4, జూన్ 2026, గురువారం

కరోనానే లెక్కచేయని జనాలకు ఈ ఎబోలా ఎంత ? - భండారు శ్రీనివాస రావు

హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఒక సుడాన్ దేశీయుడిని అధికారులు ఎబోలా వ్యాధి సోకిన రోగిగా గుర్తించి ముందు జాగ్రత్త చర్యగా అతడిని గాంధీ వైద్య శాలకు తరలించి ఐసోలెషన్ లో వుంచి రక్తపు నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ కోసం వాటిని పుణే పంపినట్టు ఒక వార్త టీవీ ఛానల్స్ లో చక్కర్లు కొడుతోంది.
ఇంతకీ ఏమిటి ఈ ఎబోలా?
తెలుసుకోవాలంటే ఒక పుష్కర కాలం వెనక్కి పోవాలి.
ఆ రోజుల్లో ప్రపంచ జనాభాలో అత్యధికులను ఓ మూడక్షరాల పదం వణికించింది. 'ఎబోలా' అనే వ్యాధి చాప కింది నీరులా వ్యాపిస్తోందని ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను హెచ్చరించిందంటే పొంచివున్న పెను ముప్పు ఎలాటిదో అర్ధం చేసుకోవచ్చు.
ఎబోలా అనే పేరు గల వ్యాధి ఒకటి వుందని కొన్నేళ్ళ ముందు వరకు అనేక దేశాలకు తెలియనే తెలియదు. ఇది సాధారణ వ్యాధి కాదనీ, చాలా ప్రమాదకరమైనదనీ, ప్రాణాంతకమైనదనీ వైద్య నిపుణుల హెచ్చరికలు. గతంలో గడగడలాడించిన స్వైన్ ఫ్లూ వ్యాధి గాలి ద్వారా వ్యాపించేది. అయితే ఎబోలా వైరస్ అంతకంటే చురుగ్గా త్వరగా పాకిపోతుంది. ఈ వ్యాధి యెంత త్వరగా తేలిగ్గా వ్యాపిస్తుందంటే, ఎబోలా రోగిని తాకినా, లేదా ఆ రోగి చెమట చుక్క ఇతరులపై చిందినాకూడా వారికి ఈ వ్యాధి వైరస్ సోకుతుంది.
పశ్చిమాఫ్రికా దేశాల్లో వేలాదిమంది ఈ వ్యాధి కారణంగా అసువులు బాశారు. అభివృద్ధి చెందిన అమెరికా ఐరోపా దేశాలను కూడా ఈ వ్యాధి విడిచిపెట్టలేదు. ఆ దేశాలలోని వైద్య నిపుణులకు ఎబోలా పెను సవాలుగా మారుతూ, అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది.
ఎబోలా అనేది కొత్త వ్యాధి. ఈ వ్యాధి వైరస్ ఎలా వ్యాపిస్తుందో కనుక్కోగలిగారు కాని దీన్ని అరికట్టే వాక్సిన్ కానీ ఔషధాలను కానీ కనుగొనలేదు. కేవలం రోగిని తాకడం ద్వారా వ్యాపించే గుణం ఉండడంతో ఈ వ్యాధికి చికిత్స చేయగల వైద్య సిబ్బంది కూడా కరువయ్యారు. ఎబోలా వ్యాధిని అరికట్టడంలో పశ్చిమాఫ్రికా దేశాలు ఎదుర్కున్న ప్రధాన సమస్య ఇదే. రోగ లక్షాలను తెలుసుకుని రోగిని గుర్తించడం ఒక సమస్య అయితే, ఆ రోగికి వైద్య సహాయం అందించే సిబ్బందిని వెతికి పట్టుకోవడం మరో సమస్య.
అయితే ఈ సమస్యకు సమర్ధవంతమైన పరిష్కారం కనుగొన్న దేశం ఒకటి వుంది. ఎబోలా అనే ఈ మూడక్షరాల మహమ్మారికి క్యూబా అనే రెండక్షరాల దేశం ముకుతాడు వేసే పనికి పూనుకుంది. ఇంకో విశేషం ఏమిటంటే ఆ వ్యాధి ఇంతవరకు ఆ దేశంలో పొడసూపలేదు.
ఈ వ్యాధి పొటమరించిన ఆఫ్రికా ఖండానికి కొన్ని వేల మైళ్ళ ఆవల వున్న దేశం అయినప్పటికీ, క్యూబా తన బాధ్యతగా ఎబోలా వ్యాధి పీడిత దేశాలకు అండగా నిలిచింది. ఈ విషయంలో క్యూబా నిర్వహించిన పాత్ర అనితర సాధ్యం. ఈ కితాబు ఇచ్చింది ఎవరో కాదు. క్యూబా పొడకూడా గిట్టని అమెరికాలోని ప్రధాన వార్తా పత్రిక న్యూయార్క్ టైమ్స్. మిగిలిన దేశాలన్నీ వ్యాధి పట్ల గుండెలు బాదుకుంటూ, చేతులు కట్టుకుని కూర్చుంటే క్యూబా మాత్రం తన వంతు సాయంగా క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్య సిబ్బందిని ఈ వ్యాధి పీడిత దేశాలకు సాయంగా పంపింది. వాస్తవానికి ఈ వ్యాధి వేలాదిమందికి సోకినా వారిలో అధిక సంఖ్యాకులు రోగులకు వైద్యసాయం అందించిన సిబ్బందీ డాక్టర్లే కావడం విశేషం. చికిత్స అందించేవారే రోగం బారిన పడుతూ ఉండడంతో సాయం అందించేవారి కొరత ప్రధాన సమస్యగా మారింది. క్యూబా ఈ విషయంలో గణనీయమైన సేవా పాత్ర పోషించిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక శ్లాఘించింది.
పశ్చిమాఫ్రికా దేశాలు ఈ వ్యాధిని ఎదుర్కోవడంలో పడుతున్న ఇబ్బందులను గమనించిన క్యూబా తక్షణం స్పందించి తన వైద్య బృందాలను, అవసరమైన మందులను హుటాహుటిన ఆదేశాలకు తరలించింది. సొంత దేశంలోని వైద్యులే సాయం చేయడానికి తటపటాయిస్తున్న తరుణంలో క్యూబా అందిస్తున్న ఈ ఆపన్న హస్తం ఆ దేశాలకు వరప్రసాదంగా మారింది. రోగులకు చికిత్స అందిస్తూ వైరస్ సోకిన వారిలో క్యూబన్ వైద్య సహాయక బృంద సభ్యులు కూడా వున్నారు. అయినా వారు వెరవకుండా సహాయక చర్యల్లో పాల్గొనడం ఆ దేశాలవారిని నివ్వెరపరిచింది.
ఈ క్యూబా కధనం అలా ఉంచితే, మన దేశంలో పరిస్తితి వేరే! 'సమస్య ఎదురయినప్పుడు చూసుకుందాం, ఇప్పటినుంచీ ఎందుకు లాయిలాసా' అనేవాళ్ళు ఎక్కువున్న దేశం కాబట్టి ఎబోలా గురించి ఆందోళన పడేవాళ్ళు తక్కువనే చెప్పాలి.
ఎబోలా అనేది ప్రాణాంతక వ్యాధి అని ముందే చెప్పుకున్నాం. రక్తం, చెమట, లాలాజలం ద్వారా ఆ వైరస్ త్వరితగతిన ఇతరులకు సోకుతుంది. జ్వరం, తలనొప్పి, వాంతులు, అలసట, కీళ్ళ నొప్పులు, కడుపు నొప్పి, ఆకలి మందగించడం ఈ వ్యాధి లక్షణాలు. అయితే ఇవన్నీ షరా మామూలుగా జనాలకు అలవాటయినవే. ఈ లక్షణాలు వుంటే వారికి ఈ వ్యాధి సోకినట్టుగా కంగారు పడనక్కరలేదు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వైద్యుల సలహా. చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలని, పరిసరాల్ని పరిశుభ్రంగా వుంచుకోవాలనీ, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలనీ వాళ్ళు చెబుతున్నారు. ఇవన్నీ మామూలుగా చెప్పే విషయాలే కావడంవల్ల జనం అంతగా పట్టించుకునే అవకాశాలు కూడా వుండవు. కాకపోతే ఈ వ్యాధి తీవ్రత పట్ల అవగాహన పెంచడం అవసరం. ఎందుకంటె ఒకసారి ఈ వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయితే ఇక ఆ రోగి మరణానికి చేరువ అయినట్టే అన్నది వైద్యులు చేసే హెచ్చరిక. చెవులు, ముక్కు, దేహంలోని ఇతర బాహ్య రంధ్రాల ద్వారా అపరిమితమైన రక్తస్రావం జరిగి రోగి, కొన్ని వారాల్లోనే ప్రాణాలు కోల్పోతాడు అనేది వాళ్ళు చెప్పే మరో బహుపరాక్.
అయితే అదృష్టవశాత్తు ఈ ఎబోలా పెద్ద జననష్టం కలిగించ కుండానే ఆ రోజుల్లో నిశ్శబ్దంగా తప్పుకుంది. బహుశా తనను మించిన మరో భయంకర వ్యాధి మరో పదేళ్ళలో యావత్ ప్రపంచాన్ని స్తంభింప చేయబోతోందని ఎబోలాకు ముందే తెలుసేమో మనకు తెలియదు.
తోకటపా:
కరోనా మన్ కి బాత్
కరోనా రాకచూసి మిగిలిన వ్యాధులన్నీ సర్దుకు కూర్చున్నాయి.
‘ఏమిటలా వున్నావు’ ధైర్యం చేసి అడిగింది కలరా నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ.
‘ఎలా ఉండను? నిన్న మొన్నటిదాకా మొత్తం ప్రపంచాన్ని గడగడలాడించానని విర్రవీగాను’
‘ఇప్పుడు మాత్రం ఏమైంది? నీ నామ స్మరణ చేయకుండా భూలోకవాసులకు క్షణం గడవడం లేదు కదా!’ అన్నది హెచ్.ఐ.వి.
‘నేనూ అలాగే అనుకున్నాను. ఈ సృష్టి ప్రారంభం అయిన తర్వాత యావత్ ప్రపంచ ప్రజల నోళ్ళలో నా పేరు ఎన్ని కోట్లమారు మారుమోగుతున్నదో చూసి నేనూ పులకరించిపోయాను. వాళ్ళు నా పేరు వింటేనే ఎంతగా భయపడుతున్నారో కళ్ళారా చూసి పొంగిపోయాను. కానీ అది భయం కాదనీ, వాళ్ళు నాతో పరాచికాలు ఆడుతున్నారనీ ఇపుడిప్పుడే గ్రహింపుకు వచ్చి సిగ్గుపడుతున్నాను’
‘అదేమిటే అలా అంటున్నావు. నువ్వు కదా మా అందర్నీ చూస్తుండగానే మించిపోయావు. నీ పేరు వింటేనే వణికిపోయేలా మానవుల్ని మార్చగలిగావు అని మేమిక్కడ అసూయతో రగిలిపోతుంటే, ఏమిటిది ఇలా నీ ఈ మాటలతో మమ్మల్నిలా మళ్ళీ సంతోషపెడుతున్నావు’ అంది ఎబోలా.
‘అలానా! నేను రంగ ప్రవేశం చేసిన తర్వాత మీకెవ్వరికీ సరైన పనిపాటలు లేకుండాపోయాయి కదా! ఆ ఖాళీ టైములో మీరు కాస్త పత్రికలు చదివితే, కొంచెం టీవీలు చూస్తే విషయం బోధపడేది’
‘పత్రికలూ, టీవీలు అంటూ మమ్మల్ని భయపెట్టకు. మేము ఇంతమందిమి కలిసి చేయలేని అపకారాన్ని అవి ఒంటిచేత్తో మానవాళికి చేస్తున్నాయి. అసలేం జరిగిందో నువ్వే చెప్పు, వింటాం’ అంది కేన్సర్.
‘మనుషులకు చావు భయాన్ని మించిన భయం వుండదు అనే ధీమాతో నేను భూలోకంలో అడుగుపెట్టాను. మొదట్లో నా అభిప్రాయం నిజమే అనిపించింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళు మళ్ళీ తమ మునపటి వ్యవహారాల్లో మునిగి తేలుతున్నారు. చావు ముంగిట్లో వుందని తెలిసి కూడా చిన్నారులపై లైంగిక దాడులు చేస్తూనే వున్నారు. చనిపోతే కట్టుకుపోయేది ఏమీ ఉండదని తెలిసికూడా ఆన్ లైన్ మోసాలతో ఇతరులని దోచుకుంటూనే వున్నారు. కరోనా బారిన పడితే రేపు మనది కాదు అనే భయం ఎటు పోయిందో తెలవదు ఎప్పుడో మూడేళ్ళకు వచ్చే ఎన్నికల్లో గెలవడం ఎలాగా, ప్రత్యర్ధిని ఓడించడం ఎలాగా అని మల్లగుల్లాలు పడుతున్నారు. దొంగతనాలు, దోపిడీలు జరుగుతూనే వున్నాయి. భూఆక్రమణలు మునుపటి కంటే ఎక్కువయ్యాయి. డబ్బు పోగేసుకోవడం ముమ్మరమయింది. మరణ భయంతో జనంలో అత్యాశ లేకుండా పోతుంది అనుకుంటే ఆ కక్కుర్తి మరీ ఎక్కువయింది. తింటున్నారు, తాగుతున్నారు, క్వారంటైన్లలో చిందులేస్తున్నారు. వైద్యం చేయడానికి లక్షలు గుంజుతున్నారు. చనిపోతే శవాన్ని అప్పగించడానికి డబ్బులు లాగుతున్నారు. నిజం చెప్పాలంటే నా రాకకు ముందుకంటే కూడా ఇప్పుడు ప్రపంచం మరీ పాడయిపోయింది.
‘ఇన్నిరోజుల అనుభవంతో చెబుతున్నా వినండి. కరోనా అంటే భయం కంటే డబ్బు అంటే మమకారమే వాళ్లకు ఎక్కువ అని తేలిపోయింది’
ఇతి వార్తాః

2, జూన్ 2026, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (319) : భండారు శ్రీనివాసరావు

 

గాలితో నేల అన్నది, నను తాకరాదనీ..

ఈ పాటలో చెప్పినట్టు కరోనా అనే భయంకరమైన వ్యాధి
ఒకింటిలో నివసించే మనుషులనే ఒకరినొకరు తాకకుండా విడతీసింది. పొరుగువారినే దూరం చేసింది.
ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసి, ఆత్మీయులను అనేక మందిని దూరం చేసి, రెండు దశల్లో తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించిన ఆ రోజులను మరవడం కష్టం.
2020 సంవత్సరం.
అప్పటికే కరోనా మొదటి దశ మొదలైంది. దేశం లాక్ డౌన్ లోకి వెళ్లి పోయింది. మరీ భయంకరమైన రెండో దశ ఇంకా మొదలు కాలేదు. కానీ అప్పటికే తన ప్రతాపాన్ని, ప్రభావాన్ని దేశ వ్యాప్తంగా చూపి, ప్రజలకు, ప్రభుత్వాలకు కంటిమీద కునుకు లేకుండా వణికిస్తోంది.
మే నెలలో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఫోను రింగయింది.
“భండారు శ్రీనివాసరావు గారా! లైన్లో వుండండి, వైస్ ప్రెసిడెంటు గారు మాట్లాడుతారు”
వెంకయ్య నాయుడు గారు దేశంలో చాలామందికి ఇలా ఫోను చేసి మాట్లాడుతున్నారని తెలుసు, కానీ ఆ ఫోను నాకు వస్తుందని ఊహించలేక పోయాను. ఇంతలోనే నాయుడు గారు లైన్లోకి వచ్చారు.
“శ్రీనివాసరావు గారు ఎలా వున్నారు? నేను వెంకయ్య నాయుడిని”
“నమస్కారం సార్! నేను బాగున్నానండీ! మీరెలా వున్నారు?”
“నేను బాగానే వున్నాను. మీ ఆవిడ చనిపోయిన తర్వాత ఫోను చేసి మాట్లాడలేకపోయాను, వెరీ సారీ”
“..........”
“హైదరాబాదులో మన మిత్రులందరూ కులాసానే కదా!”
“అందరూ బాగున్నారండీ. నాకు అర్ధం కాని విషయం అండీ. పేపర్లో చదివాను. మీరు ఈ కరోనా సమయంలో ఇలా అందరితో ఫోను చేసి మాట్లాడుతున్నారని. ఇంత తీరిక ఎలా దొరికింది”
“ఇలాంటి సమయాల్లోనే కదా మాట్లాడి యోగక్షేమాలు కనుక్కోవాల్సింది”
“....................”
“ఇక్కడ నేను నా భార్య ఇద్దరమే. పిల్లలు దగ్గర లేరు. బహుశా పెళ్ళయిన తర్వాత ఇలా ఇద్దరం ఒక్కచోట ఇన్నాళ్ళు కలిసివుంది ఇప్పుడేనేమో”
“చాలా సంతోషంగా వుందండీ మీతో మాట్లాడడం”
“నాకూ అలానే వుంది. అందరం పెద్ద వయసులో పడ్డాం. ఆరోగ్యం జాగ్రత్త! వుంటాను శ్రీనివాసరావు గారు”
తర్వాత సిగ్గనిపించింది. ఈ కరోనా సమయంలో నేనూ ఖాళీనే. కానీ ఎంతమంది స్నేహితులను పలకరించగలిగాను. నా ఈ ప్రశ్నకు నా దగ్గరే జవాబు లేదు.
అలాగే అదే సంవత్సరం అదే నెలలో మరో రోజు.
“నా పేరు రజనీష్ శర్మ, సిమ్లా రాజ్ భవన్ నుంచి మాట్లాడుతున్నాను. గవర్నర్ సాబ్ మీతో మాట్లాడుతారు లైన్లో వుండండి” అన్నాడో వ్యక్తి స్వచ్చమైన హిందూస్థానీలో.
కాసేపటి తర్వాత బండారు దత్తాత్రేయ గారు లైన్లోకి వచ్చారు.
“ఏం శ్రీనివాస్ ఎలా వున్నారు” అని పలకరించారు సాదరంగా. కానీ గొంతు చాలా మార్దవంగా, పీలగా వినబడింది.
“మీ ఆరోగ్యం ఎలా వుంది” నా పరామర్శ.
“బాగానే వున్నాను. కాకపోతే తెలిసిన వాళ్ళు అందరికీ దూరంగా ఇలా’
అప్పుడు ఆర్ధం అయింది ఆయన ఎందుకు అంత నీరసంగా అనిపించారో.
అంజయ్య గారికి, దత్తాత్రేయ గారికి చుట్టూ జనం వుండాలి. గొప్ప గొప్ప వాళ్ళు కాదు. సాధారణ జనం. వాళ్ళ మధ్యలో వుంటేనే వాళ్లకు అదే ఆక్సిజన్. వాళ్ళతో మాట్లాడుతూ వుంటే అదే టానిక్కు.
లాక్ డౌన్ పరామర్శలు పూర్తయిన తర్వాత ఆయన పాత రేడియో రోజులను గుర్తు చేసుకున్నారు.
“నన్ను చాలామంది అడిగేవారు, ఆ రేడియో శ్రీనివాసరావు (భండారు) మీకేమైనా చుట్టమా అని. నేను చెప్పేవాడిని, ఆయన నా కుటుంబ సభ్యుడు అని. ఆ రోజులు నిజంగా వేరు. విలేకరులు అందరూ నన్ను ప్రేమించేవారు. అభిమానించేవారు, నిజంగా వారికి నేను చేసింది ఏమీ లేదు, అప్పుడప్పుడూ రైలు టిక్కెట్లు కన్ఫర్మ్ చేయించడం తప్ప” దత్తాత్రేయ గారు చెప్పుకు పోయారు.
నిజమే. ఆయన రైల్వే మంత్రిగా వున్నప్పుడు మాలో ఎవరం రైల్వే రిజర్వేషన్ల కోసం ఇబ్బంది పడలేదు. నిజానికి ఆయన్ని మేమే చాలా ఇబ్బంది పెట్టి ఉంటాము. ఆయన వ్యక్తిగత సహాయకుడు కైలాష్ నగేష్ కి ఫోను చేసేవాళ్ళం. అంతే! కాసేపట్లో బోగీ నెంబరు, బర్త్ నెంబరు వచ్చేసేవి. బండారు దత్తాత్రేయ గారికి నగేష్ నమ్మిన బంటు. ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కాగానే హైదరాబాదు నుంచి సిమ్లాకు వెంటబెట్టుకుని వెళ్ళింది నగేష్ నే. దత్తాత్రేయ గారి లాగే నగేష్ కు కూడా ప్రజాసంబంధాలు ఎక్కువే. అందరికీ చేతనయినంత సాయం చేయాలనే మనస్తత్వం.
కాసేపు మాట్లాడిన తర్వాత దత్తాత్రేయ గారు చెప్పారు, హైదరాబాదులో మన మిత్రులను అందరినీ అడిగినట్టు చెప్పమని. మర్యాదకు అలా అన్నారు కానీ నాకు తెలుసు ఆయనే ఫోను చేసి వాళ్ళని పలకరిస్తారని. నేను అనుకున్నట్టు ఆయనే చెప్పారు.
“మన కృష్ణారావు (ఆర్వీవీ కృష్ణారావు, ఆలిండియా రేడియో మాజీ న్యూస్ ఎడిటర్)తో కూడా మాట్లాడాను. నేనూ ఆయనా రాం నగర్ లో వుండేవాళ్ళం. ఉస్మానియా యూనివర్సిటీ రోడ్డులో మార్నింగ్ వాక్ లో కలుస్తుండేవాళ్ళం”
బండారు దత్తాత్రేయ గారు ఒకసారి సికిందరాబాదు నుంచి పోటీ చేసి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఢిల్లీ ఆకాశవాణి వాళ్ళు ఆయన వాయిస్ అడిగారు. నగేష్ ని రిక్వెస్ట్ చేస్తే కాదనకుండా రాత్రి పదకొండు దాటిన తర్వాత ఆయన్ని వెంటబెట్టుకుని రేడియో స్టేషన్ కు తీసుకువచ్చాడు. ఎన్నికల ఫలితాలు కదా, మాకు ఇరవై నాలుగు గంటల వార్తాప్రసారాలు నడుస్తున్నాయి. ఇళ్ళకు పోకుండా ఆఫీసులోనే వుండి పనిచేస్తున్నాము. ఆయన ఢిల్లీ ఇంటర్వ్యూ వెంటనే అయిపోయింది. లైవ్ కాబట్టి ఆయన కూడా విన్నారు. మేము మా పనిలో పడ్డాము.
పొద్దుటి నుంచి బాగా అలసిపోయినట్టున్నారు. న్యూస్ రూమ్ కుర్చీలోనే కాసేపు అలా పడుకుండి పోయారు. కొద్ది సేపటి తర్వాత లేచి వెళ్ళిపోయారు. అంత సాదా సీదా మనిషి.
“ఇదిగో ఈ లాక్ డౌన్ అవగానే హైదరాబాదు వస్తాను, అప్పుడు కలుద్దాం” అన్నారు దత్తాత్రేయ గారు ఆప్యాయంగా.
“లేదా మీరే సిమ్లా వద్దురు కానీ” అనేసారు వెంటనే.
నూటికి నూరుపాళ్ళు జనం మనిషి. సందేహం లేదు.
మూడు రోజుల కింద బండారు దత్తాత్రేయ గారు రాసిన ఆయన ‘ప్రజల కధే నా ఆత్మ కధ’ అనే ఒక పెద్ద బౌండ్ పుస్తకం మా ఇంటికి చేరింది. పేజీలు తిరగేసి చదివే పుస్తకం కాదు, ప్రతి పేజీ శ్రద్ధగా చదవాల్సిన పుస్తకం. అందుకే తీరికగా చదువుతున్నాను. కొన్ని చాప్టర్లు పూర్తయ్యాయి.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.) నాకు చిన్ననాటి నుంచీ తెలుసు. అందులో దిగువ స్థాయి నుంచీ పనిచేసిన ఒక కార్యకర్తగా దత్తాత్రేయ గారు రాసిన విషయాలు చదివితే ఒకానొక కాలంలో ఆ సంస్థ నిర్వహించిన కార్యకలాపాలు నివ్వెర గొలిపేలా వున్నాయి అనిపిస్తుంది.
ఈ మధ్య పది రోజుల క్రితం ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి కార్యక్రమంలో కలిసినప్పుడు, వెంకయ్య నాయుడు గారు, నేను అడిగితే చెప్పారు, మా శర్మ గారు రాస్తున్న తన జీవిత చరిత్ర కూడా ముద్రణా దశలో వుందని, త్వరలో విడుదల అవుతుందని.
వీరిద్దరూ ఒక రాజకీయ పార్టీకి చెందిన వారయినా, వారి జీవితాలతో తెలుగు వారి చరిత్రలో చాలా భాగం ముడిపడి వుంది. అవి చదవడం ద్వారా మనం మన గతంలోని కొన్ని వెలుగు చూడని విషయాలు తెలుసుకోవచ్చు.
నేను గ్రహించిన నీతి:
అవసరం పడ్డప్పుడు మనుషులు గుర్తుకు రావడం సహజం. కానీ అధికారంలో వున్నప్పుడు, పెద్ద పదవిలో వున్నప్పుడు మనుషులను గుర్తు పెట్టుకోవడం కొందరికే సాధ్యం. ఆ కొందరిలో వీరిరువురూ వున్నారు.


With Shri M.Venkayya Nayudu








(ఇంకా వుంది)

1, జూన్ 2026, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (318) : భండారు శ్రీనివాసరావు

 


బెయిల్ మీద ఒక రోజు

2021 . కరోనా కాస్త తగ్గుముఖం పడుతున్న రోజులు. రెండో వేవ్ సృష్టించిన భయానక పరిస్థితులు కొద్దికొద్దిగా సాధారణ స్థితికి చేరుకుంటున్న కాలం. పగటి వేళ లాక్ డౌన్ ఎత్తివేశారు.  

చాలా ఏళ్ళుగా ఉంటున్న ఇల్లే. అలవాటయిన ఇల్లే. కానీ ఒక ఏడాదిగా  ఎటూ కదలకుండా ఇంటిపట్టునే ఉంటున్నాం.  సమస్త మానవ జాతిని  కదలకుండా కట్టిపడేసిన, ప్రపంచ వ్యాప్తంగా పౌర జీవనాన్ని స్తంభింపజేసిన ఏకైన సందర్భం అదొక్కటే, కరోనా కాలం.  

చూసి, చూసి, ‘ఎక్కడికి బయటకి పోకుండా ఇంట్లోనే  వుండి, వుండి బోర్ కొట్టడం లేదా’ అని మా అబ్బాయి సంతోష్  అడిగాడు.

మళ్ళీ వాడే అన్నాడు, ‘రేపు శనివారం ఊరి బయట మా ఫ్రెండ్ వాళ్ళ ఫార్మ్ హౌస్ కి వెళ్లి మళ్ళీ ఆదివారం ఉదయానికి వచ్చేద్దాము’  అని.

‘రిస్కేమో!’  అనబోయి మానేసి ‘సరే’ అన్నాను.

ఈ కాలపు పిల్లలకు నచ్చని ఒకే మాట ‘రిస్కేమో’ అనేది. నేనూ నా కాలంలో రిస్క్ అంటే ఏమాత్రం భయం భక్తీ లేని వాడినే. ఇక పిల్లలకు ఏం చెబుతాను.

అనుకున్నట్టే, మే ఇరవై తొమ్మిదో తేదీ శనివారం  ఉదయం ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ చేసి లాక్ డౌన్ ముగిసే సమయానికల్లా అక్కడికి చేరుకున్నాము. గేటు బయట  ఓ పాత సీలింగ్ ఫ్యాన్ విరిగిన రెక్కమీద వింటేజ్ వనం అని ఇంగ్లీష్, తెలుగు అక్షరాల్లో రాసి గోడకు కొట్టి వుంది. విలేకరి చూపు కదా ఏమిటో మాసిపోయినట్టు, చాలా పాతదిగా కనిపించింది ఆ బోర్డు. పరికించి చూస్తే అది ఓ సీలింగు ఫ్యాన్ రెక్క. (1960 ల నాటి ఓ పాత సీలింగ్ ఫ్యాన్ విరిగిన రెక్క అదని  తరువాత తెలిసింది) ఇలాంటి ప్రదేశంలో ఒక పగలూ, ఓ రాత్రీ గడపడం ఎల్లా అనే అనుమానం మనసు మూలల్లో తొంగి చూసిన మాట వాస్తవం. కానీ పైకి అనలేదు. ఆ గేటు దగ్గర కాపలావాడు, మావాడు తన ఫ్రెండ్ పేరు అనిరుద్ అని చెప్పగానే గేటు బార్లా తెరిచి పొమ్మన్నాడు. బాటకు రెండు వైపులా వ్యవసాయ క్షేత్రాలు. పెద్ద పెద్ద చెట్లు. కొంత దూరం పోయిన తర్వాత మరో గేటు. అక్కడ ఎప్పుడో మాంధాతల కాలంనాటి, శిధిలావస్థలోవున్న పాత కారు. వెనక పెళ్లి ఊరేగింపుల్లో కనబడేవి ఈ ఓపెన్ టాప్ ప్లిమత్ కార్లు.

ఇచ్చిన రెండు కాటేజీలు బాగున్నాయి. అక్కడ పనిచేసే ఆశారాం వచ్చి తాళం తీశాడు. శుద్ధ హిందీ మనిషి.

ఆ కాటేజీ యావత్తు చెక్కతో చేసినట్టు పైకి కనబడింది. ముందు చిన్న వసారా నాలుగు కుర్చీలు, ఓ మేజా బల్ల. తలుపు తెరిస్తే, ఉడెన్ ఫ్లోర్, ఒకటే డబల్ కాట్ బెడ్ రూమ్,  ఓ వ్రాత బల్ల, రెండు కుర్చీలు. స్ప్లిట్ ఏసీ, అటాచ్డ్ బాత్ రూమ్. మెయింటెనెన్స్ బాగుంది. లోలోపల ఉడుక్కుంటున్న ఆత్మారాముడు ఆ ఏర్పాట్లు చూసి చల్లబడ్డాడు. మా కోడలు నిషా  వచ్చి, ముందు ఆ పరుపు మీద వేసి వున్న చద్దరు తీసేసి ఇంటి నుంచి తెచ్చిన బెడ్ షీట్ వేసింది. అలాగే దిండ్లు కూడా. గది, బాత్ రూమ్ సానిటైజ్ చేశారు.

కాసేపు విశ్రాంతి తీసుకుని బయటకు వచ్చాము. కారులో వస్తున్నప్పుడు పూర్తిగా కనబడలేదు. చుట్టూ పచ్చటి చెట్లు, పచ్చిక బయళ్ళు.

ఒక చోట ఓ పాత కాలపు సింహ ద్వారం. దానికి ఇరువైపులా ‘అనగనగా’ అని తెలుగులో, ఇంగ్లీష్ లో రాసిన బోర్డులు వున్నాయి. చిన్నప్పుడు కధలన్నీ అనగనగా అనే వాక్యంతో, ఇంగ్లీష్ లో Once upon a time అని మొదలు పెట్టే వాళ్లు. గడప దాటి లోపలకు వెడితే, అదేదో ఇంగ్లీష్ సినిమా Back to the future మాదిరిగా మళ్ళీ నా చిన్నప్పటి రోజులకు వెళ్లినట్టు ఎక్కడ చూసినా పాత సామగ్రి. బాయిలర్లు, జాడీలు, ఇత్తడి గుండీలు, పాత కాలపు మేనాలు, గుర్రపు బగ్గీలు, ఈ కాలపు తరానికి ఆ మాటకు వస్తే నాకే తెలియని అనేక పాత కాలపు వస్తువులు. లాంతర్లు, చిమ్నీలు, రేడియోలు, టేప్ రికార్డర్లు, చేటలు, విసన కర్రలు, కెమెరాలు, ఎప్పుడో అరవై ఏళ్లనాటి బాంబే హల్వా స్వీట్ డబ్బాలు, బీహైవ్ బ్రాండీ ట్రేలు, సన్ లైట్ సోప్ కేలండర్లు, పిఠాపురం రాణి వాసం వారు వాడిన టేకు మేనా, చాలా పాత కాలం నాటి ఇంగ్లీష్ పుస్తకాలతో నింపిన బీరువాలు ఇలా అనేక వస్తువులు.

చిత్రలేఖనం, సంగీతం మీద ఆసక్తి కలిగిన వారు ప్రశాంతంగా తమ కళలకు మెరుగు పెట్టుకోవడానికి ఏర్పాట్లు.

ఇవన్నీ చూసిన తర్వాత పర్వాలేదు, రిస్క్ తీసుకుని అయినా మంచి చోటుకే వచ్చాను అనిపించింది.

అందరం కలిసి ఫాం హౌస్ యజమాని అనిరుద్ ని కలిశాము. మా అబ్బాయి ఈడువాడే.

పరిచయం చేయగానే  ‘నా పేరు అనిరుద్ విజయ కుమార్’ అన్నాడు,  బాండ్! జేమ్స్ బాండ్ లాగా.

తండ్రి పేరు అసలు పేరుకు తగిలించుకునే సాంప్రదాయం కొన్ని ప్రాంతాలలో వుంది. తమిళనాడు దీనికి మంచి ఉదాహరణ. కానీ ఈ అనిరుద్ పదహారు అణాల తెలుగువాడు. ‘నాకు నా తండ్రి అంటే గౌరవం. పలానా వారి అబ్బాయిని అని చెప్పుకోవడం నాకు ఇష్టం” అంటాడు అనిరుద్.

మిలిటరీ వారసత్వం. రూపంలో ఆ గంభీరత కనబడుతుంది.

నేను నాలా జీవిస్తాను, ఒకరిలా, లేదా మరొకరికి ఇష్టం అయ్యే రీతిలో జీవించడం నాకు అస్సలు ఇష్టం వుండదు అనేది అనిరుద్ ఫిలాసఫీ. అప్పటికి నేను జెన్ జెడ్ అనే మాటే వినలేదు. ఇప్పుడు ఆలోచిస్తే, అతడు ఇప్పుడు చెప్పుకుంటున్న ఆ నవ తరానికి చెందిన వాడన్నమాట.

నవ తరమే కానీ, పాత వస్తువులు ఇష్టం. పాత సామాగ్రి ఇష్టం. పాత సినిమాలు ఇష్టం. పాత పాటలు ఇష్టం. ఇలా పాతలో కొత్తని వెతుక్కోవడం ఇష్టం. ఆ వెతుకులాటలో బోలెడు పాత వస్తువులు పోగేసాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఆయన వింటేజ్ వనం అని పేరు పెట్టుకున్న తన ఫాం హౌస్ లో ఎక్కడ చూసినా ఇవే. ఒక ఊరు కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు పాత వస్తువు దొరుకుతుందని తెలిస్తే చాలు అక్కడ వాలిపోయి దానిని దొరికించుకునే దాకా నిద్రపట్టదు.

హైదరాబాదు పొలిమేరల్లో చిలుకూరు బాలాజీ దేవాలయానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ వింటేజ్ వనం వుంది. ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి వుంది.

“ There are no strangers here, only friends you have not met” అని రాసి వుంటుంది.

అలాగే అక్కడ ఇంతకు ముందు పరిచయం లేని ఇద్దరు కళాకారులు కనిపించారు. ఎన్నాళ్ళ బట్టో నాకు స్నేహితులు అన్నంతగా వాళ్ళు చాలా కలుపుగోలుగా మాతో కలిసిపోయారు.

ఒకరు Aqeel. ప్రసిద్ధ తెలంగాణా చిత్రకారుడు అజీజ్ గారి కుమారుడు. ఆయన దగ్గర చిత్రకళ అభ్యసిస్తున్న దివ్య అనే అమ్మాయి. మరొకరు కన్నన్. వంటల్లో ప్రవీణుడు.

అక్కడ క్యాంటీన్ వంటివి లేవు. ఎవరికి వాళ్ళే వాళ్లకి కావాల్సినవి వండుకుని తింటారు. వాళ్ళ ప్రాధాన్యత వేరే. అడవిలా ప్రశాంతంగా వున్న ఆ ప్రదేశంలో చిత్రాలు గీసుకుంటూ, కవిత్వాలు రాసుకుంటూ, పాటలు పాడుకుంటూ  సమయాన్ని గడిపేస్తారు. అక్కడ ఉండగానే వాళ్ళు ఒక గోడ చిత్రం మొదలు పెట్టారు. ఎర్రటి ఎండలో నిలబడి దాదాపు నాలుగు గంటలు కష్టపడ్డారు. ముందు ఓ కోడి పుంజు బొమ్మ గీస్తున్నారేమో అనిపించింది అవుట్ లైన్ చూసినప్పుడు. పూర్తయిన తర్వాత చూస్తే అది ఓ అమ్మాయి చిత్రం.

చుట్టూ చెట్లు, మధ్యలో ఆధునిక వసతులు వున్న అతిథి గృహాలు. అవి కూడా ప్రి ఫాబ్రికేటెడ్.

శని ఆదివారాలు అక్కడే గడిపి, హాయిగా గుండెల నిండుగా ఆక్సిజన్ దట్టించుకుని మళ్ళీ ఇంటికి చేరాము.

ఇప్పుడు నిరుద్ అనిరుద్ వున్నాడు, అతడి ఫాం హౌస్ వుంది, ఆ జ్ఞాపకాలు వున్నాయి. అక్కడికి తీసుకు వెళ్ళిన  మా అబ్బాయి సంతోష్ లేడు.



(ఇంకావుంది)

29, మే 2026, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (317): భండారు శ్రీనివాసరావు

 

1975 నుంచి 2026 వరకు.
1975 లో హైదరాబాద్ రేడియోలో చేరిన కొత్తల్లో ఒక రోజు ఉదయం ఆఫీసుకు వెళ్లేసరికి మా న్యూస్ యూనిట్ హెడ్ పన్యాల రంగనాధరావు గారు ఏదో పని చేసుకుంటూ కనిపించారు. ‘ఏం పని మీద వచ్చావ’న్నట్టు నా వైపు చూసారు.
నా మొహంలో రంగులు మారడం గమనించి, “ఇక్కడ మీకు పనేమిటి? మీరు రిపోర్టర్. బయట తిరిగితే కదా నాలుగు వార్తలు తెలిసేది? రోజూ సెక్రెటేరియట్ కు వెళ్ళండి. మంత్రులో, అధికారులో చెప్పేది వినండి. నాలుగు ముక్కలు ముక్కున పెట్టుకు వచ్చి, తెచ్చి నా మొహాన కొట్టండి. అంతే! సింపుల్” అని తేల్చేసారు.
అలా అంటూనే, “ఇంతకీ ఆఫీసుకు ఎలా వచ్చారు?” అని మరో అర్ధం కాని ప్రశ్న సంధించారు. “ఆటోలో వచ్చుంటారు. అవునా! అలా అయితే మీ జీతం డబ్బులన్నీ ఈ రిపోర్టర్ తిరుగుళ్ల కోసం ఆటోలకే తగలెయ్యాల్సి వుంటుంది. వార్తల సంగతి తరవాత. ముందు నేనో ఉత్తరం ఇస్తాను. దాన్ని తీసుకువెళ్ళి సమాచార శాఖలో ఇవ్వండి. అక్కడ అక్రిడేషన్ కార్డు తీసుకుని ఆర్టీసీ ఆఫీసుకు వెళ్ళండి. వాళ్ళు ఇచ్చే బస్ పాసు తీసుకున్న తరవాతే, మిగిలిన ఏ పనులయినా! తెలిసిందా” అన్నారు. తెలియకపోవడానికి ఏముంది. కానీ ఇలాటి పై అధికారులు కూడా వుంటారా అన్నదే అంతవరకూ తెలియని విషయం.”
గుర్తింపు పొందిన మీడియా సంస్థలలో పనిచేసే జర్నలిష్టులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు (ACCREDIDATION CARDS) ఇవ్వడం అనేది 1975 సంవత్సరానికి పూర్వం కూడా అమల్లో వున్న విధానమే.
నేను రేడియోలో చేరింది 1975 నవంబరు 14 వ తేదీన. ఆ ఏడాది జర్నలిస్టులకి ఇచ్చిన గుర్తింపు కార్డుల గడువు మరో నెలన్నర రోజుల్లో ముగిసే సమయంలో అన్నమాట. ఆ కొద్ది వ్యవదానానికి ఈ గుర్తింపు కార్డు తెచ్చుకోవడం ఎంత గగనమో ఈ నాటి జర్నలిస్టులకు తెలిసిందే.
అలా ఒక్క రోజులో తెచ్చుకున్న ‘అక్రిడిటేషన్’ నా విషయంలో ఇన్నేళ్ళుగా కొనసాగుతూనే వస్తోంది. (నేను మాస్కోలో వున్న కాలానికి కూడా) బహుశా నాకంటే సీనియర్లు కొంతమంది ఉండి వుండవచ్చేనేమో కానీ , ఒకే ఊరిలో (హైదరాబాదు) ఒకే ఒక సంస్థ తరపున వరసగా అన్నేళ్ళు ఆ ‘గుర్తింపు’ వున్నది నేను ఒక్కడినే అని గట్టిగా చెప్పగలను.
ఆ రోజుల్లో జర్నలిస్టుల సంఖ్య చాలా తక్కువ. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రెస్ మీట్ పెడితే, పదిమంది విలేకరులు హాజరయితే గొప్ప.
కాలక్రమేణా, పత్రికల సంఖ్య, విలేకరుల సంఖ్యా పెరిగాయి. కొత్తగా విజువల్ మీడియా రంగప్రవేశం చేసింది. ఇటీవలి కాలంలో వందల సంఖ్యలో వెబ్ ఛానల్స్ పురుడు పోసుకున్నాయి. ఫలితంగా ఈ కార్డుల మంజూరు అనేది ప్రభుత్వాలకు కొంత ఇబ్బందిగా మారిన మాట కూడా వాస్తవం. దరిమిలా కొత్త కార్డుల జారీ బదులు వున్న కార్డుల గడువు పెంచుకుంటూ పోయారు.
ఒక ఏడాది, 2017 లో అనుకుంటా, ఈ కార్డు రావడం కొంచెం ఆలస్యం అయింది. అప్పటి సమాచార కమీషనర్ నవీన్ మిట్టల్ కు ఒక ఎస్సెమ్మెస్ పెట్టాను. వారం తిరక్క ముందే కార్డు చేతికి వచ్చింది.
ఈ ఏడాది జర్నలిస్టు సంఘాల ఒత్తిడితో, మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్, యువ ఐ.ఎ.ఎస్. అధికారి జి. ముకుంద రెడ్డి గారు, వారి సిబ్బంది కలిసి ఎట్టకేలకు ఈ క్రతువును జయప్రదంగా పూర్తిచేశారు.
2005 లో రిటైర్ అయిన తర్వాత కూడా వయోధిక పాత్రికేయ సంఘం తరపున అప్పటి కార్యదర్శి కొండా లక్ష్మణ్ రావుగారు, ఇప్పటి కార్యదర్శి ఎన్. శ్రీనివాస రెడ్డి గారు శ్రమ తీసుకుని సంఘం సభ్యులకు కార్డులు అందేలా కృషి చేశారు.
ఈ వయసులో ఏమిటి ఈ కార్డు వల్ల ఉపయోగం అంటారా!
యాభై ఏళ్ళకు పైగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతూ వస్తున్నందుకు ప్రభుత్వం తరపున చిన్న గుర్తింపు. అంతే!




