భార్య చనిపోతే బతకలేరా?
ఎందుకు బతకలేరు, బతుకుతారు.
కానీ దాన్ని బతుకు అనరు, బతుకు
ఈడ్వడం అంటారు. అయితే ఇది సార్వజనీనం కాదు. కేవలం నాకు సంబంధించిన అభివ్యక్తి మాత్రమే సుమా!
ప్రతీ రచనకూ కృత్యాద్యవస్థ అని ఒకటుంటుంది. అంటే
ఒక రచనని ఎలా మొదలుపెట్టాలన్న విషయమై పడే జంజాటం. ఇప్పుడు ఈ ఎపిసోడ్ విషయంలో నాదీ
అలాంటి గుంజాటనే.
ఒంటరి ఆలోచనలకు ఒక పొంతన వుండదు. ఒక పద్దతి
వుండదు. చీలికలు పేలికలుగా మనసులో సుళ్ళు తిరిగే భావాలను కాగితం మీద పెట్టాలని
చూసినప్పుడు ఇది మరింత ప్రస్పుటం అవుతుంది. ఏదో ఒక భావన మాత్రం వీటిని కలపాలని,
గుదిగుచ్చాలని ప్రయత్నిస్తుంది. ఆ విఫల ప్రయత్నమే ఇది.
భగవంతుడి వయసు ఏడేళ్లు అని నా నమ్మకం. నా భార్య
నిర్మల ఏడేళ్ల క్రితం 2019 లో హఠాత్తుగా మరణించింది. ఆమె జీవించి వున్నంత వరకూ నాకు
దేవుడి అవసరం పడలేదు. నా మంచి చెడ్డలు అన్నీ తనే ఒక దేవతలా కనిపెట్టి చూసింది. ఆమె
పోయిన తర్వాత గత ఏడేళ్ళుగా దేవుడే నాకు పెద్ద దిక్కు అయ్యాడు. అలా అని పెద్దగా
గుళ్ళూ గోపురాలు తిరిగింది లేదు. కృతజ్ఞతలు తెలుపుకోవడానికి అంతంత దూరాలు పోనవసరం లేదనేది
నా నిశ్చితాభిప్రాయం.
గతంలో నా భార్య రూపంలో, ఇప్పుడు నా పిల్లల రూపంలో ఆయనే నా బాసటకు వచ్చాడు. నిజానికి అప్పుడు ఇప్పుడు కనిపెట్టి చూసింది, చూసేది కంటికి కనబడని ఆ పరమాత్ముడే అనే ఎరుకకు
ఇంకా ఒక స్పష్టమైన రూపం రాలేదు.
మరో కఠిన వాస్తవం
ఏమిటంటే జీవించి వున్నప్పుడు నా దృష్టిలో మా ఆవిడ దేవత ఏమీ కాదు, జస్ట్ భార్య
అంతే!
బర్రె చనిపోయిన తర్వాత
పాడి తెలుస్తుందని మా బామ్మ రుక్మిణమ్మ గారు చెబుతుండేది. అందులో ఎంతో నిజముంది. నిజముంది కాబట్టే చనిపోయి మా ఆవిడ దేవత అయింది.
నా చిన్ననాటి స్నేహితుడు
వేమవరపు భీమేశ్వరరావు, స్కూల్
మేట్ రామబ్రహ్మాచారి, కాలేజి
సహాధ్యాయి వెన్నెలకంటి శ్రీనివాసమూర్తి ఈ ముగ్గురూ నేనిప్పుడు ఎక్కిన పడవలో
ఎప్పటినుంచో ప్రయాణిస్తున్నారు. భార్యల్ని కోల్పోయారు కానీ జీవిత నౌకను నిబ్బరంగా
నడుపుతూనే వున్నారు. వాళ్లకి నాకు ఒక చిన్న తేడా వుంది. అదే ఇప్పుడు పెద్ద సమస్యగా
మారింది. జీవిత సహచరిని కోల్పోక ముందు కూడా వారందరూ బాధ్యత తెలిసిన భర్తలు. అంచేత,
జీవితంలో ఎదురైన గొప్ప కష్టాన్ని పంటి బిగువున భరించి, తమ జీవితాలను ఒక బాటలో
పెట్టుకోగలిగారు.
ఆ మధ్య ఒకసారి భీమేశ్వరరావు
ఇంటికి వెళ్లాను. అతడి భార్య జీవించి వున్న రోజుల్లో కూడా వెళ్లాను. కాలేజీ
ప్రిన్సిపాల్ గా రిటైర్ అయినా, తండ్రి నుంచి వారసత్వంగా లభించిన ఉచిత హోమియో వైద్యాన్ని వ్యాపకంగా మలచుకున్నాడు.
దైవదత్తంగా సంక్రమించిన రచనా పాటవాన్ని చక్కగా వాడుకుంటూ అనేక పుస్తకాలు రాశాడు. ఈ
క్రమంలో పరిచయస్తులు, అభిమానులు
పెరిగారు. అవసరం అయితే, ఇంట్లో
స్వంతంగా వంట చేసుకోగలడు. అంచేత భార్యావియోగం అనంతరం వాటిల్లే మార్పులు
ఇబ్బందులుగా మారకుండా చూసుకోగలిగాడు.
భీమేశ్వర రావు ఇంటికి
వెళ్ళివచ్చిన తర్వాత నేనూ ఒక ప్రయత్నం చేశాను. అబ్బే! ఏమాత్రం కుదరలేదు. వంట సంగతి
తర్వాత, ముందు పాలు కాగబెట్టడంతో ప్రయోగాలు చేశాను. అధరాపురపు మురళీ కృష్ణ గారి ఎపిసోడ్స్ రిపీట్ అయ్యాయి. మా
వంటిల్లు పాలు పొంగిన సిరుల గడ్డ అయింది కానీ నా నోట్లోకి కప్పు కాఫీ చేరలేదు.
‘పదహారు ఇంటూ పద్నాలుగు
ఎంత?’ అని అడిగితే, జవాబు తెలిసిన వాడు చిటికెలో చెప్పేస్తాడు. ఎక్కాలు రాని,
జవాబు తెలియని నా బోటివాడు ‘వామ్మో! అంత గొట్టు ప్రశ్న అడిగితే ఎలా! నాకు తెలియదు’ అంటాడు. వంట విషయంలో నా పరిస్థితి ఇదే.
రాదు, ఇప్పుడు నేర్చుకున్నా రాదు.
మనలో చాలామందిమి అన్నీ
తెలుసు అనుకుంటాము. కానీ తెలిసింది కొందరికే. తెలియని వాళ్ళలో నేను తప్పకుండా
వుంటాను. ఇది ఒప్పుకోవడానికి ఎలాంటి భేషజం లేదు.
ఈ లోపం అంటే ఈ తెలియనితనం
కారణంగా ఇతరులమీద ఆధారపడక తప్పదు. దాంతో కౌపీన సంరక్షణార్ధం అయం పటాటోపః అన్నట్టు,
వలలి వచ్చి వంట చేస్తేనే తిన్నట్టు.
పొద్దెలా గడుస్తుంది
అనుకునేవాడికి కాలంతో నిమిత్తం ఏమిటి? ఎప్పుడు లేస్తే అప్పుడే ఉషోదయం. నాకు తగ్గట్టే వంటమనిషి,
పని మనిషి తమ పని వేళలు తామే మార్చుకున్నారు. ‘ఈయన గారు ఇంత పొద్దున్నే లేస్తాడా
పెడతాడా’ అని వంటావిడ పదకొండు గంటలకు, పనావిడ మరింత తీరిగ్గా ఆ తర్వాత రావడం అలవాటు
చేసుకున్నారు. పాపం అంత తెల్లవారక ముందే వాళ్ళు వచ్చి చేసేది ఏముంది అని నేనూ
అలవాటు పడ్డాను. దాంతో స్నానం సంధ్యా
(రెండోది ఎట్లాగు లేదు, దేవుడి గూట్లో మా ఆవిడ నాకు వదిలిపెట్టి వెళ్ళిన దీపం
వెలిగించడం అనే ఒక బాధ్యత తప్పిస్తే), తిండీ తిప్పలు మధ్యాహ్నానికి, అపరాహ్ణం తర్వాతకు ఆటోమేటిక్ గా మారి పోయాయి.
కానీ రోజులు అన్నీ ఒకే
రకంగా గడవవు కదా!
ఈ ఏడాది (2026)
వేసవిలో నీళ్ళ
కరువు వచ్చి పడింది. బోరు ఎండిపోయింది. అపార్ట్ మెంటులో నీళ్ళ సప్లయి అతి దారుణంగా
కనిష్ట స్థాయికి పడిపోయింది. ఒకరోజు గవర్నమెంటు ట్యాంకరు, మరునాడు ప్రైవేటు
ట్యాంకరు. పదహారు వాటాలు, ఎక్కడ సరిపోతాయి? ఉదయం ఒక్కపూట ఆరున్నర నుంచి ఒక గంట అంటారు, కానీ అరగటంలోనే నల్లాలు నోరు కట్టేసుకుంటాయి.
ఇన్నేళ్ళుగా నీళ్ళ కరువు ఎరగకుండా 24X7 రన్నింగ్
వాటర్ సప్లయికి అలవాటు పడిన వాళ్లకు ఇది మింగుడు పడని వ్యవహారం. కానీ ఏం చేస్తాం!
నలుగురితో నారాయణ.
నీళ్ళ వేళలను బట్టి
దినచర్య మారిపోయింది. ఠంచనుగా ఆరున్నరకు లేవడం, అలెక్సాలో వెంకటేశ్వర సుప్రభాతం పెట్టడం, అది పూర్తయ్యే లోగా స్నాన సంధ్యాదులు, దేవుడి గూట్లో దీపం పెట్టడాలు, పాలు కాగించి తాగడాలు, తోడు
పెట్టడాలు. బాత్ రూములో బయటా ఓవర్ హెడ్ ట్యాంకులు నింపి పెట్టడాలు. మునుపు ఇవన్నీ పనివాళ్లు
చూసుకునేవారు, నేను మంచం
మీద శేషతల్ప శాయిలా పడుకుని వుండేవాడిని. ఇప్పుడు వాళ్ళు వచ్చేదాకా ఆగితే ఇంట్లో
తాగడానికి కూడా గుక్కెడు నీళ్ళు కూడా వుండవు.
వాళ్ళని కాస్త ముందు రమ్మని అడగొచ్చు కదా! నిజమే, అడిగే లోపల ఆవిడే చెప్పింది మళ్ళీ అడగకుండా. ‘ఎప్పుడు
వచ్చినా నా పని నాదే కదా! నేనే చేసుకోవాలి కదా!’ ఆ రాగం పెరిగి పెద్దది కాకముందే, నేనే, ‘సరేలే’
అనేశాను.
ఏదైతేనేం, ముందు కొంచెం ఇబ్బంది అనిపించినా, ఇప్పుడు హాయిగానే అనిపిస్తోంది. ఇబ్బందులు అలవాటు అయితే, ఇబ్బందిగా అనిపించదు అనే మధ్యతరగతి మందహాసం ఒకటి
చిందించి ఊరుకున్నాను.
పైగా ఈ కష్టాలు నా
ఒక్కరివి కావు, అందరివీ. ఈ
ఊహ మరింత హాయిని ఇస్తోంది. (ఇదీ మధ్య తరగతి మనస్తత్వమే)
ఇక ఏడున్నర నుంచీ పూర్తిగా
ఖాళీ. అంత ఫ్రీ టైం అన్నమాట.
ఇటాలియన్ భాషలో ఒక పద
బంధం వుంది.
Dolce far niente
అంటే, ఏమీ చేయకుండా
వుండడంలోని ఆనందం అన్నమాట. దాన్ని ఇప్పుడు
పూర్తిగా అనుభవిస్తున్నాను.
(ఇంకా వుంది)