నేనొక సింహాన్ని.
అప్పటికి అపోలో హాస్పిటల్ హైదరాబాద్ లో కట్టలేదు. తగిన భూమి కేటాయింపు కోసం, ఆ హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి గారు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నడుమ చర్చలు జరుగుతున్నాయి. ఆ నాటికి అపోలో హాస్పిటల్ ఒక్క మద్రాసు (చెన్నై) లోనే వుండేది. దాని బ్రాంచి ఒకటి హైదరాబాదు హైదర్ గూడాలో పెట్టిన రెడ్డి గారికి దాన్ని మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ గా అంతర్జాతీయ ప్రమాణాలతో విస్తరించాలని ఆలోచన. అప్పుడు ముఖ్యమంత్రి కీర్తిశేషులు శ్రీ టి. అంజయ్య, అప్పటికి హైదరాబాదులో అన్నీ నర్సింగ్ హోం లే తప్ప కార్పొరేట్ తరహా హాస్పిటల్స్ లేవు. ఆ మొట్టమొదటిది తనది కావాలని ప్రతాప సి రెడ్డి గారి ఆకాంక్ష. దాన్ని నెరవేర్చుకోవడం కోసం విశాలమైన ప్రభుత్వ భూమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
అదే సమయంలో గన్నవరం రాయుడు గారు అనే ఒక పెద్ద భూస్వామితో కలిసి మా మామగారు పెనుమర్తి గోపాల రావు గారు గుంటూరులో ఏదో పరిశ్రమ స్థాపన కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒక్కగానొక్క కుమార్తె తన ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండా తిరుపతిలో ప్రేమ వివాహం చేసుకుంది అనే ఒక బాధ ఆయన అంతరాంతాల్లో గూడుకట్టుకుని వుంది. ఆ కారణంగా మా మధ్య పెద్దగా రాకపోకలు లేవు.
ఆ రోజుల్లో ఎవరైనా మా ఆఫీసుకు ( న్యూస్ రూమ్, రేడియో) వచ్చి మా న్యూస్ ఎడిటర్ నర్రావుల సుబ్బారావు గారిని నా గురించి వాకబు చేస్తే ఆయన అనే మాట చాలామంది తర్వాత నాకు చెప్పేవారు. అదేమిటంటే, ‘శ్రీనివాసరావు ఇక్కడ ఎందుకు ఉంటాడు, అంజయ్య (ముఖ్యమంత్రి) జేబులో వుంటాడు’ అని. ఆయన హాస్యోక్తిగా అన్నప్పటికీ అది కొంత నిజం. రోజులో చాలా భాగం నా మకాం ముఖ్యమంత్రి కార్యాలయంలోనే. ఓ గంట నేను కనబడకపోతే శ్రీనివాస్ ఎక్కడ అని ఆరా తీసేవారు.
ఆ విధంగా ఆ రోజుల్లో నేను అంజయ్య గారి ఆఫీసులో, ఆయనతో మాటా మంతీ సాగిస్తున్న సమయంలో సూటూ బూటూ వేసుకున్న పెద్దాయన ఒకరు లోపలకు వచ్చారు. అప్పటికే ఆయన్ని చాలా సార్లు లోగడ కలిశారేమో తెలియదు, ముఖ్యమంత్రి ఆయన్ని గుర్తుపట్టి ‘రండి కూర్చోండి రెడ్డి గారు’ అని మర్యాద చేశారు. నేను లేచి బయటకు వెళ్లబోతుంటే ఆయన కూచోమని సైగ చేస్తూ, అంతకుముందు మాటామంతీలో నేను ప్రస్తావించిన విషయం గుర్తు పెట్టుకున్నారల్లె వుంది, అంజయ్య గారు ఆయనతో మరో మాట లేకుండా, ‘చూడండి రెడ్డి సాబ్, ఈయన శ్రీనివాస్. ఆలిండియా రేడియో మనిషి, నాకు బాగా కావాల్సిన వాడు, ఏదైనా మీనుంచి అయ్యే సాయం తప్పకుండా చేయండి’ అనేశారు. అంజయ్య గారి సహృదయత అలాంటిది.
అసలు విషయం ఏమిటంటే గుంటూరులో వ్యాపారం నిమిత్తం వుంటున్న మా మామగారికి కేన్సర్ వ్యాధి సోకింది. హైదరాబాదు రెడ్ హిల్స్ లో ఉన్న కేన్సర్ హాస్పిటల్ లో చికిత్స చేయించాలి.
ఆ రోజు ఎదురుగా డాక్టరు ప్రతాపరెడ్డి గారు కనిపించేసరికి అంజయ్య గారికి ఈ విషయం గుర్తుకు వచ్చి ఆయనతో అనేసారు. నిజానికి రెడ్డి గారికి మద్రాసులో సొంత హాస్పిటల్ వుంది కాని అందులో కేన్సర్ విభాగం లేదు. అయినా ప్రతాప రెడ్డి గారు ‘మీరు పేషెంట్ ని తీసుకుని మద్రాసు వచ్చి నన్ను కలవండి, అడయార్ కేన్సర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తాను’ అన్నారు తన విజిటింగ్ కార్డు తీసి నాకు ఇస్తూ.
ఆ మాట ప్రకారమే, నేను మా ఆవిడ పిల్లలను తీసుకుని రైల్లో మద్రాసు వెళ్లాను. మా మామగారి చిన్న తమ్ముడు లక్ష్మీపతి గారు, పిన్నివసుంధర గారు మద్రాసులో వుంటున్నారు. వారి ఇంట్లోనే దిగాము.
మర్నాడు వెళ్లి ప్రతాప్ రెడ్డి గారిని కలిస్తే ఆయన గుర్తుపట్టి, వెంటనే అడయారు ఆసుపత్రిలో తనకు తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడి, అక్కడ అడ్మిషన్ ఇప్పించారు. అదీ ఆయనతో నా మొదటి పరిచయం.
అడయార్ ఆసుపత్రి వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, కానీ అప్పటికే వ్యాధి బాగా ముదిరిపోయింది. కొద్ది రోజుల తర్వాత ‘లాభం లేదు, తీసుకు వెళ్ళండి’ అనేసారు.
అమ్మఒడిని, పిల్లల్ని వదిలేసి వచ్చినందువల్ల అప్పటికే మా ఆవిడ హైదరాబాదు వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో కేన్సర్ రోగులకు, సహాయకుడికి విమానాల్లో సగం రాయితీ వుండేది. రైలు చార్జీ కంటే తక్కువలోనే మేమిద్దరం విమానంలో హైదరాబాదు చేరాము.
‘సరైన చదువు సంధ్యాలేదు, ఒక మాదిరి ఉద్యోగం సద్యోగం లేదు ఇలాంటి వాడికి పిల్లను ఎలా ఇవ్వాలి?’ అనే భావన ఆయనలో వుందో లేదో తెలియదు కానీ, ఇవన్నీ చూసిన తర్వాత జీవితపు మలి సంధ్య వేళ ఆయన మోములో ‘పర్వాలేదు, అల్లుడు గట్టివాడే' అనే తెరిపిడి కనిపించింది. ఇదంతా నేను పనిచేస్తున్న రేడియో మహత్యం అని ఆయనకు తెలియదు కదా!
ఇది సరే! సింహం మాట ఏమిటి?
అదే చెబుతాను. నేనొక సింహాన్ని. నాది సింహ రాశి. ఇవన్నీ ఒకనాటి ముచ్చట్లు.
కాలం గడుస్తున్న కొద్దీ ఎంత గొప్పఅడవికి రాజు అయినా, ముసలిది కాక తప్పదు, వయసులో వున్న వగరు పొగరు తగ్గుతాయి. దంతాలలో పటుత్వం పోతుంది. వేటాడంలో బిగువు సడలుతుంది.
అదీ నా ఇప్పటి పరిస్థితి. ఒకప్పుడు ‘నేను అలా ఇలా, నేనే మోనార్క్ ను’ అంటే నమ్మే వారు వుండరు.
బోనులో ముసలి సింహం బలహీనంగా గాండ్రిస్తూ బతుకు వెళ్లదీస్తుంది. జూ సిబ్బంది పెట్టింది తిని ఈ పూట గడిచింది అనుకుంటుంది.
చాలా మంది వయసు మళ్ళిన ఒంటరి మగవాళ్ల పరిస్థితి ఈ బోనులో సింహాల మాదిరే. కాకపోతే ఈ బోనులకు ఇనుప చువ్వల తలుపులు వుండవు. బార్లా తెరిచి వున్నా బయటకు వెళ్లి వేటాడ లేని దుస్థితి.
మొదటి నుంచీ, పనిచేసే సంస్థ కారణంగా ఈ పలుకుబడి, తగిలించుకున్న హోదా వల్ల ఈ అధికారం అనుకుంటే, ‘నేనే మోనార్క్ ని' అనుకుంటూ అదేదో సినిమాలోలా నలుగురిలో పలుచన అయ్యే అవకాశం వుండదు.
అప్పటి గవర్నర్ శ్రీ కేసీ అబ్రహాం అంజయ్య గారితో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్న దృశ్యం. వేదిక మీద అంజయ్య గారి వెనుక చుబుకం మీద చేయి ఆనించుకుని చూస్తున్నది నేనే. నాకు ఇరువైపులా నాటి పోలీసు డైరెక్టర్ జనరల్ శ్రీ ఎంవీ నారాయణరావు గారు, తదనంతర కాలంలో డీజీపీ అయిన పి.ఎస్. రామమోహన రావుగారు.