3, జులై 2026, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో : (336) : భండారు శ్రీనివాసరావు

 

మా ఊరి ‘శ్రీమంతుడు’
ఏడాదికి ఒకసారైనా మా సొంతూరు కంభంపాడుకు పిల్లాజెల్లా అందరం కట్టగట్టుకుని పొలోమని వెళ్ళేది, అరకొరగా మిగిలివున్న సొంత ఆస్తుల అజమాయిషీ కోసం కాదు, మా కుటుంబంలో మిగిలి ఉన్న ఆత్మీయతలు, ఆప్యాయతలు రుచి చూడడం కోసం.
మాకు జన్మ ఇచ్చిన అమ్మా నాన్నల సంస్మరణార్థం మా మూడో అన్నయ్య ( కీర్తిశేషులు భండారు వేంకటేశ్వర రావు) నిర్మించిన అమ్మా నాన్నల గుడి (అమ్మపర్తి) ని సందర్శించి మాతా పితరులకు నివాళి అర్పించడం కోసం.
బతికి వున్నప్పుడు భారంగా నడిచేకాలం అదేమిటో చనిపోయిన తరువాత పరుగులే పరుగులు.
కింది ఫోటోలో వున్న గుడిలో వున్నది దేవుళ్ళూ దేవతలూ కాదు, మా ఇలవేలుపులు, మా అమ్మా నాన్నలు.
మా నాన్నగారు భండారు రాఘవ రావు నా చిన్నతనంలోనే చనిపోయారు. మా అమ్మగారు వెంకట్రావమ్మ చనిపోయి దాదాపు ముప్పయి యేళ్ళు దాటిపోయాయి.
1993 లో మా అమ్మ హైదరాబాదులో చనిపోయినప్పుడు మొత్తం కర్మ కాండ యావత్తూ, ఇంటిల్లిపాదిమీ కాశీ వెళ్లి అక్కడ జరిపించాము. అది మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారి అభీష్టం మేరకు జరిగింది.
మొదటి మాసికం మా స్వగ్రామం కంభంపాడులో. అప్పటికల్లా, మా మూడో అన్నయ్య భండారు వెంకటేశ్వర రావు ఎంతో శ్రద్ధ తీసుకుని ‘అమ్మా నాన్న’గుడి కట్టించాడు.
కాశీలో కర్మ కాండకు కర్త అయిన మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారూ, తలితండ్రులకు గుడి కట్టించిన మా మూడో అన్నయ్య వెంకటేశ్వరరావు ఇద్దరూ ఇప్పుడు లేరు. వారి స్మారక చిహ్నాలు కూడా ఈ గుడి పక్కనే వున్నాయి.
మూడు దశాబ్దాల నాటి ఈ దేవాలయాన్ని మా మూడో అన్నయ్య కుమారులు రఘు, రమేష్, సత్యసాయి ఇటీవల మళ్ళీ తీర్చిదిద్దారు.
మా ఊరు కంభంపాడు అనేది ఇక పాస్ పోర్టులో ప్లేస్ ఆఫ్ బర్త్ కాలం కు పరిమితమయిపోతుందేమో అని ఒక్కోసారి భయం వేస్తుంటుంది. ఒకప్పుడు అమ్మా నాన్నల అబ్దీకాలకోసం ఏడాదికి రెండు సార్లు అయినా సొంతూరుకు వెళ్లి వచ్చేవాళ్ళం. మా మూడో అన్నయ్య పోయిన తరువాత తద్దినాలు కూడా హైదరాబాదుకే మారిపోయాయి.
ఈ నేపధ్యంలో ఇంగ్లండులో (ప్రస్తుతం అమెరికాలో) ఉంటున్న మా అన్నయ్య కుమారుడు సత్యసాయి, ఏడాదికోసారి, సంక్రాంతి నాడు హైదరాబాదులో స్థిరపడిన మా కుటుంబాలను కంభంపాడు రప్పించే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ కార్యక్రమానికి వాడు కర్త అయినప్పటికీ, వాడి సోదరులు రఘు, రమేశ్ ఇద్దరూ కర్మా, క్రియలు.
ఈ విధంగా అయినా ఏడాదికోమారు సొంతూరు చూసే అవకాశం కలుగుతోంది. ఒకసారి అలా వెళ్ళినప్పుడు పరిచయం అయిన వ్యక్తి మా ఊరి ‘శ్రీమంతుడు’.
వీరి పేరు చావా నరసింహారావు. మా చిన్నప్పుడు ఈ పేరుతోనే నాకో క్లాస్ మేట్ ఉండేవాడు. కనుక్కుంటే అతడూ, ఈయనా ఒకరు కారని తేలింది. పిల్లలు ఖమ్మంలో ఏదో వ్యాపారంలో బాగానే స్థిరపడ్డారు. ఈ నరసింహారావు మాత్రం ఊళ్లోనే వుండిపోయి, వ్యవసాయం చేసుకుంటున్నాడు. కష్టపడే తత్వం, నిరాడంబర జీవనం వల్ల నాలుగు రాళ్ళు వెనకేసుకోగలిగారు. అయినా ఊరికి ఏదైనా చేయాలని తపన. లక్షలు ఖర్చు పెట్టి ఊరిలో రామాలయాన్ని కట్టించారు. మేము చదువుకున్న బడి ఇప్పుడు హైస్కూలు అయింది. వేరే ప్రాధమిక పాఠశాల మంజూరు అయితే దానికి ఒక చక్కటి భవనం కట్టి పెట్టారు. ఆ మధ్య వానలకు మా అన్నయ్య ఎప్పుడో కట్టించిన గ్రామ కచ్చేరీ దెబ్బతింటే, దానిని సొంత డబ్బులతో పునరుద్ధరించే కార్యక్రమం నెత్తికి ఎత్తుకున్నారు. ఊళ్ళో టెలి మెడిసిన్ సెంటర్ పెట్టాలని ఓ స్వచ్చంద సంస్థ ముందుకు వస్తే వారికి కావలసినవన్నీ అమర్చి పెట్టడానికి సిద్ధం అంటూ ఈయన ముందే సిద్ధం అయిపోయారు. ఇవన్నీ బాగా డబ్బులు వుండి చేస్తున్న పనులు కావు. సొంత ఖర్చులు తగ్గించుకుని చేస్తున్న వితరణలు.
నిజమైన ‘శ్రీమంతుడు’ చావా నరసింహారావు గారు. సందేహం లేదు.
కింది ఫోటోలు:
అమ్మా నాన్నల గుడి, మా ఊరి శ్రీమంతుడు శ్రీ చావా నరసింహా రావు








(ఇంకావుంది)

కామెంట్‌లు లేవు: