29, జులై 2016, శుక్రవారం

రేడియో భేరి - 7

రేడియో అక్కయ్య, రేడియో అన్నయ్య

పీవీ రాజమన్నార్, కొడవటిగంటి కుటుంబరావు, గోరాశాస్త్రి మొదలయిన వారు ఆ రోజుల్లో రేడియో కోసం నాటకాలు రాసేవారు. 1939 నాటికే మద్రాసు కేంద్రం స్త్రీలకోసం పిల్లల కోసం కార్యక్రమాలు మొదలుపెట్టింది. బాలల కార్యక్రమాలను ఒక వారం దుర్గాబాయమ్మ (దుర్గాభాయి దేశముఖ్) నిర్వహిస్తే మరో వారం న్యాయపతి కామేశ్వరి నడిపేవారు. కొన్నాళ్ళకు దుర్గాబాయమ్మ తమకున్న ఇతర పనుల తొందర వల్ల రేడియోకి రాలేకపోయేవారు. అప్పుడు కామేశ్వరితో పాటు ఆమె భర్త న్యాయపతి రాఘవరావు రేడియోలో బాలల కార్యక్రమాల నిర్వహణకు పూనుకున్నారు. ఆ దంపతులు ‘రేడియో అన్నయ్య’, ‘రేడియో అక్కయ్య’ అనే పేర్లతో ప్రసిద్ధులయ్యారు. తెలుగులో బాల సాహిత్యం వర్దిల్లడానికి వారిద్దరూ చేసిన సేవ చిరస్మరణీయం. బాలలకోసం పాటలు, నాటికలు రాయడంతోపాటు వాటిని బాలలతోనే నిర్వహించడం ‘ఆటవిడుపు’ అనే ఆదివారం కార్యక్రమం సాధించిన విజయం అపూర్వం. ఆ తరువాత బాలానందం పేర శనివారాలలోను పిల్లల కార్యక్రమాలు ప్రసారం చేసేవారు.
రెండు రోజులకోసారి ‘మహిళామండలి’ కార్యక్రమాలు మధ్యాహ్న సమయంలో ప్రసారం అయ్యేవి. ఆ కార్యక్రమాల చివర వినిపించే ‘మంగళ హారతి’ ని ఆ రోజుల్లో చాలా ఇళ్ళల్లో శుభకార్యాల్లో పాడుతూ వుండేవారు. స్త్రీల పట్ల వివక్ష ఎక్కువగా వున్న ఆ కాలంలో ‘మహిళా మండలి’ ఎందరో స్త్రీలకు ‘వాణి’ కాగలిగింది.
అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వున్న తెలుగు జిల్లాలలో వున్న సంగీత కళాకారులెందరో మద్రాసు రేడియో కేంద్రం నుంచి తమ సంగీతాన్ని వినిపించినవారే. తెలుగు పాట విలువను, ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన ప్రముఖ గాయకుల తొలి కార్యక్రమాలు మద్రాసు రేడియో కేంద్రం నుంచే ప్రసారం అయ్యాయి. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ – పదకొండేళ్ళ వయస్సులో 1941 జులై రెండో తేదీన తమ మొదటి రేడియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తరువాత కొన్నేళ్లకు ఆయన విజయవాడ, మద్రాసు, హైదరాబాదు రేడియో స్టేషన్లలో ఉద్యోగం చేశారు. రేడియో సంగీత చరిత్రలో ఇదో గొప్ప అధ్యాయంగా చెప్పుకోవచ్చు. అలాగే ఘంటసాల వేంకటేశ్వర రావు 1944 సెప్టెంబర్ ఇరవైన మొదటిసారి రేడియోలో పాడారు. ఆ తరువాత అనేక సార్లు ఆయన లలితసంగీత కార్యక్రమాల్లో, సంగీత నాటకాల్లో పాల్గొంటూ వచ్చారు. దీపావళి పండుగ కోసం సముద్రాల రాఘవాచార్యులు రాసిన ‘వెలుగు వెల్లువ’ అనే సంగీత నాటకంలో ఘంటసాల, భానుమతి ప్రధాన పాత్రధారులు. విశ్వనాధ రాసిన ‘కిన్నెరసాని’ సంగీత నాటకానికి ఘంటసాల సంగీతం సమకూర్చారు. ‘లైలా మజ్నూ’ నాటకంలో ఘంటసాల మజ్నూ పాత్ర పోషించారు. అందులో ఆయన పాడిన ‘గుడారమెత్తివేశారు’, ‘ఎందు చూచినగాని లైలా...’ అనే పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.(రచన: యండమూరి సత్యనారాయణ, సంగీతం : రజని). 1945 లో ఘంటసాల పాడిన రజని గేయం ‘ఘనాఘనా గర్జింపవొ..’ అనే పాట ఢిల్లీ నుంచి జాతీయ కార్యక్రమంలో ప్రసారమయింది. (ఇంకా వుంది)
(డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ సౌజన్యంతో)

2 కామెంట్‌లు:

శ్రీనివాసుడు చెప్పారు...

శ్రీనివాసరావు గారూ!
నాకు చాలా ఇష్టమయిన ఆకాశవాణి మధుర స్మృతులను మీరు పంచుకోవడం నాకెంతో సంతోషంగావుంది. నావరకు అయితే ఆకాశవాణి విజయవాడ ప్రసారాలు చిన్నప్పటినుండీ రోజుకు నాలుగైదు గంటలు క్రమం తప్పకుండా వినడం వలన నేను పొందిన లాభం అగణనీయం. వాచక స్పష్టత, సాహిత్య అభిరుచి, సంగీత ఆస్వాదన, నాటకాల పట్ల మక్కువ, ఇవన్నీ కలగలసి నా వ్యక్తిత్వాన్ని, ఆలోచనా విధానాన్ని ఆకాశవాణితో కలసి జమిలిగా రూపుదిద్దుకునేట్లు చేసేయి.
ఎప్పుడో ముప్ఫై, నలభై ఏళ్ళ క్రితం విన్న నాటకాలు, ముఖాముఖాలలో కొన్ని maganti.org మరియు eemata.com వారి దయవలన మళ్ళీ ఆస్వాదించగలిగేను.
మీకు అవకాశముంటే, పైడి తెరేష్ బాబు గారి, ‘‘చికెన్ మసాలా’’ అనే నాటకం లభ్యమయ్యే స్థానం చెప్పగలరా? ఆ నాటకం కొన్నేళ్ళ క్రితం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైంది. అలాగే, పైడి తెరేష్ బాబుగారి రేడియో నాటకాలు ఏవి వున్నా వాటి సమాచారం తెలిస్తే చెప్పగలరు.
మప్పిదాలతో,
శ్రీనివాసుడు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@శ్రీనివాసుడు గారు : నేనూ, ఈ వ్యాస సంకలనంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న డాక్టర్ గోపాల కృష్ణ గారు ఇద్దరం ఇప్పుడు సర్వీసులో లేము. నేను రిటైర్ అయి పదేళ్ళు దాటింది. కాబట్టి రేడియో గురించి మాకు తెలిసింది రాయడం మినహా మీరు కోరిన అంశాల్లో సాయపడడానికి నా అశక్తత అడ్డం వస్తోంది. క్షమించండి. మీ అభిమానానికి ఒకనాటి రేడియో మాజీ ఉద్యోగిగా ధన్యవాదాలు.