5, మే 2026, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (303): భండారు శ్రీనివాసరావు

 

హాఫ్ పోస్తుమస్ అవార్డ్
‘ఎప్పుడూ ఆ కంప్యూటర్ ముందు కూర్చుని టిక్కు టిక్కుమంటూ టైప్ చేస్తుంటారు, గూడలు అరిగిపోయేలా?’ (ఏమిటి ఉపయోగం? కూటికా! గుడ్డకా! సినిమాకా!) అనేది నా భార్య బతికున్న రోజుల్లో. బ్రాకెట్లో రాసినవి నా సొంత కపిత్వం.
రిటైర్ అయిన తర్వాత నేను రాస్తూ వచ్చిన వ్యాసాలను కొన్ని పత్రికల వాళ్ళు వేస్తూ వచ్చారు కానీ రచయితకు విదిలించింది ఏమీ లేదు. ఎక్కడో అక్కడ నేను రాసిన అక్షరాలకు, నలుపూ తెలుపూ రంగులు అంటుతున్నాయి కదా అని నేనూ పట్టించుకోలేదు.
పొతే, నా బ్లాగుకు హిట్లు అన్ని లక్షలు అని చంకలు కొట్టుకోవడం తప్పిస్తే దాని రాతలవల్ల నాకు అంటుకున్నవి మెడ నొప్పులు, గూడ నొప్పులు మాత్రమే.
కొన్నాళ్ళ క్రితం అమెరికాలో ఉంటున్న మా అన్నయ్య కుమారుడు సత్య సాయి కష్టపడి నా బ్లాగును Google Adsense తో అనుసంధానం చేశాడు. పాత వాటిని ఆ సంస్థ లెక్కలోకి తీసుకోదట. పోనీలే అనుకున్నాను.
ఆ మధ్య ఎప్పుడో చూస్తే రెండు అమెరికన్ డాలర్లు నా ఖాతాలో పడ్డట్టు కనిపించింది. అవి నా బ్యాంకు ఖాతాకు చేరి, జీ ఎస్ టి పోను ఎంత మిగులుతుందో అది నాకనవసరం.
డెబ్బయి అయిదేళ్ళ వయసులో నా రాతల ద్వారా నేను రెండు డాలర్లు సంపాదించాను, అంతే నాకు కావాల్సింది.
నా భార్య బతికి వుంటే, నేనో మిలియన్ డాలర్లు సంపాదించినంత సంతోషపడి వుండేది.
ఈసారి అమెరికా వెళ్ళినప్పుడు నా మనుమరాళ్లకు నా డబ్బులతో చిన్న చాకలేట్ కొనివ్వగలను అనే ఊహే నాకు ఆనందాన్ని ఇచ్చింది.
కానీ మా ఆవిడతో కలిసి మరోసారి, అదే ఆఖరు సారి, కలిసి వెళ్ళడం, అప్పటికి మా మనుమరాళ్లే ప్రయోజకులై, మా అవసరాలను వాళ్ళే కనుక్కునే స్థాయికి చేరారు.
ఇది జరిగి చాలా కాలం అయింది.
నా బ్యాంకు ఖాతాలో, చాలా కొద్ది మొత్తంలోనే అనుకోండి, మరిన్ని డాలరు డబ్బులు, జి ఎస్.టి మినహాయించుకుని, రూపాయల రూపంలో చేరాయి. ఇది ఇలా వుండగా META నుంచి మరికొన్ని డాలర్లు వచ్చాయి. నా పెన్షన్ డబ్బులు బొటాబొటిగా నా అవసరాలను తీరుస్తున్నాయి. ఇలా అదనంగా వచ్చే ఈ డబ్బులు అవసరంలో ఉన్నవారి అవసరాలను తీర్చడానికి సరిపోయేవి కాదు. పర్సులో చిల్లర డబ్బుల మాదిరి.
‘సిరి దావచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి దాఁ బోయిన బోవును కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!
అన్నట్టు, వచ్చినా పోయినా పట్టించుకోని స్థిత ప్రజ్ఞత వున్న వాడే నిజమైన ఆనందాన్ని పొందగలుగుతాడు. ఒక వయసు దాటిన తర్వాత డబ్బు అవసరం ఉండవచ్చు కానీ, అదే ప్రధానం కాదు.
కిందటి ఆదివారం కాక, అంతకు ముందు ఆదివారం నాడు ఒక తెలియని నెంబరు నుంచి ఫోన్ వచ్చింది. గ్యాస్ సిలిండర్ కోసం ఏమో అని రాంగ్ నెంబర్ అనే లోగా అవతలి గొంతు, ‘నా పేరు రాజగోపాల్! హై బిజ్ టీవీ సీ ఈ ఓ’ అని పలకరించింది.
వారు ఫోనులో చెప్పిన విషయం ఏమిటంటే ఈ ఈ ఏడాది వారి సంస్థ తరపున ఇచ్చే లెజెండ్ ఇన్ జర్నలిజం అవార్డ్ కు నన్ను ఎంపిక చేశారట. అదీ రేడియో జర్నలిజం రంగంలో. చిత్రం ఏమిటంటే, మా ఆవిడ పోయిన తర్వాత ఈ గుర్తింపులు. హాఫ్ పోస్తుమస్ అవార్డ్ అంటే ఇదే!
లొకేషన్ తీసుకుని మా ఇంటికి వచ్చారు. ‘వ్యక్తిగతంగా ఆహ్వానించడానికి వచ్చాను’ అని చెప్పారు చాలా మర్యాదగా. ఎండన పడి ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయడానికి మా ఇంట్లో వసతి లేదు.
‘నా గురించి మీరు ఎలా తెలుసుకున్నారు’ అనేది నా ప్రశ్న. ‘ఫేస్ బుక్ రీడర్ని’ అని జవాబు.
ఓహో! జీరో ముందు ఒకటి చేరుతోంది అన్నమాట.
‘మీరిచ్చే ఈ అవార్డ్ నాకు హాఫ్ పోస్తుమస్’ అన్నాను. నివ్వెరపోతుంటే ‘మా ఆవిడ వుండుంటే సంతోషపడేది’ అన్నాను.
కాసేపు కూర్చుని వెళ్ళిపోయారు.
ఆ ఆదివారం వచ్చింది. మా పెద్దన్నయ్య కుమారుడి గృహ ప్రవేశం అంతకు ముందు రాత్రే జరిగింది. అక్కడికి వెళ్లి వచ్చాను. మర్నాడు ఆదివారం పగటిపూట సత్యనారాయణ వ్రతం.
హైబిజ్ టీవీ వాళ్ళు పంపించిన కారులో శిల్పారామం దగ్గర సైబర్ గార్డెన్స్ కన్వెన్షన్ సెంటర్ కు వెళ్లాను. పాత్రికేయ మితృలు అనేకమంది కలిసారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన సుశీల్, రచయిత్రి మృణాలిని, సాక్షి రెంటాల జయదేవ్, ఆలిండియా రేడియో గోపీచంద్ సాటి అవార్డు గ్రహీతల్లో వున్నారు. మరో పాత్రికేయ మిత్రుడు ములుగు సోమశేఖర్, రేడియో సహచరుడు రాంబాబు ఇలా చాలా మంది కలిసారు. అవార్డు కన్నా ఇంతమంది పాత మిత్రులను కలవడం మరింత సంతోషం కలిగించింది.
అవార్డు ప్రదానం చేసిన రాష్ట్ర ఐ.టీ. శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆప్యాయంగా పలకరించారు. నిజానికి వారి నాన్నగారు, ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ శ్రీపాదరావు గారితో నాకు మరింత అత్యంత సన్నిహిత పరిచయం. అన్యాయంగా నక్సలైట్ల చేతిలో మరణించారు.
ముసలితనంలో వసంతం జరిపించిన హైబిజ్ టీవీ రాజ్ గోపాల్ గారికి, వారి బృందానికి కృతజ్ఞతలు.














(ఇంకా వుంది)