జగన్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జగన్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, అక్టోబర్ 2020, మంగళవారం

అసిధారావ్రతం

 


‘మా వెబ్ ఛానల్ కు మీరు ఓ ఇంటర్వ్యూ ఇవ్వాలి, జగన్, కోర్టుల వ్యవహారం మీద’

‘తప్పకుండా. కానీ  అసిధారావ్రతం అనే కండిషన్ మీద

‘అంటే!..’ అన్నదా అమ్మాయి.

నేనూ దాని ఉత్పత్తి అర్ధం జోలికి పోలేదు, పైగా దాని అసలు అర్ధం తెలియకపోవడం మంచిదే అనుకున్నాను.

‘ఏమీ లేదు, కోర్టులకు సంబంధించిన వ్యవహారం కదా! అంచేత మీరు ఏ ప్రశ్న అయినా అడగండి, నాకు అభ్యంతరం లేదు, నేను మాత్రం ఆచితూచి మాట్లాడతాను, మీకేమయినా అభ్యంతరమా

లేదనిపించుకున్న తరవాత ఇంటర్వ్యూ మొదలయింది.

‘ఇప్పుడు ఇలా కోర్టుల మీద యుద్ధం ప్రకటించిన ఏపీ సీఎం జగన్ మోహన రెడ్డికి ఎలాంటి చిక్కులు ఎదురు కాబోతున్నాయి?

‘ఆయనకు ఎదురయ్యే చిక్కుల సంగతి ఏమో కానీ కోర్టుల పట్ల గౌరవంతో కూడిన భయం కారణంగా, రాజకీయ నాయకులు అందరూ  నోరు సంభాళించుకుని మాట్లాడే పరిస్థితి వస్తే జనం చాలా చిక్కులనుంచి బయట పడతారు.’

సరిగ్గా ఇలాగే కాకపోయినా  ఇంటర్వ్యూ ఇలాగే మొదలయింది.

‘ఈ పరిణామాలను వ్యవస్థల మధ్య ఘర్షణగా భూతద్దంలో చూపిస్తున్నారు. నిజానికి ఇది వ్యక్తుల నడుమ, ఇంకా బాగా చెప్పాలంటే రెండు ప్రాంతీయ పార్టీల నడుమ ఎంతో కాలంగా సాగుతూవస్తున్న సంఘర్షణకు పరాకాష్టగా నేను అనుకుంటున్నాను.

‘ఏ వ్యవస్థ అయినా వ్యక్తుల సమూహమే. వ్యక్తులకు వుండే సహజమైన బలాలు, బలహీనతలు ఒక్కొక్కసారి వ్యవస్థల మీద ప్రతిఫలిస్తుంటాయి. అది వ్యవస్థ తప్పుకాదు, కానీ అలాంటి వ్యక్తుల కారణంగా వారు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవస్థల మీద మచ్చ పడే ప్రమాదం వుంది.

‘కొందరు రాజకీయ నాయకులు మంచి ప్రజాదరణతో గద్దె ఎక్కుతారు. ఏదో చేయాలన్న తపనతో పాటు ఎవరినో సాధించాలి అనే ఆరాటం కూడా వారిలో వుంటుంది. శ్రీమతి గాంధి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకురాలు. ఇదే బలహీనత ఆమెను అధికారానికి దూరం చేసింది. ఆ తరువాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జనతా పార్టీ ప్రజలకు హామీ ఇచ్చిన పనులు చేయడం కంటే ఇందిరాగాంధీని రాజకీయంగా భ్రస్టు పట్టించడానికే ఎక్కువ సమయం వినియోగించింది. వీటిని ప్రజలు ఎలా గమనిస్తున్నారు అనే విషయం ఆ తదుపరి జరిగిన ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.

‘ఇక జగన్ మోహనరెడ్డి విషయానికి వస్తే రెండేళ్ల కంటే కొంచెం తక్కువగా, ఇంతవరకు  సాగిన ఆయన పాలనలో ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను ఏపీ హైకోర్టు తప్పుపట్టింది. మొట్టికాయలు, అక్షింతలు  అని మీడియా వ్యవహరిస్తున్న వీటి సంఖ్య సుమారు నూరువరకు ఉండొచ్చని అంచనా. విచారణ సందర్భంలో  న్యాయమూర్తులు చేసే వ్యాఖలకు  కూడా  మీడియా  విశేష  ప్రాధాన్యం  ఇస్తోంది. వాటిమీద  మళ్ళీ  చర్చలు. ఏతావాతా తమ ప్రభుత్వంపై  అన్యాపదేశంగా  జరుగుతున్న దాడి అనే అనుమానం వారిది.

అయితే  కోర్టుల వ్యాఖ్యల తీరుతెన్నుల ఆధారంగానే  జగన్  పాలన రాజ్యాంగ సమ్మతంగా లేదని కొందరు నిర్ధారిస్తున్నారు. సరే. ఒప్పుకుందాం. కానీ చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండుసార్లు సరయిన టైం చూపిస్తుంది. అటువంటప్పుడు ఇన్ని నిర్ణయాలు వరసగా కోర్టుల స్క్రూటినీలో  తప్పని తేలుతున్నప్పుడు ఎందుకిలా జరుగుతోంది, దీని వెనకాల ఏముంది  అనే అనుమానం వరసగా అక్షింతలు వేయించుకుంటున్న వారికి  కలిగితే దాన్ని మాత్రం ఎలా తప్పుపట్టగలం.

కొందరు న్యాయమూర్తుల పనితీరు, లేదా వారి నిర్ణయాల పట్ల సందేహాలు  వ్యక్తం చేస్తూ చేసిన ప్రకటనను కూడా న్యాయ వ్యవస్థ పట్ల తమ ప్రభుత్వానికి ఎనలేని గౌరవం వుందని ఉద్ఘాటిస్తూనే మొదలుపెట్టారు. ఈ ఫిర్యాదును  నేరుగా సుప్రీం కోర్టు  ప్రధాన న్యాయమూర్తి  దృష్టికే లిఖిత పూర్వకంగా దాఖలు చేసుకున్నారు. ఇది ఒక వ్యక్తిగానే కాకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ఆయనకు ఉన్న హక్కు. దానిని ఆయన ఉపయోగించుకుంటే ఎలా తప్పుపడతాం చెప్పండి. కాకపొతే, సర్వోన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తికి ఒక ఫిర్యాదు ఇచ్చిన తరువాత, కొంత సమయం ఇచ్చి  వేచి వుండాల్సింది. ఈ లోపలే ఆ విషయాన్ని మీడియా ద్వారా బహిరంగ పరచడం నైతికంగా చూసినప్పుడు పొరబాటే. న్యాయస్థానం  దీన్ని  కోర్టు ధిక్కరణ కింద  పరిగణించే అవకాశం వుంది.

‘కానీ  వర్తమాన రాజకీయాల్లో తప్పుఒప్పుల నడుమ విభజన రేఖ ఎప్పుడో చెరిగిపోయింది. ఎలాగంటే ఒక పార్టీ నాయకుడు రాష్ట్రపతికి ఓ లేఖ రాస్తారు. అది ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కు చేరకమునుపే అందులోని విషయాలను మీడియాకు వెల్లడిస్తారు. అయితే సుప్రీం కోర్టు  ప్రధాన న్యాయమూర్తికి చేసిన  ఫిర్యాదు, రాష్ట్రపతికి ఇచ్చిన విజ్ఞాపన పత్రం ఒకటేనా అనే సందేహం మీకూ, నాకూ  రావచ్చు. కానీ రాజకీయాల్లో ఈ విధమైన విచక్షణ నానాటికీ లుప్తం అవుతోంది.

‘పునరుక్తి దోషం అయినా మళ్ళీ ఒకసారి చెప్పాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతోంది, రాజ్యాంగ వ్యవస్థల నడుమ ఘర్షణ కాదు, రెండు రాజకీయ పార్టీల నడుమ కొనసాగుతూ వస్తున్న సంఘర్షణ ఈ రూపం తీసుకుంటోంది.  

‘ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోర్టుల పట్ల చేసిన వ్యాఖ్యలను గురించి అడిగారు. ఈ పిటీషన్ విచారణ సందర్భంలో న్యాయమూర్తి ఒకరు ఒక ప్రశ్న అడిగారు. ‘ఈ వ్యాఖ్యలు ఆయన సభలో చేసారా లేక బయట చేసారా’ అని. ‘తిరుమలలో చేశార’ని జవాబు వచ్చిన జ్ఞాపకం. అంటే సభ వెలుపల చేస్తే కోర్టు ధిక్కరణ కిందికి రావచ్చేమో. సభలో చేస్తే స్పీకర్ కూడా రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న కారణం చేత అలాంటి తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చేమో!

‘ఇదే సూత్రం సోషల్ మీడియాకు కూడా వర్తిస్తుందా? నాకు అంత న్యాయ శాస్త్ర పరిజ్ఞానం లేదు. కోర్టు బయట చేసిన ఇలాంటి వ్యాఖ్యలు  కూడా న్యాయమూర్తుల అభిశంసనకు గురవుతాయా అనేది  న్యాయ కోవిదులే చెప్పాలి.

‘ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్య ప్రియులకు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటికి ఎంత త్వరగా ముగింపు పలికితే అంత శ్రేయస్కరం  

ఇలాగే సాగింది ఆ ఇంటర్వ్యూ. అచ్చం ఇలాగేనా అంటే కొంత వాచకంలో తేడా వుండి ఉండొచ్చు.

తోకటపా:

ఇక ఆ అమ్మాయి అడిగిన ‘అసిధారావ్రతం’ అంటే ఏమిటో నేను చెప్పలేదు కదూ.

‘చాలా కష్టమైన పని’ అనే అర్థంలో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తారు.

అసి అంటే కత్తి. ధారా అంటే అంచు. అసిధారావ్రతమంటే కత్తి అంచు మీద పడుకోవడమనేది భౌతికార్థం!

నిజానికి ఇది బ్రహ్మచర్య దీక్షలో ఒక భాగం. మనసు నిలకడస్థితికి పరీక్ష పెట్టే వ్రతమిది. నాతిగల బ్రహ్మచర్యం విషయంలో కూడా వాడతారు.

ఇక నా కవి హృదయం ఏమిటంటే కోర్టుల వ్యవహారాలు  గురించి  వ్యాఖ్యానించేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి అని. (13-10-2020)


Note: Courtesy Image Owner




28, ఏప్రిల్ 2020, మంగళవారం

నచ్చడు! నచ్చడంతే!!



