12, జులై 2026, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో : (340) : భండారు శ్రీనివాసరావు


లాయల్టీ

‘లాంగ్ లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో, నో బడీ కెన్ సే హౌ లాంగ్ ఎగో’ అని వెనక ఓ సినిమాలో డైలాగ్ వుంది.

అలాగే, మూడున్నర దశాబ్దాల క్రితం రేడియో విలేకరిగా ఓ వెలుగు వెలుగుతున్న ఓ పాత భూతకాలంలో, ఘనత వహించిన ఓ ఎంపీ గారు నన్నొక పని అడిగారు. తలచుకుంటే ఆయనకది చిటికలో పని. ఆయనకు పని పడింది రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఉద్యోగి పని. ఆ ఉద్యోగికి జరూరుగా బదిలీ కావాలి. అదీ రాష్ట్రానికి కడగొట్టున వున్న పొరుగు రాష్ట్రపు సరిహద్దు ప్రాంతానికి.
నాకది చాలా చిన్న పని అనిపించింది. చూస్తూ చూస్తూ అంత దూరం బదిలీ కోరేవారు ఎవరుంటారు? కాబట్టి అడగాలే కాని ఎవరైనా చేస్తారు అని ఏకంగా ఆ సంబంధిత మంత్రి దగ్గరికే వెళ్లి చీటీ ఇచ్చాను. ఆయనతో నాకు చాలా కాలంగా మంచి స్నేహమే వుంది. అడగక అడగక అడిగాను కాబట్టి వెంటనే పని అవుతుంది అనుకున్నా.
నేరుగా సచివాలయానికి వెళ్లి అడిగా.

‘ఈ ఉద్యోగి నీకు తెలుసా!’ అని మంత్రి అడిగారు.
‘నాకు అతడి ముక్కూ మొగం తెలియదు. కానీ మీ వంటి సన్నిహితుడే నన్ను ఈ ఫేవర్ అడిగారు. అందుకనే వచ్చాను’
‘సరే! నీ స్కూటర్ ఇక్కడే పెట్టు. రేపు తీసుకు పోదువు కానీ. ఈరోజు నాతొ రా. మళ్ళీ నా కార్లో నిన్ను ఇంట్లో దింపుతాను’

ఆయన కార్లోనే ఆయన ఇంటికి వెళ్లాను. మంత్రిగారు లోపలకి వెళ్లి తయారై వచ్చారు. ఇద్దరం ఆయన పోర్టికో పైన వున్న బాల్కానీ వంటి దానిపై వేసిన కుర్చీల్లో కూర్చున్నాము.
అప్పుడు ఆయన నాకు చేసిన పొలిటికల్ లాయల్టీ అనే భగవద్గీత ఇది.

‘భండారూ! నీకు అర్ధం కాదు కానీ మాకు లాయల్టీ చాలా ముఖ్యం. ఏదైనా పనిచేస్తే డబ్బు తీసుకుని పనులు చేస్తామనే నింద మాపై వుంది. అది పూర్తిగా నిజం కాదు, అలాగని అబద్ధం కాదు. నువ్వు అడిగిన బదిలీకి లక్షకు తక్కువ కాదు. నీకు అతడి ముక్కూ మొహం తెలియదు. ఇతడి గురించి నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు లెటర్లు ఇచ్చారు. నువ్వు చెప్పిన ఎంపీ కూడా వారిలో వున్నాడు. ఎంక్వైరీ చేస్తే అతడు మంచి సంపాదనపరుడు అని తెలిసింది. హైదరాబాదు నుంచి ఆదిలాబాదు జిల్లా చివరకి ఎవరూ బదిలీ కోరుకోరు. బార్డర్ ఏరియాలో వారి సంపాదన రోజుకు వేలల్లో వుంటుంది. అదంతా వారికి దక్కదు. కింద నుంచి పై దాకా పంపకాలు వుంటాయి. అంచేత మా ఎమ్మెల్యేలు చెప్పినా నేను పట్టించుకోలేదు.
‘ఈ సంగతులు ఏవీ నీకు తెలియదన్నసంగతి నాకు సాయంత్రమే అర్ధం అయింది. అందుకే మాట్లాడడానికి ఇంటికి రమ్మన్నాను.
‘ఇప్పుడు అసలు విషయం చెబుతా విను. అంతమంది చెప్పినా నేను చేయలేదు కదా! అందుకే నిన్ను పట్టుకున్నాడు, అదీ వేరే వారి ద్వారా. నువ్వు ఇన్నేళ్ళ పరిచయంలో ఎన్నడూ ఏదీ అడగలేదు. అందుకే ఆ ఫైల్ కూడా తీసుకువచ్చాను. నువ్వు నేను చెప్పిన దానికి అవును అంటే అతడిని అతడు అడిగిన చోటుకు బదిలీ చేస్తూ ఇప్పుడే ఇక్కడే సంతకం చేస్తాను. రేపే ఆర్డర్ ఇస్తాను. కానీ ముందు ఒక మాట చెప్పు. నా మాట ఒకటి విను. రేపటి నుంచి అతగాడు అందరితో చెబుతాడు. మంత్రి కాదన్నా నా పని నేను చేసుకోగలిగాను. ఆయన నాకో లెక్కా అన్నట్టు తోటివారితో చెబుతాడు. డిపార్ట్ మెంటులో క్రమశిక్షణ దెబ్బతింటుంది. పోనీ నీకన్నా లాయల్ గా ఉంటాడా అంటే అదీ లేదు. అతడెవరో కూడా నీకు తెలియదు. ఇప్పుడు చెప్పు ఏం చేద్దాం’
నాకు విషయం పూర్తిగా అర్ధం అయింది.
వెంటనే చెప్పాను.
‘ముందా ఫైల్ మీ ముందు నుంచి తీసేయండి. వేరే విషయాలు ఏవైనా మాట్లాడుకుందాం!’

కాసేపు సాయంకాలక్షేపం చేసి ఆయన కారులో ఇంటికి చేరాను.
వచ్చిన తర్వాత ఆయన అన్న ఒక మాట అర్ధం బోధ పడలేదు.
‘నీకైనా లాయల్ గా ఉంటాడా!’
లాయల్ గా వుండడం అంటే ఏమిటి!
ఏమిటైతే నాకెందుకు! నాకు అవసరం లేని వ్యవహారం.

తోకటపా:

ఇంటి పెద్ద ఇంటి ఖర్చు కోసం ఇల్లాలికి కొంత డబ్బు ఇస్తాడు. ఇల్లాలు అందులో కొంచెం డబ్బు తీసి చిన్న సరదాలు తీర్చుకోవడానికి పిల్లలకు ఇస్తుంది. అమ్మ ఇచ్చిందని పిల్లలు అనుకుంటే అనుకోవచ్చు. నిజానికి ఆ డబ్బు ఇచ్చింది తండ్రి. తనే ఇచ్చాను అని ఏ తండ్రీ చెప్పుకోడు. తనే ఇచ్చానని ఏ తల్లీ చెప్పుకోదు. టాం టాం వేసుకోరు. పిల్లల అవసరాలు తీర్చడం తమ బాధ్యత అనుకుంటారు. కానీ అలా డబ్బులిచ్చి వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేద్దామని తల్లి తండ్రులు ఎవ్వరూ అనుకోరు. కానీ పిల్లలు మాత్రం తమ తలితండ్రుల పట్ల లాయల్ గానే వుంటారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజల్ని తమ పిల్లలు అనుకుంటే ఈ లాయల్టీ పేచీయే వుండదు. రాదు.

(ఇంకావుంది)

10, జులై 2026, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో : (339) : భండారు శ్రీనివాసరావు

 

ఒకనాటి ఉద్యానవనము ఆనాటి సచివాలయము
1975 నవంబర్ లో నేను హైదరాబాదు ఆకాశవాణిలో విలేకరిగా చేరిన నాటి నుంచి కొన్ని దశాబ్దాలపాటు ఒకటే దినచర్య. నేను వుంటున్న చిక్కడపల్లి నుంచి బయలుదేరి రెండు బస్సులు మారి రేడియో స్టేషన్ కు రెండు స్టాపుల ముందే, సరోవర్ హోటల్ దగ్గర దిగిపోయేవాడిని. నేను పనిచేసేది రేడియో స్టేషన్ అయినా నా కార్యస్థానం మాత్రం సచివాలయమే.
ఆరోజుల్లో సెక్రెటేరియట్ ప్రధాన ద్వారం, రాజసం ఒలకబోసే ఇనుపకమ్మీలతో ప్రస్తుతం ఫ్లై ఓవర్ మొదలయ్యే ప్రధాన రహదారిలో వుండేది.
దాని ఎదురుగా ఆంధ్ర జ్యోతి సిటీ బ్యూరో ఆఫీసు. ఆదిరాజు వేంకటేశ్వర రావు గారు దానికి విలేకరి. ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రం బెజవాడలో అచ్చయ్యేది. ఆయన ఇక్కడనుంచే టెలిప్రింటర్ లో వార్తలు పంపేవాడు.
నేను రేడియోలో చేరకముందు ఒకసారి ఆయనతో కలిసి సచివాలయానికి వెళ్లాను. అంతకుముందు ఎప్పుడూ అందులో అడుగు పెట్టిన అనుభవం లేదు.
ఆదిరాజు పేరులోనే కాకుండా వేషభాషల్లో కూడా. ఫుల్ సూటు. నెక్ టై. చేతిలో బ్రీఫ్ కేసు. ఢిల్లీలో ఎక్కువకాలం వుండడం వల్ల అలవడ్డ అలవాట్లు కాబోలు.
సచివాలయం గేటు దగ్గర కాపలా మనిషి ఆదిరాజుని చూడగానే రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాడు. ఆయన వెంట వస్తున్న నన్ను చూసి కనీసం ఎవరని కూడా అడగలేదు. సిగరెట్ వెలుగుతున్న చేయిని విలాసంగా వూపుతూ ఆదిరాజు లోపలకు వెళ్లాడు. ఆయనతో పాటే నేనూ.
ఆ తరువాత రేడియో విలేకరిగా నాకు సచివాలయం మొదటి కార్యస్థానంగా మారిపోయింది. ప్రతి రోజూ ముందు హాజరు అక్కడే. ఆ తరువాతే రేడియో.
ఎందుకంటే రేడియో వార్తలకి అవసరం అయ్యే అధికారిక సమాచారం యావత్తూ అక్కడే దొరికేది. కాలక్రమంలో గేటు మనిషి నుంచి ముఖ్యమంత్రి వరకు అందరితో ముఖపరిచయాలు. ఎక్కడికయినా గేటు (తలుపు) తోసుకుని వెళ్ళగల చనువూ, వెసులుబాటు, వీటికి తోడు రేడియో విలేకరి అన్న ట్యాగు లైను.
గతంలో ముఖ్యమంత్రుల కార్యాలయం వున్న పాత (హెరిటేజ్) భవనం వెనుకపక్కనే ప్రెస్ రూమ్. విశాలంగా వుండేది. ఒకటి రెండు సోఫాలు, కుర్చీలు. పక్కనే భోషాణం మాదిరి చిన్న చెక్క బీరువా. అందులో ఫోను. ఈ ఫోను కోసమే చాలామంది వచ్చేవాళ్ళు. ఎందుకంటే అది డైరెక్ట్ ఫోను. సచివాలయం టెలిఫోన్ ఆపరేటర్ తో సంబంధం లేకుండా నేరుగా ఫోను చేసి మాట్లాడుకోవచ్చు.
ఆరోజుల్లో చాలామంది సీనియర్ జర్నలిష్టులకు సయితం ఇళ్ళల్లో ఫోన్లు వుండేవి కావు. ఒకరిద్దరికి వున్నా ఆఫీసు బిల్లు కట్టే పద్దతి వుండేది కాదు. అంచేత వార్తా సేకరణకోసం ప్రెస్ రూమ్ ఫోను బాగా పనికి వచ్చేది. పేపర్లవాళ్ల కంటే నాకు బాగా ఉపయోగంగా వుండేది. వాళ్లు వార్త సుదీర్ఘంగా రాయాలి కనుక ఆఫీసులకి వెళ్ళి ఇచ్చేవాళ్ళు. రేడియోకి మూడు ముక్కలాటే కనుక వార్తల టైముకు ముందుగా ఫోను చేసి చెప్పేవాడిని. ప్రెస్ రూములో రేడియో కూడా వుండేది. ఫోనులో చెప్పిన వార్త అప్పటికప్పుడే రేడియోలో రావడం కొంతమందికి ఆశ్చర్యంగా వుండేది.
ప్రెస్ రూములో టీ, కాఫీలు తెచ్చి పెట్టడానికి ఒక అటెండరు.
డెక్కన్ క్రానికల్ కరస్పాండెంట్ సింహం (నరసింహారావు, మాజీ రాష్ట్రపతి వీవీ గిరి గారి మేనల్లుడు) ఒక సోఫాలో నిద్రపోతూ వుండేవారు. కానీ ఆయనది కాకి నిద్ర. చటుక్కున లేచి కూర్చునే వారు. ప్రెస్ మీట్ లో అవతలవాడు మంత్రికానీ, ముఖ్యమంత్రి కానీ ప్రశ్నలతో సింహం మాదిరిగానే విరుచుకు పడేవాడు. ఈనాడు ఎస్. ఎన్. శాస్త్రి గారు, ఆంధ్ర పత్రిక (ముక్కు) శర్మ గారు, హిందూ రెసిడెంట్ ఎడిటర్ రాజేంద్రప్రసాద్, దాసు కేశవరావు, నగేష్ కుమార్, పీ.యస్. సుందరం (ముందు ఆంధ్ర పత్రిక విలేకరి, తరువాత ఇండియన్ ఎక్స్ ప్రెస్ రెసిడెంట్ ఎడిటర్), శ్రీకాంత్ విఠల్, బీ ఎస్ రామకృష్ణ, జాగర్లమూడి రామకృష్ణ, యూఎన్ఐ పార్ధసారధి, పీటీఐ జమాల్, యెన్ ఎస్ ఎస్ లక్ష్మారెడ్డి, కల్యాణి, ఆంధ్ర జ్యోతి వెంకట రావు గారు, ఎన్.ఇన్నయ్య, దామోదరస్వామి, ఉడయవర్లు, వేమూరి రాధా కృష్ణ ( ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ ABN ) ఆంధ్ర ప్రభ నంద్యాల గోపాల్, ఇలా ఎంతో మంది జర్నలిష్టులతో పరిచయాలు బలపడడానికి ప్రెస్ రూమ్ దోహదం చేసింది. జమాల్, కల్యాణి, లక్ష్మారెడ్డి ఎప్పుడూ కలిసి తిరుగుతుండే వారు. వారి పేర్లలో మొదటి అక్షరాలతో వారిని 'జాకాల్' అని ముద్దు పేరు పెట్టి పిలిచేవాళ్ళు. వీళ్ళల్లో కొద్దిమంది మినహా మిగిలిన వాళ్ళు కాలం చేశారు. చాలా కాలం అయింది కాబట్టి కాస్త మతిమరపు సహజం. ఎవరి పేర్లు అయినా మరచిపోతే క్షంతవ్యుణ్ణి. తదనంతర కాలంలో మన ఫేస్ బుక్ మిత్రులు నందిరాజు రాధాకృష్ణ మొదలయిన వారికి పాత ప్రెస్ రూముతో ప్రగాఢ సంబంధం అనేక సంవత్సరాలుగా వుంటూ వస్తోంది. వాళ్ల అనుభవాలు మరింత సుసంపన్నంగా వుంటాయని నా అభిప్రాయం.
అంతా ఒక కుటుంబం మాదిరిగా మధ్యాహ్నం దాకా సచివాలయంలో గడిపి, వార్తలు సేకరించుకుని, తోటి వారితో పంచుకుని, అనుమానాలు వుంటే తీర్చుకుని ఎవరి ఆఫీసులకు వాళ్ళం వెళ్ళేవాళ్ళం.
ఈరోజున చాలామంది అడుగుతుంటారు, 'మీరు యెందుకు మార్నింగ్ వాక్ చేయరు' అని. ఎందుకంటే ఒక జీవితానికి సరిపడా నడక ఆ రోజుల్లో సచివాలయంలోనే నడిచాను కనుక. ఒక బ్లాకు నుంచి మరో బ్లాకుకు, ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి, ఎక్కే మెట్లు, దిగే మెట్లు, నడకే, నడక, పరుగే పరుగు. ఆ రోజుల్లో అన్ని బ్లాకుల్లో తగిన సంఖ్యలో లిఫ్ట్ లు వుండేవి కావు.
పాత సచివాలయం లోని ఓ పాత భవనం మొదటి అంతస్తులో సీఎం పేషీ వుండేది. ఆ భవనాన్ని నిజాం బకింగ్ హాం ప్యాలెస్ నమూనాలో నిర్మించారని చెబుతారు. పక్కనే ఆల్విన్ కంపెనీ తయారుచేసిన విశాలమైన లిఫ్ట్ వుండేది. మొదటి అంతస్తు చేరుకోవడానికి వున్న చెక్క మెట్ల వరుస, ఎర్ర తివాచీ కూడా రాజభవనాన్ని గుర్తుకు తెచ్చే విధంగా వుండేది. దాని రెయిలింగుకు వాడిన కలప ఎంతో ఖరీదయినది. 'మహోగని' అనే అరుదయిన వృక్షజాతికి చెందిన ఆ కలప బంగారం కంటే విలువయినదని చెబుతారు. ఫలక్ నామా ప్రాసాదంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన, అతి పొడవైన భోజనాల బల్ల కూడా ఆ కలపతో తయారైనదే.
ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, ఆయనకూ సచివాలయ ఉద్యోగులకూ నడుమ ఏదో పేచీ వచ్చి అందరూ ఆయన కార్యాలయంపై విరుచుకు పడ్డారు. ఆ సందర్భంలో మెట్లకు అమర్చిన రెయిలింగు దెబ్బతిన్నది. సచివాలయంలో పనిచేసే ఓ పాతకాలపు వడ్రంగి అది చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. 'అయ్యో అది బంగారం కంటే ఖరీదు, వీళ్ళెవ్వరికీ తెలిసినట్టు లేదు' అని వాపోయాడు.
ఇప్పుడా ప్రెస్ రూమే లేదు. మేము నడయాడిన పాత భవనాలు లేవు. సచివాలయంతో మూడు దశాబ్దాల పైచిలుకు అనుబంధం ఇరవై ఏళ్ళ క్రితం పదవీ విరమణ చేసినప్పుడే తెగిపోయింది.
జీతభత్యాల విషయంలో ఈనాటి జర్నలిష్టులకు సాటి రాకున్నా, పోలిక లేకున్నా ఆ రోజుల్లో జర్నలిష్టులుగా పొందిన గౌరవాభిమానాలు మాత్రం వెలకట్టలేనివి. అవే మరపురాని, మరవలేని జ్ఞాపకాలుగా మిగిలాయి.
మేము ఆ రోజుల్లో తిరుగాడిన పాత భవనాలు కూల్చి కొత్తవి నిర్మించారు. మళ్ళీ ఆ మొత్తం సచివాలయం స్థానంలో కేసీఆర్ సరికొత్త సచివాలయాన్ని ఏర్పాటు చేశారు.
ఒకప్పుడు పాత కాలపు జర్నలిస్టులకు సెకండ్ హోం గా వున్న అలనాటి సచివాలయం, కొత్త హంగులు సమకూర్చుకుని, ఇప్పుడు దూరం నుంచి చూసే ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది.
యాభై ఏళ్లలో ఇన్ని మార్పులు కళ్ళారా చూడగలగడమే జీవితం.
కింది ఫోటోలు:
ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు మొదటి సారి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆయన కార్యాలయం వున్న భవనం, పాడుబడి పోయి, కాలక్రమంలో కూల్చివేతకు గురయింది. రెండో ఫోటో: పాత సచివాలయం స్థానంలో ఆధునీకరించిన ఉమ్మడి రాష్ట్ర సచివాలయం
మూడోది ముఖ్యమంత్రి కేసీ ఆర్ హయాములో నిర్మించిన ఈనాటి తెలంగాణా నూతన సచివాలయ భవనం.










(ఇంకా వుంది)

9, జులై 2026, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (338) : భండారు శ్రీనివాసరావు

 

1975 జులై నెలలో ఒక రోజు.
“ఏం ఉద్యోగాలండీ! ఒక ఇల్లు పట్టదు, ఇల్లాలు పట్టదు. నిండు నెలల మనిషిని ఇంట్లో ఒంటరిగా వదిలేసి, నైట్ డ్యూటీలు ఏమిటి చోద్యం కాకపోతే! వెళ్ళండి! వెళ్లి చూడండి, అమెరికన్ ఆస్పత్రిలో రాత్రి మీ ఆవిడ డెలివరీ అయింది. మగపిల్లాడు. అర్ధరాత్రి నొప్పులు వస్తే నేనే తీసుకువెళ్ళాను’ అంటున్నారు మా ఇల్లుగలావిడ రమణి గారు, తెల్లారకముందే మా తలుపు కొట్టి లేపుతూ.
నాకు నిద్ర మత్తు దిగిపోయింది. బెజవాడ బందరు రోడ్డు ఆంధ్రజ్యోతిలో నైట్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి ఇంట్లో మా ఆవిడ నిర్మల కనిపించలేదు. నొప్పులు వచ్చే రోజులు. పక్క ఇంట్లో రమణి గారింట్లో పడుకుందేమో అనుకున్నా. పెద్ద పిల్లాడు సందీప్ ని దాదాపు వాళ్ళే పెంచుతున్నారు, నెలలు నిండిన మా ఆవిడకు కాస్త ఉపశమనంగా వుంటుందని. రమణి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు. వాళ్ళూ చిన్నవాళ్లే! అంచేత, రెండేళ్ల ఈడువాడయిన సందీప్ ని బాగా ముద్దు చేసేవాళ్ళు. ఎక్కువసేపు వాళ్ళ ఇంట్లోనే వుండేవాడు. వాళ్లకు ఒక పెద్ద ఆల్సేషియన్ కుక్క వుండేది. వాడికి బెస్ట్ ఫ్రెండ్.
లేచి హడావిడిగా తయారై రిక్షా చేసుకుని అమెరికన్ ఆసుపత్రికి వెళ్లాను. జనరల్ వార్డులో ఒక మంచం మీద పడుకుని వుంది. నన్ను చూసి నీరసంగా నవ్వింది. కళ్ళతోనే సైగ చేసి చూపించింది, పక్కన బొద్దుగా వున్న పసివాడిని. ‘అయ్యో మళ్ళీ మగపిల్లవాడేనా!’ అనబోయి తమాయించుకున్నాను. ఒక మగ, ఒక ఆడపిల్ల అయితే చాలనుకున్నాము. మా ఇద్దరికీ ఆడపిల్లలంటే ఇష్టం. కానీ దైవ నిర్ణయం వేరేగా వుంది.
సండేనాడు పుట్టాడు కనుక పెద్ద వాడిని సందీప్ అనే పీరుతో పిలిచేవాడిని. ప్రత్యేకంగా బారసాలలు, నామకరణాలు లేవు. మా పెళ్ళే గుళ్ళో పెళ్లి. ఇక ఇలాంటి వేడుకలకు ఆస్కారమే లేదు.
ఎప్పుడూ ఆనందంగా వుండాలనే నా ఫిలాసఫీకి అనుగుణంగా రెండో వాడికి సంతోష్ అనే పేరు పెట్టాను. ఈ పేర్ల విషయంలో ఎలాంటి పట్టింపులు పెట్టుకోలేదు. ఎవరినీ సంప్రదించలేదు. జాతకాలు రాయించలేదు.
రెండో వాడు పుట్టిన తర్వాత కొన్ని నెలలకే నాకు హైదరాబాదు ఆలిండియా రేడియోలో ఉద్యోగం వచ్చింది.
పెట్టే బేడా సర్దుకుని హైదరాబాదు చేరాము. అప్పటికే మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు స్టేట్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ గా అక్కడ పనిచేస్తున్నారు. అశోక్ నగర్ లో బ్యాంకు వాళ్ళు ఇచ్చిన ఒక పెద్ద ఇంట్లో వుంటున్నారు. మాకు ఇల్లు దొరికేంతవరకు వాళ్ళింట్లోనే మా మకాము. వాళ్లకి అందరూ మగపిల్లలు. జవహర్, సుభాష్, లాల్ బహదూర్, రాజేంద్ర ప్రసాద్. జాతీయ నాయకుల పేర్లు. వీళ్ళకి తోడు మా ఇద్దరు పిల్లలు. ఇల్లు ఎప్పుడు సందడి సందడిగా వుండేది.
తర్వాత చిక్కడ పల్లి త్యాగరాయ గానసభ సభ దగ్గర మాకు ఓ రెండు గదుల వాటా అద్దెకు దొరికింది. అక్కడికి మారిపోయాము.
పిల్లల్ని కొంచెం దగ్గరలో వున్న సెంట్ ఆంథోనీ స్కూల్లో చేర్పించాము. డొనేషన్ అడగకుండా రేడియోలో నా ఉద్యోగం పనికొచ్చింది. అయితే ఒక విషయంలో నాకూ స్కూలు వాళ్లకు చిన్న పేచీ వచ్చింది. దరఖాస్తు పత్రంలో కులం అనే కాలమ్ నింపడానికి నేను సుతారమూ ఒప్పుకోలేదు. చివరికి ప్రిన్సిపాల్ గ్రెగరీ రెడ్డి గారే ఒక మెట్టు దిగి అడ్మిషన్ ఇచ్చారు. స్కూలు స్థాయి నుంచే మా పిల్లలు తమ కులం ఏదో తెలియకుండా పెరిగారు.
మాస్కోలో నా ఉద్యోగం నాకు ఎందుకు పనికిరాకపోయినా పిల్లలు ఇద్దరికీ కలిసి వచ్చింది. ఒక అంతర్జాతీయ వాతావరణంలో ఎదగడం జీవితంలో ఎదుగుదలకు వారికి బాగా తోడ్పడింది. పెద్ద గొప్ప డిగ్రీలు లేకపోయినా మంచి ఉద్యోగాలే సంపాదించుకున్నారు. వారి నెల జీతాలతో పోలిస్తే నా ఏడాది జీతం చాలా తక్కువ.
పెద్దవాడు సందీప్ కి పెళ్లి కాగానే ఇన్ఫో సిస్ లో ఉద్యోగం వచ్చింది. వాళ్లది ప్రేమ వివాహమే. కంపెనీ వాళ్ళే అమెరికా పంపించారు.
రెండో వాడు సంతోష్ కూడా పుణేలో ఒక మంచి ఎం ఎన్ సీ లో ఉద్యోగం. కానీ ఒక చట్రంలో ఇమిడే రకం కాదు. ఏదో చేయాలని, ఏదేదో సాధించాలని తాపత్రయం.
బంగారం లాంటి ఉద్యోగం వదిలిపెట్టి హైదరాబాదులో మై ఆఫీసు డాట్ కాం అనే కంపెనీ పెట్టాడు. స్నేహితులే సాయం చేశారు. నేను ఒక్క రూపాయి ఇవ్వలేదు, ఇవ్వడానికి నా దగ్గర ఏమైనా ఉంటేగా. ‘అమ్మా! నాన్న నా ప్రయత్నానికి అడ్డు చెప్పలేదు, అదే ఆయన నాకు చేసిన సాయం’ అనేవారు వాళ్ళ అమ్మతో.
అనుకూలమైన భార్య వచ్చింది. అదే వాడి అదృష్టం. వాడి పెళ్లి కూడా వాడి ఇష్టం ప్రకారమే జరిగింది. మా పనల్లా ఎందుకు ఇలా చేశారు అని కోపడి అక్షింతలు వేయకుండా, ఆశీర్వదించి నెత్తి మీద అక్షింతలు వేయడమే. మా పెళ్లి కూడా అలా జరిగిందే కదా!
పిల్లలిద్దరికీ నా చేతిలో వున్నది కూడా చేయలేకపోయాను. అయినా వాళ్ళు తమంతట తాము పైకి వచ్చారు, ఎప్పుడు నా మీద ఎలాంటి నెపం మోపకుండా. తల్లి చనిపోయినప్పుడు కూడా వాళ్ళే యావత్తు భారం మోశారు. నేను నిమిత్తమాత్రుడిగా మౌనంగా చూస్తూ వుండి పోయాను.
రెండోవాడికి వాళ్ళ అమ్మ అంటే అపరితమైన ప్రేమ. మా కాపురంలో ఆర్ధికంగా ఎన్ని బాధలు పడిందీ కళ్ళారా చూసాడు.
‘చూస్తుండు, ఒకనాడు నువ్వు మహారాణీలా వుండేలా చూస్తాను’ అనే వాడు.
బహుశా ఇక్కడ చేయలేనిది స్వర్గంలో చేసి చూపిద్దామని అనుకున్నాడేమో, తల్లి చనిపోయిన కొన్నేళ్ళకే, వాడూ అక్కడికే వెళ్ళిపోయాడు.
దేవుడికి మాత్రం తెలియదా తనకు దగ్గరి వారెవ్వరో! అందుకే వాళ్ళిద్దరినీ తన దగ్గరకు చేర్చుకున్నాడు.
“సంతోష్! నువ్వూ అమ్మా ఇద్దరూ ఒకే తేదీన పుట్టారు. తను ఫిబ్రవరి తొమ్మిది, నువ్వు జులై తొమ్మిది. చెట్టంత పెరిగి చల్లగా చూసుకుంటావని కన్న కలలు కల్లలు అయ్యాయి. అయినా నీ చేతిలో ఏముంది?
“ఈరోజు, జులై తొమ్మిది. నీ పుట్టినరోజు. నీకు శుభాకాంక్షలు. నువ్వు ఎక్కడ వున్నావో తెలియదు కానీ, అక్కడినుంచే నీ చిన్నారి ముద్దులపట్టి జీవికను ఆశీర్వదించు. నీ ఫోటో చూడగానే నాన్న, నాన్న అంటుంది.
“నువ్వెలా మరచిపోతావ్!”








