7, మార్చి 2026, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (280) : భండారు శ్రీనివాసరావు

 మొబైల్లో 'ఈగ' పడింది

 ఆ 'ఈగ’ ఖరీదు అక్షరాలా నాలుగువేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు. ఇదెలాగంటారా! చిత్తగించండి. 2012 సంవత్సరం జులై 15. హైదరాబాదులో థియేటర్ కు వెళ్లి సినిమా చూడడమనేది చాలా అరుదు. అధవా, ఎప్పుడయినా వెళ్ళామంటే గోకుల్ థియేటర్ కే. అదీ ఏదయినా కొత్త సినిమా మొదటి వారంలోనే. ఎందుకంటే ఆ సినిమాహాల్లో వారం వారం పిక్చర్లు మార్చి వేస్తుంటారు. ఆ థియేటర్ ఓనర్లలో ఒకడయిన శ్రీనివాస యాదవ్, మా రెండో అన్నయ్య కుమారుడు సుభాష్ చంద్ర బోస్ చిన్ననాటి స్నేహితులు కావడం మూలాన, టిక్కెట్లు దొరకవు అన్న బాధ లేకపోవడం మూలాన, మా అన్నదమ్ముల కుటుంబ సభ్యులం అందరం కట్టగట్టుకుని వెళ్ళే సందర్భం కావడం మూలాన, సాధారణంగా నేను కూడా ఇరవై నుంచి పాతిక వరకు వుండే ఈ ‘కొత్త సినిమా ప్రేక్షక వర్గంలో’ చేరుతూనే వుంటాను. అలా చూసిన సినిమా నాలుగు రోజులు గుర్తుండి పోయే సినిమా కావడం అన్నది సకృత్తు గా జరిగే విషయం. ఆ రోజు శనివారం కూడా అలాటి సందర్భం వచ్చింది. పెద్దా చిన్నా, పిల్లా మేకా, ముసలీ ముతకా పాతికమందిమి కలిసి వెళ్లి ఆ థియేటర్లో ‘ఈగ’ సినిమా చూసాము. చూసినవాళ్లలో మెజారిటీ రాజమౌళి అభిమానులే కాబట్టి సినిమా గురించిన చర్చ హద్దులలోనే సాగింది. ‘ఈగ’ వీక్షణానంతరం, మా మూడో అన్నయ్య కుమారుడు (ఇప్పుడు అమెరికా) ‘సాయి’ వాళ్లింట్లో భోజనాలు మొదలు పెట్టబోయేలోగా నా సెల్లు సుతారంగా మోగింది. చూస్తే బ్యాంకు నుంచి అలర్ట్ మెసేజి. ‘ఫలానా షాపులో మీరు ఇప్పుడే ఇంత తగలేశారు. తగలేయగా పోను మీకు ఇంకా తగలడివున్న బ్యాలెన్సు ఇంత’ అంటూ ఓ శ్రీముఖం. కార్డు సొంతదారునయిన నేను, ఆ కార్డుకు ‘యాడాన్’ కార్డు సొంతదారిణి ( అదేవిటో తెలుగు కూడా అలాగే తగలడి చస్తోంది సుమా) అయిన మా ఆవిడ వైపు ఓ చూపు పారేసి, సినిమా మధ్యలో కూడా లేచి వెళ్లి షాపింగు చేసి వచ్చిన ఆవిడ సామర్ధ్యాన్ని కంటి చూపుతోనే మెచ్చుకోబోయాను. కానీ నా వాలకాన్ని పసికట్టిన మా ఆవిడ ‘యేమయిందంటూ’ తన తరహాలో చూస్తూ నాకర్ధమయ్యే భాషలో ఇతరులకు తెలియకుండా అడిగింది. అంత గుంభనగా మాట్లాడ్డం తెలియని నేను అమాయకంగా విషయం బయట పెట్టాను. తాను కూడా కంగారుగా తన హ్యాండ్ బ్యాగ్ లో దాచిన బ్యాంకు కార్డు కోసం వెతికింది. ఆమె మొహం చూస్తూనే అది బ్యాగులో లేదన్న సంగతి అందరికీ తెలిసిపోయింది. అలా నలుగురిలో పడ్డ పాము ఎవరి చేతిలో చావకుండా, ‘ఇప్పుడేంచేయాల’న్న ప్రశ్నను మా ముందుంచి ,తాను చల్లగా తప్పుకుంది. కార్డును డీయాక్టివేట్ చేయడం ఒక్కటే మార్గమని మా కుటుంబం యావత్తూ ఏకాభిప్రాయానికి వచ్చేలోగా చేతిలో సెల్లు మరోమారు మోగింది. చూస్తే ఏముంది. బ్యాంకు నుంచి మరో ఎస్సెమ్మెస్ ఎలర్ట్. ‘ఏంచేయాలేంచేయాలని అలా ఆలోచిస్తూనే వుండండి, ఈ లోగా మీ కార్డు కొట్టేసిన దొంగ గారు, ‘విజిటింగు కార్డు బదులు క్రెడిట్ కార్డు నొక్కేస్తే పోయేద’న్న ‘ఈగ’ సినిమా డైలాగు పట్టుకుని ఇప్పటికప్పుడే మరో రెండువేల ఐదువందలకు దర్జాగా షాపింగు చేసి అంత దర్జాగా వెళ్లిపోయాడన్నది’ ఆ ఎలర్టు సారాంశం. ఈ తరహా చర్చల్లో పడితే, ‘ఈగ’ సినిమా బడ్జెట్ పదికోట్ల నుంచి ముప్పయి కోట్లకు పెరిగిపోయిన చందంగా దొంగ గారి షాపింగ్ స్ప్రీ అదే తరహాలో సాగిపోయే ప్రమాదాన్ని మేమందరం కొంచెం కొంచెం పసికడుతున్న తరుణంలో, ‘రాచ పీనుగ తోడు లేకుండా కదలదు’ అన్నట్టు పోయిన కార్డుతో పాటు మరో బ్యాంకు కార్డు కూడా కనబడం లేదని మా శ్రీమతి చావు కబురు చల్లగా చెప్పింది. దాంతో అందరం యమర్జెంటుగా మాకు మేమే ఎమర్జెన్సీ ప్రకటించేసుకున్నాం. తలా ఒక లాప్ టాప్ పట్టుకుని కొందరూ, సెల్ ఫోన్లతో మరికొందరూ, లాండ్ లైన్ సాయంతో ఇంకొందరూ ఒక్కుమ్మడిగా రంగంలోకి దిగి, ‘ఒకటి నొక్కండి, ఏడు నొక్కండి’ అనే బ్యాంక్ కస్టమర్ కాల్ సెంటర్ సూచనలను ఖచ్చితంగా పాటించే పనిలో పడ్డాం. ఆ కంగారులో ‘యాడాన్’ కార్డుతో పాటు నా ప్రైమరీ కార్డు లావాదేవీలను కూడా జయప్రదంగా స్తంభింపచేశాం. దరిమిలా, ‘మూడు వర్కింగు డేస్ నుంచి పదిహేను దినాల లోపల మీకు కొత్త కార్డు జారీ చేస్తామ’ని, మా పుట్టిన తేదీలు, మాతాపితరుల నామధేయాలు వాళ్ల రికార్డులతో పోల్చుకున్న పిమ్మట కాల్ సెంటర్ వాళ్లు ప్రకటించారు. ‘అమ్మయ్య’ అని అనుకుంటున్న సంతోషం కాస్తా కాసేపటిలోనే ఆవిరావిరయిపోయింది. అదేమిటంటే మేము మళ్ళీ ‘1975’ మోడల్ సంసారానికి మారిపోయాము. అంటే ఏమిటి? ‘చేతిలో క్యాషూ లేదు, జేబులో కార్డూ లేదు’ అనే పాత రోజులకన్న మాట. ఇంతకీ, ‘ఈగ’ సంగతేమిటంటారా! ‘ప్రధమ కబళే మక్షికాపాతః’ అన్నట్టు ఈ కార్డు తస్కరణ ఉదంతం ‘ఈగ’ ను కమ్మేసింది. ఇంటిల్లిపాదిదీ ఒకటే మాట. ‘సినిమా చాలా బాగుంది. రాజమౌళి హాట్స్ ఆఫ్’. సినిమాలు బాగా చూసేవారు కాబట్టి వాళ్ల మాటే రైట్ అనుకోవాలి.






 (ఇంకావుంది)


అయాం ఎ బిగ్ జీరో (279): భండారు శ్రీనివాస రావు

 

 తెలుగు పాత్రికేయ దిగ్గజం

 ‘ఒక పత్రిక ఎడిటర్ అనేవాడు ఎలావుంటాడు? ఎలా వుండాలి?’ అని కళ్ళుమూసుకుని ప్రశాంతంగా ఆలోచిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరిచినప్పుడు కనబడే రూపమే శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సీపీఆర్వో వనం జ్వాలా నరసింహారావు నేనూ కలిసి ఒకసారి పొత్తూరి వారి ఇంటికి వెళ్లాం. వారు రాసిన ‘బులేనా’ పుస్తకం సంతకం చేసి ఇచ్చారు. ‘ఎలా వున్నారు, ఆరోగ్యం ఇప్పుడు కులాసా కదా’ అని మేము అడగడం తప్పిస్తే ఆయన అంతట ఆయన తన అనారోగ్యం గురించి ఒక్క మాటా మాట్లాడలేదు. ఎంతో ఖరీదయిన వైద్యం. మామూలు మందులు కాక అదనంగా మూడు వారాలపాటు రోజుకొక కాప్స్యూల్ వేసుకోవాలి. ఒక్కొక్కటి అక్షరాలా వెయ్యి రూపాయలు. సాదా సీదా అట్టపెట్టెలోవున్న ఆ మాత్రల బాటిల్ ఇరవై వేల రూపాయలు అంటే నమ్మ బుద్దికాలేదు, కానీ కళ్ళెదుట కనబడుతున్న వాస్తవం అది. వున్న ఆ కొద్ది సమయంలోనే ఆయన ఎన్నో కబుర్లు చెప్పారు. ప్రత్యేకతెలంగాణా ఉద్యమం కొన్ని దశాబ్దాల క్రితం సికిందరాబాదులోని ఒక హోటల్లో ఎలా ఊపిరి పోసుకున్నదో చెబుతూ ఆనాటి విశేషాలు వివరించారు. ఇంట్లో పెంచుకుంటున్న ఈశ్వర నామం కలిగిన ఒక మొక్కను చూపించారు. పచ్చటి వర్ణం కలిగిన ఆకులు. వాటి మీద కపిల వర్ణంలో ‘నాగుపాము పడగ’ మీద వుండే కృష్ణ పాద ముద్రలు. ఆ మొక్క చాలా అరుదుగా దొరుకుతుందట. ఆ మొక్క వుంటే పాములు ఆ దరికి కూడా రావట. ఆయుర్వేద వైద్యులు మాత్రమే ఈ మొక్కను గుర్తించగలరట. ప్రాచీన ఔషధీ శాస్త్రంలో ఇటువంటివి ఎన్నో వున్నాయని చెప్పారు. నిజం కావచ్చు. నిజం కాదని నమ్మే వాళ్ళూ వుంటారు. నమ్మేవారు మొక్కితే రాయే సాయి, నమ్మనివారు తొక్కితే అదే రాయి. అదలా ఉంచి వెంకటేశ్వరరావు గారు స్వయంగా చెప్పిన కొన్ని విశేషాలు నెమరు వేసుకుందాం. ఈనాటి పత్రికారంగం వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశాలు వాటిల్లో వున్నాయి. పత్రిక యజమానికి తన పత్రిక గురించి ఆరా తీసే అధికారం ఉంటుందా? ఇప్పటి రోజుల్లో అయితే ఇదొక ప్రశ్నే కాదు. ఆరా తీయడమేమిటి, వార్తలను అదుపు చేసే అధికారం కూడా వుంటుంది. అయితే దాన్ని గురించి ఒక పాత విషయం చెప్పారు. కొంచెం అటూ ఇటూగా మూడు దశాబ్దాల నాటి సంగతి. అప్పటి ఆంధ్రప్రభ దినపత్రికకు పొత్తూరి వెంకటేశ్వరరావు గారు ఎడిటర్. విజయవాడలో రంగా హత్య దరిమిలా జరిగిన విధ్వంస కాండపై, రామోజీరావు గారు చైర్మన్ గా ఉన్న ఎడిటర్స్ గిల్డ్ ఒక నిజనిర్ధారణ కమిటీ వేసింది. కుల్ దీప్ నాయర్, చెన్నై ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ జగన్నాధన్ తో పాటు ఆంధ్రప్రభ ఎడిటర్ హోదాలో పొత్తూరి వెంకటేశ్వర రావు గారు కూడా అందులో ఒక సభ్యులు. పొత్తూరివారు విడిగా బెజవాడ వెళ్లి పరిస్తితులను పరిశీలించి ఒక నివేదిక పంపారు. అది ఎలా చేరిందో ఇండియన్ ఎక్స్ ప్రెస్ అధినేత రామనాద్ గోయంకాకు చేరింది. అది ఆయనకు రుచించినట్టు లేదు. వెంటనే వెంకటేశ్వర రావు గారికి ఒక లేఖ పంపారు. ‘మీ నివేదిక నాకు దిగ్భ్రాంతితో కూడిన నిరుత్సాహాన్ని కలిగించింది’ అన్నది దాని సారాంశం. గోయంకా యజమాని. పొత్తూరి వారు ఆయన దగ్గర ఒక ఉద్యోగి. అయినా అలా ఉత్తరం రాయడం ఆయనకు నచ్చలేదు. వెంటనే నిరసనగా రాజీనామా లేఖ గోయంకాకు పంపించారు. గోయంకా నుంచి పిలుపు వచ్చింది, మద్రాసు వస్తున్నాను అక్కడికి రమ్మని. పొత్తూరిగారు వెళ్ళారు. “నా ఎడిటర్ అభిప్రాయంతో విబేధించే స్వేచ్చ నాకు లేదా?” అని సూటిగా అడిగారు, రాజీనామా విషయం ప్రస్తావించకుండా గోయంకా. ఇంకా ఇలా అన్నారు. “మన పత్రికలో పాఠకుల ఉత్తరాలు ప్రచురిస్తాము కదా. పత్రిక విధానాలతో విబేధించే ఉత్తరాలు కూడా వేస్తుంటాం. యజమానిగా ఒక విషయం మీ దృష్టికి తెచ్చాను. అది మీకు నచ్చలేదు. సరే! ఒక సాధారణ పాఠకుడికి వుండే ఈ వెసులుబాటు కూడా ఒక యజమానిగా నాకు లేదా చెప్పండి” ఇలాంటి యజమానికి ఏ సంపాదకుడు అయినా ఏం జవాబు చెబుతారు. అందుకే గుంభనగా వుండిపోయారు. రాజీనామా విషయం పట్టుబట్టలేదు. గోయంకానే స్వయంగా రాజీనామా లేఖ పొత్తూరి వారి చేతిలో పెట్టి సాదరంగా సాగనంపుతూ అన్నారు. “మీరు ఎడిటర్ గా ఉన్నంత కాలం మీరు మీ అభిప్రాయాలనే రాస్తూ వుండండి” పొత్తూరివారి ఆరోగ్యం బాగాలేదని జ్వాలా ద్వారా తెలుసుకున్న తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖరరావు స్వయంగా పొత్తూరి వారిని చూడడానికి విజయనగర్ కాలనీలోని వారి ఇంటికి వెళ్ళారు. అక్కడి పరిస్తితిని ఓ కంట గమనించిన కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు. వారికి పూర్తి స్వస్థత చేకూరేవరకు ఆ బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు అయినప్పటికీ, సుదీర్ఘ కాలం ప్రాంతీయ ఉద్యమాన్ని నడిపిన కేసీయార్, పొత్తూరి వారిని ఒక పాత్రికేయుడుగా గుర్తించారు కాని, అయన ఏప్రాంతం వారనే వివక్ష చూపలేదు. ఆయనలోని ఈ విలక్షణత్వం పొత్తూరివారికి కూడా తెలుసు. కానీ మొదటే చెప్పినట్టు విలువలకు కట్టుబడి జీవిస్తూ వచ్చిన పాత్రికేయుడాయన. అంచేత కేసీఆర్ సాదరంగా ఇవ్వచూపిన సాయాన్ని వారు సున్నితంగా తిరస్కరించారు. అయితే వారిరువురి నడుమ సాగిన సంభాషణలో పొత్తూరి వారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. “రెండో ప్రపంచయుద్ధంలో నాయకత్వం వహించిన నాటి బ్రిటన్ ప్రధానమంత్రి విన్ స్టన్ చర్చిల్ ఆ తరువాత జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో ఆట్లీ చేతిలో ఓడిపోయారు. కానీ సుదీర్ఘకాలం ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి సారధ్యం వహించిన కేసీఆర్, తెలంగాణా రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలలోనే విజయబావుటా ఎగురవేసి తన నాయకత్వ పటిమను నిరూపించుకున్నారు” తెలుగు పత్రికా రంగంలో తరాల నడుమ నడుమ వారధిలా ఉంటూ వచ్చిన పొత్తూరివారి మరణం పాత్రికేయ లోకానికి ఎన్నటికీ తీరని లోటే. ఆరేళ్ళ క్రితం 2020 మార్చి అయిదో తేదీన పొత్తూరి వారు మరణించారు.


(ఇంకావుంది )

6, మార్చి 2026, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (278) : భండారు శ్రీనివాసరావు

 

ఇద్దరు అధికారులు, ఒకే పాఠం

ఎంత అల్పులమో తెలుసుకోవడానికి అనుదినం ఎదురయ్యే సంఘటనలను కొంత నిశితంగా పరిశీలిస్తే చాలని కొన్నేళ్ళ కిందటి నా ఈ అనుభవమే నాకు మరోసారి తెలియపరిచింది.

దూరదర్శన్ సప్తగిరి ఆధ్వర్యంలో హైదరాబాదు రవీంద్రభారతిలో ‘స్వర సమరం’ అనే సంగీత పోటీ జరిగింది. అప్పటి ఉమ్మడి రాష్ట్ర  గవర్నర్ శ్రీ నరసింహన్ ముఖ్య అతిధి. సతీసమేతంగా హాజరయి శాస్త్రీయ సంగీతం పట్ల తమ మక్కువను చూపారు. ఆద్యంతం తెలుగులో ప్రసంగిస్తూ ఇలాటి అద్భుత కార్యక్రమాలను నిర్వహించే శక్తి కేవలం దూరదర్శన్ కు మాత్రమే వుందని ఉద్ఘాటిస్తూ, ఆ సంస్థ ఇటువంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించడం ద్వారా శాస్త్రీయ సంగీతాన్ని ప్రోత్సహించాలని ఉద్బోధించారు. సరే అసలు విషయం ఇది కాదు.

మాజీ పోలీసు డైరెక్టర్ జనరల్ శ్రీ ఆర్. ప్రభాకర రావు, వారి శ్రీమతి వేదవతి సంగీతం మీద వున్న ఆసక్తితో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శ్రీ ప్రభాకర రావు పోలీసు శాఖలో అనేక ఉన్నత పదవులను నిర్వహించి సమర్ధుడైన అధికారిగా నిరూపించుకున్నారు. ఆయన్ని గుర్తుపట్టిన దూరదర్శన్ సిబ్బందిలో కొందరు వారిని మొదటి వరుసలో కూర్చోవాల్సిందిగా అభ్యర్ధించారు. అయినా సున్నితంగా తిరస్కరించి సాధారణ ప్రేక్షకుల మాదిరిగానే వారిద్దరూ వెనుక వరుసలోనే కూర్చుని కార్యక్రమాన్ని ఆసాంతం తిలకించారు.

గవర్నర్ పాల్గొంటున్న దృష్ట్యా రవీంద్ర భారతి ఆవరణలో కట్టుదిట్టమయిన పోలీసు బందోబస్తు చేశారు. కార్యక్రమం ముగిసిన తరువాత రంగస్థలం మీద కళాకారులను అభినందిస్తూ నరసింహన్ దంపతులు కొద్దిసేపు అక్కడే వుండిపోయారు. ప్రభాకరరావు దంపతులు ఈలోగా బయటకు వెళ్ళడానికి ప్రయత్నించగా, ద్వారం వద్దవున్న పోలీసు అధికారులు అడ్డగించారు. కొత్తగా ఉద్యోగంలో చేరి విధులు నిర్వహిస్తున్న ఆ సిబ్బందికి, తాము అభ్యంతరం చెబుతున్న వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం తమ శాఖకు అత్యున్నత అధికారిగా పనిచేశారన్న విషయం తెలిసివుండక పోవచ్చు. మధ్యలో ఎవరో కల్పించుకుని ఆయన ఎవరో ఏమిటో చెప్పబోతుంటే శ్రీ ప్రభాకర రావు వద్దని సైగచేసారు. ‘వారి డ్యూటీ వారిని చేయనీయండి’ అంటూ మళ్ళీ వెనక్కు వచ్చి హాలులో కూర్చుండిపోయారు.

రోజు తిరగకుండా మరోసారి మళ్ళీ ఇదేమాదిరి సంఘటన అనుభవంలోకి వచ్చింది. మర్నాడు ఆదివారం గవర్నర్ శ్రీ నరసింహన్ పుట్టినరోజు. రాజభవన్ లో అనేకమంది వారిని కలుసుకుని శుభాకాంక్షలు తెలియ చేసారు. శ్రీ నరసింహన్ పూర్వాశ్రమంలో పోలీసు అధికారిగా పనిచేసినందువల్లనేమో లోగడ పోలీసు శాఖలో ఉన్నత పదవుల్లో పనిచేసిన అనేకమంది గవర్నర్ ను అభినందించడానికి రాజ్ భవన్ కు వచ్చారు. గతంలో నేను రేడియోలో పనిచేసిన కాలంలో  సన్నిహితంగా మెలిగిన అనేకమంది అధికారులను చాలా సంవత్సరాల తరువాత అక్కడ కలుసుకోవడం జరిగింది. వారిలో శ్రీ రామస్వామి ఒకరు. ఆయన హైదరాబాదు పోలీసు కమీషనర్ గా పనిచేశారు. నిబంధనల ప్రకారం తన సెల్ ఫోనును కారులో బయటే వుంచేసి లోపలకు రావడం చూసి ఆ విషయాన్ని ఆయనతో ప్రస్తావిస్తే ‘పోలీసుశాఖలో ఇన్నేళ్ళు పనిచేసి మేమే రూల్స్ పాటించకపోతే యెట్లా’ అన్నట్టు చిరునవ్వే సమాధానం.

ఎదిగినకొద్దీ వొదగమ’ని ఓ సినీ కవి చక్కని పాట రాశారు. విన్నప్పుడల్లా యెంత చక్కని పాట అని ఎన్నోసార్లు అనుకుంటాం. కాని సందర్భం వచ్చినప్పుడు మాత్రం గుర్తు రాదు. ఉద్యోగం ద్వారా సమకూడిన హోదా ఒక్కటే గుర్తుంటుంది.

ఒక రోజు తేడాతో చూసిన ఈ రెండు సంఘటనలు మనసుపై మంచి ముద్రవేశాయి. అలా వుండగలిగితే యెంత బాగుండు ఒక్క క్షణం అనిపిస్తుంది. కాని మనసు కోతి లాటిది. దానికి తోడు, పాడు అహం, ఆ ఆలోచనను అనుక్షణం చంపేస్తూనే వుంటుంది. ఏం చేస్తాం!

(ఇంకావుంది)

4, మార్చి 2026, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (277) : భండారు శ్రీనివాసరావు

 

రాజకీయాల్లో ఇంత డబ్బు ఉందా?
ఆరేళ్ల క్రితం వరకూ నాది వారాలబ్బాయి జీవితం. పూటకు ఒక ఇంట్లో భోజనం మాదిరిగా నేను ప్రతి వారం ఒక టీవీ స్టూడియోకి వెళ్ళే వాడిని. సోమవారం ఒక ఛానల్ కు వెడితే మళ్ళీ వారం తర్వాత కానీ అదే ఛానల్ కు వెళ్ళే వాడిని కాదు. (మధ్యాహ్నాలు, సాయంత్రాలు మినహాయింపు, అలా రోజుకు మూడు పూటలు టీవీ చర్చలకు వెళ్ళిన సందర్భాలు అనేకం) మొదట్లో ఈ పద్దతి టీవీల వాళ్లకి నచ్చేది కాదు. ఆ రోజు అంశాన్ని బట్టి విశ్లేషకుడిని పిలవాలని అనుకునేవారు. కానీ చాలా సార్లు చెప్పాను కదా! నేనో సీతయ్యను, ఎవరి మాట వినను అని. చివరికి వాళ్ళే సర్దుకుపోయారు. ఆ విధంగా వారాలబ్బాయి అనే పేరు స్థిరపడింది.
ఉబెర్లు, ఓలాలు లేని రోజుల్లో టీవీల వాళ్ళు, వాళ్ళ కార్లు పంపేవాళ్ళు. ఈ సౌకర్యం వచ్చిన తర్వాత వాళ్ళు బుక్ చేసిన ఈ కార్ల లోనే వెళ్లి వస్తుండేవాడిని. ఆ రోజుల్లోని ఓ జ్ఞాపకం ఇది.
ఓనాడు ఉదయం ఇంటి నుంచి మహా న్యూస్ ఛానల్ కు వెడుతున్నాను. క్యాబ్ డ్రైవర్లు మాటామంతీ కలపడం మామూలే. కానీ ఈ కరుణాకర్ అనే క్యాబ్ డ్రైవర్ అన్న ఒక్క మాటే నన్ను ఆశ్చర్యపరిచింది. ఆలోచనలో పడేసింది. కొంచెం కట్టె విరుపుగా వున్నా, అందులో నిజం లేకపోలేదు.
“మీరు మహా టీవీకి వెడుతున్నారు. ఖచ్చితంగా అక్కడ బాబు గారికి అనుకూలంగా కొన్ని మాటలు చెబుతారు. నాకు బాగా తెలుసు. మిమ్మల్ని చాలా రోజులుగా టీవీల్లో చూస్తున్నాను. ఈ మధ్య తరచుగా రావడం లేదు. అది వేరే సంగతి”
ఏమనాలో తోచలేదు.
నాకు వచ్చిన మెసేజ్ ప్రకారం ఆ ఓలా క్యాబ్ డ్రైవర్ పేరు కరుణాకర్. (OLA CAB : KARUNAKAR, TS 15UB 3347)
కరోనా ఉధృతం తగ్గి ప్రజాజీవనం మళ్ళీ గాడిలో పడుతున్న కాలం. మూతి గుడ్డ పెట్టుకుని మాట్లాడడం వల్ల ముందు అతనేమంటున్నాడో నాకు అర్ధం కాలేదు. నేను కల్పించుకుని చెప్పేలోగా అతడే ఇంకా ఇలా అన్నాడు.
“మొన్న మిమ్మల్ని సాక్షిలో చూశాను. అక్కడా ఇంతే. జగన్ గారికి కొంత అనుకూలంగా మాట్లాడారు. నేను తప్పు పట్టను. మీలో నాకో సుగుణం కనిపించింది. బాబు అనుకూల ఛానల్లో బాబు వైపు మొగ్గు చూపినా, జగన్ గారికి వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా నోరు తెరిచి చెప్పరు. అలాగే సాక్షిలో జగన్ గారికి అనుకూలంగా మాట్లాడుతారు కాని బాబు గారికి వ్యతిరేకంగా ఎవరు రెచ్చగొట్టినా మాట్లాడరు. అయినా మీరు నాకు ఎందుకు నచ్చుతారంటే, ఏ టీవీలో మాట్లాడినా మధ్యలో ఎక్కడో వీలు చేసుకుని ఆ ఛానల్ వాళ్లకు ఇష్టం వున్నా లేకపోయినా, మీ మనసులో మాట కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు. అందుకే ఏ ఛానల్లో కనపడ్డా, యూ ట్యూబ్ లో కనపడ్డా నేను తప్పకుండా చూస్తాను”
అన్నాడు కరుణాకర్.
ఇంతకీ పొగుడుతున్నట్టా, తెగుడుతున్నట్టా! ఏదైనా దాచుకోకుండా మనసులో మాట చెబుతున్నాడు. జనం నాడి తెలుసుకోవడానికి ఇలాంటివాళ్ళే బెటరు.
“రాజకీయాలు అంటే ఇంట్రస్టా” అని అడిగాను ఏదో ఒకటి మాట్లాడాలని.
“నాకొకటి చెప్పండి. వీళ్ళకు ఇంత డబ్బు ఎలా వస్తుందండీ. నాకొక దోస్త్ వున్నాడు. వాడూ ఒకప్పుడు నాలాగే డ్రైవర్. ఒక నాయకుడి దగ్గర చేరి ఎక్కువ కాలం కాలేదు. ఏదో ఎన్నికల్లో మా వాడిని మా ఊరి వార్డు మెంబరు చేశారు. ఇప్పుడు అతడి వైభోగం వేరు. సొంత కారుంది. చిన్న ఇల్లు కట్టాడు. చాలా ఖరీదు చేసే సెల్ ఫోన్లు తరచూ మారుస్తుంటాడు. ఒక వార్డు మెంబరు అయితే ఇంత సంపాదన ఉంటుందా! ఈ లెక్కన బడా బడా నాయకుల రాబడి ఎంత వుంటుందో మరి”
జవాబు చెప్పే వ్యవధానం లేకుండా చేరాల్సిన గమ్యం చేరుకోవడం వల్ల అతడి ప్రశ్నకు బదులు ఇవ్వలేదు. నిజానికి ఆ ప్రశ్నకు సమాధానం నాకు కూడా తెలియదు.
మర్నాడు ఉదయం మరో ఛానల్ కు వెళ్లాను. చర్చా కార్యక్రమం పూర్తయ్యాక చాయ్ తాగుతున్నప్పుడు చర్చలో పాల్గొన్న చోటా రాజకీయ నాయకుడు ఒకరు తన జేబు నుంచి యాధాలాపంగా తీసినట్టు ఒక పెద్ద నోట్ల కట్టలు రెండు బయటకు తీసి, మళ్ళీ జేబులో పెట్టుకున్నాడు. అంత పొద్దున్న పొద్దున్నే అంత డబ్బు జేబులో పెట్టుకుని తిరగాల్సిన అవసరం ఏమి వుందో తెలవదు. వాటిని అలా బహిరంగంగా ప్రదర్శించాల్సిన సందర్భం కూడా కాదు.
అంతకు ముందు రోజు ఓలా డ్రైవర్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.














(ఇంకా వుంది)

3, మార్చి 2026, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (276) : భండారు శ్రీనివాసరావు

 

గుడిలో ఏముంది?
అప్పటికి ఉద్యోగపర్వం నుంచి రిటైర్ అయ్యాను.
ఒకసారి రవీంద్రభారతిలో ప్రోగ్రాం జరుగుతుంటే వెళ్లాను. ముందు వరసలో మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య గారు కనిపిస్తే వెళ్లి నమస్కారం పెట్టాను. ఆయన ‘రా! శ్రీనివాసరావ్! కూర్చో!’ అంటూ తన పక్క సీటులో కూర్చోబెట్టుకున్నారు.
ఇంకా సమయం వుండడంతో మాటామంతీ మొదలుపెట్టారు. మాట్లాడుతుంటే ఇంకా ఇంకా వినాలని అనిపించే మాటల చాతుర్యం ఆయన సొంతం.
‘మన రాష్ట్రమే తీసుకో! ఎవరిదగ్గర డబ్బు ఎక్కువ వుంటుందని నీ అంచనా! నువ్వు, ఇంకా చాలామంది అనుకున్నట్టు వేరే కులాల దగ్గర కాదు, డబ్బు కట్టలు మూలుగుతున్నది నిజానికి మా వాళ్ళ దగ్గర. (ఆయన కులం పేరు చెప్పారు కానీ దాన్ని ప్రస్తావించడం సంభావ్యం కాదు, అందరికీ తెలిసిందే) కానీ అవసరం అయితే కానీ తీయరు. దాతృత్వం తక్కువేమీ కాదు. కాలేజీలు, హాస్టళ్ళు చాలా కట్టారు. కానీ ఆచితూచి ఖర్చు పెడతారు. ఈ నాటి రాజకీయాల్లో విచ్చలవిడిగా డబ్బు వెదజల్లితే కానీ నెగ్గుకు రాలేని పరిస్థితులు. అది తెలిసి వచ్చిన తర్వాతనే నేను ప్రత్యక్ష ఎన్నికలకు దూరం జరిగాను.
‘సరే! ఇదలా ఉంచు. మరో విషయం తెలుసా? మన దగ్గరే కాదు, దేశంలో ఎక్కడికి వెళ్ళినా రాములోరి గుడి, షావుకారు దుకాణం లేని ఊరు వుండదు. అంటే ఏమన్న మాట. కొన్ని ఊళ్ళల్లో అన్ని కులాలవారు వుండరు. కానీ పూజారి (బ్రాహ్మడు) షావుకారు ప్రతి ఊర్లో వుంటారు. అయినా ఆ కులాలకు ఈనాడు ఏమి విలువ వుంది చెప్పు’ (బహుశా ఆయన ఉద్దేశ్యం రాజకీయాల్లో కావచ్చు)
ఒక బహిరంగ ప్రదేశంలో, ఒక రాజకీయ నాయకుడు, అదీ పరిణతి చెందిన ఒక రాజకీయ వేత్త అలా కులాలు గురించి, మెల్లగానే అయినా, బాహాటంగా ప్రస్తావించడం నాకు చిత్రం అనిపించింది.
తమిళనాడు గవర్నరుగా నియమితులైన సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రమాణ స్వీకారానికి పూర్వమే రాష్ట్ర ఆర్య వైశ్య సంఘం ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమం అది. ఈలోగా నిర్వాహకులు వచ్చి రోశయ్య గారిని సగౌరవంగా వేదిక మీదకు తీసుకు వెళ్ళారు.
నేను కాసేపు కూర్చుని పంజాగుట్టలోని మా మేనల్లుడు డాక్టర్ రంగారావు (108, 104 పధకాల రూపశిల్పి) ఇంటికి వెళ్లాను. సాయంత్రం వేళల్లో అక్కడ చాలామందిమి కలుస్తూ వుండేవాళ్ళం.
మాటల మధ్యలో వృద్ధులు, పిల్లలు పౌష్టికాహారం ప్రసక్తి వచ్చింది. నేను రోశయ్య గారు చెప్పిన ప్రతి ఊరిలో రాములోరి గుడి గురించి చెప్పాను.
అప్పుడు డాక్టర్ రంగారావు, డాక్టర్ బాలాజీ చెప్పిన విషయాల్లో నాకు జ్ఞాపకం వున్నంతవరకు ఇక్కడ పేర్కొంటున్నాను.
మనిషికి ప్రధానంగా అవసరం అయింది ఆహారం. దానికి మిక్కిలి కొరతగా వుండే పాతరోజుల్లో గుళ్ళో పులిహారో, పాయసమో చేసి జనాలకు ప్రసాదంగా పంచేవారు. కూటికీ, గుడ్డకూ మొహం వాచిన ఆ రోజుల్లో అదే మహా ప్రసాదం.
ఇక వూళ్ళల్లో వయోవృద్దులకు, అభాగ్యులకు గుడి ప్రసాదమే మహా భాగ్యం. ఈ రోజుల్లో ప్రభుత్వాలు అలాటి పేద వృద్ధులకు, పింఛన్ల పేరుతొ నెలకు ఇంత అని డబ్బు చెల్లించి తమ బాధ్యత దులుపుకుంటున్నాయి. నా అనేవాళ్ళు ఎవ్వరూ లేని, వంటావార్పూ సొంతంగా చేసుకోలేని ఆ అభాగ్యులకు డబ్బు ఇస్తే ఏం ప్రయోజనం. వండి వార్చేవాళ్ళు లేని నిస్సహాయులకు గుడిలో లభించే పులిహారో, దద్దోజనమో మించింది ఏముంటుంది. ఆ రోజుల్లో గుళ్ళు ఈ సామాజిక బాధ్యతను గొప్పగా పోషించాయి.
ఇప్పటికీ పెద్ద పెద్ద దేవాలయాల్లో అన్నదాన పథకాలు అమలు అవుతున్న మాట నిజమే. అయితే వాటిపై ఓ అపప్రధ వుంది. పేదలకు ఉచితంగా పంచాల్సిన ప్రసాదాలను అమ్ముకుంటూ, మరో పక్క వీ.ఐ.పీ.ల సేవలో తరిస్తున్నాయని.
ఈరోజుల్లో చదువుకునే పిల్లలకోసం ప్రభుత్వాలు ఎంతో డబ్బు ఖర్చు చేసి మధ్యాహ్న భోజన పధకాలు అమలు చేస్తున్నాయి.
పూర్వపు రోజుల్లో ప్రభుత్వాలపై భారం లేకుండా ఊరిలోని దేవాలయాలే ఈ పని చూసుకునేవి. నిలవవుండే పులిహోర, పోషకాలు సమృద్ధిగా వుండే దద్దోజనం, పాయసం వీటికి మించిన మధ్యాహ్న భోజనం ఏముంటుంది?
గుడి అంటే కేవలం ఆస్తికత్వానికి ప్రతిరూపం అనుకోకూడదు. వాటిని సరిగా వాడుకోగలిగితే, ఎన్నో సామాజిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. గుడిలో ఏముందీ అని వ్యంగ్యంగా పాటలు పాడుకునే అవసరం వుండదు.
అయితే, ప్రతిదీ రాజకీయమయమయిపోతున్న ఈ రోజుల్లో ఇది సాధ్యమా అంటే అనుమానమే.
ఇక్కడ గుడి అంటే దేవాలయం మాత్రమే కాదు, అది ఒక మసీదు కావచ్చు, ఒక చర్చి కావచ్చు, ఒక గురుద్వారా కావచ్చు. ఏదయినా అవి నెరవేర్చే సామాజిక బాధ్యత మాత్రం ఒక్కటే.
ఊరివారు తలచుకుంటే, ఆ సంకల్పానికి ప్రభుత్వ సాయం తోడయితే అన్నానికి మొహం వాచే వారంటూ ఏ వూరిలో మిగలరు.

కింది ఫోటో: మా స్వగ్రామం కంభంపాడులో రామాలయం




(ఇంకావుంది)

1, మార్చి 2026, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (275) : భండారు శ్రీనివాసరావు

 పాలించడానికి కాదు, ప్రశ్నించడానికి

‘ప్రతి శుక్రవారం సాయంత్రం ఏడుగంటలకు హైదరాబాదు ప్రెస్ క్లబ్ కు వెళ్ళాలి, అక్కడ అందరం కలవాలి, ఇది పిలుపులు లేని పేరంటం’ అని మిత్రుడు జ్వాలా చెప్పిన విషయం మొన్న శుక్రవారం నాడు పొద్దుగుంకుతున్న సమయంలో జ్ఞాపకం వచ్చింది.
తయారయి ఏడుగంటల కల్లా అక్కడ వుండాలి అనే ఉద్దేశ్యంతో ఉబెర్ యాప్ ఓపెన్ చేశాను.
నిజానికి నేను రెగ్యులర్ గా డ్రైవర్లను బుక్ చేసే షఫీకే ముందు ఫోన్ చేశాను. రంజాన్ మాసం కావడం వల్ల ఆ సమయానికి డ్రైవర్లు అందుబాటులో లేరు. మామూలుగా అయితే అరగంట ముందు చెప్పినా డ్రైవర్ వచ్చేవాడు.
ఓలా, ఉబెర్ లు అంతర్జాతీయ కంపెనీలు. కష్టమర్లను ఆకర్షిస్తూనే మరోపక్క లాభాలు ఆర్జించడం వాళ్ళ ధ్యేయం.
పదేళ్ల క్రితమో అంతకు కొంత ముందో ఈ కొత్త రకం రవాణా వ్యవస్థ హైదరాబాదులో ప్రవేశించిన నాటి నుంచి నేను వీటికి కష్టమర్ ని. సొంతానికి కారు వుందన్న మాటే కానీ, మధ్యలో ఆగితే కారు తోయడం కూడా తెలవదు. నాలాంటి వారికి ఆ రోజుల్లో ఈ ఉబెర్లు, ఓలాలు వరప్రసాదంలా దొరికాయి. ఆటో చార్జీతో సమానంగా వీటి ఛార్జీలు వుండేవి. హాయిగా ఏసీ కార్లో కాలుమీద కాలు వేసుకుని, ఎక్కడికి కావాలంటే అక్కడికి, ‘లెఫ్ట్ తిరుగు, రైట్ తిరుగు’ అని చెప్పే పనిలేకుండా, గమ్యస్థానం దగ్గరే నేరుగా దిగిపోవచ్చు’ అనే సాధారణ మధ్యతరగతి మనస్తత్వం ఈ కంపెనీలకు కాసులు కురిపిస్తోంది. చౌకగా జనాలకు అలవాటు చేసి తరువాత తరువాత రేట్లు ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటూ పోవడాన్ని కష్టమర్లు నిస్సహాయంగా చూస్తూనే వాటికి అలవాటు పడిపోయారు. మల్టీ నేషనల్ కంపెనీల అసలు గుట్టు ఇదే. ముందు అలవాటు చేయాలి. తరువాత తరువాత ఎంతగా రేట్లు పెంచినా, పెంచిన రేట్లకు జనమే కిమ్మనకుండా అలవాటుపడిపోతారు. ఈ సూత్రంతోనే అవి నడుస్తుంటాయి. మనల్ని నడిపిస్తుంటాయి.
వీటికి సొంతంగా ఒక్కటంటే ఒక్క కారు వుండదు. కానీ వేలాది కార్లు ఈ బ్రాండ్ తో నడుస్తుంటాయి. టెక్నాలజీతో కారు డ్రైవర్ ని, వినియోగదారుడుడిని కలపడం ఒక్కటే వీళ్ళు చేసే పని. ఒకరకంగా చెప్పాలి అంటే చిట్ ఫండ్ వ్యాపారం. అందులో నిర్వాహకులకు ఒక్క రూపాయి ఖర్చు వుండదు. డబ్బు అవసరం వున్నవాడిని, అంతగా లేని వాడిని కలపడం. అవసరం వున్నవాడు పాడుకుంటాడు, కొంత నష్టానికి. ఆ నష్టమే అవసరం లేని వాడికి లాభంగా మారుతుంది. ఆ లాభాల్లో సింహభాగం చిట్ ఫండ్ కంపెనీ వాడు వుంచుకుని మిగిలిన డబ్బుని పాట పాడని వాళ్ళకు పంచడం. ఈ రవాణా కంపెనీ వాళ్ళదీ ఇదే వరస.
ఆ శుక్రవారం అదృష్టం కొద్దీ ఉబెర్ కారు తొందరగానే వచ్చింది. డ్రైవర్ పేరు వెంకటేష్. పిన్ నెంబరు చెప్పగానే డోరు తీశాడు. యాప్ లో ప్రెస్ క్లబ్ చేరే టైము చూపిస్తోంది. పర్వాలేదు పది నిముషాలు ముందే వుంటాను అనుకున్నాను, కారులో సర్దుకుని కూర్చొంటూ.
‘మీరు జర్నలిస్టా?’ అడిగాడు, కారు మెయిన్ రోడ్డు మీదకు పోనిస్తూ.
‘ఏమీ లేదు, ప్రెస్ క్లబ్ కు వెడుతున్నారు కదా! అందుకని అడిగాను’ అన్నాడు అతడే వివరణ ఇస్తూ.
ఇలా వెళ్ళే సమయాల్లో డ్రైవర్లు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. అన్యమనస్కంగానే వింటూ వుంటాను. కొంత స్వార్ధం కూడా వుంది. ఒక్కోసారి రాసుకోవడానికి మంచి విషయాలు తెలుస్తుంటాయి.
‘రాఘవ్ చద్దా రీల్స్ చూస్తుంటారా!’ అని అడిగాడు డ్రైవర్ వెంకటేష్. ఈ మధ్యనే ఎవరో మిత్రుడు చెబితే ఒకటి రెండు సార్లు రాజ్యసభలో రాఘవ్ చద్దా చేసిన కొన్ని ప్రసంగాలు విన్నాను. అతడు ఏ పార్టీ వాడో కూడా తెలియదు. సాధారణ ప్రజలు నిత్య జీవితంలో ఎదుర్కునే సమస్యలను ప్రస్తావిస్తూ వుంటాడు. ఆ రాఘవ్ చద్దా పేరు ఒక సామాన్య టాక్సీ డ్రైవర్ నోట వినడం నాకు చాలా వింతగా అనిపించింది.
రద్దీ రోడ్డుపై లాఘవంగా డ్రైవ్ చేస్తూనే వెంకటేష్ రాఘవ్ గురించి చెబుతూనే వున్నాడు.
‘నాకు ఆయన ఏ పార్టీవాడో తెలియదండీ. ఎప్పుడు మాట్లాడినా దేశంలో చిన్న మనుషుల సమస్యలే మాట్లాడుతాడు. నిజానికి అవి చిన్నవాళ్ల పెద్ద సమస్యలు. పెద్దవాళ్లకు అసలు పట్టని సంగతులు. ఆయన అవే మాట్లాడుతాడు. పెద్ద ఉపన్యాసాలు చేయడు. అయిదు కిలోల రేషన్ కోసం వేలిముద్రలు అడుగుతారు. యూరియా కొనాలి అంటే వేలి ముద్రలు తీసుకుంటారు. మరి, అతి ముఖ్యమైన ఓటు వేయడానికి వేలిముద్రలు ఎందుకు తీసుకోరు. ఓటును వేలిముద్రకు ముడిపెడితే దొంగ ఓట్ల బెడద వుండదు కదా! అని ఒకసారి చెప్పాడండీ. ఎంతచక్కని మాట! నాకు బాగా నచ్చిందండీ’ చెబుతున్నాడు వెంకటేష్.
‘ఆయన చెప్పేవన్నీ ఇలాంటివేనండీ. ఎవర్నీ ఘాటుగా విమర్శించడు. పొల్లు మాట ఆయన నోట వినపడదు. ఇలాంటి వాళ్ళు ఓ పదిమంది వుంటే దేశం పరిస్థితి ఇలా వుండదండీ’
వెంకటేష్ చెప్పుకు పోతున్నాడు. రాజ్యసభలో రాఘవ్ చద్దా చెప్పిన మరి కొన్ని సంగతులు గుర్తుచేసుకుని మరీ చెబుతున్నాడు.
‘దేశంలో ఎక్కువమంది పేదవాళ్లు, మధ్యతరగతి వాళ్ళు తమకు కావాల్సినవి కొనుక్కుని పన్నులు చెల్లిస్తూ వుంటే, వాటిని తయారు చేసిన పెద్దోళ్లు సంపాదించి పన్నులు కడుతున్నారు. పేదవాళ్లకు సబ్సిడీలు , పధకాలు. గొప్పోళ్ళు తీసుకున్న బ్యాంకు రుణాలు పూర్తిగా మాఫీ, మరి పన్నులు కట్టే మధ్యతరగతికి మాత్రం గుండు సున్నా. వాళ్ళు బంగారు గుడ్లు పెట్టే బాతులు మాత్రమే. బతకాలంటే పన్ను, ఆఖరికి చావాలంటే కూడా పన్నే. ఎయిర్ పోర్టుల్లో మామూలోడు ఒక కప్పు కాఫీ కొనుక్కుని తాగే పరిస్థితి ఉందా!
‘ఇలాంటి సంగతులు ఎన్ని చెబుతూ వుంటాడండీ ఆ పెద్దాయన. నాకయితే కాళ్ళకు మొక్కాలని అనిపిస్తుంది ఆ మాటలు వింటుంటే’
ఇంతలో ప్రెస్ క్లబ్ వచ్చింది.
‘అసెంబ్లీలో, పార్లమెంటులో ఎప్పుడు ఏదో ఒక విషయంపై రగడ. అనవసరమైన విషయాలపై ఏదో ఒక రభస. అందరూ రాఘవ్ గారి మాదిరిగా ప్రజా సమస్యలను ఎందుకు లేవనెత్తరో అర్ధం కాదు’ అన్నాడు రైడ్ క్లోజ్ చేస్తూ.
గూగుల్ పే చేసిన తర్వాత అడిగాను వెంకటేష్ ని, ‘నీకు సెల్ఫీ తీయడం వచ్చా! నీతో నా ఫోటో ఒకటి తీస్తావా’ అని.
వెంకటేష్ ఏమి చదువుకున్నాడో, అతడి నేపధ్యం ఏమిటో నాకు తెలియదు.
అతడి మాటల వల్ల తెలిసిందల్లా దేశంలో, సామాన్య జనంలో పాజిటివ్ థింకింగ్ క్రమంగా పెరుగుతోందని.
దీర్ఘకాలంలో జాతికి మేలు చేసే ఆలోచనా ధోరణులు పెరుగుతున్నాయని.
భయం లేదు! సమాజం మేలుకుంటోంది!



(ఇంకా వుంది)
01-03-2026

28, ఫిబ్రవరి 2026, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (274) : భండారు శ్రీనివాసరావు

 

నగరానికి ఏమైయింది?

1975 వ సంవత్సరం.
రేడియోలో విలేకరి ఉద్యోగంలో చేరడానికి హైదరాబాదు వచ్చాను. నగరం పొలిమేరలకు చేరకముందే ఆలిండియా రేడియో ట్రాన్స్ మిటర్లు (ఇప్పుడు నడిబొడ్డుకు చేరాయి) కనబడ్డాయి. బస్సు కిటికీ కడ్డీలు ముట్టుకుంటే ఐసు కడ్డీలు తాకినట్టు చల్లగా తగిలేవి. చుట్టూ ఎటు చూసినా కనుచూపు మేర వరకు పచ్చటి అనాబ్ షాహీ ద్రాక్ష తోటలు.
నగరంలో రోడ్లు తీర్చి దిద్దినట్టు శుభ్రంగా ఉండేవి. ఇరువైపులా పచ్చని చెట్లు. భారీ వర్షం పడినా, రోడ్లు ఏరులై పారినా, వాన వెలవగానే వరదలా వెల్లువెత్తిన నీళ్లన్నీ చప్పున మాయం అయ్యేవి. రోడ్లమీద నీళ్ళు నిలిచేవి కావు. ఇప్పుడా పరిస్తితి వుందా! లేదని చెప్పడానికి తడుముకోవాల్సిన పని లేదు.
నగరంలో జర్నలిష్టులకు మరో కాలనీ మంజూరయింది. ఎక్కడో జూబిలీ హిల్స్ అట. చూద్దామని కొందరు మిత్రులతో బయలుదేరాను.
పంజాగుట్ట స్మశానం దాటగానే ఊరు కనబడలేదు. రోడ్డుకు అటూఇటూ విసిరేసినట్టు అక్కడక్కడా ఇళ్ళు. చెక్ పోస్ట్ దగ్గర అన్నీ పొలాలే. ఎన్టీఆర్ తన కుమారుడు బాలకృష్ణ కోసం కట్టిన భవంతి ఒక్కటే ఒంటరిగా నిలబడి వుంది. అది దాటిన తరువాత జర్నలిష్టుల కాలనీ కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలం. (పొలం అనాలా). దానికి చివర్లో పెద్ద లోయ. అందులో నిండుకుండలా ఓ తటాకం. చిక్కడపల్లి నుంచి వెళ్ళిన నాకది ఓ అపూర్వ దృశ్యం.
ఇప్పుడా లోయాలేదు, తటాకమూ లేదు. లోయకు పైన జర్నలిష్టుల కాలనీ, లోయని పూడ్చేసి సంపన్నుల కాలనీ వెలిశాయి. వీటికి ఆనుకుని ప్రభుత్వాలను, ప్రజలను శాసించే ఐ.ఏ.ఎస్.,ఐ.పీ.ఎస్., అధికారుల నివాస భవనాలు.
హైదరాబాదు నగరం చుట్టుపక్కల వేల సంఖ్యలో చిన్నా చితకా చెరువులు వుండేవని నగరం గురించి రాసిన పుస్తకాలు చదివితే తెలుస్తుంది. అదేమిటో చాలావరకు చెరువులన్నీ మంత్రం వేసినట్టు మాయమయిపోయాయి. వాటిల్లో చిన్న స్థాయి వాళ్ళు కట్టుకున్న చిన్న వాడలు, మధ్యతరగతి వాళ్ళు వుండే అపార్ట్ మెంట్లు, ఇంట్లో వంట్లో పుష్కలంగా వుండే కలిగినవాళ్ళు నివసించే సంపన్న కాలనీలు అంగుళం జాగా లేకుండా వెలిసాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ కుంచించుకు పోయినా ఇంకా మిగిలే వున్నాయి. సంతోషించాలి.
గతంలో గండిపేట చెరువు చూడడానికి విహార యాత్రకు వెళ్ళేవాళ్ళం. అందులో అపార జలరాశిని చూస్తుంటే కడుపు నిండిపోయేది. అలాంటి దృశ్యాలు ఇప్పుడు కేవలం పాత తెలుగు సినిమాల్లో మాత్రమే కనబడతాయి. ఇప్పుడు అదే తటాకం, ఏడాదిలో చాలా నెలలపాటు వట్టిపోయి రాళ్ళు తేలి కానవస్తోంది.
నేను రేడియోలో చేరిన తొలి రోజుల్లో స్టేట్ బ్యాక్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో తమ కార్యకలాపాలను హైదరాబాదు విలేకరులకు చూపించడానికి ఒక వ్యానులో కొందరు పత్రికా ప్రతినిధులను తీసుకు వెళ్ళారు. ఆ బృందంలో నేను కూడా వున్నాను. అరగంట లోపలే నగరం పొలిమేరలకు చేరాము. (ఇప్పుడది అసాధ్యం అని అందరికీ అనుభవైకవేద్యమే!
అక్కడినుంచి అడవి దారిలో మా ప్రయాణం సాగింది. బాటకు ఇరువైపులా పొడవాటి చెట్లు. ఆ వెనుక దట్టమైన అడవి. ఇప్పుడు అడవి సరే, పెద్ద పెద్ద చెట్లు కనబడడం కూడా అపురూపం. వన మహోత్సవాల పేరుతొ రహదారులకు అటూ ఇటూ నాటిన చెట్లు కనబడతాయి. నిజానికి ఈ ఉత్సవాల సమయాల్లో ఆయా ప్రభుత్వాలు ప్రకటించుకున్నట్టు, నాటిన మొక్కలు అన్నీ పెరిగి పెద్దవి అయివున్న పక్షంలో గత యాభయ్ ఏళ్ళలో నగరాలు, పట్టణాలు అన్నీ దట్టమైన అడవుల మధ్య వుండేవి.
నా చిన్నతనంలో కాలువ గట్ల మీద వరసగా అనేక చెట్లు వుండేవి. వాటిపై నెంబర్లు వేసేవాళ్ళు, ఎవరైనా దొంగతనంగా చెట్టు నరికితే కనిపెట్టడం కోసం. అక్రమంగా చట్లు నరికితే శిక్షలు కఠినంగా వుండేవి. కనుకనే చెట్టు నరకడానికి భయపడే వాళ్ళు. ఇప్పుడా భయమేదీ! ఆ భయమే వుంటే వెనుకటి అడవులు ఎలా మాయమయ్యేవి?
నేను ఖమ్మం స్కూల్లో చదువుకొనేటప్పుడు, అప్పుడు డీపీఆర్వోగా పనిచేస్తున్న మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారి వెంట ఒకసారి ఆయన వ్యానులో భద్రాచలం వెళ్లాను. కొత్తగూడెం, పాల్వంచ తరువాత అన్నీ కారడవులే. రాత్రి వేళల్లో క్రూర మృగాలు సంచరిస్తాయని ప్రయాణాలు చేయడానికి సంకోచించేవాళ్లు. ఇప్పుడా అడవులు లేవు, ఆ భయాలు లేవు. పచ్చని చెట్లే కనబడకుండా పోయాయి.
ఎండలు మండుతున్నాయని, అకాల వర్షాలు కురుస్తున్నాయని ఇప్పుడు గగ్గోలు పెడితే ఏమి లాభం? అంతా స్వయం కృతం.
తోకటపా:
కింది చిత్రాన్ని చూడండి.
ఈ పాటి ఎత్తు ఎదగడానికి నాకు 80 ఏళ్ల టైమ్ పట్టింది. నా వెనుక వున్న వృక్షం ఆకాశమంత ఎత్తు ఎదగడానికి ఎన్ని దశాబ్దాలు గడిచి పోయాయో మరి. ఇంత కాలం దానిని నరకకుండా కాపాడిన వారిని మెచ్చుకోవాలి. మనదేశం కాదు కనుక బతికిపోయింది.
గత పాతికేళ్లలో నేను అనేక సార్లు అమెరికా వెళ్లాను. అక్కడి అనేక నగరాల మాదిరిగానే మా వాడు వుంటున్న సియాటిల్ కూడా పచ్చని నగరం. ఇన్నేళ్ళలో చెట్టు కాదు కదా చెట్టు కొమ్మ కొట్టడం కూడా నేను చూడలేదు.



(ఇంకా వుంది)