31, ఆగస్టు 2018, శుక్రవారం

నాన్నకి ప్రేమతో....



క్యాబ్ డ్రైవర్లలో కొందరు హుషారు మనుషులు వుంటారు. కార్లో ప్రయాణం చేస్తున్నంత సేపూ ఏదో ఒకటి మాట్లాడుతూనే వుంటారు. రాత్రి వచ్చిన టీవీ ఛానల్ కారు డ్రైవర్ ఈ మాదిరే. కారు ప్రమాదంలో హరికృష్ణ దుర్మరణం గురించి చెబుతూ ఆయన వెనక్కి తిరిగి నీళ్ళ బాటిల్ అందుకోబోయే సమయంలో రెప్పపాటులో ప్రమాదం జరిగిందని అంటూ ఆ సీను రిప్లే చేసే ప్రయత్నం చేస్తుంటే ఆపి, ‘అసలు మీ కుటుంబం ఏమిటి, సంపాదన సరిపోతుందా’ అనే ప్రశ్నలు వేస్తూ సంభాషణను జయప్రదంగా దారి మళ్ళించాను. కానీ అతడు చెప్పిన సంగతులు వింటే ఏ తండ్రికి అయినా ఇలాంటి కొడుకు వుంటే బాగుంటుందనిపించింది.
పేద కుటుంబంలో పుట్టాడు. ఒక్కడే కొడుకు. చదువు సరిగా అబ్బక పోవడంతో సంసారం నడపడానికి స్టీరింగ్ చేతబట్టాడు. తండ్రికి వేరే సంపాదన లేదు. టాక్సీ నడిపిన రోజుల్లో బాగానే గిట్టుబాటయ్యేది. ఒక్కోసారి రోజువారీ ఆదాయం వేలల్లో వుండేదిట. సంసారం కాస్త తెరిపిన పడింది. దేశంలో తిరగని ఊళ్ళు లేవు.
రోజులు ఎప్పుడూ ఒకలా వుండవు. తండ్రికి జబ్బు చేసింది. ఏ క్షణాన ఆసుపత్రికి తీసుకువెళ్ళాలో తెలవదు. దేశం పట్టుకుని తిరుగుతూవుంటే సంపాదన బాగా ఉండొచ్చు కానీ, ఇంట్లో ఏదైనా అవసరం పడితే చప్పున రావడం కష్టం. అందుకని రాబడి తగ్గినా పరవాలేదనుకుని హైదరాబాదులోనే ఉండేలా ట్రావెల్స్ లో చేరాడుట.
‘నాకు మా నాన్న ఆరోగ్యం ముఖ్యం. సంపాదన కానీ, ఏదైనా కానీ దాని తర్వాతే’ అన్నాడు నెమ్మదిగా.
వెనక సీట్లో కూర్చోవడం వల్ల అతడి మొహం నాకూ, నా మొహం అతడికీ కనబడే వీలు లేదు.


కానీ నాకు మల్లేనే అతడి కళ్ళు చెమ్మగిల్లి వుంటాయి.

నిజం లాంటి అబద్ధం – భండారు శ్రీనివాసరావు



‘ఓ నిజం చెప్పనా?’ అంది నిజం.
నిజమే స్వయంగా ఓ నిజం చెబుతున్నప్పుడు దాన్ని నమ్మనివాళ్ళు ఎవరుంటారు.
‘నన్నూ ఓ నిజం చెప్పమంటారా?, నేనూ, నిజమూ మా చిన్నప్పటి నుంచీ దోస్తులం”
అంది పక్కనే వున్న అబద్ధం, అది శుద్ధ అబద్ధమని తెలిసికూడా.
కానీ అబద్ధం చెప్పిన మాట నిజమని నమ్మేసింది, నిజం  అమాయకంగా.
అప్పట్నించి నిజం అబద్ధంతో స్నేహం చేయడం మొదలెట్టింది.
అలా కొన్నాళ్ళు గడిచాయి.
నిజం తనను నిజంగా నమ్ముతోందని ధ్రువపరచుకున్న తర్వాత  అబద్ధం ఓరోజు నిజాన్ని అడిగింది ‘అలా సరదాగా అడవిలో   షికారుకు  వెళ్లివద్దామా’ అని.
సరే అని నిజం అబద్ధం వెంట అడవికి వెళ్ళింది.  చాలా దూరం వెళ్ళిన తర్వాత వారికి ఓ సరస్సు కనిపించింది. అందులోకి దిగితే తిరిగి ప్రాణాలతో బయటకి రాలేరు. ఈ నిజం అబద్ధానికి తెలుసు. అయినా ఆ విషయం నిజానికి చెప్పకుండా దాచింది.
ఇద్దరూ స్నానం చెయ్యడానికి దుస్తులు విప్పి ఒడ్డున పెట్టారు. నిజం ముందుగా నీళ్ళల్లోకి దిగింది.
అబద్ధం తెలివిగా ఒడ్డున వదిలేసిన నిజం దుస్తులు తాను ధరించి సరస్సులోకి దిగకుండా వెనక్కి  వచ్చేసింది. నిజం ఆసరస్సులోనే వుండిపోయింది.
అప్పటినుంచి అబద్ధం తాను  వేసుకున్న నిజం దుస్తులతో తానే నిజాన్నని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం మొదలు పెట్టింది. ఆ విధంగా కొన్నాళ్ళకు  అబద్ధమే నిజంగా చెలామణిలోకి వచ్చింది.
అంటే ఈ రోజు మనకు కనిపించే, వినిపించే నిజం, నిజానికి  నిజం కాదు, అబద్ధం చెప్పే నిజం మాత్రమే.  
(ఒక ఇంగ్లీష్ కధనానికి స్వేచ్చానువాదం )    

25, ఆగస్టు 2018, శనివారం

సరదాకు మాత్రమే! – భండారు శ్రీనివాసరావు


ఒక రకంగా బాగానే వుందనిపించింది
ఈరోజు ఒక టీవీలో చర్చాకార్యక్రమం నిర్వాహకుడు చర్చలో పాల్గొంటున్న ఒకరిని ఇలా సంబోధించారు.
“ఒకప్పటి టీడీపీ నాయకుడిగా, ప్రస్తుత టీఆర్ఎస్ నాయకుడిగా ఈ అంశంపై మీ అభిప్రాయం చెప్పండి”
సరదాగా చేసిన ఈ పరిచయ వాక్యం అందర్నీ నవ్వించింది. నిజానికి సీరియస్ చర్చల్లో అప్పుడప్పుడూ ఇలాంటి చమక్కులు అవసరం కూడా.
అయితే, ఇలాటి పరిచయాలు చేయాల్సివస్తే పాల్గొనే వాళ్లకి కొంత ఇబ్బందే. ఉదాహరణకు:


“ఒకప్పుడు మీరు కాంగ్రెస్. తరువాత టీడీపీలో చేరారు. కొంతకాలం తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. కొద్దిరోజులకే ఎన్నికలు రావడం, మీరు టీఆర్ఎస్ లో చేరడం జరిగిపోయాయి. రాష్ట్రం విడిపోవడంతో వైసీపీలో చేరి గెలిచిన తర్వాత టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు ముందు మరో కొత్త పార్టీ జనసేనలోనో, లేదా మరింత తాజాగా పెట్టిన పేరుపెట్టని మరో పార్తీలోనో చేరుతారనే వార్తలు వినవస్తున్నాయి. ఈ అనుభవ నేపధ్యంలో ఈ అంశంపై మీరు యేమని అనుకుంటున్నారు”

21, ఆగస్టు 2018, మంగళవారం

టీవీ చర్చలు అవగాహన కలిగించేలా వుండాలి – భండారు శ్రీనివాసరావు



రాత్రి ఒక టీవీ అమరావతి బాండ్లు గురించిన చక్కటి అంశాన్ని చర్చకు తీసుకుంది. మూడు ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ముగ్గురూ ఘనాపాటీలే. విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళే. ఎవరి వాదాన్ని వాళ్ళు వినిపించడమో, తమకు తెలిసిన దాన్ని వివరించడమో చేస్తే బాగుండేది. ఎంతసేపటికీ ఎదుటివాళ్ళ వాదాన్ని పూర్వపక్షం చేయడానికే సమయాన్ని వినియోగించుకున్నట్టు అనిపించింది. టీవీలు చూసేవారిలో ఆయా పార్టీల అభిమానులకు వారి భాషణలు ఆనందం కలిగించి ఉండవచ్చు. కానీ విషయం పట్ల అవగాహన పెంచుకోవడానికి కొంతమందయినా టీవీ చర్చలు చూస్తారు. వారికి మాత్రం నిరాశ మిగిలిందనే చెప్పాలి. చర్చకు ముందు మనసులో మెదిలిన సందేహాలు మరిన్ని పెరిగాయి కానీ నివృత్తి కాలేదని గట్టిగా చెప్పొచ్చు.  

19, ఆగస్టు 2018, ఆదివారం

కధకు ప్రాణం పోసి కధగా మిగిలిన వేదగిరి రాంబాబు – భండారు శ్రీనివాసరావు


ఇంకా ఎందరో వుండి ఉండొచ్చు. కానీ నాకు తెలిసి ముగ్గురే ముగ్గురు నా తరం వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, నేను కలిసి పనిచేసిన వాళ్ళు. ఈ మువ్వురూ ఏనాడూ ఎవరి దగ్గరా నెల జీతం తీసుకుని ఉద్యోగం చేసి ఎరుగరు. ఒకరు సురమౌళి, రెండో వారు గుడిపూడి శ్రీహరి, మూడో వ్యక్తి వేదగిరి రాంబాబు. మొదటి ఇద్దరూ తమ రచనావ్యాసంగంతో పాటు రేడియోలో అప్పుడప్పుడూ ప్రాంతీయ వార్తలు చదివేవాళ్ళు. ఇక రాంబాబు. రేడియోలో పనిచేసే ఉద్యోగులన్నా రాకపోవచ్చు కానీ వేదగిరి రాంబాబు మాత్రం సదా రేడియో ఆవరణలోనే కనిపించేవాడు. రేడియోకి సంబంధించిన ఏ విభాగానికి ఏ రచన అవసరమైనా రాంబాబు తక్షణం ఆ అవసరం తీర్చేవాడు. కాంట్రాక్టు ఉందా లేదా, డబ్బులు ఇస్తారా లేదా అనేదానితో నిమిత్తం లేకుండా ఎవరికి ఏది అవసరం అయినా రాంబాబు తన ఆపన్న హస్తం అందించేవాడు.
ఇక తెలుగు కధ అంటే చాలు ముందుగా జ్ఞాపకం వచ్చే పేరు వేదగిరి రాంబాబు. ఎవరయినా తాము రాసినదానిని ఎవరికో ఒకరికి అంకితం ఇస్తారు. రాంబాబు మాత్రం కధల మీది వ్యామోహంతో మొత్తం తన జీవితాన్నే కధకు అంకితం చేసాడు. ఈ క్రమంలో ఏం సుఖపడ్డాడో తెలియదు కానీ అనేక కష్టాలు పడిఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అందుకే కాబోలు తనవంతుగా ‘తెలుగు కధ’ కన్నీరుమున్నీరవుతోంది రాంబాబు ఇక లేడని తెలిసి.     

18, ఆగస్టు 2018, శనివారం

హుందాతనం అంటే......ఇదీ!

భారత ప్రధమ ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మరణించారు. దేశం యావత్తూ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ రోజుల్లో అటల్ బిహారీ వాజ్ పాయ్ ప్రతిపక్ష జన సంఘ్ నాయకుడు. నెహ్రూ కాంగ్రెస్ కూ వాజ పాయ్ జన సంఘ్ కూ అన్ని విషయాల్లో చుక్కెదురు. 


