6, ఫిబ్రవరి 2026, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (260) : భండారు శ్రీనివాసరావు

 

సత్యనారాయణ పురం రైల్వే స్టేషన్
జీవితంలో చాలా విషయాలు కనురెప్పల కిందే కరిగిపోతున్నాయి.
ఒకానొక రోజుల్లో రిక్షాలు, గూడు రిక్షాలు జన జీవనంలో భాగంగా వుండేవి. ఆ రోజుల్లో రోడ్డు మీదకు రాగానే కనబడే మొట్ట మొదటి రవాణా వాహనం గూడు రిక్షా. ఇంటి గేటు వేస్తున్న చప్పుడు కాగానే నెమ్మదిగా రిక్షా లాక్కుంటూ వచ్చి ‘రిక్షా కావాలా బాబూ, ఎక్కడికి వెళ్లాలంటూ’ చనువుగా చేతి సంచీ తీసుకువెళ్ళే రిక్షా తాతలు, అందరి జ్ఞాపకాల్లో పదిలంగా వుండే వుంటారు.
రిక్షాలు లాగేవాళ్ళు కధానాయకులుగా పెద్ద పెద్ద హీరోలతో సినిమాలే వచ్చాయంటే గతంలో ‘రిక్షాలు’ ఎలాటి సోషల్ స్టేటస్ అనుభవించాయో అర్ధంచేసుకోవచ్చు.
ఇప్పుడీ రిక్షాల కాలం చెల్లిపోయి వాటితో పొట్టపోసుకునే వారి జీవితాలు రోడ్డున పడుతున్నాయి. అభివృద్ధి వల్ల కలిగే అనర్ధాల్లో ఈ పరిణామం ఒక భాగం. కొత్తనీరు వచ్చి పాత నీటిని నెట్టివేయడం కొత్తేమీకాదు. కాకపొతే, అలా మరుగునపడిపోతున్న విషయాలను ఇలా నెమరు వేసుకోవడం వల్ల కలిగే ఆనందమే వేరు. చిన్ననాటి ఫోటోలను చూసుకున్నప్పుడు కలిగే సంతోషానికి వెల, విలువ కట్టగలమా?
2010లో అమెరికా నుంచి బయలుదేరుతూ ఆఖరి వారంలో చూసిన రెండు విశేషాలు పాతలోని మధురిమను మరోసారి అనుభవంలోకి తెచ్చాయి.
పాతను ‘ఉప్పు పాతర’ వేయకుండా ఇక్కడ ఈ పరాయి దేశం వాళ్ళు యెంత జాగ్రత్త పడుతున్నారో కూడా అర్ధం అయింది.
1889లో సంభవించిన అగ్ని ప్రమాదంలో సియాటిల్ డౌన్ టౌన్ లో చాలా భాగం తగులబడిపోయింది. తరవాత దాని స్తానంలో కొత్త నగరం నిర్మితమయింది. కానీ పాతనగరం జ్ఞాపకాలను అతి పదిలంగా దాచుకుంటున్న తీరే అద్భుతం. ఆదర్శప్రాయం.
దాదాపు నూట ముప్పయ్ ఆరేళ్ల నాటి సియాటిల్ పాత బస్తీలోని కొన్ని ప్రదేశాలను ఎంపికచేసి, బేస్ మెంట్ లో పాత వాటిని మ్యూజియంలో మాదిరిగా జాగ్రత్త చేసి, పైన పలు అంతస్తుల ఆధునిక సుందర భవనాలను నిర్మించుకున్నారు. అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న పాత గృహాలను, గృహోపకరణాలను రూపు చెడకుండా ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి, భద్రపరచి, - ‘సియాటిల్ అండర్ గ్రౌండ్ టూర్’ పేరుతొ టూరిస్టులకు చూపిస్తున్నారు.
దాదాపు రెండు గంటలపాటు సాగే ఈ టూరులో ఒక గైడ్ వెంట వుండి పాతరోజుల సంగతులను కొత్త కొత్తగా చెబుతుంటాడు. ఆ కాలంలో వాడిన టైపు రైటర్లు, గోడ గడియారాలు, సోఫాలు, బాయిలర్లు, ఇంటి పైకప్పులు, దర్వాజాలు, చివరాఖరుకు బాత్ రూమ్ కమోడ్లు ఇలా అన్నిటినీ చూడవచ్చు. పదిహేను డాలర్ల టిక్కెట్టు కొనుక్కుని ఈ టూర్ లో పాల్గొనడానికి వచ్చే టూరిస్టుల సంఖ్య ఆ రాజుల్లోనే ప్రతిరోజూ వందల్లో వుంటుందంటే, పాత రోజులపట్ల ఇక్కడి ప్రజలకు వున్న కొత్త మోజు ఎలాటిదో అర్ధం చేసుకోవచ్చు.
అలాగే. ఇస్సక్క్వా (Issaquah).
సులభంగా నోరు తిరగని ఈ ఊరు సియాటిల్లోని శివారు ప్రాంతం. మైనింగ్ అవసరాలకోసం ఈ పట్టణాన్ని కలుపుతూ లోగడ ఒక రైలు మార్గం వుండేది. దాన్ని తరవాత మూసి వేశారు. ఇస్సక్క్వా హిస్టారికల్ సొసైటీ వారు ఈ పట్టణం డౌన్ టౌన్ ను ఒక చారిత్రాత్మక ప్రదేశంగా అభివృద్ధి చేసి, అప్పటి రైల్వే స్టేషన్ ను, రైలు పట్టాలను అలాగే వుంచేసి పాత జ్ఞాపకాలకు గుర్తుగా మిగుల్చుకున్నారు. (విజయవాడ లో సత్యనారాయణ పురం రైల్వే స్టేషన్ ఎత్తేసిన తరువాత దాన్ని ఒక రహదారిగా మార్చేసిన సంగతి ఇక్కడ గమనార్హం)
ఆ రోజుల్లో వుండే పెట్రోల్ (గ్యాస్) బంకులను, సినిమాహాళ్ళను యధాతధంగా వుంచేసారు. ఆధునిక నగరం సియాటిల్ నుంచి వచ్చి ఆ పాత పట్టణంలో కలయ తిరుగుతూ వుంటే, ఒక్కసారిగా ‘టైం మెషిన్’ లో గతకాలంలోకి జారిపోయిన అనుభూతి కలుగుతుంది.
పోతే, గూడు రిక్షాలేకాదు, కలికానికి కూడా కనబడకుండా పోతున్న, అంతరించి పోతున్న వస్తువుల జాబితా మన దగ్గర తక్కువేమీ లేదు. తిరగళ్లు, రోకళ్లు, రుబ్బురోళ్లు, ఎడ్లబళ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత. అన్నట్టు చాంతాడు కూడా ఇక ఇలాటి సామెతలకే పరిమితం.
కింది ఫోటో :
2010 లో ఇస్సక్వా పట్టణంలో అలనాటి పాత పెట్రోల్ బంకులో నేను.



