ఇంటికే
వచ్చిన బుక్ ఎగ్జిబిషన్
గత
కొద్ది రోజులుగా పోస్టు ద్వారా, కొరియర్ ద్వారా అనేక పుస్తకాలు మా
ఇంటికి చేరాయి.
ఈ
రోజు ఏకంగా విశ్వనాధ వారి వేయి పడగలు నవల పోస్టులో అందింది. ఫేస్ బుక్ మితృలు, పెద్దలు జేవీపీఎస్ సోమయాజులు గారు
శ్రమ తీసుకుని పంపారు. కొద్ది రోజుల ముందే మా గురువుగారు పురాణం సుబ్రమణ్య శర్మ
గారు రాసిన ‘విశ్వనాధ ఒక కల్పవృక్షం’ అనే పుస్తకం మా ఇంటికి చేరడం కూడా
సోమయాజులు గారి పుణ్యమే. వేయి పడగలు నవల ముప్పది ఏడవ ముద్రణ.
హార్డ్ బౌండ్. 999 పేజీలు, ధర : 888 రూపాయలు.
ఇక
మిగిలిన పుస్తకాల వివరాలు: వార్తాప్రస్థానం : రచన: గద్దె దుర్గారావు, నేను బహువచనం: ములుగు రాజేశ్వర రావు,
యం.యస్, ఆచార్య : మాఢభూషి శ్రీధర్, అక్షరాయుధుడు ఏబీకే, పేపర్ బాయ్ టు ఎడిటర్: ఎస్, వినయ్ కుమార్, అప్పుడు – ఇప్పుడు : జి.కృష్ణ, పాములపర్తి వెంకట నరసింహారావు:
అప్పరసు కృష్ణారావు, అనుభవాలు- జ్ఞాపకాలు, మౌన సాక్ష్యాలు: ప్రముఖ పత్రికా
ఫోటోగ్రాఫర్ కేశవులు, సత్యవోలు సుందర సాయి, అధినాయక జయహే : చిం వ్యాసుడి ఖడ్గాలు, అమృత దర్శనం : విశ్వపతి, అమృత వర్షిణి: కొలిపాక శారద శతజయంతి సంచిక.
మొన్న
సాయంత్రం సోమయాజులు గారు ఫోన్ చేసి వేయిపడగలు పుస్తకం వుందా? చదివారా? అని అడిగారు.
అవును, కాదు అని చెప్పలేకపోయాను. వేయిపడగలు పుస్తకం స్వయంగా
విశ్వనాధ గారి కరకమలాల నుంచే స్వీకరించిన
వృత్తాంతం గుర్తుకు వచ్చింది.
అరవై
ఏళ్ళ కిందటి సంగతి.
సుమారు
ఆరు దశాబ్దాల క్రితం ఇద్దరు బెజవాడ ఎస్సారార్ కాలేజి కుర్రాళ్ళకు, వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో నెగ్గినందుకు
గాను నూట యాభయ్ రూపాయలు పారితోషికంగా
వచ్చాయి. అంత డబ్బుతో ఏం కొనుక్కోవాలి అనేది పెద్ద సమస్యగా మారింది. చివరికి
వారిలో ఒకడన్నాడు, పుస్తకాలు కొనుక్కుందాం అని. పుస్తకాలు అంటే
క్లాసు పుస్తకాలు కాదు, పెద్ద రచయితలు రాసిన గొప్ప పుస్తకాలు.
విశ్వనాధవారి
వేయి పడగలయితే అన్నాడు ఇద్దరిలో ఒకడు. ఈ డబ్బుకు రెండు పుస్తకాలు వస్తాయంటావా
అన్నాడు ఆ ఇద్దరిలో మరొకడు.
