మద్య నిషేధం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మద్య నిషేధం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, మే 2021, బుధవారం

కాడి బరువు

 సంసారం నడపడానికి గృహస్తు ఎలా తంటాలు పడతాడో, ప్రభుత్వాలు కూడా అంతే! వాళ్లకి డబ్బులు ఆకాశం నుంచి రాలి పడవు. పన్నుల రూపంలో  ప్రజలనుంచే  వస్తాయి. ఆ సంగతి తెలుసు కాబట్టే  ఔరంగజీబు జిజియా పన్నుతో సరిపుచ్చితే, ఈనాటి ప్రజాప్రభుత్వాలు ఆయన్ని మించిపోయి ఆదాయ మార్గాలు కనుక్కుంటున్నాయి.  ఒడ్డున కూర్చొని నీతులు చెప్పే ప్రతిపక్ష రాజకీయ నాయకులు తాము అధికారంలోకి రాగానే ఇవే పనులు చేస్తారు. వాళ్ళకీ తెలుసు, మోసేవాడికి తెలుస్తుంది కాడి బరువు అని.

ఎన్ని చూడలేదు, ఎంతమందిని చూడలేదు?

అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యనిషేధం విధిస్తామంటూ ఆర్భాటంగా హామీలు ఇచ్చే రాజకీయ పార్టీలు, గద్దె ఎక్కగానే ఆ వూసు ఎత్తవు. ఎందుకంటే, మద్యం వల్ల సంసారాలు చితికి పోయే మాట నిజమే కాని, నిషేధం విధిస్తే ప్రభుత్వాలు ఆర్ధికంగా దెబ్బ తింటాయనే నిజం వాళ్లకు తెలుసు కనుక. వాళ్ళు ఏ ఆట ఆడాలన్నా ముందు విత్తం వుంటేనే కద. ఖజానా నిండుగా వుంటేనే నడిచేది కధ.

ఏదైనా రాజకీయ పార్టీ అది అధికారంలో వున్నప్పుడు మద్యం అమ్మకాలకి తాము వ్యతిరేకం అంటే నమ్మే పరిస్థితి ఉందా! అసలు అలా అనగలవా, ఏదో ఎన్నికలు  దగ్గర పడితే తప్ప.

(ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్)అసెంబ్లీ రికార్డులు పరిశీలిస్తే 1968 జూన్ 26 వ తేదీన వావిలాల వారు చేసిన ప్రసంగం దొరికింది. (ఆయన మద్యానికి సంపూర్ణ వ్యతిరేకి)

 

ఆంధ్రప్రదేశ్ (ఆంధ్రా ఏరియా) మద్య నిషేధం సవరణ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ వావిలాల గోపాలకృష్ణయ్య గారు చేసిన ఈ ప్రసంగం అచ్చులో దాదాపు రెండు పేజీల పైన వుంది. విషయవిస్తరణ భీతితో దాన్ని కుదించాల్సి వచ్చింది.

వావిలాల వారు ఏమన్నారంటే:

 

మన జీవితమంతా రెండు నాలుకలలో నడుస్తున్నది. నిన్న మొరార్జీ దేశాయి గారు ఇక్కడకు వచ్చి ప్రొహిబిషన్ రద్దు చేయడానికి వీలు లేదన్నారు. ఈవేళ కాంగ్రెస్ ప్రెసిడెంటుగా ఉన్న నిజలింగప్ప గారు ఇంకొక మాట చెబుతున్నారు. బెంగుళూరులో వారిని అడిగితె, ఇది శాంతి భద్రతలకు సంబంధించిన విషయం, సామాన్య ప్రజలు ఎంతవరకు శిరసావహిస్తారు అనే దృష్టితో చూడాలి. ఏమైనా ఇది రాష్ట్రాలకు సంబంధించిన విషయం అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మొరార్జీ దేశాయి గారు ప్రొహిబిషన్ వల్ల కలిగే నష్టంలో సగం ఇస్తాం అంటున్నారు. అసలు డబ్బు ఎక్కడ వుంది?

“....కాంగ్రెస్ ఆదర్శాలతో వుండేవారు ఈనాడు బహిరంగంగా తాగడానికి పర్మిట్లు ఎందుకు ఇస్తున్నారు. తాగనిస్తారట. పర్మిషన్ లేకుండా తాగేవారిని జైల్లో పెడతారట. తెలంగాణలో ప్రొహిబిషన్ అక్కరలేదా. ఆంధ్రాకే కావాలా. ఇట్లా ఈ రెండు నాలుకల రాజ్యం ఎన్నాళ్ళు సాగుతుందో అర్ధం కావడం లేదు. నేను ప్రొహిబిషన్ కు అనుకూలుడను అనేది మాత్రం క్లియర్ గా చెబుతున్నాను. కానీ ఇప్పుడు ప్రొహిబిషన్ అమలు జరుగుతున్నది అంటే నన్ను నేను మోసగించుకోవడం, మిమ్ములను మోసగించడం తప్ప ప్రొహిబిషన్ ఎక్కడా లేదు. దీనివల్ల అధికారులు లంచగొండులవుతున్నారు. దాదాపు పన్నెండు దేశాలలో ప్రొహిబిషన్ అమలు చేసారు. ఆ దేశాలలో రాజ్యం ఎవరి చేతుల్లోకి పోయింది. బూటులిక్కర్స్ చేతికే పోయింది.

మోరల్స్ లేవు. బహిరంగంగా తాగుతూ వుంటే ఎదురుగా వుండి కూడ, కళ్ళు వుండికూడా మూసుకుని వ్యవహరిస్తున్నాము. అమలు చేయడానికి సమర్ధత లేకపోతె వదిలేయాలి. (ప్రొహిబిషన్) అమలు చేస్తారంటే సరిగా అమలుచేయాలి.

“... ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించాలి. అమలు చేయడానికి సమర్ధత లేదంటారా ఏడుస్తూ ఒప్పుకుంటాము”

ఆ కాలంలో మద్య నిషేధం గురించిన వావిలాలవారి మధనం అది.

 

ఇక ప్రస్తుతానికి వస్తే,

నిరుడు కేంద్రం కరోనా విషయంలో కొత్త మార్గదర్శికాలు ప్రకటించగానే లిక్కర్ షాపులు ఓపెన్ చేయడానికి పచ్చ జండా వూపిన రాష్ట్రాలు ఇవే.

1. ఆంధ్రప్రదేశ్

2. ఉత్తరప్రదేశ్

3. పశ్చిమ బెంగాల్

4. మహారాష్ట్ర

5. ఛత్తీస్ గర్

6. కర్ణాటక

7. అసోం

8. హిమాచల్ ప్రదేశ్.

ఈ రాష్ట్రాలు ఏ పార్టీల పాలన కింద వున్నాయో విడమరిచి చెప్పక్కర్లేదు.

ఈ రాష్ట్రాల్లో అన్ని పార్టీల వాళ్ళు అధికారంలో వున్నారు.

కాబట్టి అందరూ అందరే. చొక్కాలు చించుకోనక్కరలేదు.

ఒక్కముక్కలో చెప్పాలంటే:

"మద్య నిషేధం రాజకీయ పార్టీలకి విజయ నినాదం

మద్యం అమ్మకం ఆ పార్టీల ప్రభుత్వాలకు ప్రాణాధారం"

తోకటపా:

రెండేళ్ల క్రితం (2019) ఎన్నికల ఫలితాల సమయంలో టీవీ విశ్లేషణ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఎనిమిదింటికి మొదలైన చర్చ అర్ధరాత్రి దాకా సాగింది. ప్రోగ్రాం అయిన తర్వాత నాతో పాటు పాల్గొన్న మరో విశ్లేషకుడు అడిగారు, ఈ టైములో ఎక్కడైనా బార్లు తెరిచివుంటాయా అని. ఆ రాత్రి అలాంటి బారు పట్టుకున్నామా లేదా అనేది వేరే విషయం.

మళ్ళీ ఒక  రోజు ఆయన ఓ టీవీ చర్చలో కనపడ్డాడు, 'ప్రభుత్వం మద్యం షాపులు తెరవడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడమే' అని బల్ల గుద్ది వాదిస్తూ.

(2021)

 

 

 

 

30, అక్టోబర్ 2020, శుక్రవారం

తాగడానికెందుకురా తొందరా ! - భండారు శ్రీనివాసరావు

 1995 లో ఎన్టీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయి రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధించినప్పుడు, ఎవరైనా మందు ఎక్కడ దొరుకుతుంది అని అడిగితే పలానా పత్రిక పలానా పేజీలో అని జవాబు వచ్చేది. మద్యనిషేధం ఎందుకు అవసరమో ప్రజలకు నచ్చచెబుతూ పుంఖానుపుంఖాలుగా వార్తలు, వ్యాసాలు ఆ పత్రిక ప్రచురించేది. ఆ తర్వాత కొద్ది కాలానికే సంభవించిన రాజకీయ పరిణామాల దరిమిలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యనిషేధం కారణంగా మద్యం మాఫియాల వల్ల ఒనగూడబోయే అనర్థాలు గురించి కూడా అదే పత్రిక వైనవైనాలుగా రాసింది. కొంతకాలం తర్వాత అందరూ అనుకున్నట్టే చంద్రబాబునాయుడు ముందు మద్యనిషేధాన్నిసడలించి, ఆ పిదప పూర్తిగా తొలగించారు.

ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోవడం, ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మార్గాలలో మద్యం రవాణా పెరిగిపోవడం, అన్నింటికంటే మించి మద్యం మాఫియా కోరలు సాచి తన విశ్వరూపాన్ని ప్రదర్శించడం ఇవన్నీ ఆయన మద్య నిషధం ఎత్తివేయడానికి కారణాలుగా చెప్పుకున్నారు. రాష్ట్రాల సరిహద్దుల్లో మాఫియా చెలరేగి ఆయా ప్రాంతాల రాజకీయ నాయకుల అస్తిత్వానికే ప్రమాదకరంగా పరిణమించడంతో అన్ని పార్టీల వాళ్ళు బయటకు ఎన్ని ప్రకటనలు చేసినా లోపల మాత్రం చంద్రబాబు నిర్ణయాన్ని హర్షించారనే చెప్పాలి.

అప్పుడు కర్నాటక సరిహద్దుల్లో వుండే ఒక అధికార పక్షం శాసన సభ్యుడు చెప్పిన విషయం ఏమిటంటే ఒక లారీ లోడు మద్యం రాష్ట్రంలోకి వచ్చేలా చేయగలిగితే లక్షల రూపాయలు ముట్టచెప్పేవారట. ఈ రకమైన సులభ ఆదాయానికి అవకాశం దొరకడంతో మద్యం మాఫియా ప్రభుత్వ వ్యవస్థలనే ప్రభావితం చేయగల స్థాయికి వెళ్ళిపోయిందని చెప్పారు. రాజకీయులను కలవరపరచిన అంశాలలో ఇది ప్రధానమైనది.

అమలు సాధ్యం కాని మద్య నిషేధం వుంటేనేమి, లేకపోతేనేమి అనే నిస్పృహ ప్రజలలో కలిగించి, వారిలో తదనుగుణమైన మార్పు రావడానికి అప్పటి పత్రికలు కొన్ని సహకరించాయి. మొదటే చెప్పినట్టు ముందు పేర్కొన్న పత్రికదే ఇందులో సింహభాగం క్రెడిట్.

1980 - 2010 నడుమ పుట్టిన వారిలో చాలామందికి 1994, 1995 ప్రాంతాల్లో జరిగిన సంఘటనలు, పరిణామాల పట్ల పూర్తి అవగాహన వుండే అవకాశాలు తక్కువగా వుంటాయి. ఎందుకంటే అప్పటికి వారి వయసు పదిహేనేళ్లకు లోపు కనుక. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా చురుగ్గా పాల్గొంటున్న అలాంటి వారికి అలనాటి విషయాలు గురించి గూగుల్ పరిజ్ఞానం ఉండవచ్చు కానీ ప్రత్యక్ష సాక్షులుగా వుండి అవగాహన చేసుకునే వీలు వుండే అవకాశం లేదు.

1994లో నెల్లూరు జిల్లా దూబగుంట గ్రామానికి చెందిన నిరక్షరాస్యురాలయిన ఓ పేద మహిళ రోసమ్మ సాగించిన సారా వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడడంతో అప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న ఎన్టీ రామారావుకు ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో ఇదొక ప్రచారాస్త్రంగా ఉపయోగపడింది. తమ పార్టీ అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్య నిషేధం విధిస్తానని ఆయన వివిధ ఎన్నికల సభల్లో చేసిన వాగ్దానం పేద దిగువ తరగతి మహిళలలో విపరీతమైన ఆశలు పెంచింది. ఫలితంగా అంతకుముందు అయిదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీని మంచి మెజారిటీతో గెలిపించి ప్రభుత్వ పగ్గాలు అప్పగించారు. రామారావు గారు కూడా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని ప్రవేశపెట్టారు.

పేద జనాల తాలూకు ఆడంగులందరూ హాహా ఓహో అన్నారు. అయితే ప్రశంసలతో ప్రభుత్వాలు నడవవు కదా! పైగా బోలెడు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సిన పరిస్థితి. కానీ ఆయన మొండి మనిషి. ససేమిరా మద్యనిషేధాన్ని ఎట్టిపరిస్థితిలోనూ అమలు చేసి తీరాల్సిందే అన్నారు. కానీ జరిగింది వేరే విధంగా వుంది.

బడుగు బలహీన వర్గాల కుటుంబాలు ఆర్ధికంగా కూసింత నిలదొక్కుకునే దశలో మద్యం మాఫియా జడలు విప్పింది. నిషేధ చట్టానికి తూట్లు పొడిచే కార్యక్రమం ఒక పద్దతి ప్రకారం మొదలయింది. ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా అడ్డూఅదుపూ లేకుండా సాగింది. బయట నుంచి ఒక్క లారీ లోడ్ మద్యం రాష్ట్రంలోకి వచ్చేలా చూడగలిగిన పెద్దలకు లక్షల్లో నజరానాలు అందాయి. సరిహద్దు ప్రాంతాల ప్రజాప్రతినిధులకు నెలలవారీ మామూళ్ళు ముట్టాయి. వారికి సహకరించేవారు రాత్రికి రాత్రి లక్షాధికారులు అయ్యారు.

ప్రభుత్వానికి రాజమార్గంలో రావాల్సిన ఆదాయం దారిమళ్లి వేరే వారి జేబుల్లోకి చేరింది. ఉభయ భ్రష్టత్వం ఉపరిసన్యాసం.

ఎవరెన్ని కబుర్లు చెప్పినా మద్యం అనేది ఏ ప్రభుత్వానికి అయినా కాసుల వర్షం కురిపించే కామధేనువు. అయితే అదే సమయంలో అదే మద్యనిషేధం వాగ్దానరూపం ధరిస్తే ఎన్నికల వైతరణిని దాటించే సులభమైన మార్గం కూడా. అంచేత తెలివయిన రాజకీయ నాయకులు రెండు వైపులా పదునున్న ఈ అయుధాన్ని అంతే తెలివిగా ఉపయోగించుకుంటారు.
అందుకే, పైకి చెప్పరు కానీ వారిది ఒకే నినాదం.
“అధికారంలోకి రావడానికి ప్రజలకు నచ్చే కొన్ని మాటలు చెప్పాలి. అలా దక్కిన అధికారాన్ని నాలుగు కాలాలు నిలబెట్టుకునేందుకు జనాలకు ఇష్టంలేని కొన్ని పనులు చేయాలి”
చేయక తప్పదు కూడా.

అదే జరిగింది లోగడ. ఇప్పుడూ జరుగుతుందేమో తెలియదు.
కానీ ఆనాటి పత్రికల సహకారం ప్రస్తుతం పూర్తిగా పూజ్యం.
(30-10-2020)

5, మే 2020, మంగళవారం

తెలుగు మద్యం కధ


అనగనగా, ఒకప్పుడు ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రాంతంగాను, ఇప్పటి తెలంగాణా హైదరాబాదు స్టేట్ గాను వున్నప్పుడు ఆంధ్రలో టోటల్ ప్రొహిబిషన్. అంటే సంపూర్ణ మద్యనిషేధం. హైదరాబాదు స్టేట్ లో ఎప్పుడూ ఈ మాట వినబడలేదు. 1956 లో ఈ రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డ చాలా కాలం వరకు ఈ ఒక్క నిబంధన మాత్రం చెక్కు చెదరకుండా ఆయా ప్రాంతాల్లో అమల్లో వుండేది. అంటే ఒకే రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో రెండు రకాల ఎక్సైజ్ విధానాలు. ఆంధ్రాలో మద్యం షాపులు ఉండేవి కావు. కాపు సారా కాసే వారిని పట్టుకోవడానికి ఎక్సైజ్ సిబ్బంది వుండేవారు. మా ఊరు రెండు ప్రాంతాల సరిహద్దు రేఖపై వుండేది. ఆంధ్రాలో ఆ రోజుల్లో ఓ జోకు చెప్పుకునేవారు. మందుబాబులు ఊరి పొలిమేర దగ్గర నిలబడి మందు కొడుతూ, ఎక్సైజ్ కనిస్టీబు కనిపించగానే ఒక గెంతు గెంతి గెట్టు దాటి తెలంగాణా ప్రాంతంలోకి దూకి ఇప్పుడు పట్టుకో చూద్దాం అని అతడ్ని ఆటలు పట్టించేవారట.
మేము స్కూల్లో చదువుకునే రోజుల్లో ఖమ్మం మొత్తానికి ఒకే ఒక వైన్ షాపు వుండేది. (వైన్ అంటే ఏమిటో అక్కడే ఎందుకు అమ్ముతారో మాకు తెలవదు) మందు కొనేవాళ్ళు భుజాన కండువా నెత్తి మీద కప్పుకుని, మొహం గుర్తుపట్టకుండా ఆ దుకాణానికి వెళ్ళేవాళ్ళు. మందుబాబులు అంటే సమాజంలో చాలా చిన్న చూపు వుండేది.
తర్వాత రోజుల్లో ఆంధ్రప్రాంతంలో కూడా ప్రొహిబిషన్ ఎత్తేశారు. ఆ విధంగా సమసమాజ నిర్మాణం జరిగింది.
ఇప్పుడు చిత్రంగా కరోనా లాక్ డౌన్ పీరియడ్ లో ఆంధ్రాలో కొన్ని చోట్ల వైన్ షాపులు తెరిచారు. తెలంగాణాలో మాత్రం మందు విక్రయాలు జరగడం లేదు.