20, మే 2026, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో : (311): భండారు శ్రీనివాసరావు

 వన్ మ్యాన్ ఆర్మీ

కింది ఫోటోల్లోని మనిషిని తెలియని వాళ్ళు వుండరు. విశ్రాంత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు గారు. కానీ తెలియని సంగతల్లా నడిరోడ్డు మీద ఆయన ఎందుకలా నిలబడ్డారు? దూరం నుంచి చూస్తే,  ట్రాఫిక్ పోలీసులు నిలబడే ట్రాఫిక్ ఐ లాండ్ లా వుంది. ఒక పక్క నుంచి సిటీ బస్సు వెడుతున్నట్టు కానవస్తోంది. ఏవేవో కేబుల్స్ వేలాడుతున్నాయి. రోడ్డు భద్రతకు సంబంధించిన బోర్డు అడ్డంగా వుంది. అక్కడ వున్న ఒక కాంస్య విగ్రహాన్ని అది చాలావరకు కప్పివేస్తోంది. మాజీ ఉపరాస్ట్రపతిగా అత్యంత భద్రత కలిగిన వెంకయ్య నాయుడు గారు అలాంటి చోటుకు ఎందుకు వెళ్ళారు అనేది రెండో ఫోటో చూస్తే అర్ధం  అవుతుంది.

ఈరోజు మే ఇరవై, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి. వారి సంస్మరణార్ధం ప్రకాశం అధ్యయన సంస్థ ఆధ్వర్యంలో అక్కడ ఒక కార్యక్రమం జరిగింది.

అనేక సంవత్సరాలుగా మే ఇరవై ప్రకాశం గారి వర్ధంతి నాడు, మళ్ళీ ఆగస్టు ఇరవై మూడో తేదీ ప్రకాశం గారి జయంతి నాడు ఒక దీక్ష మాదిరిగా ఆ మహానీయునికి  ఈ పుష్పాంజలి కార్యక్రమాన్ని   నిర్వహిస్తున్నది,  ఆ సంస్థకు కర్తా, కర్మా క్రియ అయిన టంగుటూరి శ్రీ రాం. వన్ మ్యాన్ ఆర్మీ అనేది ఈయన గురించే. వీరి నాన్నగారు టంగుటూరి సూర్యనారాయణ గారు తన కొడుక్కు వారసత్వంగా ఏమి ఆస్తులు ఇవ్వలేదు కానీ, ఇలాంటి బాధ్యతలు ఒప్పగించి దాటిపోయారు. మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు అయిదుగురు ముఖ్యమంత్రుల దగ్గర ప్రధాన పౌర సంబంధాల అధికారిగా పనిచేసే బహు పాత కాలంలో,  ఈ సూర్య నారాయణ గారు నాకు పరిచయం. ఆయన ఇంటి పేరు చూసి ప్రకాశం పంతులు గారికి బంధువు ఏమో అనుకునేవారు వున్నారు. నాకు తెలిసి వారి ముత్తాతల కాలంలో దాయాది బంధుత్వం వుండేది. ఆ కుటుంబానికి ప్రకాశం గారంటే అంతులేని అభిమానం. అంతే!

అలాంటి అభిమానం, గౌరవంతోనే వెంకయ్య నాయుడు గారు ఈ కార్యక్రమానికి అడిగిన వెంటనే వచ్చారు. అదీ ఎప్పుడూ? చివరి నిమిషంలో ఏదో కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కష్టం మీద ఆయన్ని కలసి నిర్వాహకులు శ్రీ రాం ఆహ్వానించినప్పుడు, ప్రకాశం గారి పేరు వినగానే వెంకయ్య నాయుడు గారు, వారి మీద తన అభిమానంతో వెంటనే  అంగీకరించారు.  వారిలాగే అనేకమంది ఈ ఉదయం  రవీంద్ర భారతి, ఆకాశవాణి, అసెంబ్లీ ఎదురుగా మూడు రోడ్ల కూడలిలో వున్న ప్రకాశం పంతులు గారి కాంస్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన వారిలో వున్నారు. ఉదయపు వేళ అయినా వేసవి ఎండ చురుక్కుమనిపిస్తున్న సమయంలో వచ్చారు అంటే ప్రకాశం గారి మీద తమకున్న అభిమానంతోనే. వీరిలో చాలామంది వృద్ధులే కావడం ఆశ్చర్యం.

వెంకయ్య నాయుడు గారు తాము చెప్పినట్టే 8.45 కల్లా వచ్చి రోడ్డు మీద కారు దిగి, రోడ్డు పక్కన ఫుట్ పాత్ మాదిరిగా కొంచెం ఎత్తుగా వున్న ప్రదేశానికి వచ్చేశారు. ఒక చిన్న షామియానా, పదో ఇరవయ్యో కుర్చీలు ఆ చిన్న స్థలంలోనే వేశారు. వచ్చి ఒక కుర్చీలో కూచుని చుట్టూ చూసారు. ప్రకాశం గారి విగ్రహాన్ని కనబడకుండా చేస్తున్న బోర్డులను గమనించారు. ఆయన సునిశిత దృష్టి ఎలాంటిది అంటే రోడ్డుకు ఒక పక్క రెడ్ లైట్ వెలిగి చాలా వాహనాలు నిలిచిపోయాయి. తన కోసం వారిని ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆరా తీశారు. అలా కాదు, రెడ్ లైట్ కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయిందని చెప్పిన తర్వాత ఆయన స్థిమిత పడ్డారు. వచ్చిన పెద్దలను అందర్నీ సాదరంగా పలకరించారు. ప్రకాశం గారి విగ్రహం ప్రస్పుటంగా కనబడేలా చేయడానికి ఏమి చెయ్యాలో తాను సంబంధిత అధికారులతో మాట్లాడుతాను అని హామీ ఇచ్చారు.

ప్రకాశం గారి గురించి , ఈ నాటి తరం వారే కాకుండా నేటి రాజకీయ నేతలు కూడా నేర్చుకోవాల్సింది చాలా వుందని అన్నారు. ప్రకాశం గారి జీవితంలో స్పూర్తిని రగిలించే అనేక ఘట్టాలను ఆయన తనదైన శైలిలో ప్రస్తావించారు.

తెలంగాణా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, తెలంగాణా బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు, మాజీ మంత్రి వి.హనుమంతరావు గారు,   మాజీ కేంద్రమంత్రి, వేణుగోపాలాచారి గారు,  మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఎల్వీ సుబ్రహ్మణ్యం గారు, ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు, నా రేడియో రోజుల్లో సుపరిచితులైన రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు  పద్మరాజు వంటి పాత దోస్తులు,  దైవజ్ఞాశర్మ  గారు, కర్నూల్ వాసి, కూరడి చంద్రశేఖర కల్కుర గారు ఇంకా   అనేకమంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

కదానాయకుడైన శ్రీ రాం గారి తండ్రిని మా పెద్దన్నయ్య నాకు పరిచయం చేస్తే, శ్రీ రాం గారిని పరిచయం చేసింది, నా మేనల్లుడు,  108, 104 పధకాల  రూపశిల్పి డాక్టర్ ఏపీ రంగారావు. అప్పుడు ఆయన పూనికపై  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వున్న జంద్యాల హరి నారాయణ్ గారి సహాయ సహకారాలతో, హౌసింగ్ బోర్డు అధీనంలో వున్న ఒక పాత భవనంలో ప్రకాశం అధ్యయన సంష్తకు సంస్థకు ఒక చిన్న ఆవాసం కల్పించే పనిలో నేను ఒక చిటికెన వేలు పాత్ర పోషించాను. ఈ సంస్థతో నాకిది ఓ బాదరాయణ సంబంధం. తరువాత కూడా డాక్టర్ రంగారావు ఈ సంస్థకు మాట సాయం చేసే బాధ్యతను తన కుమారుడు డాక్టర్ భరత్ కు  ఒప్పగించాడు. వీరిద్దరూ పితృవాక్య పరిపాలనలో కలిసి మెలిసి పనిచేసుకుంటూ వస్తున్నారు. ఏటా మే ఇరవై, ఆగస్టు ఇరవై మూడుకు ముందు రోజున డాక్టర్ భరత్, ఫోన్ చేసి గుర్తు చేస్తాడు. ఇద్దరం కలిసి వెళ్లి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం ఒక ఆనవాయితీగా మారింది. ప్రకాశం పంతులు గారికి పుష్పాంజలి ఘటించే అవకాశంతో పాటు పెద్దలను చాలామందిని కలుసుకునే అదృష్టం ఇందువల్ల ప్రాప్తిస్తోంది.















(ఇంకావుంది)    

19, మే 2026, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో: (310) : భండారు శ్రీనివాసరావు

 


మొన్న ఒక రోజు తెలంగాణా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ కె.శ్రీనివాసరెడ్డి నుంచి ఫోన్. ‘లీడర్ ఏమిటి విశేషం?’ అన్నాను. ఆయన్ని లీడర్ అని పిలవడం నాకు అలవాటు. ‘వచ్చే రెండు మూడు రోజుల్లో మనం ఒకసారి కలుద్దాం. మా వాళ్ళు టచ్ లో వుంటారు’ అన్నారు.

 

కొన్నేళ్ళ క్రితం, నేను రిటైర్ అయిన కొత్త రోజులు.

నా మేనకోడలు విజయలక్ష్మి, నా మిత్రుడు జ్వాల నరసింహారావు దంపతుల జేష్ఠ పుత్రిక మేమందరం ముద్దుగా బుంటీ అని పిలుచుకునే జర్నలిస్ట్ ప్రేమ, మాటల సందర్భంలో అన్నది. ‘చూస్తుండు మామయ్యా! మరో పదేళ్ళలో డిజిటల్ జర్నలిజం ఒక్కటే రాజ్యమేలుతుంది. రెండు చేతులతో పట్టుకునే చదివే వార్తాపత్రికలు ఒక్క చేతిలోకి వచ్చేస్తాయి. అన్నీ స్మార్ట్ ఫోన్ లోనే. అంతే కాదు, ఏమిటీ డిజిటల్ మీడియా అంటున్నారు కదా! మెయిన్ స్ట్రీం మీడియా స్థానంలో రాబోతున్నది అదే!’

నా జర్నలిజం కెరీర్  1970 ప్రాంతంలో  మొదలైంది. అప్పుడు ఆరు పేజీల పత్రిక బయటకు రావడానికి నానా హైరాణా. హాండ్ కంపోజింగ్. అన్ని పేజీల్లో మనకు  కనబడే ప్రతి అక్షరాన్ని కళ్ళు కుట్టుకుని చూస్తూ,  కంపోజిటర్లు  చేతితో కూర్చాల్సి వచ్చేది. ఇక ఫోటో ప్రింట్ చేయాలి అంటే అదో బ్రహ్మ ప్రళయం. పత్రికాఫీసుల్లో కుదిరేపని కాదు. బయటకు వెళ్లి  బ్లాక్ మేకింగ్ వర్క్స్ లో చేయించుకుని రావాలి. నేను బెజవాడ ఆంధ్రజ్యోతిలో పనిచేసేటప్పటి పరిస్థితులు అవి.

చూస్తుండగానే కొత్త ముద్రణా యంత్రాలు రంగప్రవేశం చేశాయి. నలుపు తెలుపు స్థానంలో రంగు రంగుల హంగులు వచ్చాయి. ముద్రణలో వేగం పెరిగింది. చదువరులు పెరిగారు. పల్లెల్లో మూడో నాటికి చేరే పత్రికలు, తెల్లవారక ముందే ఇళ్ళ తలుపులు తడుతున్నాయి. కానీ ఎక్కడో ఏదో  లోటు. తొందరలో  తప్పులు తొక్కుతున్న భావన.  ఆ భావన కూడా పెరుగుతోందే కానీ తరగడం లేదు. దాన్ని ఏమంటారో! నిబద్ధత అని నేను అనుకుంటున్నాను.

మార్పును  సహజంగా తీసుకుంటే ఏ ఇబ్బందీ లేదు. కొత్తతరం తరహా అదే. ప్రతిదీ తేలికగా తీసుకోవడం వారి స్వభావం. అలా అని వాళ్ళు మౌన ప్రేక్షకులు మాత్రం కాదు. ‘ఇదే మా రోజుల్లో అయితే..’  అని మొదలు పెట్టడానికి రోజులు చెల్లాయి.

శ్రీనివాసరెడ్డి ఆహ్వానం మేరకు  మే పందొమ్మిదవ తేదీన (19-05-2026)  హైదరాబాదు లోని తెలంగాణా మీడియా అకాడమీకి వెళ్లాను.

పాతతరం లేదా ఒక తరానికి చెందిన పాత్రికేయ ఘనాపాటీలు అక్కడ కనిపించారు. ఒకరా ఇద్దరా! ప్రముఖ సంపాదకులు శ్రీయుతులు ఇనగంటి వెంకట్రావు, కె. రామచంద్రమూర్తి, దాసు కేశవ రావు, నగేష్ కుమార్, ఎంపీ రవీంద్ర నాద్, దిలీప్ రెడ్డి, మాఢభూషి శ్రీధరాచార్య, ఆర్వీ రామారావు, దేవులపల్లి అమర్, వినయ్ కుమార్, ఎం. సుబ్బారావు,  ఉడుముల సుధాకర్ రెడ్డి, జగన్,  నరేంద్ర రెడ్డి, విరాహత్ ఆలి, అమెర్ ఆలీ ఖాన్ ఇత్యాదయః. ముఖ్యంగా పేర్కొనాల్సిన పేరు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ జి. ముకుందరెడ్డి.

ఇదొక సమావేశం అనాలా! నాకు అర్ధం కాలేదు. ఎందుకంటే ఇందులో అందరూ వక్తలే! సభికులు, శ్రోతలు లేరు. అందరికీ మాట్లాడే అవకాశం వచ్చింది అనడం కంటే, ఇచ్చారు అనడం సముచితం.

చాలామంది పాత్రికేయ వృత్తిలో పండిపోయిన అనుభవజ్ఞులు. ఐ. వెంకట్రావు గారి తర్వాత వయసులో నేనే పెద్దవాడిని. వీరందరితో కాకపోయినా వీరిలో చాలామందితో ఒకానొక కాలంలో  రాసుకు పూసుకు తిరిగిన అనుభవం నాకుంది. ఎనభయ్యవ ఏట అందర్నీ ఒక్క చోట చూడగలగడం నేను చేసుకున్న అదృష్టం.

మధ్యాన్న భోజనం తర్వాత అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి శాలువాలతో సీనియర్లను సత్కరించారు. ఆయన సౌహార్దానికి ధన్యవాదాలు.    

    

ఒక్కోరోజు అలా ఆనందంగా, ఆహ్లాదంగా గడిచిపోతుంది.

ఈరోజు, మే పందొమ్మిది అలాంటిదే.  ఇలా ప్రతిరోజూ గడవకపోవచ్చు. గడవాలని ఆశించడం కూడా అత్యాశే.

ఇంతకీ అందరూ ఎందుకు కలిసారు? ఏం మాట్లాడారు? చాలా మాట్లాడారు. తమ అనుభవాలు చెప్పారు. బహుశా అక్కడికి వచ్చిన జర్నలిజం విద్యార్ధులు వాటిని నోట్ చేసుకుంటూ కనిపించారు.

నిజంగా ఈ సీనియర్ పాత్రికేయుల అనుభవాలు పుస్తక రూపంలోకి తేదగ్గవే! మీడియా అకాడమీ చేయదగ్గ పనే.

మరి డిజిటల్ మీడియా ప్రసక్తి ఎందుకు అంటే , మొదట్లో ఎప్పుడో నా మేనకోడలు కుమార్తె జర్నలిస్ట్ ప్రేమ చెప్పిన మాటలే, వీరందరిలో వయసులో చిన్నవాడయిన టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధి శ్రీ ఉడుముల సుధాకర్ రెడ్డి నోట విన్నాను. నమ్మినా నమ్మకపోయినా జెన్ జీ సిద్ధాంతం సరైనదే అనిపిస్తోంది. పుస్తకాల బదులు, ఆడియో, వీడియో రూపంలో తెస్తే కొత్త తరానికి సులభంగా అందుబాటులో వుంటాయని ఆయన అభిప్రాయ పడ్డారు.




(ఇంకావుంది)    

18, మే 2026, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో : (308) : భండారు శ్రీనివాసరావు

 

ఓటమిలో ఆనందం
చిన్న కోడలు నిషా నిన్న ఆఫీసు పని మీద అమెరికా వెళ్ళింది. మళ్ళీ వచ్చే ఆదివారం తిరిగి వస్తుంది. రాను పోను ప్రయాణానికే మూడు రోజులు. అక్కడ వుండేది మూడు రోజులకంటే తక్కువ. అయినా తప్పని ప్రయాణాలు. వెళ్ళేది బిజినెస్ క్లాసులో కాబట్టి అంత అలసట వుండకపోవచ్చనేది ఓ ఊరట.
ఇంట్లో నాకు తోడు నా మనుమరాలు జీవిక. అందుకే దాన్ని తీసుకుని దగ్గరలో వున్న గలేరియా మాల్ కు తీసుకు వెళ్ళాను.
సరిగ్గా అయిదేళ్లు కూడా లేని జీవిక తెలివితేటలు చూస్తుంటే కొన్నిసార్లు నాకు అసూయ కలుగుతుంది. మరికొన్ని సార్లు ఆనందం, భయం, ఆశ్చర్యం కూడా.
జెన్ జీ అని ఈ మధ్య వింటున్న కొత్త తరం ఆలోచనలు, అవగాహన పాత తరాన్ని మించి పోతున్న సంగతి నిజమే అనిపించింది. మా జీవిక సంగతి ఒక్కటే కాదు, తరం మారుతోంది అని గమనంలో పెట్టుకోవడం పాత తరానికే మంచిది.
మాల్ లోకి వెళ్ళగానే,
“తాతయ్యా, నాకు లాలిపాప్ కావాలి” అంది. అంతే కాదు, నా చెయ్యి పట్టుకుని ఎస్కలేటర్ మీద పైకి తీసుకువెళ్లి, అక్కడ లాలిపాప్‌లు అమ్మే దుకాణానికి తీసుకెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాక చూస్తే లాలిపాప్‌లు లేవు.
ఒక ప్లాస్టిక్ మోటార్‌సైకిల్ బొమ్మను చూపించి, అది కొనిపెట్టమంది. చిన్న బొమ్మ. ధర రెండువందల యాభయ్ చెప్పాడు.
“చూడమ్మా అది కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు” అన్నాను.
జీవిక నా మొబైల్ ఫోన్ వైపు చూపించి, “డబ్బులు ఇందులో ఉన్నాయి కదా తాతయ్యా” అంది.
ప్రతిరోజూ నేను ఫోన్ ద్వారా చేసే చెల్లింపులను జీవిక గమనిస్తున్నట్టుంది.
ఐదేళ్ల వయసులోనే ఆమె తెలివితేటలు, అవగాహన చేసుకునే సామర్ధ్యాన్ని చూసి నేను ముచ్చట పడాలా, గర్వపడాలా, ఆందోళన చెందాలా అనేది అర్ధం కాలేదు.
చివరికి ఆ బొమ్మను కొనక తప్పలేదు.
కానీ ఆ బొమ్మలో ఏమి కనిపించిందో, ఎందుకు ఇష్టపడిందో నాకు మాత్రం అర్థం కాలేదు. అది పైకి మోటార్‌సైకిల్‌లా కనిపించినా, దాని చక్రాలన్నీ పిల్లలు తినే చిన్న చిన్న జెమ్స్‌తో నిండి వున్నాయి. ఆ విషయం ఇంటికి వస్తున్నప్పుడు చెప్పింది. అంటే మళ్లీ జీవిక చేతిలో నేను మోసపోయానన్న మాట.
అయినా బాధ లేదు. పిల్లల చేతిలో ఓటమిని మించిన ఆనందం పెద్దలకు ఏముంటుంది”
ఇంటికి చేరే లోగా మోటార్ సైకిల్ వెనుక టైర్ ఖాళీ చేసేసింది. ఇంటికి రాగానే ఆ బొమ్మను మూలకు విసిరేసింది.




17-05- 2026
(ఇంకా వుంది)

14, మే 2026, గురువారం

అయాం ఎ బిగ్ జీరో: (307) భండారు శ్రీనివాసరావు

ఆ గాలీ .....ఆ నేలా......

డెబ్బయ్ ఏళ్ళ పైమాటే. అప్పటికి నాకు పదేళ్లు ఉంటాయేమో! ఆనాటి జ్ఞాపకాలు స్పష్టాస్పష్టంగా మనసు పొరల్లో మెదులుతున్నాయి. గురుతుల మడతల్లో కదులుతున్నాయి.
మా ఊరు కంభంపాడు. అప్పట్లో చాలా వెనకపడ్డ ప్రాంతం. అయినా అన్నీ ఉండేవి. స్వావలంబన లాంటి మాటలు, వాటి అర్ధాలు అప్పట్లో తెలవ్వు. కానీ అన్నీ అమర్చినట్టు ఉండేవి ఆ కొసగొట్టు పల్లెటూళ్ళో.
మా ఇంటికి దగ్గరలో అంటే నడిచిపోయే దూరంలో చెరువు గట్టు కింద మా మాగాణి పొలాల పక్కన ఓ మెరక మీద మంచి నీళ్ళ బావి. పైగా గిలకల బావి. నాలుగు వైపులా ఇనుప గిలకలు ఉండేవి. ఊరి మొత్తానికి అదొక్కటే మంచి నీటి వనరు. మా ఇంట్లో బావిలో నీళ్ళు ఉప్పు కషాయం. స్నానాలకు, ఇతర అవసరాలకు ఆ నూతి నీళ్ళే వాడే వాళ్ళం. మా అమ్మగారు వెంకట్రావమ్మ, మా చిన్న మేనత్త చిదంబరం అత్తయ్య తడి మడి చీరెలతో వెళ్లి మంచినీటి బావి నుంచి బిందెలలో నీళ్ళు తెచ్చే వాళ్ళు.
అప్పుడప్పుడూ వాళ్ళతో నేనూ వెళ్ళే వాడిని. దోవలో వీరబ్రహ్మం ఇల్లు. ఆయన ఉలీ, బాడిసె పట్టుకుని ఎడ్లు లాగే బండ్లు తయారు చేసేవాడు. నేను అక్కడే ఒక మొద్దు మీద కూర్చుని చూస్తూ కూర్చుండేవాడిని. బండి చక్రాలు, వాటికి ఆకులు. అలా కొలతలకు తగ్గట్టుగా ఎలా చెక్కేవాడో ఆశ్చర్యం అనిపించేది. ఆయన ఏమీ చదువుకున్నవాడు కాదు. కానీ బండి ఇరుసు ఏ కొలతలతో చెక్కితే బండి బ్యాలెన్సుగా నడుస్తుందో ఆ విధంగా తయారు చేసేవాడు.
ఆ పక్క వీధిలో కమ్మరి కొలిమి. ఆయనకూ చదువు రాదు. కానీ ఇనుమును కొలిమిలో ఎర్రగా కాల్చి రకరకాల సామాగ్రి తయారు చేసేవాడు.
ఒక వీధిలో వస్త్రాల హనుమంతరావు అని నా దోస్తు ఇల్లు వుండేది. ఆడామగా బట్టలు నేసే వాళ్ళు. ఇంటి బయట చేతికి రంగులు పూసుకుని దారాలకు రంగులు అద్దే వాళ్ళు. ఇంట్లో మగ్గం మీద చీరెలు ధోతులు నేసే వాళ్ళు.
చిన్నిరాములు కొట్లో మిఠాయి ఉండలు, లౌజు ముక్కలు కూడా అమ్మేవాళ్లు. ఇళ్ళల్లో లాంతర్లు, చిమ్నీ(బుడ్డి) దీపాలకు వాడే కిరసనాయిలు అక్కడే కొనేవాళ్ళం. కిరోసిన్ డబ్బా పైన ఒక మూలలో వున్న రంధ్రంలో గొట్టం లాంటి సాధనం వుంచి పైకీ కిందికీ ఒక తీగతో లాగుతూ వుంటే డబ్బాలో కిరోసిన్ సీసాల్లో పడేది. (దాన్ని బొంబాయి అంటారని తర్వాత తెలిసింది. కానీ ఆ పేరు ఎలా వచ్చిందో ఈనాటికీ తెలియదు)
ఆ పక్కనే కుండలు చేసేవారు. కుండలు చేసే విధానం చూస్తుంటే కళ్ళు తిరిగిపోయేవి. ఒక చక్రం మీద మట్టి ముద్ద వుంచి ఆ చక్రాన్ని వేగంగా ఒకసారి తిప్పే వాళ్ళు. తడి చేతి వేళ్ళతో ఆ మట్టి ముద్దను సుతారంగా తాకుతూ చిత్రవిచిత్రంగా కుండలు తయారు చేసేవాళ్ళు. ఆ ముద్ద నుంచి కుండల ఆకారాలు వస్తుంటే ఏదో మాయాజాలంగా అనిపించేది.
సత్యమూర్తి అని నా చిన్న నాటి నేస్తం. ఆయన అన్నయ్య నాగలింగాచారి బంగారు నగలు చేసేవాడు. బడికి వెళ్ళే దోవలోనే వాళ్ళ ఇల్లు. బుగ్గలు బూరెలు అయ్యేలా గొట్టంతో ఊదుతూ ఎర్రటి కొలిమిలో బంగారం కరిగించి వస్తువులు తయారు చేసేవాడు.
సాయంత్రం అయ్యేసరికి మా ఇంటికి దగ్గరలో ఉన్న వాడనుంచి బ్యాండు మేళం వినపడేది. ఆ తర్వాత తెలిసింది వాళ్లకు గిరాకీ లేని రోజుల్లో అలా తీరి కూర్చుని సినిమా పాటలు ప్రాక్టీసు చేస్తుంటారని. అలాగే సన్నాయి మేళం వాయించేవాళ్లు. మా ఇంటికి చుట్టపక్కాలు ఎవరైనా వస్తే వాళ్ళు పెట్రోమాక్స్ లైట్ తెచ్చి పెట్టేవాళ్ళు. ఆ లైటు వెలిగిస్తుంటే పిల్లలం అందరం కళ్ళప్పగించి చూస్తుండే వాళ్ళం. పొడుగాటి వత్తి తగలబడిపోకుండా చిన్న ఆకారంలోకి మారిపోయి తెల్లటి వెలుగులు విరజిమ్మడం నిజంగా ఆశ్చర్యంగా వుండేది. ఆ వత్తి ఎర్రపడి కాంతి తగ్గినప్పుడల్లా గాలి కొట్ట్టేవారు.
మా ఊరు పంచాంగాలకు ప్రసిద్ధి. వాటిని రాసే సిద్ధాంతులు ముగ్గురు వుండేవాళ్ళు. ఒకే ఊరు నుంచి మూడు పంచాంగాలు రావడం గొప్పగా చెప్పుకునే వారు. గొలుసుకట్టు రాతలో, తెలుగు అంకెలతో రాసిన పంచాంగాలను ఆ సిద్ధాంతులు తెనాలి తీసుకువెళ్లి అక్కడ అచ్చు వత్తించేవారు. ఉగాది రావడానికి ముందుగానే చుట్టుపక్కల గ్రామాలకు కాలినడకన వెళ్లి అక్కడి మోతుబరులకు పంచాంగాలు ఇచ్చి ఆశీర్వదించేవాళ్లు. సంభావన రూపంలో వచ్చిన ప్రతిఫలం ఎంత ఇస్తే అంత తీసుకుని తిరిగివచ్చేవారు.
మంచి నీళ్ళ బావికి వెళ్ళే దోవలో ముస్లింల కోసం పీర్ల సావిడి వుండేది. పీర్లను ఊళ్ళో ఊరేగించిన తర్వాత మళ్ళీ ఈ సావిడిలో భద్రపరిచేవాళ్ళు.
షెడ్యూల్ కులాలకోసం ఉసిగెవాగు అవతల ఒక కాలనీ వుండేది. అక్కడ ఒక మిషనరీ స్కూలు వుండేది.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జంధ్యాల హరి నారాయణ కృష్ణాజిల్లా కలెక్టరుగా వున్నప్పుడు మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు గారు అక్కడ కొత్త కాలనీ నిర్మాణం కోసం సుమారు ఇరవై ఎకరాలు భూమి ఇచ్చారు. చక్కటి విశాలమైన కాలనీ ఏర్పడింది. జిల్లా మొత్తంలో అదే పెద్ద కాలనీ అని చెప్పుకునేవారు.
ఊళ్ళో మరో బడి వుండేది. అందులోనే మా చదువు. స్కూలు మొత్తానికి కలిపి ఇద్దరే టీచర్లు, అప్పయ్య మాస్టారు, భద్రయ్య పంతులు గారు. బ్లాకు బోర్డులు లేవు. చుట్టూ ఫ్రేం ఉన్న బొందు పలక, సుద్ద బలపం, అవి పెట్టుకునే గుడ్డ సంచీ వుంటే వాడు అందరి దృష్టిలో స్పెషల్.
అప్పయ్య మాస్టారి తండ్రి శివరాజు నాగభూషణం గారు తెలవారకముందే లేచి స్నానసంధ్యాదులు ముగించుకుని ఇంటి బయట నిలబడి ఉచ్చైస్వరంతో ఆలపించే కృష్ణ శతకంలోని పద్యాలే ఊరంతటికీ కోడికూత.
పంచాయతీ రేడియోలో సాయంత్రం అయ్యే సరికి తెలుగు వార్తలు వినేవాళ్ళం. బెజవాడ నుంచి అంధ్రపత్రిక దినపత్రిక రెండో రోజు సాయంత్రానికి పోస్టులో మా ఊరికి వచ్చేది. అప్పయ్య మాస్టారు పత్రికలో వచ్చిన వార్తలను బిగ్గరగా చదివి వినిపించేవారు. ఆయనే మా ఊరికి రేడియో న్యూస్ రీడర్. తర్వాత అందరూ అరుగుల మీద కూర్చుని తీరిగ్గా ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు.
మా ఇంటికి వెనుక రెండు దేవాలయాలు ఒకే ప్రాకారంలో ఉండేవి. ఒకటి శివుడి గుడి. వాసిరెడ్డి జమీందారు ఆ ప్రాంతంలో కట్టించిన అనేక శివాలయాల్లో ఇదొకటి. మరొకటి ఆంజనేయుడి గుడి. పక్కనే కోనేరు వుండేది. కాలక్రమంలో అది పూడిపోయింది.
ఆ గుళ్ళకు మేమే వంశ పారంపర్య ధర్మకర్తలం. వాటికి మాన్యాల రూపంలో నలభయ్ ఎకరాల దాకా భూమి వుండేది, కానీ వాటి మీద వచ్చే అయివేజు స్వల్పం. వూళ్ళో వాళ్ళే పూనుకుని పండుగ దినాల్లో ఉత్సవాలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించేవారు.
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ వారి చిన తిరుణాలకు, అది జరిగినన్ని రోజులూ మా వూరినుంచి రంగు కాగితాలతో అలంకరించిన ప్రబ్భండ్లు (ప్రభలు) మేళతాళాలతో ఇంటికొకటి బయలుదేరేవి.
ఆ రోజుల్లో మా ఊర్లో రెండు రకాల సేద్యపు నీటి వనరులు ఉండేవి. ఒకటి చెరువు, రెండోది మునేటి కాలువ. ఒకప్పుడు ఈ రెంటి కిందా అధిక భాగం భూములు మావే.
ఐదో అక్కయ్య భర్త కొమరగిరి అప్పారావు గారిది పొరుగూరు పెనుగంచి ప్రోలు. ఆ బావగారు వచ్చినప్పుడల్లా గుర్రపు సవారీ. రాగానే గుర్రాన్ని మేతకు వదిలేసేవాడు. అది మేసినంత మేరా ‘మీ మామగారి (అంటే మా నాన్నగారు) తాలూకు పొలాలే, ఏం పరవాలేదు’ అని చెప్పుకునే వారు నా చిన్నతనంలో.
ఇప్పుడు ఇవన్నీ ఏవీ లేవు అని చెప్పను కానీ అప్పటి మాదిరిగా లేవు. కొన్ని అసలే లేవు, జ్ఞాపకాలు తప్ప.
వీరబ్రహ్మం లేడు, ఎడ్ల బళ్ళు తయారుచేసే వాళ్ళు లేరు. ఆ బండ్లు లేవు. ఎడ్లూ లేవు. ట్రాక్టర్లు వచ్చాయి. ఇంటికి రెండు చొప్పున మోటారు సైకిళ్ళు, పదో పాతికో ఏసీ కార్లు. నాటి మగ్గాలు లేవు, బట్టలు నేసేవాళ్ళు లేరు. చిన్ని రాములు కొట్టు లేదు. షట్టర్లు కలిగిన దుకాణాలు వచ్చాయి. కుండల తయారీ లేదు. స్టీలు సామాను, ఫ్రిజ్ లు గృహప్రవేశం చేసాయి.
లాంతర్లు లేవు, అందరి ఇళ్ళల్లో విద్యుత్ దీపాలే. కాలక్షేపానికి బ్యాండ్ మేళాలు లేవు, ప్రతి ఇంట్లో స్మార్ట్ టీవీలే.
పంచాయతి రేడియో లేదు. అరుగుల మీద ముచ్చట్లు లేవు. అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్స్. ఎవరి గోల వారిదే!
స్వయంసమృద్ధి కాకపోయినా స్వయంపోషకంగా వుండే మా ఊరు, ఇప్పుడు అన్ని ఊళ్లలో ఒక ఊరు. అంతే!
పాస్ పోర్టులో నేటివ్ ప్లేస్ కాలం పూర్తి చేయడానికి మాత్రం పనికి వస్తోంది.
కింది ఫోటోలు :
మా తలితండ్రుల జ్ఞాపకార్ధం మా మూడో అన్నయ్య భండారు వెంకటేశ్వర రావు నిర్మించిన అమ్మానాన్నల గుడి 'అమ్మపర్తి '






(ఇంకావుంది)

అయాం ఎ బిగ్ జీరో (306) : భండారు శ్రీనివాసరావు

 

సాగు నీటి మంత్రి - తాగు నీటి మంత్రి

నేను రేడియోలో పనిచేసే రోజుల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుమ్మల నాగేశ్వర రావు గారు రోడ్లు, భవనాల శాఖ మంత్రి. అయితే అందరికీ తెలియని విషయం ఏమిటంటే, ఒకానొక కాలంలో ఆయన మా రేడియో వార్తలకు ప్రధాన శ్రోత. (ఇప్పటి సంగతి తెలియదు).
రోడ్డు మార్గాన హైదరాబాదు నుంచి ఖమ్మం జిల్లాకు వెళ్లి వస్తున్నప్పుడు, మధ్యాన్నం 1.10 లేదా సాయంత్రం 6.15 అయితే చాలు, మంత్రి గారు ప్రయాణిస్తున్న మోటారు వాహనం రోడ్డు పక్కన నిలిచి పోయేది. ప్రాంతీయ వార్తలు పూర్తిగా విన్న తరువాత మళ్ళీ బయలుదేరేది. (అప్పట్లో ఇప్పటి నాలుగు లేన్ల రహదారి లేదు, అంచేత ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కన కారు ఆపుకునే వెసులుబాటు వుండేది)
ఈ సంగతి ఓసారి మాటల సందర్భంలో ఆయన నోటి నుంచే నేను విన్నాను.
శాసనసభలో మంత్రుల కోసం విడిగా గదులు వుండేవి. ఒక్కో గదిలో ఇద్దరేసి చొప్పున మంత్రులు వుండేవాళ్ళు. తుమ్మల గారితో పాటు మరో మంత్రి. ఒకరు భారీ నీటిపారుదల శాఖ. మరొకరు ఎక్సైజ్ శాఖ. బయట మంత్రుల పేరుతోపాటు వారి శాఖల పేర్లు వున్న బోర్డులు వుండేవి. విలేకరులు సాగు నీటి మంత్రి, తాగు నీటి మంత్రి అని హాస్యోక్తిగా అనేవారు.
తుమ్మల నాగేశ్వర రావు గారికి ఈ రెండు శాఖలు నిర్వహించిన అనుభవం వుంది.
తన నలభయ్ ఏళ్ళ పైచిలుకు రాజకీయ ప్రస్థానంలో పార్టీలు మారిన చరిత్ర వున్నది కానీ, పార్టీ మారిన తర్వాత, తాను వదిలేసిన పార్టీని గురించి కానీ, ఆ పార్టీ నాయకుడిని గురించి కానీ ఏనాడూ ఒక పొల్లు మాట మాట్లాడిన దాఖలా కనపడదు. ఆయన వ్యక్తిత్వానికి ఇదొక కొలమానంగా చెప్పవచ్చు.
నేను చదువుకునే రోజుల నుంచి, రేడియో విలేకరిగా చేరిన వరకు నాకు బాగా తెలిసిన ఖమ్మం జిల్లా నాయకులలో జలగం వెంగళరావు గారు మొదటి వారు. జిల్లా అభివృద్ధిలో ప్రతి ఇటుక మీద నా పేరు వుండి తీరుతుందని వెంగళరావు గారు తదనంతర కాలంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తరచుగా చెబుతుండేవారు.
అలాగే ఇప్పుడు అలా ఘనంగా చెప్పుకోదగిన కృషి చేసింది, చేస్తున్నదీ తుమ్మల నాగేశ్వర రావు గారని స్థానిక నాయకులు చెబుతుండగా వింటున్నాను.
చంద్రబాబు గారి మంత్రి వర్గంలో పనిచేస్తున్నప్పుడు హైదరాబాదు విలేకరులు చాలా మందికి తుమ్మల నాగేశ్వర రావు గారితో సన్నిహిత, సౌహార్ద సంబంధాలు వుండేవి. ఏ సమయంలోనైనా ఫోనులో అందుబాటులో వుండేవారు.
వారం వారం ఖమ్మం వెళ్లి వస్తుండేవారు. ఖమ్మం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో మంత్రిగా ఒక వీ ఐ పీ రూమ్ ఆయన పేరిట వుండేది. బంధుగణం ఎక్కువ కావడం వల్ల నాకూ తరచూ ఖమ్మం ప్రయాణాల అవసరం పడేది.
మా బంధువుల ఇళ్లన్నీ ఆ గెస్ట్ హౌస్ కి నడక దూరంలో వుండేవి. కాబట్టి, అందులో అకామడేషన్ కోసం అడిగేవాడిని. ఆయన వెంటనే ఏర్పాటు చేసేవారు. ఒకసారి ఆయన తన వ్యక్తిగత సిబ్బందితో చెబుతుంటే విన్నాను. ‘శ్రీనివాసరావు అడిగితే వెంటనే ఏర్పాటు చేయండి. ఒకవేళ గదులు ఖాళీ లేకపోతె, నేను ఖమ్మంలో వున్నాసరే పర్వాలేదు, నేను వేరే చోటికి వెడతాను’
అలా ఎప్పుడూ జరగలేదు కానీ ఒక మంత్రి అలా అనడం నా అనుభవంలో ఎప్పుడూ జరగలేదు.
నా స్నేహితుడు, మేనకోడలు భర్త వనం జ్వాలా నరసింహా రావుకు కూడా నాగేశ్వరరావు గారితో చాలా చనువు. నేనూ, జ్వాలా, చిన్నప్పుడు ఖమ్మం, మామిళ్ళ గూడెం రిక్కా బజార్ హైస్కూల్లో చదువుకొనేటప్పుడు ఆయనకు ఒక క్రికెట్ టీం వుండేది. ఇంగ్లాండ్ లోని ఎం సీ సీ అనే క్రికెట్ క్లబ్ మాదిరిగా ఆ టీం కి కూడా అదే పేరు పెట్టారు. అంటే మామిళ్ళ గూడెం క్రికెట్ క్లబ్ అన్నమాట.
ఈ జ్వాలాకు, మాకెవ్వరికీ లేని మాచెడ్డ మంచి అలవాటు ఒకటి వుంది. అదేమిటంటే చిన్నప్పటి నుంచీ ఇప్పటివరకు తన జీవితంలో తారసపడిన మిత్రులతో తరచూ ఫోన్లో మాట్లాడడం లేదా వీలు చూసుకుని కలవడం. నిజంగా చాలా మంచి అలవాటు. నాకు అలవడని అలవాటు.
అలా ఒకసారి హైదరాబాదులో ఈ మామిళ్ళ గూడెం క్రికెట్ క్లబ్ సభ్యులను అందరినీ ఆహ్వానించి లంచ్ మీట్ ఏర్పాటు చేశాడు. దీనికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా రావాల్సిందని అప్పటికప్పుడు ఫోన్లో పిలిచాడు. ఖమ్మం వెళ్ళే హడావిడిలో వుండి కూడా, తుమ్మల నాగేశ్వర రావు గారు కాదనకుండా వచ్చి, చాలాసేపు వుండి అందర్నీ పేరు పేరునా పలకరించి వెళ్ళారు.
కింది ఫోటో అప్పటిదే.
మే పద్నాలుగు, 2026, నాటికి తుమ్మల నాగేశ్వర రావు గారు తొలిసారి మంత్రి అయి నలభయ్ ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా వారికి అభినందనలు.



(ఇంకావుంది)

11, మే 2026, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (305) : భండారు శ్రీనివాసరావు

 

ఈ నగరానికి ఏమైయింది?
1975 వ సంవత్సరం. నవంబరు నెల.
రేడియో ఉద్యోగంలో చేరడానికి బస్సులో హైదరాబాదు వచ్చాను. నగరం పొలిమేరలకు కూడా చేరక ముందే ఆలిండియా రేడియో ట్రాన్స్ మిటర్లు (ఇప్పుడు నడిబొడ్డుకు చేరాయి) కనబడ్డాయి. బస్సు కిటికీ చువ్వలు ముట్టుకుంటే ఐసు కడ్డీలు తాకినట్టు చల్లగా తగిలేవి. చుట్టూ ఎటు చూసినా కనుచూపు మేర వరకు ద్రాక్ష తోటలు.
నగరంలో రోడ్లు తీర్చి దిద్దినట్టు ఎక్కడా గోతులు, గుంటలు లేకుండా శుభ్రంగా ఉండేవి. ఇరువైపులా పచ్చని చెట్లు. భారీ వర్షం పడినా, రోడ్లు ఏరులై పారినా, వాన వెలవగానే వరదలా వెల్లువెత్తిన నీళ్లన్నీ చప్పున మాయం అయ్యేవి. రోడ్లమీద నీళ్ళు నిలిచేవి కావు. ఇప్పుడా పరిస్తితి వుందా! లేదని చెప్పడానికి తడుముకోవాల్సిన పని లేదు.
నగరంలో జర్నలిష్టులకు మరో కాలనీ మంజూరయింది. ఎక్కడో ఊరవతల జూబిలీ హిల్స్ అట. చూద్దామని కొందరు మిత్రులతో బయలుదేరాను.
పంజాగుట్ట స్మశానం దాటగానే ఊరు కనబడలేదు. రోడ్డుకు అటూ ఇటూ విసిరేసినట్టు అక్కడక్కడా ఇళ్ళు. చెక్ పోస్ట్ దాటితే అన్నీ పొలాలే. ఎన్టీఆర్ తన కుమారుడు బాలకృష్ణ కోసం కట్టిన భవంతి ఒక్కటే దారిలో ఒంటరిగా నిలబడి వుంది. అది దాటిన తరువాత జర్నలిష్టుల కాలనీ కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలం. (పొలం అనాలా). దానికి చివర్లో పెద్ద లోయ. దాని అంచున అడ్డంగా ఇనుపకడ్డీల రెయిలింగ్. అక్కడ నుంచి చూస్తే, కింద నిండు కుండలా ఓ తటాకం. చిక్కడపల్లి నుంచి వెళ్ళిన నాకది ఓ అపూర్వ దృశ్యం.
ఇప్పుడా లోయా లేదు, తటాకమూ లేదు. లోయకు పైన జర్నలిష్టుల (బీ) కాలనీ, లోయని పూడ్చేసి సంపన్నుల కాలనీ వెలిశాయి. వీటికి ఆనుకుని ప్రభుత్వాలను, ప్రజలను శాసించే ఐ.ఏ.ఎస్.,ఐ.పీ.ఎస్., అధికారుల నివాస భవనాలు.
హైదరాబాదు నగరం చుట్టుపక్కల వేల సంఖ్యలో చిన్నా చితకా చెరువులు వుండేవని నగరం గురించి రాసిన పుస్తకాలు చదివితే తెలుస్తుంది. అదేమిటో చాలావరకు చెరువులన్నీ మంత్రం వేసినట్టు మాయమై పోయాయి. వాటిల్లో చిన్న స్థాయి వాళ్ళు కట్టుకున్న చిన్న వాడలు, మధ్యతరగతి వాళ్ళు వుండే అపార్ట్ మెంట్లు, ఇంట్లో వంట్లో పుష్కలంగా వుండే కలిగినవాళ్ళు నివసించే సంపన్న కాలనీలు అంగుళం జాగా లేకుండా వెలిసాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ కుంచించుకు పోయినా ఇంకా మిగిలే వున్నాయి. సంతోషించాలి.
గతంలో గండిపేట చెరువు చూడడానికి విహార యాత్రకు వెళ్ళేవాళ్ళం. అందులో అపార జలరాశిని చూస్తుంటే కడుపు నిండిపోయేది. (అలాంటి దృశ్యాలు ఇప్పుడు కేవలం పాత తెలుగు సినిమాల్లో మాత్రమే కనబడతాయి)
ఇప్పుడు అదే తటాకం వేసవిలో వట్టిపోయి రాళ్ళు తేలి కానవస్తోంది.
ఒకప్పుడు ఏడాదిలో చాలా మాసాలు, ఎయిర్ కండిషన్లు సరే, కనీసం పంకాలు కూడా అవసరం లేని చల్లటి వాతావరణం కలిగిన హైదరాబాదులో ఎండలు మండుతున్నాయని ఇప్పుడు గగ్గోలు పెడితే ఏమి లాభం? అంతా స్వయంకృతం.
తోకటపా:
మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, హరివిల్లు విరిస్తే !
రెండేళ్ల క్రితం మండే వేసవిలో ఒక రోజు :
'త్తాతా త్తాతా' అంటూ నా గదిలోకి పరిగెత్తుకు వచ్చింది నా మనుమరాలు జీవిక. తా కు వత్తు పెట్టి పిలవడంలోనే కనిపిస్తోంది దాని ఎక్జైట్ మెంట్.
'తాతా! వాన, ర్రెయిన్! దా దా ' అంటూ చేయి పట్టి బయటకు తీసుకువచ్చింది.
అపార్ట్ మెంట్ జీవితాల్లో, పిడుగులు పడితే తప్ప, చినుకుల చప్పుడు లోపల వినపడదు. వర్షాన్ని టీవీల్లో చూడాల్సిందే.
వెంటనే చిన్నతనం గుర్తుకు వచ్చి ఓ కాగితం పడవ తయారు చేసి, చిన్నదాన్ని వెంటబెట్టుకుని కిందికి వెళ్లి వర్షపు నీళ్లలో కాగితపు పడవ మజా ఏమిటో చూపించాలని బయట తలుపు తెరిచాను. మండుతున్న శరీరాలు చల్లపడేట్టు ఒక్క ఉదుటున చల్లగాలి తోసుకు వచ్చింది. లక్షల ఎయిర్ కండిషనర్లు చేయలేని పని ఒక్క వాన చేసింది.
అడుగు బయట పెట్టే లోగా కరెంట్ ఫట్. వాన రాకడ కరెంటు పోకడ అంటారు అందుకే.
కరెంటు లేకపోతే లిఫ్ట్ పనిచేయదు. అంచేత కాగితపు పడవల ఆటకు అలా బ్రేక్ పడింది. ఏమిటో జీవితం! స్మాల్ ప్లెజర్స్ కు కూడా నోచుకోలేదు.



(ఇంకావుంది)

6, మే 2026, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (304): భండారు శ్రీనివాసరావు

ఎర్రటి ఎండలో పుట్టింటికి ప్రయాణం
75 ఏళ్ళక్రితం నాటిన మొక్క ఈనాడు ఒక మహావృక్షంగా తయారయింది. ఆ శీతలతరుచ్ఛాయలో మూడు దశాబ్దాలకు పైగా సేదతీరినవాడిని. మహామహులు తచ్చాడిన ఆ ప్రదేశంలో నేను సైతం అంటూ, 1975 లో ప్రవేశించి ఆడుతూ పాడుతూ హాయిగా ఉద్యోగం చేసిన వాడిని.
2025 ఏప్రిల్ మాసం
నేను పనిచేసిన ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం 75 వ వార్షికోత్సవం ఏప్రిల్ పదిహేనున.
హైదరాబాదు కేంద్రం వార్తావిభాగంలో చాలా సంవత్సరాలు పనిచేశాను. చేరిన చోటనే రిటైర్ కావాలన్న నా అభిలాష నెరవేరకుండానే చివరాఖరి సంవత్సరంలో నన్ను హైదరాబాదు దూరదర్సన్ వార్తా విభాగానికి బదిలీ చేశారు. అదొక్కటే అసంతృప్తి.
అన్ని సంవత్సరాల అనుబంధం ఉన్న హైదరాబాదు ఆకాశవాణి కేంద్రానికి డెబ్బయ్ అయిదేళ్ళ పండుగ అంటే అందులో పనిచేసిన వారికి పుట్టింటి పండుగే. మరీ ముఖ్యంగా నాకు.
రేడియో పట్ల నా అనురాగం తెలిసిన వాళ్ళు కనుక, నాలుగు ముక్కలు మాట్లాడాలని వారినుంచి పిలుపు. వాళ్ళు పంపిన కారులోనే ఎగురుకుంటూ వెళ్లాను.
పుట్టింటి ఆరాటం అంటే ఏమిటో ఆనాడు ఆకాశవాణికి వెళ్ళినప్పుడు అర్ధం అయింది. రిటైర్ అయి, అడుగు బయట పెట్టి ఇరవై ఏళ్ళు. కానీ బయట గేటు దగ్గర సెక్యూరిటీ వాళ్ళ దగ్గర నుంచి అక్కడ పనిచేస్తున్న డ్యూటీ ఆఫీసర్లు, ఇంజినీర్లు, ప్రోగ్రాం అధికారులు, అన్ని విభాగాల సిబ్బంది గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించడం, యోగక్షేమాలు ఆరా తీయడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఎవర్నీ కాదనలేక ఎన్ని సార్లు, ఎన్ని టీలు తాగానో లెక్కేలేదు.
అప్పుడు న్యూస్ యూనిట్ లో మాతో పనిచేసి, ఇప్పుడు స్టేషన్ డైరెక్టర్ వద్ద పీ ఎస్ గా పనిచేస్తున్న మా న్యూస్ యూనిట్ ‘చిట్టి చెల్లెలు’ శైలజ ఆనందానికి అంతులేదు. మా ఆవిడని అమ్మా అని పిలిచేది. శైలజ లాంటి ఆడపిల్ల వుంటే ఇంట్లో దీపం అక్కరలేదు అనేది మా ఆవిడ.
ఒకప్పుడు నేను పనిచేసినప్పుడు అచ్చు ప్రభుత్వ కార్యాలయం మాదిరిగా ఉన్న అదే ఆఫీసు ఇప్పుడు కార్పొరేట్ హంగుల్ని సమకూర్చుకుంది. మా న్యూస్ రూమ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అంతా డిజిటలైజ్ చేసారు. ప్రసారం అయిన ప్రతి బులెటిన్ ని ఏ.ఐ.ఆర్. వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేస్తున్నారు. ఏవిటో, అందరూ వినే రోజుల్లో ఇన్ని భోగాలు లేవు.
రికార్డింగు జరిగింది కాసేపే. ఎక్కువ సమయం, నేను పనిచేసిన రోజుల్లో వున్న తోటి సహోద్యోగులతో, నేను రిటైర్ అయిన తర్వాత చేరిన వారితో మాటా ముచ్చట్లతో గడిచింది.
నిజానికి ముప్పయి ఏళ్ళ పైచిలుకు కాలంలో నేను చేసింది కూడా ఇదే.
‘శ్రీనివాసరావు అసలు ఆఫీసుకు రావడమే గగనం. వచ్చాడంటే చాలు, ఆయన చుట్టూ అందరూ, అందరి మధ్యా ఆయన’ అనే పేరొకటి.
ఇక రేడియో గురించి నేను కొత్తగా చెప్పేది ఏముంటుంది? వార్తకు ప్రాణం విశ్వసనీయత. అదే ఇన్నేళ్ళుగా రేడియో వార్తల్ని బతికిస్తోంది. అప్పటికి ఎవరం ఉంటామో ఉండమో తెలియదు కానీ, ఇదే రేడియో కేంద్రం నూరేళ్ళ పండుగ జరుపుకోవడం తథ్యం. అది నా కోరిక.
నిజానికి నేను చేసింది చాలా చిన్న ఉద్యోగం. అంత చిన్న మనిషిని ఇంత పెద్దవాడిని చేసింది రేడియోనే అనే విషయం నేను ఎప్పటికీ మరిచిపోలేను.
నా ఉద్యోగం హోదా ఏమైనప్పటికి, ఆలిండియా రేడియో హైదరాబాదు కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్, హెడ్ ఆఫ్ ఆఫీస్ బి. హరి సింగ్, కేంద్రం ప్రోగ్రాం హెడ్, ఎస్. రమేశ్ సుంకసారి, డిప్యూటీ డైరెక్టర్ న్యూస్ ఎం.ఎస్. మహేష్, అసిస్టెంట్ డైరెక్టర్ న్యూస్ సురేశ్ ధర్మపురి, న్యూస్ కరస్పాండెంట్ లక్ష్మి తమ హోదాలను పక్కనబెట్టి బయట వరకు వచ్చి సాదరంగా నాకు వీడ్కోలు చెప్పారు. వారి గొప్ప మనసుకు మనసారా ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుని కారెక్కాను.
పుట్టింటిని మరిచిపోవచ్చేమో కానీ, పుట్టిల్లు ఎన్నటికీ మరవదు.
తోకటపా: డ్రైవర్ చిన్నా దోవలో నాతో అనేక ముచ్చట్లు చెప్పాడు. నేను రేడియోలో చేరినప్పటికి అతడు పుట్టనే లేదట. పెరిగి పెద్దయినప్పుడు రేడియోలో నా గొంతు వినేవాడట. అలా నన్ను గుర్తు పట్టాను అన్నాడు. మాటల మధ్యలో అడిగి నా వయసు తెలుసుకున్నాడు.
' చూసారా! మన రేడియో స్టేషన్ కంటే వయసులో మీరే నాలుగేళ్లు పెద్ద' అనడం నాకు నవ్వు తెప్పించింది.
థాంక్స్ చిన్నా!
కింది ఫోటోలు: ఆలిండియా రేడియోలో తీసినవి.






(11-04-2025)
ఇంకా వుంది