27, ఏప్రిల్ 2026, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (300) : భండారు శ్రీనివాసరావు

 

రోడ్డు దాటగలవా ఓ నరహరి!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రోజులు.
హైదరాబాదులో ఎర్రమంజిల్ ఐ.ఎ.ఎస్. కాలనీ నుంచి జూబిలీ హాల్ కు బయలుదేరాను. (ముఖ్యమంత్రికి వున్న విచక్షణ అధికారాలతో, ఔట్ ఆఫ్ టర్న్ పద్దతిలో చంద్రబాబు నాయుడు నాకు ఆ ఐ.జే. 2 క్వార్టర్ అలాట్ చేశారు. సీనియర్ ఐ.ఎ,ఎస్, ఐపీఎస్ అధికారులు నివసించే ఆ కాలనీలో కారు లేని వాడిని, నేనొక్కడినే. ఇప్పుడు ఆ కాలనీ లేదు. మెట్రో కోసం నేలమట్టం చేశారు. మేము వున్న క్వార్టర్ స్థానంలో ఏదో పెద్ద షాపింగ్ మాల్ వచ్చింది)
అసెంబ్లీ సమావేశాలకు ముందు స్పీకర్ సంప్రదాయంగా ఇచ్చే అల్పాహార విందుకు వెళ్ళాలి. రోడ్డు దాటి అవతల వైపు వెళ్ళి ఆటో పట్టుకోవాలి. ఇవతల ఎక్కుదామంటే ఒక్కడూ రాకపోగా సనత్ నగర్ అయితే తీసుకుపోతా అంటాడు. వాళ్ళతో పని కాదనుకుని సగం రోడ్డు దాటాను. ఇంతలో ముఖ్యమంత్రి వస్తున్న దాఖలాగా పోలీసుల హడావిడి కనిపించింది. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడివాళ్ళను అక్కడే నిలిపేశారు. దాంతో నేను రోడ్డు మధ్యలో డివైడర్ మీదనే నిలబడిపోయాను. ఈ లోగా సీఎం కాన్వాయ్ రావడం పోవడం క్షణాల్లో జరిగిపోయింది. కాన్వాయ్ వెళ్లడం ఆలశ్యం, రోడ్డుమీద ఎక్కడలేని హడావిడి. అప్పటిదాకా నిలబడిపోయిన వాహనాలన్నీ ఒక్కమారుగా బయలుదేరాయి. అంతా అస్తవ్యస్తం. ఒకదానికొకటి అడ్డం. అడిగే నాధుడు లేదు. అప్పటిదాకా ట్రాఫిక్ కంట్రోల్ చేసిన పోలీసులందరూ మంత్రం వేసినట్టు మాయం అయిపోయారు. సీఎం వెళ్ళగానే తమ డ్యూటీ అయిపోయినట్టు వాళ్ల లెక్క కాబోలు. పోలీసులు మరికొద్ది నిమిషాలు వుండి వాహనాల రాకపోకలు అదుపుచేసి వుంటే ఈ పరిస్తితి వుండేది కాదు.
నేను ఆటో పట్టుకుని వెళ్ళేటప్పటికే అల్పాహార విందు మొదలయింది. విందు పూర్తి కావస్తుండగా సీఎం సెక్యూరిటీ అధికారి అబ్రహాం లింకన్ నాతో అన్నారు, ‘వస్తుంటే దారిలో డివైడర్ మీద నిలబడ్డ మిమ్మల్ని చూసాము, ఒక్కసారి సీఎం గారిని కలవండి’ అని. చంద్రబాబు నన్ను చూస్తూనే ‘వచ్చారా సంతోషం, బ్రేక్ ఫాస్ట్ చేశారా, ఎవరక్కడ, వీరిని కనుక్కోండి’ అంటూ రోడ్డు మీద నన్ను గమనించిన విషయాన్ని అన్యాపదేశంగా ప్రస్తావించారు. “సిటీలో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది, గట్టిగా ఏదైనా చేయాలి, చూద్దాం’ అన్నారు.
నేను మళ్ళీ సెక్యూరిటీ అధికారి దగ్గరికి వెళ్లి, 'మరికొద్ది నిమిషాలు పోలీసులు అక్కడ వుంటే కొంపలు మునగవు కదా' అన్నాను. ఆయన నవ్వుతూ, 'అవును మీ సలహా బాగానే వుంది, కమీషనర్ గారితో చెప్పి చూస్తాను' అన్నారు మర్యాదగా.
ఇది జరిగి కొంచెం అటూ ఇటుగా ముప్పయ్ ఏళ్ళు దాటాయి.
ఈ సమస్య పరిష్కారం కాకపోగా దాని తీవ్రత ముప్పయ్ రెట్లు పెరిగింది.
2014 లో రాష్ట్రం విడిపోయినప్పుడు హైదరాబాదులో కొంత కాలంపాటు, ఉమ్మడి గవర్నర్, ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇద్దరు డీజీపీలు, ఇలా ఇంతమంది వీ.వీ. ఐ.పీ. ల రాకపోకలతో ట్రాఫిక్ సర్దుబాటు చేయడానికి, సమన్వయం చేయడానికి పోలీసులు నానా అవస్థలు పడేవారు.
రద్దీ సమయాలని దృష్టిలో పెట్టుకుని నగరాల్లో 'వీ.ఐ.పీ.' ల పర్యటనలు, రాకపోకల సమయాల్లో మార్పులు చేయడం వల్ల వాహనదారులకు ఒకింత ఉపశమనం కలుగుతుంది. వారికోసం రోడ్లపై వాహనాలను అంతూపొంతూ లేకుండా నిలిపివేసే పద్దతికి స్వస్తి చెప్పడానికి అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలు వాడుకోవాలి.
ముఖ్యమంత్రులు కూడా తమ వ్యవహార శైలిలో కొంత మార్పు చేసుకోవాలి. సమయపాలన విషయంలో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావును ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన టైం అంటే టైం. వెళ్ళాల్సిన ప్రదేశానికి నిమిషం ఆలస్యం కాకుండా వెళ్ళే వాళ్ళు.
నేను విలేకరిగా చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను. ‘టైం అవుతోంది బయలుదేరాల’ని సంబంధిత అధికారి మర్యాదగా సూచిస్తారు. ముఖ్యమంత్రి సిద్ధం కాగానే సెక్యూరిటీ అధికారి ట్రాఫిక్ వారికి సమాచారం ఇస్తారు. అంతే, ఆయన వెళ్ళే మార్గంలో ట్రాఫిక్ నిలిపేస్తారు.
ముఖ్యమంత్రి అంజయ్య వున్నప్పుడు కళ్ళారా చూశాను. కారు ఎక్కబోతుంటే ఎవరో కలుస్తారు. తెరిచిన కారు డోరు పట్టుకుని ఆయన వారితో మాట్లాడుతూ ఆగిపోయేవారు. అంతసేపు దోవలో ట్రాఫిక్ నిలిపే వుంచేవారు. కాకపోతే ఆ రోజుల్లో ఇంత ట్రాఫిక్ లేదు. కాబట్టి ఇబ్బందుల తీవ్రత కూడా ఇంతగా వుండేది కాదు.
సమయానికి కూడా అంత విలువ వుండేది కాదు. బస్సులు, రైళ్లు కొంచెం ఆలస్యం అయినా జనం సర్దుకు పోయేవాళ్ళు. ఇప్పుడలా కాదు. సమయం అంటే డబ్బుకు మరో రూపం. కార్పొరేట్ ప్రపంచంలో జీవించేవారికి ఆలస్యాలు అసలు పనికి రావు. అలాగే ఆసుపత్రులకు వెళ్ళే వారికి కూడా సమయం అమూల్యం. అమృత ఘడియల్లో (గోల్డెన్ అవర్స్ అని డాక్టర్లు అంటారు) రోగికి చికిత్స అందిస్తే రోగి బతికి బట్టకట్టే అవకాశాలు ఎక్కువ. అటువంటి వారిని తీసుకువెళ్ళే అంబులెన్సులకు సయితం ఈ ట్రాఫిక్ సమస్య తప్పడం లేదు.
ప్రధానమైన ఆస్పత్రులు వున్న వీధుల్లో రాస్తారోఖోలు, ధర్నాలు, ఊరేగింపులను నిషేధించడం వంటి చర్యలను చేపడితే మంచిది.
తోకటపా:
హైదరాబాదు విలేకరులకు మంచి స్నేహితుడు అయిన సమ్మెట విజయకుమార్ Vijaya Kumar Sammeta గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వద్ద దాదాపు పదేళ్లు ప్రధాన పౌర సంబంధాల అధికారిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. నిన్ననో మొన్ననో మాదాపూర్ వంద అడుగుల రోడ్డు వద్ద పాదచారుల అవస్థలు గురించి ఫొటోలతో సహా ఒక పోస్టు పెట్టారు. అదే ఈ పోస్టుకు ప్రేరణ.
కింది లింక్ అదే!
(ఇంకావుంది)

24, ఏప్రిల్ 2026, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (299) : భండారు శ్రీనివాసరావు

“కాయ రూపాయ్ అయ్ పొతే, ఆవకాయను పెట్టుటెలా!
కూరనార లేనిరోజున బడికి పిల్లల పంపుటెలా!”
అప్పుడెప్పుడో 1975లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో నేను రాసిన రోజువారీ వాక్టూన్లలో ఒక పంక్తి ఇది.
"మా కోడలు సంగతి ఏం
చెప్పమంటారు పిన్నిగారు
అదిగో అవతల పిలుస్తున్నారు మా వారు
చెబుతా లెండి వివరంగా మరోమారు
అన్నట్టు ఆవకాయ కారాలు పెట్టారా మీరు"
"ఎడతెగని ముచ్చట్లు' పేరుతొ ఇది మరో వాక్టూన్.
2018లో, కారణం తెలవదు, ఎప్పుడూ ఇంట్లో ఇటు పుల్ల తీసి అటు పెట్టే అలవాటు బొత్తిగా లేని నేను మొట్టమొదటిసారి ఆవకాయ కారాల కార్యక్రమంలో చేయి పెట్టడమే కాదు, యావత్తు బాధ్యతను నేనే నెత్తిన వేసుకున్నాను.
దిగిన తర్వాత తెలిసింది ఇది ఆషామాషీ వ్యవహారం కాదని. ముందుగానే అటకల మీద వున్న జాడీలను దింపి, వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టాలి. పంజా గుట్టలో ఒక షాపు వుంది. అక్కడికి వెళ్లి పలానా బ్రాండు కారాలు, నూనెలు, ఆవపిండి, నువ్వులు, మెంతులు, వెల్లుల్లి పాయలు, ఉప్పు వగైరా వగైరా కొనుక్కోరావాలి. ఆ ఉదయం ఎర్రగడ్డ రైతు బజారుకు వెళ్లి పులుపుగా, గట్టిగా వున్న మామిడి కాయలను సెలక్టు చేసుకుని ముక్కలు కొట్టించి తీసుకురావాలి. బోలెడు చాకిరీ. ఏళ్ళ తరబడి ఆడవాళ్ళు ఇంత శ్రమకు ఓర్చి కారాలు పెడుతున్న విషయం నాకప్పుడు బోధ పడింది.
‘ఏడాది తర్వాత మీకెట్టాగు తప్పదులే ఇంటి చాకిరీ’ అనుకుందో ఏమో, మా ఆవిడ ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా తాను పక్కన కూర్చుని సూచనలు చేస్తుంటే నేను ఆ క్రతువును దిగ్విజయంగా పూర్తి చేశాను. (వెనుకటి రోజుల్లో అంటే మా తండ్రి, తాతల కాలంలో మొగవాళ్ళే ఈ బాధ్యత నిర్వర్తించేవారని విన్నాను)
కారాలు కలుపుతున్న చేతులు కాబట్టి నేను ఫోటో తీయలేకపోయాను. ఫోటోలు అంటే ఇష్టపడదు కనుక తను తియ్యలేదు. ఏతావాతా జరిగింది ఏమిటంటే నా జీవితంలో మొట్టమొదటిసారి ఇంటి పనుల్లో మా ఆవిడకు సాయం చేశాను అనే దానికి (అదీ ఆ ఒక్కసారే అనుకోండి) ఒకే ఒక్క రుజువు అంటూ లేకుండా పోయింది. అది నిజంగా నా దురదృష్టం. అమూల్యమైన, అపురూపమైన ఇటువంటి జ్ఞాపకాలు మనసులోనే దాచుకోవాలని రాసిపెట్టి వుంటే ఏం చేస్తాము చెప్పండి.
సీజనులో పండ్లు తినడం సరే, ఏడాది పొడుగునా తినే ఊరగాయ పచ్చళ్ళు జాడీల్లో నిండుగా వుండాలంటే సీజను తప్పిపోకముందే ఆవకాయ కారాలు పెట్టేసుకోవాలి. అంచేత ఈ రోజుల్లో ఏ ఇంట్లో చూసినా ఈ కొత్త కారాల గుబాళింపులే. అమ్మలక్కల నోట్లో కారాల గురించిన ముచ్చట్లే.
అయిత ఒక ఏడాది మాత్రం ఆ సీజనులో ఇంట్లో కాకుండా ఆసుపత్రిలో ఎక్కువ రోజులు వుండడం వల్ల, ఈ కొత్త కారాల బాధ్యతను మా ఆవిడ భుజం మీద నుంచి మా రెండో వదిన గారు, మేనకోడళ్ళు తమ భుజాలకు ఎత్తుకున్నారు. ఆ విధంగా మా ఇంట్లో పెట్టని కొత్త ఆవకాయ కారాలు మూతులు బిగించి, వాసెన కట్టిన జాడీల్లో మా ఇంట్లో కొలువు తీరాయి. దీన్నే కాబోలు ప్రాప్తం అంటారు.
ఇంట్లోనే పెరుగు చిలికి తీసిన వెన్న పూసతో కొత్త ఆవకాయ కారాన్ని వేడి వేడి అన్నంలో కలుపుకు తింటుంటే, అహో ఏమి రుచి. 'మిధునం' సినిమాలో పాట గుర్తుకు రాక తప్పదు.
మా అక్కయ్యల చేతి రుచి ఇలా ఇలవరసగా మా మేనకోడళ్లకు వచ్చింది. అది వాళ్ళను కట్టుకున్నవాళ్ల అదృష్టం.




