16, అక్టోబర్ 2020, శుక్రవారం

నీళ్ళ యుద్ధాలు – భండారు శ్రీనివాసరావు

కనీవినీ ఎరుగని కుంభవృష్టి  నేపధ్యంలో చాలా హృదయ విదారక దృశ్యాలు, కొన్ని అవాంఛిత సంఘటనలు చూడాల్సివస్తోంది. హైదరాబాదులో అక్కడెక్కడో వరద నీటి ప్రవాహం తమ ఇళ్ళను ముంచెత్తకుండా  ఒక కాలనీ వాళ్ళు గండి కొట్టే ప్రయత్నం చేస్తే కొంచెం దిగువన ఉన్న కాలనీ వాళ్ళు అభ్యంతరం చెప్పడంతో  మాటామాటా పెరిగి, చేతులు కలుపుకుని, కర్రలతో కొట్టుకునేదాకా వెళ్లిందని ఓ టీవీలో స్క్రోలింగులు  చూశాను.

ఓ ఇరవై ఏళ్ళ క్రితం ఇలాగే  నాకు తెలిసిన కుటుంబం  నగరంలో ఒక కాలనీలో రెండంతస్తులతో ఇల్లు కట్టుకున్నారు. మేము గృహ ప్రవేశానికి  కూడా వెళ్ళాము. ఇంటి ఎదురుగా పెద్ద చెరువు. కాకపోతే నీళ్ళు  ఆట్టే లేవు. వీళ్ళ ఇల్లు  నిజానికి ఆ చెరువుకు నీళ్ళు పారే ప్రదేశంలో వుంది. చెరువుకు నీళ్ళు వస్తే ఇబ్బంది పడతారేమో అని చెప్పాలనిపించింది.  కానీ సందర్భం కాదేమో అని ఊరుకున్నాను.

అంత చక్కటి ప్రదేశంలో మంచి ఇల్లు కట్టుకున్నందుకు వచ్చిన వాళ్ళు అందరూ గృహస్తును  అభినందించారు. అప్పటికే ఆ కాలనీలో చాలా సుందర భవంతులు వెలిశాయి. చూడగానే సంపన్నుల కాలనీ అనిపించేదిగా వుంది. ఆ రోజుల్లో  ముఖ్యమంత్రికి నగర సుందరీకరణ మీద మక్కువ ఎక్కువ కావడంవల్ల ఆ చెరువు కట్టను అందమైన మినీ టాంక్ బండుగా తీర్చిదిద్దారు. దానితో ఆ కట్టకు దిగువన దీనిని తలదన్నే మరో కాలనీ  వెలిసింది. సరే కొంత కాలం ఆ కాలనీ వాళ్ళు, ఈ కాలనీ వాళ్ళు సఖ్యంగానే వున్నారు.

ఆ సమయంలో ఇప్పటిలాగే కనీవినీ ఎరుగని వర్షాలు కురిసి  చాలా కాలనీలు వరద ముంపుకు గురయ్యాయి. చెరువు నిండి ఆ ప్రవాహం వెనక్కి రావడంతో ఎగువ కాలనీలోని ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చాయి. మునిగిపోతాయన్న భయంతో వాళ్ళు ఆ చెరువు కట్టకు గండి కొట్టే ప్రయత్నం చేయబోయారు. అంతే! దిగువన వున్న కాలనీవాళ్ళు గండి కొడితే తమ కాలనీ మునిగిపోతుందని భయపడి ఎగువ కాలనీ వాళ్లకు ఎదురు తిరిగారు. అప్పటిదాకా  సఖ్యతగా ఉన్న రెండు కాలనీల వాళ్ళు ఒకరికొకరు పరమ శత్రువులు అయిపోయారు.

ఈ లోగా వరుణుడు శాంతించడం, వరద తగ్గు ముఖం పట్టడంతో పెద్ద సంఘర్షణకు అవకాశం లేకుండా పోయింది.

ప్రకృతి ప్రజలకు ఉచితంగా ప్రసాదించే నీరు తక్కువైనా కష్టాలే, ఎక్కువైనా కష్టాలే! అయితే ఈ కష్టాలకు తామే కారణం అని ప్రజలకూ తెలుసు. కానీ తెలియనట్టుగా ఉండిపోతారు. (16-10-2020)

కామెంట్‌లు లేవు: