YSR లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
YSR లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, సెప్టెంబర్ 2022, శుక్రవారం

రెండు కన్నీటి బొట్లు - భండారు శ్రీనివాసరావు

 (Published in SAKSHI daily on 02-09-2022, FRIDAY, today)

సరిగ్గా పదమూడేళ్ల క్రితం, 2009 సెప్టెంబరు రెండో తేదీన యావత్ తెలుగు ప్రజానీకం పడిన ఆందోళన ఇంకా గుండెల్లో పచ్చిగానే వుంది. కార్చిన కన్నీటి తడి ఇంకా చెమ్మగానే వుంది. ఆ విషాద ఘడియల్లో దేశవ్యాప్తంగా మీడియాలో, పత్రికల్లో అత్యధికంగా వినపడ్డ, కనపడ్డ పదం వై.ఎస్.ఆర్. ఆ పేరు ఇక ముందు కూడా వినబడుతూనే వుంటుంది కానీ, ఇక ఆ రూపం సజీవంగా కనబడే అవకాశమే లేదు. ఒక వ్యక్తి గుణగణాలను సమాజం సంపూర్తిగా అవగాహన చేసుకునేది అతడి మరణం తర్వాతనే అన్నది రాజశేఖర రెడ్డి గారి విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజమైంది.
'రాజశేఖరా!నీపై మోజు తీరలేదురా!' అని తెలుగు ప్రజానీకం రెండో పర్యాయం ఆయనకు అధికార పగ్గాలు అప్పగించి వంద రోజులు నిండీనిండగానే, రాజశేఖరుడికి నూరేళ్ళు నిండిపోవడం అత్యంత విషాదకరం.
'రాజసాన ఏలరా!' అని మనసారా కోరుకున్న ప్రజలకు ఆయన ఆకస్మిక మరణం విధి విధించిన శాపం.
అర్థవంతమైన జీవితాలెప్పుడూ అర్ధంతరంగానే ముగిసిపోతుంటాయి.మాట తప్పని మనిషిగా, మడమ తిప్పని వీరుడిగా పేరు తెచ్చుకున్న వై.ఎస్.ఆర్., అరవై యేళ్ళు రాగానే రిటైర్ అయిపోతానన్న మాటని నిలబెట్టుకుంటూ, జీవితం నుంచే రిటైర్ కావడం అన్నది, ఆయన పధకాల ద్వారా బతుకులు పండించుకుంటున్న బడుగు జీవుల దురదృష్టం.
1978 నుంచి ఒక జర్నలిష్టుగా ఆయన్ని కలుసుకున్న సందర్భాలు అనేకం వున్నాయి. విలేకరులను విందు సమావేశాలకు ఆహ్వానించినప్పుడు ఆయన తరహానే వేరుగా వుండేది. బిగుసుకుపోయినట్టు వుండడం, మర్యాద కోసం మొహాన నవ్వు పులుముకోవడం ఆయన స్వభావానికే విరుధ్ధం. నవ్వులో స్వచ్చత, పిలుపులో అత్మీయత వుట్టిపడేవి. నమ్మినవాళ్ళని నట్టేట ముంచకపోవడం, నమ్ముకున్నవాళ్ళకోసం ఎంత దూరమైనా వెళ్ళడం జన్మతః అబ్బిన గుణాలు. వీటివల్ల, రాజకీయ జీవితంలో మేలు కన్న కీడే ఎక్కువ జరిగిన సందర్భాలు వున్నా, ఆయన లెక్కపెట్టింది లేదు. తీరు మార్చుకున్నదీ లేదు. ఈ విలక్షణ లక్షణమే వై.ఎస్.ఆర్. కు రాష్త్రవ్యాపితంగా అభిమానులను తయారుచేసి పెట్టింది. ఎన్నికలు వచ్చినప్పుడు కేవలం తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా, రాష్త్రంలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ తరపున ప్రచారం చేయగల ఖలేజాను ఆయనకు కట్టబెట్టింది.
1975 లో నేను రేడియో విలేకరిగా హైదరాబాదులో అడుగుపెట్టిన మూడేళ్ళ తరవాత రాజశేఖరరెడ్డి గారు తొలిసారి శాసనసభకి ఎన్నిక కావడం, మంత్రి పదవి చేపట్టడం జరిగింది. వయస్సు మళ్ళిన వాళ్ళే రాజకీయాల్లోకి వస్తారనే అభిప్రాయానికి భిన్నంగా యువరక్తం రాజకీయ రంగంలోకి రావడం అప్పుడే మొదలయింది.
రాజశేఖరరెడ్డిగారిని నేను మొదటిసారి చూసింది, ఆ రోజుల్లొ సచివాలయానికి కూతవేటు దూరంలో వున్న సరోవర్ హోటల్ (ఇప్పుడు మెడిసిటి హాస్పిటల్) టెర్రేస్ మీద. సచివాలయంలో జరిగిన ఒక సంఘటన దరిమిలా వివరణ ఇచ్చేందుకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భం అది. అప్పట్లో ఆయన ఒక తరహా మీసకట్టులో కనిపించే వారు. కానీ, కపటం లేని మందహాసానికి మాత్రం అప్పటికీ, ఇప్పటికీ ఆయనదే కాపీ రైట్.
ఇటు హైదరాబాదులోనూ, అటు ఢిల్లీలోనూ వైఎస్సార్ నివాసాలు జర్నలిష్టులతో కళకళలాడుతూవుండేవి. వేళాపాళాతో నిమిత్తంలేకుండా ఆ ఇళ్ళకి వెళ్ళివచ్చే చనువు వుండేది. సుదీర్ఘకాలం రాజకీయరంగంలో కొనసాగడం వల్ల, పేరుతో పిలిచి పలకరించగల జర్నలిష్టు స్నేహితులు ఆయనకు రాష్త్రంలోని అన్ని ప్రాంతాల్లో వుండడం సహజమే.
2004 లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి కాగానే, ఆయనతోవున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని, కేవీపీ గారి ద్వారా నా మనసులోని మాటని ఆయన చెవిన వేశాను. అప్పటికే కొన్ని ప్రైవేటు టీవీ ఛానళ్ళు రంగప్రవేశం చేసినందువల్ల, రేడియో కేంద్రానికి వచ్చి తొలి సందేశం రికార్డు చేయడం అన్నది కొద్దిగా ఇబ్బందే. అయినా, ఆయన నా మాట మన్నించి, నేరుగా ఆకాశవాణి కేంద్రానికి వచ్చారు. అలాగే, హైదరాబాదు దూరదర్శన్ లో నేను రిటైర్ కావడానికి ముందు కూడా ఆయన స్టుడియోకి వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఒక విలేకరికి, ఒక రాజకీయనాయకుడికి నడుమ సహజంగావుండే సాధారణ సంబంధాన్ని మహోన్నతంగా పెంచి పెద్ద చేసిన పెద్దమనసు ఆయనది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా పెనవేసుకున్న ఈ బంధం శాశ్వతంగా తెగిపోయిందే అన్న బాధతో, ఆ మహోన్నత వ్యక్తిత్వానికి నివాళి అర్పిస్తూ, 'రెండు కన్నీటి బొట్లు' రాల్చడం మినహా ఏమీ చేయలేని చేతకానితనం నాది.



(02-09-2022)

1, ఆగస్టు 2016, సోమవారం

వై.ఎస్.ఆర్. నవ్వుపై చంద్రబాబు కామెంటు



2005 డిసెంబరులో  దూరదర్సన్ నుంచి రిటైర్  అయిన తరువాత డాక్టర్ ఎన్ భాస్కర రావుగారి సంస్థ ‘సీ ఎం ఎస్’ తో కలిసి కొన్నాళ్ళు పనిచేసాను. వారి కార్యాలయంలో అనేక టీవీ సెట్లు ఉండేవి. ప్రతి దాంట్లో ఒక్కో ఛానల్ వచ్చేది.  వివిధ ఛానల్స్ కార్యక్రమాలు చూసి వాటిపై  వారం వారం ఓ రివ్యూ తయారు చేసేవాళ్ళం. ఇందులో ప్రకాష్, శశికళ, సుజాత, శివ సహకరించేవారు. పాత కాగితాలు సర్దుతుంటే ఆనాటి ఓ రిపోర్ట్ కళ్ళబడింది. అదే ఇది:
(ఏప్రిల్ 17, 2006)
కారణం ఏదైనా, ఈ వారం అన్ని ఛానళ్ళు కూడబలుక్కున్నట్టు రాజకీయాలతో పాటు ఇతర  అంశాలకు కూడా పెద్ద  పీటవేశాయి.
కలవని మనసులు, కలహాల కాపురాలు, పెద్దల పట్టుదలలు, యువతీ యువకుల తప్పటడుగుల కారణంగా విడాకుల సంఖ్య పెరుగుతోందని చెబుతూ ‘మూడు ముళ్ళ బంధం’ శీర్షిక లో ఈ టీవీ -2 రోజుకో కధనాన్ని ప్రసారం చేసింది. రేషన్ కార్డులకోసం వచ్చిన అమ్మాయిలను వేధిస్తున్న రేషన్ కీచకుడి భాగోతాన్ని కూడా బయట పెట్టిన ఆ ఛానల్ కు  అభినందనలు. అలాగే, రేషన్ కార్డులు కావాలనుకునే వాళ్ళు గర్భ సంచి పరీక్ష చేయించుకోవాలని మహాబూబ్ నగర్ జిల్లాలో సాగిన ఓ వ్యవహారాన్ని తేజ టీవీ అందించింది.
ఏప్రిల్ మొదట్లోనే ఎండలు బాగా  ముదిరిపోతూ  ఉండడానికి కారణాలను నిపుణుల చర్చద్వారా  ఈ టీవీ -2 అందిస్తే, ఎండల కారణంగా రాష్ట్రంలో పట్టపగలే కర్ఫ్యూ  వాతావరణం నెలకొంటోందని టీవీ -9 ఒక  కధనం ప్రసారం చేసింది.
రైతులకు ‘కెపాసిటీ’వుందా  అంటూ, కెపాసిటర్లు  బిగించుకోవడం వల్ల కలిగే  లాభ నష్టాలను గురించి   ఈ టీవీ -2 ఒక కార్యక్రమం  రూపొందించింది.
రంగుల కలలతో  దుబాయ్ వెడుతున్న యువకులు తిరిగి రాలేక ఆ ఎడారి దేశంలో పడుతున్న అవస్థలు గురించి ఒక పరిశోధనాత్మక కధనాన్ని టీవీ -9  ప్రసారం చేసింది. దుబాయ్  లో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు జరుగుతున్న నేపధ్యంలో ఇది ప్రసారం అయింది.
అలాగే ఆ ఛానల్ ఈ వారం మరో కొత్త  పుంత తొక్కింది. క్రీడా రంగ నిపుణులతో నిర్వహించే క్రికెట్  మ్యాచ్ విశ్లేషణ కార్యక్రమాన్ని  అసెంబ్లీలో  ప్రభుత్వ  చీఫ్  విప్  నల్లారి  కిరణ్  కుమార్  రెడ్డి తో  నిర్వహించింది.
షాద్ నగర్ సమీపంలో దొంగతనాలు జరిగితే పోలీసులకు పని ఉండదని చెబుతూ, దొంగను పట్టుకునే బాధ్యతను గ్రామస్తులు ఒక చెంబుకు అప్పగిస్తారని తేజ  ఛానల్ ప్రసారం చేసిన వార్త జనంలోని మూఢనమ్మకాలకు అద్దం పట్టింది.
మహబూబ్ నగర్  జిల్లాలో బర్డ్  ఫ్లూ  వదంతులు  వేగంగా  వ్యాప్తి చెందిన నేపధ్యంలో అక్కడి కోళ్ళ పెంపకందార్లు వాటికి సరిగా మేత పెట్టకపోవడంతో అవి తమలో తాము పొడుచు కుంటున్నాయని జీ టీవీ  ఒక ప్రత్యేక కధనం  అందించింది.
విజయనగరం జిల్లా అల్లువాని వలస గ్రామంలో ఇంటికో  వికలాంగుడు  ఉన్నాడని, రెండు చుక్కల మందు (పోలియో డ్రాప్స్) గురించి వారికి తెలియనే తెలియదని మా టీవీ ఒక కధనం ప్రసారం చేసింది.
ప్రకాశం జిల్లా పొదిలి గ్రామంలో 1999 ఏప్రిల్   20 వ తేదీన జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో చికిత్స పొందిన  30మంది రోగులు కళ్ళు పోగొట్టుకున్నారని , అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారికి అందిస్తానన్న సాయం ఇప్పటివరకు అందలేదని మా టీవీ  ‘రివైండ్’ పేరుతొ ప్రసారం చేసిన కార్యక్రమంలో వెల్లడించింది.
మగ పిల్లలపై మమకారంతో, మగ శిశువు కలిగే వరకు  గిరిజన తండాల్లోని ప్రజలు డజన్ల కొద్దీ ఆడపిల్లలను కంటున్నారని తెలియచేస్తూ పన్నెండు మంది ఆడపిల్లల్ని కన్నఒక మహిళ కధనాన్ని దూరదర్సన్ సప్తగిరి ప్రసారం చేసింది.
కొసమెరుపు:
‘ముఖ్యమంత్రి ఏం చేసినా ప్రతిపక్ష నాయకుడికి గిట్టకపోవడం అసహజమేమీ కాదు. కాకపొతే రాజశేఖర రెడ్డి స్వభావ సిద్ధంగా చిందించే మందహాసాలపై  చంద్రబాబునాయుడు చేసిన విమర్శలు దాదాపు అన్ని ఛానళ్ళకు ఈ వారం ముడి సరుకై కూర్చున్నాయి.
‘ముఖ్యమంత్రి నవ్వు, నటుడు నాగభూషణం నవ్వులాగా విలనీ మార్కు నవ్వు’ అంటూ చంద్రబాబు  విమర్శిస్తే , ‘అసలు నవ్వడమే తెలియని వాళ్ళు మరొకరు నవ్వితే బాధ పాడడం ఎందుకని’ వై.ఎస్.ఆర్. తిప్పికొట్టారు. చాలా  రోజుల తరువాత ఈ పాత ‘స్నేహితుల’ నడుమ చోటు చేసుకున్న ఈ ‘టిట్  ఫర్ టాట్’ జనాలను ఆహ్లాద పరచింది.”
ఇవీ ఈ  వారం  విశేషాలు. మరిన్ని సంగతులతో వచ్చేవారం    (ఏప్రిల్ 17, 2006)

                    

8, జులై 2016, శుక్రవారం

వై ఎస్ ఆర్ చెప్పిన గానుగెద్దు కధ


2004 జులై 21 న అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఒక కధ చెప్పారు.
“బాగా చదువుకున్న పండితుడు ఒకాయన నూనె గానుగ వద్దకు వెళ్ళాడు. అక్కడ గుండ్రంగా తిరుగుతున్న ఎద్దు తప్ప ఎవరూ కనిపించలేదు. ఆ ఎద్దు మెడలోని గంటల చప్పుడు తప్ప ఏ అలికిడీ లేదు. పండితుడు గానుగ మనిషిని పేరు పెట్టి పెద్దగా పిలిచాడు. ఆ పిలుపు విని అతడు బయటకు వచ్చాడు.
నూనె కొన్న తరువాత పండితుడు అడిగాడు.
‘ఎప్పుడు వచ్చినా నువ్వుండవు.  గానుగ పని మాత్రం నడుస్తూనే వుంటుంది. ఎలా’ అని.
‘ఎద్దు మెడలో గంట కట్టిందే అందుకోసం. గంట చప్పుడు వినబడుతున్నదీ అంటే ఎద్దు తిరుగుతున్నట్టే లెక్క. తిరగడం మానేస్తే గంట చప్పుడు వినబడదు. నేను ఏ పనిలో వున్నా బయటకు వచ్చి ఎద్దుకు మేత వేస్తాను. నీళ్ళు పెడతాను. మళ్ళీ దాని పని మొదలు. నాపనిలో నేనుంటాను’ గానుగవాడు చెప్పాడు.
పండితుడు కదా! అనుమానాలు ఎక్కువ.
‘అలా అయితే ఎద్దు ఒకచోటనే నిలబడి తల ఊపుతుంటే గంటల శబ్దం వినబడుతుంది. కాని పని సాగడుదు. అప్పుడెలా?’ అడిగాడు. 
‘నా ఎద్దు అలా చేయదు’ అన్నాడు గానుగ మనిషి.
‘అంత నమ్మకంగా ఎలా చెప్పగలవు?’ అని గుచ్చి  అడిగాడు పండితుడు.
‘ఎందుకంటే, నా ఎద్దు మీలా చదువుకోలేదు కాబట్టి’
ఆ జవాబుతో పండితుడి కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి.”   


వై.ఎస్.ఆర్. హెల్త్  సీక్రెట్
ఆయనోసారి ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూ లో తన ఆరోగ్య రహస్యం చెప్పారు.

“మితాహారం, యోగ. అంతకు మించి ఏమీ లేవు. నేను ఉదయం తీసుకునే అల్పాహారంలో ఇడ్లీ, కానీ దోశ కానీ వుంటాయి. నూనె వస్తువులకు దూరం. ఫ్రూట్ సలాడ్ తప్పనిసరి. మధ్యాన్న భోజనంలో రెండు పుల్కాలు, రెండు వెజిటేరియన్  కూరలు, కొంచెం పెరుగన్నం. సాయంత్రం కూడా ఇంతే.  మధ్య మధ్యలో కీరా ముక్కలు తింటుంటాను. నీళ్ళు ఎక్కువ తాగుతాను. వారానికి రెండు సార్లు రాగి సంకటి తప్పనిసరి. నాన్ వెజ్ అప్పుడప్పుడు మాత్రమే” 

8, ఏప్రిల్ 2013, సోమవారం

భండారు బఠానీలు



‘పెద్దయ్యాక ఏమవుదామనుకుంటున్నావు?’  అనేది చిన్నప్పుడు స్కూల్లో అడిగే ప్రశ్న.
‘తెలుగు మాస్టారు’ ఠకీమని సమాధానం.
ప్రశ్న అడిగిన లెక్కల మాస్టారుకి ఎక్కడ కాలాలో అక్కడే కాలేది. తరువాత ఏదో తప్పువెతికి పట్టుకోవడం, చెయ్యి చాపమనడం, చాచిన చేతిని తిరగేయించడం,  దానిమీద డష్టరు తిరగేయడం - అది వేరే కధ.
తమదగ్గర  చదువుకునే పిల్లల్లో ఐ.ఏ.ఎస్. లు ఎంతమంది అవుతారన్నది వారికొచ్చిన  డౌటేహం కావచ్చు. వాళ్ళల్లో రాజకీయనాయకులు, జర్నలిస్టులు కొంతమంది అయినా కాకపోతారా అనే నమ్మకం కావచ్చు. అందుకే కాబోలు,  పిల్లలకు   వక్తృత్వపోటీలు పెట్టి, ‘కలం గొప్పదా? కత్తి గొప్పదా?’ – ‘అణ్వస్త్రాలు కావాలా?  అన్నవస్త్రాలు కావాలా?’ అని ప్రతి అంశానికి అనుకూలంగా ప్రతికూలంగా రెండు విధాలుగా చెప్పించేవారు. అప్పుడర్ధంయ్యేది కాదు కానీ ఇప్పుడు టీవీ చర్చల తీరుతెన్నులు, రాజకీయ నాయకుల ప్రకటనలు గమనిస్తుంటే  అందులోని తత్వం  నెమ్మది నెమ్మదిగా తలకెక్కుతోంది.
‘నరం లేని నాలుక ఏవిధంగానయినా మాట్లాడుతుందంటారు చూడండి. అలా రాజకీయ నాయకులు ‘మొన్న ఏం మాట్లాడాం, నిన్న ఏం చెప్పాం’ అన్నదానితో నిమిత్తం లేకుండా ‘ఈరోజు చెప్పిందే ఫైనల్’ అన్న పద్ధతిలో  బల్లగుద్ది వాదిస్తున్న విధం చూస్తుంటే రాజకీయాల్లో సోషలిజం, కమ్యూనిజం, క్యాపిటలిజం   కాకరకాయా ఏమీలేదు వొట్టి అవకాశవాదం తప్ప అనిపిస్తే ఆశ్చర్యపోవాల్సింది ఏమీ వుండదు.




‘మా నాన్నవల్ల ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కూలగొట్టడం నామతం కాదు,  అభిమతం కాదు, కాదెంతమాత్రం కానే  కాదం’టూ ఎక్కడలేని ధర్మపన్నాలు  వల్లించి ఆ తరువాత అనతికాలంలోనే  పోటీ పార్టీ పెట్టి సొంతపార్టీకి చిల్లి పెడుతున్న విధం చూస్తుంటే-  రెండు నాలికలతో  మాట్లాడడానికి  చిన్నప్పుడే స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?

‘అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ నాయకులను పంచెలూడతీసి తరిమికొడతాం!’ అంటూ పొడుగుపాటి డైలాగులు అలవోకగా జనం మీదకు వొదులుతూ, పార్టీ పెట్టిన  తొమ్మిదిమాసాల్లోనే అధికార పీఠం ఎక్కిన  ఎన్టీయార్ రికార్డుని బద్దలుకొట్టేసి,   రాజ్యాధికారంలోకి వద్దామనుకున్న కలలు కాస్తా   పార్టీ పారాణి ఆరకముందే కల్లలైపోవడంతో, ఇక  విధిలేక  ఆ కాంగ్రెస్ పంచనే చేరి, కేంద్రమంత్రి పదవిలో విదేశాల్లో  సేదతీరుతూ, తీరిగ్గా  సోనియా భజన చేస్తున్న వైఖరి చూస్తుంటే - రెండు నాలికలతో  మాట్లాడడానికి  చిన్నప్పుడు స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?

‘హెలికాప్టర్ దుర్ఘటనలో వైఎస్సార్ చనిపోయినప్పుడు, పట్టు చీరెల అంచులతో, ఖాదీ ఉత్తరీయాలతో కళ్ళు వొత్తుకుంటూ బుల్లితెరలమీద బారులుతీరి ‘అంతటి నాయకుడు ఇంతకు ముందు పుట్టలేదు ఇకముందు పుట్టడు’ అంటూ విలపించిన ఆయన  మంత్రివర్గ సహచరులే  ఇప్పుడు పల్లవి మార్చి ‘అవినీతిలో వైఎస్ ను మించినవాడు లేడం’టూ వైనవైనాలుగా శాపనార్ధాలు పెడుతున్న వైనం గమనిస్తుంటే - రెండు నాలికలతో  మాట్లాడడానికి  చిన్నప్పుడు స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?

‘తుది శ్వాస విడిచేవరకు తాత స్థాపించిన పార్టీలోనే వుంటానంటూ, ప్రత్యర్ధి పార్టీల ఫ్లెక్సీల్లో అభిమానుల పేరుతొ తన ఫోటోలు పెడుతుంటే మిన్నకుండిపోయి ముసిముసి నవ్వులు నవ్వడం చూస్తుంటే - రెండు నాలికలతో  మాట్లాడడానికి  చిన్నప్పుడు స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?
‘అల్లుడా రమ్మని పిల్లనిచ్చిన  మామ పిలిచి పార్టీ అందలం ఎక్కిస్తే, పార్టీని బతికించే నెపంతో పార్టీ సంస్తాపకుడి అంతాన్నే కళ్ళారాచూసి, ఇప్పడు మళ్ళీ పార్టీ పునరుద్దానానికి ఆ కీర్తిశేషుడి పేరునే వాడుకుంటూ, దానిపై పేటెంటు రైటు తమదే అంటూ వాడవాడలా  వూరేగుతున్న విపరీతాన్ని చూస్తున్నప్పుడు - రెండు నాలికలతో  మాట్లాడడానికి  చిన్నప్పుడు స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?

పార్టీలు, వ్యక్తుల భజనకోసం పెట్టిన టీవీ చానళ్ళలో పనిచేస్తూ, జీతాలకోసమో, హోదాలకోసమో వేరే చానళ్ళలో చేరి  పొగిడిన నోళ్లతోనే తెగుడుతున్న విధానాలను పరికిస్తుంటే - రెండు నాలికలతో  మాట్లాడడానికి  చిన్నప్పుడు స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?

ఇలాటి  చద్మ వేషధారుల, ఆషాఢభూతుల లీలలు చూపించి, వారి అసలు రూపాలను, స్వరూపాలను చూపించే విధంగా ఏ టీవీ వారయినా పుణ్యం కట్టుకుని, ‘అప్పుడు – ఇప్పుడు’ అనే కార్యక్రమం ప్రసారం చేస్తే యెంత బాగుంటుందో !   (08-04-2013)  
Note: Courtesy image owner              

12, ఏప్రిల్ 2012, గురువారం

రాజకీయుల నాలుకకు నరం వుంటుందా! – భండారు శ్రీనివాసరావు


రాజకీయుల నాలుకకు  నరం వుంటుందా!భండారు శ్రీనివాసరావు
అడ్లాయ్ స్టీవెన్సన్ పాత తరం అమెరికన్ రాజకీయవేత్త. రాజకీయాల్లో దురదృష్టం వెంటాడిన వారిలో ఆయన ఒకరు. ఇలినాయిస్ గవర్నర్ గా వున్న ఆయనకు 1952 లో అమెరికన్ అధ్యక్ష పదవికి పోటీచేయడానికి డెమొక్రాటిక్ పార్టీ నామినేషన్ లభించింది. ఆ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి  ఐసెన్ హోవర్ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. 1956 లో  మళ్ళీ  డెమోక్రటిక్ పార్టీ ఆయన్నే అభ్యర్ధిగా నిలబెట్టింది. కానీ ఐసెన్ హోవర్ తిరిగి గెలుపొందడంతో  వైట్ హౌస్ కు దూరమయ్యారు. 1960   అధ్యక్ష ఎన్నికలనాటికి  డెమొక్రాటిక్ పార్టీ తన అభ్యర్ధిని మార్చి జాన్ ఎఫ్ కెన్నెడీని బరిలో దించింది. ఆ ఎన్నికలో కెన్నెడీ రిపబ్లికన్ అభ్యర్ధిని ఓడించి అమెరికా అధ్యక్షుడిగా అధికారం స్వీకరించారు. కెన్నెడీ శ్వేతసౌధంలో అడుగుపెట్టగానే చేసిన మొదటి పని ఏమిటంటే – తనకు ముందు రెండు ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన అడ్లాయ్ స్టీవెన్సన్ ను ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా నియమించడం.
అడ్లాయ్  స్టీవెన్సన్ సంభాషణా చతురుడు. హాస్యోక్తులతో కూడిన ఆయన ఎన్నికల ప్రసంగాలను ప్రజలు ఎంతో ఆసక్తిగా వినేవారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఒక విషయాన్ని పలుమార్లు చెబుతుండేవారు. తన ప్రత్యర్ధులకు సవాలుతో కూడిన ఒక అవకాశాన్ని అందిస్తూ వుండేవారు. ‘ మీరు నా గురించి అసత్యాలు చెప్పకుండా వున్న పక్షంలో మీ గురించిన వాస్తవాలు వెల్లడించకుండా వుంటాను’ అన్న స్టీవెన్సన్ వ్యాఖ్యకు ఆ రోజుల్లో విస్తృత ప్రచారం లభించింది.
రాజకీయాల్లో అసత్యాలు వల్లె వేసి జనాలను నమ్మించడానికి ప్రయత్నించే  సంప్రదాయం ఆ రోజుల నుంచే వుందనుకోవాలి.
అసత్యాలు సరే గతంలో అన్న మాటలనే మరచిపోయి స్వవచనఘాతానికి పూనుకునే ప్రబుద్ధులు ఈనాడు రాజకీయాల్లో ప్రబలిపోయారు. వర్తమాన రాష్ట్ర రాజకీయాల  తీరుతెన్నులను  గమనిస్తున్నవారికి ఇది కరతలామలకమే.
‘కండవర్  విండిలై విండవర్ కండిలై’ అని  తమిళంలో ఓ సూక్తి వుంది. అంటే చూసిన వారు చెప్పలేరు, చెప్పినవారు చూడలేరు అని అర్ధం. ‘కళ్ళు చూస్తాయి కాని మాట్లాడలేవు, నోరు మాట్లాడుతుంది కాని చూడదు’ అని ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ దాన్ని వివరించి చెప్పేవారు. ఆయన మాటల్లో చెప్పాలంటే – ఒకే విషయం గురించి చెప్పవలసినప్పుడు కూడా పదుగురు పది రకాలుగా చెబుతూ వుండడం కద్దు. ప్రతి ఒక్కరూ ప్రపంచం యెట్లా వుండాలని తాము అనుకుంటున్నారో ఆ దృక్పధంతో చూస్తూ వుండడమే దీనికి కారణం. కళ్ళ ముందు ఒక వేలును పెట్టుకుని చూడాలనుకోండి. మూడురకాలుగా చూడవచ్చు. రెండు కళ్ళతో కలసి ఒక చూపు. అలాగే ప్రతి కంటితో విడివిడిగా రెండు చూపులు. చూసే వస్తువు ఒక్కటే కనబడడంలోనే తేడాలు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో దివంగత రాజశేఖర రెడ్డి గురించి కూడా ఇదే రకమయిన అయోమయం చోటుచేసుకుంటు న్నట్టు అనుదినం వార్తలు తెలుపుతున్నాయి. కొందరికి ఆయన కనబడుతుంటే మరికొందరికి ఆయన కుమారుడు జగన్ మోహన రెడ్డి కూడా కనబడుతున్నారు. నిజానికి, రాజకీయాల్లో రాజశేఖరరెడ్డి ఆజాత శత్రువు ఏమీ కాదు. ఆజన్మ శత్రువులకు కూడా కొదవేమీ లేదు. వైయస్సార్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు సయితం  ఆయనతో తీవ్రంగా విభేదించిన కాంగ్రెస్ నాయకులున్నారు. అలాగే ఆయనను ఇంద్రుడు, చంద్రుడు అని వేనోళ్ళ పొగిడి రాజకీయ లబ్ది పొందినవాళ్ళు కూడా వున్నారు.  తెలుగు దేశం హయాంలో రాష్ట్రంలో కొడిగట్టిపోతున్న కాంగ్రెస్ పార్టీకి తన పాద యాత్రతో నూతన  కొత్త జవసత్వాలు కట్టబెట్టి అనేక ఏళ్ళ తరువాత అందని పండుగా మారిన అధికారాన్ని  తమ  పార్టీకి అందించాడని  కొన్నేళ్లపాటు ఆయనను విడవకుండా కీర్తించిన వందిమాగధుల స్వరాలు కూడా  క్రమంగా మారిపోతూ వుండడమే విచిత్రం. ఆయన చనిపోయిన వెంటనే సీను హఠాత్తుగా మారిపోలేదు  కాని క్రమంగా మారుతూ వచ్చింది.  వైయస్సార్ కుమారుడు తిరుగుబాటు బావుటా ఎగురవేసి వేరు కుంపటి పెట్టి రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతున్న క్రమంలో జరిగిన ఉపఎన్నికల్లో ఎదురయిన వరస అపజయాల దరిమిలా కాని కాంగ్రెస్ నాయకులకు కళ్ళు తెరిపిళ్ళు పడలేదు. లక్షల కోట్ల లెక్కలో జగన్  మోహన రెడ్డి అవినీతి గురించి తాము  చెబుతున్న లెక్కలు జనాలకు పట్టకపోవడం వారికి వింతల్లో వింతగా అనిపిస్తూ వుండవచ్చు. ఇందుకు నెపం ఎవరిమీదనో మోపాల్సిన పని లేదు. రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్ చేసుకున్న స్వయంకృతాపరాధం. ఆయన చనిపోగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన ముగిసి మరో పార్టీ అధికారంలోకి వచ్చిందా అన్నట్టు ఆ తరువాత  అధికార పీఠం ఎక్కిన వారు ప్రవర్తించడం కాంగ్రెస్ పార్టీని అభిమానించేవారికి నచ్చడం లేదు. ఆ విధంగానే, ఆయన పాలన అంతా అవినీతిమయం అంటున్న  వారికి ఆయన చేపట్టి అమలు చేసి చూపిన సంక్షేమ కార్యక్రమాల వూసు పట్టడం లేదు. దాని ఫలితమే బడుగు బలహీన వర్గాలన్నీ వైయస్సార్ పేరుతొ పెట్టిన పార్టీ వెంట నడవడానికి దోహదం చేసింది. ‘రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా తనకేం చేసుకున్నాడో, తన కొడుక్కేం చేసుకున్నాడో మాకనవసరం. మాకేం  చేశాడన్నదే మాకు ప్రధానం’ అని మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చి రాజధానిలో బార్బర్ గా పనిచేస్తున్న నరేష్ చెప్పాడు. వైయస్సార్ పుణ్యమా అని తన చెల్లెలు ఇంజినీరింగు పూర్తిచేసిందని, తనకూ ఈ మాదిరి సాయం లభించి వుంటే పదో తరగతి కూడా పూర్తి చేయకుండానే  చదువు మధ్యలో  మానేయాల్సిన దుస్తితి తప్పేదని అంటూ, చెల్లెలు ఇంజినీరుకాగానే వూళ్ళో తమ స్తాయి పెరిగిందనీ, అందరూ తమ కుటుంబాన్ని గౌరవంగా చూస్తున్నారనీ గర్వంగా చెప్పుకొచ్చాడు. ఆరోగ్య శ్రీ కింద  గుండె ఆపరేషన్లు చేయించుకున్నవాళ్ళు, ఏ పార్టీ జెండా పట్టుకోకుండానే ఇందిరమ్మ ఇల్లు పొందిన వాళ్లు, నెలనెలా పెన్షన్ క్రమం  తప్పకుండా అనుకుంటున్న వృద్ధులు – వీరంతా  వూరూరా నోటిమాటగా చేసిన ప్రచారం కోట్లు ఖర్చు  పెట్టి చేసే ప్రభుత్వ ప్రచారాన్ని మించి పోయింది. ఇది గమనం లోకి తీసుకోకుండా పార్టీలోని వైయస్సార్ ప్రత్యర్ధులు చేసిన తప్పుడు ప్రచారాన్ని  నమ్మి కొంతా, పధకాల మీద తమ  పట్టు పోతోందన్న  ఉక్రోషంతో కొందరు అధికారులు చేసిన నిర్వాకం వల్ల కొంతా  మొత్తం మీద ఏదయితేనేం వైయస్సార్ సంక్షేమ పధకాలను  అటకెక్కి స్తున్నారన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లిపోయాయి. వైయస్సార్ మరణం తరువాత ఈ పధకాలను అప్పటి మాదిరిగానే కొనసాగించివున్న పక్షంలో ఈనాడు జగన్ మోహన రెడ్డి  ఆ పధకాలను గురించి క్లెయిం చేసుకునే అవకాశం దక్కివుండేది కాదు. ఆ పధకాల వల్ల మేలు పొందిన వారి అభిమానం కాంగ్రెస్ పట్ల చెక్కు చెదరకుండా వుండేది. వైయస్సార్ బొమ్మ గురించి ఈనాడు ఇంతగా పార్టీ వర్గాలు మల్లగుల్లాలు పడాల్సిన అవసరం వుండేది కాదు.  కారణాలు ఏవయినా కాంగ్రెస్ నాయకత్వం ఈ బంగారు అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంది. దాని ఫలితమే,  దరిమిలా  కడప, కోవూరు ఉపఎన్నికల  ఫలితాల్లో ప్రస్పుటమయింది కూడా.
అయినా ఇప్పటికీ,  రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వం గురించి  పార్టీ వర్గాల్లో  గుంజాటన సాగుతూనే వుంది. ఈ మధ్య ఢిల్లీలో అధిష్టాన దేవతలు రాష్ట్ర నాయకులకు అభ్యంగన స్నానం చేయించి, చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పి, చేయాల్సిన హిత బోధలు చేసి సాగనంపిన పిమ్మట   ఇది క్రమంగా శ్రుతి మించి ఆరున్నొక్క రాగంగా మారుతోంది.
కాంగ్రెస్ లో అవలక్షణాలకు చక్కని పేర్లు పెట్టుకుంటూ వుంటారు. కార్యకర్తల స్తాయిలోనే కాకుండా అధినాయకుల స్తాయిలో కూడా మాటలు విసురుకుంటూ దానికి అంతర్గత ప్రజాస్వామ్యం అనే నామకరణం చేసుకుని వారిలో వారే సంతృప్తి పడుతూ వుంటారు. పోటీ లేనప్పుడు, ప్రత్యామ్నాయం లేనప్పుడు ఇలా గొడవలు పడ్డా వచ్చే ప్రమాదం లేకపోవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితులు ఆ విధంగా లేవు. ఏదో అధికారంలో వున్న పార్టీ కదా ఇప్పుడే  వొదిలేయడం ఎందుకు, కొన్నాళ్ళు ఆగితే పోలా అనుకునేవాళ్లకు  కాంగ్రెస్ లో ఏమాత్రం కొరత లేదు. అలాగే వై యస్సార్ వీరవిధేయులు పార్టీ విడిచి వెళ్ళిన తరువాత కూడా, మరి  కొందరు ఇంకా మఠం వేసుకు కూర్చుని ‘మనసు ఒక చోటా మనువు మరో చోటా’ అన్న డోలాయమానంలో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి తార్కాణం కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా  వెల్లడిస్తున్న ‘కోవర్టు’ల వ్యవహారమే.
త్వరలో జరగనున్న పద్దెనిమిది ఉప ఎన్నికల్లో ఏ పార్టీ పరిస్తితి ఎలావుంటుందో ఎవరూ చెప్పలేరు. పోలింగుకు ఒక్క రోజు ముందు జరిగే ఏ సంఘటన అయినా ఫలితంపై ప్రభావం చూపే అవకాశం వుంటుంది. కాని ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పొచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి ఇంత దీనాతిదీనంగా వుండడం గత నలభై ఏళ్లలో ఎప్పుడూ చూడలేదు. వైయస్సార్ మరణానంతరం లభించిన  మూడేళ్ళ పై చిలుకు అధికార సమయాన్ని కాంగ్రెస్ వారు పూర్తిగా వృధా చేసుకున్నారు. నిష్క్రియాపరత్వానికి ఒక ఉదాహరణగా చరిత్రలో నిలచిపోతారు. (11-04-2012)
                                                          

16, జూన్ 2010, బుధవారం

Strategy? Or showdown? - Bhandaru Srinivas Rao (I.I.S.)

Strategy? Or showdown? - Bhandaru Srinivas Rao (I.I.S.)

The ongoing war-of-nerves among ruling Congress party members, indeed sending a wrong signal to people, that too on the eve of byelections to 12 assembly constituencies, which necessitated due to the resignation of 10 TRS and one each of TDP and BJP members protesting against the Centre’s refusal to carve out separate Telangana and instead constitute Justice BN Srikrishna Committee.

Today, people are perplexed with the behavior of the ruling Congress members, that too the so called seniors from the region, who are more vocal in digging their own party colleagues graves. Was it a clever strategy of anti-YSR group nail their pro-YSR counterparts? Or such ‘pressure’ tactics only meant to prevail upon the party high command not to consider accommodating the former CM’s scion and Kadapa MP Y S Jaganmohan Reddy with a plum post in future? (This is in the wake of rumors making rounds that he may as well be allowed to succeed D Srinivas as Pradesh Congress Committee chief, as the former's term is coming to an end next month)

Should one consider it as their ‘strategy’ to ‘finish’ pro-YSR group within the party? Or a show down with the party high command?

Whatever may be their ‘hidden’ agenda, it is not going do any good to the party – now or in future. Calling their own colleague ‘corrupt’ doesn’t augment anyway for their own ‘vote bank’ to sail with them in the coming polls. And, if the party high command, for some reason or the other, bow down to these pressure tactics, and direct Rosaiah to ‘drop’ allegedly corrupt Ponnala from the Cabinet, it proves more disastrous to the party and government.



Doesn’t the so called seniors of the region aware of these facts? How come they choose to don the role of “Bhasmasura” to wipe their own party from the state? Can they dare imagine of the party winning any future elections, leave alone bouncing back to power yet again in 2014?



What one fails to understand how come these seniors dare not raise their voice while YSR was alive and kicking? Weren’t they scared of his unassailable stature and his ‘hold’ with the party high command? Do they choose now as they find ‘chicken heart-type’ qualities in their own Chief Minister K Rosaiah as he has no control over them?



As far Rosaiah is concerned, he is proving beyond doubt of adopting ‘Chanakya’ neethi. Time and again he is reiterating that he is sitting in CM's gaddi at the behest of party high command. He admits that the ‘seat’ is too 'hot' and willing to vacate, if the party high command so directs. Thus far, Rosaiah ‘cleverly’ keeps his hands off on ongoing war-of-nerves among his own party colleagues. Not that he is ‘blind’ to the fact that such malicious campaign against his own Cabinet colleague only weaken his government, than serve any better. Yet, by leaving the decision on ‘disciplining members’ to the party high command, he establishes his ‘neutral stand’ amongst warring groups.

It is up to the party high command to decide whether such ‘neutral’ stand of Rosaiah will do any good to the party or not.
But for an average onlooker the ongoing ‘power struggle’ within the ruling clique reminds them of pre-1983 political scenario in the state. The ‘power struggle’ within the Congress appears to be making its main Opponent Telugu Desam party job much easier to win over the people. The Congress party could win 2004 and 2009 elections simply because of the ‘unity’ it displayed under the strong leadership of YSR. That YSR initiated welfare schemes to poor and needy might have further cemented the ‘faith’ of electorate in that party.

The TDP, which spearheaded the ‘corruption’ issue, especially attacking the envious ‘Jalayagnam’ project from the day it was unveiled, in fact failed to convince the electorate. Their ‘appeasing tactics’ of ‘direct money transfer’ scheme into beneficiaries accounts, if their party brought back to power, also failed to convince the electorate in 2009 elections.

But, if the ruling party members themselves admit that there are more skeletons in their cupboard and are willing to pull one after the other, then the electorate does't require any more proofs.

Now it’s up to the ruling party and its high command to take immediate ‘damage control’ measures to prevent further erosion of the party’s image in the eyes of Andhrites. It they do, and then the fears of pre-1983 may as well come true! (16-06-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

2, మార్చి 2010, మంగళవారం

దటీజ్ డాక్టర్ రాజశేఖరరెడ్డి!


దటీజ్ డాక్టర్ రాజశేఖరరెడ్డి!

"అయాం సోల్డ్" - అన్నారు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు.

ముఖ్యమంత్రి అమ్ముడుపోవడమా!అందులోను వైఎస్సార్? ఎవరికి అమ్ముడుపోయారు? ఎంతకు అమ్ముడుపోయారు?



అది డిసెంబరు నెల. 2007 వ సంవత్సరం.

అప్పటికే -108- అంబులెన్సులు రాష్ట్రాన్ని చుట్టిపెడుతున్నాయి. అత్యవసర వైద్య సేవలు అందించడంలో దేశం మొత్తంలోనే అగ్రగామి అనిపించుకుంటున్నాయి.నిజానికి ఈ సర్వీసులకు ప్రాచుర్యం కల్పించిన ఘనత రాజశేఖరరెడ్డి గారిదే. ఏ పబ్లిక్ మీటింగ్ లోనయినా సరే - 'కుయ్ ...కుయ్' మని 108 అంబులెన్సుని అనుకరిస్తూ దాని ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియచేసేవారు.

ఆ రోజుల్లోనే - సుదూర గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలకు సంబంధించి మరో ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు వచ్చింది.అదే ఎఫ్ డీ హెచ్ ఎస్. -'ఫిక్సెడ్ డేట్ హెల్త్ సర్వీస్' - నిర్దేశిత దిన వైద్య సేవలు. ఇందుకు పూర్వ రంగం గురించి కొంత ప్రస్తావించాల్సివుంటుంది.

ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తోంది.ఇందులో సింహ భాగం నిర్వహణ వ్యయం కిందికే పోతోంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు కొంత మేరకు ప్రజల ఆరోగ్య సేవల అవసరాలను తీరుస్తున్నప్పటికీ- డాక్టర్ల కొరత అన్నది ఎప్పటికీ తీరని సమస్యగానే మిగిలిపోతున్నది. మన రాష్ట్రంలో ఎనభయి వేల గ్రామాలుంటే, కేవలం పదిహేను వందల చోట్ల మాత్రమే వైద్యులు అందుబాటులో ఉన్నారు. వైద్య కళాశాలలో పట్టా పుచ్చుకున్న ఏ ఒక్కరు కూడా పల్లెలకు వెళ్లి వైద్యం చేయడానికి సిద్దంగా లేరంటే అతిశయోక్తి కాదు. ఇక మందుల విషయం చెప్పనక్కరలేదు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా వున్న పల్లెల్లో నివసించే వారికి ఈ అరకొర సదుపాయం కూడా అందుబాటులో లేదు. నాటు వైద్యుల దయా దాక్షిణ్యాల పయినా, వారిచ్చే నాటు మందుల పయినా ఆధారపడాల్సిన దీన స్తితి వారిది. బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా అరణ్య ప్రాంతాలలో - అంత సులువుగా చేరుకోలేని కోయ గూడాలు, లంబాడి తండాల్లో వుండే పేద వారికి రోగం రొస్టూ వస్తే ఇక ఇంతే సంగతులు. అలాటివారు సాధారణంగా షుగరు, రక్త పోటు, ఉబ్బసం, కీళ్ళ వ్యాధులతో బాధపడుతుంటారు. అసలు ఇలాటి జబ్బులు తమకు వున్నట్టు కూడా వీరికి తెలియదు. ఎందుకంటె ఎలాటి వైద్య పరీక్షలు ఎప్పుడూ చేయించుకుని ఎరుగరు కనుక. రోగం ముదిరి ఏ పక్షవాతానికో దారి తీసేదాకా 'బీపీ' వున్నట్టు కూడా తెలియదు.

ఈ నేపధ్యంలో -

అప్పటికే - ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం ప్రాతిపదికన ఏర్పాటయి, పనిచేస్తున్న -104- ఉచిత వైద్య సలహా కేంద్రం నిర్వాహకులు - హె చ్ ఎం ఆర్ ఐ (హెల్త్ మానేజిమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) వారు ఈ సమస్యపై దృష్టి సారించారు. అందుబాటులో వున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు మూడు కిలోమీటర్ల ఆవల వుండే ప్రతి పల్లెకు- నెల నెలా క్రమం తప్పకుండా వెళ్లి - వూరివారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించే వాహనానికి రూపకల్పన చేశారు. 108 అంబులెన్సు ప్రమాదం అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించినదయితే ఈ 104 సంచార వైద్య వాహనం - పేద పల్లె ప్రజల ప్రాణాలు ప్రమాదం అంచుకు చేరకుండా చూస్తుంది.ఇంతా చేసి ఈ పధకం కింద లబ్ది పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే- ఒక్కొక్కరిపై పెట్టె ఖర్చు ఏడాదికి కేవలం ఎనభయి రూపాయలు మాత్రమే. అంటే వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్ లో పది శాతం కన్నా తక్కువన్నమాట.

ఈ వాహనం ప్రతి నెలా ఒక నిర్దేశిత దినం నాడు క్రమం తప్పకుండా ఒక గ్రామాన్ని సందర్శిస్తుంది. ఇందులో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ముగ్గురు ఏ ఎన్ ఎం లు(నర్సులు), ఒక ఫార్మసిస్టు, ఒక లాబ్ టేక్నీషియన్, ఒక డ్రయివర్తో సహా మొత్తం ఏడుగురు సిబ్బంది వుంటారు. బయో మెట్రిక్ పద్దతి ద్వారా రోగుల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. గర్భిణీ స్త్రీలను, బాలింతలను పరీక్షించి మందులు ఇస్తారు. గర్భిణి కడుపులో పిండం పెరుగుదలను నెలనెలా గమనిస్తూ తగిన జాగ్రత్తలు సూచిస్తారు.అవసరమని భావిస్తే, ఫోన్ చేసి ఆసుపత్రిలో చేర్పిస్తారు.రక్త పోటు, షుగర్ ఉన్నవారికి నెలవారీగా చేయాల్సిన పరీక్షలు నిర్వహిస్తారు.

'దర్వాజాలో దవాఖానా' వంటి ఈ పధకానికి సంబంధించిన మొత్తం వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ రూపంలో ముఖ్యమంత్రికి వివరించడానికి హెహ్ ఎం ఆర్ ఐ నిర్వాహకులు ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్ తీసుకుని ఆనాడు సచివాలయానికి వెళ్ళారు.ఇప్పటి ముఖ్యమంత్రి, ఆనాటి ఆర్ధిక మంత్రి అయిన రోశయ్య గారు కూడా పాల్గొన్న ఆ సమావేశం మొదలయి మూడు నాలుగు స్లయిడులు వేసారో లేదో- రాజశేఖరరెడ్డి గారు ఇక వినాల్సింది ఏమీ లేదన్నట్టు, హటాత్తుగా 'అయాం సోల్డ్ '(ఫర్ థిస్ ఐడియా) అనేసారు.

అంతే!

దాదాపు ఏడాదికి నూరు కోట్ల రూపాయలకు పైగా ఖర్చయ్యే ప్రాజక్టును పది నిమిషాల్లో ఖరారుచేసి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.

దటీజ్ డాక్టర్ రాజశేఖరరెడ్డి!

___________________________________________________________________________________________

-భండారు శ్రీనివాసరావు (02-03-2010)

____________________________________________________________________________________________

--(హెలికాప్టర్ దుర్ఘటనలో రాజశేఖర రెడ్డి గారు కన్నుమూసి ఆరు మాసాలు గడిచిన సందర్భంలో 02-03-2010 తేదీన సాక్షి దినపత్రికలో ప్రచురితం - భండారు శ్రీనివాసరావు)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

24, డిసెంబర్ 2009, గురువారం

రెండు కన్నీటి బొట్లు - భండారు శ్రీనివాసరావు

రెండు కన్నీటి బొట్లు - భండారు శ్రీనివాసరావు



దేశవ్యాప్తంగా,మీడియాలో,పత్రికల్లో అత్యధికంగా వినపడ్డ,కనపడ్డ పదం వైఎస్సార్.ఆ పేరు వినబడుతూనే వుంటుంది కానీ,ఇక ఆ రూపం కనబడే అవకాశమే లేదు.ఒక వ్యక్తి గుణగణాలను సమాజం సంపూర్తిగా అవగాహన చేసుకోవడం జరిగేది అతడి మరణం తర్వాతనే అన్నది రాజశేఖర రెడ్డి గారి విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజమైంది.



'రాజశేఖరా!నీపై మోజు తీరలేదురా!' అని తెలుగు ప్రజానీకం రెండోపర్యాయం ఆయనకు అధికార పగ్గాలు అప్పగించి వంద రోజులు నిండీనిండగానే-రాజశేఖరుడికి నూరేళ్ళు నిండిపోవడం అత్యంత విషాదకరం.



'రాజసాన ఏలరా!' అని మనసారా కోరుకున్న ప్రజలకు ఆయన ఆకస్మిక మరణం విధి విధించిన శాపం.

