15, ఫిబ్రవరి 2022, మంగళవారం

నా ఓటు సాధారణ ఓటరుకే! - భండారు శ్రీనివాసరావు

 ఎన్నికలు దగ్గర పడగానే సాధారణ ఓటర్లకు సుద్దులు చెప్పే నీతిశతకకారులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తారు. డబ్బుకు అమ్ముడు పోవద్దు అంటూ సుమతీ శతకాలు వల్లె వేస్తుంటారు. ఉదాహరణకు 2014 లో జరిగిన ఎన్నికలకు ముందు, విశేష ప్రజాదరణ కలిగిన ఒక ప్రముఖ పత్రిక ఓటర్లకు విజ్ఞప్తి చేసింది. ఏమని? ఓటు వేసేముందే ఎంచుకునే అభ్యర్ధిని శ్రీరాముడి గుణగణాలతో పోల్చుకుని మరీ ఓటువెయ్యమని. ఓటర్లు ఆ సూచన పాటిస్తే అభ్యర్ధుల జాబితాలో శ్రీరామచంద్రునితో సరితూగగలవాళ్ళు ఒక్కరూ దొరక్కపోవచ్చు. నోటాకే ఓట్లు దండిగా పడొచ్చు.

నిజానికి చదువుకున్న ఓటర్లతో పోలిస్తే నిరక్షరాస్యులయిన ఓటర్లే చాలా నయం.

అందుకే సగటు భారతీయ ఓటరు అంటే నాకు తగని గౌరవం. దీనికి కారణం వుంది.

అనేక దశాబ్దాల నుంచి ఎన్నికలు చూస్తూ వస్తున్నాను. కాడిజోడెడ్లు (కాంగ్రెస్) కంకీ కొడవలి (కమ్యూనిస్ట్) ప్రమిదె (జనసంఘం) ఇలా పోలింగు కేంద్రంలో గుర్తులు అతికించిన బ్యాలెట్ డబ్బాలు (నిజంగానే డబ్బాలు, ఖాళీ కిరసనాయిలు డబ్బాలు అనుకుంటాను) పెట్టేవాళ్ళు. ఆయా పార్టీలకి వచ్చిన ఓట్లు విడిగా లెక్కబెట్టి ఫలితాలు ప్రకటించేవాళ్ళు. తరువాత కాలంలో కాంగ్రెస్ గుర్తు ఆవూ దూడా, ఆ పిదప హస్తం ఇలా మారిపోయింది. కమ్యూనిస్ట్ పార్టీలు రెండుగా విడిపోయాయి. జనసంఘం భారతీయ జనతా పార్తీగా పేరుతో బాటు, గుర్తును కమలంగా మార్చుకుంది. అభ్యర్ధుల పేర్లు లేకుండా గుర్తులతో బ్యాలెట్ పేపర్లు వచ్చాయి. ఎలక్ట్రానిక్ ఓటింగి యంత్రాలు రంగ ప్రవేశం చేసాయి. చదువుకున్న పోలింగు సిబ్బంది కొంత గందరగోళపడ్డారు కాని నిరక్షరాస్యుడయిన సగటు ఓటరు మాత్రం మార్పుకు తేలిగ్గా అలవాటుపడ్డాడు. మనతోబాటే స్వతంత్రం తెచ్చుకున్న ఇరుగుపొరుగు దేశాలు ఎప్పుడో ఒకప్పుడు సైనిక పాలనలోకి జారిపోయాయి కాని మనదగ్గర మాత్రం ప్రభుత్వాలు కేవలం ఓటుతోనే మారుతూ వచ్చాయి. అలాటి ఘన చరిత్ర కలిగిన సగటు ఓటరుకు, డబ్బుకు మద్యానికి అమ్ముడుపోవద్దంటూ నీతులు చెబుతున్నప్పుడు చాలా బాధ వేస్తుంది. నిజానికి ప్రతిఎన్నికలో చురుగ్గా పాల్గొని ఓటు హక్కు వినియోగించుకునేది వాళ్ళే. ఎండయినా వానయినా పోలింగు కేంద్రాల వద్ద క్యూలల్లో వేచి నిలబడి ఓటు వేసేవాళ్ళు వాళ్ళే. చదువుకున్నవాళ్ళలో ఇలాటి చొరవ కనబడదు. ఆసక్తి కనబడదు. పైపెచ్చు డబ్బుకు గడ్డి తిని ఓటేస్తున్నారని మామూలు ఓటర్లని ఎద్దేవా చేస్తుంటారు. ఇది వాళ్లని అవమానించడమే. నిజానికి అధికారానికి భయపడి జనాలు ఓట్లేస్తే ఎమర్జెన్సీ ఎత్తేసిన తరువాత జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధి ఓడిపోయేదా ? డబ్బుకు కక్కుర్తి పడి ఓటేస్తే డబ్బున్నఖామందులందరూ గెలుస్తూ వుండేవారు కదా!

ప్రచారానికి, ఇతరత్రా ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేసే  రాజకీయ పార్టీలు, డబ్బున్నవాళ్ల నుంచి డబ్బు తీసుకుని టిక్కెట్లు ఇస్తే అది తప్పుకాదు. వాళ్లు నామినేషన్ వేయడానికి చేసే హడావిడి చూసి ఎవ్వరు మాట్లాడరు. ప్రత్యేక విమానాల్లో, హెలికాఫ్టర్లలో నాయకులు తిరుగుతుంటే ఆ డబ్బెక్కడిది అని అడిగేవాళ్ళు వుండరు. గెలిచివచ్చిన తర్వాత ప్రభుత్వాల ఏర్పాటులో కానీ, ముఖ్యమంత్రుల ఎంపికలో కానీ లక్షలకు లక్షలు డబ్బులు నిస్సిగ్గుగా తీసుకుని ఓటు వేసే ప్రజాప్రతినిధులను డబ్బుకు అమ్ముడుపోతున్నారని ఏ ఒక్కరూ వేలెత్తి చూపరు. సాధారణ  ఓటరు దగ్గరకు వచ్చేసరికి అందరూ నీతులు చెప్పేవాళ్ళే!

ఎన్నికల్లో అభ్యర్ధులు ముట్టచెప్పే డబ్బు తీసుకుంటున్నారేమో కాని ఖచ్చితంగా ఓటు మాత్రం వాళ్లు అమ్ముకోవడం లేదు. వాళ్ళ ఓట్లను అభ్యర్ధులు కొనుక్కుంటున్నారు అని అంటే కొంత అర్ధం వుంది.

ఇది నిష్టూరంగా ధ్వనించే సత్యం.

దయచేసి ఇలా సగటు ఓటర్ని అవమానించవద్దు. ఈ వట్టినీతులు కట్టిపెట్టి, చేతనయితే పోలింగు రోజు టీవీలకు, కంప్యూటర్లకు అతుక్కుపోకుండా వెళ్ళి వోటు వేసి అందరికీ ఆదర్శంగా నిలవండి.


కామెంట్‌లు లేవు: