28, జూన్ 2026, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (335) : భండారు శ్రీనివాసరావు

 సింహం తల, మనిషి రూపం ఏమిటి ఇందులో పరమార్థం?

 

మీ అన్నయ్య (కీర్తిశేషులు పర్వతాలరావు గారు) పుట్టపర్తిలో ఉంటున్నాడట కదా! ఏం చేస్తున్నాడు?”  మాజీ ప్రధానమంత్రిగా హైదరాబాదు వచ్చినప్పుడు శ్రీ పీవీ నరసింహారావు గారు నన్నడిగిన ప్రశ్న.

నరసింహావతారం గురించి పుస్తకాలు రాస్తున్నాడు’

అలా అయితే నేనడిగానని చెప్పు. మనిషి శారీరకంగా సింహం కంటే బలహీనుడు. ఆ అవతారంలో సింహం తలా, మనిషి శరీరం ఏమిటో రాయమని చెప్పు’

నమస్కారం పెట్టి వచ్చేశాము.

 

పీవీ గారి సందేహానికి, మా అన్నయ్య తాను రాసిన ఓం నమో శ్రీ నారసింహాయ అనే  పుస్తకంలో చాలా పెద్ద వివరణే ఇచ్చారు.

ఓపిక ఉన్న వారు చదువుకోవడానికి పూర్తి పాఠం ఇస్తున్నాను.

 

హిరణ్యకశిపుడు స్వతహాగా మహాబలుడు. దానికి తోడు తపశ్శక్తితో పొందిన వరాలు. అతడిని చంపేందుకు వెళ్ళే విష్ణువు నరసింహ మిశ్రమ రూపం ధరించాల్సి వుంటుంది. అలాంటప్పుడు రెంటిలోనూ గల బలమైన అంశాలనే స్వీకరించాల్సి వుంటుంది. నరుని మేధ సింహపు మేధ కన్నా చురుకు. సింహపు శరీరం నరుడి దేహం కన్నా బలమైనది. కనుక నరుని తల, సింహపు శరీరం కలిస్తే రెండు బలమైన అంశాలను స్వీకరించినట్టు అయ్యేది. కాని విష్ణువు ఈ అవతారానికి సింహపు తల, మనిషి శరీరం ఎన్నుకున్నాడు. రెండు బలహీనమైన అంశాల మిశ్రమం అది. మరి విష్ణువు అలా ఎందుకు చేశాడు? కొందరు కరాటే ఉదాహరణ చెప్పారు. కరాటేలో చేయి బలహీనంగా వుండడంకన్నా ఆ చేయిని ప్రయోగించడంలో చూపే వేగం, గురి, ఏకాగ్రత ప్రధానం. కనుక బలహీనమైన శరీరాన్ని ఎన్నుకున్నా ఇబ్బంది లేదని వారి అభిప్రాయం. అలా అనుకున్నా అట్టి ఏకాగ్రత నరుని మేధ సాధించినట్టు సింహపు మెదడు సాధించగలదా! మానసిక పటుత్వాన్ని సాధించడం నరునికే సాధ్యం కాని సింహానికి కాదు. జంతువు కావాలంటే సింహమే ఎందుకు? జిత్తులమారి నక్క తల అయితే ఇంకా ఎక్కువ ప్రయోజనకారిగా వుండేదేమో! మరి స్వామి సింహపు తలనే ఎందుకు ఎన్నుకున్నట్టు!

హిరణ్యకశిపుడు యావత్ ప్రకృతిని తన కనుసన్నలలోకి తెచ్చుకున్నాడు. అసలు హిరణ్యకశిపుడు అంటే అర్ధం ఏమిటి? కళాప్రపూర్ణ వేదుల సూర్యనారాయణ శర్మగారీ విషయాన్ని తమ ‘అంతరార్ద భాగవతం’ లో చెప్పారు. హిరణ్యం అంటే ప్రకృతి (బంగారం కూడా). కశిపుడు అంటే హింసించేవాడు. ప్రకృతిని తన దోవన పోనీయకుండా, తాను చెప్పిన దోవనే అది నడవాలని కట్టడి చేసినవాడు. ప్రకృతిని అలా నిర్బంధించడమే హింస. ఆ రాక్షసుడి కట్టడిలో ప్రకృతి విలవిలలాడిపోయింది.

అస్మదీయంబగు నాదేశమున గాని

మిక్కిలి రవి మింట మెరయ వెరచు’

అని ప్రగల్భాలు పలికిన వాడు ఆ రాక్షస రాజు.

అలాగే ఇంద్రుడు, యముడు, అగ్ని, వాయువు అంతా గడగడలాడారు.

పృధు చక్రవర్తి కాలంలో కూడా ప్రకృతి అన్నివిధాల ఆయనకు అనుకూలంగా నడిచింది. దున్నకుండానే పంటలు పండేవి. పృధువు పట్ల భక్తీ గౌరవం వల్లనే కాని చండశాసనుడు అనే భయంతో కాదు. రెంటికీ ఎంత తేడా! నియంతృత్వానికి, ఆదర్శ ప్రజాస్వామ్యానికి ఉన్నంత తేడా.

అలా ప్రకృతిని తన కనుసన్నల్లో పెట్టుకోవడం ఎందుకు? ఇంద్రియ సుఖాలను అనుభవించడానికే. ప్రకృతి అందరికీ అవసరమైన మేరకు ఇస్తుంది. కానీ ఆశ పడ్డంత కాదని గాంధీజీ చెప్పారు.

నరసింహావతారంలో విష్ణువుకి మనిషి తల పనికి రాకపోవడానికి ఈ ఆబే (అత్యాశే) కారణం. మనిషికి ‘ఆశాపాశము తా కడున్ నిడుపులేదంతంబు’. అట్టి ఆశలమారి మేధ ఆబను, కక్కుర్తిని మరింత పెంచుతుంది. తృప్తి చెందదు. సింహం అలా కాదు. అది మృగరాజు. దానికి లేకితనం, పేరాశ లేవు. ఏ పూటకు ఎంత అవసరమో ఆ పూటకు అంతే వేటాడి సంపాదించుకుంటుంది. ఆ పైన దాచుకోవడం ఎరగదు. రేపు మాపు అన్న చింత దానికి లేదు. అన్ని జంతువులూ అలా కాదు. పులీ, చిరుతపులి కూడా వేటాడిన జంతువును దాచుకుని తింటాయి. సింహానికి అది పనికిరాదు. తన కడుపు నిండితే పక్క నుంచి పోయే జంతువులను కూడా అది పట్టించుకోదు. రేపుతో లంకె పెట్టుకోని తత్వం. ఆధ్యాత్మికంగా చూసినప్పుడు అంతకన్నా నిస్సంగత్వం లేదు. ఇలాంటి తత్వం సమాజానికి ఎంతో అవసరం. అట్టి సంస్కృతి వుంటే ప్రస్తుత పర్యావరణం ఇంత దెబ్బ తినేది కాదు. అనేక పక్షి, జంతుజాలాలు అంతరించిపోయేవి కావు. మనిషిలో ఆబ పెరగడం వల్లనే ఈ వినాశనమంతా.

అట్టి ఆబ (GREED) లేని సింహం తలను స్వామి ఎంచుకోవడం హిరణ్యకశిపుని ఆబ (GREED) కు వ్యతిరేకంగా వుండే సమాజాన్ని ఆవిష్కరించడం కోసమే. మనిషి శరీరాన్ని ఎంచుకున్నా దాని బలహీనత వల్ల స్వామికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. స్వామిది సంకల్పబలం. నిజానికి తాను ఎలాంటి చావు చావాలో హిరణ్యకశిపుడే కోరుకున్నట్లయింది. అతడు కోరిన కోర్కెలే, అతడు పెట్టిన నిబంధనలే అతడిని సంహరించే వ్యక్తి ఎలా ఉండాలో, ఏ సమయంలో ఎక్కడ ఎలా అతడిని చంపాలో నిర్దేశించాయి”

 

ఈ వివరణ ఇచ్చిన మా అన్నయ్య పర్వతాలరావు గారు, ఈ వివరణ కోరిన శ్రీ పీవీ నరసింహారావు గారు ఇప్పుడు మన మధ్య లేరు.

నా చేత ఇవి రాయించడానికే, ఆ నారసింహుడు, వారిని తన సన్నిధికి చేర్చుకున్నారేమో! 

అంతా భగవత్ సంకల్పం.

 

కింది ఫోటో:

రాస్తూ మా అన్నయ్య, చూస్తూ నేను. పక్కన వున్నది, మా మేనకోడలి భర్త, రిటైర్డ్ ఐ.జి. రావులపాటి సీతారామా రావు గారు, మా రెండో అన్నయ్య స్టేట్ బాంక్ రిటైర్డ్ చీఫ్ జనరల్ మేనేజర్  భండారు రామచంద్ర రావు గారు.



అయాం ఎ బిగ్ జీరో (334) : భండారు శ్రీనివాసరావు


పీవీ గారి రెండు కోర్కెలు
మరణించడానికి కొన్ని నెలల ముందు, శ్రీ పీవీ నరసింహారావు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్ లో బస చేసారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు కనబడే హడావిడి యెలా వుండేదో ఒక విలేకరిగా నాకు తెలుసు. ఆయన చుట్టూనే కాదు చుట్టుపక్కల ఎక్కడ చూసినా అధికారులు, అనధికారులు, మందీ మార్బలాలు, వందిమాగధులు, ఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయనాయకులు, ఆ వైభోగం వర్ణించ తరమా? అన్నట్టు వుండేది.
నేనూ , ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్ ఆర్వీవీ కృష్ణారావు గారు, గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం వెళ్లి, ఆ పని పూర్తిచేసుకున్నతరవాత, రాజ్ భవన్ గెస్ట్ హౌస్ మీదుగా తిరిగి వెడుతూ అటువైపు తొంగి చూసాము. సెక్యూరిటీ మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడంతో మేము లోపలకు వెళ్ళాము. ‘పీవీ గారిని చూడడం వీలుపడుతుందా’ అని అక్కడవున్న భద్రతాదికారిని అడిగాము. అతడు తాపీగా 'లోపలకు వెళ్ళండి' అన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూ లోపలకు అడుగు పెట్టాము.
పెట్టిన తరవాత, మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే కూర్చుని టీవీలో ఫుట్ బాల్ మాచ్ చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేశామేమో అన్న ఫీలింగుతోనే, మమ్మల్ని పరిచయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు నా వైపు చూస్తూ, 'మీ అన్నయ్య పర్వతాలరావు ఎలావున్నాడయ్యా !' అని అడిగేసరికి నాకు మతి పోయినంత పనయింది.
ఎప్పుడో దశాబ్దాల క్రితం, పీవీగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, రాష్ట్ర సమాచార శాఖలో పనిచేస్తున్న మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు ఆయనకు పీఆర్వో గా కొద్దికాలం పనిచేశారు. అసలు పీవీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అప్పటి విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ పీవీగారి గొప్పతనం.
ఆ తరవాత కూడా ఆయన ఏదో మాట్లాడుతున్నారు కానీ మాకు ‘కలయో వైష్ణవ మాయయో’ అన్నట్టుగావుంది. మేము కలసి కూర్చుంది, కొన్నేళ్ళ క్రితం వరకు దేశాన్ని వొంటి చేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ వుండడం వల్ల, కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరవాత, కొణిజేటి రోశయ్య గారు వచ్చారు. ఆయన్ని చూడగానే పీవీ గారి మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది. రోశయ్య గారు వచ్చిన తరువాత కాసేపు వుండి మేము వచ్చేశాము.
అంతకుముందు పీవీ గారిని మరోసారి ఢిల్లీలో కలిసాను. రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెడుతూ అప్పుడు కేంద్రమంత్రిగా అత్యంత ఉచ్ఛస్థానంలో వున్న పీవీ గారిని కలుద్దామని వెళ్లాను. బంగ్లా అంతటా నిశ్శబ్ధం. కాసేపటి తరువాత ఎవరో అటుగా వస్తే, 'పీవీ గారిని కలవడానికి వీలుంటుందా' అని హిందీలో అడిగాను. అతగాడు బంగ్లాలో ఓ గది చూపించి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా తలుపు తోసి చూస్తే ఎదురుగా పీవీ గారు. ఎవ్వరూ లేరు. పరిచయం చేసుకుని మాస్కో వెడుతున్నట్టు చెప్పాను. అప్పుడు ఆయన విదేశాంగ మంత్రి అనుకుంటాను. నా మొహంలో భావాలు పసికట్టినట్టున్నారు.
'పనులు చేసి పెడుతూ వుంటే కదా పదిమంది వచ్చేది' అన్నారు ఆయన తన మొహంలో భావాలు ఏమీ తెలియకుండా.
'మాస్కో ఎందుకయ్యా వేరే దేశంలో మీ రేడియో ఉద్యోగాలు లేవా ? బాగా చలిదేశం. పెళ్ళాం పిల్లలతో ఎలావుంటావు' అని అడిగారు. చాలా ముక్తసరిగా మాట్లాడేవారని పేరున్న పీవీ గారు, నేను వూహించని విధంగా చనువుగా ఆ రెండు ముక్కలు మాట్లాడ్డం నా అదృష్టం అనే భావిస్తాను.
పీవీ గారు మాజీ ప్రధానమంత్రిగా పాల్గొన్న ఒక సదస్సు హైదరాబాదులోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో జరిగింది.
మధ్యాన్నం భోజన విరామ సమయంలో విలేకరులు ఒక్కొక్కరుగా కలుస్తున్నారు. ఆలిండియా రేడియో ప్రాంతీయ విభాగంలో పనిచేసే ఆర్వీవీ కృష్ణారావు గారు నేనూ కాస్త వెనగ్గా నిలబడివున్నాం.
చివరికి ఆయనే మమ్మల్ని దగ్గరకు పిలిచారు.
‘ఏమయ్యా కృష్ణారావూ. ఢిల్లీలో పద్మనాభరావుకి కూడా చెప్పాను. ఏవయ్యా నా టేపులు?”
పీవీ గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తెలుగులో అనేక రేడియో ప్రసంగాలు చేశారు. వాటిని గురించి చేసిన వాకబు ఇది.
కృష్ణారావు గారు ఏదో చెప్పారు.
ఆయన నా వైపు తిరిగారు.
‘మీ అన్నయ్య (కీర్తిశేషులు పర్వతాలరావు గారు) పుట్టపర్తిలో ఉంటున్నాడట కదా! ఏం చేస్తున్నాడు?”
‘నరసింహావతారం గురించి పుస్తకాలు రాస్తున్నాడు’
‘అలా అయితే నేనడిగానని చెప్పు. మనిషి శారీరకంగా సింహం కంటే బలహీనుడు. ఆ అవతారంలో సింహం తలా, మనిషి శరీరం ఏమిటో రాయమని చెప్పు’
నమస్కారం పెట్టి మేము వచ్చేశాము.
పీవీ నరసింహారావు గారు ప్రధానమంత్రిగా వున్న రోజుల్లో ఓ ఏడాది ప్రముఖ కవి కాళోజీ నారాయణ రావు గారిని పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించాలని అనుకున్నారు. ప్రధానే స్వయంగా నిర్ణయిస్తే అడ్డేముంటుంది? కానీ ఆ ఆటంకం ఏమిటో పీవీ గారికే బాగా తెలుసు. తీరా ప్రకటించిన తర్వాత కాళన్న కాదంటే.
వరంగల్ జిల్లా ఎస్పీకి వర్తమానం వెళ్ళింది. వాళ్ళు విచారిస్తే కాళోజీ ఆ సమయానికి కమ్యూనికేషన్ సౌకర్యం లేని వూళ్ళో తిరుగుతున్నారు. ఓ పోలీసు అధికారి వెళ్లి ఆయన్ని పోలీసు స్టేషన్ కు రమ్మన్నారు.
కాళోజీకి పోలీసులు, పోలీసు పిలుపులు కొత్తేమీ కాదు. పదమంటూ పోలీసు వెంట బయలుదేరి వెళ్ళారు.
‘వచ్చారా! పీఎం గారు మీతో మాట్లాడతారట వుండండి’ అంటూ ఢిల్లీకి ఫోన్ లైన్ కలిపారు. పీవీ లైన్లోకి వచ్చారు. కాళోజీ గారితో కాసేపు పిచ్చాపాటీ మాట్లాడారు.
చివర్లో పీవీ ఇలా అన్నారు.
“కాళన్నా! నేనొకటి అడుగుతాను, నువ్వు కాదనుకుండా ఒప్పుకోవాలి”
‘అదేమిటో చెప్పు’ అన్నారు కాళోజీ.
‘అందుకే ముందే మాట ఇమ్మంటున్నాను. నువ్వు ఒప్పుకోవాలి అంతే!’ అన్నారు పీవీ.
‘...........’
‘నీకు ఈసారి పద్మ విభూషణ్ ఇవ్వాలని నా కోరిక. నువ్వు కాదు అనరాదు’ అన్నారు పీవీ.
‘..........’
‘కాళన్నా! నువ్వు సమ్మతి సమ్మతి సమ్మతి అని మూడు సార్లు చెబితేనే కానీ నేను ఒప్పుకోను’
‘అయితే. నేను చెప్పేది కూడా విను. నాకేదో బిరుదు ఇచ్చారని సర్కారుపై నా విమర్శలు ఆపేది లేదు. ఇది గుర్తుంచుకో’ అన్నారు కాళోజి విస్పష్టంగా.
తర్వాత ఎప్పుడో హైదరాబాదులో జరిగిన కాళోజి సత్కారసభకు నేనూ, జ్వాలా వెళ్ళాము. ఆ సభలో మాట్లాడుతూ ప్రధాన మంత్రి శ్రీ పీవీ నరసింహారావు ఈ విషయాలు స్వయంగా గుర్తు చేసుకున్నారు.

https://epaper.sakshi.com/article/Hyderabad_Main?OrgId=286891f7fa8&eid=123&imageview=1&standalone=1&device=desktop&fbclid=IwY2xjawStpmRleHRuA2FlbQIxMQBzcnRjBmFwcF9pZBAyMjIwMzkxNzg4MjAwODkyAAEeuKtCPCPIE7_QoD5_cZPZPFFJqCxujdXlSDx0c5qXgmXtSXmR632vWfPmUK8_aem_uqdquF0r9hzTLwLy3E0LPw

(జూన్, 28, పీవీ గారి జయంతి సందర్బంగా ఈరోజు సాక్షి దినపత్రికలో ప్రచురితం)
(ఇంకా వుంది)

26, జూన్ 2026, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో : (333) – భండారు శ్రీనివాసరావు

 

ఓం నమో శ్రీ నారసింహాయ
ఒక పుస్తకం చదువుతాం. మంచి పుస్తకం చదివాము అనిపిస్తే రచయితకు అభినందనలు తెలియచేయాలని ప్రయత్నిస్తాం. కుదరక పొతే చదివిన ఆ పుస్తకం గురించి మనకు తెలిసిన నలుగురితో చెప్పుకుంటాం. కుదిరితే ఫేస్ బుక్ లో నాలుగు మంచి వాక్యాలు రాస్తాం.
కానీ సత్యానందంగారి రూటే సపరేటు.
ఆయన గారు పూర్వాశ్రమంలో ఓ బ్యాంకు ఉద్యోగి. బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే అగ్రశ్రేణి బ్యాంకులో చాలా కాలం పనిచేసి ప్రస్తుతం రామా కృష్ణా అంటూ కాలక్షేపం చేస్తున్నారు. నిజంగానే సుమా. ప్రతి నిత్యం రాముడి గుడికి వెడతారు. సజ్జన సాంగత్యంలో పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలో శేష జీవితం గడుపుతున్నారు.
ఒకరోజు ఓ పుస్తకం ఆయన కంటపడింది. చదివారు. మళ్ళీ చదివారు. తీరిక వున్నప్పుడు కొన్ని సార్లు, తీరిక చేసుకుని చాలా సార్లు ఆ పుస్తకాన్ని పదే పదే చదివారు. అదే పనిగా అనేక సార్లు చదివారు. తనకు నచ్చిన ఆ పుస్తకాన్ని ఇంట్లో వారి చేత చదివించారు. తెలిసిన వారికి ఇచ్చి చదివించారు.
ఇక ఇది పని కాదనుకున్నారు. ఆ పుస్తకాన్ని పునర్ ముద్రించి నలుగురికీ లభ్యం అయ్యేలా చూడాలని సంకల్పించారు.
ఆయనేమీ బ్యాంకులో డబ్బులు మూల్గుతున్న సంపన్నులు కారు. అతి సాధారణ జీవితం గడుపుతున్న అతి మామూలు వ్యక్తి.
అయితేనేం ఆయన సంకల్ప బలం గొప్పది. సంకల్ప ముహూర్తం అంతకన్నా గొప్పది. అందుకే ఆయన సంకల్పం సిద్ధించింది. ఆ పుస్తకం అచ్చు గుద్దినట్టు పాత పుస్తకమే కొత్త రూపంలో బయటకు వచ్చింది.
ఆ పుస్తకం పేరు ఓం నమో శ్రీ నారసింహాయ
ఆ పుస్తక రచయిత మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాల రావు గారు.
ఆధ్యాత్మికత ఉట్టిపడే సైదాబాదు రామాలయం ఆవరణలో, స్వామివారు శ్రీరామచంద్ర మూర్తి సన్నిధిలో, నాలుగేళ్ల క్రితం, 2022 లో ఒక రోజున, భారత ప్రభుత్వంలో విజిలెన్స్ కమిషనర్ వంటి అత్యున్నత పదవిని నిర్వహించిన శ్రీమతి రంజనా కుమార్ చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ జరిగింది.
(విచిత్రం ఏమిటంటే ఈ పుస్తకం ఏడు సంపుటాలు వెలువడినప్పుడు కూడా ఎలాంటి ఆవిష్కరణ జరగలేదు. మా అన్నగారు పర్వతాల రావు గారు, రాష్ట్రంలోని ప్రధానమైన నారసింహ క్షేత్రాలను దర్శించి ఆ పుస్తకాలను భక్తులకు ఉచిత పంపిణీ నిమిత్తం ఆయా దేవాలయాలకే సమర్పించారు)
రంజనా కుమార్ తమ వయసును కూడా లెక్క చేయకుండా ఈ కార్యక్రమానికి వచ్చి ఆసాంతం వుండి పోయారు. ఆమె గతంలో ఇండియన్ బ్యాంక్ చైర్మన్, నాబార్డ్ చైర్మన్ వంటి ఉన్నతోద్యోగాలు చేసే ముందు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చేశారు. తెలుగు కొంచెం కొంచెం తెలిసిన కాశ్మీరీ.
పుస్తకం చదివారో, లేదా ఎవరిచేతనయినా చదివించుకుని తెలుసుకున్నారో కానీ రంజనా కుమార్ గారు అద్భుత ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. పుస్తకం గురించి కన్నా, రాసిన రచయిత ప్రస్తావన ఎక్కువ ఉండేలా జరిగిన ప్రసంగాలను ఈ ఆవిష్కరణ సభలో విన్నాను. అంతటి పెద్ద మనిషికి చిన్న తమ్ముడిని అయినందుకు మరోమారు గర్వపడ్డాను.
మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు గారు చెన్నై స్టేట్ బ్యాంక్ సీ.జీ.ఎం. గా వున్నప్పుడు ఇండియన్ బ్యాంక్ చైర్మన్ గా శ్రీమతి రంజనాకుమార్ పనిచేశారు. అంచేత వారిద్దరికీ పూర్వ పరిచయం కొంత వుంది. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత కలుసుకున్నప్పుడు వారిద్దరూ పాత విషయాలను మననం చేసుకున్నారు.
పర్వతాల రావు గారి పుత్రుడు రాఘవరావు, అతడి కుమారుడు పరాశర, ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీమాన్ శ్రీనివాసాచారి, రామాలయ కమిటీ చైర్మన్ శ్రీ నరసింహా రెడ్డి, అప్పటి స్థానిక కార్పొరేటర్ శ్రీమతి అరుణారెడ్డి, సత్యానందం గారితో సహా అనేకమంది బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ అధికారులు, కాలనీ వాసులు అనేకమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తోకటపా:
ఓం శ్రీ నమో నారసింహాయ పుస్తకం చదివిన మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు గారికి ఒక సందేహం కలిగింది. అది స్వయంగా నాతోనే చెప్పారు. మీ అన్నయ్యను అడిగి చెప్పు అని కూడా అన్నారు. ఈ విషయం గురించి మరో సారి.



(ఇంకా వుంది)

అయాం ఎ బిగ్ జీరో (332) : భండారు శ్రీనివాసరావు

 

వెంకయ్య నాయకుడు
డెబ్బయ్ ఏళ్ళు దాటిన తర్వాత మన తరానికి చెందిన పరిచయస్తులను కలుస్తూ వుంటే శారీరక, మానసిక ఆరోగ్యాలకు మంచిదని ఎక్కడో చదివాను. అందుకే ఈ మధ్య హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో కొత్తగా మొదలయిన శుక్రవారం ములాఖత్ లకు క్రమం తప్పకుండా వెడుతున్నాను.
పాత్రికేయ మిత్రుడు Maa Sarma మా శర్మ గారు ‘వెంకయ్య నాయకుడు’ అనే పేరుతొ, పూర్వ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు గారి గురించి రాసిన జీవిత చరిత్ర పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమానికి నిన్న వెళ్లాను. రాజకీయ అతిరథ మహారధులతో సభామందిరం కళకళలాడుతోంది.
చాలాకాలంగా నేను కలవని, చాలా కాలం క్రితం దాదాపు రోజూ కలుస్తూ వచ్చిన అనేకమంది రాజకీయ ప్రముఖులను తిరిగి కలిసే అవకాశం నాకు దొరికింది.
ఉదాహరణకు ఇంద్రసేనారెడ్డి గారు. ఆయన మలక్ పేట శాసన సభ్యుడిగా వున్నప్పుడు అత్యంత సన్నిహితంగా మెలిగిన వాడిని.
అసెంబ్లీ అయిపోయిన తర్వాత రద్దీగా వున్న రోడ్డు దాటి ఎదురుగా వున్న రేడియో స్టేషన్ కు వెళ్లడం ఎల్లా అని గుంజాటనలో వున్నప్పుడు ఇంద్రసేనా రెడ్డి గారు నన్ను తన వాహనంలో ఎక్కించుకుని న్యూస్ యూనిట్ లో వదిలి వెళ్ళేవారు. ఇలా చాలా సార్లు జరిగింది. 1987 లో మాస్కో వెళ్ళే ముందు ఒకసారి కలిసాను. అంతే! 39 ఏళ్ళ తరవాత మళ్ళీ నిన్ననే కలవడం. ఆయనలో ఏ మార్పు లేదు, ఆప్యాయంగా అదే పలకరింపు. గవర్నర్ పదవిలో వుంటూ కూడా అదే నిరాడంబరమైన జీవనశైలి. పలకరించడమే కాదు, పక్కన కూర్చోబెట్టుకుని చాలా సేపు పాత సంగతులు మాట్లాడారు.
ఆ పక్కనే మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు. వీరి సంగతి చెప్పక్కర లేదు. వారు వీరని తారతమ్యం లేదు. అందరి వాడు. తాను రాసుకున్న తన జీవిత చరిత్ర పుస్తకాన్ని గుర్తు పెట్టుకుని మా ఇంటికి పంపించారు. వీరిని మధ్య మధ్య కలిసే అవకాశాలు చాలా వచ్చాయి. అలాగే తరచుగా కలిసే అవకాశాలు వున్న మరో నాయకుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి గారు.
పొతే, వై. సత్యకుమార్ గారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ వైద్య శాఖ మంత్రి. పూర్వాశ్రమంలో వెంకయ్య నాయుడు గారు కేంద్ర మంత్రిగా, సాక్షాత్తు మా రేడియో శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు వారి ద్వారా వీరి పరిచయం. ఆ రోజుల్లో వారం వారం వెంకయ్య నాయుడి గారితో పాటు, తరచుగా హైదరాబాదు వచ్చేవారు. వీరిని కలవక ఏండ్లూ పూండ్లు గడిచిపోయాయి. నిన్న వెళ్లి కలవగానే గుర్తుపట్టి పలకరించారు. అప్పటి ఫోన్ నెంబరు కూడా మారినట్టు లేదు.
ఈలోగా ఒడిసా గవర్నర్ కంభంపాటి హరిబాబు గారి ఆత్మీయ పలకరింపు. ఆరు మాసాల క్రితమే వారిని భువనేశ్వర్ రాజ్ భవన్ (ఇప్పుడు ప్రజా భవన్ అంటున్నారు) లో కలిసాను. వారి ఇంటి పేరు, మా ఊరి పేరు ఒకటే కంభంపాడు. అదో బాదరాయణ సంబంధం.
ఇక నిన్నటి కధా నాయకుడు వెంకయ్య నాయుడు గారు, ఒక చోట కూర్చోకుండా, హాలంతా కలయ తిరుగుతూ వచ్చిన ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరిస్తూ కనిపించారు. ఇది నిజంగా అపూర్వ విషయం. పరిచయస్తులని, పాత స్నేహితులను కలవడంలో ఆయన ఆనందం పొందుతారు. విద్యార్థి నాయకుడుగా ఉన్నప్పటి నుంచీ చూస్తున్నాను. ఉపరాష్ట్రపతి వంటి అత్యున్నత పదవిలో వున్నప్పుడు కూడా ఆయన ధోరణిలో, ప్రవర్తనలో, మాట తీరులో ఇసుమంత మార్పు లేదు.
తెలంగాణా బీజేపీ అధ్యక్షులు శ్రీ రామచంద్ర రావు గారు గతంలో టీవీ చర్చల్లో కలిసే వాళ్ళం. ఇప్పుడు ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షులు. కాలం గడుస్తున్నా పలకరింపుల్లో మార్పు లేకపోవడం గొప్ప విశేషం.
ఇంకా చాలామంది ఘనాపాటీలు. ఎవరు వచ్చారు అనే దానికన్నా ఎవరు రాలేదో చెప్పడం చాలా సులభం.
ఇక పూర్వ సంపాదకులు, కె. రామచంద్ర మూర్తి గారు, ఐ. వెంకట్రావు గారు, గతంలో కలిసి మెలిసి తిరిగిన పాత్రికేయ మితృలు భగీరధ, ఉడయవర్లు, కొండా లక్ష్మణ రావు ఇలా చాలామంది కలిశారు.
పుస్తక రచయిత మా శర్మ గారు వేదిక మీద వున్న కారణంగా ఆయన్ని కలవలేకపోయాను. అయినా ఇంత మందిని కలిసే అవకాశం కల్పించిన మా శర్మ గారికి వేనవేల ధన్యవాదాలు.
నాలుగున్నరకు మొదలైన కార్యక్రమం దాదాపు తొమ్మిది గంటల దాకా సాగింది.
అంచేత చివర్లో, ముందుగా బయటకు రావాల్సివచ్చింది. తరువాత బయట పడడం కష్టం. ఎందుకంటే అంతమంది వీ ఐ పీ లు వెళ్ళే దాకా చాలా సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ హడావిడిలో అసలు పుస్తకం చేతికి అందలేదు.
సభ ఎలా జరిగిందన్నది అన్ని పత్రికలు, అన్ని మాధ్యమాలు వివరంగా కవర్ చేసాయి. ఇక రాయాల్సింది పుస్తకం గురించి. అది రాయాలంటే ముందు చదవాలి. ఎలా!
కొసమెరుపు:
నిజంగా కొసమెరుపే. ఇది రాస్తున్నప్పుడు మొబైల్ మోగింది.
‘నా పేరు బండి సందీప్...’
మళ్ళీ హెచ్ పీ గ్యాస్ బాపతేమో అని సందేహపడేంతలో, అతడు అంటున్నాడు.
“వెంకయ్య నాయుడు గారి ఇంటి నుంచి వచ్చాను. మీ గుమ్మం ముందు నిలబడి వున్నాను. మీ కాలింగ్ బెల్ పనిచేయడం లేదు’
ఒక్క పెట్టున కంప్యూటర్ ముందు నుంచి లేచి వెళ్లి తలుపు తీశాను. ఎదురుగా పుస్తకం పార్సెల్ తో బండి సందీప్.
ఇలా కూడా జరుగుతుందా!
కానీ జరిగింది.



