30, అక్టోబర్ 2020, శుక్రవారం

తాగడానికెందుకురా తొందరా ! - భండారు శ్రీనివాసరావు

 1995 లో ఎన్టీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయి రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధించినప్పుడు, ఎవరైనా మందు ఎక్కడ దొరుకుతుంది అని అడిగితే పలానా పత్రిక పలానా పేజీలో అని జవాబు వచ్చేది. మద్యనిషేధం ఎందుకు అవసరమో ప్రజలకు నచ్చచెబుతూ పుంఖానుపుంఖాలుగా వార్తలు, వ్యాసాలు ఆ పత్రిక ప్రచురించేది. ఆ తర్వాత కొద్ది కాలానికే సంభవించిన రాజకీయ పరిణామాల దరిమిలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యనిషేధం కారణంగా మద్యం మాఫియాల వల్ల ఒనగూడబోయే అనర్థాలు గురించి కూడా అదే పత్రిక వైనవైనాలుగా రాసింది. కొంతకాలం తర్వాత అందరూ అనుకున్నట్టే చంద్రబాబునాయుడు ముందు మద్యనిషేధాన్నిసడలించి, ఆ పిదప పూర్తిగా తొలగించారు.

ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోవడం, ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మార్గాలలో మద్యం రవాణా పెరిగిపోవడం, అన్నింటికంటే మించి మద్యం మాఫియా కోరలు సాచి తన విశ్వరూపాన్ని ప్రదర్శించడం ఇవన్నీ ఆయన మద్య నిషధం ఎత్తివేయడానికి కారణాలుగా చెప్పుకున్నారు. రాష్ట్రాల సరిహద్దుల్లో మాఫియా చెలరేగి ఆయా ప్రాంతాల రాజకీయ నాయకుల అస్తిత్వానికే ప్రమాదకరంగా పరిణమించడంతో అన్ని పార్టీల వాళ్ళు బయటకు ఎన్ని ప్రకటనలు చేసినా లోపల మాత్రం చంద్రబాబు నిర్ణయాన్ని హర్షించారనే చెప్పాలి.

అప్పుడు కర్నాటక సరిహద్దుల్లో వుండే ఒక అధికార పక్షం శాసన సభ్యుడు చెప్పిన విషయం ఏమిటంటే ఒక లారీ లోడు మద్యం రాష్ట్రంలోకి వచ్చేలా చేయగలిగితే లక్షల రూపాయలు ముట్టచెప్పేవారట. ఈ రకమైన సులభ ఆదాయానికి అవకాశం దొరకడంతో మద్యం మాఫియా ప్రభుత్వ వ్యవస్థలనే ప్రభావితం చేయగల స్థాయికి వెళ్ళిపోయిందని చెప్పారు. రాజకీయులను కలవరపరచిన అంశాలలో ఇది ప్రధానమైనది.

అమలు సాధ్యం కాని మద్య నిషేధం వుంటేనేమి, లేకపోతేనేమి అనే నిస్పృహ ప్రజలలో కలిగించి, వారిలో తదనుగుణమైన మార్పు రావడానికి అప్పటి పత్రికలు కొన్ని సహకరించాయి. మొదటే చెప్పినట్టు ముందు పేర్కొన్న పత్రికదే ఇందులో సింహభాగం క్రెడిట్.

1980 - 2010 నడుమ పుట్టిన వారిలో చాలామందికి 1994, 1995 ప్రాంతాల్లో జరిగిన సంఘటనలు, పరిణామాల పట్ల పూర్తి అవగాహన వుండే అవకాశాలు తక్కువగా వుంటాయి. ఎందుకంటే అప్పటికి వారి వయసు పదిహేనేళ్లకు లోపు కనుక. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా చురుగ్గా పాల్గొంటున్న అలాంటి వారికి అలనాటి విషయాలు గురించి గూగుల్ పరిజ్ఞానం ఉండవచ్చు కానీ ప్రత్యక్ష సాక్షులుగా వుండి అవగాహన చేసుకునే వీలు వుండే అవకాశం లేదు.

1994లో నెల్లూరు జిల్లా దూబగుంట గ్రామానికి చెందిన నిరక్షరాస్యురాలయిన ఓ పేద మహిళ రోసమ్మ సాగించిన సారా వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడడంతో అప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న ఎన్టీ రామారావుకు ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో ఇదొక ప్రచారాస్త్రంగా ఉపయోగపడింది. తమ పార్టీ అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్య నిషేధం విధిస్తానని ఆయన వివిధ ఎన్నికల సభల్లో చేసిన వాగ్దానం పేద దిగువ తరగతి మహిళలలో విపరీతమైన ఆశలు పెంచింది. ఫలితంగా అంతకుముందు అయిదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీని మంచి మెజారిటీతో గెలిపించి ప్రభుత్వ పగ్గాలు అప్పగించారు. రామారావు గారు కూడా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని ప్రవేశపెట్టారు.

పేద జనాల తాలూకు ఆడంగులందరూ హాహా ఓహో అన్నారు. అయితే ప్రశంసలతో ప్రభుత్వాలు నడవవు కదా! పైగా బోలెడు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సిన పరిస్థితి. కానీ ఆయన మొండి మనిషి. ససేమిరా మద్యనిషేధాన్ని ఎట్టిపరిస్థితిలోనూ అమలు చేసి తీరాల్సిందే అన్నారు. కానీ జరిగింది వేరే విధంగా వుంది.

బడుగు బలహీన వర్గాల కుటుంబాలు ఆర్ధికంగా కూసింత నిలదొక్కుకునే దశలో మద్యం మాఫియా జడలు విప్పింది. నిషేధ చట్టానికి తూట్లు పొడిచే కార్యక్రమం ఒక పద్దతి ప్రకారం మొదలయింది. ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా అడ్డూఅదుపూ లేకుండా సాగింది. బయట నుంచి ఒక్క లారీ లోడ్ మద్యం రాష్ట్రంలోకి వచ్చేలా చూడగలిగిన పెద్దలకు లక్షల్లో నజరానాలు అందాయి. సరిహద్దు ప్రాంతాల ప్రజాప్రతినిధులకు నెలలవారీ మామూళ్ళు ముట్టాయి. వారికి సహకరించేవారు రాత్రికి రాత్రి లక్షాధికారులు అయ్యారు.

ప్రభుత్వానికి రాజమార్గంలో రావాల్సిన ఆదాయం దారిమళ్లి వేరే వారి జేబుల్లోకి చేరింది. ఉభయ భ్రష్టత్వం ఉపరిసన్యాసం.

ఎవరెన్ని కబుర్లు చెప్పినా మద్యం అనేది ఏ ప్రభుత్వానికి అయినా కాసుల వర్షం కురిపించే కామధేనువు. అయితే అదే సమయంలో అదే మద్యనిషేధం వాగ్దానరూపం ధరిస్తే ఎన్నికల వైతరణిని దాటించే సులభమైన మార్గం కూడా. అంచేత తెలివయిన రాజకీయ నాయకులు రెండు వైపులా పదునున్న ఈ అయుధాన్ని అంతే తెలివిగా ఉపయోగించుకుంటారు.
అందుకే, పైకి చెప్పరు కానీ వారిది ఒకే నినాదం.
“అధికారంలోకి రావడానికి ప్రజలకు నచ్చే కొన్ని మాటలు చెప్పాలి. అలా దక్కిన అధికారాన్ని నాలుగు కాలాలు నిలబెట్టుకునేందుకు జనాలకు ఇష్టంలేని కొన్ని పనులు చేయాలి”
చేయక తప్పదు కూడా.

అదే జరిగింది లోగడ. ఇప్పుడూ జరుగుతుందేమో తెలియదు.
కానీ ఆనాటి పత్రికల సహకారం ప్రస్తుతం పూర్తిగా పూజ్యం.
(30-10-2020)

29, అక్టోబర్ 2020, గురువారం

అమెరికా ఎన్నికల్లో సింహభాగం ఖర్చు మీడియా మీదే.

 అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు గురించి కొద్ది సేపటి క్రితం ఒక టీవీ ఛానల్ డిబేట్ నిర్వహించింది.

అమెరికానుంచి ఇందులో పాల్గొన్న తానా మాజీ అధ్యక్షుడు శ్రీ కోమటి జయరాం ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు.

‘మన దేశంలో మాదిరిగానే ఆ దేశంలో కూడా పార్టీల వాళ్ళు ఓటర్లకు డబ్బులు ఇస్తారా అనే సందేహం మన దగ్గర చాలామందిలో వుంది. ఓటర్లకు నేరుగా డబ్బులు ఇవ్వడం అనేది అమెరికాలో లేదు. మరి వసూలు చేసిన కోట్లాది డాలర్ల పార్టీ ఎలెక్షన్ ఫండ్ ఎలా ఖర్చు చేస్తారు అనే అనుమానం రావచ్చు. ఉదాహరణకు నన్ను ఈ చర్చకు ఆహ్వానించారు. వరసగా వాణిజ్య ప్రకటనలు వేస్తూ పది నిమిషాలు వెయిట్ చేయించారు. అక్కడా పార్టీలకు ఇదే ప్రధానమైన ఖర్చు. పత్రికలు, ప్రకటనలకు అయ్యే ఖర్చే ఎక్కువ. ఓటర్లకు ఇచ్చేది ఏమీ వుండదు. ఇక్కడి ఓటర్లు ఓ బాధ్యతగా భావించి తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. వాళ్ళని ప్రలోభ పెట్టాల్సిన అవసరం వుండదు”

అచ్చు ఇలాగే కాకపోయినా ఇదే అర్ధం వచ్చేట్టు ఆయన మాట్లాడారు.

(29-10-2020)

26, అక్టోబర్ 2020, సోమవారం

రెండు రెళ్ళు యాభయ్ - భండారు శ్రీనివాసరావు

 ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారి రచనా వ్యాసంగానికి  యాభయ్ ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నిన్నా, ఈరోజూ ప్రసారం అయిన సాక్షి టీవీ వారి కార్యక్రమాన్ని చాలా మంది చూసారు. నిజానికి మల్లాది  గారి గురించి అందులో వెల్లడించిన చాలా విషయాలు ఒకనాటి తరంలో చాలామందికి తెలిసినవే. కాకపొతే ఆయన ఎలా ఉంటారో చూద్దామనే ఆసక్తితో అనేకమంది ఆ కార్యక్రమం చూసారు. ఫేస్  బుక్ పాఠకులలో ఒకరి వ్యాఖ్య సందర్భోచితంగా వుంది. ‘పాండవులు లేని మాయాబజార్ సినిమాలా వుంద’ని ఆయన అన్నారు. నిజమే అనిపించింది.

ఈ యాభయ్ ఏళ్ళలో మల్లాది వారు అనేక సభల్లో పాల్గొని వుంటారు. కానీ ఆయన ఫోటో మాత్రం  ఏ పత్రికలోనూ రాలేదు. (అలా సకృత్తుగా నా కంట పడిన ఫోటో ఒకదాన్ని నేను నా బ్లాగులో ఒకసారి  పోస్టు చేస్తే అప్పుడు అమెరికాలో వున్న మల్లాది గారు  నాకు మెసేజ్ పెట్టారు, దాన్ని వెంటనే తొలగించమని)

అలాగే  ఒకమారు, ఏదో ఇంటర్వ్యూలో యండమూరి వారినీ ఆయననూ కలిపి చూపించాల్సి వస్తే యండమూరి ఫోటో పక్కన మల్లాది వెంకట కృష్ణ మూర్తి అని ఆయన పేరు  రాసి వున్న పుస్తకం కవర్ పేజీని  పెట్టి చూపించారు.

ఇక సాక్షి కార్యక్రమంలో నాకు నచ్చిన అంశం ఏమిటంటే మల్లాది గారి గురించి  సముచిత గౌరవంతో వ్యక్తం చేసిన యండమూరి వీరేంద్రనాథ్ గారి అభిప్రాయంతో  కూడిన  వీడియో బిట్ చూపించారు. ఆయన చెప్పిన పలుకులు కూడా సాటి రచయిత పట్ల ఆయనకున్న ఆప్యాయతను, సద్భావాన్ని ప్రతిఫలించాయి. అంతే కాదు, తెచ్చిపెట్టుకున్నట్టుగా కాకుండా హృదయం విప్పి చెప్పిన అనుభూతిని  మిగిలించాయి.

మల్లాది గారెని చూపిస్తారేమో అనే ఆశతో ఈ కార్యక్రమాన్ని చూసిన వారికి నిరాశే మిగిలింది.

నిజానికి ఈ పోస్టు నిన్ననే రాశాను. కానీ ఈరోజు రిపీట్ టెలికాస్ట్ వున్న కారణంగా కొద్దిగా ఆలస్యంగా పోస్టు చేస్తున్నాను. ఎందుకంటే ఆయన కనబడరు అని ముందే తెలిస్తే  చూసేవారు తగ్గిపోతారు కాబట్టి. 



 (26-10-2020)

అందరూ అత్తలే – భండారు శ్రీనివాసరావు


అదేవిటో దురదృష్టం. కోడళ్ళకు సరే. సినిమావాళ్ళకు కూడా అత్త అంటే పడదు. అత్త అంటే సూర్యాకాంతం లాంటి గడుసు మనిషని అనుకునేలా సినిమాలు తీసారు. తీస్తున్నారు. అత్తలందరికీ అసలు పేరు ఒకటి వుంటుంది కాని, గయ్యాళితనానికి మారుపేరనే పాడుపేరొకటి వారి సొంతం. సొంతానికి సాధించింది ఏవీ లేకపోయినా పొద్దస్తమానం కోడళ్లను సాధిస్తారనే ట్యాగ్ లైన్ మరోటి. కోడలు యెంత గుణవంతురాలయినా, నడుం దించకుండా అడవా చాకిరీ యెంత చేస్తున్నా, 'అదేం రోగమో మా కోడలు పిల్లకు నడుం ఒంగి చావదు, చచ్చినట్టు ప్రతిపనీ నేనొక్కత్తినే చేసుకు చావాలి' అనే టీవీ సీరియళ్ల అత్తళ్ళకు కొదవ వుండదు. ఇంతకీ ఈ అత్తల పురాణం ఎందుకంటే? -

సాధించే గుణం, వంకలు పెట్టే గుణం, 'అన్ని పనులు నేనే చేస్తున్నాను, వేరేవారికి పనులు చేతకాదు' అనే అత్తల సహజ స్వభావం సమాజంలో అందరిలోను ఎంతో కొంత వుందని చెప్పడానికే.

ఏదయినా ఆఫీసరును కదిపి చూడండి. అక్షరం పొల్లుపోకుండా ఇదే సోది చెబుతాడు. 'తను తప్ప పనిచేసేవారు ఎవ్వరూ లేరనీ, అందరి పనులు తానే నెత్తికెత్తుకుని చేస్తుండబట్టే ఆఫీసు ఈ మాత్రం నడుస్తోంద'నీ అంటాడు. ఆయన కింద పనిచేసేవాడిని అడిగితే ఆయనా తన కింద వాళ్లని గురించి ఇదేవిధమైన అమూల్యాభిప్రాయం వ్యక్తం చేస్తాడు. అంటే ఏమిటన్న మాట, అత్తలకీ వీళ్ళకీ ఏమీ తేడా లేదన్న మాట.

'ఎవ్వరూ పనిచేయడం లేదు అందుకే దేశం ఇలా తగలడిపోతోంద'ని అనుక్షణం మధన పడిపోయేవాళ్లు అడుగడుక్కీ కనిపిస్తుంటారు. నేనూ ఇందుకు మినహాయింపు కాదు. వంకలు పెట్టే వంకర గుణం నాకూ వుంది.

ఓసారి రైల్లో పోతుంటే బోధి వృక్షం కింద బుద్ధుడికి జ్ఞాన బోధ అయినట్టు జీవిత సత్యం బోధపడింది. వెచ్చటి వేసవి కాలంలో చల్లటి ఏసీ కోచ్ లో అంతా ముసుగుతన్ని పడుకున్న సమయంలో, ప్రపంచం అంతా నిద్రలో జోగుతున్న సమయంలో పట్టాలపై రైలు అలుపులేకుండా పరుగులుతీస్తోంది. ఏదయినా స్టేషన్ వచ్చినప్పుడల్లా రైలు దడదడా పట్టాలు మారుతున్న ధ్వని వినబడుతూ వుంది. ఆ అర్ధరాత్రి వేళ పట్టాలు మార్చే మనిషి కాస్త ఏమరు పాటుగా వున్నా, కాసింత రెప్ప వాల్చినా రెప్పపాటు కాలంలో ఆ రైల్లోని ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం తధ్యం. అంటే ఏమిటి, రైల్లో ఇంతమంది జనం హాయిగా కంటినిండా నిద్రపోగలుతున్నారు అంటే ఇంతమందికోసం ఎవరో ఒకరు ఆ నిశిరాత్రివేళ నిద్ర లేకుండా పనిచేస్తున్నారనే అర్ధం. 'అది అతని డ్యూటీ చేయక ఏం చేస్తాడు' అంటే అతడు పనిచేస్తున్నాడు అనేకదా! కాబట్టి 'మనం ఒక్కళ్ళమే పనిచేస్తున్నాం, మిగిలిన వాళ్లు అందరూ పని దొంగలు' అని రొమ్ము విరుచుకోవడంలో అర్ధం లేదు.

అలాగే మరో ఉదాహరణ. చలి కాలం. నిద్రలేచి కూడా లేవడానికి బద్దకించి ముసుగు తన్నిపడుకున్నవేళ, మన ఇంటి ముందు ఎవరో పాల ప్యాకెట్లు వుంచి వెడతారు. 'అవి అంత పొద్దున్నే యెలా వచ్చాయి' అని ఒక్క క్షణం కూడా ఆలోచించం. 'ఇంటింటికీ ఇలా పొద్దున్నే వేస్తున్నాడు అంటే అతడు యెంత పొద్దున్న లేచి వుంటాడు అనే ప్రశ్న నేనయితే ఎప్పుడూ వేసుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే నాలోనూ కనిపించని 'అత్త' అవుంది. అదే నాచేత 'అది అతడి డ్యూటీ' అనే మాట చెప్పిస్తుంది. అనేది నా థియరీ. అంటే మరి అతడు తన డ్యూటీ చేస్తున్నప్పుడు 'ఎవ్వరూ పనిచేయడం లేదు' అని నేనిచ్చే స్టేట్ మెంట్లకి అర్ధం ఏమిటి?

వేడి వేడి కాఫీ తాగుతూ పత్రికల్లో వచ్చే తాజా వార్తలు చదివే భోగం మనకు పట్టింది అంటే ఎవరో పిల్లాడు తెల్లవారుఝామున్నే నిద్ర లేచి, ఏజెంట్లు ఇచ్చిన పత్రికలు సైకిల్ మీద పెట్టుకుని ఇంటింటికీ తిరిగి వేయబట్టే కదా! అలాగే తెల్లారకముందే అన్నన్ని వార్తలు మోసుకుని పత్రికలు మన ఇళ్లకు వస్తున్నాయి అంటే పత్రికాఫీసుల్లో ఎంతమందో మనకోసం నిద్ర కాచి పనిచేయబట్టే కదా! ఇలాగే, మన చుట్టూ వున్న పని మనుషులు, వీధులు వూడ్చేవాళ్ళు, ఒకళ్లా ఇద్దరా అనేకమంది ఒళ్ళు దాచుకోకుండా, పనికి బద్ధకించకుండా ఎవరి పనులు వాళ్లు చేస్తూ వుండడం వల్లే, హాయిగా కాలు మీద కాలేసుకుని కూర్చుని, 'ఎవ్వరూ పనిచేసేవాళ్ళే లేరు, నేనొక్కడ్ని తప్ప. అందుకే దేశం ఇలా తగలడిపోతోంద'ని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాము.

ఒక్కటి నిజం. ఎవ్వరూ పనిచేయకుండా మనకు రోజు గడవడం లేదు. ఒక్కళ్ళూ పనిచేయడం లేదని వంకలు పెట్టకుండా కూడా రోజు గడవడం లేదు. అందుకే అన్నది, అందరిలోనూ ఎంతో కొంత 'అత్తల గుణం' వుందని.

23, అక్టోబర్ 2020, శుక్రవారం

దమ్ముంటే

 ‘దూకుతా దూకుతా అనే సవితే కాని దూకిన నా సవితి లేదు’ అనేది ఓ ముతక సామెత.

‘మీరు రాజీనామా చేయండి. నాతొ పోటీ చేసి గెలవండి. అప్పుడు తెలిసిపోతుంది ప్రజలు ఎవరి పక్షాన వున్నారన్నది’
ఈ మధ్య ఇటువంటి సవాళ్లు మరీ శృతిమించి రాగాన పడుతున్నాయి.

నాకెందుకో ఈ సవాళ్ళలో చిత్తశుద్ధి లేదనిపిస్తుంది. నాగభూషణం రక్తకన్నీరు నాటకంలో చెప్పినట్టు రాజకీయ నాయకులు వదలలేనిది పదవి ఒక్కటే. టీవీ చర్చల్లో చేసే సవాళ్ళను స్వీకరించి రాజీనామాలు చేస్తారంటే మీరూ నేనే కాదు, పైకి చెప్పరు కానీ వాళ్ళు కూడా నమ్మరు.

(అయితే ఈ సూత్రానికి కూడా కొన్ని మినహాయింపులు వున్నాయి. తెలంగాణా ఉద్యమం రోజుల్లో అప్పటి పీసీసీ ప్రెసిడెంటు ఎం. సత్యనారాయణరావు గారు, ఓసారి నోరుజారి నాటి ఉద్యమ నేత కేసీఆర్ కు ఇలాగే ఓ సవాలు విసిరారు. ఆయన ఆ సవాలును స్వీకరించి మెరుపు వేగంతో కరీంనగర్ పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి, ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికలో నిలబడి పెద్ద మెజారిటీతో గెలిచారు. ఆ ఉపఎన్నిక ఫలితం తెలంగాణా ఉద్యమాన్ని మంచి మేలుమలుపు తిప్పిందని అంటారు.

కాబట్టి దమ్ముందా అనే ఛాలెంజ్ విసిరేముందు సొంత దమ్ము గురించి ఓపరి ఆలోచించుకోవడం మంచిది)
23-10-2020

20, అక్టోబర్ 2020, మంగళవారం

అపభ్రంశపు అనువాదం – భండారు శ్రీనివాసరావు

 మిత్రుడు A.Saye Sekhar ఈ మధ్య Communication”, “Communicator” అనే ఇంగ్లీషు పదాలకు telugu equivalent (బహుశా సమానార్థక తెలుగు పదాలు కాబోలు) ఏమిటనే ప్రశ్నను సంధించారు. నా ఈ పోస్టు దానికి సమాధానం కాదు కానీ ఇటువంటి సందేహాలు పొటమరించినప్పుడు ఏమి చేయాలి అనే దానికి నాకు తెలిసినంతలో చిన్న వివరణ:

మొన్నీ మధ్య ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్న ఓ సినిమా చూస్తుంటే ఇద్దరి మధ్య సంభాషణలో ఒకడు ‘పోనీలేరా! ఇంకేమిటి చెప్పు’ అంటాడు. దానికి కింద సబ్ టైటిల్స్ లో ‘Thanks. Leave it’ అని వేశారు.

మామూలుగా ఇంగ్లీషులో థాంక్స్ అంటే ధన్యవాదాలు అని తెలుగు అనువాదం ఏ నిఘంటువులో అయినా కనిపిస్తుంది. కానీ తెలుగు సంస్కృతిలో ఈ థాంక్స్ సాంప్రదాయం లేదు. ప్రతి దానికీ ఇంగ్లీష్ వాళ్ళు థాంక్స్ అనే పదం విరివిగా వాడతారు. కానీ తెలుగులో మాట్లాడేటప్పుడు ఇలా థాంక్స్ చెప్పడం కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. కానీ జనాలకు అలవాటయిపోయింది. అది వేరే విషయం. అనువాదకులు మాత్రం ఇలాంటి సందర్భాలలో సాధారణ జనం ఏం మాట్లాడుకుంటారో అది గమనించి అనువదిస్తే అందులో కృతకత్వం లోపిస్తుంది.

ఏతావాతా చెప్పేది ఏమిటంటే Communication”, “Communicator” అనే ఇంగ్లీషు పదాలకు telugu equivalent గురించి ఆలోచించేటప్పుడు కూడా మక్కికి మక్కి అనువాదం కాకుండా మామూలు ప్రజలు వాడే భాష ఎలా వుంటుందో ఒకింత అవగాహన చేసుకుని, సందర్భాన్ని బట్టి ఆ పదాలను అనువదిస్తే అది సరయినది అవుతుంది. లేకపోతే అది సాంఘిక మాధ్యమాల్లో బాగా ప్రాచుర్యం పొందిన ‘ఒక పత్రిక భాష’ అవుతుంది.

తోకటపా: అపభ్రంశ అనువాదాలకన్నా మూలంలో వాడిన పదాన్ని యధాతధంగా ఉంచేయడం మేలు. అర్ధం చేసుకోవడానికి పాఠకులు తమ తిప్పలేవో తామే పడతారు.

16, అక్టోబర్ 2020, శుక్రవారం

నీళ్ళ యుద్ధాలు – భండారు శ్రీనివాసరావు

కనీవినీ ఎరుగని కుంభవృష్టి  నేపధ్యంలో చాలా హృదయ విదారక దృశ్యాలు, కొన్ని అవాంఛిత సంఘటనలు చూడాల్సివస్తోంది. హైదరాబాదులో అక్కడెక్కడో వరద నీటి ప్రవాహం తమ ఇళ్ళను ముంచెత్తకుండా  ఒక కాలనీ వాళ్ళు గండి కొట్టే ప్రయత్నం చేస్తే కొంచెం దిగువన ఉన్న కాలనీ వాళ్ళు అభ్యంతరం చెప్పడంతో  మాటామాటా పెరిగి, చేతులు కలుపుకుని, కర్రలతో కొట్టుకునేదాకా వెళ్లిందని ఓ టీవీలో స్క్రోలింగులు  చూశాను.

ఓ ఇరవై ఏళ్ళ క్రితం ఇలాగే  నాకు తెలిసిన కుటుంబం  నగరంలో ఒక కాలనీలో రెండంతస్తులతో ఇల్లు కట్టుకున్నారు. మేము గృహ ప్రవేశానికి  కూడా వెళ్ళాము. ఇంటి ఎదురుగా పెద్ద చెరువు. కాకపోతే నీళ్ళు  ఆట్టే లేవు. వీళ్ళ ఇల్లు  నిజానికి ఆ చెరువుకు నీళ్ళు పారే ప్రదేశంలో వుంది. చెరువుకు నీళ్ళు వస్తే ఇబ్బంది పడతారేమో అని చెప్పాలనిపించింది.  కానీ సందర్భం కాదేమో అని ఊరుకున్నాను.

అంత చక్కటి ప్రదేశంలో మంచి ఇల్లు కట్టుకున్నందుకు వచ్చిన వాళ్ళు అందరూ గృహస్తును  అభినందించారు. అప్పటికే ఆ కాలనీలో చాలా సుందర భవంతులు వెలిశాయి. చూడగానే సంపన్నుల కాలనీ అనిపించేదిగా వుంది. ఆ రోజుల్లో  ముఖ్యమంత్రికి నగర సుందరీకరణ మీద మక్కువ ఎక్కువ కావడంవల్ల ఆ చెరువు కట్టను అందమైన మినీ టాంక్ బండుగా తీర్చిదిద్దారు. దానితో ఆ కట్టకు దిగువన దీనిని తలదన్నే మరో కాలనీ  వెలిసింది. సరే కొంత కాలం ఆ కాలనీ వాళ్ళు, ఈ కాలనీ వాళ్ళు సఖ్యంగానే వున్నారు.

ఆ సమయంలో ఇప్పటిలాగే కనీవినీ ఎరుగని వర్షాలు కురిసి  చాలా కాలనీలు వరద ముంపుకు గురయ్యాయి. చెరువు నిండి ఆ ప్రవాహం వెనక్కి రావడంతో ఎగువ కాలనీలోని ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చాయి. మునిగిపోతాయన్న భయంతో వాళ్ళు ఆ చెరువు కట్టకు గండి కొట్టే ప్రయత్నం చేయబోయారు. అంతే! దిగువన వున్న కాలనీవాళ్ళు గండి కొడితే తమ కాలనీ మునిగిపోతుందని భయపడి ఎగువ కాలనీ వాళ్లకు ఎదురు తిరిగారు. అప్పటిదాకా  సఖ్యతగా ఉన్న రెండు కాలనీల వాళ్ళు ఒకరికొకరు పరమ శత్రువులు అయిపోయారు.

ఈ లోగా వరుణుడు శాంతించడం, వరద తగ్గు ముఖం పట్టడంతో పెద్ద సంఘర్షణకు అవకాశం లేకుండా పోయింది.

ప్రకృతి ప్రజలకు ఉచితంగా ప్రసాదించే నీరు తక్కువైనా కష్టాలే, ఎక్కువైనా కష్టాలే! అయితే ఈ కష్టాలకు తామే కారణం అని ప్రజలకూ తెలుసు. కానీ తెలియనట్టుగా ఉండిపోతారు. (16-10-2020)

13, అక్టోబర్ 2020, మంగళవారం

అసిధారావ్రతం

 


‘మా వెబ్ ఛానల్ కు మీరు ఓ ఇంటర్వ్యూ ఇవ్వాలి, జగన్, కోర్టుల వ్యవహారం మీద’

‘తప్పకుండా. కానీ  అసిధారావ్రతం అనే కండిషన్ మీద

‘అంటే!..’ అన్నదా అమ్మాయి.

నేనూ దాని ఉత్పత్తి అర్ధం జోలికి పోలేదు, పైగా దాని అసలు అర్ధం తెలియకపోవడం మంచిదే అనుకున్నాను.

‘ఏమీ లేదు, కోర్టులకు సంబంధించిన వ్యవహారం కదా! అంచేత మీరు ఏ ప్రశ్న అయినా అడగండి, నాకు అభ్యంతరం లేదు, నేను మాత్రం ఆచితూచి మాట్లాడతాను, మీకేమయినా అభ్యంతరమా

లేదనిపించుకున్న తరవాత ఇంటర్వ్యూ మొదలయింది.

‘ఇప్పుడు ఇలా కోర్టుల మీద యుద్ధం ప్రకటించిన ఏపీ సీఎం జగన్ మోహన రెడ్డికి ఎలాంటి చిక్కులు ఎదురు కాబోతున్నాయి?

‘ఆయనకు ఎదురయ్యే చిక్కుల సంగతి ఏమో కానీ కోర్టుల పట్ల గౌరవంతో కూడిన భయం కారణంగా, రాజకీయ నాయకులు అందరూ  నోరు సంభాళించుకుని మాట్లాడే పరిస్థితి వస్తే జనం చాలా చిక్కులనుంచి బయట పడతారు.’

సరిగ్గా ఇలాగే కాకపోయినా  ఇంటర్వ్యూ ఇలాగే మొదలయింది.

‘ఈ పరిణామాలను వ్యవస్థల మధ్య ఘర్షణగా భూతద్దంలో చూపిస్తున్నారు. నిజానికి ఇది వ్యక్తుల నడుమ, ఇంకా బాగా చెప్పాలంటే రెండు ప్రాంతీయ పార్టీల నడుమ ఎంతో కాలంగా సాగుతూవస్తున్న సంఘర్షణకు పరాకాష్టగా నేను అనుకుంటున్నాను.

‘ఏ వ్యవస్థ అయినా వ్యక్తుల సమూహమే. వ్యక్తులకు వుండే సహజమైన బలాలు, బలహీనతలు ఒక్కొక్కసారి వ్యవస్థల మీద ప్రతిఫలిస్తుంటాయి. అది వ్యవస్థ తప్పుకాదు, కానీ అలాంటి వ్యక్తుల కారణంగా వారు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవస్థల మీద మచ్చ పడే ప్రమాదం వుంది.

‘కొందరు రాజకీయ నాయకులు మంచి ప్రజాదరణతో గద్దె ఎక్కుతారు. ఏదో చేయాలన్న తపనతో పాటు ఎవరినో సాధించాలి అనే ఆరాటం కూడా వారిలో వుంటుంది. శ్రీమతి గాంధి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకురాలు. ఇదే బలహీనత ఆమెను అధికారానికి దూరం చేసింది. ఆ తరువాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జనతా పార్టీ ప్రజలకు హామీ ఇచ్చిన పనులు చేయడం కంటే ఇందిరాగాంధీని రాజకీయంగా భ్రస్టు పట్టించడానికే ఎక్కువ సమయం వినియోగించింది. వీటిని ప్రజలు ఎలా గమనిస్తున్నారు అనే విషయం ఆ తదుపరి జరిగిన ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.

‘ఇక జగన్ మోహనరెడ్డి విషయానికి వస్తే రెండేళ్ల కంటే కొంచెం తక్కువగా, ఇంతవరకు  సాగిన ఆయన పాలనలో ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను ఏపీ హైకోర్టు తప్పుపట్టింది. మొట్టికాయలు, అక్షింతలు  అని మీడియా వ్యవహరిస్తున్న వీటి సంఖ్య సుమారు నూరువరకు ఉండొచ్చని అంచనా. విచారణ సందర్భంలో  న్యాయమూర్తులు చేసే వ్యాఖలకు  కూడా  మీడియా  విశేష  ప్రాధాన్యం  ఇస్తోంది. వాటిమీద  మళ్ళీ  చర్చలు. ఏతావాతా తమ ప్రభుత్వంపై  అన్యాపదేశంగా  జరుగుతున్న దాడి అనే అనుమానం వారిది.

అయితే  కోర్టుల వ్యాఖ్యల తీరుతెన్నుల ఆధారంగానే  జగన్  పాలన రాజ్యాంగ సమ్మతంగా లేదని కొందరు నిర్ధారిస్తున్నారు. సరే. ఒప్పుకుందాం. కానీ చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండుసార్లు సరయిన టైం చూపిస్తుంది. అటువంటప్పుడు ఇన్ని నిర్ణయాలు వరసగా కోర్టుల స్క్రూటినీలో  తప్పని తేలుతున్నప్పుడు ఎందుకిలా జరుగుతోంది, దీని వెనకాల ఏముంది  అనే అనుమానం వరసగా అక్షింతలు వేయించుకుంటున్న వారికి  కలిగితే దాన్ని మాత్రం ఎలా తప్పుపట్టగలం.

కొందరు న్యాయమూర్తుల పనితీరు, లేదా వారి నిర్ణయాల పట్ల సందేహాలు  వ్యక్తం చేస్తూ చేసిన ప్రకటనను కూడా న్యాయ వ్యవస్థ పట్ల తమ ప్రభుత్వానికి ఎనలేని గౌరవం వుందని ఉద్ఘాటిస్తూనే మొదలుపెట్టారు. ఈ ఫిర్యాదును  నేరుగా సుప్రీం కోర్టు  ప్రధాన న్యాయమూర్తి  దృష్టికే లిఖిత పూర్వకంగా దాఖలు చేసుకున్నారు. ఇది ఒక వ్యక్తిగానే కాకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ఆయనకు ఉన్న హక్కు. దానిని ఆయన ఉపయోగించుకుంటే ఎలా తప్పుపడతాం చెప్పండి. కాకపొతే, సర్వోన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తికి ఒక ఫిర్యాదు ఇచ్చిన తరువాత, కొంత సమయం ఇచ్చి  వేచి వుండాల్సింది. ఈ లోపలే ఆ విషయాన్ని మీడియా ద్వారా బహిరంగ పరచడం నైతికంగా చూసినప్పుడు పొరబాటే. న్యాయస్థానం  దీన్ని  కోర్టు ధిక్కరణ కింద  పరిగణించే అవకాశం వుంది.

‘కానీ  వర్తమాన రాజకీయాల్లో తప్పుఒప్పుల నడుమ విభజన రేఖ ఎప్పుడో చెరిగిపోయింది. ఎలాగంటే ఒక పార్టీ నాయకుడు రాష్ట్రపతికి ఓ లేఖ రాస్తారు. అది ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కు చేరకమునుపే అందులోని విషయాలను మీడియాకు వెల్లడిస్తారు. అయితే సుప్రీం కోర్టు  ప్రధాన న్యాయమూర్తికి చేసిన  ఫిర్యాదు, రాష్ట్రపతికి ఇచ్చిన విజ్ఞాపన పత్రం ఒకటేనా అనే సందేహం మీకూ, నాకూ  రావచ్చు. కానీ రాజకీయాల్లో ఈ విధమైన విచక్షణ నానాటికీ లుప్తం అవుతోంది.

‘పునరుక్తి దోషం అయినా మళ్ళీ ఒకసారి చెప్పాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతోంది, రాజ్యాంగ వ్యవస్థల నడుమ ఘర్షణ కాదు, రెండు రాజకీయ పార్టీల నడుమ కొనసాగుతూ వస్తున్న సంఘర్షణ ఈ రూపం తీసుకుంటోంది.  

‘ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోర్టుల పట్ల చేసిన వ్యాఖ్యలను గురించి అడిగారు. ఈ పిటీషన్ విచారణ సందర్భంలో న్యాయమూర్తి ఒకరు ఒక ప్రశ్న అడిగారు. ‘ఈ వ్యాఖ్యలు ఆయన సభలో చేసారా లేక బయట చేసారా’ అని. ‘తిరుమలలో చేశార’ని జవాబు వచ్చిన జ్ఞాపకం. అంటే సభ వెలుపల చేస్తే కోర్టు ధిక్కరణ కిందికి రావచ్చేమో. సభలో చేస్తే స్పీకర్ కూడా రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న కారణం చేత అలాంటి తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చేమో!

‘ఇదే సూత్రం సోషల్ మీడియాకు కూడా వర్తిస్తుందా? నాకు అంత న్యాయ శాస్త్ర పరిజ్ఞానం లేదు. కోర్టు బయట చేసిన ఇలాంటి వ్యాఖ్యలు  కూడా న్యాయమూర్తుల అభిశంసనకు గురవుతాయా అనేది  న్యాయ కోవిదులే చెప్పాలి.

‘ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్య ప్రియులకు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటికి ఎంత త్వరగా ముగింపు పలికితే అంత శ్రేయస్కరం  

ఇలాగే సాగింది ఆ ఇంటర్వ్యూ. అచ్చం ఇలాగేనా అంటే కొంత వాచకంలో తేడా వుండి ఉండొచ్చు.

తోకటపా:

ఇక ఆ అమ్మాయి అడిగిన ‘అసిధారావ్రతం’ అంటే ఏమిటో నేను చెప్పలేదు కదూ.

‘చాలా కష్టమైన పని’ అనే అర్థంలో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తారు.

అసి అంటే కత్తి. ధారా అంటే అంచు. అసిధారావ్రతమంటే కత్తి అంచు మీద పడుకోవడమనేది భౌతికార్థం!

నిజానికి ఇది బ్రహ్మచర్య దీక్షలో ఒక భాగం. మనసు నిలకడస్థితికి పరీక్ష పెట్టే వ్రతమిది. నాతిగల బ్రహ్మచర్యం విషయంలో కూడా వాడతారు.

ఇక నా కవి హృదయం ఏమిటంటే కోర్టుల వ్యవహారాలు  గురించి  వ్యాఖ్యానించేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి అని. (13-10-2020)


Note: Courtesy Image Owner




ఇలాటి అధికారులు కావాలి

 ఒకానొక కాలంలో జిల్లాను మొత్తం తమ కనుసన్నల్లో శాసించే జిల్లా కలెక్టర్లకు తమ జిల్లాలో తిరగడానికి జీపు సౌకర్యం మాత్రమే వుండేది. అదీ టార్పాలిన్ పట్టాలు అటూ ఇటూ టపటపా కొట్టుకుంటూ వేళ్ళాడే పాతతరం జీపులు.

అలాటి కాలంలో, ఒకానొక జిల్లాలో, కలెక్టర్ గా పనిచేస్తున్న ఓ ఐ.ఏ.ఎస్. అధికారి జీపు తీసుకుని ఓ రోజు ఉదయం ఏదో గ్రామానికి టూరుకు వెళ్లి తిరిగి వస్తుంటే జీపు టైరు పంక్చర్ అయింది. సెల్ ఫోన్లు లేని రోజులాయె. డ్రైవర్ పంక్చర్ వేయించుకుని రావడానికి కొన్ని మైళ్ళ దూరంలో వున్న మరో పెద్ద వూరికి వెళ్ళాడు. కలెక్టర్ గారి వెంట వున్న బిళ్ళ బంట్రోతు, అయ్యగారికి చెట్ల నీడన వున్న ఒక మోరీ చూపించి అక్కడ కూర్చోపెట్టాడు. డ్రైవర్ రావడానికి బాగా వ్యవధి వుంది. అటూ ఇటూ చూస్తున్న కలెక్టర్ గారి దృష్టికి దగ్గరలో ఓ వూరు జాడ కనిపించింది. కొందరు ఆడవాళ్ళు బిందెలు చంకన పెట్టుకుని వస్తూ కానవచ్చారు. ఆయన వారిని పలకరించి, 'నీళ్ళ కోసం ఇంత దూరం ఎందుకు పడుతూ లేస్తూ వస్తున్నారు, మీ వూళ్ళో మంచి నీటి బావి లేదా?' అని ప్రశ్నించారు. 'నువ్వేమన్నా ఆర్చేవాడివా, తీర్చేవాడివా' వంటి చొప్పదంటు ప్రశ్నలు వాళ్ళు వేయకుండా, 'వూళ్ళో బావులకేం చాలా వున్నాయి, కానీ మమ్మల్ని అక్కడ నీళ్ళు తోడుకోనివ్వరు' అని బదులు చెప్పారు. కలెక్టర్ సాలోచనగా తలపంకించి ఊరుకున్నారు. ఈలోగా టైరు పంక్చర్ వేయించుకుని డ్రైవర్ తిరిగివచ్చాడు. కలెక్టర్ తన మానాన తాను పొతే కధే లేదు. ఆయన అల్లాంటి ఇల్లాంటి అధికారి కాదు కాబట్టి ఏం చేయాలో వెంటనే ఆలోచించి పెట్టుకున్నాడు. డ్రైవర్ ని నేరుగా జిల్లా కేంద్రానికి పంపించి తాను ఆ మోరీ మీదనే కూర్చుండిపోయాడు. ఈలోగా ఆయన మౌఖిక ఆదేశాలు అందుకున్న కలెక్టర్ గారి సిబ్బంది, స్థానిక తాసిల్దారు టైప్ రైటర్లు, కలెక్టర్ గారి అధికారిక ముద్రిక తదితరాలతో సహా అక్కడికి వచ్చారు. ఊళ్ళోకి కబురు పంపి గ్రామ సర్పంచుని రప్పించారు. ఈ హడావిడి అంతా చూసి ఊరిజనం అంతా అక్కడ పోగయ్యారు. వూరి వెలుపల నుంచి మంచి నీళ్ళు తెచ్చుకునే వారికి వారి గూడెం లోనే ఒక మంచి నీటి బావి మంజూరు చేయాలని సర్పంచు నుంచి ఓ అభ్యర్ధన పత్రం తీసుకున్నారు. దానికి అక్కడికక్కడే స్థానిక అధికారి నుంచి ఆమోద ముద్ర వేయించారు. తనకున్న విశేష అధికారాలను ఉపయోగించుకుంటూ అందుకు అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేస్తూ ఆ మోరీ మీదనే కూర్చుని సంతకం చేసి, కింద స్టాంపు వేసారు. ఆ వెనువెంటనే కూలీలను పిలిపించారు. బావి తవ్వకానికి ఆయనే స్వయంగా గడ్డపారతో మొదటి పలుగు వేసి స్వీకారం చుట్టారు. ఝాము పొద్దెక్కక ముందే ఝామ్మని బావి పని మొదలయింది. అంతకుముందు ఆ ఊరిజనం ఇలాటి అధికారిని చూడలేదు సరికదా కనీసం వినికూడా వుండలేదు. అందుకే అందరి మొహాల్లో నిండుకున్న నిబిడాశ్చర్యం. ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో వారి వూరిలో ఓ అభివృద్ధి కార్యక్రమానికి శుభారంభం జరిగింది. పొద్దుగూకే సమయానికి బావిలో సమృద్ధిగా జలపడింది. ఆ వూరి గూడెం జనానికి కొత్త పొద్దు పొడిచింది.
ఆ జిల్లా ఖమ్మం జిల్లా. ఆ వూరు రెబ్బారం అని అందరూ పిలుచుకునే రెబ్బవరం. ఆ కలెక్టర్ గారి పేరు ఆర్. పార్ధసారధి. ఆయన ఇప్పుడు జీవించి లేరు. కానీ ఆ గూడెం ప్రజల మనస్సులో ఇంకా జీవించే వున్నారు.
నేను ఖమ్మం కాలేజీలో చదువుకునే రోజుల్లో పార్ధసారధి ఆ జిల్లా కలెక్టర్. తరువాత హైదరాబాదులో రేడియో విలేకరిగా వారిని కలుసుకునే అవకాశం అనేక సార్లు లభించింది.

 

 

ఆర్. పార్ధసారధి గారి లాంటి అధికారులు అరుదుగా కనిపిస్తారు. సురేష్ చందా అనే ఓ ఐ.ఏ.ఎస్. అధికారి కూడా ఈ కోవలోకే వస్తారు. తెలంగాణా ప్రభుత్వంలో పనిచేస్తున్న ఈ అధికారి గురించి కొన్నేళ్ళ క్రితం పత్రికల్లో అనేక కధనాలు వచ్చాయి. వాటి ఆధారంగా రూపొందించిన వ్యాసం ఇది.
గత యాభై ఏళ్ళలో అనేక మార్పులు వచ్చాయి. జిల్లాకు ఒక ఐ.ఏ.ఎస్. అధికారి మాత్రమె వుండే పద్దతి మారి జిల్లాకు ముగ్గురు నలుగురు వచ్చారు. టార్పాలిన్ పట్టాలు వున్న జీపులు పోయి అధునాతన వాహన శ్రేణి వచ్చి చేరింది. జిల్లా మొత్తంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో తెలియచెప్పే సమాచార వ్యవస్థ చేతికి అందివచ్చింది. సిబ్బంది పెరిగారు. జనం ఇబ్బందులూ పెరిగాయి. మరీ అంతలా కాకపోయినా, రాజకీయ అవరోధాలను అధిగమించి, పదిమందికి పనికి వస్తాయని తాము అనుకున్న మంచి పనులను అనుకున్న రీతిలో చేసి పెట్టె అధికారులు కూడా మన మధ్యనే వున్నారు.సురేష్ చందా అనే ఒక ఐ.ఏ.ఎస్. అధికారి తెలంగాణా సచివాలయంలో ఒక ఉన్నత స్థానంలో పనిచేస్తున్నారు. రాష్ట్రం మొత్తంలో ఆరోగ్య, వైద్య సేవలు ఆయా ప్రభుత్వ ఆసుపత్రులలో ఎలా అందుతున్నాయో పర్యవేక్షించే బాధ్యత ఆయనది. యువకుడు కావడం వల్ల కంప్యూటర్ పరిజ్ఞానం హెచ్చుగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. అంచేత తన శాఖ పని తీరు మెరుగుపరుచుకోవడానికి ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవాలని ఆయన భావించారు. తెలంగాణాలో పేరొందిన గాంధి ఆసుపత్రితో మొదలు పెట్టి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని అనుకున్నారు. గాంధీ ఆసుపత్రిలో ఏమూల ఏం జరుగుతున్నదో సచివాలయంలోని తన చాంబర్ నుంచే కనిపెట్టి చూసే ఉద్దేశ్యంతో ఆ ఆసుపత్రిలో సుమారు రెండువందల నిఘా కెమెరాలను అమర్చాలని తలపెట్టారు. కిందవాళ్ళు చేసే పనులను కనిపెట్టి చూడడం ఆయన బాధ్యతల్లో ఒకటి. కానీ, తాను ఎలా పనిచేస్తున్నది కూడా నలుగురికీ తెలియాలి కదా! అందుకని ఈ ప్రయోగాన్ని ఆయన తనతోనే ప్రారంభించారు. చడీచప్పుడూ కాకుండా తన కార్యాలయంలో ఒక నిఘా కెమెరాను ఏర్పాటు చేసుకున్నారు. తన గదిలో ఏం జరిగేది, తనను కలుసుకోవడానికి ఎవరెవరు వచ్చేది, ఏం మాట్లాడేది రికార్డు చేయడం కోసం ఈ కెమెరా. అయితే ఈ కెమెరా రికార్డు చేసేది తను ఒక్కరే కాకుండా ఎవరయినా సరే చూడగలిగేలా ఇంటర్నెట్తో దాన్ని అనుసంధానం చేయడం ఇందులోని ఒక ప్రత్యేకత. 'సమాచార చట్టం ప్రకారం ప్రజలకు తెలుసుకునే హక్కు వచ్చింది. వాళ్ళు అడిగితే ఇవ్వడం కాకుండా అడక్కుండానే యావత్ సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచితే తప్పేమిట'నేది ఈ అధికారి అభిప్రాయం. తన దృష్టికి వచ్చిన ఫైళ్ళపై తాను రాసిన నోట్ వివరాలను కూడా వెంటవెంటనే ఆయన ఇంటర్నెట్లో పెడుతుంటారని పత్రికల్లో చదివినవారికి ఒకింత ఆశ్చర్యం కలగడం సహజం. అవసరానికి మించిన గోప్యతను అధికారులు పాటించడం వారికో అలవాటని జనంలో ఒక అభిప్రాయం బలంగా నాటుకుని ఉండడమే ఇందుకు కారణం. తాము చెప్పినది సావకాశంగా విని, కోరిన సమాచారం ఓ మేరకయినా అధికారులు అందించగలిగితే, తమ సమస్య సగం పరిష్కారం అయిందని సంతోషించే సామాన్యుల సంఖ్య కూడా అధికమే.
'
అనుమతి లేకుండా పురుగు కూడా ప్రవేశించలేని అతి శీతల గదుల్లో కూర్చుని అధికారులు ఏం చేస్తుంటారు?' అనే అనుమానం సాధారణ జనంలో వుంది. అ అధికారుల గదుల్లోకి కనీసం తొంగి చూడడానికి కూడా వీలుపడని వారికి సురేష్ చందా అనే ఈ అధికారి చేస్తున్నది అబ్బురం అనిపించడంలో సందేహం లేదు.
అడగగానే మెచ్చి వరాలు ఇచ్చే దేవుళ్ళకు మన పురాణాల్లో కొదవలేదు. అడగకుండానే సమాచారం ఇవ్వాలనే అభిమతం కొందరు అధికారుల్లో అయినా ఊపిరి పోసుకోవడం అభిలషణీయం. ఆహ్వానించదగ్గ పరిణామం .
మొత్తం పరిపాలన ఇలా ప్రజల కళ్ళ ముందు జరగడం అంటూ జరిగితే పాలకుల పట్ల ప్రజల్లో పేరుకుపోతున్న అసహనం ఓ మేరకయినా తగ్గడం కూడా ఖాయం. (02-05-2015)
తోకటపా: ఇది రాసి నాలుగేళ్ళు దాటింది. ఏ హోదాలో వున్నా ఆ అధికారి ఇప్పటికీ అలానే వ్యవహరిస్తున్నారని ఆశిద్దాం.

Top of Form

Bottom of Form

 

10, అక్టోబర్ 2020, శనివారం

పోస్ట్ - భండారు శ్రీనివాసరావు

 (Today, 9th October is World Postal Day)

కంప్యూటర్ ముందు కూర్చుని నా మానాన నేను పనిచేసుకుంటూ వుంటే ఈ పిలుపు.
నిజంగా ఈ మాట వినబడక ఎన్నాళ్ళు అయింది?
ఓ యాభయ్ ఏళ్ళ క్రితం పల్లెటూళ్ళలో నివసించే వృద్ధులయిన తలితండ్రులు, పట్టణాల్లో చదువుకుంటూ ఊళ్ళనుంచి వచ్చే ఉత్తరాలకోసం ఎదురు చూసే వారి పిల్లలు, ప్రియుడు రాసే ప్రేమలేఖ కోసం చకోరపక్షిలా పడిగాడ్పులు పడే ప్రియురాలు ఇలా ఎందరెందరో ‘పోస్ట్’ అనే తియ్యటి మాటను తన నోట పలికే పోస్ట్ మన్ కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని చూస్తుండేవాళ్ళు. ఒకానొక కాలంలో తెలుగు కధల్లో చాలామటుకు ఈ పోస్ట్ అనే మాట తోనే మొదలయ్యేవని చెప్పుకుండేవాళ్ళు కూడా.
ఇప్పుడామాట గతకాలపు ముచ్చట అయింది.
మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత, నెట్లోకం ఆవిష్కృతమయిన ఇన్నేళ్ళ తర్వాత ఆ మాట మా గుమ్మం ముందు వినపడింది.
తలుపు తెరిచి చూస్తే తపాలా శాఖలో ఉత్తరాలు బట్వాడా చేసే మనిషి.
అతడిచ్చిన కవరు అందుకున్నాను. ఒకసారి లోపలకు వస్తారా అని అడిగాను. అతడు ఆశ్చర్యపోతూనే వచ్చాడు.
‘మీతో ఒక్క ఫోటో తీసుకుంటాను. నాకు సెల్ఫీలు తీయడం రాదు, అయినా సరే!’ అన్నాను.
బహుశా నా అంతట నేను అడిగిన మొదటి సందర్భం ఇదే.
అతడి పేరు బీ. మాధవ రెడ్డి.
చాలా సంతోషం అనిపించింది, గత కాలం గుర్తుకువచ్చి.





7, అక్టోబర్ 2020, బుధవారం

సలాం గాంధి ఆస్పత్రి – భండారు శ్రీనివాసరావు


కీడులో మేలులా,  కరోనా  కొంత మంచి కూడా చేస్తోంది. మునుపు సర్కారు దవాఖానా అంటే జనంలో చిన్న చూపు. కరోనా బాధితులను ప్రైవేటు/ కార్పొరేటు ఆసుపత్రులు చేస్తున్న లూటీ గురించి తెలుసుకున్న ప్రజల దృష్టి ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్స్ మీద పడింది. ఈ విషయంలో విశేష సేవ చేస్తున్న ఆసుపత్రులలో గాంధి ఆస్పత్రి ఒకటి.

మొన్నీమధ్య నా కాలేజ్ మేట్ ఒకరు ఫోను చేశాడు. ఉమ్మడి రాష్ట్ర సచివాలయంలో చాలా పెద్ద పదవిలోనే రిటైర్ అయ్యాడు. కానీ వస్తుతః నిదానస్తుడు, నిగర్వి, పదవిని అడ్డం పెట్టుకుని అడ్డదారులు తొక్కని వాడు. పైగా ఆధ్యాత్మిక భావాలు, దైవ భక్తీ, పాపభీతి.  ఇలాంటి వాడికి కరోనా కష్టం వచ్చి పడింది. రెండో అబ్బాయి  రామచంద్రన్ (యితడు ఒకప్పటి మద్రాసులో పుట్టాడు, దానితో స్కూలు రిజిస్టరులో పేరు అలా పడింది) పాజిటివ్ అనగానే మనవాడి గుండె జారిపోయింది. దానికి ప్రధాన కారణం కరోనా అయితే రెండో కారణం కొడుకు పుట్టుకతోనే బధిరుడు. ఇలాంటి వాడు ఆసుపత్రిలో ఒంటరిగా ఎలా ఉండగలుగుతారు అనేది నా స్నేహితుడి బెంగ. గాంధి ఆసుపత్రిలో చేర్చి నాకు ఫోను చేశాడు. కానీ నేనూ అతడి పడవలోనే ప్రయాణిస్తున్నాను. రిటైర్ అయి పదిహేను ఏళ్ళు అవుతోంది. చేయగలిగింది ఒక్కటే మంత్రి  కేటీఆర్   గారికి   ఆసుపత్రిలో కోవిడ్ ప్రత్యేకాధికారి డాక్టర్ ప్రభాకరరెడ్డి గారికి  వాట్సప్ లో అభ్యర్ధనలు పంపాను. పర్వాలేదు అన్నట్టుగా ఇద్దరి నుంచి  తిరుగు సందేశం వచ్చింది. పేషెంటుకు వినికిడి సమస్య వుంది కాబట్టి ప్రత్యేక గది కన్నా క్యూబికల్స్ లో వుంటే మంచిది అని డాక్టరు ప్రభాకరరెడ్డి గారు అన్నారు. అదే మంచిదయింది. ఆసుపత్రిలొ  వున్నన్ని రోజులు రోగిని కనిపెట్టి చూసుకున్నారు. ప్రతిరోజూ పరిశుభ్రమైన, పౌష్టిక  ఆహారం అందించేవారు. సిబ్బంది సైతం చాలా సేవాభావంతో పనిచేసేవారని ఆ అబ్బాయి ఫోనులో చెబుతుంటే, ఇంకా నయం వేరే కార్పొరేట్ హాస్పిటల్ లో చేర్పించక పోవడం  మంచిదయిందని తండ్రి సంతోషపడ్డాడు.

మొత్తం మీద నెగెటివ్ అనిపించుకుని నిన్ననే అతడు డిశ్చార్జ్ అయ్యాడు. ప్రభుత్వ ఆసుపత్రులపై తనకు మంచి అభిప్రాయం లేదనీ, కానీ ఇప్పుడా దురభిప్రాయం పూర్తిగా తొలగిపోయిందనీ ఇంటికి వచ్చిన తర్వాత తండ్రితో చెప్పాడు. డాక్టర్ ప్రభాకర రెడ్డి గారెతో తను తీయించుకున్న ఫోటోను తన స్నేహితులతో గర్వంగా పంచుకుంటున్నాడు.              


6, అక్టోబర్ 2020, మంగళవారం

మాటలు మింగే తిమింగలాలు

 'మీ గొంతు పీలగా అనిపించింది’  

‘మొదలు పెట్టినప్పుడు దూకుడుగా మొదలెడతారు. పోను పోను తేలిపోతున్నట్టుగా వుంటుంది. ఇక వాక్యం ముగించేటప్పుడు ఆఖరు పదాలు మింగేస్తునారు’ 

నాలుగు దశాబ్దాలకు పూర్వం నేను రేడియో ఉద్యోగంలో చేరి వార్తావాహిని కార్యక్రమాన్ని వారానికి ఒకసారో, రెండుసార్లో సమర్పిస్తున్నప్పుడు దాన్ని రేడియోలో విని నాతో మా ఆవిడ అన్న మాటలు ఇవి.

నా ప్రోగ్రాం వినే అవకాశం నాకు  లేకపోవడం వల్ల మా ఆవిడ మాటలే వేదం అనుకుని కొంత బాణీ మార్చుకునే ప్రయత్నం చేశాను. ఈలోగా వారం వారం ‘జీవన స్రవంతి మొదలయింది. ‘తినగ తినగ వేము తియ్యనగును అన్నట్టు నా గొంతుకు శ్రోతలు అలవాటు పడిపోవడంతో నా భార్య మాటలు చెవిన పెట్టడం మానేసాను.

ఇప్పుడు టీవీల్లో కొందరి స్వరాలు వింటుంటే ఈ పూర్వపు రోజులు గుర్తుకొస్తున్నాయి. ఒక్కోసారి అనిపిస్తుంది, వీళ్ళకు మంచీచెడూ చెప్పే  భార్యలు లేరా, లేక చెవికి ఎక్కించుకుపోవడం అనే నా చెడ్డ అలవాటు వీరికీ ఉందా అని. (2020)   

 

5, అక్టోబర్ 2020, సోమవారం

వ్యక్తులు – వ్యవస్థలు – భండారు శ్రీనివాసరావు

 ఒక వ్యక్తి అన్నాక ఏదో ఒక వ్యవస్థలోని వాడే అవడానికి అవకాశాలు ఎక్కువ.

ఉదాహరణకు ఎవరో ఒక జర్నలిస్టు ఎవరినో బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఒక పోలీసు అధికారి పెద్ద మొత్తంలో లంచం తీసుకుని పట్టుబడతాడు. ఒక బ్యాంకు అధికారి ఫ్రాడ్ కేసులో దొరికిపోతాడు. ఒక ఆధ్యాత్మిక గురువు లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కుంటాడు. ఒక కులానికి చెందిన వ్యక్తిపై ఇలాంటివే ఏవో అపనిందలు వస్తాయి. ఈ విషయాలపై మీడియాలో చర్చలు జరుగుతాయి. చర్చల్లో పాల్గొనే వాళ్ళు అసలు విషయం వదిలిపెట్టి ఆరోపణలు ఎదుర్కుంటున్న వారి వ్యవస్థలకు వాటిని ఆపాదిస్తూ మాట్లాడతారు. ఆ వ్యవస్థలు, కులాలకు చెందినవాళ్ళు కూడా తమ వ్యవస్థలపై జరుగుతున్న దాడిగానే పరిగణిస్తారు. ఈ క్రమంలో వ్యక్తులకు సంబంధించిన అంశాలు వ్యవస్థలకు చెందిన విషయాలుగా రూపాంతరం చెందుతాయి. అసలు విషయం, అసలు మనుషులు మరుగున పడిపోయి అనవసరమైన అంశాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి.

రాజ్యాంగానికి మూల స్తంభాలు అయిన మూడు వ్యవస్థలు, వాటికి అనుబంధం అయిన నాలుగో స్తంభం మీడియా అలాగే ఈ సమాజంలోని అన్ని వ్యవస్థలలో ఇదే జరుగుతోంది. నిజంగా వ్యవస్థపై దాడి జరుగుతుంటే ఆ వ్యవస్థకు చెందిన వారు దానిని కాపాడుకోవడం కోసం ఎంతగా ఉద్యమించినా దాన్ని తప్పుపట్టలేము. కానీ జరుగుతున్న కధ వేరేగా వుంది. వ్యక్తుల లోపాలను వ్యవస్థల లోపాలుగా ఎత్తి చూపడం జరుగుతోంది. వ్యక్తులపై ఆరోపణలను వ్యవస్థలపై ఆరోపణలుగా పరిగణించడం వల్ల వ్యవస్థల నడుమ ఘర్షణలకు దారితీస్తోంది.

సున్నితంగా చెప్పే విషయం కనుక ఇంతకంటే సూటిగా చెప్పడం నాకు సాధ్యపడడం లేదు. (October,2020)