19, మార్చి 2026, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (284) : భండారు శ్రీనివాసరావు

రాజకీయ శ్రవణానందాలు
ఉగాది పర్వదినంనాడు పంచాంగ శ్రవణం అనేది అనూచానంగా వస్తున్న ఆచారం. ప్రస్తుతం అన్ని వ్యవహారాలు ఆర్ధికమయం అయిపోతున్న ఈ రోజుల్లో, కాలపరీక్షకు నిలుస్తూ ప్రజల అభిమానం చూరగొంటున్న పంచాంగ శ్రవణం కూడా క్రమంగా విలువలు కోల్పోతూ వాణిజ్య స్వరూపాన్ని సంతరించుకుంటూ వుండడం విచారకరం.
మా స్వగ్రామం కంభంపాడులో మా చిన్నతనంలో ఇద్దరు పంచాంగ కర్తలు వుండేవాళ్ళు. లంకా సూర్య ప్రకాశ సిద్ధాంతి గారు. గూడా సత్యనారాయణ సిద్ధాంతి గారు. నాకు గుర్తున్నంతవరకు తెలుగు అంకెల్లో అంటే – ౧ ౨ ౩ ౪ ౫ (1 2 3 4 5 ) ఇలా ముద్రించే ప్రింటింగ్ ప్రెస్సులు ఆ రోజుల్లో చాలా తక్కువ వుండేవి. పైగా పంచాంగంలో తెలుగు భాషను అర్ధం చేసుకుని కంపోజ్ చేసేవాళ్ళు, ప్రూఫులు దిద్దేవాళ్ళు కూడా తక్కువగా వుండడం వల్లనో యేమో చాలా పంచాంగాలు, విభిన్న పండితులు రాసినా ఒకే ప్రెస్సులో ముద్రించేవారు. నాకు గుర్తున్నంతవరకు ఇలాంటి ముద్రణాలయాలు ఒకటో రెండో తెనాలిలో వుండేవి. ఉగాదికి చాలా ముందుగానే వీటి ముద్రణ పూర్తయ్యేది. ఎందుకంటే రాసిన సిద్ధాంతులు వాటిని కాలినడకన అన్ని వూళ్ళకు వెళ్ళి పంచాంగాల ముద్రణకు ద్రవ్య సాయం చేసిన దాతలకు వాటిని ఇచ్చి, అందుకు ప్రతిఫలంగా తృణమో ఫణమో స్వీకరించేవారు.
పంచాంగ రూపకల్పనకు ముందు, నాకు బాగా జ్ఞాపకం, సత్యనారాయణ సిద్ధాంతి గారు అస్తమానం గాలిలో చేతులు ఆడిస్తూ, అర్ధనిమీలిత నేత్రాలతో ఏదో గణిస్తూవుండేవారు. ఒకరకంగా చెప్పాలంటే వాళ్లదో లోకం.
తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని అనేక తెలుగు టీవీ ఛానళ్ళు ‘రాజకీయ పంచాంగాల’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తుంటాయి. ప్రతి రాజకీయ పార్టీ తన కార్యాలయంలో ఒక సిద్ధాంతి గారితో పంచాంగ శ్రవణం కార్యక్రమాలను ఏర్పాటుచేసుకుని తమకు అనుకూలమైన ఫలితాలను చెప్పించుకుని తాత్కాలిక ఉపశమనం పొందుతుంటాయి.
నిజానికి దేవాలయ ప్రాంగణాల్లో నిర్వహించాల్సిన తంతు ఇది. వెనుకటికి, ఆ మాటకు వస్తే ఇప్పటికీ గుళ్ళల్లో జరిగే పంచాంగ శ్రవణాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతూనే వున్నారు.
టెక్నాలజీ వినియోగం తక్కువగా వున్నరోజుల్లో ప్రజలు, తమకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తిని ఈ పంచాంగ శ్రవణాల ద్వారా తీర్చుకునేవారు. అప్పట్లో వాళ్లకు కొన్ని అంశాల మీదనే ఆసక్తి వుండేది. వానలు యెలా పడతాయి? పంటలు యెలా పండుతాయి? యే పంటలకు ఎలాటి ధర లభిస్తుంది? ఇక వ్యక్తిగతంగా చూసుకున్నప్పుడు ఆదాయ వ్యయాలు యెలా వుంటాయి? ఆరోగ్యం ఎలావుంటుంది? ఇలాటి ప్రశ్నలకు పంచాంగ శ్రవణ కార్యక్రమాల్లో సమాధానాలు లభిస్తాయన్న ఆశ వారిది. నాటి పరిస్తితుల దృష్ట్యా తప్పుబట్టడానికి కాని, సిద్ధాంతులు చెప్పే విషయాలతో కేవలం వాదన కోసం విభేదించడానికి కాని వీలు లేదు.
కాకపొతే ప్రజలు వీటిని బాగా నమ్ముతున్నారు అన్న నమ్మకం పెంచుకున్న రాజకీయ పార్టీలు, వాటి నాయకులు ఈ పంచాంగ శ్రవణాన్ని సైతం తమ ప్రయోజనాలకు వాడుకోవడం ఈ మధ్యకాలంలో బాగా ప్రబలిపోయింది. అందుకే యే పార్టీకి ఆ పార్టీ సొంతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని పండితుల చేత నాలుగు మంచి ముక్కలు చెప్పించుకుని, మీడియాలో ప్రచారం చేయించుకుని, తాము సంతోషపడడం మాత్రమే కాకుండా ఆ మాటలు జనం కూడా నమ్ముతున్నారు అనే భ్రమలో పడిపోతున్నారు. మరో రకంగా చెప్పాలంటే ఎన్నికల సర్వేలు చేయించుకుని, తమకు అనుకూలంగా రాయించుకుని, సానుకూల ఫలితాలు రాకపోతాయా అని సంతృప్తి పడడం ఎలానో ఇదీ అలానే.
ఈ ఆచారానికి బీజం పడింది మాత్రం పాలక పక్షాలు ప్రభుత్వ ఖర్చుతో ఉగాది వేడుకల పేరుతొ నిర్వహించే అధికారిక కార్యక్రామాల్లోనే.
మొదట్లో గుడిలో జరిగే రీతిలోనే ఈ పంచాంగ శ్రవణాలు మొదలయినా, పోను పోను రాజుల ఆస్థానాల్లో వందిమాగధుల స్త్రోత్ర పాఠాల మాదిరిగా తయారై, ఇదిగో ఈనాటి ఈ వికృత రూపాన్ని సంతరించుకున్నాయి. దేనికీ పడనివాడు పొగడ్తకు పడతాడన్నట్టుగా ఈ నాటి రాజులను అంటే ముఖ్యమంత్రులను సంతోషపెట్టడానికి నాలుగు మంచి ముక్కలతో ప్రారంభమై ఇప్పుడు , రాజుల ఆస్థానాలలో వందిమాగధుల పొగడ్తలను తలదన్నేవిదంగా తయారయ్యాయి.
పేరున్న సినిమా నటి ‘పలానా సబ్బునే వాడుతాను’ అంటే జనం ఎగబడి కొంటారన్న భ్రమలకు గురై వాణిజ్య సంస్థలు ప్రకటనలు గుప్పిస్తున్నట్టు ఇప్పుడు ఈ కార్యక్రమాలకోసం ప్రజల్లో పట్టున్న పండిత ప్రకర్షులను పోటీలు పడి ఎంపిక చేసుకుంటున్న తీరు గమనిస్తే పరిస్తితి యెంత వేగంగా దిగజారుతున్నదో అర్ధం అవుతుంది. యే రోటి వద్ద ఆ పాట పాడాలి అన్నచందంగా యే పార్టీ ఆఫీసులో ఆ పార్టీ పలుకు పలికే తీరులో ఇవి ఏడాది ఏడాదికీ విలువలు పోగొట్టుకుంటున్నాయి.
‘పంచాంగాలా పాత చింతకాయ పచ్చడేం కాదూ’ అంటూ అవహేళన చేసే హేతువాదులకు, జన చైతన్య కార్యకర్తలకు కొత్త ఆయుధాన్ని చేతికి అందిస్తున్నాయి. అలాగే, వాటిని పవిత్రంగా, సంస్కృతిలో భాగంగా భావించేవారికి కూడా ఈ పరిణామాలు తీరని మనస్తాపాన్ని కలిగిస్తున్నాయి. ప్రాచీన సంస్కృతీ వైభవాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్న ప్రతిఒక్కరూ ఈ విషయంపై దృష్టి సారిస్తే బాగుంటుంది.
అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
(ఇంకావుంది)

18, మార్చి 2026, బుధవారం

అసాధ్యులు మన మధ్యలోనే వున్నారు – భండారు శ్రీనివాసరావు

 

“ఉడుముండదె నూరేండ్లును?
పడియుండదె పేర్మి పాము పదినూరేండ్లున్?
మడుగున కొక్కెర యుండదె?”
ఎన్నేండ్లు బతికామన్నది కాదు, ఏమి సాధించామన్నదే లెక్క అన్నది సుమతీ శతకకారుడు చెప్పిన మాట.
ఈ ఫేస్ బుక్ అనేది ఒక మహా సముద్రం. వెతుక్కుంటే ప్రాప్తాన్నిబట్టి గులకరాళ్ళు, మంచి ముత్యాలు దొరికే వీలుంది.
మా అన్నయ్య భండారు రామచంద్రరావు గారికి మేలిమి ముత్యాలు పంచే ఒక రాయసకాడు ఇందులో కనబడ్డారు. పేరు హరి సింగ్ షెకావత్. ఆయన ఏది రాసినా ఇంగ్లీష్ లోనే రాస్తారు. అనేక విషయాల మీద రాస్తారు. చరిత్రలో మరుగున పడిన అంశాలు గురించి రాస్తారు. తెలిసిన చరిత్రలోనే మనకు తెలియని విషయాలు గురించి రాస్తారు. వ్యక్తుల గురించీ, వ్యవస్థల గురించీ రాస్తారు. అతిగా పొగడడం, అతిగా తెగడడం ఆయన రాతల్లో కనబడదు.
మా అన్నగారు చెప్పడంతో నేను వెతికి మరీ పట్టుకున్నాను. అన్నీ ఇంగ్లీష్ రచనలే. మచ్చుకు ఒకటి తెనుగు చేశాను. అదే ఇది.
“అద్భుతం! ఊహాతీతం! నమ్మశక్యం కాని విషయం!
మనదేశంలో ఒక వ్యక్తి వున్నాడు. కాదు, ఇటీవలి వరకు వుండేవాడు.
డాక్టరు, లాయరు, ఐపీఎస్, ఐఏఎస్, వైస్ చాన్సలర్, ఎం.ఎల్.ఎ., మంత్రి, ఎంపీ, పెయింటర్, ఫోటోగ్రాఫర్, జర్నలిస్టు, సంస్కృతం, గణిత శాస్త్రంలో పండితుడు, చరిత్రకారుడు, కవి, రచయిత. వాట్ నాట్!
ఆయన చదవని చదువులేదు, చేయని డిగ్రీ లేదు. ఎం.బీ.బీ.ఎస్, ఎండీ గోల్డ్ మెడలిస్ట్, చరిత్ర, సోషియాలజీ, ఇంగ్లీష్, హిందీ, పొలిటికల్ సైన్స్, ఆర్కియాలజీ, ఆంత్రోపాలజీ, సైకాలజీ మొదలైన వాటిల్లో ఎమ్మే చేశారు. ఇరవైకి పైగా డిగ్రీలు చేసి గిన్నిస్ రికార్డులకెక్కారు. 1978 బ్యాచ్ ఐపీఎస్, 1980 బ్యాచ్ ఐఏఎస్, 1981 లో ఎం.ఎల్.ఎ అయ్యారు. 1992 to 1998 నడుమ రాజ్యసభ సభ్యుడిగా వున్నారు.
విభిన్న రంగాల్లో విశిష్టంగా రాణించిన ఈ వ్యక్తి పేరు డాక్టర్ శ్రీకాంత్ జిచ్కర్ (DR. SHRIKANT JICHKAR) మహారాష్ట్రలోని ఒక సంపన్న మరాఠా కుటుంబంలో 1954లో జన్మించారు. 1973 నుంచి 1990 వరకు చదువులే శ్వాసగా బతికారు. చదవడం, పరీక్షలు రాయడం, డిగ్రీలు సాధించడం ఇదే ఆయన లోకం.
యువతకు ప్రధాన లక్ష్యం అయిన ఐఏఎస్ సాధించి కూడా ఆ సర్వీసులో పనిచేసింది నాలుగు నెలలే. తరువాత రాజకీయ రంగప్రవేశం చేసి, 26 ఏళ్ళ ప్రాయంలోనే దేశంలోనే అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే గా మహారాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. తరువాత మంత్రి అయ్యారు. ఆ పిమ్మట రాజ్యసభ సభ్యత్వం.
1999లో కేన్సర్ మహమ్మారి పాలపడ్డారు. వ్యాధి ముదిరింది. బతికేది కేవలం ఒక నెలే అని డాక్టర్లు చెప్పేశారు. అయినా ఆయన కుంగిపోలేదు. ఆ తరుణంలో ఒక యోగి ఆయన్ని చూడడానికి వెళ్ళాడు. ‘నువ్వు కోలుకుంటావు. నువ్వు చేయాల్సిన పనులు ఇంకా వున్నాయి’ అన్నాడు. సంస్కృతం అభ్యసించమని ప్రోత్సహించాడు. ఆయన ఆదేశాన్ని పాటించాడు. ఆయన అన్నట్టే, డాక్టర్లు విస్తుపోయేలా, శ్రీకాంత్ ఆరోగ్యం కుదుటపడింది. సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వచ్చిన తర్వాత రాజకీయాలకు స్వస్తి పలికారు. సంస్కృతంలో డి.లిట్ పట్టా సాధించారు.
పుణే లో సందీపని పేరుతో ఒక విద్యాసంస్థ స్థాపించారు. నాగపూర్ లో కాళిదాస్ సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. దానికి వైస్ చాన్సలర్ ఆయనే.
2004 లో ఊహించని ఘోరం జరిగిపోయింది. జూన్ రెండో తేదీన రోడ్డు ప్రమాదం లో శ్రీకాంత్ కన్నుమూశారు.
భయంకరమైన కేన్సర్ ని సయితం జయించిన ఆయన ఆ ప్రమాదంలో మరణాన్ని ఎదుర్కోలేక, 49 ఏళ్ళ పిన్న వయస్సులోనే తలవాల్చేసారు. ఏదైనా సాధించాలి అంటే వయస్సుతో నిమిత్తం లేదని నిరూపించి ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నారు. సుమతీ శతకకారుడి వాక్యాన్ని నిజం చేశారు.
(COURTESY : SHRI HARISINGH SHEKHAWATH)
కింది ఫోటో:
డాక్టర్ శ్రీకాంత్ జిచ్కర్ (DR. SHRIKANT JICHKAR)








17, మార్చి 2026, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (283) : భండారు శ్రీనివాసరావు

దుర్వినియోగం చేయని అధికారం ఎందుకు? 

కొన్ని సంవత్సరాలు వెనక్కి వెడితే... 

సాక్షి టీవీలో అమర్ ఫోర్త్ ఎస్టేట్ ప్రోగ్రాం. పక్కన ఎక్జిక్యూటివ్ ఎడిటర్ రామచంద్ర మూర్తి గారు కూడా వున్నారు, నంద్యాల ఎన్నికల తరువాత అనుకుంటాను. “అధికారం ఉన్నదే దుర్వినియోగం చేయడానికి, లేకపోతే ఆ అధికారం ఎందుకు?” అన్నాను ఒక ప్రశ్నకు జవాబుగా. అధికార దుర్వినియోగాన్ని నేను సమర్దిస్తున్నానా అనే భావం వారి మొహాల్లో కనిపించి నేను కొంత వివరణ ఇవాల్సి వచ్చింది.

 అధికారాన్ని వినియోగించడం, దుర్వినియోగం చేయడం అనే విషయంలో చాలామందికి చాలా అభిప్రాయాలు వుంటాయి. నాకు తెలిసిన ఒక ఐ.ఏ.ఎస్. అధికారి వుండేవారు. ఇప్పుడు లేరు. జిల్లా కలెక్టర్ గా పనిచేసే రోజుల నుంచి తెలుసు. చాలా నిక్కచ్చి మనిషి. విజయ నగర్ కాలనీలో ఒక టూ ఆర్టీ ఇంట్లో కాపురం. ఆయన భార్య రెండు సిటీ బస్సులు మారి నారాయణ గూడాలోని మా బంధువుల ఆసుపత్రికి వచ్చి వెడుతుండేది. ఆయన ఆఫీసు కారు ఆయన ఆఫీసు వరకే. అలాంటి మనిషి ఒక మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో విలేకరుల సమావేశాలు పెడుతుండేవారు. నేను మామూలుగా అందరు విలేకరులతో వెళ్లి కూర్చుంటే, ఆయన నన్ను తన పక్కన వచ్చి కూర్చోమనే వారు. అలా ఒక విలేకరిని విడిగా మర్యాద చేయడం మర్యాద కాదని ఆయనతో ఎన్నో సార్లు మర్యాదగానే చెప్పేవాడిని. కానీ పిలిచిన ప్రతిసారీ అదే వరస. చివరికి నేను పోవడం మానేసి, వాళ్ళ పీఆర్వో తో మాట్లాడి ప్రెస్ నోట్ తెప్పించుకునే వాడిని. ఇదెందుకు చెబుతున్నాను అంటే అధికార దుర్వినియోగం అంటే తెలియని ఆ అధికారి కూడా తన తోటి సిబ్బంది దృష్టిలో మాట పడే పరిస్తితి తెచ్చుకున్నాడు. ‘ఈయన సరే లెండి, ఒక రూలూ లేదు చట్టుబండలు లేదు. తనకెంత తోస్తే అంతే!’ అనే వాళ్ళు పరోక్షంలో.

 ఒకప్పటి కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారు ఆయన శాఖలో అధికార దుర్వినియోగానికి అడ్డు కట్ట వేసే ప్రయత్నం మొదలు పెట్టారు. ఉన్నతాధికారులు ఎవరి పని వాళ్ళు చూసుకోవాలని, పై అధికారులు పర్యటనలకు వచ్చినప్పుడు విమానాశ్రయాలకు వెళ్లి రిసీవ్ చేసుకునే పద్దతికి స్వస్తి చెప్పాలని, ప్రత్యేక బోగీల్లో (సెలూన్ అంటారు, ఒక స్టార్ హోటల్ గదిలా సర్వ సౌకర్యాలు వుంటాయి, వెనక మల్లికార్జున్ గారు రైల్వేశాఖ డిప్యూటీ మంత్రిగా వున్నప్పుడు ఈ వైభోగం అనుభవించే అవకాశం హైదరాబాదులోని మా బోటి విలేకరులకు తరచూ కలుగుతుండేది) ప్రయాణాలు మానుకోవాలని ఇలా అనేక ఆదేశాలు జారీ చేసారు. ఈ వార్త పత్రికల్లో వచ్చినప్పుడు సంతోషం అనిపించింది. వార్త అయితే వచ్చింది కానీ, అమలు జరిగిన వార్త నా కంటికి కానరాలేదు. పోనీండి. 

పూర్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు మంత్రులు కేంద్రంలో వున్నప్పుడు వారానికి రెండు మార్లు, ముఖ్యంగా శనాదివారాల్లో హైదరాబాదు వచ్చి పోయేవాళ్ళు. ఈ విషయంలో ఎన్డీయే ప్రభుత్వం, యూపీఏ తేడా లేదు. శుక్రవారం సాయంత్రం కల్లా వివిధ మంత్రిత్వశాఖలకు చెందిన ఓ వంద వాహనాలు బేగం పేట ఎయిర్ పోర్టుకు చేరుకునేవి. వాటిల్లో కనీసం ఓ పాతిక అయినా అద్దెకు తీసుకున్న ఖరీదైన వాహనాలు ఉండేవి. అవి వచ్చే అతిధులకు, వారి పరివారం కోసం. వాటికి వారం వారం బిల్లులు కట్టడం తప్ప అవి ఎవరు వాడారు, ఎక్కడెక్కడ తిరిగారు అని ఆరా తీసే నాధుడు ఉండేవాడు కాదు. వచ్చే మంత్రి గారి శాఖ స్థాయిని బట్టి ఏర్పాట్ల స్థాయి కూడా పెరుగుతుండేది. బస చేయడానికి ప్రభుత్వ అతిధి గృహాలు ఉన్నప్పటికీ ఎందుకయినా మంచిదని అయిదు నక్షత్రాల హోటళ్ళు కూడా బుక్ చేసేవాళ్ళు. యెంత చెట్టుకు అంత గాలి అన్నట్టు కాస్త గిట్టుబాటు వుండే శాఖల వాళ్ళు విరగబడి ఖర్చులు పెట్టేవాళ్ళు.

తోక టపా : పూర్వం ఒక ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. తన జన్మదినం రోజున ఎవ్వరూ పుష్ప గుచ్చాలు తేవద్దని ముందస్తుగా ప్రకటన కూడా విడుదల చేసారు. ఆ రోజు ఆయన్ని కలిసి అభినందనాలు తెలపడానికి వచ్చిన వాళ్ళ చేతుల్లో పుష్ప గుచ్చాలు లేవు. వాటి స్థానంలో అత్యంత ఖరీదైన కాశ్మీరీ శాలువలు వున్నాయి.





 (ఇంకా వుంది)

15, మార్చి 2026, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (282) : భండారు శ్రీనివాసరావు

 

‘దొర’కునా ఇటువంటి అధికారి
ఫిబ్రవరి 27 - మార్చి 13
ఈ మధ్యలో ఎన్ని రోజులు? కేవలం పద్నాలుగు. ఇంతలోనే ఆయన కన్నుమూత.
ఆయన్ని తలచుకుని, ఆయన రాసిన ‘ఎన్టీఆర్ తో నేను’ అనే పుస్తకం గురించి రాసిన తర్వాత ఆయన జీవించింది పద్నాలుగు రోజులే. మొన్న మధ్యాన్నం టీవీల్లో మాజీ డీజీపీ హెచ్ జే దొర మరణం అనే స్క్రోలింగ్ చూడగానే నెత్తిన పిడుగు పడిన ఫీలింగు.
వెంటనే మాజీ ఐ పి ఎస్ అధికారి మా మేనకోడలు మొగుడు అయిన రావులపాటి సీతారామారావు గారికి మెసేజ్ పెట్టాను. ఆయన ‘అవును ‘ఇప్పుడు అక్కడికే వెడుతున్నాను’ అనే జవాబు ఇచ్చారు.
దొరగారి తలితండ్రులు ఏరికోరి మంచి పేరు ఆయన బారసాల నాడే పెట్టారు. పేరుకు ముందు శ్రీ అక్కరలేని పేరు. ఎవరైనా సరే, ముఖ్యమంత్రి అయినా, ఇంకెవరైనా దొరగారు అనాల్సిందే.
స్పురద్రూపి అంటే దొరగారే. చూడగానే ఆకర్షించే అయస్కాంతం లాంటి మనిషి. దానికి తగ్గ వ్యక్తిత్వం. కోపం లేని ఈ మనిషికి పోలీసు ఉద్యోగం ఎవరిచ్చారు అనిపించేటంత మంచితనం. చిదిమితే పాలు కారుతాయనిపించే సుకుమ కోమల వదనం, మృదువైన శరీర ఛాయ. సదా దరహాసంతో కనబడే దొరగారిలాంటి పోలీసు అధికారిని నేనైతే చూడలేదు.
అల్లాటప్పా పోలీసు ఉద్యోగం కాదు. ఏకంగా పోలీసు శాఖకే సర్వాధిపతి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. దేశం గర్వించే సీబీఐ సంస్థకు డైరెక్టర్ చేసిన వ్యక్తి. అలాంటి మనిషితో చిరకాల పరిచయం వుండడం అనేది రేడియో విలేకరిగా నా అదృష్టం.
నిన్నా ఈరోజు మీడియాలో పత్రికల్లో దొరగారి మరణ వార్తలే. పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరిగిన జూబిలీ హిల్స్ మహాప్రస్థానంలో దొరగారి భౌతికకాయాన్ని వుంచిన పాడెను ప్రస్తుత తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి, పోలీసు కమిషనర్లు సజ్జనార్, రమేశ్ మోస్తూ కనిపించిన దృశ్యాలను చూసినప్పుడు, రిటైర్ అయి దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా పోలీసు అధికారుల గుండెల్లో ఆయన పట్ల ఆనాటి గౌరవ ప్రతిపత్తులు అలాగే చిరస్థాయిగా ఉన్నాయన్న విషయం విదితమైంది.
ఈరోజు ఉదయం ఆంధ్రజ్యోతి దినపత్రిక మాజీ ఎడిటర్, ఒకానొక కాలంలో జ్యోతిలో నేను కలిసి పనిచేసిన పాత్రికేయ మితృలు ఐ.వెంకట్రావు గారు ఫోన్ చేసి దొరగారితో తన జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితమే తాను దొరగారిని కలుసుకున్నానని చెబుతూ, ఇంత త్వరగా ఈ దుర్వార్త వినాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు. 2011లో జరిగిన ఎన్టీఆర్ తో నేను అనే పేరుతొ దొరగారు రాసిన పుస్తకం ఆవిష్కరణ విశేషాలను ఓ పదిహేను రోజుల క్రితం నేను ఫేస్ బుక్ లో పంచుకున్న విషయాన్ని తాను దొరగారికి షేర్ చేసిన సంగతి చెప్పారు.
అలనాటి విలేకరులు అందరికీ దొరగారితో ఇదే విధమైన సాన్నిహిత్య సంబంధాలు వున్న సంగతులను రెండు రోజులుగా నేను చదువుతూనే వున్నాను. ఏం రాయాలో తెలియని అయోమయ స్థితి. ఒకటా రెండా అనేక అనుభవాలు ఆయనతో.
దొరగారు డీజీపీగా వున్నప్పటి మాట. నేను రేడియో స్టేషన్ కు వెళ్ళడానికి ఖైరతాబాదు మీదుగా వెడుతుంటే లక్ డి కా పూల్ వద్ద ట్రాఫిక్ జామ్. ముందు చూస్తే చాలా వాహనాలు ఆగిపోయి వున్నాయి. అందులో ఒకటి దొరగారిది. ఆయనా అందరిలానే ట్రాఫిక్ లో చిక్కుకుపోయి వున్నారు. కాసేపటి తర్వాత ఆఫీసుకు చేరి ఆయనకు ఫోన్ చేశాను. ‘మీరు కూడా ట్రాఫిక్ లో ఓపిగ్గా అలా ఎలా వుండగలిగారు? తలచుకుంటే నిమిషాల్లో క్లియర్ చేసేవాళ్ళు కదా!’ అని అడిగాను. ఆయన అన్నారు.
’నా ఒక్కడి సమస్య కాదు కదా! సమస్యకు పరిష్కారం వెతకాలి. ఇప్పుడు అదే పని మీద వున్నాను’ అన్నారు ప్రశాంతంగా.
దొరగారి మరణంతో తెలుగు రాష్ట్రాలు ఒక మంచి పోలీసు అధికారిని కోల్పోయాయి.
కింది ఫోటోలో: ఎడమనుంచి కుడికి:
శ్రీయుతులు హెచ్, జే. దొర, (Former DGP), ఎస్. రామచంద్రరావు, (Former CPRO to then CM NTR), భండారు శ్రీనివాసరావు, ఎస్.వి. ప్రసాద్, ( Former Chief Secretary of United AP), రావులపాటి సీతారామారావు, ( Former IGP), జ్వాలా నరసింహారావు (Former CPRO to first CM of Telangana, KCR), దేవీప్రియ (కవి, రచయిత)






15-03-2026
(ఇంకా వుంది)

13, మార్చి 2026, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (281): భండారు శ్రీనివాసరావు

 

ఆ రోజులికరావు
‘యుద్ధం మీద మాట్లాడాలి, కారు పంపిస్తాను ఓ పది నిమిషాలు స్టూడియోకి వస్తారా’ అన్నాడు గెస్ట్ కో ఆర్డినేటర్ నేతాజీ ఫోన్లో. నాకు మంచి స్నేహితుడు కూడా. యుద్ధం మొదలయిన తర్వాత, చాలా టీవీల నుంచి ఇలా ఎన్నో ఫోన్లు. ‘తెలుసుకదా కాడి కింద పారేసానని’ చెప్పాను నేతాజీతో.
కాడి అంటే గుర్తుకు వచ్చాయి కొన్ని పాత రోజులు.
మా చిన్నతనంలో ఎడ్లబండిలో బరువు తూకంగా వుండాలనేవారు. బండిలో వెనక కూర్చున్న వాళ్ళు ముందుకు జరిగితే బండి తోలేవాడు చెప్పేవాడు, 'కాస్త వెనక్కి జరగండి, కాడి బరువు మోపవుతోంది'అని.
దాని అర్థం ఏమిటంటే ఆ బరువు బండిని లాగే ఎడ్లమీద పడుతుందని.
వేరే పార్టీల నుంచి అధికార పార్టీలోకి మూకుమ్మడిగా చేరేవారి విషయంలో కూడా ఈ కాడి బరువు ఉదాహరణ వర్తిస్తుంది.
'నిలకడగా నిల్వవున్న నీరు నాచు పట్టి నీచు వాసన వేస్తుంది. పారే నీరు పారదర్శకంగా స్వచ్చంగా కనబడుతుంది'
పార్టీ మార్పిడులను సమర్ధిస్తూ ఓ రాజకీయ నేత చేసిన వ్యాఖ్య ఇది. గుడ్డి సమర్ధనకు ఈ వ్యాఖ్యను పరాకాష్టగా తీసుకోవాలేమో.
మర్రి చెన్నారెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే కాంగ్రెస్ ఎస్ నుంచి ఇందిరా కాంగ్రెస్ కు వలసలు మొదలయ్యాయి. ఎన్నికలు ముగియగానే పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఆయన వైపు మళ్లిపోతున్నారు.
అసెంబ్లీలో ప్రతిపక్షంలో వున్న భాట్టం శ్రీరామ మూర్తి అన్నారు. 'చెన్నారెడ్డి గారి ఆకర్షణ శక్తి అమోఘం. ఎన్నికల్లో గెలిచిన వాళ్లు జమాఖర్చులు కూడా ఇంకా దాఖలు చేయలేదు. దానికి ముందే పరకాయ ప్రవేశాలా. ఈ తంతు చూస్తూ వుంటే మంగళ సూత్రాలతో, మధు పర్కాలతో పెళ్లి పీటల మీదనుంచి లేచిపోతున్నట్టుగా వుంది'
ఈ వ్యాఖ్య సభలో దుమారం రగిలించింది. పార్టీ మారిన వాళ్ళలో మహిళా సభ్యులు కూడా వున్నారు. లేచిపోవడం అనే పదానికి అభ్యంతరం తెలిపారు. అది సభలో వాడతగ్గ పదమా కాదా అన్న దానిపై విస్తృతంగా చర్చ జరిగింది. ఏ ఫలితమూ రాకుండానే ముగిసింది. అది కాదు అసలు విషయం.
పార్టీ మార్పిళ్ళపై ఇంతటి ఘాటు వ్యాఖ్య చేసిన భాట్టం శ్రీరామ్మూర్తి కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు.
2018 లో ఏపీలో జరిగిన మూకుమ్మడి పార్టీ మార్పిళ్ళపై ఆ రోజుల్లో అనేక టీవీ ఛానళ్ళు చర్చలు నిర్వహించాయి. ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాలకూడదనే ఈనాటి రోజులు కావు కనుక, నేను నిక్షేపంగా వెళ్లి ఒకే రోజున ఏబీఎన్, సాక్షి, టీవీ-5, HMTV, మహా న్యూస్ ఛానళ్ళలో నా అభిప్రాయాలు చెప్పేశాను. ఆ రోజులు మళ్ళీ రావు.
కింది ఫోటోలు అవే:
తోకటపా:
ఆ మధ్య ఒక పెద్దమనిషి కనబడి, ‘ఏమిటీ ఈ మధ్య టీవీల్లో కనబడడం లేదు’ అని అడిగారు.
జవాబు చెప్పేలోగా ఆయనే అనేసారు, ‘అదీ మంచిదే లెండి, విశ్లేషకులకు, పార్టీల ప్రతినిధులకు చెప్పేదాంట్లో తేడా ఏమీ లేదు, అందరిదీ, ఏ గూట్లో పలుకు ఆ గూట్లో’
నోరు తెరవకపోవడం మంచిదయింది అనుకున్నాను.










