18, ఏప్రిల్ 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో ( 143 ) - భండారు శ్రీనివాసరావు

 ఏ నీతివాక్యం అయినా సరే,  ఏ ఒక్కరికో అనుకూలం కాదు. ఏ ఒక్కరికో ప్రతికూలం కాదు. నీతి అంటేనే ధర్మం. ధర్మానికి స్వపర బేధాలు వుండవు.

వర్తమానంలో ఏది సరైన దారి అని చెప్పేదే గతం. దాన్ని నుంచి పాఠం నేర్చుకుంటే భవిష్యత్తు బాగుంటుంది.

ఇది ఇప్పటి మాట కాదు, జరిగి అటూ ఇటూగా  అరవై ఏళ్ళు.

బెజవాడ రైల్వే ప్లాటు ఫారం. కృష్ణా జిల్లా కలెక్టర్ హడావిడిగా రాత్రివేళ అక్కడికి చేరుకున్నారు. కారణం వుంది. రైల్వే అధికారులపై ఆయనకు ఆగ్రహం కలిగింది. హైదరాబాదు నుంచి వైజాగ్ వెడుతున్న ఒక ఉన్నతాధికారికి కలిగిన అసౌకర్యం అందుకు కారణం. అధికారి రైల్వే రిజర్వేషన్ గురించి ముందుగానే రెవెన్యూ అధికారులు  బెజవాడ రైల్వే వారికి సమాచారం అందించి, రిజర్వేషన్ గురించిన అర్జీ ముందుగానే అందచేశారు కూడా. ఆ రోజుల్లో రిజర్వేషన్ల వ్యవహారం ఇప్పట్లా కంప్యూటర్ల సాయంతో జరిగేది కాదు. హైదరాబాదు నుంచి వైజాగ్  వెళ్ళే వాళ్ళు బెజవాడలో రైలు మారి మరో రైల్లో వెళ్ళాలి. బెజవాడలో రైల్వే అధికారులు తయారు చేసిన రిజర్వేషన్ చార్టులో హైదరాబాదు అధికారి పేరు లేదు. రెవెన్యూ అధికారులకు ఏం చెయ్యాలో పాలిపోలేదు. కలెక్టర్ నేరుగా రైల్వే ఉన్నతాధికారితో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. రైల్వే వారికీ, రెవెన్యూ వారికీ మాట పట్టింపు వచ్చింది. ఎవరికి వారు తమ వాదనే సరయినది అనుకోవడం వల్ల ఆ పట్టింపు పంతానికి దారి తీసింది. రిజర్వేషన్ ఇవ్వడం కుదరదు అంటే కుదరదు అన్నారు.

కలెక్టర్ తన పవర్ చూపించారు. తనకున్న జిల్లా మేజిస్ట్రేట్ అధికారాలను ఉపయోగించుకుంటూ, అక్కడికక్కడే ప్లాటుఫారం మీదనే కోర్టు ఏర్పాటు చేశారు. దురుసుగా ప్రవర్తించిన రైల్వే అధికారిని అరెస్టు చేయాలని ఆర్డరు వేశారు. రైల్వే వారికి పరిస్తితి అర్ధం అయింది. మెట్టు దిగి వచ్చి హైదరాబాదు అధికారికి బెర్తు ఏర్పాటు చేశారు.

ఇది జరిగి కూడా అరవై ఏళ్ళు దాటింది. ఆ రోజుల్లో పత్రికల్లో చిన్న వార్తగా వచ్చింది. అప్పటి హైదరాబాదు పొలిమేరల్లో ఉన్న మిలిటరీ కంటోన్మెంటు నుంచి ఒక సైనిక జవాను నగరానికి వచ్చాడు. సినిమాహాల్లో కాబోలు అతడికీ స్థానిక పోలీసు జవానుకూ నడుమ ఒక తకరారు వచ్చింది. అది ముదిరి చేతులు కలుపుకునే దాకా వెళ్ళింది. స్థానిక పోలీసు తనకున్న స్థానబలంతో ఆ మిలిటరీ జవానును తీసుకువెళ్ళి లాకప్పులో పడేశాడు. ఈ సమాచారం కాస్త ఆలస్యంగా కంటోన్మెంటుకు చేరింది. ఒక ట్రక్కులో సైనికులు ఆ పోలీసు స్టేషన్ కు చేరుకొని స్థానిక పోలీసులకు దేహశుద్ధి చేసి తమ సహోద్యోగిని బందీఖానా నుంచి విడిపించి వెంటబెట్టుకు వెళ్ళారు. ఆ కాలంలో సమాచార వ్యాప్తి మెల్లగా జరిగేది కనుక, విషయం పైఅధికారులకు తెలిసేసరికి కొంత ఆలస్యం అయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నడుమ వ్యవహారం కాబట్టి అది మరింత ముదరకుండా ఇరువైపులా ఉన్నతాధికారులు సర్దుబాటు చర్యలు తీసుకున్నారని పత్రికా వార్తల కధనం.

“విద్యా సంస్థలు బంద్  అని టీవీల్లో స్క్రోలింగులు కనబడగానే మా అమ్మాయి బడికి వెళ్ళకుండా ఇంట్లో వుండిపోతుంది. యెంత చెప్పినా వినదు. ఇక  స్కూళ్ళు కూడా అలాగే మూసేస్తున్నారు. ఇదంతా మీడియా సృష్టిస్తున్నభయాందోళనల వల్లే”.

ఈ మాటలు అన్నది సాక్షాత్తూ ఒకప్పటి  హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ ఏకే ఖాన్ అంటే నమ్మ శక్యం కాకపోవచ్చు కానీ ఇది నిజంగా నిజం.

చాలా ఏళ్ళ క్రితం నగరంలో జరిగిన ఒక  సమావేశంలో మాట్లాడుతూ ఆయన తన మనసులోని మాటలను బయట పెట్టారు. ఈ క్రమంలో ఇజ్రాయల్ దేశాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. “ఆ దేశంలో యెంత పెద్ద హింసాత్మక సంఘటన జరిగినా అక్కడి మీడియా ఆ విషయాన్ని లోపలి పేజీల్లో ప్రచురిస్తుంది. అభివృద్ధికి సంబంధించిన వార్తల్ని ప్రముఖంగా మొదటి పేజీల్లో వేస్తుంది. మన దగ్గర మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా జరుగుతోంది. స్తానికంగా పరిమితమయిన సంఘటనలను సార్వత్రికం చేసి వార్తలు ప్రచారం చేయడం వల్ల లేనిపోని అనర్ధాలు జరుగుతున్నాయి.”

కొత్వాల్ గారు అంతటితో ఆగలేదు.

ఇతరుల హక్కులకు భంగం కలగకుండా ఉద్యమాలను నిర్వహించుకోవాలని హితవు పలికారు.

“రోడ్ల మీద భైఠాయించి ఇతరుల హక్కులకు భంగం  కలిగించే స్వేచ్చ ఆందోళనకారులకు ఎక్కడిద”ని నిలదీశారు.

ఖాన్ గారి ఈ  భావజాలంతో ఏకీభవించాల్సిన అవసరం వుందని కాదు కానీ, ఈ అంశాన్ని గురించి ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమయిందని మాత్రం చెప్పవచ్చు.

