సాగు నీటి మంత్రి - తాగు నీటి మంత్రి
నేను రేడియోలో పనిచేసే రోజుల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుమ్మల నాగేశ్వర రావు గారు రోడ్లు, భవనాల శాఖ మంత్రి. అయితే అందరికీ తెలియని విషయం ఏమిటంటే, ఒకానొక కాలంలో ఆయన మా రేడియో వార్తలకు ప్రధాన శ్రోత. (ఇప్పటి సంగతి తెలియదు).
రోడ్డు మార్గాన హైదరాబాదు నుంచి ఖమ్మం జిల్లాకు వెళ్లి వస్తున్నప్పుడు, మధ్యాన్నం 1.10 లేదా సాయంత్రం 6.15 అయితే చాలు, మంత్రి గారు ప్రయాణిస్తున్న మోటారు వాహనం రోడ్డు పక్కన నిలిచి పోయేది. ప్రాంతీయ వార్తలు పూర్తిగా విన్న తరువాత మళ్ళీ బయలుదేరేది. (అప్పట్లో ఇప్పటి నాలుగు లేన్ల రహదారి లేదు, అంచేత ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కన కారు ఆపుకునే వెసులుబాటు వుండేది)
ఈ సంగతి ఓసారి మాటల సందర్భంలో ఆయన నోటి నుంచే నేను విన్నాను.
శాసనసభలో మంత్రుల కోసం విడిగా గదులు వుండేవి. ఒక్కో గదిలో ఇద్దరేసి చొప్పున మంత్రులు వుండేవాళ్ళు. తుమ్మల గారితో పాటు మరో మంత్రి. ఒకరు భారీ నీటిపారుదల శాఖ. మరొకరు ఎక్సైజ్ శాఖ. బయట మంత్రుల పేరుతోపాటు వారి శాఖల పేర్లు వున్న బోర్డులు వుండేవి. విలేకరులు సాగు నీటి మంత్రి, తాగు నీటి మంత్రి అని హాస్యోక్తిగా అనేవారు.
తుమ్మల నాగేశ్వర రావు గారికి ఈ రెండు శాఖలు నిర్వహించిన అనుభవం వుంది.
తన నలభయ్ ఏళ్ళ పైచిలుకు రాజకీయ ప్రస్థానంలో పార్టీలు మారిన చరిత్ర వున్నది కానీ, పార్టీ మారిన తర్వాత, తాను వదిలేసిన పార్టీని గురించి కానీ, ఆ పార్టీ నాయకుడిని గురించి కానీ ఏనాడూ ఒక పొల్లు మాట మాట్లాడిన దాఖలా కనపడదు. ఆయన వ్యక్తిత్వానికి ఇదొక కొలమానంగా చెప్పవచ్చు.
నేను చదువుకునే రోజుల నుంచి, రేడియో విలేకరిగా చేరిన వరకు నాకు బాగా తెలిసిన ఖమ్మం జిల్లా నాయకులలో జలగం వెంగళరావు గారు మొదటి వారు. జిల్లా అభివృద్ధిలో ప్రతి ఇటుక మీద నా పేరు వుండి తీరుతుందని వెంగళరావు గారు తదనంతర కాలంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తరచుగా చెబుతుండేవారు.
అలాగే ఇప్పుడు అలా ఘనంగా చెప్పుకోదగిన కృషి చేసింది, చేస్తున్నదీ తుమ్మల నాగేశ్వర రావు గారని స్థానిక నాయకులు చెబుతుండగా వింటున్నాను.
చంద్రబాబు గారి మంత్రి వర్గంలో పనిచేస్తున్నప్పుడు హైదరాబాదు విలేకరులు చాలా మందికి తుమ్మల నాగేశ్వర రావు గారితో సన్నిహిత, సౌహార్ద సంబంధాలు వుండేవి. ఏ సమయంలోనైనా ఫోనులో అందుబాటులో వుండేవారు.
వారం వారం ఖమ్మం వెళ్లి వస్తుండేవారు. ఖమ్మం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో మంత్రిగా ఒక వీ ఐ పీ రూమ్ ఆయన పేరిట వుండేది. బంధుగణం ఎక్కువ కావడం వల్ల నాకూ తరచూ ఖమ్మం ప్రయాణాల అవసరం పడేది.
మా బంధువుల ఇళ్లన్నీ ఆ గెస్ట్ హౌస్ కి నడక దూరంలో వుండేవి. కాబట్టి, అందులో అకామడేషన్ కోసం అడిగేవాడిని. ఆయన వెంటనే ఏర్పాటు చేసేవారు. ఒకసారి ఆయన తన వ్యక్తిగత సిబ్బందితో చెబుతుంటే విన్నాను. ‘శ్రీనివాసరావు అడిగితే వెంటనే ఏర్పాటు చేయండి. ఒకవేళ గదులు ఖాళీ లేకపోతె, నేను ఖమ్మంలో వున్నాసరే పర్వాలేదు, నేను వేరే చోటికి వెడతాను’
అలా ఎప్పుడూ జరగలేదు కానీ ఒక మంత్రి అలా అనడం నా అనుభవంలో ఎప్పుడూ జరగలేదు.
నా స్నేహితుడు, మేనకోడలు భర్త వనం జ్వాలా నరసింహా రావుకు కూడా నాగేశ్వరరావు గారితో చాలా చనువు. నేనూ, జ్వాలా, చిన్నప్పుడు ఖమ్మం, మామిళ్ళ గూడెం రిక్కా బజార్ హైస్కూల్లో చదువుకొనేటప్పుడు ఆయనకు ఒక క్రికెట్ టీం వుండేది. ఇంగ్లాండ్ లోని ఎం సీ సీ అనే క్రికెట్ క్లబ్ మాదిరిగా ఆ టీం కి కూడా అదే పేరు పెట్టారు. అంటే మామిళ్ళ గూడెం క్రికెట్ క్లబ్ అన్నమాట.
ఈ జ్వాలాకు, మాకెవ్వరికీ లేని మాచెడ్డ మంచి అలవాటు ఒకటి వుంది. అదేమిటంటే చిన్నప్పటి నుంచీ ఇప్పటివరకు తన జీవితంలో తారసపడిన మిత్రులతో తరచూ ఫోన్లో మాట్లాడడం లేదా వీలు చూసుకుని కలవడం. నిజంగా చాలా మంచి అలవాటు. నాకు అలవడని అలవాటు.
అలా ఒకసారి హైదరాబాదులో ఈ మామిళ్ళ గూడెం క్రికెట్ క్లబ్ సభ్యులను అందరినీ ఆహ్వానించి లంచ్ మీట్ ఏర్పాటు చేశాడు. దీనికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా రావాల్సిందని అప్పటికప్పుడు ఫోన్లో పిలిచాడు. ఖమ్మం వెళ్ళే హడావిడిలో వుండి కూడా, తుమ్మల నాగేశ్వర రావు గారు కాదనకుండా వచ్చి, చాలాసేపు వుండి అందర్నీ పేరు పేరునా పలకరించి వెళ్ళారు.
కింది ఫోటో అప్పటిదే.
మే పద్నాలుగు, 2026, నాటికి తుమ్మల నాగేశ్వర రావు గారు తొలిసారి మంత్రి అయి నలభయ్ ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా వారికి అభినందనలు.
(ఇంకావుంది)