(ఇంకా వుంది)

రాజ్యం లేని భోజరాజు – భండారు శ్రీనివాసరావు

ఆయనకు, కవులు, రచయితలు, పాత్రికేయులు, సమాజంలోని వివిధ రంగాల వాళ్ళు బహు ఇష్టులు. ఒక్కముక్కలో చెప్పాలి అంటే ఆయనకు మనుషులంటే ఇష్టం. ఎప్పుడూ నలుగురిలో వుండడానికి అంతగా ఇష్టపడే మనిషిని మరొకర్ని చూడలేదు. ఆయన నిజమైన హ్యూమనిస్ట్. మానవతావాది.
అందుకే నిన్న హైదరాబాదులో జరిగిన ఆయన సంస్మరణ సమావేశానికి అంతమంది తరలి వచ్చారు. వారిలో పెక్కురు ఆయనతో తమకున్న అనుబంధాన్ని నలుగురితో పంచుకున్నారు.
ఇంతకీ ఆయన ఎవరంటే, మొన్నీమధ్య కన్ను మూసిన వెనిగళ్ళ వెంకట రత్నం గారు.
‘మంచి పనులు చేయడానికి వనరులు అక్కరలేదు, మంచి మనసు వుంటే చాలు అని నిరూపించి నిశ్శబ్దంగా మన మధ్యనుంచి నిష్క్రమించిన వ్యక్తి వెంకట రత్నం’ అని ఈ సమావేశంలో ప్రసంగించిన పలువురు వక్తలు పేర్కొన్నారు.
మంచి మనసే కాదు, అవసరంలో వున్నవారికి సాయపాడాలి అనే తపన కూడా ఆయనకు వుంది. ఆ తపన ఎంతవరకూ అంటే తాను చనిపోయిన తర్వాత తన దేహాన్ని వైద్య విద్యార్ధులకు ఉపయోగపడడానికి దానం చేయాలని కుటుంబసభ్యులకు నచ్చచెప్పే వరకూ వెళ్ళింది. వారూ ఆయన అంతిమ కోర్కెను తీర్చి, వెంకటరత్నం గారి భౌతిక దేహాన్ని ఒక వైద్య కళాశాలకు అప్పగించారు.
ఈ సమావేశానికి హాజరైన వారిలో కూడా కొందరిలో దేహ దానం చేయాలనే స్పూర్తి రగిలింది అంటే, మరణానంతరం కూడా ఆయన జీవిస్తున్నట్టే లెక్క.
అక్కడికి వచ్చిన వారిలో చాలామంది ఒక మాట చెప్పుకోవడం వినపడింది. నిజానికి మంచి ఆలోచనే.
డెబ్బయి దాటిన బంధు మిత్రులను చూడాలని అనిపించినప్పుడు, వాయిదా వేయకుండా వెంటనే వెళ్లి చూడాలి. ‘మొన్న ఆ పెద్దమనిషిని కలిసాను, నిన్ను గుర్తు చేసుకున్నారు’ అని ఎవరైనా చెబితే, ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్లి, ఆయన్ని చూసి రావడం మరీ మంచిది అనేది ఈ మాటల సారాంశం.



(05-02-2026)

3, ఫిబ్రవరి 2026, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (259) : భండారు శ్రీనివాసరావు

 

ఇంటికే వచ్చిన బుక్ ఎగ్జిబిషన్

గత కొద్ది రోజులుగా పోస్టు ద్వారా, కొరియర్ ద్వారా అనేక పుస్తకాలు మా ఇంటికి చేరాయి. 

ఈ రోజు ఏకంగా విశ్వనాధ వారి వేయి పడగలు నవల పోస్టులో అందింది. ఫేస్ బుక్ మితృలు, పెద్దలు జేవీపీఎస్ సోమయాజులు గారు శ్రమ తీసుకుని పంపారు. కొద్ది రోజుల ముందే మా గురువుగారు పురాణం సుబ్రమణ్య శర్మ గారు రాసిన విశ్వనాధ ఒక కల్పవృక్షం అనే పుస్తకం మా ఇంటికి చేరడం కూడా సోమయాజులు గారి పుణ్యమే.  వేయి పడగలు నవల ముప్పది ఏడవ ముద్రణ. హార్డ్ బౌండ్. 999 పేజీలు,  ధర : 888 రూపాయలు.

ఇక మిగిలిన పుస్తకాల వివరాలు: వార్తాప్రస్థానం : రచన: గద్దె దుర్గారావు, నేను బహువచనం: ములుగు రాజేశ్వర రావు,  యం.యస్, ఆచార్య : మాఢభూషి శ్రీధర్,  అక్షరాయుధుడు ఏబీకే, పేపర్ బాయ్ టు ఎడిటర్: ఎస్, వినయ్ కుమార్, అప్పుడు – ఇప్పుడు : జి.కృష్ణ, పాములపర్తి వెంకట నరసింహారావు: అప్పరసు కృష్ణారావు, అనుభవాలు- జ్ఞాపకాలు, మౌన సాక్ష్యాలు: ప్రముఖ పత్రికా ఫోటోగ్రాఫర్ కేశవులు, సత్యవోలు సుందర సాయి, అధినాయక జయహే : చిం వ్యాసుడి ఖడ్గాలు, అమృత దర్శనం : విశ్వపతి, అమృత వర్షిణి: కొలిపాక శారద శతజయంతి సంచిక.

మొన్న సాయంత్రం సోమయాజులు గారు ఫోన్ చేసి వేయిపడగలు పుస్తకం వుందా? చదివారా?  అని అడిగారు.

అవును, కాదు అని  చెప్పలేకపోయాను. వేయిపడగలు పుస్తకం స్వయంగా విశ్వనాధ గారి కరకమలాల  నుంచే స్వీకరించిన వృత్తాంతం గుర్తుకు వచ్చింది.

అరవై ఏళ్ళ కిందటి సంగతి.

సుమారు ఆరు దశాబ్దాల క్రితం ఇద్దరు బెజవాడ ఎస్సారార్  కాలేజి కుర్రాళ్ళకు,  వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో నెగ్గినందుకు గాను  నూట యాభయ్ రూపాయలు పారితోషికంగా వచ్చాయి. అంత డబ్బుతో ఏం కొనుక్కోవాలి అనేది పెద్ద సమస్యగా మారింది. చివరికి వారిలో ఒకడన్నాడు, పుస్తకాలు కొనుక్కుందాం అని. పుస్తకాలు అంటే క్లాసు పుస్తకాలు కాదు, పెద్ద రచయితలు రాసిన గొప్ప పుస్తకాలు.

విశ్వనాధవారి వేయి పడగలయితే అన్నాడు ఇద్దరిలో ఒకడు. ఈ డబ్బుకు రెండు పుస్తకాలు వస్తాయంటావా అన్నాడు ఆ ఇద్దరిలో మరొకడు.

ఇద్దరూ కలిసి బెజవాడ మాచవరంలో ఉంటున్న కవిసామ్రాట్ ఇంటికి వెళ్ళారు. ఇంటి ముందు విశాలమైన ఆవరణ. వరండాలో ఓ వాలు కుర్చీలో  పై పంచ లేకుండా దోవతీలో ఒకాయన, ఆయనకు దగ్గరగా  తెల్లటి వస్త్రాల్లో మరొకాయన కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ ఇద్దరిలో విశ్వనాధ ఎవరై వుంటారు?

తెల్ల ఉడుపుల పెద్దమనిషి వారిద్దరినీ గుర్తు పట్టాడు. పట్టి, పై ఆచ్ఛాదన లేని వ్యక్తికి పరిచయం చేశారు.

‘ఇదిగో ఈ పొడుగబ్బాయి, సన్నగా వున్నాడే వీడు ప్లీడరు తుర్లపాటి హనుమంతరావు పంతులు గారి పెద్దబ్బాయి సాంబశివరావు. ఇంట్లో శాయిబాబు అంటారు. ఈ రెండోవాడు శ్రీనివాసరావు. మా అక్కయ్య కోడలి తమ్ముడు. హనుమంతరావు పంతులుగారికి కూడా స్వయానా బావమరది’

అప్పుడు ఇద్దరిలో సన్నవాడికి లైటు వెలిగింది. ఓహో వీరు పేరాల భరత శర్మ గారు, విశ్వనాధవారి శిష్యులు అని రెండోవాడి చెవిలో ఊదాడు.

ఏం పని మీద వచ్చారు అని అడగకుండానే చెప్పాము, పోటీల్లో బహుమతి కింద ఇద్దరికీ కలిపి నూట యాభయ్ వచ్చాయని, ఆ డబ్బుతో మీ వేయి పడగలు పుస్తకం కొనుక్కుందామనే  కోరిక కలిగిందని.

‘నా పుస్తకాలు మీకు అర్ధం అవుతాయా’ అనేది విశ్వనాధ వారి మొదటి ప్రశ్న.

‘ఏమోనండీ అర్ధం కాకపోవచ్చు. కానీ అర్ధం చేసుకోవడానికే చదవాలని అనుకుంటున్నాం’ మా జవాబు.

విశ్వనాధవారి మొహంలో కనీ కనపడని నవ్వు.

‘అదిగో ఆ మూల వున్నాయి. పోయి చెరి రెండూ తెచ్చుకోండి’ అన్నారు.

పోయి చూస్తే విశ్వనాధ వారు రాసిన పుస్తకాలు  ప్యాకెట్లుగా కట్టి వున్నాయి.

ఆయన చెప్పినట్టే చేసి చెప్పాము.

‘ఇందులో చాలా పుస్తకాలు ఉన్నట్టున్నాయి. మా దగ్గర నూట యాభయ్ మాత్రమే వున్నాయి’ అన్నాడు సాంబశివరావు అనే నా సహాధ్యాయి,  మేనల్లుడు కూడా.

అప్పుడు విశ్వనాధవారు పెద్దగా నవ్వారు.

‘అర్ధం చేసుకుంటాం అన్నారు కదా! పోయి చదవండి. చదివేవారికి పుస్తకం చేరాలి. మిగిలిన పుస్తకాల డబ్బు మీ ఇద్దరికీ నా గిఫ్ట్’ అనేశారు.

మహదానందంతో రెక్కలు కట్టుకుని ఇంటికి వచ్చి ప్యాకెట్ విప్పితే :

‘వేయి పడగలు, కిన్నెరసాని పాటలు, దిండు కింద పోకచెక్క, స్వర్గానికి నిచ్చెనలు, చెలియలి కట్ట, ఏకవీర, తెఱచిరాజు, మాబాబు, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు, చిట్లీచిట్లని గాజులు....’

కవిసామ్రాట్ అయ్యే. ఎంత పెద్ద చేయి అయివుండాలి మరి.




(ఇంకా వుంది)          

1, ఫిబ్రవరి 2026, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (258) : భండారు శ్రీనివాసరావు


ఎవరు ముందు ? ఎవరు వెనుక?
ఈ ఇంగ్లీషు వాడున్నాడే, ఎంతయినా గొప్పవాడు.
పంతాలు, పట్టింపులు, అహంభావం, అహంకారం, నేనే గొప్ప అనే, అనేక రకాల భావనలను అన్నీ కలిపి, ఎంచక్కా ఈగో (Ego) అనే ఒక్క చిన్న మూడక్షరాల పదంలో గుదిగుచ్చాడు.
(నిజం చెప్పాలి అంటే ఈ ఈగోకి నేను అతీతుడిని ఏమీ కాదు. ఈ తలపొగరు వల్ల జీవితంలో పోగొట్టుకున్నవే ఎక్కువ అని జీవిత చరమాంకంలో జ్ఞానోదయం అయింది. గతజల సేతు భంజనం)
ఈ మధ్య ఏ పేపరు తిరగేసినా, ఏ ఛానల్ పెట్టినా, అధికారులు, అనధికారులు, చోటా నాయకులు, బడా నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, చివరాఖరికి ఉన్నత రాజ్యాంగ పదవుల్లో వున్నవాళ్ళు సయితం ఈ ఈగో అనే విషవలయంలో చిక్కుకుని సంచలన వార్తలకు కేంద్ర బిందువులు అవుతున్న విషయం బోధపడుతుంది.
నిజానికి ఇవన్నీ కొత్తవేమీ కాదు. కాకపోతే గతంలో కంటే మీడియా విస్తృతి ఈనాడు ఎక్కువ కనుక, వీటికి మరింత ఎక్కువ ప్రాచుర్యం లభిస్తోంది.
మచ్చుకు ఓ ఉదాహరణ చెప్పుకుందాం.
అప్పుడు వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి. మోహన్ కందా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. స్వర్ణజిత్ సేన్ పోలీసు డైరెక్టర్ జనరల్. దినేష్ రెడ్డి హైదరాబాదు నగర పోలీసు కమిషనర్.
ఆ రోజుల్లో ఒకసారి రాష్ట్రపతి ఏ.పీ.జే. అబ్దుల్ కలాం హైదరాబాదు వచ్చారు. బేగం పేట విమానాశ్రయంలో స్వాగతం. ఏర్పాట్లు అన్నీ జరిగాయి. రాష్ట్రపతికి స్వాగతం చెప్పడానికి అందరూ వరసగా నిలబడ్డారు.
పోలీసు కమిషనర్ దినేష్ రెడ్డి ప్రోటోకాల్ ప్రకారం కొంత వెనుక నిలబడాల్సి వచ్చింది. అది ఆయనకి నచ్చలేదు. వరుస తప్పించి ముందుకు వెళ్లి డీజీపీ పక్కన నిలబడ్డారు.
సరే ఆ కార్యక్రమం ముగిసింది. కానీ దినేష్ రెడ్డి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రోటోకాల్ విషయంలో తనకు జరిగిన లోపాన్ని ఎత్తి చూపుతూ చీఫ్ సెక్రెటరీకి ఓ ఉత్తరం రాశారు.
“సీనియారిటీ రీత్యా నాకంటే జూనియర్ అయిన ఓ ఐ.ఏ.ఎస్. అధికారి (సీ.ఆర్. బిస్వాల్, ప్రిన్సిపాల్ సెక్రెటరి పొలిటికల్) వెనక నేను నిలబడడం కుదరదు. నగర పోలీసు కమిషనర్ గా నేను ఆయనకంటే ముందు వుండాలి” అంటూ ఆయన తన మనసులో మాట బయట పెట్టారు.
దీనికి జవాబుగా ఆయనకు చీఫ్ సెక్రెటరి నుంచి మెమో వచ్చింది.
“రాష్ట్రపతి స్వాగత కార్యక్రమంలో మీరు ప్రిన్సిపల్ సెక్రెటరి పొలిటికల్ ని దాటుకుని వెళ్లి డీజీపీ పక్కన నిలబడ్డారు. ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన కిందికి వస్తుంది’ అనేది ఆ మెమో తాత్పర్యం.
ఈ మెమో ముఖ్యమంత్రి ఆదేశం ప్రకారం ఇచ్చింది అని తెలియక దినేష్ రెడ్డి చీఫ్ సెక్రెటరీకి మరో ఘాటయిన లేఖ రాశారు, “నాకు మెమో ఇవ్వడానికి మీకెంత ధైర్యం? హైదరాబాదు నగర పోలీసు కమిషనర్ గా నా స్థాయి (హోదా) చీఫ్ సెక్రెటరీకి సమానం’ అంటూ.
ఇది చిలికి చిలికి గాలివాన అయింది. స్టేట్ ఐ.పి.ఎస్. అధికారుల సంఘం కార్యవర్గం అత్యవసర సమావేశం జరిపి ప్రోటోకాల్ విషయంలో తమను కూడా ఐ.ఏ.ఎస్. అధికారులతో సమానంగా పరిగణించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసింది. ఈ సంఘానికి దినేష్ రెడ్డి కార్యదర్శి కావడం కాకతాళీయం కావచ్చు.
తాను 1977 బ్యాచ్ ఐ.పి.ఎస్. అధికారినని, ప్రోటోకాల్ వ్యవహారాలు చూసే అధికారి 1981 బ్యాచ్ ఐ.ఏ.ఎస్. కాబట్టి అతడు తనకు జూనియర్ అవుతాడు అనే ధోరణితో దినేష్ రెడ్డి ఉత్తరం రాసారు.
నివురుగప్పిన నిప్పు మాదిరిగా ఈ వివాదం కొనసాగుతోంది కానీ ప్రభుత్వం పెదవి విప్పలేదు. కారణం నగరంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం పూర్తి కావాల్సి వుంది. ఆ కార్యక్రమం సజావుగా అలా పూర్తయిందో లేదో నగర పోలీసు కమిషనర్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అప్పటికి ఆయన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టి పది నెలలు కూడా కాలేదు. నగర పోలీసు కమిషనర్ ను బదిలీ చేస్తున్న సమాచారం డీజీపీకి కూడా తెలియదని వార్తలు గుప్పుమన్నాయి.
ఏదో కక్ష కట్టినట్టు బదిలీ చేసినట్టు కాకుండా అదే రోజు మరో ఆరుగురు ఉన్నత పోలీసు అధికారులకు కూడా స్థాన చలనం కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అప్పుడు అలా అర్ధాంతరంగా కమిషనర్ పదవి నుంచి తప్పుకోవాల్సివచ్చిన దినేష్ రెడ్డి, ఆద్యతన కాలంలో పోలీసు డైరెక్టర్ జనరల్ అయ్యారు.
సంబంధిత మంత్రికి కూడా తెలియకుండా ఆయన ఒకే ఒక్క రోజున రాష్ట్ర వ్యాప్తంగా యాభయ్ మంది డీ.ఎస్.పి. లను బదిలీ చేయడం ఓ కొసమెరుపు.
(ఇంకా వుంది)