(ఇంకావుంది)

4, జులై 2026, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (337 ) : భండారు శ్రీనివాసరావు

 

 

వైట్ హౌస్

 

ఈ మధ్య టీవీ 9 మేనేజింగ్ ఎడిటర్ శ్రీ రజనీకాంత్,  అమెరికా ప్రెసిడెంట్ నివాస భవనం వైట్ హౌస్  విశేషాలను వివరిస్తున్న ఒక వీడియో సాంఘిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వైట్ హౌస్ ప్రాంగణ ప్రవేశం అంత దుర్బేధ్యమైన పనేమీ కాదు. ఇక వైట్ హౌస్ ప్రవేశం అంటారా అది అంత సులభం కాదు, అలాగని అంత కష్టం కూడా కాదు. ముందుగా అనుమతి తీసుకుంటే ఇది సాధ్యమే.

 

నిరుడు ఇదే సమయంలో అమెరికా వెళ్ళినప్పుడు వైట్ హోస్ ని అతి దగ్గరగా చూడగలిగాము. ఆ ప్రాంగణంలో స్వేచ్ఛగా తిరిగాము. ఫోటోలు తీసుకున్నాము. అక్కడ ఎవరూ మీరెవరు అని అడిగిన వాళ్ళు కనిపించలేదు. సీక్రెట్ కెమెరాలు వున్నాయేమో,  సీక్రెట్ పోలీసులు మఫ్టీలో వున్నారేమో తెలియదు. తెలిసిందల్లా అణువణువునా శోధనలు లేవు.  తనిఖీలులేవు. ఎటు తిరిగినా వద్దన్న వాడు లేడు. అడ్డగించిన వాడు లేడు. ఇది నిజమా! మీరు వెళ్ళింది నిజంగా వైట్ హౌస్ కేనా అనే సందేహాలు రావడం సహజం. కానీ ఇది స్వానుభవం. ఎప్పటిదో కాదు, నిరుటి అనుభవమే.  

  

ఆ కధా కదన మెట్టిదనిన.

 

నేను, నా పెద్ద కుమారుడు సందీప్ సియాటిల్ నుంచి బయలుదేరి సాల్ట్ లేక్ సిటీ మీదుగా రాత్రంతా విమానంలో ప్రయాణం చేసి బాల్టిమోర్ ఎయిర్పోర్ట్ చేరుకునే సరికి ఉదయం ఆరుగంటలు. మా మూడో అన్నయ్య కుమారుడు సత్య సాయి వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకు వెళ్ళాడు. రాత్రి నిద్ర బాకీ మొత్తం బుధవారం పగటి వేళ తీర్చుకున్నాము.


ఎందుకంటే మర్నాడు గురువారం, ఆ మర్నాడు శుక్రవారం రెండు రోజులు  హెక్టిక్ స్కెడ్యూలు. మా అన్నయ్య పిల్లలు అమెరికాలో వుండడం వల్ల నా ప్రయాణం నల్లేరు మీద బండిలా సాగుతోంది.
ఒకరకంగా చెప్పాలి అంటే గవర్నర్ గారి పర్యటన మాదిరిగా వుంది. అన్నీ ఎరెంజ్ చేసి కారూ, విమానమూ ఎక్కమంటారు.



గురువారం అంతా అమెరికా రాజధాని వాషింగ్టన్ డీ సీ అంతా కలయ తిరిగాము. Nations' most famous address వైట్ హౌస్ మా ప్రియారిటీ.

సెక్యూరిటీ హడావిడి వుంటుందని అనుకుంటూ వెడితే అక్కడ ముగ్గురు నలుగురు సాయుధ పోలీసులు మాత్రమే కనిపించారు. కనిపించారు కానీ, లోపలకు వెడుతున్న మమ్మల్ని ఎవరు మీరు అని తనిఖీలు చేయలేదు. కనీసం గుర్తింపు కార్డులు చూపించమని కూడా అడగలేదు. సెక్యూరిటీ చెక్ ద్వారాలు లేవు.  ముందుగా ఆన్ లైన్లో బుక్ చేసుకుంటే విజిటర్లను లోపలకు కూడా అనుమతించే ఏర్పాటు వుందట.

విచిత్రం ఏమిటంటే వైట్ హౌస్ కు వెళ్ళే మార్గంలో, దానికి కూతవేటు దూరంలో పేవ్ మెంట్ మీద ఇద్దరు బిచ్చగాళ్లు (హోం లెస్) కనిపించారు. అదే దోవలో దారి పక్కన టోపీలు, టీ షర్టులు అమ్ముకుంటున్న వాళ్ళు కనిపించారు.

అమెరికా పార్లమెంట్, లింకన్ మెమోరియల్, వాషింగ్ టన్ మెమోరియల్ (ఎత్తైన స్థూపం) చూసాము. ఎటు తిరిగినా, ఏమి చేసినా, ఫోటోలు తీసుకుంటున్నా, అక్కడ అడిగేవాళ్ళు, అభ్యంతర పెట్టేవాళ్ళు ఎవరూ లేకపోవడం చిత్రంగా అనిపించింది. అటకాయించే భద్రతా సిబ్బంది మాకు కనబడలేదు.

అమెరికా రాజధానిలో మేము చూసినంత మేరకు , పెద్ద పెద్ద భవనాలు వున్నాయి కానీ, ఆకాశ హర్మ్యాలు కానరాలేదు. దానికి కారణం అడిగితే, వాషింగ్ టన్ మెమోరియల్ స్థూపం కంటే మించి ఎత్తైన భవనాలు నిర్మించరాదని చట్టం వుందని చెబుతారు.

తోకటపా:

వైట్ హౌస్ పైన ఎగురుతున్న అమెరికన్ జాతీయ పతాకం కిందనే నలుపు తెలుపులో మరో జెండా ఎగురుతుంటుంది. యుద్ధాల్లో మరణించిన లేదా ఆచూకీ తెలియకుండా పోయిన అమెరికన్ సైనికుల స్మృత్యర్ధం రూపొందించిన పతాకం అది.
















(ఇంకా వుంది)

3, జులై 2026, శుక్రవారం

ఇదెక్కడి గోల? – భండారు శ్రీనివాసరావు

 

ఉన్నది పోతుందన్న బెదురుతో

అనుకున్నది రాదేమో అన్న అదురుతో

కొట్టుకుంటూ తిట్టుకుంటూ

కొండ కెక్కేవాళ్లము

మీ అండకోరే వాళ్ళము”

ఇదీ ఈనాటి అన్ని అర్హతలు కలిగిన సాధారణ ఓటరు పరిస్థితి” అని సూత్రీకరించాడు ఒకాయన.  

ఇక్కడ మామూలు ఓటరు అంటే నేను కాదు. కంప్యూటర్స్ లో ప్రావీణ్యం వున్న వాళ్ళు కాదు. చదువుకున్న వాళ్ళు కాదు. చదువు లేని వాళ్ళు కాదు. ఇరవై నాలుగేళ్ల క్రితం  2002 లో తాము   నియోజకవర్గంలో, ఏ పోలింగ్ స్టేషన్ లో, ఏ నెంబరు బూతులో ఓటు వేశామో అనే విషయంలో కనీస పరిజానం పరిజ్ఞానం లేని వాళ్ళు వీళ్ళు.  అది ఎలా తెలుసుకోవాలో తెలియని వాళ్ళు. అయినా వాళ్ళు ఓటు వేసే వయసు నుంచీ ఓటు వేయడం తమ కర్తవ్యంగా పాటిస్తున్న వాళ్ళు. కానీ ఏమి లాభం?

గత ఇరవై నాలుగేళ్ళలో భౌగోళిక స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఊహాతీతంగా, సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందింది.  రాష్ట్రాల విభజన జరిగింది. నియోజక వర్గాలు మారాయి. పోలింగ్ స్టేషన్ల పేర్లు, పోలింగ్ బూత్ ల నెంబర్లు మారాయి.

మొత్తం ఓటర్లలో ఆయా రాజకీయ పార్టీల ఓటర్లు ఇరవై నుంచి నలభయ్ శాతం వుంటారు. అభిమానులు మరో పది శాతం వుంటారు. అసలు ఓటు జోలికే పోని నిర్లిప్త జనం మరో పది శాతం వుంటారు. మరి,  మరో ముప్పయి శాతం మంది రాజకీయ రంగు, సొంటు లేని వాళ్ళు వుంటారు. కానీ ఓటు హక్కు అంటే వారికి  అపరిమితమైన ప్రేమ. అది లేకపోతే తాము చనిపోయినట్టే, జనాభా లెక్కల్లో లేనట్టే అని బాధ పడే రకం.

వీళ్ళే ముందు చెప్పిన :

ఉన్నది పోతుందన్న బెదురుతో

అనుకున్నది రాదేమో అన్న అదురుతో

కొట్టుకుంటూ తిట్టుకుంటూ

కొండ కెక్కేవాళ్లము

మీ అండకోరే వాళ్ళము”

అర్ధం అయిందా ప్రభువులూ!

ఏ సంస్కరణ తీసుకువచ్చినా దాన్ని సామాన్యుల కోణంలో ఆలోచించి రూపొందించాలి.

అప్పుడే ఆ సంస్కరణలు బహుళ జనామోదం పొందుతాయి.  

అయాం ఎ బిగ్ జీరో : (336) : భండారు శ్రీనివాసరావు

 

మా ఊరి ‘శ్రీమంతుడు’
ఏడాదికి ఒకసారైనా మా సొంతూరు కంభంపాడుకు పిల్లాజెల్లా అందరం కట్టగట్టుకుని పొలోమని వెళ్ళేది, అరకొరగా మిగిలివున్న సొంత ఆస్తుల అజమాయిషీ కోసం కాదు, మా కుటుంబంలో మిగిలి ఉన్న ఆత్మీయతలు, ఆప్యాయతలు రుచి చూడడం కోసం.
మాకు జన్మ ఇచ్చిన అమ్మా నాన్నల సంస్మరణార్థం మా మూడో అన్నయ్య ( కీర్తిశేషులు భండారు వేంకటేశ్వర రావు) నిర్మించిన అమ్మా నాన్నల గుడి (అమ్మపర్తి) ని సందర్శించి మాతా పితరులకు నివాళి అర్పించడం కోసం.
బతికి వున్నప్పుడు భారంగా నడిచేకాలం అదేమిటో చనిపోయిన తరువాత పరుగులే పరుగులు.
కింది ఫోటోలో వున్న గుడిలో వున్నది దేవుళ్ళూ దేవతలూ కాదు, మా ఇలవేలుపులు, మా అమ్మా నాన్నలు.
మా నాన్నగారు భండారు రాఘవ రావు నా చిన్నతనంలోనే చనిపోయారు. మా అమ్మగారు వెంకట్రావమ్మ చనిపోయి దాదాపు ముప్పయి యేళ్ళు దాటిపోయాయి.
1993 లో మా అమ్మ హైదరాబాదులో చనిపోయినప్పుడు మొత్తం కర్మ కాండ యావత్తూ, ఇంటిల్లిపాదిమీ కాశీ వెళ్లి అక్కడ జరిపించాము. అది మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారి అభీష్టం మేరకు జరిగింది.
మొదటి మాసికం మా స్వగ్రామం కంభంపాడులో. అప్పటికల్లా, మా మూడో అన్నయ్య భండారు వెంకటేశ్వర రావు ఎంతో శ్రద్ధ తీసుకుని ‘అమ్మా నాన్న’గుడి కట్టించాడు.
కాశీలో కర్మ కాండకు కర్త అయిన మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారూ, తలితండ్రులకు గుడి కట్టించిన మా మూడో అన్నయ్య వెంకటేశ్వరరావు ఇద్దరూ ఇప్పుడు లేరు. వారి స్మారక చిహ్నాలు కూడా ఈ గుడి పక్కనే వున్నాయి.
మూడు దశాబ్దాల నాటి ఈ దేవాలయాన్ని మా మూడో అన్నయ్య కుమారులు రఘు, రమేష్, సత్యసాయి ఇటీవల మళ్ళీ తీర్చిదిద్దారు.
మా ఊరు కంభంపాడు అనేది ఇక పాస్ పోర్టులో ప్లేస్ ఆఫ్ బర్త్ కాలం కు పరిమితమయిపోతుందేమో అని ఒక్కోసారి భయం వేస్తుంటుంది. ఒకప్పుడు అమ్మా నాన్నల అబ్దీకాలకోసం ఏడాదికి రెండు సార్లు అయినా సొంతూరుకు వెళ్లి వచ్చేవాళ్ళం. మా మూడో అన్నయ్య పోయిన తరువాత తద్దినాలు కూడా హైదరాబాదుకే మారిపోయాయి.
ఈ నేపధ్యంలో ఇంగ్లండులో (ప్రస్తుతం అమెరికాలో) ఉంటున్న మా అన్నయ్య కుమారుడు సత్యసాయి, ఏడాదికోసారి, సంక్రాంతి నాడు హైదరాబాదులో స్థిరపడిన మా కుటుంబాలను కంభంపాడు రప్పించే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ కార్యక్రమానికి వాడు కర్త అయినప్పటికీ, వాడి సోదరులు రఘు, రమేశ్ ఇద్దరూ కర్మా, క్రియలు.
ఈ విధంగా అయినా ఏడాదికోమారు సొంతూరు చూసే అవకాశం కలుగుతోంది. ఒకసారి అలా వెళ్ళినప్పుడు పరిచయం అయిన వ్యక్తి మా ఊరి ‘శ్రీమంతుడు’.
వీరి పేరు చావా నరసింహారావు. మా చిన్నప్పుడు ఈ పేరుతోనే నాకో క్లాస్ మేట్ ఉండేవాడు. కనుక్కుంటే అతడూ, ఈయనా ఒకరు కారని తేలింది. పిల్లలు ఖమ్మంలో ఏదో వ్యాపారంలో బాగానే స్థిరపడ్డారు. ఈ నరసింహారావు మాత్రం ఊళ్లోనే వుండిపోయి, వ్యవసాయం చేసుకుంటున్నాడు. కష్టపడే తత్వం, నిరాడంబర జీవనం వల్ల నాలుగు రాళ్ళు వెనకేసుకోగలిగారు. అయినా ఊరికి ఏదైనా చేయాలని తపన. లక్షలు ఖర్చు పెట్టి ఊరిలో రామాలయాన్ని కట్టించారు. మేము చదువుకున్న బడి ఇప్పుడు హైస్కూలు అయింది. వేరే ప్రాధమిక పాఠశాల మంజూరు అయితే దానికి ఒక చక్కటి భవనం కట్టి పెట్టారు. ఆ మధ్య వానలకు మా అన్నయ్య ఎప్పుడో కట్టించిన గ్రామ కచ్చేరీ దెబ్బతింటే, దానిని సొంత డబ్బులతో పునరుద్ధరించే కార్యక్రమం నెత్తికి ఎత్తుకున్నారు. ఊళ్ళో టెలి మెడిసిన్ సెంటర్ పెట్టాలని ఓ స్వచ్చంద సంస్థ ముందుకు వస్తే వారికి కావలసినవన్నీ అమర్చి పెట్టడానికి సిద్ధం అంటూ ఈయన ముందే సిద్ధం అయిపోయారు. ఇవన్నీ బాగా డబ్బులు వుండి చేస్తున్న పనులు కావు. సొంత ఖర్చులు తగ్గించుకుని చేస్తున్న వితరణలు.
నిజమైన ‘శ్రీమంతుడు’ చావా నరసింహారావు గారు. సందేహం లేదు.
కింది ఫోటోలు:
అమ్మా నాన్నల గుడి, మా ఊరి శ్రీమంతుడు శ్రీ చావా నరసింహా రావు








(ఇంకావుంది)

30, జూన్ 2026, మంగళవారం

చేసేవారిని చేయనిస్తే పనులు అవుతాయి - భండారు శ్రీనివాసరావు

 

