15, ఫిబ్రవరి 2026, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (264) : భండారు శ్రీనివాసరావు

నిశ్శబ్దం రాజ్యమేలిన దళిత ముఖ్యమంత్రి సభ
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ గా పనిచేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు చక్రపాణి గారు ఒక సందర్భంలో చెప్పిన ఒక పాత విషయం స్పురణకు వస్తోంది.
అప్పుడు జవహర్ లాల్ నెహ్రూ ప్రధాన మంత్రి.
ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి ఆ పదవికి రాజీనామా చేసారు. ఆయన స్థానంలో దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రిగా నియమించాలని నెహ్రూ నిర్ణయించారు. అగ్రకులాల ఆధిపత్యం అధికంగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ లోని కొందరు నాయకులు ఒక దళితుడు ముఖ్యమంత్రి కావడాన్ని సహించలేక పోయారు. సంజీవయ్య అవినీతిపరుడని, అక్రమంగా లక్షలాది రూపాయలు కూడబెట్టారని అధిష్టానానికి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. సంజీవయ్య నీతి, నిజాయితీ తెలిసిన నెహ్రూ ఆ ఫిర్యాదులను కొట్టి పారేశారు. అయినా, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మొండిపట్టు పట్టారు.
నెహ్రూ ఓ నాయకుడిని ఆంధ్రాకు వెళ్లి సంజీవయ్య మీద రహస్య విచారణ చేసి నివేదిక ఇవ్వమని కోరారు. ఆయన హైదరాబాద్ వచ్చి అప్పటి కాంగ్రెస్ యువనాయకుడు చక్రపాణి గారిని కలిసి వచ్చిన పని చెప్పారు. సంజీవయ్య గారి గూర్చి బాగా తెలిసిన చక్రపాణిగారు నిర్ఘాంతపోయి ఆ నాయకుడిని చివాట్లు పెట్టారు. కానీ ప్రధాని ఆదేశం. చేసేది లేక ఢిల్లీ నాయకుడిని వెంటబెట్టుకుని కారులో సంజీవయ్య గారి గ్రామానికి వెళ్లారు. గ్రామ పొలిమేరలలో ఒక పూరి పాక ముందు కారు ఆపారు చక్రపాణి. ఆ పాక బయట ఒక వృద్ధురాలు కట్టెల పొయ్యిపై మట్టి కుండతో అన్నం వండుతున్నది. పొగగొట్టంతో మంటను ఊదుతూ చెమటలు కక్కుతున్నది. "ఏమిటి ఇక్కడ ఆపారు?" ప్రశ్నించాడు ఢిల్లీ నేత.
"సంజీవయ్య గారి ఇల్లు ఇదే. ఆ వృద్ధురాలు ఆయన అమ్మగారు. కారు దిగండి" అన్నారు చక్రపాణి. నాయకుడు నివ్వెరపోయాడు. చక్రపాణి ఆమెకు నమస్కరించి "అమ్మా...ప్రస్తుతం మంత్రి గా ఉన్న మీ అబ్బాయి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నారు" అన్నారు.
ఆమె చెమటలు తుడుచుకుంటూ "అయితే మా వాడి జీతం ఏమైనా పెరుగుతుందా నాయనా! ఈ కట్టెల పొయ్యి మీద వంట చెయ్యడం కష్టంగా ఉంది. ఒక బొగ్గుల కుంపటి కొనిపెట్టమని ఎన్నాళ్ళ నుంచో అడుగుతుంటే, డబ్బులు లేవు అంటున్నాడు" అన్నది.
నాయకుడి నోట్లోంచి మాట రాలేదు. "సార్.. గ్రామం లోకి వెళ్లి విచారణ చేద్దామా?" అడిగారు చక్రపాణి. "అవసరం లేదు. కారును హైద్రాబాద్ కు పోనీయండి" అన్నాడు నాయకుడు.
ఆ తరువాత వారం రోజుల్లో సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అయ్యారు.
సంజీవయ్య గారిది కర్నూలు జిల్లా కల్లూరు మండలం లోని పెద్దపాడు గ్రామం.
ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒకసారి తల్లిని చూడడానికి స్వగ్రామానికి వెళ్ళారు.
తిరిగి వస్తూ ఓ వందరూపాయల నోటు ఖర్చులకు వాడుకోమని ఇచ్చారు.
‘నాకు సరే నువ్వున్నావు, డబ్బులు ఇవ్వడానికి, కానీ ఎలాంటి ఆసరాలేని బీదా బిక్కీ సంగతేమిటి?’ అని ఆమె అన్నమాట సంజీవయ్య గారిలో ఆలోచనలు రేకెత్తించింది.
ఫలితమే ఆయన ప్రభుత్వం ప్రవేశపెట్టిన వృద్ధాప్య పింఛను పధకం.
ముఖ్యమంత్రి సభలో నిశ్శబ్దం అని కదా మొదలు పెట్టింది. దానికే వస్తాను. ఈ లోగా దానితో సంబంధం వున్న కొంత స్వకీయం.
మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ స్థాయికి చేరడానికి ముందు ఎక్కిన అనేకానేక నిచ్చెన మెట్లలో నెలకు పాతిక రూపాయల ‘విలేకరి కొలువు’ కూడా వుంది. చాలా మందికి తెలియదు.
ఖమ్మంలోని ఎస్సార్ అండ్ బీజీఎన్ ఆర్ కాలేజీలో ఆయన డిగ్రీ పూర్తిచేశారు. రామ్మోహనరావు గారు ఆ కాలేజీలో లెక్చరర్. వారి నాన్నగారికి పత్రికల ఏజెన్సీ కూడా వుంది. అప్పట్లో ఆ ఏజెంట్లే పత్రికా విలేకరుల పాత్ర కూడా పోషించేవారు. మా అన్నయ్యకు తెలుగులో ఉన్న ప్రావీణ్యం గమనించి, ‘నెలకు ఓ పాతిక ఇస్తాను, నీకు పాకెట్ మనీగా పనికి వస్తుంది, నువ్వు ఆంద్రజ్యోతి పత్రికకు వార్తలు రాస్తుండు. వాళ్ళు వేస్తే వేస్తారు, లేకపోతే లేదు, కానీ నీకు మంచి కాలక్షేపంగా వుంటుంది’ అని ప్రోత్సహించడంతో మా అన్నయ్య ఒప్పుకున్నాడు.
ఇక అసలు విషయానికి వస్తాను.
నాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఖమ్మం జిల్లా పర్యటన ఖరారు అయింది. అప్పటికే జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరూ రెండు వర్గాలుగా విడిపోయి వున్నారు. జలగం వెంగళరావు, శీలం సిద్దారెడ్డి వంటి అతిరధులు కలిగిన ప్రధాన వర్గం అప్పటివరకు ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవ రెడ్డికి అనుకూలం. మరో వర్గం సంజీవయ్య వైపు. దీనికి మాకు బాబాయి వరుస అయిన బొమ్మకంటి సత్యనారాయణ గారు నాయకులు. ఖమ్మం జిల్లాకు సంబంధించినంత వరకు ఆయన ముఖ్యమంత్రి అన్నట్టే లెక్క. సంజీవయ్య గారికి కుడి భుజం. ముఖ్యమంత్రికి సంఘీభావం తెలిపేందుకు గోకినేపల్లిలో జిల్లా దళిత మహా సభ ఏర్పాటు చేశారు. ఈ సభను కవర్ చేయడానికి పాతిక రూపాయల విలేకరి అయిన మా అన్నయ్యను పురమాయించారు రామ్మోహన రావు గారు.
సభ బాగా జరిగింది. ముఖ్యమంత్రి ప్రసంగించడానికి మైకు ముందు నిలబడ్డారు. సంజీవయ్య స్వతహాగా మంచి వక్త. ఆయన ప్రసంగం మొదలు పెట్టారు.
‘నన్ను బాధ పెడుతున్న, నా మనసును కలచి వేస్తున్న ఓ విషయాన్ని మీకు చెప్పదలచుకున్నాను. ఇక్కడ పైనా కిందా కూర్చున్న మనుషులం అందరం ఒకే తీరున ఉన్నాము. ఒంట్లో పారే రక్తం రంగు అందరికీ ఎరుపే. కానీ మనలో చాలామందిమి సాటి మనిషిని మనిషిగా చూస్తున్నామా అంటే అనుమానమే. డబ్బున్న ఖామందులు పెంపుడు బొచ్చు కుక్క పిల్లల్ని తమ పక్కలపై పడుకోబెట్టుకుంటారు. ముద్దు చేస్తారు. అదే సాటి మనిషిని తాకడానికి కూడా వారికి అస్పృశ్యత అనే అనాచారం అడ్డం వస్తుంది. కుక్కలపాటి చేయరా ఈ మనుషులు? ఎందుకీ వ్యత్యాసం? ఎందుకీ వివక్ష?’
రెండు చేతులూ గట్టిగా గాలిలో ఊపుతూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి స్వరం బొంగురు పోయింది. పైకిలేపిన చేతులను అలాగే వుంచి ఆయన కాసేపు మౌనంగా వుండిపోయారు.
సభకు హాజరై ప్రసంగం వింటున్న యావన్మంది చేష్టలు ఉడిగి వుండిపోయారు. అంతటా నీరవ నిశ్శబ్దం.
సరే! ఆ రోజు సభ ముగిసింది. తిరిగి హైదరాబాదు వెళ్ళడానికి దామోదరం సంజీవయ్య అంబాసిడర్ కారు ఎక్కారు. ఆయన పక్కనే మా బాబాయి బొమ్మకంటి సత్యనారాయణ. ముందొక పోలీసు జీపు, వెనక మరో జీపు. అదీ ముఖ్యమంత్రి కాన్వాయ్ ఆ రోజుల్లో.
మా అన్నయ్య ఖమ్మం చేరుకున్న వెంటనే తన రిపోర్ట్ రాసి మర్నాడు పోస్టులో పంపారు. ఆ మరునాడు అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది.
‘ముఖ్యమంత్రి దళిత సభలో రాజ్యమేలిన నిశ్శబ్దం’.
వార్తతో పాటు మా అన్నయ్య పెట్టిన హెడ్డింగ్ కూడా యధాతధంగా పత్రికలో రావడం కొసమెరుపు.
(కింది ఫొటోలో చక్రపాణి గారితో నేనూ, పాత్రికేయ మిత్రుడు విద్యారణ్య)



(ఇంకావుంది)

14, ఫిబ్రవరి 2026, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (263) : భండారు శ్రీనివాసరావు

రేడియోకి పాదాభివందనం
నిన్న అంటే ఫిబ్రవరి పదమూడో తేదీ ప్రపంచ రేడియో దినోత్సవం రోజున అనేకమంది ఆకాశవాణిని గుర్తు చేసుకోవడం చూసి నాకు ఏనుగు ఎక్కినంత సంబరం అనిపించింది. ఎందుకంటే నా జీవితంలో ముప్పావు భాగం ఆకాశవాణి నీడలోనే గడిచింది.
అంచేత ఓ పాత అనుభవాన్ని పంచుకుంటున్నాను.
మా ఆవిడ నిర్మల చనిపోవడానికి వారం పది రోజుల ముందు... జరిగిన సంఘటన. 2019 ఆగష్టు తొమ్మిదిన ఇద్దరం కలిసి సినిమాకి వెళ్ళాం. తొమ్మిది రోజుల తర్వాత 18 వ తేదీ అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుతో తను అకస్మాత్తుగా మరణించింది. కింది సంఘటనకి మా ఆవిడ మరణానికి ఏమీ సంబంధం లేదు. కేవలం కాకతాళీయం.
నేను మాస్కోలో రేడియో మాస్కోలో పనిచేసే రోజుల్లో తెలుగు కార్యక్రమాలు శ్రద్ధగా వినే శ్రోతలకు రేడియో తరపున చిన్ని చిన్ని కానుకలు పంపించే సాంప్రదాయం వుండేది.
మన దేశంలో టీవీ దూరదర్సన్ రూపంలో రంగప్రవేశం చేసిన మొదటి సంవత్సరాలలో బాగా కలిగిన వాళ్ళ ఇళ్ళల్లోనే టీవీ సెట్లు కనిపించేవి. ఆదివారం రోజున ఆ లోగిళ్ళు అన్నీ రామాయణ, భారతాల ప్రేక్షకులతో నిండి కనిపించేవి. బాపూ రమణలు మిస్టర్ పెళ్ళాం చిత్రంలో ఇటువంటి సన్నివేశాలను హృద్యంగా జొప్పించారు కూడా.
మరి ఇప్పటికీ వెనుకటి మాదిరిగా రేడియో (ఆకాశవాణి) వింటున్నవాళ్ళు, దూరదర్సన్ చూస్తున్న వాళ్ళు వున్నారా అని కొందరు అమాయకంగా అడుగుతుంటారు. పెద్ద గీత ముందు చిన్న గీత లాగా, మునుపటి మాదిరిగా ‘ఈ సంగతి రేడియోలో విన్నాం’ అని చెప్పేవాళ్ళు అంతగా కనిపించక పోవచ్చుకానీ వినేవాళ్ళు లేకుండా మాత్రం లేకుండా పోలేదు.
రేడియో వినడమే కాదు, రేడియో అంటే ప్రాణం అని చెప్పే ఒక వ్యక్తి ఆ రోజు మాకు తారసపడ్డాడు. అతడి మాటల్లో నా ప్రసక్తి వుంది కాబట్టి, అది ప్రస్తావించకుండా విషయం వివరించలేని పరిస్తితి నాది. కొంత స్వోత్కర్ష అనిపించినా దానికి మినహాయింపు ఇచ్చి నేను చెప్పే విషయానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని నా వినమ్ర పూర్వక విన్నపం.
నేనూ మా ఆవిడా తీరి కూర్చుని గిల్లి కజ్జాలు పెట్టుకోవడం మంచిది కాదని, ఆ తీరిక సమయాన్ని ఓ సినిమా చూడడంలో గడపాలని నిర్ణయించుకుని దాన్ని తక్షణం అమలుచేసాం. ఒక మాల్ లోని హాల్లో సినిమా చూసి ఇంటికి రావడానికి ఉబెర్ బుక్ చేసుకునే ప్రయత్నంలో వుండగా ఆ వ్యక్తి మా ఆవిడతో మాట్లాడ్డం గమనించాను.
'రేడియోలో పనిచేసే శ్రీనివాసరావా' అని అతడు ఆరా తీయడం కనిపించింది.
కన్నుమూసి తెరిచేలోగా అతగాడు అధాటున ముందుకు వంగి నా కాళ్ళకు దణ్ణం పెట్టాడు. నలుగురిలో అతడలా చేయడంతో సిగ్గుతో ముడుచుకుపోయాను
“ఇది నేను రేడియోకు పెడుతున్న నమస్కారం, వేరేలా అనుకోకండి” అనేశాడు.
తన పేరు సుభాష్ అని, కరీంనగర్ జిల్లా వాసిననీ, ప్రస్తుతం కూకట్ పల్లిలో వుంటున్నాననీ వివరాలు అడగకుండానే చెప్పాడు. రేడియో వినడం చిన్నప్పటి నుంచి తనకు అలవాటని చెబుతూ జేబులోనుంచి ఒక బుల్లి ట్రాన్సిస్టర్ తీసి చూపించాడు.
వారానికి రెండు సార్లు వచ్చే వార్తావాహిని, ప్రతి గురువారం వచ్చే జీవన స్రవంతి వినేవాడినన్నాడు.
1989 లో నేను మాస్కో వెళ్లకముందు నేను చేసిన ప్రోగ్రాములు అవి. అంటే దాదాపు నాలుగు దశాబ్దాలు కావస్తోంది.
'టీవీల్లో భండారు శ్రీనివాసరావు అని చెబుతూ వుంటారు, అలా చూసి మిమ్మల్ని గుర్తు పట్టాను' అని ఒక చిన్న వివరణ ఇచ్చి నా మనసు మూలల్లో తొలుస్తున్న సందేహాన్ని నివృత్తి చేసాడు.
ఆ రేడియో అభిమానితో ఓ సెల్ఫీ దిగాలనిపించింది. కానీ ఆ ప్రక్రియ నాకు రాదు. ఈ లోపల అతడే ఓ సెల్ఫీ తీసుకోవచ్చా అని అడిగి తన సెల్ ఫోన్ తో తీసి ఒకటి నాకు వెంటనే వాట్సప్ లో పంపాడు.
ముందుగా మాస్కో రేడియో ప్రసక్తి ఎందుకు తెచ్చాను అంటే, ఆకాశవాణివాళ్ళు కూడా ఇటువంటి అభిమానులతో కొన్ని ఇంటర్వ్యూలు చేసి ప్రసారం చేస్తే బాగుంటుందని.
కారెక్కగానే మా ఆవిడ అంది, గిల్లికజ్జాకు ప్రారంభ సూచికగా.
"మీరు రేడియో మనిషని అటు రేడియో వాళ్ళు, ఇటు దూరదర్సన్ వాళ్ళు ఎప్పుడో మరచిపోయారు, కనీసం రేడియో వినే వాళ్ళయినా మిమ్మల్ని గుర్తుంచుకుంటున్నారు, సంతోషించండి"
తోకటపా:
మాటలు మింగే తిమింగలాలు
‘మీ గొంతు పీలగా అనిపించింది’
‘మొదలు పెట్టినప్పుడు దూకుడుగా మొదలెడతారు. పోను పోను తేలిపోతున్నట్టుగా వుంటుంది. ఇక వాక్యం ముగించేటప్పుడు ఆఖరు పదాలు మింగేస్తునారు’
నలభయ్ ఎనిమిదేళ్ల క్రితం నేను రేడియో ఉద్యోగంలో చేరి వార్తావాహిని కార్యక్రమాన్ని వారానికి ఒకసారో, రెండుసార్లో సమర్పిస్తున్నప్పుడు దాన్ని రేడియోలో విని నాతో మా ఆవిడ తరచుగా అంటుండే మాటలు ఇవి.
నా ప్రోగ్రాం వినే అవకాశం నాకు లేకపోవడం వల్ల, మా ఆవిడ మాటలే వేదం అనుకుని కొంత బాణీ మార్చుకునే ప్రయత్నం చేశాను. ఈలోగా వారం వారం ‘జీవన స్రవంతి’ మొదలయింది. ‘తినగ తినగ వేము తియ్యనగును’ అన్నట్టు నా గొంతుకు శ్రోతలు అలవాటు పడిపోవడంతో నా భార్య మాటలు చెవిన పెట్టడం మానేసాను.
ఇప్పుడు టీవీల్లో కొందరి స్వరాలు వింటుంటే ఈ పూర్వపు రోజులు గుర్తుకొస్తున్నాయి. ఒక్కోసారి అనిపిస్తుంది, వీళ్ళకు మంచీచెడూ చెప్పే భార్యలు లేరా, లేక చెవికి ఎక్కించుకుపోవడం అనే నా చెడ్డ అలవాటు వీరికీ ఉందా అని.
కింది ఫోటో:
సినిమాహాలు వెలుపల రేడియో అభిమాని సుభాష్ తో నేను



(ఇంకా వుంది)

11, ఫిబ్రవరి 2026, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (262 ): భండారు శ్రీనివాసరావు

 

'రామః రామౌ, రామాః, హే రామ హే రామౌ, హే రామాః ........' సంస్కృతం మాస్టారి నోట మధురంగా, మంద్రంగా వినవచ్చేవి శబ్ద మంజరి పాఠాలు.
బెజవాడ గవర్నర్ పేట లోని సీవీఆర్ జీఎంహెచ్ స్కూలు (చుండూరు వెంకటరెడ్డి గవర్నర్ పేట మునిపల్ హైస్కూలు) భవనం చాలా విశాలమైన ప్రాంగణంలో వుంది. (వుండేది)
దాని నట్టనడుమ రాజసం వొలకబోసే రాతికట్టడం. దానికి ఇరువైపులా తరగతి గదులు.
ప్రధాన భవనంలో మెట్లకింద, తెల్లని పంచె, లాల్చీ కండువా ధరించిన సంస్కృతం మాస్టారు అలా శబ్దమంజరి చదువుతుంటే, మేము ఒక పది మందిమి కాబోలు సంస్కృతం రెండో భాషగా తీసుకున్నవాళ్ళం, శ్రద్ధగా వింటూ మాస్టారు చెప్పింది వల్లె వేస్తూ వుండేవాళ్ళం.
‘రామ శబ్దం ఆకారంత పుంలింగం. రామః రాముడు ఏకవచనం. రామౌ ఇద్దరు రాములు, ద్వి వచనం, రామాః అనేకమంది రాములు, బహువచనం
అలాగే రామః, ప్రధమా విభక్తి, హే రామః, సంబోధన ప్రధమా విభక్తి’
ఇలా సాగిపోయేవి మాస్టారి నోటి వెంట సంస్కృతం పాఠాలు. అంతా భట్టీయమే. ఎంత వంట బట్టిందన్నది ఆ దేవుడికే ఎరుక.
ఇంగ్లీష్, తెలుగు, లెక్కలు, ఇతర సబ్జక్టులు బోధించడానికి తరగతి గదులు విడిగా, ఉండేవి కాని సంస్కృతం క్లాసు మాత్రం, శబ్ధమంజరి, అమరకోశం చెప్పుకుంటూ మేడ మెట్ల కిందే నడిచేది. అది ఒకప్పటి జ్ఞాపకం.
మరొకప్పటి మరో జ్ఞాపకం . చాలా కాలం క్రితం, నెట్లో ఒక ఆసక్తికర సమాచారాన్ని మిత్రులు శ్రీ పీ.వీ.వీ.జీ. స్వామిగారు అమెరికా నుంచి పంపారు. ఆ ఇంగ్లీష్ వార్తకు నా తెలుగు అనువాదం నా సొంత బాణీలో :
ఒకానొకకాలంలో సూర్యుడు అస్తమించని సువిశాల సామ్రాజ్యానికి అది రాజధాని. అన్ని భాషలకు మాతృభాషగా పేరొందిన సంస్కృతం పరిఢవిల్లిన అఖండ భారతాన్ని వందల సంవత్సరాలపాటు బానిస దేశంగా పాలించిన బ్రిటిష్ ప్రభువుల రాజధాని నగరం. అలాటి ఇంగ్లీష్ గడ్డ అయిన లండన్ నగరంలో సంస్కృతాన్ని బోధించే పాఠశాల. వినడానికే విచిత్రం అనిపించినా ఇది నిజం.
లండన్ లోని సెంట్ జేమ్స్ ఇండిపెండెంట్ స్కూల్లో సంస్కృత భాషా విభాగం అధిపతి వార్విక్ జేస్సప్ మాటల్లో మిగిలింది తెలుసుకుందాం.
"ప్రపంచం మొత్తంలో సంస్కృతంతో పోల్చచదగిన ఉత్కృష్టమైన భాష మరొకటి లేదు. ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు. జర్మన్ ప్రజలు జర్మన్ మాట్లాడతారు. మాట్లాడే ప్రజల పేరుతోనే ఆ భాషలకు నామకరణం చేసారు. సంస్కృతం ఒక్కటే మినహాయింపు. ఆ ఒక్క భాష చక్కగా నేర్చుకుంటే చాలు, సైన్సు, గణితం వంటి ఇతర అంశాలపై పట్టు చిక్కించుకోవడం సులభం అవుతుంది'
ఇక ఆ స్కూలు హెడ్ మాష్టర్ పాల్ మాస్ గారు సంస్కృతం గురించి మరింత గొప్ప కితాబు ఇచ్చారు.
'దేవనాగరి లిపిలో రాయడం నేర్చుకుంటే విద్యార్ధులకు తమ చేతి వేళ్ళపై గట్టి పట్టు చిక్కుతుంది. సంస్కృతంలో మాట్లాడడం వస్తే ఇక ఆ నాలుకకు అడ్డే వుండదు. స్పష్టమైన ఉచ్చారణ అలవడుతుంది'
పాల్ మహాశయులు అంతటితో ఆగలేది. ఇంకా ఇలా వివరించారు.
'యూరోపియన్ భాషలు మాట్లాడేవాళ్ళు నాలుకలో వుండే అన్ని భాగాలను ఉపయోగించరు. నాలుక కొసతో మాట్లాడేస్తుంటారు. రాసేటప్పుడు కూడా వేళ్ళల్లోని అన్నికదలికలను వాడరు. అదే సంస్కృతం మాట్లాడడం అలవాటు చేసుకుంటే మెదడు చురుగ్గా పనిచేయడానికి అది దోహదం చేస్తుంది'
లండన్ లోని ఈ ఇంగ్లీష్ స్కూల్లో సంస్కృతం సెకండ్ లాంగ్ వేజ్ గా తీసుకునే వాళ్ళు విధిగా ఆరేళ్ళపాటు ఆ భాషను అధ్యయనం చేయాల్సివుంటుంది. (మెట్ల కింద కాదు. చక్కటి తరగతి గదులు వున్నాయి) సంస్కృత విద్యార్ధులకు స్కూల్లో శాకాహార భోజనమే లభిస్తుంది.
మరి ఇప్పుడు చెప్పండి. ఇంగ్లీష్ వాడు చెప్పాడు కనుక మనమూ సంస్కృతం గొప్పదని అనుకుందామా!
అన్నట్టు గతంలో ఆకాశవాణిలో సంస్కృతం పాఠాలు బోధించేవాళ్లు. మరిప్పుడు పరిస్థితి ఏమిటో Sivaramaprasad Kappagantu శివరామ ప్రసాద్ కప్పగంతు వారు చెప్పాలి.
తోకటపా: మొన్న సంక్రాంతికి మా ఊరు కంభంపాడు వెళ్ళాము. కంచిలో ఒక సంస్కృత విద్యాలయంలో వేదం అభ్యసిస్తున్న ఒక కుర్రవాడు మా ఇంటికి వచ్చాడు. వాళ్ళ తాతగారు ఇంగువ పురుషోత్తమ శర్మగారు, సంస్కృతం మీద తనకున్న భక్తి గౌరవాలతో మనుమడు చిరంజీవి విజయ కృష్ణ శర్మను అక్కడ చేర్పించాడు.
చదువు, బస, భోజనం అన్నీ ఉచితం. కాకపోతే మెడిసిన్ లాగా చాలా ఏళ్ళు చదవాలి. కష్టపడి చదవాలి. తెల్లవారుఝామున నిద్ర లేవాలి. బావి దగ్గర చేదతో నీళ్ళు తోడుకుని తల స్నానం చేయాలి. గోవులకు మేత వేసి పాలు పితకాలి. అక్కడ చదువుకునే పిల్లలు అందరూ ఆవు పాలే తాగాలి. గోక్షీరంతో తయారైన పెరుగుతో భోజనం చేయాలి. మొత్తం సాత్వికాహారం. అంత చిన్నతనంలో అంత దూరం వెళ్లి సంస్కృతం నేర్చుకుంటున్న ఆ పిల్లవాడిని చూస్తే చాలా ముచ్చటేసింది.
కింది వీడియోలో తాను నేర్చుకున్న సంస్కృత పనసలను మాకు వినిపించాడు.



https://www.facebook.com/reel/1468401071626669


(ఇంకా వుంది)

9, ఫిబ్రవరి 2026, సోమవారం

“ హలో! హ్యాపీ బర్త్ డే”

 " మీరు మాట్లాడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి ఎవరి పిలుపుకు అందనంత దూరంలో వున్నారు. వచ్చే జన్మలో ప్రయత్నం చేయండి" 

ఈరోజు, ఫిబ్రవరి తొమ్మిది మా ఆవిడ పుట్టినరోజు. 

చనిపోయిన వారికి పుట్టినరోజులు ఉంటాయా!

పుట్టిన తర్వాతనే కదా వాళ్ళు చనిపోయింది.













పుట్టిన తర్వాతనే కదా వారు చనిపోయింది!

7, ఫిబ్రవరి 2026, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (261): భండారు శ్రీనివాస రావు

నైహికాముష్మిక సుఖం
మహాత్ములు, స్వాములు తమ అనుగ్రహ భాషణల్లో సాధారణంగా ఆ సర్వేశ్వరుడిని తప్ప మనుష్యమాత్రుల్ని ప్రశంసించడం జరగదని నా విశ్వాసం. అయితే, తమ ధార్మిక సేవా కార్యక్రమాలకు అండదండలకోసం కొండొకచో రాజుల్ని, పాలకుల్ని పొగడడం కొత్తేమీ కాదు.
అలాంటిది చనిపోయిన ఒక వ్యక్తిని, అందునా కేవలం వివేకసంపద మినహా ఏవిధమైన లౌకిక బాహ్య సంపదలను కూడబెట్టుకోకుండా ఈ లోకం నుంచి సెలవు తీసుకున్న వ్యక్తిని బహిరంగ సమావేశంలో బాహాటంగా ఒక ఆధ్యాత్మిక గురువు అదేపనిగా ప్రశంసించిన సందర్భాన్ని నేనెరుగను.
ఆ వ్యక్తి మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు కావడం మా కుటుంబం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఇంకేమీ కాదు.
దీనికి ముందు ఒక విషయం గురించి చెప్పుకోవాలి. మా అన్నయ్య తాను జీవించి ఉన్నకాలంలో ఎంతో శ్రమకోర్చి, అనేక ప్రాంతాలు తిరిగి, కొండలు కోనల్లో ఉన్న అనేక నారసింహ క్షేత్రాలను సందర్శించి, ఆ క్షేత్రాల ప్రాశస్త్యాన్ని స్వయంగా అధ్యయనం చేసి కంప్యూటర్ల సాయం లేకుండా కేవలం చేతి రాతతో ఏడు సంపుటాలను ‘ఓం నమో శ్రీ నారసింహాయ’ అనే పేరుతో రచించారు. వాటిల్లో మొదటి మూడు ప్రచురణకు నోచుకున్నాయి. మిగిలిన ఏడింటిని సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి శ్రీ కే.ఆర్. పరమహంస గారు, మిత్రవాత్యల్యంతో డిజిటలైజ్ చేయించి నెట్లో భద్రపరిచారు. ఆ నాలుగు సంపుటాలను మా అన్నయ్య కుమార్తె కొలిపాక కృష్ణ వేణి పుస్తక రూపంలోకి తీసుకు వచ్చింది. వాటిని ఎలాటి లాభాపేక్ష లేకుండా, ఆధ్యాత్మిక భావాలు కలిగిన వారికి, ఆసక్తి ఉన్న వారికి ఉచితంగా అందచేయాలని సంకల్పించింది. ఆమె సంకల్పానికి భర్త కొలిపాక రమేష్ కుమార్ సహకారం తోడవడంతో అనుకున్న కొద్దిరోజుల్లోనే నిర్విఘ్నంగా ప్రచురణ కార్యక్రమం పూర్తయింది.
ఈలోగా అనుకోని ఒక విశేషం జరిగింది. మా అన్నగారి కుటుంబానికి పూజ్యులు అయిన శ్రీధర్ గురూజీ హైదరాబాదు వస్తున్నట్టు తెలిసి వారి శిష్యులను సంప్రదించారు. గురూజీ కూడా నరసింహోపాసకులు. ఆయన పాల్గొనే ఆ కార్యక్రమానికి నరసింహ భక్తులు అనేక మంది వస్తారు కాబట్టి గ్రంధావిష్కరణ అక్కడే చేయడం సముచితంగా ఉంటుందని అప్పుడు ముంబైలో ఉంటున్న మా అన్నయ్య కుమారుడు రాఘవరావు అందుకు తగిన ఏర్పాట్లు చేసాడు. గురూజీ శిష్యులలో ఒకరయిన వడ్డాది సత్యనారాయణ మూర్తి గారి సహకారంతో గ్రంధావిష్కరణకు గురూజీ అంగీకరించారు.
హైదరాబాదులోని ఆర్టీసీ కళా మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. మేమెవరం ఊహించని విధంగా గురూజీ గ్రంధావిష్కరణకి పెద్ద పీట వేసి ఆ సాయంత్రం యావత్ కార్యక్రమాన్ని దానితోనే ప్రారంభించారు.
సభికులతో కిక్కిరిసిన ఆడిటోరియంలో గురూజీ ఇంగ్లీష్ లో చేసిన, ఉపన్యాసాన్ని మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు సంగ్రహంగా ఇలా పేర్కొన్నారు.
“For full 20 minutes, Sridhar Guruji, spoke about Annayya (BHANDARU PARVATALA RAO) in a largely attended meeting. He started his speech like this.....
‘Normally we will start any pravachanam by invoking Lord Ganesha. Today I will start with mentioning about a great, good, knowledgeable and highly simple and dear friend Parvatalarao’
Like this Guruji spoke for 20 minutes, paying glorious tributes to Annayya. We were all deeply touched.” -
B.Ramachandra Rao
మా అన్నయ్య కుమారుడు సుభాష్ చంద్రబోస్ అన్నట్టు “ ఆయన పుట్టిన కుటుంబంలో పుట్టిన మేము కూడా అదృష్ట వంతులం అయ్యాము”
భర్తృహరి సుభాషితాల్లో ఒకదాన్ని ఏనుగు లక్ష్మణ కవి ఇలా అనువదిస్తారు:
“విద్య యొసగును వినయంబు వినయంబునను
బడయు పాత్రత పాత్రత వలన ధనము
ధనము వలనను ధర్మంబు దాని వలన
నైహికాముష్మిక సుఖంబు లందు నరుడు”
బాగా చదివే విద్యార్ధిని ఒక క్లాసు చదవకుండానే పై క్లాసులోకి ప్రమోట్ చేసేవిధంగా, మా అన్నయ్య కూడా ‘పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మంబు’ అనే పద్య పాదాన్ని తాకకుండానే (నిర్ధనుడు గానే) ‘నైహికాముష్మిక’ సుఖ ప్రాప్తి పొందాడు. ఇది సత్యం.
కింది ఫోటో:
మా పెద్దన్నయ్య గారితో నేను





(ఇంకావుంది)


(ఇంకా వుంది)

6, ఫిబ్రవరి 2026, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (260) : భండారు శ్రీనివాసరావు

 

సత్యనారాయణ పురం రైల్వే స్టేషన్
జీవితంలో చాలా విషయాలు కనురెప్పల కిందే కరిగిపోతున్నాయి.
ఒకానొక రోజుల్లో రిక్షాలు, గూడు రిక్షాలు జన జీవనంలో భాగంగా వుండేవి. ఆ రోజుల్లో రోడ్డు మీదకు రాగానే కనబడే మొట్ట మొదటి రవాణా వాహనం గూడు రిక్షా. ఇంటి గేటు వేస్తున్న చప్పుడు కాగానే నెమ్మదిగా రిక్షా లాక్కుంటూ వచ్చి ‘రిక్షా కావాలా బాబూ, ఎక్కడికి వెళ్లాలంటూ’ చనువుగా చేతి సంచీ తీసుకువెళ్ళే రిక్షా తాతలు, అందరి జ్ఞాపకాల్లో పదిలంగా వుండే వుంటారు.
రిక్షాలు లాగేవాళ్ళు కధానాయకులుగా పెద్ద పెద్ద హీరోలతో సినిమాలే వచ్చాయంటే గతంలో ‘రిక్షాలు’ ఎలాటి సోషల్ స్టేటస్ అనుభవించాయో అర్ధంచేసుకోవచ్చు.
ఇప్పుడీ రిక్షాల కాలం చెల్లిపోయి వాటితో పొట్టపోసుకునే వారి జీవితాలు రోడ్డున పడుతున్నాయి. అభివృద్ధి వల్ల కలిగే అనర్ధాల్లో ఈ పరిణామం ఒక భాగం. కొత్తనీరు వచ్చి పాత నీటిని నెట్టివేయడం కొత్తేమీకాదు. కాకపొతే, అలా మరుగునపడిపోతున్న విషయాలను ఇలా నెమరు వేసుకోవడం వల్ల కలిగే ఆనందమే వేరు. చిన్ననాటి ఫోటోలను చూసుకున్నప్పుడు కలిగే సంతోషానికి వెల, విలువ కట్టగలమా?
2010లో అమెరికా నుంచి బయలుదేరుతూ ఆఖరి వారంలో చూసిన రెండు విశేషాలు పాతలోని మధురిమను మరోసారి అనుభవంలోకి తెచ్చాయి.
పాతను ‘ఉప్పు పాతర’ వేయకుండా ఇక్కడ ఈ పరాయి దేశం వాళ్ళు యెంత జాగ్రత్త పడుతున్నారో కూడా అర్ధం అయింది.
1889లో సంభవించిన అగ్ని ప్రమాదంలో సియాటిల్ డౌన్ టౌన్ లో చాలా భాగం తగులబడిపోయింది. తరవాత దాని స్తానంలో కొత్త నగరం నిర్మితమయింది. కానీ పాతనగరం జ్ఞాపకాలను అతి పదిలంగా దాచుకుంటున్న తీరే అద్భుతం. ఆదర్శప్రాయం.
దాదాపు నూట ముప్పయ్ ఆరేళ్ల నాటి సియాటిల్ పాత బస్తీలోని కొన్ని ప్రదేశాలను ఎంపికచేసి, బేస్ మెంట్ లో పాత వాటిని మ్యూజియంలో మాదిరిగా జాగ్రత్త చేసి, పైన పలు అంతస్తుల ఆధునిక సుందర భవనాలను నిర్మించుకున్నారు. అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న పాత గృహాలను, గృహోపకరణాలను రూపు చెడకుండా ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి, భద్రపరచి, - ‘సియాటిల్ అండర్ గ్రౌండ్ టూర్’ పేరుతొ టూరిస్టులకు చూపిస్తున్నారు.
దాదాపు రెండు గంటలపాటు సాగే ఈ టూరులో ఒక గైడ్ వెంట వుండి పాతరోజుల సంగతులను కొత్త కొత్తగా చెబుతుంటాడు. ఆ కాలంలో వాడిన టైపు రైటర్లు, గోడ గడియారాలు, సోఫాలు, బాయిలర్లు, ఇంటి పైకప్పులు, దర్వాజాలు, చివరాఖరుకు బాత్ రూమ్ కమోడ్లు ఇలా అన్నిటినీ చూడవచ్చు. పదిహేను డాలర్ల టిక్కెట్టు కొనుక్కుని ఈ టూర్ లో పాల్గొనడానికి వచ్చే టూరిస్టుల సంఖ్య ఆ రాజుల్లోనే ప్రతిరోజూ వందల్లో వుంటుందంటే, పాత రోజులపట్ల ఇక్కడి ప్రజలకు వున్న కొత్త మోజు ఎలాటిదో అర్ధం చేసుకోవచ్చు.
అలాగే. ఇస్సక్క్వా (Issaquah).
సులభంగా నోరు తిరగని ఈ ఊరు సియాటిల్లోని శివారు ప్రాంతం. మైనింగ్ అవసరాలకోసం ఈ పట్టణాన్ని కలుపుతూ లోగడ ఒక రైలు మార్గం వుండేది. దాన్ని తరవాత మూసి వేశారు. ఇస్సక్క్వా హిస్టారికల్ సొసైటీ వారు ఈ పట్టణం డౌన్ టౌన్ ను ఒక చారిత్రాత్మక ప్రదేశంగా అభివృద్ధి చేసి, అప్పటి రైల్వే స్టేషన్ ను, రైలు పట్టాలను అలాగే వుంచేసి పాత జ్ఞాపకాలకు గుర్తుగా మిగుల్చుకున్నారు. (విజయవాడ లో సత్యనారాయణ పురం రైల్వే స్టేషన్ ఎత్తేసిన తరువాత దాన్ని ఒక రహదారిగా మార్చేసిన సంగతి ఇక్కడ గమనార్హం)
ఆ రోజుల్లో వుండే పెట్రోల్ (గ్యాస్) బంకులను, సినిమాహాళ్ళను యధాతధంగా వుంచేసారు. ఆధునిక నగరం సియాటిల్ నుంచి వచ్చి ఆ పాత పట్టణంలో కలయ తిరుగుతూ వుంటే, ఒక్కసారిగా ‘టైం మెషిన్’ లో గతకాలంలోకి జారిపోయిన అనుభూతి కలుగుతుంది.
పోతే, గూడు రిక్షాలేకాదు, కలికానికి కూడా కనబడకుండా పోతున్న, అంతరించి పోతున్న వస్తువుల జాబితా మన దగ్గర తక్కువేమీ లేదు. తిరగళ్లు, రోకళ్లు, రుబ్బురోళ్లు, ఎడ్లబళ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత. అన్నట్టు చాంతాడు కూడా ఇక ఇలాటి సామెతలకే పరిమితం.
కింది ఫోటో :
2010 లో ఇస్సక్వా పట్టణంలో అలనాటి పాత పెట్రోల్ బంకులో నేను.