(ఇంకా వుంది)

27, మే 2026, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (316): భండారు శ్రీనివాసరావు

 

నిద్రపట్టడం ఎలా!
ఈ కాలపు పిల్లలు వయసులో చిన్నవారే కావచ్చు కానీ, అనేక పనులు (మల్టీ టాస్కింగ్) ఏకకాలంలో నిభాయించుకుని రావడంలో సిద్ధహస్తులు. ఈ విషయంలో ఆడామగా తేడా లేదని నా ఉద్దేశ్యం.
ఆఫీసు, వర్క్ షాపులు, అయిదు రోజుల అమెరికా మీటింగు కోసం నా చిన్న కోడలు నిషా కటక్ నుంచి నెల క్రితం హైదరాబాదు వచ్చింది. తను ఆఫీసు పనులతో బిజీగా వుంటే, నా మనుమరాలు జీవిక నన్ను ఇబ్బంది పెడుతుందేమో అని, హైదరాబాదు రావడానికి ముందే ఆన్ లైన్ లో, మా ఇంటికి దగ్గరలో వున్న ఓ డే కేర్ సెంటర్ లో అడ్మిషన్ తీసుకుంది. అలాగే ఇరవై నాలుగు గంటలు పిల్లను కనిపెట్టి చూడడానికి కేర్ టేకర్ ని పెట్టుకుంది. ఇవన్నీ నేను చేయలేనని నాకు తెలుసు.
మధ్యలో ఒక మూడు రోజుల వర్క్ షాపు కోసం అమెరికా వెళ్లి వచ్చింది. వచ్చిన మర్నాడే జెట్ లాగ్ లెక్కచేయకుండా సోమవారం నాడు శ్రీశైల మల్లికార్జునుడి దర్శనం చేసుకోవాలనే కోరికతో రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్ళింది. తగిన ఏర్పాటు లేకుండా వెడితే ఇబ్బంది పడతావేమో అంటే, నేను వెడుతోంది దైవ దర్సనానికి కదా! కొంత ఇబ్బంది పడితే నష్టం ఏముంది అని జవాబు. ఆ రాత్రి ఒక చిన్న సత్రంలో బస చేసింది. తెల్లవారి క్యూ లైన్లలో నిలబడి తను కోరుకున్నట్టుగా దైవ దర్శనం చేసుకుంది. ఒక్క రోజు ముందు బిజినెస్ క్లాసులో ప్రయాణం చేసి వచ్చిన అమ్మాయి, ఏసీ కూడా లేని ఒక చిన్న గదిలో నిద్ర చేసింది. రోడ్డు పక్కన హోటల్ లో భోజనం. ఇవన్నీ బూజుపట్టిన భావాలతో సతమవుతున్న నాకు కళ్ళు తెరిపిడ్లు పడే విషయాలే.
పెద్దలు PVRK ప్రసాద్ (IAS) గారు చెబుతుండే వారు. మనం ఎంత గొప్ప ప్రయత్నం చేసినా, ఆ భగవంతుడు ఎవరికి ఎలాంటి దర్శనం ఇవ్వాలో అదే ప్రసాదిస్తాడు అని. తన నాహం కర్త : పుస్తకంలో ఆ మాటే రాశారు. ఎలాంటి ప్రయత్నం లేకుండా వెళ్ళిన మా కోడలికి, మనుమరాలికి ఆ దేవుడు వాళ్లకు తృప్తికరమైన దర్శనమే ఇచ్చాడని అనుకోవాలి.
ఆమె దృష్టి ఒక్కటే. మహాదేవుడి దర్శనం చేసుకోవాలి. హైదరాబాద్ వెళ్ళిపోవాలి.
మూడు గంటలు క్యూలో వున్నా ఆమెలో ప్రశాంతత చెదరలేదు.
నేను ఫోను చేసినప్పుడు మంచి దర్శనం జరిగిందనే తృప్తితో మాట్లాడింది.
నా కోడలు అని కాదు కానీ ఇలాంటి వాళ్లే నిజమైన భక్తులు. నా లాంటి వాళ్ళు కాదు.
హైదరాబాదు వచ్చి ఇరవై నాలుగు గంటలు కాలేదు, మళ్ళీ తెల్లారి భువనేశ్వర్ తిరుగు ప్రయాణం.
ఇన్ని రోజులుగా మనుమరాలితో సందడిగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా బోసిపోయింది. ఏమిటో జీవితం. నా పిల్లలు చిన్నగా వున్నప్పుడు వారితో గడిపే తీరికలేదు. ఇప్పుడు తీరిక వున్నా పిల్లలు దగ్గర వుండరు. మధ్యాన్నం నుంచీ జీవిక ధ్యాసే.
మొబైల్ ఫోన్ పట్టుకోగానే ‘తాతా నాకది ఇవ్వు, యు ట్యూబ్ లో శివ చూడాలి’ అంటూ వచ్చేది. ‘వద్దమ్మా పిల్లలు మొబైల్ చూడకూడదు, టీవీలో చూడు అంటే, బుంగమూతి పెట్టుకుని ఓ పక్కకు పోయి కూర్చునేది.
టీవీలో IPL మ్యాచ్ కోసం టీవీ ఆన్ చేయగానే, పరిగెత్తు కొంటూ వచ్చి, ‘క్రికెట్ వద్దు, నాకు 529 ఛానల్ కావాలి, శివ చూడాలి’ అంటూ మారాము చేసేది.
భోజనం చేసి ట్యాబ్ లెట్లు వేసుకోవడానికి సిద్ధం కాగానే, ‘ఆగు తాతా నేను ఇస్తాను నీకు దవాయ్’ అంటూ వచ్చేది.
అన్నం తినడానికి కూర్చోగానే, ‘తాతా నాకు కూడా అన్నం పెట్టు’ అనేది. ‘వద్దమ్మా ఇది కారం. నువ్వు తినలేవు’ అంటే ‘కాదు తాతా నాకు కారం ఇష్టం, పెట్టి చూడు ఎలా తింటానో’ అనేది.
‘ఈ రాత్రి నీ దగ్గరే పడుకుంటాను తాతా’ అంటూ పిల్లిలా వచ్చి, ‘తలుపు వేశాను, అమ్మ చూడదులే , ఇప్పుడు టీవీ పెట్టు’ అనేది.
ఉదయం పూట ‘స్కూలు టైం అయింది’ అన్నా నిద్ర లేవని జీవిక, ‘అమ్మా నువ్వు లేచి స్నానం చేసి తయారు అయితే, రెండు GEMS PACKTS ఇస్తాను’ అనగానే తటాలున లేచి కూర్చునేది.
పగలు, ఇప్పడు ఇవే ఆలోచనలు.
తోకటపా :
అతనో రాజు. పేరుకు కాదు, నిజంగానే ఓ రాజ్యానికి రాజు.
ఉదయం లేచిన దగ్గరనుంచి చుట్టూ కనిపెట్టుకుని వుండే పరిచారికలు, క్రీగంట కనిపెట్టి అప్పటికప్పుడు సకల పరిచర్యలు చేసే పరివారం. కొలువు తీరిస్తే చాలు రాజాధిరాజా అంటూ ఆస్థాన కవిగాయక బృందాల బృందగానాలు. కొలువు ముగించి అంతఃపురంలో అడుగు పెట్టగానే ఇష్ట సఖుల సరస సల్లాపాలు. వారితో కూడి విందులు వినోదాలు. రాత్రి పడక గది చేరి పట్టపు రాణి వారితో ప్రియ సంభాషణలు.
సమయం గడుస్తున్న కొద్దీ ఉత్సాహభరిత, ఉల్లాసపూరిత వాతావరణంలో నిశ్శబ్దపు నీడలు. తెలియకుండానే ఒంటరితనం వొళ్ళు విరుచుకుంటుంది. పరివారాలు తప్పుకుంటాయి. పరిచారికలు సెలవు తీసుకుంటారు. రాణివాసంలో నిశ్శబ్దం తాండవిస్తుంది.
రాజుకు నిద్ర పట్టదు. శత్రు భయం కాదు. ఒంటరితనం అనే భయం. పొరుగురాజులు ఒక్కుమ్మడిగా చుట్టుముట్టినా వెరవని అరివీర భయంకరుడే. కానీ ఆ నిశ్శబ్ద నిశీధిలో చుట్టుముట్టిన ఒంటరితనాన్ని ఎదుర్కోవడమే పెద్ద సమస్య.
రాజ్యం తనది. ప్రజలు తన వాళ్ళు. సకల భోగభాగ్యాలు తనవే. కానీ సమస్త ప్రపంచం ఓ పక్క గాఢ నిద్రలో వుంది. తన కంటికే కునుకు లేదు. తలచుకుంటే అప్పటికప్పుడు కవిగాయక శ్రేష్టులను పిలిపించి ఆ రాత్రి పొద్దు పుచ్చడం అనేది తనకో లెక్క కాదు. కానీ రాజుకు నిద్ర పట్టడం లేదు అనే కఠోర వాస్తవం నలుగురుకీ తెలిస్తే ఇంకేమైనా ఉందా!
ప్రపంచంలో ఉన్న ప్రతి సుఖమూ తనకు అందుబాటులో వుంది. మృష్టాన్న భోజనాలు, సురలు మాత్రమె సేవించగల మధుపానీయాలు, సుఖంగా శయనించడానికి వీలైన హంస తూలికా తల్పాలు వున్నాయి. కానీ నిద్ర పట్టడం ఎలా! అది తన చేతిలో లేదే! వజ్రవైడూర్యాలు, మరకత మణిమాణిక్యాలు సకల సంపదలతో పొంగిపొరలుతున్న తన ఖజానాలో కూడా అది లేదు, ‘ఎవర్రా అక్కడ! పోయి నిద్రాదేవిని పట్టుకు రండి’ అని ఆజ్ఞాపించడానికి.
సమస్య అంటూ ఎరుగని ఆ రాజుకు జీవితంలో ఎదురయిన సమస్య నిద్ర పట్టకపోవడం. అది ఎంత పెద్ద సమస్యో ఆ నిద్రపట్టని రాత్రి రాజుకు తెలిసివచ్చింది.



(ఇంకావుంది)

అయాం ఎ బిగ్ జీరో (315): భండారు శ్రీనివాసరావు


మీడియాతో జాగ్రత్త!
తెలుగుదేశం పార్టీ వార్షిక సదస్సుకు ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్టీఆర్, మహానాడు అని తొలుత నామకరణం చేసినప్పుడు అందరు ఇదెక్కడి పేరు అని ఆశ్చర్యపోయారు. కానీ తదాదిగా మహానాడు అనేది తెలుగునాట బాగా ప్రాచుర్యం పొందింది.
మాస్కోలో వున్న అయిదేళ్లు మినహాయిస్తే, ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యేంతవరకు తెలుగుదేశం పార్టీ నిర్వహించిన అన్ని మహానాడు కార్యక్రమాలకు నేను రేడియో విలేకరిగా హాజరయ్యాను. టీడీపీ మాజీ ఎంపీ శ్రీ కె. రామ్మోహన్ రావు, పార్టీ పీఆర్వో శ్రీ LVSRK ప్రసాద్ (వీరి ఇంటి పేరు చాలా పొడుగు, అందుకని ఆయనతో సన్నిహితంగా వుండే విలేకరులం ఏబీసీడీ ప్రసాద్ అనే వాళ్ళం. హైదరాబాదు విలేకరుల యోగక్షేమాలు అన్నీ వీరిద్దరూ అతి జాగ్రత్తగా చూసుకునేవారు.
చంద్రబాబునాయుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఓసారి తెలుగుదేశం మహానాడు కాకినాడలో జరిగింది. హైదరాబాదు నుంచి విలేకరులను తీసుకువెళ్ళారు. ప్రారంభానికి ముందు రోజే అక్కడికి చేరుకున్నాం.
అప్పటికి ప్రైవేటు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు ప్రయోగాత్మక దశలో వున్నాయి. టీవీ 9 వారికి ఓ ఆలోచన కలిగింది. ప్రారంభోత్సవానికి ముందు ఎవరయినా జర్నలిస్టుతో మాట్లాడించాలని అనుకున్నారు.
‘పొద్దున్నే(మహానాడు జరిగే ప్రదేశం దగ్గరికి) పోదాం రెడీగా ఉండమ’ని చెప్పారు. బ్రేక్ ఫాస్ట్ చేయకుండానే వెళ్లాం. మహానాడు వెన్యూ దగ్గర తిరుగుతూ నేనూ రజనీకాంత్ మాట్లాడుకుంటున్నాం. ఆయన ఏవో అడుగుతున్నారు. నేను ఏదో చెబుతున్నాను.
‘ప్రతి రాజకీయ పార్టీ తమ కేడర్ ను ఉత్సాహ పరచడం కోసం ఇలాంటి తంతులు నిర్వహిస్తుంటారు. ఎక్కడో పల్లెటూరిలో వుండే పార్టీ కార్యకర్తలకు ఇదో పండగ. పార్టీ నాయకత్వం గుర్తింపు తమకు లభించిందని తమ తోటివారితో చెప్పుకుని గర్వపడతారు.
ఇక ఇలాంటి సభల్లో ఏవో మొక్కుబడి తీర్మానాలు ప్రవేశపెడతారు. ఏదో చర్చ జరిగిందని అనిపిస్తారు. తర్వాత ఆ తీర్మానాలు ఏమయ్యాయో ఎవరూ పట్టించుకోరు. కాకపోతే, హైదరాబాదులో వుండే నాయకులకి గ్రౌండ్ లెవెల్ రియాలిటీలు తెలుసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. ఇలాంటి సందర్భాలలో గ్రామ స్థాయి కార్యకర్తల్ని పిలిచి మాట్లాడితే, హైదరాబాదులో కూర్చుని, పార్టీ స్తితిగతుల గురించి వేగుల ద్వారా తెలుసుకోలేని విషయాలు వాళ్లకు బోధపడతాయి. కానీ అంత తీరిక వాళ్ళకి వుండదు. అందుకే ఇదంతా ఒక తంతు అనేది. టీడీపీ అనే కాదు కాంగ్రెస్ ఏ పార్టీ వార్షిక సమావేశాలు ఏ పేరుతో జరిగినా ఇదే తంతు”
ఏదో ఇలా చెప్పుకుపోతున్నాను. కాసేపు అలా తిరిగి మళ్ళీ హోటల్ కు వచ్చాము.
బ్రేక్ ఫాస్ట్ టేబుల్ దగ్గర మంత్రి యనమల రామకృష్ణుడు కనిపించారు. ఆయన మొహంలో ఎప్పుడూ కనిపించే ప్రసన్నత కానరాలేదు. ప్లేటు చేతికి ఇస్తూ అన్నారు నా మొహం లోకి చూస్తూ.
“అంతే లెండి! ఇంతింత శ్రమ పడి చేసినదంతా మీకు ఓ తంతులాగా కనిపిస్తోంది అన్నమాట”
ముందు నాకు అర్ధం కాలేదు ఆయన అలా ఎందుకు అంటున్నారో.
తర్వాత తెలిసింది, అంతకు ముందు నేను మాట్లాడినదంతా ఆ టీవీలో లైవ్ లో చూపించారట! చూడనిది నేనొక్కడినే.
(ఇంకావుంది)