“మీ ఇంటికి ఎలా రావాలి”
నిన్న ఉదయం తొమ్మిది గంటల నుంచీ ఎదురు చూస్తున్న కాల్ మధ్యాన్నం పన్నెండు గంటలకు వచ్చింది.
“మీరు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర వున్నాను అని చెప్పారు కదా! ఎన్టీఆర్ విగ్రహం చేయి ఎటు చూపెడుతున్నదో అటు చూడండి. ఆర్బీఐ క్వార్టర్స్ కనబడతాయి. నడిచి వస్తే నాలుగు నిమిషాలు. మోటార్ సైకిల్ అయితే నిమిషం కూడా పట్టదు. మా ఇంటిని ఆనుకుని హనుమాన్ మందిర్. అదే కొండ గుర్తు”
ఇంత చెప్పినా అరగంట తర్వాత వచ్చాడు, రెండు చేతుల్లో రెండు సంచులు మోసుకుంటూ.
ఎండనపడి వచ్చాడు, కూల్ డ్రింక్ తీసుకోండని కోక్ క్యాన్ ముందు పెడితే, గొంతు నొప్పి వద్దని మర్యాదగానే తిరస్కరించాడు.
నా ఎపిక్ నెంబరు చెప్పగానే, అతడు తన మొబైల్ ఆన్ చేసి చెక్ చేయబోతుండగానే ఏదో కాల్ వచ్చింది. అది ఎటెండ్ అవగానే మరో కాల్. ఇలా పదిహేను నిమిషాలు వస్తున్న కాల్స్ మాట్లాడడంతోనే అతడికి సరిపోయింది.
“చూశారు కదా! ఈ కాల్స్ అన్నీ మీలాంటి ఓటర్ల నుంచే. ఎక్కే గడప. దిగే గడప. పొద్దున్న అనగా బయలుదేరాను. ఇప్పటికి మూడిళ్లు కూడా కవర్ చేయలేదు” చెబుతుండగానే సెల్ మోగింది.
“దగ్గరలోనే పలానా చోట వున్నాను” అంటూ మా అపార్ట్ మెంటు పేరు చెప్పాడు. “మా పై అధికారి. నేను పని చేస్తున్నానో లేదో అని చెక్”
అసలు నా ఓటు సంగతి ఏమిటో తేలక ముందే, ఆ పైఅధికారి మరో వ్యక్తిని వెంటబెట్టుకుని మా ఇంటికి వచ్చాడు. వెంట వచ్చిన వ్యక్తి కెమేరాతో మా అందర్నీ ఫోటోలు తీశాడు. బహుశా అప్ లోడ్ కూడా చేసి వుంటాడు, పని చేస్తున్నట్టు గుర్తుగా,
పై అధికారి, కింది అధికారి చేతికి ఒక జాబితా ఇచ్చి, “ఇంకా ఇన్ని పెండింగు వున్నాయి, ఎప్పటికి తెమలాలి ఇవన్నీ” గదమాయింపుగా అన్నాడు. ఈ లోగా ఆ పై అధికారికి ఆయన పై అధికారి ఫోన్ చేసి రివ్యూ మీటింగ్ వుంది వెంటనే రమ్మన్నాడు.
వాళ్ళు పోగానే, ముందు వచ్చిన చిన్న అధికారి కూడా, నా చేతిలో రెండు కాగితాలు పెట్టి “ఇవి పూర్తి చేసి వుంచండి, మూడు రోజుల తర్వాత వచ్చి తీసుకుంటాను” అన్నాడు తన సంచులు సర్దుకుంటూ.
“మరి ఫోటో సంగతి” అంటే, “బ్లాక్ అండ్ వైట్ ఫోటో బాగానే వుంది కదా! ఫోటో సరిగ్గా లేకపోతేనే కొత్త ఫోటో” అంటూ హడావిడిగా సంచులు చేతిలో పట్టుకున్నాడు, ‘మరి, మా కోడలు సంగతి’ అంటే, ‘మరోసారి’, అంటూ బయట పడ్డాడు.
అతడు మునిసిపల్ పారిశుధ్య సిబ్బందిపై అజమాయిషీ చేసే సూపర్ వైజర్. అమీర్ పేట నుంచి కృష్ణా నగర్ వరకు తిరగాలి.
దాదాపు నలభయ్ నిమిషాలకు పైగా వున్నారు. ఫోన్లకు జవాబు చెప్పడమే వాళ్లకు సరిపోయింది. ఈ లెక్కన ఈ యజ్ఞం ఎప్పుడు తెల్లారేనో! వాళ్ళ కోసం మా వాచ్ మన్ తో తెప్పించి తయారు చేయించిన గ్రీన్ టీ కప్పులు టేబుల్ మీద అలాగే చల్లారి పోయి కనిపించాయి.
వాళ్ళు వెళ్ళిన తర్వాత, ఆ కాగితాలు తీరిగ్గా తీసి చూసాను.
రెండూ నావే. పై భాగంలో నా నలుపు తెలుపు ఫోటో( నా వోటరు కార్డు మీద వున్నదే) కొన్ని వివరాలు, నా చిరునామా, నియోజకవర్గం పేరు, పార్ట్ నెంబరు మొదలైనవి వున్నాయి.
ఒకసారితో అయిపోతుంది, అనుకుంటే మరోసారి అన్నమాట.
కానీ వాళ్ళు పడుతున్న పాట్లు చూస్తుంటే జాలి వేసింది. వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితాలు వస్తే అంతకంటే కావాల్సింది ఏముంది? ఇది మా పని కాదు అని మొరాయించకుండా పని చేస్తున్నారు. సంతోషించాలి.
కాసేపు వాళ్ళతో తీరిగ్గా మాట్లాడి, విషయాలు రాబట్టి, నలుగురికి పనికొచ్చే సంగతులు ఏమైనా రాద్దామని అనుకున్నా. మా ఇంటికి వచ్చిన వాళ్ళతో ఫోటోలు కూడా దిగాను, నాలుగు మంచి ముక్కలు రాద్దామని. అసలు నా పనే పూర్తిగా పూర్తయిందో లేదో తెలియదు.
కానీ వాళ్ళ పేర్లు, ఫోటోలు గోప్యంగా ఉంచడమే మంచిది అని ఇప్పుడు అనిపిస్తోంది.
మూడు రోజుల్లో మళ్ళీ వచ్చి పూర్తి చేసిన ఫారం తీసుకుపోతానని చెప్పాడు. పని ఒత్తిడి చూస్తుంటే, ఈ కాగితాలు మా ఇంట్లో ఎన్నాళ్ళు నిద్ర చేయాలో ఏమిటో!



(30-06-2026)