అదేదో సినిమాలో ఓ క్యారక్టర్ అంటుంది ‘నాకు నీ ఫేస్ నచ్చలేదు’ అని.
అంటే అతడి మొహం నచ్చకపోతే ఆ వ్యక్తిలో నచ్చదగిన ఏ లక్షణాలు లేనట్టేనా!
ఈ మానసిక వ్యాధికి ఏదన్నా పేరు ఉందేమో తెలియదు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గురించి సాంఘిక మాధ్యమాల్లో వస్తున్న విపరీత వ్యాఖ్యానాలు చూస్తుంటే ఒకటి మాత్రం సత్యం అనిపిస్తోంది. చంద్రబాబును నచ్చని వారు ఈ జన్మలో అతడ్ని మెచ్చరు. అలాగే జగన్ మోహన రెడ్డి. ఇతడ్ని ద్వేషించేవారికి అందుకు ప్రత్యేకమైన కారణం అక్కరలేదు. ఆ సినిమాలో చెప్పినట్టు జస్ట్ జగన్ మాకు నచ్చడు, నచ్చడంతే! అంతే కాదు, అతడేమి చేసినా మంచయినా సరే మాకు నచ్చదు, నచ్చదు నచ్చదంతే. చంద్రబాబును నరనరాన ద్వేషించేవారిది కూడా ఇదే తరహా! ఆయన ఏ పని చేసినా మాకు నచ్చదు, నచ్చదు గాక నచ్చదు. మరో మాట లేదు.
మరో విషయం ఏమిటంటే వీరెవ్వరూ వాళ్ళపార్టీల కార్యకర్తలు కాదు, వారి అనుచరులు కాదు. వాళ్ళు గెలిచినా, ఓడినా వీళ్ళకు ఒరిగేది లేదు, తరిగేది లేదు. ఏదో ప్రయోజనం ఆశించి పెంచుకున్న అభిమానం కాదు వీరిది.
అయినా సరే! మేమింతే మేము మారం అనేది వీరి నినాదం. నాకో డౌటనుమానం. అదేమిటంటే వీరిలో ఎవరికయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు హక్కు వుందా!


(ఎవరి ఫోటో ముందు పెట్టాలి అనేదానిపై వాదులాట మొదలయినా ఆశ్చర్యం లేదు)

19, ఆగస్టు 2016, శుక్రవారం

మారుతున్న తరాలు

మారుతున్న తరాలు

“తనకు అందరూ తెలుస్తారు. కానీ తనెవరో అందరికీ  తెలియదు.
అందర్నీ తను గుర్తుపడతాడు, గుర్తుంచుకుంటాడు, కానీ తానెవరో వారికి గుర్తుండకపోవచ్చు.”
ఈ పొడుపు కధకు సమాధానం ‘జర్నలిష్టు’. మరీ ఖచ్చితంగా చెప్పాలంటే మాజీ జర్నలిష్టు. అంటే రిటైరయిన జర్నలిష్టు.
అతడికి ఎప్పటికీ మిగిలేవి జ్ఞాపకాలే.
జర్నలిష్టుగా వున్న రోజుల్లో వృత్తి రీత్యా  అనేకమందితో ముఖపరిచయం సహజం. మరి  కొందరితో అతి పరిచయం కూడా అంతే సహజం.
