29, మార్చి 2023, బుధవారం

నాలుగు పదులు దాటిన తెలుగుదేశం – భండారు శ్రీనివాసరావు

 


(మార్చి 29 టీడీపీ ఆవిర్భావ దినోత్సవం)

 

ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి 1982 చాలా ముఖ్యమైన సంవత్సరం. తదనంతర కాలంలో రాష్ట్రం రూపురేఖలు పూర్తిగా మారిపోయే రాజకీయ పరిణామాలకు పునాది పడింది కూడా ఆ ఏడాదిలోనే. 1956 లో ఏర్పడ్డ మొట్టమొదటి భాషాప్రయుక్త  రాష్ట్రాన్ని అప్పటివరకు జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యంగా సాగించిన పాలనకు, తెలుగుదేశం పార్టీ పేరుతొ కొత్తగా ఒక ప్రాంతీయ పార్టీ పెట్టిన నందమూరి తారకరామారావు, చరమ గీతం పాడింది కూడా అదే ఏడాది.

వరసగా ముగ్గురు ముఖ్యమంత్రులను మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే కాంగ్రెస్ అధిష్టానం మార్చడం, ముఖ్యమంత్రి హోదాలో వున్న అంజయ్యను, ఇందిరాగాంధి కుమారుడు రాజీవ్ గాంధి బహిరంగంగా అవమానించడం, ఏళ్ళ తరబడి సాగిన కాంగ్రెస్ పాలనలో అవినీతి, బంధుప్రీతి విచ్చలవిడిగా పెరిగిపోయి, సరైన ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్న సమయంలో ఏర్పడ్డ రాజకీయ శూన్యత,  ఇలాటివన్నీ కొత్తగా రాజకీయ పార్టీ స్థాపించి, సినీ గ్లామరుతో రంగప్రవేశం చేసిన రామారావుకు బాగా కలిసి వచ్చాయి.

 

తెలుగు దేశం పార్టీ పుట్టేనాటికి నాకు ముప్పయ్ ఆరేళ్ళు. ఆ పార్టీలో నాడు కొత్తగా చేరినవాళ్ళలో చాలామంది వయసులో నాకంటే చాలా చాలా చిన్నవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ వయసు కూడా అరవై దాటి వుంటుంది.

ఆ పార్టీ ఆవిర్భావం నాటికి నేను రేడియో విలేకరిగా పనిచేస్తున్నాను. 1982 మార్చి 21 వ తేదీన   రామకృష్ణా సినీ స్టూడియోకి  విలేకరులను పిలిచి,  తాను త్వరలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు ఎన్టీ రామారావు ప్రకటించారు. పార్టీ స్వరూప స్వభావాలను గురించి గుచ్చిగుచ్చి ప్రశ్నించినా, వాటికి ఆయన నుంచి జవాబు లేదు. ఊహాజనితమైన వేటికీ సమాధానం చెప్పనని చెప్పేశారు.

అయితే చెప్పే ముహూర్తం త్వరలోనే వచ్చింది. మళ్ళీ విలేకరులకు పిలుపువచ్చింది. ఈసారి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మార్చి 29కలుసుకున్నారు. పెట్టబోయే పార్టీ పేరు “తెలుగుదేశం పార్టీ” అనగానే అందరూ విస్తుపోయారు. ఒక పార్టీకి, అందులోనా ఒక ప్రాంతీయ పార్టీకి దేశం అనే పదం జోడించడం ఏమిటని అనుకున్నారు.

ఇక అక్కడనుంచి ఆయన కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కాదు.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆ పార్టీ ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టిందన్నారు. ఒక తాసీలు ఆఫీసులో గుమాస్తాను బదిలీ చేయాలన్నా ఢిల్లీ అనుమతి కోసం ఎదురుచూపులు చూసే పార్టీ, తెలుగు ప్రజలకు ఏం ఒరగబెడుతుందని ప్రశ్నించారు. ఇప్పటి కాంగ్రెస్ మహాత్మా గాంధీ కాలం నాటి కాంగ్రెస్ యెంత మాత్రం కాదన్నారు. ఇంగ్లీష్ లో ఎన్ని అక్షరాలు వున్నాయో కాంగ్రెస్ అన్ని రకాలుగా చీలిపోయిందని ఎద్దేవా చేసారు.

పార్టీ ప్రచారం కూడా వినూత్న పద్దతిలో సాగింది. ముందు హెలికాప్టర్ పై రాష్ట్రాన్ని చుట్టి రావాలని అనుకున్నారు. కానీ కేంద్రంలోని ప్రభుత్వం హెలికాప్టర్ కు అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్ పైనే నెపం వేసారు. పర్యటనల కోసం తమ ఇంట్లో ఓ గరాజులో మూలపడివున్న, ఎప్పుడో ముచ్చట పడి కొనుక్కున్న నల్ల రంగు వ్యాన్ ని బయటకు తీసి కొత్త నగిషీలు చెక్కారు. వ్యాను పైకెక్కి మైకులో ఉపన్యసించడానికి వీలుగా ఏర్పాట్లు చేసారు. ఎన్టీఆర్ భోజనం, పడక అంతా అందులోనే. ఉదయం పూట రోడ్డుపక్కనే స్నానాలు. అంతవరకూ ఇలాటి ప్రచారం ఎరుగని వారికి ఇదంతా వింతగా అనిపించింది. అది ఒక ఆకర్షణగా మారింది.

ఎన్టీఆర్ చైతన్య రధం ఒక గ్రామం చేరే లోగా మరో జీపు ముందుగానే అక్కడికి చేరుకునేది. వేములపల్లి శ్రీ కృష్ణ రాసిన ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా’ అనే పాట, శంకరంబాడి సుందరాచారి రచించిన ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ అనే పాటలను మైకుల్లో వినిపించేవాళ్ళు. వస్తున్నది రామారావు వంటి సుప్రసిద్ధ నటుడు. వేస్తున్నది ఉర్రూతలూగించే ఈ పాటలు. జనాలు విరగబడేవాళ్ళు. వాళ్ళను చూడగానే ఎన్టీఆర్ ప్రసంగం మరింత వేడెక్కేది. ఇక ఈలలూ, చప్పట్లతో ఆ ప్రాంతం మారుమోగిపోయేది.

ఒక్క పత్రిక తప్ప మిగిలిన తెలుగు దినపత్రికలన్నీ అప్పుడు కాస్తో కూస్తో కాంగ్రెస్ అనుకూల వార్తలు రాసేవి. రామారావు సాగిస్తున్న ఈ ప్రచారాన్ని చూసి కాంగ్రెస్ నాయకులు ‘డ్రామారావు’ అని అపహాస్యంగా మాట్లాడేవాళ్ళు. కాంగ్రెస్ నాయకుడు జీ. వెంకటస్వామి ‘అది తెలుగు దేశం కాదు, కమ్మ దేశం’ అంటూ నేరుగా ఆ పార్టీకి కులాన్ని ఆపాదిస్తూ ప్రకటన చేసారు. అప్పుడు కాంగ్రెస్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుని విలేకరులం కలిసి ‘ మీ మామగారి పార్టీలో చేరతారా అని అడిగితే, ‘కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఎన్టీఆర్ పైనే పోటీ చేస్తా’ అని బదులిచ్చారు. ఆ సాయంత్రం ప్రాంతీయ వార్తల్లో, మరునాడు పత్రికల్లో ‘మామగారిపై పోటీకి రెడీ అంటున్న చంద్రబాబు’ అంటూ ప్రముఖంగా వార్తలు వచ్చాయి.

ప్రచారం ఉధృతం అవుతున్న కొద్దీ కాంగ్రెస్ నాయకులకు తత్వం బోధపడింది. అపజయం తప్పదేమో అనే సందేహం పట్టుకుంది. దీనికి తొలి సూచన నంద్యాలలో జరిగిన ఇందిరాగాంధీ ఎన్నికల ప్రచారంలో కనబడింది. ఆ సభలో మాట్లాడుతూ అప్పటి కాంగ్రెస్ అభ్యర్ధి బొజ్జా వెంకట రెడ్డి, ‘బడుగు బలహీన వర్గాలను కాపుకాసే కాంగ్రెస్ కు ఓటు వేస్తారా, సినిమా వేషాలతో జిమ్మిక్కులు చేసే తెలుగు దేశం పార్టీకి ఓటేస్తారా’ అని అడిగితే, సభకు వచ్చిన వాళ్ళలో చాలామంది మా ఓటు ఎన్టీఆర్ కే అని చెప్పడంతో కాంగ్రెస్ శ్రేణులు నీరసపడిపోయాయి. తిరుపతి ఎన్నికల సభల నాటికి విషయం  ధ్రువ పడింది.

ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వెలువడుతున్నాయి. షాద్ నగర్ నుంచి మొదటి ఫలితం అధికారికంగా వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ పి. శంకరరావు గెలుపొందారు. రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. అందువల్ల మిగిలిన అన్నిచోట్లకంటే అక్కడ ఫలితం చాలా ముందుగా వెలువడింది. షాద్ నగర్ నుంచి నేను పంపిన వార్త మధ్యాన్నం, సాయంత్రం వార్తల్లోనూ, ఢిల్లీ నుంచి ప్రసారం అయ్యే ఆరుగంటల ఇంగ్లీష్ వార్తల్లోనూ ప్రముఖంగా వచ్చింది. తరువాత చాలా సేపటి వరకు ఎటువంటి సమాచారం ఎక్కడి నుంచి లేదు. టీడీపీ అభ్యర్ధులు చాలా చోట్ల ఆధిక్యతలో వున్నట్టు అనధికారికంగా తెలుస్తున్నా, అప్పటి నిబంధనలు అనుసరించి ప్రసారం చేయడం సాధ్యపడలేదు. కావాలనే రేడియోలో వార్తలు తొక్కిపడుతున్నారని ఆ పార్టీ అభిమానుల్లో సందేహాలు కలిగాయి. కొందరు రేడియో స్టేషన్ దగ్గర ఆందోళనకు దిగారు కూడా. విషయం వివరించి చెప్పడంతో శాంతించారు.

అదే రాత్రి ఫలితాలు చాలావరకు తెలిసిపోయాయి. ప్రభుత్వం స్థాపించడానికి అవసరం అయ్యే మెజారిటీ టీడీపీకి అప్పటికే లభించింది. ఎన్టీఆర్ ని కలిసి ఆయన స్పందన రికార్డు చేయడానికి స్కూటరు మీద ఆబిడ్స్ నివాసానికి వెళ్లాను. వాకబు చేస్తే ఆయన అప్పటికే నిద్రకు ఉపక్రమించారని తెలిసింది.

దటీజ్ ఎన్టీఆర్.

రాష్ట్రమంతా సంబరాలు జరుగుతుంటే ఆయన మాత్రం ఆయన అలవాటు ప్రకారం వేళకు నిద్రపోయారు.

మరునాడు అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి విజయభాస్కర రెడ్డి రాజీనామా చేశారు. ఆయన స్పందన విచిత్రం అనిపించింది.

కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ తుడిచిపెట్టుకునిపోదు. చూస్తుండండి, మళ్ళీ అధికారంలోకి వస్తుంది”

అప్పుడు భేషజం అనిపించిన ఆయన మాటలు ఆరేళ్ళ తరువాత నిజమయ్యాయి. 1989 లో కాంగ్రెస్ పార్టీ, టీడీపీని ఓడించి మళ్ళీ అధికార పగ్గాలు చేపట్టింది. తిరిగి అయిదేళ్ళలోనే అధికారానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీది  కుటుంబ పాలన అంటూ దుమ్మెత్తి పోసిందో అదే దిక్కుగా పయనించడం రాజకీయ చమత్కారం.

టీడీపి సంస్థాపక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి  ఎన్టీఆర్ తాను  జీవించి వుండగా, రెండు ఆగస్టు సంక్షోభాలను ఎదుర్కున్నారు. రెండు సందర్భాలలోను  ఆయన  ముఖ్యమంత్రి పదవి కోల్పోయారు. దానికి కారణం స్వంత పార్టీ మనుషులే. మొదటిసారి నాదెండ్ల ఎపిసోడ్ లో ఎన్టీఆర్ సాగించిన ఉద్యమాన్ని ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంగా అభివర్ణించిన పత్రికలు,, అదే పద్దతిలో పురుడు పోసుకున్న రెండో ఆగస్టు సంక్షోభాన్ని మాత్రం దుష్ట శక్తుల నుంచి టీడీపీని కాపాడే ఉద్యమంగా కితాబు ఇవ్వడం మారిన రాజకీయాలకు, మీడియా విలువలకు అద్దం పట్టింది.   

రాష్ట్ర విభజన తర్వాత  నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని  అయిదేళ్లు పాలించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, మరో ప్రాంతీయ పార్టీ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ చేతిలో ఘోర పరాజయానికి గురై, ఇటీవలికాలంలో సాధించిన విజయాలతో ఇప్పుడిప్పుడే  తేరుకుంటోంది. పార్టీకి పునర్‌వైభవం సిద్ధిస్తుందా లేదా అనే సంగతి రానున్న ఏడాదిలో తేలిపోతుంది.

(29-03-2023)

 

26, మార్చి 2023, ఆదివారం

ఉరిశిక్షకు ప్రత్యామ్నాయం లేదా? – భండారు శ్రీనివాసరావు

  

(Published in Andhra Prabha today, 26-03-2023, SUNDAY)


ఈ ప్రశ్న వేసింది సామాన్యులు కాదు, ఏకంగా  దేశ సర్వోన్నత న్యాయ స్థానం అయిన  సుప్రీం కోర్టు ధర్మాసనం. 

గత  మంగళవారం వారం అంటే మార్చి 21 న ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పీ.ఎస్. నరసింహంలతో కూడిన ధర్మాసనం ఉరిశిక్షకు ప్రత్యామ్నాయం గురించి పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

మరణ శిక్ష పడిన దోషులకు నొప్పి తెలియకుండా చనిపోయే అవకాశం కల్పించాలని అర్థిస్తూ దాఖలైన పిల్ దీనికి ప్రాతిపదిక.

దీనిపై స్పందిస్తూ మెడకు ఉరితాడు బిగించి చంపేసే క్రూరమైన పద్దతి కాకుండా తక్కువ నొప్పితో మరణ దండన అమలుచేసే ఇతర విధానాలపై వివరాలను సేకరించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

దీనికి ఓ నేపధ్యం వుంది. 

చాలా సంవత్సరాల క్రితం మరణ శిక్షను రద్దు చేయాలనే ప్రతిపాదన గురించి లా కమిషన్ సుదీర్ఘ కాలం అధ్యయనం చేసి ఒక నివేదిక సమర్పించింది.

ఉరిశిక్ష స్థానంలో, తుపాకీతో కాల్చడం, విషపు ఇంజెక్షన్ ఇవ్వడం, ఎలక్ట్రిక్ కుర్చీలో కూర్చోబెట్టి విద్యుత్ఘాతం లేదా గ్యాస్ ఛాంబర్ లో వుంచి ప్రాణం తీయడం వంటి ప్రత్యామ్నాయ శిక్షలను ఆ నివేదికలో పొందుపరిచారు. అనేక ఇతర దేశాల్లో ఉరి వేసి చంపే పద్దతికి క్రమంగా స్వస్తి చెబుతున్న విషయాన్ని లా కమిషన్ గుర్తు చేసింది.   

స్పందించిన ధర్మాసనం ఈ అంశాలతో ఏకీభవించలేదు. తక్కువ నొప్పి అనేది ఇక్కడ ప్రశ్నే కాదని అంటూ, సైన్స్ ఏం చెబుతోంది అన్నదే ప్రధానం అని పేర్కొన్నది. విషపు ఇంజెక్షన్ ఇవ్వడం, తుపాకీతో కాల్చడం కూడా క్రూరమైన చర్యే అని చీఫ్ జస్టిస్ చంద్ర చూడ్ అభిప్రాయపడ్డారు. మరణ దండన ఏ పద్దతిలో అమలు చేయాలనేది తాము ప్రభుత్వానికి చెప్పలేమని అన్నారు. ఉరివేసి చంపడం వల్ల కలిగే ప్రభావాలపై ఏదైనా శాస్త్రీయ అధ్యయనం వుంటే దాన్ని తీసుకు రావాలని అటార్నీ జనరల్ ను ఆదేశించారు.  ఈ విషయంలో నిపుణుల కమిటీ ఏర్పాటును పరిశీలిస్తామని విచారణను వాయిదా వేశారు.

మరణ దండనలను ఏ రూపంలో విధించినా వాటిని అమలు చేయడం మానవ హక్కులను ఉల్లంఘించడమే అని, మరణ శిక్షలను రద్దు చేయాలని ఒక వర్గం నుంచి ఒత్తిడి చాలాకాలంగా వుంది. దీనిపై అనేక వ్యాసాలే కాదు, నవలలు, సినిమాలు కూడా వచ్చాయి.   

ప్రాణం తీయడం ఎంత పాపమో, ప్రాణం తీసుకోవడం కూడా మహాపాపం అనే భావం సాధారణ ప్రజల్లో వుంది. ఆత్మహత్య మహాపాతకం అని శాస్త్రాలు చెబుతాయి.  ఆత్మహత్యకు ప్రయత్నించడం శిక్షార్హమైన నేరంగా చట్టం కూడా  పేర్కొంటోంది. ఈ నేపధ్యంలో ఉరిశిక్షవిధించే విధానానికి స్వస్తి చెప్పాలని కేంద్ర లా కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఉగ్రవాద సంబంధమైన కేసులు మినహా మిగిలిన సందర్భాల్లో మరణ శిక్షను వెంటనే రద్దు చేయాలని కమిషన్ కోరింది. అత్యంత అరుదయిన కేసుల్లోను ఉరిశిక్ష రద్దు చేయాలన్నది కమిషన్ అభిప్రాయం. ఉరిశిక్ష అనేది రాజ్యాంగపరంగా చూసినప్పుడు నిలబడదని స్పష్టం చేసింది. 

సరే! ఇది కేవలం సిఫారసు మాత్రమే  కాబట్టి ఇది చట్ట రూపం దాల్చి, మరణ దండనకు నూకలు చెల్లడానికి మరి కొంత కాలం పట్టే అవకాశం వుంది. ఈ సిఫారసులపై ప్రజాప్రయోజన వ్యాజ్యాల కారణంగా మరింత ఆలస్యం అయినా  ఆశ్చర్యం లేదు.

ఈ సందర్భంలో గతాన్ని నెమరు వేసుకోవడం అవసరమే.

ఎనిమిదేళ్ల క్రితం అనుకుంటాను ఇదే అత్యున్నత న్యాయస్థానం మరో కేసులో ఒక సంచలన నిర్ణయం వెలువరించింది. తమ మతాచారం ప్రకారం ప్రాయోపవేశ దీక్ష స్వీకరించి ఎటువంటి ఆహారం తీసుకోకుండా మరణం కోసం నిరీక్షించే పద్దతి, ఖచ్చితంగా ఆత్మహత్య కిందికే వస్తుందని రాజస్థాన్ హైకోర్టు నిర్ధారించడాన్ని సవాలు చేస్తూ, కొందరు జైనమత విశ్వాసులు సుప్రీం కోర్టు తలుపు తట్టారు. హైకోర్టు తీర్పు తమ మత విశ్వాసుల ప్రాధమిక హక్కులను ఉల్లంఘించేదిగా వుందని, రాజ్యాంగంలో పొందుపరచిన లౌకిక సూత్రాలకు విరుద్ధంగా వుందని పిటీషనర్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వాదనలు విని, రాజస్థాన్ హైకోర్టు తీర్పు అమలు కాకుండా నిలుపు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.  

ఉరిశిక్ష పడ్డ నేరస్తులు కూడా ఏదో ఒకవిధంగా ఆ శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అలాటిది జైన మతస్తులు తమ మతాచారం ప్రకారం స్వచ్చంద మరణం కోరుకోవడమే కాకుండా దాన్ని ఒక హక్కుగా భావించడం ఆ మతం గురించి అవగాహన లేనివారికి కొంత విడ్డూరంగానే అనిపిస్తుంది. జైనుల జీవన విధానంలో అహింసను పరమధర్మంగా భావిస్తారు. ఉపవాస దీక్ష ద్వారా మరణం పొందడం జైన మతంలో ఒక సాంప్రదాయం. దాన్ని ‘సంథారా’ అంటారు. రాజస్థాన్ హైకోర్టు ఈ సాంప్రదాయాన్ని నేరపూరిత చర్యగా పరిగణించడం సరికాదన్న అభిప్రాయాన్ని సుప్రీం ధర్మాసనం వ్యక్తం చేసింది. హైకోర్టు ఈ నిర్ధారణకు వచ్చేముందు జైన మత గురువులు, మత పెద్దల అభిప్రాయం తీసుకుని వుండాల్సిందని పేర్కొన్నది. ఒక మతాచారం కనుక సర్వోన్నత న్యాయ స్థానం ఈ విషయంలో ఇటువంటి నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు. ఒక పక్క లా కమిషన్ మరణశిక్షను రద్దు చేయాలని సిఫారసు చేస్తే మరోపక్క స్వచ్చంద మరణాలకు మతాచారం ప్రాతిపదికగా సుప్రీం పచ్చ జెండా ఊపడం ఒకే రోజున జరగడం కాకతాళీయం కావచ్చు. 

ఈ స్వచ్చంద మరణాలు మనకు భీష్ముడి కాలంనుంచి ఎరుకే. పూర్వం యుద్ధాల్లో రాజపుత్ర సంతతికి చెందిన రాజులు వీరమరణం చెందినప్పుడు, రాణీవాసపు స్త్రీలు పరాయి మూకల చెరలో చిక్కకుండా చితి పేర్పించుకుని ఆత్మాహుతి చేసుకున్న సందర్భాలు చరిత్ర పుటల్లో కానవస్తాయి. ఆత్మగౌరవం నిలుపుకోవడం కోసం ప్రాణ త్యాగాలు చేసిన సంఘటనలు రోమన్ చరిత్రలో కూడా వున్నాయి. యుద్ధంలో మరణం అనివార్యం అని భావించినప్పుడు రోమన్ సైనికులు తమకు తాముగా ప్రాణాలు తీసుకునే వాళ్ళు. 

జపాన్ లో ఓ సాంప్రదాయం వుండేది. దాన్ని ‘హరకిరి’ అంటారు. ‘హరాకిరీ’ అనేవాళ్ళు కూడా వున్నారు. సమాజంలో కులీన కుటుంబాలకు చెందిన వాళ్ళు రాజాగ్రహానికి గురై, మరణశిక్ష పడ్డప్పుడు, ఆ అవమాన భారం భరించ లేక, తమకు తామే ఈ శిక్ష విధించుకుని ప్రాణాలు తీసుకునేవారు. జపానీయుల భాషలో ’హర’ అంటే ‘పొట్ట’. ‘కిరి’ అంటే కోసుకోవడం. పేగులు చీల్చుకునేలా పొట్టను కోసుకుని ఆత్మహత్య చేసుకోవడాన్ని ‘హర కిరి’ అంటారు. కాలక్రమంలో ఈ పదాలకు అర్ధం మారిపోయింది. ఆత్మహననాలకు, ఆత్మహత్యలకు ఇప్పుడిది పర్యాయపదం అయింది.

విదేశాల్లో కొన్ని క్రైస్తవ మఠాలకు సంబంధించిన సన్యాసులు నేల మాళిగల్లో వుండిపోయి సమాధి స్తితికి చేరుకునేవారు. 

ఈ రకంగా ప్రాణాలు తీసుకోవడం అనేది మన దేశంలో పూర్వం నుంచి మహా పాపంగా పురాణాలు, ఇతిహాసాలు పేర్కొంటున్నాయి. అకాల మరణం లేని దీర్ఘాయువు కోరుకోవడం ‘చమకం’ లో వుంది. ‘జీవంతు శరదాం శతం’ అంటే వందేళ్ళు బతకాలని కోరుకునే వారు. ఆశీర్వచనాల్లో కూడా ‘ ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధిరస్తు’ అంటూ ఆయువుకే మొదటి పీట. 

బలవంతంగా ప్రాణం తీసుకున్న సంఘటనలు విన్నప్పుడు మనస్సు చివుక్కు మంటుంది. ప్రాణం ఉన్నంతవరకు జీవించాలి కాని, ప్రాణం తీసుకుని ఉసురు తీసుకోవడం ఏరకంగా చూసినా సమర్ధనీయం కాదనిపిస్తుంది. 

నిజానికి ప్రాణత్యాగం అనేది మామూలు విషయం కాదు. అందుకే శత్రువులనుచి రహస్యాలు రాబట్టేవారు అంతిమంగా ‘ప్రాణాలు దక్కవంటూ’ హెచ్చరించడం అనేక సినిమాల్లో సాధారణం. 

లక్ష్యం యెంత ఉన్నతమైనదైనా దాన్ని సాధించి తీరడానికి బతికి వుండాలి కాని, ఆ క్రమంలో నిండు ప్రాణాలు తీసుకోవడం వల్ల ఆ లక్ష్య సాధనను కళ్ళారా చూసే మహత్తర అవకాశాన్ని చేజేతులా కోల్పోతారు. 

కాబట్టి ఆత్మహత్య అనేది తుట్టతుది మార్గం కూడా కాదు. అసలది మార్గమే కాదు.

తోకటపా: ఎల్లాగు ఇందులో జైనుల ప్రసక్తి వచ్చింది కాబట్టి వారికి సంబంధించిన ఒక అంశంతో దీన్ని ముగిస్తాను.

పూర్వం కార్డులు, కవర్లు రాజ్యమేలే రోజుల్లో రాసుకునే ప్రతి ఉత్తరం ‘తప్పులున్న క్షమించగలరు’ అనే అభ్యర్ధనతో ముగిసేది.

సంఘజీవనంలో తెలిసో, తెలియకో, మాటలతోనో, చేతలతోనో సాటివారిని నొప్పించడానికి అవకాశాలెక్కువ. అందుకే, నాగరీకం బాగా ముదిరిన ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు , రోజువారీగా అనేక పర్యాయాలు ‘సారీ’ అనే పదాన్ని ఉదారంగా వాడుతుంటారు. అలాగే రష్యన్లు కూడా మాట మాట్లాడితే ‘ఇజ్వెనీచ్ పజాలుస్త’ (సారీ ప్లీజ్) అంటారు. అసలు క్షమించమని కోరడం, క్షమాగుణం కలిగివుండడం భారతీయ సంప్రదాయాల్లో భాగం. కానీ అన్ని సంప్రదాయాల్లాగే ఇదీ కాలక్రమేణా కనుమరుగు అవుతోంది. కాకపోతే, కాలు తొక్కి ‘సారీ’ చెప్పేవాళ్ళ సంఖ్య మాత్రం పెరుగుతోంది.

చర్చికి వెళ్లి కన్ఫెషన్ బాక్స్ లో నిలబడి, చేసిన తప్పులను దేవుడికి నివేదింఛి, క్షమాపణలు కోరే సంప్రదాయం క్రైస్తవుల్లో వుంది.

క్షమాపణలు అర్దించే ఒక విధానం  జైన మతంలో కూడా వుంది. దీని వాళ్లు ‘మిచ్చామి దుఖఃడం’ అని పిలుస్తారు. భాద్రపద మాసం నాలుగో రోజు అంటే వినాయక చవితి రోజున జైన మత విశ్వాసులు దీన్ని పాటిస్తారు. ‘మిచ్చామి దుఖఃడం’ అనేది ప్రాకృతంలో ఒక పదబంధం.

'మిచ్చామి' అంటే మరచిపోవడం, మన్నించడం అని అర్ధం.

'దుఖఃడం' అంటే దుష్కృత్యాలు. చేసిన చెడ్డ పనులు అని తాత్పర్యం. 

జైనులు ప్రాయూషణ పర్వ కాలంలో ఎనిమిదో రోజున, భాద్రపద శుద్ద చవితి నాడు ఒకరికొకరు ‘నేను చేసిన తప్పులను మన్నించండి’ అని మనవి చేసుకుంటారు. అంతకు ముందు ఏడాది కాలంలో తాము ఇతరులపట్ల చేసిన అపరాధాలకు క్షమాపణలు అర్ధిస్తారు. ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా ఈ తంతు కొనసాగుతుంది. 

మంచి ఆచారం కదా!




21, మార్చి 2023, మంగళవారం

నేర్చుకోవాల్సింది చాలావుంది

 నిజమే. డెబ్బయ్ ఏడేళ్ల వయస్సులో కూడా నేర్చుకోవాల్సింది చాలావుంది, అదీ నిత్య జీవితంలో తారసపడుతున్న  చాలామంది చిన్నవాళ్ల నుంచి. గౌతమ్ రావూరి (Goutam Ravuri) ని మొన్న  మొదటిసారి ప్రసాద్ ప్రీ వ్యూ ధియేటర్లో కలిసినప్పుడు ఈ విషయం నాకు మరోసారి ధృవపడింది.

ఆయన చదివిన చదువేమిటి, చేస్తున్న ఉద్యోగం ఏమిటి, రాస్తున్న రాతలేమిటి? ఏమిటో ఏమీ అర్ధం కాలేదు ముందు.

ఈనాటి తలితండ్రులు పిల్లల నుంచి కోరుకునే చదువే  చదివాడు. తలితండ్రులు ఆశించే చక్కటి కంప్యూటర్ కొలువు చేస్తున్నాడు. ఆ వయసు కుర్రాళ్ళు, పేరొందిన  ఎం ఎన్ సీలో ఉన్నతోద్యోగం చేస్తున్న పిల్లలు  క్లబ్బులు అంటారు, పబ్బులు అంటారు. కానీ ఈ కుర్రాడు, నా పిల్లల కంటే వయసులో చాలా చాలా చిన్నవాడు గౌతమ్ తరహానే వేరు. వాళ్ళ నాన్నగారు ప్రసాద్ గారు కూడా నా లాగే జర్నలిస్టు కుటుంబం నుంచి వచ్చిన వారే. తండ్రీ కొడుకు ఇద్దరి పోలికలు ఒకటిగా వుండవచ్చు కానీ అభిరుచులు, హాబీలు  ఒకటిగా వుండడం చాలా అరుదు. వీరిద్దరి విషయంలో ఆ అరుదైన విషయం సాధ్య పడింది. సమయం దొరికింది అంటే చాలు వీరిద్దరూ కలిసి వెళ్ళేది బార్లకు కాదు, బలాదూరు తిరుగుళ్ళకు కాదు. మార్నింగ్ షో సినిమాలకి. అర్ధరాత్రి దాకా నైట్ డ్యూటీ చేసి వచ్చి మళ్ళీ తెల్లవారడం తడవు మార్నింగ్ షోకి తయారవడం గౌతమ్ తల్లి గారి తల్లి మనసుకు అంతగా నచ్చక పోయినా, కుమారుడి, పెనిమిటి అభిరుచులకు అడ్డం చెప్పేవారు కాదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ సినిమాలో మంచి చెడులు క్షుణ్ణంగా చర్చించుకోవడం చూసి ముచ్చట పడేవారు. చూసే సినిమాల్లో సింహభాగం తెలుగు తెర కొదమసింహం చిరంజీవి సినిమాలే. వాటిని ఏ పరిస్థితిలోనూ మిస్సయ్యే అవకాశమే లేదు. చిరంజీవి సినిమాలన్నా, చిరంజీవి అన్నా ప్రాణం పెట్టే కోట్లాది మంది యువకుల్లో గౌతమ్ ముందు వరసలో వుంటారు. చూసిన చిరంజీవి సినిమా గురించి ఇంటికి వచ్చి సమీక్షించుకోవడం మాత్రమే కాదు ఆ భావాలను అక్షరీకరించి, కంప్యుటీకరించి సాంఘిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం గౌతమ్ కు హాబీ అనాలో, వ్యసనం అనాలో తెలియదు.  ఫేస్ బుక్ రాతల ద్వారా పరిచయం అయి, ముఖతః కలుసుకోకపోయినా, మొన్న రంగమార్తాండ ప్రీ వ్యూ లో కనపడి పరిచయం చేసుకున్నప్పుడు, నన్ను మన్ననగా పలకరించిన తీరు గమనించి అతడి వినయ సంపదకు విస్తుపోయాను. సినిమా అయిపోయిన తర్వాత అతడి కారులో నన్ను ఇంటి వద్ద దింపినప్పుడు , ఒక్క క్షణం అంటూ,  మరుక్షణం ఒక పుస్తకం నా చేతిలో పెట్టాడు. ముఖచిత్రం మీద పునాది రాళ్లు - రావూరి గౌతమ్ అని వుంది. నాకు పుస్తకం ఇస్తున్నట్టు దిగిన ఫోటో కాకుండా విడిగా ఇద్దరం వున్న ఫోటో అడిగి తీసుకున్నాడు. నేను అర్జంటుగా మరో పని మీద వెళ్ళాల్సి రావడం వల్ల, అతడిని ఇంట్లోకి పిలిచే మర్యాద చేయలేకపోయాను.

నిన్నకాక మొన్న పరిచయం అయిన వ్యక్తి గురించి ఇన్ని విషయాలు ఎలా తెలుసు అనే సందేహం ఎవరికయినా కలిగితే దానికి సమాధానమే ఈ పుస్తకం. ఈ విషయాలు అన్నీ అందులోనివే. అప్పటివరకు వృత్తి జీవితంలో తారసపడే అనేకమందిలో గౌతమ్ కూడా ఒకడు అనుకున్నా. చదివిన తర్వాత గౌతమ్ స్థాయి ఎలాటిది అనే సత్యం అవగతమైంది.

ఎదుగుతున్న వయసులో వివిధ దశల్లో చిరంజీవితో దిగిన ఫోటోలు చూస్తే బుగ్గల మీద గిల్లితే పాలుకారుతాయేమో అనిపించే నూనూగు మీసాల  నూత్న యవ్వనం నుంచి ప్రపంచాన్ని చదివిన అనుభవశాలిగా గంభీరంగా వుండే గౌతమ్ కనిపిస్తాడు. సినిమా పిచ్చి అంటే సినిమాల్లో నటించాలనే పిచ్చి కాదు, సినిమాలు అదేపనిగా చూసే పిచ్చితో పెరిగిన  పిల్లలు, నిజజీవితంలో దారితప్పుతారేమో అనే నా వంటి సందేహాత్మకుల కళ్ళు తెరిపిళ్ళు పడేలా సాగింది ఈ పుస్తకం.

చిరంజీవికి వీరాభిమాని అయినప్పటికీ, ఆయన సినిమాల గురించి రాసిన ఈ పుస్తకంలో ఎలాంటి శషభిషలు లేకుండా, అనవసర అభిమానపు ఛాయలు పడకుండా  సమీక్షలు చేయడం అనేది రచయితగా గౌతమ్ రావూరి పరిణతికి నిదర్శనం.

పుస్తకం చివర్లో :

“ఇది ఇంటర్వెల్....మరిన్ని చిరంజీవి సినిమాలతో ....పునాది రాళ్లు – 2- పేర మరో సంపుటి రాయాలన్నది నా ఆకాంక్ష అని ముగింపు ప్రకటన చేశారు.

ఈ పుస్తకం చదివిన ప్రతివారూ గౌతమ్ ఆకాంక్ష నెరవేరాలనే కోరుకుంటారు.

కుమారుడిని ఆదర్శంగా పెంచిన గౌతమ్ తలితండ్రులు పార్వతి గారు, ప్రసాద్ గారు ధన్యులు, ఆదర్సనీయులు.






(21-03-2023)            

20, మార్చి 2023, సోమవారం

విషాద సందర్భంలో అపూర్వ కలయిక – భండారు శ్రీనివాసరావు

 IAS, IPS మాదిరిగానే IIS (Indian Information Service) కూడా ఒక ఆలిండియా సర్వీసు. ఈ సర్వీసు వాళ్ళు మొత్తం దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి వుంటుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఫీల్డ్ పబ్లిసిటీ, ఆలిండియా రేడియో, దూరదర్సన్, ఫిలిమ్స్ డివిజన్, యోజన సాంగ్ అండ్ డ్రామా మొదలైన అనేక విభాగాల్లో ఈ సర్వీసు అధికారులు పనిచేస్తుంటారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వుంటాయి.

కింది చిత్రంలో కనిపించేవారు అందరూ సీనియర్ అధికారులుగా దశాబ్దాల తరబడి పనిచేసి ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్నారు. ఇందులో నేను కూడా వున్నాను. వయసులో తప్ప మిగిలిన వాళ్ళు అందరూ నాకంటే అన్నింటా మిన్న. వీరిలో చాలామందితో కలిసి పనిచేసే అవకాశం నాకు దక్కింది.

ఇటీవల మాబృందంలో ఇద్దరు, ఆర్.ఆర్.రావు గారు, అబిద్ సిద్దికి గారు ఆకస్మికంగా మరణించారు. వారి సంస్మరణ సభ బన్సీలాల్ పేట లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం లోని పి.ఐ.బి. కాన్ఫరెన్స్ హాలులో ఈరోజు సోమవారం సాయంత్రం జరిగింది.

కింది ఫోటోలో: ఆర్వీవీ కృష్ణా రావు, నేను, సి.జి.కె మూర్తి, ఎం.వి.ఎస్.ఎస్. మూర్తి, ఖాన్ షకీల్, సురేంద్రబాబు, వేదగిరి విజయ కుమార్, వెంకటప్పయ్య, బాఖర్ మీర్జా 



(20-03-2023)       

రంగమార్తాండ – భండారు శ్రీనివాసరావు

 ఎప్పుడో యాభయ్  ఏళ్ళకు పూర్వం బెజవాడ ఆంధ్రజ్యోతిలో పనిచేసేటప్పుడు సినిమా ప్రీ వ్యూ (PREVIEW) లకు వెళ్ళే వాడిని. జ్యోతి వార పత్రిక ఎడిటర్ పురాణం సుబ్రమణ్య శర్మగారు వీటిని ఫ్రీ వ్యూ (FREE VIEW) లు అని చమత్కరించేవారు.

మొన్న ఫేస్ బుక్ మితృలు, రచయిత, చిత్రకారులు అయిన లక్ష్మీ భూపాల్ గారు రంగ మార్తాండ ప్రీ వ్యూ కి ఆహ్వానించారు. సినిమాలు చూసే అలవాటు చిన్నప్పుడు అందరిలాగే నాకూ వుండేది. క్రమంగా ఉద్యోగం, సాయంకాలక్షేపాలతో సమయం కుదించుకు పోయి, సినిమాలు చూడడం తగ్గిపోయింది. అయినా మిత్రులను కలవడానికి మంచి అవకాశం అని వెళ్లాను. వెళ్లక పొతే ఒక మంచి సినిమా చూసే అవకాశం తప్పిపోయేది కూడా.

ప్రసాద్  ప్రీవ్యూ ధియేటర్ కి వెళ్ళిన తర్వాత తెలిసింది,  సినిమా రంగ మార్తాండ,  దర్శకుడు కృష్ణ వంశీ అని. కృష్ణ వంశీ గారి కొన్ని చిత్రాలు గతంలో నేను థియేటర్లలో చూశాను. చందమామ సినిమా చూసిన తర్వాత అమ్మయ్య వీరి పేరు కనబడితే ఇక ఆ సినిమా నిశ్చింతగా చూడవచ్చు అనే భరోసా కలిగింది. రంగ మార్తాండ సినిమాలో చాలా నచ్చిన అంశాలు, కొద్దిగా కొన్ని నచ్చని సీన్లు వున్నాయి. (ప్రకాష్ రాజ్ ని ఉద్దేశించి  బ్రహ్మానందం తరచుగా అనే మాటలు లాంటివి).   కళ్ళనీళ్ళు ఆపుకోలేరు అని ఈ సినిమా నాకంటే ముందు చూసిన వాళ్ళు కొందరు రాసేసారు. దాంతో కృష్ణ వంశీ గారి ట్రేడ్ మార్క్ అయిన సునిశిత హాస్యం కనిపించదేమో అని సందేహం కలిగింది.

బ్రహ్మానందం వున్నారు కదా పర్వాలేదు అని సర్ది చెప్పుకున్నాను. కానీ కృష్ణ వంశీ గారు ఆయన్ని, ఆహార్యంతో సహా  పూర్తిగా  విభిన్నంగా చూపారు. ఆయన ఏడుస్తూ జనాలను ఏడిపిస్తూ నవ్వించిన తీరు అమోఘం. రంగ మార్తాండ రాఘవరావుగా ప్రకాష్ రాజ్  తన డైలాగులతో దున్నేసారు. వాటికి యువ ప్రేక్షకులు కనెక్ట్ అయితే మాత్రం, ఈ సినిమాకు పట్టపగ్గాలు వుండవు. నాటకాలు అంటే ఏమిటి అనే యువత జీవిస్తున్న ప్రస్తుత సమాజంలో నాటకాలని ప్రధాన వస్తువుగా తీసుకుని ధైర్యంగా  తీసిన సినిమా ఇది. వెంటనే శంకరాభరణం గుర్తుకు వచ్చింది. ఆనాటి యువతీ యువకులు అప్పుడే రిలీజ్ అయిన ఆకలి రాజ్యం సినిమాని మించి, సంగీత ప్రధానంగా వచ్చిన శంకరాభరణం సినిమాని నెత్తిన పెట్టుకున్నారు. రంగమార్తాండ కూడా అదే కోవలోకి చేరుతుందని సినిమా చూసిన తర్వాత అనిపించింది. సినిమాలో మరికొన్ని పాత్రల్లో నటించిన నటీనటులు వాళ్ళ కోసమే ఆ  పాత్రలు సృష్టించారా అన్నట్టు వాటిల్లో సహజంగా ఒదిగి పోయారు. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. ముఖ్య తారాగణంతో పాటు వారూ ప్రశంసలకు అర్హులే. ఇక రమ్యకృష్ణ గారు.

తొంభయ్యవ దశకంలో నేను  మాస్కోలో రేడియో మాస్కోలో పనిచేసిన అయిదేళ్లు ఒక పాటని తప్పకుండా వేసేవాడిని. విశ్వనాధ్ గారి సూత్రధారులు సినిమాలో జోలా జేజోలా అని రమ్య కృష్ణ పాత్రధారి చేత పాడించిన పాట అది.

అందరూ తమ నటనతో చెరిగిపారేస్తే, రమ్యకృష్ణ నటించకుండా చిత్రాన్ని పై మెట్టులో నిలబెట్టారు. పాత్రలో జీవించారు అనే ప్రశంస కూడా చిన్నదే అవుతుంది. అసలు డైలాగులే తక్కువ. అవన్నీ ప్రకాష్ రాజ్ కోటాలోకి వెళ్లిపోయాయి. ఒక తల్లిగా అవధులు దాటని పాత్ర పోషిస్తూ, ఉన్నట్టుండి భార్య పాత్రలో ఒక సందర్భంలో ఆమె ప్రదర్శించిన  హావభావాలను చూసిన తర్వాత ఆమెకు ఏ అవార్డు ఇచ్చినా తక్కువే అనిపించింది. భర్తను కూతురే దొంగ అన్నప్పుడు నాన్నను దొంగ అంటావా అంటూ రౌద్రంగా చూసిన చూపుకు ఆ కూతురు పాత్రధారి మాడి మసై పోతుందేమో అన్న భావన కలిగింది. ఏదో పల్లెటూరులో రచ్చ బండ మీద చెట్టు నీడలో కళ్ళు మూసుకుని కన్ను మూసిన తీరు క్లియో పాట్రాని గుర్తు చేసింది. నుదుట కుంకుమ మెరుస్తూ వుంటే తల కింద చేయి పెట్టుకుని ఓ అందాల దేవత ప్రశాంతంగా  నిద్రిస్తున్నదా అనిపించింది.

రంగమార్తాండ చిత్రానికి పూర్తి మార్కులు వేయాల్సి వస్తే, కృష్ణ వంశీ తర్వాత ఆ అర్హత వున్నది  రమ్యకృష్ణకే.

ఈ చిత్రాన్ని టిక్కెట్టు కొనుక్కుని థియేటర్ లో చూడాలి అనుకుంటే మాత్రం ఆమె అద్భుతమైన నటన కోసమే చూడాలి.

ఈ సినిమా చూడడానికి దోహద పడ్డవారు ఎంతోమంది

వున్నా ముందు థాంక్స్ చెప్పుకోవాల్సింది. లక్ష్మీ భూపాల గారికి.



(పై ఫోటోలో ఎడమనుంచి కుడికి: లక్ష్మి భూపాల, నేను, కృష్ణ వంశీ, శివ రాచర్ల)



(19-03-2023)

                 

19, మార్చి 2023, ఆదివారం

శ్రమజీవికి ఎంత కష్టం! ఎంత కష్టం!! – భండారు శ్రీనివాసరావు

 

(Published in Andhra Prabha today, 19-03-2023, SUNDAY)
ఈ కధనానికి ఓ నేపధ్యం వుంది. తర్వాత చెబుతాను.
కొన్నేళ్ళ క్రితం మేము అద్దెకు వుంటున్న మా అపార్ట్ మెంటుకు ఐమూలగా ఓ ఖాళీ స్థలం వుండేది. కొద్ది రోజుల్లోనే అక్కడ ఇంటి నిర్మాణం మొదలు పెట్టారు. హైదరాబాదులాంటి నగరంలో ఇది కొత్త విషయం ఏమీ కాదు. కానీ కొత్తగా ప్రస్తావించుకోవడానికి కొత్త నేపధ్యం ఒకటి కలిసి వచ్చింది. కరెంటు లేకపోవడం వల్ల ఎండగాలో వడగాలో ఏదో ఓ గాలి వస్తే చాలనుకుని పడక గది కిటికీ తెరిచాను. ఆర్నెల్ల కిందట ఆకారం కూడా లేని ఆ నిర్మాణం చిత్రంగా రెండంతస్తులు లేచింది. మూడోదానిమీద పిల్లర్లు వేస్తున్నారు. ఓ యాభయ్ అరవై మంది కూలీలు ఆడా మగా సుశిక్షితులయిన సైనికుల మాదిరిగా నిర్విరామంగా ఆ ఎర్రటి ఎండలో పనిచేస్తున్నారు. కొందరు కంకర ఎత్తి పోస్తుంటే మరికొందరు ఇసుక, సిమెంటు కొలిచి గుండ్రంగా తిరుగుతున్న ఓ మిక్సింగ్ యంత్రంలో పోస్తున్నారు. అలా తయారయిన కాంక్రీటును ఓ చిన్న లిఫ్ట్ లాంటి యంత్రం మూడో అంతస్తుకు చేరుస్తోంది. అక్కడ దాన్ని దించుకున్న కూలీలు బొచ్చెల్లో తీసుకు వెళ్ళి పిల్లర్లను నింపుతున్న కూలీలకు అందిస్తున్నారు. అంతా ఒక క్రమపధ్ధతి ప్రకారం జరిగిపోతోంది. బోలెడు కష్టపడిపోతున్న ఫీలింగు కూడా వారిలో వున్నట్టు దూరం నుంచి గమనిస్తున్న నా దృష్టికి ఆనలేదు. సరిగ్గా వొంటిగంట కాగానే గంట కొట్టినట్టు పనులు ఆగిపోయాయి. ఎవరికి వారు అక్కడ డ్రమ్ముల్లో వున్న నీళ్ళతో మొహం కాళ్ళూ చేతులూ కడుక్కుని, ఇళ్లనుంచి క్యారేజీల్లో తెచ్చుకున్న భోజనాలు చేశారు.
ఈ లోగా మా ఇంట్లో కరెంటు వచ్చింది. ప్యాను తిరిగింది. వొళ్ళు చల్లబడింది. కానీ ఎర్రటి ఎండలో కూలీల చుట్టూ తిరిగొచ్చిన మనసు మాత్రం ఇంకా వేడిగానే వుంది. ఆవిర్లు కక్కుతూనే వుంది.
అసలు విషయం ఇప్పుడు విప్పుతాను. మొదట్లో నేపధ్యం ఒకటుంది అని చెప్పాను గుర్తుంది కదా! అదే ఇది.
నగర విస్తరణలు అభివృద్ధిలో భాగం. రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు అభివృద్ధి సూచికల్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. తక్కువ వ్యవధిలో ఎక్కువ సంపాదనకు అవకాశం ఉన్న వ్యాపారరంగం కావడంతో అవినీతిలో అభివృద్ధి కూడా దినదినాభివృద్ధి చెందుతోంది. ఎన్ని నియమాలు, కఠినతర నిబంధనలు, చిత్తశుద్ధి కలిగిన అధికార యంత్రాంగం ఉన్నప్పటికీ, అనుమతుల మంజూరీలో డబ్బులు చేతులు మారక తప్పని పరిస్థితే వుంది. రాత్రికి రాత్రే కోట్లకు పడగలు ఎత్తగల అవకాశాలు పుష్కలంగా ఉన్న రంగం కనుక రియల్టర్లు కొల్లలుగా పుట్టుకు వచ్చారు. అత్యధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించే రంగం కావడం, పెట్టుబడికి మించి ఇబ్బడి ముబ్బడి లాభాల పంట పండించే వీలుసాళ్ళు అపారంగా వుండడం వంటి కారణాలతో రియల్ ఎస్టేట్ రంగం మూడు పువ్వులు, ఆరుకాయలుగా విలసిల్లుతున్న మాట కూడా నిజం. పెద్ద మొత్తాల్లో ఆర్జనకు అవకాశాలు వుంటాయి కనుక ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా అదే స్థాయిలో వుండడం సహజం. పైగా రాజకీయుల వత్తాసు కారణంగా అక్రమ నిర్మాణాలు ఏ నగరంలో చూసినా పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్నాయి. ఇవన్నీ చక్కటి నగర శోభను మటుమాయం చేస్తున్నాయి. విదేశాల్లో స్థిరపడిన ప్రవాసులు స్వస్థలాలకు తిరిగి రావడానికి ఇచ్చగించకపోవడానికి గల కారణాల్లో ఇదొకటి. కాబట్టి అక్రమ భవన నిర్మాణాలకు అడ్డుకట్ట వేసే ఎలాంటి ప్రయత్నాన్ని అయినా సామాన్య ప్రజలు హర్షిస్తారు, స్వాగతిస్తారు. సందేహం లేదు.
ఈ సమస్య ఏ ఒక్క హైదరాబాదుకు లేక ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు మాత్రమే పరిమితం కాదు. పల్లెలు పట్టణాలుగా, పట్టణాలు నగరాలుగా, నగరాలు విశ్వ నగరాలుగా మార్పు చెందడం అనేది పరిణామ క్రమంలో భాగం. అయితే ఇదంతా ఒక పద్దతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం జరిగినప్పుడే అది సరైన అభివృద్ధి అవుతుంది. ఇందుకోసమే ప్రతి పట్టణంలో ప్లానింగ్ విభాగాలు ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం భవన నిర్మాణాలు జరిగేలా కనిపెట్టి చూడడం ఈ విభాగాల విధి. అయితే నిర్మాణాలు పూర్తయిన తర్వాత వాటికి ఏదో ఒక పేరుతొ నిర్మాణ అనుమతులు పొందడం సాధ్యం అయ్యే పరిస్థితులను అలాంటి రియల్టర్లు చక్కగా ఉపయోగించుకోవడంతో వీటికి అడ్డూ అదుపూ లేకుండా పోతున్న మాట కూడా వాస్తవం.
మరో పక్క, అక్రమ నిర్మాణాల పేరుతొ పెద్ద పెద్ద భవనాలను కూల్చివేస్తున్న వార్తలు తరచుగా వింటుంటాము. నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి నిర్మాణాలను అనుమతించకూడదని నమ్మే వారిలో నేనూ వున్నాను. అక్రమ కట్టడాలను తొలగిస్తున్న ఫోటోలను పత్రికల్లో చూసినప్పుడు, ఇదిగో ఇప్పుడు చెప్పానే, మా ఇంటి దగ్గర నిర్మాణంలో వున్న ఇంటికంటే అవి చాలా పెద్దవిగా అనిపిస్తుంటాయి. ఆరునెలల నుంచి కడుతున్నా ఇది ఇంకా పూర్తి కాలేదు. అలాటిది ఆ కూల్చేసిన ఇళ్ళను కట్టడానికి కనీసం ఏడాది, రెండేళ్లు అయినా పట్టి వుంటుంది. అన్నాళ్ళు అధికారులు, అనుమతులు లేకుండా జరుగుతున్న ఆ నిర్మాణాలను గమనించలేదా! లేదా కళ్ళుండి కూడా నేను గమనించనట్టు వాళ్ళూ చూడలేదా! ఒక్క ఇల్లు కట్టడానికే ఇంతమంది ఇంతటి ఎండాకాలంలో తమ రక్త మాంసాలను ఫణంగా పెట్టి ఎంతో శ్రమ పడుతున్నారు. ఇసుక సిమెంట్ కంకరతో పాటు వారి స్వేదం కూడా ఆ నిర్మాణం అణువణువులో వుంది. ఎంతో కష్టపడి కట్టిన ఇళ్లను ఏమాత్రం కష్టపడకుండా యంత్రాల సాయంతో కూల్చివేయడం ఏం న్యాయం? ఎలాటి న్యాయం అనిపించుకుంటుంది. అంత డబ్బుకు, అది ఎవరిదయినా కావచ్చు పూర్తిగా నీళ్లు వొదులుకున్నట్టే కదా! ఇన్నాళ్ళు అనుమతి లేని నిర్మాణాలను కాసులకు కక్కుర్తిపడి అనుమతిస్తూ వచ్చిన అధికారులను, సిబ్బందిని వారు ఎవరయినా సరే, వారి వెనుక ఎవరు వున్నా సరే, కనీసం ఓ యాభయ్ మందిని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాలనుంచి ఉన్నపెట్టున శాశ్వతంగా తొలగిస్తే మళ్ళీ ఇలాటి నిర్మాణాలు జరుగుతాయా! ఆ మాత్రం భయం వారిలో కలిగించడం సర్కారు తలచుకుంటే సాధ్యం కాదా!
కొన్నేళ్ళ క్రితం, మీడియాలో స్క్రోలింగులు చకచకా పరుగులు తీసాయి.
హైదరాబాదు పొలిమేరల్లో మల్లంపేట చెరువులో అక్రమనిర్మాణాలు. ఏకంగా 260 ఖరీదైన విల్లాలు. రాత్రికి రాత్రే సాధ్యం అయ్యే నిర్మాణ వ్యవహారం కాదు. విషయం బయటకి పొక్కడంతో వాటిల్లో 120 విల్లాలను అధికారులు సీజ్ చేశారు. మీడియా ఈ విషయాన్ని ఎత్తి చూపింది. వాటిని ఏం చేస్తారు. కూల్చేస్తారా! ఏం చేశారన్నవిషయంలో తర్వాత మీడియా కూడా పట్టించుకున్నట్టు లేదు. అందుకు సంబంధించిన ఎలాంటి వార్తా లేదు. స్వాధీనం చేసుకున్నారు సరే! వాటిని ఏం చేశారు? కూల్చివేతే తుది పరిష్కారమా! వాటిని కట్టడానికి అయిన వ్యయం, వాటిని నిర్మించడానికి వేలాదిమంది కార్మికులు అహోరాత్రులు పడిన శ్రమ బూడిద పాలేనా! ఇలాంటి సంఘటనలు దేశ వ్యాప్తంగా లెక్క వేస్తే ఆ నష్టాన్ని అంకెల్లో లెక్కపెట్టడం కుదిరే పనేనా! కట్టడానికి ముందే కట్టకుండా చర్యలు తీసుకునే విధానం వుంటే అసలు నిర్మాణాలను కూల్చే అవసరమే రాదు కదా!
ఆ స్థాయిలో భారీ నిర్మాణాలు పూర్తయ్యేవరకు అంతకాలం కళ్ళు మూసుకున్న వారిపై చర్యలు ఉండవా!
ఉంటాయో ఉండవో తెలియదు కానీ ఈ ప్రశ్నలకు జవాబులు వుండవు.
అయితే, సిబ్బంది కొరత అనే సమాధానం మాత్రం సిద్ధంగా వుంటుంది.











(19-03-2023, SUNDAY)

16, మార్చి 2023, గురువారం

60-77-78

 ‘శ్రీనివాసరావు గారు. కాలేజీలో కానీ స్కూల్లో కానీ నాటకాలు వేసిన అనుభవం ఉందా”

సత్యం వేమూరి గారు హఠాత్తుగా ఈ ప్రశ్న వేయడంతో ఏం చెప్పాలో ఓ క్షణం అర్ధం కాలేదు.

ఆయనే అన్నారు, నా అవస్థ చూసి.

‘లోగడ అనుభవం వున్నా లేకపోయినా, ఈరోజు కొంచెం మీ నటన మాకు చూపాలి. ఏం లేదు, మీ ముందు పెట్టిన టిఫిన్ లాంటి తినుబండారాలను తింటున్నట్టు నటిస్తే చాలు

అప్పుడు కానీ విషయం బోధపడలేదు.

ఆయనలోని స్పాంటేనియస్ హ్యూమర్ కి ఇది ఒక మచ్చు తునక.

ఈ రోజు ఉదయం ఫోన్ చేశారు.

‘అమెరికా నుంచి మన ఫేస్ బుక్ మితృలు  శ్రీనివాస్ సత్తిరాజు ఫోన్ చేసి మా ఇంటికి వస్తామన్నారు. మీ ఫోన్ నెంబరు తెలియక మీకు చెప్పమని కూడా నాతొ చెప్పారు. మా ఇంటికి దగ్గరే కనుక మీకు ఏ టైం ఫ్రీ నో చెబితే వచ్చి కలుస్తామని అన్నారు సత్యం గారు.

శ్రీనివాస్ ఫేస్ బుక్ లో చాలా ఆక్టివ్ గా వుంటారు. పోస్టుల ద్వారా బాగా తెలిసిన మనిషి.

‘మళ్ళీ విడిగా ఎందుకు. మీకు అభ్యంతరం లేకపోతె నేనే మీ ఇంటికి వస్తాను. మా ఇంటి నుంచి కూత వేటు దూరమే కదా!’

అన్నట్టుగానే వారి ఇంటికి వెళ్లాను. కూత వేటు అంటే మెట్రో రైలు స్టేషన్ వారి ఇంటి పక్కనే వుంటుంది. రైలు కూతవేటు దూరం అన్నమాట.

వెళ్ళే సరికి సత్యం గారు, వారి శ్రీమతి, అమెరికా నుంచి వచ్చిన బాబీ అంటే శ్రీనివాస్ సత్తిరాజు గారు, సత్యం గారి  కుమారుడు బాబీ (ఆయన కూడా ఈ మధ్యనే అమెరకా నుంచి వచ్చారు) గ్రీన్ టీ, తినుబండారాలు సిద్ధం.

సరే! శ్రీనివాస్ గారు కబుర్ల పుట్ట. సత్యం గారు ఒక మాటతో ఆ పుట్ట తవ్వారు. ఇక కబుర్లే కబుర్లు.

చాలా సేపు కూర్చుని, కొంతసేపు తిన్నట్టు నటించి, టీ విషయంలో నటన తగ్గించి, ఆస్వాదిస్తూ గ్రీన్ టీ సేవించి ..

సత్తిరాజు శ్రీనివాస్ వాళ్ళ అక్కయ్య వాళ్ళ ఇంటికీ, నేను మా ఇంటికి.

వెళ్ళేటప్పుడు ఒంటరిగా, వచ్చేటప్పుడు చిరు చినుకులు నాకు తోడు.

కింది ఫోటో: (ఎడమ నుంచి కుడికి)

 భండారు శ్రీనివాసరావు అను నేను ( 77), శ్రీనివాస్ సత్తిరాజు ( 60 ), సత్యం వేమూరి గారు (78)

(బ్రాకెట్లలో వయసులుఅన్నమాట)   



16-03-2023