10, ఏప్రిల్ 2026, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (289): భండారు శ్రీనివాసరావు

 

అమ్మ ఇచ్చిన ఉద్యోగం ఈ ముఖ్యమంత్రి పదవి

“ఏమయినా చెప్పు! రెడ్డి సాబ్ టేస్టే టేస్టు! ఈ కుర్చీ చూడు ఎంత గొప్పగావుందో!” - అన్నారు ముఖ్యమంత్రి అంజయ్య ఆ స్వింగ్ చైర్ లో కూర్చుని అటూ ఇటూ కదులుతూ.
అంజయ్య గారిది పిల్లవాడి మనస్తత్వం. ఇందిరాగాంధీ దయవల్ల తాను ముఖ్యమంత్రిని అయ్యానన్న భావం ఆయనలో వుండేది. దాన్ని దాచుకోవడానికికానీ, లేనిపోని భేషజం ప్రదర్శించడానికి కానీ ఎప్పుడూ ప్రయత్నించేవారు కాదు. ప్రతి సందర్భంలో ‘అమ్మ అమ్మ’ అంటూ ఆమెని హమేషా తలచుకుంటూనే వుండేవారు.
చెన్నారెడ్డి గారి వంటి చండశాసనుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన తరవాత ఆ స్తానంలో మేదకుడయిన అంజయ్య గారిని ఊహించుకోవడం రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులకు ఒక పట్టాన మింగుడుపడేది కాదు. ఆయన గురించి తేలిగ్గా మాట్లాడుకునేవారు. ఈ విషయం ఇందిరాగాంధీకి తెలియకుండా వుంటుందా. వెంటనే ఒకరోజు ఆమె పనికట్టుకుని హైదరాబాదు వచ్చారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసారు. మామూలుగా ఈ మీటింగులు శాసనసభ ఆవరణలో జరుగుతుంటాయి. కానీ ఈ సారి ఆ సంప్రదాయానికి విరుద్ధంగా అంజయ్యగారు ముఖ్యమంత్రిగా నివాసం వుంటున్న ‘జయప్రజాభవన్’ (గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్) లో నిర్వహించారు. ఇందిరాగాంధీ ఆ సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఇంట్లో సమావేశం జరిపి అందులో మాట్లాడడం ద్వారా ఆమె కాంగ్రెస్ వాదులందరికీ ఒక స్పష్టమయిన సందేశం పంపారు. అంతే! అంజయ్య గారిని గురించి అంతవరకూ తేలికగా మాట్లాడిన వారందరూ నోళ్ళు కుట్టేసుకున్నారు.
ఎందుకో ఏమో కారణం తెలియదు కాని, నా పట్ల ఆయన అపారమయిన వాత్సల్యం చూపేవారు.
ఒక్కోసారి ఈ ప్రవర్తన ఇరకాటంగా వుండేది. ముఖ్యమంత్రిని కలవడానికి ఎవరెవరో వస్తుంటారు. ఏదయినా చెప్పుకోవాలనుకుంటారు. అక్కడ నాలాటి బయటవారు వుంటే ఇబ్బంది. పైగా విలేకరిని. కానీ ఆయన నన్ను తన చాంబర్ నుంచి అంత తేలిగ్గా కదలనిచ్చేవారు కాదు. “వెడుదుగానిలే! కాసేపు కూర్చో!” అనేవారు నేను లేవగానే. ఇబ్బంది పడుతూనే కూర్చుండిపోయేవాడిని పనేమీ లేకపోయినా.
ఆంధ్రప్రదేశ్ కు అంజయ్య గారు ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధి తనయుడు రాజీవ్ గాంధి విమానాల పైలట్ గా పనిచేస్తున్నారు. ఓ రోజు ముఖ్యమంత్రిగారు సచివాలయంలో నలుగురితో మాటా మంతీ సాగిస్తున్న సమయంలో ఆయనకు ఓ ఫోన్ వచ్చింది.
ఆయన తత్తరపడుతూ లేచి వున్నపాటున బరకత్ పురాలో వున్న తన ఇంటికి బయలుదేరారు. అప్పటికి అంజయ్య గారు అధికార నివాసం గ్రీన్ లాండ్స్ (ముద్దుగా ఆయన పెట్టుకున్న పేరు ‘జయ ప్రజా భవన్) కి మకాం మార్చలేదు. బరకత్ పురాలో హౌసింగ్ బోర్డ్ వారి టూ ఆర్ టీ ఇంట్లోనే వుంటున్నారు. (మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఆయన అదే ఇంట్లో వున్నారు ) ఇప్పటి రోజులతో పోలిస్తే అది ఒక విడ్డూరమే. ఆ చిన్న ఇంటిపైనే గది మీద గది నిర్మించుకుంటూ వెళ్లడం వల్ల చాలా ఇరుకుగా వుంటుంది. మెట్లు కూడా సౌకర్యంగా వుండవు.
సరే! అంజయ్య గారు హడావిడి పడుతూ ఇంటికి వెళ్ళి ఆయాసపడుతూ మెట్లెక్కినప్పుడు కనబడ్డ దృశ్యం ఈనాటి ఛానళ్ళకు దొరికివుంటే పండగే పండగ.
రాజీవ్ గాంధీ అక్కడి చిన్న గదిలో అంతకంటే చిన్న కుర్చీలో కూర్చుని, తనను పీక్కుతింటున్న దోమల్ని తోలుకునే పనిలో నిండా మునిగి తేలుతున్నారు. అసలే పండంటి మనిషి. లేత శరీరం. ఆయన మొహం మీద దోమ కాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అసలు జరిగిన విషయం ఏమిటంటే, రాజీవ్ గాంధీ పైలట్ గా హైదరాబాదు వచ్చిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం, తిరిగి వెళ్ళడానికి బాగా వ్యవధానం వున్నట్టుంది. యెందుకు అనిపించిందో తెలియదు కాని, ఆయన బేగం పేట ఎయిర్ పోర్ట్ లో ఎవర్నో అడిగి ఓ కారు తీసుకుని నేరుగా బరకత్ పురాలోని అంజయ్య గారి నివాసానికి వెళ్ళిపోయారు. ఈ కబురు అంది, ముఖ్యమంత్రిగారు ఆఘమేఘాలమీద ఇంటికి వచ్చేసరికి ఇదీ సీను.
'అమ్మ ఇచ్చిన ఉద్యోగం' ఇది అని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రిగా అంజయ్య గారు ఏనాడు నామోషీ పడలేదు. పైగా కూసింత గర్వంగా చెప్పుకునేవారు.
రాజీవ్ గాంధీ ఆయన ఇంటిని చూసి వాళ్ల అమ్మ సెలెక్షన్ మంచిదే అనుకుని కూడా వుంటారు. కాకపొతే పేరడీ ఏమిటంటే అంజయ్య గారి ముఖ్యమంత్రి పదవి వూడడానికి కూడా తదనంతర కాలంలో రాజీవ్ గాంధీయే కారణం అయ్యారు.
రాజకీయాల్లో ఇదొక వైచిత్రి.
కింది ఫోటో :
ముఖ్యమంత్రి అంజయ్య గారు, టేప్ రికార్డర్ సమేతంగా నేను, మధ్యలో నాగార్జున గ్రామీణ బ్యాంక్ చైర్మన్ శ్రీ సత్యనారాయణ మూర్తి గారు