(ఇంకా వుంది)

23, ఏప్రిల్ 2026, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (298) : భండారు శ్రీనివాసరావు

 

గద్దర్ టు గణేశా!
నాలుగేళ్ల క్రితం అంటే 2022లో ఒక రోజు.
'రెయిన్ బో ఇయర్స్'. ఇది ఒక తెలుగువాడు రాసిన ఇంగ్లీష్ నవల.
దీన్ని నవల అనాలా! లేక కాల్పనిక పాత్రలతో కూర్చిన ఒక వ్యక్తి వాస్తవ జీవన చిత్రం అనాలా!
రాసింది ఆషామాషీ వ్యక్తి అయితే ఇంత చర్చ అనవసరం. కర్నాటక కేడర్ లో అడిషినల్ చీఫ్ సెక్రెటరీ స్థాయి వరకు ఎదిగిన ఓ సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి రాయడం వల్ల, పుస్తకం టైటిల్ కు CONFLICTS TO CONTENTMENT అనే ట్యాగ్ లైన్ జోడించడం వల్ల పెరిగిన ఆసక్తి కారణంగా ఈ పుస్తకం గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం ఏర్పడింది.
పుస్తక పరిచయ కార్యక్రమం హైదరాబాదులోని టూరిజం ప్లాజాలో జరిగింది. మండుటెండ మాడుస్తున్నా సభామందిరం కిటకిటలాడింది. అనేకమంది విశ్రాంత ఐ.ఏ.ఎస్. అధికారులు, రచయితలు, పాత్రికేయులు హాజరయ్యారు.
హాజరీ ఈ స్థాయిలో ఉండడానికి ఈ పుస్తకం గురించి అంతకు ముందు ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో ‘మావో నుంచి మహర్షి దాకా’ అనే శీర్షికతో శ్రీ కారుసాల వెంకటేష్ రాసిన సవివర సమీక్షా వ్యాసం కూడా చాలావరకు కారణం అని చెప్పవచ్చు.
పుస్తక రచయిత పేరు మాఢభూషి మదన్ గోపాల్. తెలంగాణా గడ్డ మనిషి.
ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మదన్ గోపాల్ తండ్రి ఎం. వెంకటాచారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. పుచ్చలపల్లి సుందరయ్యగారితో కలిసి పనిచేశారు. వామపక్ష భావజాలంతో పుట్టి పెరిగిన మదన్ గోపాల్, మరో అడుగు ముందుకు వేసి మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ సానుభూతిపరుడిగా ఎదిగారు. ఇటువంటి వ్యక్తి ఇండియన్ సివిల్ సర్వీసులో ఐ.ఏ.ఎస్. హోదా పొందడం ఓ విచిత్రం. నక్సలైట్ అభిమాని అనే కారణంతో కొన్నాళ్ళు సస్పెండ్ అయిన చరిత్ర కూడా వుంది.
నవలల్లో రచయిత కధని మలుపులు తిప్పినట్టే, ఊహకు అందని, మనిషి బుర్రకు చిక్కని ఏదో ‘మానవాతీత శక్తి’ కూడా మనుషుల జీవితాలను అనేక మలుపులు తిప్పుతుంది. ఈ క్రమంలో అనేక రకాల ఘర్షణలు, సంఘర్షణలు. (CONFLICTS). మరి CONTENTMENT సాధించడం ఎల్లా!
(ఈ పుస్తకం అప్పటికి చదవలేదు. నిజం చెప్పాలి అంటే ఇంతవరకూ కూడా చదవలేదు.)
మదన్ గోపాల్ కి చలం గురించి ఎవరు చెప్పారో తెలియదు. తిరువన్ణామలైలో వుంటున్న గుడిపాటి వెంకటాచలంతో ఉత్తర ప్రత్యుత్తరాలు మొదలు పెట్టారు. ఆ ఉత్తరాలు చదివిన చలం, ‘నీ రాతలతో నా తల తినడం ఆపేసి, ఓసారి నా దగ్గరకు రా’ అని ఓ కార్డు ముక్కమీద జవాబు రాసి పడేసారు.
మదన్ ఆ పిలుపు పట్టుకుని రమణాశ్రమానికి బయలుదేరి వెళ్ళారు. ఆ సమయంలో చలం, వచ్చిన వాళ్ళని కలుసుకుంటున్నారు. మదన్ గోపాల్ వెళ్లి ఎదురుగా నిలబడితే ‘ఎవరు నీవు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తుంటావు’ అనే ప్రశ్న ఒక్కటి కూడా వేయకుండా, వెంటనే ఆయనకు బస ఏర్పాటు చేశారు. పొద్దున్నే ఉపాహారం, కాసేపు తోట పని. పగలు చలం చెంత గడపడం. శ్రీ రమణుని బోధనలు గురించి తెలుసుకోవడం. అప్పుడు అనిపించింది. జీవితం అంటే వేరే ఒకటి వుందని. దాని ద్వారా లభించే CONTENTMENT అనేది మరోటి ఉంటుందని. మూఢ భక్తి వేరు, ఆధ్యాత్మిక చింతన వేరు . ఆధ్యాత్మికత అంటే తనను తాను తెలుసుకోవడం. అదే శ్రీ రమణుని భక్తిమార్గం అని అప్పుడే ఆయనకు తెలిసింది.
సరే! ముందు మొదలు పెట్టిన ‘గద్దర్ టు గణేశా’ ఏమిటి అంటే!
పుస్తక పరిచయ కార్యక్రమం మొదలు కాబోతున్న తరుణంలో వచ్చిన ప్రజా గాయకుడు గద్దర్ ని గమనించిన మదన్ గోపాల్ లేచి నిలబడి, గద్దర్ గతంలో పాడిన ఓ పాట పాడుతూ సగౌరవంగా ఆహ్వానించారు. ఆ తర్వాత గణపతి ప్రార్ధనతో సభ మొదలయింది.
నా ఈ రాతలో కూడా కొన్ని CONFLICTS కనిపించి వుంటే ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే, నేనింకా CONTENTMENT దశకు చేరుకోలేదు. CONFLICTS నడుమే కొట్టుమిట్టాడుతున్నాను.
తోకటపా: ఈ కొత్త పుస్తకం కోసం వెడితే పాత మితృలు, పాత పరిచయస్తులైన అనేకమంది ఐ.ఏ.ఎస్. అధికారులు కనిపించారు.
మిత్రుడు జ్వాలా కోరికమీద రచయిత మదన్ గోపాల్, ఆంధ్రజ్యోతి (అప్పటి) ఎడిటర్ కె. శ్రీనివాస్, తెలంగాణా పబ్లిక్ సర్వీసు కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, నాటి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, 108 సర్వీసు మాజీ సీఈఓ వెంకట్ చంగవల్లి, 104 సర్వీసు మాజీ సీఈఓ డాక్టర్ ఉట్ల బాలాజీ అందరం కలసి జ్వాలా ఇంటికి వెళ్లాం.
మా మేనకోడలు, జ్వాలా శ్రీమతి అయిన వనం విజయలక్ష్మి, “వండనలయదు నేవురువచ్చిరేని నన్నపూర్ణకు నుద్దియౌనతని గృహిణి” అనే ప్రవరాఖ్యుని ఇల్లాలు బాపతు కాబట్టి, మా అందరికీ అప్పటికప్పుడు వండివార్చిన వేడి వేడి విందు భోజనం ఆనాటి మా కలయికలో నిజంగా హై లైట్.
గతంలోకి తొంగి చూస్తుంటే ఇలాంటి మధురమైన ఘటనలు, సంఘటనలు ఎన్నో, ఎన్నెన్నో.
కింది ఫొటోలు జ్వాలా ఇంట్లో:








(ఇంకా వుంది)

22, ఏప్రిల్ 2026, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (297) : భండారు శ్రీనివాసరావు


ఇది ఇప్పటి మాట కాదు. మూడు దశాబ్దాల కిందటి సంగతి. ఈ రోజుల్లో అయితే ఇలాంటి అనుభవాలకు ఆస్కారమే లేదు.
“ఏమండీ ఆయన గారు వచ్చారు, మళ్ళీ ఏదైనా సమస్య వచ్చిందేమో!!”
పదవుతున్నా ఇంకా పడక సీనులోనే వున్న నాతో మా ఆవిడ వచ్చి చెప్పింది.
బయటకు వచ్చి చూస్తే ఆయనే. మొహం వాడిపోయినట్టు వుంది. మనిషి దిగాలుగా వున్నాడు.
పేరుకు పెద్ద అధికారి. పైగా సీనియర్ ఐ.ఏ.ఎస్. మా ఇంటికి వచ్చి నాకోసం ఎదురు చూడడం ఏమిటి చిత్రం కాకపోతే!
నిమిషాల్లో తయారై, ఆటోలో ఆయన్ని తీసుకుని వెళ్ళాల్సిన వాళ్ళ దగ్గరికి తీసుకు వెళ్ళాను. ఆయన్ని బయట కూర్చోబెట్టి లోపల చెప్పాల్సిన వాళ్లకు ఆయన గురించి చెప్పాను.
‘నువ్వు ఇంతగా చెప్పాలా శ్రీనివాసరావ్ ఆయన గురించి. నాకు బాగా తెలుసు. నిజాయితీపరుడు. తన డ్యూటీ శ్రద్ధగా చేస్తాడు. కానీ..”
“ఆ కానీ ఏమిటో నాకూ తెలుసండీ. మీరు ఆయన అడిగిన పోస్టు ఇస్తే, రేపు నేను వెళ్లి ఆయన్ని కలిసినా ఎవరు నువ్వు అన్నట్టే చూస్తారు. ఫోన్ చేసినా రెస్పాన్స్ వుండదు. మళ్ళీ బదిలీ అయిన దాకా నేనెవరన్నది ఆయనకు గుర్తు కూడా వుండదు. ఏ పని చేయాలన్నా రూలు బుక్కే వేదం. మీరే కాదు, ముఖ్యమంత్రి చెప్పినా వినే రకం కాదు. నిజంగా ఇలాంటి అధికారులే కావాలి. అందుకే వెంట బెట్టి తీసుకువచ్చాను. ఇక మీ ఇష్టం” అనేశాను.
“నేనూ అదే చెబుతున్నా! ఇక నీ ఇష్టం. ఈసారి చేస్తాను. ఆరు నెలల్లో మళ్ళీ నువ్వే వస్తావు, ఆయన సంగతి చూడమని. రూలు బుక్కు అంటూ ఎక్కడా ఇమిడే రకం కాదు. ఎవరి మాటా వినే రకం కాదు.” అన్నాడా మంత్రిగారు.
మూడు రోజుల్లో ఆయన కోరుకున్న పోస్టు దొరికింది. నాకు తెలుసు దొరుకుతుందని. మరో విషయం కూడా తెలుసు తిరిగి బదిలీ అయ్యేదాకా నేను ఎవరన్నది ఆయనకు గుర్తు కూడా ఉండదని.
నాకు ఆ అధికారి జిల్లా కలెక్టర్ గా వున్నప్పటి నుంచి తెలుసు. ఆయన నిజాయితీ గురించి, చేసిన మంచి పనులు గురించీ ఆ జిల్లాలోని బీదాబిక్కీ బాహాటంగా చెప్పుకోవడం కూడా నాకు తెలుసు. తర్వాత కొంత కాలానికి హైదరాబాదు బదిలీ పై వచ్చారు.
నారాయణ గూడాలో మాకు దూరపు చుట్టం, మా ఆవిడకి దగ్గరి స్నేహితురాలు అయిన లేడీ డాక్టరు గారికి ఓ నర్సింగ్ హోం వుండేది. తాము వుంటున్న విజయ నగర్ కాలనీ నుంచి రెండు సిటీ బస్సులు మారి ఈ అయ్యేఎస్ అధికారి భార్య, డాక్టరుకు చూపించుకోవడానికి వచ్చేవారు. అక్కడ మా ఆవిడకి పరిచయం ఆమె గారు కూడా. ఆవిడ నిరాడంబరత గురించి మా ఆవిడే చెప్పింది. ఆయన్ని గురించి విన్నది కరక్టే అనే అభిప్రాయం కలిగింది.
ఇలాంటి నిజాయితీ కలిగిన మంచి అధికారులు వుంటేనే ప్రజలకు మంచిది అని కోరుకునే వాడిని కనుక, ఆయన నన్ను పట్టించుకున్నాడా లేదా అనే విషయాన్ని పట్టించుకునే వాడిని కాదు.
పొతే, ఇంత నిబద్ధత కలిగిన అధికారికి పోస్టింగుల మీద ఈ వ్యామోహం ఏమిటి అనే అనుమానం తొలుస్తూ వుండేది.
ఒకసారి బదిలీ అయినప్పుడు ఆయనే చెప్పారు ఇలా.
“సాయం చేయగలిగిన, అదీ అవసరంలో వున్న పేదవారికి సహాయపడగలిగిన పోస్టులో వుంటే చేయగలిగింది చేస్తాను. కలక్టరుగా వున్నప్పుడు ఆ స్వేచ్ఛ వుండేది కొంతవరకు. కానీ సచివాలయానికి వచ్చిన తర్వాత అలా కుదరదు. ఎవరికీ ఉపయోగపడలేని పోస్టులో వేస్తె, గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుని జీతం తీసుకుకోవడం తప్పిస్తే ఏం చేయగలను చెప్పు”
“అది సరే! మీకు సాయం చేసిన పై వారి మాట, కనీసం అప్పుడప్పుడైనా చెవిన పెడితే, మీ గురించి అలా మాట్లాడరు కదా!”
“సరి సరి భలే మాట చెప్పావు. వాళ్ళ మాటలు వినడం మొదలు పెడితే నాచేత వాళ్ళు చేయించేవి పనులు కాదు, అకృత్యాలు”
(ఆ అధికారి ఎవరన్నది ముఖ్యం అనుకోను. ఆయనిప్పుడు జీవించి కూడా లేరు. సర్వీసులో ఉన్న రోజుల్లో తోటి అయ్యే ఎస్సులు ఆయనకీ పెట్టిన పేరు పిచ్చోడు)
(ఇంకా వుంది)

21, ఏప్రిల్ 2026, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో ( 296 ) : – భండారు శ్రీనివాసరావు

 