అయినా  నెహ్రూ  గురించి వాజ్ పాయ్  ఏమన్నారో తెలుసుకుంటే ఆయన హుందాతనం బోధపడుతుంది. 
Sir, a dream has been shattered, a song silenced, a flame has vanished in the infinite. It was the dream of a world without fear and without hunger, it was the song of an epic that had the echo of the Gita and the fragrance of the rose. It was the flame of a lamp that burnt all night, fought with every darkness, showed us the way, and one morning attained Nirvana.
Death is certain, the body is ephemeral. The golden body that yesterday we consigned to the funeral pyre of sandalwood was bound to end. But did death have to come so stealthily? When friends were asleep and guards were slack, we were robbed of a priceless gift of life.
Bharat Mata is stricken with grief today — she has lost her favourite prince. Humanity is sad today — it has lost its devotee. Peace is restless today — its protector is no more. The down-trodden have lost their refuge. The common man has lost the light in his eyes. The curtain has come down. The leading actor on the stage of the world displayed his final role and taken the bow.


NOTE:  Link provided by Sri Vinnakota Narasimha Rao    

17, ఆగస్టు 2018, శుక్రవారం

రాజకీయాల్లో అస్తమించిన హుందాతనం – భండారు శ్రీనివాసరావు


అటల్ బిహారీ వాజ్ పాయ్ విదేశాంగ మంత్రి. అప్పటివరకు ఢిల్లీ సౌత్ బ్లాక్ లో ఉంటూ వచ్చిన నెహ్రూ చిత్రపటం కనబడకపోవడాన్ని ఆయన గమనించారు. నెహ్రూ ఫోటోను తక్షణం అక్కడ పెట్టాలని ఆదేశించడం, అది అమలుకావడం జరిగింది. ఈ రోజుల్లో ఈ హుందాతనాన్ని ఊహించగలమా?
పార్లమెంటులో ప్రసంగిస్తూ వాజ్ పాయ్ ఆనాటి ప్రధాని నెహ్రూను తీవ్రంగా విమర్శించారు. ఆ సాయంత్రం అటల్ బిహారీ వాజ్ పాయ్ పార్లమెంటు హాలులోకలిసినప్పుడు నెహ్రూ ఆయన భుజం తట్టి ‘బాగా మాట్లాడావు’ అని మెచ్చుకున్నారు. (ఇద్దరూ ఒకరినొకరు ‘గురూజీ’ అని సంబోధించుకునేవారట)  ఈ రోజుల్లో అలాంటి హుందాతనాన్ని ఊహించగలమా!
వాజ్ పాయి ముందు విదేశాంగ మంత్రి అయ్యారు. తరువాత అదే పదవిని పీవీ నరసింహా రావు స్వీకరించారు. వాజ్ పాయి వ్యక్తిగత సిబ్బందిని అందర్నీ కొనసాగించడానికి పీవీ నిర్ణయించారు. ఈరోజుల్లో అలాంటి హుందాతనాన్ని ఊహించగలమా!
ముందు పీవీ ప్రధాని అయ్యారు. తరువాత అదే పదవిని వాజ్ పాయ్ అలంకరించారు. అప్పటికే పీవీ, దేశప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అణుపరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా వాజ్ పాయ్ ప్రభుత్వం వచ్చింది. పీవీ నరసింహా రావు, ఎవరూ గమనించకుండా వాజ్ పాయ్ చేతిలో ఒక చీటీ పెట్టారు. “అణుపరీక్షకు సర్వం సంసిద్ధంగా వుంది. ముందుకు తీసుకు వెళ్ళాల్సిన బాధ్యత మీపై వుంది”
పీవీ సలహాను వాజ్ పాయ్ పాటించారు. పోఖ్రాన్ లో అణుపరీక్షను జయప్రదంగా నిర్వహించారు.
పీవీ మరణించినప్పుడు ఇచ్చిన సంతాప సందేశంలో వాజ్ పాయ్ ఈ సంగతి వెల్లడించేవరకు ఈ విషయం గోప్యంగానే వుంది. ఈ హుందాతనాన్ని నేటి రాజకీయాల్లో ఊహించగలమా!
పీవీ ప్రధానమంత్రి, జెనీవాలో జరిగిన మానవహక్కుల సదస్సుకు అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వాజ్ పాయ్ నాయకత్వంలో భారత ప్రతినిధివర్గాన్ని పంపాలని నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీకి చెందివారిని కాకుండా విపక్షానికి చెందిన వ్యక్తిని  పీవీ ఎంపిక చేయడం ఆ పార్టీవారికి రుచించలేదు. అలాగే బీజేపీ వారికి కూడా వాజ్ పాయ్ ఆ ఆహ్వానాన్ని అంగీకరించడం పట్ల అభ్యంతరాలు వున్నాయి. కానీ భారత ప్రతినిధివర్గం నాయకుడిగా జెనీవా సదస్సులో వాజ్ పాయ్ ప్రసంగించిన తీరు, భారత దేశ విధానాన్ని వ్యక్తం చేసిన పద్దతి ఆ తర్వాత అందరి ఆమోదాన్ని పొందింది. ఈనాటి రాజకీయాల్లో ఇలాంటి హుందాతనాన్ని ఊహించగలమా!
తదనంతర కాలంలో పీవీ రాసిన పుస్తకాన్ని వాజ్ పాయ్ ఆవిష్కరించారు. అలాగే వాజ్ పాయ్ రచించిన కావ్యాన్ని పీవీ ఆవిష్కరించారు.
పాలక, ప్రతిపక్షాలు రెండూ నిప్పూ ఉప్పూ తరహాలో కాట్లాడుకుంటున్న ఈనాటి రాజకీయ వాతావరణంలో ఆనాటి హుందాతనాన్ని ఊహించగలమా!