అర్థవంతమైన జీవితాలెప్పుడూ అర్ధంతరంగానే ముగిసిపోతుంటాయి.మాట తప్పని మనిషిగా, మడమ తిప్పని వీరుడిగా పేరు తెచ్చుకున్న వైఎస్సార్-అరవై యేళ్ళు రాగానే రిటైర్ అయిపోతానన్న మాటని నిలబెట్టుకుంటూ-జీవితం నుంచే రిటైర్ కావడం అన్నది-ఆయన పధకాల ద్వారా బతుకులు పండించుకుంటున్న బడుగు జీవుల దురద్రుష్టం.



1978 నుంచి ఇప్పటివరకూ ఒక జర్నలిష్టుగా ఆయన్ని కలుసుకున్న సందర్భాలు అనేకం వున్నాయి.విలేకరులను విందు సమావేశాలకు ఆహ్వానించినప్పుడు ఆయన తరహానే వేరుగా వుండేది.బిగుసుకుపోయినట్టు వుండడం, మర్యాద కోసం మొహాన నవ్వు పులుముకోవడం ఆయన స్వభావానికే విరుధ్ధం.నవ్వులో స్వచ్చత,పిలుపులో అత్మీయత వుట్టిపడేవి.నమ్మినవాళ్ళని నట్టేట ముంచకపోవడం,నమ్ముకున్నవాళ్ళకోసం యెంతకైనా తెగించడం జన్మతః అబ్బిన గుణాలు.వీటివల్ల-రాజకీయ జీవితంలో మేలు కన్న కీడే ఎక్కువ జరిగిన సందర్భాలు వున్నా, ఆయన లెక్కపెట్టింది లేదు.తీరు మార్చుకున్నదీ లేదు. ఈ విలక్షణ లక్షణమే వైఎస్సార్ కు రాష్త్రవ్యాపితంగా అభిమానులను తయారుచేసిపెట్టింది.ఎన్నికలు వచ్చినప్పుడు కేవలం తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా- రాష్త్రంలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ తరపున ప్రచారం చేయగల ఖలేజాను ఆయనకు కట్టబెట్టింది.



1975 లో నేను రేడియో విలేకరిగా హైదరాబాదులో అడుగుపెట్టిన మూడేళ్ళ తరవాత రాజశేఖరరెడ్డి గారు తొలిసారి శాసన సభకి ఎన్నిక కావడం-మంత్రి పదవి చేపట్టడం జరిగింది.వయస్సు మళ్ళినవాళ్ళే రాజకీయాల్లోకి వస్తారనే అభిప్రాయానికి భిన్నంగా యువరక్తం రాజకీయ రంగంలోకి రావడం అప్పుడే మొదలయింది.



కొంచెం అటు ఇటుగా రాష్త్ర రాజకీయాల్లో అడుగిడిన రాజశేఖరరెడ్డి గారు, చంద్రబాబు నాయుదుగారూ ప్రాణ స్నేహితులుగా మసలిన రోజులకు నేను కూడా సాక్షిని కావడం యాద్రుచ్చికం. మంత్రి పదవి తనను ముందు వరించినప్పటికీ- చంద్రబాబు నాయుడు గారు సైతం మంత్రి అయ్యేంత వరకూ ఆయన పడ్డ ఆరాటం- ఆనాటి జర్నలిష్టులందరికీ తెలుసు.



రాజశేఖర రెడ్డిగారిని నేను మొదటిసారి చూసింది-ఆ రోజుల్లొ సచివాలయానికి కూతవేటు దూరంలో వున్న సరోవర్ హోటల్ (ఇప్పుడు మెడిసిటి హాస్పిటల్) టెర్రేస్ మీద.సచివాలయంలో జరిగిన ఒక సంఘటన దరిమిలా వివరణ ఇచ్చేందుకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భం అది.అప్పట్లో ఆయన ఒక తరహా మీసకట్టులో కనిపించే వారు.కానీ, కపటం లేని మందహాసానికి మాత్రం అప్పటికీ, ఇప్పటికీ ఆయనదే కాపీ రైట్.

ఇటు హైదరాబాదులోనూ,అటు ఢిల్లీలోనూ వైఎస్సార్ నివాసాలు జర్నలిష్టులతో కళకళలాడుతూవుండేవి. వేళాపాళాతో నిమిత్తంలేకుండా ఆ ఇళ్ళకి వెళ్ళివచ్చే చనువు వుండేది.సుధీర్ఘకాలం రాజకీయరంగంలో కొనసాగడం వల్ల,పేరుతో పిలిచి పలకరించగల జర్నలిష్టు స్నేహితులు ఆయనకు రాష్త్రంలోని అన్ని ప్రాంతాల్లో వుండడం సహజమే.



2004 లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి కాగానే-ఆయనతోవున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని, కేవీపీ గారి ద్వారా నా మనసులోని మాటని ఆయన చెవిన వేశాను.అప్పటికే కొన్ని ప్రైవేటు టీవీ చానళ్ళు రంగప్రవేశం చేసినందువల్ల-రేడియో కేంద్రానికి వచ్చి తొలి సందేశం రికార్డు చేయడం అన్నది కొద్దిగా ఇబ్బందే.అయినా, ఆయన నా మాట మన్నించి- నేరుగా ఆకాశవాణి కేంద్రానికి వచ్చారు.అలాగే,హైదరాబాదు దూరదర్శన్ లో నేను రిటైర్ కావడానికి ముందు కూడా ఆయన స్టుడియోకి వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.



వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన రెండేళ్ళకే నా విలేకరిత్వానికి తెరపడింది. అయినా,ఆ తర్వాత కూడా, వార్షికంగా నిర్వహించే విందు సమావేశాలకు నాకు ఆహ్వానం అందుతూనే వుండేది. రిటైర్ అయిన తర్వాత చాలా రోజులకు జరిగిన-మా రెండో కుమారుడి వివాహానికి-ముఖ్యమంత్రిగా యెన్నో పని వొత్తిళ్ళు వున్నప్పటికీ హాజరై ఆశీర్వదించి వెళ్ళడం- నా పట్ల వారికున్న వాత్సల్యానికి మచ్చుతునకగా భావిస్తాను.

ఆయన ప్రతిపక్షనాయకుడిగా వున్నరోజుల్లో ఎప్పుడైనా కాలక్షేపంగా కలుసుకున్న సందర్భాల్లో రాజకీయాల ప్రస్తావన వచ్చినప్పటికీ- ఆయన నాతో సరదా కబుర్లనే ఇష్టపడేవారు.రేదియో విలేకరిగా నాకున్న పరిమితులను ఆకళింపు చేసుకోవడమే కాకుండా- 'శ్రీనివాసరావుని ఇబ్బంది పెట్టకండయ్యా!' అని తోటి జర్నలిష్టులకి సర్దిచెప్పేవారు.

ఒక విలేకరికి-ఒక రాజకీయనాయకుడికి నడుమ సహజంగావుండే సాధారణ సంబంధాన్ని మహోన్నతంగా పెంచి పెద్ద చేసిన పెద్దమనసు ఆయనది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా పెనవేసుకున్న ఈ బంధం తెగిపోయిన విపత్కర సందర్భంలో- ఆ మహోన్నత వ్యక్తిత్వానినికి నివాళి అర్పిస్తూ-'రెండు కన్నీటి బొట్లు ' రాల్చడం మినహా ఏమీ చేయలేని చేతకానితనానికి చింతించడం తప్ప చేయగలిగింది ఏముంది?



Bhandaru Srinivas Rao (I.I.S.)

Cell: 98491 30595 Res: 040 2373 1056.