(ఇంకావుంది)

7, మార్చి 2026, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (280) : భండారు శ్రీనివాసరావు

 మొబైల్లో 'ఈగ' పడింది

 ఆ 'ఈగ’ ఖరీదు అక్షరాలా నాలుగువేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు. ఇదెలాగంటారా! చిత్తగించండి. 2012 సంవత్సరం జులై 15. హైదరాబాదులో థియేటర్ కు వెళ్లి సినిమా చూడడమనేది చాలా అరుదు. అధవా, ఎప్పుడయినా వెళ్ళామంటే గోకుల్ థియేటర్ కే. అదీ ఏదయినా కొత్త సినిమా మొదటి వారంలోనే. ఎందుకంటే ఆ సినిమాహాల్లో వారం వారం పిక్చర్లు మార్చి వేస్తుంటారు. ఆ థియేటర్ ఓనర్లలో ఒకడయిన శ్రీనివాస యాదవ్, మా రెండో అన్నయ్య కుమారుడు సుభాష్ చంద్ర బోస్ చిన్ననాటి స్నేహితులు కావడం మూలాన, టిక్కెట్లు దొరకవు అన్న బాధ లేకపోవడం మూలాన, మా అన్నదమ్ముల కుటుంబ సభ్యులం అందరం కట్టగట్టుకుని వెళ్ళే సందర్భం కావడం మూలాన, సాధారణంగా నేను కూడా ఇరవై నుంచి పాతిక వరకు వుండే ఈ ‘కొత్త సినిమా ప్రేక్షక వర్గంలో’ చేరుతూనే వుంటాను. అలా చూసిన సినిమా నాలుగు రోజులు గుర్తుండి పోయే సినిమా కావడం అన్నది సకృత్తు గా జరిగే విషయం. ఆ రోజు శనివారం కూడా అలాటి సందర్భం వచ్చింది. పెద్దా చిన్నా, పిల్లా మేకా, ముసలీ ముతకా పాతికమందిమి కలిసి వెళ్లి ఆ థియేటర్లో ‘ఈగ’ సినిమా చూసాము. చూసినవాళ్లలో మెజారిటీ రాజమౌళి అభిమానులే కాబట్టి సినిమా గురించిన చర్చ హద్దులలోనే సాగింది. ‘ఈగ’ వీక్షణానంతరం, మా మూడో అన్నయ్య కుమారుడు (ఇప్పుడు అమెరికా) ‘సాయి’ వాళ్లింట్లో భోజనాలు మొదలు పెట్టబోయేలోగా నా సెల్లు సుతారంగా మోగింది. చూస్తే బ్యాంకు నుంచి అలర్ట్ మెసేజి. ‘ఫలానా షాపులో మీరు ఇప్పుడే ఇంత తగలేశారు. తగలేయగా పోను మీకు ఇంకా తగలడివున్న బ్యాలెన్సు ఇంత’ అంటూ ఓ శ్రీముఖం. కార్డు సొంతదారునయిన నేను, ఆ కార్డుకు ‘యాడాన్’ కార్డు సొంతదారిణి ( అదేవిటో తెలుగు కూడా అలాగే తగలడి చస్తోంది సుమా) అయిన మా ఆవిడ వైపు ఓ చూపు పారేసి, సినిమా మధ్యలో కూడా లేచి వెళ్లి షాపింగు చేసి వచ్చిన ఆవిడ సామర్ధ్యాన్ని కంటి చూపుతోనే మెచ్చుకోబోయాను. కానీ నా వాలకాన్ని పసికట్టిన మా ఆవిడ ‘యేమయిందంటూ’ తన తరహాలో చూస్తూ నాకర్ధమయ్యే భాషలో ఇతరులకు తెలియకుండా అడిగింది. అంత గుంభనగా మాట్లాడ్డం తెలియని నేను అమాయకంగా విషయం బయట పెట్టాను. తాను కూడా కంగారుగా తన హ్యాండ్ బ్యాగ్ లో దాచిన బ్యాంకు కార్డు కోసం వెతికింది. ఆమె మొహం చూస్తూనే అది బ్యాగులో లేదన్న సంగతి అందరికీ తెలిసిపోయింది. అలా నలుగురిలో పడ్డ పాము ఎవరి చేతిలో చావకుండా, ‘ఇప్పుడేంచేయాల’న్న ప్రశ్నను మా ముందుంచి ,తాను చల్లగా తప్పుకుంది. కార్డును డీయాక్టివేట్ చేయడం ఒక్కటే మార్గమని మా కుటుంబం యావత్తూ ఏకాభిప్రాయానికి వచ్చేలోగా చేతిలో సెల్లు మరోమారు మోగింది. చూస్తే ఏముంది. బ్యాంకు నుంచి మరో ఎస్సెమ్మెస్ ఎలర్ట్. ‘ఏంచేయాలేంచేయాలని అలా ఆలోచిస్తూనే వుండండి, ఈ లోగా మీ కార్డు కొట్టేసిన దొంగ గారు, ‘విజిటింగు కార్డు బదులు క్రెడిట్ కార్డు నొక్కేస్తే పోయేద’న్న ‘ఈగ’ సినిమా డైలాగు పట్టుకుని ఇప్పటికప్పుడే మరో రెండువేల ఐదువందలకు దర్జాగా షాపింగు చేసి అంత దర్జాగా వెళ్లిపోయాడన్నది’ ఆ ఎలర్టు సారాంశం. ఈ తరహా చర్చల్లో పడితే, ‘ఈగ’ సినిమా బడ్జెట్ పదికోట్ల నుంచి ముప్పయి కోట్లకు పెరిగిపోయిన చందంగా దొంగ గారి షాపింగ్ స్ప్రీ అదే తరహాలో సాగిపోయే ప్రమాదాన్ని మేమందరం కొంచెం కొంచెం పసికడుతున్న తరుణంలో, ‘రాచ పీనుగ తోడు లేకుండా కదలదు’ అన్నట్టు పోయిన కార్డుతో పాటు మరో బ్యాంకు కార్డు కూడా కనబడం లేదని మా శ్రీమతి చావు కబురు చల్లగా చెప్పింది. దాంతో అందరం యమర్జెంటుగా మాకు మేమే ఎమర్జెన్సీ ప్రకటించేసుకున్నాం. తలా ఒక లాప్ టాప్ పట్టుకుని కొందరూ, సెల్ ఫోన్లతో మరికొందరూ, లాండ్ లైన్ సాయంతో ఇంకొందరూ ఒక్కుమ్మడిగా రంగంలోకి దిగి, ‘ఒకటి నొక్కండి, ఏడు నొక్కండి’ అనే బ్యాంక్ కస్టమర్ కాల్ సెంటర్ సూచనలను ఖచ్చితంగా పాటించే పనిలో పడ్డాం. ఆ కంగారులో ‘యాడాన్’ కార్డుతో పాటు నా ప్రైమరీ కార్డు లావాదేవీలను కూడా జయప్రదంగా స్తంభింపచేశాం. దరిమిలా, ‘మూడు వర్కింగు డేస్ నుంచి పదిహేను దినాల లోపల మీకు కొత్త కార్డు జారీ చేస్తామ’ని, మా పుట్టిన తేదీలు, మాతాపితరుల నామధేయాలు వాళ్ల రికార్డులతో పోల్చుకున్న పిమ్మట కాల్ సెంటర్ వాళ్లు ప్రకటించారు. ‘అమ్మయ్య’ అని అనుకుంటున్న సంతోషం కాస్తా కాసేపటిలోనే ఆవిరావిరయిపోయింది. అదేమిటంటే మేము మళ్ళీ ‘1975’ మోడల్ సంసారానికి మారిపోయాము. అంటే ఏమిటి? ‘చేతిలో క్యాషూ లేదు, జేబులో కార్డూ లేదు’ అనే పాత రోజులకన్న మాట. ఇంతకీ, ‘ఈగ’ సంగతేమిటంటారా! ‘ప్రధమ కబళే మక్షికాపాతః’ అన్నట్టు ఈ కార్డు తస్కరణ ఉదంతం ‘ఈగ’ ను కమ్మేసింది. ఇంటిల్లిపాదిదీ ఒకటే మాట. ‘సినిమా చాలా బాగుంది. రాజమౌళి హాట్స్ ఆఫ్’. సినిమాలు బాగా చూసేవారు కాబట్టి వాళ్ల మాటే రైట్ అనుకోవాలి.






 (ఇంకావుంది)


అయాం ఎ బిగ్ జీరో (279): భండారు శ్రీనివాస రావు

 

 తెలుగు పాత్రికేయ దిగ్గజం

 ‘ఒక పత్రిక ఎడిటర్ అనేవాడు ఎలావుంటాడు? ఎలా వుండాలి?’ అని కళ్ళుమూసుకుని ప్రశాంతంగా ఆలోచిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరిచినప్పుడు కనబడే రూపమే శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సీపీఆర్వో వనం జ్వాలా నరసింహారావు నేనూ కలిసి ఒకసారి పొత్తూరి వారి ఇంటికి వెళ్లాం. వారు రాసిన ‘బులేనా’ పుస్తకం సంతకం చేసి ఇచ్చారు. ‘ఎలా వున్నారు, ఆరోగ్యం ఇప్పుడు కులాసా కదా’ అని మేము అడగడం తప్పిస్తే ఆయన అంతట ఆయన తన అనారోగ్యం గురించి ఒక్క మాటా మాట్లాడలేదు. ఎంతో ఖరీదయిన వైద్యం. మామూలు మందులు కాక అదనంగా మూడు వారాలపాటు రోజుకొక కాప్స్యూల్ వేసుకోవాలి. ఒక్కొక్కటి అక్షరాలా వెయ్యి రూపాయలు. సాదా సీదా అట్టపెట్టెలోవున్న ఆ మాత్రల బాటిల్ ఇరవై వేల రూపాయలు అంటే నమ్మ బుద్దికాలేదు, కానీ కళ్ళెదుట కనబడుతున్న వాస్తవం అది. వున్న ఆ కొద్ది సమయంలోనే ఆయన ఎన్నో కబుర్లు చెప్పారు. ప్రత్యేకతెలంగాణా ఉద్యమం కొన్ని దశాబ్దాల క్రితం సికిందరాబాదులోని ఒక హోటల్లో ఎలా ఊపిరి పోసుకున్నదో చెబుతూ ఆనాటి విశేషాలు వివరించారు. ఇంట్లో పెంచుకుంటున్న ఈశ్వర నామం కలిగిన ఒక మొక్కను చూపించారు. పచ్చటి వర్ణం కలిగిన ఆకులు. వాటి మీద కపిల వర్ణంలో ‘నాగుపాము పడగ’ మీద వుండే కృష్ణ పాద ముద్రలు. ఆ మొక్క చాలా అరుదుగా దొరుకుతుందట. ఆ మొక్క వుంటే పాములు ఆ దరికి కూడా రావట. ఆయుర్వేద వైద్యులు మాత్రమే ఈ మొక్కను గుర్తించగలరట. ప్రాచీన ఔషధీ శాస్త్రంలో ఇటువంటివి ఎన్నో వున్నాయని చెప్పారు. నిజం కావచ్చు. నిజం కాదని నమ్మే వాళ్ళూ వుంటారు. నమ్మేవారు మొక్కితే రాయే సాయి, నమ్మనివారు తొక్కితే అదే రాయి. అదలా ఉంచి వెంకటేశ్వరరావు గారు స్వయంగా చెప్పిన కొన్ని విశేషాలు నెమరు వేసుకుందాం. ఈనాటి పత్రికారంగం వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశాలు వాటిల్లో వున్నాయి. పత్రిక యజమానికి తన పత్రిక గురించి ఆరా తీసే అధికారం ఉంటుందా? ఇప్పటి రోజుల్లో అయితే ఇదొక ప్రశ్నే కాదు. ఆరా తీయడమేమిటి, వార్తలను అదుపు చేసే అధికారం కూడా వుంటుంది. అయితే దాన్ని గురించి ఒక పాత విషయం చెప్పారు. కొంచెం అటూ ఇటూగా మూడు దశాబ్దాల నాటి సంగతి. అప్పటి ఆంధ్రప్రభ దినపత్రికకు పొత్తూరి వెంకటేశ్వరరావు గారు ఎడిటర్. విజయవాడలో రంగా హత్య దరిమిలా జరిగిన విధ్వంస కాండపై, రామోజీరావు గారు చైర్మన్ గా ఉన్న ఎడిటర్స్ గిల్డ్ ఒక నిజనిర్ధారణ కమిటీ వేసింది. కుల్ దీప్ నాయర్, చెన్నై ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ జగన్నాధన్ తో పాటు ఆంధ్రప్రభ ఎడిటర్ హోదాలో పొత్తూరి వెంకటేశ్వర రావు గారు కూడా అందులో ఒక సభ్యులు. పొత్తూరివారు విడిగా బెజవాడ వెళ్లి పరిస్తితులను పరిశీలించి ఒక నివేదిక పంపారు. అది ఎలా చేరిందో ఇండియన్ ఎక్స్ ప్రెస్ అధినేత రామనాద్ గోయంకాకు చేరింది. అది ఆయనకు రుచించినట్టు లేదు. వెంటనే వెంకటేశ్వర రావు గారికి ఒక లేఖ పంపారు. ‘మీ నివేదిక నాకు దిగ్భ్రాంతితో కూడిన నిరుత్సాహాన్ని కలిగించింది’ అన్నది దాని సారాంశం. గోయంకా యజమాని. పొత్తూరి వారు ఆయన దగ్గర ఒక ఉద్యోగి. అయినా అలా ఉత్తరం రాయడం ఆయనకు నచ్చలేదు. వెంటనే నిరసనగా రాజీనామా లేఖ గోయంకాకు పంపించారు. గోయంకా నుంచి పిలుపు వచ్చింది, మద్రాసు వస్తున్నాను అక్కడికి రమ్మని. పొత్తూరిగారు వెళ్ళారు. “నా ఎడిటర్ అభిప్రాయంతో విబేధించే స్వేచ్చ నాకు లేదా?” అని సూటిగా అడిగారు, రాజీనామా విషయం ప్రస్తావించకుండా గోయంకా. ఇంకా ఇలా అన్నారు. “మన పత్రికలో పాఠకుల ఉత్తరాలు ప్రచురిస్తాము కదా. పత్రిక విధానాలతో విబేధించే ఉత్తరాలు కూడా వేస్తుంటాం. యజమానిగా ఒక విషయం మీ దృష్టికి తెచ్చాను. అది మీకు నచ్చలేదు. సరే! ఒక సాధారణ పాఠకుడికి వుండే ఈ వెసులుబాటు కూడా ఒక యజమానిగా నాకు లేదా చెప్పండి” ఇలాంటి యజమానికి ఏ సంపాదకుడు అయినా ఏం జవాబు చెబుతారు. అందుకే గుంభనగా వుండిపోయారు. రాజీనామా విషయం పట్టుబట్టలేదు. గోయంకానే స్వయంగా రాజీనామా లేఖ పొత్తూరి వారి చేతిలో పెట్టి సాదరంగా సాగనంపుతూ అన్నారు. “మీరు ఎడిటర్ గా ఉన్నంత కాలం మీరు మీ అభిప్రాయాలనే రాస్తూ వుండండి” పొత్తూరివారి ఆరోగ్యం బాగాలేదని జ్వాలా ద్వారా తెలుసుకున్న తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖరరావు స్వయంగా పొత్తూరి వారిని చూడడానికి విజయనగర్ కాలనీలోని వారి ఇంటికి వెళ్ళారు. అక్కడి పరిస్తితిని ఓ కంట గమనించిన కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు. వారికి పూర్తి స్వస్థత చేకూరేవరకు ఆ బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు అయినప్పటికీ, సుదీర్ఘ కాలం ప్రాంతీయ ఉద్యమాన్ని నడిపిన కేసీయార్, పొత్తూరి వారిని ఒక పాత్రికేయుడుగా గుర్తించారు కాని, అయన ఏప్రాంతం వారనే వివక్ష చూపలేదు. ఆయనలోని ఈ విలక్షణత్వం పొత్తూరివారికి కూడా తెలుసు. కానీ మొదటే చెప్పినట్టు విలువలకు కట్టుబడి జీవిస్తూ వచ్చిన పాత్రికేయుడాయన. అంచేత కేసీఆర్ సాదరంగా ఇవ్వచూపిన సాయాన్ని వారు సున్నితంగా తిరస్కరించారు. అయితే వారిరువురి నడుమ సాగిన సంభాషణలో పొత్తూరి వారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. “రెండో ప్రపంచయుద్ధంలో నాయకత్వం వహించిన నాటి బ్రిటన్ ప్రధానమంత్రి విన్ స్టన్ చర్చిల్ ఆ తరువాత జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో ఆట్లీ చేతిలో ఓడిపోయారు. కానీ సుదీర్ఘకాలం ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి సారధ్యం వహించిన కేసీఆర్, తెలంగాణా రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలలోనే విజయబావుటా ఎగురవేసి తన నాయకత్వ పటిమను నిరూపించుకున్నారు” తెలుగు పత్రికా రంగంలో తరాల నడుమ నడుమ వారధిలా ఉంటూ వచ్చిన పొత్తూరివారి మరణం పాత్రికేయ లోకానికి ఎన్నటికీ తీరని లోటే. ఆరేళ్ళ క్రితం 2020 మార్చి అయిదో తేదీన పొత్తూరి వారు మరణించారు.


(ఇంకావుంది )