14, మే 2026, గురువారం

అయాం ఎ బిగ్ జీరో: (307) భండారు శ్రీనివాసరావు

ఆ గాలీ .....ఆ నేలా......

డెబ్బయ్ ఏళ్ళ పైమాటే. అప్పటికి నాకు పదేళ్లు ఉంటాయేమో! ఆనాటి జ్ఞాపకాలు స్పష్టాస్పష్టంగా మనసు పొరల్లో మెదులుతున్నాయి. గురుతుల మడతల్లో కదులుతున్నాయి.
మా ఊరు కంభంపాడు. అప్పట్లో చాలా వెనకపడ్డ ప్రాంతం. అయినా అన్నీ ఉండేవి. స్వావలంబన లాంటి మాటలు, వాటి అర్ధాలు అప్పట్లో తెలవ్వు. కానీ అన్నీ అమర్చినట్టు ఉండేవి ఆ కొసగొట్టు పల్లెటూళ్ళో.
మా ఇంటికి దగ్గరలో అంటే నడిచిపోయే దూరంలో చెరువు గట్టు కింద మా మాగాణి పొలాల పక్కన ఓ మెరక మీద మంచి నీళ్ళ బావి. పైగా గిలకల బావి. నాలుగు వైపులా ఇనుప గిలకలు ఉండేవి. ఊరి మొత్తానికి అదొక్కటే మంచి నీటి వనరు. మా ఇంట్లో బావిలో నీళ్ళు ఉప్పు కషాయం. స్నానాలకు, ఇతర అవసరాలకు ఆ నూతి నీళ్ళే వాడే వాళ్ళం. మా అమ్మగారు వెంకట్రావమ్మ, మా చిన్న మేనత్త చిదంబరం అత్తయ్య తడి మడి చీరెలతో వెళ్లి మంచినీటి బావి నుంచి బిందెలలో నీళ్ళు తెచ్చే వాళ్ళు.
అప్పుడప్పుడూ వాళ్ళతో నేనూ వెళ్ళే వాడిని. దోవలో వీరబ్రహ్మం ఇల్లు. ఆయన ఉలీ, బాడిసె పట్టుకుని ఎడ్లు లాగే బండ్లు తయారు చేసేవాడు. నేను అక్కడే ఒక మొద్దు మీద కూర్చుని చూస్తూ కూర్చుండేవాడిని. బండి చక్రాలు, వాటికి ఆకులు. అలా కొలతలకు తగ్గట్టుగా ఎలా చెక్కేవాడో ఆశ్చర్యం అనిపించేది. ఆయన ఏమీ చదువుకున్నవాడు కాదు. కానీ బండి ఇరుసు ఏ కొలతలతో చెక్కితే బండి బ్యాలెన్సుగా నడుస్తుందో ఆ విధంగా తయారు చేసేవాడు.
ఆ పక్క వీధిలో కమ్మరి కొలిమి. ఆయనకూ చదువు రాదు. కానీ ఇనుమును కొలిమిలో ఎర్రగా కాల్చి రకరకాల సామాగ్రి తయారు చేసేవాడు.
ఒక వీధిలో వస్త్రాల హనుమంతరావు అని నా దోస్తు ఇల్లు వుండేది. ఆడామగా బట్టలు నేసే వాళ్ళు. ఇంటి బయట చేతికి రంగులు పూసుకుని దారాలకు రంగులు అద్దే వాళ్ళు. ఇంట్లో మగ్గం మీద చీరెలు ధోతులు నేసే వాళ్ళు.
చిన్నిరాములు కొట్లో మిఠాయి ఉండలు, లౌజు ముక్కలు కూడా అమ్మేవాళ్లు. ఇళ్ళల్లో లాంతర్లు, చిమ్నీ(బుడ్డి) దీపాలకు వాడే కిరసనాయిలు అక్కడే కొనేవాళ్ళం. కిరోసిన్ డబ్బా పైన ఒక మూలలో వున్న రంధ్రంలో గొట్టం లాంటి సాధనం వుంచి పైకీ కిందికీ ఒక తీగతో లాగుతూ వుంటే డబ్బాలో కిరోసిన్ సీసాల్లో పడేది. (దాన్ని బొంబాయి అంటారని తర్వాత తెలిసింది. కానీ ఆ పేరు ఎలా వచ్చిందో ఈనాటికీ తెలియదు)
ఆ పక్కనే కుండలు చేసేవారు. కుండలు చేసే విధానం చూస్తుంటే కళ్ళు తిరిగిపోయేవి. ఒక చక్రం మీద మట్టి ముద్ద వుంచి ఆ చక్రాన్ని వేగంగా ఒకసారి తిప్పే వాళ్ళు. తడి చేతి వేళ్ళతో ఆ మట్టి ముద్దను సుతారంగా తాకుతూ చిత్రవిచిత్రంగా కుండలు తయారు చేసేవాళ్ళు. ఆ ముద్ద నుంచి కుండల ఆకారాలు వస్తుంటే ఏదో మాయాజాలంగా అనిపించేది.
సత్యమూర్తి అని నా చిన్న నాటి నేస్తం. ఆయన అన్నయ్య నాగలింగాచారి బంగారు నగలు చేసేవాడు. బడికి వెళ్ళే దోవలోనే వాళ్ళ ఇల్లు. బుగ్గలు బూరెలు అయ్యేలా గొట్టంతో ఊదుతూ ఎర్రటి కొలిమిలో బంగారం కరిగించి వస్తువులు తయారు చేసేవాడు.
సాయంత్రం అయ్యేసరికి మా ఇంటికి దగ్గరలో ఉన్న వాడనుంచి బ్యాండు మేళం వినపడేది. ఆ తర్వాత తెలిసింది వాళ్లకు గిరాకీ లేని రోజుల్లో అలా తీరి కూర్చుని సినిమా పాటలు ప్రాక్టీసు చేస్తుంటారని. అలాగే సన్నాయి మేళం వాయించేవాళ్లు. మా ఇంటికి చుట్టపక్కాలు ఎవరైనా వస్తే వాళ్ళు పెట్రోమాక్స్ లైట్ తెచ్చి పెట్టేవాళ్ళు. ఆ లైటు వెలిగిస్తుంటే పిల్లలం అందరం కళ్ళప్పగించి చూస్తుండే వాళ్ళం. పొడుగాటి వత్తి తగలబడిపోకుండా చిన్న ఆకారంలోకి మారిపోయి తెల్లటి వెలుగులు విరజిమ్మడం నిజంగా ఆశ్చర్యంగా వుండేది. ఆ వత్తి ఎర్రపడి కాంతి తగ్గినప్పుడల్లా గాలి కొట్ట్టేవారు.
మా ఊరు పంచాంగాలకు ప్రసిద్ధి. వాటిని రాసే సిద్ధాంతులు ముగ్గురు వుండేవాళ్ళు. ఒకే ఊరు నుంచి మూడు పంచాంగాలు రావడం గొప్పగా చెప్పుకునే వారు. గొలుసుకట్టు రాతలో, తెలుగు అంకెలతో రాసిన పంచాంగాలను ఆ సిద్ధాంతులు తెనాలి తీసుకువెళ్లి అక్కడ అచ్చు వత్తించేవారు. ఉగాది రావడానికి ముందుగానే చుట్టుపక్కల గ్రామాలకు కాలినడకన వెళ్లి అక్కడి మోతుబరులకు పంచాంగాలు ఇచ్చి ఆశీర్వదించేవాళ్లు. సంభావన రూపంలో వచ్చిన ప్రతిఫలం ఎంత ఇస్తే అంత తీసుకుని తిరిగివచ్చేవారు.
మంచి నీళ్ళ బావికి వెళ్ళే దోవలో ముస్లింల కోసం పీర్ల సావిడి వుండేది. పీర్లను ఊళ్ళో ఊరేగించిన తర్వాత మళ్ళీ ఈ సావిడిలో భద్రపరిచేవాళ్ళు.
షెడ్యూల్ కులాలకోసం ఉసిగెవాగు అవతల ఒక కాలనీ వుండేది. అక్కడ ఒక మిషనరీ స్కూలు వుండేది.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జంధ్యాల హరి నారాయణ కృష్ణాజిల్లా కలెక్టరుగా వున్నప్పుడు మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు గారు అక్కడ కొత్త కాలనీ నిర్మాణం కోసం సుమారు ఇరవై ఎకరాలు భూమి ఇచ్చారు. చక్కటి విశాలమైన కాలనీ ఏర్పడింది. జిల్లా మొత్తంలో అదే పెద్ద కాలనీ అని చెప్పుకునేవారు.
ఊళ్ళో మరో బడి వుండేది. అందులోనే మా చదువు. స్కూలు మొత్తానికి కలిపి ఇద్దరే టీచర్లు, అప్పయ్య మాస్టారు, భద్రయ్య పంతులు గారు. బ్లాకు బోర్డులు లేవు. చుట్టూ ఫ్రేం ఉన్న బొందు పలక, సుద్ద బలపం, అవి పెట్టుకునే గుడ్డ సంచీ వుంటే వాడు అందరి దృష్టిలో స్పెషల్.
అప్పయ్య మాస్టారి తండ్రి శివరాజు నాగభూషణం గారు తెలవారకముందే లేచి స్నానసంధ్యాదులు ముగించుకుని ఇంటి బయట నిలబడి ఉచ్చైస్వరంతో ఆలపించే కృష్ణ శతకంలోని పద్యాలే ఊరంతటికీ కోడికూత.
పంచాయతీ రేడియోలో సాయంత్రం అయ్యే సరికి తెలుగు వార్తలు వినేవాళ్ళం. బెజవాడ నుంచి అంధ్రపత్రిక దినపత్రిక రెండో రోజు సాయంత్రానికి పోస్టులో మా ఊరికి వచ్చేది. అప్పయ్య మాస్టారు పత్రికలో వచ్చిన వార్తలను బిగ్గరగా చదివి వినిపించేవారు. ఆయనే మా ఊరికి రేడియో న్యూస్ రీడర్. తర్వాత అందరూ అరుగుల మీద కూర్చుని తీరిగ్గా ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు.
మా ఇంటికి వెనుక రెండు దేవాలయాలు ఒకే ప్రాకారంలో ఉండేవి. ఒకటి శివుడి గుడి. వాసిరెడ్డి జమీందారు ఆ ప్రాంతంలో కట్టించిన అనేక శివాలయాల్లో ఇదొకటి. మరొకటి ఆంజనేయుడి గుడి. పక్కనే కోనేరు వుండేది. కాలక్రమంలో అది పూడిపోయింది.
ఆ గుళ్ళకు మేమే వంశ పారంపర్య ధర్మకర్తలం. వాటికి మాన్యాల రూపంలో నలభయ్ ఎకరాల దాకా భూమి వుండేది, కానీ వాటి మీద వచ్చే అయివేజు స్వల్పం. వూళ్ళో వాళ్ళే పూనుకుని పండుగ దినాల్లో ఉత్సవాలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించేవారు.
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ వారి చిన తిరుణాలకు, అది జరిగినన్ని రోజులూ మా వూరినుంచి రంగు కాగితాలతో అలంకరించిన ప్రబ్భండ్లు (ప్రభలు) మేళతాళాలతో ఇంటికొకటి బయలుదేరేవి.
ఆ రోజుల్లో మా ఊర్లో రెండు రకాల సేద్యపు నీటి వనరులు ఉండేవి. ఒకటి చెరువు, రెండోది మునేటి కాలువ. ఒకప్పుడు ఈ రెంటి కిందా అధిక భాగం భూములు మావే.
ఐదో అక్కయ్య భర్త కొమరగిరి అప్పారావు గారిది పొరుగూరు పెనుగంచి ప్రోలు. ఆ బావగారు వచ్చినప్పుడల్లా గుర్రపు సవారీ. రాగానే గుర్రాన్ని మేతకు వదిలేసేవాడు. అది మేసినంత మేరా ‘మీ మామగారి (అంటే మా నాన్నగారు) తాలూకు పొలాలే, ఏం పరవాలేదు’ అని చెప్పుకునే వారు నా చిన్నతనంలో.
ఇప్పుడు ఇవన్నీ ఏవీ లేవు అని చెప్పను కానీ అప్పటి మాదిరిగా లేవు. కొన్ని అసలే లేవు, జ్ఞాపకాలు తప్ప.
వీరబ్రహ్మం లేడు, ఎడ్ల బళ్ళు తయారుచేసే వాళ్ళు లేరు. ఆ బండ్లు లేవు. ఎడ్లూ లేవు. ట్రాక్టర్లు వచ్చాయి. ఇంటికి రెండు చొప్పున మోటారు సైకిళ్ళు, పదో పాతికో ఏసీ కార్లు. నాటి మగ్గాలు లేవు, బట్టలు నేసేవాళ్ళు లేరు. చిన్ని రాములు కొట్టు లేదు. షట్టర్లు కలిగిన దుకాణాలు వచ్చాయి. కుండల తయారీ లేదు. స్టీలు సామాను, ఫ్రిజ్ లు గృహప్రవేశం చేసాయి.
లాంతర్లు లేవు, అందరి ఇళ్ళల్లో విద్యుత్ దీపాలే. కాలక్షేపానికి బ్యాండ్ మేళాలు లేవు, ప్రతి ఇంట్లో స్మార్ట్ టీవీలే.
పంచాయతి రేడియో లేదు. అరుగుల మీద ముచ్చట్లు లేవు. అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్స్. ఎవరి గోల వారిదే!
స్వయంసమృద్ధి కాకపోయినా స్వయంపోషకంగా వుండే మా ఊరు, ఇప్పుడు అన్ని ఊళ్లలో ఒక ఊరు. అంతే!
పాస్ పోర్టులో నేటివ్ ప్లేస్ కాలం పూర్తి చేయడానికి మాత్రం పనికి వస్తోంది.
కింది ఫోటోలు :
మా తలితండ్రుల జ్ఞాపకార్ధం మా మూడో అన్నయ్య భండారు వెంకటేశ్వర రావు నిర్మించిన అమ్మానాన్నల గుడి 'అమ్మపర్తి '






(ఇంకావుంది)

అయాం ఎ బిగ్ జీరో (306) : భండారు శ్రీనివాసరావు

 

సాగు నీటి మంత్రి - తాగు నీటి మంత్రి

నేను రేడియోలో పనిచేసే రోజుల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుమ్మల నాగేశ్వర రావు గారు రోడ్లు, భవనాల శాఖ మంత్రి. అయితే అందరికీ తెలియని విషయం ఏమిటంటే, ఒకానొక కాలంలో ఆయన మా రేడియో వార్తలకు ప్రధాన శ్రోత. (ఇప్పటి సంగతి తెలియదు).
రోడ్డు మార్గాన హైదరాబాదు నుంచి ఖమ్మం జిల్లాకు వెళ్లి వస్తున్నప్పుడు, మధ్యాన్నం 1.10 లేదా సాయంత్రం 6.15 అయితే చాలు, మంత్రి గారు ప్రయాణిస్తున్న మోటారు వాహనం రోడ్డు పక్కన నిలిచి పోయేది. ప్రాంతీయ వార్తలు పూర్తిగా విన్న తరువాత మళ్ళీ బయలుదేరేది. (అప్పట్లో ఇప్పటి నాలుగు లేన్ల రహదారి లేదు, అంచేత ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కన కారు ఆపుకునే వెసులుబాటు వుండేది)
ఈ సంగతి ఓసారి మాటల సందర్భంలో ఆయన నోటి నుంచే నేను విన్నాను.
శాసనసభలో మంత్రుల కోసం విడిగా గదులు వుండేవి. ఒక్కో గదిలో ఇద్దరేసి చొప్పున మంత్రులు వుండేవాళ్ళు. తుమ్మల గారితో పాటు మరో మంత్రి. ఒకరు భారీ నీటిపారుదల శాఖ. మరొకరు ఎక్సైజ్ శాఖ. బయట మంత్రుల పేరుతోపాటు వారి శాఖల పేర్లు వున్న బోర్డులు వుండేవి. విలేకరులు సాగు నీటి మంత్రి, తాగు నీటి మంత్రి అని హాస్యోక్తిగా అనేవారు.
తుమ్మల నాగేశ్వర రావు గారికి ఈ రెండు శాఖలు నిర్వహించిన అనుభవం వుంది.
తన నలభయ్ ఏళ్ళ పైచిలుకు రాజకీయ ప్రస్థానంలో పార్టీలు మారిన చరిత్ర వున్నది కానీ, పార్టీ మారిన తర్వాత, తాను వదిలేసిన పార్టీని గురించి కానీ, ఆ పార్టీ నాయకుడిని గురించి కానీ ఏనాడూ ఒక పొల్లు మాట మాట్లాడిన దాఖలా కనపడదు. ఆయన వ్యక్తిత్వానికి ఇదొక కొలమానంగా చెప్పవచ్చు.
నేను చదువుకునే రోజుల నుంచి, రేడియో విలేకరిగా చేరిన వరకు నాకు బాగా తెలిసిన ఖమ్మం జిల్లా నాయకులలో జలగం వెంగళరావు గారు మొదటి వారు. జిల్లా అభివృద్ధిలో ప్రతి ఇటుక మీద నా పేరు వుండి తీరుతుందని వెంగళరావు గారు తదనంతర కాలంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తరచుగా చెబుతుండేవారు.
అలాగే ఇప్పుడు అలా ఘనంగా చెప్పుకోదగిన కృషి చేసింది, చేస్తున్నదీ తుమ్మల నాగేశ్వర రావు గారని స్థానిక నాయకులు చెబుతుండగా వింటున్నాను.
చంద్రబాబు గారి మంత్రి వర్గంలో పనిచేస్తున్నప్పుడు హైదరాబాదు విలేకరులు చాలా మందికి తుమ్మల నాగేశ్వర రావు గారితో సన్నిహిత, సౌహార్ద సంబంధాలు వుండేవి. ఏ సమయంలోనైనా ఫోనులో అందుబాటులో వుండేవారు.
వారం వారం ఖమ్మం వెళ్లి వస్తుండేవారు. ఖమ్మం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో మంత్రిగా ఒక వీ ఐ పీ రూమ్ ఆయన పేరిట వుండేది. బంధుగణం ఎక్కువ కావడం వల్ల నాకూ తరచూ ఖమ్మం ప్రయాణాల అవసరం పడేది.
మా బంధువుల ఇళ్లన్నీ ఆ గెస్ట్ హౌస్ కి నడక దూరంలో వుండేవి. కాబట్టి, అందులో అకామడేషన్ కోసం అడిగేవాడిని. ఆయన వెంటనే ఏర్పాటు చేసేవారు. ఒకసారి ఆయన తన వ్యక్తిగత సిబ్బందితో చెబుతుంటే విన్నాను. ‘శ్రీనివాసరావు అడిగితే వెంటనే ఏర్పాటు చేయండి. ఒకవేళ గదులు ఖాళీ లేకపోతె, నేను ఖమ్మంలో వున్నాసరే పర్వాలేదు, నేను వేరే చోటికి వెడతాను’
అలా ఎప్పుడూ జరగలేదు కానీ ఒక మంత్రి అలా అనడం నా అనుభవంలో ఎప్పుడూ జరగలేదు.
నా స్నేహితుడు, మేనకోడలు భర్త వనం జ్వాలా నరసింహా రావుకు కూడా నాగేశ్వరరావు గారితో చాలా చనువు. నేనూ, జ్వాలా, చిన్నప్పుడు ఖమ్మం, మామిళ్ళ గూడెం రిక్కా బజార్ హైస్కూల్లో చదువుకొనేటప్పుడు ఆయనకు ఒక క్రికెట్ టీం వుండేది. ఇంగ్లాండ్ లోని ఎం సీ సీ అనే క్రికెట్ క్లబ్ మాదిరిగా ఆ టీం కి కూడా అదే పేరు పెట్టారు. అంటే మామిళ్ళ గూడెం క్రికెట్ క్లబ్ అన్నమాట.
ఈ జ్వాలాకు, మాకెవ్వరికీ లేని మాచెడ్డ మంచి అలవాటు ఒకటి వుంది. అదేమిటంటే చిన్నప్పటి నుంచీ ఇప్పటివరకు తన జీవితంలో తారసపడిన మిత్రులతో తరచూ ఫోన్లో మాట్లాడడం లేదా వీలు చూసుకుని కలవడం. నిజంగా చాలా మంచి అలవాటు. నాకు అలవడని అలవాటు.
అలా ఒకసారి హైదరాబాదులో ఈ మామిళ్ళ గూడెం క్రికెట్ క్లబ్ సభ్యులను అందరినీ ఆహ్వానించి లంచ్ మీట్ ఏర్పాటు చేశాడు. దీనికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా రావాల్సిందని అప్పటికప్పుడు ఫోన్లో పిలిచాడు. ఖమ్మం వెళ్ళే హడావిడిలో వుండి కూడా, తుమ్మల నాగేశ్వర రావు గారు కాదనకుండా వచ్చి, చాలాసేపు వుండి అందర్నీ పేరు పేరునా పలకరించి వెళ్ళారు.
కింది ఫోటో అప్పటిదే.
మే పద్నాలుగు, 2026, నాటికి తుమ్మల నాగేశ్వర రావు గారు తొలిసారి మంత్రి అయి నలభయ్ ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా వారికి అభినందనలు.



(ఇంకావుంది)

11, మే 2026, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (305) : భండారు శ్రీనివాసరావు

 

ఈ నగరానికి ఏమైయింది?
1975 వ సంవత్సరం. నవంబరు నెల.
రేడియో ఉద్యోగంలో చేరడానికి బస్సులో హైదరాబాదు వచ్చాను. నగరం పొలిమేరలకు కూడా చేరక ముందే ఆలిండియా రేడియో ట్రాన్స్ మిటర్లు (ఇప్పుడు నడిబొడ్డుకు చేరాయి) కనబడ్డాయి. బస్సు కిటికీ చువ్వలు ముట్టుకుంటే ఐసు కడ్డీలు తాకినట్టు చల్లగా తగిలేవి. చుట్టూ ఎటు చూసినా కనుచూపు మేర వరకు ద్రాక్ష తోటలు.
నగరంలో రోడ్లు తీర్చి దిద్దినట్టు ఎక్కడా గోతులు, గుంటలు లేకుండా శుభ్రంగా ఉండేవి. ఇరువైపులా పచ్చని చెట్లు. భారీ వర్షం పడినా, రోడ్లు ఏరులై పారినా, వాన వెలవగానే వరదలా వెల్లువెత్తిన నీళ్లన్నీ చప్పున మాయం అయ్యేవి. రోడ్లమీద నీళ్ళు నిలిచేవి కావు. ఇప్పుడా పరిస్తితి వుందా! లేదని చెప్పడానికి తడుముకోవాల్సిన పని లేదు.
నగరంలో జర్నలిష్టులకు మరో కాలనీ మంజూరయింది. ఎక్కడో ఊరవతల జూబిలీ హిల్స్ అట. చూద్దామని కొందరు మిత్రులతో బయలుదేరాను.
పంజాగుట్ట స్మశానం దాటగానే ఊరు కనబడలేదు. రోడ్డుకు అటూ ఇటూ విసిరేసినట్టు అక్కడక్కడా ఇళ్ళు. చెక్ పోస్ట్ దాటితే అన్నీ పొలాలే. ఎన్టీఆర్ తన కుమారుడు బాలకృష్ణ కోసం కట్టిన భవంతి ఒక్కటే దారిలో ఒంటరిగా నిలబడి వుంది. అది దాటిన తరువాత జర్నలిష్టుల కాలనీ కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలం. (పొలం అనాలా). దానికి చివర్లో పెద్ద లోయ. దాని అంచున అడ్డంగా ఇనుపకడ్డీల రెయిలింగ్. అక్కడ నుంచి చూస్తే, కింద నిండు కుండలా ఓ తటాకం. చిక్కడపల్లి నుంచి వెళ్ళిన నాకది ఓ అపూర్వ దృశ్యం.
ఇప్పుడా లోయా లేదు, తటాకమూ లేదు. లోయకు పైన జర్నలిష్టుల (బీ) కాలనీ, లోయని పూడ్చేసి సంపన్నుల కాలనీ వెలిశాయి. వీటికి ఆనుకుని ప్రభుత్వాలను, ప్రజలను శాసించే ఐ.ఏ.ఎస్.,ఐ.పీ.ఎస్., అధికారుల నివాస భవనాలు.
హైదరాబాదు నగరం చుట్టుపక్కల వేల సంఖ్యలో చిన్నా చితకా చెరువులు వుండేవని నగరం గురించి రాసిన పుస్తకాలు చదివితే తెలుస్తుంది. అదేమిటో చాలావరకు చెరువులన్నీ మంత్రం వేసినట్టు మాయమై పోయాయి. వాటిల్లో చిన్న స్థాయి వాళ్ళు కట్టుకున్న చిన్న వాడలు, మధ్యతరగతి వాళ్ళు వుండే అపార్ట్ మెంట్లు, ఇంట్లో వంట్లో పుష్కలంగా వుండే కలిగినవాళ్ళు నివసించే సంపన్న కాలనీలు అంగుళం జాగా లేకుండా వెలిసాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ కుంచించుకు పోయినా ఇంకా మిగిలే వున్నాయి. సంతోషించాలి.
గతంలో గండిపేట చెరువు చూడడానికి విహార యాత్రకు వెళ్ళేవాళ్ళం. అందులో అపార జలరాశిని చూస్తుంటే కడుపు నిండిపోయేది. (అలాంటి దృశ్యాలు ఇప్పుడు కేవలం పాత తెలుగు సినిమాల్లో మాత్రమే కనబడతాయి)
ఇప్పుడు అదే తటాకం వేసవిలో వట్టిపోయి రాళ్ళు తేలి కానవస్తోంది.
ఒకప్పుడు ఏడాదిలో చాలా మాసాలు, ఎయిర్ కండిషన్లు సరే, కనీసం పంకాలు కూడా అవసరం లేని చల్లటి వాతావరణం కలిగిన హైదరాబాదులో ఎండలు మండుతున్నాయని ఇప్పుడు గగ్గోలు పెడితే ఏమి లాభం? అంతా స్వయంకృతం.
తోకటపా:
మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, హరివిల్లు విరిస్తే !
రెండేళ్ల క్రితం మండే వేసవిలో ఒక రోజు :
'త్తాతా త్తాతా' అంటూ నా గదిలోకి పరిగెత్తుకు వచ్చింది నా మనుమరాలు జీవిక. తా కు వత్తు పెట్టి పిలవడంలోనే కనిపిస్తోంది దాని ఎక్జైట్ మెంట్.
'తాతా! వాన, ర్రెయిన్! దా దా ' అంటూ చేయి పట్టి బయటకు తీసుకువచ్చింది.
అపార్ట్ మెంట్ జీవితాల్లో, పిడుగులు పడితే తప్ప, చినుకుల చప్పుడు లోపల వినపడదు. వర్షాన్ని టీవీల్లో చూడాల్సిందే.
వెంటనే చిన్నతనం గుర్తుకు వచ్చి ఓ కాగితం పడవ తయారు చేసి, చిన్నదాన్ని వెంటబెట్టుకుని కిందికి వెళ్లి వర్షపు నీళ్లలో కాగితపు పడవ మజా ఏమిటో చూపించాలని బయట తలుపు తెరిచాను. మండుతున్న శరీరాలు చల్లపడేట్టు ఒక్క ఉదుటున చల్లగాలి తోసుకు వచ్చింది. లక్షల ఎయిర్ కండిషనర్లు చేయలేని పని ఒక్క వాన చేసింది.
అడుగు బయట పెట్టే లోగా కరెంట్ ఫట్. వాన రాకడ కరెంటు పోకడ అంటారు అందుకే.
కరెంటు లేకపోతే లిఫ్ట్ పనిచేయదు. అంచేత కాగితపు పడవల ఆటకు అలా బ్రేక్ పడింది. ఏమిటో జీవితం! స్మాల్ ప్లెజర్స్ కు కూడా నోచుకోలేదు.



(ఇంకావుంది)

6, మే 2026, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (304): భండారు శ్రీనివాసరావు

ఎర్రటి ఎండలో పుట్టింటికి ప్రయాణం
75 ఏళ్ళక్రితం నాటిన మొక్క ఈనాడు ఒక మహావృక్షంగా తయారయింది. ఆ శీతలతరుచ్ఛాయలో మూడు దశాబ్దాలకు పైగా సేదతీరినవాడిని. మహామహులు తచ్చాడిన ఆ ప్రదేశంలో నేను సైతం అంటూ, 1975 లో ప్రవేశించి ఆడుతూ పాడుతూ హాయిగా ఉద్యోగం చేసిన వాడిని.
2025 ఏప్రిల్ మాసం
నేను పనిచేసిన ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం 75 వ వార్షికోత్సవం ఏప్రిల్ పదిహేనున.
హైదరాబాదు కేంద్రం వార్తావిభాగంలో చాలా సంవత్సరాలు పనిచేశాను. చేరిన చోటనే రిటైర్ కావాలన్న నా అభిలాష నెరవేరకుండానే చివరాఖరి సంవత్సరంలో నన్ను హైదరాబాదు దూరదర్సన్ వార్తా విభాగానికి బదిలీ చేశారు. అదొక్కటే అసంతృప్తి.
అన్ని సంవత్సరాల అనుబంధం ఉన్న హైదరాబాదు ఆకాశవాణి కేంద్రానికి డెబ్బయ్ అయిదేళ్ళ పండుగ అంటే అందులో పనిచేసిన వారికి పుట్టింటి పండుగే. మరీ ముఖ్యంగా నాకు.
రేడియో పట్ల నా అనురాగం తెలిసిన వాళ్ళు కనుక, నాలుగు ముక్కలు మాట్లాడాలని వారినుంచి పిలుపు. వాళ్ళు పంపిన కారులోనే ఎగురుకుంటూ వెళ్లాను.
పుట్టింటి ఆరాటం అంటే ఏమిటో ఆనాడు ఆకాశవాణికి వెళ్ళినప్పుడు అర్ధం అయింది. రిటైర్ అయి, అడుగు బయట పెట్టి ఇరవై ఏళ్ళు. కానీ బయట గేటు దగ్గర సెక్యూరిటీ వాళ్ళ దగ్గర నుంచి అక్కడ పనిచేస్తున్న డ్యూటీ ఆఫీసర్లు, ఇంజినీర్లు, ప్రోగ్రాం అధికారులు, అన్ని విభాగాల సిబ్బంది గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించడం, యోగక్షేమాలు ఆరా తీయడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఎవర్నీ కాదనలేక ఎన్ని సార్లు, ఎన్ని టీలు తాగానో లెక్కేలేదు.
అప్పుడు న్యూస్ యూనిట్ లో మాతో పనిచేసి, ఇప్పుడు స్టేషన్ డైరెక్టర్ వద్ద పీ ఎస్ గా పనిచేస్తున్న మా న్యూస్ యూనిట్ ‘చిట్టి చెల్లెలు’ శైలజ ఆనందానికి అంతులేదు. మా ఆవిడని అమ్మా అని పిలిచేది. శైలజ లాంటి ఆడపిల్ల వుంటే ఇంట్లో దీపం అక్కరలేదు అనేది మా ఆవిడ.
ఒకప్పుడు నేను పనిచేసినప్పుడు అచ్చు ప్రభుత్వ కార్యాలయం మాదిరిగా ఉన్న అదే ఆఫీసు ఇప్పుడు కార్పొరేట్ హంగుల్ని సమకూర్చుకుంది. మా న్యూస్ రూమ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అంతా డిజిటలైజ్ చేసారు. ప్రసారం అయిన ప్రతి బులెటిన్ ని ఏ.ఐ.ఆర్. వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేస్తున్నారు. ఏవిటో, అందరూ వినే రోజుల్లో ఇన్ని భోగాలు లేవు.
రికార్డింగు జరిగింది కాసేపే. ఎక్కువ సమయం, నేను పనిచేసిన రోజుల్లో వున్న తోటి సహోద్యోగులతో, నేను రిటైర్ అయిన తర్వాత చేరిన వారితో మాటా ముచ్చట్లతో గడిచింది.
నిజానికి ముప్పయి ఏళ్ళ పైచిలుకు కాలంలో నేను చేసింది కూడా ఇదే.
‘శ్రీనివాసరావు అసలు ఆఫీసుకు రావడమే గగనం. వచ్చాడంటే చాలు, ఆయన చుట్టూ అందరూ, అందరి మధ్యా ఆయన’ అనే పేరొకటి.
ఇక రేడియో గురించి నేను కొత్తగా చెప్పేది ఏముంటుంది? వార్తకు ప్రాణం విశ్వసనీయత. అదే ఇన్నేళ్ళుగా రేడియో వార్తల్ని బతికిస్తోంది. అప్పటికి ఎవరం ఉంటామో ఉండమో తెలియదు కానీ, ఇదే రేడియో కేంద్రం నూరేళ్ళ పండుగ జరుపుకోవడం తథ్యం. అది నా కోరిక.
నిజానికి నేను చేసింది చాలా చిన్న ఉద్యోగం. అంత చిన్న మనిషిని ఇంత పెద్దవాడిని చేసింది రేడియోనే అనే విషయం నేను ఎప్పటికీ మరిచిపోలేను.
నా ఉద్యోగం హోదా ఏమైనప్పటికి, ఆలిండియా రేడియో హైదరాబాదు కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్, హెడ్ ఆఫ్ ఆఫీస్ బి. హరి సింగ్, కేంద్రం ప్రోగ్రాం హెడ్, ఎస్. రమేశ్ సుంకసారి, డిప్యూటీ డైరెక్టర్ న్యూస్ ఎం.ఎస్. మహేష్, అసిస్టెంట్ డైరెక్టర్ న్యూస్ సురేశ్ ధర్మపురి, న్యూస్ కరస్పాండెంట్ లక్ష్మి తమ హోదాలను పక్కనబెట్టి బయట వరకు వచ్చి సాదరంగా నాకు వీడ్కోలు చెప్పారు. వారి గొప్ప మనసుకు మనసారా ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుని కారెక్కాను.
పుట్టింటిని మరిచిపోవచ్చేమో కానీ, పుట్టిల్లు ఎన్నటికీ మరవదు.
తోకటపా: డ్రైవర్ చిన్నా దోవలో నాతో అనేక ముచ్చట్లు చెప్పాడు. నేను రేడియోలో చేరినప్పటికి అతడు పుట్టనే లేదట. పెరిగి పెద్దయినప్పుడు రేడియోలో నా గొంతు వినేవాడట. అలా నన్ను గుర్తు పట్టాను అన్నాడు. మాటల మధ్యలో అడిగి నా వయసు తెలుసుకున్నాడు.
' చూసారా! మన రేడియో స్టేషన్ కంటే వయసులో మీరే నాలుగేళ్లు పెద్ద' అనడం నాకు నవ్వు తెప్పించింది.
థాంక్స్ చిన్నా!
కింది ఫోటోలు: ఆలిండియా రేడియోలో తీసినవి.






(11-04-2025)
ఇంకా వుంది

5, మే 2026, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (303): భండారు శ్రీనివాసరావు

 

హాఫ్ పోస్తుమస్ అవార్డ్
‘ఎప్పుడూ ఆ కంప్యూటర్ ముందు కూర్చుని టిక్కు టిక్కుమంటూ టైప్ చేస్తుంటారు, గూడలు అరిగిపోయేలా?’ (ఏమిటి ఉపయోగం? కూటికా! గుడ్డకా! సినిమాకా!) అనేది నా భార్య బతికున్న రోజుల్లో. బ్రాకెట్లో రాసినవి నా సొంత కపిత్వం.
రిటైర్ అయిన తర్వాత నేను రాస్తూ వచ్చిన వ్యాసాలను కొన్ని పత్రికల వాళ్ళు వేస్తూ వచ్చారు కానీ రచయితకు విదిలించింది ఏమీ లేదు. ఎక్కడో అక్కడ నేను రాసిన అక్షరాలకు, నలుపూ తెలుపూ రంగులు అంటుతున్నాయి కదా అని నేనూ పట్టించుకోలేదు.
పొతే, నా బ్లాగుకు హిట్లు అన్ని లక్షలు అని చంకలు కొట్టుకోవడం తప్పిస్తే దాని రాతలవల్ల నాకు అంటుకున్నవి మెడ నొప్పులు, గూడ నొప్పులు మాత్రమే.
కొన్నాళ్ళ క్రితం అమెరికాలో ఉంటున్న మా అన్నయ్య కుమారుడు సత్య సాయి కష్టపడి నా బ్లాగును Google Adsense తో అనుసంధానం చేశాడు. పాత వాటిని ఆ సంస్థ లెక్కలోకి తీసుకోదట. పోనీలే అనుకున్నాను.
ఆ మధ్య ఎప్పుడో చూస్తే రెండు అమెరికన్ డాలర్లు నా ఖాతాలో పడ్డట్టు కనిపించింది. అవి నా బ్యాంకు ఖాతాకు చేరి, జీ ఎస్ టి పోను ఎంత మిగులుతుందో అది నాకనవసరం.
డెబ్బయి అయిదేళ్ళ వయసులో నా రాతల ద్వారా నేను రెండు డాలర్లు సంపాదించాను, అంతే నాకు కావాల్సింది.
నా భార్య బతికి వుంటే, నేనో మిలియన్ డాలర్లు సంపాదించినంత సంతోషపడి వుండేది.
ఈసారి అమెరికా వెళ్ళినప్పుడు నా మనుమరాళ్లకు నా డబ్బులతో చిన్న చాకలేట్ కొనివ్వగలను అనే ఊహే నాకు ఆనందాన్ని ఇచ్చింది.
కానీ మా ఆవిడతో కలిసి మరోసారి, అదే ఆఖరు సారి, కలిసి వెళ్ళడం, అప్పటికి మా మనుమరాళ్లే ప్రయోజకులై, మా అవసరాలను వాళ్ళే కనుక్కునే స్థాయికి చేరారు.
ఇది జరిగి చాలా కాలం అయింది.
నా బ్యాంకు ఖాతాలో, చాలా కొద్ది మొత్తంలోనే అనుకోండి, మరిన్ని డాలరు డబ్బులు, జి ఎస్.టి మినహాయించుకుని, రూపాయల రూపంలో చేరాయి. ఇది ఇలా వుండగా META నుంచి మరికొన్ని డాలర్లు వచ్చాయి. నా పెన్షన్ డబ్బులు బొటాబొటిగా నా అవసరాలను తీరుస్తున్నాయి. ఇలా అదనంగా వచ్చే ఈ డబ్బులు అవసరంలో ఉన్నవారి అవసరాలను తీర్చడానికి సరిపోయేవి కాదు. పర్సులో చిల్లర డబ్బుల మాదిరి.
‘సిరి దావచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి దాఁ బోయిన బోవును కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!
అన్నట్టు, వచ్చినా పోయినా పట్టించుకోని స్థిత ప్రజ్ఞత వున్న వాడే నిజమైన ఆనందాన్ని పొందగలుగుతాడు. ఒక వయసు దాటిన తర్వాత డబ్బు అవసరం ఉండవచ్చు కానీ, అదే ప్రధానం కాదు.
కిందటి ఆదివారం కాక, అంతకు ముందు ఆదివారం నాడు ఒక తెలియని నెంబరు నుంచి ఫోన్ వచ్చింది. గ్యాస్ సిలిండర్ కోసం ఏమో అని రాంగ్ నెంబర్ అనే లోగా అవతలి గొంతు, ‘నా పేరు రాజగోపాల్! హై బిజ్ టీవీ సీ ఈ ఓ’ అని పలకరించింది.
వారు ఫోనులో చెప్పిన విషయం ఏమిటంటే ఈ ఈ ఏడాది వారి సంస్థ తరపున ఇచ్చే లెజెండ్ ఇన్ జర్నలిజం అవార్డ్ కు నన్ను ఎంపిక చేశారట. అదీ రేడియో జర్నలిజం రంగంలో. చిత్రం ఏమిటంటే, మా ఆవిడ పోయిన తర్వాత ఈ గుర్తింపులు. హాఫ్ పోస్తుమస్ అవార్డ్ అంటే ఇదే!
లొకేషన్ తీసుకుని మా ఇంటికి వచ్చారు. ‘వ్యక్తిగతంగా ఆహ్వానించడానికి వచ్చాను’ అని చెప్పారు చాలా మర్యాదగా. ఎండన పడి ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయడానికి మా ఇంట్లో వసతి లేదు.
‘నా గురించి మీరు ఎలా తెలుసుకున్నారు’ అనేది నా ప్రశ్న. ‘ఫేస్ బుక్ రీడర్ని’ అని జవాబు.
ఓహో! జీరో ముందు ఒకటి చేరుతోంది అన్నమాట.
‘మీరిచ్చే ఈ అవార్డ్ నాకు హాఫ్ పోస్తుమస్’ అన్నాను. నివ్వెరపోతుంటే ‘మా ఆవిడ వుండుంటే సంతోషపడేది’ అన్నాను.
కాసేపు కూర్చుని వెళ్ళిపోయారు.
ఆ ఆదివారం వచ్చింది. మా పెద్దన్నయ్య కుమారుడి గృహ ప్రవేశం అంతకు ముందు రాత్రే జరిగింది. అక్కడికి వెళ్లి వచ్చాను. మర్నాడు ఆదివారం పగటిపూట సత్యనారాయణ వ్రతం.
హైబిజ్ టీవీ వాళ్ళు పంపించిన కారులో శిల్పారామం దగ్గర సైబర్ గార్డెన్స్ కన్వెన్షన్ సెంటర్ కు వెళ్లాను. పాత్రికేయ మితృలు అనేకమంది కలిసారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన సుశీల్, రచయిత్రి మృణాలిని, సాక్షి రెంటాల జయదేవ్, ఆలిండియా రేడియో గోపీచంద్ సాటి అవార్డు గ్రహీతల్లో వున్నారు. మరో పాత్రికేయ మిత్రుడు ములుగు సోమశేఖర్, రేడియో సహచరుడు రాంబాబు ఇలా చాలా మంది కలిసారు. అవార్డు కన్నా ఇంతమంది పాత మిత్రులను కలవడం మరింత సంతోషం కలిగించింది.
అవార్డు ప్రదానం చేసిన రాష్ట్ర ఐ.టీ. శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆప్యాయంగా పలకరించారు. నిజానికి వారి నాన్నగారు, ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ శ్రీపాదరావు గారితో నాకు మరింత అత్యంత సన్నిహిత పరిచయం. అన్యాయంగా నక్సలైట్ల చేతిలో మరణించారు.
ముసలితనంలో వసంతం జరిపించిన హైబిజ్ టీవీ రాజ్ గోపాల్ గారికి, వారి బృందానికి కృతజ్ఞతలు.














(ఇంకా వుంది)

30, ఏప్రిల్ 2026, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (302) – భండారు శ్రీనివాసరావు

 

తప్పులపై కత్తి దూసిన పాత్రికేయుడు
వేదిక మీద కూర్చొన్న కుర్చీలో నుంచి లేచి పది పదిహేను అడుగులు నడిచి, మైకు దగ్గరకు వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో అంతకంటే నా ప్రసంగానికి ఆరోజు తక్కువ సమయం పడుతుందని సభికులు కానీ, సభానిర్వహకులు కానీ ఊహించి వుండరు.
‘ఇంకా ఎంతసేపురా బాబూ ఈ సోది’ అని వినేవాళ్ళు అనుకోకముందే ప్రసంగం ముగించేవాడు, ‘అయ్యో! అప్పుడే అయిపోయిందా ఇంకా కాసేపు మాట్లాడితే బాగుండేది అని శ్రోతలు భావించేవాడు మంచి వక్త అని ఏనాడో నా ఈ సీరియల్ లోనే రాసుకున్న గుర్తు.
సందర్భం ప్రముఖ రచయిత, సంపాదకుడు శ్రీ ఎం వీ ఆర్ శాస్త్రి గారి డెబ్బయ్ అయిదవ పుట్టినరోజు వేడుక. ఇటీవలే, ఏప్రిల్ 22 బుధవారం నాడు, హైదరాబాదులో ఖత్రియ హోటల్లో ఆయన మిత్ర బృందం నిర్వహించారు. నగరంలోని చిన్నా పెద్దా, అతి పెద్ద పాత్రికేయులు, పురప్రముఖులు శాస్త్రి గారి మీది గౌరవంతో తరలి వచ్చారు. శాస్త్రి గారిని, వారి సతీమణి దుర్గ గారిని ఘనంగా, సముచితంగా సత్కరించారు.
ఆ సందర్భంగా చాలా మంది ఘనాపాటీలు శాస్త్రి గారి గురించీ, వారి విద్వత్ సంపద గురించీ చాలా ఘనమైన ప్రసంగాలు చేశారు. అవన్నీ పత్రికల్లో వచ్చాయి కూడా.
ఆ క్రమంలో శాస్త్రి గారిని గురించి నన్నూ నాలుగు మాటలు మాట్లాడమన్నారు. పై ప్రస్తావన అప్పటిది అన్నమాట.
‘సభకు నమస్కారం. నేను ప్రసంగాలు చేయను. ఓ కధ చెబుతాను. అదీ శాస్త్రి గారు చెప్పిందే సుమా!’ అని మొదలు పెట్టి కొనసాగించాను.
‘గతంలో వయోధిక పాత్రికేయ సంఘం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ శాస్త్రి గారు, తాను ఆంధ్రభూమిలో పనిచేసేటప్పుడు ఓ వింత ఆలోచన కలిగిందనీ, దాన్ని ఆచరణలో పెట్టడానికి వరదాచారి గారు ఒక్కరే సమర్ధులని నిర్ణయించుకుని ఆ బాధ్యత ఆయన భుజస్కంధాలపై వుంచామని చెప్పుకొచ్చారు.
అదేమిటంటే వివిధ తెలుగు దినపత్రికల్లో వస్తున్న భాషాదోషాలను, సంపాదకీయాల్లో దొర్లే గుణదోషాలను ఎత్తి చూపే ఒక శీర్షిక నిర్వహణ అన్నమాట. ‘దిద్దుబాటు’ అనుకుంటా ఆ కాలమ్ పేరు.
ఈ రోజుల్లో, శాస్త్రిగారు చెప్పిన సంగతి పెద్ద విషయం కాకపోవచ్చు. ఎందుకంటే పత్రికల నడుమ జరుగుతున్న కలంపోట్లని జనం అందరూ గమనిస్తున్నారు. కానీ ఇది పాతకాలం ముచ్చట. విలువలు, మశానము అంటూ దేవిరించే రోజులు అవి.
వరదాచారి గారి నాలుకకే పదును ఎక్కువ అనుకుంటే, ఇక ఆయన కలానికి ఉన్న పదును ఎలాంటిదో వేరే చెప్పాలా!
శాస్త్రి గారి మాటపై ఆయన తన కలాన్ని ఝలిపించారు.
అన్ని పత్రికలు ముందేసుకుని చిత్రిక పట్టారు. ఎక్కడ ఏ దోషం వున్నా దాన్ని ఉతికి ఆరేసే వారు.
పక్క పత్రికల మీద రాతలు కదా! ఆంధ్ర భూమిలో పనిచేసే వాళ్ళు, వరదాచారి గారి చెణుకులను బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ‘ఆ వరద హస్తం మన వైపు చూపిస్తే, కొంపలు అంటుకుంటాయి’ అనే భయం కూడా మనసు మూలల్లో వుండేది.
అన్నంత పనీ జరిగింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇంకా అనేక ఇతర ప్రముఖ పత్రికల భరతం పట్టిన తర్వాత, వరదాచారి గారు ఆంధ్రభూమి వైపు దృష్టి సారించడమే కాదు, బాణం ఎక్కుపెట్టి గురిచూసి కొట్టారు. భూమిలో వచ్చే అపభ్రంశపు రాతలను, చీల్చి చెండాడారు. దొర్లుతున్న స్ఖాలిత్యాలను ఎత్తి చూపారు. ఈ విషయంలో ఆయనకు స్వపరబేధం లేదు.
ఆ దూకుడు రాతలు చూసి భూమి సిబ్బందే నివ్వెరపోయారు.
ఇలాంటి రాతలు వరదాచారి గారు మాత్రమే రాయగలరు.
ఇలాంటి రాతలు ఎం వీ ఆర్ శాస్త్రి గారి లాంటి ఎడిటర్ మాత్రమే రాయించగలరు.
శాస్త్రి గారు ఇక ఎలాంటి ఆస్తిపాస్తులను కూడబెట్టాల్సిన అవసరం లేదు. రాదు. ఆయన అంతటి భాగ్యశాలి మరొకరు వుండబోరు అనడానికి ఈనాటి ఈ వేడుకే సాక్ష్యం. కేవలం ధనధాన్యాలు, సిరి సంపదలు మాత్రమే ఒక వ్యక్తిని సంపన్నుడిని చేయలేవు. అదే కొలమానం అయితే, వేదిక మీదా, కిందా వున్న వారిలో అధిక సంపన్నులు చాలామంది వున్నారు.
అయితే మీరు కూడబెట్టిన సంపదను లెక్కకట్టే కరెన్సీ కౌంటింగ్ మిషన్లను ఇంకా కనుక్కోలేదు, మీ ఖాతాలో పేరుకుపోయిన అభిమాన ధనంపై పన్ను వేయగల సామర్ధ్యం ఆదాయపు పన్ను శాఖకు వుంటుందని అనుకోను.
ఇంటికి వెళ్ళగానే మీకు దిష్టి తీయమని మీ శ్రీమతి గారికి నా విజ్ఞప్తి.
చివర్లో ఒక్క మాట. వృత్తి రీత్యా ఆయన శిఖర సమానుడు. ఆ విధంగా ఆయనకు శత సహస్ర వందనాలు. వయసు రీత్యా నాకంటే నాలుగయిదేళ్ళు చిన్న. అంచేత ‘శతమానం భవతి’ అని ఆశీర్వదిస్తున్నాను.”
కింది ఫోటోలు: శాస్త్రి గారి అమృతోత్సవంలో వేదికపై, శాస్త్రి గారు, షణ్ముఖ శర్మ గారి వంటి దిగ్గజాల పక్కన నేను.







(ఇంకా వుంది)

28, ఏప్రిల్ 2026, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (301) : భండారు శ్రీనివాసరావు

ఓ కధ చెప్పుకుందాం
నిజానికి ఇది కధ కాదు. నిజ జీవితమే.
కధల కోసం కంచికి పోనవసరం లేదు, జీవితాల్లోకి తొంగి చూస్తే కనబడతాయి, మనసును ఆర్ద్రం చేసే కధలు. అలాంటిదే ఇది.
మా స్వగ్రామంలో పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తి కొంత వుంది. వుందని తెలుసు కానీ వాటి ఆజాపజా మా అన్నదమ్ములు నలుగురికి కానీ, అన్నదమ్ముల సంతానం పది మందికి కానీ ఎవరికీ తెలియదు. కొంచెం తెలిసిన మా మూడో అన్నయ్య ఆకాలంగా కాలం చేశాడు. అల్లాగే మా పెద్దన్నయ్య కూడా. ఇప్పుడు ఇద్దరం మిగిలాము.
చిన్నవాడి నైన నాకే రేపోమాపో ఎనభయ్ నిండుతున్నాయి. మా రెండో అన్నయ్య ఎనభయ్ నాలుగు. ఇక ఆస్తి పాస్తులు గురించి తెలుసుకోవాల్సిన అగత్యం, అనుభవించాల్సిన అవసరం మా ఇద్దరికీ ఈ వయసులో ఉంటుందని అనుకోను.
ఈ నేపధ్యంలో, నాలుగేళ్ల క్రితం అనుకుంటాను, ఖమ్మంలో వుండే మా మూడో అన్నయ్య కొడుకు భండారు రమేశ్ వీటి విషయం తెలుసుకోవాలని నడుం కట్టాడు. అడ్డదిడ్డంగా పెరిగిన చెట్లూ పుట్టల్ని తొలగించి, పొలాలని కొత్తగా సర్వే చేయించే బృహత్తర కార్యక్రమాన్ని ఈ మండే ఎండల్లో నెత్తికి ఎత్తుకున్నాడు. ఈ క్రమంలో వాడి కంటికి కనిపించిన ఒక మానవీయ దృశ్యానికి ఇది అక్షర రూపం. అదే ఇది:
“కింది ఫోటోలో కనిపిస్తున్న మనిషి పేరు పిండిప్రోలు పిచ్చయ్య. భార్య పేరు పిచ్చమ్మ. వీరికి ఈడుకు వచ్చిన ఒక కూతురు కూడా ఉంది.
ఈ పిచ్చయ్య ఒకప్పుడు కంభంపాడు గ్రామం లోనే వుంటూ, కూలి పనులు చేసుకుని జీవించేవాడు. కూతురు కుట్టు మిషన్ పనిచేస్తూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేది.
అయితే అనుకోని సంఘటనతో వీరి కుటుంబ జీవనం తలకిందులైంది. కొంత మంది కామాంధుల పైశాచిక చేష్టలతో వీళ్ల కూతురు మానసికంగా దెబ్బతింది. దీంతో ఆమె తల్లి కూడా అనారోగ్యానికి గురైంది. తల్లీ కూతుళ్లు ఇద్దరూ కూడా, వంటి మీద బట్టలు వేసుకోకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడంతో, వీరు తమ ఇళ్ళ మధ్య ఉండటానికి గ్రామస్తులు ఇష్టపడలేదు.
దాంతో, ఊరికి దూరంగా, చెట్టు నీడ కూడా లేని ప్రదేశంలో ఒక రేకుల షెడ్డులోనే చాలా ఏళ్ళుగా ఉంటున్నారు. కనీసం తాగడానికి నీళ్లు లేక పోగా, కనుచూపు మేరలో విద్యుత్ వెలుగులు కూడా కనిపించవు. పిలిచినా పలికే నాధుడే ఉండడు. ఉన్నా పలకరు. గ్రామ బహిష్కారం లాంటి శిక్ష. పగలు మండుటెండలో, రాత్రుళ్లు కటిక చీకట్లో ఆ రేకుల షెడ్డు లోనే కాలం వెళ్లదీస్తున్నారు.
ప్రతిరోజు వాళ్లకు కావలసినవన్నీ పిచ్చయ్య సమకూర్చుతూ ఉంటాడు. రోజువారీ వాడే నీళ్ల నుంచి మంచినీళ్ల వరకు తానే స్వయంగా తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాడు. పిచ్చయ్య ఒక్కడి రెక్కల కష్టంతోనే వాళ్ళిద్దరూ అక్కడ ఒంటరిగా జీవిస్తున్నారు. పిచ్చయ్య కూడా పెద్దవాడు కావడంతో ఓపిక సన్నగిల్లి ఆదాయవనరులు తగ్గిపోయాయి. తల్లి కూతుర్లు ఆ రేకుల షెడ్డు దాటి బయటకు రారు, రాలేరు.
“ఈ విషయం మా రమేశ్ దృష్టికి వచ్చింది. ఒకరిద్దరు చెప్పడంతో, ఖమ్మంలో వుంటున్న వాడు, కంభంపాడు వెళ్లి మాకున్న ట్రాన్స్ఫారం పొలం ఆనుకుని, ఒక మూలన పొలానికి అడ్డు లేకుండా ఒక చివరన జాగా చూపెట్టి, తాత్కాలికంగా ఉండమని చెప్పాడు. . దీంతో వాళ్లు అక్కడ ఒక రేకుల షెడ్డు నిర్మించుకొని ఉంటున్నారు. వాళ్ళు వుంటున్న షెడ్డు అదే.
పిచ్చయ్య కోరిక ప్రకారం ఎక్కడో ఒకచోట వారికి ఒక గూడు ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. వాడు మొదలు పెట్టిన ఈ ప్రయత్నానికి మిత్రులు కొందరు సహకరించారు. మా మూడో అన్నయ్య పెద్ద కుమారుడు రఘు రెవెన్యూ డిపార్ట్ మెంటులో ఉద్యోగి. ఇంగువ అనంత రామయ్య గారి మనుమడు గోపాలకృష్ణ కలిసి, వీళ్ళకి పోరంబోకు స్థలం చూపించి శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఈ విషయంలో తలా ఒక చేయి వేస్తున్నారు.
ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకు వెళ్ళారు. వారికి స్థలం కేటాయించి, నివాస గృహం ఏర్పాటు చేయడానికి రెవెన్యూ అధికారులు సైతం సుముఖత వ్యక్తం చేశారు.
ఈ కధనానికి మా కుటుంబంలో వాళ్ళ స్పందన మొదలయింది. సోలార్ ద్వారా ఆ షెడ్డుకు ఒకటి, రెండు బల్బుల విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రతిపాదన వచ్చింది.
అతి త్వరలోనే ఆ కుటుంబానికి ఒక ఆధారం ఏర్పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మా భండారు సంతానం మేలిమి బంగారం. ఇలాంటి వాటిల్లో వాళ్ళు ఎప్పుడు ముందే వుంటారు. మేము సైతం అని ముందుకు వచ్చారు.
పిచ్చయ్య కుటుంబానికి ఆధారం దొరుకుతుంది. కానీ ఇలాంటి అభాగ్యులు ఈ దేశంలో ఎంతమంది వున్నారో!



(ఇంకావుంది)