(ఇంకా వుంది)

24, జూన్ 2026, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో: (331) - భండారు శ్రీనివాసరావు

 

పేరులోనే వుంది
దాదాపు యాభయ్ ఏళ్ళ నాటి ముచ్చట.
పూర్వం కమ్యూనిస్టుల ఏలుబడిలో సోవియట్ యూనియన్ వర్ధిల్లిన కాలంలో, మాస్కో రేడియో నుంచి దాదాపు ఎనభైకి పైగా ప్రపంచ భాషల్లో వార్తా ప్రసారాలు జరిగేవి. నేను తెలుగు విభాగం బాధ్యుడిగా 1987 నుంచి అయిదేళ్లపాటు మాస్కోలో పనిచేశాను. అప్పుడు సోవియట్ అధినేత మిహాయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్.
ఇన్ని ప్రపంచ భాషలకు సంబంధించిన వార్తలను ముందు ఇంగ్లీష్ భాషలో తయారు చేసి వాటి ప్రతులను అన్ని విభాగాలకు పంపేవారు. వాటిని ఆయా భాషల నిపుణులు తమ భాషలలోకి అనువదించి ప్రసారం చేసే వాళ్ళు. నాకు సహాయకుడిగా, కొద్ది కొద్దిగా తెలుగు తెలిసిన, గీర్మన్ అనే రష్యన్ ఉండేవాడు.
‘మీరు వార్తల బులెటిన్ అసలు ప్రతి ఇస్తున్నారు సరే. మీ వార్తల్ని మీరు అనుకున్నట్టు యధాతధంగా అనువదిస్తున్నామా లేదా అనే సంగతి మీకెలా తెలుస్తుంది’ అని అడిగాను, ఓసారి. దానికి ఆయన చెప్పిన సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది.
‘ప్రతి వార్తలో దాదాపు మా నాయకుడి పేరు అనేకసార్లు వస్తుంది. మీరు ఎన్నిసార్లు ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ అంటారో దాన్ని మా వాళ్ళు విని, మా దగ్గర వున్న ఒరిజినల్ బులెటిన్లో ఆ పేరు ఎన్ని సార్లు వచ్చిందో సరి చూసుకుని, అప్పుడు మీరు సరిగా అనువాదం చేస్తున్నారో లేదో కనుక్కుంటారు’ అని కర్ణుడి జన్మ రహస్యం నా చెవిన వేశాడు.
అంటే ఇక ఎటువంటి పరిస్తితిలోనూ సర్వనామాలు ఇక్కడ అనువాదపు పనిలో పనికి రావు అనేది బోధపడింది.
అందుకా, ‘ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ ప్రకటించారు, ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ ఇంకా ఇలా అన్నారు, ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ పేర్కొన్నారు, ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ ఉద్ఘాటించారు’ అంటూ ఒకే పేరాలో నా చేత అష్టోత్తరం చదివిస్తున్నారు అనే వాస్తవం ఎరుకలోకి వచ్చింది.
సరే! ఆ శకం ముగిసింది. సోవియట్ శకం కూడా నేను మాస్కోలో వున్నప్పుడే అంతం అయింది.
ఇలాంటిదే మరో విశేషం నా కంట పడింది.
ఆఫ్రికా దేశం అయిన ఉగాండాను ఇదీ అమీన్ అనే నియంత పాలించేవాడు. రేడియో కంపాలాలో ప్రతి రోజు అయన గురించిన వార్తలే ప్రముఖంగా ప్రసారం అయ్యేవి.
ఆయనకు రేడియోలో తన పూర్తి పేరు చెప్పాలని మక్కువ. నియంత తలచుకుంటే కానిదేముంది. కాకపోతే ఒక ఇబ్బంది ఎదురయింది. పూర్తి పేరు అయితే పరవాలేదు కానీ తనకున్న బిరుదులు, మెడల్స్ కూడా జోడించి చెప్పాలని ఆదేశం. నియంత పాలించే ఆ దేశంలో, ఆయన ఆదేశం శిరోధార్యమాయే. దాంతో ఒకటికి పదిసార్లు రేడియోలో ఆయన పేరు వచ్చేది. ఒకటికి పదిసార్లు జనం దాన్ని వినాల్సి వచ్చేది. ఎలా అంటే ఇలా:
“His Excellency the President of the Republic of Uganda, General al Haji Idi Amin Dada, VC, DSO, MC……”
ఏమి సేతురా లింగా.....
తోకటపా:
ఎనభయ్యవ దశకం పూర్వార్థంలో, ఆకాశవాణి, దూరదర్శన్ లు మాత్రమే రాజ్యమేలుతున్న రోజుల్లో, వాటిని ఇందిరా వాణి అనీ, రాజీవ్ దర్శన్ అనీ గిట్టని వాళ్ళు ముద్దుగా పిలిచేవారు. వాటి మీద, అవి ప్రసారం చేసే కార్యక్రమాలమీద ఏలినవారి పెత్తనం, సర్కారువారి ముద్ర అంతగా వుండేవని చెప్పడం అందులోని శ్లేష. ఆ తరవాత రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెళ్ళినప్పుడు, అక్కడి దేశాధినేత అనండీ , పార్టీ నేత అనండీ, మిహాయిల్ గోర్భచేవ్, రష్యన్ టీవీ తెరపై గంటలు గంటలు కనబడే తీరు చూసిన తర్వాత మానవ మనస్తత్వం మనస్తత్వం తాలూకు అసలు తత్వం బోధపడింది.
మేము అలా అనుకుంటూ సంతోషంగా ఆ రష్యన్ టీవీ కార్యక్రమాలు చూస్తూ రోజులు గడుపుతున్న రోజుల్లో ఒక ఆరబ్ దేశం నుంచి నాకు తెలిసిన ఒక తెలుగు మిత్రుడు ఏదో పని మీద మాస్కో వచ్చి, మా ఇంట్లో రష్యన్ టీవీ ప్రోగ్రాములు చూసి ఎంతగానో మురిసి ముక్కచెక్కలవ్వడం చూసి, మాకు మతి పోయింది. కదిలిస్తే అతగాడు చెప్పిన కధ, అర్జున విషాద యోగాన్ని తలపించింది.
ఆ దేశంలో టీవీ తెరపై, ఉదయం నుంచీ రాత్రి పడుకునే వరకూ బోధలు ప్రవచిస్తూ , సూక్తులు వల్లిస్తూ ఒకే ఒక్క పెద్దమనిషి అస్తమానం దర్శనం ఇస్తాడట. ఆ ప్రోగ్రాములు చూసీ చూసీ వచ్చిన ఆ పెద్దమనిషికి, రష్యన్ టీవీ కార్యక్రమాలు చల్లని వేళలో ప్రియురాలి వెచ్చని కౌగిలిలా ఎంతో ఉల్లాసాన్ని కలిగించాయి. అందుకే అన్నారు మనుషుల బాధలు, ఇబ్బందులు అన్నీ సాపేక్షం (రిలెటివ్). ఇతరులతో పోల్చి చూసుకుంటే సగం బాధ తగ్గిపోతుందంటారు .
మానవ మనస్తత్వం తీరే అంత. మన ఇంట్లో కరెంటు పోతే, కరెంటు కంప్లైంట్ చేయడానికి ముందు, పక్క వాటాలో కరెంటు వుందో లేదో చూడాలనిపిస్తుంది. పొరుగు వారింట్లో కూడా కరెంటు పోతే ‘అదో తుత్తి’.
కింది ఫోటో:
40 ఏళ్ళ క్రితం రేడియో మాస్కోలో నా ఫోటో గుర్తింపు కార్డు


(ఇంకా వుంది)

22, జూన్ 2026, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో: (330) - భండారు శ్రీనివాసరావు


మళ్ళీ మళ్ళీ రాని రోజు అనుకునే ఆ రోజు నిస్సారమైన జీవితాల్లో కూడా ఏదో ఒక రోజు వస్తుంది. భగవంతుడు మామూలు మనిషికి ముందే అమర్చిపెట్టిన కుషన్ ఇది. కోరకుండానే ఇచ్చిన వరం కూడా.
‘ఎండనబడి వచ్చావు, అలా కూర్చో నాయనా!’ అంటూ చల్లని నీళ్ళు ఇచ్చింది, ఆ ఇల్లాలు.
విదేశాల్లో ఉంటున్న సుందరానికి ఆ పల్లె వాతావరణం చీదరగానే వుంది. పూర్వీకుల ఆస్తికి బేరం తగిలింది. దాన్ని ఏదో విధంగా ఏదో ఒక రేటుకు తెగనమ్మి వెళ్ళిపోవాలని సొంతూరు వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత కానీ రిజిస్ట్రేషన్ వ్యవహారాలు అంత సాఫీగా జరగవన్న సంగతి అర్ధం అయింది. మొత్తం మీద కొంత మొత్తం ముట్టచెప్పిన పిమ్మట ఆ పని ముగిసింది. ఇక బయలుదేరి వెళ్ళే ముందు ఎప్పుడో అమ్మేసిన, తాను పుట్టి పెరిగిన ఇంటిని చూద్దామని అనిపించి వచ్చాడు. అది ఇప్పటికే పది చేతులు మారింది. తనను ఆప్యాయంగా పలకరించిన ముసలమ్మే ఇప్పుడు ఆ ఇంట్లో ఒంటరిగా వుంటోంది. ఆమె కొడుకులు తన లాగే ఎక్కడో విదేశాల్లో వుంటున్నారు.
‘ఒక్క పది నిమిషాలు అలా కూర్చో నాయనా! ఏదో చేతనమయిన వంట చేసి పెడతాను’ అంటోంది ఆవిడ.
‘అన్నంతిని వెళ్ళమని అన్నప్పుడు కాదు కూడదు అని వెళ్ళకూడదు, మొండిగా వెడితే ఆ పూటకు అన్నం పుట్టదు’ అని చిన్నప్పుడు బామ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.
వంటింట్లో పీట, విస్తరి వేసి వడ్డించింది.
ఇబ్బందిగా కూర్చుని తినడం మొదలు పెట్టాడు.
‘కళ్ళకు మసకలు, డాక్టరు చూపించుకోవడానికి కుదరడం లేదు, పచ్చట్లో ఉప్పు సరిపడా వేశానో లేదో ముద్ద కలుపుని చెప్పు నాయనా’ అంటోంది ఆ ఇల్లాలు ప్రేమగా.
సుందరం ఆ ఆప్యాయతకు చలించిపోయాడు. గత కొన్ని దశాబ్దాలుగా ఇలాంటి ప్రేమానురాగాలకు దూరంగా ఉంటున్న సుందరం కళ్ళు చమర్చాయి. కంటి నీరు ఉబికి వచ్చింది. ఆ వెచ్చటి, ఉప్పటి కన్నీరు తింటున్న అన్నంలో కలిసింది.
‘ఉప్పు సరిపాళ్ళుగానే వేశారు బామ్మగారూ’ అన్నాడు సుందరం ఆమె చూడకుండా కళ్ళు తుడుచుకుంటూ.
ఇదో కధ అనుకుని అలా ఉంచుదాం.
పొతే,
ఈ ఫేస్ బుక్ లో మెరికలు లాంటి ఇద్దరు అక్కచెల్లెళ్ళు వున్నారు. Komaragiri Phanikumari ఫణి కుమారి, Manikumari Govindarajula మణి కుమారి. వీళ్లిద్దరూ నా మేనకోడళ్ళు. పిల్లలు పెళ్ళిళ్ళు అన్నీ బాధ్యతలు పూర్తి చేసుకుని హైదరాబాదులో సెటిల్ అయ్యారు.
మణి కధలు రాస్తుంది. ఫణి పేరుకు తగ్గటుగా పనిమంతురాలు. కొత్తగా వచ్చిన ఏ ఐ ని ఆపోసన పట్టింది. ఆ నైపుణ్యంతో తన మొబైల్ తో ఏవో జిమ్మిక్కులు చేస్తుంది. ఇక వంటలు, పిండి వంటలు సరే చెప్పక్కర లేదు. వంట వేరు వడ్డన వేరు. వంట రుచి వడ్డన టెక్నిక్ తెలిస్తే రెట్టింపు అవుతుంది అంటారు. అది వీళ్ళిద్దరి విషయంలో నూటికి నూరు పాళ్ళు కరక్ట్.
వీళ్ళ అన్నయ్య , నా మేనల్లుడు శ్రవణ్ కూడా అక్కడే ఆ ప్రాంతంలోనే ఉంటాడు. చిన్నప్పటి నుంచి శ్రవణ్ కు హీరో కృష్ణ, అంటే అభిమానం. ఎంత అభిమానం అంటే తన పిల్లలకు విమల్ కృష్ణ, రమ్య కృష్ణ అని పేర్లు పెట్టుకున్నాడు. నాలుగేళ్ల క్రితం, 2022లో విడుదల అయిన బ్లాక్ బస్టర్ చిత్రం డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణే నా మేనల్లుడి కుమారుడు.
“డీ.జే. టిల్లు! ఇదేం పేరురా! ఆడవాళ్ళకి నచ్చుతుందా అసలు” అన్నాను నేరుగా ఈ సినిమా డైరెక్టర్ తోనే.
విమల్ కృష్ణ బీ. టెక్. చదివాడు. అమెరికా ఛాన్స్ కూడా వదులుకుని సినిమాల మీద మోజుతో అలాగే ఆ ప్రపంచంలోనే వుండి పోయాడు. అలా కొన్నేళ్ళు. చివరికి ఆ తపస్సు ఫలించింది. పట్టుదల ఫలితం ఇచ్చింది. విమల్ డైరెక్ట్ చేసిన చిత్రం డీ.జే. టిల్లు కనక వర్షం కురిపిస్తోందని ఆ రోజుల్లో అమెరికా నుంచి మా పిల్లలు ఫోన్ చేసి చెప్పారు.
నాది పాత తరం కదా! సర్దుకోవడం కొంచెం ఇబ్బంది. ఇదేం పేరు, ఇదేం కధ అనే భావనే. కానీ నవ తరానికి అపరిమితంగా నచ్చినట్టు వుంది.
అప్పటికి జెన్ జడ్ (Gen Z అంటే 1997 - 2012 మధ్య జన్మించిన వాళ్ళు) అనే పదం కూడా ప్రాచుర్యంలో లేదు. నేటి కుర్రకారుకు ముందు చూపులేదు అని పాత తరం అనుకునే మాటలోనే ఏమాత్రం ముందు చూపులేదు అని ఎప్పటికప్పుడు రుజువవుతూనే వుంది. అయినా పాత తరం పద్దతి మార్చుకోవడం లేదు. నేనూ మినహాయింపు కాదు.
“జనం కోరేది మనం శాయడమా! మనం చేసేది జనం చూడడమా!” అనే అలనాటి పాతాళభైరవి పింగళి మార్కు మాంత్రికుడి డైలాగ్ నేటికీ వర్తించేలా సినిమా తీసిన డీ జే టిల్లు కుర్ర బృందానికి అభినందనలు. ఇప్పుడు అనుమాన పక్షి అనే మరో సినిమా తీశాడు. విడుదలకు సిద్ధంగా వుంది.
'ఘన విజయం సినిమా తీసిన ఒక డైరెక్టర్ కు మరో సినిమా తీయడానికి నాలుగేళ్ల కాలం ఎందుకు పట్టింది? డీజే టిల్లు సీక్వెల్ కు దర్శకత్వం చేసే అవకాశం ఎందుకు అంది పుచ్చుకోలేదు' అనే సందేహాలకు విమల్ కృష్ణ తనదైన రీతిలో చాలా హుందాగా జవాబు చెప్పాడు.
'డీజే టిల్లులో హీరో పాత్ర ఒక ఐకానిక్ కేరక్టర్. మళ్ళీ అలాంటి కేరక్టర్ కోసమే ఇంత విరామం. సీక్వెల్ కంటే మరో ఐకానిక్ పాత్ర రూపొందించడానికే నేను ఇష్టపడ్డాను, వేరే కారణాలు ఏవీ లేవు' అన్నది విమల్ కృష్ణ వివరణ.
జెన్ జడ్ అంటేనే సొంత, నిర్ధిష్ట అభిప్రాయాలతో ముందుకు సాగే తరం. మా తరం మాట్లాడేది ఏముంటుంది? ఆ తరాన్ని సమర్థించక పోయినా, వారిని నిరుత్సాహ పరచకపోవడమే మా తరం చేయాల్సిన పని.
All the best my dear Vimal Krishna!
నిన్న విమల్ కృష్ణ తండ్రి శ్రవణ్ ఇంట్లో అందరం కలిశాము. ఫణి భర్త Rampa Ks రాంపా చిత్రకారుడు, రచయిత. ఫేస్ బుక్ లో మితృలు చాలామందికి తెలిసిన వాడే. మణి భర్త నరసింహారావుకు ఎడమ కాలు చాలా గట్టిది. చేసిన ప్రతి ఉద్యోగాన్ని ఎడాపెడా ఎడమ కాలితో తన్నుకుంటూ, తారాజువ్వలా తన వృత్తిలో దూసుకుపోయాడు.
ఇక మరో వ్యక్తి Paramesh CK పరమేష్. బెజవాడలో నా కళ్ళముందే పుట్టి పెరిగాడు. దుబాయ్ లో ఇరవై ఆరేళ్లు ఉద్యోగం చేసి హైదరాబాదులో ఇటీవలే సెటిల్ అయ్యాడు. వీళ్ళందరూ వయసులో నాకంటే చిన్నవాళ్లు అయినా నాకు మంచి మితృలు. అంచేత ఆదివారం సాయంత్రం హాయిగా, మళ్ళీ మళ్ళీ తిరిగిరాని రోజు అన్నట్టుగా గడిచిపోయింది.
మేనకోడళ్ళు, మేనల్లుడు భార్య లక్ష్మి, భోజనాల బల్ల దగ్గర కనుక్కుని, కనుక్కుని మరీ వడ్డన చేశారు. అన్ని రకాలు చేయడానికి వాళ్ళు ఎంత కష్ట పడ్డారో నాకు తెలియదు కానీ, అన్ని రుచికరమైన పదార్ధాలను వదిలి వేయకుండా తినడానికి నేనైతే చాలా కష్టపడ్డాను.
షరా మామూలుగా తోక టపా!
ముందు చెప్పిన కధలో సుందరాన్ని నేనే!
కృతజ్ఞతలు బాహాటంగా వ్యక్తం చేయడం నిజానికి చాలా కష్టమైన పని. అందుకు నేను ఎంచుకున్న పద్దతి ఇది.



(ఇంకా వుంది)

20, జూన్ 2026, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (329): భండారు శ్రీనివాసరావు

 

యోగ కాలం
పొందలేని దాన్ని సాధించగలగడాన్ని యోగం అంటారు. ఉదాహరణకు ఆత్మ సాక్షాత్కారం. దీన్ని సాధించడం అంత సులభం ఏమీ కాదు. సాధించాలంటే అందుకుతగ్గట్టుగా శరీరాన్ని తయారు చేసుకోవాలి. ఈ సాధనే యోగా. ఈ సాధన చేసేవారిని పూర్వం యోగులు అనేవారు. యోగసాధన ద్వారా లక్ష్యాన్ని అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలిగిన వారిని యోగయుక్తులు అంటారు. లక్ష్యసాధన ఒక ఎత్తయితే, సాధించిన దాన్ని పదిలపరచుకోవడం మరో ఎత్తు. మొదటిది యోగం, రెండోది క్షేమం. ఈ 'యోగక్షేమాల' ప్రసక్తి భగవద్గీతలో కూడా వుంది. గీత తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో శ్లోకంలో అంటాడు భగవానుడు అర్జునుడితో, " అనన్యాచింతయంతోమా యేజనాః పర్యూపాసతే, తేషామ్ నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్" అని.
అంటే 'వేరే ధ్యాస లేకుండా నన్నే తలుస్తూ, నన్నే ధ్యానిస్తూ పోతే వారి యోగక్షేమాలు నేను చూసుకుంటాను' అని స్తూలార్ధం. అలాగే, 'అధాతో బ్రహ్మ జిజ్ఞాసా' అనే దానితో 'బాదరాయణ బ్రహ్మ సూత్రాలు' మొదలవుతాయి. ( ఈ బ్రహ్మ సూత్రాలు వేద వ్యాస విరచితమనీ, కాదు బాదరాయణుడు రాశాడనీ కొన్ని వాదాలు వున్నాయి. ఆ ఇద్దరూ ఒకరనే వాదం కూడా వుంది, అది వేరే విషయం)
బ్రహ్మసూత్రాలలో చెప్పిన అధాతో అంటే 'అటు పిమ్మట...'. శరీరాన్ని యోగాతో ఆత్మసాక్షాత్కారానికి అనువుగా 'మార్చుకున్న పిమ్మట' అని భాష్యం చెప్పుకోవచ్చు. శంకర భాష్యాన్ని ప్రముఖ పండితులు పుల్లెల రామచంద్రుడు తెనిగించి పుణ్యం కట్టుకున్నారు.
అందులోని జిజ్ఞాస అధికరణంలో ఈ యోగ ప్రసక్తి వుంది. ఈ యోగ సూత్రాలను పతంజలి మహాముని వెలికితీసి ఒకచోట గుదిగుచ్చి పంచాంగాలతో, కర్మ యోగము, రాజ యోగము, భక్తి యోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగములతో కూడిన 'యోగ దర్శనం' తయారు చేశారు. అదే పతంజలి యోగశాస్త్రంగా ఈనాటికీ మన్ననలు అందుకుంటోంది.
పతంజలి యోగానికి ఇచ్చిన నిర్వచనం 'యోగసు కర్మ కౌశల్యం', 'చిత్తవృత్తి నిరోధం'. ఏ కర్మ (పని) చేసినా దాన్ని నైపుణ్యంతో చేయడం, మానసిక చాంచల్యాలను జయించడం అని అర్ధం చెప్పుకోవచ్చు.
ఇందుకోసం ఆయన సాధన చతుష్టయాన్ని ప్రబోధించారు. నిత్యానిత్య వస్తువు వివేక జ్ఞానము, ఇహలోక పరలోక విషయం భోగ వైరాగ్యము, శమదమాది సాధన సంపద, మోక్షం పొందాలనే తీవ్రమైన వాంఛ- ఈ నాలుగు అలవరచుకుని యోగసాధన మొదలు పెట్టాలి. శమదమాది సాధన సంపద అంటే ఒకటి శమము( మనో నిగ్రహము), రెండు దమము ( బాహ్య ఇంద్రియ నిగ్రహము ) మూడు ఉపరతి (విషయాలనుంచి వెనక్కు మరలడం) నాలుగు తితిక్ష (సహనం), అయిదు శ్రద్ధ (శాస్త్రాదుల పట్ల పరిపూర్ణ విశ్వాసం).
ఈ అయిదూ యోగసాధకుడికి అత్యవసరం. బ్రహ్మ సూత్రాలలో చెప్పిన మొదటి సూత్రం 'యధాతో బ్రహ్మ జిజ్ఞాస' అంటే అటు పిమ్మట అనేది, 'ఈ అయిదూ సాధించిన' పిమ్మట అనేది గ్రాహ్యం. తద్వారా ఆత్మ సాక్షాత్కార సాధన సులభం అవుతుంది. ఈ నైపుణ్యం అలవరచుకోవడం కోసం కర్మయోగాది పంచ యోగాలు ఉపయోగపడతాయి.
కర్మ, రాజ, భక్తి, ధ్యాన, జ్ఞాన యోగాలు కర్మతో మొదలయి జ్ఞానంతో అంతమవుతాయి. ఈ జ్ఞాన సాధనతో యోగి యోగయుక్తుడు/ యోగసిద్ధుడు కాగలుగుతాడు.
పతంజలి చెప్పిన అష్టాంగయోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి విభాగాలు వున్నాయి.
ఇవన్నీ సరే, మామూలు మనిషికి ఇవన్నీ యెందుకు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.
మానవ శరీరం శాశ్వతం కాదు. ఎప్పుడో ఒకప్పుడు నశించి పోయేదే. జీవుడు శాశ్వతం. అతడికి నాశనం లేదు. కానీ శరీరాన్ని ఆవహించుకుని వున్న జీవుడికి ఆ తాత్కాలిక ఆవాసం మీదనే మోజు. తద్వారా సంప్రాప్తించిన సుఖ దుఃఖాలతో మునిగితేలుతుంటాడు. ఈ అజ్ఞానం తొలగగానే లౌకిక వ్యవహారాలను నిర్లిప్త వైఖరితో పరికించే స్తితి వస్తుంది. ఇట్టి స్తితికే ముక్తి, కైవల్యం, అపవర్గం అని పేర్లు.
ఇలాటి స్తితిని దేహం వుండగానే చేరుకోగలిగితే అది జీవన్ముక్తి అనిపించుకుంటుంది. ఈ యావత్ యోగ సాధన అంతా ఈ స్తితికి చేరుకోవడం కోసమే.
బుధజనులతో అప్పుడప్పుడు జరిపే సంభాషణల్లో వినవచ్చిన కొన్ని మంచి సంగతులు ఇవన్నీ.
ఆరువేల ఏళ్ళ క్రితం మన పూర్వీకులు మనకందించి వెళ్ళిన ఈ అత్యంత విలువైన జీవన విధానం ఇది. అలాటి యోగాకి ప్రత్యేకించి ఒక దినాన్ని కేటాయించాలని ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన విజ్ఞప్తి మేరకు ఏటా జూన్ ఇరవై ఒకటో తేదీని అంతర్జాతీయ యోగాదినంగా ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. అతి నిరాడంబరంగా పూర్వీకులు అందించిన భారతీయ యోగ శాస్త్రానికి సంప్రాప్తించిన మహా యోగం.
మరో ముఖ్యమైన విషయం. మొత్తం మానవాళికి యోగవిద్యను ప్రసాదించింది భారతీయులే. కానీ మనస్సును, శరీరాన్ని అదుపులో వుంచుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాలను కాపాడుకోవడానికి మంచి ఉపకరణం అయిన యోగాను ఏదో ఒక దేశానికో లేదా మతానికో పరిమితం చేసి చూడడం మంచిది కాదు. ఇస్కాన్ గతంలో నిర్వహించిన భగవద్గీత పఠనం పోటీలో మర్యం ఆసిఫ్ సిద్దికీ అనే ముస్లిం బాలిక ప్రధమ స్థానం దక్కించుకోవడం మనందరికీ గర్వకారణం.
అలాగే, మనం బాధపడాల్సిన అంశాలు కూడా వున్నాయి. మతాన్ని నల్లమందుతో సమానంగా పరిగణించే కమ్యూనిష్ట్ చైనాలో భగవద్గీతను చైనా భాషలో ప్రచురించి ప్రజలకు అందుబాటులో పెట్టారు. మనం పవిత్ర గ్రంధం అని పైకి గొప్పగా చెప్పుకుంటాము కాని భగవద్గీత గ్రంధాల ఉనికి, కోర్టుల్లో సాక్షి ప్రమాణాలకు, మనుషులు కాలం చేసినప్పుడు మైకుల్లో వినిపించడానికి పరిమితం అయిపోయింది. ఇదొక విషాదం.
తోక టపా:
నలభై ఏళ్ళ కిందట నేను పూర్వపు సోవియట్ యూనియన్ రాజధాని మాస్కోలో, మాస్కో రేడియోలో ఉద్యోగం చేస్తున్నరోజులవి.
రష్యన్ టీవీ నేషనల్ ఛానల్ ప్రైం టైంలో నాటి కమ్యూనిష్ట్ పార్టీ అధినేత, ఆ దేశాధ్యక్షుడు అయిన మిహాయిల్ గోర్భచెవ్ తో సమానంగా టెలివిజన్ తెరపై గంటలు గంటలు కనిపించే అవకాశం దక్కిన ఏకైక వ్యక్తి ఒక సాధారణ భారతీయుడు అంటే నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ ఇది నిజం. ఆయన పేరు లక్ష్మణరావు గారు. తెలుగు బాగా తెలిసిన కన్నడిగుడు. భారత రాయబార కార్యాలయం నడిపే ఇండియన్ స్కూలులో యోగా టీచరు.
ఆయన ప్రతి రోజూ టీవీ ద్వారా రష్యన్ పౌరులకు యోగా పాఠాలు బోధించేవారు. దీన్ని బట్టి భారతీయ యోగాకి అప్పట్లోనే విదేశాల్లో వున్న ఆదరణ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
(ఇంకా వుంది)