భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య
మీడియా, రాజకీయాలు, మరెన్నో
22, మే 2022, ఆదివారం
ఉరి శిక్షలు ఎన్కౌంటర్లు
సతీ నీలాంబరి – భండారు శ్రీనివాసరావు
నీలాంబరితో ఏకాంబరం పెళ్లి పెళ్లున జరిగిపోయింది. మొదటి రాత్రే ఏకాంబరం భార్యతో చెప్పాడు.
'మనం ఇద్దరం ఒక అవగాహనకు వద్దాం. నా మీద నీకు కోపం వస్తే కేకలు వెయ్యి. కానీ
అప్పుడు మనిద్దరం తప్ప మూడో వ్యక్తి వుండకూడదు.
నేనూ అలాగే. మరొకరు వున్నప్పుడు నీ మీద నోరు
పారేసుకోను. అండర్ స్టాండ్?'
'అండర్ స్టాండ్. అల్లాగే' అన్నది నీలాంబరం.
భార్య సహకారం చూసిన ఏకాంబరానికి ఆమె మీద ప్రేమ పూనకంలా తన్నుకు వచ్చింది.
'నువ్వుంటే నాకు ఈ లోకంతో పనిలేదు. ఎదురుగా ఎందరు వున్నా నా కంటికి నువ్వొక్కదానివే...' అంటూ
గారాలు పోయాడు.
మర్నాడు కాఫీ తాగేటప్పుడు ఏదో విషయం
మీద మాటా మాటా వచ్చి మొగుడ్ని అత్తామామల ముందే కడిగి
పారేసింది నీలాంబరి. ఏకాంబరం బిత్తరపోయాడు.
బిక్కచచ్చిపోయాడు.
ఆ రాత్రి వొంటరిగా వున్నప్పుడు అడిగాడు 'అందరిముందు ఎందుకు అలా వొంటి కాలి మీద
లేచావు' అని.
నీలాంబరి గారాలు పోతూ చెప్పింది.
'ఎవరున్నారు అక్కడ? మీరే కదా అన్నారు, ఎదురుగా నేనుంటే ఇక ఎవరూ లేనట్టే అని'
ఏకాంబరం మరోసారి బిక్కచచ్చిపోయాడు
21, మే 2022, శనివారం
డొక్కు జీపులో రాజీవ్ గాంధి – భండారు శ్రీనివాసరావు
(ఈరోజు మే 21 రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రభలో ప్రచురితం)
ఒకరు, సాక్షాత్తు దేశానికి ప్రధాన మంత్రి. మరొకరు జిల్లాస్తాయి యంత్రాంగంలో ఓ జీపు డ్రైవర్. వీరిద్దరూ కలసి భద్రాచలం అడవుల్లో ఓ డొక్కు జీపులో కలసి ప్రయాణం చేశారు. నమ్మదగని విషయంగా అనిపించినా ఇది అక్షర సత్యం. పైగా దానికి నేనే ప్రత్యక్షసాక్షిని.
గోదావరికి వరదలు రావడం మామూలే. కానీ వరద నష్టం పరిశీలించడానికి ప్రధాన మంత్రి స్వయంగా రావడం మామూలు విషయం కాదు. అందుకే ఏర్పాట్లన్నీ పకడ్బందీగా జరిగాయి. అందులోనూ రాష్ట్రంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం, ఎన్ టీ రామారావు గారి ముఖ్యమంత్రిత్వంలో నడుస్తున్న రోజులాయె.
హెలికాఫ్టర్ లో భద్రాచలం చేరుకున్న రాజీవ్ గాంధీకి ఘన స్వాగతం లభించింది. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయ కార్యక్రమాలను వివరించే ఫోటో ప్రదర్శనని తిలకించిన అనంతరం, అనేక వాహనాలతో కూడిన ప్రధాన మంత్రి బృందం రోడ్డు మార్గంలో వరద తాకిడికి గురయిన ప్రాంతాలను చూసేందుకు బయలుదేరింది. ప్రధాని వెంట ముఖ్య మంత్రి రామారావు, మాజీ ముఖ్య మంత్రి, అప్పటి కేంద్రమంత్రి జలగం వెంగళరావు, అధికారులు, అనధికారులు అంతా వున్నారు. ఆ రోజుల్లో రేడియో విలేకరికి కొద్దో గొప్పో ప్రాధాన్యత వుండడం మూలాన, హైదరాబాదు నుంచి వెళ్ళిన నాకు కూడా ప్రధాని కాన్వాయిలో ఒక జీపు కేటాయించారు. అప్పట్లో ఇప్పటిలా ఇన్ని టీవీ ఛానళ్ళు లేవు. టేపు రికార్డర్ చేతబట్టుకుని వీ ఐ పీ ల వెంట తిరగగలిగే వెసులుబాటు వుండేది. భద్రాచలం నుంచి చింతూరు వరకు రోడ్డుమార్గంలో వెళ్లి రావాలన్నది అధికారుల ప్లాను. మార్గమధ్యంలో రాజీవ్ గాంధీ అనేక చోట్ల వాహనాన్ని నిలిపి, రోడ్డు దిగి కాలినడకన ఇసుక మేట వేసిన పొలాలలోకి వెళ్లి రైతులతో, కూలీలతో మాటా మంతీ కలపడం సాగించారు. కాంగ్రెస్ నాయకుడు వీ హనుమంతరావు ప్రజలకు, ప్రధానికి నడుమ దుబాసీగా వ్యవహరించారు. ఇలా అనేక చోట్ల కాన్వాయి ఆపడం, చాలాదూరం నడుచుకుంటూ వెళ్లి స్తానికులతో మాట్లాడడం, ఇదంతా యువకుడయిన రాజీవ్ గాంధీకి ఏమాత్రం అలసట కలిగించలేదు. కానీ, ఆ ఎర్రటి ఎండలో ఎగుడు దిగుడు పొలాల్లో వేగంగా అడుగులువేస్తూ వెడుతున్న రాజీవ్ గాంధీతో పాటు సమానంగా నడవడానికి మిగిలిన నాయకులు నానా హైరానా పడ్డారు. ఈ విధంగా సాగిపోతున్న ప్రధాని పర్యటన అనుకోని మలుపు తిరిగింది. ఆ మలుపు తిరిగేముందు ఓ పిట్టకధ చెప్పుకోవాలి.
నేను ఖమ్మంలో చదువుకునే రోజుల్లో వంటమ్మగారనే పేద వృద్ధురాలు వుండేది. నాలుగయిదు ఇళ్ళల్లో వంటలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేది. ఆమె మనవడికి చదువు వొంటపట్టకపోవడంతో వారినీ వీరినీ ప్రాధేయపడి ఏదో చిన్న ఉద్యోగం వేయించగలిగింది. అతను కూడా డ్రైవింగ్ నేర్చుకుని ఓ ప్రభుత్వ శాఖలో డ్రైవర్ గా స్థిరపడ్డాడు. రాజీవ్ గాంధీ కాన్వాయిలో నేనెక్కిన డొక్కు జీపుకు అతనే డ్రైవర్ కావడం కాకతాళీయం. ఇక వర్తమానం లోకి వస్తే,
మరి కాసేపటిలో చింతూరు చేరతామనగా ఓ మలుపు దగ్గర రాజీవ్ గాంధీ వాహనం ఆపించారు. ఆ మలుపులో రోడ్డుకు ఎడమ వైపున దిగువగా అడవిలోకి వెళ్ళే ఓ బాట వుంది.
రాజీవ్ గాంధీ, కారు దిగి జేబులోనుంచి ఓ మ్యాప్ తీసి చూసుకుంటూ అడవి బాట పట్టారు. ఆ వెనుకే రామారావు, వెంగళరావు, ఒకరిద్దరు భద్రతాధికారులు, నేనూ, నామాదిరిగానే హైదరాబాదు నుంచి వచ్చిన పత్రికా విలేకరి సురేందర్( ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్) అంతా ఆయన్ని అనుసరించాము. రాజీవ్ గాంధీ పదే పదే రోడ్డు దిగిపోయి పొలాలవెంట తిరిగిరావడం గమనిస్తూ వచ్చిన పోలీసులూ, ఇతర అధికారులూ రోడ్డు మీదే వుండిపోయారు.
ఆ అడవి బాటలో కొద్ది దూరం వెళ్ళిన తరవాత, 'ఇక్కడికి దగ్గరలో పలానా పల్లెటూరు వుండాలి కదా' అని అడిగారు రాజీవ్ గాంధీ మరో సారి మ్యాప్ కేసి చూస్తూ. ఖమ్మం జిల్లా ఆనుపానులన్నీ తెలిసిన వెంగళరావుకు కూడా ఈ గ్రామం గురించి తెలిసినట్టు లేదు. 'పదండి పోదాం' అంటూ రాజీవ్ కదిలారు. దూరంగా రోడ్డుపై జీపు ఆపుకుని వున్న డ్రైవర్ అదే అమ్ముమ్మగారి మనవడు, మేము ముందుకు కదలడం చూసి రివ్వున జీపు స్టార్ట్ చేసి మా దగ్గరకు వచ్చాడు. మ్యాప్ చూస్తున్న రాజీవ్ గాంధీ గభాలున ఆ జీపులో ఎక్కి కూర్చున్నారు. దాంతో, రామారావు, వెంగళరావు, సెక్యూరిటీ వాళ్ళు కూడా ఎక్కేసారు. నేనూ సురేందర్ పరిగెత్తుకుని వెళ్లి జీపు వెనుక డోరు కడ్డీపై చతికిలపడ్డాము, సెక్యూరిటీ వాళ్ళు వద్దని వారిస్తున్నా వినకుండా.
జీపు కదిలింది. డ్రైవర్ పక్కన ముందు సీట్లో రాజీవ్ గాంధీ, ఆయన వెనుక వెంగళ రావు, డ్రైవర్ వెనుక సీట్లో రామారావు, సెక్యూరిటీ వాళ్ళు, నేనూ, సురేందర్, అంత చిన్న జీపులో ఎలా ఇరుక్కుని వెళ్ళామో ఇప్పుడు తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. రాజీవ్ గాంధీ రాజకీయాలలోకి రాకముందు విమానాలు నడిపే పైలట్ గా పనిచేసారు. ఆకాశంలో కొన్ని వేల అడుగుల ఎత్తున విమానం నడుపుతూ, రాడార్ సాయంతో దిగాల్సిన ప్రదేశాన్ని గుర్తించి, నడి రాత్రయినా, పట్టపగలయినా రన్ వేపై ఖచ్చితంగా దించగలిగిన అనుభవం ఆయనకు వుంది. ఎక్కడో భద్రాచలం దగ్గర మారుమూల అరణ్య ప్రాంతంలో మ్యాప్ చూసి గ్రామాలను గుర్తించగలిగిన దక్షతను ఆ అనుభవమే ఆయనకు నేర్పి వుంటుంది.
అడవి గాలికి జీపుకు వేళ్ళాడుతున్న పాత టార్పాలిన్ పట్టాలు టపటపా కొట్టుకుంటున్నాయి. నిటారుగా పెరిగిన చెట్ల కొమ్మలు రాపాడుకుంటూ చప్పుడు చేస్తున్నాయి. నక్సల్స్ సంచరించే ప్రాంతాలలో కొత్త వ్యక్తుల రాక గురించి వారికి తెలియచెయ్యడానికి వారి సానుభూతిపరులు చెట్ల కొమ్మలను ఒకదానికి మరొకటి తాటించి చప్పుడు చెయ్యడం ద్వారా సంకేతాలు పంపుతారని చెప్పుకునేవాళ్ళు. నక్సల్స్ కు పట్టు వున్న అడవుల్లో ఇలా సంచరించడం క్షేమం కాకపోయినా, రాజీవ్ గాంధీ మాత్రం ముందుకే పోవాల్సిందని డ్రైవర్ కు సైగ చేశారు. తన పక్కన కూర్చుని సూచనలిస్తున్నది సాక్షాత్తు భారత ప్రధాన మంత్రి అన్న విషయం తెలిసికూడా మా అమ్మమ్మగారి మనమడు మాత్రం ఏమాత్రం తొట్రుపడకుండా, నిబ్బరం కోల్పోకుండా, సుశిక్షితుడయిన సైనికుడి మాదిరిగా జీపు నడపడం చూసి నివ్వెరపోవడం మా వంతయింది.
రాజీవ్ ఊహించినట్టుగానే దగ్గరలోనే ఆ లంబాడాగూడెం తారసపడింది. తీరా చూస్తె పట్టుమని పది పూరిళ్లు కూడా లేవు. రాజీవ్ గాంధీ ఎలాంటి భేషజం లేకుండా ఓ చుట్టూ గుడిసె లోకి వెళ్లి ఆ పేద కుటుంబం స్తితిగతులను ఆరా తీసారు. ఓ మూలాన మూడు రాళ్ళ పొయ్యిపై వున్న మూకుడు మీద మూత తీసి, అన్నం మెతుకులను పట్టి చూసి, ఆ పేదరాలి భుజంపై చేయి వేసి, సాయం చేయడానికి సర్కారు ఉన్నదన్న భరోసా కలిగించారు. ఆ మిట్టమధ్యాన్నం వేళ తమ ఇంటికి వచ్చిన అతిథి, దేశ ప్రధాని అన్న సంగతి ఆమెకు తెలుసో లేదో! ఇప్పటి ప్రచార యుగంలో ఈ సంఘటన జరిగి ఉన్నట్టయితే ఎంతటి ప్రాచుర్యం లభించి ఉండేదో! తర్వాత షరా మామూలే.
రాజీవ్ గాంధీ మళ్ళీ మ్యాప్ సాయంతోనే మమ్మల్నందర్నీ చేరాల్సిన చోటికి చేర్చారు.
ఒక ప్రధాని, ఒక ముఖ్య మంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి వెంట ఖమ్మం జిల్లా అడవుల్లో కలిసి తిరిగిన విశేషాలను మర్నాటి ఉదయం రేడియో వార్తల ద్వారా బయటి ప్రపంచానికి తెలియచెప్పడానికి, మట్టికొట్టుకుపోయిన దుస్తులతో తెల్లారేసరికల్లా భద్రాచలం చేరడం అదో కధ.
20, మే 2022, శుక్రవారం
అంతులేని టీవీ చర్చలు భండారు శ్రీనివాసరావు
(పొద్దున్నే టీవీ చర్చలు చూసిన నిర్వేదంలో)
పాలక పక్షం ఒక
విధానం ప్రకటిస్తుంది. ప్రతిపక్షం అందులో వున్న మంచిని పక్కనబెట్టి, కోడి గుడ్డు మీద
ఈకలు పీకిన చందంగా దాని వెనుక ఏదో పైకి కనిపించని రాజకీయ వ్యూహం వుందని
ఆరోపిస్తుంది.
ప్రతిపక్షం ఒక
ఆరోపణ చేస్తుంది. పాలక పక్షం అందులోని హేతుబద్ధత పట్టించుకోకుండా అదంతా రాజకీయ
కుట్ర అంటూ ఒక్క ముక్కలో కొట్టి పారేస్తుంది.
చెడిపోయిన గడియారం
సయితం రోజులో రెండు మార్లు సరయిన టైము చూపిస్తుంది. అలాగే ప్రభుత్వాలు చేసే
నిర్ణయాలు అన్నీ సరైనవి కాకపోవచ్చు కానీ వాటిలో కొన్నయినా జన హితంకోసం చేసినవి
వుంటాయి. కానీ ప్రతిపక్షాలు వాటిని గుర్తించవు. అభినందించవు.
ప్రతిపక్షాలు చేసే
ఆరోపణలన్నీ నూటికి నూరుశాతం ఆధారరహితం కాకపోవచ్చు. వాటిల్లో కొన్నయినా సహేతుకమైనవి
కావచ్చు. కానీ అంగీకరించడానికి పాలకపక్షాలు సంసిద్ధంగా వుండవు.
కారణం ఒక్కటే. 'రాజకీయం'.
ఇక్కడే ప్రజాసంఘాల
పాత్ర వస్తుంది. రాజకీయ పార్టీలు తమ తప్పుల్ని ఎలాగూ ఒప్పుకోవు. వాటిని ఒప్పించేలా
చేయగలిగే సత్తావున్న ప్రజాసంఘాలు ఈనాడు లేవు. పత్రికలు, మీడియా ఈ పాత్ర
పోషిస్తున్నాయి. కానీ, రాజకీయ మరకలు పడి, వాటి విశ్లేషణలకు, అభిప్రాయాలకు, సూచనలకు, సలహాలకు ఒకనాడు వున్న గుర్తింపు మసకబారి పోతోంది.
ఈ దుస్తితి
తప్పాలంటే సమస్యతో సంబంధం వున్న అందరూ ఒక మెట్టు దిగాలి. ముందు వినడం
నేర్చుకోవాలి. విన్నదాన్ని విశ్లేషించుకోవాలి. ప్రతి అంశాన్ని రాజకీయం చేయకూడదు.
మంచిని మంచిగా చూడగలిగి, చెడును చెడుగా చెప్పగలిగే ధైర్యం అలవరచుకోవాలి.
ఇది సాధ్యమా అని
ప్రశ్నించుకుంటే సాధ్యం కాదు.
సాధ్యమే అని
నిశ్చయించుకుంటే అసాధ్యం కాదు.
(20-05-20)
నిర్వచనోత్తర రామాయణం – భండారు శ్రీనివాసరావు
సదస్సు
ఒకడి మనస్సులో వున్న అయోమయాన్ని
హాజరయిన అందరికీ, పెంచి మరీ పంచే వేదిక
రాజీ
వున్న ఒక్కకేకునూ అందరికీ పంచి, ప్రతి ఒక్కరూ తమకే పెద్ద ముక్క దొరికిందని సంతోషపడేలా
చేయడం.
కన్నీరు
ఆడదాని కంట్లో నుంచి వచ్చే ఆ కన్నీటి
వేగం ముందు ఎంతటి బలవంతుడయిన మగవాడయినా
నీరు కారిపోక తప్పదు అని నిరూపించే ప్రబల శక్తి
నిఘంటువు
వివాహం కన్నా విడాకులు అనే పదం ముందు
కనపడే పుస్తకం
గోష్టి
ఒకరి మాట మరొకరు వినిపించుకోకుండా
ఆఖర్న ఒకరితో ఒకరు విభేదించే మహత్తర కార్యక్రమం.
గొప్ప పుస్తకం
అందరూ మెచ్చుకునేది, ఎవరూ చదవందీ.
చిరునవ్వు
పైకి మెలికలాగా కనిపించినా, వంకర తిరిగినవాటిని కూడా సాపు చేయగల అద్భుత సాధనం
ఆఫీసు
ఇంట్లో పడ్డ శ్రమ అంతా మర్చిపోయి బడలిక
తీర్చుకునే ఆహ్లాదకరమైన ప్రదేశం
ఆవులింత
భార్య ముందు నోరు తెరవడానికి మగవాడికి
దొరికే అరుదైన అవకాశం
ఎట్సెట్రా
ఏవీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు
బుకాయించే పదం
కమిటీ
విడివిడిగా ఎవరికి వారు ఏమీ చేయలేని మనుషులందరూ ఒక చోట కలిసి ఏమీ చేయలేమని
కలిసికట్టుగా తీర్మానించే సంఘం
అనుభవం
తాము చేసే పొరబాట్లకు మనుషులు పెట్టుకున్న ముద్దుపేరు
17, మే 2022, మంగళవారం
అదృష్టం అంటే - భండారు శ్రీనివాసరావు
ఓసారి ముళ్ళపూడి వారు రాసారు. అదృష్టం అంటే ఎవడో కొన్న లాటరీ టిక్కెట్టును వాడు మన జేబులో పెట్టి మరిచిపోయి వెడితే, దానికి మొదటి బహుమతి తగలడం అని. మనం రూపాయో, అర్ధో పెట్టి టిక్కెట్టు కొంటే లాటరీ తగలడం అదృష్టం కాదని ముళ్ళపూడి వారి చమత్కారం.
