19, ఆగస్టు 2023, శనివారం

ఫోటో – భండారు శ్రీనివాసరావు

 

నా చిన్ననాటి స్నేహితుడు, సహాధ్యాయి ప్లస్ మేనల్లుడు అయిన తుర్లపాటి సాంబశివరావు (శాయిబాబు) దగ్గర ఒక డబ్బా డొక్కు కెమెరా వుండేది. అది పనిచేసేదా కాదా తెలుసుకోవాలి అంటే పదో పదిహేనో రూపాయలు కావాలి. రీలు కొనడానికి ఓ పది, కడిగించి ప్రింట్లు వేయడానికి మళ్ళీ కొంతా ఇల్లాగన్న మాట.  అంత మొత్తం మాదగ్గర ఎలాగూ వుండదు కాబట్టి, అదో టాయ్ కెమేరాలాగా శాయిబాబు వద్ద చాలా కాలం ఉండిపోయింది.

ఒకరోజు దాని అవసరం వచ్చింది. అప్పటికి చదువు  పూర్తి కాకుండా, ఉద్యోగం సద్యోగం కనుచూపుమేరలో లేదన్న సంగతి నిర్ధారణగా తెలిసిన రోజుల్లో, పక్కింటి అమ్మాయితో (అంటే తదనంతర కాలంలో మా ఆవిడ) నా ప్రేమ వ్యవహారం నిరాఘాటంగా సాగిపోతున్న అద్భుత కాలంలో నాకు ఆ కెమెరా కావాల్సి వచ్చింది. కృష్ణా  బ్యారేజి దాకా నడుచుకుంటూ వెళ్లి అక్కడి నుంచి గూడు రిక్షాలో మంగళగిరి పానకాల స్వామి దర్శనం చేసుకుని రావాలనేది నా ప్లాను. మరో మేనల్లుడు రామచంద్రం మన కూడా వస్తేనే నేను వస్తానని నాకు కాబోయే ఆవిడ  షరతు పెట్టడంతో,  ముగ్గురం కలిసి వెళ్ళాము.  దర్శనం అదీ అయిన తర్వాత అక్కడి కొండపై ఇదిగో ఈ కింది ఫోటో దిగాము. తీసింది రామచంద్రం. కెమెరా ఇచ్చేటప్పుడే చెప్పాడు. రీల్లో ఆల్రెడీ తీసిన ఫోటోలు కొన్ని వున్నాయి. డబ్బులు లేక కడిగించలేదు, కాబట్టి ఒకటీ లేదంటే రెండు, అంతే అంతకంటే ఎక్కువ దిగకండి అని. దాంతో ఒక్కటంటే ఒక్క ఫొటోనే దిగి కెమెరా తిరిగి ఇచ్చేశాను. 

ఆ రీలు కడిగించే డబ్బులు కూడ బెట్టడానికి మరి కొన్ని నెలలు ఆగాల్సివచ్చింది. వీరన్న స్టూడియోలో ఇచ్చాము. రెండు రోజుల తర్వాత చూస్తే రీల్లో చాలా ఫోటోలు  ప్రింటుకు పనికిరానివని తేలింది. చివరికి ఐదో ఆరో బాగున్నాయి. కానీ అన్నీ ప్రింటు వేయించాలి అంటే డబ్బులు సరిపోవు. అంచేత ఓ మూడు వేయించాము. అందులో ఇదొకటి.



పెళ్ళికి ముందు ఫోటో కదా! అదో స్వీట్ మెమొరి.

(ఈరోజు, ఆగస్టు 19, వరల్డ్  ఫోటోగ్రఫీ డే అట కదా!)