ఇద్దరూ
కలిసి బెజవాడ మాచవరంలో ఉంటున్న కవిసామ్రాట్ ఇంటికి వెళ్ళారు. ఇంటి ముందు విశాలమైన
ఆవరణ. వరండాలో ఓ వాలు కుర్చీలో పై పంచ
లేకుండా దోవతీలో ఒకాయన, ఆయనకు దగ్గరగా తెల్లటి వస్త్రాల్లో మరొకాయన కూర్చుని
మాట్లాడుకుంటున్నారు. ఆ ఇద్దరిలో విశ్వనాధ ఎవరై వుంటారు?
తెల్ల
ఉడుపుల పెద్దమనిషి వారిద్దరినీ గుర్తు పట్టాడు. పట్టి, పై ఆచ్ఛాదన లేని వ్యక్తికి పరిచయం
చేశారు.
‘ఇదిగో
ఈ పొడుగబ్బాయి, సన్నగా వున్నాడే వీడు ప్లీడరు తుర్లపాటి
హనుమంతరావు పంతులు గారి పెద్దబ్బాయి సాంబశివరావు. ఇంట్లో శాయిబాబు అంటారు. ఈ
రెండోవాడు శ్రీనివాసరావు. మా అక్కయ్య కోడలి తమ్ముడు. హనుమంతరావు పంతులుగారికి కూడా
స్వయానా బావమరది’
అప్పుడు
ఇద్దరిలో సన్నవాడికి లైటు వెలిగింది. ఓహో వీరు పేరాల భరత శర్మ గారు, విశ్వనాధవారి శిష్యులు అని రెండోవాడి
చెవిలో ఊదాడు.
ఏం
పని మీద వచ్చారు అని అడగకుండానే చెప్పాము, పోటీల్లో బహుమతి కింద ఇద్దరికీ కలిపి
నూట యాభయ్ వచ్చాయని, ఆ డబ్బుతో మీ వేయి పడగలు పుస్తకం
కొనుక్కుందామనే కోరిక కలిగిందని.
‘నా
పుస్తకాలు మీకు అర్ధం అవుతాయా’ అనేది విశ్వనాధ వారి మొదటి ప్రశ్న.
‘ఏమోనండీ
అర్ధం కాకపోవచ్చు. కానీ అర్ధం చేసుకోవడానికే చదవాలని అనుకుంటున్నాం’ మా జవాబు.
విశ్వనాధవారి
మొహంలో కనీ కనపడని నవ్వు.
‘అదిగో
ఆ మూల వున్నాయి. పోయి చెరి రెండూ తెచ్చుకోండి’ అన్నారు.
పోయి
చూస్తే విశ్వనాధ వారు రాసిన పుస్తకాలు
ప్యాకెట్లుగా కట్టి వున్నాయి.
ఆయన
చెప్పినట్టే చేసి చెప్పాము.
‘ఇందులో
చాలా పుస్తకాలు ఉన్నట్టున్నాయి. మా దగ్గర నూట యాభయ్ మాత్రమే వున్నాయి’ అన్నాడు
సాంబశివరావు అనే నా సహాధ్యాయి, మేనల్లుడు కూడా.
అప్పుడు
విశ్వనాధవారు పెద్దగా నవ్వారు.
‘అర్ధం
చేసుకుంటాం అన్నారు కదా! పోయి చదవండి. చదివేవారికి పుస్తకం చేరాలి. మిగిలిన
పుస్తకాల డబ్బు మీ ఇద్దరికీ నా గిఫ్ట్’ అనేశారు.
మహదానందంతో
రెక్కలు కట్టుకుని ఇంటికి వచ్చి ప్యాకెట్ విప్పితే :
‘వేయి
పడగలు, కిన్నెరసాని
పాటలు, దిండు
కింద పోకచెక్క, స్వర్గానికి నిచ్చెనలు, చెలియలి కట్ట, ఏకవీర, తెఱచిరాజు, మాబాబు, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు, చిట్లీచిట్లని గాజులు....’
కవిసామ్రాట్
అయ్యే. ఎంత పెద్ద చేయి అయివుండాలి మరి.
(ఇంకా
వుంది)