‘ఉహు’ అనకుండా, ‘ఊ’ అంటే పోలా!
డెబ్బయ్యేళ్లు దాటాయా?
కింద ఫోటో చూసారు కదా!
‘పోట్లాడడం నాకిష్టం వుండదు. వాదులాటకు దిగను. నా జీవితంలో చాలా భాగం గడిచిపోయింది. చిల్లరమల్లర తగాదాలతో, ఒకర్ని బాధ పెట్టి, మనం బాధ పడే అనవసరమైన వాదోపవాదాలతో, పంతాలు, పట్టింపులతో మిగిలివున్న కొద్ది విలువైన కాలాన్ని వృధా చేసుకోదలచుకోలేదు’ అనేది స్థూలంగా ఈ ఫోటో వ్యాఖ్య లోని భావం.
ఈ సూత్రం తెలియక జీవితంలో దాదాపు 78 ఏళ్ళు వృధా చేసుకున్నాను. రెండేళ్ల క్రితమే నాకీ జీవనసత్యం బోధపడింది. దాన్నే పాటిస్తూ వస్తున్నాను. గతంలో నన్ను పట్టి పీడించిన బీపీ షుగర్ ఇతర అనారోగ్య సమస్యలు చాలావరకు దూరం అయ్యాయి.
ఇందులో లేని మరొక అదనపు అలవాటు ఏమి చేసుకున్నాను అంటే, Facebook లో పొలిటికల్/ సినిమా పోస్టులు పెట్టకుండా వుండడం, ఇతరుల పొలిటికల్/ సినిమా పోస్టులకు కామెంట్ సరే, కనీసం LIKE కూడా కొట్టక పోవడం. అనేక దశాబ్దాలుగా అనుదినం రాజకీయ వార్తలు, ముప్పూటలా రాజకీయ వ్యాఖ్యలు రాస్తూ, చేస్తూ వున్న నేను, ఈ విషయంలో నిగ్రహించుకోవాల్సి రావడం ఒక విధంగా బాధాకరమే. కానీ మారిన పరిస్థితుల్లో నేను పంధా మార్చుకోక తప్పలేదు. ఇది వెనుకడుగు కాదు, మరింత ముందడుగు వేయడానికి వేస్తున్న వెనుకడుగు మాత్రమే.
నిజానికి ఇవే నా ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి.
‘ఉన్నరోజున వుంది’ అని కానీ, లేని రోజున ‘లేదు’ అని కానీ అనుకోకపోవడం కూడా ఈ చిట్కాల్లో వున్నాయి.
శరీరాన్ని, మనసుని కష్టపెట్టుకోనవసరం లేని, కాణీ ఖర్చు లేని ఉపాయాలు ఇవి. పాటించడం పెద్ద కష్టం కాదు. కాస్త నాలుకను అదుపులో వుంచుకోవాలి. అంతే! ప్రయత్నిస్తే పెద్ద కష్టమేమీ కాదు.
కోపం ముందు పుట్టి తరువాత నేను పుట్టాను. అవతల మనిషి ఎవరు అనేది చూడకుండా నోరు జారడం, మాట తూలడం నాకు పుటకలతో పుట్టిన బుద్దులు. వీటి వల్ల జీవితంలో చాలా నష్టపోయాను. ఇతరులని కష్టపెట్టాను. వారిలో చనిపోయిన నా భార్య కూడా వుంది. అయినా, ఇప్పుడు యేమని అనుకోని ఏమి లాభం!
అనుకోకుండా నా అంతట నేను ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాను. దీనివల్ల మిత్రులను, బంధువులను తరచూ కలవడం తగ్గిపోతోంది. కొంత బాధ కలిగించే విషయమే. కానీ నా అనారోగ్యంతో ఇతరులకు కలిగించిన కష్టంతో పోల్చుకుంటే ఇది తక్కువే. రెండేళ్ల క్రితం నేను తరచుగా అస్వస్థతకు గురి అవుతున్నప్పుడు, మా అన్నయ్య రామచంద్ర రావు గారు, మేనల్లుడు డాక్టర్ మనోహర్, జ్వాలా ఇలా అనేకమంది నా స్వస్టత కోసం శ్రమ పడ్డ సంగతి నాకు బాగా గుర్తుంది.
అంచేత నన్ను నేను బాగు చేసుకోవడానికి మొదలు పెట్టిన ఈ పద్దతులు, నాకయితే మంచి ఫలితాలనే ఇస్తున్నాయి.
ఎనభయ్ అంకె చేరడానికి ఇంకా కొద్ది మాసాలే వ్యవధానం వుంది. ఈ వయసులో, ఈ ఒంటరి జీవితంలో ఇది కేవలం నా అవసరం మాత్రమే. ఇతరులు అనుసరించాలని కాదు.



ఫోటో కర్టెసి :Shri Satyam Vemuri
(20-04-2026)
ఇంకా వుంది

19, ఏప్రిల్ 2026, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (295) : భండారు శ్రీనివాస రావు

 నా పాదయాత్ర

తొమ్మిదేళ్ల కిందటి ముచ్చట

పార్కుకు వెడదామా?” అంది మా ఆవిడ.

నలభయ్ ఏళ్ళు ఆలస్యం అయిందేమో!” అనబోయి తెలివి తెచ్చుకుని, ఆ మాట బయటకు అనకుండా నాలుక కిందే నొక్కిపట్టి యాభయ్ ఏళ్ళ కాపురాన్ని కాపాడుకునే ప్రయత్నంలో పడ్డాను.

మొత్తం మీద మా జీవన యానంలో ‘తొలి నడక’, నా డెబ్బయ్యవ ఏట బ్రహ్మానందరెడ్డి పార్కులో మొదలయింది.

మా నడక మా కాళ్ళ మీద మేము నడవడానికి తల ఒక్కింటికి పాతిక రూపాయల టిక్కెట్టా! ఔరా’ అనబోయి మళ్ళీ మా ఆవిడ తొలిసారి కోరిన కోరిక గుర్తొచ్చి గమ్మున ఉండిపోయాను.

అదే మొదటిసారి ఆ పార్కులో నా కుడి కాలు పెట్టడం. ఇంత కాలం బ్రహ్మానందరెడ్డి పార్కు గురించి ఏదో బ్రహ్మాండంగా ఊహించుకుంటూ వచ్చిన నేను అక్కడి వాతావరణం చూసి కాస్త నిరాశ పడ్డాను. నడక దారి చుట్టూ చెట్లు వున్నాయి కానీ వాటిలో చాలావరకు ఎండిన మోడులే. పచ్చగా ఉండాల్సిన పొదలు కూడా గోధుమ వర్ణంలోకి మారిపోయివున్నాయి. ఎండాకాలం కదా మనుషులమే మోడులుగా తయారవుతున్నప్పుడు చెట్లు అనగా యెంత అని సరిపుచ్చుకున్నాను.