పత్రికలు చదవను.  టీవీ చూడను. ఇదే నా ఆరోగ్య రహస్యం అన్నారు మాజీ ప్రధాని, కీర్తిశేషులు చరణ్ సింగ్.

భారత ప్రజాస్వామ్య సౌధానికి మూల స్తంభాలయిన వ్యవస్థల  ప్రతినిధుల నిర్వాకాలు గమనిస్తుంటే చరణ్ సింగ్ మాటలు గుర్తుకొస్తున్నాయి.

చేతులు  బార్లా   జాపుకునే స్వేచ్చ ప్రతి ఒక్కరికీ వుంటుంది. అయితే  ఆ చేతి కొసభాగం పక్కవాడి ముక్కునో, కంటినో తాకనంత వరకే ఈ స్వేచ్చ  అని ఓ ఆంగ్ల సామెత వుంది.  అంటే స్వేచ్చకు సయితం హద్దులు వున్నాయని చెప్పడం ఈ నానుడి తాత్పర్యం.

 

“కేంద్రం మిధ్య” పొమ్మన్నారు, అలనాడు తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి రాష్ట్రంలో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి  ఎన్టీ రామారావు.

రామారావు సొంత పార్టీ పెట్టిన నాడు ఆయన పెట్టుకున్న లక్ష్యాలు ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ, కాంగ్రెస్ వ్యతిరేకత, ప్రాంతీయ ప్రయోజనాల సాధన. ఆ క్రమంలో ఆయన కేంద్రంపై విరుచుకుపడడాన్ని ప్రజలు అర్ధం చేసుకుని ఆయన్ని ఆశీర్వదించారు. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులను ఇష్టం వచ్చిన రీతిలో మార్చడం, ఆ పార్టీ హయాములో ముఖ్యమంత్రి అంజయ్యకు జరిగిన అవమానం, తెలుగు వాడి ఆత్మ గౌరవం దెబ్బతినేలా ఆనాడు తీసుకున్న కొన్ని చర్యలు కూడా కేంద్రంపై పోరాటంలో రామారావు సాధించిన అపూర్వ  విజయానికి ఉపయోగపడిన మాట వాస్తవం. పోరాట పటిమ ప్రదర్శించడంలో ఎన్టీఆర్ చిత్తశుద్ధిని ప్రజలు త్రికరణశుద్ధిగా ఆమోదించారు. 

  

ఒక్క ప్రధాన మంత్రి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రి అనేకాదు,    ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పదవికీ, ప్రతి ఉద్యోగికీ కొన్ని అధికారాలు వుంటాయి. ఆ అధికారాలుకు అనుగుణంగా పనిచేసే కొన్ని వ్యవస్థలు వుంటాయి.  రాజ్యాంగం ప్రసాదించిన ఆ అధికారాలను, వ్యవస్థలను   తమ ప్రత్యర్ధులు, లేదా తాము  ఇష్టపడని వారిపై ప్రయోగిస్తూ పోతే అది ఖచ్చితంగా అధికార దుర్వినియోగమే అవుతుంది. అలా వాడుకోలేని అధికారాలు వుంటే ఏమి, లేకపోతే ఏమి అని వాదించేవాళ్లకు ఒక నమస్కారమే నా సమాధానం.

అంతరిక్షంలో వేలాది గ్రహాలు కళ్ళు తిరిగిపోయే వేగంతో  తమ నిర్ణీత కక్ష్యల్లో పరిభ్రమిస్తుంటాయని సైన్సు చెబుతుంది. ఏ ఒక్క గ్రహమూ తన నిర్దేశిత కక్ష్యను దాటి ఒక మిల్లి మీటరు కూడా పక్కకు తొలగదు. అలా జరిగితే అది విశ్వ వినాశనమే. అయినా అన్ని గ్రహాలు అంత వేగంతో తిరుగుతూ కూడా  గతి తప్పకుండా భ్రమిస్తుంటాయి. పైగా కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల నుంచీ జరుగుతోంది.

వాటికి ఎవరు చెప్పారు ఇలా గాడి తప్పరాదని.

రాజ్యాంగ వ్యవస్థలు కూడా అలాగే గతి తప్పకూడదు. తప్పితే రాజ్యాంగానికే ముప్పు. మన ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, న్యాయాధిపతులు, అధికారులు  అందరూ సతతం మననం చేసుకోవాల్సిన నీతి వాక్యం.

ధర్మోరక్షిత రక్షితః

‘రాజ్యాంగాన్ని మీరు కాపాడండి. ఆ రాజ్యాంగమే మిమ్మల్ని కాపాడుతుంది”



(ఇంకా వుంది)

 

16, ఏప్రిల్ 2025, బుధవారం

అమ్మ చనిపోయింది – భండారు శ్రీనివాసరావు

 మా అమ్మ కడుపున పుట్టినా,  నేను పెరిగింది మా వదిన భండారు సరోజినీ దేవి దగ్గర.  నన్ను పెంచింది మా పెద్ద వదినే. నా  హైస్కూలు, కాలేజి చదువులు మా అన్నయ్య ఇంట్లోనే.

ఇరవై ఏళ్ళు దాటిన తర్వాత వెన్నెముకకి సంబంధించిన  వ్యాధితో బాధ పడ్డాను. కింద చాప మీద వెల్లకిలా పడుకునే వుండాలి. ఏమాత్రం అటుఇటు ఒత్తిగిల్లినా ప్రాణం పోతున్నంత బాధ. అప్పుడు అన్నం ముద్దలు తినిపించింది మా వదినే. వేళకు మందులు వేసేది. అంతెందుకు బెడ్ పాన్ కూడా ఆమే పెట్టేది. కన్నతల్లి చేసే సేవలు మా వదిన చేసింది. ఆమె రుణం ఎన్ని జన్మలకు తీరనిది.

85 వ ఏట ఆమె రాత్రి నిద్రలోనే పోయింది.

మా అన్నయ్య భండారు పర్వతాల రావు గారు   రిటైర్ అయిన తర్వాత, పుట్టపర్తిలో ఒకే ఒక గదిలో వుండేవాళ్ళు. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం నడుచుకుంటూ భజనలకు వెళ్ళేవాళ్ళు. రెండు అడుగులు ముందు అన్నయ్య. ఆయన వెనుకనే అడుగులో అడుగు వేసుకుంటూ మా వదిన. ఎక్కడికి అని అడిగేది కాదు. ఆయన వెంట నడవడమే ఆమెకు తెలిసింది.

ముందు ఆయన పోయాడు. ఇప్పుడు ఆయన వెనుకనే వదిన.

ఇప్పుడే హైదరాబాదు మహాప్రస్థానంలో వదినగారి అంత్యక్రియలు ముగించుకుని ఇంటికి చేరాము.

ఓం శాంతి!



(16-04-2025)

15, ఏప్రిల్ 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (142)- భండారు శ్రీనివాసరావు

 చంద్రబాబు నాయుడు నవ్వుతారా?

ఇదేమీ లోగడ  టీవీల్లో ఎస్ఎంఎస్ ప్రశ్న కాదు. అందుకు సందేహం అక్కరలేదు. ఆయన నవ్వుతారు. కాకపోతే నవ్వించాలి. ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా వున్న తొమ్మిదేళ్ళ పైచిలుకు కాలంలో , 'నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వన'ని ఉద్యోగులని వెంటబడి తరుముతూ పనిచేయిస్తున్న కాలంలో, నవ్వుతూ వుంటే ఆ మాటలకు సీరియస్ నెస్ రాదని మానేసారేమో కాని,  ఆయనా నవ్వుతారు. దీనికి ప్రత్యక్ష సాక్షిని నేనే! చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయిన తొలిరోజుల్లో జూబిలీ హాలులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అందరికీ కబురు పెట్టారు. 'డిన్నర్ ఫాలోస్' అని దానికో టాగ్ లైన్. ఆరోజు 'ప్రాంతీయ వార్తలు సమాప్తం' అనగానే నడుచుకుంటూ రేడియో స్టేషన్ కు ఎదురుగా వున్న జూబిలీ హాలుకు బయలుదేరాను. పబ్లిక్ గార్డెన్ గేటు దగ్గర పోలీసుల హడావిడి కనిపించింది. లోపలకు వెడితే సీఎం పేషీ అధికారులు కొందరు కనిపించారు. విలేకరుల సంఖ్య చాలా పలుచగా వుంది. 'నేనంటే ఎదురుగానే ఆఫీసు కనుక వెంటనే వచ్చాను మిగిలిన వాళ్లు నెమ్మదిగా వస్తారులే' అనుకున్నా. ఈలోపల అప్పటి సీపీఆర్వో విజయ్ కుమార్ వచ్చాడు. విలేకరుల సంఖ్య చూసి ఆయనా నిరుత్సాహపడ్డట్టున్నాడు. కొందరికి ఫోన్లు చేసి గుర్తుచేసే పనిలో పడ్డాడు. ఈలోగా సచివాలయం నుంచి ఫోన్లు, 'సీఎం బయలుదేరి రావచ్చా' అని. మొత్తం మీద కొంత కోరం పూర్తయింది. చంద్రబాబు వచ్చేశారు. విలేకరులు పలుచగా వుండడం ఆయన కూడా గమనించారు.

'దీనికి మూడు కారణాలు వున్నాయి' అన్నాను ఆయన పక్కనే కూర్చుని. అవేమిటో చెప్పమని అడిగారు. 'నెంబర్ వన్. ఈరోజు వాతావరణం చల్లగా వుంది. చినుకులు పడతాయా అన్నట్టుగా వుంది'

'అయితే...'

 'నెంబర్ టూ. ఈరోజు టీవీలో ఇండియా పాకిస్తాన్, డే అండ్ నైట్ వన్ డే మ్యాచ్ వస్తోంది'

'వూ..'

'లాస్ట్ వన్. ఇది జూబిలీ హాలు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిన్నర్. ఇక ఇక్కడేమి వుంటుంది. మా ఆఫీసు దగ్గర్లో లేకపోతే నేను కూడా డుమ్మా కొట్టేవాడినే'

ఆయనకు అర్ధం అయింది. అర్ధం కాగానే హాయిగా నవ్వేసి నా భుజం తట్టారు.

వై ఎస్ ఆర్ చెప్పిన గానుగెద్దు కధ
2004
జులై 21 న అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఒక కధ చెప్పారు.
బాగా చదువుకున్న పండితుడు ఒకాయన నూనె గానుగ వద్దకు వెళ్ళాడు. అక్కడ గుండ్రంగా తిరుగుతున్న ఎద్దు తప్ప ఎవరూ కనిపించలేదు. ఆ ఎద్దు మెడలోని గంటల చప్పుడు తప్ప ఏ అలికిడీ లేదు. పండితుడు గానుగ మనిషిని పేరు పెట్టి పెద్దగా పిలిచాడు. ఆ పిలుపు విని అతడు బయటకు వచ్చాడు.
నూనె కొన్న తరువాత పండితుడు అడిగాడు.
ఎప్పుడు వచ్చినా నువ్వుండవు. గానుగ పని మాత్రం నడుస్తూనే వుంటుంది. ఎలాఅని.
ఎద్దు మెడలో గంట కట్టిందే అందుకోసం. గంట చప్పుడు వినబడుతున్నదీ అంటే ఎద్దు తిరుగుతున్నట్టే లెక్క. తిరగడం మానేస్తే గంట చప్పుడు వినబడదు. నేను ఏ పనిలో వున్నా బయటకు వచ్చి ఎద్దుకు మేత వేస్తాను. నీళ్ళు పెడతాను. మళ్ళీ దాని పని మొదలు. నాపనిలో నేనుంటానుగానుగవాడు చెప్పాడు.
పండితుడు కదా! అనుమానాలు ఎక్కువ.
అలా అయితే ఎద్దు ఒకచోటనే నిలబడి తల ఊపుతుంటే గంటల శబ్దం వినబడుతుంది. కాని పని సాగదు. అప్పుడెలా?’ అడిగాడు.
నా ఎద్దు అలా చేయదుఅన్నాడు గానుగ మనిషి.
అంత నమ్మకంగా ఎలా చెప్పగలవు?’ అని గుచ్చి అడిగాడు పండితుడు.
ఎందుకంటే, నా ఎద్దు మీలా చదువుకోలేదు కాబట్టి
ఆ జవాబుతో పండితుడి కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి.

వై ఎస్ చెప్పిన ఈ కధతో శాసనసభలో అందరూ పెద్దగా నవ్వారు.

 

నేనమ్మా! చంద్రబాబునాయుడిని మాట్లాడుతున్నాను. మీ వారిని ఫోను దగ్గరకు పిలవమ్మా’

ఉమ్మడి రాష్ట్రంలో ఆరోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకస్మిక పర్యటనలు ఒక ఆకర్షణ. తన పరిపాలన విభిన్నంగా ఉంటుందని ప్రజలకు తెలియచెప్పడానికి ఆయన ఎంచుకున్న విధానం ఇది. ఒకరోజు పొద్దున్నే విలేకరులు  వెంటరాగా, ఒక ప్రత్యేక బస్సులో బయలుదేరేవారు. ఒకరోజు వెంగళరావు పార్కు దగ్గర చెత్తపోగు ఒకటి ఆయన కంటపడింది. వెంటనే సంబంధిత మునిసిపల్ అధికారికి ఫోను చేశారు. ఆ అధికారి అప్పటికి నిద్ర లేచి వుండడు. భార్య ఫోను తీసిందేమో!

నేనమ్మా! చంద్రబాబునాయుడిని మాట్లాడుతున్నాను. మీ వారిని ఫోను దగ్గరకు పిలవమ్మా’ అని ఆయన అనడం పక్కనే వున్న మా అందరికీ వినబడుతూనే వుంది. నిద్రనుంచి లేచి ఫోనులో ముఖ్యమంత్రితో మాట్లాడిన తరువాత ఆ అధికారికి మళ్ళీ నిద్రపట్టి వుండదు.

 

కింది ఫోటో:

 

చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తీసిన ఫోటో. కర్టేసి: మిత్రుడు  శ్రీ జయప్రసాద్ఎండీమెట్రో టీవీ. ఆ రోజుల్లో బాబు గారి ఆకస్మిక పర్యటనలు మీడియాకు మంచి ఆహారం. అలా ఒక రోజు ప్రత్యేక బస్సులో వెడుతుండగా సీఎం మాతో (విలేకరులతో) ముచ్చటిస్తూ ఉన్నప్పటి దృశ్యం. ఆయన ఎదురుగా పొడుగు చేతుల తెల్ల చొక్కా మనిషిని నేనే.

మొదటి టరమ్ అని ఎందుకు గట్టిగా చెప్పగలుగుతున్నాను అంటే చంద్రబాబు కాళ్ళకు వున్న చెప్పులు. బహుశా తర్వాత అమెరికా వెళ్ళినప్పుడు ఆయన తన  ఆహార్యం (ప్యాంటుచొక్కా)  ఏమీ మార్చుకోలేదు కానీ చెప్పుల నుంచి బూట్లలోకి మారిపోయారు. నేను కొత్తగా  మాస్కో రిటర్న్ కదా! బ్రాండెడ్  నైక్ షూస్ తో నేను.



 

(ఇంకా వుంది)

14, ఏప్రిల్ 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (141) – భండారు శ్రీనివాసరావు

 


రాజకీయ ప్రముఖుల వేషధారణ

మళ్ళీ ఇదేమి యూ టర్న్ అనిపిస్తోందా!

రాజకీయాలు ఇక రాయను, కాడి కిందపారేసాను అని రాయగానే చాలామంది మితృలు, శ్రేయోభిలాషులు ఫోన్లు చేశారు. పలానా పత్రిక వక్రించి రాసింది అంటారు కానీ, రేడియోలో నా మాటలు వక్రించి ప్రసారం చేశారు అనే మాట ఎప్పుడైనా విన్నామా! అలాగే, రాజకీయ పార్టీల సోషల్ మీడియా వాళ్ళు కూడా తప్పుపట్ట లేని ఎన్నో విశేషాలు రేడియో విలేకరిగా మీకు తెలిసి వుంటాయి కదా! వాటిని చదువరులతో పంచుకుంటే తప్పేమిటి అన్నారు. వెలుగు చూడని వార్తలు బయట పెట్టడానికి అభ్యంతరాలు వుంటే, ఇంకా తెలిసిన సంగతులు ఏమైనా వుంటే రాస్తూ వుండండి అని సలహా.

బిగ్ జీరో మరో భాగం రాయడానికి  మూడు రోజులకు పైగా  వ్యవధానం తీసుకోవడానికి ఈ తర్జన భర్జనలే కారణం. 

నిజమే! నా వృత్తి జీవితంలో ముప్పావు భాగం రాజకీయ నాయకులతోనే గడిచి పోయింది. ఎన్నెన్నో మంచి అనుభవాలు వారితో వున్నాయి. వాటిల్లో కొన్నింటిని ప్రస్తావించడం ద్వారా నా జీవిత కధకు కొంత నిండుతనం వస్తుందని అనిపించింది. అయితే ఆయా పార్టీల సోషల్ మీడియా శక్తుల కళ్ళు నా మీద పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ, నా వ్యక్తిగత జీవితంతో పాటు, నాకు తెలిసిన  వృత్తి జీవిత విశేషాలను అప్పుడప్పుడూ ప్రస్తావిస్తూ వుండాలని నిర్ణయించుకున్నాను.

మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, ఇవి రాజకీయ నాయకుల గురించే కానీ, పొలిటికల్ పోస్టులు  మాత్రం కాదు.

నందమూరి తారక రామారావు అనగానే ఓ రూపం కళ్ల ముందు కదలాడుతుంది. రాజకీయ నాయకుడిగా ఆయన వేషధారణ మరింత ప్రత్యేకంగా ఉంటుంది. కాషాయ వస్త్రాలుపెద్ద పెద్ద కళ్లద్దాలూఎడమచేయి గాల్లోకి లేపిచిద్విలాసం చిందిస్తూ.. ‘సోదర సోదరీమణులారా’ అంటూ వేదికలపై తన వాక్‌చాతుర్యంతో హోరెత్తించిన తెలుగుదేశం పార్టీ అధినాయకుడి రూపాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేం. ఇక సినిమాల్లో అయితే రాముడు, కృష్ణుడు అనగానే గుర్తుకొచ్చేది, ఎన్టీఆర్ మాత్రమే.

సినీ నటుడు కావడం వల్ల కావచ్చు రాజకీయ రంగప్రవేశం చేసిన తర్వాత కూడా ఆయన అనేకసార్లు తన వేష ధారణ మార్చారు. మొదట్లో తెలుగుదేశం పార్టీ పెట్టి చైతన్య రధంపై రాష్ట్రం నలుమూలలా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నప్పుడు ఖాకీ ప్యాంటు, ఖాకీ చొక్కాతో కనిపించారు. ఆ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే తెల్లటి ధోవతి, లాల్చీని తన ఆహార్యంగా చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళు వివేకానందుడి గెటప్ తో, కొన్నాళ్ళు కాషాయ వస్త్రాలతో విభిన్నంగా కనిపించారు. ద్వితీయ వివాహం చేసుకున్న తర్వాత కాషాయాన్ని వదిలేసి మళ్ళీ మల్లెపూవులాంటి ధవళ వస్త్రధారణ స్వీకరించారు. చనిపోయేవరకు అదే ఆహార్యం. మార్పులేదు.

చాలా మంది రాజకీయ నాయకులు జీవితాంతం ప్రజలకు ఒకే వస్త్ర ధారణతో గుర్తుండి పోయారు. ఉదాహరణకు మహాత్మాగాంధీ, (కొల్లాయి గుడ్డ, చేతిలో కర్ర) జవహర్ లాల్ నెహ్రూ, (ఎర్ర గులాబీ, తల మీద టోపీ లేకపోతే నెహ్రూను నెహ్రూగా గుర్తుపట్టడం కష్టం), సుభాష్ చంద్రబోస్ (మిలిటరీ దుస్తులు లేని సుభాష్ చంద్ర బోసును ఊహించడం అసాధ్యం). అలాగే, రాజగోపాలాచారి, కరుణానిధి ఈ ఇద్దరూ హమేషా పగలూ రాత్రీ తేడా లేకుండా నల్లకళ్ళ జోళ్ళతో కనిపించేవారు. నల్లద్దాల కంటి జోడు ధరించే అలవాటు ఎం.జీ. రామచంద్రన్ కు కూడా వుండేది. కాకపోతే, నెత్తిమీద ఫర్ టోపీ అదనం. జయలలిత కూడా భద్రతా పరమైన కారణాలో, ఆరోగ్యపరమైన కారణాలో తెలియదుకానీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒకే రకం ఆహార్యంతో కానవచ్చేవారు.  

రాష్ట్రపతి అయిన తర్వాత నీలం సంజీవరెడ్డి ఆహార్యం మారిపోయింది.  అప్పటివరకు ఏళ్ళతరబడి ఒకే రకం వస్త్రధారణ. పంచె, లాల్చీ, తలమీద గాంధి టోపీ. ఇక కాసు బ్రహ్మానందరెడ్డి. ఆయనా డిటో. తలమీద టోపీని చేత్తో కొంచెం సదురుకున్నట్టు కనిపించింది అంటే అయన ఏదో కొత్త రాజకీయ వ్యూహం పన్నుతున్నారని చెప్పుకునేవారు.

ఇక పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఒకటే ఆహార్యం, తెల్లటి  పంచె లాల్చీ. విదేశీ పర్యటనలు, కొన్ని అధికారిక కార్యక్రమాలలో మాత్రం సూటు ధరించేవారు, రాష్ట్రపతి సంజీవరెడ్డి మాదిరిగా.

నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యేంతవరకు, ఆఖరికి గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో కూడా వస్త్రధారణ పట్ల అంత శ్రద్ధ చూపిన దాఖలాలు లేవు. ప్రధాని అయిన తర్వాత మాత్రం  వివిధ రకాల దుస్తులు ధరించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు వేషధారణ అనేక దశాబ్దాలుగా ఒకే రకంగా ఉంటూ వస్తోంది. తెల్లటి చొక్కా, తెల్లటి లుంగీ. ఏ పదవిలో వున్నా, ఏ హోదాలో వున్నా  ఇదే ఆహార్యం. విద్యార్థి నాయకుడిగా ఆయన్ని ప్యాంటు, చొక్కాతో చూసిన జ్ఞాపకాలు వున్నాయి.

ఆంధ్ర రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు దుస్తులు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండేవి. వారగా భుజం మీద కప్పుకున్న శాలువా ఆయన ప్రత్యేకత. అదిలేని టంగుటూరిని గుర్తుపట్టడం కష్టం.

ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి ఆహార్యం విభిన్నమైన రీతిలో వుండేది. చేతిలో పొన్ను కర్ర ఓ స్పెషాలిటీ.

పొతే, చంద్రబాబునాయుడు మొదటి సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఆహార్యం ఎప్పుడూ ఒకే రీతిలో ఉండేట్టు చూసుకున్నారు. ఒక రకమైన ఖాదీ వస్త్రంతో తయారుచేసిన ప్యాంటు చొక్కాను ధరించడం మొదలుపెట్టారు. కాళ్ళకు బూట్లు ధరించడం కూడా చాలాకాలం తర్వాతనే అలవాటు చేసుకున్నారు. అదీ, ముఖ్యమంత్రిగా మొదటి విదేశీ ప్రయాణం పెట్టుకున్నప్పుడు అనుకుంటాను. అమితాబ్ బచ్చన్ కు, చంద్రబాబుకు మాత్రమే  ప్రత్యేకమైన తెల్ల గడ్డం లేని రోజుల నుంచి ఆయన నాకు తెలుసు. అయితే  1978లో మొదటి సారి అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు నల్లటి మీసాలు ఉండేవి.

వై.ఎస్ రాజశేఖర రెడ్డి సయితం ఒకే రకం వస్త్రధారణ పట్ల మక్కువ చూపేవారు. పదహారణాల తెలుగుతనం ఉట్టిపడేలా తెల్లటి పంచె, లాల్చీ ధరించి తనకంటూ ఒక శైలిని రూపొందించుకున్నారు. రాజకీయాల్లో ప్రవేశించిన తొలి రోజుల్లో మూతికి  రెండు వైపులా కిందికి వాలిన మీసాలు వుండేవి. చాలాకాలం ప్యాంటు చొక్కాతోనే కనిపించేవారు. 

తెలంగాణా  మొదటి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు విషయానికి వస్తే  అనేక దశాబ్దాలుగా ఆయన వస్త్రధారణలో ఎలాంటి మార్పు లేదు. తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు. ఢిల్లీ వంటి చలి ప్రదేశాలకు పోయినప్పుడు ఏమో కానీ, కాళ్లకు చెప్పులు. కొన్నాళ్ళు మెడ చుట్టూ మడిచిన ఉత్తరీయంతో కనిపించడం మొదలుపెట్టారు టీవీల్లో. ఆయన ఆహార్యంలో కానవచ్చిన మార్పు ఏదైనా ఉన్నదంటే ఇదొక్కటే.   

యువతరం రాజకీయ నాయకుల్లో ఏపీ మాజీ  ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన రెడ్డి రాజకీయాల్లో ప్రవేశించిన తొలిరోజుల్లో రంగు రంగుల  చొక్కాలు వేసుకున్నా, ఆ తర్వాత మోచేతుల వరకు ముడిచిన తెల్లచొక్కా, తెల్ల ప్యాంటుకు మాత్రమే పరిమితం అయ్యారు.

జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాల్లో  అనేక రకాల దుస్తులు ధరించినప్పటికీ, సొంతంగా పార్టీ పెట్టుకున్నప్పటి నుంచి, లాల్చీ పైజమా, గుబురుగా పెంచిన గడ్డం మీసాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు.

కింది ఫోటో:

నల్లటి మీసకట్టుతో  వై.ఎస్. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు



(ఇంకా వుంది)




11, ఏప్రిల్ 2025, శుక్రవారం

ఎర్రటి ఎండలో పుట్టింటికి ప్రయాణం – భండారు శ్రీనివాసరావు

  

75  ఏళ్ళక్రితం నాటిన మొక్క ఈనాడు ఒక మహావృక్షంగా తయారయింది. ఆ శీతలతరుచ్ఛాయలో మూడు దశాబ్దాలకు పైగా సేదతీరినవాడిని. మహామహులు తచ్చాడిన ఆ ప్రదేశంలో నేను సైతం అంటూ, 1975 లో ప్రవేశించి ఆడుతూ పాడుతూ హాయిగా ఉద్యోగం చేసిన వాడిని.  

నేను పనిచేసిన ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం 75 వ వార్షికోత్సవం జరుపుకోబోతోంది ఈ నెల ఏప్రిల్ పదిహేనున.

వార్తావిభాగంలో చాలా సంవత్సరాలు పనిచేశాను. చేరిన చోటనే రిటైర్ కావాలన్న నా అభిలాష నెరవేరకుండానే చివరాఖరి సంవత్సరంలో నన్ను హైదరాబాదు  దూరదర్సన్ వార్తవిభాగానికి బదిలీ చేశారు. అదొక్కటే అసంతృప్తి.  అన్ని సంవత్సరాల అనుబంధం ఉన్న హైదరాబాదు ఆకాశవాణి కేంద్రానికి డెబ్బయ్ అయిదేళ్ళ పండుగ అంటే అందులో పనిచేసిన వారికి పుట్టింటి పండుగే. మరీ ముఖ్యంగా నాకు.

రేడియో పట్ల నా అనురాగం తెలిసిన వాళ్ళు కనుక,  నాలుగు ముక్కలు మాట్లాడాలని వారినుంచి  పిలుపు. వాళ్ళు పంపిన కారులోనే ఎగురుకుంటూ వెళ్లాను. రికార్డింగు జరిగింది కాసేపే. ఎక్కువ సమయం, నేను పనిచేసిన రోజుల్లో వున్న తోటి సహోద్యోగులతో, నేను రిటైర్ అయిన తర్వాత చేరిన వారితో మాటా  ముచ్చట్లతో గడిచింది. నిజానికి ముప్పయి ఏళ్ళ పైచిలుకు కాలంలో నేను చేసింది కూడా ఇదే. అసలు ఆఫీసుకు రావడమే గగనం. వచ్చాడో ఆయన చుట్టూ అందరూ, అందరి మధ్యా ఆయన అనే పేరొకటి.

ఇరవై ఏళ్ళ క్రితం నాకు తెలిసిన ఉద్యోగులు  కూడా, మీసం లేని నన్ను  గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించారు. ముఖ్యంగా అప్పుడు న్యూస్ యూనిట్ లో మాతో పనిచేసి ఇప్పుడు స్టేషన్ డైరెక్టర్ వద్ద పీ ఎస్ గా  పనిచేస్తున్న మా న్యూస్  యూనిట్ చిట్టి చెల్లెలు శైలజ ఆనందానికి అంతులేదు. మా ఆవిడని అమ్మా అని పిలిచేది. శైలజ లాంటి ఆడపిల్ల వుంటే ఇంట్లో దీపం అక్కరలేదు అనేది మా ఆవిడ.

ఇక రేడియో గురించి నేను కొత్తగా చెప్పేది ఏముంటుంది? వార్తకు ప్రాణం విశ్వసనీయత. అదే ఇన్నేళ్ళుగా రేడియో వార్తల్ని బతికిస్తోంది. అప్పటికి ఎవరం ఉంటామో ఉండమో తెలియదు కానీ ఇదే రేడియో కేంద్రం నూరేళ్ళ పండుగ జరుపుకోవడం తథ్యం.

నిజానికి నేను చేసింది చాలా చిన్న ఉద్యోగం. 

అయినప్పటికీ, ఆలిండియా రేడియో హైదరాబాదు కంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్,  హెడ్ ఆఫ్ ఆఫీస్  బి. హరి సింగ్, కేంద్రం ప్రోగ్రాం హెడ్, ఎస్. రమేశ్ సుంకసారి, డిప్యూటీ డైరెక్టర్ న్యూస్ ఎం.ఎస్. మహేష్, అసిస్టెంట్ డైరెక్టర్ న్యూస్ సురేశ్ ధర్మపురి, న్యూస్ కరస్పాండెంట్  లక్ష్మి తమ హోదాలను పక్కనబెట్టి  బయట వరకు వచ్చి ఆదరంగా వీడ్కోలు చెప్పారు. వారి  గొప్ప మనసుకు మనసారా ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుని కారెక్కాను. 

పుట్టింటిని మరిచిపోవచ్చేమో కానీ,  పుట్టిల్లు ఎన్నటికీ మరవదు. 

తోకటపా: డ్రైవర్ చిన్నా దోవలో నాతో అనేక ముచ్చట్లు చెప్పాడు. నేను రేడియోలో చేరినప్పటికి అతడు పుట్టనే లేదట. పెరిగి పెద్దయినప్పుడు రేడియోలో  నా గొంతు వినేవాడట. అలా నన్ను గుర్తు పట్టాను అన్నాడు. మాటల మధ్యలో అడిగి నా వయసు తెలుసుకున్నాడు. 

'చూసారా! మన రేడియో స్టేషన్ కన్నా వయసులో మీరే నాలుగేళ్ళు పెద్ద' అనడం నవ్వు తెప్పించింది.

థాంక్స్ చిన్నా!

కింది ఫోటోలు ఆలిండియా రేడియోలో తీసినవి.












(11-04-2025)

10, ఏప్రిల్ 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (140) - భండారు శ్రీనివాసరావు

 వెలుగు చూడని వార్తలు

మనం రోజూ పత్రికల్లో, మీడియాలో చూస్తున్న వార్తల కంటే మీదు మిక్కిలి వార్తలు వెలుగు చూడకుండానే  అంతర్ధానం అవుతుంటాయి అనే సంగతి ఈ రంగంలో వున్నవారికే బాగా తెలుస్తుంది. కాకపోతే,  అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు అభిజ్ఞవర్గాల కధనం అనే పేరుతోనో, అసలు పేర్లే పెట్టకుండా ఇచ్చే లీకుల రూపంలోనో కానవస్తుంటాయి. సోషల్ మీడియా రంగప్రవేశం తర్వాత వీటికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అసలు వార్తల కన్నా, ఈ కొసరు వార్తలకే రంగూ రుచీ వాసనా  ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఇవే ప్రధాన వార్తలుగా చలామణీ అవుతున్నాయి. ఏడాదికోసారి ఏప్రిల్ ఒకటో తేదీన గతంలో చాలా పత్రికలు, లేనిపోని  ఊహాగానాల కధనాలు ప్రధాన శీర్షికలుగా ప్రచురించి, చివర ఎక్కడో ఈరోజు ఏప్రిల్ ఒకటి అని రాసి పాఠకులను ఫూల్స్ చేశామని సంతృప్తి పడడం జరిగేది.

రాజకీయ నాయకులకు దగ్గరగా మెసిలే కొందరు సీనియర్ జర్నలిస్టులమీద  రాజకీయ నాయకులు  కూడా విశ్వాసం వుంచి  బయటకు తెలియని సమాచారాలు, విశేషాలు చెబుతుండడం ఎప్పటినుంచో వున్న ఆచారమే. ఇలా ఉప్పు అందించే వారిలో ముఖ్యమంత్రి స్థాయి నాయకులు కూడా వుండడం రహస్యమేమీ కాదు.  తమకు రాజకీయంగా పనికి వచ్చే కొన్ని వార్తలను (నిజాలు కాదు) తమ పీ ఆర్ వొ ల ద్వారా విలేకరులకు అందిస్తుంటారు. అలాగే సాయంకాలాలు జరిగే వ్యక్తిగత భేటీల్లో కొన్ని సంగతులు బయట పడుతుంటాయి. రేడియోకి  ఇలాంటి వార్తలు పనికిరావు. ఎలాగూ వార్తల్లో ఇవ్వడు అని అర్ధం చేసుకున్న కొంతమంది నాయకులు నాతో బాహాటంగానే కొన్ని సంగతులు ముచ్చటిస్తూ వుండేవాళ్ళు. విలేకరులు కూడా తమకు ఇలా తెలిసిన ప్రతి సంగతినీ వార్తగా మలచాలి అంటే ఆ సమాచారం యజమాని దృష్టిలో పనికివచ్చేదిగా వుండాలి. అప్పుడే అది వెలుగు చూస్తుంది. ఇలా వెలుగు చూడని అనేక వార్తలు  బుద్దా మురళి వంటి సీనియర్ల వద్ద పుంఖానుపుంఖాలుగా దొరుకుతాయి.

ఇటు రాజకీయులకు, అటు జర్నలిస్టులకు లీకులు అనేవి కొత్తవి కావు. వారిరువురి నడుమా బంధాలు, అనుబంధాలు పెనవేసుకుని పోవడానికి బాగా తోడ్పడేవి నిజానికి లీకులే. పొగడ్తలతో కూడిన గొప్ప వార్తలు, వ్యాసాలు రాయడానికి చాలామంది వుంటారు. అంతకంటే కూడా, తమ రాజకీయ ప్రయోజనాలకోసం కొన్ని కట్టుడు కధలు పత్రికల్లో/ మీడియాలో రావడం వాళ్లకి ప్రధానం.

అయితే ఈ కధనాలు వాళ్ళు చెప్పినట్టే రావాలి కానీ వాళ్ళు చెప్పినట్టు ఎక్కడా బయటకి రాకూడదు. అలా బయటకు వచ్చిన లీకులపై విస్తృతంగా చర్చ జరిగిన పిమ్మట ‘ఆ వార్తలు మీడియా సృష్టి, నాకేమీ సంబంధం లేదు’ అని ఖండన ఇచ్చుకునే విధంగా వుండాలి. అలా అని ఆ వార్తలో పూర్తిగా నిజం వుండకూడదనీ కాదు. అలా అని అసలు నిజం లేదనీ కాదు. ఆ లీకు వీరుడి పేరు ఎటువంటి పరిస్థితుల్లో వెల్లడి కారాదు. (సోర్స్ చెప్పాల్సిన అవసరం మాకు లేదు’ అనే unwritten హక్కు గురించి మాట్లాడేది ఇలాంటి సందర్భాలలోనే). ఇన్ని షరతులతో లీకులు బయటకి వస్తాయి కాబట్టే వాటికి అంతటి డిమాండ్.

ఇంతకీ ఈ లీకులు ఏమిటి? ఎలా పురుడు పోసుకుంటాయి?

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించేరోజుల్లో అధికార పక్షంలోని అసంతృప్తులే ఈ లీకుల్ని విలేకరులకు ఉప్పందించేవారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతూనే వచ్చింది. తదనంతర కాలంలో ఇవి పతాక స్థాయికి చేరి ఏది నిజమో ఏది అబద్ధమూ తెలియనంతగా మారిపోయి పాత్రికేయ ప్రమాణాలను, విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా విశ్వరూపం దాలుస్తున్నాయి.

ముఖ్యమంత్రుల కార్యాలయాల్లో పనిచేసే పౌర సంబంధాల అధికారులు ఈ లీకు వ్యవహారాలను చూస్తుంటారు. అల్లాగే మంత్రుల దగ్గర పనిచేసేవాళ్ళు.

ఒక ఉదాహరణ చెప్పుకుందాం.

అప్పటికి మీడియా విస్తృతి ఇంత లేదు. పత్రికలే రాజ్యం చేస్తున్నాయి, ఇప్పటికీ వాళ్ళదే రాజ్యం. అందుకే పలానా పత్రిక కావాలని రాసింది అని రాజకీయులు అంటుంటారు. ప్రింటులో వచ్చే వార్త ఖచ్చితం అని నమ్మేవారు ఇంకా మిగిలి వుండడమే ఇందుకు కారణం.

ఓ పత్రికా విలేకరికి ముఖ్యమంత్రి కార్యాలయంలోని సోర్స్ నుంచి ఫోన్ వస్తుంది. సంభాషణ ఇలా నడుస్తుంది.

ఏమిటి సంగతులు ఏమైనా కొత్త విషయాలు ఉన్నాయా!’

మా దగ్గర వార్తలు ఏముంటాయి? మీరిస్తేనే కదా మాకు వార్తలు’

అలా అంటావు కానీ మీరు రాసేవే మాకు వార్తలు. మొన్న చెప్పాను కదా! ఆయన వెళ్లి  ఆ పెద్దాయన్ని కలిశాడు అంటున్నారు. నీకేమైనా తెలుసా?’

తెలియదే. ఎప్పుడు?’

నేనూ విన్నదే! కనుక్కోని చెప్పు’

ఇక అక్కడినుంచి ఆ విలేకరి పని మొదలవుతుంది. ‘ఆయన’ అంటే ముఖ్యమంత్రి. మరి పెద్దాయన ఎవరు?

ఆయన’ డ్రైవర్ నెంబరుకు ఫోను చేశాడు. వీ ఐ పీ రాకపోకలు కనుక్కోవాలంటే పోలీసులు, డ్రైవర్లను మించి విలేకరులకు మంచి సోర్సు దొరకదు.

డ్రైవర్ దొరికాడు కానీ కావాల్సిన సమాచారం రాలేదు. కాకపొతే ఓ విషయం చెప్పాడు. ఆ రోజు ‘ఆయన’ అధికారిక వాహనం కాకుండా వేరే కారులో వెళ్ళిన మాట ధృవీకరించాడు. వెంట ఎవరు వెళ్లిందీ చెప్పాడు. ఆ వెంట వెళ్ళిన వాళ్ళను పట్టుకుంటే ‘ఆ పెద్దాయన’ ఎవరో తెలిసింది.

ఇవన్నీ జరిగిన సంగతులు. తర్వాత కావాల్సిన విధంగా మసాలాలు దట్టించి వార్తను వండి వార్చడమే.

అధిష్టానంపై తిరుగుబాటుకు పావులు కదుపుతున్న ముఖ్యమంత్రి!’

కేంద్రంలో చక్రం తిప్పుతున్న ఓ సీనియర్ మంత్రిని రహస్యంగా కలుసుకుని చర్చలు జరిపిన ముఖ్యమంత్రి’

ఇది హెడ్డింగు. అసలు వార్త అనేక సోయగాలు అద్దుకుని అక్షరాల రూపంలో మర్నాడు పత్రికలో మొదటి పేజీలో దర్శనం ఇస్తుంది.

దానితో పాటే ముఖ్యమంత్రి కార్యాలయం జారీ చేసిన ‘ఖండన’ ప్రకటన కూడా ఆ పత్రిక కార్యాలయానికి చేరుతుంది.

ఇలా వుంటాయి ఆ తమాషాలు.

నలభయ్ ఏళ్ళ పాత్రికేయ జీవితంలో ఎదురయిన అటువంటి వృత్తాంతాలను, ఇంతవరకూ బయటకు రాని వార్తలను సేకరించి, సుమారు నూట యాభయ్ ఎపిసోడ్లు,   వెలుగు చూడని వార్తలు అనే పేరుతో  అక్షరబద్ధం చేసి నా కంప్యూటర్ లోనే పదిలంగా దాచుకున్నాను.

అసలు నేను నా ఈ జీవనయానం కధ మొదలు పెట్టినప్పుడు అలాంటి అన్ టోల్డ్ స్టోరీస్ రాస్తానని నన్ను తెలిసిన వాళ్ళు అనుకున్నారు.  నేను కూడా ఒక బలహీన క్షణంలో అలాంటి ఆలోచన చేసిన మాట  నిజమే. ఎందుకంటే పెద్ద కష్టం లేకుండా రోజుకు ఒకటి తీసి  పోస్టు చేస్తూ పోవడమే.

తరువాత తీరిగ్గా ఆలోచించి, దరిమిలా ఎదురయ్యే కష్టనష్టాలను బేరీజు వేసుకుని  ఆ ప్రయత్నం మానుకున్నాను.

ఎప్పుడో పాతికేళ్ళ క్రితం కళ్ళతో చూసి, చెవులతో విన్న సంఘటనలను అక్షరబద్ధం చేయాలి అంటే కత్తిమీద సామే. అప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. రాజకీయ పారావారాలు గిరులు, బరులు గీసుకుని ఉచ్చనీచాలు లేకుండా  విచ్చలవిడిగా చెలరేగిపోతూ, మాటల ఈటెలు దూసుకుంటున్నప్పుడు, రామా అన్నా అందులో వేరే అర్ధం పట్టుకునే రోజులు.  ఈ బురదలో కాలు పెట్టడం అంత అజ్ఞానం మరోటి వుండదు. అడుసు తొక్కనేల కాలు కడుగనేల!

 

నిజానికి నేను 1992 లో మాస్కో నుంచి తిరిగివచ్చిన తర్వాత 2005 వరకు యాక్టివ్ జర్నలిజంలోనే వున్నాను. ఆ తరవాత కూడా వివిధ టీవీ చానళ్ల రాజకీయ చర్చల్లో పాల్గొంటూ, పత్రికలకి వ్యాసాలు రాసుకుంటూ దాదాపు పదిహేను సంవత్సరాలు అదే వృత్తిలో కొనసాగాను. వారంలో ప్రతిరోజూ ఒక టీవీకి వెడుతూ, వారాలబ్బాయి అనే పేరు కూడా తెచ్చుకున్నాను. టీవీల వాళ్ళు కూడా నా మీద కాస్త సానుభూతితో ఏది మాట్లాడినా అనుమతించేవారు. మరీ వారి పాలసీకి విరుద్ధంగా నా సంభాషణ సాగుతోందని ఎరుక కలిగినప్పుడు, ఇప్పుడో చిన్న విరామం అనో, లేక చర్చలో అతి తక్కువ సమయాన్ని ఇవ్వడం ద్వారానో ఆ పూట లాగించేవారు. ప్రశ్న అడగకుండా  కల్పించుకుని మాట్లాడే పద్దతి నాది కాదు. నేను వ్యక్తం చేసే అభిప్రాయాల తీరు నచ్చని రాజకీయ పక్షాల ప్రతినిధులు కూడా లైవ్ లో నా మాటకు అడ్డం తగిలే వారు కాదు. తెలంగాణా ఉద్యమం ఉదృతంగా వున్నప్పుడు కూడా నా సమైక్య రాష్ట్ర  వాదనను తప్పుపట్టేవారు కాదు. ప్రస్తుతం ఉప్పూ నిప్పూ మాదిరిగా కత్తులు దూసుకుంటున్న ఛానల్లకు ఆ రోజుల్లో వెళ్ళినప్పుడు,  వారి వాహనంలోనే నేను ప్రత్యర్థి ఛానల్ కు వెళ్ళిన సందర్భాలు అనేకం. అలాగే విభిన్న రాజకీయ స్వభావాలు, ఒత్తిడులు  కలిగిన పత్రికలకి రాజకీయ అంశాలపై వ్యాసాలు ఏళ్ళ తరబడి రాశాను. మాట రాలేదు, మాట పడలేదు.

కానీ రోజులు ఎప్పుడూ ఒకరకంగా వుండవు అనడానికి నా అనుభవమే సాక్ష్యం.  

తర్వాత తర్వాత రోజులు మారుతూ వచ్చాయి. ఛానల్ చర్చల్లో ఏమీ అనకపోయినా, వారి వారి సోషల్ మీడియా శక్తులు నా మీద కత్తి దూయడం మొదలు పెట్టాయి. నన్నే కాకుండా నా కుటుంబాన్ని కూడా కలుపుతూ అతి  హేయంగా వ్యాఖ్యలు పెట్టడం మొదలు పెట్టారు. సోషల్ మీడియా రాజకీయాల్లో పండిపోయిన వారికి వుండే,  దళసరి చర్మం లేనివాడిని  కనుక, వాటిని  తట్టుకోలేక ఒక మంచి రోజు చూసుకుని టీవీ చర్చలకు నేనే  స్వస్తి చెప్పాను. పత్రికలకు రాజకీయ వ్యాసాలు రాయడం మానేశాను. అంతెందుకు, సోషల్ మీడియాలో అత్యంత సన్నిహితులు పెట్టే రాజకీయ పోస్టులకు లైకులు కొట్టడం , కామెంట్లు పెట్టడం కూడా మానేశాను. మరో రకంగా చెప్పాలంటే దశాబ్దాల నుండి మోస్తూ వచ్చిన  కాడి కింద పారేశాను. చాలామంది హితైషులు, మీలాంటి జర్నలిస్టులే  ఇలా భయపడిపోతే ఎట్లా అని సలహాలు చెప్పారు. ఇది భయపడి వెనక్కు తగ్గడం ఎంత మాత్రం కాదు.  కావాలని కాలు అశుద్ధంలో పెట్టడం మాత్రం శ్రేయస్కరం కాదు. ఈ వయసులో నాకు కొత్తగా వచ్చే పేరు ప్రఖ్యాతులు ఏమీ లేవు. వీటి మీద అదనంగా ఆర్జించే సంపాదనా లేదు. అనవసరంగా బీపీలు పెరగడం తప్ప.

అంచేతే నా దారి నేనే మార్చుకున్నాను. నా రాతలు మార్చుకున్నాను. రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పాను. నిజానికి ఈనాడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు గమనిస్తుంటే, గతంలో నేను చూసిన సంఘటనలు గుర్తుకు వచ్చి ఏదైనా మంచి మాట చెప్పాలని, రాయాలని  అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. కానీ బలవంతాన నిగ్రహించుకుంటాను.

తెలిసిన రాజకీయాలు గురించి, తెలిసిన రాజకీయ నాయకులు గురించీ నాకు తెలిసిన  మంచి విషయాలు రాయకుండా ఒక జర్నలిస్టు జీవిత చరిత్ర సంపూర్ణం కాని మాట నిజమే.  మంచి మాటలు కూడా  చెప్పే పరిస్థితి  నా వంటివారికి లేకుండా పోయింది. ఇదో విషాదం!  ఇదే  ప్రయత్నం ఓ పదేళ్లు ముందు చేసివుంటే,  బహుశా నాకు తెలిసిన అనేక విషయాలు నిస్సంకోచంగా రాసివుండేవాడినేమో! ఇప్పుడు అది కుదరని పని.

ఈ కారణాల చేతనే భద్రంగా దాచుకున్న ఆ వెలుగు చూడని వార్తలను కంప్యూటర్ సమాధిలోనే  వుంచేశాను.

నమ్మకమైన సమాచారం అయినా, ఒక తరం వారికి ఆసక్తి కలిగించే విషయాలే  అయినా, ఆ సంచలనాల వైపు మళ్ళకుండా, ఏదో నా జీవితం గురించీ, దానిచుట్టూ అల్లుకున్న పరిస్థితులు గురించీ రాసుకుంటూ వెడుతున్నాను. ఒక సాధారణ వ్యక్తి సాధారణ జీవితం ఎలా గడిచిందో, గడుస్తున్నదో చెప్పడమే ఈ బిగ్ జీరో ధ్యేయంగా మార్చుకున్నాను.  

ఈ విషయంలో  అందరి నుంచి వెల్లువెత్తుతున్న అభిమానానికి వేల వేల ధన్యవాదాలు.

(రాజకీయాల ప్రసక్తి  లేని మీ జీవిత చిత్రం, రాముడు లేని రామాయణంలా వుందని కొందరు మితృలు చేస్తున్న  వ్యాఖ్యలకు ఇది చిన్నపాటి వివరణ)

కింది ఫోటోలు:

(నా వృత్తి జీవితంలో తటస్థపడిన కొందరు రాజకీయ ప్రముఖులతో నేను. దయచేసి ఇందులో ప్రాధాన్యతా క్రమాలు వెతక్కండి. సాంకేతిక ప్రతిభ లేని కారణంగా ఒక క్రమంలో పోస్టు కాలేదు. వరుసగా: చంద్రబాబు నాయుడు, వై.ఎస్. రాజశేఖర రెడ్డి, డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, రాహుల్ గాంధీ, చండ్ర రాజేశ్వర రావు, కె. రోశయ్య, ఎం. వెంకయ్య నాయుడు, తమిలసై, కేవీపీ, టి.అంజయ్య, నరసింహన్, కేటీఆర్, సీతారాం ఏచూరి, కిషన్ రెడ్డి, వై.ఎస్. జగన్ మోహన రెడ్డి)























(ఇంకావుంది)




















(ఇంకా వుంది)