31, జనవరి 2026, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (257) : భండారు శ్రీనివాసరావు

రాముడి కుమారుడు దశరధుడు

‘నేను పుట్టడానికి కొన్ని నెలల ముందు నుండే నన్ను చంపడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ దుర్మార్గానికి పూనుకుంది కూడా నా కన్నతల్లే కావడం విధి విచిత్రం’
‘కాబోయే కథకులకు కావాల్సిన చిట్కాలు’ అనే పేరుతో, కొత్త రచయితలకు మార్గనిర్దేశం చేస్తూ కీర్తిశేషులు, సుప్రసిద్ధ కవి, విమర్శకుడు ఆరుద్ర రాసిన ఒక వ్యాస సంపుటి ఈ విధంగా మొదలవుతుంది. కధ ఎత్తుగడ ఎలావుండాలి, తొలి వాక్యంతోనే పాఠకులను యెలా ఆకట్టుకోవాలి అనే అంశానికి ఉదాహరణగా ఆయన ఈ రెండు వాక్యాలను ఉటంకించారు.
పుట్టడానికి ముందే చంపే ప్రయత్నం అంటే ‘అబార్షన్’ అనుకోవాలి. తల్లే దానికి పూనుకున్నదంటే పెళ్లి కాకుండానే ఆమె గర్భవతి అని అర్ధం. ఆ క్రమంలో ప్రాణాలు కోల్పోవాల్సిన పాపాయే ఈ మాటలు చెబుతోందంటే అబార్షన్ విఫలమయిందని భావం. రెండు చిన్న వాక్యాలలో ఇంత కధను ఇమడ్చగలిగితే ఇక ఆ కధ పట్ల పాఠకుల ఆసక్తి అపరిమితంగా పెరిగిపోయే అవకాశం కూడా అంతే వుంటుంది. ఏమంటారు?
ఏమంటాం. చెప్పింది వింటాం. చెప్పినవారు అలాంటి ఇలాంటి మనిషి కాదాయె. సాక్షాత్తు సరస్వతీ సంపన్నుడు ఆరుద్ర.
కధలు రాయాలని, కవిత్వం గిలకాలని ఒక వయసులో కోరుకోని వారుండరు. మరీ ముఖ్యంగా ప్రాయంలో వున్న మగపిల్లలకు తోటి ఆడపిల్లలను త్వరగా ఆకట్టుకోవడానికి రచయిత అనే ట్యాగ్ లైన్ బాగా ఉపకరిస్తుంది.
పత్రికల్లో వచ్చే కధలు, కాకరకాయలకే ఇంత డిమాండ్ వుంటే ఆబాలగోపాలాన్ని ఆకర్షించే సినిమా కధలకు ఎంత గిరాకీ వుండాలి? అయితే ఎంతమంది అందర్నీ ఆకట్టుకునే రచనలు చేయగలరు.
తెనుగు భాగవతం రాసిన పోతన్నగారేమన్నారు? తాను ఎలా రాశాను అని చెప్పారు?
“విబుధజనుల వలన, విన్నంత, కన్నంత, తెలియవచ్చినంత తేటపరుతు” అన్నారు.
అంతటి పరమ భాగవతోత్తముడు ఎంత వినయంగా చెప్పారు. పెద్దలు చెప్పింది విని, ఆకళింపు చేసుకుని, (పాఠకులకు) తేటతెల్లం చేస్తాను అన్నారు. ఎంత గొప్పమాట.
అంటే ఏమిటి? కేవలం రాయాలనే కోరిక చాలదు. విషయం చెప్పగలిగిన పెద్దలు దొరకాలి. వాళ్ళు చెప్పింది వినాలి. తర్వాతనే కాగితం మీద కలం పెట్టాలి.
ఈ విషయ ప్రస్తావనకు ఒక కారణం వుంది.
వృత్తి రీత్యా సీనియర్ ఐ.పి.ఎస్. అధికారి, ప్రవృత్తి రీత్యా రచయిత, మా మేనకోడలు శారద భర్త అయిన శ్రీ రావులపాటి సీతారామారావు, సినీ రచయిత, దర్శకుడు దశరధ్ రాసిన కథారచన పుస్తకంపై రాసిన ఒక మంచి పలుకును ఫేస్ బుక్ లో చదివాను.
సీతారామారావుగారి మాటల్లో:
“This small but resourceful book contains bigger ideas in first having a good story and then quality screen play to launch a purposeful but acceptable film. As writer of some standing, I learnt many a lesson and for my further writings, I sincerely try to fit in your ideas.”
ఒక రచయిత రచనను, మరో రచయిత హృదయపూర్వకంగా ప్రశంసించడం ఆహ్వానించ తగ్గ పరిణామం.
సినిమా పరిశ్రమని 24 CRAFTS గా పేర్కొంటూ వుంటారు. వీటిల్లో చాలా వాటిల్లో ప్రవేశించడానికి తగిన శిక్షణా సంస్థలు వున్నాయి. చక్కని సినిమా కధని రాసుకుని, తగిన స్క్రీన్ ప్లే రాయడానికి శిక్షణ ఇచ్చే సంస్థలు కానీ వాటిని గురించి తెలియచెప్పే తెలుగు పుస్తకాలు కానీ వున్న దాఖలా నాకు తెలిసి లేవు.
అలనాడు పోతనా మాత్యులు చెప్పినదీ, ఒకనాడు ఆరుద్ర గారు చెప్పినదీ, ఈ రెంటికీ కూడా దశరధ్ రాసిన కథారచన అనే పుస్తకం ఉపకరిస్తుందని నేను నమ్ముతున్నాను.
సరే! రాముడి కుమారుడు దశరధుడు. ఈ మతలబు ఏమిటంటారా!
ఈ సినీ దర్శక, రచయిత దశరద్ ఎవరంటే, ఖమ్మంలో నేను రిక్కాబజార్ స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో నా క్లాస్ మేట్ కొండపల్లి రామచంద్రం కుమారుడు. నాగార్జున హీరోగా నటించిన సంతోషం సినిమాతో ప్రాచుర్యం పొందిన డైరెక్టర్.
కింది ఫోటో: దశరద్



(ఇంకావుంది)

24, జనవరి 2026, శనివారం

తెనాలి ప్రేమికుడు వెనిగళ్ళ వెంకటరత్నం ఇక లేరు

 

‘మాదీ బందరు, మీదీ బందరు’ ‘మాదీ తెనాలి, మీదీ తెనాలి’ అని కొన్ని సినిమాల్లో హాస్య పాత్రలతో అనిపించడం అందరికీ గుర్తే.
కానీ సొంతవూరుపట్ల మమకారం అలాంటిది. దాంట్లో తప్పు పట్టడానికి కానీ, ఎద్దేవా చేయడానికి కానీ కారణం కనిపించదు.
రేడియోలో నా సహోద్యోగి, కీర్తిశేషులు డి. వెంకట్రామయ్య గారి ద్వారా వెనిగళ్ళ వెంకటరత్నం గారు నాకు పరిచయం. పెద్ద ఉద్యోగాలు చేసిన తర్వాత, హాయిగా సాహితీ మిత్రులతో కాలక్షేపం చేయడం ఆయన హాబీ.

ఆయనలో మంచి స్నేహితుడిని చూసాను కానీ ఆయన కలం విదిలిస్తే చక్కటి రచనలు చేయగల దిట్ట అని ఆలస్యంగా తెలిసింది.
1983 లో నోబెల్ పురస్కార గ్రహీత నార్మన్ బోర్లోగ్ తో అయన చేసిన ఇంటర్వ్యూ ఆంధ్రప్రభ దినపత్రికలో అచ్చయింది.
ఆయనే, ఆ వెంకట రత్నం గారే ‘ ఆంధ్రా ప్యారిస్ తెనాలి’ అనే పుస్తకానికి రచయిత.

అలనాటి అందాల నటి కాంచనమాలతో మొదలెట్టి తెనాలికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన అనేకమంది జీవన చిత్రాలను సరళమైన శైలిలో ఆయన ఇందులో పొందుపరిచారు.
తెనాలికి ఆంధ్రా ప్యారిస్ అనే పేరు రావడానికి కారణం అదొక అందాల నగరమని కాదు, అందాల భామలకు ప్రసిద్ధి అని కూడా కాదు. కొత్త కొత్త ఫ్యాషన్లకు, సరి కొత్త ఆలోచనలకు ప్యారిస్ పెట్టింది పేరు. అక్కడి కవులు, రచయితలు కొత్త రీతిలో రచనలు చేసేవాళ్ళు. చిత్రకారులు కొత్త పోకడలతో చిత్రాలు గీసే వాళ్ళు. అలాగే తెనాలిలో కూడా ఇలాంటి వాతావరణమే వెల్లివిరుస్తుండేది.
మధ్యలో మూడు కాలువలు ప్రవహిస్తూ వుండడం కూడా ప్యారిస్ తో తెనాలిని ముడి పెట్టడానికి కారణమని వెంకట రత్నం గారి భావన.

తెనాలి గురించి ఆయన చెప్పిన మరో విశేషం.
1942 క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో తెనాలి రైల్వే స్టేషన్ ను తగులబెట్టారు. పోలీసు కాల్పుల్లో ఏడుగురు ఉద్యమకారులు మరణించారు. ఈ వార్తను బెర్లిన్, టోక్యో రేడియోలు ప్రసారం చేసాయి. బ్రిటిష్ పాలకులు రెచ్చిపోయి ఎందర్నో అరెస్టు చేసారు. తెనాలి ప్రజలపై రెండు లక్షల రూపాయల అపరాధ పన్ను విధించారు. ఆ పోరాట ప్రదేశాన్ని ‘రణరంగ్ చౌక్’ గా నామకరణం చేసి, అమరుల స్మృతి చిహ్నంగా ఏడు స్తూపాలు నిర్మించారు. 1959లో వాటిని నాటి తెనాలి మునిసిపల్ చైర్మన్ ఆలపాటి వెంకట్రామయ్య గారి ఆధ్వర్యంలో ఏ.ఐ.సి.సి. అధ్యక్షులు శ్రీ కామరాజ నాడార్ ఆవిష్కరించారు. ఈ స్మారక చిహ్నం చిత్రాన్నే ఈ పుస్తకం కవర్ పేజీగా రూపొందించడం హర్షణీయం.

తెనాలి పట్ల అంతటి ప్రేమాభిమానాలు కలిగిన వెనిగళ్ళ వెంకటరత్నం గారు ఈ రోజు హైదరాబాదులో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారని వాసిరెడ్డి నవీన్ గారి ద్వారా తెలిసింది.

కింది ఫోటో: ఒక సాయంత్రం వెనిగళ్ళ వెంకట రత్నం గారు, సుప్రసిద్ధ పాత్రికేయ మిత్రుడు శ్రీ సోమశేఖర్, తెలంగాణా మీడియా అకాడమి చైర్మన్ కే. శ్రీనివాస రెడ్డి గారు, మా ఇంటికి వచ్చారు. అప్పటి ఫోటో.