బాగా పాత తరానికి చెందిన జలగం వెంగళరావు, అంజయ్య, నేదురుమల్లి జనార్ధన రెడ్డి, రోశయ్య మొదలయిన వారితో చాలా సాన్నిహిత్యం వుండేది.  మరో ముగ్గురు ముఖ్యమంత్రులు  చంద్రబాబు, వైయస్సార్ లతో  చెప్పుకోదగ్గ పరిచయం వుండేది. కేసీఆర్ గతంలో మంత్రిగా వున్నప్పుడు మిగిలిన జర్నలిష్టులతో పాటే నాకూ ఆయనతో మంచి పరిచయమే వుండేది.
వీరి వారసులు, నేటి తరం యువ నాయకులు  జగన్, కేటీఆర్, లోకేష్ లతో ముఖ పరిచయం కాదుకదా ఎన్నడూ ఎదురుపడి  కలుసుకోవడం కూడా జరగలేదు. ప్రెస్ క్లబ్ పుణ్యమా అని కేటీఆర్ ని ఓసారి  కలిసాను. జగన్ మోహన రెడ్డిని  టీవీల్లో చూడడమే.  చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు లోకేష్ చిన్న పిల్లవాడు. జూబిలీ హిల్స్  లోని  వాళ్ళ ఇంటికి  తరచూ వెడుతూ వున్న రోజుల్లో బయట  కనబడేవాడు. పెద్దయి రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కలిసే సందర్భం ఎన్నడూ  తారసపడలేదు.
రాత్రి జనార్ధన్ అమ్మాయి పెళ్ళిలో కనబడ్డారు. టీడీపీ నాయకుడు  దినకర్, ఎన్టీవీ రుషినీ, నన్నూ  పలానా అని ఆయనకి పరిచయం చేశారు.
అంత హడావిడిలో కూడా ఆయన మా దగ్గర కాసేపు  ఆగి,  ‘అమరావతికి ఎప్పుడు వస్తున్నారు అని రుషిని ప్రశ్నిస్తూ  నా వైపు చూసి, టీవీ ఎనలిష్టు  అంటూ చిరునవ్వుతో పలకరించి ముందుకు వెళ్ళిపోయారు.
మూడు దశాబ్దాలకు పైగా పనిచేసిన రేడియో, డీడీ ‘చెవులు’ ఎటుపోయాయో, కొత్తగా వచ్చిన ఈ టీవీ ఎనలిష్టు ‘కొమ్ములు’ ఏవిటో! ముందు బోధపడలేదు.
ఆలోచిస్తే  అర్ధం అయింది. నిజమే. నేనూ  ఇలా ప్రవర్తించిన వాడినే.
నాకంటే  పాతతరం వాళ్ళు  ఎప్పుడూ నాగయ్య, నారాయణరావు, శ్రీ రంజని గురించి మాట్లాడుతుండేవాళ్ళు. అప్పటికే ఏ యెన్ ఆర్, ఎన్టీఆర్  తరం వచ్చేసింది. నాగయ్య  అనగానే  మంచం మీద దగ్గుతూ, గెడ్డం నెరిసిన మనిషే  కళ్ళల్లో మెదిలేవాడు. గతంలో ఆయన తారాపధంలో  ఓ వెలుగు వెలిగిన సంగతులు  మా  పాత తరం వాళ్లకు  తెలుసు కానీ  మాకు తెలియవు. అలాగే  నేటి తరం అస్తమానం తలచుకుండే తారలని  సినిమాల్లో చూసినా  గుర్తు పట్టలేని  పరిస్తితి  మా తరానిది.
ఈ సత్యం బోధపడితే  తరాల  అంతరాల్లో తేడాలని సరిగ్గా అర్ధం చేసుకోవచ్చు. లేకపోతే మిగిలేవి అపార్ధాలే!       


14, సెప్టెంబర్ 2012, శుక్రవారం

చిన్నసార్లు వస్తున్నారు – భండారు శ్రీనివాసరావు


చిన్నసార్లు వస్తున్నారు 
దేశంలో అతిపెద్ద రాష్ట్రం  అయిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అతిపిన్న వయస్కుడయిన అఖిలేష్ యాదవ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన దరిమిలా తలలు పండిన రాజకీయ నాయకుల్లో చిన్న కదలిక మొదలయింది.  రేపో మాపో తమ రాజకీయ వారసులను తెర మీదకు తీసుకు రావాలని పధకాలు రచిస్తున్న రాజకీయ పితాశ్రీలందరూ  ఆ పని ఇంకా ఎంతమాత్రం ఆలశ్యం చేయకుండా వెనువెంటనే ఆచరణలోకి తీసుకురావాలని తొందర పడుతున్నారు. ఈ  విషయంలో  మాత్రం అన్ని పార్టీల నాయకులదీ, ప్రత్యేకించి అవకాశం వున్న నాయకులందరిదీ ఒకే తీరు.
అఖిల భారత స్తాయిలో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ రాజకీయ రంగ ప్రవేశం అంతగా కలిసి రాకపోయినా ఆ పార్టీకి అంతకంటే ప్రత్యామ్నాయం లేదు. భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీని చూడడం ఒక్కటే ఆ పార్టీ శ్రేణుల లక్ష్యం. రాహుల్ గాంధీకి ఆ నాయకత్వ లక్షణాలు, ప్రతిభా పాటవాలు వున్నాయా లేదా అన్న దానితో వారికి నిమిత్తంలేదు. ఆ పార్టీకి చెందిన అధి నాయకులు, ముఖ్యమంత్రుల నుంచి అట్టడుగు నాయకులవరకు ఇదే వరస. ఎవరిని కదిలించినా ఇదే మాట చెబుతారు. ఇటీవల జరిగిన యూ పీ ఎన్నికల్లో మొత్తం బాధ్యతను రాహుల్  ఒంటి భుజం మీదకు ఎత్తుకుని వొంటరిగా  పాటుపడ్డా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరకలేదు. ఇదే వేరొకరయితే అతగాడి రాజకీయ భవితవ్యం పార్టీలో ప్రశ్నార్ధకంగా మారివుండేది. అధినేత్రి కుమారుడు కాబట్టి పరాజయ కారణాలకు అతడిని బాధ్యుడుడిని చేయలేదు. అందుకే ఇంకా ఆయన్ని భావి భారత ప్రధాని అభ్యర్ధుల జాబితానుంచి తొలగించలేదు.
అప్పుడప్పుడు, అడపాదడపా ప్రియాంకా గాంధీ పేరు నలుగుతున్నప్పటికీ, రాహుల్ మాత్రమే ఇప్పటికీ దారీ తెన్నూ లేని కాంగ్రెస్ పార్టీకి దారి చూపే  చుక్కాని. ప్రధాని అభ్యర్ధిగా పార్టీ శ్రేణులు రాహుల్ భజన చేస్తున్నప్పటికీ జనం ఆమోదం లభించడానికి మాత్రం మరో రెండేళ్ళు వేచివుండక తప్పదు, గత్యంతరం లేక మధ్యంతరం ముంచుకు వస్తే తప్ప.
మరో జాతీయ పార్టీ బీజేపీకి ఈ ‘యువరక్తం’ గొడవలేదు. అక్కడి అగ్రనాయకులందరూ కురు వృద్ధులే. మోడీ పేరు మీడియాలో మోగుతున్నప్పటికీ, వయస్సు రీత్యా ఆయనంత కుర్రకారేమీకాదు. నడికారు దాటినవాడే.
ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే, యువతరం నాయకుడిగా జగన్ జనంలోకి దూసుకు పోతున్నాడు. ఆయన్ని ఎదుర్కునే రాజకీయ పార్టీలన్నీ గతంలో  చేసిన, లేదా ప్రస్తుతం  చేస్తున్న వ్యూహాత్మక తప్పిదాలే జగన్ పట్ల శ్రీరామరక్షగా మారుతూ వున్నాయి. పాతతరం నాయకులెవరికీ ఎన్నికల సమరంలో ఆయన్ని  ఎదిరించి నిలవగల సత్తా లేదని ఇటీవలి  గత చరిత్రే చెబుతోంది. వ్యక్తిగతంగా అన్ని మరకలు అంటి కూడా, అవినీతి ఆరోపణల్లో కూరుకుని పోయి కూడా, జైల్లో కాలుపెట్టి మూడు మాసాలు దాటిపోతున్నా కూడా అన్ని పార్టీల్లో వున్న దిగువ స్థాయి కార్యకర్తల చూపు వై.ఎస్.ఆర్. పార్టీ వైపు వుండడం ఆయా పార్టీల అధినాయకులకు మింగుడు పడడం లేదు. వున్న పార్టీల్లో పొసగలేక, బయటకు పోయేదారిగా భావించి పోయేవాళ్ళేకానీ అలాటివారివల్ల తమ పార్టీలకు వచ్చే నష్టం ఏముండదు అని పైకి సర్ది చెప్పుకుంటున్నా లోలోపల ఎవరి భయాలు వారికి వున్నాయి. అందుకే ‘యువ రక్తం’ పేరుతొ కొత్త నాయకులను పార్టీలోకి తీసుకువస్తే  ఎన్నికల  ముహూర్తం నాటికయినా పరిస్తితి  కొంతలో కొంతయినా మారక పోతుందా అన్నది వారి ఆశ. ముఖ్యంగా ఎలాటి మచ్చా లేని, అవినీతి ఆరోపణల మరకలు అంటని విద్యాధిక యువకుడు రంగప్రవేశం చేస్తే జగన్ పార్టీని కట్టడి చేయడం సాధ్యమని భావించేవాళ్ళు కూడా లేకపోలేదు.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఈ ఆవశ్యకత హెచ్చుగావున్నట్టు తోస్తోంది. ఎందుకంటే టీడీపీ వంటి ప్రాంతీయ పార్టీ రెండు పర్యాయాలకంటే ఎక్కువ కాలం అధికార పీఠానికి దూరంగా వుండడం అంటే చాలా ఇబ్బంది. కాంగ్రెస్ పరిస్తితి వేరు. జాతీయ పార్టీ కాబట్టి, రాష్ట్ర స్థాయి నాయకులు కొంతకాలం అధికారానికి దూరంగా వున్నా ఏదోవిధంగా ఓపిక పట్టగల స్తితిలో వుంటారు. మళ్ళీ అధికారానికి వచ్చినప్పుడు చూసుకుందాంలే అనే భరోసా వారిలో పుష్కలం. తమంతట తాముగా అధికారంలోకి రాలేకపోయినా, ఎదుటివారి  వైఫల్యాలే తమకు రక్షరేకుగా  భావించి,  ప్రత్యామ్నాయం కింద ప్రజలే  తమకు అధికార పగ్గాలు అప్పగించక పోతారా అన్నది వారి మరో ధీమా.
కానీ టీడీపీ పరిస్తితి ఇందుకు విభిన్నం. గత ఎన్నికల్లో గెలుపు వూరించి వూరించి చేయి జారి,  మరో ‘చేతి’లోకి పోయిందని టీడీపీ నేతలు ఇప్పటికీ చింతిల్లుతూ వుండడం చూస్తున్నాం. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అరంగేట్రం చేయడం వల్లనే మహాకూటమి మహా ఓటమి పాలయిందని లెక్కలు చెబుతుంటారు. ఇది ఒక రకంగా నిజం. కానీ, ప్రజాస్వామ్యంలో అంతా అంకెల మహత్యమే. ఒంటి చేత్తో లెక్కించగల అతికొద్ది వోట్ల తేడా వచ్చినా గెలుపు గెలుపే.


నారా లోకేష్ 

అందుకే, చంద్రబాబు నాయుడికి ఇప్పుడు ఒక కొత్త కార్డు కావాలి. టీడీపీ కంటే కూడా ఆయనకే వ్యక్తిగతంగా ఈ అవసరం ఎక్కువ. ఎన్టీ రామారావు గారు  తెలుగు దేశం పార్టీ పెట్టినప్పుడు ‘ఆంధ్రులు – ఆత్మగౌరవం’ నినాదంతో పాటు నెహ్రూ  కుటుంబం వారసత్వ రాజకీయాలను కూడా ఆయన ఎండగడుతూ చేసిన విమర్శలు కూడా  జనాలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పార్టీ స్తాపించిన తొమ్మిది నెలలల్లోనే అది అధికార అందలం ఎక్కడానికి పార్టీ అనుసరించిన ఆ విధానం బాగా  దోహదపడింది. మరి ఇప్పుడు అదే పార్టీ రాజకీయ వారసత్వ విధానాలను అనుసరిస్తే ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారన్నది బాబు  గుంజాటన. దీనికి తోడు పైకి వొప్పుకున్నా వొప్పుకోకపోయినా నందమూరి, నారా కుటుంబాల నడుమ చాపకింది నీరులా పాకుతున్న  వారసత్వ ‘రాజకీయాలు’ కూడా టీడీపీ అధినేత, తన కుమారుడి రాజకీయ రంగ ప్రవేశం విషయంలో మీనమేషాలు లెక్కించడానికి కారణమనే వారు కూడా వున్నారు.
ఏమయితేనేం, కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్టు చంద్రబాబు కుమారుడు నారా లోకేష్, ఎట్టకేలకు  ‘మంచు గడ్డను’ బద్దలు కొట్టారు. తాను టీడీపీ లో ‘కార్యకర్తగా’ పనిచేయబోతున్నట్టు ప్రకటించి ఆయన రాజకీయ అరంగేట్రం విషయంలో అలముకునివున్న అనుమానాలన్నింటినీ  ఆయనే పటాపంచలు చేశారు.        
పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగానే  పనిచేస్తానని ఓ పక్క చెప్పుకుంటూనే, యువతకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంటూ పార్టీలో తాను నిర్వహించబోయే పాత్ర ప్రాముఖ్యాన్ని చెప్పకనే లోకేష్  చెప్పారు.
అనేక అనూహ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతూ, భవిష్యత్తు పట్ల ఆందోళనతో వున్న టీడీపీ శ్రేణులకు   ఎంతో ఉత్సాహం, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి మరెంతో  వూరట కలిగించే వార్త.  పార్టీ ప్రతిష్ట వేగంగా కొడిగడుతున్న తరుణంలో చంద్రబాబు ఇటీవల స్వయంగా పూనుకుని పునరుజ్జీవ చర్యలు చేపట్టారు. బీసీ డిక్లరేషన్, ఎస్సీ వర్గీకరణ,  తెలంగాణా పై కేంద్రానికి  మరో లేఖ ఇవ్వడం వంటి పలు కీలక నిర్ణయాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ‘పాదయాత్ర’ చేయాలనే సంకల్పాన్ని కూడా  ప్రకటించారు. ఈ నేపధ్యంలో – లోకేష్ వంటి యువకుడి దన్ను వుంటే లభించే ప్రయోజనాన్ని  ఆయన అంచనా వేయకుండా వుండరు. వేయరని,  బాబు గురించి బాగా  తెలిసిన వారెవ్వరూ అనుకోరు.  (14-09-2012)                                  

15, అక్టోబర్ 2011, శనివారం

దమ్ముందా? ధైర్యముందా? – భండారు శ్రీనివాసరావు

దమ్ముందా? ధైర్యముందా? – భండారు శ్రీనివాసరావు

తర్డ్ రేట్ తెలుగు సినిమాల్లో తరచుగా వినవచ్చే  ఈ రెండు పదాలు ఈ మధ్యకాలంలో బుల్లి తెరల వార్తల్లో, చర్చల్లో పదే పదే వినబడుతున్నాయి.


మాటలు కోటలు - చేతలు బీటలు






‘జగన్ కు దమ్ముందా? చంద్రబాబుకు దమ్ముందా? రాజీనామాలు ఆమోదించే ధైర్యం దమ్మూ స్పీకర్ నాదెండ్ల కు వున్నాయా? ఆమోదించమని చెప్పే దమ్ము సీఎం కిరణ్ కు వుందా? రాజీనామాలు ఆమోదింపచేసుకునే దమ్ము ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వుందా?’


ఇలా ఎవరికి వారు ఎదుటివారిపై చెలరేగిపోయేవారే. ధైర్యం దమ్మూ తమకే వుందనీ, ఎదుటివారికి ఈ రెండూ సున్నా అని ఎగబడిచెప్పే వారే.


ఈ సవాళ్ళ అర్ధం ఏమిటి? అసలెవరికీ దమ్మూ ధైర్యం లేవనా?


ఒకటి మాత్రం వీరందరికీ తెలుసు.


అసలు సిసలు ధైర్యం దమ్మూ వున్నవాళ్ళు జనంలో వున్నారు.


కానీ వారు వాటిని బయటకు చూపడానికి ఇంకా రెండేళ్లకు పైగా టైముంది.


అదే వీళ్ళకున్న దమ్మూ ధైర్యం! (15-10-2011)