25, నవంబర్ 2013, సోమవారం

కిరణ్ కుమార్ రెడ్డి – ముఖ్యమంత్రిగా మూడేళ్ళు


మూడేళ్ళ క్రితం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆనాటి పరిస్థితుల్లో ఏడాది కొనసాగడం కూడా అబ్బురమే అనుకున్నారు. అయితే అటు పరుగులు చేయకుండా ఇటు అవుట్ కాకుండా (NO RUNS – NOT OUT) క్రీజులో వుండిపోయే క్రికెట్  ఆటగాని మాదిరిగా మొత్తం మీద ఆయన  మూడేళ్ళు బండి లాగించేశారు.


(మూడేళ్ళక్రితం ఇదే రోజున ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి) 

రోశయ్యగారి తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, మంత్రుల శాఖల్లో సీనియర్లను కూడా పక్కనబెట్టి మార్పులు చేసిన విధానం గమనించిన వారికి కొత్త ముఖ్యమంత్రి ‘మొనగాడేమో’ అన్న అభిప్రాయం కలిగింది. కానీ,  అది కరిగి  కనుమరుగై పోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
ఏ రాజకీయ నాయకుడికయినా ముఖ్యమంత్రి పదవి అనేది ఓ కమ్మటి కల. ఏళ్ళూ పూళ్ళూ  ఎదురుచూస్తూ కూర్చున్నా  ఆ కల సాకారం కావడం  అంత సులభం కాదు.  ప్రత్యేకించి ఈ పరిస్తితి కాంగ్రెస్ పార్టీలో మరింత ఎక్కువ. ఢిల్లీలో కొలువుతీరివుండే ఎంతోమంది అధిష్టాన దేవతలను ప్రసన్నం చేసుకుంటే కాని నెరవేరని కల. అందుకే ముఖ్యమంత్రిగా కిరణ్ పేరు వెల్లడయినప్పుడు రకరకాల వదంతులు వెలుగులోకి వచ్చాయి. సోనియా గాంధీ,  సీఎం మార్పు విషయం గురించి ఆలోచన చేసినప్పుడు ఆమె మనస్సులో మెదిలిన పేరు, అంతకుముందు  స్పీకర్ గా పనిచేసిన  కే. ఆర్. సురేష్ రెడ్డి.  ఆయన ఎన్నికల్లో వోడిపోయిన సంగతి ఆ క్షణంలో గుర్తుకురాక,  ‘స్పీకర్ రెడ్డి’ అనడంతో అప్పుడు స్పీకర్ గా వున్న కిరణ్ కుమార్ రెడ్డి పేరును అధిష్టాన దేవతలు ఖరారు చేసారని సూతుడు శౌనకాది మునులకు చెప్పినట్టు ఓ  కధ ప్రచారంలోకి వచ్చింది కూడా.   
ఇలాటి నేపధ్యంలో – ఒక్కసారి కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనుభవం కూడా లేని కిరణ్ కుమార్ రెడ్డిచేత ఏకంగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించడం కాంగ్రెస్ వర్గాల్లో అత్యంత చర్చనీయాంశం అయింది.    స్పీకర్ హోదానుంచి నేరుగా ముఖ్యమంత్రి పదవికి ఎగబాకిన  కిరణ్ కుమార్ రెడ్డి అదృష్టాన్ని ఆహ్వానించిన వారికంటే కన్ను కుట్టిన వారి సంఖ్యే సొంత పార్టీలో ఎక్కువగా వుండడం కాంగ్రెస్ సంస్కృతి తెలిసిన వారికి ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. సరిగ్గా అదే జరిగింది. రోశయ్య గారిని మార్చడం అంటూ జరిగితే ఆ వరమాల తమ మెడలోనే పడేట్టుగా లోపాయికారి ప్రయత్నాలు సాగించిన సీనియర్ మంత్రులకు ఈ పరిణామం సహజంగానే మింగుడు పడలేదు. కాబట్టే మొదటి ముద్దలోనే ఈగ పడిందన్న చందంగా తొలినాళ్ళలో ఆయనకు సొంత మంత్రులనుంచే సహకారం అందకుండా పోయింది. పరిపాలన మీద పట్టు చిక్కించుకోవడం మాట అటుంచి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవడమే గగనమైపోతోందన్న మాటలు వినబడ్డాయి. ఒకపక్క రాష్ట్ర విభజన ఉద్యమం, మరోపక్క కొత్తగా పుట్టుకొచ్చిన జగన్ పార్టీ విసురుతున్న సవాళ్లు - కొత్త ముఖ్యమంత్రికి కంటిమీద కునుకు లేకుండా చేసాయి. దానికి తోడు పీసీసీ అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణ నియామకంతో కిరణ్ పాలనకు రోజులు మూడాయన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లోనే బాగా సాగింది. కాంగ్రెస్ నుంచి కొత్త పార్టీలోకి వలసలను అరికట్టలేకపోతున్నారన్న అపప్రధ  ఓ పక్క. మరోపక్క ఉపఎన్నికల్లో పాలకపక్షం పరాజయ పరంపర. సొంత గొడవలే తప్ప ప్రజలగోడును ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఇంకో పక్క. ఒక కాంగ్రెస్  ముఖ్యమంత్రి రాత్రికి రాత్రే  మాజీ ముఖ్యమంత్రి కావడానికి ఇవి చాలు. కానీ, కిరణ్ అదృష్టం ఏమిటో గాని అధిష్టానం ఇవేవీ పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకే మొదటి ఏడాది కాలం ఇట్టే గడిచిపోయింది. రెండో ఏడాది ఇవన్నీ మరింత ముదిరి పాకాన పడ్డాయి. అయినా ఆయన కుర్చీ కిందకు నీళ్ళు రాకపోవడం చూసి కాంగ్రెస్ పార్తీవాళ్ళే ఆశ్చర్యపోవడం మొదలెట్టారు. చూస్తుండగానే మూడో ఏడు. ఈలోగా పాలన మీద పెద్దగా కాకపోయినా ఓ మోస్తరుగానయినా ముఖ్యమంత్రికి పట్టుకుదిరింది. ఆయన్ని  మార్చరేమో అన్న అనుమానం మొదలు కాగానే ముందు మొరాయించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ  ఎందుకయినా మంచిది అన్న ధోరణిలో సర్దుకుపోవడం మొదలెట్టారు. అంతకు ముందు ప్రైవేటు సంభాషణల్లో ‘కిరణ్’ అంటూ  తేలిగ్గా మాట్లాడిన వాళ్లందరూ ‘గౌరవనీయులయిన ముఖ్యమంత్రి గారు,  పూజ్యులయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు’ అని ముందూ వెనుకా గౌరవ వాచకాలు తగిలించి మరీ మాట్లాడడం గమనిస్తే క్రమేపీ పార్టీపై ఆయన పట్టు బిగిస్తున్న సంగతి బోధపడుతుంది. దీనికి తోడు ఆయనొక ‘సీతయ్య- ఎవ్వరి మాటా వినడు’ అనే పద్ధతిలో సాగిన ప్రచారం కూడా కిరణ్ కుమార్ రెడ్డికి కొంత కలిసివచ్చింది.
వాస్తవానికి  ముఖ్యమంత్రిగా కిరణ్ సాధించిన ఘన కార్యాలు ఏవీ లేవు. ఏవో కొన్ని కొత్త పధకాలకు రూపకల్పన చేసి అమలుచేస్తున్నా,  వాటిలో కొన్నింటికి ‘తన పేరు’  పెట్టుకోవడం అన్న సంగతి పక్కన పెడితే,  వాటిపై తనదైన ముద్ర వేసుకోవడంలో కానీ, వాటికి  తగిన ప్రాచుర్యం కల్పించుకునే విషయంలో కానీ, గతంలో చంద్రబాబు, రాజశేఖర రెడ్డి చూపించినట్టుగా  కిరణ్ కుమార్ రెడ్డి అంతగా  ఆసక్తి ప్రదర్శించకపోవడం కూడా ముఖ్యమంత్రిగా ఆయన వైఫల్యాల జాబితాలో చేరిపోయింది. ఎన్నికల్లో పార్టీని గెలిపించి మరోసారి అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యత అంటూ లేకపోవడం వల్లనే ఆయన ఇలా నిరాసక్తంగా వ్యవహరిస్తున్నారన్న నింద కూడా వుంది.   
సాఫల్య వైఫల్యాలు యెలా వుంటేనేం,  ముఖ్యమంత్రిగా మూడేళ్ళు పూర్తిచేసిన రికార్డు ఆయన ఖాతాలో చేరిపోయింది. 1975 నుంచి తీసుకుంటే ‘ఎమర్జెన్సీ’ కాలపు ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, ‘వాజ్ పేయీ నీడన చంద్రబాబు, అధిష్టానం చల్లని చూపుల్లో రాజశేఖర రెడ్డిని మినహాయిస్తే, ఇటీవలి కాలంలో కిరణ్ కుమార్ రెడ్డిదే అరుదయిన రికార్డ్.  కాంగ్రెస్ పార్టీలో ఉద్దండ నాయకులు మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి, నేదురుమల్లి జనార్ధన రెడ్డి వీరెవ్వరికీ ఈ రికార్డ్ లేదు. వీరిలో రెండు మార్లు ఈ పదవి పొందిన వారు వున్నారు కానీ ఏకబిగిన మూడేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేయలేదు.
ఇక కిరణ్ కుమార్ రెడ్డి గురించి చెప్పుకోవాల్సిన ఆసక్తికరమైన అంశం ఒకటుంది. ఆయన ముఖ్యమంత్రి అయిన తొలిరోజుల్లో తెలంగాణా అంశం ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టింది. బలహీనుడయిన ముఖ్యమంత్రిగా ముద్ర వేసింది. విచిత్రం ఏమిటంటే మళ్ళీ తెలంగాణా అంశమే కిరణ్ కుమార్ రెడ్డిని  అత్యంత శక్తిమంతుడిని చేసింది. ఈ విషయంలో ఆయన అధిష్టానాన్ని దిక్కరిస్తున్న తీరు ‘కొందరి దృష్టిలో’ అయినా ఆయన్ని ‘మొనగాడి’ని చేసింది.

నిజానికిది ఒక ‘రాజకీయ విచిత్రం’  (25-11-2013)

23, నవంబర్ 2013, శనివారం

ఎన్టీయార్ పెళ్లి శుభలేఖ

1942

అంటే డెబ్బయ్యేళ్లు దాటిపోయాయి. అప్పటి శుభలేఖ ఇది.
అంత పాతది సరే. అంతకంటే విలువైనది  కూడా! 
అదేమిటంటే -
ఆంధ్రుల ఆరాధ్య నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి   పెళ్లి పిలుపు ఇది.
అందుకే ఇది అరుదయినదీ, అంతే అపురూపమైనదీ.
నెట్ మిత్రుడు ఒకరు దీన్ని పంపారు.
అసలైనదేనా అనే సందేహాలు పక్కనపెడితే ఎంచక్కా సంతోషం కలిగించే పాత పెళ్లి పత్రిక ఇది. 




(ఎన్టీయార్  పెళ్లి పత్రిక)

గిల్లకురా!


గవర్నర్ల వ్యవస్థ మిధ్య పొమ్మన్నారు అలనాడు ఎన్టీ రామారావు గారు. రాం లాల్ ఉదంతం జ్ఞాపకం వున్నవారికి  గవర్నర్ల మీద ఆయనకు యెందుకు అంత ఆగ్రహం అన్నది అర్ధం అవుతుంది. కానీ ప్రస్తుతం డెబ్బయ్ ఎనిమిదో పడిలో పడ్డ మాజీ పోలీసు బాసు గారు కే పీ ఎస్ గిల్ గారికి గవర్నర్లతో ఏం గిల్లికజ్జా వున్నదో తెలవదు.


(శ్రీ కేపీఎస్ గిల్ )  
‘గవర్నర్లకు పనీ పాడూ ఏమీ వుండదు. వూరికే ఎదురు చూస్తూ కూర్చోవడం తప్ప’ అనేశారు  పోలీసు బాసుగా వున్నరోజుల్లో ఎన్కౌంటర్ స్పెషలిష్టుగా పేరుమోసిన ఈ సర్దార్జీ. ఆనాటితో ఆగే తత్వం ఆయనదయితే ఆయన్ని గురించి ఇంతగా చెప్పుకోవాల్సిన పనేంటి? 

పనేమీ ఉండదు..ఊరికే ఎదురు చూస్తుండాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఆఫర్ చేసింది
అప్పట్లో పైలెట్ స్వయంగా కోరారు
అలాంటి పదవి వద్దని చెప్పేశాను
కేపీఎస్ గిల్ వివాదాస్పద వ్యాఖ్యలు
అసోం హత్యలతో సంబంధం లేదని వివరణ
- See more at: http://www.andhrajyothy.com/node/32485#sthash.1c8X8txL.dpuf    
గిల్ దొరవారు గవర్నర్లను  ఏకంగా ‘వయసుడిగిన వేశ్యలతో’ పోల్చి వార్తల్లోకెక్కారు. కాకపొతే, వార్తల్లోకి ఎక్కడం అనేది గిల్ మహాశయులవారికి  వెన్నతో పెట్టిన విద్య.
యాభయ్యవ పడి  దాటిన  తరువాత కూడా గిల్ దొరవారికి స్త్రీ చాపల్యం తగ్గలేదు. ఒక సాయంత్రం సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్న పార్టీలో పీకల దాకా తాగిన   కేపీఎస్ గిల్ ఆ మద్యం మత్తులో ఒక మహిళా ఐ ఏ ఎస్  అధికారిణిని తాకరాని ప్రదేశంలో ఒక చాపు చరిచారు. రూపన్ బజాజ్ అనే ఆ ఐ.ఏ.ఎస్. మహిళ కూడా ఏమీ తక్కువ తినలేదు. పై అధికారి అని ఏమాత్రం మొహమాటపడకుండా గిల్ దొరవారిపై పోలీసు కేసు పెట్టింది. లో పెట్టిన ఆ కేసు ఎనిమిదేళ్ళ తరువాత కానీ ఓ కొలిక్కి రాలేదు. మొత్తం మీద న్యాయస్థానం ఆయన్ని దోషిగా పరిగణించి రెండు లక్షల రూపాయల జరిమానా, మూడు మాసాల కఠిన కారాగారశిక్ష విధించి చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదు అని నిరూపించింది. కాని దరిమిలా సుప్రీం దాకా సాగిన ఈ కేసు లో గిల్ గారికి ఓ మేరకు వూరట లభించింది. జైలు శిక్షను రద్దు చేసి జరిమానాతో సరిపెట్టారు. అయితే ఆ డబ్బును పరిహారంగా తీసుకోవడానికి  రూపన్ బజాజ్ అంగీకరించలేదు. దాంతో  ఆ డబ్బును ఏదయినా మహిళా స్వచ్చంద సంస్థకు విరాళంగా ఇవ్వాలని న్యాయస్థానం  ఆదేశించింది. (23-11-2013)

ఎవరీ అంకుల్ టామ్ ? - 6


ఎవరీ అంకుల్ టామ్ ? అన్న ప్రశ్నకు టెలివిజన్ రంగంలో నిష్ణాతులయిన తోట భావనారాయణ గారు సవివరమైన సమాధానం ఇచ్చారు. నలుగురూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇందులో వున్నాయన్న  ఉద్దేశ్యంతో, ఆయనతో నాకున్న పరిచయాన్ని ఉపయోగించుకుని ఆయన రాసిన ఈ  వ్యాసాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. దీనిపై ‘కాపీ రైట్లు’,  ‘కాపీ కొట్టే రైట్లు’  సమస్తం ఆయనవే.
 

(శ్రీ తోట భావనారాయణ)


టీవీ రేటింగ్ ప్రజాభిప్రాయమా?
రేటింగ్స్ ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడం లేదా అనేది... రేటింగ్స్ లెక్కించే పరిభాషలో ప్రజలు అంట నగరాలు, పట్ణణాల్లో ఉంటూ కేబుల్ కనెక్షన్ ఉన్న ఇళ్లలో నివసించేవారని అర్థం. ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ మహానగరంతో పాటు పదిలక్షల జనాభా పైబడిన విజయవాడ, విశాఖపట్టణం, నగరాలు లక్ష నుంచి పది లక్షల మధ్య జనాభా ఉన్న 12 పట్టణాలను మాత్రమే రేటింగ్స్ లెక్కింపులో పరిగణిస్తారు. వాటిలో కొన్ని పట్టణాలు అప్పుడప్పుడూ మారుతూ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలను ఎంత మాత్రమూ పట్టించుకోవటం లేదనీ, వారి అభిప్రాయాలను రేటింగ్స్ ప్రతిబింబించటం లేదనీ స్పష్టంగానే తెలుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో రేటింగ్స్ ఆధారంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారంటే నిజంగా ప్రజలు కోరుకుంటున్న విధంగా ఛానల్స్  నడుచుచుంటున్నాయని చెప్పగలమా? గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉండే దూరదర్శన్ రేటింగ్స్ లో ఎక్కువగా కనపడకపోవటం గమనించవచ్చు. ఇది కూడా  TAM సంస్థ పరిధి పరిమితంగా ఉండటం వల్లే.

రేటింగ్స్ ఆధారంగా కార్యక్రమాలు తయారవ్వడం అంటే ఎక్కువ శాతం పట్టణ ప్రాంత ప్రజలను..ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రేటింగ్స్ లెక్కించే నగరాలు, పట్టణాల ప్రజలనే టార్గెట్ చేసుకోవడమన్నమాట. ఆ విధంగా కొన్ని సక్సెస్ ఫార్ములాలు తయారుచేసుకుని ఛానల్స్ తమ కార్యక్రమాలను రూపొందిస్తున్నాయి. వీలైతే ఇతర భాషల్లో సక్సెస్ అయిన (ఎక్కువ రేటింగ్స్ సంపాదించిన) కాన్సెప్ట్స్ ను ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా మార్పులతో తీర్చి దిద్దటమూ చూస్తున్నాం. మంచి కరా్యక్రమాలతో ప్రజలకు మేలు చేయటానికి బదులు ప్రజలను తాత్కాలికంగా రెచ్చగొట్టి ఆకర్షించేందుకే ప్రయత్నించటానికి కారణం రేటింగ్స్ మాయాజాలమే. ప్రసారాల మీద ప్రేక్షకుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఛానల్స్ ప్రయత్నించటం లేదు. ఎలాంటి శాస్త్రీయమైన సర్వేలూ లేవు. TAM కు చందా కట్టి డేటా తెప్పించుకోవటమే తప్ప స్వయంగా రీసెర్చి జరిపేందుకు ఎవరూ పూనుకోవటం లేదు. ప్రేక్షకుల అభిప్రాయాలకు అనుగుణంగా కార్యక్రమాలు తయారుచేయటానికి బదులుగా తాము ఇచ్చిన వాటిలో ఏది బాగా చూస్తారో అలాంటివే చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తనకు ఏం కావాలో చెప్పుకునే అవకాశం లేనప్పుడు ప్రేక్షకుడు సహజంగానే ఉన్నంతలో నచచింది చూడక తప్పదు. ఆ క్రమంలో చేతిలో రిమోట్ కు పనిచెప్పడం మరింత పెరుగుతుంది. రేటింగ్స్ వలలో పడిన ఛానల్స్ ఈ నిజాన్ని గుర్తించకపోతే భిన్నంగా ఆలోచించడానికే సాహసించవు. స్వల్పకాలిక ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తే ఎంత అనర్థమో ముందు ముందు తెలుస్తుంది. ఛానల్స్ ను  నియంత్రించాలని ప్రయత్నించే ట్రాయ్ ఈ రేటింగ్స్ వేలం వెర్రి నుంచి వాటిని కాపాడగలిగితే ప్రేక్షకులు సంతోషిస్తారు. (ఇంకా వుంది)

22, నవంబర్ 2013, శుక్రవారం

ఎవరీ అంకుల్ టామ్ ? -5


అన్న ప్రశ్నకు టెలివిజన్ రంగంలో నిష్ణాతులయిన తోట భావనారాయణ గారు సవివరమైన సమాధానం ఇచ్చారు. నలుగురూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇందులో వున్నాయన్న  ఉద్దేశ్యంతో, ఆయనతో నాకున్న పరిచయాన్ని ఉపయోగించుకుని ఆయన రాసిన ఈ  వ్యాసాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. దీనిపై ‘కాపీ రైట్లు’,  ‘కాపీ కొట్టే రైట్లు’  సమస్తం ఆయనవే.


(శ్రీ తోట భావనారాయణ)
 

రేటింగ్స్ విశ్లేషణ, భిన్న వాదనలు
వస్తువుల ప్రకటనల కోసం కొన్ని టార్గెట్ గ్రూపులను ఎంచుకోవటం ఆనవాయితీ గనుక ఆ వస్తువు స్వభావాన్ని బట్టి మార్కెట్ పరిధిని కూడా అంచనా వేసుకోటానికి వీలుగా TAM తన సర్వే ఫలితాలను జనాభా ప్రాతిపదికన మూడు వర్గాలుగా విభజిస్తుంది. హైదరాబాద్ నగరంలో సేకరించే వివరాలను ఒక విభాగంలో అందజేస్తుంది. పదిలక్షలు పై బడిన జనాభా ఉన్న విజయవాడ, విశాఖపట్టణం నగరాలను మరో వర్గంలో చేరుస్తుంది. లక్ష నుంచి పదిలక్షలలోపు జనాభా ఉన్న పట్టణ ప్రాంతాలు మూడవ విభాగంలో చేరతాయి. అయితే, లక్షలోపు జనాభా గల ప్రాంతాలను రేటింగ్స్ కోసం సర్వే పరిధిలో చేర్చకపోవటం వల్ల నిజమైన రేటింగ్స్ రావటం లేదనే విమర్శలున్నాయి. ప్రకటనదారులు కోరుకునే మార్కెట్ గ్రామాలలో లేనందున ఆ ప్రాంతాన్ని చేర్చకపోయినా ఫరవాలేదనేది యాడ్ ఏజెన్సీల వాదన.
నిజానికి రేటింగ్స్ అనేవి ఆ కార్యక్రమం గొప్పదనం, నాణ్యత మీదనే ఆధారపడి ఉంటాయని చెప్పటానికి వీల్లేదు. అదే సమయంలో ఇతర ఛానల్స్ లో ఇంకా మెరుగైన కార్యక్రమాలు ఉన్న పక్షంలో రేటింగ్స్ వాటంతట అవే పడిపోతాయి. అంతమాత్రాన ఈ కార్యక్రమం బాగాలేదని భావించడానికి వీల్లేదు. పైగా ప్రతిరోజూ పరిస్థితి ఒకే విధంగా ఉంటుందని కూడా చెప్పలేం. ఎప్పటికప్పుడు రేటింగ్స్ ను కాపాడుకునేందుకు తగిన వ్యూహం అనుసరించడంలోనే విజయ రహస్యం దాగి ఉంది. వారం మొత్తంలో అన్ని ఛానల్స్ లో ప్రసారమవుతున్న కార్యక్రమాలకు ర్యాంకులు ఇవ్వడం ద్వారా ప్రకటన కర్తలు తగిన నిర్ణయం తీసుకునేందుకు టామ్ వీలు కల్పిస్తుంది. ముందే చెప్పినట్లు హైదరాబాద్ నగరంలోనూ, 10 లక్షల పైబడిన జనాభా గల నగరాలలోనూ, లక్ష నుంచి 10 లక్షల లోపు జనాభా గల పట్టణాల్లోనూ టీవీ ఛానల్స్ లో ప్రసారమవుతున్న కార్యక్రమాలకు ర్యాంకులు ఇస్తారు.
వయో వర్గాల వారీగానూ, పురుషులు, మహిళలె వేరు వేరుగానూ ఎంతమంది ఏయే ఛానల్ ఎంత సేపు చూస్తున్నారో లెక్కిస్తారు. ఆ విధంగా ఏ ఛానల్ వాటా ఎంత ఉందో తెలుస్తుంది. ఛానల్ వాటాను తెలియజేసే ఈ నాలుగు పట్టికలలో వరసగా హైదరాబాద్ ఫలితాలు, విజయవాడ, విశాఖ నగరాల పరిస్థితి, చిన్న పట్టణాల ఫలితాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ లలో ఛానల్స్ మార్కెట్ వాటా వరసగా తెలుస్తాయి. ఈ పరిశీలనలో కేవలం న్యూస్  ఛానల్స్ పరిస్థితిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు.
రేటింగ్స్ ప్రభావం
ఎంటర్ టైన్ మెంట్ ఛానల్స్ తో పోలిస్తే న్యూస్ ఛానల్స్ వాటా చాలా తక్కువగా ఉంటుంది. వార్తల పట్ల ఆసక్తిచూపే వాళ్లు తక్కువగా ఉండటం ఒక కారణమైతే, పత్రికలు అందుబాటులో ఉండటం మరో కారణం. దృశ్య ప్రధానమైన టీవీని వినోద సాధనంగా పరిగణించడం ఒక కోణమైతే నిరక్షరాస్యులకు కూడా అందుబాటులో ఉండటం మరో కారణం. అన్నింటికంటే ప్రధానమైన అంశం పిల్లలు, మహిళలు ఎక్కువగా టీవీలలో వినోద కార్యక్రమాల పట్ల బాగా మొగ్గుచూపటం. ఎంటర్ టైన్ మెంట్ ఛానల్స్ లో కార్యక్రమాల వైవిధ్యం ఉండటం వలన ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేయటం సులభమవుతుంది. న్యూస్ ఛానల్స్ కు అటువంటి లక్షణం లేదు. ఏదైనా ప్రత్యేకమైన సంఘటన జరిగినప్పుడు తప్ప ప్రతి బులెటిన్ లో ప్రత్యేకత చూపించడం సాధ్యం కాదు. ప్రజలకు అవసరమైన సమాచారం అందించాలన్నది న్యూస్ ఛానల్స్ తపన కావచ్చు గానీ ప్రజలు కోరుకుంటున్నది అందించాలనుకుంటున్న ఎంటర్ టైన్ మెంట్ ఛానల్స్ ఆలోచనే మంచి ఫలితాలనివ్వడం చూస్తున్నాం. అందువల్లనే 24 గంటల న్యూస్ ఛానల్స్ వాటా చాలా పరిమితంగా ఉంటోంది.
లక్ష నుంచి పదిలక్షలలోపు జనాభా ఉన్న ప్రాంతాలను గ్రామీణ ప్రాంతాలుగా టామ్ చెబుతున్నప్పటికీ ఇవి కూడా ఒక మోస్తరు నుంచి భారీ సైజు పట్టణాలే. నిజానికి ఇక్కడి మార్కెట్ మీదనే ప్రకటన కర్తలు ఎక్కువగా దృష్టిసారిస్తారు. నగరాలలో ప్రకటించాల్సిన వస్తువులకు, ఇటువంటి semi-urban ప్రాంతాలలో ప్రకటించాల్సిన వస్తువులకు తేడా ఉంటుంది గనుక ఆ విషయాన్ని ఎప్పుడూ దృష్టిలో పెట్టుకుంటారు. పెరుగుతున్న ఆర్థిక స్థోమత దృష్ట్యా ఇక్కడి ప్రజలకు ఎలాంటి ఆధునిక సౌకర్యాలను పరిచయం చేయాలో గమనించి ఆయా ఉత్పత్తుల ప్రకటనలు జారీ చేస్తారు.
తెలుగు న్యూస్ ఛానల్స్ కు నగరాల్లో కంటే చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ ఆదరణ ఉన్నట్టు అర్ధమవుతుంది. న్యూస్ ఛానల్స్ కు ున్న మార్కెట్ వాటా చాలా తక్కువే అయినప్పటికీ ప్రకటనలు ఎలా వస్తాయి? అన్ని న్యూస్ ఛానల్స్ కలిపి కేవలం నాలుగున్నర శాతం మార్కెట్ వాటా సంపదించుకుంటున్నప్పటికీ ప్రకటనకర్తలు ఎందుకు మొగ్గుచూపుతున్నారు?  ఈ ప్రశ్నలు తలెత్తడం చాలా సహజం. అయితే ఇందుకు సమాధానం ప్రేక్షకుల పరిమాణంతో బాటు నాణ్యతను విశ్లేషించడమే. వార్తలు చూసేది ఎక్కువగా పురుషులేనన్నది అందరూ అంగీకరించాల్సిన నిజం. కొనుగోళ్లను మహిళలు, పిల్లలు కొంత మేరకు ప్రభావితం చేయవచ్చునే తప్ప చాలా సందర్భాల్లో నిర్ణయాధికారం పురుషులదేనని, అందువలన పురుషులను ఆకట్టుకోవడం ముఖ్యమని ప్రకటనకర్తలు భావిస్తున్నారు.  కుటుంబంలో ఐదుగురు సభ్యులుంటే వాళ్లలో కీలకమైన కుటుంబ యజమానిని ఆకట్టుకుంటే చాలునన్న అభిప్రాయమే ఇందుకు కారణం. పురుషులకు మాత్రమే పనికొచ్చే వస్తువుల గురించి ప్రకటనలు ప్రసారం చేయాలన్నా న్యూస్ ఛానల్స్ లో రేటింగ్స్, మార్కెట్ వాటా గురించి పెద్దగా పట్టించుకోకుండానే ప్రకటనలిస్తారు.

ఛానల్స్ ఆలోచనా విధానాన్ని రేటింగ్స్ ఎంతగా ప్రభావితం చేస్తున్నాయంటే రేటింగ్స్ రాని కార్యక్రమాన్ని వెంటనే తొలగిస్తున్నాయి. ఒక  చిన్న ఉదాహరణ చూద్దాం. ఒకప్పుడు జెమినీ టీవీలో శుభోదయం పేరుతో ఒక కార్యక్రమం ప్రసారమయ్యేది. చాలా మంది ఆ ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. ఉదయాన్నేఒక చక్కటి కార్యక్రమాన్ని ఇస్తున్నారంటూ అభినందనలు వచ్చాయే తప్ప రేటింగ్స్ రాలేదు. దాదాపు ఏడాది పాటు ఓపిక పట్టిన యాజమాన్యం యువర్స్ లవింగ్లీలాంటి కార్యక్రమానే పునరుద్ధరించాల్సి వచ్చింది. వాళ్లు అంచనా వేసినట్టే దానికి  మంచి రేటింగ్ వచ్చింది. అయితే, రేటింగ్స్ ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడం లేదా అనే ప్రశ్న ఎదురవుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే వార్తలు చూసే వాళ్లు పదిశఆతం మాత్రమే. వాళ్లకు మాత్రమే శుభోదయం లాంటి కార్యక్రమం నచ్చింది. వినోద కార్యక్రమాలు  చూసే 90శాతం మందికి పెద్దగా నచ్చలేదు. అందుకే రేటింగ్ రాలేదు. (ఇంకా వుంది)

21, నవంబర్ 2013, గురువారం

ఎవరీ అంకుల్ టామ్ ? - 4


అన్న ప్రశ్నకు టెలివిజన్ రంగంలో నిష్ణాతులయిన తోట భావనారాయణ గారు సవివరమైన సమాధానం ఇచ్చారు. నలుగురూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇందులో వున్నాయన్న  ఉద్దేశ్యంతో, ఆయనతో నాకున్న పరిచయాన్ని ఉపయోగించుకుని ఆయన రాసిన ఈ  వ్యాసాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. దీనిపై ‘కాపీ రైట్లు’,  ‘కాపీ కొట్టే రైట్లు’  సమస్తం ఆయనవే. 


(శ్రీ తోట భావనారాయణ)

భారతదేశంలో రేటింగ్స్ 
A.C. Nielsen ఆధ్వర్యంలో ఏర్పాటయిన IMRB సంస్థ TAM (Television Audience Measurement) పేరుతో రేటింగ్స్ నివేదిక రూపొందిస్తుండగా ORG MARG సంస్థ INTAM(Indian National Television Audience Measurement) పేరుతో రేటింగ్స్ నిర్ణయించడం మొదలెట్టింది. దీంతో భారతదేశంలో TAM, INTAM నివేదికలు రెండూ వాడకంలోకి వచ్చాయి. TAM మొదట్లో డైరీ పద్ధతిలో రేటింగ్స్ నిర్ణయించేది. INTAM వాడుతున్న అత్యాధునికమైన Picture Making Technology ప్రస్తుతం 9 దేశాలకు విస్తరించింది. ఈ విధానంలో నిమిష నిమిషానికీ ప్రేక్షకులు ఒక కార్యక్రమం నుంచి మరో కార్యక్రమానికి మారుతున్నా ఆ విషయం స్పష్టంగా నమోదవుతుంది. భారతదేశంలోని 49 నగరాలకు విస్తరించిన INTAM క్రమంగా తన పరిధి పెంచుకుంటూ వచ్చింది. Picture Making విధానం ఉండటం వలన కేబుల్ ఆపరేటర్లు ఛానల్స్ వరుస క్రమాన్ని మాటిమాటికీ మార్చినప్పుడు  కూడా ఛానల్స్ వారీగా వివరాలు ఖచ్చితంగా నమోదు చేయటం సాధ్యమవుతుంది. ఈ వివరాలన్నింటినీ TVPointer పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్ వేర్ రూపంలో చందాదారులకు అందజేయటం INTAM కున్న మరో విశిష్టత.

అయితే TAM, INTAM రేటింగ్స్ లో దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలనే విషయంలో సందిగ్ధత, వివాదం కొనసాగుతూ వచ్చాయి. రెండూ తమ శాంపిల్ సైజ్ ఇంకా పెంచుకోవాలన్నది Indian Broadcasting Foundation (IBF) అభిప్రాయం. టీవీ పరిశ్రమ కష్టనష్టాలను సమీక్షించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న IBF సంస్థ TAM, INTAM రెండూ సమగ్రమైన రేటింగ్స్ ఇవ్వలేకపోతున్నాయని అసంతృప్తి వ్యక్తంచేస్తూ వచ్చింది. లెక్కింపులో అనుసరించాల్సిన సాంకేతిక ప్రమాణాల విషయంలో కూడా ఈ రెండు సంస్థల్లో సారూప్యం కొరవడిందనే అభిప్రాయం ఉంది. చెరో విధానం అవలంబించడం వలన అనవసరమైన గందరగోళం ఏర్పడిందన్న భావం పెరిగింది.
భారత్ వంటి పెద్ద దేశంలో వైవిధ్యం ఎక్కువ ఉండటం వలన శాంపిల్ సైజ్ కూడా ఎక్కువగా ఉన్నప్పుడే అన్ని వర్గాలకూ ప్రాతినిధ్యం కల్పించినట్లవుతుంది. అప్పుడే అర్థవంతమైన రేటింగ్స్ నిర్ణయించడం కుదురుతుంది. పెద్ద పెద్ద నగరాలలో కూడా శాంపిల్ సైజ్ చాలా చిన్నదిగా ఉండటం ఇప్పటికీ సమస్యగానే మిగిలిపోయింది. పైగా హిందీ మాట్లాడే రాష్ట్రాలకున్న ప్రాధాన్యం తూర్పున ఉన్న రాష్ట్రాలకు లేదు. దేశంలో చాలా ప్రాంతాలకు ఇప్పటికీ ప్రాతినిధ్యం లేదు. రాజస్థాన్, హర్యానా, ఒరిస్సాతో పాటు ఈశాన్య రాష్ట్రాలను పట్టించుకోలేదు.
అయితే ప్రభుత్వ అంచనాల ప్రకారం భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో టీవీ ప్రేక్షకులు సంఖ్య 30 కోట్ల మంది. వారిలో కేబుల్, శాటిలైట్ ప్రసారాలు చూసే వారి సంఖ్య 22 కోట్ల మంది. అంటే ఈ రెండు సంస్థలూ ఇంకా పూర్తిస్థాయిలో విస్తరించలేదు అన్నది సుస్పష్టం. ఈ రెండు సంస్థలను పర్యవేక్షించేందుకు ఒక వ్యవస్థ ఉండాలని ఛానల్ యజమానులు కోరుతూ వచ్చారు. కనీసం 75 శాతం మంది ప్రజలను సర్వే పరిధిలోకి తీసుకురావటం, పొరపాట్లు సరిదిద్దడం, అటు యాడ్ ఏజెన్సీలూ, ఇటు ఛానల్ యజమానులూ కలిసికట్టుగా ఉండి ఒకే విధమైన రేటింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకు వచ్చేలా చేయటం  ధ్యేయాలుగా ఉండాలని IBF వాదిస్తూ వచ్చింది. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే  TAM, INTAM రెండూ పోటీ సంస్థలుగా కనిపిస్తున్నప్పటికీ డచ్ సంస్థ VNU కు  TAM  రేటింగ్స్ నడిపే AC NIELSEN లోనూ,  INTAM రేటింగ్స్ ఇచ్చే ORG MARG లోనూ మెజారిటీ వాటా ఉంది. మొత్తమ్మీద INDIAN BROADCASITING FOUNDATION పట్టుబట్టడంతో ఈ రెండు సంస్థలూ కలిసి పనిచేయటం మొదలయింది. ఫలితంగా ఇప్పుడు మనకు TAM రేటింగ్స్ మాత్రం మిగిలాయి.

TAM ప్రతివారం సేకరించిన డేటాను విశ్లేషించి, మార్కెట్లో ఏ ఛానల్ వాటా ఎంత ఉందో తేల్చిచెబుతుంది. ఇందులో వాస్తవం ఎంత అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అన్ని ఛానల్స్ ఈ డేటాను ఆమోదించి తీరాల్సిందే. అందరూ అంగీకరించి చందా కట్టడం వల్ల  TAM ఇచ్చే నివేదిక మీద అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం లేదు. పైగా అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలు కూడా TAM నివేదిక ఆధారంగా ప్రకటనలు ఏ మేరకు ఇవ్వాలో నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రేటింగ్స్ పరిధి విస్తరించాలని మాత్రమే అందరూ కోరుకుంటున్నారు. (ఇంకావుంది)

18, నవంబర్ 2013, సోమవారం

చెవిటిమేళం


ఏకాంబరానికి అనుమానం వచ్చిందే తడవుగా డాక్టర్ దగ్గరకు వెళ్లాడు.
‘మా ఆవిడకు చెవుడు వచ్చిందని నా అనుమానం’ చెప్పాడు డాక్టర్ తో.
‘వోస్ ఇంతేనా! మా పని చెవుడు నయం చేయడమే’ అన్నాడు డాక్టర్.
‘మా ఆవిడ చెవుడు యెంత  ముదిరిందో తెలుసుకునే వీలుందా!’
‘అదేమంత పని. దీనికి చిన్న టెస్ట్ వుంది. మీరే చేసుకుని  మీకు మీరే నిర్ధారణ చేసుకోవచ్చు’
డాక్టర్ చెప్పిన చిట్కా విని ఇంటికి వెళ్లాడు ఏకాంబరం. భార్య వంట గదిలో వుంది.
డాక్టర్ చెప్పినట్టు,  కాస్త ఆమెకు దూరంగా నిలబడి,  ‘ఇవ్వాళ ఏం కూర చేస్తున్నావు’ అని అడిగాడు.
ఏదో గొణుగుతున్నట్టు పెదాలు కదిలాయి కాని ఆమె దగ్గరనుంచి సమాధానం లేదు.
ఏకాంబరం ఆమెకు మరింత దగ్గరగా జరిగి ‘ఏం కూర’ అంటూ మళ్ళీ అదే ప్రశ్న వేసాడు. అప్పుడూ ఆమెనుంచి స్పందన లేదు. ఇంకాస్త దగ్గరకు వెళ్ళి డాక్టర్ చెప్పినట్టే మళ్ళీ అదే అడిగాడు.
ఈసారి ఏకాంబరం భార్య నుంచి ఠకీమని  జవాబు వచ్చింది.
‘ఏం కూర ఏం కూర అని మూడు సార్లు అడిగారు. వంకాయ కూర అని మూడుసార్లూ  నెత్తీ నోరూ కొట్టుకుంటూ చెప్పాను. మీకేదో చెవుడు వచ్చినట్టుంది. ముందు పోయి ఏ డాక్టర్ కన్నా చూపించుకోండి’



(నెట్లో ‘జోక్కి ‘ స్వేఛ్చానువాదం)

(Courtesy image owner - 18-11-2013)

నడకే మంత్రము



విజయసాధనకు వేసే ప్రతి అడుగు విశ్వాసంతో తొణికిసలాడాలి. గందరగోళంతో కూడిన వురుకులు పరుగులకంటే నమ్మకం నిండిన నడకే ముందుగా గమ్యానికి చేరుస్తుంది. 


(Courtesy image owner)
    

సరైన తరుణం


ఇరవై ఏళ్ళ క్రితం మనం ఒక మొక్కను నాటివుంటే అది ఇప్పటికల్లా ఫలితాలను ఇస్తూ వుండేది. అయితే  అప్పుడు నాటలేదని చింతిస్తూ కూర్చోనక్కరలేదు. ఇప్పుడు కూడా ఆ పనిచేయవచ్చు. మొక్కలు నాటడానికి తరుణం మించిపోవడం అంటూ వుండదు. ఈరోజు ఒక మొక్కను నాటుతున్నాము అంటే  భవిష్యత్ తరానికి ‘పచ్చని’ ఆస్తులు పంచుతున్నట్టే లెక్క. పైగా ఈ ఆస్తులకు పన్నుల బాధాలేదు, పంపకాల ప్రయాసా వుండదు. 


(Courtesy image owner)

ఎవరు గొప్ప


సజావుగా నడవడానికి రెండు పాదాలు అవసరం. ఒక కాలు ఎత్తి ముందుకు వేస్తున్నప్పుడు రెండో కాలు వెనుకే వుండిపోతుంది. దాన్ని చూసి ముందు కాలు నవ్వుకోవడం అంటే నగుబాటు కావడమే. ఎందుకంటే రెండో కాలు ఎత్తి అడుగు ముందుకు వేసినప్పుడు మొదటి అడుగు వేసిన పాదం వెనుకే వుండిపోతుంది. కాబట్టి నేనే ముందు, నాదే ముందడుగు అని భేషజాలకు పోవడం శుద్ధ దండుగ. మానవ జీవన యానంలో అందరూ కాస్తా ముందూ వెనుకా. ఆ మాత్రానికే మిడిసిపాటు యెందుకు ?


(Courtesy image owner)



ఇబ్బందులు


కష్టాలు, కడగండ్లు, ఇబ్బందులు ఇక్కట్లు ఇవన్నీ దూది కూరిన బస్తాలవంటివి. దూరం నుంచి చూస్తే యెంత బరువో అనిపిస్తాయి. వాటిని యెలా ఎదుర్కోవాలో తెలిస్తే మాత్రం మొయ్యడం అంత భారం అనిపించదు.



(Courtesy image owner)

17, నవంబర్ 2013, ఆదివారం

ఎవరీ అంకుల్ టామ్ ? - 3


ఎవరీ అంకుల్ టామ్ ? అన్న ప్రశ్నకు టెలివిజన్ రంగంలో నిష్ణాతులయిన తోట భావనారాయణ గారు సవివరమైన సమాధానం ఇచ్చారు. నలుగురూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇందులో వున్నాయన్న  ఉద్దేశ్యంతో, ఆయనతో నాకున్న పరిచయాన్ని ఉపయోగించుకుని ఆయన రాసిన ఈ  వ్యాసాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. దీనిపై ‘కాపీ రైట్లు’,  ‘కాపీ కొట్టే రైట్లు’  సమస్తం ఆయనవే. 


(శ్రీ తోట భావనారాయణ)

రేటింగ్స్ లెక్కింపు విధానం
టీవీ ప్రేక్షకులందరూ ఏయే ఛానల్స్ ఏ సమయంలో ఎంతసేపు చూస్తున్నారన్నది నేరుగా తెలుసుకోవడం సాధ్యమయ్యేపని కాదు. ఎన్నికల సర్వే తరహాలో ఇక్కడ కూడా ఒక శాంపిల్ సర్వే మాత్రమే నిర్వహించడం కుదురుతుంది. ఒక శాంపిల్ సైజ్ నిర్ధారించుకుని, వాళ్లు ఎంతసేపు ఏ ఛానల్ చూస్తున్నారో లెక్కించి, ఆ ఫలితాలను మొత్తం ప్రేక్షకులకు వర్తింపచేయటమే రేటింగ్స్ పని. శాంపిల్ గా ఎంచుకున్న ప్రేక్షకుల ఇళ్లలో టీవీ మీద మీటర్లు పెట్టి, అన్ని మీటర్లలోని సమాచారాన్ని ఆయా ఛానల్స్ ప్రసారం చేస్తున్న కార్యక్రమాల డేటాకు జత చేసి ఏ కార్యక్రమాన్ని ఎవరు ఎంతసేపు చూశారో విశ్లేషిస్తారు. Nielsen సంస్థ  అమెరికాలో 5 వేల ఇళ్లను శాంపిల్ గా తీసుకుంది. నిజానికి అమెరికాలో పదికోట్ల టీవీలు ఉన్నప్పటికీ 5 వేల శాంపిల్స్ మాత్రమే తీసుకోవటం చాలా తక్కువగానే కనిపిస్తుంది. అయితే  ఆ ఐదువేల ఇళ్లు మొత్తం జనాభాకు ప్రాతినిధ్యం వహించేందుకు వీలుగా ఉన్నాయని నీల్సన్ సంస్థ  తమ ఎంపికను సమర్ధించుకుంటోంది.

ఈ మీటర్ వలన ఏ ఛానల్ ఎంత సేపు చూశారన్నదే తెలుస్తుంది. ఎవరు చూశారో తెలియదు. ఏ వయోవర్గానికి చెందిన వారు చూశారో, వారు పురుషులో, స్త్రీలో తెలియదు. అందుకే ఈ సమాచారం కోసం మరో ఏర్పాటు అనివార్యమయింది. ఈ ఇళ్లలో టీవీల దగ్గర మరో చిన్న బాక్స్ అమర్చాల్సి వచ్చింది ఎవరు చూడటం మొదలెట్టినా ఆన్ బటన్ నొక్కాలి. కుటుంబ సభ్యులందరికీ వేరు వేరుగా ఆన్, ఆఫ్  బటన్స్ ఉంటాయి. అందువలన ఎవరు టీవీ చూడబోతుంటే వాళ్లు వెళ్లి టీవీ ఆన్ చేసి కూర్చుంటారు. చూడటం ఆపేసి వెళ్లాలనుకున్నప్పుడు ఆఫ్ చేసి వెళ్తారు. ఆ విధంగా ఆ కుటుంబంలోని ఫలానా సభ్యుడు ఫలానా సమయం నుంచి ఫలానా సమయం వరకు టీవీ చూసినట్లు నమోదవుతుంది. దీని ఆధారంగా వివిధ వయోవర్గాల వారు టీవీ చూసిన సమయాన్ని లెక్కగడతారు.
ఇదంతా ఒక వంతయితే ఫోన్ సాయంతో సమాచారం సేకరించడం మరో వంతు. Nielsen సంస్థ వేలాది మంది ఇళ్లకు ఫోన్ చేసి ఆ సమయంలో వాళ్లు టీవీ చూస్తున్నారా, చూస్తుంటే ఏ కార్యక్రమం చూస్తున్నారు అనే సమాచారం సేకరిస్తుంది. ఈ సమాచారాన్ని తమ మీటర్ల సమాచారంతో సరిపోల్చుకోవటం కూడా గమనించవచ్చు. ఈ సమాచారాన్ని విశ్లేషించి ప్రతి ఛానల్ లో ప్రతి కార్యక్రమాన్ని ఎవరెవరు ఎంత సేపు చూశారో ఒక నివేదిక తయారుచేస్తారు.  ఇందులో మొదటి దశలో ప్రాథమిక సర్వే జరుగుతుంది. ఇది కొంత భారీ స్థాయిలోనే జరుగుతుంది. దీని వలన రేటింగ్స్ కు సరిపడే ప్రతినిధులు ఎవరనే విషయం తేలుతుంది. ఆ తరువాత, ప్రాతినిధ్యపు టీవీ యజమానుల ఇళ్లకు వెళ్లి, వాళ్లకు నచ్చజెప్పి, సర్వేకు సహకరించాల్సిందిగా  కోరతారు. వాళ్ల ఇంట్లో మీటర్, దానికి అనుసంధానంగా ఒక టెలిఫోన్ సెట్ పెట్టుకునేందుకు కూడా అనుమతి తీసుకుంటారు. అలా ఏర్పాటు చేసిన మీటర్, టెలిఫోన్ సాయంతో కేంద్ర కార్యాలయానికి ఏరోజుకారోజు పూర్తిస్థాయిలో డేటా అందుతుంది. అదే సమయంలో టీవీ కేంద్రాల వారి కార్యక్రమాల వివరాలు కూడా కేంద్ర కార్యాలయం అందుకుంటుంది. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఏ కార్యక్రమాన్ని ఎవరెవరు ఎంత సేపు చూశారో లెక్కించి, దాన్ని మొత్తం ప్రేక్షకులకు వర్తింపచేసి సమగ్ర సమాచారాన్ని టీవీ సంస్థల కంప్యూటర్లకు అందజేయటం ఆఖరి దశ.

దీని ఆధారంగా మొత్తం ప్రేక్షకులలో ఎంత శాతం మంది ఏ ఛానల్ చూస్తున్నారో కూడా లెక్కగట్టే వీలుంది. ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉన్నట్టు తేలిన కార్యక్రమాలకు ఎక్కువ ప్రకటనలు వస్తాయి. ఎక్కువ ప్రకటనలు వచ్చే కార్యక్రమాన్ని మరింత నాణ్యంగా రూపొందించేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తుంది. రేటింగ్స్ ఆధారంగానే ఛానల్ యజమానులు ఆయా కార్యక్రమాల్లో ఇచ్చే ప్రకటనలకు రేట్లు నిర్ణయించి వసూలు చేస్తారు. (ఇంకావుంది)

16, నవంబర్ 2013, శనివారం

ఎవరీ అంకుల్ టామ్ ? - 2


(ఎవరీ అంకుల్ టామ్ ? అన్న ప్రశ్నకు టెలివిజన్ రంగంలో నిష్ణాతులయిన తోట భావనారాయణ గారు సవివరమైన సమాధానం ఇచ్చారు. నలుగురూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇందులో వున్నాయన్న  ఉద్దేశ్యంతో, ఆయనతో నాకున్న పరిచయాన్ని ఉపయోగించుకుని ఆయన రాసిన ఈ  వ్యాసాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. దీనిపై ‘కాపీ రైట్లు’,  ‘కాపీ కొట్టే రైట్లు’  సమస్తం ఆయనవే. అంటే కింద ఫోటోలో కనిపిస్తున్న తోట భావనారాయణ గారివే)

  

ఎ.సి నీల్సన్ కంపెనీ ( AC Nielsen Company ) : రేటింగ్స్ మాట వినగానే గుర్తుకొచ్చేది ఎ.సి.నీల్సన్ కంపెనీ. ఈ సంస్థ నీల్సన్ మీడియా రీసెర్చ్ పేరుతో మార్కెట్ విశ్లేషణ మీద దృష్టి సారించింది. 1923లో ప్రారంభమైనప్పటికీ,  1930 తర్వాతే ప్రేక్షకుల మీద అధ్యయనం మొదలెట్టింది. అప్పట్లో రేడియో శ్రోతలతో దీన్ని
మొదలుపెట్టింది. ఏ ఫ్రీక్వెన్సీని శ్రోతలు ఎంతసేపు వింటున్నారో సర్వే చేయటం ద్వారా కార్యక్రమ నిర్వాహకులకూ, ప్రకటన కర్తలకూ ఈ సమాచారాన్ని అందజేయటం దీని పని. అయితే పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు విడివిడిగా ఎవరు వింటున్నారో తెలుసుకునే సౌకర్యం మాత్రం లేదు. అప్పటివరకు కొంత మంది శ్రోతలకు డైరీ ఇచ్చి, వాళ్ళచేత నమోదు చేయించే విధానం అమలులో ఉంది. శ్రోతల ఆసక్తి, నిజాయితీ, అందుబాటు అనే మూడు ప్రధాన అంశాల మీద ఆధారపడి రేటింగ్ నిర్ణయించడం కన్నా ఆటోమేటిక్ గా ఏ ఫ్రీక్వెన్సీ ఎంతసేపు ఆన్ చేసి ఉందో తెలుసుకోవడమే మెరుగైన, కచ్చితమైన విధానమనే అభిప్రాయం కలగడానికి నీల్సన్ సంస్థ దోహదం చేసింది.
కొద్దిపాటి పరిశోధన, మార్పుల అనంతరం Nielsen Audi meter సిద్ధమైంది. అమెరికా తూర్పు ప్రాంతంలోని 800 ఇళ్లను శాంపిల్ గా తీసుకుని సర్వే చేపట్టారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రేడియోల వినియోగంతో పాటు శాంపిల్ సైజ్ కూడా గణనీయంగా పెరిగింది.  1949  నాటికి 97 శాతం అమెరికన్ రేడియో శ్రోతలకు ప్రాతినిధ్యం వహించే సరైన శాంపిల్ సైజ్ తయారయింది. అదే సమయంలో మరో పోటీ సంస్థ రేడియో రేటింగ్స్ రంగం నుంచి తప్పుకుంది. దీంతో Nielsen సంస్థకు డిమాండ్ మరింత పెరిగ చందాదారులు ఎక్కువయ్యారు. చందాదారులు  చెల్లించే డిపాజిట్లు ప్రధాన ఆదాయ వనరు కావడంతో కొత్త డిపాజిట్ల ఫలితంగా Nielsen శాంపిల్ సైజ్ ఇంకా పెంచుకోగలిగింది. మరోవైపు టెలివిజన్ రంగం విస్తరించడం ఎక్కువైంది. రేడియోను పక్కనపెట్టి టీవీ మీద దృష్టి సారించిన నీల్సన్ సంస్థ  1964 నాటికి రేడియోను పూర్తిగా వదులుకుంది.
ఆన్ చేయడం, ఆఫ్ చేయడం మొదలుకుని టీవీ ఛానల్స్ మారుస్తూ ఉన్నప్పుడు సైతం సమగ్రంగా సమాచారం నమోదు చేయగలిగే పరికరాన్ని రూపొందించడంతో సంస్థ విజయం సాధించింది. ఈ సమాచారన్ని ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి పంపేందుకు ప్రత్యేకమయిన టెలిఫోన్ లైన్లు కూడా లీజుకు తీసుకోవడం మరో ప్రత్యేకత. నీల్సన్ బ్లాక్ బాక్స్  ( Nielsen Black Box ) పేరుతో ప్రసిద్ధమైన ఈ మీటర్లు టెలివిజన్ రేటింగ్ లెక్కగట్టడంలో కీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చాయి. అయితే ఏ టీవీ కార్యక్రమాలు ఎంతసేపు చూస్తున్నారన్న విషయాలు మాత్రమే ఇందులో నమోదయ్యే అవకాశం ఉండగా ఏయే వర్గం వారు ఆ కార్యక్రమాలు చూస్తున్నారు? వారిలో స్త్రీలెంత మంది? పురుషులెంత మంది? అనే విషయాలు మాత్రం స్పష్టంగా తెలిసే అవకాశం లేకపోవటం ఒక లోటుగా కనిపించింది. ఇందుకోసం ప్రత్యేకంగా డైరీలు వాడటం మొదలెట్టారు.
కొంత మంది ప్రేక్షకుల ఇళ్లలో ఈ డైరీలు ఉంచి అందులో వివరాలు నమోదు చేయాలని కోరేవారు. టీవీ ఆన్ చేసిన ప్రతిసారీ ఏ ఛానల్ ఎంతసేపు ఎవరెవరు చూసారో అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది యంత్రసాయంతో జరిగేది కాదు గనుక శాంపిల్ సైజు చాలా తక్కువగా ఉంటుంది. పైగా అందరూ శ్రద్ధగా నమోదు చేయకపోతే ప్రయోజనం ఉండదు.

సామాన్య ప్రేక్షకులకు వీరు ప్రతినిధులు కాకపోవచ్చుననేది మరో వాదన. ఈ విధానం లోపభూయిష్టమైనదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇందుకు కారణం నీల్సన్ సంస్థ వారి పీపుల్స్ మీటర్స్ ఇచ్చిన డేటాకు, డైరీల డేటాకు పొంతన లేకపోవటమే. సహజంగానే పరిశ్రమలో ఇదొక వివాదాస్పద అంశంగా మారింది. రేటింగ్స్ ఆధారంగానే ప్రకటనల రేట్లలో బేరసారాలు జ
రుగుతాయి కనక ఇందులో తేడాల వలన చాలా ఇబ్బందులొచ్చిపడ్డాయి. ఏమైనప్పటికీ ఈ వివాదాల మధ్యలో రేటింగ్స్ ఇచ్చేందుకు మరికొన్ని చిన్నాచితకా సంస్థలు ముందుకొచ్చినా ఈ రంగంలో ఒక్కరే ఉండటం సమంజసమని, అన్ని టీవీలూ అదే సంస్థ రేటింగ్స్ ను ప్రామాణికంగా తీసుకోవడం మంచిదనే విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది. ఆ విధంగా నీల్సన్ వారి పీపుల్స్ మీటర్ విధానానికే అమెరికన్ ఛానల్స్ పట్టం కట్టాయి.  Nielsen Television Index ( NTI )  పేరుతో ఇస్తున్న రేటింగ్స్ అక్కడ ప్రామాణికంగా మారాయి. (ఇంకా వుంది)
(16-11-2013)

15, నవంబర్ 2013, శుక్రవారం

ఎవరీ అంకుల్ టామ్ ?


ఎవరీ అంకుల్ టామ్ ? అన్న ప్రశ్నకు టెలివిజన్ రంగంలో నిష్ణాతులయిన తోట భావనారాయణ గారు సవివరమైన సమాధానం ఇచ్చారు. నలుగురూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇందులో వున్నాయన్న  ఉద్దేశ్యంతో, ఆయనతో నాకున్న పరిచయాన్ని ఉపయోగించుకుని ఆయన రాసిన ఈ  వ్యాసాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. దీనిపై ‘కాపీ రైట్లు’,  ‘కాపీ కొట్టే రైట్లు’  సమస్తం ఆయనవే.


(శ్రీ తోట భావనారాయణ)

పత్రికల ప్రజాదరణ లెక్కించడానికి అవి అమ్ముడుపోయే ప్రతుల సంఖ్యను ఆధారంగా తీసుకుంటారు ఆడిట్ బ్యూర్ ఆఫ్ సర్క్యులేషన్ ( ABC ) సంస్థ ప్రతి ఆరునెలలకొకసారి లెక్కలు వేసి ఈ సంఖ్యలను నిర్ధారిస్తుంది. స్థూలంగా ఈ సమాచారం ఆధారంగా పత్రికలకు ప్రకటనలిచ్చే వారు నిర్ణయం తీసుకుంటారు. అదే విధంగా ఒక్కో పత్రిక ఎంత మంది చదువుతున్నారో అంచనా వేసేందుకు నేషనల్ రీడర్ షిప్ సర్వే( NRS ) పేరిట మరో అధ్యయనం కూడా జరుగుతుంది.
అయితే టెలివిజన్ ఛానల్స్ కార్యక్రమాల విషయంలో మాత్రం  ప్రత్యేకమయిన లెక్కింపు విధానాన్ని అనుసరించాల్సి వస్తుంది.  సర్వే పద్ధతిలో కొన్ని ఎంపిక చేసిన శాంపిల్స్ ఆధారంగా వివిధ ఛానల్స్ లో ప్రసారమయ్యే వివిధ కార్యక్రమాల ఆదరణ అంచనా వేస్తారు. దీన్ని నిర్వహించే TAM India  సంస్థ ఇచ్చే రేటింగ్స్ ఆధారంగా ప్రకటన కర్తలు ఆయా ఛానల్స్ లో ఆయా కార్యక్రమాల సమయంలో ఆ సంస్థలు నిర్దేశించిన రేట్ల ప్రకారం ప్రకటనలు ఇవ్వటానికి సిద్ధపడతారు.
ఒక నిర్ధిష్ట సమయంలో టీవీ చూస్తున్న ప్రేక్షకులందరిలో ఆ కార్యక్రమం చూస్తున్న వారి శాతమే స్థూలంగా రేటింగ్ అని చెప్పవచ్చు. ఒక నిర్దిష్టమైన సమయంలో ఉన్న ప్రేక్షకుల మొత్తం సంఖ్యను శాంపిల్స్ ను దృష్టిలో ఉంచుకుని రేటింగ్స్ నిర్ణయిస్తారు. ఒక ఛానల్ లో వారం మొత్తంలో సంపాదించిన రేటింగ్స్ మొత్తమే స్థూల రేటింగ్ పాయింట్లు (Gross Rating Points – GRPs ) అంటారు. ఉదాహరణకు ఒక వారంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రసారమయ్యే అన్ని ఛానల్స్  జిఆర్ పిలలో ఒక నిర్ధిష్టమైన ఛానల్ సంపాదించిన జిఆర్ పిల మొత్తాన్ని మార్కెట్ వాటాగా చెబుతారు. ప్రకటనలిచ్చే వాళ్లకు సౌకర్యంగా ఉండటానికి వీలుగా స్త్రీ పురుషులను వివిధ వయో వర్గాలుగా  విభజించి రేటింగ్స్ తీస్తారు. అందువలన ఒక కార్యక్రమానికి మహిళల నుంచి లేదా పురుషుల నుంచి లేదా పిల్లల నుంచి ప్రత్యేకమైన ఆదరణ ఉంటే రేటింగ్స్ లో ఆ విషయం స్పష్టమవుతుంది. (ఇంకా వుంది)
(15-11-2013)

Telugu TV