28, ఫిబ్రవరి 2022, సోమవారం

శివశంకర్ – ఓ జ్ఞాపకం

 


(ఫిబ్రవరి  27 వర్ధంతి)  

ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో రేడియో మాస్కోలో పనిచేయడానికి నిర్ణయం జరిగింది కానీ అందుకు సంబంధించిన ఉత్తర్వులు రావడంలో జాప్యం జరుగుతోంది.

విషయం తెలుసుకుందామని నేనూ, అప్పుడు రేడియో న్యూస్ ఎడిటర్ గా పనిచేస్తున్న ఆకిరి రామకృష్ణారావు గారు కలిసి ఢిల్లీ వెళ్లాం. ఏపీ భవన్ లో దిగి బ్రేక్ ఫాస్ట్ పూర్తిచేసుకుని ఆఫీసు పని వేళలకి ఇంకా కొంత సమయం ఉండడంతో అప్పుడు కేంద్ర మంత్రిగా వున్న శివశంకర్ ఇంటికి ఫోను చేసి వస్తున్నట్టు ఆకిరి చెప్పారు. ముందే కబురు చేయడం వల్ల సెక్యూరిటీ వాళ్ళు వెంటనే లోపలకు పంపారు. ముందు గదిలో శివశంకర్ కూర్చుని వున్నారు. మమ్మల్ని సాదరంగా పలకరించి వచ్చిన పని ఏమిటని వాకబు చేసారు. ఆకిరి సంకోచించకుండా నా మాస్కో ఆర్డర్లు లేటవుతున్నాయని చెప్పారు.

ఆయన వెంటనే రాక్స్ ఫోనులో (మాట్లాడే విషయాలు ఇతరులకు తెలిసే అవకాశం లేని ఫోన్లు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కొందరు కేంద్ర మంత్రులు, ముఖ్యమైన సీనియర్ అధికారుల ఇళ్ళల్లో మాత్రమే వుంటాయి) సమాచార శాఖ కార్యదర్శితో మాట్లాడి నా విషయం చెప్పారు. ఆయన పదిగంటలకు ఆఫీసుకు పంపించమని చెప్పారు.

ఢిల్లీ వచ్చిన పని అనుకోకుండా శివశంకర్ గారిని కలవడంతో పూర్తయింది. దాంతో ఆయనతో కాసేపు అవీఇవీ మాట్లాడి, ఆయన ఇచ్చిన కాఫీ తాగి బయట పడ్డాము. పది గంటలకల్లా శాస్త్రి భవన్ (సమాచార మంత్రిత్వశాఖ కార్యాలయం వుండే సదనం) చేరుకున్నాము. అక్కడ చాలా హడావిడిగా వుంది. హైదరాబాదు స్టేషన్ డైరెక్టర్ గా పనిచేసి ఢిల్లీలో సీనియర్ అధికారిగా పనిచేస్తున్న జీ. రఘురాంని (మా పెద్దన్నయ్య పర్వతాలరావుకి మంచి స్నేహితులు) కలుసుకున్నాము. ఆయన మమ్మల్ని చూస్తూనే ‘రండి రండి మీకోసమే చూస్తున్నాను, మీ ఆర్డరు రెడీగా ఉందంటూ చేతికి అందించారు.

ఆ రోజుల్లో ఢిల్లీ అధికార కారిడార్లలో శివశంకర్ గారి హవా అలా వుండేది.



 

27, ఫిబ్రవరి 2022, ఆదివారం

జగన్ అంటే మా ఆవిడకు పుత్ర వాత్సల్యం ఎందుకు?

 

దాదాపు నలభయ్ నిమిషాల నిడివి ఉన్న నా ఇంటర్వ్యూలో మా ఆవిడ ప్రసక్తి ఉన్న సుమారు  నలభయ్ సెకన్ల భాగాన్ని అమెరికానుంచి మా అన్నయ్య కుమారుడు  సాయి విడదీసి పంపించాడు. వాడికి నా కృతజ్ఞతలు  

Please CLICK on the below LINK


Bhandaru Srinivas Rao Exclusive Interview - About CM Jagan - YouTube

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర - పరిణామాలు

నా గురించి నా నోటితో (రెండో భాగం)

మర్యాదకు మంగళం – భండారు శ్రీనివాసరావు

 

(Published in Andhra Prabha on 27-02-2022, SUNDAY)

సహిష్ణుత’ మన దేశ సంస్కృతిలో భాగమని చెబుతారు. సహనశీలత శతాబ్దాల తరబడి దండలో దారంలాగా ఉంటూ వచ్చిందని విదేశీయులు సయితం కితాబులు ఇచ్చారు. కాలపరీక్షకు తట్టుకుని నిలిచిన ఈ దేశపు సహనశీలతకు కూడా తూట్లు పడుతున్నాయని ఇటీవలి పరిణామాలను గమనించినప్పుడు అనిపిస్తోంది. అందుకే, ‘ఇవ్వాళ దేశానికి బాగా అవసరమైనదేమిటి?’ అంటే, ‘కాసింత సహనం’ అని వాకృచ్చాడొక పెద్దమనిషి. సహన సంస్కృతికి పుట్టిల్లు అని చెప్పుకునే మన దేశానికి ప్రస్తుతం దాపురించిన దుస్తితి ఇది.

అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రచార యుద్ధంలో పేలుతున్న మాటల తూటాల నేపధ్యంలో, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు కనుచూపుమేరలో లేకపోయినప్పటికీ వివిధ రాజకీయ పక్షాల నడుమ చెలరేగుతున్న దిగజారుడు వ్యాఖ్యల క్రమంలో  ఈ విషయం ప్రస్తావించుకోవాల్సి వస్తోంది.

ప్రచార పర్వంలో పాల్గొంటున్న రాజకీయ పార్టీల నేతలు, అభివృద్ధికి తాము  ఏం చేయబోతున్నామో చెబితే ఎవరికీ అభ్యంతరం వుండదు. అల్లాగే గతంలో ఏం చేశారో ఆ ‘ప్రవర’ మరోమారు  వల్లె వేసినా అక్షేపించాల్సింది ఏమీ వుండదు. ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకున్నా ‘ఏదోలే! ఎన్నికల వేళ కదా! పోనీలే’ అని విని వూరుకోవచ్చు. ఎదుటి పక్షం వాళ్ళపై దారుణమైన ఆరోపణలు చేసినా అంతకంటే వాళ్ళు చేసేది ఏముందని, చెప్పేది ఏముందని సరిపెట్టుకోవచ్చు. కానీ, అనవసరమైన అంశాలను ప్రస్తావిస్తూ ప్రచారాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు.

మాటకు వున్న ‘పవర్’ ఏమిటో నేటి తరం రాజకీయ నాయకులకు బాగా తెలుసు. మాటను ఎలా తిప్పి వదిలితే అది మీడియా దృష్టిని ఆకట్టుకుంటుందో వారికి వెన్నతో పెట్టిన విద్య. ఎలాటి మాటలు రువ్వితే అవి సంచలనాన్ని సృష్టిస్తాయో వారికి కరతలామలకం. ఆ సంచలనాలు కలిగించే పెను ముప్పులతో, పరిణామాలతో  వారికి నిమిత్తం లేదు. అవి ప్రజల్లో రేకెత్తించే భయసందేహాలతో వారికి సంబంధం లేదు. వారి వార్త మీడియాలో పేలాలి. పేలుడు ఫలితాలు వారికి అక్కరలేని విషయం.

జిహ్వాగ్రే మిత్ర బాంధవావః జిహ్వాగ్రే బంధన ప్రాప్తి: జిహ్వాగ్రే మరణం ధృవం’ అన్నారు. జిహ్వ అంటే నాలుక. ఇక్కడ నాలుక అంటే మాట. మాట వల్లనే స్నేహాలు, బాంధవ్యాలు. మాటను బట్టే మరణం కూడా. మాటకు వున్న అసలు శక్తి ఇది. సంచలనాలు సృష్టించడం కాదు. ‘వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు ప్రల్లదనం’ అంటూ ‘చేయకూడని’ కార్యాల జాబితాలో కూడా ‘చెడు పలుకు’ను చేర్చింది అందుకే.

అలవాట్లు, నమ్మకాలు వ్యక్తిగతాలు. వాటిని ఎద్దేవా చేయడం సంస్కారం వున్నవాళ్ళు చేసేపని కాదు.

తినే తిండికీ, మతానికీ ముడిపెట్టి మాట్లాడడం యెంత తప్పో ప్రజల్ని పలానాదే తినండి, పలానాది తినకూడదు అనడం అంతే తప్పు. అసలా మాటకు వస్తే, ఆహారం అనేది మతం పుట్టకముందే వుంది. నాగరీక సమాజం ఆవిష్కృతం కాకమునుపే, మనుషులు అడవుల్లో జంతువుల్లా జీవిస్తున్న పాత రాతి యుగంలో కూడా మనుషులు తమకు నచ్చిందే తిని, తమకు నచ్చినట్టే జీవించారు. నాగరీకం ముదిరిన నేటి రోజుల్లో కూడా మనుషులు తమకు నచ్చిందే తింటున్నారు. అందుకే అన్నారు జిహ్వకో రుచి అని. శాకాహారం తినే వాళ్ళు కూడా అన్ని రకాల కాయగూరలు తినరు. ఒకరు కాకరకాయ తింటారు. కొందరికి సొరకాయ సయించదు. మరి కొందరికి నషాళానికి అంటే కారం నాలుక్కి తగిలితే కాని ముద్ద గొంతు దిగదు. అలాగే మాంసాహారుల్లో కూడా అనేక రుచిపచులు. గుడ్డు తినేవాళ్ళు అందరూ కోడిమాంసం తింటారనుకోను.

ఎనభయ్యవ దశకం చివర్లో నేను నా కుటుంబంతో కలిసి అయిదేళ్ళు మాస్కోలో వున్నాను. అక్కడివాళ్ళకి, మాంసాహారులు కాకుండా శాకాహారులు అనే ఒక తెగ మనుషుల్లో వుందని  తెలియదన్న విషయం అక్కడికి పోయిన తర్వాత తెలిసింది. ఆ రోజుల్లో ఇండో సోవియట్ సాంస్కృతిక సంఘం, ఇస్కస్ ఆధ్వర్యంలో అనేక మంది తెలుగువాళ్ళు ఏటా మాస్కో వస్తుండేవాళ్ళు. నాకు తెలిసిన జర్నలిష్టులు కూడా వారిలో వుండేవారు. వాళ్ళు మాంసాహారులే అయినా, అక్కడి మాంసపు వంటకాలు నచ్చేవి కావు. అధికార విందుల్లో ఏదో మర్యాదకు భోజనం అయిందనిపించుకుని, సాయంత్రం కల్లా మా ఇంటికి వచ్చి మా ఆవిడ వండిపెట్టిన కాయగూరల భోజనం ఆప్యాయంగా ఆరగించి, ఆశీర్వదించి వెళ్ళేవాళ్ళు.

కాబట్టి చెప్పేదేమిటంటే ఒకళ్ళ ఆహారపు అలవాట్లను ఎద్దేవా చేయడం కానీ, తమ అలవాట్లే గొప్పవి అని డప్పు కొట్టుకోవడం కానీ నాగరికం అనిపించుకోదని. సభ్య సమాజంలో జీవించేవారు ఇలాటి ‘ ప్రల్లధనపు’ పలుకులకు స్వస్తి చెప్పాలని మాత్రమే.

కానీ రాజకీయపు వేడిలో, అవసరాల అక్కరలో ఎవరికీ ఏమీ తెలియడం లేదు. ఎన్నికల్లో గెలుపు అవకాశాలను మెరుగు పరచుకోవడం కోసం రాజకీయ నాయకులు తాత్కాలికంగా ఇలాటి రెచ్చగొట్టే ప్రకటనలు చేసేసి ఆ తరువాత మరిచిపోవచ్చు. కానీ వీటి తాలూకు ప్రభావం ప్రజల మనస్సులో పది కాలాలపాటు పేరుకుపోయే ప్రమాదం వుంటుంది. కానీ ఈ హెచ్చరికలు రాజకీయ నాయకుల చెవికెక్కవు. వారికి వారి రాజకీయ ప్రయోజనాలే ప్రధానం.

అన్ని మతాలలో జంతువుల్ని ప్రేమించే స్వభావం వుంది. కొన్నిజంతువుల్ని పవిత్రంగా భావించి ఆరాధించే ఆచారం వుంది. పరమత సహనం గురించి ప్రబోధించేవాళ్లు, పరాయి మతస్తుల ఆచార వ్యవహారాలను కూడా గౌరవించి తీరాలి. ప్రజలు ఎలా జీవించాలి, వారి జీవన విధానాలు ఎలా వుండాలి అని అన్ని మతాలూ బోధిస్తాయి. వాటిని తు.చ. తప్పకుండా పాటించేవాళ్ళు, ఇతర మతాలవాళ్లకు కూడా అలాటి వెసులుబాటు ఇవ్వాలి. తమ మతం, తమ ఆచారాలు ఎలా తమకి ప్రధానమో, ఇతరులకీ అలాగే అనే సహిష్ణుత అలవరచుకోవాలి. అన్నింటికీ ముందు రాజకీయాలు మతాల ముసుగు వేసుకోకుండా చూడాలి. హాయిగా జీవిస్తున్న ప్రజల నడుమ మతాల పేరుతొ చిచ్చు పెట్టకుండా చూడాలి. మతాన్ని రాజకీయంతో ముడిపెట్టి పబ్బం గడుపుకునే రాజకీయ నాయకులకు ఇటువంటి మాటలు రుచించకపోవచ్చు. కానీ, విశాల జాతి హితం ముందు ఇవి అత్యల్ప స్వల్ప విషయాలు.

ఉపశృతి: వెనకో మునీశ్వరుడికి కాలజ్ఞానం వుండేది. జరగబోయేది ముందుగానే తెలుసుకోగలిగిన శక్తి ఆయనకు వుండేది. ఇక మరణం తప్పదు అనుకున్నప్పుడు ఆయనకు ఓ తీరని మనోవేదన పట్టుకుంది. ఈ జన్మలో తాను సర్వసంగ పరిత్యాగి అయిన ముని. వచ్చే జన్మలో అదే ఆశ్రమంలో ఒక ఎలుకగా పుట్టబోతున్నట్టు ముందుగా తెలియడం వల్లనే ఆ ఆవేదన. శిష్యుడిని పిలిచి చెబుతాడు. తాను చనిపోయి అదే చోట ఎలుకగా పుట్టబోతున్నానని. ఇంతటి ఔన్నత్యం కలిగిన బతుకు బతికి కలుగులో ఎలుకలా బతకడం తనకు ఇష్టం లేదని, ఎలుక రూపంలో వున్న తనను వెంటనే చంపేసి ఆ జన్మకు పరిసమాప్తి కలిగించాల్సిందని. ఎలుక రూపంలో ఉన్న తనను గుర్తు పట్టడానికి తన నుదుటిపై ఒక తెల్లటి మచ్చ ఉంటుందని చెప్పి తనువు చాలిస్తాడు. ఎలుకగా పుట్టిన గురువును ఆ శిష్యుడు గుర్తుపట్టి, గురువుగారు పూర్వజన్మలో  ఇచ్చిన ఆదేశం మేరకు ఆ ఎలుకను చంపబోతే గురువు వద్దని వారించి ఇలా అంటాడు.

 మనిషిగా వున్నప్పుడు అదే ఉత్కృష్ట జన్మ అనుకుని, ఎలుకను చిన్నచూపు చూసి ఎద్దేవా చేశాను. అయితే, ఇప్పుడు ఎలుకగా జన్మించిన తరువాత అది ఎంతటి గొప్ప జన్మో నాకు అర్ధం అయింది’.

ఇందులోని నీతి ఏమిటంటే, ఎవరినీ చిన్నచూపు చూడరాదు. చిన్న చూపుకు గురైన వారు ప్రతీకారేచ్చకు పూనుకోరాదు. ఒకరిని ఒకరు మన్నించుకోవడం ద్వారా మాత్రమే తామూ మనుషులమే అని అనిపించుకోగలుగుతారు.



26, ఫిబ్రవరి 2022, శనివారం

ఇద్దరు అధికారులు, ఒకే పాఠం – భండారు శ్రీనివాసరావు



ఎంత అల్పులమో తెలుసుకోవడానికి అనుదినం ఎదురయ్యే సంఘటనలను కొంత నిశితంగా పరిశీలిస్తే చాలని కొన్నేళ్ళ కిందటి నా ఈ అనుభవమే నాకు మరోసారి తెలియపరిచింది.
దూరదర్శన్ సప్తగిరి ఆధ్వర్యంలో హైదరాబాదు రవీంద్రభారతిలో ‘స్వర సమరం’ అనే సంగీత పోటీ జరిగింది. గవర్నర్ శ్రీ నరసింహన్ ముఖ్య అతిధి. సతీసమేతంగా హాజరయి శాస్త్రీయ సంగీతం పట్ల తమ మక్కువను చూపారు. ఆద్యంతం తెలుగులో ప్రసంగిస్తూ ఇలాటి అద్భుత కార్యక్రమాలను నిర్వహించే శక్తి కేవలం దూరదర్శన్ కు మాత్రమే వుందని ఉద్ఘాటిస్తూ, ఆ సంస్థ ఇటువంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించడం ద్వారా శాస్త్రీయ సంగీతాన్ని ప్రోత్సహించాలని ఉద్బోధించారు. సరే అసలు విషయం ఇది కాదు.
మాజీ పోలీసు డైరెక్టర్ జనరల్ శ్రీ ఆర్.ప్రభాకర రావు, వారి శ్రీమతి వేదవతి సంగీతం మీద వున్న ఆసక్తితో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శ్రీ ప్రభాకర రావు పోలీసు శాఖలో అనేక ఉన్నత పదవులను నిర్వహించి సమర్ధుడైన అధికారిగా నిరూపించుకున్నారు. ఆయన్ని గుర్తుపట్టిన దూరదర్శన్ సిబ్బందిలో కొందరు వారిని మొదటి వరుసలో కూర్చోవాల్సిందిగా అభ్యర్ధించారు. అయినా సున్నితంగా తిరస్కరించి సాధారణ ప్రేక్షకుల మాదిరిగానే వారిద్దరూ వెనుక వరుసలోనే కూర్చుని కార్యక్రమాన్ని ఆసాంతం తిలకించారు.
గవర్నర్ పాల్గొంటున్న దృష్ట్యా రవీంద్రభారతి ఆవరణలో కట్టుదిట్టమయిన పోలీసు బందోబస్తు చేశారు. కార్యక్రమం ముగిసిన తరువాత రంగస్థలం మీద కళాకారులను అభినందిస్తూ నరసింహన్ దంపతులు కొద్దిసేపు అక్కడే వుండిపోయారు. ప్రభాకరరావు దంపతులు ఈలోగా బయటకు వెళ్ళడానికి ప్రయత్నించగా ద్వారం వద్దవున్న పోలీసు అధికారులు అడ్డగించారు. కొత్తగా ఉద్యోగంలో చేరి విధులు నిర్వహిస్తున్న ఆ సిబ్బందికి తాము అభ్యంతరం చెబుతున్న వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం తమ శాఖకు అత్యున్నత అధికారిగా పనిచేశారన్న విషయం తెలిసివుండక పోవచ్చు. మధ్యలో ఎవరో కల్పించుకుని ఆయన ఎవరో ఏమిటో చెప్పబోతుంటే శ్రీ ప్రభాకర రావు వద్దని సైగచేసారు. ‘వారి డ్యూటీ వారిని చేయనీయండి’ అంటూ మళ్ళీ వెనక్కు వచ్చి హాలులో కూర్చుండిపోయారు.
రోజు తిరగకుండా మరో సారి మళ్ళీ ఇదేమాదిరి సంఘటన అనుభవంలోకి వచ్చింది. మర్నాడు ఆదివారం గవర్నర్ శ్రీ నరసింహన్ పుట్టినరోజు. రాజభవన్ లో అనేకమంది వారిని కలుసుకుని శుభాకాంక్షలు తెలియచేసారు. శ్రీ నరసింహన్ పూర్వాశ్రమంలో పోలీసు అధికారిగా పనిచేసినందువల్లనేమో లోగడ పోలీసు శాఖలో ఉన్నత పదవుల్లో పనిచేసిన అనేకమంది గవర్నర్ ను అభినందించడానికి రాజ్ భవన్ కు వచ్చారు. గతంలో రేడియోలో పనిచేసి నప్పుడు సన్నిహితంగా మెలిగిన అనేకమంది అధికారులను చాలా సంవత్సరాల తరువాత అక్కడ కలుసుకోవడం జరిగింది. వారిలో శ్రీ రామస్వామి ఒకరు. ఆయన హైదరాబాదు పోలీసు కమీషనర్ గా పనిచేశారు. నిబంధనల ప్రకారం తన సెల్ ఫోనును కారులో బయటే వుంచేసి లోపలకు రావడం చూసి ఆ విషయాన్ని ఆయనతో ప్రస్తావిస్తే ‘పోలీసుశాఖలో ఇన్నేళ్ళు పనిచేసి మేమే రూల్స్ పాటించకపోతే యెట్లా’ అన్నట్టు చిరునవ్వే సమాధానం.
‘ఎదిగినకొద్దీ వొదగమ’ని ఓ సినీ కవి చక్కని పాట రాశారు. విన్నప్పుడల్లా యెంత చక్కని పాట అని ఎన్నోసార్లు అనుకుంటాం. కాని సందర్భం వచ్చినప్పుడు మాత్రం గుర్తురాదు. ఉద్యోగం ద్వారా సమకూడిన హోదా ఒక్కటే గుర్తుంటుంది.
ఒక రోజు తేడాతో చూసిన ఈ రెండు సంఘటనలు మనసుపై మంచి ముద్రవేశాయి. అలా వుండగలిగితే యెంత బాగుండు ఒక్క క్షణం అనిపిస్తుంది. కాని మనసు కోతి లాటిది. దానికి తోడు, పాడు అహం, ఆ ఆలోచనను అనుక్షణం చంపేస్తూనే వుంటుంది. ఏం చేస్తాం!

24, ఫిబ్రవరి 2022, గురువారం

విజేత మిగలని యుద్ధం – భండారు శ్రీనివాసరావు

 

 పామును చూసి మనిషి భయపడినట్టే, మనిషిని చూసి పాము కూడా భయపడుతుంది. పాము కాటు వేస్తుందేమో అని మనిషి భయం. మనిషి చేతిలో కర్ర చూసి పాముకు భయం.

అణు బాంబులు ఉన్న దేశాలు తలపడ్డప్పుడు  కూడా ఇదే పరిస్థితి. అణుయుద్ధం అంటూ జరిగితే, పరాజితులు వుండరు, విజేతలు మిగలరు.

వాళ్లకు ఆ భయం ఉన్నంత వరకు ఇక ఎవరికీ ఏ భయం అక్కరలేదు, స్టాక్ మార్కెట్ల పతన భయం తప్ప. సాధారణ మనుషులకు   Bear and Bull గొడవే పట్టదు.

(24-02-2022)

యుద్ధాలు మిగిల్చేది ఏమిటి? - భండారు శ్రీనివాసరావు


‘తాతల తండ్రుల చంపుకొనుటకా ఈ భండనంబు కృష్ణా!’

కురుక్షేత్ర రణక్షేత్రంలో మహా భారత యుద్ధం ప్రారంభం కావడానికి ముందు తెల్లగుర్రముల రధమును తోలే నల్లనయ్యను అప్పటికి అజ్ఞాన తిమిరంలో కొట్టుమిట్టాడుతున్న అర్జునుడు అడుగుతాడీ ప్రశ్న. తదుపరి కృష్ణుడు గీతార్ధసారం ఎరిగించిన తరువాత ఎరుకనబడిన సవ్యసాచి అన్నదమ్ములతో కలసి సాగించిన ఆ మహా సంగ్రామం అనంతరం కూడా నివృత్తి కాని సందేహం ఇదే.

ఎందుకంటె పద్దెనిమిది రోజులపాటు జరిగిన ఈ మహాయుద్ధంలో విజయం సాధించిన యుధిష్టురుడికి మిగిలిందేమిటి? గుట్టలకొద్ది సైనికుల శవాలు. ఆనవాలు పట్టలేని ఆత్మీయుల కళేబరాలు.
కౌరవ పాండవుల తరపున యుద్ధంలో పాల్గొన్నఅనేక అక్షౌహిణుల సైన్యం నిహతమయింది. శవాల గుట్టల నడుమ, గెలిచినవారి పక్షాన బతికిబట్టగలిగింది ధర్మజ,భీమ,అర్జున,నకుల,సహదేవులు, కృష్ణుడితో కలిపి మరో ఇద్దరు మాత్రమే. ఈ ఇద్దరిలో సాత్యకిని మినహాయిస్తే యుయుత్సుడి విషయం మళ్ళీ అనుమానమే అంటారు చరిత్రకారులు. అంటే విజయలక్ష్మి వరించిన ధర్మజుని పక్షంలో మిగిలింది కేవలం ఏడుగురు మాత్రమే. అటు ఓడిన కౌరవ పక్షంలో ప్రాణాలతో బయటపడింది నలుగురే నలుగురు. అశ్వథామ, కృపాచార్యుడు, కృతవర్మ, కర్ణుడి కుమారుడయిన విశ్వకేతు. ఎవరి కారణంగా ఈ మహారణం చెలరేగిందో ఆ కురుసార్వభౌముడు, దుర్యోధనుడితో పాటు దుశ్శాసనాది అతడి సోదరులందరూ ఈ మహా యుద్ధంలో అసువులు బాశారు.

పదిహేను లక్షల యాభయ్ మూడు వేల తొమ్మిది వందల సైనికులతో కూడిన ఏడు అక్షౌహిణుల పాండవదండుకు సైన్యాధ్యక్షుడు పాంచాల రాజు ద్రుష్టద్యుమ్నుడు కాగా, ఇరవై నాలుగు లక్షల అయిదు వేల ఏడు వందల సైన్యం కలిగిన పదకొండు అక్షౌహిణుల కౌరవసేనకు తొలుదొల్త నాయకత్వం వహించింది భీష్మ పితామహుడు. యుద్ధ పరిసమాప్తి నాటికి ఇరువైపులా మొత్తం సైనికులందరూ తుడిచిపెట్టుకుపోయారు.

22, ఫిబ్రవరి 2022, మంగళవారం

కేసీఆర్ తో ఎనిమిది గంటలు – భండారు శ్రీనివాసరావు

 ఈరోజు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఫోన్  మోగింది.

“సీఎం ఆఫీసు నుంచి. శ్రీనివాసరావు గారా!  సీఎమ్ గారు మాట్లాడుతారు, లైన్లో వుండండి”  అంది ఓ గొంతు.

ఓ ఇరవై ఏళ్ళ క్రితం అయితే ఇలాంటి ఫోన్లు ఆశ్చర్యం లేదు. రిటైర్ అయి పదిహేను ఏళ్ళు దాటింది కదా! అందుకే ఆశ్చర్యం.

“శ్రీనివాసరావు గారు, బాగున్నారా! ఎక్కడ వుంటున్నారు, ఒకసారి మాట్లాడుకుందాం, కారు పంపిస్తాను, ఇంటికి రండి”

కొద్దిసేపటికే పియ్యే ఫోన్ చేసి లొకేషన్ తీసుకున్నాడు. మరి కొద్ది సేపటికే అనిల్ అనే డ్రైవర్ ఫోన్ చేసి మీ (మా) ఇంటి దగ్గర వున్నాను అన్నాడు.

రోజూ మూడున్నరకు నా  మధ్యాన్న భోజనం. రెండున్నర దాటితే కానీ స్నానం సంధ్యా ప్రసక్తి వుండదు.

డ్రైవర్ ని ఉండమని చెప్పి అప్పటికప్పుడు తయారై, గుప్పెడు మెతుకులు నోట్లో వేసుకుని కారెక్కాను. సరాసరి సీఎం ఇంటికే తీసుకు వెళ్ళాడు. లిఫ్టులోపైకి వెళ్లేసరికి రండి రండి భోజనం చేద్దాం అని ఆహ్వానించారు కేసీఆర్. చేసేవచ్చానని చెబితే, ఇలా మాతో వచ్చి కూర్చోండి అన్నారు. భోజనం టేబుల్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ వున్న ఆరుగురిలో ఇద్దరే తెలుసు, ఒకరు సంతోష్, ఎంపీ. మరొకరు భాను ప్రసాద్ ఎం.ఎల్.సీ.

భోజనాల కార్యక్రమం పూర్తి కాగానే కిందికి వెళ్లాం. వరసగా వాహనాలు. నన్ను కాన్వాయ్ లో మూడో వాహనంలో కూచోబెట్టారు. కారు తలుపు ఎంత గట్టిగా వుందంటే చేత్తో తీయడం సాధ్యం కాలేదు. అది బులెట్ ప్రూఫ్ అని చెప్పి  డ్రైవర్ డోర్ తీశాడు.

కాన్వాయ్ కదిలింది. నేరుగా బేగం పేట ఎయిర్ పోర్ట్ చేరింది. ఒక హెలికాప్టర్ దగ్గర ఆగింది. నేను దిగి ఒక పక్కన నిలబడ్డాను. ఇక్కడ నుంచి ఇంటికి చేరడం ఎల్లా అనేది నా ఆందోళన. ఈలోగా ఎవరితోనో  ముచ్చటిస్తున్న సీఎమ్  నా వైపు చూసి ఎక్కండి అన్నారు. నాకు కలయో వైష్ణవ మాయయో అన్నట్టు వుంది. ఉద్యోగంలో వున్నప్పుడు ఇలాంటి ప్రయాణాలు అలవాటే. రిటైర్ అయి పదిహేనేళ్లు. అందుకే ఆశ్చర్యం. పక్కన కూర్చోబెట్టుకున్నారు.

అరగంటలో నారాయణ్ ఖేడ్ చేరాము. స్టేజి మీద తన వెనకనే కూర్చోబెట్టుకున్నారు. బహిరంగ సభలో ప్రసంగిస్తూ కూడా నాతోపాటు భండారు శ్రీనివాసరావు కూడా వచ్చారు అని ఆయన చెబుతున్నప్పుడు మతి పోయింది.

సభ ముగిసింది.

తిరిగి అరగంటలో బేగంపేట ఎయిర్పోర్ట్. అక్కడ నుంచి సీఎం రెసిడెన్స్. పైకి వెళ్ళాము. వేడి వేడి ఉప్మా కాఫీ ఇచ్చారు. ఓ గంటన్నర ఏవేవో ముచ్చ్చట్లు. నన్ను ఎందుకు రమ్మన్నారో అంతు చిక్కలేదు.

ఏడున్నర కాగానే నేను లేచి నిలబడి ధన్యవాదాలు చెప్పాను.

ఆయన్ని ఇంటి దగ్గర జాగ్రత్తగా  దింపి రండి అన్నారు అక్కడ ఎవరితోనో.

ఏడున్నర ప్రాంతంలో ఇంటికి చేరాను.

అప్పటివరకు సెక్యూరిటీ  జామర్ల వల్ల మూగనోము పట్టిన నా ఫోను మళ్ళీ ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ తో పిలుపులు మొదలు పెట్టింది.

కలా నిజమా అనుకుందాం అంటే ‘నారాయణ్ ఖేడ్ మీటింగులో సీఎం తో పాటు నువ్వు కూడా కనిపించావు టీవీల్లో’ అని మిత్రుల ఫోన్స్.

అయితే నిజమే అన్నమాట.

ఇంతకూ ఎందుకు పిలిచినట్టు? నేను ఎందుకు వెళ్లినట్టు?

ఈ భేతాళ ప్రశ్నకు జవాబు లేదు, కేసీఆర్ గారి అభిమానం ఆ స్థాయిలో ఉంటుందని సమాధానపడం తప్ప.



(21-02-2022)

        

20, ఫిబ్రవరి 2022, ఆదివారం

భయం లేదు! స్త్రీ జాతి సంసిద్ధమయింది!! – భండారు శ్రీనివాసరావు

 

‘పొద్దున్నే హైదరాబాదు వచ్చాను. ఆర్మూరులో అంతా బాగే. అపోలోలో చిన్నక్కను చేర్పించారని బావ ఫోను చేశాడు. ఇప్పుడక్కడికే వెడుతున్నా. చూశాక ఎట్లుందీ మళ్ళీ ఫోను చేసి చెబుతా’

ఈ మాటలు వింటుంటే ఆశ్చర్యం అనిపించింది.
ఇందులో ఆశ్చర్యం ఏముందంటారా! కరోనా కారణంగా ఇప్పుడు కుదరడం లేదు కానీ, లోగడ ఊబెర్ లో తిరిగేటప్పుడు ఒక్కన్నీ కాకుండా వీలయినప్పుడల్లా పూల్ (షేరింగ్) పద్దతి ఎంచుకునే వాడిని. డబ్బులు సేవ్ చేయడంకోసం కాదు. రకరకాల వ్యక్తుల్ని కలవడానికి వీలుంటుందని.

అలాగని కారులో వుండగా ఎవరితో మాటలు కలపను. డ్రైవర్ పక్కన ముందు సీట్లో కూర్చుని మనుషుల్ని చదివే ప్రయత్నం చేసేవాడిని. పుటకలతో పుట్టిన బుద్ది కదా! అలాగే, ఆ రోజు ఊబెర్ ఎక్కాను. వెనక సీట్లో ఒకమ్మాయి కూర్చుని వుంది. ఎవరో ఫోను చేస్తే ఆ అమ్మాయి అంటున్న మాటలు ఇవి. నిజానికి నేను విన్నవి కావు, వినపడ్డవి.
ఊరు నుంచి పట్నం వచ్చింది. నిర్భయంగా ఊబెర్ టాక్సీ పిలుచుకుంది. డేరింగుగా షేరింగు పద్దతి ఎంచుకుంది. ఆసుపత్రిలో వున్న అక్కను పరామర్శించడానికి వెడుతోంది. ఈ దేశానికి ఇంతకంటే ఏం కావాలి? చాలా సంతోషం అనిపించింది.

ఒక విషాదం - ఒక విజయం - భండారు శ్రీనివాసరావు

 (20-02-2022 ఆదివారం ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)

సర్జికల్ స్ట్రయిక్స్ అనే పదం మరోసారి మీడియాలో వినపడుతోంది. రాజకీయ విమర్సలు, ఆరోపణల ప్రసక్తి లేకుండా దీని పూర్వాపరాల పునశ్చరణే ఈ వ్యాసాంశం.  

మూడేళ్ల క్రితం అంటే 2019  ఫిబ్రవరి పద్నాలుగో తేదీ. మధ్యాన్నం మూడు గంటలు దాటింది. ఎర్రటి కాశ్మీర్ కుంకుమ పువ్వును విస్తారంగా పండించే పుల్వామా ప్రాంతం ఉగ్రవాదదాడితో మరింత ఎర్రబడింది. విధి నిర్వహణ కోసం రోడ్డుమార్గంలో జమ్మునుంచి కాశ్మీర్ తరలివెడుతున్న భారత సైనిక వాహన శ్రేణిపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషె మహ్మద్ కు చెందిన ఆదిల్ అనే ఉగ్రవాది ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. శక్తివంతమైన పేలుడు పదార్ధాలు కలిగిన మరో వాహనంలో వాహనశ్రేణి వెంట వేగంగా ప్రయాణిస్తూ, తన కారును తానే పేల్చేసుకున్నాడు. ఆ పేలుడు తీవ్రతకు పక్కనే ప్రయాణిస్తున్న మిలిటరీ కాన్వాయ్ లోని ఒక బస్సు తునాతునకలయింది. ఆ వేడికి కరిగి ఇనుప ముద్దగా మారింది. ఆ బస్సులో ప్రయాణిస్తున్న మొత్తం నలభయ్ మంది భారత సైనికులు ఈ సంఘటనలో విగతజీవులయ్యారు. వారి దేహాలు వంద మీటర్ల పరిధిలో చెల్లాచెదురుగా పడ్డాయి. మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది క్షతగాత్రులు అయ్యారు. దేశం యావత్తు దిగ్భ్రాంతికి గురయింది.

ఈ దాడికి పూనుకుంది తామే అని మసూద్ ఆజాద్ నాయకత్వంలోని జైషే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఆదిల్ అహ్మద్ అలియాస్ వకాస్ మాట్లాడిన దృశ్యాలతో కూడిన వీడియోను సంఘటన జరిగిన కొద్ది సేపటిలోనే ఈ సంస్థ విడుదల చేసింది. ‘దీన్ని జమ్మూ కాశ్మీర్ ప్రజలు చూసే సమయానికి తాను స్వర్గం(దేవుని వద్దకు) చేరుకుంటాన’ని ఆదిల్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. తన నమ్మకం పట్ల తనకున్న నమ్మకం అతడ్ని అన్నిరకాల మానవ సంబంధాలనుంచి దూరం చేసిందని ఈ వీడియోని బట్టి అర్ధం చేసుకోవచ్చు.

కత్తి తిప్పేవాడు ఆ కత్తి ఒరలోనే మరణిస్తాడు’ అన్నది బైబిల్ సూక్తి. క్రైస్తవం ఒక్కటే కాదు, ఇస్లాం అయినా ఆ మాటకు వస్తే,  ప్రపంచంలోని ఏ మతమయినా హింసామార్గాన్ని ఎంతమాత్రం అనుమతించదు. ప్రబోధించదు. ఏమాత్రం సమర్థించదు. అయితే, ఈ మానవేతిహాసంలో జరిగిన అనేక యుద్ధాలు మతం పేరిట మొదలు కావడం ఆ మతాలు చేసుకున్న దౌర్భాగ్యం.

మతాన్ని మీరు రక్షిస్తే, ఆ మతం మిమ్మల్ని రక్షిస్తుంది’ అనే ప్రాధమిక సూత్రం ఈ తగవులకు మూలకారణం. మతాన్ని రక్షించడం అంటే పర మతాలనుంచి దాన్ని కాపాడుకోవడం కాదనీ, ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ, పర మతాలను సయితం గౌరవించడమనీ మత పెద్దలు ఎంతగా మొత్తుకున్నా మత ఛాందసులు పట్టించుకోవడం లేదు. ఫలితం మతం పేరిట యుద్ధాలు, రక్త తర్పణాలు.

టూత్ పేస్టు  ట్యూబ్ నుంచి పేస్ట్ బయటకు తీయగలమే కాని తిరిగి దానిని ట్యూబ్ లో పెట్టడం అసాధ్యం. అలాగే, ఉగ్రవాదం, తీవ్రవాదం ఏ పేరుతొ పిలిచినా దాన్ని పెంచడం సులభం, తుంచడం కష్టం. ఇప్పుడు మానవాళికి కావాల్సింది మానవ హననం కాదు, కాసింత సహనం.

'సహనావవతు' అనేది వేద కాలం నుంచి వినవస్తున్న హితోక్తి. కానీ దాన్ని బోధించేవారే కానీ పాటించేవారు కరువయ్యారు.

మోడీ సర్కారు  పుల్వామా సంఘటనపై తీవ్రంగా స్పందించింది. వీర సైనికుల త్యాగాలను వృధా కానివ్వం అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ తో సహా అన్ని ప్రతిపక్షాలు ఉగ్రవాద చర్యను ఆ నాడు తీవ్రంగా గర్హించాయి.

అంతకు ముందు మూడేళ్ల  క్రితం 2016 సెప్టెంబరు 18 వ తేదీన కాశ్మీర్ లోని బారాముల్ల జిల్లా ఉరీలోని భారత సైనిక శిబిరంలోకి ఉగ్రవాదులు చొరబడి పద్దెనిమిది మందిని పొట్టనబెట్టుకున్నారు. ఆ ముష్కర చర్యతో దేశం యావత్తు దిగ్భ్రాంతి చెందింది. మనమేమీ చేయలేమా అనే ప్రశ్న తలెత్తింది. గతంలో కూడా ఆ ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడి జరిపారు. ఖచ్చితంగా ఆ చర్య పొరుగు దేశంపై యుద్ధం చేయడంతో సమానమే. పార్లమెంటుపై దాడికి తెగించినవారిపై తక్షణమే గట్టి చర్య తీసుకునివుంటే ఇప్పుడీ పరిస్తితి తలెత్తేది కాదు అనే భావన ప్రజల్లో కలిగింది.

ఉరీ సంఘటన జరిగినప్పుడు కూడా మన దేశ నాయకులు ‘ఉక్కుపాదంతో ఉగ్రవాదాన్ని అణచివేస్తామనే భారీ ప్రకటనలు చేసారు. అవి షరా మామూలు ఊకదంపుడు ప్రకటనలనే విమర్శలు వచ్చాయి. భారత ప్రభుత్వం మేకతోలు గాంభీర్యం ప్రదర్శిస్తోందని అన్నవారూ వున్నారు. అలా అన్న పది రోజులకే అంటే సెప్టెంబరు  28 వ తేదీన భారత సైనికులు మెరుపు దాడి చేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని అయిదు ఉగ్రవాద స్థావరాలపై దెబ్బతీసి తమ ఆధిక్యతను అద్భుతంగా ప్రదర్శించారు. దేశ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారు. ఉరీ సంఘటనకు ప్రతీకారం తీర్చుకున్నారు. సర్జికల్ స్ట్రయిక్స్ అనే పద ప్రయోగం కూడా అప్పుడే ప్రాచుర్యంలోకి వచ్చింది.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలోకి భారత సైనికులు చొరబడి అక్కడి ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు (సర్జికల్ స్ట్రయిక్స్) జరిపి తమకు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేయడం ఆ రోజుల్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

సర్జికల్ స్ట్రయిక్స్ లో కొన్ని  ప్రత్యేక లక్షణాలు వున్నాయి.

ఈ మెరుపుదాడుల వల్ల అక్కడి సాధారణ పౌరులకు హాని జరగకూడదు. కేవలం లక్ష్యఛేధనే గురిగా ఎంచుకోవాలి. మెరుపు దాడులు చేయడానికి తగిన శిక్షణ పొందిన, అనుభవం కలిగిన కమాండోలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. కటిక చీకట్లో కూడా చూడగలిగిన కంటి పరికరాలను, గురి చూసి కొట్టగలిగిన ఆధునిక ఆయుధాలను వారికి సమకూర్చాలి. అన్నింటికంటే ప్రధానం లక్ష్య నిర్దేశం. ఎలాటి పొరబాటుకు అవకాశం లేకుండా శత్రువు స్థావరాన్ని ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోవడం, అలాగే శత్రు బలగాలకు తమ ఉనికి, కదలికలు గురించి  గురించి ఎలాంటి అనుమానాలు కలగకుండా గమ్యాన్ని చేరుకోవడం ఈ మెరుపు దాడుల్లో అతి ప్రధానం. ఈ విషయంలో భారత సైన్యం ఎంతో కసరత్తు చేసింది. భారత ఉపగ్రహాల సాయం తీసుకుని ఉగ్రవాద స్థావరాల ప్రాంతాన్ని ముందుగానే గుర్తించింది. అంచేతే, అర్ధరాత్రి తమ కదలికలను ఎవరూ గుర్తుపట్టకుండా వెళ్లి, ఒప్పగించిన బాధ్యతను నూటికి నూరు పాళ్ళు పూర్తి చేయగలిగింది.

నిజానికి సర్జికల్ అనే పదం వైద్య శాస్త్రానికి సంబంధించినది. దేహంలో ప్రాణాంతక వ్యాధికి కారణమైన ‘కణం’ ఎక్కడ వున్నా, మిగిలిన శరీర భాగాలకు ఇసుమంత హాని జరగకుండా, శస్త్రచికిత్స ద్వారా ఆ కణాన్ని మాత్రమే తొలగించే లాప్రోస్కోపిక్ ప్రక్రియలు ప్రస్తుతం అందుబాటులో వున్నాయి. ఈ సర్జికల్ స్ట్రయిక్స్ లక్ష్యం కూడా అలాంటిదే.

మహాభారతం సౌప్తిక  పర్వంలో కూడా ఇటువంటి అస్త్రశస్త్రాల ప్రసక్తి కానవస్తుంది. భారత యుద్ధం ముగిసిన తరువాత, తన ప్రభువైన సుయోధనుడి పరాజయాన్ని, పాండవుల చేతిలో తన తండ్రి ద్రోణుడి మరణాన్ని జీర్ణించుకోలేని అశ్వద్ధామ,  పాండవ వంశనాశనానికి శపధం చేస్తాడు. పాండవులు లేని సమయంలో వారి శిబిరంలో ప్రవేశించి ధృష్టద్యుమ్యుడితో సహా ఉపపాండవులను ఊచకోత కోస్తాడు. తదనంతరం ముఖాముఖి జరిగిన యుద్ధంలో అర్జునుడు, అశ్వద్ధామ పరస్పరం తలపడతారు. ద్రోణనందనుడు ఒక గడ్డి పరకను చేతిలోకి తీసుకుని బ్రహ్మశిరోనామాస్త్రాన్ని ఆవాహన చేసి ‘అపాండవం భవతు’ అంటూ దానికి లక్ష్య నిర్దేశనం చేసి ప్రయోగిస్తాడు. అందుకు ప్రతిగా అప్పుడు అర్జునుడు కూడా, కృష్ణుడి ప్రేరణపై అదే అస్త్రాన్ని స్మరించి, ‘గురుపుత్రుడైన ఆశ్వద్దామకు హానిచేయకుండా, ప్రత్యర్ధి అస్త్రానికి లక్ష్యమైన మా సోదరులను రక్షించాలని తన అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ మహాస్త్ర శస్త్రాల ధాటికి ముల్లోకాలు తల్లడిల్లడంతో వ్యాస, నారద మహర్షులు జోక్యం చేసుకుని అస్త్ర ఉపసంహారానికి విజ్ఞప్తులు చేస్తారు. అర్జునుడు అంగీకరించినా, బ్రహ్మ శిరోనామాస్త్రం ఉపసంహార ప్రక్రియ ఆశ్వద్దామకు తెలియక పోవడం వల్ల, ఆ అస్త్ర లక్ష్యాన్ని పాండవ వంశీయుల గర్భవిచ్చిత్తికి మళ్ళించి లోకనాశనాన్ని తప్పించారని బొమ్మకంటి వెంకట సుబ్రమణ్య శాస్త్రి గారు తాము రచించిన శ్రీ మదాంధ్ర సంపూర్ణ మహా భారతంలో పేర్కొన్నారు.

సమరము సేయరే బలము సాలిన......అనే పద్యం తెలుగునాట చాలా ప్రాచుర్యం పొందింది. శక్తి వుంటే సంగరానికి దిగి అమీతుమీ తేల్చుకోవాలి. దొంగ దెబ్బలు తీయడం వీరుల లక్షణం కాదు. కానీ పొరుగు దేశం పాకిస్తాన్ కు ఉన్న ప్రధమ,  అధమ లక్షణమే ఇది కావడం ప్రపంచ దౌర్భాగ్యం.