12, నవంబర్ 2020, గురువారం

అబుల్ కలాం అబ్దుల్ కలాం కాదు

 


అందరికీ అన్నీ తెలియాలని లేదు. తెలియని విషయాన్ని తెలిసిన వారిని అడిగి తెలుసుకోవడం మంచిది అనే వారు హైదరాబాదు హిందూ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ కీర్తి శేషులు శ్రీ ఆర్.జే.రాజేంద్రప్రసాద్.

పొద్దున్న ఏదో ఛానల్ లో స్క్రోలింగ్  కనబడింది ఈరోజు అబ్దుల్ కలాం జయంతిని జాతీయ విద్య దినోత్సవంగా పాటిస్తున్నారని. మొదటి పదం మినహా అన్నీ కరక్టే. పేరే తప్పు. ఆయన పేరు మౌలానా అబుల్ కలాం ఆజాద్. పూర్తిపేరు  మౌలానా సయ్యీద్ అబుల్ కలాం గులాం మొయుద్దీన్ అహ్మద్ బీన్ ఖైరుద్దీన్ ఆల్ హుస్సేనీ ఆజాద్. 1888 నవంబరు 11 వ తేదీన జన్మించారు. గొప్ప విద్యావేత్త. స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. స్వతంత్ర భారత దేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి.  ఆయన హయాములోనే జాతీయ విద్య వ్యవస్థకు అంకురార్పణ జరిగింది. ఈనాడు భారతీయ విద్యాలయాలకు ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చిన Indian Institute Of Technology (I.I.T.) University Grants Commission వంటి సంస్థలు ఏర్పాటు చేశారు. ప్రజలందరికీ  ఉచితంగా ప్రాధమిక విద్యను బోధించాలనేది ఆయన ఆశయం. విద్యారంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1992లో భారత రత్న పురస్కారాన్ని ప్రకటించింది. 1998 లో హైదరాబాదులో మొట్టమొదటి ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు అయింది. ఆయన జయంతి నవంబరు పదకొండో తేదీని జాతీయ విద్య దినోత్సవంగా జరపాలని 2008లో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

మాజీ  రాష్ట్రపతి  ఏపీజే  అబ్దుల్  కలాం అనుకుని పొరబడి ఆ టీవీ స్క్రోల్ చేసి ఉండవచ్చు. పొరబాటే కావచ్చు కానీ ఒకింత జాగ్రత్త పడి తెలుసుకుని రాసిఉంటే బాగుండేది అనేది భవదీయుడి అభిప్రాయం.  

 

కామెంట్‌లు లేవు: