31, డిసెంబర్ 2022, శనివారం

నో తాతయ్యా!

 


డెబ్బయి వసంతాల పైచిలుకు జీవితంలో మొట్టమొదటిసారి,  పాత సంవత్సరం కొత్త సంవత్సరంలోకి కొత్త విధంగా జారిపోతోంది.  ఏడాది వయసున్న నా  మనుమరాలు జీవిక ఈ రాత్రి  నాకు కంపెనీ ఇచ్చింది. అదేమిటో ఇంత రాత్రి వరకు అది  మేలుకునే వుంది.

పాత అలవాట్ల ప్రకారం ఏదైనా చేయబోయినా, చక్రాలు లాంటి కళ్ళతో వద్దు అనే సంకేతం ఇచ్చింది. కొన్ని విషయాల్లో ప్రాణానికి ప్రాణం అయిన మా ఆవిడ మాటే నేను వినలేదు.

అలాంటిది జీవిక తన  కళ్ళతోనే నన్ను కట్టి పడేసింది.

నో తాతయ్యా అనే సంకేతం నాకు అందులో కనిపించింది.

ఒక్క రోజు నా చిట్టితల్లి చెప్పే మాట వింటే ఏం పోతుంది.

దేవుడు అంతటి వాడే పిల్లల మాట వింటాడు అంటారు.

ఇక నేనెంత?    



(31-12-2022)

28, డిసెంబర్ 2022, బుధవారం

అమెరికాలో మంచు ముప్పు

 మంచు తుఫానులతో అతలాకుతలం అవుతున్న అమెరికా వార్తలు వింటున్నప్పుడు గుర్తుకు వచ్చిన అలనాటి మా మాస్కో జీవితం :

మాస్కోలో మేము అడుగుపెట్టింది ఎముకలు కొరికే చలి కాలంలో.
ఇండియా నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వెళ్ళిన మాకు ఆ వాతావరణం ఓ పట్టాన కొరుకుడుపడలేదు. కొన్నాళ్ళు వానలు, కొన్నాళ్ళు చలి గాలులు, మరికొన్నాళ్ళు మండే ఎండలు - ఇలాంటి వాతావరణం తెలుసు. కానీ అక్కడి వాతావరణం గురించిన ఒక జోక్ ఇలా ప్రచారంలో వుంది. 'మాస్కోలో మొదటి నాలుగు నెలలు చలికాలం- తరువాత మరో నాలుగు నెలలు చలికాలం. పోతే, మిగిలిన నాలుగు నెలలు చలికాలమే'
ఏప్రిల్, మే నెలల నడుమ ఓ పదిహేను, యిరవయి రోజులు వేసవి కాలం పలకరిస్తుంది. అప్పుడు కూడా డిల్లీలో చలికాలం మాదిరిగా ఎండ కాస్తుంది. దానికే మాస్కో వాసులు తెగ సంబరపడిపోతారు. ఆ సంబరంలో వాళ్లకు వొంటిమీద బట్టనిలవదు. ఏటిపొడుగునా ధరించే ఎలుగుబంటి దుస్తుల్ని వొదిలిపెట్టి - ఆడవాళ్ళు స్కర్టుల్లోకి, మగవాళ్ళు నిక్కరు,టీ షర్టుల్లోకి మారిపోతారు. నిజానికి, రష్యన్ల మేని ఛాయ తెల్లని తెలుపు. కానీ చలి దుస్తుల్లో వారి అందం కాస్తా మరుగున పడిపోతుంది. ఫర్ కోట్లు, ఫర్ టోపీలు ధరించిన తరవాత ఎవరు ఆడో - ఎవరు మగో గుర్తు పట్టడం కష్టం మరి.
ఇక మాస్కో గురించి చెప్పుకోవాలంటే అక్కడ కురిసే మంచు గురించి ముందు ముచ్చటించుకోవాలి. తెల్లటి మంచు పూలరేకులమాదిరిగా నిరంతరం నింగినుంచి 'దేవతలు పుష్పవృష్టి' కురిపిస్తున్నట్టు జాలువారుతూనే వుంటుంది. ఆ మంచు వానలో దుస్తులన్నీ 'మంచు కొట్టుకు పోతాయి' కానీ 'తడిసి ముద్దయి' పోవు. ఎందుకంటె అక్కడి 'మైనస్' టెంపరేచర్లలో మంచు కరిగి నీరుగా మారే అవకాశమే లేదు. తెల్లవార్లూ ఎడతరిపి లేకుండా కురిసే మంచులో ఇళ్ళ ముందు పార్కు చేసిన కార్లు నిలువెత్తు మంచులో కూరుకు పోతాయి. ఆ మంచుని తొలగించి కార్లను మళ్ళీ రోడ్డు ఎక్కించడం వాటి యజమానులకు రోజూ ఒక సమస్యే. అందుకే చాలామంది కార్లను 'మంచు సమాధుల'లోనే ఉంచేసి , భూగర్భంలోని మెట్రో రైళ్ళలోనే రాకపోకలు సాగిస్తుంటారు.
కింది ఫోటో: మాస్కో రెడ్ స్క్వేర్ లో లెనిన్ మసోలియం క్యూ వద్ద మా ఆవిడ నిర్మల, కన్నడ న్యూస్ రీడర్ రామకృష్ణ గారి భార్య సరోజ



అమ్మలాంటి కోడలు – భండారు శ్రీనివాసరావు

 కొన్ని విషయాలు చెప్పుకుంటే సంగతులు. కొన్నేళ్ళ తర్వాత అవే జ్ఞాపకాలు.

అలాంటిదే ఇది.

“శ్రీ ఆంజనేయం....”
‘............”
‘శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం.. చెప్పండి అత్తయ్యా! మిమ్మల్నే’
‘............’
‘మీరు దండకం చెప్పకపోతే నేను ఫోన్ చేసి మీ తమ్ముడి గారితో మీ చేత మాట్లాడించను. మరి చెప్పండి! శ్రీ ఆంజనేయం! ప్రసన్నాంజనేయం!..’
‘....ప్రభాదివ్య కాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే హం పవిత్రం భజే సూర్య మిత్రం భజే రుద్రతేజం భజే బ్రహ్మ తేజం బటంచున్ ....’
అందుకున్న ఆమె గొంతునుంచి ఆంజనేయ దండకం తుదివరకు సాగిపోయింది.
ఆ స్వరం పీలగా, సన్నగా, ఎక్కడో నూతిలోంచి వస్తున్నట్టు వున్నా ఉచ్ఛారణ లోపం లేకుండా, ఎనిమిది పదుల ఆ వృద్ధురాలు ఎక్కడా తడబడకుండా ఏ పదం మరచిపోకుండా ఆలపిస్తుంటే చూడడానికి ఆ దృశ్యం కమనీయంగాను వుంది. దయనీయంగాను వుంది.
వృద్ధాప్యం పైనపడి ఎక్కడ మతిమరపుకు లోనవుతారో అని ఉదయం సాయంత్రం ఆమె కోడలు దగ్గర వుండి ఆమె చేత చేయిస్తున్న అసాధారణ ధారణ కసరత్తు ఇది.
ఒకప్పుడు ఒంటి చేత్తో పదిమందివున్న సంసారాన్ని సరిదిద్దిన ఆ వృద్ధ మాత తుర్లపాటి భారతి. ఒక పక్కన కార్పొరేట్ ఉద్యోగాన్ని వర్క్ ఫ్రం హోం చేస్తూనే, మరో పక్క వృద్ధురాలు, ఆశక్తురాలు అయిన అత్తగారిని లాలించి, అవసరమయితే డబాయించి ఆమె చేత దండకాలు, లలితా సహస్రనామాలు వల్లె వేయిస్తున్న మహిళ ఆవిడ కోడలు స్వర్ణ.
దండకం చెప్పకపోతే మీ తమ్ముడితో ఫోనులో మాట్లాడించేదిలేదంటూ ఆ కోడలు బెదిరించిన ఆ తమ్ముడిని నేను.
కొన్నేళ్ళ క్రితం ఒక నాటి సాయంత్రం నా కొడుకూ, కోడలు నన్ను వెంటబెట్టుకుని సికింద్రాబాదులోని మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి కానవచ్చిన ఈ దృశ్యం కమనీయంగా ఉన్నట్టా! దయనీయంగా ఉన్నట్టా!
హాట్సాఫ్ స్వర్ణా!

27, డిసెంబర్ 2022, మంగళవారం

వాళ్ళని గురించి వాళ్లకు పట్టదా

 ‘ఏమండీ చొక్కా గుండీలు సరిగ్గా పెట్టుకోకుండానే వెడుతున్నారు

‘ఒకసారి అద్దంలో చూసుకుని వెళ్ళండి, జుట్టు దువ్వుకోవడం మరచిపోయారు

‘ఎంచక్కా షేవ్ చేసుకోవచ్చు కదా! పైగా పోయేది పెద్దవాళ్లు వచ్చే ఫంక్షన్ అంటున్నారు!’

పాపం ఇప్పుడు ఏ లోకంలో వుందో ఏమో! ఇంట్లోనుంచి కాలు బయట పెట్టే ముందు ఎన్నిసార్లు ఇలా జాగ్రత్తలు చెప్పి పంపించిందేమో మరి.

ఇప్పుడు బతికుండి ఇప్పటి సినిమాలు చూసే భాగ్యం వుండివుంటే ......

అయ్యో లోకమే ఇలా తగలడిందని అనుకుని వుండేదేమో!

27-12-2022

 

25, డిసెంబర్ 2022, ఆదివారం

కుంభకోణాల భారతం – భండారు శ్రీనివాసరావు

 (Published in ANDHRAPRABHA today, 25-12-2022, SUNDAY)

 

దినపత్రిక తెరవగానే  ఇక్కడ ఇన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది, అక్కడ ఇన్ని లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనే రాజకీయ ఆరోపణల వార్తలే.

వెనుక ఆకాశవాణి ప్రాంతీయ వార్తావిభాగంలో పనిచేసే రోజుల్లో తమిళనాడులోని కుంభకోణంలో సెటిలయిన, తెలుగు తెలిసిన ఒక పెద్దమనిషి నుంచి ఫోను వచ్చింది.

దేశంలో ఎక్కడ ఏ లాలూచీ జరిగినా, ఆర్ధికపరమైన గందరగోళాలు చోటుచేసుకున్నా, కుంభకోణం’ అంటూ మా వూరు పేరు ఎందుకు చెబుతారు? ఈసారి వార్తల్లో అల్లా చెప్పారంటే కోర్టులో కేసు వేస్తాను సుమా!’ అని సున్నితంగానే కాకుండా, సూటిగా కూడా హెచ్చరించాడు. దరిమిలా, నేను రేడియోలో పనిచేసినంత కాలం మళ్ళీ ఆ పదం వాడలేదు. కేసు వేస్తాడన్న భయం వల్ల కాదు, తన ఊరిపై అతగాడికి

వున్న వల్లమాలిన మమకారంవల్ల పెల్లుబికిన గౌరవంతో. కానీ, పత్రికలలో రాసేటప్పుడు తప్పడం లేదు. పత్రికల్లో ఆ పదం చదవగా తప్పడం లేదు. ఎందుకంటే ఈ మొత్తం ఇతివృత్తం కుంభకోణాల మయం కనుక. కుంభకోణం పెద్దమనిషి పెద్ద మనసు చేసుకుని నన్ను మన్నిస్తారని నమ్ముతున్నాను.

ఇంత సువిశాల దేశంలో ఎక్కడో ఏదో జరుగుతుంది. అన్నీ వెలుగులోకి రావు. కొన్ని వస్తాయి. కానీ అవి జనాలకు పూర్తిగా తెలిసేలోగా చప్పున తెరవెనక్కి తప్పుకుంటాయి. వీటికంటే చిన్న విషయాలు కొన్ని నలుగురి నోళ్ళలో పడి నాలుగు రోజులు జనం నోళ్ళలో నాని పెద్దవవుతాయి. వాటిని గురించి చర్చలు మొదలవుతాయి. వాటి వెనుకనే ఆరోపణలు, వాటిని వెన్నంటి ఖండనలు. వెరసి చిన్న విషయం పెద్దగా రూపు దిద్దుకుంటుంది. ఒక కుంభకోణంగా మారుతుంది. ఫలితాలు ఊహాతీతంగా వుంటాయి కూడా. కొండొకచో  ప్రభుత్వాలు పడిపోవచ్చు. లేదా ఎన్నికల్లో పాలక

పక్షం ఘోర పరాజయం పాలుకావచ్చు. ఇది మన దేశానికే కాదు, అమెరికా వంటి పెద్ద దేశాలకు కూడా అనుభవమే.

రాఫెల్.

ఇప్పుడు దేశంలో నలుగురి నోళ్ళలో నానుతున్న చిన్న మాట. ఇదొక యుద్ధ విమానం అనే అవగాహన లేని వాళ్ళు కూడా అదొక కుంభకోణం అనే నమ్ముతున్నారు.

అందుకే ఈ వివాదాన్ని తుదికంటా తీసుకువెళ్ళి రాజకీయ ప్రయోజనం పొందాలనేది కాంగ్రెస్ వ్యూహం. తప్పేమీ లేదు. గతంలో ప్రతిపక్షాలు కూడా ఇదే వ్యూహంతో బోఫార్స్ ఆయుధాన్ని వాడుకుని అప్పటి రాజీవ్ గాంధి ప్రభుత్వాన్ని చావుదెబ్బ కొట్టాయి. తేలిగ్గా తేలిపోతుందని మొదట్లో కాంగ్రెస్ భావించిన ఆ బోఫార్స్ యుద్ధ ఫిరంగుల కొనుగోలు వ్యవహారం, చిలికి చిలికి చివరకు కుంభకోణంగా మారి ఆ పార్టీ ఆయువుపట్టునే నిర్వీర్యం చేసింది. బోఫార్స్ చరిత్ర అయితే,  రాఫెల్ వర్తమానం. అంతే తేడా. కాకపొతే బోఫార్స్ మాదిరిగా రాఫెల్  కాంగ్రెస్ కు కలిసి వస్తుందా లేక దూదిపింజలా తేలిపోతుందా అనేదానికి సమాధానం కిందటి సార్వత్రిక ఎన్నికల్లో మోడీ అఖండ విజయం ద్వారా వెల్లడయింది. ప్రజలు పెద్దగా నమ్మలేదని తేలిపోయింది.

మన దేశంలో కుంభకోణాలకు కొదవేమీ లేదు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటినుంచీ ఇవి వెలుగు చూస్తూనే వున్నాయి.

నిన్నటివరకు జనం చెప్పుకున్నది, ఇంకా చెప్పుకుంటోంది లిక్కర్ కింగ్, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థాపకుడు విజయ్ మాల్యా వ్యవహారం.

లక్షాధికారుల ఇంట్లో పుట్టి, కోట్లసంపద నడుమ పెరిగి, అత్యంత

సంపన్నులలోఒకడిగా ఎదిగి, ఆ క్రమంలో అందిన చోటల్లా అప్పులు చేసి, ‘పక్షిలా ఎగిరిపోవాలి’ అని పాడుకుంటూ  విదేశాలకు ఎంచక్కా ఎగిరిపోయిన విజయ్ మాల్యా గతంలోనూ, ఇప్పుడూ కూడా మీడియా వార్తలకు మంచి ముడిసరుకే.

బ్యాంకులకు అక్షరాలా తొమ్మిది వేల కోట్లు ఎగనామం పెట్టినట్టు అభియోగాలను ఎదుర్కుంటున్న చిద్విలాస పురుషుడు విజయ్ మాల్యా.

1947 లో దేశానికి స్వాతంత్రం రావడం తరువాయి, ఏకంగా మొదటి అడుగు పడింది జీపుల కుంభకోణంలో. భారత, పాకిస్తాన్ దేశాల నడుమ సంఘర్షణలకు కేంద్రం అయిన కాశ్మీర్ రాష్ట్రంలో సైనికదళాల కదలికలకు అక్కడి ఎగుడు దిగుడు మార్గాలు ప్రతిబంధకంగా ఉండేవి. దానితో అందుకు తగిన మోటారు వాహనాలు(జీపులు) దిగుమతి చేసుకోవాల్సిన అవసరం పడింది. అప్పట్లో ప్రధాని నెహ్రూకు బాగా సన్నిహితుడయిన వీకే. కృష్ణమీనన్, బ్రిటన్ లో మన దేశం తరపున హై కమీషనర్ గా పనిచేస్తుండేవారు. ఎక్కడ, ఏ మీట ఎవరు నొక్కారో తెలియదు, చాలా తక్కువ నాణ్యత కలిగిన, నాసిరకం జీపులు దేశంలోకి దిగబడ్డాయి. ఆ జీపుల కుంభకోణాన్ని ఆరాతీయడానికి అనంత శయనం అయ్యంగార్ నేతృత్వంలో ఒక దర్యాప్తు సంఘం

ఏర్పాటయింది. ఇప్పట్లా కాదు కనుక ఆయన త్వరత్వరగా దర్యాప్తు పూర్తిచేసి వెంటనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అది ఇంతవరకు వెలుగు చూసిన దాఖలా లేదు. కాకపోతే ఈ వ్యవహారంలో వెలుగులోకి వచ్చిన పేరు కృష్ణమీనన్. దరిమిలా మొత్తం దేశానికే ఆయన రక్షణ మంత్రి అయ్యారు. అదీ కొసమెరుపు.

1949 లోఉత్తరాది రాష్ట్రానికి పరిశ్రమల మంత్రిగా వున్న రావు శివ బహదూర్ సింగ్ కేవలం పాతిక వేలు లంచం తీసుకుని ఒక వజ్రాలగని లీజుని, తనకు

తెలిసిన వ్యాపారికి కట్టబెట్టారు. పాతిక వేలు ఎటుపోయాయో తెలియదు కాని, చట్టానికి దొరికిపోయిన మంత్రిగారు మాత్రం మూడేళ్ళు జైలు ఊచలు

లెక్కబెట్టాడు. పాలక పక్షం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు జైలు పాలు కావడం అదే మొదలు.

1951 లో ఎస్ ఏ వెంకట్రామన్ అనే మంత్రి కేంద్రంలో పరిశ్రమల శాఖ నిర్వహించేవారు. ఆ రోజుల్లో సైకిల్ విడిభాగాలను విదేశాలనుంచి దిగుమతి

చేసుకునేవారు. అలాటి ఒక లైసెన్సును మంత్రి మహోదయులు తనకు తెలిసిన కంపెనీకి గుండు గుత్తగా అప్పగించారు. ఫలితం, ఆరోపణలు, దర్యాప్తులు.

చివరకు అసలు వ్యవహారం బయట పడి ఆయన మూడేళ్ళు జైల్లో గడిపారు.

1956 లో దాల్మియా అనే వ్యాపార వేత్తకు అనేక వ్యాపారాలు, రాజకీయ నాయకులతో సంబంధాలు ఉండేవి. దాల్మియా జైన్ ఎయిర్ వేస్ కు ఆయన చైర్మన్. భారత బీమా సంస్థ అనే ప్రైవేటు బీమా సంస్థకు యజమాని. ఏదో డబ్బు అవసరంపడి ఆ సంస్థలో రెండు కోట్ల రూపాయల నిధులు ఆరగించారు. విషయం బయటకు పొక్కడం, విచారణ జరగడం, దాల్మియాను రెండేళ్ళు జైలుకు పంపడం చక చకా జరిగిపోయాయి. ఆ దెబ్బతో దేశంలో బీమా వ్యాపారాన్ని ప్రభుత్వం జాతీయం చేసి చేతులు దులుపుకుంది.

1957 లో కాన్పూరులో హరిదాస్ ముంద్రా అనే వ్యాపారి వుండేవారు. వ్యాపారం అన్నాక డబ్బుల అవసరం తప్పదు. అందులో కేంద్రంలో ఆర్ధిక మంత్రిగా వున్న టీ.టీ. కృష్ణమాచారి గారికీ, ఈ ముంద్రా గారికీ మంచి స్నేహం. మంత్రిగారు తలచుకుంటే ఎల్.ఐ.సి. (జీవిత బీమా సంస్థ) నుంచి రుణం ఇప్పించడం ఏమంత కష్టం? అందులోను అది ప్రభుత్వ రంగ సంస్థ. టీటీకే కార్యాలయం నుంచి ఫోను వెళ్ళగానే చిటికెలో ముంద్రా గారెకి కావాల్సిన కోటి రూపాయల రుణం మంజూరు అయిపోయింది. కానీ కధ అయిపోలేదు. పైగా కొత్తగా కేసు మొదలయింది. ముంద్రా ఇరవై రెండు నెలలు

జైల్లో వున్నాడు. సిఫారసు చేసిన పాపానికి టీటీ కృష్ణమాచారికి కృష్ణజన్మస్థానానికి వెళ్ళే ప్రమాదం రాలేదు కానీ, మంత్రి పదవికి నీళ్ళు

ఒదులుకోవాల్సివచ్చింది.

1962 లో మరో కుంభకోణం వెలుగు చూసింది. ఆర్ధికపరమయిన నేరాల్లో ఇరుక్కుంటే చక్కటి జీవితాలు కూడా ఎలాటి భయంకరమయిన మలుపులు తిరుగుతాయో అనడానికి ఇది చక్కని ఉదాహరణ. ఆయన పేరు చూస్తే ఉత్తర భారతం అనిపిస్తుంది కాని, జయంతి ధర్మతేజ అనే ఈ పెద్దమనిషి పదహారణాల తెలుగువాడు. తన సొంత తెలివితేటలతో ఒక సువిశాల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించగలిగాడు. ఇప్పుడు ప్రభుత్వ రంగంలో వున్న

భారత షిప్పింగ్ కార్పొరేషన్ ఆవిర్భావానికి పూర్వం, దేశ నౌకానిర్మాణ రంగం ధర్మతేజ గారి ఆధిపత్యంలోనే వుండేది. స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో అప్పటి

ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూను ధర్మతేజ తెలివితేటలు బాగా ఆకట్టుకున్నాయి. కేవలం రెండు వందల రూపాయల పెట్టుబడితో ఆయన సంస్థ ప్రారంభం అయిందని చెబుతారు. నెహ్రూ పుణ్యమా అని ఇరవై రెండుకోట్ల అప్పు పుట్టింది. ఇకనేం, ఆయన వ్యాపారం మూడు పూవులు ఆరుకాయలుగా విలసిల్లింది. కాలక్రమంలో ధర్మతేజ వ్యాపారంలో అనేక అధర్మ కోణాలు వెలుగు చూసాయి. సుదీర్ఘ విచారణ అనంతరం ఆయన్ని లండన్ లో అరెస్టు చేసి ఆరేళ్లు  జైల్లో ఉంచారు. ఆ పిదప ఆయన్ని గురించి చెప్పుకోవడానికి ఏమీ మిగలలేదు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన జయంతి ధర్మతేజ మసకబారి కాలగర్భంలో కలిసిపోయాడు.

1964 ప్రాంతంలో అవిభజిత పంజాబు రాష్ట్రం ముఖ్యమంత్రిగా ప్రతాప్ సింగ్ ఖైరాన్ అనే కాంగ్రెస్ నాయకుడు ఏకచత్రాధిపత్యంగా పాలిస్తుండేవాడు.

ఎదురులేని పాలన అయినా, ఎదురు దెబ్బలు మాత్రం తప్పలేదు. అధికారంతో పాటే సంక్రమించిన అవినీతి తెగులు దేశం మొత్తంలో ఒక చర్చనీయాంశం అయింది. దాస్ కమీషన్ ఆయనపై అభియోగాలను నిర్ధారించడంతో ఖైరాన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

1971 లో నగర్ వాలా కేసు ఒక విచిత్రం. ఢిల్లీలోని ఒక స్టేట్ బ్యాంక్ శాఖలో పనిచేస్తున్న చీఫ్ క్యాషియర్ కి ఓరోజు ఫోన్ వచ్చింది. ‘నేను ప్రధాని

ఇందిరాగాంధీని మాట్లాడుతున్నాను’ అని అవతల నుంచి వినిపించింది. ఇవతల అధికారి భయంతో బిక్కచచ్చిపోయాడు. కానీ, ప్రధాని తనకు ఫోన్ చేయడం ఏమిటని క్షణం కూడా సందేహించలేదు. “నగర్ వాలా అని నా తరపున ఒకతను వస్తాడు. అతడికి వెంటనే అరవై లక్షలు ఇచ్చి పంపేయండి’ అని చెప్పేసి అవతల ఫోన్ కట్టయింది. చెప్పినట్టే రుస్తుం సోరబ్ నగర్ వాలాగారు విచ్చేశారు. ఆ నగర్ వాలాజీ ఒక మాజీ సైనికాధికారి. బ్యాంకు అధికారి అక్షరాలా అరవై లక్షలు లెక్కబెట్టి అతడి చేతిలో పెట్టాడు. అతగాడు లెక్కబెట్టుకోకుండానే దర్జాగా ఆ డబ్బు తీసుకుని అంతకంటే దర్జాగా వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో ఇదొక పెద్ద దుమారంగా, సంచలనంగా మారింది. ప్రధాని పేరు వినరావడంతో దర్యాప్తులు, విచారణలు ముమ్మరంగా సాగాయి. అయితే, కధ మరీ సాగిపోకుండా ఆగిపోయింది, నగర్ వాలా ఒక రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మరణించడంతో.

1974 లో పుదుచ్చేరికి చెందిన కొందరు వ్యాపారులు ఢిల్లీ వెళ్లి కేంద్ర వాణిజ్య మంత్రిని కలిసి తమకు దిగుమతి లైసెన్సు ఇవ్వాలని కోరుతూ ఒక మహజరు అందచేసారు. దాన్ని గట్టిగా సిఫారసు చేస్తూ ఇరవై ఒక్కమంది పార్లమెంటు సభ్యులు సంతకాలు చేసారు. తీరా లైసెన్సులు జారీ చేసిన తరువాత తెలిసినదేమిటంటే ఆ సంతకాలన్నీ ఫోర్జరీవని.

మహారాష్ట్రలో అబ్దుల్ రహమాన్ అంతులే అనే కాంగ్రెస్ నాయకుడికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అంటే అంతులేని అభిమానం. అంచేత ఇందిరా ప్రతిభా

ప్రతిష్టాన్ అనే స్వచ్చంద సంస్థను పెట్టి ముఖ్యమంత్రి హోదాలో ఒత్తిడి తెచ్చి అంతులేని విరాళాలు సేకరించి అందులో పెట్టారని ఆయనపై అభియోగాలు

వెల్లువెత్తాయి. ఫలితం ముఖ్యమంత్రి పదవి నుంచి ఉద్వాసన.

ఆర్ధిక కుంభకోణాల్లో జనం ఇప్పటికీ మరిచిపోలేనిది హర్షద్ మెహతా షేర్ల భాగోతం. సరళీకరణ ఆర్ధిక విధానాలు ఆరంభదశలో ఉన్నకాలంలో అవకాశాలను అంది పుచ్చుకుని పైకి ఎదిగిన ఈ షేర్ సింగ్ అనతికాలంలోనే అడ్డదార్లలో పదివేల కోట్ల రూపాయల కుంభకోణానికి తెర తీశాడు. ఇతడి దెబ్బకు యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చిగురుటాకులా అల్లల్లాడిపోయింది. దాన్ని ఒడ్డున పడెయ్యడానికి ప్రభుత్వం పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన ధనాన్ని 4,800 కోట్ల మేరకు వాడాల్సివచ్చింది.

ఇలా చెప్పుకుంటూ పొతే ఈ జాబితా చేంతాడు అంత అవుతుంది. నకిలీ స్టాంపుల

తెల్గీలు, కృష్ణ యాదవ్ లు, పశువుల దానా లాలూ యాదవ్ లు, షేర్ మార్కెట్లతో

గోలీ ఆటలు ఆడుకున్న చేతన్ పరేఖ్ లు.......ఒకటా, రెండా..... ఎన్నెన్నో

కుంభకోణాలు, ఒకళ్ళా, ఇద్దరా.... ఎందరెందరో మహానుభావులు, తమ వికృత

చేష్టలతో చరిత్రను సృష్టించి చరిత్రలో కలిసిపోయారు.

అయినా నేటి చరిత్ర చూస్తుంటే గత కాలము మేలు అనే అనిపిస్తోంది కదూ.