#Tenali

23, జనవరి 2026, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (256): భండారు శ్రీనివాసరావు

పతీ పత్నీ ఔర్ ఓ
‘భార్యను చంపి, ముక్కలు చేసి, కుక్కర్ లో ఉడికించి’ ...అంటూ నిరుడు ఒకరోజు (గురువారం, 23-01-2025) పత్రికల్లో ఒక భయంకరమైన కధనం వచ్చింది. చదవగానే కడుపులో తిప్పే ఇలాంటి వార్తను తక్షణమే మరచి పోవాలి. లేదా పేజీ తిప్పేయాలి. కానీ నేను ఆ పని చేయకుండా 65 ఏళ్ళ కిందటి ఒక పాత క్రైం స్టోరీ గుర్తు చేసుకున్నాను.
అది ఆ రోజుల్లో కొన్ని పత్రికల్లో వచ్చింది.
ఖమ్మం సాయిబాబాగా ప్రసిద్ధి చెంది అక్కడ ఒక ఆశ్రమం కూడా నిర్మించుకుని కొన్నేళ్ళ క్రితం పరమపదం చేరుకున్న జీవై కృష్ణమూర్తి స్వయంగా మా బాబాయి గారి అల్లుడు. మా అక్కయ్య మధురకు భర్త. పూర్వాశ్రమంలో సమర్ధుడైన పోలీసు అధికారి. యూనిఫారంలో ఆయన్ని చూస్తే మాకు వణుకు. నేరగాళ్లకు సింహస్వప్నం. ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్నప్పుడు, ఆ నాటి ముఖ్యమంత్రి గారి (ఆయన అప్పుడు కారులో లేరు, పైగా ఆ రోజుల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు) కారును ట్రాఫిక్ ఉల్లంఘన కింద బుక్ చేస్తే, పనిష్ మెంటుగా నేర విభాగానికి బదిలీ చేశారు.
ఆ రోజుల్లో జరిగిన కధ ఇది.
హుస్సేన్ సాగర్ ఒడ్డున కొన్ని కుక్కలు ఆహారం కోసం వెతుకుతూ కాలి గోళ్ళతో తవ్వుతుంటే మనిషి చేయి ఒకటి బయటకు వచ్చింది. ఎవరో చెబితే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఒకచోట చేయి, మరో చోట మనిషి తాలూకు మరో అంగం ఇలా పలుచోట్ల దొరికాయి. ఒక చోట ఆ మనిషి ధరించిన వస్త్రం (తరువాత అది ఆడవాళ్ళు ధరించే నైటీ అని తెలిసింది) కనబడింది.
అప్పుడు మా బావగారు క్రైం ఇన్స్పెక్టర్. ఆ నైటీ భాగాన్ని పరిశీలనగా చూస్తే చాకలి గుర్తు కనిపించింది. (ఆ రోజుల్లో పేపర్లో అలాగే రాశారు కాని, ఈ రోజుల్లో ఇలా ఒక కులం పేరు రాయడం తప్పని తెలుసు. నన్ను మన్నించాలి). దర్యాప్తు చేస్తే ఆ గుర్తు బొంబాయిదని తేలింది. కృష్ణమూర్తిగారు బొంబాయి (ఇప్పుడు ముంబై) వెళ్లి ఆ గుర్తు ఆధారంగా తన పరిశోధన కొనసాగిస్తే, అది నానావతి అనే ఒక డాక్టర్ తాలూకుదని తెలిసింది. తీగెను కదిలిస్తే డొంక కదిలింది.
కుటుంబ కలహాల కారణంగా ఆ డాక్టరుకు భార్యపై తగని కోపం ప్రబలింది. ఆ ఉద్రేకంలో ఆమెను ఇంట్లోనే హత్య చేశాడు. తరువాత పరిణామాలు ఆయన్ని భయపెట్టాయి.
డాక్టరుగా అనేక ఆపరేషన్లు చేశాడు. శరీరంలో ఏ భాగాన్ని ఎలా కత్తిరించాలో బాగా తెలుసు. ఎలా కట్ చేస్తే రక్తం ఎక్కువగా స్రవించదో కూడా తెలిసిన మనిషి. ఆ పరిజ్ఞానంతో శరీర భాగాలను ముక్కలుగా కట్ చేసి ఒక పెద్ద సూటు కేసులో పెట్టి, రైల్వే స్టేషన్ కు వెళ్లి హైదరాబాదుకు వెళ్ళే రైలు ఎక్కాడు. తెలతెలవారుతుండగా ఆ సూటుకేసును రైలు బోగీ గుమ్మంనుంచి హుస్సేన్ సాగర్ లోకి నెట్టి వేశాడు. ఆ రోజుల్లో రిజర్వేషన్ల గొడవ లేదు కాబట్టి తిరుగు రైలులో బొంబాయి వెళ్ళిపోయాడు. హుస్సేన్ సాగర్ లో పడ్డ ఆ సూటు కేసు తెరుచుకుని శరీర భాగాలు చెల్లాచెదురు అయ్యాయి. అవి ఒడ్డుకు కొట్టుకు వచ్చి భూమిలో కూరుకుపోయి, చివరికి వీధి కుక్కల నోటికి ఒక చేయి దొరికింది.
బొంబాయిలో నానావతిని అరెస్టు చేసి మా బావగారు హైదరాబాదు తీసుకువచ్చారు. అప్పుడు సిటీ పోలీసు నేర విభాగం రేడియో స్టేషన్ కు దగ్గరలో వున్న సిటీ పోలీసు కంట్రోల్ రూమ్ పైన వుండేది. ముద్దాయిని విచారిస్తున్న సమయంలో అతడు హఠాత్తుగా మూడో అంతస్తు నుంచి దూకి చనిపోయాడు.
ఈ క్రైం స్టోరీ దర్యాప్తు గురించి అంధ్రపత్రిక దినపత్రిక కధలు కధలుగా అనేక కధనాలు సీరియల్ గా ప్రచురించింది.
మరో క్రైం స్టోరీ కూడా ఇంచుమించు ఇలాగే సాగుతుంది.
ఇదీ జరిగిన కధే. అంచేత ఓ కధలా ముచ్చటిద్దాం. పేర్లూ, ఊర్లూ తర్వాత చెప్పుకుందాం.
అతడో పెద్ద అధికారి. భార్యా, ముగ్గురు పిల్లలు. ఉద్యోగ బాధ్యతల కారణంగా అతడు నెలలో చాలా రోజులు వేరే ఊళ్లలో ఉంటుంటాడు. ఈ క్రమంలో అతడి భార్యకు భర్త స్నేహితుడితో సంబంధం ఏర్పడుతుంది. విడాకులు తీసుకుని అతడ్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. కానీ ఆ ప్రియుడి ఉద్దేశ్యం వేరు. ఆడవాళ్ళను వాడుకుని వదిలేసే రకం.
ఈ విషయం భర్తకు తెలుస్తుంది. అధికార రీత్యా ప్రభుత్వం అతడికి సమకూర్చిన రివాల్వర్ తీసుకుని భార్యను లోబరుచుకున్న వ్యక్తి ఇంటికి వెడతాడు. నా భార్యను పెళ్లి చేసుకుని, నా పిల్లల్ని నీ పిల్లలుగా చూసుకునే ఉద్దేశ్యం ఉందా లేదా అని నేరుగా అడిగేస్తాడు. ‘నాతొ కాలక్షేపం చేసిన ప్రతి అమ్మాయిని పెళ్ళాడాలంటే నేను వెయ్యి పెళ్ళిళ్ళు చేసుకోవాల’ని అతడు ఎకసెక్కంగా మాట్లాడుతాడు. భర్తకు పట్టలేని ఆగ్రహం కలిగి పిస్టల్ తో కాలుస్తాడు. భార్య ప్రియుడు అక్కడికక్కడే ప్రాణాలు విడుస్తాడు. అతడు నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి నేరం ఒప్పుకుని లొంగిపోతాడు. కేసు విచారణ సుదీర్ఘంగా సాగుతుంది. జ్యూరీ అతడ్ని నిర్దోషిగా పరిగణిస్తుంది. కానీ సెషన్స్ జడ్జి జ్యూరీ నిర్ణయాన్ని కాదని కేసును హై కోర్టుకు పంపుతాడు. అక్కడ అతడికి జీవిత ఖైదు విధిస్తారు. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు ధ్రువ పరుస్తుంది.
ఇక్కడ కధ మరో మలుపు తిరుగుతుంది.
కధలో మలుపుకు కారణం ఓ పత్రిక. ఒకానొక రోజుల్లో విపరీతమైన పాఠకాదరణ కలిగిన ఇంగ్లీష్ వారపత్రిక బ్లిట్జ్. ఆ పత్రిక ఎడిటర్ ఆర్కే కరంజియా.
ఇప్పుడు పేర్లూ వివరాలు చెప్పుకుందాం. అతడి పేరు నానావతి. నేవీ కమాండర్. స్నేహితుడి పేరు ప్రేమ్ ఆహూజా. బాగా డబ్బున్నవాడు. విలాసపురుషుడు.
బ్లిట్జ్ పత్రిక ముద్దాయిని భుజాలకు ఎత్తుకుని ధారావాహిక కధనాలు నానావతికి మద్దతుగా ప్రచురిస్తుంది. దానితో ప్రజలందరూ ఆ కేసు గురించే మాట్టాడుకోవడం మొదలవుతుంది. పాతిక పైసల పత్రికను రెండు రూపాయలు పెట్టి కొనుక్కుని చదివేవారు. నానావతి పేరుతొ పిల్లలు ఆడుకునే బొమ్మ పిస్తోల్లు, ఆహూజా పేరుతొ టీ షర్ట్లులు అమ్మడం మొదలైంది. నానావతికి నైతిక మద్దతు తెలుపుతూ ర్యాలీలు, ఊరేగింపులు జరుగుతాయి. దేశవ్యాప్తంగా నానావతి కేసు ఓ సంచలనంగా మారుతుంది.
చివరికి అప్పటి మహారాష్ట్ర గవర్నర్ శ్రీమతి విజయలక్ష్మి పండిట్ క్షమాభిక్ష పెట్టి అతడి యావజ్జీవ శిక్షను రద్దు చేయడంతో కధ సుఖాంతమవుతుంది.
కేసు నుంచి బయట పడిన నానావతి తన కుటుంబాన్ని తీసుకుని కెనడా వెళ్లి అక్కడే సెటిల్ అయి అక్కడే చనిపోవడంతో అతడి కధ ముగుస్తుంది.
ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. బ్లిట్జ్ పత్రిక యజమాని, సంపాదకుడు ఆర్కే కరంజియా పార్సీ. ముద్దాయి నానావతి కూడా పార్సీ.
1959లో కాబోలు ఇది జరిగింది. అప్పుడు నేను స్కూల్లో చదువుకుంటున్నాను. ఆంధ్ర పత్రిక వాళ్ళు దీన్ని ఓ సీరియల్ గా ప్రచురించేవారు. బ్లిట్జ్ పత్రిక ఏమి రాసిందో తెలియదు కానీ అంధ్రపత్రిక మాత్రం ఆసక్తికరమైన వార్తా కధనాలను వండి వార్చేది.
కోర్టులో వాదోపవాదాలు ఎలా జరుగుతాయో తెలుసుకోవడం మీద ఆ రోజుల్లో జనాలకు చాలా ఆసక్తి వుండేది. ప్రాసిక్యూషన్ తరపున రాం జెట్ మలానీ వాదిస్తే, ముద్దాయి నానావతి తరపున ఖండాలావాలా ఈ కేసు వాదించారు.
ఈ వాస్తవ కధనాన్ని ఆధారంగా చేసుకుని హిందీలో ఒక సినిమా తీశారు.
ఇరవై నాలుగు గంటల టీవీ చానళ్ళ కాలంలో ఇది జరిగివుంటే పండగే పండగ.



(ఇంకావుంది)