11, జులై 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (192) : భండారు శ్రీనివాసరావు

 మరణమా! జీవన్మరణమా!

నిన్న  వాల్ మార్ట్ కు వెళ్ళినప్పుడు ఒక వృద్ధ వనిత ట్రాలీ తోసుకుంటూ  బయటకు వస్తూ కనిపించింది. ముడుతలు పడ్డ శరీరం, నడుం వంగిపోయి వుంది. ఖచ్చితంగా ఆమె వయసు తొంభయ్ దాటి వుండాలి.

అయితే భిక్షువర్షీయసి గేయంలో శ్రీశ్రీ రాసినట్టు

‘ముగ్గుబుట్టవంటి తలా,

ముడుతలు తేరిన దేహం,

కాంతిలేని గాజుకళ్లు,

తన కన్నా శవం నయం’ అన్నంత దయనీయంగా లేదు. పైపెచ్చు  ఆమె కళ్ళల్లో కాంతి తగ్గలేదు. సామాన్లు వేసుకున్న ట్రాలీని  తోసే విషయంలో శరీర పాటవం సరిపోక అవస్థ పడుతున్నదే కానీ, ఎవరి సాయం అక్కరలేదనే ధీమా ఆమె కళ్ళల్లో స్ఫుటంగా కనబడుతోంది. నిర్గమన ద్వారానికి దగ్గరలో వృద్ధులకు రిజర్వ్ చేసిన చోట పార్క్ చేసి వుంచిన కారులో సామాను వేసుకుని చూస్తుండగానే, వాహనం నడుపుకుంటూ, ‘నా బతుకు నేను బతకగలను’ అన్నట్టు ధీమాగా  వెళ్ళిపోయింది. ఇంతటి ధీమంతం ఆ వృద్ధురాలికి ఎవరు ఇచ్చారు? ఏ వ్యవస్థ ఇచ్చింది?

ఇంటికి వచ్చిన తర్వాత కూడా అవే ఆలోచనలు. ఒకరిపై ఆధారపడకుండా బతకగలమా! ఇది సాధ్యమా! కాళ్ళూ చేతులూ సరిగా వున్నప్పుడే, మంచాన పడకముందే, ‘ఇదిగో నాకు నిద్ర వస్తోంది గుడ్ నైట్ అని చెప్పినంత సులభంగా, హుందాగా మరణించడం అయ్యేపనేనా!  

పైకి చెప్పుకున్నా చెప్పలేకపోయినా, ఒక వయసు వచ్చిన తర్వాత చాలామందికి మరణానికి సులువయిన మార్గం ఏమిటి అనే ఆలోచన తొలుస్తూనే వుంటుంది. దారుణ మరణాలను కళ్ళారా చూసినప్పుడు ఈ రకమైన వేదాంత తత్వం మరింత పెరుగుతూ వుంటుంది. మన దగ్గర  చాలామంది పెద్దవాళ్ళు అంటుంటారు ‘ఇలా కాళ్ళూ చేతులూ ఆడుతున్నప్పుడే దాటిపోతే బాగుంటుంద’ని. అలాగే మరణం తధ్యం అనుకున్న సందర్భాలలో కూడా, తమ మరణం హుందాగా ఉండాలనే ప్రతి మనిషి ఆలోచిస్తూ వుంటారనడానికి చరిత్రలో అనేక రుజువులు వున్నాయి. యావత్  ప్రపంచంలో తాను అందరికంటే అందగత్తెనని విర్రవీగిన క్లియోపాత్రా సంగతే చూడండి. అక్టేవియస్ సీజర్ తనని బందీగా పట్టుకుంటాడేమో అని భయపడిపోయిన క్లియోపాత్రా ఆత్మహత్యకు సిద్ధపడుతుంది. చనిపోయిన తరువాత కూడా తన శరీరం రంగు మారి, అందం చెడకుండా వుండే  విషం కోసం అన్వేషించి,  ఒక రకం సర్పాన్ని అందుకోసం  ఎంపిక చేసుకుంటుంది.  చక్కగా అలంకరించుకుని, శయ్యాగతురాలై,  ఆ విషనాగుతో కాటు వేయించుకుని మహరాణిలా మరణిస్తుంది.

పురాణాల్లో మనకు తెలిసిన భీష్ముడి స్వచ్చంద మరణం కొద్ది తేడా వున్నా అలాంటిదే. కాకపొతే అర్జున గాండీవ విముక్త శస్త్రాలతో శరీరమంతా చిల్లులు పడి, అంపశయ్య మీద పడుకుని ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు ఎదురు చూసి, తండ్రి ఇచ్చిన  స్వచ్చంద మరణ వరం కారణంగా ఇచ్చామరణం పొందిన గాధ  భీష్మాచార్యులది. ఆయన మాదిరిగా అలాటి వరభాగ్యం  అందరికీ దక్కదు.     

 

‘అనాయాసేన మరణం, వినాదైన్యేన జీవనం...’ అన్నారు. హాయిగా చీకూ చింతా లేకుండా బతకడం, అనాయాసంగా చనిపోవడం ఈ రెండింటికీ మించి మనిషి బతుక్కు వేరే సార్ధకత వుండదు.

‘జాతస్య హిధ్రువో మృత్యు:’ అని గీతావాక్యం. పుట్టిన ప్రతి జీవీ గిట్టక మానదు, తప్పని దానికి విచారించడం దేనికన్నది కృష్ణుడి ప్రశ్న.

ప్రతి జీవితానికి ముగింపు మరణమే అని తెలిసి కూడా ప్రతి ఒక్కరూ మరణ భీతితోనే జీవిస్తుంటారు. ఇదొక వైచిత్రి.

జీవితం మనిషికి లభించిన అపూర్వ వరం. బలవన్మరణాలతో దీనికి చరమగీతం పాడరాదని పెద్దల వాక్కు. అయినా జీవించివున్నన్నాళ్ళు  మనిషిని  వెంటాడి వేధించే విషయం మరణ భయమే. ఆ భయంతోనే కాబోలు అనాయాసంగా మృత్యువు ఒడి చేరాలని అనుకుంటారు. కోరుకుంటారు.

‘దీర్ఘాయుత్వంచమే...’ అని చమకంలో చెప్పారు. అంటే  ఏమిటన్నమాట. అపమృత్యువు లేని దీర్ఘాయువు  కావాలి. శతమానం భవతి అంటూ  నిండు నూరేళ్ళు జీవించమని ఆశీర్వదించడం బట్టి చూస్తే పూర్ణాయుర్దాయం అంటే బాల్య, కౌమారాది నాలుగు దశలు దాటి సహజమైన ముగింపుకు చేరుకోవడం. ఏ ప్రమాదాలవల్లో అకాల మరణం రాకూడదని, ఆత్మహత్యల ద్వారా బలవన్మరణాలు తగవనీ  పూర్వీకులు చెబుతూ వచ్చారు. ఆత్మహత్య మహాపాపం అని నిర్ధారణ చేసి, దాన్ని నిషేధ కార్యాల జాబితాలో చేర్చేసారు కూడా.  

ఈ నేపధ్యంలోనే కారుణ్య మరణాల అంశం తెర మీదకు వచ్చింది.

ఆస్తులు, వారసులు, దాయాది తగాదాలు మిక్కుటంగా వున్న సమాజంలో కారుణ్య మరణాలకు చట్టబద్ధత కలిపిస్తే మరిన్ని చిక్కులు ఎదురుకాగలవని సందేహాత్మకుల డౌటేహం. ఆస్తులపై వ్యామోహంతో కన్నవారిని కూడా మట్టుబెట్టాలని చూసే వారి గురించిన కధలు, కధనాలు వింటున్నప్పుడు ‘కారుణ్య మరణాలకు’ అనుమతి ఇస్తే అది దుర్వినియోగం అయ్యే అవకాశాలే ఎక్కువన్నది వారు వెలిబుచ్చే అనుమానం.

మంచాన పడి, అయిన వారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతుకు బండి ఈడుస్తున్న అనేకమంది వృద్ధులకు, దీర్ఘ రోగ పీడితులకు  కారుణ్య మరణం అనేది ఉపశమనం కలిగించే విషయమే. అలాగే, వయోభారంతో  మంచానికి బందీగా మారి  కట్టకడపటి రోజుకోసం ఎదురు చూస్తూ రోజులు లెక్కబెడుతున్న తమ కన్నవారిని సరిగా చూసుకోలేకా, చూడకుండా వుండలేకా అనునిత్యం మధన పడే వారి సంతానానికి సయితం ఈ  ఏర్పాటు ఒక విముక్తి మార్గంగా  కనిపించవచ్చు.

ప్రతి మనిషికి హుందాగా జీవించే హక్కు మాదిరిగా గౌరవంగా మరణించే హక్కు కూడా వుండాలని వాదించే వారి సంఖ్య పెరుగుతోంది. అంతా బాగున్నప్పుడు, జీవితంలో ఇక సాధించాల్సింది ఏమీ లేదు అని నిర్ధారణకు వచ్చినప్పుడు హాయిగా ప్రశాంతంగా కన్నుమూయడం ఎందరికి సాధ్యం.  ఇలాటి అవకాశం చట్టబద్ధంగా వుంటే జీవన్మరణాలు తగ్గిపోయి ప్రశాంత మరణాలు పెరుగుతాయని వారి అభిప్రాయం. సందేహం లేదు, ఇది   గొంతెమ్మ కోరికే.

ఇవన్నీ ఆలోచించడానికి ముందు, ముందు చెప్పిన ముసలావిడను గమనంలో వుంచుకోవడం మంచిది. బతుకు మీది తీపి చావకుండా ఎలా జీవనం సాగిస్తున్నదో తెలుసుకోవడం మంచిది. అలాంటి ధీమాను ఎలాంటి వ్యవస్థ హామీ ఇస్తున్నదో దాన్ని కోరుకోవడం మరీ మంచిది.

ఉపశృతి: మా దూరపు చుట్టం ఒకరు జీవితంలో అన్ని బాధ్యతలు నెరవేర్చుకున్నారు. పిల్లల చదువులు, పెండ్లి పేరంటాలు, పురుళ్ళు, పుణ్యాలు అన్నీ ఒక పద్దతిగా పూర్తి చేసుకున్నారు. పిల్లలు, మనుమళ్ళు కళకళలాడుతూ  నట్టింట తిరుగుతూ వున్నవేళ, ఒక రోజు భార్యాబిడ్డలతో  తీరి కూర్చుని కబుర్లు చెబుతూ, చెబుతూ  హఠాత్తుగా ఒక పక్కకి ఒరిగిపోయారు. అంతే. ఒక క్షణం ముందు వరకు ఆయన ప్రాణం వున్న మనిషి, మరుక్షణం విగత జీవి. అంతవరకూ నవ్వుతూ కబుర్లు చెప్పారు. పిల్లలు చెప్పినవి నవ్వుతూ విన్నారు. అలా ఆయన జీవనయానం   హాయిగా, ప్రశాంతంగా  ముగిసింది. కోటికొక్కరికి కూడా లభించని  అరుదయిన అవకాశం.

చావు ఒక ముగింపు కావచ్చు, పరిష్కారం మాత్రం కాదు.

కింది ఫోటో: Courtesy Google



(ఇంకావుంది)

11-07-2025

10, జులై 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో ( 191 ) : భండారు శ్రీనివాసరావు

 

భార్యావియోగం
‘ఎప్పుడూ ఈయనకు ఈ భార్య నామస్మరణ ఏమిటి? ఎవరికి లేరు భార్యలు?’ అనే మాటలు నా చెవినపడక పోలేదు. అది నిజమే కదా! సమర్థించుకోవాల్సిన అవసరమేముంది?
మా ఆవిడకి ప్రియనేస్తం వనం గీత ఈ వాక్బాణాన్నే మరోరకంగా మా ఆవిడ మీద ప్రయోగిస్తూ వుండేవారు.
‘వస్తానండీ! మా ఆయన వచ్చే వేళ అయింది’ అనగానే, ‘ఏమిటి దుర్గా! (మా ఆవిడకి మరోపేరు) మాకు లేరా మొగుళ్లు? మీరు పోయి కాఫీ కలిపి ఇవ్వాలా! ఆ మాత్రం ఆయన చేసుకోలేరా! మరీ గారాబం చేస్తున్నారు’ అనేది నవ్వుతూ.
నిజానికి భార్య నామస్మరణ వేరు, భార్యావియోగం కారణంగా ఆమెను పదేపదే తలచుకోవడం వేరు. ఈ వియోగబాధ శ్రీరామచంద్రులవంటి వారికే తప్పలేదు. రావణ వధ అనంతరం సీతాదేవిని మళ్ళీ కనులారా చూసేవరకు సీతా సీతా అంటూ ఎన్ని సార్లు తలచుకున్నది రామాయణం గురించి తెలిసినవారందరికీ తెలుసు.
భార్యా వియోగం గురించి విశ్వనాధ వారి అనుభవం ఫేస్ బుక్ మితృలు, పెద్దలు జేవీపీఎస్ సోమయాజులు గారు రాసిన విషయాలు చదివిన తర్వాత అంతటి కవి సామ్రాట్ కే ఈ వేదన తప్పలేదని అర్ధం అయింది. విశ్వనాధ ప్రియ శిష్యులు పేరాల భరత శర్మ గారి ద్వారా ఈ సంగతులు సోమయాజులు గారికి తెలిశాయి. వారు పేర్కొన్న విషయాలు సంగ్రహంగా .
విశ్వనాధ వారు రాసిన రామాయణ కల్పవృక్షం గ్రంధానికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. బెజవాడ రేడియో స్టేషన్ వారి ఆహ్వానంపై విశ్వనాధ సత్యనారాయణ గారు, తన శిష్యులు అయిన పేరాల భరత శర్మ గారిని వెంటబెట్టుకుని కారులో వెడుతున్నారు. అప్పుడు ముచ్చట్ల నడుమ విశ్వనాధ గారు ఇలా చెప్పుకొచ్చారట.
‘ఈ శరీరమే చిత్రమైనది. ఎన్ని బాధలు పడిందో అన్ని సుఖాలూ పడింది. ఈ శరీరంలో ఉన్న సత్యనారాయణ నాటికీ నేటికీ ఒక్కడే. కాని వీడిచుట్టూవున్న సంసారం మారిపోయింది. అప్పుడు నాతో బ్రతికిన భార్య యిప్పుడు లేదు. ఇప్పుడు నా యింట్లో ఎన్ని కూరలున్నా, చుట్టం వస్తే మళ్ళా ఏ బంగాళాదుంపలో ఏవో తెప్పిస్తేగాని తృప్తిగా వుండదు. అప్పట్లో నా కొంపకు చుట్టం వస్తే, వానికి ఏమి మర్యాద చేయగలమా అని నాకు కొంచెం కష్టంగా వుండేది. భోజనం వేళ ఆగదుగదా ! ఆ వేళకు మాఆవిడ వచ్చిన చుట్టానికి, నాకు తిండి సృష్టించేది. ఇంట్లో ఆ పదార్థాలు ఎలా ఎక్కడనుండి ఊడిపడినాయో నాకు తెలియదు. షడ్రసోపేతంగా అమృతాయమానమైన తిండి సృష్టించేది. సృష్టించడమే సుమా! కూర, పప్పు, పులుసు, పచ్చడి ఏమి కావాలో అన్నీ, ఎలా వచ్చినాయి యివన్నీ! నా బీదకాపురానికి అటువంటి సృష్టిచేయడానికి, ఆ మర్యాద దక్కించడానికి ఆ మహా యిల్లాలు పడిన శ్రమ తలచుకుంటే నాకు ఇప్పటికీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అదంతా ఎందుకండి! నేను 1956 లో మేడ కట్టాను. అప్పటివరకూ పాకలో వున్నాను. అప్పుడూ ఇప్పుడూ ఒక్కటే. కాని అప్పటి మా ఆవిడ పడిన కష్టం అంతా ఇంతా కాదు. వాన కురిస్తే ఇంట్లో మోకాటి లోతు నీళ్ళు. ఆ నీళ్ళు తోడేసి రాళ్ళు పేర్చి వాటిమీద యింత ఉడకేసి పెట్టాల్సివచ్చేది. అప్పటి విశ్వనాథ సత్యనారాయణకి యిప్పటి విశ్వనాథ సత్యనారాయణకి తేడా ఏమిటి? అదే శరీరం కారులో పోతుంది. రైలులో పోతుంది. కొన్ని యేండ్లుగా యిలా సుఖపడుతున్నది. లోపల ఉన్న జీవుడు ముందు స్థితి మరచిపోలేదు. మా తండ్రిగారుండగా నేను యువరాజును. పుట్టుభోగిని. తర్వాత కష్టదశ. ఈ కనపడే భోగం, మేడ అంతా ఆ జీవుడినంటుకోవడం లేదు. అందువల్ల వాడికి దుఃఖమేమిటో కష్టమేమిటో తెలిసినంత సుఖం గూర్చి తెలీదు. వానికి గర్వం ఎలా వుంటుంది? బ్రతికి వున్నాను కనుక యివన్నీ అనుభవిస్తున్నాను. ఆ భార్య లేదు. ఆమెకీ అనుభవంలేదు. ఇప్పుడింత మహాకవిని, అప్పుడూ మహాకవినే నన్ను మహాకవిని చేసినది ఆమె’’ ఈ మాటలాయన కళ్ళల్లో చెమ్మతో అన్న మాటలు. వరలక్ష్మీ త్రిశతిలో అన్నారు కదా!
‘‘వట్టి నీరసబుద్ధి నట్టినన్ను రసోత్థపథముల సత్కవీశ్వరుని జేసి
…….ఇతరు లెవ్వరు నెరుగని యీ రహస్య ఫణితి నను
నేలుకొనిన నా పట్టమహిషి’’
‘‘నా యఖిల ప్రశస్త కవనమ్మున కాయమ పట్టభద్రురా
లాయమ లేక యాధునికమైన మదున్నత చిత్తవృత్తి లేదు’’
అని చెప్పారు.
శ్రీరామచంద్రమూర్తికి ముప్పై ఆరుఏండ్ల వయసులో సీతా వియోగం సంప్రాప్తించింది. తనకు కూడా సరిగా అదే వయస్సులో ఆ భార్యావియోగ మహాదు:ఖం సంప్రాప్తించింది. ఆ వియోగ వ్యథ ఏమిటో తెలియనిదే తాను రామకథను రసవంతం చేయలేడని భగవంతుడు తనకు ఆ యోగ్యత కూడా కల్పించాడని వాపోయినాడాయన’ అని ముగించారు భరత శర్మగారు.
ఇంత అద్భుతమైన వృత్తాంతాన్ని అందచేసిన సోమయాజులు గారికి ధన్యవాదాలు.
అంత పెద్దవారితో పోల్చుకుని నా భార్యా వియోగానికి ఉన్నతిని కల్పించడం కోసం కాదు ఇది మొదలు పెట్టింది.
అమెరికా వచ్చిన తర్వాత కాలక్షేపం కోసం నెట్ సంచారం చేస్తుంటే, కొన్ని పాత వీడియోలు కంటపడ్డాయి. వాటిల్లో ఒకటి మూడేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాత్రికేయ రంగంలో జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రకటించి నాకు అందచేసింది. ముఖ్యమంత్రి నుంచి అది స్వీకరిస్తున్నప్పుడు దాన్ని పైలోకాల్లో వున్న మా ఆవిడకి చూపించడానికి పైకి ఎత్తాను. నా ఈ చర్యను ఎవరు గమనించారో లేదో నాకు తెలియదు. నాకు రావాల్సిన గుర్తింపు రాలేదని ఆమెకు మనసులో కొంచెం కినుకగా వుండేది. అది వచ్చిన రోజున ఆమె లేదు.
తోకటపా!
ఈ అవార్డు వచ్చిన ముహూర్త బలం ఏమిటో కానీ అప్పటి నుంచి నా రాజకీయ రచనా వ్యాసంగానికి స్వస్తి చెప్పాల్సిన దుర్గతి దాపురించింది.
అది ఒక ప్రభుత్వం ఇచ్చిన అవార్డు.
అయితే అప్పటికే రాజకీయ పారావారాలుగా విడిపోయిన సోషల్ మీడియాలో ఒక వర్గం నామీద దాడి మొదలుపెట్టింది. ఆఖరికి ఈ ట్రోలింగు (అప్పుడే మొదటిసారి ఈ పదానికి వున్న పదును నాకు బోధపడింది) గొడవల్లో అభం శుభం ఎరుగని, చనిపోయిన నా ఇల్లాలిని కూడా ఇరికించి అభాండాలు వేశారు. నలభయ్ ఏళ్ళ జర్నలిజం కెరీర్ లో ఏనాడు ఇటువంటి అపప్రథకు గురికాని నాకు ఆ పరిణామాలు చాలా మనోవేదన కలిగించాయి. నా భార్య చనిపోయి బతికిపోయిందనే భావన కలిగింది. దానితో రాజకీయ రచనా వ్యాసంగానికి భరత వాక్యం పలికాను. ఇతరుల రాజకీయ పోస్టులు, అవి ఎంత సమ్మతంగా ఉన్నాసరే, వాటికి లైకులు కొట్టడం కానీ, కామెంట్స్ పెట్టడం కానీ స్వచ్చందంగా మానేశాను. టీవీ చర్చల నుంచి తప్పుకున్నాను. ఒంటరి జీవితంలో కొంత ఉపశమనం ఇస్తున్న వ్యాసంగాన్ని వదులుకుని మళ్ళీ ఒంటరి గుహలో కూర్చుని నా జీవిత కధా రచనతో కాలక్షేపం చేస్తున్నాను.

కింది ఫోటో:
విశ్వనాధ సత్యనారాయణ గారు

No photo description available.

(ఇంకా వుంది)

9, జులై 2025, బుధవారం

జులై తొమ్మిది

 దేవుడికి తెలియదా తనకు దగ్గరి వారెవ్వరో! అందుకే తన దాపున వున్న మీ ఇద్దరినీ తన దగ్గరకు చేర్చుకున్నాడు.

సంతోష్! నువ్వూ అమ్మా ఇద్దరూ ఒకే తేదీన పుట్టారు. తను ఫిబ్రవరి తొమ్మిది, నువ్వు జులై తొమ్మిది. చెట్టంత పెరిగి చల్లగా చూసుకుంటావని కన్న కలలు కల్లలు అయ్యాయి. అయినా నీ చేతిలో ఏముంది?
ఈరోజు నీ పుట్టినరోజు. నీకు శుభాకాంక్షలు. ఎక్కడ వున్నా అక్కడినుంచే నీ చిన్నారి ముద్దులపట్టి జీవికను ఆశీర్వదించు. నీ ఫోటో చూడగానే నాన్న, నాన్న అంటుంది. నువ్వెలా మరచిపోతావ్!













8, జులై 2025, మంగళవారం

నెత్తినే వుంది గంగమ్మ – భండారు శ్రీనివాసరావు

 శివ రాచర్ల గారితో ఓ పదిహేనేళ్ల క్రితమే పరిచయం అయివుంటే బాగుండేదని మరో పాతికేళ్ళ తర్వాత కూడా అనుకుంటాను. వచ్చే నెలలో ఎనభయ్యవ పడిలో పడతాను కనుక నాకా అదృష్టం ఉండకపోవచ్చు.

పిలిచిన ప్రతి ఛానల్ కు వెళ్లి ఇంటర్వ్యూలు ఇచ్చే రోజుల్లో,  ఒకరోజు ఆయన ఒక స్టుడియోలో పరిచయం అయ్యారు. తర్వాత కూడా కొన్నిసార్లు కలిశాము. నాదీ స్నేహ స్వభావమే కానీ పేర్లు, మొహాలు చప్పున గుర్తు రావు. అంచేత మధ్యలో ఎవరో మళ్ళీ పరిచయం చేయడం, నేను శివగారు నాకెందుకు తెలియదు అన్నట్టు కప్పి పుచ్చుకోవడం వారికి అర్ధం అయ్యే వుంటుంది. అయితే తర్వాతి రోజుల్లో  నా మతిమరపు తత్వాన్ని ఆయన అర్ధం చేసుకున్నారు అనే అనుకుంటున్నాను. లేకపోతే, నన్నో పొగరుమోతుగా భావించి,  మధ్యమధ్యలో ఫోన్ చేసి మాట్లాడేవారు కాదు.

ఇక ఆయన సంగతి చెప్పాలంటే  ఒక నడిచే ఎన్సైక్లో పీడియా. చేయి తిరిగిన జర్నలిస్టుల దగ్గర కూడా లేనంత రాజకీయ సమాచారం శివ గారి దగ్గర వుంది. ఇక ఇరిగేషన్ రంగంలో ఆయన పరిజ్ఞానం అపూర్వం. ఇవ్వాళ ఎవరో పోస్టు పెడితే అదే కామెంటు పెట్టాను, శివుడి నెత్తి మీదే గంగ వుంది, ఇక నదుల గురించి ఆయనకు మనం చెప్పాలా అని.

ఆయన గురించి అనేకమంది కామన్ మితృలు రాసిన పోస్టులు అమెరికాలో తీరి కూర్చుని చదివాను . శివగారిలో  నాకు తెలియని అద్భుత  కోణాలను పరమాద్భుతంగా ఆవిష్కరించారు. వారందరికీ నా ధన్యవాదాలు.

ఇక ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటారా! ఈ ఒక్కరోజే ఎందుకు? వారికి నా తరపున ప్రతిరోజూ, ప్రతి ఉదయం  వుంటాయి.

మరో ముక్కతో ఈ పోస్టు ముగిస్తాను.

కిందటి నెలలో నా అమెరికా ప్రయాణం.

ఓరోజు పొద్దున్నే శివగారి నుంచి ఫోను. పదిన్నరకు వస్తాను అన్నారు. అన్నట్టే వచ్చారు.

ఇలా నా అంతట నేనుగా మిత్రులను వెళ్లి  కలిసే రోజు ఎప్పుడు వస్తుంది?  రాదని తెలుసు. ఎందుకంటే నేనో సీతయ్యను.

Many many happy returns of the day Siva Racharla garu  





7, జులై 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (190) : భండారు శ్రీనివాసరావు


నాకు సముద్రం అంటే వల్లమాలిన ప్రేమ. తీరంలో కూర్చుని ముందుకు వెనక్కి వెళ్ళే అలలు చూస్తూ, సముద్రపు హోరు వింటూ గంటలు గంటలు గడపాలని అనిపిస్తుంది. కానీ నా చదువు సంధ్యలు సాగిన విజయవాడలో కానీ, ఖమ్మంలో కానీ, ఉద్యోగాలు వెలగబెట్టిన హైదరాబాదు, మాస్కోలలో కానీ ఎక్కడా సముద్రం లేదు. పెద్దయ్యేవరకు సినిమాల్లో చూసి సంతోషించడమే.

అలాంటిది 2025 జులై ఆరో తేదీ, ఒకే రోజున ఒకే సముద్రంతో, అదీ ప్రపంచంలో అతిపెద్దదైన పసిఫిక్ మహాసముద్రంతో  మూడు చోట్ల ములాఖత్తులు.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ మొదలుకుని  రాత్రి డిన్నర్ వరకూ పసిఫిక్ తీరాల్లోనే గడిపాము.  కేనన్ బీచ్, హగ్ పాయింట్ బీచ్, షార్ట్ శాండ్ బీచ్ ఈ సముద్రానికి సంబంధించి అరెగాన్ రాష్ట్రంలో మూడు ప్రముఖమైన పర్యాటక ప్రాంతాలు. లాంగ్ వీకెండ్ కావడంతో జనం పోటెత్తారు. ఫలితం రహదారులపై వాహనాల వరద. కారు పార్కింగ్ కోసం వెతుకులాట. చాలా సమయం కృష్ణార్పణం. 

హగ్ పాయింట్

వున్నవూరు వాడికి వల్లకాడు  భయం, పొరుగూరువాడికి  ఏటి భయం అనేది మా బామ్మగారు. 

వున్న ఊరు వాడికి ఏటి భయం వుండదు. ఏట్లో ఎంత వరద పారుతోందో, ఎక్కడ సుడిగుండాలు వున్నాయో ఈ వివరాలు తెలుసు కనుక భయం లేకుండా ఏరు దాటేస్తాడు. అదే స్మశానం అంటే జంకుతాడు. పొరుగూరు వాడికి అంటే పరదేశికి ఏటిలో ఎక్కడ ఎంత లోతు ఉన్నదో అని భయపడి ఏరు దాటడానికి భయపడతాడు. వల్లకాడు అని తెలియదు కాబట్టి నిక్షేపంగా అందులో నడిచి వెడతాడు.

హగ్ పాయింట్ బీచ్ లో నా కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో విలాసంగా కూర్చుని ఎదురుగా కనబడుతున్న అనంత జలరాశిని చూస్తూ కాలక్షేపం చేస్తున్న సమయంలో, మూడు నాలుగేళ్ల కుర్రాడు ఒకడు సముద్రం ఎదురుగా వెడుతూ కనిపించాడు. చుట్టుపక్కల చూస్తే అతడి తాలూకు వాళ్ళు ఎవరూ కనిపించలేదు. అరెరే అనుకుంటుంటే ‘భయపడకండి ఇక్కడి వాళ్లకు ఇవన్నీ మామూలే’ అన్నట్టు మా వాళ్ళు కళ్ళతోనే వారించారు. ఆ పిల్లాడు కూడా సముద్రంలో దిగి అలలతో ఆడుకుంటున్నాడు. ముందుకు పోవడం, ఎగిసే కెరటాలతో పాటు వెనక్కి రావడం. కాసేపటి తర్వాత  ముందు పరిగెత్తుతున్న ఓ కుక్క, దాని వెనుకనే పరిగెత్తుకుంటూ అతడి తలితండ్రులు కాబోలు,  పిల్లాడికంటే అదే ఎక్కువ అన్నట్టు కనిపించారు.    

మా చిన్నప్పుడు  మా ఊళ్ళో కొందరు నా దోస్తులు లోతయిన దిగుడుబావిలోకి పైనుంచిదూకేవారు. వాళ్ళ పెద్దవాళ్లు కూడా పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. మోచేతులు, మోకాళ్లు చీరుకుపోయినా తేలిగ్గా తీసుకునే వారు. జీవితంలో ఢక్కా మొక్కీలు తినాలంటే ఇవన్నీ తప్పవు అన్నట్టు వుండేది వాళ్ళ వ్యవహారం.

పసిఫిక్ తీరంలో ఇసుక కూడా సాయంత్రపు సూర్య కాంతికి మిలమిలా మెరుస్తోంది. నాలుగుసార్లు మర పట్టించిన బియ్యపు తవుడులా ఎంతో మెత్తగా వుంది. ఈ బీచ్ లోకి వెళ్ళాలి అంటే పైన కార్లు ఆపుకుని కాలినడకన దాదాపు ఓ కిలోమీటరు  కొండ దిగి వెళ్ళాలి. ఆ కొండదారికి ఇరువైపులా ఆకాశాన్ని తాకుతున్నట్టు పొడవైన వృక్షాలు.  నడుమ సెలయేళ్ళు. వాటి మీద కర్ర వంతెనలు. ఆ కాలిబాటలో నడిచేవాళ్ళు ఒక నిబంధన పాటించడం గమనించాను. దిగేవాళ్ళు కుడివైపుగా దిగుతుంటే, పైకి వచ్చేవాళ్ళు ఎడమవైపుగా ఎక్కుతున్నారు.

ఆ చెట్లని చూస్తుంటే ఇవి కూడా పసిఫిక్ సముద్రంతో పాటే పెరిగాయా అన్నట్టు కొన్ని గజాల చుట్టుకొలతతో, మెడలు రిక్కించి చూడాల్సిన  ఎత్తులో వున్నాయి. గొడ్డలి వేటు అంటే ఏమిటో తెలియనట్టుగా పెరుగుతున్నాయి. పెనుగాలులు వీచినప్పుడు కూకటి వేళ్ళతో కూలిన పెద్ద చెట్టు ఒకటి కనిపించింది. అది అలాగే పడివుంది. దాని కాండం మీద మరికొన్ని చెట్లు పెరుగుతున్నాయి.  

ఆ కిలోమీటరు నడవడానికి నా ఒళ్ళు నాకే బరువనిపించి ఆయాసపడుతుంటే, ఆడా మగా తేడా లేకుండా చాలామంది బరువైన సర్ఫింగ్ బోట్లు పట్టుకుని చులాగ్గా నడిచి వెడుతున్నారు. రోజంతా బీచిలో, సముద్రంలో గడపడానికి తమవెంట తెచ్చుకున్న టెంట్లు, కుర్చీలు, తిండి పదార్ధాలు ఈ బరువుకి అదనం. బీచిలోకి అడుగు పెట్టగానే దుస్తులు తీసేసి, ఈత దుస్తుల్లోకి మారిపోయి సర్ఫింగ్ బోట్లు తీసుకుని, నేరుగా సముద్రంలోకి వెళ్ళిపోతున్నారు. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలల మీద బ్యాలెన్స్ చేసుకుంటూ  సర్ఫింగ్ చేయడం వాళ్ళకో ఆట మాదిరిగా వుంది. 

రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా వెలుతురు తగ్గలేదు. నీరెండలో నా నీడ పొడవు రెండింతలు సాగింది. సముద్రం మీద నుంచి వీస్తున్న బలమైన గాలులకు వాతావరణం బాగా చల్లబడింది. ఆ చలి గాలి తగలకుండా నన్ను రెండు గుట్టల నడుమ కూర్చోబెట్టారు. కోడలు భావన ముందుగా సిద్ధం చేసి తీసుకువచ్చిన పులిహార పెరుగన్నం తింటూ మెత్తటి ఇసుకపై మా చిన్న మనుమరాలి పేరు తెలుగులో రాశాను. అదోతుత్తి. అంతే!


కేనన్ బీచ్ లో, సముద్ర జలాల మధ్య వుండే  హే క్ కొండని చూడడానికి వెళ్ళాము. విపరీతమైన రద్దీ. పెయిడ్ పార్కింగ్ కోసం అరగంట వెతికినా దొరకలేదు. పదిహేనేళ్ల క్రితం వచ్చినప్పుడు దీన్ని దగ్గర నుంచి చూశాము. అప్పుడు సముద్రం బాగా వెనక్కి పోయింది. దానితో  కొండ తీరంలోకి వచ్చింది. చుట్టూ నీళ్ళ మధ్య వుండే ఈ కొండను పక్షుల సంరక్షణా కేంద్రంగా అభివృద్ధి చేశారు.   

కేనన్ బీచ్ కి వెళ్లే దోవలో అడవి మలుపులో అడవి దుప్పి ఒకటి  కనిపించింది. చాలా బలిష్టంగా వుంది. అడవి జంతువుల స్వేచ్ఛకు భంగం కలిగించడం కానీ, అడవిలో దొరికే ఆహారం తప్పిస్తే, వాటికి  వేరే ఆహారం అందించడం కానీ వీల్లేదు. ‘మీరు అడవి జంతువుల ఆవాసాల్లోకి అతిధులుగా వచ్చారు. అలాగే వెళ్లిపోండి’ అనే బోర్డులు కొన్ని చోట్ల కనిపించాయి. 

ఇలాంటిదే ఒకటి అమెరికా కెనడా సరిహద్దులో చూశాను.

‘పక్షులు విశ్రాంతి తీసుకుంటున్నాయి వాటికి ఇబ్బంది కలిగించకండి’ అని బోర్డు పెట్టారు.

పోర్ట్ లాండ్ లో నాలుగు రోజులు గడిపి ఈ ఉదయం సియాటిల్ తిరిగివస్తూ మధ్యలో వాషింగ్టన్ రాష్ట్ర రాజధాని అయిన ఒలింపియాలో కాసేపు ఆగి అసెంబ్లీ భవనం, సుప్రీం కోర్టు (టెంపుల్ ఆఫ్ జస్టిస్) భవనాలను చూశాము. ఈరోజు ఆదివారం అనే కాకుండా చూడాలనుకునే వారు ఎప్పుడైనా వెళ్ళవచ్చు. నిషేధాలు లేవు. అనుమతి పత్రాలు అక్కరలేదు. సెక్యూరిటీ తనిఖీలు లేవు. అసలు పోలీసులే లేరు. పైగా ఒక గైడ్ ని పెట్టి భవన విశేషాలను వివరిస్తారు. స్వేచ్ఛగా ఫోటోలు తీసుకోవచ్చు. చాలా పెద్ద భవనం. అనేక మెట్లు ఎక్కి వెళ్ళాలి. భవన నిర్మాణ శైలి అద్భుతంగా వుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో అసువులు బాసిన అమర వీరుల స్మారక స్థూపం ఆ ఆవరణలో వుంది. 

ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా చట్ట సభల్లో శాసనాలు చేస్తారు. ఆ భవనంలో పౌరుల ప్రవేశానికి అభ్యంతరాలు  ఎందుకు? ఆంక్షలు ఎందుకు అనే ప్రశ్నలకు తావు లేకుండా చేశారు.    

కింది ఫోటోలు: అరెగాన్ రాష్టంలో పసిఫిక్ మహాసముద్ర తీరాల్లో విహారం 



















(ఇంకా వుంది)

5, జులై 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (189) : భండారు శ్రీనివాసరావు

 

2025 జులై మూడో తేదీ మధ్యాన్నం భోజనాలు చేసి రోడ్డు ఎక్కాము. సియాటిల్ నుంచి పోర్ట్ లాండ్ 280 కిలోమీటర్లు. అక్కడ కొన్ని రోజుల బస. మళ్ళీ అవే విశాలమైన రోడ్లు. రోడ్లకు ఇరువైపులా అవే పొడవాటి చెట్లు. ఎన్ని మైళ్ళు వెళ్ళినా గోధుమరంగు తివాచీలు పరచినట్టుగా అవే మైదానాలు. ఒక మిత్రుడు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. సరదాకే అనుకోండి. ఒకాయన అమెరికా వచ్చి నెల తిరక్కముందే ఇంటిదారి పట్టాడట. కారణం అడిగితే, ఏముంది ఇక్కడ! మనిషి మొహమే కనపడదు, ఎటు చూసినా చెట్లూ మైదానాలు అన్నాడట.
జులై నాలుగు అమెరికన్ ఇండిపెండెన్స్ డే. దేశం మొత్తం సెలవు. శని ఆది వారాలు లాంగ్ వీకెండ్. పొలోమని జనం టూరిస్టు రిసార్టులకు బయలుదేరారు. రోడ్లన్నీ కార్లతో నిండిపోయాయి. మూడు గంటలు అనుకున్న ప్రయాణం సాగిసాగి ఆరుగంటలు అయింది.
సువిశాల దేశం. కావాల్సినంత భూమి వుంది. మాంధాతల కాలం నాడే దేశమంతా విశాలమైన రోడ్లు పరిచేశారు. నాలుగు దిక్కులకు, ఎనిమిది మూలలకు. అడ్డంగా, నిలువుగా. ఐ మూలగా. శరీరంలో నాడీ మండలంలాగా దేశాన్ని ఏకం చేస్తూ, ఎక్కడినుంచయినా, ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా రోడ్లు వేసుకున్నారు. అండర్ పాసులు, ఓవర్ బ్రిడ్జీలు, అవీ మూడు నాలుగు వరసలు. ఉత్తరం నుంచి తూర్పు వైపు. పడమర నుంచి దక్షిణం వైపు ఎటు వెళ్ళాలి అంటే అటు వైపు వెళ్ళేలా పద్మవ్యూహం లాంటి రోడ్లు. ఎలా వేసారన్నది కాదు, ఎలా వాటిని మెయిన్ టైన్ చేస్తున్నారన్నది పాయింటు. ఎక్కడా రోడ్లకు మరమ్మతులు చేస్తున్నట్టు కనబడదు. అప్పుడే వేసిన వాటి మాదిరిగా కొత్తగా కనిపిస్తాయి. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ మొదటిసారి అమెరికా వెళ్లి వచ్చినప్పుడు అక్కడి రోడ్లు ఒక సినిమాతార బుగ్గల మాదిరి నున్నగా వున్నాయని చెప్పిన సంగతి గుర్తుంది కదా!
వెళ్ళే దారిలో కొలంబియా నది తగులుతుంది. అది దాటితే అవతల ఒడ్డున అరెగాన్ రాష్ట్రం లోని పోర్ట్ లాండ్ పట్టణం. నది ఇవతల ఒడ్డున వాషింగ్టన్ రాష్ట్రంలోని వాంకూవర్ పట్టణం. కెనడాలోని వాంకూవర్ కాదు, ఇది వేరే. ముందే చెప్పాకదా ప్రపంచంలోని నగరాలన్నీ అమెరికాలో వున్నాయి. అవే పేర్లతో.
వాంకూవర్ లో కాసేపు ఆగి కొలంబియా నది తీరంలో సాయంత్రపు నడక పూర్తిచేయాలని మా వాళ్ళు అనుకున్నారు. నడవడం సంగతి ఎలా వున్నా కొత్త ప్రదేశాలు చూడాలనే ఆసక్తితో నేను కూడా వారితో జత కలిసాను. రెండు రాష్ట్రాలను విడదీస్తూ ఆ నదీ జలాలు సాయంత్రపు సూర్య కాంతిలో అత్యంత మనోహరంగా ఉరకలు పెడుతూ పారుతున్నాయి. నదిలో నీళ్ళు అంత స్వచ్చంగా, కాలుష్యరహితంగా ఎలా వున్నాయో అర్ధం కాని విషయం. నదీ తీరాన్ని గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దారు.
కొలంబియా వంతెన దాటగానే పోర్ట్ లాండ్. జీపీఎస్ చెప్పినట్టు వెడితే మేము నాలుగు రోజులు వుండబోయే బస (AIR BNB) దొరికింది. దాని యజమానులు నెట్లో పంపిన పాస్ వర్డ్ సాయంతో తాళం తీసుకుని లోపలకు వెళ్ళాము. కింద మొత్తం డ్రాయింగు రూము, టీవీ, కిచెన్, డైనింగ్ హాలు. వంట సామాగ్రి, వెనుక విశాలమైన పెరడు. షటిల్ ఆడుకునే ప్రదేశం. ఆరేడు మంది కలసి జలకాలు ఆడుకునే హాట్ టబ్, క్యాంప్ ఫైర్, బార్బీక్యూ, పైన మొదటి అంతస్తులో పడక గదులు. బాత్ టబ్స్ తో స్నానాల గదులు. స్టార్ హోటళ్ళలో మాదిరిగా అన్నీ అమర్చి పెట్టి వున్నాయి. భోజనాల బల్ల మీద రాసి ఉంచిన FAMILY IS EVERYTHING అనే సూక్తి బాగా నచ్చింది.
ఆ సాయంత్రం బాత్ టబ్ లో వేడినీటి జలకాలాతలు, క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చుని చలి కాచుకుంటూ సాయంకాలక్షేపం, తర్వాత వేడివేడి భోజనం కబుర్లు.
పోర్ట్ లాండ్ గులాబీ తోటలకు, ద్రాక్ష తోటలకు ప్రసిద్ధి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వైన్ బ్రూవరీస్ వున్నాయి. వాటిల్లో ఎల్క్ కోవ్ ( ELK COVE) వైన్ యార్డ్ సందర్శనకు వెళ్ళాము. ముందుగా రిజర్వ్ చేసుకుని వెళ్ళాలి. దట్టమైన అడవుల నడుమ బ్రహ్మాండంగా వేసిన నున్నటి రోడ్లమీడుగా ఓ గంట ప్రయాణం. అక్కడక్కడా విసిరేసినట్టు ఇళ్లు. స్కూలు బస్ స్టాప్ అనే బోర్డు కనిపించింది. ఎక్కడ ఏ ఆవాస ప్రాంతంలో అయినా నిర్దిష్ట జనాభా వుంటే అక్కడ స్కూలు, ఆసుపత్రి వుండి తీరాలి అనే నిబంధన వుందని చెప్పారు. ఇలా ప్రాధమిక వసతులు అన్ని చోట్లా వున్నండువల్లె పట్టాణాలు, నగరాల మీద భారం పడకుండా జనాలు పల్లె పట్టుల్లో జీవిస్తున్నారేమో అనిపించింది.
కొండల మీద, కొండ సానువుల్లో వందల ఎకరాల్లో విస్తరించి వుంది ఈ ఎల్క్ కోవ్ ( ELK COVE) వైన్ యార్డ్. కొండ శిఖరం మీద వుంది మేము బుక్ చేసుకున్న వైన్ టేస్టింగ్ (రకరకాల వైన్స్ ని రుచి చూపించే రెస్టారెంటు) సెంటర్. నడికారు వయసు వున్న అమెరికన్ మహిళ ఒకరు ఆరు రకాల వైన్స్ ను రుచి చూపించారు. ప్రతి ఒక్క రకం వైన్ విశిష్టతను, అది తయారు చేసిన విధానాన్ని, పండించిన భూమి తరహాను బట్టి రుచుల్లో వచ్చే తేడాలను సమగ్రంగా వివరిస్తూ వైన్ సర్వ్ చేశారు. ఇదంతా ఉచితమే కానీ, వెళ్ళిన వాళ్ళు తమకు నచ్చిన వైన్ బాటిల్స్ కొనుక్కుని వెడతారు. బహుశా ఇదంతా కార్పొరేట్ మార్కెటింగ్ మెలకువల్లో భాగం కావచ్చు.
ఇక్కడి వైన్ యార్డులు, ద్రాక్ష తోటల వైభవం చూసిన తర్వాత రియల్ ఎస్టేట్ ప్రభావానికి బలైపోయిన, ఒకనాటి హైదరాబాదు శివార్లలో వందల ఎకరాల్లో విస్తరించి నగరానికి చక్కటి గుర్తింపు తెచ్చిపెట్టిన అనాబ్ షాహీ ద్రాక్ష తోటల ప్రాభవం గుర్తుకువచ్చి మనస్సు చివుక్కుమంది.
కింది ఫోటోలు:
కొలంబియా నదీ తీర దృశ్యాలు, పోర్ట్ ల్యాండ్ లో మేము బస చేసిన హోటల్ లాంటి ఇల్లు, ఎల్క్ కొవ్ వైన్ యార్డు.




































(ఇంకా వుంది)