27, ఫిబ్రవరి 2023, సోమవారం

మై హూ నా! – భండారు శ్రీనివాసరావు


(Published in Andhra Prabha daily on 26-02-2023, SUNDAY)


ఎవరి పరిపాలనలో అయితే పాలకుల ప్రమేయం లేకుండా పాలితులకు రోజువారీ జీవితం హాయిగా

గడిచిపోతుందో ఆ పరిపాలనను సుపరిపాలనగా చాణక్యుడు అభివర్ణించారు.


మూడు దశాబ్దాలకు పూర్వం మాస్కోలో, రేడియో మాస్కోలో పనిచేసే అవకాశం నాకు లభించింది. 1990 లో ఓ సెలవు రోజున ఢిల్లీ నుంచి మాస్కో  వస్తున్న ఓ మిత్రుడిని రిసీవ్ చేసుకోవడానికి భార్యా పిల్లలతో కలిసి మాస్కో నగర పొలిమేరల్లో వున్న షెర్మేతోవా అంతర్జాతీయ విమానాశ్రయానికి టాక్సీలో బయలుదేరాను. విపరీతంగా మంచు కురుస్తోంది. మార్గమధ్యంలో వుండగా కారు టైర్లు మంచులో  జారిపోయి ఓ పక్కకు వెళ్లిపోయింది. ఏం జరిగిందా అని ఆందోళన మొదలయ్యేలోగా, మంచు తెర కమ్మిన కారు కిటికీ అద్దం వెనుక ఆరున్నర అడుగుల భారీ శరీరం కనిపించింది. నల్లటి యూనిఫారం చూడగానే అతడు ట్రాఫిక్ పోలీసు అని గుర్తు పట్టాను. ఇంత  మంచువర్షంలో హఠాత్తుగా ఇతడెలా ప్రత్యక్షం అయ్యాడో అర్ధం కాలేదు. ఇప్పుడీ కేసు తేలేదాకా రోడ్డు మీద అవస్థలు తప్పవేమో అని భయపడుతున్న సమయంలో, ఆ పోలీసు రెండు కాళ్ళు నేల మీద గట్టిగా చరిచి, ఫుల్ సెల్యూట్ చేయడంతో మా మొహాల్లో  భయం తగ్గిపోయి ఆశ్చర్యం ఆవరించింది. పౌరులకు అక్కడి పోలీసులు ఇచ్చే మర్యాద అని తరువాత తెలిసింది. అతడు ఆ మంచులో కారు దిగవద్దని మాకు  సైగలు చేస్తూ, వాకీ టాకీలో  మాట్లాడుతున్నాడు. కొద్ది నిమిషాల్లో మరో టాక్సీ వచ్చి ఆగింది. అందులోకి మమ్మల్ని ఎక్కించిన తర్వాతనే అతడు ట్రాఫిక్ కేసు విషయం చూసుకోవడం మొదలు పెట్టాడు. కేసు విచారణ పేరుతొ మాకు ఎలాంటి ఇబ్బంది కలిగించని అతడి తీరు మమ్మల్ని ఎంతగానో  విస్మయపరచింది. చాణక్యుడు చెప్పిన సూక్తి గుర్తుకు వచ్చింది. 


యాభయ్ ఏళ్ళ క్రితం 

ఒకసారి మా వూరికి  పార్లమెంటు సభ్యుడు, కేంద్రమంత్రి అయిన డాక్టర్ కే.ఎల్. రావు టూరు ప్రోగ్రాము పెట్టుకున్నారు. 

ప్రోగ్రాం ప్రకారం  ఆయన మా వూరికి మధ్యాన్నం రెండు గంటల ప్రాంతంలో రావాలి. అందరం ఆయన కోసం ఎదురు చూస్తున్నాం.

మూడయింది, నాలుగయింది, మంత్రిగారి జాడలేదు. చూస్తుండగానే చీకటి పడింది. అప్పటికి మా వూళ్ళో కరెంటు లేదు. కిరసనాయిలు దీపాలే. ఇంతలో దూరంగా  జీపు హెడ్ లైట్ల కాంతి కనిపించింది. ఇంకేముంది, మంత్రిగారు  వస్తున్నారని సంబర పడ్డాము. ఆ జీపు లైట్లు ఆకాశంలో చుట్టూ గిరగిర తిరిగే సర్కసు దీపం (బీమ్) మాదిరిగా కొంతసేపు కనిపించి ఆ తర్వాత కనపడకుండా పోయాయి. ఇంకో రెండు గంటలు చూసి వూరివాళ్ళు ఇళ్ళకు మళ్ళారు.

ఆ తర్వాత కాసేపటికి రెండు జీపుల్లో మంత్రిగారి కాన్వాయ్ మా ఇంటి దగ్గర ఆగింది. మా బాబాయి కొడుకు సత్యమూర్తి అన్నయ్య మా వూరు సర్పంచ్. కాస్త వసతిగా ఉంటుందని ఆయన కార్యకలాపాలు మా ఇంటి నుంచే నడిపేవారు.

అనుకున్నంత సేపు పట్టలేదు మంత్రిగారి పర్యటన. ఊరి పోలిమేరల్లోకి వచ్చి ఊరిలోకి వెళ్ళే  దారి తెలియక చాలాసేపు ఇబ్బంది పడిన విషయం ఆయన చెప్పేదాకా తెలియదు. అంత అధ్వాన్నంగా ఉండేవి ఆరోజుల్లో  రహదారి సౌకర్యాలు. మా ఊరికి అయితే బండ్ల బాట మినహా వేరే దారిలేదు. చల్లారిపోయిన పాలను మళ్ళీ వేడి చేసి పెట్టి ఇచ్చిన కాఫీలు తాగి మంత్రిగారు  నిష్క్రమించారు. 

సరైన రోడ్డు సదుపాయం లేక  ఆ ప్రాంతపు ప్రజలు పడుతున్న ఇబ్బందులు స్వయంగా అనుభవం లోకి రావడం వల్లనెమో, ఢిల్లీ వెళ్ళగానే ఆ విషయంపై దృష్టి పెట్టినట్టున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే శ్రమదానం కార్యక్రమాన్ని ప్రకటించి మా వూరికి రోడ్డు, కరెంటు మంజూరు చేసారు. మా వూరికే కాదు చుట్టుపక్కల అనేక  గ్రామాలను కలుపుతూ వత్సవాయి నుంచి చెవిటికల్లు వరకు మా వూరి మీదుగా రోడ్డు పడింది. కరెంటు వచ్చింది. శ్రమదానం అంటే ఏ వూరివాళ్ళు ఆ ఊరికి కావాల్సిన కరెంటు స్తంభాలు తమ బండ్ల మీద చేరవేయాలి. అలాగే రోడ్డు నిర్మాణంలో శ్రమదానం చేయాలి. స్తంభాలు, కంకర, సిమెంటు వగైరా ప్రభుత్వం ఇస్తుంది.

కే ఎల్ రావు గారిచ్చిన స్పూర్తితో దాదాపు నలభయ్ గ్రామాల ప్రజలు పార్టీలతో నిమిత్తం లేకుండా తమ ఊళ్లకు కరెంటు, రోడ్డు సాధించుకున్నారు. ఇన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా ఆ గ్రామాల ప్రజలు ఆ రోడ్డుని కేఎల్ రావు గారి రోడ్డనే పిలుస్తారు.

ఇది గుర్తుకు వచ్చినప్పుడల్లా వెంటనే గుర్తొచ్చేది చాణక్యుడి సూక్తే.   

గత కొన్నేళ్లుగా  జంట నగరాల్లో కరెంటు కోతలు లేకుండాపోయాయి. 

అయినా కానీ, ప్రజలకు కరెంటు కష్టాలు పూర్తిగా తొలగిపోయాయని చెప్పలేము.

అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాలకు కూడా ఈ అవస్థలు తప్పడం లేదు

ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. పౌరుడికి ఒక సమస్య ఎదురయినప్పుడు

దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకు వెడతాడు. స్పందించే అధికారి వుంటే చాలు

సగం సమస్య తీరిపోయినట్టుగా అతడు భావిస్తాడు. అన్ని సమస్యలకు ఏదో ఒక పరిష్కారం 

అంటూ వుంటుంది. కొన్నిటికి తక్షణ ఉపశమనం లభిస్తే మరి కొన్ని నిదానంగా

పరిష్కారమవుతాయి.

మేము ఉంటున్న ప్రాంతంలో విద్యుత్ సరఫరాలో కోతలు లేవు. కానీ అంతరాయాలు

వున్నాయి. సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళడానికి ఇప్పుడు

సాంఘిక మాధ్యమాలు అందుబాటులో వున్నాయి. 

నాకు తెలిసిన విషయాలను

సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మాత్రం చేస్తూ వస్తున్నాను. గతంలో కూడా మా

ప్రాంతవాసుల సమస్యలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తే మునిసిపల్ అధికారులు

తక్షణం స్పందించారు. అలాగే మరో అనుభవం.

ఒకరోజు రాత్రి కాసేపు కరెంటు పోయింది. లిఫ్ట్ లో ఒక పెద్దావిడ చిక్కుకు పోయింది.

కాసేపటికి కరెంటు వచ్చింది. ఆ పెద్దావిడ మా అపార్ట్ మెంటులో ఎవరినో

చూడడానికి వచ్చింది. లిఫ్ట్ ఇబ్బంది పెట్టడంతో గాభరా పడిపోయింది. ఇది

చూసి రాత్రి పొద్దుపోయిన తర్వాత నేను ఒక పోస్ట్ పెట్టాను.

“వేసవికాలం ప్రవేశించింది. నిరంతర విద్యుత్ సరఫరా విషయంలో పౌరుల

ప్రేమయాత్ర ముగిసింది అనుకోవాలా!  అటక ఎక్కించిన పవర్ ఇన్వర్టర్లను, జెనరేటర్లను

మళ్ళీ కిందికి దింపాలేమో! ఇలా చెప్పడానికి కాసింత  సిగ్గుపడుతున్నాను”

కఠినంగా రాశానేమో అని నాకే తరువాత అనిపించి ఆ పోస్ట్ తీసివేశాను.

ఆవిషయం మరచిపోయాను.

మరునాడు మధ్యాన్నం కాబోలు అయిదారుగురు మా ఇంటికి వచ్చారు.

“పొద్దున్న చైర్మన్ ప్రభాకర రావు గారు ఫోన్ చేశారు”

వారిలో ఒకరు ఈ మాట అంటూ, తనని తాను పరిచయం చేసుకున్నారు.

ఆయన గారి పేరు ఆనంద్.ట్రాన్స్ కోలో  సూపర్ ఇన్ టె౦డింగ్ ఇంజినీరు.

మిగిలినవాళ్ళు ఏడీయీలు, ఏఈలు.

సమస్య ఏమిటని అడిగారు. నేను చెప్పింది విన్నారు. అప్పటికే ఆశ్చర్యంలో

మునిగిపోయి ఉన్న నాకు ఆయన తన సెల్ ఫోన్ లో రికార్డ్ అయిన కొన్ని విషయాలు

చెప్పారు. అది వింటుంటే నా ఆశ్చర్యం రెట్టింపు అయింది. 

మా ప్రాంతంలో ఈ నెలలో అయిదు సార్లు కరెంటు పోయిందని చెబుతూ,  కరెంటు పోయిన

టైమును, మళ్ళీ వచ్చిన సమయాన్ని వివరాలతో సహా చూపించారు. నాలుగుసార్లు ఈ

ఎల్ (ఎర్త్ లీకేజీ), ఒకసారి ఓఎల్ (ఓవర్ లోడ్) వల్ల సరఫరాకు అంతరాయం

కలిగినట్టు రికార్డులలో వుంది.

ఎస్ ఈ గారి అధీనంలో మొత్తం 38 సబ్ స్టేషన్లు వుంటాయిట. ప్రతిరోజూ ఆ

ఏరియాల్లో ఎక్కడ, ఎన్నిసార్లు కరెంటు పోయిందనే వివరాలు ఎప్పటికప్పుడు అప్ డేట్

అవుతాయట. ఆ సమాచారం ఆధారంగా వెనువెంటనే సరఫరా పునరుద్ధరణకు రాత్రీ పగలూ

ఇరవై నాలుగు గంటలు సిబ్బంది సిద్ధంగా వుంటారట.

సాధారణంగా చెట్ల కొమ్మలు నరికే సమయాలను ముందుగానే ఆయా వినియోగదారులకు

ఎస్సెమ్మెస్ ద్వారా తెలియచేస్తారట.

ఎంత ప్రయత్నం చేస్తున్నా తమ చేతిలో లేని కారణాల వల్ల సరఫరాలో ఆటంకాలు

కలుగుతున్న మాట నిజమే అని చెబుతూ, వాటిని సాధ్యమైనంత మేరకు తగ్గించడానికే

తాము, తమ సిబ్బంది నిరంతరంగా పనిచేస్తున్నామని చెప్పారు.

మా ప్రాంతంలో కరెంటు సరఫరాలో అంతరాయాలు లేకుండా చేయడానికి చేయవలసినది

చేస్తామని హామీ ఇచ్చారు.

ముందే చెప్పినట్టు సమస్య పరిష్కారం ముఖ్యమే కావచ్చు కానీ, సమస్యను విని,

‘నేనున్నాను కదా!’ అని భరోసా ఇచ్చేవాళ్ళు కూడా అంతే ముఖ్యం. అప్పుడే

ప్రభుత్వం పనిచేస్తోందని జనం అనుకుంటారు. పనిచేసే ప్రభుత్వం అని

మెచ్చుకుంటారు.

మళ్ళీ మూడు దశాబ్దాల తర్వాత చాణక్యుడి సూక్తి మరోమారు స్పురణకు వచ్చింది.

ప్రభుత్వ ప్రమేయం లేని సాధారణ జన జీవితం. వినడానికి బాగానే వుంది.

ఇలా అడపా దడపా కాకుండా చాణక్యుడి సూక్తి అనుదినం గుర్తుకు వచ్చే బంగారు రోజులు వస్తే ఎంత బాగుంటుందో!




22, ఫిబ్రవరి 2023, బుధవారం

ఈ చక్కటి జ్ఞాపకానికి అప్పుడే ఏడాది

 

ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఫోన్ మోగింది. “ శ్రీనివాసరావు గారా! సీఎం ఆఫీసు నుంచి. సీఎమ్ గారు మాట్లాడుతారు, లైన్లో వుండండి” అంది ఓ గొంతు. ఓ ఇరవై ఏళ్ళ క్రితం అయితే ఇలాంటి ఫోన్లు ఆశ్చర్యం లేదు. రిటైర్ అయి పదిహేను ఏళ్ళు దాటింది కదా! అందుకే ఆశ్చర్యం. “శ్రీనివాసరావు గారు, బాగున్నారా! ఎక్కడ వుంటున్నారు, ఒకసారి మాట్లాడుకుందాం, కారు పంపిస్తాను, ఇంటికి రండి” కొద్దిసేపటికే పియ్యే ఫోన్ చేసి లొకేషన్ తీసుకున్నాడు. మరి కొద్ది సేపటికే అనిల్ అనే డ్రైవర్ ఫోన్ చేసి మీ (మా) ఇంటి దగ్గర వున్నాను’ అన్నాడు. రోజూ మూడున్నరకు నా మధ్యాన్న భోజనం. రెండున్నర దాటితే కానీ స్నానం సంధ్యా ప్రసక్తి వుండదు. డ్రైవర్ ని ఉండమని చెప్పి అప్పటికప్పుడు తయారై, గుప్పెడు మెతుకులు నోట్లో వేసుకుని కారెక్కాను. సరాసరి సీఎం ఇంటికే తీసుకు వెళ్ళాడు. లిఫ్టులోపైకి వెళ్లేసరికి రండి రండి భోజనం చేద్దాం అని ఆహ్వానించారు కేసీఆర్. చేసేవచ్చానని చెబితే, ఇలా మాతో వచ్చి కూర్చోండి అన్నారు. భోజనం టేబుల్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ వున్న ఆరుగురిలో ఇద్దరే తెలుసు, ఒకరు సంతోష్, ఎంపీ. మరొకరు భాను ప్రసాద్ ఎం.ఎల్.సీ. భోజనాల కార్యక్రమం పూర్తి కాగానే కిందికి వెళ్లాం. వరసగా వాహనాలు. నన్ను కాన్వాయ్ లో మూడో వాహనంలో కూచోబెట్టారు. కారు తలుపు ఎంత గట్టిగా వుందంటే చేత్తో తీయడం సాధ్యం కాలేదు. అది బులెట్ ప్రూఫ్ అని చెప్పి డ్రైవర్ డోర్ తీశాడు. కాన్వాయ్ కదిలింది. నేరుగా బేగం పేట ఎయిర్ పోర్ట్ చేరింది. ఒక హెలికాప్టర్ దగ్గర ఆగింది. నేను దిగి ఒక పక్కన నిలబడ్డాను. ఇక్కడ నుంచి ఇంటికి చేరడం ఎల్లా అనేది నా ఆందోళన. ఈలోగా ఎవరితోనో ముచ్చటిస్తున్న సీఎమ్ నా వైపు చూసి ఎక్కండి అన్నారు. నాకు కలయో వైష్ణవ మాయయో అన్నట్టు వుంది. ఉద్యోగంలో వున్నప్పుడు ఇలాంటి ప్రయాణాలు అలవాటే. రిటైర్ అయి పదిహేనేళ్లు. అందుకే ఆశ్చర్యం. పక్కన కూర్చోబెట్టుకున్నారు. అరగంటలో నారాయణ్ ఖేడ్ చేరాము. స్టేజి మీద తన వెనకనే కూర్చోబెట్టుకున్నారు. బహిరంగ సభలో ప్రసంగిస్తూ కూడా నాతోపాటు భండారు శ్రీనివాసరావు కూడా వచ్చారు అని ఆయన చెబుతున్నప్పుడు మతి పోయింది. సభ ముగిసింది. తిరిగి అరగంటలో బేగంపేట ఎయిర్పోర్ట్. అక్కడ నుంచి సీఎం రెసిడెన్స్. పైకి వెళ్ళాము. వేడి వేడి ఉప్మా కాఫీ ఇచ్చారు. ఓ గంటన్నర ఏవేవో ముచ్చ్చట్లు. నన్ను ఎందుకు రమ్మన్నారో అంతు చిక్కలేదు. ఏడున్నర కాగానే నేను లేచి నిలబడి ధన్యవాదాలు చెప్పాను. ఆయన్ని ఇంటి దగ్గర జాగ్రత్తగా దింపి రండి అన్నారు అక్కడ ఎవరితోనో. ఏడున్నర ప్రాంతంలో ఇంటికి చేరాను. అప్పటివరకు సెక్యూరిటీ జామర్ల వల్ల మూగనోము పట్టిన నా ఫోను మళ్ళీ ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ తో పిలుపులు మొదలు పెట్టింది. కలా నిజమా అనుకుందాం అంటే ‘నారాయణ్ ఖేడ్ మీటింగులో సీఎం తో పాటు నువ్వు కూడా కనిపించావు టీవీల్లో’ అని మిత్రుల ఫోన్స్. అయితే నిజమే అన్నమాట. ఇంతకూ ఎందుకు పిలిచినట్టు? నేను ఎందుకు వెళ్లినట్టు? ఈ భేతాళ ప్రశ్నకు జవాబు లేదు, కేసీఆర్ గారి అభిమానం ఆ స్థాయిలో ఉంటుందని సమాధానపడం తప్ప.


(21-02-2022) Video Clipping Courtesy: Shri Nirmal Akkaraju

https://fb.watch/iRRvVsg5dl/ https://fb.watch/iRPUnB4Ugw/

17, ఫిబ్రవరి 2023, శుక్రవారం

అనాయాస మరణం చూస్తే అసూయ ఎందుకు?

 


పొద్దున్న పదిగంటలకు మొద్దుబారిన నా మెదడు క్రమంగా అదుపులోకి వస్తోంది. వచ్చిన తర్వాత, విన్న సంగతులు నెమరు వేసుకుంటూ వుంటే  నా మనసంతా, అనకూడదు కానీ అసూయతో  నిండిపోయింది.

డెబ్బయ్ ఏడేళ్ల వయస్సులో ఈ అసూయ ఏమిటి. అది కూడా అనాయాసంగా చనిపోయిన  నా మేనకోడలు భర్త, నా చిన్న నాటి స్కూలు సహాధ్యాయి  జూపూడి ప్రసాద్ గురించి అంటే నా మనసే సమాధానం పడడం లేదు. మనుషులు ఇలాగా కూడా అనాయాసంగా పోతారా, ఇలాంటి అదృష్టం నా నొసట రాసి ఉందా లేదా అన్న ఆలోచనే ఆ అసూయకు కారణం.

నాకంటే రెండేళ్లు చిన్నవాడయిన నా మేనల్లుడు దుర్గా ప్రసాద్ ఈ మధ్యనే చనిపోయాడు,  ఇలాగే అనాయాసంగా దాటిపోయాడు. అనకూడదు కానీ అప్పుడు కూడా వాడి సునాయాస మరణం చూసి అసూయ పడ్డ మాట నిజం. అప్పుడు పైకి చెప్పలేదు. ఈ రెండో మరణ వార్త తెలిసిన తర్వాత ఇక చెప్పక తప్పడం లేదు.

ఖమ్మంలో వుండే ప్రసాద్ ఈ ఉదయం లేచి చాయ్ తాగి కాసేపు అలా పక్క మీదనే కళ్ళు మూసుకుని పడుకున్నాడు. అటూ ఇటూ ఇంట్లో తిరిగే వాళ్ళ అబ్బాయి షమీకి   అనుమానం వచ్చింది. ఏమిటి ఇంతసేపు పడుకున్నాడు, ఇలా ఆలస్యంగా లేచే అలవాటు ఆయనకి లేదే అనుకుంటూ తట్టి లేప బోయాడు.

అప్పుడు తెలిసింది అది నిద్ర కాదు, దీర్ఘ నిద్ర అని.

విషయం తెలిసి విదేశాల్లో ఉన్న పిల్లలు రేపు రాత్రికి వస్తున్నారు. ఎల్లుండి అంత్యక్రియలు.

నాలుగేళ్ల క్రితం మా ఆవిడ పోయినప్పుడు ఎక్కడో రాసుకున్న గుర్తు.

మన దేశంలో మెజారిటీ వృద్దులకు జీవన యానం చివర్లో ఐసు పెట్టెలో మూడు నిద్రలు తప్పేట్టు లేవు.

కఠినం అనిపించినా వాస్తవమే కదా!   

17-02-2023       




15, ఫిబ్రవరి 2023, బుధవారం

ఈనాటి వార్త: ఓనాటి జ్ఞాపకం

 





ఎక్కడ ? ఎప్పుడు ? 


కొంత కాలం గత కాలంలో కలిసిపోయిన తర్వాత, ఆ నాటి పాత విషయాలను గుర్తు చేసుకుంటూ వుంటే, గుర్తుకు వస్తూ వుంటే, కొంత సంతోషం అనిపిస్తుంది, కొంత తమాషాగా అనిపిస్తుంది.


ఈ ‘ఎక్కడ ఎప్పుడు’ ఇలాటి విషయాల్లో ఒకటి. 

ఈ రెండు పదాలతో రేడియో మార్నింగ్ బులెటిన్ లో ఒక హెడ్ లైన్ వార్త తయారు అయ్యేది.


అర్ధరాత్రో అపరాత్రో మా చిక్కడపల్లి ఇంట్లో ఫోన్ రింగయ్యేది. ఆ రోజుల్లో ల్యాండ్ లైన్ ఫోన్లే. సెల్ కాలం కాదు.


ఫోను  మంచం పక్కనే  పెట్టుకునేవాడిని. మరీ అర్ధరాత్రి ఫోనయితే అవతల  రైల్వే పీఆర్ఓ మైఖేల్. తెల్లవారుఝామున అయితే సీపీఆర్వో కృష్ణయ్య గారు. అదీ లెక్క.


ఫోను ఎత్తి ‘ఎక్కడ? ఎప్పుడు?’ అని అడిగేవాడిని.

వాళ్ళ నుంచి జవాబు తీసుకుని వెంటనే విజయవాడ రేడియో ప్రాంతీయ వార్తా విభాగం న్యూస్ ఎడిటర్ శ్రీ ఆర్వీవీ కృష్ణారావు గారు లేదా శ్రీ ఏమ్వీఎస్ ప్రసాద్ గారికో ఫోను కలిపేవాడిని. ఎవరు డ్యూటీలో వుంటే వాళ్ళు నా ఫోన్ రిసీవ్ చేసుకుని  'ఎక్కడ? ఎప్పుడు?' అని అడిగేవారు. నేను క్లుప్తంగా ఇచ్చిన సమాచారాన్ని వాళ్ళు ఓ వార్త రూపంలో రాసుకునే వారు.  వాళ్ళిద్దరూ ఎంతటి సమర్ధులు అంటే కొన్ని  క్షణాల్లో నేను చెప్పిన వార్తను విస్తరించి,  మరికొన్ని నిమిషాల్లో ప్రసారం అయ్యే ప్రాంతీయ వార్తల బులెటిన్ లో ప్రాధాన్యతా క్రమంలో చేర్చేవారు. 


“ఆకాశవాణి  ప్రాంతీయ వార్తలు చదువుతున్నది  ప్రయాగ రామకృష్ణ/ కొప్పుల సుబ్బారావు.


“దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఒక గూడ్స్ రైలు  రాత్రి పట్టాలు తప్పింది. పలానా  స్టేషన్ల నడుమ జరిగిన ఈ దుర్ఘటన కారణంగా పలు రైళ్ళ రాకపోకలకు  అంతరాయం కలిగిందని, కొన్ని రైళ్లు దారి మళ్లిస్తున్నారని రైల్వే అధికారులు కొద్దిసేపటి క్రితం మా హైదరాబాదు ప్రతినిధికి తెలియచేసారు. వివరాలు.....”


ఎక్కడో సికిందరాబాదు  రైల్వే క్వార్తర్స్ లో పొద్దున్నే రేడియో పెట్టుకుని వార్తలు వింటున్న రైల్వే అధికారులు, ఎలాంటి పొరబాటు లేకుండా వార్త ప్రసారం అయిన సంగతి తెలుసుకుని ఊపిరి పీల్చుకునే వారు. చెప్పిన వార్త ఎలాంటి తభావతు లేకుండా వస్తుందని తెలుసు కనుక నేను ముసుగు తన్ని నిద్రపోయేవాడిని.

14, ఫిబ్రవరి 2023, మంగళవారం

నిశ్శబ్దం రాజ్యమేలిన ముఖ్యమంత్రి సభ - భండారు శ్రీనివాసరావు

 (ఫిబ్రవరి 14 దామోదరం  సంజీవయ్య గారి జయంతి)

ఈ విషయం చెప్పే ముందు దీంతో సంబంధం ఉన్న మరో విషయంతో మొదలు పెడతాను.

మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ స్థాయికి చేరడానికి ముందు ఎక్కిన అనేకానేక నిచ్చెన మెట్లలో నెలకు పాతిక రూపాయల ‘విలేకరి కొలువు’ కూడా వుంది.

ఖమ్మంలోని ఎస్సార్ అండ్ బీజీ ఎన్ ఆర్ కాలేజీలో ఆయన డిగ్రీ పూర్తిచేశారు. రామ్మోహనరావు గారు ఆ కాలేజీలో లెక్చరర్. వారి నాన్నగారికి పత్రికల ఏజెన్సీ కూడా వుంది. అప్పట్లో ఆ ఏజెంట్లే పత్రికా విలేకరుల పాత్ర కూడా పోషించేవారు. మా అన్నయ్యకు తెలుగులో ఉన్న ప్రావీణ్యం గమనించి ‘నెలకు ఓ పాతిక ఇస్తాను, నీకు పాకెట్ మనీగా పనికి వస్తుంది, నువ్వు ఆంద్రజ్యోతి పత్రికకు వార్తలు రాస్తుండు. వాళ్ళు వేస్తె వేస్తారు, లేకపోతే లేదు, కానీ నీకు మంచి కాలక్షేపంగా వుంటుంది’ అని ప్రోత్సహించడంతో మా అన్నయ్య ఒప్పుకున్నాడు.

ఇక అసలు విషయానికి వస్తాను.

నాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఖమ్మం జిల్లా పర్యటన ఖరారు అయింది. అప్పటికే జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరూ రెండు వర్గాలుగా విడిపోయివున్నారు. జలగం వెంగళరావు, శీలం సిద్దారెడ్డి వంటి అతిరధులు కలిగిన ప్రధాన వర్గం అప్పటివరకు ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవ రెడ్డికి అనుకూలం. మరో వర్గం సంజీవయ్య వైపు. దీనికి మాకు బాబాయి వరుస అయిన బొమ్మకంటి సత్యనారాయణ నాయకులు. ఖమ్మం జిల్లాకు సంబంధించినంతవరకు ఆయన ముఖ్యమంత్రి సంజీవయ్యకు కుడి భుజం. సంజీవయ్యకు సంఘీభావం తెలిపేందుకు గోకినేపల్లిలో జిల్లా దళిత మహా సభ ఏర్పాటు చేశారు. ఈ సభను కవర్ చేయడానికి పాతిక రూపాయల విలేకరి అయిన మా అన్నయ్యను పురమాయించారు రామ్మోహన రావు గారు.

సభ బాగా జరిగింది. ముఖ్యమంత్రి ప్రసంగించడానికి మైకు ముందు నిలబడ్డారు. సంజీవయ్య స్వతహాగా మంచి వక్త. ఆయన ప్రసంగం మొదలు పెట్టారు.

నన్ను బాధ పెడుతున్న, నా మనసును కలచి వేస్తున్న ఓ విషయాన్ని మీకు చెప్పదలచుకున్నాను. ఇక్కడ పైనా కిందా కూర్చున్న మనుషులం అందరం ఒకే తీరున ఉన్నాము. ఒంట్లో పారే రక్తం రంగు అందరికీ ఎరుపే. కానీ మనలో చాలామందిమి సాటి మనిషిని మనిషిగా చూస్తున్నామా అంటే అనుమానమే. డబ్బున్న ఖామందులు పెంపుడు బొచ్చు కుక్క పిల్లల్ని తమ పక్కలపై పడుకోబెట్టుకుంటారు. ముద్దు చేస్తారు. అదే సాటి మనిషిని తాకడానికి కూడా వారికి అస్పృశ్యత అనే అనాచారం అడ్డం వస్తుంది. కుక్కలపాటి చేయరా ఈ మనుషులు? ఎందుకీ వ్యత్యాసం? ఎందుకీ వివక్ష?’

రెండు చేతులూ గట్టిగా గాలిలో ఊపుతూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి స్వరం బొంగురుపోయింది. పైకిలేపిన చేతులను అలాగే వుంచి ఆయన కాసేపు మౌనంగా వుండిపోయారు.

సభకు హాజరై ప్రసంగం వింటున్న యావన్మంది చేష్టలు ఉడిగి వుండిపోయారు. అంతటా నీరవ నిశ్శబ్దం.

సరే! ఆ రోజు సభ ముగిసింది. తిరిగి హైదరాబాదు వెళ్ళడానికి దామోదరం సంజీవయ్య అంబాసిడర్ కారు ఎక్కారు. ఆయన పక్కనే మా బాబాయి బొమ్మకంటి సత్యనారాయణ. ముందొక పోలీసు జీపు, వెనక మరో జీపు. అదీ ముఖ్యమంత్రి కాన్వాయ్ ఆ రోజుల్లో.

మా అన్నయ్య ఖమ్మం చేరుకున్న వెంటనే తన రిపోర్ట్ రాసి మర్నాడు పోస్టులో పంపారు. ఆ మరునాడు అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది.

ముఖ్యమంత్రి దళిత సభలో రాజ్యమేలిన నిశ్శబ్దం’.

వార్తతో పాటు మా అన్నయ్య పెట్టిన హెడ్డింగ్ కూడా యధాతధంగా పత్రికలో రావడం కొసమెరుపు.



 

13, ఫిబ్రవరి 2023, సోమవారం

మాటలు మింగే తిమింగలాలు – భండారు శ్రీనివాసరావు

 

ఈరోజు రేడియోను గుర్తు చేసుకునే రోజు

(ప్రపంచ రేడియో దినోత్సవం)

అంచేత ఓ పాత అనుభవాన్ని పంచుకుంటున్నాను.

మీ గొంతు పీలగా అనిపించింది’

మొదలు పెట్టినప్పుడు దూకుడుగా మొదలెడతారు. పోను పోను తేలిపోతున్నట్టుగా వుంటుంది. ఇక వాక్యం ముగించేటప్పుడు ఆఖరు పదాలు మింగేస్తునారు’

నలభయ్ ఎనిమిదేళ్ల క్రితం నేను రేడియో ఉద్యోగంలో చేరి వార్తావాహిని కార్యక్రమాన్ని వారానికి ఒకసారో, రెండుసార్లో సమర్పిస్తున్నప్పుడు దాన్ని రేడియోలో విని నాతో మా ఆవిడ తరచుగా అంటుండే మాటలు ఇవి.

నా ప్రోగ్రాం వినే అవకాశం నాకు లేకపోవడం వల్ల మా ఆవిడ మాటలే వేదం అనుకుని కొంత బాణీ మార్చుకునే ప్రయత్నం చేశాను. ఈలోగా వారం వారం ‘జీవన స్రవంతి’ మొదలయింది. ‘తినగ తినగ వేము తియ్యనగును’ అన్నట్టు నా గొంతుకు శ్రోతలు అలవాటు పడిపోవడంతో నా భార్య మాటలు చెవిన పెట్టడం మానేసాను.

ఇప్పుడు టీవీల్లో కొందరి స్వరాలు వింటుంటే ఈ పూర్వపు రోజులు గుర్తుకొస్తున్నాయి. ఒక్కోసారి అనిపిస్తుంది, వీళ్ళకు మంచీచెడూ చెప్పే భార్యలు లేరా, లేక చెవికి ఎక్కించుకుపోవడం అనే నా చెడ్డ అలవాటు వీరికీ ఉందా అని.



13-02-2023

 

9, ఫిబ్రవరి 2023, గురువారం

“నీ ధ్యాసలో నేను, నా శ్వాసలో నీవు”

 

ఈ రోజల్లా జ్ఞాపకాలే భోజనం

జర్నలిష్టుని ప్రపంచం భరిస్తుంది. ఆదరిస్తుంది, అభిమానిస్తుంది. కాని అతగాడిని భరించడం యెంత కష్టమో తెలిసేది మాత్రం ఆ జర్నలిష్ట్ భార్యకి మాత్రమే.”

ఈ రోజు (9th Feb) మా ఆవిడ నిర్మల పుట్టిన రోజు. ఈ రోజును మరచిపోకపోవడమే ఆమెకు నేనిచ్చే బర్త్ డే గిఫ్ట్ అని అనుకుంటాను.

చూసావా నువ్వు గుర్తు చేయకుండానే నేనెలా గుర్తుంచుకున్నానో’ అని చెప్పాలని వుంది. కానీ వినడానికి ఆవిడ లేదు.

పెళ్ళయిన కొత్తల్లో నాకు దేవుడు అంటే భయం, భక్తీ అంతా ఇంతా కాదు. ఆమెకు పూజా పునస్కారాలు అంతగా లేవు. కానీ కొన్నేళ్ళ తర్వాత పాత్రలు తిరగబడ్డాయి. ఆమె వుంటే ఇక నాకు దేముడితో పనేమిటి అనే భరోసా నాలో పెరిగితే, ఇల్లూ వాకిలీ పట్టని నాలాంటి మొగుడు దొరికాక, దేవుడి అవసరం ఆమెకు బాగా పెరిగింది.

2019 ఆగస్టు ఏడోతేదీ. ఆరోజు నా పుట్టిన రోజు. పొద్దున్నే టీవీ ఛానల్ డిబేట్ కి వెళ్లి వచ్చాను. తాను తయారుగా వుంది. జూబిలీ హిల్స్ లోని టీటీడీ బాలాజీ దేవాలయానికి వెడదాం అన్నది. నేనూ అంతవరకూ ఆ గుడి చూడలేదు. సరే పదమని బయలుదేరి వెళ్లాం. కొండ మీద గుడి. మంచి దర్శనం అయింది. అర్చన చేయించి, పులిహోర ప్రసాదం తీసుకుని తిరిగి కిందికి వస్తుంటే ఓ పూజారి గారు నన్ను గుర్తు పట్టి పక్కనే ఉన్న మరో గుడి, వినాయకుడి గుడికి తీసుకు వెళ్ళారు. ఈ గుడికీ, ఆ గుడికీ నడుమ ఓ ప్రహరీ గోడ వుండడం వల్ల కాస్త చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. పూజారి గారు ఏదో చెబుతున్నారు, ఒకరిది వైఖానస సాంప్రదాయం, మరొకరిది శ్రీ వైష్ణవ సాంప్రదాయం అనుకుంటా. ఒకదానికి మరొకటి చుక్కెదురుట. తమని వేరే శ్రీవైష్ణవుల నుండి విడిగా గుర్తించడానికి వైఖానసులు తిరుచూర్ణం స్థానంలో (నిలువు నామాలకు మధ్య వచ్చే నిలువు గీత) కేసరి రంగు మిశ్రమాన్ని వాడతారు. ఇతర వైష్ణవులు నామంలో ఎర్రని పొడిని వాడతారుట. ఇవన్నీ .నాకు అర్ధం కాని విషయాలే కాదు, అవసరం లేని విషయాలు కూడా. ఎప్పుడైనా గుడికి వెడితే దేముడికి దండం పెట్టి బయటకు రావడమే తప్ప మిగిలిన విషయాలు పట్టించుకోను.

గుడి మహా ద్వారం దగ్గర ఫోటో తీసుకుందామని అనిపించింది. సెల్ఫీ తీయడం రాదు, తీసేవాడు కనిపించలేదు. కనపడిన వాడిని అడగడానికి మొహమాటం. లేకపోతే ఆ ఫోటో మా జీవితంలో ఆఖరిసారి కలిసి దిగిన ఒక అపూర్వమైన జ్ఞాపకంగా మిగిలిపోయేది.

ఇంటికి వచ్చేముందు జూబిలీ హిల్స్ లోనే ఉంటున్న మా రెండో అన్నయ్య గారి ఇంటికి వెళ్ళాము, మా కుటుంబానికి పెద్దలు అయిన రామచంద్రరావు గారు, విమల వదినల ఆశీస్సులు తీసుకుందామని. భోజనం చేసిన తర్వాత ఏదో సినిమాకి వెళ్ళిన గుర్తు. ఆ తర్వాత పదంటే పది రోజులకే మాసివ్ హార్ట్ అటాక్ వచ్చి మా ఆవిడ మరణించడంతో ఆ జ్ఞాపకాలన్నీ అలికినట్టు గజిబిజిగా అయిపోయాయి.

ఈరోజు నేను ఒక్కడినే వెళ్లి దేవుడి గుడిలో కాసేపు కూర్చుని వచ్చాను. శరీరాన్ని ఏదో కట్టడి చేసి భగవత్ సన్నిధానంలో కూర్చోవడమయితే కూర్చున్నా. కానీ, మనసు నా స్వాధీనంలో వుండదు కదా!

చెత్త ఆలోచనలు చుట్టుముడుతూనే వుంటాయి.

మా ఆవిడ చనిపోయి అప్పుడే నాలుగేళ్లా ! అయినా ఇంకా ప్రాణాలతోనే వున్నాను అంటే నా గుండె గట్టిది అయినా అయివుండాలి. లేదా ఆమె మీద నా ప్రేమ వట్టిది అయినా అయివుండాలి”

ఎంతయినా మగవాడిని కదా! రెండూ నిజమే అయివుండాలి.

(09-02-2023)

కింది ఫోటో:

పెళ్ళికాకముందు, ప్రేమలో పడిన కొత్తల్లో మేమిద్దరం (1968)



 

ఏమండీ నేను గుడికి వెళ్లి రానా!’

(కూడా రావడానికి మీకేమైనా  వీలవుతుందా అనేది అందులో అంతరార్ధం)

మా ఇంటికీ, హనుమంతుడి గుడికి మధ్య ప్రహరీ గోడే అడ్డు.  వెళ్ళిరావడం పది నిమిషాల పని.

‘నువ్వు వెళ్ళు. టీవీ వాళ్ళ కారు కూడా వచ్చింది, ఆగమని చెప్పడం బాగుండదు’  అనేవాడిని, ఆమె ఇచ్చిన కాఫీ తాగుతూ. 

కారులో వెడుతుంటే గుర్తుకు వచ్చేది, ఈరోజు మా ఆవిడ పుట్టినరోజు అని. 

గుడికి రమ్మంది ఇందుకా  అని  నా మట్టి బుర్రకు అప్పుడు అర్ధం అయ్యేది. కానీ ఏం లాభం?

ఇప్పుడు బోలెడు  తీరిక. టీవీ చర్చల్ని నాకు నేనుగానే వదులుకున్నాను. 

కానీ, ఇప్పుడు  ఎన్ని గుళ్ళు తిరిగితే, మనసులో పేరుకుపోయిన ఈ క్షోభ సమసిపోవాలి.

దేవుడ్ని నమ్ముకుంది కనుకే, తను ఇబ్బంది పడకుండా, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా హాయిగా మాట్లాడుతూ మాట్లాడుతూ  దాటిపోయింది.

ముందు ముందు ఎన్ని ఇబ్బందులు పడాలో, ఎంతమందిని ఇబ్బంది పెట్టాలో! ఆ దేవుడు ఏమని నొసట  రాసిపెట్టాడో ఎవరికి తెలుసు.

తెలిసిందల్లా, ఈరోజు ఫిబ్రవరి తొమ్మిది, మా ఆవిడ నిర్మల పుట్టిన రోజు.

ఇప్పుడు అన్నీ బాగానే జ్ఞాపకం ఉంటున్నాయి, అదేమిటో మరి.



(09-02-2023)

8, ఫిబ్రవరి 2023, బుధవారం

వార్తల ధృవీకరణ అనేది విశ్వసనీయతకు గీటురాయి – భండారు శ్రీనివాసరావు


వార్త ఒక్కటే. ఒక్కో టీవీలో ఒక్కోరకం స్క్రోలింగ్.

ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియదు. వార్త ఇచ్చేముందు నిర్ధారణ చేసుకోవడం అనేది ప్రాధమిక సూత్రం. అలాటి అవకాశాలు ఈనాటి పాత్రికేయులకు లేవనుకోవాలా?
చాలా ఏళ్ళ క్రితం సంగతి. ఏదో కేసు విషయంలో హైకోర్టు జడ్జి పలానా తీర్పు ఇచ్చారని పీటీఐ వార్తా సంస్థ భోగట్టా. ఇలాటి అంశాలను నిర్ధారించుకోకుండా రేడియో వార్తల్లో చెప్పే వీలు లేదు. సాయంత్రం వార్తల ప్రసార సమయం దగ్గర పడుతోంది. తీర్పు ఇచ్చిన జడ్జి గారు ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడన్నీ ల్యాండ్ లైన్లు. ఫోన్ చేస్తే, జడ్జి గారు బంగ్లా లాన్ లో కూర్చుని టీ తాగుతున్నారని సమాచారం. ఫోను తీసుకుని వెళ్లి ఇవ్వడం కుదురుతుందా అని అనుమానంగానే అడిగాను. ఏ కళన ఉన్నాడో కాని బంట్రోతు ఫోను జడ్జి గారికి ఇచ్చాడు. ఫోన్లో మాటలు వినపడుతున్నాయి. ఎవరది అని జడ్జి గారు అడుగుతున్నారు. రేడియో నుంచి అనగానే లైన్లోకి వచ్చారు. నేను తీర్పు విషయం అడగగానే ఆయన కొంత అసహనానికి గురయ్యారు. అది సహజం కూడా. ‘ఒక న్యాయమూర్తిని ఇలా డిస్టర్బు చేయడం నేరమని తెలుసా’ అంటున్నారు. నేనన్నాను. ‘తెలియదు. కానీ ఇటువంటి వార్తను నిర్ధారించుకోకుండా ప్రసారం చేయడం మాత్రం నేరం’. ఈ జవాబుతో ఆయన మెత్తపడి నేను కోరిన వివరణ ఇచ్చారు. అది వార్తా సంస్థ ఇచ్చిన సమాచారానికి అనుగుణంగానే వుంది. అయినా కొన్ని సంచలన నిర్ణయాలను ప్రసారం చేసేముందు నిజాన్ని నిర్దారించుకోవడం నా విధి. అది నేను పాటించాను. తప్పిస్తే ఆ వార్తాసంస్థ నిబద్ధతను అనుమానించడానికో, మరో దానికో మాత్రం కాదు.
ఇలా ఉండేవి ఆ రోజులు. నిజంగా ఆ రోజులే వేరు.
రేడియోలో మేమే నయం. పొరబాటు జరిగినట్టు గుర్తించగానే వెంటనే 'క్షమించాలి' అంటాము.
ఇప్పుడు ట్వీట్ చేయడం, ఎవరైనా తప్పు పడితే సింపుల్ గా దాన్ని తొలగించి చేతులు దులుపుకోవడం, ఇదీ వరస!

3, ఫిబ్రవరి 2023, శుక్రవారం

శివైక్యం చెందిన కాశీనాధుని విశ్వనాధ్

1979వ సంవత్సరం లో ఒక రోజు.

మా పెద్దన్నయ్య కీర్తిశేషులు పర్వతాలరావు గారికి సినిమాల గోల పట్టదు. అలాంటిది ఆయన స్వయంగా ఒక సినిమాకి ముందుగా టిక్కెట్లు బుక్ చేయించాడు. చిక్కడపల్లి, అశోక్ నగర్ లలో ఉంటున్న కుటుంబాల వాళ్ళం మేమందరం, సుమారు ఓ పాతిక మందిమి పోలో మంటూ రిక్షాలు కట్టించుకుని సుల్తాన్ బజార్ దాపుల్లో, హనుమాన్ వ్యాయామ శాలకు దగ్గర్లో, కందస్వామి లేన్ లో ఉన్న రాయల్ టాకీసుకి వెళ్ళాము. (ఈ హాలు లహౌటీ అనే పెద్ద వ్యాపారస్తుడిదనీ, ఆ హాల్లో కర్టెన్లు, కుర్చీలు అన్నీ పింక్ రంగులో ఉంటాయని, అంచేత దాన్ని పింక్ థియేటర్ అనేవాళ్ళనీ నా జర్నలిష్టు మిత్రుడు, సినిమాల విషయాల్లో ఉద్దండుడూ అయిన వీజేఎం దివాకర్ చెప్పాడు) సినిమా మొదలయింది. హాలు హాలంతా నిశ్శబ్దంగా సినిమా చూస్తున్నారు. అంతా సంగీతం, పాటలు, హీరోయిన్ కి మాటలే లేవు, యేవో పొడిపొడిగా అక్కడక్కడా రెండు మూడు ముక్కలు తప్ప. (జంధ్యాల మాటలు రాశాడు. కధానాయకుడు, నాయకి నడుమ మాటలే వుండవు. సినిమాలో ఎక్కువ డైలాగులు వున్నది అల్లు రామలింగయ్య పాత్రకే) ఇంటర్వెల్ లో ఎవరో అంటున్నారు, ‘మొదట్లోనే రావడం మంచిదయింది, తీరు చూస్తుంటే రెండో వారం పోస్టరు కూడా పడేట్టు లేదు’ తనలో తాను గొణుక్కుంటున్నట్టు.


ఆశ్చర్యంగా రెండో వారం నుంచే మంచి టాకంటుకుంది. జనం క్యూల్లో నిలబడి టిక్కెట్లు కొనుక్కుని చూడ్డం మొదలెట్టారు.

కొన్ని రోజులు పోయాక, విలేకరులకోసం రామకృష్ణా స్టూడియోలోని మినీ థియేటర్లో ఆ సినిమా ప్రీవ్యూ వేశారు. నేనూ వెళ్లాను. హాలు సగం వరకు కుర్చీలు వేశారు. మొదటి వరసలో ఒకాయన కాకీ ప్యాంటు, కాకీ షర్టు టక్ చేసుకుని దీక్షగా సినిమా చూస్తున్నారు. నేను ఆల్రెడీ చూసిన సినిమాయే కనుక ఆయన్నే గమనిస్తూ పోయాను. ఒక విగ్రహంలా కూర్చుని, కన్ను ఆర్పకుండా చూస్తూ సినిమాలో లీనమైపోయారు. ఇంటర్వెల్ లో మళ్ళీ ఈ లోకంలో పడడానికి ఆయనగారికి కొంత వ్యవధి పట్టింది. అంతా లేచివెళ్ళి ఆయన్ని అభినందిస్తున్నారు. నేనూ వెళ్లి నమస్కరించాను.

ఆయనే తెలుగు సినిమాని మరో మలుపు తిప్పిన కాశీనాధుని విశ్వనాధ్!


కట్ చేస్తే.....

 మళ్ళీ 2017లో...

‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు స్ట్రోక్ తగిలింది నాకు, సన్ స్ట్రోక్ లాగా.’ అన్నారు డైరెక్టర్ కే. విశ్వనాథ్, నేను సభ్యుడిగా ఉన్న వయోధిక పాత్రికేయ సంఘం వారు ఆయనకా  రోజు ఫిలిం ఛాంబర్ లో చేసిన సన్మాన సభలో మాట్లాడుతూ. నిజానికి ఈ కార్యక్రమంలో అత్యంత క్లుప్తంగా ప్రసంగించింది కూడా విశ్వనాద్ గారు మాత్రమే. వరస సన్మాన పరంపరలతో, టీవీ ఇంటర్యూలతో తీరికలేని రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన మాటలివి. నిజంగానే ఆయనలో ఆ అలసట కానవచ్చింది.


శంకరాభరణం గురించి కూడా చెప్పారు.

“ఎవరో ఒకతను తాను ఆ సినిమా డజను సార్లు చూశానని అన్నాడు. అన్ని సార్లు చూడడానికి అందులో ఏముందని అడిగాను. ఏమోసారూ, ఆ సినిమాహాల్లో కూర్చుంటే దేవుడి గుడిలో వున్నట్టు అనిపిస్తుంది’ అన్నాడా కుర్రాడు. జన్మ ధన్యం అవడం అంటే ఇదే కాబోలు”


చాలామంది చాలా మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ శ్రీ రోశయ్య, సినిమాహాలుకు వెళ్లి సినిమా చూడక దశాబ్దాలు గడిచాయని, విశ్వనాద్ సినిమా మాత్రం తప్పకుండా చూసేవాడినని చెప్పారు.



సీన్  కట్ చేసి  కొంత వెనక్కి వెడితే....

1987- 92 మధ్య రేడియో మాస్కోలో పనిచేసిన కాలం నాటి జ్ఞాపకం. ఊలిచ్చవావిలోవాలోని మాస్కో రేడియో భవనంలో నివాసం వుండేవాళ్ళం. మా ఇంటికి పెద్ద దూరం కాదు కానీ, ఒక మోస్తరు దూరంలో 'రష్యన్ సర్కస్' వుంది. టికెట్స్ దొరకడం చాలా కష్టం. దాన్ని చూడాలంటే కనీసం మూడు నెలలముందు నుంచే ప్రయత్నం ప్రారంభించాలి. అయితే మాస్కో రేడియోలో పనిచేస్తున్న విదేశీయులకోసం ఒక సౌలభ్యం వుంది. ఎన్ని టిక్కెట్లు కావాలో తెలియచేస్తే వాళ్లే తెప్పించి పెడతారు. అల్లా ఒకరోజు రష్యన్ సర్కస్ చూసే అవకాశం లభించింది.

సర్కస్ నుంచి తిరిగివస్తుంటే దోవలో ఒక సినిమా హాలు కనబడింది. టిక్కెట్స్ కొనుక్కుని లోపలకు వెళ్లి చూద్దుము కదా, అది మన శంకరాభరణం సినిమా. 


పాటలన్నిటినీ యధాతధంగా తెలుగులో ఉంచేసి, సంభాషణలను మాత్రం రష్యన్ లోకి డబ్ చేశారు. 'ఆకలేసిన బిడ్డ అమ్మా అని ఒకరకంగా అంటుంది ...' అంటూ శంకరాభరణం శంకర శాస్త్రి (సోమయాజులు గారి) నోట రష్యన్ పలుకులు వినబడుతుంటే చెప్పరాని ఆనందం వేసింది. రష్యాలో డబ్బింగ్ పట్ల యెంత శ్రద్ధ తీసుకుంటారో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. తెలుగు శంకరాభరణం సినిమాలో నటించిన నటీ నటుల గాత్రానికి తగిన స్వరం కలిగిన డబ్బింగ్ కళాకారులనే ఎంపిక చేయడం వల్ల, సోమయాజులు గారే కాకుండా, ఆ సినిమాలో నటించిన తదితర నటీనటులు అచ్చు రష్యన్ భాషలో మాట్లాడుతున్నారా అన్న అనుభూతి కలిగింది. 

సినిమా చూసి ఇంటికి రాగానే మద్రాసులో వున్న నా క్లాసుమేటు, ఆ చిత్రానికి సంభాషణలు రాసిన జంధ్యాలకు ఫోన్ చేసి చెప్పేవరకు ఉగ్గబట్టుకోలేక పోయాను. ఒకే రోజున అయాచితంగా లభించిన ఈ రెండు అవకాశాలు మా మాస్కో జీవితంలో మరచిపోలేని మధుర అనుభవాలు


(Published in Andhraprabha on 05-02-2023, SUNDAY)