(ఇంకా వుంది)

రాజ్యం లేని భోజరాజు – భండారు శ్రీనివాసరావు

ఆయనకు, కవులు, రచయితలు, పాత్రికేయులు, సమాజంలోని వివిధ రంగాల వాళ్ళు బహు ఇష్టులు. ఒక్కముక్కలో చెప్పాలి అంటే ఆయనకు మనుషులంటే ఇష్టం. ఎప్పుడూ నలుగురిలో వుండడానికి అంతగా ఇష్టపడే మనిషిని మరొకర్ని చూడలేదు. ఆయన నిజమైన హ్యూమనిస్ట్. మానవతావాది.
అందుకే నిన్న హైదరాబాదులో జరిగిన ఆయన సంస్మరణ సమావేశానికి అంతమంది తరలి వచ్చారు. వారిలో పెక్కురు ఆయనతో తమకున్న అనుబంధాన్ని నలుగురితో పంచుకున్నారు.
ఇంతకీ ఆయన ఎవరంటే, మొన్నీమధ్య కన్ను మూసిన వెనిగళ్ళ వెంకట రత్నం గారు.
‘మంచి పనులు చేయడానికి వనరులు అక్కరలేదు, మంచి మనసు వుంటే చాలు అని నిరూపించి నిశ్శబ్దంగా మన మధ్యనుంచి నిష్క్రమించిన వ్యక్తి వెంకట రత్నం’ అని ఈ సమావేశంలో ప్రసంగించిన పలువురు వక్తలు పేర్కొన్నారు.
మంచి మనసే కాదు, అవసరంలో వున్నవారికి సాయపాడాలి అనే తపన కూడా ఆయనకు వుంది. ఆ తపన ఎంతవరకూ అంటే తాను చనిపోయిన తర్వాత తన దేహాన్ని వైద్య విద్యార్ధులకు ఉపయోగపడడానికి దానం చేయాలని కుటుంబసభ్యులకు నచ్చచెప్పే వరకూ వెళ్ళింది. వారూ ఆయన అంతిమ కోర్కెను తీర్చి, వెంకటరత్నం గారి భౌతిక దేహాన్ని ఒక వైద్య కళాశాలకు అప్పగించారు.
ఈ సమావేశానికి హాజరైన వారిలో కూడా కొందరిలో దేహ దానం చేయాలనే స్పూర్తి రగిలింది అంటే, మరణానంతరం కూడా ఆయన జీవిస్తున్నట్టే లెక్క.
అక్కడికి వచ్చిన వారిలో చాలామంది ఒక మాట చెప్పుకోవడం వినపడింది. నిజానికి మంచి ఆలోచనే.
డెబ్బయి దాటిన బంధు మిత్రులను చూడాలని అనిపించినప్పుడు, వాయిదా వేయకుండా వెంటనే వెళ్లి చూడాలి. ‘మొన్న ఆ పెద్దమనిషిని కలిసాను, నిన్ను గుర్తు చేసుకున్నారు’ అని ఎవరైనా చెబితే, ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్లి, ఆయన్ని చూసి రావడం మరీ మంచిది అనేది ఈ మాటల సారాంశం.



(05-02-2026)