నాకెందుకో అక్కడ పచ్చటి వృక్షాలకంటే నడిచే మనుషులే ఎక్కువ అన్న భావన కలిగింది. అది ఎల్లా వుంటే ఏమిటి మళ్ళీ మళ్ళీ వచ్చేదా ఏమిటి నా పిచ్చికాని.

ఈ ఉరుకుల పరుగుల హైదరాబాదు నగరంలో ఇంతమంది నడిచేవాళ్ళు వున్నారా అనిపించింది. వారంలో ఒక్కరోజయినా అందరూ వాహనాలు షెడ్లో పెట్టి నటరాజా సర్వీసు మొదలు పెడితే నగర ఆరోగ్యం చక్కబడుతుంది కదా అని కూడా అనిపించింది.

కానీ అది అత్యాశ. పార్కులో నడవడానికి కార్లు వేసుకు వచ్చేవాళ్ళు ఆఫీసులకు కూడా అలా నడిచి వెడతారా! ఊహాతీతం.

Note: Please Preserve the ticket అని ఎంట్రీ టికెట్ మీద రాశారు. లాటరీ తీసి కోటి రూపాయలు ఇస్తారేమో!

అయాం ఎ బిగ్ జీరో (294) : భండారు శ్రీనివాసరావు


వృత్తి, ప్రవృత్తి
‘వైద్యం నా వృత్తి, రచనావ్యాసంగం నా ప్రవృత్తి’ అంటుంటారు రెండింటిలో చేయి తిరిగిన వాళ్ళు.
చిన్నప్పటి నుంచి నాకు తెలుగంటే అవ్యాజానురాగం. బహుశా వేరే ఇతర భాషలు ఒంటపట్టక పోవడం దీనికి కారణమేమో!
మాస్కో రేడియోలో ఉద్యోగం చేసే రోజుల్లో నాకు రష్యన్ భాష నేర్పడానికి ఒక టీచరమ్మను పెట్టారు. ఆవిడ వారానికి మూడు సార్లు మా ఇంటికి వచ్చి రష్యన్ పాఠాలు చెప్పేది. చివరికి జరిగిందేనిటంటే నాకు రష్యన్ ఒక్క ముక్క అంటకపోగా ఆవిడ మాత్రం ఎంచక్కా తెలుగు నేర్చుకుని చక్కాపోయింది.
సరే! మా ఇద్దరు పిల్లలు అక్కడే ఇండియన్ ఎంబసీ వారి సెంట్రల్ స్కూల్లో చదువుకున్నారు. మాస్కో మొత్తంలో అదొక్కటే ఇంగ్లీషు మీడియం స్కూలు.
క్లాసులో వుండేది పదిహేను, ఇరవై మంది విద్యార్ధులే అయినా ఒకడు అమెరికా, మరొకడు ఇంగ్లాండ్, ఇంకొకడు ఆఫ్రికా, ఇండోనేషియా ఇలా ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలా వుండేది. మిగిలిన వాళ్ళు మన దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల వాళ్ళు, వివిధ భాషల వాళ్ళు. ఇలా మొత్తం ఇంటర్నేషనల్. అయితే వీళ్ళని కలిపి వుంచేది దండలో దారంలా ఇంగ్లీషు భాష ఒక్కటే.
ఆ మాస్కో అధ్యాయం ముగిసి ఇండియాకు తిరిగొచ్చాము. పెద్ద వాడు ఇంజినీరింగు పాసయ్యాడు. చిన్నవాడు డిగ్రీ. ఇంజినీరింగు అయిన తర్వాత ఉద్యోగాల వేట.
ఆ రోజుల్లో పెద్ద కంపెనీల వాళ్ళు ఎక్కడెక్కడినుంచో ఫోను ఇంటర్వ్యూలు చేసి అభ్యర్ధుల్ని వడపోసేవాళ్ళు. చివరికి పర్సనల్ ఇంటర్వ్యూదాకా వెడితే ఏముంది అక్కడ అందరూ ఐఐటీవాళ్ళు పోటీ. అక్కడ మా వాడికి మాస్కో ఇంగ్లీష్ అక్కరకు వచ్చి సెలక్టు అయి అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. రెండోవాడు కేవలం డిగ్రీ అయినా ఇంగ్లీష్ ప్రావీణ్యం వాడిని ఒక అంతర్జాతీయ సంస్థలో పెద్ద ఉద్యోగిని చేసింది. ( ఇప్పుడు లేడు, 2024 ఫిబ్రవరి లో హార్ట్ ఫెయిల్యూర్ తో హఠాత్తుగా చనిపోయాడు)
నాది ప్రవృత్తి, వాళ్ళది వృత్తి.
అలా అడ్జస్ట్ అయిపోయి, ‘తెలుగదేలయన్న’ అని పద్యాలు పాడుకుంటూ నా తెలుగు అభిమానాన్ని నాలోనే దాచుకున్నాను.
(ఇంకా వుంది)