(ఇంకా వుంది)

9, ఏప్రిల్ 2026, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (288) : భండారు శ్రీనివాసరావు

నేనొక సింహాన్ని.

అప్పటికి అపోలో హాస్పిటల్ హైదరాబాద్ లో కట్టలేదు. తగిన భూమి కేటాయింపు కోసం, ఆ హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి గారు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నడుమ చర్చలు జరుగుతున్నాయి. ఆ నాటికి అపోలో హాస్పిటల్ ఒక్క మద్రాసు (చెన్నై) లోనే వుండేది. దాని బ్రాంచి ఒకటి హైదరాబాదు హైదర్ గూడాలో పెట్టిన రెడ్డి గారికి దాన్ని మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ గా అంతర్జాతీయ ప్రమాణాలతో విస్తరించాలని ఆలోచన. అప్పుడు ముఖ్యమంత్రి కీర్తిశేషులు శ్రీ టి. అంజయ్య, అప్పటికి హైదరాబాదులో అన్నీ నర్సింగ్ హోం లే తప్ప కార్పొరేట్ తరహా హాస్పిటల్స్ లేవు. ఆ మొట్టమొదటిది తనది కావాలని ప్రతాప సి రెడ్డి గారి ఆకాంక్ష. దాన్ని నెరవేర్చుకోవడం కోసం విశాలమైన ప్రభుత్వ భూమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
అదే సమయంలో గన్నవరం రాయుడు గారు అనే ఒక పెద్ద భూస్వామితో కలిసి మా మామగారు పెనుమర్తి గోపాల రావు గారు గుంటూరులో ఏదో పరిశ్రమ స్థాపన కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒక్కగానొక్క కుమార్తె తన ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండా తిరుపతిలో ప్రేమ వివాహం చేసుకుంది అనే ఒక బాధ ఆయన అంతరాంతాల్లో గూడుకట్టుకుని వుంది. ఆ కారణంగా మా మధ్య పెద్దగా రాకపోకలు లేవు.
ఆ రోజుల్లో ఎవరైనా మా ఆఫీసుకు ( న్యూస్ రూమ్, రేడియో) వచ్చి మా న్యూస్ ఎడిటర్ నర్రావుల సుబ్బారావు గారిని నా గురించి వాకబు చేస్తే ఆయన అనే మాట చాలామంది తర్వాత నాకు చెప్పేవారు. అదేమిటంటే, ‘శ్రీనివాసరావు ఇక్కడ ఎందుకు ఉంటాడు, అంజయ్య (ముఖ్యమంత్రి) జేబులో వుంటాడు’ అని. ఆయన హాస్యోక్తిగా అన్నప్పటికీ అది కొంత నిజం. రోజులో చాలా భాగం నా మకాం ముఖ్యమంత్రి కార్యాలయంలోనే. ఓ గంట నేను కనబడకపోతే శ్రీనివాస్ ఎక్కడ అని ఆరా తీసేవారు.
ఆ విధంగా ఆ రోజుల్లో నేను అంజయ్య గారి ఆఫీసులో, ఆయనతో మాటా మంతీ సాగిస్తున్న సమయంలో సూటూ బూటూ వేసుకున్న పెద్దాయన ఒకరు లోపలకు వచ్చారు. అప్పటికే ఆయన్ని చాలా సార్లు లోగడ కలిశారేమో తెలియదు, ముఖ్యమంత్రి ఆయన్ని గుర్తుపట్టి ‘రండి కూర్చోండి రెడ్డి గారు’ అని మర్యాద చేశారు. నేను లేచి బయటకు వెళ్లబోతుంటే ఆయన కూచోమని సైగ చేస్తూ, అంతకుముందు మాటామంతీలో నేను ప్రస్తావించిన విషయం గుర్తు పెట్టుకున్నారల్లె వుంది, అంజయ్య గారు ఆయనతో మరో మాట లేకుండా, ‘చూడండి రెడ్డి సాబ్, ఈయన శ్రీనివాస్. ఆలిండియా రేడియో మనిషి, నాకు బాగా కావాల్సిన వాడు, ఏదైనా మీనుంచి అయ్యే సాయం తప్పకుండా చేయండి’ అనేశారు. అంజయ్య గారి సహృదయత అలాంటిది.
అసలు విషయం ఏమిటంటే గుంటూరులో వ్యాపారం నిమిత్తం వుంటున్న మా మామగారికి కేన్సర్ వ్యాధి సోకింది. హైదరాబాదు రెడ్ హిల్స్ లో ఉన్న కేన్సర్ హాస్పిటల్ లో చికిత్స చేయించాలి.
ఆ రోజు ఎదురుగా డాక్టరు ప్రతాపరెడ్డి గారు కనిపించేసరికి అంజయ్య గారికి ఈ విషయం గుర్తుకు వచ్చి ఆయనతో అనేసారు. నిజానికి రెడ్డి గారికి మద్రాసులో సొంత హాస్పిటల్ వుంది కాని అందులో కేన్సర్ విభాగం లేదు. అయినా ప్రతాప రెడ్డి గారు ‘మీరు పేషెంట్ ని తీసుకుని మద్రాసు వచ్చి నన్ను కలవండి, అడయార్ కేన్సర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తాను’ అన్నారు తన విజిటింగ్ కార్డు తీసి నాకు ఇస్తూ.
ఆ మాట ప్రకారమే, నేను మా ఆవిడ పిల్లలను తీసుకుని రైల్లో మద్రాసు వెళ్లాను. మా మామగారి చిన్న తమ్ముడు లక్ష్మీపతి గారు, పిన్నివసుంధర గారు మద్రాసులో వుంటున్నారు. వారి ఇంట్లోనే దిగాము.
మర్నాడు వెళ్లి ప్రతాప్ రెడ్డి గారిని కలిస్తే ఆయన గుర్తుపట్టి, వెంటనే అడయారు ఆసుపత్రిలో తనకు తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడి, అక్కడ అడ్మిషన్ ఇప్పించారు. అదీ ఆయనతో నా మొదటి పరిచయం.
అడయార్ ఆసుపత్రి వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, కానీ అప్పటికే వ్యాధి బాగా ముదిరిపోయింది. కొద్ది రోజుల తర్వాత ‘లాభం లేదు, తీసుకు వెళ్ళండి’ అనేసారు.
అమ్మఒడిని, పిల్లల్ని వదిలేసి వచ్చినందువల్ల అప్పటికే మా ఆవిడ హైదరాబాదు వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో కేన్సర్ రోగులకు, సహాయకుడికి విమానాల్లో సగం రాయితీ వుండేది. రైలు చార్జీ కంటే తక్కువలోనే మేమిద్దరం విమానంలో హైదరాబాదు చేరాము.
‘సరైన చదువు సంధ్యాలేదు, ఒక మాదిరి ఉద్యోగం సద్యోగం లేదు ఇలాంటి వాడికి పిల్లను ఎలా ఇవ్వాలి?’ అనే భావన ఆయనలో వుందో లేదో తెలియదు కానీ, ఇవన్నీ చూసిన తర్వాత జీవితపు మలి సంధ్య వేళ ఆయన మోములో ‘పర్వాలేదు, అల్లుడు గట్టివాడే' అనే తెరిపిడి కనిపించింది. ఇదంతా నేను పనిచేస్తున్న రేడియో మహత్యం అని ఆయనకు తెలియదు కదా!
ఇది సరే! సింహం మాట ఏమిటి?
అదే చెబుతాను. నేనొక సింహాన్ని. నాది సింహ రాశి. ఇవన్నీ ఒకనాటి ముచ్చట్లు.
కాలం గడుస్తున్న కొద్దీ ఎంత గొప్పఅడవికి రాజు అయినా, ముసలిది కాక తప్పదు, వయసులో వున్న వగరు పొగరు తగ్గుతాయి. దంతాలలో పటుత్వం పోతుంది. వేటాడంలో బిగువు సడలుతుంది.
అదీ నా ఇప్పటి పరిస్థితి. ఒకప్పుడు ‘నేను అలా ఇలా, నేనే మోనార్క్ ను’ అంటే నమ్మే వారు వుండరు.
బోనులో ముసలి సింహం బలహీనంగా గాండ్రిస్తూ బతుకు వెళ్లదీస్తుంది. జూ సిబ్బంది పెట్టింది తిని ఈ పూట గడిచింది అనుకుంటుంది.
చాలా మంది వయసు మళ్ళిన ఒంటరి మగవాళ్ల పరిస్థితి ఈ బోనులో సింహాల మాదిరే. కాకపోతే ఈ బోనులకు ఇనుప చువ్వల తలుపులు వుండవు. బార్లా తెరిచి వున్నా బయటకు వెళ్లి వేటాడ లేని దుస్థితి.
మొదటి నుంచీ, పనిచేసే సంస్థ కారణంగా ఈ పలుకుబడి, తగిలించుకున్న హోదా వల్ల ఈ అధికారం అనుకుంటే, ‘నేనే మోనార్క్ ని' అనుకుంటూ అదేదో సినిమాలోలా నలుగురిలో పలుచన అయ్యే అవకాశం వుండదు.
కింది ఫోటో:
అప్పటి గవర్నర్ శ్రీ కేసీ అబ్రహాం అంజయ్య గారితో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్న దృశ్యం. వేదిక మీద అంజయ్య గారి వెనుక చుబుకం మీద చేయి ఆనించుకుని చూస్తున్నది నేనే. నాకు ఇరువైపులా నాటి పోలీసు డైరెక్టర్ జనరల్ శ్రీ ఎంవీ నారాయణరావు గారు, తదనంతర కాలంలో డీజీపీ అయిన పి.ఎస్. రామమోహన రావుగారు.



(ఇంకావుంది)

1, ఏప్రిల్ 2026, బుధవారం

అనుమాన పక్షి – భండారు శ్రీనివాసరావు

 

నాలుగేళ్లు వెనక్కి వెడితే ..
“డీ.జే. టిల్లు! ఇదేం పేరురా! ఆడవాళ్ళకి నచ్చుతుందా అసలు” అన్నాను నేరుగా ఈ సినిమా డైరెక్టర్ తోనే.
ఈ సినిమా డైరెక్టర్ విమల్ కృష్ణ, నా మేనల్లుడు పింగిలి శ్రవణ్ కుమార్ Sravan Kumar Pingili ఏకైక కుమారుడు. బీ. టెక్. చదివాడు. అమెరికా ఛాన్స్ కూడా వదులుకుని సినిమాల మీద మోజుతో అలాగే ఆ ప్రపంచంలోనే వుండిపోయాడు. అలా కొన్నేళ్ళు. చివరికి ఆ తపస్సు ఫలించింది. పట్టుదల ఫలితం ఇచ్చింది. విమల్ డైరెక్ట్ చేసిన చిత్రం డీ.జే. టిల్లు కనక వర్షం కురిపిస్తోందని ఆ రోజుల్లో అమెరికా నుంచి మా పిల్లలు ఫోన్ చేసి చెప్పారు.
నాది పాత తరం కదా! సర్దుకోవడం కొంచెం ఇబ్బంది. ఇదేం పేరు, ఇదేం కధ అనే భావనే. కానీ నవ తరానికి అపరిమితంగా నచ్చినట్టు వుంది.
అప్పటికి జెన్ జడ్ (Gen Z అంటే 1997 - 2012 మధ్య జన్మించిన వాళ్ళు) అనే పదం కూడా ప్రాచుర్యంలో లేదు. నేటి కుర్రకారుకు ముందు చూపులేదు అని పాత తరం అనుకునే మాటలోనే ఏమాత్రం ముందు చూపులేదు అని ఎప్పటికప్పుడు రుజువవుతూనే వుంది.
“జనం కోరేది మనం శాయడమా! మనం చేసేది జనం చూడడమా!” అనే అలనాటి పాతాళభైరవి పింగళి మార్కు మాంత్రికుడి డైలాగ్ నేటికీ వర్తించేలా సినిమా తీసిన డీ జే టిల్లు కుర్ర బృందానికి అభినందనలు.
పొతే, ఈ సినిమాలో హీరోగా వేసిన సిద్దూతో మరో బాదరాయణ సంబంధం. అతగాడు ఒకానొక రోజుల్లో నా రేడియో సహోద్యోగి శారద గారి అబ్బాయి. సినిమా విజయవంతం అయిన పుత్రోత్సాహంతో ఆవిడ ఫోన్ చేసి చెప్పినప్పుడు నాకీ విషయం తెలిసింది. సినిమా నిర్మాణ సమయంలో తరచూ తమ ఇంటికి వచ్చి వెడుతుండే కుర్ర డైరెక్టర్ విమల్ నా మేనల్లుడి కుమారుడు అని నేను చెప్పేదాకా ఆమెకూ తెలియదు.
మొన్న నా మేనకోడలు Manikumari Govindarajula మణి కుమారి ఇంట్లో, నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విమల్ కృష్ణ దర్శకత్వంలో విడుదలకు సిద్ధం అవుతున్న మరో చిత్రం అనుమాన పక్షి సినిమాలో ఒక పాటను (నేటి సినీ పరిభాషలో టీజర్ అంటారనుకుంటా) విన్నప్పుడు, ఈ విషయాలు అన్నీ సినిమా రీలులా మనసులో సుడి తిరిగాయి.
'ఘన విజయం సినిమా తీసిన ఒక డైరెక్టర్ కు మరో సినిమా తీయడానికి నాలుగేళ్ల కాలం ఎందుకు పట్టింది? డీజే టిల్లు సీక్వెల్ కు దర్శకత్వం చేసే అవకాశం ఎందుకు అంది పుచ్చుకోలేదు' అనే సందేహాలకు విమల్ కృష్ణ తనదైన రీతిలో చాలా హుందాగా జవాబు చెప్పాడు.
'డీజే టిల్లులో హీరో పాత్ర ఒక ఐకానిక్ కేరక్టర్. మళ్ళీ అలాంటి కేరక్టర్ కోసమే ఇంత విరామం. సీక్వెల్ కంటే మరో ఐకానిక్ పాత్ర రూపొందించడమే నేను ఇష్టపడ్డాను, వేరే కారణాలు ఏవీ లేవు' అన్నది విమల్ కృష్ణ వివరణ.
జెన్ జడ్ అంటేనే సొంత, నిర్ధిష్ట అభిప్రాయాలతో ముందుకు సాగే తరం. మా తరం మాట్లాడేది ఏముంటుంది? ఆ తరాన్ని సమర్థించక పోయినా, వారిని నిరుత్సాహ పరచకపోవడమే మా తరం చేయాల్సిన పని.
All the best my dear Vimal Krishna
తోకటపా : మేనల్లుడు శ్రవణ్ కుమార్ సుప్రసిద్ధ చలన చిత్ర నటుడు కృష్ణ, ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మలకు ప్రగాఢ అభిమాని. వారి పట్ల అభిమాన సూచకంగా తన సంతానానికి విమల్ కృష్ణ, రమ్య కృష్ణ అని పేరు పెట్టుకున్నాడు.
కింది లింక్ :
అనుమాన పక్షి సినిమాలో రమణ గోగుల పాడిన గులాబ్ జామ్





(01-04-2026)

25, మార్చి 2026, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (287) : భండారు శ్రీనివాసరావు

 

ఎక్కడ ? ఎప్పుడు ?
కొంత కాలం గత కాలంలో కలిసిపోయిన తర్వాత, ఆ నాటి పాత విషయాలను గుర్తు చేసుకుంటూ వుంటే, గుర్తుకు వస్తూ వుంటే, కొంత సంతోషం అనిపిస్తుంది, కొంత తమాషాగా అనిపిస్తుంది.
ఈ ‘ఎక్కడ ఎప్పుడు’ ఇలాటి విషయాల్లో ఒకటి.
ఈ రెండు పదాలతో రేడియో మార్నింగ్ బులెటిన్ లో ఒక హెడ్ లైన్ వార్త తయారు అయ్యేది.
అర్ధరాత్రో అపరాత్రో మా చిక్కడపల్లి ఇంట్లో ఫోన్ రింగయ్యేది. ఆ రోజుల్లో ల్యాండ్ లైన్ ఫోన్లే. సెల్ కాలం కాదు.
ఫోను మంచం పక్కనే పెట్టుకునేవాడిని. మరీ అర్ధరాత్రి ఫోనయితే అవతల రైల్వే పీఆర్ఓ మైఖేల్. తెల్లవారుఝామున అయితే సీపీఆర్వో పనబాక కృష్ణయ్య గారు. అదీ లెక్క.
ఫోను ఎత్తి ‘ఎక్కడ? ఎప్పుడు?’ అని అడిగేవాడిని.
వాళ్ళ నుంచి జవాబు తీసుకుని వెంటనే విజయవాడ రేడియో ప్రాంతీయ వార్తా విభాగం న్యూస్ ఎడిటర్ శ్రీ ఆర్వీవీ కృష్ణారావు గారు లేదా శ్రీ ఏమ్వీఎస్ ప్రసాద్ గారికో ఫోను కలిపేవాడిని. ఎవరు డ్యూటీలో వుంటే వాళ్ళు నా ఫోన్ రిసీవ్ చేసుకుని 'ఎక్కడ? ఎప్పుడు?' అని అడిగేవారు. నేను క్లుప్తంగా ఇచ్చిన సమాచారాన్ని వాళ్ళు ఓ వార్త రూపంలో రాసుకునే వారు.
వాళ్ళిద్దరూ ఎంతటి సమర్ధులు అంటే కొన్ని క్షణాల్లో నేను చెప్పిన వార్తను విస్తరించి, మరికొన్ని నిమిషాల్లో ప్రసారం అయ్యే ప్రాంతీయ వార్తల బులెటిన్ లో ప్రాధాన్యతా క్రమంలో చేర్చేవారు.
“ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ప్రయాగ రామకృష్ణ/ కొప్పుల సుబ్బారావు.
“దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఒక గూడ్స్ రైలు రాత్రి పట్టాలు తప్పింది. పలానా స్టేషన్ల నడుమ జరిగిన ఈ దుర్ఘటన కారణంగా పలు రైళ్ళ రాకపోకలకు అంతరాయం కలిగిందని, కొన్ని రైళ్లు దారి మళ్లిస్తున్నారని రైల్వే అధికారులు కొద్దిసేపటి క్రితం మా హైదరాబాదు ప్రతినిధికి తెలియచేసారు. వివరాలు.....”
ఎక్కడో సికిందరాబాదు రైల్వే క్వార్తర్స్ లో పొద్దున్నే రేడియో పెట్టుకుని వార్తలు వింటున్న రైల్వే అధికారులు, ఎలాంటి పొరబాటు లేకుండా వార్త ప్రసారం అయిన సంగతి తెలుసుకుని ఊపిరి పీల్చుకునే వారు. చెప్పిన వార్త ఎలాంటి తభావతు లేకుండా వస్తుందని తెలుసు కనుక నేను ముసుగు తన్ని నిద్రపోయేవాడిని.




(ఇంకావుంది)

24, మార్చి 2026, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (286) : భండారు శ్రీనివాసరావు

 

నేర్చుకోవాల్సింది చాలావుంది
2023 మార్చి నెలలో ఒకరోజు.
‘ఈ రోజు సాయంత్రం ప్రసాద్ లాబ్స్ లో రంగ మార్తాండ సినిమా ప్రీ వ్యూ వుంది, వీలుంటే కాదు, వీలు చేసుకుని తప్పకుండా రండి’ అని ఆజ్ఞా పూర్వక ఆహ్వానాన్ని ఫోన్ చేసి అందించారు ప్రముఖ సినీ రచయిత, అత్యద్భుత చిత్రకారులు లక్ష్మి భూపాల Lakshmi Bhupala గారు. నా జీవితంలో కలుస్తాను అని ఎన్నడూ అనుకోని గొప్ప దర్శకుడు కృష్ణవంశీ వంటి వారిని కలుసుకునే అవకాశం అక్కడ నాకు దొరికింది.
నిజమే. ఎనిమిది పదులకు దగ్గరపడుతున్న ఈ వయస్సులో కూడా నేర్చుకోవాల్సింది చాలా వుంది, అదీ నిత్య జీవితంలో తారసపడుతున్న చాలామంది చిన్నవాళ్ల నుంచి. గౌతమ్ రావూరి (Goutam Ravuri) ని మొదటిసారి ప్రసాద్ ప్రీ వ్యూ ధియేటర్లో కలిసినప్పుడు ఈ విషయం నాకు మరోసారి ధృవపడింది. నాకు మంచి స్నేహితుడు నిర్మల్ Nirmal Akkaraju ద్వారా గౌతమ్ పరిచయం.
ఆయన చదివిన చదువేమిటి, చేస్తున్న ఉద్యోగం ఏమిటి, రాస్తున్న రాతలేమిటి? ఏమిటో ఏమీ అర్ధం కాలేదు ముందు.
ఈనాటి తలితండ్రులు పిల్లల నుంచి కోరుకునే చదువే చదివాడు. తలితండ్రులు ఆశించే చక్కటి కంప్యూటర్ కొలువు చేస్తున్నాడు. ఆ వయసు కుర్రాళ్ళు, పేరొందిన ఎం ఎన్ సీలో ఉన్నతోద్యోగం చేస్తున్న పిల్లలు క్లబ్బులు అంటారు, పబ్బులు అంటారు. కానీ ఈ కుర్రాడు, నా పిల్లల కంటే వయసులో చాలా చాలా చిన్నవాడు గౌతమ్ తరహానే వేరు. వాళ్ళ నాన్నగారు ప్రసాద్ గారు కూడా నా లాగే జర్నలిస్టు కుటుంబం నుంచి వచ్చిన వారే.
తండ్రీ కొడుకు ఇద్దరి పోలికలు ఒకటిగా వుండవచ్చు కానీ అభిరుచులు, హాబీలు ఒకటిగా వుండడం చాలా అరుదు. వీరిద్దరి విషయంలో ఆ అరుదైన విషయం సాధ్య పడింది. సమయం దొరికింది అంటే చాలు వీరిద్దరూ కలిసి వెళ్ళేది బార్లకు కాదు, బలాదూరు తిరుగుళ్ళకు కాదు. మార్నింగ్ షో సినిమాలకి. అర్ధరాత్రి దాకా నైట్ డ్యూటీ చేసి వచ్చి మళ్ళీ తెల్లవారడం తడవు మార్నింగ్ షోకి తయారవడం గౌతమ్ తల్లిగారి తల్లి మనసుకు అంతగా నచ్చక పోయినా, కుమారుడి, పెనిమిటి అభిరుచులకు అడ్డం చెప్పేవారు కాదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ సినిమాలో మంచి చెడులు క్షుణ్ణంగా చర్చించుకోవడం చూసి ముచ్చట పడేవారు.
చూసే సినిమాల్లో సింహభాగం తెలుగు తెర కొదమసింహం చిరంజీవి సినిమాలే. వాటిని ఏ పరిస్థితిలోనూ మిస్సయ్యే అవకాశమే లేదు. చిరంజీవి సినిమాలన్నా, చిరంజీవి అన్నా ప్రాణం పెట్టే కోట్లాది మంది యువకుల్లో గౌతమ్ ముందు వరసలో వుంటారు. చూసిన చిరంజీవి సినిమా గురించి ఇంటికి వచ్చి సమీక్షించుకోవడం మాత్రమే కాదు ఆ భావాలను అక్షరీకరించి, కంప్యుటీకరించి సాంఘిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం గౌతమ్ కు హాబీ అనాలో, వ్యసనం అనాలో తెలియదు.
ఫేస్ బుక్ రాతల ద్వారా పరిచయం అయి, ముఖతః కలుసుకోకపోయినా, రంగమార్తాండ సినిమా ప్రీ వ్యూ లో కనపడి పరిచయం చేసుకున్నప్పుడు, నన్ను మన్ననగా పలకరించిన తీరు గమనించి అతడి వినయ సంపదకు విస్తుపోయాను.
సినిమా అయిపోయిన తర్వాత అతడి కారులో నన్ను ఇంటి వద్ద దింపినప్పుడు , ఒక్క క్షణం అంటూ, మరుక్షణం ఒక పుస్తకం నా చేతిలో పెట్టాడు. ముఖచిత్రం మీద పునాది రాళ్లు - రావూరి గౌతమ్ అని వుంది. నాకు పుస్తకం ఇస్తున్నట్టు దిగిన ఫోటో కాకుండా విడిగా ఇద్దరం వున్న ఫోటో అడిగి తీసుకున్నాడు. నేను అర్జంటుగా మరో పని మీద వెళ్ళాల్సి రావడం వల్ల, అతడిని ఇంట్లోకి పిలిచే మర్యాద చేయలేకపోయాను.
కొత్తగా పరిచయం అయిన వ్యక్తి గురించి ఇన్ని విషయాలు ఎలా తెలుసు అనే సందేహం ఎవరికయినా కలిగితే దానికి సమాధానమే ఈ పుస్తకం. ఈ విషయాలు అన్నీ అందులోనివే. అప్పటివరకు వృత్తి జీవితంలో తారసపడే అనేక మందిలో గౌతమ్ కూడా ఒకడు అనుకున్నా. చదివిన తర్వాత గౌతమ్ స్థాయి ఎలాటిది అనే సత్యం అవగతమైంది.
ఎదుగుతున్న వయసులో వివిధ దశల్లో చిరంజీవితో దిగిన ఫోటోలు చూస్తే, బుగ్గల మీద గిల్లితే పాలుకారుతాయేమో అనిపించే నూనూగు మీసాల నూత్న యవ్వనం నుంచి ప్రపంచాన్ని చదివిన అనుభవశాలిగా గంభీరంగా వుండే గౌతమ్ కనిపిస్తాడు. సినిమా పిచ్చి అంటే సినిమాల్లో నటించాలనే పిచ్చి కాదు, సినిమాలు అదేపనిగా చూసే పిచ్చితో పెరిగిన పిల్లలు, నిజజీవితంలో దారితప్పుతారేమో అనే నా వంటి సందేహాత్మకుల కళ్ళు తెరిపిళ్ళు పడేలా సాగింది ఈ పుస్తకం.
చిరంజీవికి వీరాభిమాని అయినప్పటికీ, ఆయన సినిమాల గురించి రాసిన ఈ పుస్తకంలో ఎలాంటి శషభిషలు లేకుండా, అనవసర అభిమానపు ఛాయలు పడకుండా సమీక్షలు చేయడం అనేది రచయితగా గౌతమ్ రావూరి పరిణతికి నిదర్శనం.
పుస్తకం చివర్లో :
“ఇది ఇంటర్వెల్....మరిన్ని చిరంజీవి సినిమాలతో ....పునాది రాళ్లు – 2- పేర మరో సంపుటి రాయాలన్నది నా ఆకాంక్ష అని ముగింపు ప్రకటన చేశారు.
ఈ పుస్తకం చదివిన ప్రతివారూ గౌతమ్ ఆకాంక్ష నెరవేరాలనే కోరుకుంటారు.
కుమారుడిని ఆదర్శంగా పెంచిన గౌతమ్ తలితండ్రులు పార్వతి గారు, ప్రసాద్ గారు ధన్యులు, ఆదర్శనీయులు.
కింది ఫోటోలు:





దర్శకుడు కృష్ణ వంశీ, టెకీ జర్నలిస్టు పొలిటికల్ రెడీ రికనర్ శివ రాచర్ల, స్వీటీ రచయిత అధరాపురపు మురళీకృష్ణ, యువ రచయిత గౌతమ్ రావూరితో నేను.

(ఇంకావుంది)

22, మార్చి 2026, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (285) : భండారు శ్రీనివాసరావు


‘జిహ్వాగ్రే మిత్ర బాంధవావః జిహ్వాగ్రే బంధన ప్రాప్తి: జిహ్వాగ్రే మరణం ధృవం’ అన్నారు. జిహ్వ అంటే నాలుక. ఇక్కడ నాలుక అంటే మాట. మాట వల్లనే స్నేహాలు, బాంధవ్యాలు. మాటను బట్టే మరణం కూడా. మాటకు వున్న అసలు శక్తి ఇది. సంచలనాలు సృష్టించడం కాదు.
అందుకనే అంటారుకదా! నోరా వీపుకు తేకే అని.
మొన్న ఉగాది పండుగ రోజున మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారింటికి భోజనానికి వెళ్లాను. మా అన్నగారి ముగ్గురు పిల్లలు, కోడళ్ళు, మనుమరాళ్ళతో, ఇల్లంతా పండగ సందడి. పెద్ద కోడలు, మేనకోడలు కూడా అయిన రేణు సుధ స్వయంగా చేసిన వంటలు, పిండి వంటలతో మృష్టాన్న భోజనం సరే సరి.
సరే! ఇవన్నీపండగ పూట అందరిండ్లలో మామూలే.
భోజనాల అనంతరం మా అన్నయ్య ఎప్పటివో పాత సంగతులు చెప్పుకు వచ్చారు. ఆయన ధారణ శక్తి గొప్పది.
మాటల్లో నడిచే దేవుడిగా ప్రసిద్ధి చెందిన కంచి పరమాచార్య స్వామి వారి ప్రసక్తి వచ్చింది. వారిని దర్శించి పాద నమస్కారం చేసుకునే అదృష్టం తనకు ఒకసారి అనుకోకుండా దక్కిందని చెప్పారు.
స్టేట్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ గా బ్యాంక్ పనిమీద వెళ్లి కారులో హైదరాబాదు తిరిగి వస్తుండగా, కర్నూలు దగ్గర రోడ్డు పక్కన పొలాల మధ్య కొన్ని చిన్న చిన్న గుడారాలు కనిపించాయి. ఆరా తీస్తే కంచి పరమాచార్య వారు పరివారంతో అక్కడ బస చేస్తున్నారని తెలిసింది. మార్గమధ్యంలో సంధ్యా సమయానికి అనుష్టానాలు ముగించుకోవడానికి బావి సౌకర్యం వున్న ఏదైనా ప్రదేశం వద్ద ఆగి అక్కడే బస చేయడం ఆనవాయితీ. రెండు మూడు పెట్రోమాక్స్ లైట్లు మినహా పూర్తి నిర్మానుష్య ప్రదేశంలో ఒక చిన్న పాక వంటి టెంటులో అంతటి మహానుభావుడు బస చేయడం మా అన్నగారికి చాలా ఆశ్చర్యం కలిగించింది. కంచి పీఠానికి వున్న ఆస్తిపాస్తులతో పోల్చి చూసుకుంటే ఆయన అంత నిరాడంబరంగా వుండడం మామూలు విషయం కాదు.
ఆ రాత్రి కర్నూలులో వుండిపోయి మరునాడు, స్వామివారి చాతుర్మాస్యమండల దీక్ష మొదలవుతుంది కనుక అ రాత్రి కర్నూలులో వుండి స్వామి వారి దర్శనం చేసుకుని వెడితే బాగుంటుందని బ్యాంకు అధికారి ఒకరు చెప్పడంతో మా అన్నగారు అలాగే అని మరుసటి ఉదయం స్వామి దర్శనం చేసుకున్నారు. పాద నమస్కారం చేసుకున్నారు.
స్వామివారి నిరాడంబరత, వాగాడంబరం లేని ఆయన ప్రవచనాలు, మెల్లగా, మృదువుగా మాట్లాడే తీరు ఇవన్నీ తనను బాగా ఆకట్టుకున్నాయని, స్వామివారిపై గౌరవ ప్రతిపత్తులు రెట్టింపు అయ్య్యాయని గుర్తు చేసుకున్నారు.
తదుపరి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి (ఇప్పుడు లేరు ) వారి తరువాత పీఠం అధిష్టించాల్సిన విజయేంద్ర సరస్వతి స్వామి కూడా పరమాచార్య వెంట వున్నారు. అప్పటికి ఆయన వయసులో చాలా చిన్నవారు. పసితనపు ఛాయలు వీడని వయసు. కానీ అసాధారణ ధారణ శక్తి. దీన్ని మా అన్నయ్య కళ్ళారా చూసారు. పెద్ద స్వామి వారు సుదీర్ఘమైన సంస్కృత శ్లోకాలను, వేద పనసలను మంద్ర స్థాయిలో మెల్లగా చదువుతుంటే, వాటిని మననం చేసుకుంటూ ఆ బాల స్వామి అప్పటికప్పుడే ఏమాత్రం తొట్రు పడకుండా, స్పష్టంగా వల్లెవేయడం గమనించి అక్కడి జనం నివ్వెరపోయారు. నాటి బాలస్వామే నేటి కంచి పీఠాధిపతి.
మరునాడు హైదరాబాద్ వస్తుంటే, మార్గమధ్యంలో మరో పీఠాధిపతి వాహన శ్రేణి ఎదురుపడింది. ఆ వాహనానికి ముందు పలానా పీఠం అనే పెద్ద బోర్డు, ముందూవెనుక పతాకాలతో పటాటోపంగా అనేక వాహనాలు.
ఇదీ వరుస.
“సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తి:”
మంచి మనసున్న మనుషులతో సాంగత్యం మనసుపై మంచి సానుకూల ప్రభావం చూపుతుంది. ఆది శంకరాచార్యులు తన భజగోవింద స్త్రోత్రంలో చెప్పిన ఈ శ్లోకం అంతరార్ధం ఇదే.
మంచి భోజనం చేసి, మంచి మాటలు విని ఇంటికి చేరి టీవీ పెడితే రకరకాల ఛానళ్ళలో రకరకాల ప్రోగ్రాములు, ఉగాది పంచాంగ శ్రవణాల పునః ప్రసారాలు. వాగాడంబర విన్యాసాలు. ఎప్పుడో ఏడాది రెండేళ్ల క్రితం ఒక ప్రవచన కర్త నోటివెంట వెలువడిన పలుకులపై విమర్శలు, ప్రతి విమర్శలు.
శంకరభగవత్పాదులు చెప్పిన దేమిటి? జరుగుతున్నదేమిటి?
మాటకు వున్న ‘పవర్’ ఏమిటో నేటి తరం రాజకీయ నాయకులకు బాగా తెలుసు. మాటను ఎలా తిప్పి ఒదిలితే అది మీడియా దృష్టిని ఆకట్టుకుంటుందో వారికి వెన్నతో పెట్టిన విద్య. ఈ నడుమ సక్సెస్ మీట్ల పేరుతో, సినీ జనం నిర్వహించే కార్యక్రమాల్లో కూడా నలుగురు వింటున్నారని, చూస్తున్నారనే సోయ లేకుండా సినీ నటులు చేస్తున్న వికృత వ్యాఖ్యలు ఈ కోవలోకే చేరుతున్నాయి. వారి పలుకులు ములుకుల్లా మీడియాలో పేలాలి. పేలుడు ఫలితాలు వారికి అక్కరలేని విషయం. ఇదీ ఇప్పటి లోకం తీరు.
‘వెలది, జూదంబు, పానంబు, వేట,పలుకు ప్రల్లదనం’ అంటూ ‘చేయకూడని’ కార్యాల జాబితాలో కూడా ‘చెడు పలుకు’ను చేర్చింది అందుకే.
అంచేత మాట మాట్లాడే ముందే ఆలోచించుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత ఆలోచించి ప్రయోజనం శూన్యం. జనాన్ని ఆకర్షించడం కోసమో, చమత్కారం కోసమో నోరు తెరిస్తే మాత్రం ఇంతే సంగతులు.



(ఇంకావుంది) 

19, మార్చి 2026, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (284) : భండారు శ్రీనివాసరావు

రాజకీయ శ్రవణానందాలు
ఉగాది పర్వదినంనాడు పంచాంగ శ్రవణం అనేది అనూచానంగా వస్తున్న ఆచారం. ప్రస్తుతం అన్ని వ్యవహారాలు ఆర్ధికమయం అయిపోతున్న ఈ రోజుల్లో, కాలపరీక్షకు నిలుస్తూ ప్రజల అభిమానం చూరగొంటున్న పంచాంగ శ్రవణం కూడా క్రమంగా విలువలు కోల్పోతూ వాణిజ్య స్వరూపాన్ని సంతరించుకుంటూ వుండడం విచారకరం.
మా స్వగ్రామం కంభంపాడులో మా చిన్నతనంలో ఇద్దరు పంచాంగ కర్తలు వుండేవాళ్ళు. లంకా సూర్య ప్రకాశ సిద్ధాంతి గారు. గూడా సత్యనారాయణ సిద్ధాంతి గారు. నాకు గుర్తున్నంతవరకు తెలుగు అంకెల్లో అంటే – ౧ ౨ ౩ ౪ ౫ (1 2 3 4 5 ) ఇలా ముద్రించే ప్రింటింగ్ ప్రెస్సులు ఆ రోజుల్లో చాలా తక్కువ వుండేవి. పైగా పంచాంగంలో తెలుగు భాషను అర్ధం చేసుకుని కంపోజ్ చేసేవాళ్ళు, ప్రూఫులు దిద్దేవాళ్ళు కూడా తక్కువగా వుండడం వల్లనో యేమో చాలా పంచాంగాలు, విభిన్న పండితులు రాసినా ఒకే ప్రెస్సులో ముద్రించేవారు. నాకు గుర్తున్నంతవరకు ఇలాంటి ముద్రణాలయాలు ఒకటో రెండో తెనాలిలో వుండేవి. ఉగాదికి చాలా ముందుగానే వీటి ముద్రణ పూర్తయ్యేది. ఎందుకంటే రాసిన సిద్ధాంతులు వాటిని కాలినడకన అన్ని వూళ్ళకు వెళ్ళి పంచాంగాల ముద్రణకు ద్రవ్య సాయం చేసిన దాతలకు వాటిని ఇచ్చి, అందుకు ప్రతిఫలంగా తృణమో ఫణమో స్వీకరించేవారు.
పంచాంగ రూపకల్పనకు ముందు, నాకు బాగా జ్ఞాపకం, సత్యనారాయణ సిద్ధాంతి గారు అస్తమానం గాలిలో చేతులు ఆడిస్తూ, అర్ధనిమీలిత నేత్రాలతో ఏదో గణిస్తూవుండేవారు. ఒకరకంగా చెప్పాలంటే వాళ్లదో లోకం.
తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని అనేక తెలుగు టీవీ ఛానళ్ళు ‘రాజకీయ పంచాంగాల’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తుంటాయి. ప్రతి రాజకీయ పార్టీ తన కార్యాలయంలో ఒక సిద్ధాంతి గారితో పంచాంగ శ్రవణం కార్యక్రమాలను ఏర్పాటుచేసుకుని తమకు అనుకూలమైన ఫలితాలను చెప్పించుకుని తాత్కాలిక ఉపశమనం పొందుతుంటాయి.
నిజానికి దేవాలయ ప్రాంగణాల్లో నిర్వహించాల్సిన తంతు ఇది. వెనుకటికి, ఆ మాటకు వస్తే ఇప్పటికీ గుళ్ళల్లో జరిగే పంచాంగ శ్రవణాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతూనే వున్నారు.
టెక్నాలజీ వినియోగం తక్కువగా వున్నరోజుల్లో ప్రజలు, తమకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తిని ఈ పంచాంగ శ్రవణాల ద్వారా తీర్చుకునేవారు. అప్పట్లో వాళ్లకు కొన్ని అంశాల మీదనే ఆసక్తి వుండేది. వానలు యెలా పడతాయి? పంటలు యెలా పండుతాయి? యే పంటలకు ఎలాటి ధర లభిస్తుంది? ఇక వ్యక్తిగతంగా చూసుకున్నప్పుడు ఆదాయ వ్యయాలు యెలా వుంటాయి? ఆరోగ్యం ఎలావుంటుంది? ఇలాటి ప్రశ్నలకు పంచాంగ శ్రవణ కార్యక్రమాల్లో సమాధానాలు లభిస్తాయన్న ఆశ వారిది. నాటి పరిస్తితుల దృష్ట్యా తప్పుబట్టడానికి కాని, సిద్ధాంతులు చెప్పే విషయాలతో కేవలం వాదన కోసం విభేదించడానికి కాని వీలు లేదు.
కాకపొతే ప్రజలు వీటిని బాగా నమ్ముతున్నారు అన్న నమ్మకం పెంచుకున్న రాజకీయ పార్టీలు, వాటి నాయకులు ఈ పంచాంగ శ్రవణాన్ని సైతం తమ ప్రయోజనాలకు వాడుకోవడం ఈ మధ్యకాలంలో బాగా ప్రబలిపోయింది. అందుకే యే పార్టీకి ఆ పార్టీ సొంతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని పండితుల చేత నాలుగు మంచి ముక్కలు చెప్పించుకుని, మీడియాలో ప్రచారం చేయించుకుని, తాము సంతోషపడడం మాత్రమే కాకుండా ఆ మాటలు జనం కూడా నమ్ముతున్నారు అనే భ్రమలో పడిపోతున్నారు. మరో రకంగా చెప్పాలంటే ఎన్నికల సర్వేలు చేయించుకుని, తమకు అనుకూలంగా రాయించుకుని, సానుకూల ఫలితాలు రాకపోతాయా అని సంతృప్తి పడడం ఎలానో ఇదీ అలానే.
ఈ ఆచారానికి బీజం పడింది మాత్రం పాలక పక్షాలు ప్రభుత్వ ఖర్చుతో ఉగాది వేడుకల పేరుతొ నిర్వహించే అధికారిక కార్యక్రామాల్లోనే.
మొదట్లో గుడిలో జరిగే రీతిలోనే ఈ పంచాంగ శ్రవణాలు మొదలయినా, పోను పోను రాజుల ఆస్థానాల్లో వందిమాగధుల స్త్రోత్ర పాఠాల మాదిరిగా తయారై, ఇదిగో ఈనాటి ఈ వికృత రూపాన్ని సంతరించుకున్నాయి. దేనికీ పడనివాడు పొగడ్తకు పడతాడన్నట్టుగా ఈ నాటి రాజులను అంటే ముఖ్యమంత్రులను సంతోషపెట్టడానికి నాలుగు మంచి ముక్కలతో ప్రారంభమై ఇప్పుడు , రాజుల ఆస్థానాలలో వందిమాగధుల పొగడ్తలను తలదన్నేవిదంగా తయారయ్యాయి.
పేరున్న సినిమా నటి ‘పలానా సబ్బునే వాడుతాను’ అంటే జనం ఎగబడి కొంటారన్న భ్రమలకు గురై వాణిజ్య సంస్థలు ప్రకటనలు గుప్పిస్తున్నట్టు ఇప్పుడు ఈ కార్యక్రమాలకోసం ప్రజల్లో పట్టున్న పండిత ప్రకర్షులను పోటీలు పడి ఎంపిక చేసుకుంటున్న తీరు గమనిస్తే పరిస్తితి యెంత వేగంగా దిగజారుతున్నదో అర్ధం అవుతుంది. యే రోటి వద్ద ఆ పాట పాడాలి అన్నచందంగా యే పార్టీ ఆఫీసులో ఆ పార్టీ పలుకు పలికే తీరులో ఇవి ఏడాది ఏడాదికీ విలువలు పోగొట్టుకుంటున్నాయి.
‘పంచాంగాలా పాత చింతకాయ పచ్చడేం కాదూ’ అంటూ అవహేళన చేసే హేతువాదులకు, జన చైతన్య కార్యకర్తలకు కొత్త ఆయుధాన్ని చేతికి అందిస్తున్నాయి. అలాగే, వాటిని పవిత్రంగా, సంస్కృతిలో భాగంగా భావించేవారికి కూడా ఈ పరిణామాలు తీరని మనస్తాపాన్ని కలిగిస్తున్నాయి. ప్రాచీన సంస్కృతీ వైభవాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్న ప్రతిఒక్కరూ ఈ విషయంపై దృష్టి సారిస్తే బాగుంటుంది.
అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
(ఇంకావుంది)