CHANDRABABU లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
CHANDRABABU లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, ఆగస్టు 2016, సోమవారం

వై.ఎస్.ఆర్. నవ్వుపై చంద్రబాబు కామెంటు



2005 డిసెంబరులో  దూరదర్సన్ నుంచి రిటైర్  అయిన తరువాత డాక్టర్ ఎన్ భాస్కర రావుగారి సంస్థ ‘సీ ఎం ఎస్’ తో కలిసి కొన్నాళ్ళు పనిచేసాను. వారి కార్యాలయంలో అనేక టీవీ సెట్లు ఉండేవి. ప్రతి దాంట్లో ఒక్కో ఛానల్ వచ్చేది.  వివిధ ఛానల్స్ కార్యక్రమాలు చూసి వాటిపై  వారం వారం ఓ రివ్యూ తయారు చేసేవాళ్ళం. ఇందులో ప్రకాష్, శశికళ, సుజాత, శివ సహకరించేవారు. పాత కాగితాలు సర్దుతుంటే ఆనాటి ఓ రిపోర్ట్ కళ్ళబడింది. అదే ఇది:
(ఏప్రిల్ 17, 2006)
కారణం ఏదైనా, ఈ వారం అన్ని ఛానళ్ళు కూడబలుక్కున్నట్టు రాజకీయాలతో పాటు ఇతర  అంశాలకు కూడా పెద్ద  పీటవేశాయి.
కలవని మనసులు, కలహాల కాపురాలు, పెద్దల పట్టుదలలు, యువతీ యువకుల తప్పటడుగుల కారణంగా విడాకుల సంఖ్య పెరుగుతోందని చెబుతూ ‘మూడు ముళ్ళ బంధం’ శీర్షిక లో ఈ టీవీ -2 రోజుకో కధనాన్ని ప్రసారం చేసింది. రేషన్ కార్డులకోసం వచ్చిన అమ్మాయిలను వేధిస్తున్న రేషన్ కీచకుడి భాగోతాన్ని కూడా బయట పెట్టిన ఆ ఛానల్ కు  అభినందనలు. అలాగే, రేషన్ కార్డులు కావాలనుకునే వాళ్ళు గర్భ సంచి పరీక్ష చేయించుకోవాలని మహాబూబ్ నగర్ జిల్లాలో సాగిన ఓ వ్యవహారాన్ని తేజ టీవీ అందించింది.
ఏప్రిల్ మొదట్లోనే ఎండలు బాగా  ముదిరిపోతూ  ఉండడానికి కారణాలను నిపుణుల చర్చద్వారా  ఈ టీవీ -2 అందిస్తే, ఎండల కారణంగా రాష్ట్రంలో పట్టపగలే కర్ఫ్యూ  వాతావరణం నెలకొంటోందని టీవీ -9 ఒక  కధనం ప్రసారం చేసింది.
రైతులకు ‘కెపాసిటీ’వుందా  అంటూ, కెపాసిటర్లు  బిగించుకోవడం వల్ల కలిగే  లాభ నష్టాలను గురించి   ఈ టీవీ -2 ఒక కార్యక్రమం  రూపొందించింది.
రంగుల కలలతో  దుబాయ్ వెడుతున్న యువకులు తిరిగి రాలేక ఆ ఎడారి దేశంలో పడుతున్న అవస్థలు గురించి ఒక పరిశోధనాత్మక కధనాన్ని టీవీ -9  ప్రసారం చేసింది. దుబాయ్  లో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు జరుగుతున్న నేపధ్యంలో ఇది ప్రసారం అయింది.
అలాగే ఆ ఛానల్ ఈ వారం మరో కొత్త  పుంత తొక్కింది. క్రీడా రంగ నిపుణులతో నిర్వహించే క్రికెట్  మ్యాచ్ విశ్లేషణ కార్యక్రమాన్ని  అసెంబ్లీలో  ప్రభుత్వ  చీఫ్  విప్  నల్లారి  కిరణ్  కుమార్  రెడ్డి తో  నిర్వహించింది.
షాద్ నగర్ సమీపంలో దొంగతనాలు జరిగితే పోలీసులకు పని ఉండదని చెబుతూ, దొంగను పట్టుకునే బాధ్యతను గ్రామస్తులు ఒక చెంబుకు అప్పగిస్తారని తేజ  ఛానల్ ప్రసారం చేసిన వార్త జనంలోని మూఢనమ్మకాలకు అద్దం పట్టింది.
మహబూబ్ నగర్  జిల్లాలో బర్డ్  ఫ్లూ  వదంతులు  వేగంగా  వ్యాప్తి చెందిన నేపధ్యంలో అక్కడి కోళ్ళ పెంపకందార్లు వాటికి సరిగా మేత పెట్టకపోవడంతో అవి తమలో తాము పొడుచు కుంటున్నాయని జీ టీవీ  ఒక ప్రత్యేక కధనం  అందించింది.
విజయనగరం జిల్లా అల్లువాని వలస గ్రామంలో ఇంటికో  వికలాంగుడు  ఉన్నాడని, రెండు చుక్కల మందు (పోలియో డ్రాప్స్) గురించి వారికి తెలియనే తెలియదని మా టీవీ ఒక కధనం ప్రసారం చేసింది.
ప్రకాశం జిల్లా పొదిలి గ్రామంలో 1999 ఏప్రిల్   20 వ తేదీన జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో చికిత్స పొందిన  30మంది రోగులు కళ్ళు పోగొట్టుకున్నారని , అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారికి అందిస్తానన్న సాయం ఇప్పటివరకు అందలేదని మా టీవీ  ‘రివైండ్’ పేరుతొ ప్రసారం చేసిన కార్యక్రమంలో వెల్లడించింది.
మగ పిల్లలపై మమకారంతో, మగ శిశువు కలిగే వరకు  గిరిజన తండాల్లోని ప్రజలు డజన్ల కొద్దీ ఆడపిల్లలను కంటున్నారని తెలియచేస్తూ పన్నెండు మంది ఆడపిల్లల్ని కన్నఒక మహిళ కధనాన్ని దూరదర్సన్ సప్తగిరి ప్రసారం చేసింది.
కొసమెరుపు:
‘ముఖ్యమంత్రి ఏం చేసినా ప్రతిపక్ష నాయకుడికి గిట్టకపోవడం అసహజమేమీ కాదు. కాకపొతే రాజశేఖర రెడ్డి స్వభావ సిద్ధంగా చిందించే మందహాసాలపై  చంద్రబాబునాయుడు చేసిన విమర్శలు దాదాపు అన్ని ఛానళ్ళకు ఈ వారం ముడి సరుకై కూర్చున్నాయి.
‘ముఖ్యమంత్రి నవ్వు, నటుడు నాగభూషణం నవ్వులాగా విలనీ మార్కు నవ్వు’ అంటూ చంద్రబాబు  విమర్శిస్తే , ‘అసలు నవ్వడమే తెలియని వాళ్ళు మరొకరు నవ్వితే బాధ పాడడం ఎందుకని’ వై.ఎస్.ఆర్. తిప్పికొట్టారు. చాలా  రోజుల తరువాత ఈ పాత ‘స్నేహితుల’ నడుమ చోటు చేసుకున్న ఈ ‘టిట్  ఫర్ టాట్’ జనాలను ఆహ్లాద పరచింది.”
ఇవీ ఈ  వారం  విశేషాలు. మరిన్ని సంగతులతో వచ్చేవారం    (ఏప్రిల్ 17, 2006)

                    

8, ఫిబ్రవరి 2016, సోమవారం

బాబుగారి అసలు ఆస్తి


పాతికేళ్ళ క్రితం ఉద్యోగ రీత్యా ఓ అయిదేళ్ళ పాటు మాస్కోలో వున్న నాలుగు కుటుంబాల వాళ్ళం నిన్న ఆదివారం కలుసుకున్నాం. మేము మాస్కో వెళ్ళే నాటికి తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని పాలిస్తోంది. తిరిగొచ్చేనాటికి కాంగ్రెస్ పాలన. నేను మాస్కో రేడియోలో పనిచేస్తే మిగిలిన ముగ్గురు ఇండియన్ ఎంబసీలో ఉన్నతోద్యోగులు. వారికీ, వారి కుటుంబాలకి తెలుగుదేశం అన్నా, చంద్రబాబునాయుడు అన్నా విపరీతమైన అభిమానం. ఆ అయిదేళ్ళ కాలంలో ఎప్పుడు కలుసుకున్నా వాళ్ళ నోటి నుంచి బాబుగారి గురించిన ప్రశంసావాక్యాలే. 1989 లో ఆ పార్టీ ఓడిపోయినప్పుడు, రేడియో వాడిని కనుక, ఆ రోజుల్లో ఇంత సమాచార విస్పోటనం లేదు కనుక, ఆ వార్తను వారికి ముందుగా చెబితే,   ఇంటిల్లిపాదీ బాధపడడం నాకు తెలుసు.  వాళ్ళ అభిమానం చూసి, ‘ఎన్నారైలకి ఓటు హక్కు ఇస్తే బాబు గారే రాష్ట్రానికి శాశ్విత ముఖ్యమంత్రి’ అని నేను సరదాగా జోక్ చేసేవాడిని.   మధ్యలో ఒకసారి మాస్కో నుంచి వచ్చినప్పుడు నేనే స్వయంగా ఈ మాట ఆయన చెవినవేసాను. నవ్వి ఊరుకున్నారు.
గత ఇరవై ఐదేళ్ళలో బాబు గారి వెంట ఆనాడు వున్న అనేకులు, పార్టీ  ప్రముఖులు, ముఖ్యంగా ఆయన నుంచి ఏదో ఒక ప్రయోజనం పొందినవాళ్ళు  మొహం చాటేశారు. వాళ్ళెవళ్ళు అన్నది అందరికీ  తెలిసిందే.
కానీ మాస్కో బ్యాచ్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. బాబు గారంటే అదే ఆప్యాయత, అదే ఆదరణ.

ఆయన గుర్తింపుతో నిమిత్తం లేని అభిమానం వారిది. ఇది నాకెలా తెలుసంటే, హైదరాబాదు వచ్చిన  తరువాత  ఇన్నేళ్ళలో ఆయన్ని కలిపించమని ఎన్నడూ అడగలేదు.


  

11, మే 2015, సోమవారం

బుక్ షెల్ఫ్ ..........


ప్రతి రాజకీయ పార్టీలో క్రమశిక్షణ లేకపోయినా క్రమశిక్షణా సంఘం అంటూ ఒకటి వుంటుంది. 'దొంగవాడికి మడిబట్టలు అడ్డమా' అన్నట్టు ఇష్టారాజ్యంగా ప్రవర్తించేవారిని ఈ సంఘాలు ఏమీ చెయ్యలేవు. కాకపొతే పార్టీ నుంచి బహిష్కరించే వీలుంటుంది. స్వగృహ ప్రవేశం పేరుతొ ఎంచక్కా  తిరిగి పార్టీలో చేర్చుకుంటున్న రోజుల్లో, నిజం చెప్పాలంటే ఎవరికి వారే పార్టీలో తిరిగి  చేరిపోతున్నట్టు పత్రికా ప్రకటనలు ఇచ్చుకుంటున్న కాలంలో 'బహిష్కరణ వేటు' అనేది  ఏమేరకు ఉపయోగం అనేవారూ వున్నారు.
క్రమశిక్షణ పేరుతొ వేటు వేసేముందు ఆ  సంఘం వారు ఒక నివేదిక ఇస్తారు. అభియోగాలను విచారించేందుకు సీనియర్ సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తారు. వారు దర్యాప్తు చేస్తారు. పార్టీ అధ్యక్షుడికి ఒక నివేదిక సమర్పిస్తారు. ఒక పద్దతి అంటూ సాగని  వ్యవహారాలపై విచారణ తతంగం మాత్రం  పద్దతి ప్రకారమే జరుగుతుంది. అలా నియమాలను తోసిరాజని ప్రవర్తించిన సభ్యులను పార్టీ నుంచి తొలగించాలని సంఘం చేసిన సిఫారసును పార్టీ అధ్యక్షులు ఆమోదించి తదనుగుణంగా ఆ సభ్యుడిని బహిష్కరించినట్టు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకుంటారు. అయితే సంఘాల నివేదికల్లో ఏమి పేర్కొన్నదీ బయట ప్రజలకి తెలియదు. పార్టీలో వారికీ తెలియదు. కానీ కొన్ని సందర్భాలలో ఆ అంశాలు బహిర్గతం అవుతుంటాయి. అలా మరుగున పడిపోయిన ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తుంటాయి.
అలాటి సందర్భం తెలుగుదేశం అధినాయకుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా వున్నకాలంలో జరిగింది. ఎన్టీఆర్ హయాములో తెలుగు దేశం పార్టీకి సుశిక్షితమైన, క్రమశిక్షణ కలిగిన పార్టీ అని పేరుండేది. అలాటి ఆ పార్టీలో,  సీనియర్ సభ్యురాలయిన రేణుకా చౌదరిపై ఒక సారి ఇలాగే త్రిసభ్య బృందాన్ని ఏర్పాటు చేసి ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై దర్యాప్తు జరపమని స్వయానా పార్టీ అధ్యక్షులవారే ఆదేశించారు. శ్రీమతి టీ.ఎన్. సదాలక్ష్మి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ప్రతాపరెడ్డి త్రిసభ్య కమిటీలో  సభ్యులు. సమావేశం అనంతరం  ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఇలా వుంది.
"ఇది నా ఆఫీసు, ఈ సిటీ నాది. ఈ సిటీ మొత్తం మీద పెత్తనం నాది. నా అనుమతి లేకుండా నువ్వు (బుచ్చయ్య చౌదరి) ఎవడవురా రావడానికి? వాడు (ఎన్టీఆర్) ఎవడురా పంపడానికి? కొడకా! చేపలు అమ్ముకునే వెధవా? ఏం పీకుతావురా? ఇదేమన్నా గోదావరి అనుకున్నావా?" అని రేణుకా చౌదరి లంకించుకునేసరికి సమావేశాన్ని వాయిదా వేసుకుని త్రిసభ్య సంఘం వారు బయట పడ్డారు. అయినా ఆమె ఒదిలిపెట్టలేదు. తన అనుచరులకు బుచ్చయ్య చౌదరిని చేయితో చూపిస్తూ, 'డక్కా మారో సాలేకో!' అంటూ రేణుకా చౌదరి వారి వెంట పడ్డారు.
ఇంత  జరిగిన తరువాత కూడా రాజీ కుదర్చడానికి ఆఖరు నిమిషంలో పెద్ద తలకాయలే రంగంలోకి దిగాయి. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కూడా రాజీ కోసం తాము  చేసిన ప్రయత్నాలను కమిటీ సభ్యురాలు సదాలక్ష్మికి  వివరించారు. అటు రేణుకా చౌదరి ప్రతిష్ట దెబ్బతినకుండా, ఇటు   రామారావు ఆదేశాన్ని పాటించే విధంగా 'తెలియకుండా జరిగిపోయింది. క్షమించాలి' అని కోరుతూ ఒక లేఖ ఎన్టీఆర్ కి అందచేయాలని తామూ,  చంద్రబాబు నాయుడు రేణుకా చౌదరిని కోరామనీ, అందుకు ఆవిడ కూడా అంగీకరించారనీ, అయితే తెల్లారేసరికల్లా ఏం జరిగిందో కాని మొత్తం పరిస్తితి మారిపోయిందనీ సదాలక్ష్మి చెప్పారు. శ్రీ రామారావుకు ఇష్టం లేకున్నా ఆయనకు నచ్చచెప్పి ఈ రాజీ ప్రయత్నాలు చేసామని సదాలక్ష్మి తెలపడం విశేషం. ఇంత చేసినా పార్టీ నుంచి రేణుకా చౌదరి బహిష్కరణ తప్పలేదు. ఈ ఉదంతాన్ని చంద్రబాబు నాయుడికి ఓటమిగా, దగ్గుబాటి, లక్ష్మీ పార్వతి వర్గాల విజయంగా అప్పట్లో పార్టీలో పరిగణించారు. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ తరువాత రేణుకా చౌదరి లెక్క చేసేది ఒక్క చంద్రబాబునే. ఆమె అంటే బాబుకు కూడా అభిమానం. అందుకే రేణుక  బహిష్కరణ పట్ల ఆయన ఖిన్నులయ్యారు.
బహిష్కరణ నిర్ణయంతో రేణుకా చౌదరి ఏ మాత్రం బెదరలేదు. పైపెచ్చు సంచలన వ్యాఖ్యలు చేసారు. 'నన్ను బహిష్కరించి ఎన్టీఆర్ ఇన్నాల్టికి మగాడనిపించుకున్నాడు. థాంక్స్.' ఇదీ ఆవిడ ప్రతిస్పందన.
(తదనంతర కాలంలో వడివడిగా సాగిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం, రేణుకా చౌదరిని తిరిగి తెలుగు దేశం పార్తీలోకి చేర్చుకోవడం జరిగాయి.  కాని, రేణుక ఇమడ లేకపోయారు. మూడోసారి రాజ్యసభ టిక్కెట్టు ఇవ్వనందుకు బాబు వైఖరిపై కినిసి రేణుకా చౌదరి, కాంగ్రెస్ లో చేరి 1999 ఎన్నికల్లో ఆ పార్టీ టిక్కెట్టుపై ఖమ్మం నుంచి లోక సభకు ఎన్నికయ్యారు) 

  

(సీనియర్ జర్నలిష్ట్  ఐ. వెంకట్రావు, ఎన్టీ రామారావు పై రాసిన  'ఒకే ఒక్కడు' పుస్తకం ఆధారంగా)                   

26, సెప్టెంబర్ 2013, గురువారం

ఏమి సేతురా లింగా !


ముని మంత్రమ్ము నొసంగనేల? ఇడెబో మున్ముందు మార్తాండు ర
మ్మని నేకోరగనేల? కోరితినిబో యాతండు రానేల?
చ్చెనుబో కన్నియనంచు నెంచక ననున్ జేపట్టగా నేల?
ట్టెనుబో పట్టి నొసంగనేల? యడుగంటెన్ కుంతి సౌభాగ్యముల్


కరుణశ్రీ పద్య రూపంలో పలికించిన ` కుంతీ విలాపం' మాదిరిగా ఉంది నేడు రాష్ట్రంలో వివిధ పార్టీల పరిస్థితి. 
గెలిచి తీరతాం! అన్న ధీమా కాస్తా
గెలవకపోతామా! అన్న ఆశగా మారి 
గెలుస్తామా! అన్న సంశయ రూపం ధరిస్తే - 
మిగిలేది కుంతీ విలాపమే!

కోరిన వరాలిచ్చు కొండంత దేవుళ్ళలాంటి వాళ్ళు  కాదు ఓటర్లు.  వాళ్ళ నాడి కనిపెట్టడం రాజకీయ పార్టీలను పుట్టించిన బ్రహ్మదేవుడి తరం కూడా కాదు. వాళ్ళ మూడ్‌ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అలాగని గాలి వాటం కాదు. సమయం వచ్చినప్పుడు కీలెరిగి వాత పెట్టడంలో వారికి వారే సాటి. ఈ పాటి వాస్తవం ఎరగబట్టే పార్టీ నేతల్లో ఇంత గుబులు.


పైకి ఎంత ధీమాగా ఉన్నా -  బింకంగా కనబడ్డా - 
లోలోపల ఏదో తెలియని గుబులు వారి మనసులను ఏదో మూల తొలుస్తూనే వుండాలి! 
ఇది ఇలా ఎందుకు జరిగింది? అన్న ప్రశ్న  ఎంత స్వాభావికమైనదో -
అలా జరిగి వుంటే - ఇలా జరిగేది కాదేమో అన్న భావన కూడా అంత స్వాభావికమైనదే! 
ఆ నాడు సర్కారు ఎక్స్ ప్రెస్ కాస్త  లేటుగా వచ్చి – నా  పెళ్ళి చూపులకు మీరు మరికాస్త ఆలస్యంగా వచ్చివుంటే - మా నాన్న ఎంచక్కా నాకు ఆ భీమవరం సంబంధమే ఖాయం చేసివుండేవాడు' అన్నదట ఓ ఇల్లాలు శోభనం రోజున కట్టుకున్న మొగుడితో. 
అలాగే - భవనం వెంట్రామ్‌ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు, తన స్నేహితుడు, సహాధ్యాయి అయిన   ఎన్‌. టీ. రామారావు గారిని  రాజభవన్‌కు ఆహ్వానించకపోయి వున్నా, లేదా వెంకట్రామ్‌ గారి సలహా మేరకు రామారావుగారికి  కాంగ్రెస్‌ అధిష్టానం రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి వున్నా  - అసలు తెలుగుదేశం పార్టీ పుట్టేదే కాదన్నాడొక రాజకీయ పండితుడు. 
మరో విశ్లేషకుడు మరో అడుగుముందుకువేసి - డిప్యూటీ స్పీకర్‌కు బదులుగా - చంద్రశేఖరరావుకు చంద్రబాబు తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే తెలంగాణా రాష్ట్ర సమితి ఆవిర్భవించి  వుండేదే కాదు పొమ్మన్నాడు.
రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తరువాత జగన్ మోహన రెడ్డి కోరుకున్న ముఖ్యమంత్రి పీఠం కాకపోయినా ఏదో ఒక ఈశాన్య రాష్ట్రానికి పార్టీ ఇంచార్జ్ గా వేసివున్నా  రాష్ట్రంలో రాజకీయ పరిస్తితి మరో రకంగా వుండేదని ఇంకో పరిశీలకుడు అభిప్రాయపడ్డాడు.
కుంతి పడ్డ మధనం కూడా ఇలాటిదే.
అందుకే మన జనం వేదాంతాన్ని నమ్ముకున్నది 
ఆదీ అంతం అంటూ లేని ఆ వేదాంతం చెప్పేదేమిటంటే -  
‘కానున్నది కాకమానదు. కానిది కానే కాదు’
రోట్లో తలదూర్చిన తరువాత రోకటి పోటుకు వెరవకూడదు.

ఈ సూత్రం పార్టీలకే కాదు ప్రజలకు కూడా వర్తిస్తుంది.

(26-09-2013)

20, డిసెంబర్ 2011, మంగళవారం

"ఎన్టీఆర్ తో నేను" -హెచ్.జె. దొర




"ఎన్టీఆర్ తో నేను" -హెచ్.జె. దొర 


( సీనియర్ ఐ పీ ఎస్ అధికారి, మాజీ డీజీపీ హెచ్.జె.దొర గారు ‘ఎన్టీఆర్ తో నేను’ అనే పేరుతొ  
రాసిన పుస్తకంలో కొన్ని మచ్చుతునకలు.)




