3, జులై 2026, శుక్రవారం

ఇదెక్కడి గోల? – భండారు శ్రీనివాసరావు

 

ఉన్నది పోతుందన్న బెదురుతో

అనుకున్నది రాదేమో అన్న అదురుతో

కొట్టుకుంటూ తిట్టుకుంటూ

కొండ కెక్కేవాళ్లము

మీ అండకోరే వాళ్ళము”

ఇదీ ఈనాటి అన్ని అర్హతలు కలిగిన సాధారణ ఓటరు పరిస్థితి” అని సూత్రీకరించాడు ఒకాయన.  

ఇక్కడ మామూలు ఓటరు అంటే నేను కాదు. కంప్యూటర్స్ లో ప్రావీణ్యం వున్న వాళ్ళు కాదు. చదువుకున్న వాళ్ళు కాదు. చదువు లేని వాళ్ళు కాదు. ఇరవై నాలుగేళ్ల క్రితం  2002 లో తాము   నియోజకవర్గంలో, ఏ పోలింగ్ స్టేషన్ లో, ఏ నెంబరు బూతులో ఓటు వేశామో అనే విషయంలో కనీస పరిజానం పరిజ్ఞానం లేని వాళ్ళు వీళ్ళు.  అది ఎలా తెలుసుకోవాలో తెలియని వాళ్ళు. అయినా వాళ్ళు ఓటు వేసే వయసు నుంచీ ఓటు వేయడం తమ కర్తవ్యంగా పాటిస్తున్న వాళ్ళు. కానీ ఏమి లాభం?

గత ఇరవై నాలుగేళ్ళలో భౌగోళిక స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఊహాతీతంగా, సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందింది.  రాష్ట్రాల విభజన జరిగింది. నియోజక వర్గాలు మారాయి. పోలింగ్ స్టేషన్ల పేర్లు, పోలింగ్ బూత్ ల నెంబర్లు మారాయి.

మొత్తం ఓటర్లలో ఆయా రాజకీయ పార్టీల ఓటర్లు ఇరవై నుంచి నలభయ్ శాతం వుంటారు. అభిమానులు మరో పది శాతం వుంటారు. అసలు ఓటు జోలికే పోని నిర్లిప్త జనం మరో పది శాతం వుంటారు. మరి,  మరో ముప్పయి శాతం మంది రాజకీయ రంగు, సొంటు లేని వాళ్ళు వుంటారు. కానీ ఓటు హక్కు అంటే వారికి  అపరిమితమైన ప్రేమ. అది లేకపోతే తాము చనిపోయినట్టే, జనాభా లెక్కల్లో లేనట్టే అని బాధ పడే రకం.

వీళ్ళే ముందు చెప్పిన :

ఉన్నది పోతుందన్న బెదురుతో

అనుకున్నది రాదేమో అన్న అదురుతో

కొట్టుకుంటూ తిట్టుకుంటూ

కొండ కెక్కేవాళ్లము

మీ అండకోరే వాళ్ళము”

అర్ధం అయిందా ప్రభువులూ!

ఏ సంస్కరణ తీసుకువచ్చినా దాన్ని సామాన్యుల కోణంలో ఆలోచించి రూపొందించాలి.

అప్పుడే ఆ సంస్కరణలు బహుళ జనామోదం పొందుతాయి.  

కామెంట్‌లు లేవు: