30, నవంబర్ 2014, ఆదివారం

మనశ్శాంతికి మంచి మార్గం


బుద్ధుడు అంతేవాసులతో కలసి అడవి మార్గాన వెడుతున్నాడు.
దోవలో ఆగి ఒక శిష్యుడిని పిలిచి ‘దాహంగా వుంది మంచి నీళ్ళు పట్టుకురమ్మ’ని కోరాడు.
అతడు చుట్టుపక్కల పరికిచి చూస్తే దగ్గరలో ఓ వాగు కనిపించింది. ఆకుల దొన్నెలో నీళ్ళు పట్టుకురాబోయేలోగా ఒక  ఎడ్లబండి అటుగా వచ్చింది. ఎడ్లు వాగుదాటే క్రమంలో  అందులోని  నీళ్లన్నీ మురికి మురికిగా మారాయి.  ఆ నీటిని తీసుకువెళ్లడం ఆ శిష్యుడికి మనస్కరించలేదు.
తిరిగి బుద్ధుడి దగ్గరికి వెళ్ళి వున్న విషయం మనవి చేసుకున్నాడు. ‘స్వామీ! వాగులో నీరు మురికి మురికిగా వుంది’
బుద్ధుడు తలపంకించి వూరుకున్నాడు.      

అప్పటికి అక్కడే విశ్రాంతికోసం  విడిది చేసిన బుద్ధుడు కొంతసేపు గడిచిన తరువాత అదే శిష్యుడిని పిలిచి మంచి నీరు పట్టుకు రావాల్సిందని మళ్ళీ కోరాడు.
శిష్యుడు మళ్ళీ వాగువద్దకు వెళ్లాడు.
అప్పటికీ వాగులో నీళ్ళు  తేరుకోలేదు.  బురద బురదగానే వున్నాయి.
శిష్యుడు తిరిగి వచ్చి అదే విషయం బుద్ధుడితో చెప్పాడు. బుద్ధుడు ఏమీ మాట్లాడలేదు.
మరి కొద్ది సేపటిలోనే ఆ శిష్యుడికి మళ్ళీ పిలుపు. నీళ్ళు తెమ్మని గురువుగారి అర్ధింపు.
ఈసారి వెళ్లేసరికి వాగులో నీరు తేరుకుని వున్నాయి. నిర్మలంగా వున్న నీటిని ఆకు దొన్నెలో తెచ్చి గురువు గారికి అందించాడు.
బుద్ధుడు ఆ నీటిని సేవించి శిష్యుడితో ఇలా అన్నాడు.
‘దీన్నిబట్టి నీకేం అర్ధం అయింది. ముందు వెళ్ళినప్పుడు వాగులో నీళ్ళు మురికిగా వున్నాయి.
‘కొంత వ్యవధానం తరువాత అవే తేరుకున్నాయి. అవి అలా తేరుకోవడానికి మనం చేసినదేమీ లేదు. కొంత వ్యవధి ఇచ్చాం అంతే.
 ‘మన మనసు కూడా ఆ వాగులో నీటి మాదిరే.
‘అది కలత చెందినప్పుడు దాన్ని దాని మానాన వొదిలిపెట్టాలి. కాసేపటి తరువాత అదే కుదుట పడుతుంది.
‘ఈ మర్మం తెలుసుకోగలిగితే మనశ్శాంతి కష్టమేమీ కాదు.
‘మానసిక ప్రశాంతత కోసం వేరే  ప్రయత్నాలేవీ  అవసరం లేదు. నిజానికి ఎలాటి ప్రయత్నమూ లేకుండానే దాన్ని పొందవచ్చు.’



28, నవంబర్ 2014, శుక్రవారం

రాతి యుగం ఆలోచనలు ఇక మారవా?


(Published by 'SURYA' telugu daily in its Edit Page on 30-11-2014, SUNDAY)

నవంబర్ మాసంలో నాలుగో గురువారం అమెరికాలో చాలా ప్రాముఖ్యత కలిగిన దినం. ఆ రోజును అమెరికాలో 'థాంక్స్ గివింగ్ డే' గా పాటించి ఘనంగా జరుపుకుంటారు. కనిపెంచిన  తలితండ్రులకు  ఆదేశపు పౌరులు కృతజ్ఞతలు తెలుపుతూ తమ స్తోమత కొద్దీ కానుకలు ఇచ్చే రోజు. ఆ పండుగ తరువాతి రోజున వచ్చే   శుక్రవారం అమెరికన్లకు 'బ్లాక్ ఫ్రైడే'.  వారి  జీవితంలో ఈ బ్లాక్ ఫ్రైడే కి చాలా ప్రాముఖ్యత వుంది. బ్లాక్ డే అనగానే అదేదో సంతాప దినం అని అనుకోరాదు. ఆ రోజున అమెరికాలో క్రయ విక్రయాలు  భారీగా జరుగుతాయి.  కొనుగోలుదారులతో  వీధులు చాలా రద్దీగా వుంటాయి. యెంత రద్దీ అంటే ఆరోజున కారు  టైర్ల గుర్తులతో రహదారులు నల్లగా తయారవుతాయిట. అందుకే ఆ దినాన్ని అమెరికన్లు బ్లాక్ ఫ్రైడే అని పిలుచుకుంటారని  ఒక కధ ప్రచారంలో వుంది.
జన జీవితంలో విశేష ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ రెండు ప్రత్యేక దినాలను ఈ ఏడాది జరుపుకోరాదని అనేక ప్రజా సంఘాలు పిలుపు ఇచ్చాయి. దీనికి కారణం లేకపోలేదు. అదేమిటంటే-  అమెరికా దేశంలోని సెంట్ లూయీస్ పొలిమేరల్లోని ఫెర్గ్యూసన్ పట్టణంలో జరిగిన ఓ సంఘటన.  
శరీర వర్ణాన్ని బట్టి రక్తం రంగు మారదు. మనిషి స్తితిగతులనుబట్టి ప్రాణం విలువ పెరగదు, తరగదు.
అయినా ఈ పాడు  ప్రపంచంలో విలువల కొలమానాలు తారుమారవుతూనే వున్నాయి. ఇటీవల అమెరికాలో ఒక న్యాయ స్థానం గ్రాండ్ జ్యూరీ  ఇచ్చిన తీర్పే దీనికి నిలువెత్తు ఉదాహరణ.
ఒక నల్ల జాతి యువకుడ్ని కాల్చి చంపిన  ఘటనలో, అందుకు కారకుడయిన  శ్వేతజాతి  పోలీసు అధికారిపై   నేరారోపణ చేసే అవసరం లేదని మిస్సోరీ రాష్ట్రంలోని ఫెర్గూసన్ కోర్టు గ్రాండ్ జ్యూరీ చేసిన  నిర్ణయం దేశవ్యాప్తంగా వివాదాలకు, ప్రపంచవ్యాప్తంగా నిరసనలకు కారణమయింది.



నిరసనలు కొన్ని చోట్ల హింసారూపం దాల్చాయి. అనేక ఇండ్లు తగులబెట్టారు. వాహనాలకు నిప్పంటించారు. అల్లరి మూకలను అదుపు చేయడానికి పోలీసులు భాష్పవాయు తూటాలు పేల్చారు.   ఫెర్గ్యూసన్ గవర్నర్ జే నిక్సన్ తన రాష్ట్రంలో అత్యవసర పరిస్తితి ప్రకటించి శాంతి భద్రతలను అదుపుచేయడం కోసం రెండు వేలమందికి పైగా నేషనల్ గార్డులను రంగంలోకి దించారు.  ప్రెసిడెంట్ ఒబామా సైతం శాంతిని కాపాడడంలో సహకరించాలని  అన్ని వర్గాల ప్రజలకు  విజ్ఞప్తి చేయాల్సివచ్చింది. ప్రెసిడెంట్ తన నివాసం అయిన వైట్ హౌస్ లో కూర్చుని టీవీ, రేడియో ద్వారా ఈ విజ్ఞప్తి చేసారు. ప్రధాన టీవీ ఛానళ్ళు ప్రెసిడెంట్ సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తూనే, టీవీ తెరలపై సగం వైపు  ఒబామాను, మరో సగంలో ఫెర్గ్యూసన్ నగరంలో జరుగుతున్న హింసాత్మక  దృశ్యాలను ఏకకాలంలో చూపించడం విశేషం.  ఆ తరువాత కూడా అవాంఛనీయ సంఘటనలకు అడ్డుకట్టపడలేదు.  అమెరికాలో  జాత్యహంకార మూలాలు ఇంకా మిగిలే వున్నాయని మీడియా గగ్గోలు మొదలయింది. ఒక ఆఫ్రికా అమెరికన్ దేశాధ్యక్షుడిగా వున్నప్పుడు జరిగే  ఇటువంటి సంఘటనలకు సహజంగానే ప్రాచుర్యం లభిస్తుంది.      
ఈ పరిణామాలకు దారితీసిన కాల్పుల సంఘటన  గత ఆగస్టు తొమ్మిదో తేదీన ఫెర్గ్యూసన్ నగర నడివీధిలో అరిగింది. పద్దెనిమిదేళ్ళ  నల్లజాతి యువకుడు మైఖేల్ బ్రౌన్ ని పోలీసు అధికారి డారెన్ విల్సన్ తన రివాల్వర్ తో ఆరు సార్లు కాల్చడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ యువకుడు తన మీద దాడి  చేసాడనీ, ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరపాల్సివచ్చిందనీ అధికారి వివరణ ఇచ్చుకున్నాడు. బ్రౌన్  తనను కారులోకి నెట్టి, తన ఆయుధాన్ని లాక్కోవడానికి ప్రయత్నించాడని ఆ అధికారి పేర్కొన్నట్టు సెంట్ లూయీస్ పోలీసులు చెబుతున్నారు.    అయితే ఆ సంఘటన జరిగినప్పుడు బ్రౌన్ వెంట వున్న అతడి స్నేహితుడు డోరియన్ జాన్సన్ కధనం వేరేగా వుంది. 'ఇద్దరూ కలిసి  జాన్సన్ ఇంటికి నడిచి వెడుతుండగా పోలీసు వాహనం అటుగా వచ్చింది. పోలీసు అధికారి వారిని పక్కకు తొలగి నిలబడమని ఆదేశించాడు. అధికారి కారు నుంచి దిగుతూనే కారు డోరుతో బ్రౌన్ ని బలంగా నెట్టాడు. బ్రౌన్ ని చేతులతో వొడిసి పట్టుకుని రివాల్వర్ తో కాల్చాడు.'  మామూలుగా అయితే ఇది సర్వ సాధారణ సంఘటనే. కాల్చిన పోలీసు అధికారి శ్వేత జాతీయుడు కావడం, విచారణ జరిపిన గ్రాండ్ జ్యూరీ, ఆ అధికారి తప్పేమీ లేదని  తీర్పు చెప్పడం యావత్ వివాదానికి తెర తీసింది.
గతంలో ఇటువంటి సంఘటనలు జరక్కపోలేదు. శ్వేత జాతి పోలీసులు ఆఫ్రికన్ అమెరికన్ల పట్ల వివక్ష చూపుతున్నారన్న ఆరోపణలు కూడా వున్నాయి. అమెరికాలో వర్ణ వివక్షను అరికట్టడానికి అబ్రహాం లింకన్ కాలంలో మొదలయిన సంస్కరణలు, చేసిన చట్టాలు చేస్తున్న ప్రయత్నాలు కూడా తక్కువేమీ కావు. ఆదేశంలో నల్లజాతివాడని, నీగ్రో అనీ పిలవడం నిషిద్ధం. అయినా వారిలో ఇంకా అభద్రతాభావం గూడుకట్టుకునే  వుంది. ఫెర్గ్యూసన్ సంఘటన  దరిమిలా దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచం నలుమూలలా వినవస్తున్న నిరసన స్వరాలు అమెరికన్ పాలకుల మనస్తత్వంలో మార్పు తీసుకు రాగలవని విశ్వసించడం మినహా చేయగలిగింది లేదు.
సమస్త సృష్టిలో ఎక్కడా లేని ఈ వర్ణ వివక్ష కేవలం మానవులకే పరిమితం కావడం మరో విషాదం. 

NOTE : Courtesy Image Owner   


26, నవంబర్ 2014, బుధవారం

'రాజధాని' కబుర్లు

(Published By 'SURYA' Telugu Daily in its Edit Page on 26-11-2014, Thursday)

ఇప్పుడు ఎక్కడ విన్నా 'రాజధాని' కబుర్లే.
దేశాలకు గానీ రాష్ట్రాలకు గానీ నూతన రాజధానుల నిర్మాణం అనేది కొత్తేమీ కాదు. ప్రాచీన కాలంలో ఈజిప్షియన్లు, రోమన్లు, చైనీయులు తరచుగా రాజధానులను ఒక చోటి నుంచి మరో చోటికి మార్చుకున్నట్టు ఆధారాలు వున్నాయి. రాజకీయ, ఆర్ధిక కారణాలు మాత్రమే కాకుండా దేశ రక్షణ అంశాలు కూడా ఇందులో ముడిపడి వున్నాయి. ప్రజల నడుమ ఐక్యత, ప్రాదేశిక భద్రత అనేవి రాజధాని ఎంపికలో కీలక భూమిక పోషిస్తాయి. 


(ప్రాచీన రాజధాని)

దక్షిణ కొరియా  ఉదాహరణ తీసుకుందాం.
అక్కడ కొత్త రాజధాని నిర్మించాలని ప్రతిపాదించారు  ప్రస్తుత రాజధాని సియోల్ కాకుండా సెజోంగ్ అనే మరో చోట నూతన రాజధాని ఏర్పాటు చేసుకోవాలని 2005 లోనే ఒక బృహత్తర ప్రణాళిక రూపొందించారు. రెండు లక్షల పదమూడువేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఒక భారీ భవన నిర్మాణాన్ని 2011  నవంబర్ లో మొదలు పెట్టి  రెండేళ్లలో  పూర్తిచేశారు. నిరుడు డిసెంబర్ నెలలో సియోల్ నుంచి అనేక ప్రభుత్వ విభాగాలను నూతన రాజధానికి తరలించారు. పాత రాజధాని సియోల్ లో మాదిరిగా  ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని మౌలిక సదుపాయాలతో కిక్కిరిసిపోకుండా కొత్త రాజధానిని సరికొత్త ఆలోచనలతో నిర్మించాలనే పాలకుల అభిప్రాయానికి అనువుగా వృత్తాకారంలో, మధ్యలో ఎలాటి నిర్మాణాలు లేకుండా నూతన  రాజధాని డిజైన్ కు రూపకల్పన చేసారు. వృత్తాకార నిర్మాణాలకు ఆవల ఇరవై ఇరుగు పొరుగు ఆవాస ప్రాంతాలు అభివృద్ధి జరిగేలా ప్రణాలికలు తయారు చేసారు. సాంప్రదాయిక ఇరుగుపొరుగు ప్రాంతాల అభివృద్ధితో పాటు, మారుతున్న పరిస్తితులకు అనుగుణంగా అభివృద్ధి  చేసే ఆధునిక విధానాలను జోడించడం ఈ ప్రణాళికల్లోని ప్రత్యేకత.
అయితే కొత్త రాజధాని నిర్మాణ పధకాలకు మొదటి అడ్డంకి రాజకీయ ప్రత్యర్ధుల విమర్శల రూపంలో ఎదురయింది.  కొరియన్ జాతీయ అసెంబ్లీలో ఈ అంశంపై చర్చలు చాలా తీవ్రంగా జరిగాయి. ఎన్ని అడ్డంకులు ఎదురయినా ప్రభుత్వం తన ప్రణాళికతో ముందుకు పోయింది. నిరుడు జులై నెలలో మలేసియా కు చెందిన పుత్రజయ, కొరియా నూతన రాజధాని నగరం సెజోంగ్ సిటీ నడుమ అవగాహన పత్రంపై సంతకాలు జరిగాయి. కొత్త రాజధాని ఒక ఆర్ధిక కేంద్రంగా రూపొందేందుకు వీలుగా ఉప ప్రణాలికలు తయారు చేసారు. భవిష్యత్తులో పెరగబోయే జనాభా అవసరాలకు తగ్గటుగా పౌర సదుపాయాలు కల్పించడానికి వీటిని తయారు చేసారు.
ఇక బ్రెజిల్ విషయం తీసుకుంటే -
బ్రెజిల్ దేశపు రాజధాని నిర్మాణం జరిగి  యాభయ్ ఏళ్ళు పూర్తయిన తరువాత కూడా ఈనాటికీ అది ప్రపంచంలోని సుందర రాజధాని నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందుతూ  ఉన్నదంటే ఆ నగరం రూపకల్పన యెంత పకడ్బందీగా చేసారో అర్ధం అవుతుంది. పైగా ఈ రాజధాని నిర్మాణాన్ని కేవలం నలభయ్ ఒక్క మాసాలలో పూర్తిచేయగలగడం మరో విశేషం. 1956 - 1961 మధ్య బ్రెజిల్ అధ్యక్షుడిగా వున్న జుసెలినో కుబిత్చెక్ - బ్రేసీలియా పేరుతొ ఈ కొత్త రాజధాని నిర్మాణాన్ని సత్వరంగా పూర్తి చేసి 'అయిదేళ్ళలో యాభయ్ ఏళ్ళ అభివృద్ధి' అనే నినాదానికి ఊపిరి పోశారు. పట్టుదల వుంటే ఏదీ అసాధ్యం కాదు అని నిరూపించారు.    
పొతే,  అమెరికా.
అమెరికన్  విప్లవం అనంతరం దేశ రాజధానికి అనేక నగరాలను పరిశీలించారు.ఫిలడెల్ఫియా, బాల్టిమోర్, న్యూయార్క్ సిటీలతో పాటు ఎనిమిది నగరాలు పరిశీలనకు వచ్చాయి. చివరికి ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ పొటామాక్ నదీ తీరంలో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసారు. వర్జీనియా, మేరీ లాండ్ రాష్ట్రాల వాళ్ళు రాజధాని నగర నిర్మాణానికి అవసరమైన భూమిని విరాళంగా ఇచ్చారు. ఆ విధంగా వాషింగ్టన్ డీసీ నగరం రూపుదిద్దుకుంది. 1800 నుంచి అమెరికా రాజధానిగా విలసిల్లుతోంది. దక్షిణాది రాష్ట్రాల ఆర్ధిక ప్రయోజనాలు, ఉత్తరాది రాష్ట్రాల యుద్ధ బకాయిల చెల్లింపు డిమాండ్ల కారణంగా తలెత్తిన వివాదం దరిమిలా రాజీ మార్గంగా ఈ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసుకోవలసి వచ్చింది.
రష్యా
14 వ శతాబ్దం నుంచి 1712 వరకు రష్యన్ సామ్రాజ్యానికి మాస్కో రాజధానిగా వుండేది. దరిమిలా రష్యాను మరింత పాశ్చాత్య పోకడలకు దగ్గర చేసే ఉద్దేశ్యంతో యూరోపుకు దగ్గరగా వుండే సెంట్ పీటర్స్ బర్గ్ నగరానికి రాజధానిని మార్చారు. తిరిగి కమ్యూనిస్ట్ విప్లవం అనంతరం రాజధాని    1918 లో మళ్ళీ మాస్కోకి తరలిపోయింది.
కెనడా
కెనడా పార్లమెంటు సమావేశాలను మొదట్లో టొరంటో. క్యూబెక్ సిటీలు రెండిట్లో విడతలువారీగా నిర్వహిస్తూ వుండేవారు.   1857లో అట్టావా దేశపు రాజధాని అయింది. నిజానికి ఆరోజుల్లో అట్టావా అనేది చాల చిన్న పట్టణం. పైగా బాగా వెనుకబడిన ప్రాంతంలో వుండేది. కాకపొతే ఒంటారియో, క్యూబెక్ ప్రాంతాలకు నడుమ వుండడం దీనికి కలిసివచ్చింది.
ఆస్ట్రేలియా 
19 వ శతాబ్దంలో మొత్తం ఆస్ట్రేలియాలో సిడ్నీ, మెల్బోర్న్ ఈ రెండే పెద్ద నగరాలు. దేశ రాజధాని విషయంలో ఈ రెంటి నడుమ గొప్ప పోటీ ఏర్పడింది. రాజీ మార్గంగా కొత్త రాజధాని నిర్మించాలని నటి పాలకులు నిర్ణయించారు. విస్తృతంగా సర్వే చేసిన తరువాత న్యూ సౌత్ వేల్స్ ప్రాంతంలో ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసి అక్కడ రాజధాని నిర్మించారు. ఆవిధంగా ఒక ప్రణాళికాబద్ధంగా నిర్మించిన కాన్ బెర్రా 1927 నుంచి ఆస్ట్రేలియా రాజధానిగా ఉంటోంది. సిడ్నీ. మెల్బోర్న్ నగరాల నట్టనడుమ ఈ కొత్త రాజధానిని నిర్మించారు. కాకపోతే సముద్రతీరం లేని రాజధాని నగరం అది.
ఇండియా
ఇండియా బ్రిటిష్ పాలనలో వున్నప్పుడు 1911 వరకు తూర్పు తీరంలో వున్న  కలకత్తా రాజధానిగా వుండేది. పరిపాలన సౌలభ్యం కోసం బ్రిటిష్ వారు రాజధానిని ఉత్తర భారతంలోని ఢిల్లీకి మార్చారు. న్యూ ఢిల్లీ నగరాన్ని  ఒక ప్రణాళిక ప్రకారం నిర్మించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947 సంవత్సరం నుంచి భారత దేశపు రాజధానిగా కొనసాగుతోంది.
టాంజనీయా
1970 ప్రాంతాల్లో టాంజనీయా రాజధానిని తీర ప్రాంతంలో వున్న దార్ ఎస్ సలాం నుంచి దేశం నడిబొడ్డులో వున్న దొదోమా నగరానికి మార్చారు. దశాబ్దాలు గడిచిపోతున్నాయి కానీ నూతన రాజధాని నిర్మాణం మాత్రం ఇంకా పూర్తి కాలేదు.
మియన్మార్ (బర్మా)
లోగడ బర్మాగా వున్న నేటి మియన్మార్ కు ఒకప్పుడు రంగూన్ రాజధానిగా వుండేది. మియన్మార్ రాజధాని మార్పిడి చాలా ఆకస్మికంగా జరిగిపోయింది.  2005 నవంబర్ లో సైనిక ప్రభుత్వం రంగూన్ లో వున్న ప్రభుత్వ సిబ్బందిని హుటాహుటిన దేశానికి ఉత్తర కొనలో వున్న నేపిడా (Naypyidaw) నగరానికి తరలి వెళ్ళమని ఆదేశించింది. మరింత ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే రాజధాని కోసం మూడేళ్ళ క్రితమే ఆ నగరాన్ని నిర్మించిన విషయం బయటకు పొక్కకుండా చూడడం. ఈ వివాదాస్పద రాజధాని మార్పిడికి కారణం జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహా అని ఒక వదంతి అక్కడ బహుళ ప్రచారంలో వుంది. పెద్ద నగరం అయిన రంగూన్ ను వొదిలి చాలా చిన్న జనాభా కలిగిన పట్టణాన్ని ఎంచుకోవడానికి మరో పైకి చెప్పని కారణం వుంది. రంగూన్ వంటి పెద్ద నగరంలో రాజధాని వుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనల్లో  జనం పెద్ద ఎత్తున పోగవడానికి ఆస్కారం వుంటుంది. అంచేత అలాటి వాటికి వీలులేకుండా  చూడడానికే రాజధానిని మరో చోట  మారుమూల చిన్న ప్రాంతానికి తరలించారని  రాజకీయ ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు. (26-11-2014)
NOTE: Courtesy Image Owner




25, నవంబర్ 2014, మంగళవారం

మంత్రిని కుమ్మిన గేదె కధ


సాక్షాత్తు ఒక కేంద్ర మంత్రిని  పల్లెటూరి  గేదె ఒకటి   కొమ్ములతో కుమ్మి కింద పడేసింది. ఇది జరిగింది వెనుకబడిన  మహబూబ్ నగర్ జిల్లాలో. వేల జనం చూస్తుండగా గేదె తన ప్రతాపాన్ని ప్రదర్శించింది. చుట్టూ వున్న అధికారులు, పోలీసులు నిశ్చేష్టులయి చూస్తూ వుండిపోయారు. మొత్తమ్మీద  సుఖాంతంగా ముగిసిన ఈ కధాకధన క్రమంబెట్టిదనిన:



(This incident was narrated to me by my brother Shri B.Ramachandra Rao, who retied as Chief General Manager State Bank Of India. Story in his words)
"దాదాపు 31 సంవత్సరాల క్రితం 1983 లో నేను హైదరాబాదు స్టేట్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ గా పనిచేస్తున్న రోజులు.  ఒక రోజు ఉదయం ఆఫీసుకు వెళ్ళీ వెళ్ళగానే సీ.జీ.ఏం. గారు అర్జంటుగా పిలుస్తున్నారని కబురు. శ్రీ ఏమ్వీ  సుబ్రహ్మణ్యం గారు (ఇప్పుడు లేరు) అప్పుడు సీ.జీ.ఎం. నేను  వెళ్లేసరికి ఆయన ఛాంబర్లో  నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యుడు  శ్రీ మల్లు అనంత రాములు గారు కూర్చుని వున్నారు.  కేంద్రంలో ఆర్ధిక శాఖ సహాయ మంత్రిగా వున్న  శ్రీ  జనార్ధన పూజారి గారికి అయన  చాలా సన్నిహితులు. సీజీఎం గారు విషయం సూటిగా చెప్పారు.
'మరో పది రోజుల్లో మంత్రిగారు నాగర్  కర్నూల్  వస్తున్నారట. స్టేట్ బ్యాంక్ వాళ్ళు బ్రహ్మాండమయిన లోన్ మేళా ఏర్పాటుచేయాలి.'
ఇంతలో అనంత రాములు గారు, జనార్ధన  పూజారి గారికి తాను  యెంత దగ్గరో తెలియచెప్పడానికో ఏమో ఆ గదిలోనుంచే ఫోను కలిపించి ( అప్పట్లో సెల్ ఫోనులు లేవు) మంత్రిగారితో మాట్లాడించారు. ఫంక్షన్ ఎలా జరగాలో మంత్రిగారు  ఫోనులోనే మా సీజీఎం గారికి పది నిమిషాలపాటు హుకుం జారీ చేసారు. అనంతరాములు గారు సంతృప్తిగా వెళ్ళిపోయారు కానీ,  సీజీఎం గారికి భయం పట్టుకుంది. మంత్రిగారు ఆ సభకి కనీసం పదివేలమంది రైతులు రావాలి, ప్రతివారికీ రుణ సంతర్పణ జరగాలి అని చెప్పారట. 'పదిరోజుల్లో ఇది ఎలా సాధ్యం అని అంటూనే, 'ఏం చేస్తావో తెలవదు. మంత్రి గారి చేత మాట రాకుండా చూడాల్సిన బాధ్యత నీది. మీటింగ్ ఏర్పాట్లు ఘనంగా వుండాలి. యెంత ఖర్చయినా పరవాలేదు. నేను 'రాటిఫై' చేస్తాను. నాకు మాత్రం మాట రాకూడదు' అనేసారు. (జనార్ధన పూజారి గారు వ్యక్తిగతంగా ఎంతో నిజాయితీ పరులు. కానీ బ్యాంకు ఉన్నతాధికారులను కూడా బహిరంగ సభల్లో కడిగేస్తారు. పేరుకు జూనియర్ మంత్రి అయినా ఆయన అంటే బ్యాంకింగ్ రంగంలో టెర్రర్. దేశమంతా లోన్ మేళాలు పెట్టించి బ్యాంకింగ్ వ్యవస్తఃను ఒక రకంగా పలుచన చేసారు. అది వేరే సంగతి).
ఇక చూడాలి. మా అవస్థలు. వున్నది పదిరోజులు. రుణాలు ఇవాల్సింది పదివేల మందికి. నాగర్ కర్నూల్ డివిజన్లోని మా పదిమంది బ్రాంచి మేనేజర్లు రాత్రనక, పగలనక అవిశ్రాంతంగా కష్టపడ్డారు. నేను కూడా వారితో కలిసి ఆ  ప్రాంతం అంతా తిరిగాను. మా మేనేజర్లతో ఒక్కటే చెప్పాను. 'ఈ హడావిడిలో ఎలాటి తప్పులు చేయవద్దు. తప్పుడు పేర్లతో లోన్లు ఇవ్వవద్దు. మీ మీద  ఏ వత్తిడి వచ్చినా, అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా నాకు ఫోను చేసి చెప్పండి. మర్నాడే నేను వచ్చి చూసుకుంటాను. మీరు మాట పడవద్దు, నాకు మాట రానియ్యవద్దు.'
సిబ్బంది శ్రమ ఫలించింది. పెట్టుకున్న టార్గెట్ చేరుకోగలిగాము.
ఆరోజు రానే వచ్చింది. సాయంత్రం నాలుగు గంటలకు నాగర్ కర్నూల్ లో బహిరంగ సభ.  హైస్కూల్ మైదానంలో ఎక్కడ చూసినా జనమే జనం. రుణ గ్రహీతలకోసం మంజూరు చేసిన  దాదాపు వెయ్యి గేదెలు, రెండు వందల ట్రాక్టర్లు, వందలాది పంపు సెట్లు అక్కడకు తెప్పించి పెద్ద ఎగ్జిబిషన్  పెట్టాము.
అదంతా చూసి అనంతరాములు గారు ఖుషీ. ఆయన ఖుషీ చూసి మా సీజీఎం గారు ఖుషీ. కధ ఇలా ప్రశాంతంగా సాగిపోతున్న సమయంలో ఉన్నట్టుండి ఒక జరగరాని సంఘటన జరిగిపోయింది.
మంత్రి గారు ఈలోపల గేదెల స్టాల్ చూస్తానన్నారు. అక్కడికి వెళ్లి అక్కడి బ్యాంకు సిబ్బందితో గేదెలను గురించి రకరకాల ప్రశ్నలు సంధించారు. జవాబులు ఆయనకు సంతృప్తి కలిగించడంతో బతుకు జీవుడా అనుకున్నాము. ఇంతలో అనంత రాములు గారు 'చీకటి పడుతోంది, తొందరగా సభ మొదలు పెడదాం' రండని పిలిచారు. మంత్రి గారు సరేనంటూ  పక్కకు తిరిగారు. పెద్ద పెద్ద  కొమ్ములున్న ఓ పెద్ద గేదె ఆయన కంట పడింది. అలాటి గేదెలు బాగా తెలిసున్నవాడిలా  ఆయన చరచరా దాని దగ్గరకు వెళ్లి చూసారు. ఆ గేదె గురించి  మళ్ళీ కొన్ని ప్రశ్నలు వేసారు. మేము తత్తరపడుతుంటే  అయన -  'మీరంతే. ఏసీ రూముల్లో కూర్చునే బ్యాంకర్లు. గేదెలగురించి మీకేం తెలుస్తుంది? నేను చెబుతాను వినండి' అంటూ ఓ చేత్తో గేదె కొమ్ములు పట్టుకుని చెప్పడం మొదలు పెట్టారు.
ఆ గేదెకి ఈ వ్యవహారం నచ్చినట్టు లేదు. అకస్మాత్తుగా అది మెడవంచి కొమ్ములతో మంత్రిగారిని అమాంతం కుమ్మేసింది. గేదె కబుర్లు చెప్పబోతున్న మంత్రిగారికి కళ్ళు బైర్లు కమ్మాయి. కుమ్మడమే కాకుండా అది పూజారి గారిని కింద పడేసి కాళ్ళతో తొక్కబోయింది. అందరం బిత్తరపోయాం. ఏం చెయ్యాలో తెలియదు. ఓపక్క గేదె కాళ్ళకింద మంత్రి గారు. మరో పక్క కాలెత్తి తొక్కడానికి సిద్ధంగా వున్న గేదె. వూరివాళ్ళు కలిపించుకుని గేదెని పట్టుకు  వెళ్లి దూరంగా కట్టేశారు. మంత్రిగారు కిందపడి  లేవలేకుండా వున్నారు. ఇంతలో ఎవరో 'డాక్టర్ డాక్టర్' అని అరిచారు. ఇంకెవరో వెళ్లి ఓ డాక్టర్ ని పట్టుకొచ్చారు. అమ్మయ్య అనుకున్నాం.  తీరా చూస్తె అయన పశువుల డాక్టర్. మా సీజీఎం గారి బీపీ పెరిగిపోతోంది. చివరికి పూజారి గారు తనకు తానే తేరుకున్నారు. తేరుకోగానే ఆయనకు తను మంత్రి అన్న విషయం స్పృహకు వచ్చింది. లేచి  నిల్చుని 'డోంట్ వర్రీ నాకేం కాలేదు. నాకు ప్రజలు ముఖ్యం. వారితో మీటింగ్ ముఖ్యం. నాకేం జరిగిందన్నది ముఖ్యం కాదు' అంటూ చకచకా వెళ్లి స్టేజి ఎక్కారు.
జరిగిన దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమో ఏమో మంత్రి గారు ఆరోజు అనర్ఘళంగా మాట్లాడారు. గట్టిగా గొంతెత్తి ప్రసంగించడం మొదలు పెట్టారు. మేము ఏర్పాటు చేసిన అనువాదకుడు కూడా రెచ్చిపోయి అంతకంటే గట్టిగా బిగ్గరగా అరవడం మొదలు పెట్టాడు.
మంత్రి గారు స్వరం పెంచి అడిగారు. " ఇక్కడకు వచ్చిన పదివేలమందిలో బ్యాంకు లోను కోసం ఎవరయినా లంచం ఇచ్చారా. అది నాకు తెలవాలి. లంచం ఇస్తే చేతులెత్తండి. వాళ్ళను ఇక్కడే సస్పెండ్ చేస్తాను, మీకేం భయం లేదు. భయపడకుండా చేతులెత్తండి."
కాసేపు అంతటా నీరవ  నిశ్శబ్దం. స్టేజి మీద మరింత భయంకరమైన నిశ్శబ్దం. అయిదు నిమిషాలు గడిచాయి. ఎవరూ చేతులు ఎత్తలేదు.
మంత్రి గారు పట్టువదలని విక్రమార్కుడిలా మళ్ళీ మైకు పట్టుకుని చెప్పారు.
అనువాదకుడు తెలుగులో అంతకంటే గట్టిగా కరిచినట్టు అరిచి చెప్పాడు.
'చెప్పండి. భయపడకండి' అంటూ.
చివరికి మంత్రిగారు ఓ మెట్టు దిగి అడిగారు.
'సరే. ఇప్పుడు మరోటి అడుగుతా చెప్పండి.  మీలో లంచం ఇవ్వకుండా లోను తీసుకున్నవాళ్లు ఎవ్వరో చేతులు ఎత్తండి'
ఒక్కసారిగా అందరూ చేతులు ఎత్తారు. స్టేజ్ మీద వున్న బ్యాంకర్లు  ఊపిరి పీల్చుకున్నారు.
మంత్రి గారు ఉపన్యాసం ఇలా ముగించారు.
'ఈ నాగర్ కర్నూల్ సభని నేనెప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికి వెళ్ళినా మీ ఉదాహరణే చెబుతాను'
అక్కడికి కధ సుఖాంతం. కానీ కధ అయిపోలేదు.
అప్పుడు రుణ మేళాలు. ఇప్పుడు రుణ మాఫీలు. బ్యాంకింగ్ వ్యవస్థ ఎటు  పోతోందో, ఎటు  పోవాలో అర్ధం కాని  పరిస్తితి.
"Are we playing for galleries? Are we indulging in competitive populism? When so many banks in other  countries  collapsed at one point of time, we are proud that banks in India stood the test of the time. Let us not politicise or pollute our banks. Long live Indian Banks"  

22, నవంబర్ 2014, శనివారం

ఏదో ఒకటి కావాలి!

"పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసి పిల్లలకు పెద్ద
వాళ్ళ పేర్లు కలిసొచ్చేటట్టు పొడుగాటి పేర్లు పెడతారు. చివరికి, చిట్టీ, చిన్నా అంటూ పొట్టి పేర్లతో పిలుస్తారు.
బేగంపేట్ ఎయిర్ పోర్ట్ ను ఏ టాక్సీ
వాడయినా బేగంపేట్ అనే అంటాడు. అలాగే
శంషాబాదు ఎయిర్ పోర్ట్. ఏ పేరు పెట్టినా చివరికి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అనే. ఇక ఈ నాామకరణాాలన్నీ రాజకీయ వాదులాటలకోసం"



NOTE: Courtesy Cartoonist 

21, నవంబర్ 2014, శుక్రవారం

తల్వార్


తల్వార్ అంటే కత్తి. కానీ ఈ ఆర్కే తల్వార్ కత్తిలాంటి మనిషి. అయితే ఈయన 'మాటల్లో మల్లెపూవు, చేతల్లో గులాబీ ముల్లు'  

(Late Shri R.K.Talwar)

చిన్న వయస్సులో స్టేట్ బ్యాంక్  ఆఫ్ ఇండియాలో అతి చిన్న ఉద్యోగంలో చేరారు.  మామూలుగా ప్రతి మూడేళ్ళకోసారి, అదీ ప్రతిభ ఆధారంగా వచ్చే ప్రమోషన్ ఈయన గారికి ఏడాది రెండేళ్ళు తిరక్కుండానే వచ్చేది. అది ఆయన ప్రతిభ కాదు,  పై వాళ్ళని పట్టుకునే చాకచక్యం అని ఎకసెక్కం చేసిన వాళ్ళు లేకపోలేదు. ఐతే అలాటి  'పట్టు' పనిచేసేది ఒకసారో రెండు సార్లో. కానీ తల్వార్ మహాశయులు అలా అలా ప్రతియేటా  నిచ్చెన  మెట్లెక్కి పోయి యాభయ్ రెండేళ్ళ వయస్సులోనే  స్టేట్ బ్యాంక్ చైర్మన్ కుర్చీలో కూర్చున్నారు. ఇక ఎక్కడానికి మెట్లు లేక అక్కడే ఆగిపోయారు. కానీ అసలు కధ అక్కడే మొదలయింది.
అప్పుడు నడుస్తున్నది ఎమర్జెన్సీ రోజులు.
ఒక రోజు ఓ పెద్దాయన అనిపించుకుంటున్న ఓ చిన్నాయన  నుంచి ఈ పెద్దాయనకు పిలుపు వచ్చింది. ఖుద్దున వచ్చి తన దగ్గర హాజరీ వేయించుకోమని విన్నపం లాంటి ఆదేశం. ఆరోజుల్లో ఆయన నుంచి పిలుపు వచ్చిందంటే మహా మహా  మంత్రులే రెక్కలు కట్టుకుని క్షణాల్లో వాలియేవారు. కానీ ఆయన పిలిచింది తల్వార్ ని. ఆయన రూటే సపరేటు. ఆయన ఆలోచనలే వేరు.  
'తనను పిలిపించుకోవాల్సింది అదీ అవసరం వుంటే ఆర్ధిక మంత్రి. తను వెళ్ళాలన్నా వెళ్ళేది ఆర్ధిక మంత్రి దగ్గరకు. అదీ ఏదైనా జరూరు పనివుంటేనే. మధ్యలో ఈ కుర్రకారు చిలిపి పిలుపులు లెక్కచేయాల్సిన పని లేదన్న'ది తల్వార్ గారి లెక్క.
ఈ లెక్కలు, అదీ  అసలు లెక్కలే తెలియని ఆ యువనేతకు రుచించలేదు. అనుకున్న పని అనుకున్న క్షణంలో జరిగిపోవాలి. అది ఆయన నైజం.
ఫలితం. స్టేట్ బ్యాంక్ చైర్మన్  తల్వార్ గారికి తక్షణం ఉద్వాసన పలకాలని ఉత్తర్వు. యువరాజు తలచుకుంటే ఉత్తర్వులకేం కొదవు. కానీ నిబంధనలు అంటూ కొన్ని వున్నాయి కదా! స్టేట్ బ్యాంక్ చైర్మన్ ని నియమించడం వరకే ప్రభుత్వానికి అధికారం. తొలగించడానికి లేదు. అదే విషయం యువరాజావారికి మనవి చేసారు. కిం కర్తవ్యమ్?
సర్కారు లో పనిచేసేవారికి ఒకటే కర్తవ్యమ్. పై వారు చెప్పింది అక్షరాలా చేయాలి. రూల్స్ అడ్డం  వస్తాయి. రాక చస్తాయా. అవి ఉన్నదే అందుకు. అందుకేం చేసారు ? మొత్తం స్టేట్ బ్యాంక్ చట్టాన్నే సవరించారు. మూడు నెలలు నోటీసు ఇచ్చి తల్వార్ గారిని తప్పుకోమన్నారు. డానికి తల్వార్ గారు ఏం చేసారు?
ఇప్పటి అధికారుల మాదిరిగా కోర్టుకెక్కలేదు. పత్రికలను పట్టుకోలేదు. ఉద్యోగం వొదిలేసిన తరువాత కూడా ఆయనకు నిబంధనల ప్రకారం లభించాల్సిన సౌకర్యాలను గురించి కూడా లిప్త కాలం ఆలోచించలేదు. నిజానికి మరో రెండు నెలలు అధికారిక నివాసంలో ఉండవచ్చు. మిగిలిన సదుపాయాలను కూడా అనుభవించవచ్చు. కానీ ఆయన ఎవ్వరు? తల్వార్!
అంచేతే, ఉద్యోగం పోయిన తరువాత వెంటనే తన కుటుంబంతో సహా పాండిచేరి వెళ్ళిపోయారు.  తను నమ్మిన అరబిందో మార్గాన్నే నమ్ముకున్నారు. అక్కడ ఓ రెండు గదుల అపార్ట్ మెంటులో లో మరణించేవరకు తన శేష జీవితాన్ని హాయిగా హుందాగా గడిపారు. దటీజ్ తల్వార్.
మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు గారు చెన్నై కేంద్రంగా స్టేట్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ గా తమిళ నాడుతో పాటు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల  వ్యవహారాలు చూసున్నప్పుడు మర్యాదపూర్వకంగా పాండిచేరి వెళ్లి తన మాజీ బాసును కలుసుకున్నారు. ఆయన భార్య స్వయంగా కలిపి తీసుకువచ్చిన టీ తాగారు.
స్టేట్  బ్యాంక్ చైర్మన్ గా అనుభవంలోకి వచ్చే వైభోగాలు తెల్సిన వాడు కనుక తల్వార్ మహాశయుల నిరాడంబర జీవితాన్ని చూసి చలించి పోయారు.
ఇలాటి వారు ఇంకా వున్నారా!
అంటే ఒకే సమాధానం. అలాటి వారు ఉండబట్టే మనం ఇంకా ఈ కర్మ భూమిలో జీవించగలుగుతున్నాం.
అది మనం చేసుకున్న అదృష్టం. అవునంటారా!

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం ఎలా జరగాలి?

(Published in 'SURYA' Daily in its Edit Page on 23-11-2014, SUNDAY)


రోమ్ నగరాన్ని ఒక రోజులో నిర్మించలేదని నానుడి.  అభివృద్ధి అనేది ఒక క్రమపధ్ధతి ప్రకారం దశలవారీగా జరగాలంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రానికి సరికొత్త రాజధాని నిర్మించే పనిలో వున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని గమనంలో పెట్టుకుంటే బాగుంటుంది.  దార్శనికుడయిన రాజకీయ నాయకుడిగా ఆయనకు పేరుంది. దానికి తోడు   కొత్త రాజధాని నిర్మాణం అనేది  ఆయనకు మాత్రమే లభించిన అపూర్వ సువర్ణావకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోగలిగితే చరిత్రలో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు.
ఎందుకో ఏమిటో కారణాలు ఆయనకే తెలియాలి. రాజధాని  ప్రదేశం ఎంపిక  విషయంలోనిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి  ప్రజాస్వామ్య పద్దతిలో ప్రతిపక్షాలను సంప్రదించకుండాస్వపక్షంలో కూడా కొందరినే విశ్వాసంలోకి తీసుకుంటూ వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం జనబాహుళ్యంలో వుంది. రికార్డు స్థాయిలో అపార పరిపాలనానుభవం  కలిగిన చంద్రబాబుకు ఈ వాస్తవం తెలియదని అనుకోలేము. ప్రతి విషయంలో ఎంతో ఆచి తూచి వ్యవహరిస్తారనే పేరున్న వ్యక్తిభవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడే రాజధాని నిర్మాణం వంటి ప్రాముఖ్యత కలిగిన అంశం పట్ల అనుసరిస్తున్న వైఖరిఆయన కానీఆయన తరపున మంత్రులు కానీ చేస్తున్న ప్రకటనలు మరింత  గందరగోళానికి తెర తీస్తున్నాయి.
వరుణ దేవుడి కరుణాకటాక్షాలపై ఆధారపడాల్సిన అవసరం, అగత్యం ఏమాత్రం లేకుండా  ఏటా మూడు పంటలు నిక్షేపంగా  పండే ప్రాంతంలో ముప్పై వేల ఎకరాల భూమి సేకరించడం ఏమేరకు సబబు అనే ప్రశ్నకు సరయినసహేతుకమైన సమాధానం దొరకడం లేదు. హైదరాబాదుకు పోటీగా సైబరాబాదును అత్యంత ఆధునికంగా అనతి కాలంలో అభివృద్ధి చేసిన ఘనత తన ఖాతాలో వుందని ఆయన పదేపదే చెబుతుంటారు. అది వాస్తవం కూడా. కానీ అది ఎలా జరిగింది ? అనే ప్రశ్న వేసుకుంటే వచ్చే సమాధానం  అంత రుచికరంగా ఉండకపోవచ్చు.
రాళ్ళు రప్పలు, కొండలు గుట్టలతో కూడిన ప్రదేశంలో చంద్రబాబు పూనికతోఅయన ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో ఎల్ అండ్ టీ సంస్థ తొంభయ్యవ దశకంలో  హై టెక్ సిటీ భవనాన్ని నిర్మించినప్పుడుదాన్ని చూసి  అందరూ ఔరా అని ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారు. క్రమంగా అక్కడవున్న ప్రభుత్వ భూముల్ని అంతర్జాతీయ కంప్యూటర్ సంస్థలకు ఇవ్వడంతో ఆ ప్రాంతంలో ఆర్ధిక పరమైన కార్యకలాపాలు శరవేగంతో పుంజుకున్నాయి. దానితో ఆ ప్రాంతంలో అభివృద్ధి మరింత చురుగ్గా చోటు చేసుకుంది. విశాలమైన రహదారులుబహుళ జాతి సంస్థలు నిర్మించిన  బహుళ అంతస్తుల సుందర భవనాలు  ఆ ప్రాంతం శోభను ఇనుమడింపచేసాయి. అక్కడ పనిచేసే ఉద్యోగులకోసం నివాసాలు నిర్మించేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పోటీ పడ్డారు. భూముల రేట్లకు రెక్కలు విచ్చుకున్నాయి. 'మీరూ బాగుండాలిమేమూ బాగుండాలిఅనే తరహాలో అందరూ  ఒకరికొకరు సహకరించుకున్నారు. దేశం యావత్తు ఘనంగా చెప్పుకుంటున్న  సైబరాబాదు ఆవిధంగా  ఆవిష్కృతమైంది. ఇందులో చంద్రబాబు పేరు ప్రతి ఇటుక మీదా వుందని అంటే కాదనే వారు ఉండకపోవచ్చు. అయితే ఇక్కడే ఒక విషయం గమనంలో పెట్టుకోవాలి. ఈ ఆధునిక రాజధాని నిర్మాణం కోసం  ప్రభుత్వ భూములు ప్రైవేటు పరం అయ్యాయి. మరి ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని విషయంలో జరగబోతున్నది ఏమిటిఇక్కడ జరిగిన దానికిఅక్కడ జరగబోయేదానికీ ఏమైనా పోలిక ఉందా పాలకులే ఆలోచించుకోవాలి. అక్కడ ప్రైవేటు భూములుఅవీ ఏడాదికి మూడు పంటలు పండే బంగారు భూములను ప్రభుత్వం తీసుకోబోతోంది. ఇదీ రెండింటి నడుమ ప్రధానమైన తేడా!
ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆ మాటకు వస్తే ఉభయ రాష్ట్రాల మీడియాలో ఆంద్ర ప్రదేశ్ రాజధాని గురించీఅందుకోసం సేకరించాలని అనుకుంటున్న భూములు గురించీ విస్తృత చర్చ సాగుతోంది. రాజధాని కోసం  ముప్పయ్ వేల ఎకరాల సారవంతమైన భూములు అవసరమా అని ప్రతిపక్షాలు యాగీ చేస్తుంటేపాలక పక్షం అయిన తెలుగు దేశం మాత్రం తను ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళికల ప్రకారమే ముందుకు సాగుతోంది. రాజధాని నిర్మాణం కోసం భూమిని సాధ్యమైన మేరకు సమీకరణ ద్వారాతప్పనిసరి పరిస్తితుల్లో సేకరణ ద్వారా సంపాదించాలనే కృత నిశ్చయంతో వున్నట్టు కానవస్తోంది. అధికారంలో వున్న పార్టీ కాబట్టి  వ్యతిరేక ప్రచారానికి కారణం ప్రతిపక్షాలే అని సహజంగానే నెపం వారిమీద మోపే ప్రయత్నం చేస్తుంది. ప్రతిపక్షం కూడా తన సహజరీతిలో స్పందిస్తుంది. అందివచ్చిన అవకాశాన్ని మరింత గట్టిగా అందిపుచ్చుకుని ప్రభుత్వాన్ని ఇరకాటాన పెట్టాలని ప్రయత్నిస్తుంది. ఇది ఒక రాజకీయ క్రీడ. కానీ,   భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడే రాజధాని నిర్మాణ అంశాన్ని  కేవలం   రాజకీయాలకు పరిమితం చేసి చూడకూడదు.  ప్రతిపక్షాలు సరేరాజకీయం చేస్తున్నాయని అనుకోవచ్చు. కానీ ప్రజల్లో, కనీసం వారిలో కొంతమందిలో అయినా  కానవస్తున్న వ్యతిరేకతను తక్కువగా అంచనా  వేయడం కానీవారి గోడును ఆలకించకపోవడం కానీ ప్రజాహితాన్ని కోరుకునే పాలకులు చేయాల్సిన పనికాదు.
ముందు సైబరాబాదు ఉదాహరణ ఉదహరించింది ఇందుకోసమే. అక్కడ ప్రభుత్వం  చొరవ చూపగానే ఆర్ధిక పరమైన కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కొత్త నగర నిర్మాణం దానంతట అదే జరిగిపోయింది. ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వ  భూముల బదలాయింపులో సర్కారు కొంత చెడ్డ పేరు మోయాల్సివచ్చిన సందర్భాలు ఎదురయినా మొత్తం మీద  మంచి పేరు మొత్తం  నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కింది. సమర్ధుడని ఆనాడు సముపార్జించుకున్న ఆ 'గుడ్ విల్ ' కారణంగానే  కొత్త రాజధాని నిర్మాణంలో ఆయన తప్పటడుగులు వేయరు అని చాలామంది నమ్మకం పెంచుకోవడానికి దోహదం చేసింది. వారే ఇప్పుడు జరుగుతున్న తతంగాలు చూసి నొచ్చుకుంటున్నారు. ఏమిటి ఇలా జరుగుతోందని బాధ పడుతున్నారు.
సమీకరణోసేకరణో మొత్తం మీద అనుకున్నమేరకు కాకపోయినా అత్యధిక విస్తీర్ణంలోనే  భూములు సర్కారుకు దఖలు పడడం ఖాయం. తరువాత ఏమిటికేంద్ర  సాయం గురించి ఎలాటి ఊసు వినరావడం లేదు. రాష్ట్ర ఆర్ధిక పరిస్తితి చూస్తె 'లోటులో కొట్టుమిట్టాడుతోంది. మరి ప్రపంచం మెచ్చే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం సాగేదేలా?ఈ ప్రశ్నకు సర్కారు నుంచి సరైన సమాధానం రాకపోవడం వల్లనే రాజధాని పేరుతొ  రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోతోందనే నిందను ప్రభుత్వం మోయాల్సివస్తోంది. ఒకరంటున్నారని కాదు. ఒకరికి జవాబు చెప్పాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు. కానీ అంతరాత్మకు అయినా సంజాయిషీ ఇవ్వకతప్పదు కదా! 
అందుకే ఇప్పుడయినా మించి పోయింది లేదు. ఇలాటి సమయంలో వొత్తిళ్ళు వుండడం సహజం. వాటిని ఎదుర్కోగలిగితేనే నాయకత్వ లక్షణాలు గుభాలిస్తాయి. ఘనమయిన ప్రణాళికలను ప్రస్తుతానికి పక్కన బెట్టి, సాధ్యాసాధ్యాలను మరోమారు పరిశీలించిప్రజలనుంచి అసమ్మతి  వీలయినంత తక్కువగా ఉండేలా చూసుకుంటూ మొత్తం వ్యవహారాన్ని పునః సమీక్ష చేసుకోవడం మంచిది. తీరిగ్గా విచారించడం కంటే సత్వరంగా మేలుకోవడం మేలు కదా! పై పంచ ముళ్ళ కంచెకు  చిక్కున్నప్పుడు దాన్ని సుతారంగా తిరిగి తీసుకోగలగాలి. అది చాతుర్యం అనిపించుకుంటుంది. 


పొతే, ఇలాటి సందర్భాలలలో అనుసరించాల్సిన కొన్ని విధి విధానాలు వుంటాయి. అది ఒక ఇంటి నిర్మాణం కావచ్చు, రాజధాని నిర్మాణం కావచ్చు.
ఎవరయినా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే ఏం చేస్తారు. ముందు అందుకు తగిన సొమ్ములు సమకూర్చుకుంటారు. ఇల్లు ఎక్కడ కట్టాలో నిర్ణయించుకుంటారు. యెంత వసతిగా వుంటే బాగుంటుందో ఆలోచిస్తారు. ఇల్లంటే ఒకనాటి  వ్యవహారం కాదుపదేపదే కట్టుకునేది కాదు. కనుక ఓ పదేళ్ళ తరువాత అవసరాలకు తగ్గట్టుగా ప్లాను వేసుకుంటారు. వృద్దులయిన తలితండ్రులు వుంటే వారి అవసరాలకు తగిన విధంగా అంటే వారి స్నానపు గదుల్లో కాలు జారడానికి వీలుండని గరుకు బండలువాళ్లకు వసతిగా  తక్కువ మెట్లు ఉండేలా చూసుకోవడం ఇలా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు.
అదే ఒక వూరిలో ఒక కాలనీ  నిర్మాణం బాధ్యత మీద పడిందని అనుకోండి. జనాభా యెంతవారి అవసరాలు ఎలా వుంటాయివీధి లైట్లు తగినన్ని ఉన్నాయా ? పారిశుధ్యం విషయంలో ఎలాటి జాగ్రత్తలు తీసుకోవాలిడ్రైనేజీ సదుపాయం ఎలా వుండాలిఅసాంఘిక శక్తులు తలెత్తకుండా రాత్రి వేళల్లో గస్తీ,  కాలనీ వాసులకోసం చక్కని పార్కు ఇలాటి అంశాలన్నీ ముందు గమనంలో పెట్టుకుని ప్రణాళికలు వేసుకుంటారు.
ఒక నగరం కొత్తగా నిర్మించుకోవాలని అనుకున్నప్పుడు ఇలాటి విషయాలు అన్నింటినీ మరింత విస్తృత రూపంలో ఆలోచించుకోవాల్సి వుంటుంది. పధక రచన చేసుకోవాల్సి వుంటుంది.
ఈ విషయంలో గతం నుంచి నేర్చుకోవాల్సింది కూడా ఎంతో వుంటుంది. మొహెంజొదారోహరప్పా చారిత్రిక శిధిల సంపదను పరిశీలించేవారికి అలనాటి పాలకులు నగర నిర్మాణాలలో ఎంతటి ముందు చూపు ప్రదర్శించారన్నది తేలిగ్గానే అవగత మవుతుంది. ఈ చారిత్రిక నగరాలే కాదువందల ఏళ్ళ చరిత్ర కలిగిన  ఏ నగర చరిత్రను తిరగేసినా ఇలాటి ఉదాహరణలే కానవస్తాయి. హైదరాబాదు నగరాన్నే తీసుకుంటే అప్పటి నిజాం నవాబునగర పౌరుల దాహార్తిని తీర్చడానికి జంట జలాశయాలను ఏర్పాటు చేయడానికి యెంత శ్రద్ధ వహించారో తెలుసుకోవడానికి చరిత్ర గ్రంధాలు తిరగేయనక్కరలేదు. అప్పుడు నగర జనాభా కేవలం యాభయ్ వేలే. అయినా  ఎంతో ముందు చూపుతో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా  లక్షల జనాభాకి సరిపడేలా నగర డ్రైనేజీ వ్యవస్థను సయితం  రూపొందించిన ఇంజినీర్ మోక్షగుండం  విశ్వేశ్వరయ్య గారు నిజమైన దార్శనికుడు. ఈనాడు మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న హైటెక్ సిటీలో డ్రైనేజీ వ్యవస్థ లేదంటూ విమర్శలు వినవస్తున్నాయంటే ఈనాటి పాలకులు పై పై మెరుగులకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న నిజం బోధ పడుతుంది. కేవలం బహుళ అంతస్తుల భవనాలుఅందమైన వీధి దీపాలు మాత్రమే నగర సౌందర్యానికి  కొలమానాలు కావు. ఒక్క వర్షం గట్టిగా కురుస్తే ట్రాఫిక్ అస్తవ్యస్తం అయ్యే రోడ్లు నాగరిక జీవనానికి అద్దం పట్టవు. వర్తమానంలోని అవసరాలను అంచనా వేసుకుంటూభవిష్యత్తులో తలెత్తగల సమస్యలను ముందుగా ఊహించుకుంటూ వాటికి తగ్గట్టుగా ప్రణాలికలను రూపొందించచగలిగిన నాయకులు ద్రష్టలు అవుతారు. దార్శనికులు అనిపించుకుంటారు.
(22-11-2014)

NOTE: Courtesy Image Owner 

20, నవంబర్ 2014, గురువారం

రాజధాని నిర్మాణానికి రాళ్ళెత్తే కూలీలెవ్వరు?



ఎవరయినా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే ఏ చేస్తారు. ముందు అందుకు తగిన సొమ్ములు సమకూర్చుకుంటారు. ఇల్లు ఎక్కడ కట్టాలో నిర్ణయించుకుంటారు. యెంత వసతిగా వుంటే బాగుంటుందో ఆలోచిస్తారు. ఇల్లంటే ఒకనాటి  వ్యవహారం కాదు, పదేపదే కట్టుకునేది కాదు. కనుక ఓ పదేళ్ళ తరువాత అవసరాలకు తగ్గట్టుగా ప్లాను వేసుకుంటారు. వృద్దులయిన తలితండ్రులు వుంటే వారి అవసరాలకు తగిన విధంగా అంటే వారి స్నానపు గదుల్లో కాలు జారడానికి వీలుండని గరుకు బండలు, వాళ్లకు వసతిగా ఉండేలా తక్కువ మెట్లు ఉండేలా చూసుకోవడం ఇలా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు.
అదే ఒక వూరిలో ఒక కాలనీ  నిర్మాణం బాధ్యత మీద పడిందని అనుకోండి. జనాభా యెంత? వారి అవసరాలు ఎలా వుంటాయి? వీధి లైట్లు తగినన్ని ఉన్నాయా ? పారిశుధ్యం విషయంలో ఎలాటి జాగ్రత్తలు తీసుకోవాలి? డ్రైనేజీ సదుపాయం ఎలా వుండాలి? అసాంఘిక శక్తులు తలెత్తకుండా రాత్రి వేళల్లో గస్తీ,  కాలనీ వాసులకోసం చక్కని పార్కు ఇలాటి అంశాలన్నీ ముందు గమనంలో పెట్టుకుని ప్రణాళికలు వేసుకుంటారు.
ఒక నగరం కొత్తగా నిర్మించుకోవాలని అనుకున్నప్పుడు ఇలాటి విషయాలు అన్నింటినీ మరింత విస్తృత రూపంలో ఆలోచించుకోవాల్సి వుంటుంది. పధక రచన చేసుకోవాల్సి వుంటుంది.



ఈ విషయంలో గతం నుంచి నేర్చుకోవాల్సింది కూడా ఎంతో వుంటుంది. మొహెంజొదారో, హరప్పా చారిత్రిక శిధిల సంపదను పరిశీలించేవారికి అలనాటి పాలకులు నగర నిర్మాణాలలో ఎంతటి ముందు చూపు ప్రదర్శించారన్నది తేలిగ్గానే అవగత మవుతుంది. ఈ చారిత్రిక నగరాలే కాదు, వందల ఏళ్ళ చరిత్ర కలిగి ఏ నగర చరిత్రను తిరగేసినా ఇలాటి ఉదాహరణలే కానవస్తాయి. హైదరాబాదు నగరాన్నే తీసుకుంటే అప్పటి నిజాం నవాబు నగర పౌరుల దాహార్తిని తీర్చడానికి జంట జలాశయాలను ఏర్పాటు చేయడానికి యెంత శ్రద్ధ వహించారో తెలుసుకోవడానికి చరిత్ర గ్రంధాలు తిరగేయనక్కరలేదు. అప్పుడు నగర జనాభా కేవలం యాభయ్ వేలే. అయినా  ఎంతో ముందు చూపుతో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా  లక్షల జనాభాకి సరిపడేలా నగర డ్రైనేజీ వ్యవస్థను రూపొందించిన ఇంజినీర్ మోక్షగుండం  విశ్వేశ్వరయ్య గారు నిజమైన దార్శనికుడు. ఈనాడు మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న హైటెక్ సిటీలో డ్రైనేజీ వ్యవస్థ లేదు అనే వాస్తవం తెలుసుకుంటే ఈనాటి పాలకులు పై పై మెరుగులకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న నిజం బోధ పడుతుంది. కేవలం బహుళ అంతస్తుల భవనాలు, అందమైన వీధి దీపాలు మాత్రమే నగర సౌందర్యానికి  కొలమానాలు కావు. ఒక్క వర్షం గట్టిగా కురుస్తే ట్రాఫిక్ అస్తవ్యస్తం అయ్యే రోడ్లు నాగరిక జీవనానికి అద్దం పట్టవు. వర్తమానంలోని అవసరాలను అంచనా వేసుకుంటూ,  భవిష్యత్తులో తలెత్తగల సమస్యలను ముందుగా ఊహించుకుంటూ వాటికి తగ్గట్టుగా ప్రణాలికలను రూపొందించచగలిగిన నాయకులు ద్రష్టలు అవుతారు. దార్శనికులు అనిపించుకుంటారు.

NOTE: Courtesy Image Owner
   

మౌంట్ అబూ - పదేళ్ళ కిందటి జ్ఞాపకాలు




2003 లో ఒక రోజు.
అబూ రోడ్ చేరేసరికి ఉదయం ఏడున్నర.
బ్రహ్మ కుమారీలు ఏర్పాటు చేసిన సుమోలో మా ఆరుగురిని సామానుతో సహా మౌంట్ అబూకి చేర్చారు. సుమారు యిరవై కిలోమీటర్లకు పైగా ఘాట్ రోడ్. ఆరావళీ పర్వత పంక్తుల్లో మౌంట్ అబూ ఎత్తయిన శిఖరం అంటారు. శిఖరం అన్న మాటే గాని పైన అన్ని వసతులతో కూడిన ఒక చిన్నపాటి పట్టణమే వుంది. మాకు ఇచ్చిన గెస్ట్ హౌస్ చాలా బాగుంది. స్నానాలు ముగించుకుని బ్రేక్ ఫాస్ట్ చేయడానికి కేంటీన్ కి బయలుదేరాము. నిటారుగా నిర్మించిన సిమెంట్ రోడ్ పై నుంచి కిందికి దిగి మళ్ళీ పైకి ఎక్కాలి. డైనింగ్ హాల్ ఎంతో నీటుగా వుంది. పుంగనూర్ కి చెందిన శ్రీనివాస్ అనే కార్యకర్త స్వచ్చందంగా అంత దూరం నుంచి వచ్చి అక్కడ బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేసే విధులను నిర్వహిస్తున్నాడు. బ్రహ్మ కుమారీల ప్రధాన కార్య స్థానంలో పనిచేసేవారందరూ అలాటి వారే. ఎవరూ జీతాలు తీసుకోరు. బ్రేక్ ఫాస్ట్ లో దక్షిణాది వంటకాలు కూడా వుండడంతో మాకు ఎలాటి ఇబ్బంది ఎదురు కాలేదు. తరువాత మెల్లగా నడుచుకుంటూ ఆ కొండల మీద కలయ తిరిగాము. మబ్బులు తాకుతూ వెడుతున్న అనుభూతి. పౌరాణిక సినిమాలలో నారదుడు గుర్తుకువచ్చాడు.
కాసేపు గదిలో సేదతీరామో లేదో మళ్ళీ భోజనాలకు పిలుపు. ఈసారి నార్త్ ఇండియా వంటకాలు. కాకపొతే పులిహార వడ్డించారు. తెలుగు వాళ్లమని పెరుగు స్పెషల్.
భోజనం ముగించుకుని మెట్లెక్కి శిఖరం అంచున ఫోటోలు దిగాము.
మధ్యాహ్నం నుంచి బ్రహ్మ కుమారీల సెషన్స్ మొదలయ్యాయి. బ్రదర్ శాంత కృష్ణ మెడిటేషన్ గురించీ, బ్రహ్మకుమారీల గురించీ వివరంగా చెప్పారు. మాలో కొంతమంది జర్నలిష్టులు సహజసిద్దమయిన రీతిలో రెచ్చగొట్టే విధంగా ప్రశ్నలు వేసినా, ఆయన నిగ్రహం కోల్పోకుండా జవాబులు చెప్పారు.
మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వాన.
హైదరాబాదుకు చెందిన బ్రహ్మకుమారీల ప్రతినిధి సరళ, ఐఏఎస్ అధికారి శ్రీ మంగపతిరావు, రెవెన్యూశాఖలో పనిచేసిన శ్రీమతి నైనాదేవి, మా ఆవిడ నిర్మల హైదరాబాదు నుంచి వచ్చిన బృందం లో వున్నాము. మా పని తరలి వచ్చిన మగ పెళ్లివాళ్ళ మాదిరిగావుంది.


శుక్రవారం
‘అంబర చుంబిత’ అన్న అల్లసానివారి పద్యం గుర్తుకు వచ్చింది.
మేము వుంటున్న జ్ఞాన సరోవర్ నుంచి సుమారు యిరవై కిలోమీటర్లు ఘాట్ రోడ్ లో పైకి వెడితే వచ్చే గురు శిఖిరం మీద నిలబడ్డపుడు ఎవరికయినా ఈ పద్యపాదం స్ఫురించకమానదు.
ఆకాశం అంచుల్లో నిలబడ్డ అనుభూతి కలిగించే ఆ సుందర దృశ్యం అనిర్వచనీయం. ఎటుచూసినా తెల్లని పొగ మంచు. అడుగు దూరం అవతల వున్నది కూడా కనిపించని స్తితి. ఎదురుగా వున్న మనుషులను కూడా పోల్చుకోలేని పరిస్తితి.
అక్కడికి వెడుతున్నప్పుడు మా డ్రయివర్ బాబు ఆ పొగమంచులో ముందుకు వెళ్లడం కుదరదని వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపేశాడు. ఉసూరుమనిపించింది. కానీ ఇంతలో హెడ్ లైట్లు వేసుకుని ఒక కారు ఎదుటినుంచి రావడంతో ఏమనుకున్నాడో కానీ ముందుకే నడిపించాడు. ముందు సీట్లో కూర్చున్న నాకు అడుగు ముందు ఏమివుందో కనిపించడం లేదు. అయినా డ్రయివరు బాబు మాత్రం ఎంతో చాకచక్యంగా నడుపుతూ మమ్మల్ని పైకి చేర్చాడు. అప్పటికే అక్కడ చాలామంది వున్నారు. ఏదో మాట్లాడుకుంటూ పోకపోతే ఎదురుగా వచ్చేవారు డీకొట్టే ప్రమాదం వుంది. అందుకే అవసరం వున్నా లేకపోయినా గలగలా మాట్లాడుకుంటూ, నూట యాభయి రూపాయలు పెట్టి కొనుక్కున్న కాల్చిన మొక్కజొన్న కంకులు తింటూ దాదాపు మూడువందల మెట్లెక్కి, గురు శిఖరం చేరుకున్నాము. అంత పొగమంచులో కూడా చిరుచెమట పట్టింది. ఆ శిఖరం మీద దత్తాత్రేయ ఆలయం వుంది. చాలా చిన్న గుడి. గుడి కంటే అక్కడ వేళ్ళాడదీసిన గంట పెద్దదిగా అనిపించింది. ఆ గంట మోగిస్తే దాని ధ్వని లోయలో ప్రతిధ్వనించడం ఒక అనుభూతి. అక్కడ కొన్ని ఫోటోలు దిగాము కానీ ఆ దట్టమయిన పొగమంచులో ఆ ఫోటోలు ఎలావస్తాయో తెలియదు. అన్ని మెట్లు ఎక్కలేని వాళ్ళ కోసం డోలీలు వున్నాయి. నూటయిరవై రూపాయలు ఇస్తే పైకి తీసుకువెళ్ళి కిందకు తీసుకువస్తారు. దోవలో డ్రైవర్ బాబుని అడిగాము, చంద్రబాబునాయుడు ఎవరో తెలుసా అని. ‘ఆంధ్రా సీఎం’ అని చటుక్కున జవాబిచ్చాడు. అదే గుజరాత్ సీఎం ఎవరంటే ఉప రాష్ట్రపతి పేరు చెప్పాడు.
మేము వెళ్ళిన దోవలో రెండు లోయల నడుమ కట్టిన ఒక డాం కనిపించింది. మౌంట్ అబూ లో కొన్ని ప్రాంతాలు మాత్రమే బ్రహ్మకుమారీల అధీనంలో వున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ఆకాశవాణి, దూరదర్శన్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, రాజస్తాన్ టూరిజం కార్యాలయం వున్నాయి. గురు శిఖరానికి వెళ్ళే దారిలో పడి పన్నెండు చిన్న చిన్న ఊళ్లు, ఆవుల మందలూ వాటి కాపరులూ కానవచ్చారు. విచిత్రమేమిటంటే వాళ్ళూ మేమూ కూడా చలిదుస్తులు వేసుకోలేదు. పొగమంచులో చలిగా అనిపించదు. వెంట తీసుకువెళ్ళిన షాల్స్ కారులోనే వొదిలేసి తిరిగాము. కాకపొతే, గొడుగు తప్పనిసరి. ఎప్పుడు వాన పడుతుందో తెలవదు. వాన వచ్చిందో పొగమంచు పరార్.
కిందికి వచ్చి కేంటీన్ లో భోజనాలు చేశాము. పులిహార, రోటీలు, రసం, పెరుగు, మామిడి పండ్లు. శుక్రవారం కదా. మా ఆవిడకు పులుపు నిషిద్దం. అన్నంలో పాలూ పంచదార కలుపుకుని భోజనం ముగించింది.అక్కడ మాకు హైదరాబాదు
నుంచి వచ్చిన సత్యనారాయణ రెడ్డి, రాజేశ్వరరెడ్డి, శర్మ, సుబ్బారావు, ఆయన భార్య పరిచయం అయ్యారు.
మధ్యాహ్నం నాలుగ్గంటల సమయంలో కాస్తంత ఎండ పొడ. కానీ అది వేడిగా వుందో చల్లగా వుందో అనుమానమే.
గమ్మత్తుగా సాయంత్రానికి వాతావరణం హైదరాబాదులో మాదిరిగా మారిపోయింది.
ఆరు గంటలకు అసలు సెషన్ మొదలు. మా అందరికీ బాడ్జీలు, ఇతర సమాచారం వున్న ఫోల్డర్లు ఇచ్చారు. విశాలంగా వున్న ఒక పచ్చిక బయలులో సమావేశం మొదలయింది. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లందరూ అక్కడ జమయ్యారు. ఆ ప్రదేశం ఎంతో అందంగా వుంది. తివాచీ పరచినట్టుగా పచ్చని పచ్చిక. ఎత్తయిన చెట్లు. ఎటుచూసినా రంగురంగుల పూలమొక్కలు. అకాడమీ ఆఫ్ బెటర్ వరల్డ్ కు చెందిన బ్రదర్ మోహన్ సింగ్హన్ ఒక విషయం చెప్పారు. కొన్నేళ్ళకు పూర్వం ఆ ప్రదేశం రాళ్ళు రప్పలతో, రక్కసి పొదలతో నిండి వుండేదట. నీటి సౌకర్యం ఏమాత్రం లేని ఆ రోజుల్లో నంజుడప్ప అనే ఆయన స్వచ్చందంగా ముందుకు వచ్చి ఆ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దే బాధ్యతను నెత్తికెత్తుకున్నాడు. చిన్న చిన్న మట్టి పాత్రలకు చిల్లులు పెట్టి, వాటికి దూది పెట్టి, నీళ్ళను నింపి ఒక్కొక్క మొక్కని తడుపుతూ, వాటినన్నిటినీ పసిపాపలమాదిరిగా సాకుతూ పోషించి పెంచాడట. అలా నాలుగయిదేళ్ళలోనే ఆయన ఆ ప్రాంతం రూపురేఖలను మార్చివేశాడట. ఇది విన్న తరవాత పని పట్ల నంజుడప్ప అంకిత భావానికి జోహారు అర్పించకుండా వుండలేకపోయాము.
బ్రహ్మ కుమారీ సంస్త అధినేత్రులందరూ , రాజయోగి డాదీ మనోహర్ ఇంద్రాజీ తో సహా ఆ సమావేశానికి వచ్చారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసారు. తరువాత మెడిటేషన్ హాలులో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది. మంగపతిరావు గారూ నేనూ కూడా జ్యోతులను వెలిగించాము. మీడియా ఇంచార్జి కరుణ ఆధ్వర్యంలో ఇది జరిగింది.
మధ్యాహ్నం వరకు కన్ను పొడుచుకున్నా కానరాని పొగమంచు. సాయంత్రం ఏడవుతున్నా సూర్యాస్తమయం కాని స్తితి.మౌంట్ అబూలోని ఈ ప్రకృతి వైరుధ్యాన్ని మనస్సులో పదిల పరచుకుంటూ, మెడిటేషన్ హాలులో దాదీ రతన్ మొహినీజీ హిందీలో చేసిన అనుగ్రహ భాషణాన్ని ఆలకించాము.
‘కర్మ బంధాలలో చిక్కుపోయిన ఆత్మ – తన తండ్రి అయిన పరమాత్మను గుర్తించలేదన్నారు. దానికి ధ్యానం ఒక్కటే మార్గం అన్నారు. ఆధ్యాత్మిక మార్గం హేతువుని తిరస్కరిస్తుంది, అయితే అది హేతువుని అధిగమించి వెళ్ళగలదన్నారు’ దాదీజీ.
శనివారం ఉదయం
తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి- ధ్యాన మందిరానికి వెళ్ళాము. స్నానాలు చేసి శుచిగా రావాలని కానీ, పాద రక్షలు ధరించకూడదని కానీ నిబంధనలేమీ లేవు. మందిరంలో ఒక బ్రహ్మ కుమారి తెల్లని దుస్తుల్లో సోఫా మీద ధ్యాన ముద్రలో వుంది. ప్రశాంతమయిన వాతావరణంలో – ఎక్కడ అమర్చారో తెలియని స్పీకర్ల నుంచి మెల్లగా ఒక పాట వినబడుతోంది. పాట పూర్తి కాగానే బ్రహ్మ కుమారి సమ్మోహన స్వరంతో మాట్లాడడం మొదలుపెట్టారు. మధుర ఘడి యలుగా వారు పేర్కొనే ఆ సుప్రభాత వేళలో మెడిటేషన్ చేయడం కొత్త అనుభూతి. కానీ మనస్సు కోతి కదా. దాని వాసనలు దానివి. అందరూ కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటే – నేను మాత్రం ఆ వాతావరణాన్నీ అక్కడి మనుషులనూ పరిశీలించడంలో మునిగిపోయాను. అరగంటలో ఆ కార్యక్రమం ముగిసింది. అంతా నిశ్శబ్దంగా బయటకు వచ్చారు. అందరిలో ఒక రకమయిన ప్రశాంతత. నిజంగా ధ్యానం లో ఏదయినా వుందా?
మరునాడు మౌంట్ అబూ నుంచి కిందికి దిగాము. అక్కడ బ్రహ్మ కుమారీలకు ఒక బ్రహ్మాండమయిన సమావేశ మందిరం వుంది. దాదాపు లక్షమంది సౌకర్యంగా కూర్చుని ప్రసంగాలు వినడానికి, కార్యక్రమాలు తిలకించడానికీ వీలుగా దానికి రూపకల్పన చేసిన తీరు అద్భుతంగా వుంది. అంత పెద్ద హాలులో ఎక్కడా స్తంభాలు లేకుండా మందిరం పైకప్పు నిర్మించారు. వేదికకు సుదూరంగా కూర్చున్నవారికి కూడా స్పుటంగా వినగలిగేలా అత్యాదునికమయిన లౌడ్ స్పీకర్లను అమర్చారు. నిర్మాణ కౌశలానికి ఒక మచ్చు తునకగా పరిగణించాల్సిన ఈ సుందర మందిరం దేశానికి బ్రహ్మ కుమారీల భిక్షే.
(రెండువేల మూడులో సతీ సమేతంగా చేసిన మౌంట్ అబూ యాత్ర గురించి మనసు పొరల్లో మరగునపడిన జ్ఞాపకాల ఆధారంగా - భండారు శ్రీనివాసరావు)
Be firm when authority is required, but be gentle and sweet when administering authority- Brahmakumaries