్ల పెరిగిన ఆసక్తి కారణంగా ఈ పుస్తకం గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం ఏర్పడింది.
పుస్తక పరిచయ కార్యక్రమం హైదరాబాదులోని టూరిజం ప్లాజాలో జరిగింది. మండుటెండ మాడుస్తున్నా సభామందిరం కిటకిటలాడింది. అనేకమంది విశ్రాంత ఐ.ఏ.ఎస్. అధికారులు, రచయితలు, పాత్రికేయులు హాజరయ్యారు.
హాజరీ ఈ స్థాయిలో ఉండడానికి ఈ పుస్తకం గురించి అంతకు ముందు ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో ‘మావో నుంచి మహర్షి దాకా’ అనే శీర్షికతో శ్రీ కారుసాల వెంకటేష్ రాసిన సవివర సమీక్షా వ్యాసం కూడా చాలావరకు కారణం అని చెప్పవచ్చు.
పుస్తక రచయిత పేరు మాఢభూషి మదన్ గోపాల్. తెలంగాణా గడ్డ మనిషి.
ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మదన్ గోపాల్ తండ్రి ఎం. వెంకటాచారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. పుచ్చలపల్లి సుందరయ్యగారితో కలిసి పనిచేశారు. వామపక్ష భావజాలంతో పుట్టి పెరిగిన మదన్ గోపాల్, మరో అడుగు ముందుకు వేసి మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ సానుభూతిపరుడిగా ఎదిగారు. ఇటువంటి వ్యక్తి ఇండియన్ సివిల్ సర్వీసులో ఐ.ఏ.ఎస్. హోదా పొందడం ఓ విచిత్రం. నక్సలైట్ అభిమాని అనే కారణంతో కొన్నాళ్ళు సస్పెండ్ అయిన చరిత్ర కూడా వుంది.
నవలల్లో రచయిత కధని మలుపులు తిప్పినట్టే, ఊహకు అందని, మనిషి బుర్రకు చిక్కని ఏదో ‘మానవాతీత శక్తి’ కూడా మనుషుల జీవితాలను అనేక మలుపులు తిప్పుతుంది. ఈ క్రమంలో అనేక రకాల ఘర్షణలు, సంఘర్షణలు. (CONFLICTS). మరి CONTENTMENT సాధించడం ఎల్లా!
(ఈ పుస్తకం అప్పటికి చదవలేదు. నిజం చెప్పాలి అంటే ఇంతవరకూ కూడా చదవలేదు.)
మదన్ గోపాల్ కి చలం గురించి ఎవరు చెప్పారో తెలియదు. తిరువన్ణామలైలో వుంటున్న గుడిపాటి వెంకటాచలంతో ఉత్తర ప్రత్యుత్తరాలు మొదలు పెట్టారు. ఆ ఉత్తరాలు చదివిన చలం, ‘నీ రాతలతో నా తల తినడం ఆపేసి, ఓసారి నా దగ్గరకు రా’ అని ఓ కార్డు ముక్కమీద జవాబు రాసి పడేసారు.
మదన్ ఆ పిలుపు పట్టుకుని రమణాశ్రమానికి బయలుదేరి వెళ్ళారు. ఆ సమయంలో చలం, వచ్చిన వాళ్ళని కలుసుకుంటున్నారు. మదన్ గోపాల్ వెళ్లి ఎదురుగా నిలబడితే ‘ఎవరు నీవు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తుంటావు’ అనే ప్రశ్న ఒక్కటి కూడా వేయకుండా, వెంటనే ఆయనకు బస ఏర్పాటు చేశారు. పొద్దున్నే ఉపాహారం, కాసేపు తోట పని. పగలు చలం చెంత గడపడం. శ్రీ రమణుని బోధనలు గురించి తెలుసుకోవడం. అప్పుడు అనిపించింది. జీవితం అంటే వేరే ఒకటి వుందని. దాని ద్వారా లభించే CONTENTMENT అనేది మరోటి ఉంటుందని. మూఢ భక్తి వేరు, ఆధ్యాత్మిక చింతన వేరు . ఆధ్యాత్మికత అంటే తనను తాను తెలుసుకోవడం. అదే శ్రీ రమణుని భక్తిమార్గం అని అప్పుడే ఆయనకు తెలిసింది.
సరే! ముందు మొదలు పెట్టిన ‘గద్దర్ టు గణేశా’ ఏమిటి అంటే!
పుస్తక పరిచయ కార్యక్రమం మొదలు కాబోతున్న తరుణంలో వచ్చిన ప్రజా గాయకుడు గద్దర్ ని గమనించిన మదన్ గోపాల్ లేచి నిలబడి, గద్దర్ గతంలో పాడిన ఓ పాట పాడుతూ సగౌరవంగా ఆహ్వానించారు. ఆ తర్వాత గణపతి ప్రార్ధనతో సభ మొదలయింది.
నా ఈ రాతలో కూడా కొన్ని CONFLICTS కనిపించి వుంటే ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే, నేనింకా CONTENTMENT దశకు చేరుకోలేదు. CONFLICTS నడుమే కొట్టుమిట్టాడుతున్నాను.
తోకటపా: ఈ కొత్త పుస్తకం కోసం వెడితే పాత మితృలు, పాత పరిచయస్తులైన అనేకమంది ఐ.ఏ.ఎస్. అధికారులు కనిపించారు.
మిత్రుడు జ్వాలా కోరికమీద రచయిత మదన్ గోపాల్, ఆంధ్రజ్యోతి (అప్పటి) ఎడిటర్ కె. శ్రీనివాస్, తెలంగాణా పబ్లిక్ సర్వీసు కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, నాటి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, 108 సర్వీసు మాజీ సీఈఓ వెంకట్ చంగవల్లి, 104 సర్వీసు మాజీ సీఈఓ డాక్టర్ ఉట్ల బాలాజీ అందరం కలసి జ్వాలా ఇంటికి వెళ్లాం.
మా మేనకోడలు, జ్వాలా శ్రీమతి అయిన వనం విజయలక్ష్మి, “వండనలయదు నేవురువచ్చిరేని నన్నపూర్ణకు నుద్దియౌనతని గృహిణి” అనే ప్రవరాఖ్యుని ఇల్లాలు బాపతు కాబట్టి, మా అందరికీ అప్పటికప్పుడు వండివార్చిన వేడి వేడి విందు భోజనం ఆనాటి మా కలయికలో నిజంగా హై లైట్.
గతంలోకి తొంగి చూస్తుంటే ఇలాంటి మధురమైన ఘటనలు, సంఘటనలు ఎన్నో, ఎన్నెన్నో.
కింది ఫొటోలు జ్వాలా ఇంట్లో:








(ఇంకా వుంది)