గత కొన్నేళ్ళుగా వాజ్ పాయ్ మృత్యువు పడగనీడలోనే శేష జీవితాన్ని గడుపుతూ వచ్చారు. నిజానికి మూడు దశాబ్దాల క్రితమే ఆయన మృత్యువుతో ముద్దాడి బయట పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక కవితలో రాసుకున్నారు.
1988లో అటల్ బిహారీ వాజ్ పాయ్ మూత్ర పిండాల వ్యాధి చికిత్స కోసం అమెరికా వెళ్ళారు. ఆ సమయంలో ఆయనకు మరణం తప్పదు అనిపించింది. కవిత రూపంలో తన మనసులోని భావాలను  అక్షరబద్ధం చేసి భారత దేశంలో ఉన్న తన స్నేహితుడు, కవి అయిన ధర్మవీర్ భారతికి పంపారు. అందులో ఇలా రాసుకున్నారు.
“చావుతో పోట్లాడాలని లేదు, కానీ మరణం నా దారికి అడ్డంగా వచ్చింది. తన కౌగిలిలోకి తీసుకుని నా నుదుటిపై ముద్దు పెట్టింది”    
ఒక ఏడాది మాజీ ప్రధాన మంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్ పాయ్ పుట్టిన రోజున ఆయనకు వినూత్నమైన కానుక ఇవ్వాలని ఆకాశవాణి, దూరదర్సన్ లను నిర్వహించే ప్రసార భారతి సంస్థ సంకల్పించింది.
హిందీ భాష మాట్లాడే రాష్ట్రాల నుంచి కొందరు ప్రసిద్ధ కవులను ఢిల్లీకి రప్పించి భారతీయ విద్యా భవన్ లో మూడు రోజులపాటు ప్రత్యేక కవి సమ్మేళనం నిర్వహించింది. వాజ్ పాయ్ రాసిన గేయాల నుంచి కొన్ని పంక్తులను ఒక్కొక్కరికీ ఇచ్చి వాటిని పొందు పరుస్తూ కవితలను రాయించింది. వాజ్ పాయ్ ప్రసిద్ధ గేయాలయిన “కదం మిలాకర్ చల్నా హోగా...” , “ ఆవో ఫిర్ సే జలా దియాయే....” వంటివి వీటిలో వున్నాయి.
ఒక గొప్ప వ్యక్తిని గురించి, అందులోను ఆయన రాసిన కవితల ఆధారంగా గేయ రచన చేయడం ఒక అద్భుతమైన అనుభవం అని ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్న వాళ్ళు చెప్పారు.

లోక్ సభలో బల పరీక్ష సమయంలో ఓటమి తప్పదని  ప్రధానిగా ఉన్న అటల్ బిహారీ వాజ్ పాయ్ కి అర్ధం అయింది. అతి స్వల్ప తేడా వున్నప్పుడు విపక్ష సభ్యులను తమ వైపుకు తిప్పుకునే అనైతిక చర్యలకు వాజ్ పాయ్ సుతరామూ ఇష్టపడలేదు. సొంత పార్టీలోని వారే ఆయన మీద ఒత్తిడి పెంచారు. ప్రభుత్వం పది పోవడం అంటే పార్టీకి కూడా నష్టమే. కొనుగోలు వ్యవహారాలు అనైతికం కావచ్చుకానీ, ఒకరిద్దరు సభ్యులు ఓటింగుకు హాజరు కాకుండా ‘ఫ్లోర్ మేనేజ్ మెంటు’ చేస్తే తప్పేమిటని కొందరు వాదించారు. కానీ వారందరికీ వాజ్ పాయ్ ఇచ్చిన సమాధానం ఒక్కటే.
I want to get defeated instead of defeating the spirit of democracy”
(ప్రజాస్వామ్య స్పూర్తిని ఓడించే బదులు నా ఓటమినే నేను కోరుకుంటాను”
ఈరోజుల్లో ఇలాంటి నిబద్ధతను నాయకుల నుంచి ఆశించే అవకాశం ఉందా!

14, ఆగస్టు 2018, మంగళవారం

విలేకరితో పందెం కాసిన రాహుల్ గాంధి


రాహుల్ గాంధి విలేకరుల గోష్టిలో ఒక సన్నివేశం చోటు చేసుకుంది. విలేకరుల ప్రశ్నల్లో భాగంగా టీవీ 5 ఎక్జిక్యూటివ్ ఎడిటర్ విజయ్ నారాయణ్ రాహుల్ పై ఒక ప్రశ్న సంధించారు, ‘రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ పార్టీకి వంద లేదా అంతకంటే ఎక్కువ స్థానాలు వస్తాయనుకుంటున్నారా’ అని. అంతటితో ఆగకుండా ‘పోనీ, రెండువందలు ప్లస్ రావడానికి ఛాన్సుందా’ అని రెట్టించారు. దాంతో రాహుల్ గాంధీ అక్కడే ఆగిపోయి ‘మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము, మీకేమైనా డౌటా’ అని అడిగారు. రాహుల్ గాంధి తన చేయి పట్టుకుని ‘ఇప్పుడు చెప్పండి, మీ పందెం ఎంత?’ అనడంతో విజయ్ ఒక క్షణం విస్తుపోయారు. వెంటనే తేరుకుని ‘మీరు అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రి అయిన తర్వాత ‘మా టీవీ 5 కి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వాలి’ అని జవాబు చెప్పారు. అది విని రాహుల్ నవ్వుకుంటూ మరో టేబుల్ వైపు వెళ్ళిపోయారు.

(ఎడిటర్స్ మీట్  లో రాహుల్ గాంధీతో నేను)



One scribe asked Rahul. 
'When are you getting married?'
Rahul replied
'I have already married to Congress Party'

12, ఆగస్టు 2018, ఆదివారం

2019 లో ఏపీ ఎన్నికల ఎజెండా ఏమిటి?

ఈరోజు ఆదివారం ఉదయం టీవీ 5 న్యూస్ స్కాన్ చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్న వాళ్ళు: శ్రీ కుటుంబరావు (ఆంధ్రప్రదేశ్ ప్రణాలికా మండలి ఉపాధ్యక్షులు, టీడీపీ), శ్రీ రఘురాం (బీజేపీ, ఢిల్లీ నుంచి), శ్రీ పార్ధసారధి, మాజీ మంత్రి, వైసీపీ). టీవీ 5 ఎక్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీ విజయ్ నారాయణ
YOUTUBE.COM
2019లో ఏపీ ఎన్నికల ఎజెండా ఏంటి? | 2019 Election Strategy | News Scan | TV5 News 'TV5 News' is…

10, ఆగస్టు 2018, శుక్రవారం

"సైకిల్ కాంగ్రెస్" - సాక్షి ఫోర్త్ ఎస్టేట్

గురువారం రాత్రి సాక్షి 'అమర్' ఫోర్త్ ఎస్టేట్ చర్చాకార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నవాళ్ళు: మల్లాది విష్ణు (వైసీపీ), నరహరిశెట్టి నరసింహులు (కాంగ్రెస్), శ్రీపతి రావు (బీజేపీ).
అంశం : "సైకిల్ కాంగ్రెస్"
LINK:
https://www.sakshi.com/video/daily-programmes-fourth-estate/fourth-estate-9th-august-2018-tdp-congress-alliance-1106019

