30, నవంబర్ 2020, సోమవారం

కార్తీక దీపం – భండారు శ్రీనివాసరావు

 

“వచ్చిన వారు సీదా గుళ్ళోకి వెళ్ళకుండా ఇక్కడిక్కడే తిరుగుతుంటే అప్పుడే అనుకున్నా” అందావిడ ఏమనుకున్నదో నాతొ చెప్పకుండా, ఆవిడ ఏమనుకున్నదో మాత్రం నాకు తెలిసేలా.

ఇందిరా పార్కు దగ్గర వున్న శ్రీ విజయ గణపతి ఆలయంలో భక్తులు కిటకిట లాడడం లేదు, కానీ బాగానే వున్నారు. అందరూ  మాస్కులతోనే  కనిపించారు. గుడి ద్వారం దగ్గరే  ఒకావిడ కూర్చుని వచ్చిన వారి చేతులను    సానిటైజ్ చేస్తోంది. వెనక ప్రతి గుళ్ళో కాళ్ళు కడుక్కోవడానికి ఏర్పాట్లు ఉండేవి. ఇప్పుడు కరోనా పుణ్యాన చేతులు వాళ్ళే కడుగుతున్నారు. గుడి మూసివేసే సమయానికి వెళ్ళడం వల్ల కాబోలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా వెలిగించిన దీపాలతో చలి పక్కనే వున్న పార్కులోకి పారి పోయినట్టుంది. అక్కడ నన్ను ఆకర్షించింది ఒక పెద్ద సైజు బూడిద గుమ్మడి కాయ. నిజానికి అది గుమ్మడి కాయ కాదు. ఆ సైజులో వత్తులతో తయారుచేసిన కార్తీక దీపం. ఆ దీపాన్ని వెలిగించడానికి ముందు కొబ్బరి కాయ కొడుతున్న దంపతులను అడిగాను, ఇందులో ఎన్ని వత్తులు వుంటాయి అని. 



“వన్ కరోర్” అంది నిండా ముప్పయ్యేళ్లు కూడా లేని భార్య,  ఆ దీపం వెలిగించే ఏర్పాట్లలో పక్కకి వెడుతూ.

“కోటి వత్తులా!” ఆశ్చర్యపోవడం నా వంతయింది.

 పిల్లను ఎత్తుకుని ఉన్న అతడిని అడిగాను ఇది ఎంత ఖరీదు అని. 

“ I don’t know. You ask my wife” అన్నాడతను.

అదే ప్రశ్న ఆవిడను అడిగాను. దూరంగా ఒక ఆడ మనిషిని చూపించి అక్కడ అడగండి అంది. నేను ఆమె దగ్గరికి వెళ్లి అడిగాను ఖరీదు ఎంత. ఎక్కడ దొరుకుతుంది అని.

“మిమ్మల్ని చూసి అప్పుడే అనుకున్నాను” అని అప్పుడు అన్నమాట అదన్నమాట. నాలో ఉత్సుకతను కనుక్కుందని అర్ధం అయింది.

“మూడువేలు. మళ్ళీ పోయి అడగకండి. మొగుడికి వెయ్యి అనిచెప్పింది. నాకు మూడు వేలు ఇచ్చింది. మీకూ కావాలా! ఈ నెలంతా వీటికి బాగా డిమాండ్”

ఇందిరా పార్కు ప్రహరీకి ఆనుకుని వున్న గణపతి గుడి చిన్నదే అయినా చుట్టుపక్కల చాలా పెద్ద పేరుంది. అలాంటి గుడిలో భక్తులు, మాస్కులు కట్టుకుని ఈ కరోనా సమయంలో వెలిగిస్తున్న కార్తీక దీపాలు చూస్తుంటే చాలా ముచ్చట వేసింది. 

నిన్న ఆదివారం మా ఏడో అక్కగారు తుర్లపాటి భారతీ దేవికి సహస్ర చంద్ర దర్శనం ఉత్సవ సందర్భంగా వేదోక్తంగా  కన్న సంతానం  కనకాభిషేకం చేశారు.  మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు, విమల వదిన గార్లతో  కలిసి అక్కడికి  వెళ్లి తిరిగివస్తూ దోవలో  ఆ గుడికి వెళ్ళాము.

దాదాపు ఏడెనిమిది నెలల తర్వాత మొదటిసారి దేవాలయ దర్శనం.  

‘కోటి వత్తులు ఎలా లెక్క పెడతారు?’

ఇంటికి తిరిగివస్తున్నంత సేపు నా మనసులో ఈ ప్రశ్న సుళ్ళు తిరుగుతూనే వుంది.

“నమ్మకం” అన్నాడు మా అన్నయ్య, నా ఆలోచన గ్రహించినట్టుగా. 

(30-11-2020)

మా భారతి అక్కయ్య - భండారు శ్రీనివాసరావు

 

పదకొండు మంది సంతానంలో ఆడపిల్లల్లో ఆమె చిన్నది. మగపిల్లల్లో నేను చిన్న వాడిని. అంతే అంతవరకే పోలిక. ఆమె వ్యక్తిత్వం ముందు నేనో పిపీలికాన్ని.

రేడియో డ్యూటీ మీద బెజవాడ వెళ్ళినప్పుడు,   గాంధీ నగరం లోని వాళ్ళింట్లోనే వారాల తరబడి నా ఆల్ మకాం.

 పొద్దున్నే రేడియో స్టేషన్ కారు వచ్చేది. నేను తలుపులు తీసుకుని బాత్ రూమ్ కి వెడుతుంటే బయట బండెడు అంట్ల గిన్నెలు, ఎంగిలి కంచాలు. అంటే అంతమంది జనం రాత్రి ఆ ఇంట్లో భోజనాలు చేశారన్న మాట. పక్కనే మా బావగారి పూజా రూము. అప్పటికే ఆమె  లేచి ఆ గది శుభ్రం చేసి పూజకు కావాల్సిన సంభారాలన్నీ సిద్ధం చేసిపెట్టి  నాకు కాఫీ కలిపి ఇచ్చేది. ఇంత పనీ తాను ఒంటి చేత్తో  సంభాలించేది. 

ఈ  బక్కపలచటి ఈ మనిషిలో అంతటి శక్తి ఎక్కడిది ? ఈ ప్రశ్నకి నాకు తెలిసి ఒకటే జవాబు. 

కుటుంబం పట్ల ఆమెకున్న కమిట్ మెంట్. ఈ పదానికి ఆమెకు అర్ధం తెలుసని అనుకోవడం లేదు. కానీ దానికి నిలువెత్తు నిదర్శనం మాత్రం  ఇదిగో ఈ కుర్చీలో కూర్చున్న మా అక్కయ్యే.







భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్టు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఒక గృహిణిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా ఇన్నేళ్ళుగా శరీరం సహకరించినా లేకపోయినా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చింది. 

దానికి గుర్తింపే ఇదిగో ఈ ఉత్సవం. ఈ పండగ. 

ఈ అదృష్టం ప్రతి తల్లికీ లభించాలంటే  రమేష్, సురేష్, పరేష్, సతీష్, రాజేష్ వంటి కుమారులు,  పద్మ, , స్వర్ణ , విజయలక్ష్మి,  సౌజన్య,  నీరజ వంటి కోడళ్ళు కావాలి. అదంత సులభం కాదు. 

ఈ శుభసందర్భంలో మా అక్కయ్యకు పాద నమస్కారాలు. అందరికీ అభినందనలు. పిల్లలకు ఆశీస్సులు.

నాకు సంబంధించి ఒక్కటే లోటు. మా ఆవిడ వున్నట్టయితే ఇదంతా చూసి ఆమె ఆనందానికి అవధులు వుండేవి కావు. (29-11-2020)

“హమే తుమ్సే ప్యార్ కిత్ నా......”

 నా హిందీ అంతంత మాత్రం. హిందీ సినిమాలకు వెళ్ళినప్పుడు హాల్లో అందరూ పాప్ కార్న్ తింటుంటే నేను మాత్రం మా ఆవిడ మెదడు కొరుక్కుని తింటుండేవాడిని, ఆ హీరో ఏమన్నాడు? ఆ హీరోయిన్ ఎందుకలా ఏడుస్తోంది? అని అడ్డమైన ప్రశ్నలు వేస్తూ.

మా పెద్దవాడు సందీప్ పెళ్ళికి రాంచీ నుంచి ఆడపెళ్లి వాళ్ళు తరలివచ్చారు. రవిగారు, విజయ శ్రీనగర్ కాలనీలో తాము కొనుక్కున్న కొత్తఫ్లాటును వాళ్లకి బసగా ఇచ్చారు. శ్రీ వాస్తవ్ గారు, ఆయన భార్య ఇందూ శ్రీ వాస్తవ్ వారి సమీప బంధువులు చాలామంది వచ్చారు.

1999 నవంబరు 29 అర్ధరాత్రి సందీప్ పెళ్లి. సత్యసాయి కళ్యాణ మండపంలో. ఆ రోజుల్లో హైదరాబాదులో ఆ మండపం కాసింత ఖరీదు వ్యవహారమైనా శ్రీ వాస్తవ్ దాన్ని ముచ్చటపడి ఎంపిక చేసుకున్నారు.

ఈ పెళ్ళికి అరుణ, శేఖర రెడ్డి దంపతులు మూడు రోజులపాటు తమ ఖరీదైన కారును మా అధీనంలో ఉంచారు. అమీర్ పేటలోని శైలి అపార్ట్ మెంటు నుంచి శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమం వరకు బారాత్ సాగింది. అదీ మాకు కొత్తే. సందీప్ స్నేహితులు పవన్, సుధీర్, సుధాకర్, రాజశేఖర్, కృష్ణ, శేషిరెడ్డి, కోటిరెడ్డి దారిపొడుగునా నృత్యాలు చేస్తూ మంచి ఉత్సాహం కలిగించారు.

ఆరోజు ఉదయం కళ్యాణ మండపంలోనే ఉపనయనం. ఆ ఏసీ హాల్లో హోమం చేయడానికి నిబంధనలు అడ్డం వచ్చి, బయట కారిడార్లోనే ఆ కార్యక్రమం పూర్తిచేసాము. అదే ఇబ్బంది పెళ్ళికి కూడా ఎదురయింది. సాంప్రదాయ బద్ధంగా కన్యాదానం చేయాలనుకున్న శ్రీవాస్తవ్ దంపతులు లోపల రిసెప్షన్ ఏర్పాట్లు చేసుకుని బయట ఆవరణలో షామియానాలు వేయించి, కుర్చీలు తెప్పించి మరో పెళ్లి ఖర్చు మీద వేసుకున్నారు.

బెజవాడ నుంచి ఈ పెళ్ళికి వచ్చిన హనుమంతరావు బావ పెళ్లి జరిగే వేదికకు దగ్గరలో కుర్చీ వేయించుకుని ఇటు దక్షిణాది పద్దతిలో, అటు ఉత్తరాది విధానంలో ఏక కాలంలో తెల్లవారుఝాము దాకా కొనసాగిన వివాహ క్రతువును ఆ సాంతం శ్రద్ధగా చూసారు. రాంచీ నుంచి వచ్చిన మహిళా పురోహితురాలు తాను చదువుతున్న ప్రతి మంత్రానికి అర్ధ తాత్పర్యాలను వివరించి చెప్పడం హనుమంతరావు బావగారిని ఆకర్షించింది. పెళ్లిని ఒక తంతులాగా ముగించడం కాకుండా ఆ క్రతువును నిష్టతో నిర్వహించడం చూసి ఆయన ఆ మహిళా పురోహితురాలిని మెచ్చుకున్నారు కూడా.

అంతకుముందు రోజు అంటే నవంబరు 28 న రవి గారి అపార్ట్ మెంటు ‘డోఎన్’ లో మెహందీ కార్యక్రమం. అప్పటిదాకా ఇలాంటి తంతులు ఎరగని వాళ్ళం కనుక మెహందీలో చిన్నాపెద్దా అందరూ సరదాగా పాటలు పాడడం చూసి ఎంతో సంబరపడ్డాము.

అదిగో అప్పుడు పెళ్లి కుమారుడు సందీప్ గోడనానుకుని నిలబడి, క్రీగంట పెళ్లి కుమార్తె భావనను చూస్తూ పాడిన పాటే ఇది.

“హమే తుమ్సే ప్యార్ కిత్ నా......”

అర్ధం నాకంతగా బోధపడలేదు కాని, రాంచీ నుంచి వచ్చిన పెళ్లి వారందరూ తెగ మెచ్చుకున్నారు.

ఈ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ మర్నాడు కాక ఆ మర్నాడు (డిసెంబరు ఒకటి) బేగంపేటలోని ఎయిర్ పోర్టు దగ్గరలోని ఒక హోటల్లో జరిగిన మా రెండో అన్నయ్య రామచంద్ర రావు గారి కుమారుడు రాజేష్, ప్రియల పెళ్ళికి కూడా హాజరయి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళడం భండారు కుటుంబానికి ఒక మరపురాని తీయటి జ్ఞాపకం.

భావన, సందీప్ మీ ఇద్దరికీ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ప్రియ, రాజేష్ లకు ముందస్తు శుభాశీస్సులు.

పైన రాసిన ఆ హిందీ పాటకి గూగులమ్మ లింకు:

https://www.youtube.com/watch?v=iJllh7l-D3g

28, నవంబర్ 2020, శనివారం

నా గురించి నలుగురూ

“నీ గురించి నువ్వు ఎప్పుడూ చెప్పుకోకు. మంచి చెప్పుకుంటే ఎవరూ నమ్మరు. చెడు చెప్పుకుంటే ఇంకా ఎంత వుందో అని రాగాలు తీస్తారు.”

ఎప్పుడో రేడియోలో పనిచేసే రోజుల్లో నా బల్ల మీద నేను రాసిపెట్టుకున్న సూక్తి. మనం ఎవ్వరం అనేది మనం ఎంత తక్కువ చెప్పుకున్నా ఇతరులకు అది ఎక్కువగానే అనిపిస్తుంది. అది మానవ సహజం. మన గురించి నలుగురూ ఏమనుకుంటున్నారో అదే నిజమైన ‘మనం

ఒకప్పుడు ఈనాడు  పత్రికకు  న్యూస్  బ్యూరో చీఫ్ గా చేసి, ఎన్. జనార్ధన రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయనకు ప్రధాన పౌర సంబంధాల అధికారిగా పనిచేసిన ఏ. రజా హుస్సేన్ ప్రముఖ రచయిత, ప్రసిద్ధ కవి, భావుకుడు కూడా. ఆయన నా గురించి, నా రచనలు గురించి సవివరంగా రాసిన పోస్టు ఒకటి గ్రూపుల్లో  చక్కర్లు కొడుతూ  నా దృష్టికి వచ్చింది.  ఇందులో అతిశయోక్తులుగా మీకు అనిపించినవి వడపోసి చదువుకుంటే ఎక్కడో అక్కడ  ‘నేను నా సూక్ష్మ రూపంలో కనపడతాను)    

కరోనా...కాలమ్.. – ఏ. రాజాహుస్సేన్

*ఆయన 'భండారు ' మాత్రమే కాదు...సమాచార 'భాండాగారం ' కూడా…!!

ఆయన రాతలకు కొన్ని మచ్చుతునకలు :

*దేవుడా! నాకు డబ్బివ్వు. ఎంతంటే, అవసరంలో ఉన్నవారికి సాయపడేటంత…!!

*దేవుడా! నాకు అధికారం ఇవ్వు. ఎంతంటే, అవసరంలో ఉన్నవారికి ఉపయోగపడేటంత !!.

*దేవుడా! నాకు మంచి ఆరోగ్యం ఇవ్వు. వయసు మళ్ళినప్పుడు ఎవరిమీదా ఆధారపడకుండా వుండేటంత'!

*నిర్ణయం మంచిది అయినప్పుడు అది పలానా వ్యక్తి తీసుకున్న నిర్ణయం కాబట్టి మంచిదనే నిర్ణయానికి రావద్దు. పలానా వ్యక్తి చేసిన నిర్ణయం కాబట్టి మంచిదయినా కాదని తప్పు పట్టవద్దు.

*నిజానికి రూలు అందరికీ ఒకటే. మన దేశంలో ఇబ్బంది ఏమిటంటే దాన్ని అమలు చేసే అధికారి/సిబ్బంది దయాదాక్షిణ్యాలను బట్టి రూలు రంగూ రుచీ మారుతుంటుంది.

*ఆరోపణలు చేయడానికి ఆధారాలు అక్కరలేదు. వాటిని ప్రసారం/ప్రచారం చేసే మాధ్యమాలు వుంటే చాలు

*'మీడియా మేనేజ్ మెంట్, మీడియా కంట్రోల్! ఈ రెండూ మీడియా స్వేచ్ఛను హరించేవే!'

*మూడు స్థంభాలకు జరూరుగా మరమ్మతులు జరగాలి. నాలుగోది అంటారా?Beyond Repair

*దేశంలో కావాల్సింది చమురుశుద్ధి కర్మాగారాలు కాదు, చిత్తశుద్ధి కర్మాగారాలు. ఎందుకంటే పూర్తి కొరత వున్నది దానికే్!

*ఒక సామాన్యుడి విషయంలో చట్టం ఎలా అమలవుతుందో అదే చట్టం అసామాన్యుల పట్లకూడా అదేవిధంగా వర్తిస్తే అప్పుడు చట్టం ముందు అందరూ సమానులు అనే సూక్తికి అర్ధం వుంటుంది.లేని పక్షంలో దేశంలో రెండు చట్టాలు వున్నట్టే లెక్క.

ఆకాశవాణి ఇంటి పేరుగా మార్చుకున్న భండారు శ్రీనివాసరావు,

*అతడజాత శత్రువు....అతడు ఆకాశవాణి విలేకరి.. అతడు హాస్య చతురుడు.. అతడు సహృదయుడు.. అతడు హితుడు…సన్నిహితుడు...

"మనిషి మెత్తన .. మాట మెత్తన... మృదు స్వభావి...వివాదరహితుడు!!

ఓ మనిషిలో ఇన్ని సుగుణాలుండటం
విశేషమే సుమా..?
మా భండారు శ్రీనివాసరావులో ఇవన్నీ
రాశిగా పోసివున్నాయి.

కానీ... భండారు శ్రీనివాసరావు మాత్రం…….
తాను సకల గుణ సంపన్నుడినేం కాదు అంటాడు..

"నాకు వుండకూడని అవగుణాలు అన్నీ ఉన్నాయి. కోపం, ఉక్రోషం, పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట తూలడం ఇలా అనేకం. కానీ దేవుడు నాయందు దయతలచి అసూయ ఇవ్వలేదు. అంచేత నిలువునా తగలబడి పోకుండా ఇలా నిలబడి వున్నాను".!! అంటాడు శీను.

ఆకాశవాణి విలేకరి అంటే .".కట్టె కొట్టె చెప్పె" అన్నట్లుంటారు. కానీ శ్రీనివాసరావు ఇందుకు మినహాయింపు.

వార్తను క్షుణ్ణంగా అర్థంచేసుకోనిదే ఫోన్ ఎత్తేవాడు కాదు. ఫ్లాష్ న్యూస్ ఆగమేఘాల మీద అందించే వాడు. రేడియోకి ఎంత అవసరమో అంతే..

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కార్యదర్శిగా, వైస్ ప్రెసిడెంట్ గా, కార్యవర్గ సభ్యుడిగా, ప్రెస్ క్లబ్ ఎన్నికలకు రిటర్నింగ్ ఆఫీసర్ గా వివిధ హోదాల్లో పనిచేశాడు ..

సూర్య దినపత్రికలో అయిదారేళ్ళపాటు "సూటిగా..సుతిమెత్తగా" శీర్షికతో వారానికి రెండురోజులు
వివిధ విషయాలపై వ్యాసాలు రాశాడు. సాక్షి, ఆంధ్రప్రభ , జ్యోతి, భూమి  వంటి పత్రికల వాళ్ళు ఆయనచేత అడిగి మరీ రాయించుకుంటారు. తెలుగు యూనివర్సిటీవారు తాపీ ధర్మారావు పేరిట పత్రికా రచనకు ఇచ్చే కీర్తి పురస్కారానికి ఎంపికయ్యాడు.


ఈయనది పండిత వంశం. పాత్రికేయుడిగా, వార్తల చదువరిగా, రచయితగా ఆయనది యాభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. ఎందరో  ముఖ్యమంత్రులకు  ఫోన్  చేసి పలకరించగల చనువు వున్నా ఏనాడూ తన పరిధి దాటలేదు. వారితో కూర్చుని విందు భోజనాలు చేసినా ఏనాడూ నాకిది చేసిపెట్టమని ఎవరినీ అర్థించలేదు. ఇప్పటికీ శ్రీనివాసరావు వుండేది అద్దె ఇంట్లో ఉంటున్నాడు అంటే నాకే నమ్మకం కుదరదు. కానీ అది వాస్తవం.  అందుకే రాజకీయ నాయకులకే కాదు, జర్నలిజం ఫీల్డ్ లో దిగ్గనాధీరులయిన వారికి కూడా ఆయనంటే అంత గౌరవం.

రష్యా రేడియో లో చాలా సంవత్సరాలు తెలుగు వాణిని వినిపించాడు. ఆ నాలుగేళ్ళ సమయంలో వారికి  మాస్కోలో ఎదురైన తియ్యని అనుభూతులను పంచదార పాకంలో వేసి ద్రాక్షపాకంలో కలిపి పాఠకులకు అందించారు. 2012,లో వచ్చిందీ పుస్తకం.. ‘మార్పు చూసిన కళ్ళు పేరుతొ.
ఆయన పదవీవిరమణ చేసి పుష్కరం దాటిపోయింది.
టివీ చర్చాకార్యక్రమాల్లో విశ్లేషకుడిగా ఇప్పటికీ ఈ వయసులో కూడా క్రియాశీలకంగా వుండడం ఆశ్చర్యం.  ఉన్నంతలో విషయాన్ని ఉన్నదున్నట్లు చెప్పే ఒకే ఒక్క విశ్లేషకుడు  అనే పేరు తెచ్చుకున్నాడు. టీవీల వారే  ఆయన్ని అడిగిమరీ చర్చలకు  పిలిపించుకుంటారు. రోజుకు  మూడు   ఛానళ్ళ చర్చల్లో  పాల్గొనేవాడు. విభిన్న రాజకీయ దృక్పధాలు కలిగిన ఛానళ్ళు ఆయన్ని ఆహ్వానించడం శ్రీనివాసరావు నిష్పాక్షికతకు నిదర్శనం. భార్యా వియోగంతో ..ఏడాది నుంచీ  టీవీ చర్చలకు దూరమయ్యాడు. అయినా ఛానళ్ళవాళ్ళు ఇంటికి వెళ్లి మరీ ఆయన అభిప్రాయాలు రికార్డు చేసుకుంటారు.

విషయాన్ని విడమరిచి నిష్పక్షపాతంగా తన అభిప్రాయం చెప్పడం, చర్చల్లో హుందాగా వ్యవహరించడం..ఎదుటి వారిని నొప్పించకుండా..విషయాన్ని విపులంగా వివరించడం శీను ప్రత్యేకత!!

భండారు శ్రీనివాసరావు నాకంటే వయసులోనే కాదు, ప్రొఫెషన్ గా కూడా సీనియరే. అయినా ఎందుకనోమొదటి నుంచీ ఆయన్ను " శీను" అనిపిలవడం అలవాటైంది. ఆయన దగ్గర అంత చొరవ ఎందుకు అంటే,  చెప్పడం కష్టమేమీ కాదు...అది ఆయన మంచి
తనం..సహృదయత..అంతే..!

శ్రీనివాసరావు పేరుకు ఆల్ ఇండియా రేడియో రిపోర్టరే.  కానీ..నిజానికి సకలకళావల్లభుడు. రాజకీయం,
సాహిత్యం, శాస్త్రం, కళలు, సామాజికం,..ఇలా రంగమేదైనా...ప్రవేశం, పరిజ్ఞానం అపారం. అందుకే నేను
శీను ను "అల్ ఇన్ ఒన్ "అంటాను…

ఆలిండియా రేడియో శ్రీనివాసరావు ఇప్పుడు ఫేస్ బుక్ శ్రీనివాసరావుగా మారిపోయాడు. ఆయన పోస్టులకోసం చకోర పక్షులుగా ఎదురు చూసేవారు కోకొల్లలుగా వున్నారు. ఆయన ఏదైనా ప్రజా సమస్య  గురించి రాసారు అంటే ప్రభుత్వాలు దిగివచ్చి దిద్దుబాటు చర్యలు తీసుకున్న సందర్భాలు అనేకం.  ఆయన కలం అంత పవర్ ఫుల్. తెలంగాణా మంత్రి కేటీఆర్   ఒకసారి బీబీసీ ఇంటర్వ్యూ లో  శ్రీనివాసరావు పేరు ప్రస్తావించి మరీ  చెప్పారు ఈ సంగతి.