“....అమెరికా వెళ్లి ఆపరేషన్ చేయించుకుని తిరిగివచ్చిన ఎన్టీఆర్ కు వెన్నుపోటు తప్పలేదు.
“....నాదెండ్ల భాస్కరరావు ఎవరో అప్పటిదాకా నాకు (దొరకు) తెలియదు.
“ ....తన వ్యక్తిగత విషయాలు గురించి సైతం ఎన్టీఆర్ నా దగ్గర ఓపెన్ అయ్యేవారు.
“....కొంతమంది ఎన్టీఆర్ దగ్గర (నా గురించి) ప్రస్తావించి ఇతను (దొర) ‘అవతల వ్యక్తి’ అని చెప్పినా కూడా ఆయన నన్ను వొదులుకోలేదు.
“....మా మామయ్య బొడ్డేపల్లి రాజగోపాల రావు ఏడు పర్యాయాలు శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి (కాంగ్రెస్ అభ్యర్ధిగా) పోటీ చేసి ఎన్నికవుతూ వచ్చారు. మా ఇంట్లోనే కాంగ్రెస్ క్యాంప్ రాజకీయాలు నడిచేవి. మా మామయ్యకు కుడి భుజంగా వుంటూ ఈ క్యాంప్ నడిపేది స్వయంగా నా తమ్ముడు, ఆయన అల్లుడు హెచ్.ఏ.దొర. చూపరులకు ఇదంతా ఆశ్చర్యంగా వుండేది.
“....దేశ రాజకీయాల్లో ఎప్పుడయితే రాజకీయ పార్టీలకు, వాటి సిద్ధాంతాలకు ప్రాముఖ్యం  తగ్గి వ్యక్తుల ప్రాధాన్యాలు పెరిగాయో, గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయో అప్పుడే (పోలీసు శాఖలో అంతర్భాగంగా వున్న) ఇంటెలిజెన్స్ వ్యవస్త అవసరాలు పెరిగాయి.
“.....ఎన్టీఆర్ ఎక్కువగా ఇంటెలిజెన్స్ ఇన్ పుట్స్  మీదే డిపెండ్ అయ్యేవారు.
“....ఎన్టీఆర్ ఏజెన్సీ ప్రాంతాలలో (ముఖ్యమంత్రి హోదాలో)  టూర్ చేసేటప్పుడు .....అప్పుడు అక్కడున్న గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ, ఖాళీగా వున్న ఇళ్ళల్లో కానీ (ఆయనకు) బస ఏర్పాటు చేసేవారు. (సీఎం పేషీకి చెందిన సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారులు - రాఘవేంద్రరావు, టీ ఆర్ ప్రసాద్, బెనర్జీ లతో పాటు నేను (దొర) చాలా చిన్న గదుల్లో సరయిన వసతులు లేకపోయినా నైట్ హాల్ట్ చేసేవాళ్ళం.
“....ఆంధ్ర జ్యోతి అధినేత కే.ఎల్.ఎన్. ప్రసాద్ చనిపోయారని కబురందింది. ..వెళ్లి నివాళులు అర్పించాలని చంద్రబాబు అన్నారు. ‘ఏం! ఎందుకెళ్ళాలి? మేం వెళ్ళం!’ – ఇదీ ఎన్టీఆర్ సమాధానం.
“అక్టోబర్ 31,1984. ఉదయం పది గంటలు. యు.ఎన్.ఐ. విలేకరి నుంచి ఫోన్. ప్రధానమంత్రి  ఇందిరాగాంధీని ఎవరో షూట్ చేసారట....ఢిల్లీ యెలా వెళ్లాలనే దానిపై తర్జన భర్జన. ఆ రోజుల్లో హైదరాబాదు నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి రెండే ఫ్లయిట్లు. నావల్ చీఫ్ హైదరాబాదులో వున్న సంగతి తెలుసుకుని ఆయన వచ్చిన ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను తీసుకుని ఢిల్లీ వెళ్ళాము. అప్పుడు హైదరాబాదులో వున్న మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కూడా అదే విమానం ఎక్కారు.ఆ చిన్న విమానం, యావ్రో ఎయిర్ క్రాఫ్ట్, ఢిల్లీ చేరడానికి నాలుగు గంటలు పట్టింది.
“....  ఆగస్టు సంక్షోభం నుంచి ఎన్టీఆర్ కు తలనొప్పులు మొదలయ్యాయి. (సొంత) ఎమ్మెల్యేలు పలువురు ఇప్పుడు ఆయననుంచి ఏదో ఒకటి ఆశిస్తున్నారు. ఒకరకంగా బ్లాక్ మెయిల్. అందుకే ఆయన (ఎన్టీఆర్) శాసన సభను రద్దుచేసి తాజాగా ప్రజాతీర్పు కోరదామనుకుంటున్నారు.
“.....పెను తుపాను బాధితుల పరామర్శ కోసం మద్రాసు వచ్చిన ప్రధాని రాజీవ్ గాంధీని రాజభవన్ లో ఎన్టీఆర్ కలసి మాట్లాడారు. ఆ చర్చల తరువాత ఉభయుల మధ్య రాజకీయ అవగాహన కుదిరినట్టు మాకు కొన్ని రోజులయ్యాక తెలిసింది. దీని పర్యవసానమే ఎన్టీఆర్ అసెంబ్లీ రద్దు నిర్ణయం.
“....రాజీవ్ గాంధీతో ఎన్టీఆర్ చేసుకున్న ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ పార్టీలోని ముగ్గురు ముఖ్యులు (పీవీ నరసింహారావు, శివశంకర్, జలగం వెంగళరావు) వీరిపై  తెలుగుదేశం పార్టీ గట్టి అభ్యర్ధులను పోటీకి పెట్టకూడదు.
“....పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలకు రమ్మని కాంగ్రెసేతర పార్టీలకు చెందిన జాతీయ నాయకులనుంచి ఎన్టీఆర్ పై ఒకటే వొత్తిళ్ళు. అయినా రాజీవ్ గాంధీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎన్టీఆర్ వెళ్ళలేదు. రామకృష్ణ హెగ్డే మాట కాదన లేక కర్నాటకలోని ఒక్క కోలార్ కు మాత్రమే వెళ్లారు. అలా వెళ్లినందుకు అప్పటికే ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చేసింది – ఏమిటిదీ అని. అందుకు పార్టీ వివరణ ఇవ్వాల్సివచ్చింది.
“....ఎన్నికలకు ముందు ఒక అవగాహనకు వచ్చిన రాజీవ్, ఎన్టీఆర్ ఆ తరువాత ఆ సయోధ్యకు తిలోదకాలు ఇచ్చారు.
“....రాజీవ్ గాంధీ (రాష్ట్రాల) పర్యటనల్లో కొన్ని సాహసాలు చేస్తుండేవారు.ఒకసారి ఖమ్మం జిల్లా  వచ్చినప్పుడు భద్రాచలంలో దిగి ఒక జీపులో ఎక్కి అందరూ చూస్తుండగానే దాన్ని ముందుకు ఉరికించి అడవుల్లో మాయమయ్యారు.  ఎటు వెళ్ళారో తెలియక మాకు టెన్షన్ మొదలయింది........
“....మరోసారి విశాఖ ఎయిర్ పోర్ట్ లో జర్నలిష్టులతో గంటన్నర మాట్లాడుతూ వుండిపోయారు. ఇంతలో బాగా చీకటి పడింది. ఆయన ఫ్లయిట్ ఎక్కగానే మేం కూడా తిరిగొచ్చేశాము.  తర్వాత తెలిసిందేమిటంటే వాతావరణం అనుకూలించక ఫ్లయిట్ టేకాఫ్ కాలేదు. ప్రధాని ఆ రాత్రి నావల్ ఆఫీసర్స్ మెస్ లో విశ్రాంతి తీసుకుని మరునాడు ఢిల్లీ వెళ్ళిపోయారు........తన జీవితపు చివరి ప్రయాణం కూడా విశాఖ ఎయిర్ పోర్ట్  నుంచే సాగడం రాజీవ్ గాంధీకి సంబంధించి ఒక విషాదం. (మరికొన్ని విశేషాలు మరోసారి- భండారు శ్రీనివాసరావు, 20-12-2011)