భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య
మీడియా, రాజకీయాలు, మరెన్నో
9, జులై 2026, గురువారం
అయాం ఎ బిగ్ జీరో (338) : భండారు శ్రీనివాసరావు
4, జులై 2026, శనివారం
అయాం ఎ బిగ్ జీరో (337 ) : భండారు శ్రీనివాసరావు
వైట్ హౌస్
ఈ మధ్య టీవీ 9 మేనేజింగ్ ఎడిటర్ శ్రీ రజనీకాంత్, అమెరికా ప్రెసిడెంట్ నివాస భవనం వైట్ హౌస్ విశేషాలను వివరిస్తున్న ఒక వీడియో సాంఘిక
మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వైట్ హౌస్ ప్రాంగణ ప్రవేశం అంత దుర్బేధ్యమైన
పనేమీ కాదు. ఇక వైట్ హౌస్ ప్రవేశం అంటారా అది అంత సులభం కాదు, అలాగని అంత కష్టం కూడా కాదు. ముందుగా అనుమతి తీసుకుంటే
ఇది సాధ్యమే.
నిరుడు ఇదే సమయంలో
అమెరికా వెళ్ళినప్పుడు వైట్ హోస్ ని అతి దగ్గరగా చూడగలిగాము. ఆ ప్రాంగణంలో స్వేచ్ఛగా
తిరిగాము. ఫోటోలు తీసుకున్నాము. అక్కడ ఎవరూ మీరెవరు అని అడిగిన వాళ్ళు
కనిపించలేదు. సీక్రెట్ కెమెరాలు వున్నాయేమో, సీక్రెట్ పోలీసులు మఫ్టీలో వున్నారేమో తెలియదు.
తెలిసిందల్లా అణువణువునా శోధనలు లేవు. తనిఖీలులేవు.
ఎటు తిరిగినా వద్దన్న వాడు లేడు. అడ్డగించిన వాడు లేడు. ఇది నిజమా! మీరు వెళ్ళింది
నిజంగా వైట్ హౌస్ కేనా అనే సందేహాలు రావడం సహజం. కానీ ఇది స్వానుభవం. ఎప్పటిదో
కాదు, నిరుటి అనుభవమే.
ఆ కధా కదన మెట్టిదనిన.
నేను, నా పెద్ద కుమారుడు సందీప్ సియాటిల్ నుంచి బయలుదేరి
సాల్ట్ లేక్ సిటీ మీదుగా రాత్రంతా విమానంలో ప్రయాణం చేసి బాల్టిమోర్ ఎయిర్పోర్ట్ చేరుకునే సరికి ఉదయం ఆరుగంటలు.
మా మూడో అన్నయ్య కుమారుడు సత్య సాయి వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకు వెళ్ళాడు.
రాత్రి నిద్ర బాకీ మొత్తం బుధవారం పగటి వేళ తీర్చుకున్నాము.
ఎందుకంటే మర్నాడు గురువారం, ఆ మర్నాడు శుక్రవారం రెండు
రోజులు హెక్టిక్ స్కెడ్యూలు. మా అన్నయ్య
పిల్లలు అమెరికాలో వుండడం వల్ల నా ప్రయాణం నల్లేరు మీద బండిలా సాగుతోంది.
ఒకరకంగా చెప్పాలి అంటే గవర్నర్ గారి పర్యటన మాదిరిగా
వుంది. అన్నీ ఎరెంజ్ చేసి కారూ, విమానమూ ఎక్కమంటారు.
గురువారం అంతా అమెరికా రాజధాని వాషింగ్టన్ డీ సీ అంతా
కలయ తిరిగాము. Nations'
most famous address వైట్ హౌస్ మా
ప్రియారిటీ.
సెక్యూరిటీ హడావిడి వుంటుందని అనుకుంటూ వెడితే అక్కడ
ముగ్గురు నలుగురు సాయుధ పోలీసులు మాత్రమే కనిపించారు. కనిపించారు కానీ, లోపలకు వెడుతున్న మమ్మల్ని ఎవరు మీరు అని తనిఖీలు
చేయలేదు. కనీసం గుర్తింపు కార్డులు చూపించమని కూడా అడగలేదు. సెక్యూరిటీ చెక్
ద్వారాలు లేవు. ముందుగా ఆన్ లైన్లో బుక్
చేసుకుంటే విజిటర్లను లోపలకు కూడా అనుమతించే ఏర్పాటు
వుందట.
విచిత్రం ఏమిటంటే వైట్ హౌస్ కు వెళ్ళే మార్గంలో, దానికి కూతవేటు దూరంలో పేవ్ మెంట్ మీద ఇద్దరు బిచ్చగాళ్లు (హోం లెస్) కనిపించారు. అదే దోవలో దారి పక్కన టోపీలు, టీ షర్టులు
అమ్ముకుంటున్న వాళ్ళు కనిపించారు.
అమెరికా పార్లమెంట్, లింకన్ మెమోరియల్, వాషింగ్ టన్ మెమోరియల్ (ఎత్తైన స్థూపం) చూసాము. ఎటు
తిరిగినా, ఏమి చేసినా, ఫోటోలు తీసుకుంటున్నా, అక్కడ అడిగేవాళ్ళు, అభ్యంతర పెట్టేవాళ్ళు
ఎవరూ లేకపోవడం చిత్రంగా అనిపించింది. అటకాయించే భద్రతా సిబ్బంది మాకు కనబడలేదు.
అమెరికా రాజధానిలో మేము చూసినంత మేరకు , పెద్ద పెద్ద భవనాలు వున్నాయి కానీ, ఆకాశ హర్మ్యాలు కానరాలేదు. దానికి కారణం అడిగితే, వాషింగ్ టన్ మెమోరియల్ స్థూపం కంటే మించి ఎత్తైన భవనాలు
నిర్మించరాదని చట్టం వుందని చెబుతారు.
తోకటపా:
వైట్ హౌస్ పైన ఎగురుతున్న అమెరికన్ జాతీయ పతాకం కిందనే
నలుపు తెలుపులో మరో జెండా ఎగురుతుంటుంది. యుద్ధాల్లో మరణించిన లేదా ఆచూకీ
తెలియకుండా పోయిన అమెరికన్ సైనికుల స్మృత్యర్ధం రూపొందించిన పతాకం అది.
(ఇంకా వుంది)
3, జులై 2026, శుక్రవారం
ఇదెక్కడి గోల? – భండారు శ్రీనివాసరావు
“ఉన్నది పోతుందన్న బెదురుతో
అనుకున్నది
రాదేమో అన్న అదురుతో
కొట్టుకుంటూ
తిట్టుకుంటూ
కొండ
కెక్కేవాళ్లము
మీ
అండకోరే వాళ్ళము”
ఇదీ
ఈనాటి అన్ని అర్హతలు కలిగిన సాధారణ ఓటరు పరిస్థితి” అని సూత్రీకరించాడు ఒకాయన.
ఇక్కడ
మామూలు ఓటరు అంటే నేను కాదు. కంప్యూటర్స్ లో ప్రావీణ్యం వున్న వాళ్ళు కాదు.
చదువుకున్న వాళ్ళు కాదు. చదువు లేని వాళ్ళు కాదు. ఇరవై నాలుగేళ్ల క్రితం 2002 లో తాము ఏ నియోజకవర్గంలో, ఏ పోలింగ్ స్టేషన్ లో, ఏ నెంబరు
బూతులో ఓటు వేశామో అనే విషయంలో కనీస పరిజానం పరిజ్ఞానం లేని వాళ్ళు వీళ్ళు. అది ఎలా తెలుసుకోవాలో తెలియని వాళ్ళు. అయినా
వాళ్ళు ఓటు వేసే వయసు నుంచీ ఓటు వేయడం తమ కర్తవ్యంగా పాటిస్తున్న వాళ్ళు. కానీ ఏమి
లాభం?
గత ఇరవై నాలుగేళ్ళలో భౌగోళిక స్వరూపం పూర్తిగా
మారిపోయింది. ఊహాతీతంగా, సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందింది. రాష్ట్రాల విభజన జరిగింది. నియోజక వర్గాలు
మారాయి. పోలింగ్ స్టేషన్ల పేర్లు, పోలింగ్ బూత్
ల నెంబర్లు మారాయి.
మొత్తం ఓటర్లలో ఆయా రాజకీయ పార్టీల ఓటర్లు ఇరవై నుంచి
నలభయ్ శాతం వుంటారు. అభిమానులు మరో పది శాతం వుంటారు. అసలు ఓటు జోలికే పోని నిర్లిప్త
జనం మరో పది శాతం వుంటారు. మరి, మరో
ముప్పయి శాతం మంది రాజకీయ రంగు, సొంటు లేని వాళ్ళు వుంటారు. కానీ ఓటు హక్కు అంటే
వారికి అపరిమితమైన ప్రేమ. అది లేకపోతే
తాము చనిపోయినట్టే, జనాభా
లెక్కల్లో లేనట్టే అని బాధ పడే రకం.
వీళ్ళే ముందు చెప్పిన :
“ఉన్నది పోతుందన్న బెదురుతో
అనుకున్నది
రాదేమో అన్న అదురుతో
కొట్టుకుంటూ
తిట్టుకుంటూ
కొండ
కెక్కేవాళ్లము
మీ
అండకోరే వాళ్ళము”
అర్ధం
అయిందా ప్రభువులూ!
ఏ
సంస్కరణ తీసుకువచ్చినా దాన్ని సామాన్యుల కోణంలో ఆలోచించి రూపొందించాలి.
అప్పుడే
ఆ సంస్కరణలు బహుళ జనామోదం పొందుతాయి.
అయాం ఎ బిగ్ జీరో : (336) : భండారు శ్రీనివాసరావు
30, జూన్ 2026, మంగళవారం
చేసేవారిని చేయనిస్తే పనులు అవుతాయి - భండారు శ్రీనివాసరావు
28, జూన్ 2026, ఆదివారం
అయాం ఎ బిగ్ జీరో (335) : భండారు శ్రీనివాసరావు
సింహం తల, మనిషి రూపం ఏమిటి ఇందులో పరమార్థం?
‘మీ
అన్నయ్య (కీర్తిశేషులు పర్వతాలరావు గారు) పుట్టపర్తిలో ఉంటున్నాడట కదా! ఏం
చేస్తున్నాడు?” మాజీ ప్రధానమంత్రిగా హైదరాబాదు వచ్చినప్పుడు
శ్రీ పీవీ నరసింహారావు గారు నన్నడిగిన ప్రశ్న.
‘నరసింహావతారం
గురించి పుస్తకాలు రాస్తున్నాడు’
‘అలా
అయితే నేనడిగానని చెప్పు. మనిషి శారీరకంగా సింహం కంటే
బలహీనుడు. ఆ అవతారంలో సింహం తలా, మనిషి శరీరం ఏమిటో రాయమని చెప్పు’
నమస్కారం పెట్టి వచ్చేశాము.
పీవీ గారి సందేహానికి, మా అన్నయ్య తాను రాసిన ఓం
నమో శ్రీ నారసింహాయ అనే పుస్తకంలో చాలా
పెద్ద వివరణే ఇచ్చారు.
ఓపిక ఉన్న వారు చదువుకోవడానికి పూర్తి పాఠం
ఇస్తున్నాను.
“హిరణ్యకశిపుడు
స్వతహాగా మహాబలుడు. దానికి తోడు తపశ్శక్తితో పొందిన వరాలు. అతడిని చంపేందుకు
వెళ్ళే విష్ణువు నరసింహ మిశ్రమ రూపం ధరించాల్సి వుంటుంది. అలాంటప్పుడు రెంటిలోనూ
గల బలమైన అంశాలనే స్వీకరించాల్సి వుంటుంది. నరుని మేధ సింహపు మేధ కన్నా చురుకు.
సింహపు శరీరం నరుడి దేహం కన్నా బలమైనది. కనుక నరుని తల, సింహపు
శరీరం కలిస్తే రెండు బలమైన అంశాలను స్వీకరించినట్టు అయ్యేది. కాని విష్ణువు ఈ
అవతారానికి సింహపు తల, మనిషి
శరీరం ఎన్నుకున్నాడు. రెండు బలహీనమైన అంశాల మిశ్రమం అది. మరి విష్ణువు అలా ఎందుకు
చేశాడు? కొందరు
కరాటే ఉదాహరణ చెప్పారు. కరాటేలో చేయి బలహీనంగా వుండడంకన్నా ఆ చేయిని ప్రయోగించడంలో
చూపే వేగం, గురి, ఏకాగ్రత
ప్రధానం. కనుక బలహీనమైన శరీరాన్ని ఎన్నుకున్నా ఇబ్బంది లేదని వారి అభిప్రాయం. అలా
అనుకున్నా అట్టి ఏకాగ్రత నరుని మేధ సాధించినట్టు సింహపు మెదడు సాధించగలదా! మానసిక
పటుత్వాన్ని సాధించడం నరునికే సాధ్యం కాని సింహానికి కాదు. జంతువు కావాలంటే సింహమే
ఎందుకు? జిత్తులమారి
నక్క తల అయితే ఇంకా ఎక్కువ ప్రయోజనకారిగా వుండేదేమో! మరి స్వామి సింహపు తలనే
ఎందుకు ఎన్నుకున్నట్టు!
హిరణ్యకశిపుడు యావత్ ప్రకృతిని తన కనుసన్నలలోకి
తెచ్చుకున్నాడు. అసలు హిరణ్యకశిపుడు అంటే అర్ధం ఏమిటి? కళాప్రపూర్ణ
వేదుల సూర్యనారాయణ శర్మగారీ విషయాన్ని తమ ‘అంతరార్ద భాగవతం’ లో చెప్పారు. హిరణ్యం
అంటే ప్రకృతి (బంగారం కూడా). కశిపుడు అంటే హింసించేవాడు. ప్రకృతిని తన దోవన
పోనీయకుండా, తాను చెప్పిన
దోవనే అది నడవాలని కట్టడి చేసినవాడు. ప్రకృతిని అలా నిర్బంధించడమే హింస. ఆ
రాక్షసుడి కట్టడిలో ప్రకృతి విలవిలలాడిపోయింది.
‘అస్మదీయంబగు
నాదేశమున గాని
మిక్కిలి రవి మింట మెరయ వెరచు’
అని ప్రగల్భాలు పలికిన వాడు ఆ రాక్షస రాజు.
అలాగే ఇంద్రుడు, యముడు, అగ్ని, వాయువు అంతా గడగడలాడారు.
పృధు చక్రవర్తి కాలంలో కూడా ప్రకృతి అన్నివిధాల
ఆయనకు అనుకూలంగా నడిచింది. దున్నకుండానే పంటలు పండేవి. పృధువు పట్ల భక్తీ గౌరవం
వల్లనే కాని చండశాసనుడు అనే భయంతో కాదు. రెంటికీ ఎంత తేడా! నియంతృత్వానికి, ఆదర్శ
ప్రజాస్వామ్యానికి ఉన్నంత తేడా.
అలా ప్రకృతిని తన కనుసన్నల్లో పెట్టుకోవడం ఎందుకు? ఇంద్రియ
సుఖాలను అనుభవించడానికే. ప్రకృతి అందరికీ అవసరమైన మేరకు ఇస్తుంది. కానీ ఆశ పడ్డంత
కాదని గాంధీజీ చెప్పారు.
నరసింహావతారంలో విష్ణువుకి మనిషి తల పనికి
రాకపోవడానికి ఈ ఆబే (అత్యాశే) కారణం. మనిషికి ‘ఆశాపాశము తా కడున్ నిడుపులేదంతంబు’.
అట్టి ఆశలమారి మేధ ఆబను, కక్కుర్తిని
మరింత పెంచుతుంది. తృప్తి చెందదు. సింహం అలా కాదు. అది మృగరాజు. దానికి లేకితనం, పేరాశ
లేవు. ఏ పూటకు ఎంత అవసరమో ఆ పూటకు అంతే వేటాడి సంపాదించుకుంటుంది. ఆ పైన దాచుకోవడం
ఎరగదు. రేపు మాపు అన్న చింత దానికి లేదు. అన్ని జంతువులూ అలా కాదు. పులీ, చిరుతపులి
కూడా వేటాడిన జంతువును దాచుకుని తింటాయి. సింహానికి అది పనికిరాదు. తన కడుపు
నిండితే పక్క నుంచి పోయే జంతువులను కూడా అది పట్టించుకోదు. రేపుతో లంకె పెట్టుకోని
తత్వం. ఆధ్యాత్మికంగా చూసినప్పుడు అంతకన్నా నిస్సంగత్వం లేదు. ఇలాంటి తత్వం
సమాజానికి ఎంతో అవసరం. అట్టి సంస్కృతి వుంటే ప్రస్తుత పర్యావరణం ఇంత దెబ్బ తినేది
కాదు. అనేక పక్షి, జంతుజాలాలు
అంతరించిపోయేవి కావు. మనిషిలో ఆబ పెరగడం వల్లనే ఈ వినాశనమంతా.
అట్టి ఆబ (GREED) లేని సింహం తలను స్వామి ఎంచుకోవడం
హిరణ్యకశిపుని ఆబ (GREED)
కు
వ్యతిరేకంగా వుండే సమాజాన్ని ఆవిష్కరించడం కోసమే. మనిషి శరీరాన్ని ఎంచుకున్నా దాని
బలహీనత వల్ల స్వామికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. స్వామిది సంకల్పబలం. నిజానికి తాను
ఎలాంటి చావు చావాలో హిరణ్యకశిపుడే కోరుకున్నట్లయింది. అతడు కోరిన కోర్కెలే, అతడు
పెట్టిన నిబంధనలే అతడిని సంహరించే వ్యక్తి ఎలా ఉండాలో, ఏ
సమయంలో ఎక్కడ ఎలా అతడిని చంపాలో నిర్దేశించాయి”
ఈ వివరణ ఇచ్చిన మా అన్నయ్య పర్వతాలరావు గారు, ఈ
వివరణ కోరిన శ్రీ పీవీ నరసింహారావు గారు ఇప్పుడు మన మధ్య లేరు.
నా చేత ఇవి రాయించడానికే, ఆ నారసింహుడు, వారిని
తన సన్నిధికి చేర్చుకున్నారేమో!
అంతా భగవత్ సంకల్పం.
కింది ఫోటో:
రాస్తూ మా అన్నయ్య, చూస్తూ నేను. పక్కన వున్నది, మా మేనకోడలి భర్త, రిటైర్డ్ ఐ.జి. రావులపాటి సీతారామా రావు గారు, మా రెండో అన్నయ్య స్టేట్ బాంక్ రిటైర్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ భండారు రామచంద్ర రావు గారు.




