31, మే 2014, శనివారం

"ఒక్క తెలుగు - రెండు రాష్ట్రాలు"


2014 జూన్ 2
తెలుగు  ప్రజల చరిత్ర  ఒక మహత్తరమైన మలుపు తిరుగుతున్న రోజు. ఈ అపూర్వ పరిణామానికి  మనమందరం సాక్షీభూతులం కావడం ఒక అదృష్టం అనే అనుకోవాలి. అయితే ఈ సందర్భంలో గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఒకటుంది. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసివుండాలన్న అనేకుల కల సాకారం కావాలంటే అందుకు  బాగా ఉపయోగపడేది దండలో దారం లాంటి తెలుగు భాష ఒక్కటే.
కొన్నేళ్ళ క్రితం తెలుగు భాష తీరుతెన్నులపై జరిగిన ఒక గోష్టిలో ప్రస్తావనకు వచ్చిన అంశాలు  ఈ సందర్భంలో స్పురణకు వస్తున్నాయి.
ఒక ప్రాంతం వారి భాషనుయాసను మరో ప్రాంతం వారు అణగదొక్కి తమ ప్రాబల్యాన్ని భాషపై కూడా విస్తరిస్తూ పోయారన్న అబిప్రాయం ఆ గోష్టిలో వ్యక్తమయింది.
బిడ్డ పోయి అమ్మాయికొడుకు పోయి అబ్బాయికక్కయ్య పోయి బాబాయిచిన్నమ్మ పోయి పిన్నమ్మ - ఇలా ఒక ప్రాంతానికి చెందిన పదాలు క్రమక్రమంగా కనుమరుగయి పోతున్నాయని సింగిడి తెలంగాణా రచయితల సంఘం కన్వీనర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి గారు వెల్లడి చేసిన ఆవేదనతో కొంతవరకు ఏకీభవించక తప్పదు. ప్రాంతీయపరమయిన ఉద్యమం నడుస్తున్న నాటి  నేపధ్యంలో ఇలాటి అభిప్రాయాలు మరింత బలంగా వేళ్ళూనుకోవడం సహజమే. ఇందులో తప్పుపట్టాల్సింది కూడా ఏమీ లేదు. అయితేపరిణామక్రమాన్ని కూడా కొంత పరిశీలించుకోవాల్సిన అవసరం వుంది.
నలభయ్ యాభయ్ ఏళ్ళక్రితం హైదరాబాదులో దుకాణాల పేర్లువీధుల పేర్లు తెలుగులో ఎలా రాసేవారో గుర్తున్న వాళ్ళు కూడా ఆ రోజుల్లో ఇదేవిధమయిన ఆవేదనకు గురయ్యారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతొ దేశంలో తొట్ట తొలిసారి ఏర్పడ్డ తెలుగు రాష్ట్రంలో తెలుగుకు ఈ దుర్గతి ఏమిటని బాధపడేవారు. సబ్బులుతలనొప్పి గోళీల గురించి సినిమా హాళ్ళలో వేసే ప్రకటనల్లో కూడా తెలుగు పరిస్తితి అదే విధంగా వుండేది. ఎందుకంటె ఆరోజుల్లో ఇలాటి ప్రకటనలన్నీ బొంబాయిలో తయారయ్యేవి. హిందీ లిపిలో తెలుగు రాయించితెలుగు కొద్దిగా తెలిసివాళ్ళచేత చదివించడంవల్ల వచ్చిన అపభ్రంశపు తెలుగునే తెలుగువారిపై రుద్దేవారు. ఈనాడు అరవై ఏళ్ళు దాటిన ప్రతిఒక్కరికీ ఇది అనుభవైకవేద్యమే.

మా కుటుంబంలో మా బావగార్లూవాళ్ళ పెద్దవాళ్ళూ ఉర్దూ మీడియంలో చదువుకున్నవాళ్ళే. గ్రామాల్లో రాతకోతలన్నీ ఆ భాషలోనే జరగడంవల్ల ఉర్దూ మాట్లాడగలిగినవారికి అయాచిత గౌరవం లభించేదని చెప్పుకునేవారు.
ఆ రోజుల్లో ఖమ్మం జిల్లా మొత్తానికి కలిపి ఒకే ఒక్క డిగ్రీ కాలేజి ఖమ్మంలో వుండేది. అక్కడినుంచి హైదరాబాదుకు ఒకే ఒక్క పాసింజర్ బస్సు. దాదాపు పన్నెండు గంటల ప్రయాణం. బెజవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఒకేఒక్క రైలు నైజాం పాసింజర్. కుంటుకుంటూ నడిచే ఆ రైలు బొగ్గుకోసంనీళ్ళ కోసం మధ్య మధ్యలో ఆగుతూపడుతూ లేస్తూ ఎప్పటికో హైదరాబాద్ చేరేది. ప్రయాణ సౌకర్యాలు అంతగా లేని రోజుల్లో ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాదుకు రాకపోకలు తక్కువ. పైగా భాష తెలియకపోవడం మరో ఇబ్బంది. అయినాపై చదువులకోసం హైదరాబాద్ తప్పనిసరిగా రావాల్సిన పరిస్తితి. మరోవైపురాష్ట్ర రాజధాని కావడం వల్ల ఏదో ఒక పనిపై రాకుండా వుండలేని స్తితి. ఈ క్రమంలో రాకపోకలు పెరిగాయి. ఉద్యోగాలకోసంఉపాధుల కోసం వలసలు పెరిగాయి. వ్యాపార అవకాశాలు వెతుక్కుంటూ వచ్చే వారి సంఖ్యా పెరిగింది.
ఫలితంగా – గత యాభయ్ ఏళ్లలో పరిస్తితి పూర్తిగా మారిపోయింది. రవాణా సౌకర్యాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. రోజుకొక పాసింజర్ బస్సు స్తానంలో గంటగంటకూ నడిచే ఎక్స్ ప్రెస్ బస్సులు వచ్చాయి. నలుమూలలనుంచి హైదరాబాదుకు రైళ్ల సౌకర్యం ఏర్పడింది. రాష్ట్ర రాజధానికి ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలనుంచి లక్షలాదిమంది జనం హైదరాబాదుకు వచ్చి స్తిరనివాసాలు ఏర్పరచుకోవడం మొదలయింది. ఆ రోజుల్లో ఆయా ప్రాంతాలలో వున్న అక్షరాస్యతను బట్టి చూస్తె బయట నుంచి వచ్చే ఇలాటివారి సంఖ్య గణనీయంగా వుండడం ఆశ్చర్యకరమేమీ కాదు. వలసలు వచ్చిన వాళ్ళు వారితో పాటే తమ సంస్కృతినిఆచారవ్యవహారాలనుభాషలో తమదయిన నుడికారాలను వెంటబెట్టుకు వస్తారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది ఇదే. ఉదరపోషణార్ధం ఇతరదేశాలకు ముఖ్యంగా అమెరికాకు వెళ్ళిన తెలుగువాళ్ళు చేస్తున్నదీ ఇదే. ఇదంతా సహజ సిద్దంగా జరిగేదే కానీ ఒక దాడి ప్రకారంఒక పధకం ప్రకారం జరుగుతోందని అనుకోవడం అంత సబబు కాదు. వ్యాపారవాణిజ్య ప్రయోజనాలకోసం వచ్చేవారు,స్తానికులకు చేసే అన్యాయాలతో ముడిపెట్టిఈ అంశాన్ని చూడడం కూడా సరికాదనిపిస్తుంది. పట్టణీకరణ (అర్బనైజేషన్) వల్ల వచ్చిపడే అనర్థాలలో ఇదొకటి కాబట్టి సర్దుకుపోవాలని చెప్పడం కాదు కానీఈవిధమయిన పరిణామాలు అనివార్యం అన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో వారి వారి భాషలుయాసలు పదిలంగా వుండడాన్నిబట్టి చూస్తెవలసలు ఎక్కువగా వుండే పట్టణ ప్రాంతాలలోనే ఈరకమయిన మార్పులు చోటు చేసుకుంటున్నాయని కూడా అనుకోవాలి.
భాష పట్ల మమకారం లేని వాడు వుండడు. అది కన్న తల్లితో సమానం. పరాయి భాషల వాళ్ళు మన భాషలో తడి పొడిగా యేవో రెండుముక్కలు మాట్లాడితే మురిసి ముక్కచెక్కలయ్యేది అందుకే.
మాండలికాలు ఎన్ని వున్నా తల్లి వేరు ఒక్కటే. భాషకు యాస ప్రాణం. పలికే తీరులోనే వుంటుంది మాధుర్యమంతా. చిన్నప్పుడు స్కూల్లో రసూల్ సారు ఉర్దూలో అనర్ఘలంగా మాట్లాడేవారు. ఆయన మాట్లాడే దానిలో మాకు ఒక్క ముక్క అర్ధం అయ్యేది కాదు. కానీ ఇంకా ఇంకా వినాలనిపించేది. అదీ భాషలోని సౌందర్యం.
మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అనేక తెలుగు మాండలికాలు వున్నాయి. ఒక్కొక్కదానిదీ ఒక్కొక్క తరహా. దేనికదే గొప్ప. కొన్ని పదాలు అర్ధం కాకపోయినా చెవికి ఇంపుగా వుంటాయి. ప్రతి భాషలో వుండే ఈ యాసలు ఒకదానికొకటి పోటీ కాదు. ఒకదానికొకటి ప్రత్యామ్నాయమూ కాదు. కాకపొతే భాషను సుసంపన్నం చేయడంలో వీటి పాత్ర అమోఘం.
భాషాభిమానులందరు బాధ పడాల్సిన అంశాలు మరికొన్ని కూడా వున్నాయి. నాన్నను ఒరే’ అనడం – అమ్మను ఒసే’ అనడం వంటి వికృత ప్రయోగాలు తెలుగునాటముఖ్యంగా తెలుగు సినిమాలలో నానాటికీ ముదిరిపోతున్నాయి. తెలుగు భాషకుసంస్కృతికి చీడపురుగుల్లా మారుతున్న ఈ ధోరణులకు సయితం అడ్డుకట్ట వేయాల్సిన అవసరం వుంది.
ఎన్ని కొమ్మలు వేసినా తల్లి వేరు ఒక్కటే. కలివిడిగా తల్లిని ప్రేమించడానికి ఏమయినా ఇబ్బందులు వుంటే విడివిడిగా అమ్మను  ఆరాధించడమే బిడ్డలు చేయాల్సిన పని.
'ఒక భాష - రెండు రాష్ట్రాలు' అనే నూతన శకం ఆవిష్కృతమవుతున్న శుభ సందర్భంలో - రెండు రాష్ట్రాలలో 'తెలుగు భాష' మరింత పరిపుష్టం కావాలని, ఆ భాషే రెండు ప్రాంతాల ప్రజల్ని కలిపినిలబెట్టే  మహత్తర శక్తి కావాలని మనసారా కోరుకుందాం. (28-05-2014)


సిగరెట్లు మానడం యెలా?


సిగరెట్లు మానడం యెలా?
ఇదేమన్నా బ్రహ్మ విద్యా! నేను చాలాసార్లు మానేశానుఅనే జోకులు వింటూనే వుంటాము.


చాలా సంవత్సరాల క్రితం అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ మ్యాగజైన్ సంపాదక బాధ్యతలు నిర్వహించిన కీర్తిశేషులు శ్రీ పీవీ రావు నాచేత ఈ అంశంపై ఒక వ్యాసం రాయించి పత్రికలో అచ్చు వేయించి ఓ నూటపదహార్లు అనుకుంటాను తాంబూలం కూడా ఇచ్చారు. ఏదయితేనేం అప్పుడా డబ్బులు ఓ వారం పదిరోజులు సిగరెట్ల ఖర్చుకు పనికొచ్చాయి.
నాకు సిగరెట్ అలవాటు యెలా అలవడిందో గుర్తు లేదు. మా మామగారి ముందు  ఆధిపత్యం ప్రదర్శించడానికి నేను సిగరెట్లు మొదలు పెట్టానని మా ఆవిడ అంటుంది. కానీ సిగరెట్ తాగే మా స్నేహితులు చెప్పే మాట వేరే. శ్రీనివాసరావు సిగరెట్లు తాగడు, తగలేస్తాడుఅన్నది వాళ్ల థియరీ, ‘హార్లిక్స్ తాగడు తింటాడుఅనే వాణిజ్య ప్రకటన టైపులో.
సిగరెట్లు అలవాటు కావడానికి నేను చెప్పుకునే కారణం వేరే వుంది. ఇండియాలో వున్నప్పుడు కొని తాగే అలవాటు అలవడని నేను మాస్కో వెళ్ళేక డబ్బులు తగలేసి మరీ సిగరెట్లు తగలేయడం మొదలు పెట్టాను. దానికి కారణాలు రెండు. ఒకటి మన దగ్గర అతి ఖరీదైన సిగరెట్లు కూడా మాస్కోలో అతి తక్కువ ధరకు దొరకడం. భాష ఎంతమాత్రం  తెలియని  ఆడామగా రష్యన్   సహోద్యోగులతో కాసేపు మాటామంతీలేని కాలక్షేపం చేయడానికి  ఈ సిగరెట్లు చక్కగా  అక్కరకు రావడం. దానాదీనా నా కొనుగోళ్ళు   సిగరెట్ ప్యాకెట్ల నుంచి  ఏకంగా  కార్టన్ల స్థాయికి పెరిగాయి. 2004 లో అమెరికా వెళ్ళినప్పుడు  ఒక పెద్ద సూటుకేసు నిండా మా ఆవిడ వూరగాయ పచ్చళ్ళ ప్యాకెట్లతో, మరో పెద్ద సూటుకేసు నిండా సిగరెట్ల ప్యాకెట్లతో దిగబడ్డ మమ్మల్ని చూసి అమెరికా కష్టమ్స్ వాళ్లు నోళ్ళు వెళ్ళబెట్టారు. నా మీద కార్టూన్లు వేసే స్థాయికి నేను జీవితంలో ఎదిగివుంటే అంజయ్య గారి వేలుకు హెలికాఫ్టర్ బొమ్మ ముడివేసినట్టు నా బొమ్మకు చేతిలో సిగరెట్ తగిలించేవాళ్లేమో!
'మరి ఇప్పుడేవిటి ఇలా అయిపోయారు?  ఏవి తండ్రీ నాడు విరిసిన  రింగు రింగుల  పొగల మేఘాలుఅని మా స్నేహితులు భారంగా నిట్టూర్పులు విడుస్తుంటారు. నా ఈ దుస్తితికి కారకులు ఎవరయ్యా అంటే నిమ్స్ డైరెక్టర్ గా పనిచేసిన డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు. దీనికి ముందు ఓ పిట్ట కధ చెప్పాలి. దూరదర్శన్ విలేకరిగా పనిచేస్తున్న రోజుల్లో  ఓ రోజు తెల్లగా తెలవారక మునుపే, కప్పు కాఫీ కూడా పొట్టలో పడకుండానే జూబిలీ హిల్స్ లోని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కెమెరామన్ తో సహా  చేరుకున్నాను. మిగిలిన జాతీయ ఛానళ్ళ బృందాలు కూడా బిలబిల మంటూ అక్కడికే చేరాయి. మామూలుగా అయితే అక్కడ విలేకరులకు రాజభోగాలు. కానీ ఆ రోజు విలేకరులది పిలవని పేరంటం. బీజేపీతో టీడీపీ కి ఎన్నికల పొత్తు విషయం గురించి తేల్చడానికి  ఆ రెండు పార్టీల నాయకుల నడుమ లోపల ఎడతెగని చర్చలు సాగుతున్నాయి. బయట ఫుట్ పాత్ మీద నిలబడి కొందరం,  కూలబడి కొందరం పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటున్నాం. ముందు జాగ్రత్త చర్యగా వెంట తెచ్చుకున్న సిగరెట్లను ఒకదాని వెంట మరోటి తగలేస్తూ, తెచ్చుకోని వాళ్లకు ఉదారంగా పంచిపెడుతూ నా మానాన నేను కాలక్షేపం చేస్తుండగా సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. కడుపులో ఎలుకలు. మరో పక్క సిగరెట్ల పొగతో కళ్ళు మంటలు. నిలబడి సిగరెట్ తాగుతూ వున్నవాడ్ని వున్నట్టుండి  స్లో మోషన్ లో కిందకు వొరిగి పోతూ వుండడం వరకే గుర్తు. కట్ చేస్తే నిమ్స్ ఆసుపత్రిలోని  ప్రత్యేక గదిలో డాక్టర్ల పర్యవేక్షణలో. ఆందోళనగా నా వైపే చూస్తున్న నా భార్య. ఆమెతో పాటు నా ఇద్దరు పిల్లలు. ముఖ్యమంత్రి గారా మజాకా. జరిగిన విషయం  విలేకరుల ద్వారా తెలుసుకుని హుటాహుటిన అంబులెన్స్ తెప్పించి నన్ను నిమ్స్ లో అడ్మిట్ చేయించారట. అందుకే కాకర్ల వారు కూడా వచ్చి చూసారు. కళ్ళు తిరగడానికి, వొళ్ళు తూలడానికీ నా సిగరెట్లే కారణం అని ఆయన తన అనుభవంతో ఇట్టే కనుక్కున్నారు. ఆ విషయం మా ఆవిడతో చెప్పి నెమ్మదిగా ఈ అలవాటు మానిపించమని అన్నారు. కళ్ళు తెరిచి  ఇదంతా చూస్తూ, చెవులు వొగ్గి ఇదంతా వింటున్న నేను ముందుకు వొంగి  నేను సిగరెట్లు మానేశాను డాక్టర్ గారుఅనేశాను. ఆయన నెత్తి మీది వెంట్రుకలు పట్టి చూపిస్తూ ఇలాటి వాళ్ళను నేను ఇంతమందిని చూసానుఅంటూ,  'అదంత తేలిక కాద'ని ఆయనే చెబుతూ నేను తాగే బ్రాండ్ సిగరెట్ ప్యాకెట్ ఒకటి అప్పటికప్పుడే తెప్పించి మా ఆవిడ చేతిలో పెట్టి, 'రాత్రి అందరూ  నిద్ర పోయిన తరువాత నీ మెదడు కొరుక్కు తింటాడు, ఎందుకయినా మంచి ఇది దగ్గర వుంచుకోమ్మాఅని వెళ్ళిపోయారు.
అంతే! ఎంతయినా పట్టుదల కల మనిషిని కదా! ఇంటికి వెళ్ళినప్పటినుంచి ఆ ప్యాకెట్టూ ముట్టుకోలేదు. అప్పటినుంచి సిగరెట్టూ అంటించలేదు.
మరో వింత ఏమిటంటే, ఆనాటి నుంచి  తాగాలని కూడా అనిపించలేదు.
(ఈరోజు ధూమపాన నిరోధక దినోత్సవం - Anti tobacco day - అంటున్నారు)

24, మే 2014, శనివారం

వాగ్దానభంగం


వాగ్దానాన్ని మించిన దానం లేదంటారు రాజకీయనాయకులు.
వాగ్దానాలు చేస్తూ పోవాలి కాని వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే రాజకీయాల్లో పుట్టగతులుండవని వారిలో కొందరి నిశ్చితాభిప్రాయం. గత రెండు మూడు రోజులుగా ఏ ఛానల్ పెట్టినా, లేదా ఏ ఛానల్లో చర్చకు వెళ్ళినా ఇదే చర్చ.



వాగ్దానాలు  చేయడం అన్నది రామాయణ కాలం నుంచీ వుంది. దశరధ మహారాజు తన భార్య కైకేయికి, వరసకు మూడో భార్య అయినా మాటవరసకు కూడా మూడు వరాలు ఇవ్వకుండా కేవలం రెండే రెండు వరాలు ఇచ్చాడు. మాట ఇచ్చి తప్పడం ఇక్ష్వాకుల వంశంలో లేదంటారు కాని  ఇచ్చి మరచిపోవడం వుందన్న విషయానికి తార్కాణం  కైక మళ్ళీ గుర్తు చేసేదాకా ఆయనకు ఇచ్చిన మాట  గుర్తుకు రాకపోవడమే.  అంటే ఏమిటన్న మాట. ఎన్ని మాటలన్నా ఇవ్వవచ్చు. మాటలు పుచ్చుకున్నవాళ్ళు వాటిని గుర్తు పెట్టుకుని గుర్తు చేసేదాకా ఇచ్చిన వాళ్లకు ఆ మాటలు నిలబెట్టుకోవడంపై ఎలాటి పూచీ లేదని రామాయణమే చెబుతోంది. ఇలా ఏదో సరదాకు రాస్తే కోడి గుడ్డు మీద ఈకలు పీకకండి సుమా!  నవ్వు వచ్చిందనిపిస్తే  నా మొహాన ఒకటి గిరవాటు వెయ్యండి. కోపం వస్తే మొహం అటు తిప్పుకోండి. స్వస్తి.

NOTE: Courtesy image owner

దటీజ్ మోడీ మోటివేషన్ పవర్

నమో సునామి నమో నమామి
ఇప్పుడు దేశమంతటా మోడీ అనే రెండక్షరాలే మోగిపోతున్నాయి. ఆయన్ని గురించిన కధనాలతో పత్రికలు నిండిపోతున్నాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు గురించి ఒక మిత్రుడు పంపిన సమాచారం. ఆయనకు అంటే నా మిత్రుడికి తెలుగు తెలియదు.
మోడీ గుజరాత్ సీతయ్య.  కాకపొతే కొంత తేడా వుంది. మన తెలుగు సీతయ్య ఎవడి మాటా వినడు. ఈ గుజరాత్ సీతయ్య అందరి మాటా వింటాడు కానీ చివరకు తాను అనుకున్నదే చేస్తాడు.


ఉదాహరణకు రాష్ట్రంలో చిన్నపిల్లల్ని స్కూళ్లకు పంపేలా వారి తలితండ్రులను ప్రోత్సహించడం యెలా అన్న ఆలోచన వచ్చిందనుకోండి. వెంటనే సంబంధిత అధికారుల సమావేశం ఏర్పాటు చేసి వాళ్ల అభిప్రాయాలను సావధానంగా వింటారు. తమ మనసులో మాట స్వేచ్చగా ధైర్యంగా చెప్పేలా అధికారులను ప్రోత్సహిస్తారు. మధ్యలో భోజన సమయం అయితే పదిహేను నిమిషాల్లో ఆపని ముగించుకుని మీటింగుకు హాజరు. అందరూ చెప్పింది జాగ్రత్తగా విని తాను ఒక అభిప్రాయానికి వచ్చి ఏం చేయాలో ఆ ఆదేశాలు జారీచేస్తారు. ఆ తరహా చూసిన వారికి ఒక మిలిటరీ అధికారి తన సైన్యానికి ఆదేశాలు జారీ చేసే విధానం గుర్తుకు రాకమానదు. ఇక అప్పటినుంచి ఆ కార్యక్రమం  పురోగతి గురించి వెంట వెంటనే సమీక్షా సమావేశాలు. ఎప్పటికప్పుడు పరిస్తితిని బేరీజు వేసుకుని తదుపరి ఆదేశాలు. వేసవి సెలవుల్లో మండుటెండలను లెక్కపెట్టకుండా అధికారులను వెంటేసుకుని ఒక నెలంతా పల్లెల్లో పర్యటించి పిల్లల చదువు ప్రాధాన్యతను గురించి ప్రతి ఒక్కరికీ వివరించే ప్రయత్నం మరోపక్క. ఫలితం గురించి చెప్పే పని ఏముంటుంది. రెండేళ్లలో స్కూళ్ళల్లో చేరే పిల్లల సంఖ్య  ఇరవయ్యారు శాతం నుంచి నూటికి  నూరు శాతానికి పెరిగిపోయింది. 
దటీజ్ మోడీ మోటివేషన్ పవర్.

వడ డెబ్బ


శుక్రారం నాడు సూరీడు హైదరాబాదు నగరాన్ని కాల్చుకు తిన్నాడు. 'ఫ్రై డే' కదా! బాగా 'ఫ్రై' చేసి వొదిలాడు.
ఎందుకైనా మంచిదని ఇంటి పట్టునేవున్నా. అయినా 'వడ డెబ్బ' కొట్టనే కొట్టింది.

మా ఆవిడ సాయంత్రం  పలహారంగా 'వడలు' చేసింది.  

  

22, మే 2014, గురువారం

రివైండ్ - 2010 (పదిహేనో భాగం)


విన్నంతలో కన్నంతలో అమెరికా

అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్ (కేంద్ర ప్రభుత్వం), స్తానిక (రాష్ట్ర) ప్రభుత్వాలు - విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యత కారణంగానే ఈ అసాధ్యం సుసాధ్యం అయిందని అనుకోవచ్చు. ప్రతి స్టేట్ లోను విద్యారంగం నిర్వహణ కోసం స్కూలు డిస్ట్రిక్టులను ఏర్పాటు చేసారు. తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. విద్యాప్రమాణాలను బట్టి ఆయా స్కూళ్లకు ఫెడరల్ గవర్నమెంట్ ప్రత్యెక నిధులను ఇన్నోవేషన్ ఫండ్నుంచి గ్రాంట్ రూపంలో ఇస్తుంది.ఈ ఏడాది (2010) వంద మిలియన్ డాలర్ల బడ్జెట్ కేటాయించింది. ఉదాహరణకు బెల్ వ్యూ స్కూలు డిస్ట్రిక్టు కింద వున్న సమ్మాయిష్ హైస్కూలుకు ఈ నిధి నుంచి నలభై లక్షల డాలర్ల గ్రాంటు లభించింది. దేశ వ్యాప్తంగా పోటీ ప్రాతిపదికపై నిర్వహించిన ఈ ఎంపిక ప్రక్రియకు పదిహేడు వందల ధరఖాస్తులు రాగా వాటిలో ఉత్తమంగా ఎన్నిక చేసిన 49 స్కూళ్ళలో ఇది ఒకటి. ఇలాటి పోటీల వల్ల సర్కారు బడుల్లో నాణ్యతా ప్రమాణాలు నానాటికీ పెరిగిపోతూ వస్తున్నాయి. న్యూస్ వీక్ పత్రిక విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం అమెరికా లోని వంద ఉత్తమ పాఠశాలల్లో అయిదు హైస్కూళ్ళు బెల్ వ్యూ స్కూలు డిస్ట్రిక్టు లోనే వున్నాయి.



ప్రైవేటు స్కూళ్ళలో మాదిరి గానే వసతులు, చక్కటి భవనాలు, క్రీడా మైదానాలు కలిగివుండడం వల్ల ప్రభుత్వ స్కూళ్లను చిన్న చూపు చూసే పద్దతి ఇక్కడ కానరావడం లేదు. బెల్ వ్యూ లోని వుడ్ రిడ్జ్ ఎలిమెంటరీ స్కూలు ఇందుకు ఉదాహరణ. సహజ కాంతి వుండేలా తీర్చిదిద్దిన స్కూలు భవనం, వాల్ టు వాల్ కార్పెట్లు, పొందికయిన తరగతి గదులు, లైబ్రరీ, లంచ్ రూము, ఇండోర్ జిమ్, క్రీడామైదానం, కారు పార్కింగ్ ఏది చూసినా అద్భుతం అనే మాదిరిగా వున్నాయి. టాయిలెట్లు (రెస్ట్ రూములు) అయిదు నక్షత్రాల హోటళ్ళకు దీటుగా వున్నాయి.


(ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో ఒక దృశ్యం)    



రివైండ్ - 2010 (పద్నాలుగో భాగం)


విన్నంతలో కన్నంతలో అమెరికా
కలల లోకంలో కాసేపు -
పాడు ఉద్యోగం ఎన్నాళ్ళు చేస్తాంఅని ఈసురోమనే వాళ్ళు కూడా పదవీ విరమణ ఘడియ దగ్గరపడేటప్పుడు – ‘పొడిగింపుకోసం నానా తంటాలు పడడం కద్దు. ఏడుపదుల వయస్సు వచ్చేవరకూ ఏమి జీవితమూ దుర్భరమూ అని తత్వాలు పాడుకున్నవాళ్ళు తరవాత్తరవాత తత్వం మార్చుకుని - కొద్దిగా మనుషుల్ని ఆనవాలు పట్టే చూపు దేవుడు ఇస్తే బాగుండుఅనుకుంటూ బతుకు మీద మళ్ళీ తీపి పెంచుకునేవాళ్ళు సయితం కనబడుతుంటారు. ఇప్పుడు ఆరుపదులు దాటిన తరవాత అమెరికావచ్చి- బెల్ వ్యూ లో  మా మనుమరాళ్ళు చదువుకునే ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల చూసిన తరవాత నాకూ అలాటి అభిలాషే ఒకటి కలిగింది.



 ‘మరుసటి జన్మలో అమెరికాలో పుట్టి ఇక్కడే చదువుకుంటే యెంత బాగుంటుందో కదా!అన్నదే ఆ కోరిక. అలాటి స్కూల్లో చదువుకుంటున్న మా మనుమరాళ్ళని చూసి కాస్తంత అసూయ పడ్డానేమో అని కూడా అనుమానం.
మన దేశంలో కూడా ఈ మాదిరి స్కూళ్ళు లేకపోలేదు. కానీ అవి పెట్టి పుట్టిన వాళ్ళకే పరిమితం. కూలీ నాలీ చేసుకుంటూ కలో గంజో తాగి పిల్లలను మంచి స్కూళ్ళల్లో చదివించే పేదలు కూడా మన దగ్గరవున్నారు. కానీ ఇంగ్లీష్ మీడియం కాన్వెంటు స్కూళ్ళ పేరుతొపల్లెటూళ్ళల్లో సయితం కాలు  పెడుతున్న అలాటి స్కూళ్ళన్నీ డబ్బు చేసుకునేందుకు, డబ్బు దోచుకునేందుకు తప్ప అసలు సిసలు చదువుకు పనికొచ్చేవి కావు.
ఇక్కడి విద్యాలయాల్లో చదువుకన్నా వ్యక్తిత్వవికాసానికి (personality Development) ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు అనిపించింది. గట్టిగా చదివించి- ట్యూషన్లు పెట్టించి – “ఎమ్సెట్ఒక్కటీ గట్టెక్కితే చాలనుకునే ధోరణి ఇక్కడి పేరెంట్లలో కానరాదు. ఆ అవసరం కూడా వారికి లేదనుకోండి. మరో విశేషం ఏమిటంటే సర్కారు బళ్ళల్లో (ఇక్కడ పబ్లిక్ స్కూళ్ళు అంటారు.ఇవి పూర్తిగా ప్రభుత్వ ఆజమాయిషీలో నడుస్తాయి) హైస్కూలు స్థాయి వరకూ సెంట్ ఖర్చులేకుండా చదువుకునే వీలుంది.

సమాజంలో ఉన్నత స్తాయి వర్గాలవాళ్ళు కూడా తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ళలో కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేర్పించడానికి ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే - వసతుల విషయంలో, నిపుణత కలిగిన అధ్యాపకుల విషయంలో కొండొకచో సర్కారు బడులే ప్రైవేటు స్కూళ్ళను తలదన్నేలా వుంటాయి. (2010)

21, మే 2014, బుధవారం

రివైండ్ -2010 (పన్నెండో భాగం)


విన్నంతలో కన్నంతలో అమెరికా :
శ్రావణమాసం రెండో శుక్రవారంనాడు వరలక్ష్మీ వ్రతం కోసం సియాటిల్ లోని ఈ ఇండియన్  స్టోర్ లో ఒక లారీ లోడ్ కొబ్బరికాయలు అమ్ముడుపోయాయంటే
ఇక్కడివారు సంప్రదాయ వేడుకలను యెంత శ్రద్ధగా జరుపుకుంటున్నారో అర్ధమవుతుంది.

(వరలక్ష్మీ వ్రతానికి పట్టు పరికిణీల్లో సిద్ధమైన మా ముమరాళ్ళు సృష్టి, సఖి) 

 మొత్తం వ్రత కధను, పూజావిదానాన్ని నెట్నుంచి డౌన్ లోడ్ చేసుకుని నిర్దేశించిన పద్దతిలో వ్రతం ఆచరించి ముత్తయిదువలకు దక్షిణ తాంబూలాదులు సమర్పించి సంప్రదాయాలపట్ల తమకున్న మక్కువను వ్యక్తం చేసారు. సియాటిల్ లో మాకు తెలిసిన తెలుగు లోగిళ్ళ వద్ద ఆ నాటి ఉదయం రంగురంగుల రంగవల్లులు కొలువుతీరాయి. 
(2010) 


రివైండ్ -2010 (పదకొండో భాగం)


విన్నంతలో కన్నంతలో అమెరికా :
 అసలు ఆబ్దీకాలవంటి కర్మకాండలపై అంతగా నమ్మకం లేని స్తితిలో  గత యాభయి సంవత్సరాలకు పైగా మా నాన్న గారి తద్దినాలు  పెడుతూ వస్తున్నాము. ఒక పండగ మాదిరిగా ఏటా జరిగే ఈ కార్యక్రమానికి చుట్టపక్కాలందరూ వచ్చేవాళ్ళు. ఏడాదికొకసారి కుటుంబ సభ్యులందరూ ఒకచోట కలుసుకునే సందర్భంగా భావిస్తూ దాన్ని ఒక క్రతువులా జరిపే ఆనవాయితీగా మారిపోయింది.
ఈ కర్మ కాండ మొత్తంలో ఒక ఆసక్తికరమయిన విషయం నేను గమనిస్తూ వచ్చాను. అదేమిటంటే మనకు జన్మ నిచ్చిన తలిదండ్రులతో పాటు మూడు తరాల పూర్వీకులను సయితం పేర్లతో సహా స్మరించుకునే సందర్భం ఇది. తండ్రి, తండ్రి తండ్రి పేరు చెప్పగలిగినవాళ్ళు కూడా తాత తండ్రి పేరు గుర్తుకుతెచ్చుకోవడానికి ఇబ్బంది పడతారు. వంశాన్ని ఉద్ధరించడం సంగతి ఏమో కానీ  వంశస్తులను ఏడాదికి ఒక్కమారయినా స్మరించుకునే అవకాశం  ఇచ్చే తద్దినాలు పెట్టడంలో తప్పేమీ లేదన్న అభిప్రాయం క్రమంగా మనస్సులో పడిపోయింది.


(కాకి ప్రసాదం కోసం వాయసాన్వేషణ)


 ఉత్తరాది పద్దతిలో నిర్వహించినా సుధీర్ ఝా గారు - ఎంతో సంతృప్తికరంగా మా తల్లిగారు వెంకట్రావమ్మ, పితామహి రుక్మిణమ్మ, ప్రపితామహి చెల్లాయమ్మలకు తర్పణ క్రియలు నాచేత జరిపించారు. ఇతర లాంఛనాలు పూర్తయిన తరవాత ఇంటి నుంచి తయారు చేసుకొచ్చిన గారెలు, పరవాన్నం ఇతర పదార్ధాలను  గుడికి వచ్చిన వారికి ప్రసాదంగా అందచేసి అమెరికాలో ఇటువంటి క్రతువులు సాధ్యమా అని మొదట్లో  కలిగిన సందేహాలను పటాపంచలు చేసుకుని ఇంటి దారి పట్టాము.

చెప్పడం మరిచాను. ఇటువంటి కార్యక్రమాలకు అవసరమయిన సమస్త సామాగ్రి సియాటిల్ లో వున్న ఒక ఇండియన్ స్టోర్ లో లభించింది.

రివైండ్ -2010 (పదో భాగం)


విన్నంతలో కన్నంతలో అమెరికా :
అమెరికాలో అమ్మ ఆబ్దీకం
శ్రావణ  త్రయోదశి మా అమ్మగారి ఆబ్దీకం. ఏటా హైదరాబాదులో జరిగే ఈ కార్యక్రమంలో  అమ్మలగన్నమా అమ్మనుమనసారా స్మరించుకోవడానికి ఆమె పిల్లలతో పాటు ఆ పిల్లల పిల్లలుకూడా కట్టగట్టుకుని  వచ్చేవారు. అంతకుముందు మా మూడో అన్నయ్య భండారు వేంకటేశ్వర రావు బతికున్న రోజుల్లో మా అమ్మానాన్నల తద్దినాలను 'వూరంతా పండగే' అన్న రీతిలో ఏళ్లతరబడి ఏటా నిర్వహిస్తూ వచ్చేవారు. మా ఇంట్లో పెళ్ళిళ్ళు చాలా సాదా సీదాగా జరిగేవి. తద్దినాలు మాత్రం పెళ్ళి చేసినట్టు గొప్పగా చేస్తారని చెప్పుకునే వారు.
కానీ ఈసారి అమెరికాలో వున్నాము.
 ‘ఎలా?’ అనే ప్రశ్నకు సియాటిల్ లోని హిందూ టెంపుల్ పూజారి సుధీర్ ఝా రూపంలో జవాబు లభించింది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఈ హిందూ దేవాలయ సముదాయం నిర్మాణానికి భూరివిరాళం ఇవ్వడంవల్ల దీన్ని మైక్రోసాఫ్ట్ టెంపుల్ అని పిలవడం కద్దు. (హైదరాబాదులో బిర్లా టెంపుల్ మాదిరిగా)
ఈ దేవాలయం విశాలమయిన ప్రాంగణంలో వుంది. ఒక ఎత్తయిన వేదిక మీద శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ గణేష్ మొదలయిన దేవతామూర్తులను కొలువు తీర్చారు. పుష్పశోభితమయిన ఉద్యానవనం నడుమ నిర్మించిన ఈ దేవాలయం ప్రశాంతతకు, పరిశుభ్రతతకు నిలయంగా వుంది.
 శని ఆదివారాల్లో నగరంలోని భారతీయ కుటుంబాల వాళ్ళు ఈ మందిరాన్ని సందర్శించి పూజాదికాలు నిర్వహిస్తూ వుంటారు. గతంలో ఈ గుడిలో దీక్షితులుగారనే తెలుగు పూజారి వుండేవారు. ఇప్పుడాయన సియాటిల్ లోనే రెడ్మండ్ అనే ప్రాంతంలో వున్న మరో హిందూ టెంపుల్ లో పనిచేస్తున్నారు.


(తల్లీ! నీకు వందనం!)


మైక్రోసాఫ్ట్ హిందూ టెంపుల్ లో ఆబ్దీకం పెట్టుకోవడానికి యాభయి ఒక్క డాలర్లు తీసుకుని టెంపుల్ కమిటీ వాళ్ళు రసీదు ఇచ్చారు. ఆ ప్రాంగణంలోనే ఒక గదిలో మా కార్యక్రమం పూర్తిచేసుకున్నాము. (2010)

రివైండ్ - 2010 - తొమ్మిదో భాగం


విన్నంతలో కన్నంతలో అమెరికా :
సాంకేతిక విన్యాసాల ఆవాసం - బిల్ గేట్స్ నివాసం


బిల్ గేట్స్ ఇంటికి వచ్చే అతిధులకు ఓ రకం చిప్ అమర్చిన బ్రేస్లేట్ ఇస్తారు. అంటే దేశవిదేశాల్లోని వారెవరయినా అ అతిధిదేవుళ్ళతో అవసరం పడి  వారిని కాంటాక్ట్ చేయాలనుకుంటే వేరే ఫోన్లు, సెల్ ఫోన్లు అవసరం లేదు. ఆ అతిధి యే గదిలో వుంటే ఆగదిలో అతడికి అతి దగ్గరలో వున్న ఫోనుకి ఆ  'కాల్’  కనెక్ట్ అవుతుంది. మరో విశేషం ఏమిటంటే - బయటనుంచి వచ్చిన అతిధి శరీరతత్వానికి తగినట్టుగా అక్కడి ఉష్ణోగ్రతలు మారిపోతుంటాయి. అంటే, వెచ్చదనం కావాలనుకునే వారికి అందుకు తగినట్టుగానూ, చల్లదనం కోరుకునేవారికి అందుకు అనుగుణంగానూ - ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంటుంది.

 అక్కడి పెయింటింగులు కూడా వచ్చినవారి అభిరుచులకు అనుగుణంగా మారిపోతుంటాయి. పికాసా పెయింటింగులు కోరుకునేవారికి అవే కనిపిస్తాయి. అదే సమయంలో రవివర్మ చిత్రాలు ఇష్టపడేవారికి అవే కనువిందు చేస్తాయి. మాయాబజారు సినిమా చూస్తున్నట్టు వుంది కదూ ఇవన్నీ వింటుంటే. 
బిల్ గేట్స్ నివాసం వున్న ప్రాంతం సియాటిల్ లో అతి ఖరీదయిన క్లయిడ్ హిల్ ఏరియా . అంత సంపన్నుడి ఇరుగూ పొరుగూ ఎవరో తెలుసుకోవాలనే ఉత్సుకత వుండడం సహజం.  అతగాడెవరో కాదు,  ఒక సాధారణ పిజియో తెరపిస్ట్ అంటే నమ్మగలరా!  గేట్స్ నివాసం పక్కనే ఇల్లు కొనుక్కోవడం  అతగాడికి  ఎలా సాధ్యమయిందంటే-  బిల్ గేట్స్ మైక్రో సాఫ్ట్  సంస్త పెట్టిన కొత్తల్లో అందులో  కొన్ని షేర్లు కొన్నాడు.  కాలక్రమేణా  ఆ షేర్లు ఇంతింతై, వటుడింతై అన్నట్టుగా  పెరిగిపోయాయి. దానితో ఆ మామూలు డాక్టర్ కాస్తా - కోరిన కోరికలు తీర్చుకోగల పెద్ద  ఆసామీ అయిపోయాడు. యెంతో డబ్బు గుమ్మరించి  బిల్ గేట్స్ పొరుగునే ఇల్లు కొనుక్కుని కాలర్ ఎగరేసుకుని కాపురం ఉంటున్నాడు.
అంతేకాదు బిల్ గేట్స్   మైక్రోసాఫ్ట్ పెట్టిన తొలి రోజుల్లో ఆయన ఆహ్వానంపై  అందులో చేరిన సిమోనీ అనే హంగేరియన్ అమెరికన్,  జీవితంలో  ఎంతగా ఎదిగి పోయాడంటే , అతడు వందల కోట్లు పెట్టి టికెట్లు కొనుక్కుని రెండు సార్లు అంతరిక్షంలోకి యెగిరి  వెళ్లి రాగల సంపన్నుడయ్యాడు.
అదీ మైక్రో సాఫ్ట్ షేర్ల మహాత్మ్యం అంటే.

(2010)

20, మే 2014, మంగళవారం

రివైండ్ 2010 - ఎనిమిదో భాగం


కన్నంతలో విన్నంతలో అమెరికా  
నౌకావిహారంలో భాగంగా ఒక లేడీ గైడ్ - చుట్టుపక్కల విశేషాలను మా అందరికీ ఎంతో ఆసక్తి కరంగా వివరిస్తూ - అదిగో ఆ వొడ్డుపై చెట్ల గుంపు వెనక కనిపిస్తున్న సౌధాన్ని చూడండి. యావత్ ప్రపంచంలో అత్యంత సంపన్నుడయిన వ్యక్తి అక్కడ నివసిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ భవనం అది అని చెబుతూ అందులోని విశేషాలను వర్ణించడం మొదలు పెట్టింది.


బిల్ గేట్స్ నెలసరి ఆదాయం సరిగ్గా చెప్పాలంటే చేసే వ్యాపారంలో అన్ని ఖర్చులు పోను మిగిలే నికర లాభం అన్నమాట కొన్ని వందల కోట్లు వుంటుందని అంచనా. ఇంత డబ్బుగల ఆసామీ ఇల్లు ఎంత గొప్పగా వుంటుందో అని వూహించుకోవడం సహజమే మరి. ఆ లేడీ గైడ్ చేయి చాపి చూపినవైపు చూపు సారించి చూస్తే - దూరంగా తీరం, ఎత్తయిన వొడ్డు, దానిపై వత్తుగా మరింత ఎత్తయిన వృక్షాలు, వాటి కొమ్మల మధ్య లీలగా కానవచ్చే ఓ భవనం ఓస్ ఇంతేనా అనిపించింది.
 కానీ లేడీ గైడ్ చెప్పే విశేషాలు మాత్రం ఇన్నీ అన్నీ కాదు మరి
పాత కొత్తల మేలుకలయికగా ఆ ఇంటిని డిజైన్ చేసారని చెబుతారు.
సోఫాలు,కుర్చీలు,మంచాలు ఇలాటివన్నీ చాలా పాత కాలానికి చెందిన యాంటిక్ ఫర్నిచర్గా కనిపిస్తాయి. ఇతర ఉపకరణాలన్నీ భవిష్యత్ తరానికి తగ్గట్టుగా రూపొందించారు. అవి చూసినా విన్నా అదరహోఅనాల్సిందే.

యావత్ ప్రపంచానికే టెక్నాలజీ సమకూర్చి పెట్టినవాడికి తన ఇంటిని ఒక సాంకేతిక అద్భుతంగా తీర్చిదిద్దుకోవడం పెద్ద విశేషమేమీ  కాకపోవచ్చు. కానీ కనే వారికీ, వినే వారికీ ఆ నివాసం వింతల్లో వింతే.

రివైండ్ 2010 (ఏడో భాగం)


కన్నంతలో విన్నంతలో అమెరికా  
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ప్రవేశించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అయినా గట్టిగా ప్రయత్నించి అనుమతి సంపాదించాను. ప్రెసిడెంట్ వెకేషన్ లో వున్నారు. అందువల్ల - శ్వేత సౌధంలో మీడియా వ్యవహారాలూ చూసే ఒక ఉద్యోగిని మాటల్లో పెట్టి ఓవల్ ఆఫీసు’ (వైట్ హౌస్ లో ప్రెసిడెంట్ కార్యాలయం) ను కూడా చూసాను.
 ఆయన కుర్చీ పక్కన రెండు బటన్లు కనిపించాయి. వొకటి నొక్కితే మూడో ప్రపంచ యుద్ధానికి తెరతీయడానికి, రెండోది నొక్కితే అణు యుద్ధం ప్రారంభించడానికి అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు వీలుగా వాటిని అమర్చారని నాలో నేనే ఏదో వూహించుకుని ఆ విషయమే నా వెంట వచ్చిన ఆ తెల్ల పిల్లతో అన్నాను. పెద్ద వయస్సులేని ఆ అమ్మడు చిరునవ్వు నవ్వి ఇలా అంది. మీ ఊహల్నిఅలా అంతంత దూరం పోనివ్వకండి. ఆ ఎర్ర బటన్ నొక్కితే ప్రెసిడెంట్ కి కాఫీ కావాలని అర్ధం. పచ్చ బటన్ నొక్కితే బర్గర్ కూడా తీసుకు రావాలని సంకేతం.



(లేక్  వాషింగ్టన్ లో నౌకావిహారం)

తెలియని విషయాలను గురించి మామూలుగా  మామూలు మనుషులు వూహించుకునే తీరుతెన్నులపై - ఓ నలభై ఏళ్ళక్రితం చదివిన ఈ జోక్ సియాటిల్ లోని -  లేక్ వాషింగ్టన్’ (సరస్సు) లో ఓ ఆదివారం నాడు పెద్ద మర బోటులో విహరిస్తున్నప్పుడు గుర్తుకు వచ్చింది. విశాలమయిన ఈ మంచినీటి సరస్సు కొన్ని మైళ్ల దూరం విస్తరించి వుంది. (2010)

పనిచెయ్యని 'బూచి' మంత్రం


స్వాతంత్య్రానంతరం భారత దేశరాజకీయలు ఒక కొత్త మలుపు తిరగబోతున్నాయి. గాంధీ నెహ్రూ కుటుంబానికి చెందని ఒక రాజకీయనాయకుడు, దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత జన్మించిన ఓ వృద్ధ యువకుడు మొదటిసారి ప్రధాని పదవిని చేపట్టబోతున్నాడు. అంతేకాదు భారత దేశం వంటి ఓ శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశానికి బలహీనవర్గాలకు చెందిన వ్యక్తి అధికార పగ్గాలను అందుకోబోతున్నాడు. రాజకీయాలను ఓ పక్కనబెట్టి చూస్తే నిజంగా ఇది ఒక శుభ పరిణామం అనే చెప్పాలి.


దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ అనేది యెంత ప్రభావశీలి అయినప్పటికీ కొందరి దృష్టిలో అది ఇప్పటికీ ఎప్పటికీ మతోన్మాద పార్టీ. పార్టీ ఒక్కటే కాదు ఇప్పుడు దానికి నాయకత్వం వహిస్తున్న నరేంద్ర మోదీ సంగతి చెప్పనక్కరలేదు. ఆయన పేరు వింటేనే కొందరికి కంపరం. మోదీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తేనే సహించలేక కొందరు నాయకులు ఎన్డీయే కూటమి నుంచే తప్పుకున్న సందర్భాలు వున్నాయి. కర్నాటకు చెందిన ఓ ప్రసిద్ధ రచయిత మోదీ ప్రధాని అయితే తాను భారత దేశం విడిచి పెట్టి వెళ్ళిపోతానని శపధం పూనాడంటే ఆయనంటే కొన్ని వర్గాలలో వైమనస్యం  ఏ స్థాయిలో వున్నదీ అర్ధం చేసుకోవచ్చు. పదేళ్ళ పాలన తరువాత ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో తాటి ప్రమాణంలో వుందని తెలిసిన తరువాత కూడా ఎన్నికల అనంతరం ఏర్పడే ప్రభుత్వానికి తామే నాయకత్వం వహిస్తామని కాంగ్రెస్ అధిష్టానానికి చెందిన కొందరు నాయకులు ధీమాతో కూడిన ప్రకటనలు చేయడానికి కారణం కూడా కొన్ని రాజకీయ పార్టీలు బీజేపీ ని ఒక అంటరాని పార్టీగా పరిగణించే తత్వానికి అలవాటుపడివుండడమే. బీజేపీని ఒక బూచిగా చూపించి తమ పబ్బం గడుపుకోవాలని కాంగ్రెస్ పెంచుకున్న ఆశలపై ప్రజలు నీళ్ళు చల్లారు. అది కూడా ఏదో మామూలుగా కాదు, చీత్కరించినట్టు పెద్దపెట్టున తిరస్కరించారు. నూటపాతికేళ్ల పైచిలుకు చరిత్ర కలిగిన, దేశాన్ని ఎక్కువ సంవత్సరాలు పాలించిన రికార్డు ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ పార్టీని అతి తక్కువ స్థానాలకు పరిమితం చేసి 'మా దృష్టిలో ఇదీ మీ స్థానం' అని తేటతెల్లం చేశారు. ఇంతటి ఘన  విజయాన్ని మూటగట్టుకోగలిగిన స్థోమత వస్తుతః మోదీకి వున్నప్పటికీ, నిజం చెప్పాలంటే ఇందులో కాంగ్రెస్ నిర్వాకం కూడా చాలా వుంది. స్వయంకృతాపరాధాలకు ఆ పార్టీ చెల్లించిన మూల్యంగా చెప్పుకోవచ్చు.
పెద్ద బాధ్యత భుజానికి ఎత్తుకుని మోదీ ఇంత పెద్ద పదవిని స్వీకరించబోతున్నారు. ఆయన తమ బతుకుల్ని మారుస్తాడనే ఆశతో జనం ఆయనకు ఈ పగ్గాలు అప్పగించారు. ఎవరిమీదా ఆధారపడకుండా, నిష్క్రియాపరత్వానికి ఇతరులపై నిందమోపి తప్పుకునే వీలులేకుండా తిరుగులేని సంఖ్యాబలంతో అధికారాన్ని దఖలు పరిచారు. ఇక బంతి మోదీ కోర్టులో వుంది. ఇన్నాళ్ళు చెబుతూ వచ్చిన మాటలు నీటి మీది రాతలు కావు, రాతి మీది గీతల్లా చెక్కుచెదరవని నిరూపించుకోవాల్సిన నైతిక బాధ్యత ఆయన భుజస్కందాలపైనే వుంది.
దేశాన్ని ఒక కొత్త మలుపు తిప్పుతారో, తానే ఓ మలుపు తిరిగి తానులో ముక్కనని నిరూపించుకుంటారో కాలమే తేలుస్తుంది. (20-05-2010)

రివైండ్ - 2010 ఆరో భాగం


కన్నంతలో విన్నంతలో అమెరికా :
వాషింగ్టన్ స్టేట్ (అమెరికా రాజధాని వేరు- ఆ దేశపు మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ పేరు ఈ రాష్ట్రానికి పెట్టారు) లో లీవెన్ వర్త్ అనే ఒక టూరిస్ట్ పట్టణం వుంది. జర్మనీ లోని బవేరియన్ సంస్కృతీ మూలాలు ఇక్కడ స్పుటంగా కానవస్తాయి.వేనాచీ నదీ తీరంలోని ఈ లీవెన్ వర్త్ జనాభా రెండువేలు. కానీ దీన్ని సందర్శించే వారి సంఖ్య రోజూ వేలల్లో వుంటుంది. వారాంతపు సెలవు దినాల్లో ఇది కిటకిటలాడిపోతూ వుంటుంది. ప్రతి ఏటా అక్టోబర్ లో నిర్వహించే ఉత్సవాలకు అనేక దేశాలనుంచి టూరిస్టులు రావడం ఆనవాయితీ. ఇక్కడ నిర్మాణాలన్నీ ప్రాచీన బవేరియన్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంటాయి. రుచికరమయిన వైన్ తయారీకి ప్రసిద్ధి.


ఒకప్పుడు కలప వ్యాపారంపై ఆధారపడిన ఈ చిన్ని పట్టణం తరువాత ఆర్ధికంగా పూర్తిగా చితికి పోయి- తదనంతర కాలంలో టూరిజాన్ని నమ్ముకుని ఇప్పుడు శోభాయమానంగా విలసిల్లుతోంది. టూరిస్టులను ఉల్లాసపరచడానికి స్తానికులు రోడ్ల పక్కనే పలు రకాల సంగీత నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు.



స్తానికంగా తయారయ్యే పలు రకాల వైన్ లను, తినుబండారాలను ముఖ్యంగా సాస్లను మచ్చుకు రుచి చూపిస్తారు. వైన్ వంటివాటిని అనేక పర్యాయాలు రుచి చూస్తూ కాలక్షేపం చేసేవారిని - ఇక్కడ ఒక రకం సాస్’ (మిరపకాయల రసంతో తయారు చేస్తారు) దిమ్మదిరిగేలా చేయడం కళ్ళారా చూసాము. అదేమిటో , దాన్ని ఎలా తయారు చేసారో తెలియదు కానీ ఒక్కటంటే ఒక్కచుక్క నాలిక తాకగానే - శరీరం ఆపాదమస్తకం నిలువునా దహించిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. అది రుచి చూసి గింగిరాలు తిరిగిపోతున్నవారిని చూస్తుంటే మన వైపు గుంటూరు మిరప ఘాటుమించిన పదార్ధం వుందనిపించింది. ఒక సీసా కొనుక్కువచ్చాము కానీ రుచి చూసే సాహసం మాత్రం చేయలేదు. (2010)