9, ఆగస్టు 2018, గురువారం

రేడియోకి పాదాభివందనం – భండారు శ్రీనివాసరావు

నేను మాస్కోలో రేడియో మాస్కోలో పనిచేసే రోజుల్లో తెలుగు కార్యక్రమాలు శ్రద్ధగా వినే శ్రోతలకు రేడియో తరపున చిన్ని చిన్ని కానుకలు పంపించే సాంప్రదాయం వుండేది.
మన దేశంలో టీవీ దూరదర్సన్ రూపంలో రంగప్రవేశం చేసిన మొదటి సంవత్సరాలలో బాగా కలిగిన వాళ్ళ ఇళ్ళల్లోనే టీవీ సెట్లు కనిపించేవి. ఆదివారం రోజున ఆ లోగిళ్ళు అన్నీ రామాయణ, భారతాల ప్రేక్షకులతో నిండి కనిపించేవి. బాపూ రమణలు మిస్టర్ పెళ్ళాం చిత్రంలో ఇటువంటి సన్నివేశాలను హృద్యంగా జొప్పించారు కూడా.
మరి ఇప్పటికీ వెనుకటి మాదిరిగా రేడియో (ఆకాశవాణి) వింటున్నవాళ్ళు, దూరదర్సన్ చూస్తున్న వాళ్ళు వున్నారా అని కొందరు అమాయకంగా అడుగుతుంటారు. పెద్ద గీత ముందు చిన్న గీత లాగా మునుపటి మాదిరిగా ‘ఈ సంగతి రెడియోలోవిన్నాం’ అని చెప్పేవాళ్ళు అంతగా కనిపించక పోవచ్చుకానీ వినేవాళ్ళు లేకుండా మాత్రం పోలేదు.
రేడియో వినడమే కాదు, రేడియో అంటే ప్రాణం అని చెప్పే ఒక వ్యక్తి ఈరోజు నాకు తారసపడ్డాడు. అతడి మాటల్లో నా ప్రసక్తి వుంది కాబట్టి అది ప్రస్తావించకుండా విషయం వివరించలేని పరిస్తితి నాది. కొంత స్వోత్కర్ష అనిపించినా దానికి మినహాయింపు ఇచ్చి నేను చెప్పే విషయానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని నా వినమ్ర పూర్వక విన్నపం.
ఇవ్వాళ నేనూ మా ఆవిడా తీరి కూర్చుని గిల్లికజ్జాలు పెట్టుకోవడం మంచిది కాదని, ఆ తీరిక సమయాన్ని ఓ సినిమా చూడడంలో గడపాలని నిర్ణయించుకుని దాన్ని తక్షణం అమలుచేసాం. ఒక మాల్ లోని హాల్లో సినిమా చూసి ఇంటికి రావడానికి ఉబెర్ బుక్ చేసుకునే ప్రయత్నంలో వుండగా ఆ వ్యక్తి మా ఆవిడతో మాట్లాడ్డం గమనించాను. రేడియోలో పనిచేసే శ్రీనివాసరావా అని అతడు ఆరా తీయడం కనిపించింది. కన్నుమూసి తెరిచేలోగా అతగాడు అదాటున ముందుకు వంగి నా కాళ్ళకు దణ్ణం పెట్టాడు. నలుగురిలో అతడలా చేయడంతో సిగ్గుతో ముడుచుకుపోయాను.
“ఇది నేను రేడియోకు పెడుతున్న నమస్కారం, వేరేలా అనుకోకండి” అనేశాడు.
తన పేరు సుభాష్ అని, కరీం నగర్ జిల్లా వాసిననీ, ప్రస్తుతం కూకట్ పల్లిలో వుంటున్నాననీ వివరాలు అడగకుండానే చెప్పాడు. రేడియో వినడం చిన్నప్పటి నుంచి తనకు అలవాటని చెబుతూ జేబులోనుంచి ఒక బుల్లి ట్రాన్సిస్టర్ తీసి చూపించాడు. వారానికి రెండు సార్లు వచ్చే వార్తావాహిని, ప్రతి గురువారం వచ్చే జీవన స్రవంతి వినేవాడినన్నాడు. 1989 లో నేను మాస్కో వెళ్లకముందు నేను చేసిన ప్రోగ్రాములు అవి. అంటే దాదాపు మూడు దశాబ్దాలు కావస్తోంది. టీవీల్లో భండారు శ్రీనివాసరావు అని చెబుతూ వుంటారు, అలా చూసి మిమ్మల్ని గుర్తు పట్టాను అని ఒక చిన్న వివరణ ఇచ్చి నా మనసు మూలల్లో తొలుస్తున్న సందేహాన్ని నివృత్తి చేసాడు.
ఆ రేడియో అభిమానితో ఓ సెల్ఫీ దిగాలనిపించింది. కానీ ఆ ప్రక్రియ నాకు రాదు. ఈ లోపల అతడే ఓ సెల్ఫీ తీసుకోవచ్చా అని అడిగి తన సెల్ ఫోన్ తో తీసి ఒకటి నాకు వెంటనే వాట్సప్ లో పంపాడు.
ముందుగా మాస్కో రేడియో ప్రసక్తి ఎందుకు తెచ్చాను అంటే, ఆకాశవాణివాళ్ళు కూడా ఇటువంటి అభిమానులతో కొన్ని ఇంటర్వ్యూలు చేసి ప్రసారం చేస్తే బాగుంటుందని.

కొసమెరుపు: కారెక్కగానే మా ఆవిడ అంది, గిల్లికజ్జాకు ప్రారంభ సూచికగా.
"మీరు రేడియో మనిషని అటు రెడియో వాళ్ళు, ఇటు దూరదర్సన్ వాళ్ళు ఎప్పుడో మరచిపోయారు, కనీసం రేడియో వినే వాళ్ళయినా మిమ్మల్ని గుర్తుంచుకుంటున్నారు, సంతోషించండి"

1, ఆగస్టు 2018, బుధవారం

TIME TO ASK | Big Debate On Water Fight & Controversial Comments By Hari...





మంగళవారం రాత్రి Bharath Today TV నిర్వహించిన 'TIME TO ASK' చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: ఇందిరా శోభన్ (టి. కాంగ్రెస్), సాంబారి సమ్మయ్య (టి.ఆర్.ఎస్.), వేణుగోపాల రెడ్డి (టి.బీజేపీ, వరంగల్ నుంచి). నిర్వహణ: Bharath Today TV Associate Editor: సాయి.