19, ఆగస్టు 2018, ఆదివారం

కధకు ప్రాణం పోసి కధగా మిగిలిన వేదగిరి రాంబాబు – భండారు శ్రీనివాసరావు


ఇంకా ఎందరో వుండి ఉండొచ్చు. కానీ నాకు తెలిసి ముగ్గురే ముగ్గురు నా తరం వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, నేను కలిసి పనిచేసిన వాళ్ళు. ఈ మువ్వురూ ఏనాడూ ఎవరి దగ్గరా నెల జీతం తీసుకుని ఉద్యోగం చేసి ఎరుగరు. ఒకరు సురమౌళి, రెండో వారు గుడిపూడి శ్రీహరి, మూడో వ్యక్తి వేదగిరి రాంబాబు. మొదటి ఇద్దరూ తమ రచనావ్యాసంగంతో పాటు రేడియోలో అప్పుడప్పుడూ ప్రాంతీయ వార్తలు చదివేవాళ్ళు. ఇక రాంబాబు. రేడియోలో పనిచేసే ఉద్యోగులన్నా రాకపోవచ్చు కానీ వేదగిరి రాంబాబు మాత్రం సదా రేడియో ఆవరణలోనే కనిపించేవాడు. రేడియోకి సంబంధించిన ఏ విభాగానికి ఏ రచన అవసరమైనా రాంబాబు తక్షణం ఆ అవసరం తీర్చేవాడు. కాంట్రాక్టు ఉందా లేదా, డబ్బులు ఇస్తారా లేదా అనేదానితో నిమిత్తం లేకుండా ఎవరికి ఏది అవసరం అయినా రాంబాబు తన ఆపన్న హస్తం అందించేవాడు.
ఇక తెలుగు కధ అంటే చాలు ముందుగా జ్ఞాపకం వచ్చే పేరు వేదగిరి రాంబాబు. ఎవరయినా తాము రాసినదానిని ఎవరికో ఒకరికి అంకితం ఇస్తారు. రాంబాబు మాత్రం కధల మీది వ్యామోహంతో మొత్తం తన జీవితాన్నే కధకు అంకితం చేసాడు. ఈ క్రమంలో ఏం సుఖపడ్డాడో తెలియదు కానీ అనేక కష్టాలు పడిఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అందుకే కాబోలు తనవంతుగా ‘తెలుగు కధ’ కన్నీరుమున్నీరవుతోంది రాంబాబు ఇక లేడని తెలిసి.     

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అవునండి మంచి కథకుడు. వారి కొడుకు పెళ్ళిలో వారిని చూశాను.
వారి ఆత్మకు సద్గతి కలగాలి 🙏.