భండారు శ్రీనివాసరావు అప్పుడప్పుడూ ‘ గీత’’ కారుడైపోతుంటాడు. వివిధ విషయాలు, సంఘటనలపై భాష్యం చెబుతుంటాడు.

ఫేస్బుక్ పై శీను భాష్యం చూడండి..!!

“ఇది జుకెర్ బర్గ్ సృష్టించిన వింత ప్రపంచం. ఇక్కడ వయస్సుతో నిమిత్తం లేదు. అనుభవంతో నిమిత్తం లేదు. అందరూ సమానమనే గొప్ప ప్రపంచం. ఒకరకంగా మనం ఎవరం ఎప్పుడూ చూడని కొత్త ప్రపంచం. ఈ ప్రపంచంలో ఎంత జాగ్రత్తగా మసలుకోవాలో
ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు”

ఆఖరికి  తను పనిచేసిన మీడియా రంగాన్ని కూడా ఆయన వదలకుండా తన రాతలతో  దుమ్ము దులిపారు.

మచ్చుకు  చూడండి ఆయన మాటలు ఎంత ఘాటుగా ఉంటాయో.

“సరే! జగను, బాబు, కేసీఆర్, మోడీ, రాహుల్ అంటే మీ లెక్కలేవో మీకున్నాయి. నిష్పక్షపాతంగా రాయాలి అంటే మీ ఇబ్బందులేవో మీకున్నాయి. అలాగే, ఆర్ధిక సంబంధాలు, రాజకీయ అనుబంధాలు వగైరా వగైరా!

“మరి ఎవరి కొమ్మూ కాయల్సిన అవసరం లేని సందర్భం వచ్చినప్పుడు కూడా మీడియా స్వతంత్రంగా, స్వేచ్ఛగా, నిర్మొహమాటంగా, భయమూ, బెదురూ లేకుండా వార్తను వార్తగా రాయడానికి ఏమి అడ్డం వస్తోంది. అమెరికా ఎన్నికల్లో ట్రంపునో, బైడన్ నో మోయాల్సిన అవసరం ఏమొచ్చింది?

“ట్రంపు మేనమామ కొడుకూ కాదు, బైడన్ మేనత్త కొడుకూ కాదు. వాళ్ళు మీకు ఇచ్చే ఆర్ధిక వత్తాసూ ఏమీ లేనప్పుడు మీ కలాలకు బానిస సంకెళ్ళు దేనికి? ఎందుకోసం?

"మీడియాను కట్టడి చేయడంవల్ల అధికారంలోవున్నవాళ్ళు శాశ్వతంగా అధికారంలో కొనసాగుతారా? అంటే గ్యారెంటీ లేదు" -

*ప్రభుత్వ తాయిలాలతో మీడియాను తమ కనుసన్నల్లో వుంచుకునే పార్టీలు శాశ్వతంగా అధికారంలో వుండగలవా? అంటే ఆ గ్యారెంటీ అస్సలు లేదు" -

*అధికార పార్టీని ఓడించడానికి వ్యతిరేకత ఒక్కటే సరిపోదు. ఆ వ్యతిరేకత నుంచి అసహనం పుట్టాలి. ఆ అసహనం నుంచి అసహ్యం పుట్టాలి. ఆ పార్టీని ఓడించి తీరాలి అనే కసి పుట్టాలి. ఎన్నికల చరిత్రలో ఘోర పరాజయాలకు, ఘన విజయాలకు ఇదే మూల సూత్రం. వ్యక్తుల పాత్ర కేవలం కాకతాళీయం.

*"అదేమిటండీ. ప్రెస్ ని ఎదురుగా పెట్టుకుని అంతేసి అబద్ధాలు అలవోకగా చెప్పేశారు?"
"
చూడూ. రాజకీయాల్లో నేనెక్కడ వున్నాను? నువ్వెక్కుతున్న నిచ్చెన పైమెట్టు మీద. నువ్వేమో ఇంకా మొదటి మెట్టు దాటలేదు. ఒక నీతిపాఠం చెబుతా, గుర్తెట్టుకో. అబద్ధం చెప్పు. కానీ గోడ కట్టినట్లు ధాష్టీకంగా చెప్పు. జనం అప్పుడే నమ్ముతారు. అది అబద్దమో కాదో నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎదుటి పార్టీ మీద వుంటుంది. ఇంకో సంగతి. ప్రెస్ కి కూడా ఇలాంటి సంగతులే కావాలి. పెద్దగా కష్టపడకుండా పెద్దగా ఖర్చు పెట్టకుండా పబ్లిసిటీ రావాలంటే ఇదే ఉత్తమ మార్గం. సరే పోయి వాళ్ళకి ఏమేం కావాలో దగ్గరుండి చూసుకో. పో."

"విరిగి పెరిగితి, పెరిగి విరిగితి - కష్టసుఖముల సారమెరిగితి’ అన్న గురజాడ వాక్కు కొందరి విషయంలో అక్షర సత్యం.!

కొందరు సుఖపడడానికి పుడతారు. తాము సుఖపడుతూ ఇతరులను కూడా సుఖపెడతారు. ఇంకొందరు తాము సుఖపడుతూ ఇతరులను కష్టపెడతారు. మరికొందరు కష్టపడడానికి పుడతారు. వారిలో కొందరు కష్టపడుతూ తోటివారిని సుఖపెడతారు.పైన చెప్పిన కవి వాక్కు ఇలాటివారిని గురించే. బహుశా ఈ చివరి తరగతి వారు ఆడవారయివుంటారు.

*అస్తు..అస్తు..జబరదస్తు….!

“పూర్వం వీధి నాటకాల్లో కేతిగాడు అనేవాడు రంగ ప్రవేశం చేసి తన వెకిలి చేష్టలతో గ్రామీణ ప్రజల్ని నవ్వించేవాడు. ఈటీవీలో ఓ ప్రోగ్రాం వస్తుంటుంది. దాన్ని చూస్తుంటే అది జ్ఞాపకం వచ్చింది. ఈ ప్రోగ్రాం, పేరేమిటో తెలియదు కాని, ఇందులో ఒకరా ఇద్దరా అనేకమంది కేతిగాళ్ళు. వీళ్ళ చేష్టలు, ఆకారాలు వెకిలిగా, వికృతంగా వున్నాయి. దీనికి తోడు ఆ కార్యక్రమానికి జడ్జీలుగా వచ్చిన ప్రసిద్ధ నటీనటులు పగలబడి నవ్వుతుండడం చూసి మరింత రోతగా అనిపించింది. దీన్ని నేను ఇంతవరకు చూడలేదు, కానీ వింటూ వస్తున్నాను.

రామోజీ రావు గారు తమ ఛానల్లో వచ్చే ప్రతిదీ చూసి ఓకే చేస్తారని చెబుతుండగా విన్నాను. నేను విన్నది నిజం కాదేమో అనిపిస్తోంది " .. !!

మీడియా మొఘల్ కు ఎవరైనా ఇలా ఓపెన్ గా సలహా ఇవ్వగలరా!

శీను...మీరిలానే ఎప్పుడూ... మీలానే వుండండి.!!

ఏ.రజాహుస్సేన్.!

Top of Form



27, నవంబర్ 2020, శుక్రవారం

ఒకే దేశం ఒకే ఎన్నిక – భండారు శ్రీనివాసరావు

 ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ గారి ఈ ప్రతిపాదన ఆహ్వానించతగింది. నిజానికి మనదేశానికి స్వాతంత్రం వచ్చిన తొలి ఎన్నికలు ఈ విధంగానే జరిగాయి. లోకసభకూ, ఆయా రాష్ట్రాల శాసన సభలకు కలిపి ఒకేసారి, కాకపొతే వివిధ దశల్లో ఎన్నికలు నిర్వహించేవారు. ఇది కొత్త పద్దతి కాదు, కొత్త సంప్రదాయమూ కాదు.

నెహ్రూ హయాములో ఒకసారి 1959 లో  కేరళ రాష్ట్రంలో అప్పటి కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని తొలగించి మొట్టమొదటిసారి రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టారు. తదాదిగా, అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలహీన పడడం, అక్కడ నిలదొక్కుకున్న స్థానిక నాయకత్వాలను, ప్రాంతీయ, సంకీర్ణ ప్రభుత్వాలను దెబ్బతీయడానికి, లేదా తొలగించడానికి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగంలోని 356 అధికరణాన్ని విచ్చలవిడిగా, విశృంఖలంగా వాడుకునే కొత్త వికృత సాంప్రదాయానికి తెర లేచింది. ఈ విధంగా చేయడం ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందని విపరీతంగా విమర్శలు చేసి. కాంగ్రెస్  పార్టీని ఎన్నికల్లో మట్టి కరిపించి  కేంద్రంలో అధికారంలోకి వచ్చిన జనత పార్టీ కూడా కాంగ్రెస్ పాలనలో ఉన్న అనేక రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించి ప్రజాస్వామ్య హననంలో తామూ తక్కువ తినలేదని రుజువు చేసింది.

ఈ గత అనుభవం నేర్పే పాఠం ఏమిటంటే, ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’, అదీ ఒకేసారి అనే విధానం సక్రమంగా అమలు కావాలంటే ముందు రాజ్యాంగంలో ఉన్న రాష్ట్రపతి  పాలన విధింపుకు అవకాశం ఇచ్చే  356వ అధికరణాన్ని రద్దు చేయాలి. దానికి ప్రత్యామ్నాయాన్ని గురించి ఆలోచించాలి. ఒకవేళ శాంతి భద్రతల కారణంగానో, లేదా రాజకీయాలకు అతీతమైన సహేతుక కారణంతోనో ఏదైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఎదురైతే, ఏం చేయాలి అనేదానిపై దేశవ్యాప్త చర్చ జరగాలి.

రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలనకు అవకాశం వుంది కాని కేంద్రంలో ఇందుకు అవకాశం లేదు. ఏదైనా  కారణంతో ప్రభుత్వం పడిపోతే  మళ్ళీ ఎన్నికలకు పోవడం మినహా వేరు గత్యంతరం లేదు. ఈనాటి  కలగూరగంప రాజకీయాల్లో, సంకీర్ణ ప్రభుత్వాల శకంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు మరీ ఎక్కువ. వీటిని నిరోధించకుండా, వీటికి ఒక పరిష్కారం  కనుగొనకుండా ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ అనే విధానం ఆచరణలో  సఫలం కాదు. ఇందుకు ముందు కావాల్సింది ఎన్నికల సంస్కరణలు. పార్టీ ఫిరాయింపుల చట్టానికి మరిన్ని పటిష్టమైన సవరణలు చెయడం.  ఇవన్నీ జరిగిన తర్వాతనే ముందుకు పోవడం అవసరం.

అలాగే, ఈ విధానం  ఎప్పటి నుంచి అమలుచేయాలి అనేది కూడా దుస్తరమైన నిర్ణయమే. ఎందుకంటే ఉదాహరణకు 2023నుంచి అనుకుంటే,  ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయిన కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ పదవీ కాలానికి చాలా ముందు గానే అధికారం నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. ఈ లెక్కలు ముందు సరిచేయాలి.

‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ నినాదం ఆకర్షణీయమైనదే. ఇది అమలు చేస్తే  ఎన్నికల వ్యయం తగ్గుతుంది. అభివృద్ధి అవాంతరాలు లేకుండా సాగుతుంది. అనేక దేశాల్లో ఈ పద్దతి జయప్రదంగా అమలు అవుతోంది. కానీ ఒకసారి  దారి తప్పిన ఈ విధానాన్నిమళ్ళీ దారిలోకి తేవాలంటే అనేక అడ్డంకులు ఉన్న వాస్తవాన్ని గమనంలో ఉంచుకోవాలి.

లేనిపక్షంలో గుర్రం ముందు బండి కట్టిన చందం అవుతుంది.   (27-11-2020)   

26, నవంబర్ 2020, గురువారం

TO WHOMSOEVER IT MAY CONCERN - BHANDARU SRINIVAS RAO

 

“సుమతీ శతకాలు, సూక్తి ముక్తావళులూ ఎన్నికల్లో వోట్లు రాల్చవు”
ఇది నేటి రాజకీయులు వొంటికి పట్టించుకున్న నగ్న సత్యం.

ఈ విషయంలో ఏ పార్టీకి మినహాయింపులేదు. అందుకే వోటర్లని ప్రలోభపెట్టడానికి వారు తొక్కని అడ్డ దారులు వుండవు. వోటర్లని ఆకర్షించడానికి వేయని పిల్లి మొగ్గలు వుండవు. ఈ విషయంలో వెనుకడుగు వేసే పార్టీ అంటూ కలికానికి కూడా దొరకదు. అందుకే నరం లేని నాలుక వారి చేత హామీల వర్షం కురిపిస్తుంది. ఒకటా రెండా, సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి కనుక్కున్న ఉచిత సంక్షేమ పధకాలతో దట్టించి వోటర్లకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్న మేనిఫెస్టోలకు కొరత లేదు. ప్రజలనుంచి ముక్కు పిండి వసూలు చేసి నింపిన ప్రభుత్వ ఖజానా డబ్బులతో, ఇలా ఈ చేత్తో ఇచ్చి అలా ఆ చేత్తో వోట్లు రాబట్టి అధికార పీఠం కైవసం చేసుకోవాలని చూసే రాజకీయ పార్టీల ‘క్విడ్ ప్రోఖో’ ఎన్నికల హామీల తాయిలాలను ఎలా ఇస్తారన్నడానికి లెక్కలు లేవు. ఎన్నాళ్ళు ఇస్తారన్నడానికి జవాబులు లేవు. ఇందులో ఒకరు తక్కువ తిన్నదీ లేదు, ఎదుటి వాడిని తిననిచ్చిందీ లేదు.

అందుకే అయ్యలూ! ఓ పని చేయండి. ఇలా చేస్తే, మీకూ, ఓటర్లకు మాత్రమే కాకుండా ప్రభుత్వాలకు కూడా ప్రయోజనకరంగా వుంటుంది. మీ మీ పార్టీలు ఏమీ బీదవి కావు. అందరికీ తెలిసిన విషయమే. ఓట్లకోసం మీరు పెట్టే ఖర్చే ఈ వాస్తవాన్ని తెలుపుతుంది. గెలిచిన పక్షంలో ఒక్క ఏడాది పాటు మీరిచ్చిన ఈ ఉచిత హామీలను మీ పార్టీ నిధులతో అమలు చేయండి. ఆ తర్వాత సర్కారు ఖజానా నుంచి ఖర్చు పెడుదురు కాని.

మీకు ప్రజాధనం విలువ తెలిసిరావాలంటే ఇంతకంటే వేరు మార్గం కనబడడం లేదు.
ఏమంటారు?