6, ఆగస్టు 2023, ఆదివారం

రష్యన్ కనెక్షన్ – భండారు శ్రీనివాసరావు

 మిహాయిల్ గోర్భచెవ్ లక్ష్మణ కుమార్

అరవై పడిలో పడిన వారికి గోర్భచెవ్ ఎవరో తెలిసే వుండొచ్చు. కానీ లక్ష్మణకుమార్ అనే అచ్చ తెలుగు పేరున్న కన్నడిగుడైన వ్యక్తికి ఏం సంబంధం?
తొంభయ్యవ దశకంలో రేడియో మాస్కోలో పనిచేస్తూ వున్నప్పుడు ఆ అయిదేళ్ళ పాటు సోవియట్ ప్రైం టైం టీవీలో అస్తమానం ప్రముఖంగా కనిపించే వ్యక్తులు ఎవరయ్యా అంటే సోవియట్ యూనియన్ అధినాయకుడు మిహాయిల్ గోర్భచెవ్, ఆయనతో పాటు ఇదిగో ఈ లక్ష్మణకుమార్ గారు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో పనిచేసే సిబ్బంది పిల్లల చదువు సంధ్యల కోసం ఎంబసీ వారు నెలకొల్పిన ఇండియన్ సెంట్రల్ స్కూల్లో యోగా టీచర్. అలనాటి అంటే దాదాపు ముప్పయ్ ఆరేళ్ల క్రితమే సోవియట్ పౌరులకు యోగాలో శిక్షణ ఇచ్చేందుకు వారానికి ఒకరోజు సోవియట్ ప్రైం టైం టీవీ ఛానల్ లో నిర్విరామంగా ఒక గంటకు పైగా యోగా పాఠాలు చెబుతూ కానవచ్చే వారు. బహుశా ఒక విదేశీ ప్రైం ఛానల్లో ప్రముఖంగా కనిపించే అవకాశం సకృత్తుగా కొందరికే లభిస్తుందేమో. అలాంటిది సోవియట్ యూనియన్ వంటి ఇనుపతెరల దేశంలో ఇది మరీ అసాధ్యం. అలాంటి అరుదైన మహత్తర అవకాశం లక్ష్మణ కుమార్ గారికి అయాచితంగా దొరికింది.
మా ఇద్దరు పిల్లలు మాస్కోలో అదే కేంద్రీయ పాఠశాలలో చదువుతున్నప్పుడు లక్ష్మణకుమార్ గారి పిల్లలు గిరిజ, గీతేశ్ మా పిల్లలు సందీప్, సంతోష్ క్లాస్ మేట్స్.
సరే! మా జీవితంలో ఒక అద్భుత ఘట్టానికి, సోవియట్ యూనియన్ అంగ వంగ కళింగ దేశాల మాదిరిగా విడిపోవడానికి ఒకేసారి తెర పడింది. దాంతో ఎక్కడివాళ్ళం అక్కడ తట్టా బుట్టా సర్దుకుని స్వదేశానికి తరలి వచ్చాం.
మాస్కోలో కలిసి మెలిసి ఉన్న మా రెండు కుటుంబాలు మళ్ళీ కలవడం అన్నది పాతికేళ్ళ తర్వాత ఒకసారి జరిగింది. ఏదో పనిమీద హైదరాబాదు వచ్చిన లక్ష్మణ కుమార్ దంపతులు మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. అప్పుడు మా ఆవిడ వుంది. మళ్ళీ నిన్న కలిశాము ఆవిడ లేకుండా. చాలా బాధ పడ్డారు విషయం తెలిసి. ఏమీ చేయగలిగింది లేదు వాళ్ళు, నేనూ కూడా.
ఆయనకు 88, మనిషిలో తేడా లేదు, కొంచెం వినికిడి శక్తి తగ్గింది. నాకు 78. చిన్నప్పటి నుంచి ఎవరి మాటా వినే అలవాటు లేదు. అంచేత నాకూ చెవుడే. కులాసాగా పాత కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశాము. భోజనం చేస్తూ పాత విషయాలు నెమరేసుకున్నాము.
తోకటపా
డెక్కన్ సేరాయ్ స్టార్ హోటల్ వాళ్ళు అతి ఖరీదైన డిష్ వడ్డించారు. అదే టమాటా పప్పు.
కింది ఫోటోల్లో : లక్ష్మణకుమార్ దంపతులను శాలువాలతో సత్కరిస్తూ నేను, గూపు ఫోటోలో అందరం. ఈ ఫోటోలో ఓ రష్యన్ గృహిణి వున్నారు. అపోలో ఆసుపత్రిలో పనిచేసే గుండె వైద్యుడు డాక్టర్ సతీష్ గారి నాన్నగారు భారత మిలిటరీలో అధికారి. రష్యన్ యువతి జోయా (ZOYA) అప్పుడు వారి నాన్నగారి ఉద్యోగ రీత్యా (ఆయన గారు కూడా రష్యన్ మిలిటరీ అధికారే, సోవియట్ ఎంబసీలో అధికారి) ఢిల్లీలో వుండగా పరిచయం. గుండె డాక్టర్ కదా, సతీష్ గారు, ఆవిడా గుండెలు మార్చుకుని ప్రేమించుకుని మరీ పెళ్లి చేసుకున్నారు. 1992 నుంచి ఇక్కడే వుంటూ తెలుగు బాగా నేర్చుకుని తెలుగు జోయా గారు అయిపోయారు. అదన్న మాట.






(04- 08- 2023)

20, జులై 2023, గురువారం

అన్ని రోడ్లు అటువైపే - భండారు శ్రీనివాసరావు


ఈ కింది సంభాషణలు చిత్తగించండి:
ఇంటర్వ్యూ బోర్డ్ సభ్యుడు:
“ఐ.ఐ.టి. టాపర్ మీరు. ఐ.ఏ.ఎస్. కావాలని ఎందుకు అనుకుంటున్నారు?”
“ఐ.ఏ.ఎస్. అధికారిగా ప్రజలకు ఎక్కువ సేవ చేయడానికి వీలుంటుందని భావించాను”
విలేకరి:
“మీరు ఒక ఐ.ఏ.ఎస్. అధికారి అయివుండి ఎందుకు రాజీనామా చేసి రాజకీయాల్లో చేరదామని అనుకుంటున్నారు?”
“రాజకీయాల్లో వుంటే మరింత ఎక్కువగా ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉంటుందనే నమ్మకంతో రాజీనామా చేసి రాజకీయాల్లో చేరుతున్నాను”
విలేకరి:
“రాజకీయాల్లోకి వచ్చారు సరే! కొత్తగా ఒక పార్టీ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?”
“అలా అయితేనే మనం అనుకున్న విధంగా ప్రజాసేవ చేయవచ్చని నాకు గట్టిగా అనిపించింది”
విలేకరి:
“దేశంలోనే కాదు ప్రపంచంలోనే మీరు పెద్ద పారిశ్రామికవేత్త. అనేక స్వచ్చందసంస్థలకు కోట్ల రూపాయలు భూరి విరాళాలు ఇస్తుంటారు. మరి రాజకీయ ప్రవేశం చేయాల్సిన అవసరం ఏమివచ్చింది”
“మనం కోరుకున్న విధంగా ప్రజాసేవ చేయాలంటే రాజకీయాలను మించిన మార్గం లేదు కనుక”
విలేకరి:
“సినిమా రంగంలో మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు. ఒక్కసారి మిమ్మల్ని తాకితే చాలు, జన్మ ధన్యం అనుకునే అభిమానులు మీకు లక్షల్లో వున్నారు. ఏ సినిమా వేసినా కాసుల వర్షం కురుస్తుంది. ఈ వయసులో ఎండ అనకా, వాన అనకా ప్రజాసేవ కోసం అంటూ ఈ తిరుగుళ్ళు ఏమిటి?”
“ఎంత సంపాదించినా, ఎంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నా సమాజానికి తిరిగి ఎంతోకొంత ఇవ్వాలని ఈ మార్గం ఎంచుకున్నా. నా దృష్టిలో ప్రజాసేవ చేయాలంటే ఇదొక్కటే మార్గం”
విలేకరి:
“మీ నాన్నగారు రాజకీయ రంగంలో పేరెన్నిక కన్నవారు. మీరేమో విదేశాల్లో ఉన్నత చదువులు చదివారు. గొప్ప కంపెనీకి సీ.ఈ.ఓ. వృత్తి పరంగా అనేక దేశాలు అలవోకగా చుట్టి వస్తుంటారు. ఆ జీవితం వదులుకుని ఇప్పుడు రాజకీయ అరంగేట్రం ఎందుకు చేసినట్టు”
“నాన్నగారికి రాజకీయ వారసుడిగా కాదు, ఆయన ఆలోచనలకు, తలపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజాసేవకు ఇది ఉత్తమ మార్గంగా నాకు తోచింది”
విలేకరి:
“మీరు గొప్ప జర్నలిష్టు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు మీ మాట శిరోధార్యం.అలాంటిది మీరు కూడా రాజకీయ తీర్థం పుచ్చుకోవడం ఆశ్చర్యంగా వుంది”
“మనం ఎన్ని రాసినా, ఎన్ని హితోక్తులు చెప్పినా సమాజాన్ని మార్చాలి అంటే రాజకీయాలు తప్పిస్తే వేరే దోవ కనిపించలేదు. అందుకే ఈ మార్గం పట్టాను”
ఇలాంటి సంభాషణలు తరచుగా వింటున్నప్పుడు సామాన్యుడికి కలిగే అభిప్రాయం ఒక్కటే!
చివరికి ప్రజాసేవ కూడా సోషలిజం లాగా అర్ధంపర్ధం లేకుండా వాడే పదంగా మారిపోయిందని.
తోకటపా:
తపస్సు చేసుకోవడానికి అడవుల్లోకి వెళ్ళనక్కరలేదు. ఉన్నచోట వుండే భగవధ్యానం చేసుకోవచ్చు.

19, జులై 2023, బుధవారం

మౌనమే నీభాష – భండారు శ్రీనివాసరావు

 మొన్న జ్వాలా ఫోన్ చేశాడు.

‘ ఎప్పుడూ మేము చేయడమేనా! నువ్వు ఫోన్ చేయవా?

నిజమే! కాల్ లిస్టు తీసి చూస్తే అవుట్ గోయింగ్ ఒకటి రెండు కూడా లేవు. అన్నీ ఇన్ కమింగే.

సాయంత్రం అన్నయ్య కుమార్తె వేణి ఖమ్మం నుంచి ఫోన్ చేసింది.

ఏమిటి విశేషం అన్నాను మామూలుగా.

అదే బాబాయ్ నేను చెబుదామని అనుకున్నది. విశేషం ఉంటేనే ఫోన్ చేయాలా! మామూలుగా  ఫోన్ చేసి క్షేమ సమాచారాలు కనుక్కుంటే చాలా బాగుంటుంది అన్నది. అంతే కాదు చిన్నతనం నాటి ఒక వృత్తాంతం  చెప్పింది. అన్నయ్య ఉద్యోగ రీత్యా వైజాగ్ లో వున్నప్పుడు పోస్టాఫీసు నుంచి ఓ డజన్ కార్డులు కొనుక్కు వచ్చి వేణి చేతికి ఇచ్చి చెప్పాడుట. ‘అడ్రసు కూడా రాసి పెట్టాను. నువ్వు చేయాల్సింది అల్లా వారానికి ఒక కార్డు కంభంపాడులో ఉన్న బామ్మకు పోస్టు చేయి. పెద్ద విశేషాలు రాయక్కరలేదు. మేము క్షేమం, మీరు కులాసాగా వున్నారని భావిస్తాను అని రాయి చాలు. పల్లెటూళ్ళో ఉంటున్న ఆమెకు ఈ సమాచారం ఎంతో ఊరట ఇస్తుంది. మనమంతా తనకు మానసికంగా దగ్గరగా వున్నామనే భావన పెద్దవాళ్లకు చాలా సంతోషం కలిగిస్తుంది. ఈ వయసులో వారికి కావాల్సింది ఇంతకంటే ఏమీ వుండదు అని.

‘నాన్న చెప్పింది నా మనసులో ముద్ర పడింది. అందుకే మీ వంటివారికి తరచుగా ఫోన్  చేసి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను’

 మంచి నిర్ణయం వేణీ అన్నాను.

జ్వాలా చెప్పింది, వేణి చెప్పింది ఒకటే.

నిజానికి ఇలాంటి మాటలు అన్నీ నేనే ఒకప్పుడు ఫేస్ బుక్ లో పోస్టు చేస్తూ వచ్చాను.

‘మధ్య మధ్య కలుస్తూ వుంటేనే కుటుంబ బంధాలు, మధ్య మధ్య  మాట్లాడుకుంటూ వుంటేనే స్నేహ సంబంధాలు’ అంటూ గొప్పగా నీతులు చెప్పాను. కానీ నేను చేస్తున్నది ఏమిటి?

పక్కవారికి చెప్పేటందుకే నీతులు వున్నాయి  అనుకోవాలా!

చేతిలో ఫోన్ అస్తమానం వుంటుంది. వెనుకటి మాదిరిగా గుండె గుభిల్లుమనే చార్జీల బాధ లేదు. మరి ఎందుకీ నిర్లిప్తత.

నాకూ చిన్నతనం గుర్తుకు వచ్చింది. సొంతంగా ఇంట్లో ఫోన్ లేకపోయినా మిత్రులతో, చుట్టాలతో మాట్లాడాలని తాపత్రయ పడేవాళ్ళం.  పుట్టిన రోజు సందర్భాల్లో  ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలుపుకునే వాళ్ళం. ఇప్పుడూ చెబుతున్నాం. ఫేస్ బుక్ లోనూ, వాట్సప్ లోనూ  మొక్కుబడిగా షరా మామూలు గ్రీటింగ్ పెట్టి ఊరుకుంటున్నాం. అదీ ఫేస్ బుక్ వాడు గుర్తు చేస్తేనే సుమా. వాళ్ళు చూస్తారో తెలియదు. ఒక పని అయిపొయింది అనుకుంటాం. అలా కాకుండా ఆ ఒక్కరోజు ఫోన్ చేసి శుభకామనలు తెలియచేస్తే ఎంత బాగుంటుంది.

అంత తీరికలేని పనులు ఏమీ లేవు కదా!

కానీ ఇంత చిన్న చిన్న పనులు ఎందుకు చేస్తాం!    



Courtesy Cartoonist

 

శ్రీ రమణ ఇక లేరు

 1975 లో ఆంధ్ర జ్యోతి నుంచి నా నిష్క్రమణ అనంతరం ఎడిటర్ నండూరి రామమోహనరావు గారి కోరికపై శ్రీ రమణ గారు జ్యోతిలో చేరారు. తర్వాత కాలంలో శ్రీ రమణ గారు హైదరాబాద్ వచ్చారు. వారిని ఐ. వెంకట్రావు గారు నాకు మహా టీవీలో పరిచయం చేశారు. రాతల్లో వుండే శ్లేష, వ్యంగం ఆయన మాటల్లో కూడా తొంగి చూసేది. నేనంటే ఇష్టపడేవారు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం. నిజానికి ఆయన మాట్లాడేవారు నేను వింటూవుండేవాడిని. అలా వినడం నాకు ఇష్టం. ఇక మిధునం విడుదల అయినప్పుడు హైదరాబాద్ లో వున్న పది కుటుంబాల వాళ్ళం కట్టకట్టుకుని ఫస్ట్ డే ఫస్ట్ షో కి వెళ్ళాం. బహుశా శంకరా భరణం తర్వాత అలా ఇంటిల్లపాది కలిసి చూసిన చిత్రం మిథునం మాత్రమే. ఆ సినిమాకు నేను ఫేస్ బుక్ లో రాసిన రివ్యూ చదివి శ్రీ రమణ గారు నాకు ఫోన్ చేసి అభినందించడం గర్వంగా ఫీలవుతాను. బాపు గారి చూసి రాతతో పబ్లిష్ చేసిన మిథునం పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు.

పొద్దున్నే V Chowdary Jampala గారు శ్రీ రమణ గారు చనిపోయారు అని పెట్టిన పోస్టు చూసి నిర్ఘాంత పోయాను. అంత నిశ్శబ్దంగా దాటి పోవడం ఆయనకే చెల్లు. బాపు రమణల సాన్నిధ్యంలో స్వర్గంలో ఆయనకు ఏ లోటు వుండక పోవచ్చు. కానీ ఆయన లేని లోటు తెలుగు పాఠకులకే.
వారికి సద్గతులు కలగాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏




17, జులై 2023, సోమవారం

తట్టిలేపే జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు

 

మధ్య తరగతి వాళ్ళు అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఒక పగటి కల కంటూ వుంటారు. ఏదో ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని.(చిన్నిల్లు, పెద్దిల్లు అనే పాడు అపార్థాలు చేసుకోవద్దు ప్లీజ్)

అలా నేనూ మా ఆవిడా విడివిడిగా, కలివిడిగా  కలలు కనే రోజుల్లో కలలో మేము కట్టుకోబోయే  ఆ కొత్త ఇంటికి పూజ గది విడిగా వుండాలని కోరుకునేది తాను. అద్దె ఇళ్ళు మారుస్తూ హైదరాబాదును ఏళ్ళ తరబడి చుట్టబెడుతున్న తరుణంలో పూజ గది వుండే అద్దె ఇల్లు దొరకడం అసాధ్యం. అంచేత చిక్కడపల్లి దాకా వెళ్లి ఇదిగో ఈ కింద ఫోటోలోని పూజ అల్మరా ఒకటి కొనుక్కొచ్చుకుంది.  అందులో దేవుళ్ల విగ్రహాలు, ఫోటోల సంచితాన్ని భద్రపరచుకుంది. నేనెప్పుడూ  లెక్కపెట్టలేదు కాని ముక్కోటి దేవతలు అందులో కొలువు తీరారు అనిపించేది. 

ఈరోజు జులై 17. అంచేతే కాబోలు ఓ జ్ఞాపకం మనసుని తట్టి లేపింది.

నాలుగేళ్ల క్రితం అంటే 17-07-2019 నాడు పొద్దున్నే ఏదో ఛానల్ డిబేట్ కి వెళ్లి ఇంటికి తిరిగొచ్చేసరికి మా ఆవిడ పూజ అల్మరాలో దేవుళ్ళు అందరూ కట్టగట్టుకుని మాయం అయిపోయారు. ఏమిటీ విష్ణు మాయ అనుకుని ఆశ్చర్య పోతూ ఉండగానే శుభ్రంగా తోమిన దేవుడి విగ్రహాలను మరింత మెరిసేలా తుడుస్తూ మా ఆవిడ ప్రత్యక్షం అయింది.

“ అమ్మయ్య! దేవుళ్ళు అందరూ  తలంట్లు పోసుకుని గూటికి చేరుతున్నారు “ అని ఓ జోకు జోకాను.

ఈ జోకు మా ఆవిడ విన్నదో లేదో కాని ఆమె చేతిలో ఉన్న దేవుళ్ళు విన్నారు, విని కోపగించుకున్నారు  అన్న సంగతి నెల తర్వాత తెలిసి వచ్చింది.

సరిగ్గా నెలలోపే ఆగస్టు 18న, ఇంట్లో  దేవుళ్ళు అందరూ అలాగే  వున్నారు. వాళ్లకు నిత్య పూజలు చేసే దేవతే లేకుండా వెళ్లి పోయింది.

దేవుళ్లా! మజాకా!



17-07-2023

13, జూన్ 2023, మంగళవారం

సన్ ఆర్ సన్ ఇన్ లా పాలసి – భండారు శ్రీనివాసరావు

 

నేను రేడియోలో చేరిన కొత్తల్లో సచివాలయంలో ఓ ఉన్నతాధికారి పరిచయం అయ్యారు. మంచి స్నేహశీలి. అడగనివాడిదే పాపం అన్నట్టు ఎవరు ఏది అడిగినా అది తన చేతిలో పనయితే వెంటనే చేసిపెట్టేవారు. ఉద్యోగం, బదిలీ ఇలా ఎవరు ఏ పని కోరినా, ‘కాదు, కుదరదు’ అని చెప్పే అలవాటు ఆయనకు లేదు. అలా అని డబ్బు కోసం సాయం చేయడం ఇంటావంటా లేదు. నిక్కచ్చి మనిషి. నిజాయితీ పరుడు.
సాయం కోరి నా దగ్గరకు వచ్చిన వారిని నేను ఆయన దగ్గరకు తీసుకువెళ్ళే వాడిని. ఏం కావాలో కనుక్కుని ఆ పని ఏమిటో ఆ వివరాలు ఓ చిన్న పుస్తకంలో రాసుకునేవారు. ‘రేపు రండి చెబుతాను’ అనేవారు. ఎన్నిసార్లు ఆయన దగ్గరకు పోయినా ఇదే వరస. ‘రేపు రండి’ అని పంపించేసేవారు. మరునాడు వెడితే పనిచేసి పెట్టడమో, లేక ఆ పని అయ్యేది కాదు అని మొహం మీద చెప్పడమో జరిగేది. చాలా సందర్భాలలో వచ్చిన వాళ్లకు ఆశాభంగం కలగకుండా పనిచేసి పంపించేవారు. మరి, ఇంత మాత్రం దానికి రేపు రమ్మనడం దేనికి అనే మీమాంస నన్ను వెంటాడేది.
తర్వాత విచారించగా తెలిసింది ఏమిటి అంటే ఆయనది ‘సన్ ఆర్ సన్ ఇన్ లా పాలసి’.
ముందు ఏ సాయం అయినా కొడుకు లేదా అల్లుడు. తర్వాతే ఎవరయినా అనేది ఆయన పెట్టుకున్న పద్దతి.
వచ్చిన వాడు బదిలీ అడిగాడు అనుకోండి. ఆ సాయంత్రం ఇంటికి వెళ్లి కొడుకు, అల్లుడు లేదా కోడలు, కుమార్తెతో సంప్రదించేవాడు. పనిమీద వచ్చిన వాళ్ళ పని చేసి పెడితే, దానివల్ల తన పిల్లలకు ఏమైనా ఇబ్బంది ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకునే వారు. ఉదాహరణకు ఉద్యోగం అనుకోండి, అదే ఉద్యోగానికి తన కొడుకు, లేదా అల్లుడికి సాయం కోరినవారు పోటీ అవరు అనేది తేల్చుకున్న తర్వాతనే, వారి పని చేసి పెట్టేవారు. అలాగే బదిలీ. బదిలీ అడిగిన వాళ్ళకు చేసిపెడితే దానివల్ల తన పిల్లలకు ఏమీ తభావతు రాదు అని నిర్ధారించుకున్న తర్వాత కానీ వచ్చిన వారి విషయం పట్టించుకునే వాడు కాదు. వినడానికి విడ్డూరంగా ఉండవచ్చు కానీ ఈ నియమాన్ని ఆ అధికారి చాలా కాలం పాటించడం నాకు తెలుసు.
అడిగినవాడికి లేదనకుండా సాయం చేస్తూ వచ్చిన ఆయన, తనపై ఏ మచ్చా పడకుండా ఉద్యోగ విరమణ చేశాడు. ఆ తర్వాత కొద్దికాలానికి ఆయన పోయినట్టు తెలిసింది. ఆయన వల్ల సాయం పొందిన అనేకమంది, తమ ఇంట్లో మనిషి పోయినట్టుగా బాధ పడ్డారు.
ధృతరాస్ట్రుడికే కాదు, పుత్రప్రేమ అనేది మనుషులకు పుట్టుకతోనే వస్తుందేమో.