19, ఫిబ్రవరి 2026, గురువారం

అయాం ఎ బిగ్ జీరో ( 268 ) : భండారు శ్రీనివాసరావు

 

ముసలితనంలో వసంతాలు
ఫోటో: 500 KB JPG
సంతకం : 500 KB JPG
ఆధార్: I MB PDF
ఏవిటో అంతా అయోమయం, ఒక్క ముక్కా అర్ధం కాదు.
యాభయ్ అయిదేళ్ళ క్రితం ఒక ఆగస్టు నెలలో నేను బెజవాడ బందరు రోడ్డు పి.డబ్ల్యు.డి. గ్రౌండ్ స్టాపులో పోరంకి వెళ్ళే ఒకటో నెంబరు సిటీ బస్సు ఎక్కి పశువుల ఆసుపత్రి వద్ద దిగి అక్కడికి దగ్గరలో వున్న ఆంధ్రజ్యోతి ఆఫీసుకు వెళ్లి గ్రౌండ్ ఫ్లోర్ లో ఎడిటర్ నార్ల వెంకటేశ్వర రావు గారి ఛాంబర్ లోకి వెళ్లి కలిసి నమస్కారం పెట్టాను. పెట్టి నేను పలానా అని చెప్పాను. వారు నా వైపు తేరిపార చూస్తూ, ‘మీ అన్నయ్య ఒకటే చంపేస్తున్నాడయ్యా!పో పైకి వెళ్ళు. అక్కడ ఉపేంద్రబాబును కలువు. కలిసి నేను పంపాను అని చెప్పు’ అన్నారు. అలా నా తొలి ఉద్యోగం ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్ గా చేరిపోయాను.
నార్ల గారి నోటి మాటే నా నియామక పత్రం.
అయిదేళ్ళ జ్యోతి కొలువు తర్వాత, 1975 లో హైదరాబాదు ఆలిండియా రేడియో, ప్రాంతీయ వార్తావిభాగంలో అసిస్టెంట్ ఎడిటర్ (రిపోర్టింగ్) అనే డిజిగ్నేషన్ తో మరో ఉద్యోగంలో చేరాను. నిజానికి అది రిపోర్టర్ ఉద్యోగం. స్టేషన్ డైరెక్టర్ పేషీలో రిపోర్ట్ చేసి న్యూస్ యూనిట్ కి వెళ్లాను.
ఆ రోజు బాగా జ్ఞాపకం వుంది. వెళ్లేసరికి రంగనాధరావుగారు ఏదో పని చేసుకుంటూ కనిపించారు.
పరిచయాలు అయిన తర్వాత ఏం పని మీద వచ్చావన్నట్టు నా వైపు చూసారు. నా మొహంలో రంగులు మారడం చూసి, “ఇక్కడ మీకు పనేమిటి? మీరు రిపోర్టర్. బయట తిరిగితే కదా నాలుగు వార్తలు తెలిసేది? రోజూ సెక్రెటేరియట్ కు వెళ్ళండి. మంత్రులు చెప్పేది వినండి. నాలుగు ముక్కలు ముక్కున పెట్టుకు వచ్చి, తెచ్చి నా మొహాన కొట్టండి. అంతే! సింపుల్” అని తేల్చేసారు. అలా అంటూనే, “ఇంతకీ ఆఫీసుకు ఎలా వచ్చారు?” అని మరో అర్ధం కాని ప్రశ్న సంధించారు.
“ఆటోలో వచ్చుంటారు. అవునా! అలా అయితే మీ జీతం డబ్బులన్నీ ఈ రిపోర్టర్ తిరుగుళ్ల కోసం ఆటోలకే తగలెయ్యాల్సి వుంటుంది. వార్తల సంగతి తరవాత. ముందు నేనో ఉత్తరం ఇస్తాను. దాన్ని తీసుకువెళ్ళి సమాచార శాఖలో ఇవ్వండి. అక్కడ అక్రిడిటేషన్ కార్డు తీసుకుని ఆర్టీసీ ఆఫీసుకు వెళ్ళండి. వాళ్ళు ఇచ్చే బస్ పాసు తీసుకున్న తరవాతే, మిగిలిన ఏ పనులయినా! తెలిసిందా!” అన్నారు.
ఆ విధంగా ఉద్యోగంలో చేరిన రెండో రోజే నాకు రేడియో విలేకరిగా రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు కార్డు, దాన్నే అక్రిడిటేషన్ కార్డు అంటారు, పెద్ద శ్రమ లేకుండానే చేతికి వచ్చింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు యాభయ్ ఏళ్ళ పాటు నిరాఘాటంగా ప్రతియేటా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ కార్డు నాకు అందుతూనే వుంది. కాకపోతే ఉద్యోగం చేసే రోజుల్లో రేడియో ప్రతినిధి అని, రిటైర్ అయిన తర్వాత ఇండిపెండెంట్ జర్నలిస్టు అని కార్డులో చిన్న మార్పు చేశారు.
ఈ కార్డు ద్వారా ప్రయోజనాలు కొన్ని వున్నాయి. రాష్ట్రంలో ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో మూడో వంతు చార్జీ చెల్లించి ప్రయాణాలు చేయవచ్చు. ఈ కార్డు చూపించి రైల్వే నుంచి పొందే మరో కార్డు ద్వారా రైళ్ళలో సగం చార్జి చెల్లిస్తే సరిపోతుంది. అసలు ముఖ్యమైన వృత్తిపరమైన ప్రయోజనం సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలలోకి ప్రవేశం.
ఉద్యగంలో సర్వీసు పెరుగుతున్న కొద్దీ బస్సు రాయితీని చాలామంది జర్నలిస్టులు వాడుకోవడం మానేశారు. రైల్వే వాళ్ళు తమంతట తామే రాయితీ ఇవ్వడం మానేశారు. సంఖ్య పెరగడం వల్లనో ఏమో సచివాలయం వంటి చోట్ల కొన్ని ఆంక్షలు పెట్టారు.
2005లో రిటైర్ కావడానికి ముందు నుంచే నేను ఆర్టీసీ, రైల్వే రాయితీలు తీసుకోవడం మానేశాను.
యాభయ్ ఏళ్ళ క్రితం ఉన్న కొన్ని వెసులుబాట్లు ఇప్పుడు బొత్తిగా లేవనే చెప్పాలి. మరి ఎందుకు ఈ కార్డు? కేవలం గుర్తింపు. అంతే! సీనియర్ జర్నలిస్టులకు ప్రభుత్వం ఇవ్వగల ఏకైక గౌరవం ఇదొక్కటే.
వెనుకటి రోజుల్లో జిల్లాకు ఒకే ఒక్క ఐ ఏ ఎస్ అధికారి వుండేవారు. మరిప్పుడో. పెరుగుతున్న అవసరాలను బట్టి ఉద్యోగుల సంఖ్య పెరగడం అనివార్యం.
నేను ఆంధ్రజ్యోతిలో చేరిన కాలంలో ఒకే ఒక విలేకరి, అదీ పార్ట్ టైం విలేకరే, బెజవాడకు సంబంధించి అన్నీ చూసుకునే వారు.
ముఖ్యమైన నగరాల్లో సొంతంగా స్టాఫర్లను నియమించుకునే పద్దతులు చాలాకాలం తర్వాత అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు పేట పేటకు, వాడవాడకు విలేకర్లు.
యాభయ్ ఏళ్ళ క్రితం విలేకరుల సంఖ్య కూడా తక్కువే. ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే పది కుర్చీల్లో రెండు ఖాళీ వుండేవి. ఇప్పుడో. స్టేడియంలో పెట్టినా జాగా సరిపోయేలా లేదు అని హాస్యోక్తిగా అనుకునే పరిస్థితి.
ఎలక్ట్రానికి మీడియా ఆవిర్భావం తర్వాత ఈ సమస్య బాగా పెరిగింది. పూర్వం విలేకరి, కెమెరామాన్, కెమెరా మోసే మనిషి, లైట్ బాయ్ ఇలా ఒక్కో సంస్థ నుంచి ఎందరో. న్యూస్ కవరేజ్ కి ఇంతమందీ అవసరమే ఆ రోజుల్లో.
సాంకేతికత పెరిగింది. కెమెరా సైజులు తగ్గాయి. ఓబీ వ్యాన్లు వచ్చాయి. ప్రత్యక్ష ప్రసారాలు పెరిగాయి. ఎక్కడి నుంచయినా అప్పటికప్పుడు వార్తలు, వీడియోలు పంపే సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. సోషల్ మీడియా ఆగమనంతో అసలు మీడియా స్వరూపమే పూర్తిగా మారిపోయింది.
ప్రతి వ్యక్తికి కొన్ని నిర్దిష్ట అభిప్రాయాలు వుంటాయి. వ్యక్తి స్వాతంత్రం రాజ్యాంగం పౌరులకు ప్రసాదించింది. తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకోవడానికి పూర్వకాలంలో లేని అవకాశం, స్వేచ్ఛ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా లభించాయి.
ఈ మార్పు ఇప్పుడు అందరి అనుభవంలోకి వస్తోంది. చేతిలో మొబైల్ వుంటే ఒక పత్రిక చేతిలో ఉన్నట్టే. దానితో రాజకీయ పార్టీలకు ఇదొక అవకాశంగా కనబడింది. ఫలితం ప్రతి పార్టీకి సొంతంగా మీడియా విభాగాలు. తప్పేమీ లేదు. సాధారణ మీడియా కూడా ఇటువంటి వాటికి అతీతంగా ఏమీ లేదు.
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల మీద పరిపాలనా వ్యవస్థలకు కొన్ని కంటికి కనపడని అదుపాజ్ఞలు వుంటాయి. ఈ సోషల్ మీడియాకు అలాంటివి లేవు.
‘నేనే రాజు, నేనే మంత్రి’ తరహా జర్నలిజం. కానీ చిన్నచూపు చూడడం, నిర్లక్ష్యం చేయడం కానీ కుదరని పని. భవిష్యత్తు ఈ మీడియాదే అని స్పష్టంగా కనబడుతుంటే కాదనడం సాధ్యమా! మార్పుని అంగీకరించక తప్పదు.
స్వేచ్ఛకు సంకెళ్ళు వేయడం ఎంత గర్హనీయమో, మితిమించిన స్వేచ్ఛ కూడా అంతే ప్రమాదకరం.
ప్రభుత్వాలు పరిమితి విధించే పరిస్థితులు లేనప్పుడు మీడియానే లక్ష్మణ రేఖలు గీసుకోవాలి. సరే ఇదొక అనంతమైన విషయం ఇంతటితో వదిలేద్దాం.
తామరతంపరగా వస్తున్న ఈ కొత్త మీడియాకి కళ్ళెం వేయడం కుదరని పని. అంచేత గుర్తింపు కార్డులు ఇవ్వడం ప్రభుత్వాలకు అలవికాని పనిగా మారింది. ఫలితంగా కమిటీలు, సబ్ కమిటీలు. రిపోర్టులు. వీటి ఫలితం అక్రిడిటేషన్ల ప్రక్రియకు ఆన్ లైన్ పద్దతి అందుబాటులోకి తెచ్చారు. మంచిదే.
బస్సు, రైళ్లు, విమానాల టిక్కెట్లు, తిరుపతి దర్శనాలు, పాస్ పోర్ట్లు, వీసాలు అన్నింటికీ ఆన్ లైన్ ధరకాస్తులు. అలాగే అక్రిడిటేషన్లకు. అయితే ఇబ్బంది అల్లా ఈ ధరకాస్తుల అప్ లోడ్ అనేది యూజర్ ఫ్రెండ్లీగా వుండాలి.
ఉదాహరణకు:
ముందే చెప్పినట్టు, ఫోటో: 500 KB JPG
సంతకం : 500 KB JPG
ఆధార్: I MB PDF
ఏవిటో అంతా అయోమయం, ఒక్క ముక్కా అర్ధం కాదు. రాయడం, పోస్టు చేయడం తప్పిస్తే నా బోంట్లకు ఇలాంటి కంప్యూటర్ పరిజ్ఞానం సున్నా.
గంటలు గంటలు కంప్యూటర్ ముందు కూర్చొన్నా ఫలితం వుండడం లేదని కొందరు వయోధిక జర్నలిస్టుల ఆవేదన.
(కింది ఫోటోలు: 1975 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం నాకు మంజూరు చేసిన అక్రిడిటేషన్ కార్డులలో పోయినవి పోగా మిగిలినవి కొన్ని)



(ఇంకా వుంది )

18, ఫిబ్రవరి 2026, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (267) : భండారు శ్రీనివాసరావు


మాధవుడు ఏక పదమా! సమాసమా!!
“దేవుడు మనిషికి రెండు చెవులు ఇచ్చింది ఎక్కువ వినడానికి, ఒక్క నోరే ఇచ్చింది తక్కువ మాట్లాడడానికి” అని వాక్రుచ్చాడు ఓ మితభాషి.
నిజమే! వినడం వల్ల ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఆ చెప్పేవాడు ఓ విజ్ఞాన ఖని అయితే మన పంట పండినట్టే.
కొన్నేళ్ళు, అంటే నాలుగేళ్ల క్రితం 2022 లో ఒకరోజు ఉదయం నాకు వచ్చిన అనేకానేక ఫోన్లలో కోమండూరి (ఇంటిపేరు విని రాసింది కనుక తప్పయితే క్షంతవ్యుడను) శేషాచారి గారిది ఒకటి.
మాటల నడుమ తెలిసింది వారి వయసు తొంభయ్ అని. కొద్దిగా వణుకు వున్నా, మాట స్పుటంగా వుంది. ఉస్మానియాలో తెలుగు లెక్చరర్ గా పనిచేసి రిటైర్ అయ్యారుట. చైతన్యపురిలో నివాసం.
ఆ రోజు నమస్తే తెలంగాణా పత్రికలో వచ్చిన నా వ్యాసం గురించి ప్రస్తావించారు. నా పట్ల వారి ప్రశంసలు ఇక్కడ అప్రస్తుతం.
ప్రతిరోజూ అనేక పత్రికలు చదివే అలవాటు వారికి వుందట. అలా నా వ్యాసం కూడా చదివారు. అందులో నెంబరు వుండడం చేత ఫోన్ చేశారు.
మాటల మధ్యలో శేషాచార్యుల వారు అనేక అంశాలు ప్రస్తావించారు. తొమ్మిది పదుల వయసులో ఆయన ధారణ శక్తి అద్భుతం అనిపించింది. వారు చెప్పిందే శీర్షికలో పేర్కొన్న ‘మాధవుడు ఏక పదమా! సమాసమా!’
మాధవుడు అంటే శ్రీమన్నారాయణుడు. వినగానే ఏక పదం అనిపిస్తుంది. ఉత్పత్తి అర్ధం తీసుకుంటే మా అంటే అమ్మ. అమ్మ అంటే అమ్మవారు, జగజ్జనని. అంటే శ్రీ మహావిష్ణువు సతీమణి. ధవుడు అంటే భర్త. అమ్మవారి భర్త శ్రీమన్నారాయణుడు అంటారు శేషాచార్యుల వారు.
మధ్యలో ఏదో అనుమానం కలిగి అడిగారు, ‘మీరు ఫ్రీగా వున్నారా!’ అని.
‘పరవాలేదు, నేను 24 X 7 ఫ్రీ మనిషిని. పైగా మీ మాటలు వింటుంటే రాసుకోవడానికి నాకు ముడి సరుకు దొరుకుతుంది. కాబట్టి ఇందులో నా స్వార్ధం కూడా వుంది, చెప్పండి’ అన్నాను వారితో.
‘ఒకసారి అంటే ఇప్పుడు కాదులెండి చాలా దశాబ్దాలు గడిచిపోయాయి. సారస్వత పరిషత్ లో జరిగిన ఓ సభకు ప్రముఖ కవి జాషువా గారు, కవిసామ్రాట్ విశ్వనాధ గారు వచ్చారు. నేనూ వెళ్లాను.
‘జాషువా గారు సాత్వికులు. విశ్వనాధ వారి సంగతి లోక విదితం. ప్రధమ కోపం అంటారు.
‘జాషువాగారు నాలుగు పద్యాలు చదివారు. తర్వాత ఆయన ఇలా అన్నారు.
‘నా పద్యాలకు అర్ధం అడక్కండి, కానీ రాయడానికి కారణాలు అడగండి చెబుతాను’ అంటూ జాషువాగారు తన గబ్బిలం పుస్తకం గురించి చెబుతుంటే సభలో అందరూ ఆయన కవితాభినివేశానికి మ్రాన్పడి పోయారు. అంతసేపూ వేదిక మీద ఉన్న విశ్వనాధవారు తనకు వేసిన గులాబీ పూలదండను చేతితో నలుపుతున్నట్టు అనిపించి కొంత భయపడ్డారు కూడా.
ఇంతలో జాషువాగారి ప్రసంగం ముగిసింది. సభికుల హర్షధ్వానాల నడుమ విశ్వనాధ లేచి నిలబడ్డారు. అప్పటివరకు పూలదండ నుంచి తెంచిన గులాబీ రేకులను దోసిట్లోకి తీసుకుని జాషువా శిరస్సుపై అభిషేకిస్తున్నట్టు వెదజల్లారు.
రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ జాషువాను ‘పుంభావ సరస్వతి’ అని కీర్తించారు.
శేషాచార్యుల వారు ఈ వృత్తాంతం చెబుతూ కొద్ది సేపు మౌనంగా వుండి గతకాలపు జ్ఞాపకాలను తలచుకున్నారు.
తర్వాత నేనే చొరవ తీసుకుని వారి వివరాలు అడిగి తీసుకున్నాను. లోగడ అంటే నేను రేడియోలో చేరక పూర్వమే శేషాచార్యులవారు ఆకాశవాణిలో సంస్కృత కార్యక్రమాల్లో పాల్గొన్నారట. అధర్వణ వేదాన్ని విశదీకరిస్తూ అనేక ప్రసంగాలు చేశారట.
ఇటువంటి విలువకట్టలేని నిక్షేపాలు ఆకాశవాణి వద్ద అనేకం ఉండేవి. ఉండేవి అని ఎందుకు అంటున్నాను అంటే తదనంతర కాలంలో వాటి విలువ తెలియని వాళ్ళు వాటిని పదిలంగా భద్రపరచి వుంటారనే నమ్మకం లేదు కనుక.
పాదాభివందనాలు 'శేషాచార్యుల వారూ. పరగడుపునే పరమాన్నం తినిపించారు'
అనుకున్నాను ఆ ఉదయం.
కొన్ని రోజులు భారంగా గడిచినా మరి కొన్ని రోజులు మనసుకు ఉల్లాసంగా గడుస్తాయి.
జీవితం అంటే అదే.
(ఇంకా వుంది)

అయాం ఎ బిగ్ జీరో ( 266 ): భండారు శ్రీనివాసరావు

 

చెదరని జ్ఞాపకం
ఇలా కూడా జరుగుతుందా అనిపించే సందర్భాలు జర్నలిస్ట్ జీవితంలో ఎదురవుతుంటాయి.
నాలుగేళ్ల క్రితం 2022 లో సరిగ్గా ఇదే రోజు.
ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఫోన్ మోగింది.
“భండారు శ్రీనివాసరావు గారా! సీఎం ఆఫీసు నుంచి. సీఎమ్ గారు మాట్లాడుతారు, లైన్లో వుండండి” అంది ఓ గొంతు.
ఓ పాతికేళ్ళ క్రితం అయితే ఇలాంటి ఫోన్లు ఆశ్చర్యం కలిగించేవి కావు. రిటైర్ అయి పదిహేడేళ్లు దాటింది కదా! అందుకే ఆశ్చర్యం.
“శ్రీనివాసరావు గారు, బాగున్నారా! ఎక్కడ వుంటున్నారు, ఒకసారి మాట్లాడుకుందాం, కారు పంపిస్తాను, ఇంటికి రండి” అంటున్నారు అవతల కేసీఆర్ గారు. అయోమయంలోనే విన్నాను.
కొద్దిసేపటికే పియ్యే ఫోన్ చేసి లొకేషన్ తీసుకున్నాడు. మరి కొద్ది సేపటికే అనిల్ అనే డ్రైవర్ ఫోన్ చేసి మీ (మా) ఇంటి దగ్గరే వున్నాను’ అన్నాడు.
రోజూ మూడున్నరకు నా మధ్యాన్న భోజనం. రెండున్నర దాటితే కానీ స్నానం సంధ్యా ప్రసక్తి వుండదు.
డ్రైవర్ ని ఉండమని చెప్పి, అప్పటికప్పుడు తయారై, గుప్పెడు మెతుకులు నోట్లో వేసుకుని కారెక్కాను. సరాసరి సీఎం ఇంటికే తీసుకు వెళ్ళాడు.
లిఫ్టులోపైకి వెళ్లేసరికి, 'రండి రండి భోజనం చేద్దాం' అని ఆహ్వానించారు కేసీఆర్.
చేసేవచ్చానని చెబితే, 'ఇలా మాతో వచ్చి కూర్చోండి' అన్నారు. భోజనం టేబుల్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ వున్న ఆరుగురిలో ఇద్దరే తెలుసు, ఒకరు సంతోష్, ఎంపీ. మరొకరు భాను ప్రసాద్ ఎం.ఎల్.సీ.
భోజనాల కార్యక్రమం పూర్తి కాగానే కిందికి వెళ్లాం. వరసగా వాహనాలు. నన్ను కాన్వాయ్ లో మూడో వాహనంలో కూచోబెట్టారు. కారు తలుపు ఎంత గట్టిగా వుందంటే చేత్తో తీయడం సాధ్యం కాలేదు. అది బులెట్ ప్రూఫ్ అని చెప్పి డ్రైవర్ డోర్ తీశాడు.
కాన్వాయ్ కదిలింది. నేరుగా బేగం పేట ఎయిర్ పోర్ట్ చేరింది. ఒక హెలికాప్టర్ దగ్గర ఆగింది. నేను దిగి ఒక పక్కన నిలబడ్డాను. ఇక్కడ నుంచి ఇంటికి చేరడం ఎల్లా అనేది నా ఆందోళన.
ఈలోగా ఎవరితోనో ముచ్చటిస్తున్న సీఎమ్ నా వైపు చూసి 'ఎక్కండి' అన్నారు. నాకు కలయో వైష్ణవ మాయయో అన్నట్టు వుంది. ఉద్యోగంలో వున్నప్పుడు ఇలాంటి ప్రయాణాలు అలవాటే. రిటైర్ అయి పదిహేడేళ్లు. అందుకే నిబిడాశ్చర్యం.
హెలికాఫ్టర్ లో పక్కన కూర్చోబెట్టుకున్నారు.
అరగంటలో నారాయణ్ ఖేడ్ చేరాము. స్టేజి మీద తన వెనకనే కూర్చోబెట్టుకున్నారు.
బహిరంగ సభలో ప్రసంగిస్తూ, 'నాతోపాటు భండారు శ్రీనివాసరావు కూడా వచ్చారు' అని ఆయన మైకులో చెబుతుంటే మతి పోయింది.
సభ ముగిసింది.
తిరిగి అరగంటలో బేగంపేట ఎయిర్పోర్ట్. అక్కడ నుంచి సీఎం రెసిడెన్స్.
పైకి వెళ్ళాము. వేడి వేడి ఉప్మా కాఫీ ఇచ్చారు. ఓ గంటన్నర ఏవేవో ముచ్చ్చట్లు. నన్ను ఎందుకు రమ్మన్నారో అంతు చిక్కలేదు.
ఏడున్నర కాగానే నేను లేచి నిలబడి ధన్యవాదాలు చెప్పాను.
'ఆయన్ని ఇంటి దగ్గర జాగ్రత్తగా దింపి రండి' అన్నారు అక్కడ ఎవరితోనో.
ఏడున్నర ప్రాంతంలో ఇంటికి చేరాను.
అప్పటివరకు సెక్యూరిటీ జామర్ల వల్ల మూగనోము పట్టిన నా ఫోను మళ్ళీ ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ తో పిలుపులు మొదలు పెట్టింది.
కలా నిజమా అనుకుందాం అంటే ‘నారాయణ్ ఖేడ్ మీటింగులో సీఎంతో పాటు నువ్వు కూడా కనిపించావు టీవీల్లో’ అని మిత్రుల ఫోన్స్.
అయితే నిజమే అన్నమాట.
ఇంతకూ ఎందుకు పిలిచినట్టు? నేను ఎందుకు వెళ్లినట్టు? ఈ భేతాళ ప్రశ్నలకు సమాధానం లేదు.
జరిగి నాలుగేళ్లు అవుతున్నా జవాబు దొరకని ప్రశ్నలుగానే మిగిలి పోయాయి.
కేసీఆర్ గారి అభిమానం ఆ స్థాయిలో ఉంటుందని సమాధానపడడం ఒక్కటే మిగిలింది.
(ఈరోజు ఫిబ్రవరి 17, కేసీఆర్ గారి పుట్టినరోజు )
కింది ఫోటో : నారాయణ్ ఖేడ్ సభలో కేసీఆర్ వెనుక నేను, టీవీ క్లిప్పింగ్ )





16, ఫిబ్రవరి 2026, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (265) : భండారు శ్రీనివాసరావు


వామ్మో! సూర్యనారాయణా!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో ఎన్జీవోల సమ్మె ఉధృతంగా జరుగుతున్న రోజులు.
ఖమ్మంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సివిల్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టరు గారికి చాలా దూరంలోని వేరే జిల్లాకు బదిలీ అయింది. బదిలీ ఆపుకోవడానికి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉండగానే ఈ సమ్మె వచ్చి పడింది.
ఖమ్మంలో ఉంటున్న మా బావగారు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఆ డాక్టరు గారు బాగా కావాల్సినవాడు, ఎవరయినా తెలిసిన వాళ్ళు వుంటే సాయం చేయమని.
వైద్యశాఖ మంత్రి గారు బాగా పరిచయం వున్న మనిషే. వెళ్లి కలిస్తే, ‘ముందు సమ్మె అయిపోనీ, చూద్దాం’ అన్నారు. కాస్త ఆగి మళ్ళీ ఆయనే అన్నారు, ‘నేను చెబుతాను కానీ ఆ సూర్యనారాయణ వున్నాడే, ఓ మొండి ఘటం, ఓ పట్టాన ఎవడి మాటా వినడు’.
ఆ సూర్యనారాయణ గారు సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి. ఆ రోజుల్లో వైద్య శాఖ కార్యదర్శిగా వున్నారు. ఆయనని వేరే శాఖ నుంచి బదిలీ చేసి ఎక్కువ కాలం కూడా కాలేదు. ఎవరి మాట లెక్కపెట్టని అధికారి అని పేరు. ముక్కుసూటి మనిషి. తోటి ఐ.ఏ.ఎస్. అధికారులు కూడా ఆయనకు ఒక మాట చెప్పడానికి సంకోచించేవారు. ఇక మామూలు అధికారులు, అనధికారులు అయితే ‘వామ్మో! సూర్యనారాయణ గారా! ఆయన ఎవరి మాటా వినే రకం కాదు’ అని ముందే తప్పుకునేవారు.
ఇక ఏమైతే అదే అయిందని నేనే సచివాలయానికి వెళ్లాను ఆయన్ని కలుద్దామని. సచివాలయం మొత్తం బోసి పోయి వుంది. ఎక్కడా చడీ చప్పుడు లేదు.
ఉన్నతాధికారులు మాత్రం ఆఫీసులకు వస్తున్నారు. సూర్యనారాయణ గారి ఛాంబర్స్ కు వెళ్లాను.
చీటీలు ఇచ్చే అటెండర్లు లేరు. లోపల అధికారి వున్నారో లేరో చెప్పే పియ్యేలూ లేరు. నిశ్శబ్దంగా వుంది.
నేనే తలుపు తట్టి ‘మే ఐ క మిన్ సర్’ అన్నాను మెల్లగా. ‘యస్’ అని వినిపించింది లోపల నుంచి గంభీరంగా. తలుపు తోసుకుని వెళ్లాను.
తెల్లటి దుస్తుల్లో నల్లటి మనిషి ఒకరు కుర్చీలో కనిపించారు.
“ఎవరు మీరు? ఏం కావాలి” అన్నారాయన మరింత గంభీరంగా.
రేడియో కరస్పాండెంట్ ని అని చెప్పగానే ఆయన, నేను వచ్చింది సమ్మె సమాచారం కోసం అని అనుకున్నట్టున్నారు, ‘అలాటి విషయాలు మీరు సీ ఎస్ ఆఫీసులో అడగాలి, నన్ను కాదు’ అన్నారు కరకుగా.
అప్పుడు నేను వచ్చిన పని చెప్పాను. ‘బదిలీ విషయంలో మీకు రికమెండ్ చేయడానికి పెద్ద పెద్దవాళ్లు కూడా జంకుతున్నారు. అంచేత, మీరెవరో పరిచయం లేకపోయినా, నేనే నేరుగా అడుగుదామని వచ్చాను’ అని చెప్పాను మాటల్ని కూడగట్టుకుంటూ.
‘ఎవరా డాక్టరు ఎక్కడ పనిచేస్తారు’ అని అడిగితే చెప్పాను వివరాలు. అవి రాసి ఉంచుకున్న చీటీ ఆయన గారి చేతికి అందించాను.
ఒకసారి చదువుకుని ఆయన కుర్చీలో నుంచి లేచారు బయటకు వెళ్ళడానికి. ఇక ఇది అయ్యే పని కాదనుకుని నేనూ ఆయన వెంట బయటకు వచ్చాను.
చిత్రంగా ఆయన పియ్యే టేబుల్ దగ్గర ఆగిపోయి, టెలిఫోన్ డైరెక్టరీ చేతిలోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా డి.ఎం.అండ్ హెచ్.ఓ. కి ఫోన్ చేశారు.
ఆయన లైన్లోకి రాగానే మా డాక్టరు గారి వివరాలు చెప్పి, రిలీవ్ చేయవద్దని అని నోటిమాటగా ఉత్తర్వులు ఇచ్చారు.
‘సార్! ఆర్డర్ టైప్ చేయడానికి స్టాఫ్ ఎవరూ లేరు’ అని అవతల నుంచి అన్నట్టు వుంది.
‘నా దగ్గర మాత్రం ఏమైనా వున్నారా! నేనే డైరెక్టరీ వెతికి మీకు ఫోన్ చేశాను.. అర్ధం అయిందా’ అన్నారు సూర్యనారాయణ గారు తనదైన శైలిలో.
అటు డి.ఎం.అండ్ హెచ్.ఓ. గారితో పాటు ఇటు నాకూ అర్ధం అయింది, ఆయన గారి వ్యవహార శైలి.
సూర్యనారాయణ గారిని చూడడం అదే నాకు మొదటిసారి. ఇలాంటి అధికారులు కూడా వుంటారా అని అనుకుంటూ బయటపడ్డాను.
నాకు తెలిసి ఆ డాక్టరు గారిని తర్వాత ఎవరూ కదల్చలేదు. ఖమ్మంలోనే రిటైర్ అయ్యారు.
ఇప్పుడు ఆ అధికారీ లేరు, ఆ డాక్టరు గారూ లేరు, నా జ్ఞాపకాల్లో తప్పించి.
(ఇంకా వుంది)

15, ఫిబ్రవరి 2026, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (264) : భండారు శ్రీనివాసరావు

నిశ్శబ్దం రాజ్యమేలిన దళిత ముఖ్యమంత్రి సభ
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ గా పనిచేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు చక్రపాణి గారు ఒక సందర్భంలో చెప్పిన ఒక పాత విషయం స్పురణకు వస్తోంది.
అప్పుడు జవహర్ లాల్ నెహ్రూ ప్రధాన మంత్రి.
ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి ఆ పదవికి రాజీనామా చేసారు. ఆయన స్థానంలో దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రిగా నియమించాలని నెహ్రూ నిర్ణయించారు. అగ్రకులాల ఆధిపత్యం అధికంగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ లోని కొందరు నాయకులు ఒక దళితుడు ముఖ్యమంత్రి కావడాన్ని సహించలేక పోయారు. సంజీవయ్య అవినీతిపరుడని, అక్రమంగా లక్షలాది రూపాయలు కూడబెట్టారని అధిష్టానానికి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. సంజీవయ్య నీతి, నిజాయితీ తెలిసిన నెహ్రూ ఆ ఫిర్యాదులను కొట్టి పారేశారు. అయినా, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మొండిపట్టు పట్టారు.
నెహ్రూ ఓ నాయకుడిని ఆంధ్రాకు వెళ్లి సంజీవయ్య మీద రహస్య విచారణ చేసి నివేదిక ఇవ్వమని కోరారు. ఆయన హైదరాబాద్ వచ్చి అప్పటి కాంగ్రెస్ యువనాయకుడు చక్రపాణి గారిని కలిసి వచ్చిన పని చెప్పారు. సంజీవయ్య గారి గూర్చి బాగా తెలిసిన చక్రపాణిగారు నిర్ఘాంతపోయి ఆ నాయకుడిని చివాట్లు పెట్టారు. కానీ ప్రధాని ఆదేశం. చేసేది లేక ఢిల్లీ నాయకుడిని వెంటబెట్టుకుని కారులో సంజీవయ్య గారి గ్రామానికి వెళ్లారు. గ్రామ పొలిమేరలలో ఒక పూరి పాక ముందు కారు ఆపారు చక్రపాణి. ఆ పాక బయట ఒక వృద్ధురాలు కట్టెల పొయ్యిపై మట్టి కుండతో అన్నం వండుతున్నది. పొగగొట్టంతో మంటను ఊదుతూ చెమటలు కక్కుతున్నది. "ఏమిటి ఇక్కడ ఆపారు?" ప్రశ్నించాడు ఢిల్లీ నేత.
"సంజీవయ్య గారి ఇల్లు ఇదే. ఆ వృద్ధురాలు ఆయన అమ్మగారు. కారు దిగండి" అన్నారు చక్రపాణి. నాయకుడు నివ్వెరపోయాడు. చక్రపాణి ఆమెకు నమస్కరించి "అమ్మా...ప్రస్తుతం మంత్రి గా ఉన్న మీ అబ్బాయి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నారు" అన్నారు.
ఆమె చెమటలు తుడుచుకుంటూ "అయితే మా వాడి జీతం ఏమైనా పెరుగుతుందా నాయనా! ఈ కట్టెల పొయ్యి మీద వంట చెయ్యడం కష్టంగా ఉంది. ఒక బొగ్గుల కుంపటి కొనిపెట్టమని ఎన్నాళ్ళ నుంచో అడుగుతుంటే, డబ్బులు లేవు అంటున్నాడు" అన్నది.
నాయకుడి నోట్లోంచి మాట రాలేదు. "సార్.. గ్రామం లోకి వెళ్లి విచారణ చేద్దామా?" అడిగారు చక్రపాణి. "అవసరం లేదు. కారును హైద్రాబాద్ కు పోనీయండి" అన్నాడు నాయకుడు.
ఆ తరువాత వారం రోజుల్లో సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అయ్యారు.
సంజీవయ్య గారిది కర్నూలు జిల్లా కల్లూరు మండలం లోని పెద్దపాడు గ్రామం.
ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒకసారి తల్లిని చూడడానికి స్వగ్రామానికి వెళ్ళారు.
తిరిగి వస్తూ ఓ వందరూపాయల నోటు ఖర్చులకు వాడుకోమని ఇచ్చారు.
‘నాకు సరే నువ్వున్నావు, డబ్బులు ఇవ్వడానికి, కానీ ఎలాంటి ఆసరాలేని బీదా బిక్కీ సంగతేమిటి?’ అని ఆమె అన్నమాట సంజీవయ్య గారిలో ఆలోచనలు రేకెత్తించింది.
ఫలితమే ఆయన ప్రభుత్వం ప్రవేశపెట్టిన వృద్ధాప్య పింఛను పధకం.
ముఖ్యమంత్రి సభలో నిశ్శబ్దం అని కదా మొదలు పెట్టింది. దానికే వస్తాను. ఈ లోగా దానితో సంబంధం వున్న కొంత స్వకీయం.
మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ స్థాయికి చేరడానికి ముందు ఎక్కిన అనేకానేక నిచ్చెన మెట్లలో నెలకు పాతిక రూపాయల ‘విలేకరి కొలువు’ కూడా వుంది. చాలా మందికి తెలియదు.
ఖమ్మంలోని ఎస్సార్ అండ్ బీజీఎన్ ఆర్ కాలేజీలో ఆయన డిగ్రీ పూర్తిచేశారు. రామ్మోహనరావు గారు ఆ కాలేజీలో లెక్చరర్. వారి నాన్నగారికి పత్రికల ఏజెన్సీ కూడా వుంది. అప్పట్లో ఆ ఏజెంట్లే పత్రికా విలేకరుల పాత్ర కూడా పోషించేవారు. మా అన్నయ్యకు తెలుగులో ఉన్న ప్రావీణ్యం గమనించి, ‘నెలకు ఓ పాతిక ఇస్తాను, నీకు పాకెట్ మనీగా పనికి వస్తుంది, నువ్వు ఆంద్రజ్యోతి పత్రికకు వార్తలు రాస్తుండు. వాళ్ళు వేస్తే వేస్తారు, లేకపోతే లేదు, కానీ నీకు మంచి కాలక్షేపంగా వుంటుంది’ అని ప్రోత్సహించడంతో మా అన్నయ్య ఒప్పుకున్నాడు.
ఇక అసలు విషయానికి వస్తాను.
నాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఖమ్మం జిల్లా పర్యటన ఖరారు అయింది. అప్పటికే జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరూ రెండు వర్గాలుగా విడిపోయి వున్నారు. జలగం వెంగళరావు, శీలం సిద్దారెడ్డి వంటి అతిరధులు కలిగిన ప్రధాన వర్గం అప్పటివరకు ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవ రెడ్డికి అనుకూలం. మరో వర్గం సంజీవయ్య వైపు. దీనికి మాకు బాబాయి వరుస అయిన బొమ్మకంటి సత్యనారాయణ గారు నాయకులు. ఖమ్మం జిల్లాకు సంబంధించినంత వరకు ఆయన ముఖ్యమంత్రి అన్నట్టే లెక్క. సంజీవయ్య గారికి కుడి భుజం. ముఖ్యమంత్రికి సంఘీభావం తెలిపేందుకు గోకినేపల్లిలో జిల్లా దళిత మహా సభ ఏర్పాటు చేశారు. ఈ సభను కవర్ చేయడానికి పాతిక రూపాయల విలేకరి అయిన మా అన్నయ్యను పురమాయించారు రామ్మోహన రావు గారు.
సభ బాగా జరిగింది. ముఖ్యమంత్రి ప్రసంగించడానికి మైకు ముందు నిలబడ్డారు. సంజీవయ్య స్వతహాగా మంచి వక్త. ఆయన ప్రసంగం మొదలు పెట్టారు.
‘నన్ను బాధ పెడుతున్న, నా మనసును కలచి వేస్తున్న ఓ విషయాన్ని మీకు చెప్పదలచుకున్నాను. ఇక్కడ పైనా కిందా కూర్చున్న మనుషులం అందరం ఒకే తీరున ఉన్నాము. ఒంట్లో పారే రక్తం రంగు అందరికీ ఎరుపే. కానీ మనలో చాలామందిమి సాటి మనిషిని మనిషిగా చూస్తున్నామా అంటే అనుమానమే. డబ్బున్న ఖామందులు పెంపుడు బొచ్చు కుక్క పిల్లల్ని తమ పక్కలపై పడుకోబెట్టుకుంటారు. ముద్దు చేస్తారు. అదే సాటి మనిషిని తాకడానికి కూడా వారికి అస్పృశ్యత అనే అనాచారం అడ్డం వస్తుంది. కుక్కలపాటి చేయరా ఈ మనుషులు? ఎందుకీ వ్యత్యాసం? ఎందుకీ వివక్ష?’
రెండు చేతులూ గట్టిగా గాలిలో ఊపుతూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి స్వరం బొంగురు పోయింది. పైకిలేపిన చేతులను అలాగే వుంచి ఆయన కాసేపు మౌనంగా వుండిపోయారు.
సభకు హాజరై ప్రసంగం వింటున్న యావన్మంది చేష్టలు ఉడిగి వుండిపోయారు. అంతటా నీరవ నిశ్శబ్దం.
సరే! ఆ రోజు సభ ముగిసింది. తిరిగి హైదరాబాదు వెళ్ళడానికి దామోదరం సంజీవయ్య అంబాసిడర్ కారు ఎక్కారు. ఆయన పక్కనే మా బాబాయి బొమ్మకంటి సత్యనారాయణ. ముందొక పోలీసు జీపు, వెనక మరో జీపు. అదీ ముఖ్యమంత్రి కాన్వాయ్ ఆ రోజుల్లో.
మా అన్నయ్య ఖమ్మం చేరుకున్న వెంటనే తన రిపోర్ట్ రాసి మర్నాడు పోస్టులో పంపారు. ఆ మరునాడు అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది.
‘ముఖ్యమంత్రి దళిత సభలో రాజ్యమేలిన నిశ్శబ్దం’.
వార్తతో పాటు మా అన్నయ్య పెట్టిన హెడ్డింగ్ కూడా యధాతధంగా పత్రికలో రావడం కొసమెరుపు.
(కింది ఫొటోలో చక్రపాణి గారితో నేనూ, పాత్రికేయ మిత్రుడు విద్యారణ్య)



(ఇంకావుంది)

14, ఫిబ్రవరి 2026, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (263) : భండారు శ్రీనివాసరావు

రేడియోకి పాదాభివందనం
నిన్న అంటే ఫిబ్రవరి పదమూడో తేదీ ప్రపంచ రేడియో దినోత్సవం రోజున అనేకమంది ఆకాశవాణిని గుర్తు చేసుకోవడం చూసి నాకు ఏనుగు ఎక్కినంత సంబరం అనిపించింది. ఎందుకంటే నా జీవితంలో ముప్పావు భాగం ఆకాశవాణి నీడలోనే గడిచింది.
అంచేత ఓ పాత అనుభవాన్ని పంచుకుంటున్నాను.
మా ఆవిడ నిర్మల చనిపోవడానికి వారం పది రోజుల ముందు... జరిగిన సంఘటన. 2019 ఆగష్టు తొమ్మిదిన ఇద్దరం కలిసి సినిమాకి వెళ్ళాం. తొమ్మిది రోజుల తర్వాత 18 వ తేదీ అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుతో తను అకస్మాత్తుగా మరణించింది. కింది సంఘటనకి మా ఆవిడ మరణానికి ఏమీ సంబంధం లేదు. కేవలం కాకతాళీయం.
నేను మాస్కోలో రేడియో మాస్కోలో పనిచేసే రోజుల్లో తెలుగు కార్యక్రమాలు శ్రద్ధగా వినే శ్రోతలకు రేడియో తరపున చిన్ని చిన్ని కానుకలు పంపించే సాంప్రదాయం వుండేది.
మన దేశంలో టీవీ దూరదర్సన్ రూపంలో రంగప్రవేశం చేసిన మొదటి సంవత్సరాలలో బాగా కలిగిన వాళ్ళ ఇళ్ళల్లోనే టీవీ సెట్లు కనిపించేవి. ఆదివారం రోజున ఆ లోగిళ్ళు అన్నీ రామాయణ, భారతాల ప్రేక్షకులతో నిండి కనిపించేవి. బాపూ రమణలు మిస్టర్ పెళ్ళాం చిత్రంలో ఇటువంటి సన్నివేశాలను హృద్యంగా జొప్పించారు కూడా.
మరి ఇప్పటికీ వెనుకటి మాదిరిగా రేడియో (ఆకాశవాణి) వింటున్నవాళ్ళు, దూరదర్సన్ చూస్తున్న వాళ్ళు వున్నారా అని కొందరు అమాయకంగా అడుగుతుంటారు. పెద్ద గీత ముందు చిన్న గీత లాగా, మునుపటి మాదిరిగా ‘ఈ సంగతి రేడియోలో విన్నాం’ అని చెప్పేవాళ్ళు అంతగా కనిపించక పోవచ్చుకానీ వినేవాళ్ళు లేకుండా మాత్రం లేకుండా పోలేదు.
రేడియో వినడమే కాదు, రేడియో అంటే ప్రాణం అని చెప్పే ఒక వ్యక్తి ఆ రోజు మాకు తారసపడ్డాడు. అతడి మాటల్లో నా ప్రసక్తి వుంది కాబట్టి, అది ప్రస్తావించకుండా విషయం వివరించలేని పరిస్తితి నాది. కొంత స్వోత్కర్ష అనిపించినా దానికి మినహాయింపు ఇచ్చి నేను చెప్పే విషయానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని నా వినమ్ర పూర్వక విన్నపం.
నేనూ మా ఆవిడా తీరి కూర్చుని గిల్లి కజ్జాలు పెట్టుకోవడం మంచిది కాదని, ఆ తీరిక సమయాన్ని ఓ సినిమా చూడడంలో గడపాలని నిర్ణయించుకుని దాన్ని తక్షణం అమలుచేసాం. ఒక మాల్ లోని హాల్లో సినిమా చూసి ఇంటికి రావడానికి ఉబెర్ బుక్ చేసుకునే ప్రయత్నంలో వుండగా ఆ వ్యక్తి మా ఆవిడతో మాట్లాడ్డం గమనించాను.
'రేడియోలో పనిచేసే శ్రీనివాసరావా' అని అతడు ఆరా తీయడం కనిపించింది.
కన్నుమూసి తెరిచేలోగా అతగాడు అధాటున ముందుకు వంగి నా కాళ్ళకు దణ్ణం పెట్టాడు. నలుగురిలో అతడలా చేయడంతో సిగ్గుతో ముడుచుకుపోయాను
“ఇది నేను రేడియోకు పెడుతున్న నమస్కారం, వేరేలా అనుకోకండి” అనేశాడు.
తన పేరు సుభాష్ అని, కరీంనగర్ జిల్లా వాసిననీ, ప్రస్తుతం కూకట్ పల్లిలో వుంటున్నాననీ వివరాలు అడగకుండానే చెప్పాడు. రేడియో వినడం చిన్నప్పటి నుంచి తనకు అలవాటని చెబుతూ జేబులోనుంచి ఒక బుల్లి ట్రాన్సిస్టర్ తీసి చూపించాడు.
వారానికి రెండు సార్లు వచ్చే వార్తావాహిని, ప్రతి గురువారం వచ్చే జీవన స్రవంతి వినేవాడినన్నాడు.
1989 లో నేను మాస్కో వెళ్లకముందు నేను చేసిన ప్రోగ్రాములు అవి. అంటే దాదాపు నాలుగు దశాబ్దాలు కావస్తోంది.
'టీవీల్లో భండారు శ్రీనివాసరావు అని చెబుతూ వుంటారు, అలా చూసి మిమ్మల్ని గుర్తు పట్టాను' అని ఒక చిన్న వివరణ ఇచ్చి నా మనసు మూలల్లో తొలుస్తున్న సందేహాన్ని నివృత్తి చేసాడు.
ఆ రేడియో అభిమానితో ఓ సెల్ఫీ దిగాలనిపించింది. కానీ ఆ ప్రక్రియ నాకు రాదు. ఈ లోపల అతడే ఓ సెల్ఫీ తీసుకోవచ్చా అని అడిగి తన సెల్ ఫోన్ తో తీసి ఒకటి నాకు వెంటనే వాట్సప్ లో పంపాడు.
ముందుగా మాస్కో రేడియో ప్రసక్తి ఎందుకు తెచ్చాను అంటే, ఆకాశవాణివాళ్ళు కూడా ఇటువంటి అభిమానులతో కొన్ని ఇంటర్వ్యూలు చేసి ప్రసారం చేస్తే బాగుంటుందని.
కారెక్కగానే మా ఆవిడ అంది, గిల్లికజ్జాకు ప్రారంభ సూచికగా.
"మీరు రేడియో మనిషని అటు రేడియో వాళ్ళు, ఇటు దూరదర్సన్ వాళ్ళు ఎప్పుడో మరచిపోయారు, కనీసం రేడియో వినే వాళ్ళయినా మిమ్మల్ని గుర్తుంచుకుంటున్నారు, సంతోషించండి"
తోకటపా:
మాటలు మింగే తిమింగలాలు
‘మీ గొంతు పీలగా అనిపించింది’
‘మొదలు పెట్టినప్పుడు దూకుడుగా మొదలెడతారు. పోను పోను తేలిపోతున్నట్టుగా వుంటుంది. ఇక వాక్యం ముగించేటప్పుడు ఆఖరు పదాలు మింగేస్తునారు’
నలభయ్ ఎనిమిదేళ్ల క్రితం నేను రేడియో ఉద్యోగంలో చేరి వార్తావాహిని కార్యక్రమాన్ని వారానికి ఒకసారో, రెండుసార్లో సమర్పిస్తున్నప్పుడు దాన్ని రేడియోలో విని నాతో మా ఆవిడ తరచుగా అంటుండే మాటలు ఇవి.
నా ప్రోగ్రాం వినే అవకాశం నాకు లేకపోవడం వల్ల, మా ఆవిడ మాటలే వేదం అనుకుని కొంత బాణీ మార్చుకునే ప్రయత్నం చేశాను. ఈలోగా వారం వారం ‘జీవన స్రవంతి’ మొదలయింది. ‘తినగ తినగ వేము తియ్యనగును’ అన్నట్టు నా గొంతుకు శ్రోతలు అలవాటు పడిపోవడంతో నా భార్య మాటలు చెవిన పెట్టడం మానేసాను.
ఇప్పుడు టీవీల్లో కొందరి స్వరాలు వింటుంటే ఈ పూర్వపు రోజులు గుర్తుకొస్తున్నాయి. ఒక్కోసారి అనిపిస్తుంది, వీళ్ళకు మంచీచెడూ చెప్పే భార్యలు లేరా, లేక చెవికి ఎక్కించుకుపోవడం అనే నా చెడ్డ అలవాటు వీరికీ ఉందా అని.
కింది ఫోటో:
సినిమాహాలు వెలుపల రేడియో అభిమాని సుభాష్ తో నేను



(ఇంకా వుంది)

11, ఫిబ్రవరి 2026, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (262 ): భండారు శ్రీనివాసరావు

 

'రామః రామౌ, రామాః, హే రామ హే రామౌ, హే రామాః ........' సంస్కృతం మాస్టారి నోట మధురంగా, మంద్రంగా వినవచ్చేవి శబ్ద మంజరి పాఠాలు.
బెజవాడ గవర్నర్ పేట లోని సీవీఆర్ జీఎంహెచ్ స్కూలు (చుండూరు వెంకటరెడ్డి గవర్నర్ పేట మునిపల్ హైస్కూలు) భవనం చాలా విశాలమైన ప్రాంగణంలో వుంది. (వుండేది)
దాని నట్టనడుమ రాజసం వొలకబోసే రాతికట్టడం. దానికి ఇరువైపులా తరగతి గదులు.
ప్రధాన భవనంలో మెట్లకింద, తెల్లని పంచె, లాల్చీ కండువా ధరించిన సంస్కృతం మాస్టారు అలా శబ్దమంజరి చదువుతుంటే, మేము ఒక పది మందిమి కాబోలు సంస్కృతం రెండో భాషగా తీసుకున్నవాళ్ళం, శ్రద్ధగా వింటూ మాస్టారు చెప్పింది వల్లె వేస్తూ వుండేవాళ్ళం.
‘రామ శబ్దం ఆకారంత పుంలింగం. రామః రాముడు ఏకవచనం. రామౌ ఇద్దరు రాములు, ద్వి వచనం, రామాః అనేకమంది రాములు, బహువచనం
అలాగే రామః, ప్రధమా విభక్తి, హే రామః, సంబోధన ప్రధమా విభక్తి’
ఇలా సాగిపోయేవి మాస్టారి నోటి వెంట సంస్కృతం పాఠాలు. అంతా భట్టీయమే. ఎంత వంట బట్టిందన్నది ఆ దేవుడికే ఎరుక.
ఇంగ్లీష్, తెలుగు, లెక్కలు, ఇతర సబ్జక్టులు బోధించడానికి తరగతి గదులు విడిగా, ఉండేవి కాని సంస్కృతం క్లాసు మాత్రం, శబ్ధమంజరి, అమరకోశం చెప్పుకుంటూ మేడ మెట్ల కిందే నడిచేది. అది ఒకప్పటి జ్ఞాపకం.
మరొకప్పటి మరో జ్ఞాపకం . చాలా కాలం క్రితం, నెట్లో ఒక ఆసక్తికర సమాచారాన్ని మిత్రులు శ్రీ పీ.వీ.వీ.జీ. స్వామిగారు అమెరికా నుంచి పంపారు. ఆ ఇంగ్లీష్ వార్తకు నా తెలుగు అనువాదం నా సొంత బాణీలో :
ఒకానొకకాలంలో సూర్యుడు అస్తమించని సువిశాల సామ్రాజ్యానికి అది రాజధాని. అన్ని భాషలకు మాతృభాషగా పేరొందిన సంస్కృతం పరిఢవిల్లిన అఖండ భారతాన్ని వందల సంవత్సరాలపాటు బానిస దేశంగా పాలించిన బ్రిటిష్ ప్రభువుల రాజధాని నగరం. అలాటి ఇంగ్లీష్ గడ్డ అయిన లండన్ నగరంలో సంస్కృతాన్ని బోధించే పాఠశాల. వినడానికే విచిత్రం అనిపించినా ఇది నిజం.
లండన్ లోని సెంట్ జేమ్స్ ఇండిపెండెంట్ స్కూల్లో సంస్కృత భాషా విభాగం అధిపతి వార్విక్ జేస్సప్ మాటల్లో మిగిలింది తెలుసుకుందాం.
"ప్రపంచం మొత్తంలో సంస్కృతంతో పోల్చచదగిన ఉత్కృష్టమైన భాష మరొకటి లేదు. ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు. జర్మన్ ప్రజలు జర్మన్ మాట్లాడతారు. మాట్లాడే ప్రజల పేరుతోనే ఆ భాషలకు నామకరణం చేసారు. సంస్కృతం ఒక్కటే మినహాయింపు. ఆ ఒక్క భాష చక్కగా నేర్చుకుంటే చాలు, సైన్సు, గణితం వంటి ఇతర అంశాలపై పట్టు చిక్కించుకోవడం సులభం అవుతుంది'
ఇక ఆ స్కూలు హెడ్ మాష్టర్ పాల్ మాస్ గారు సంస్కృతం గురించి మరింత గొప్ప కితాబు ఇచ్చారు.
'దేవనాగరి లిపిలో రాయడం నేర్చుకుంటే విద్యార్ధులకు తమ చేతి వేళ్ళపై గట్టి పట్టు చిక్కుతుంది. సంస్కృతంలో మాట్లాడడం వస్తే ఇక ఆ నాలుకకు అడ్డే వుండదు. స్పష్టమైన ఉచ్చారణ అలవడుతుంది'
పాల్ మహాశయులు అంతటితో ఆగలేది. ఇంకా ఇలా వివరించారు.
'యూరోపియన్ భాషలు మాట్లాడేవాళ్ళు నాలుకలో వుండే అన్ని భాగాలను ఉపయోగించరు. నాలుక కొసతో మాట్లాడేస్తుంటారు. రాసేటప్పుడు కూడా వేళ్ళల్లోని అన్నికదలికలను వాడరు. అదే సంస్కృతం మాట్లాడడం అలవాటు చేసుకుంటే మెదడు చురుగ్గా పనిచేయడానికి అది దోహదం చేస్తుంది'
లండన్ లోని ఈ ఇంగ్లీష్ స్కూల్లో సంస్కృతం సెకండ్ లాంగ్ వేజ్ గా తీసుకునే వాళ్ళు విధిగా ఆరేళ్ళపాటు ఆ భాషను అధ్యయనం చేయాల్సివుంటుంది. (మెట్ల కింద కాదు. చక్కటి తరగతి గదులు వున్నాయి) సంస్కృత విద్యార్ధులకు స్కూల్లో శాకాహార భోజనమే లభిస్తుంది.
మరి ఇప్పుడు చెప్పండి. ఇంగ్లీష్ వాడు చెప్పాడు కనుక మనమూ సంస్కృతం గొప్పదని అనుకుందామా!
అన్నట్టు గతంలో ఆకాశవాణిలో సంస్కృతం పాఠాలు బోధించేవాళ్లు. మరిప్పుడు పరిస్థితి ఏమిటో Sivaramaprasad Kappagantu శివరామ ప్రసాద్ కప్పగంతు వారు చెప్పాలి.
తోకటపా: మొన్న సంక్రాంతికి మా ఊరు కంభంపాడు వెళ్ళాము. కంచిలో ఒక సంస్కృత విద్యాలయంలో వేదం అభ్యసిస్తున్న ఒక కుర్రవాడు మా ఇంటికి వచ్చాడు. వాళ్ళ తాతగారు ఇంగువ పురుషోత్తమ శర్మగారు, సంస్కృతం మీద తనకున్న భక్తి గౌరవాలతో మనుమడు చిరంజీవి విజయ కృష్ణ శర్మను అక్కడ చేర్పించాడు.
చదువు, బస, భోజనం అన్నీ ఉచితం. కాకపోతే మెడిసిన్ లాగా చాలా ఏళ్ళు చదవాలి. కష్టపడి చదవాలి. తెల్లవారుఝామున నిద్ర లేవాలి. బావి దగ్గర చేదతో నీళ్ళు తోడుకుని తల స్నానం చేయాలి. గోవులకు మేత వేసి పాలు పితకాలి. అక్కడ చదువుకునే పిల్లలు అందరూ ఆవు పాలే తాగాలి. గోక్షీరంతో తయారైన పెరుగుతో భోజనం చేయాలి. మొత్తం సాత్వికాహారం. అంత చిన్నతనంలో అంత దూరం వెళ్లి సంస్కృతం నేర్చుకుంటున్న ఆ పిల్లవాడిని చూస్తే చాలా ముచ్చటేసింది.
కింది వీడియోలో తాను నేర్చుకున్న సంస్కృత పనసలను మాకు వినిపించాడు.



https://www.facebook.com/reel/1468401071626669


(ఇంకా వుంది)