ప్రతి ప్రభుత్వానికీ అనుసరణీయం గడప గడపకు కార్యక్రమం - భండారు శ్రీనివాసరావు
గడప గడపలో నిరసనలు వెల్లువెత్తినా సరే, గడప గడపకు అనే కార్యక్రమం చాలా మంచి నిర్ణయం. టీవీ చర్చల్లో వెలువడే విమర్శలకు రాజకీయ రంగు ఉండవచ్చు కానీ ఈ గడప గడపకు కార్యక్రమంలో వెలువడే నిరసన నిఖార్సయినది. వీటిని రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదు. కొంత రాజకీయం ఉండవచ్చు కానీ అది చాలా స్వల్పం. దీని ద్వారా లభించే ఫీడ్ బాక్ ప్రభుత్వానికి చాలా మేలు చేస్తుంది. ఉపకరిస్తుంది కూడా. ప్రజలకు కావాల్సినవి ఇస్తున్నామా లేక ప్రజలకు అనవసరమైనవి పంచి పెడుతున్నామా అనేది తెలిసి వస్తుంది. ఏ పధకం ఎలా అమలవుతోంది, ఏ పధకం అమల్లో విఫలం అవుతోంది అనే విషయాలు వాస్తవ రూపంలో తెలుస్తాయి. రాజకీయాలకు అతీతంగా అందరి గడపలకు కూడా వెడితే పాలక పక్షం నేతలకు వాస్తవాలు బోధపడుతాయి. ప్రజలు తమ సమస్యలను టీవీలకు ఎక్కి అనుదినం చెప్పుకోలేరు. అలాంటి వారికి ఇది వరప్రసాదం. నిరసన తెలిపినా, నిలదీసినా ఆ హక్కు ప్రజలకే వుంటుంది. ఇలాంటి వాటికి నెగెటివ్ ప్రచారం ఎలాగు వుంటుంది. అయితే పొరబాట్లు సరిదిద్దుకునే మహత్తర అవకాశం ప్రభుత్వానికి ముందుగా లభిస్తుంది. నిఘా వర్గాలు కూడా ఇటువంటి గ్రౌండ్ లెవెల్ పరిస్థితిని అంచనా వేయలేవు. వేసినా అరకొర సమాచారమే ప్రభుత్వానికి చేరుతుంది. ప్రజల నాడి యధాతధంగా పట్టుకోవడానికి ప్రభుత్వం చేతిలో ఉన్న ఏకైక కొలమానం ఈ గడప గడపకు కార్యక్రమం. అంతా సజావుగా వుంది అనే భ్రమలు ఏమైనా వుంటే అవి తొలగడానికి ఈ కార్యక్రమం పనికి వస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గరకు నేతలు పోవడం అనేది ఆ నాయకులకే ప్రయోజనం. ప్రజలు నిరసన తెలిపినా దానిని ఆ స్థాయిలోనే అదుపు చేయడానికి, అది అసహనంగా మారి ఆగ్రహంగా పరిణమించకుండా జాగ్రత్త పడడానికి నాయకులకు ఇదొక ఆయుధంగా ఉపయోగపడుతుంది. నిరసనలకు కారణం ప్రత్యర్థుల ప్రేరేపణ అని ఎదురుదాడికి దిగడం కన్నా వాటిని సానుకూలంగా మార్చుకోవడంలోనే నాయకుల ప్రతిభ, పరిణతి వెలుగు చూస్తుంది.
తప్పులు
దొర్లడం తప్పుకాదు. ఆ తప్పులను దిద్దుకోవడం ఉత్తమ లక్షణం. కాబట్టి ఈ గడప గడపకు
కార్యక్రమాన్ని ఏదో తూతూ మంత్రంగా కాకుండా ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో చేస్తే ఇటు
ప్రజలకు మంచిది, అటు
ప్రభుత్వానికి మంచిది.
కేంద్రంతో
సహా, దేశంలోని
అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల దృష్టిలో తమ స్థానం ఏమిటన్నది తెలుసుకోవాలంటే
ఇలాంటి కార్యక్రమాలకు పూనుకోవాలి.
(17-05-2022)