Chandrababu Nayudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Chandrababu Nayudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, ఏప్రిల్ 2016, శుక్రవారం

ముందే కూసిన కోయిల


సూటిగా.....సుతిమెత్తగా..... 

1982 – 2001 - 2008 – 2014
తెలుగు జాతి ఆధునిక రాజకీయ  చరిత్రకు  సంబంధించి  ఈ సంవత్సరాలకు చాలా ప్రాధాన్యత వుంది. 1982, 2008, 2014 సంవత్సరాల్లో   తెలుగు సినీరంగ ప్రముఖులు మువ్వురు తెలుగునాట రాజకీయ రంగ ప్రవేశం చేసి రాష్ట్ర రాజకీయాలను కొత్త మలుపు తిప్పారు. పొతే, తెలుగుదేశం పార్టీని వీడి, 2001లో తెలంగాణా రాష్ట్ర సమితి పేరుతొ ఓ కొత్త ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసి, ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం పుష్కర కాలానికి పైగా అలుపెరుగని ఉద్యమం సాగించి తెలంగాణా సాధించిన కేసీఆర్, ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను  మలుపు తిప్పడమే కాదు రాష్ట్ర సరిహద్దులనే మార్చి కొత్త చరిత్రకు స్వీకారం చుట్టారు.
రాజకీయ రంగ ప్రవేశం చేసిన కొద్ది నెలల్లోనే అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న ఘన చరిత్ర అలనాడు తెలుగు చలనచిత్ర సీమలో ధృవతారగా వెలిగిన శ్రీ నందమూరి తారక రామారావుది. 1982 మార్చి 21 వ తేదీన ఆనాటి సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 'తెలుగుదేశం' పేరుతొ ఒక పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు నాటకీయ పక్కీలో ఒక ప్రకటన చేసి మొత్తం రాజకీయ వర్గాలను ఆశ్చర్య చకితులను చేసారు. అంతకుముందు  సినీ రంగానికి చెందిన జగ్గయ్య వంటి కళాకారులు ఎన్నికల్లో పోటీచేసినా  అది పరిమిత పరిధుల్లోనే జరిగింది. పొరుగున వున్న తమిళనాట మాదిరిగా సినీ రంగానికి చెందిన వారు రాజకీయ పార్టీలను ఏర్పాటుచేసే సంప్రదాయం మన రాష్ట్రానికి అప్పటికి కొత్త. పార్టీని స్థాపించిన  తొమ్మిది నెలల్లోనే ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా  అధికార పగ్గాలు చేపట్టి దేశ రాజకీయ చరిత్రలోనే ఎన్టీఆర్   ఒక రికార్డు నెలకొల్పారు. చాలా ఏళ్ళు గడిచిన అనంతరం  2008 లో మరో అగ్రనటుడు చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి 'ప్రజారాజ్యం' పేరుతొ మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.  వరసగా అనేక సంవత్సరాలు తెలుగు చలనచిత్రసీమను వొంటి చేత్తో శాసించిన మెగా  స్టార్ చిరంజీవి  తన పార్టీని ఓ ప్రభంజనం మాదిరిగా జనంలోకి తెచ్చి మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో పోటీకి నిలబెట్టారు. అయితే ఆయన ప్రయత్నాలు అనుకున్న విధంగా  ఫలించక పోవడంతో పద్దెనిమిది సీట్లు, పద్దెనిమిది శాతం వోట్లతో అధికారానికి ఆమడ దూరంలోనే ఆగిపోయారు. తన మనస్తత్వానికి ఈ రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు సరిపడవని నిర్ధారణకు వచ్చారేమో తెలియదు కాని, పార్టీని స్థాపించిన మూడేళ్ళలోనే దాన్ని కాంగ్రెస్ లో కలిపేసిన ఓ రికార్డును తన ఖాతాలో వేసుకుని  చేతులు దులుపుకున్నారు. దరిమిలా కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో  ఒక స్థాయి మంత్రి పదవితో సంతృప్తి పడి, గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తరువాత నామమాత్రంగా ఆ పార్టీలో కొనసాగుతున్నారు. అన్నగారి ప్రజారాజ్యం పార్టీ  యువజన విభాగం అయిన యువరాజ్యం నాయకుడుగా, 2009 ఎన్నికల్లో  రాష్ట్రం నలుమూలలు తిరిగి ప్రజారాజ్యం తరపున ప్రచారం చేసి, కాంగ్రెస్ వారి పంచెలు వూడదీస్తాననే తీరులో, తనదైన బాణీలో,  ఆవేశపూరిత ప్రసంగాలు  చేసి, ఎన్నికల అనంతరం అన్నగారు పార్టీతో సహా ఆ కాంగ్రెస్ పంచనే చేరడం హరాయించుకోలేక  పవన్ కళ్యాణ్ కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా, మౌనంగా వుండిపోయారు.


మళ్ళీ 2014 ఎన్నికలకు ముందు  హఠాత్తుగా రంగ ప్రవేశం చేసి ఆ ఏడాది మార్చిలో జనసేన పేరుతో ఓ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసున్నట్టు ఆర్భాటంగా ప్రకటించి తన అభిమానులను అలరించారు. రాజకీయ ప్రత్యర్ధులను అదరగొట్టారు. అప్పటివరకు అన్నచాటు  తమ్ముడిగా పేరున్న పవన్, అదే  అన్నగారి పార్టీకి  వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేయడం అందరికీ ముఖ్యంగా అయన కుటుంబంలోని వారికే ఎంతో  ఆశ్చర్యం కలిగించింది. పేరుకు  పార్టీ అయితే పెట్టారు. కానీ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని మరో ప్రకటన చేసి అభిమానులను ఉసూరుమనిపించారు. ఈలోగా రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది.  రాష్ట్ర విభజన అంశం ఆయనకు బాగా కలిసివచ్చింది. జాతీయ రాజకీయాల్లో కొత్త మెరుపులు మెరిపిస్తున్న మోడీ ఆయనకు బాగా నచ్చారు.  పవన్ వంటి జనాదరణ వున్న సినీ హీరోల అవసరం మోడీకి లేదా ఆయన నాయకత్వం  వహిస్తున్న బీజేపీకి వున్న మాట కూడా కాదనలేనిది. ఆనాటి పరిస్తితులు అలాటివి. అది పవన్ కళ్యాణ్ కు మరింతగా కలిసివచ్చింది. మంచి డైరెక్టర్, చక్కని తారాగణం, గట్టి కధాబలం వున్న సినిమా కాసుల వర్షం కురిపిస్తుంది అన్న సినీ సూత్రం వంటబట్టించుకున్న పవన్, తెలివిగా అడుగులు వేసి బీజేపీతో చేతులు కలిపారు. అంతే  కాదు, తాను కొత్తగా స్థాపించిన 'జనసేన' పార్టీని ఎన్నికలబరిలో దింపకుండా, సీట్లకోసం బేరసారాలు ఆడకుండా,  తాను కూడా పోటీ చేయకుండా ఒక కొత్త వ్యూహంతో మోడీ పార్టీకి ప్రచారం చేసిపెట్టారు. ఇది సినీ రంగంలో మామూలే. తాము వాడని షాంపూలకు , వేలేసి కూడా  తాకని సబ్బులకు, సినీ తారలు తమ ప్రకటనలతో లేని  గిరాకీ కలిగిస్తూ వుండడం కొత్తేమీ కాదు.   అదే వాణిజ్య సూత్రాన్ని పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక  ఎన్నికల్లో ప్రయోగించి,  అటు మోడీకి, మరోపక్క బీజేపీ మిత్రపక్షం అయిన టీడీపికి ఫలితాలను ప్రభావితం చేసే రీతిలో  ప్రచారం చేసిపెట్టారు. పవన్ ఆవేశం, సమాజంపట్ల  ఆవేదన ఆయన ప్రసంగాలలో ప్రతిఫలించడంతో  అభిమానులనే కాకుండా సాధారణ  జనాలను సయితం ఆకట్టుకోగలిగారు. ఫలితం గురించి వేరే చెప్పక్కర లేదు. ఆ ఎన్నికల్లో బీజేపీ కూటమికి లభించిన విజయంతో మోడీ దృష్టిలో  పవన్ నిజంగా ఒక హీరో అయిపోయాడు. ప్రధానిగా తను చేయబోయే  ప్రమాణస్వీకారానికి రావాల్సిందని  మోడీ స్వయంగా పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించడం దీనికి దృష్టాంతం.
సరే! ఎన్నికలు ముగిసాయి. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కొలువు తీరారు. ఎవరికి వారు తమ పనుల్లో తీరికలేకుండా మునిగి పోయారు. వారు అధికారంలోకి రావడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించిన  పవన్ కళ్యాణ్  మాత్రం అప్పుడప్పుడూ మీడియా తెరలపై కనిపిస్తూ తన ఉనికిని రుజువు చేసుకోవడం మినహా పెద్దగా  రాజకీయ కార్యకలాపాలు సాగించింది  లేదు. మళ్ళీ చలనచిత్రాలతో తీరిక లేకుండా వుంటూ, దొరికిన  తీరిక సమయాల్లో అమరావతి భూముల వ్యవహారం వంటి వివాదాంశాలలో తల దూరుస్తూ, రాజకీయ యవనికపై అప్పుడప్పుడూ మెరుస్తూ పార్ట్  టైం పొలిటీషియన్ మాదిరిగా  కాలక్షేప రాజకీయాలు నడుపుతున్నారన్న అపప్రధను మూటగట్టుకున్నారు.
ఈ కధ ఇలా సాగిపోతున్న నేపధ్యంలో....
మూడేళ్ళ తరువాత జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్ లో తన పార్టీ జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని ఇటీవల ప్రకటించి కొత్త రాజకీయ చర్చకు తెర లేపారు. రానున్న రోజుల్లో పవన్ పార్టీ జనసేన, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను ఏమేరకు ప్రభావితం చేయగలుగుతుందన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా తయారయింది. ఎన్నికలకు ఇంకా చాలా వ్యవధానం వున్న తరుణంలో పవన్ చేసిన ఈ ప్రకటన ఆయన సహజ శైలికి దగ్గరగా వున్నప్పటికీ, రాజకీయ కోణంలో పరిశీలించినప్పుడు ‘కోయిల ముందే కూసింది’ అనే భావన కలిగిస్తోంది. తెలంగాణా సంగతి  ఏమో కాని, పవన్ పార్టీ ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో వున్న మాట కాదనలేనిది. ఒంటరిగా పోటీ చేయడం అనే పవన్ నిర్ణయం  గత ఎన్నికల్లో మిత్ర పక్షాలుగా వున్న బీజేపీ, టీడీపీలపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది అన్నది కీలక అంశం. వచ్చే ఎన్నికల నాటికి   రాజకీయ సమీకరణాలు  కూడా  మారడం తధ్యం అన్న అభిప్రాయం కూడా నానాటికీ బలపడుతోంది.
ప్రస్తుతానికయితే దేశంలో మోడీ హవా బాగా సాగుతోంది. స్వయంగా ముందరి కాళ్ళకు తనకు తానుగా బంధాలు వేసుకోకపోతే చంద్రబాబు నాయుడికీ అంత ఇబ్బందికర పరిస్తితి ఏమీ కనబడడం లేదు. ప్రముఖ మీడియా సంస్థ ‘సీఎం ఎస్’  తాజాగా జరిపిన సర్వే కూడా చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్తితులు ఏమీ లేవనే చెబుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్  రాజకీయాల్లో బాబుకు ప్రత్యామ్నాయం లేదంటూ ఆ సర్వేలో వెలువడిన ప్రజాభిప్రాయం టీడీపీ అధినేతకు ఊరట కలిగించే విషయమే. అయితే అదే సమయంలో  ఆ పార్టీ తన పని తీరు కొంత మార్చుకోవాల్సిన అవసరాన్ని సూచించే హెచ్చరికలు కూడా  ఆ సర్వే ఫలితాల్లో  వెల్లడయ్యాయి. చంద్రబాబు పాలనపై ప్రజల అభిప్రాయం సానుకూలమా, ప్రతికూలమా అనే ప్రశ్నకు వచ్చిన జవాబుల నడుమ తేడా కేవలం రెండు శాతం మాత్రమే వుండడం గమనార్హం.  మరో మూడేళ్ళ తరువాత  సానుకూలత, ప్రతికూలతల్లో ఎంతో కొంత తేడా రావడం సహజం. ఆ తేడాపాళాలు ఫలితాలపై ప్రభావం చూపించే అవకాశం వుంటుంది.  అది అధికారాన్ని దూరం చేసేంత ప్రభుత్వ వ్యతిరేకతగా  మారుతుందా అన్నది  ఇప్పుడే ఊహించడం కష్టం. మరి, ఈ పరిస్తితుల్లో, అప్పుడప్పుడు  మెరిసి  మురిపించే పార్టీగా పేరు తెచ్చుకున్న పవన్ పార్టీ కి కొత్తగా లభించే అవకాశాలు ఏపాటివి?
భవిష్యత్ ఎన్నికల్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో పవన్ సాయం తీసుకోవడానికి బీజేపీకి ఎలాటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. పవన్ వంటి ప్రజాకర్షణ కలిగిన నాయకుడు వొప్పుకోవాలే  కాని జనసేనను తమ పార్టీలో కలుపుకోవడానికి కూడా సిద్ధపడవచ్చు. ఒక క్రమబద్ధమైన ప్రణాళికతో, ముందస్తు చూపుతో 'కాంగ్రెస్ రహిత భారత దేశం' అనే స్వప్నాన్ని  సాకారం చేసుకునేందుకు భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఆయా రాష్ట్రాలలో, ప్రధానంగా దక్షిణాదిన,   ప్రజాదరణ వున్న స్థానిక నాయకులను దగ్గరికి తీసుకునేందుకు పావులు కదుపుతున్న విషయం రహస్యమేమీ కాదు.  మోడీకి దగ్గరవాడు కావడం, రాజకీయాలకు కొత్తకావడం పవన్ కు ఈ విషయంలో అదనపు అర్హతలు.
ప్రస్తుతం ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం లేని మాట నిజమే. అలాగే కొత్త పార్టీ దూసుకు పోవడానికి వీలైన రాజకీయ శూన్యత కూడా ఏమీ లేదు. టీడీపీ నిలదొక్కుకోవడానికి,  బీజేపీ కాలు కూడదీసుకోవడానికీ, మరో పక్క ప్రధాన ప్రతిపక్షం వైసీపీ  అదును చూసి అధికారంలోకి రావడానికీ ఇలా ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళున్నారు. బలం పెంచుకోవడానికి, బలపడడానికి మాత్రమే కాకుండా ఎదుటి పక్షాన్ని బలహీనపరచి తద్వారా తాము బలం పుంజుకోవడానికి  ఆయా  పార్టీలు చేస్తున్న లోపాయికారీ ప్రయత్నాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి ఇప్పటి రాజకీయ సమీకరణలు ఇలాగే  వుండకపోవచ్చని కూడా అనిపిస్తోంది. గత ఎన్నికల్లో రెండు ప్రత్యర్ధి పార్టీల నడుమ జయాపజయాలను నిర్ణయించిన ఓట్ల శాతం తక్కువ కాబట్టి ఆ మేరకు మించి బలం పెంచుకోవాల్సిన అవసరం అన్ని పార్టీలకి వుంది. ఈ దిశగా అడుగులు వేసేటప్పుడు మార్పులు చేర్పులు తప్పకపోవచ్చు. ఆ విధంగా చూసినప్పుడు, పవన్ తన పార్టీని రంగప్రవేశం చేయించడం ద్వారా ఏదో ఒక మేరకు, కొందరికి నష్టం, మరికొందరికి లాభం చేకూరే అవకాశం వుంటుంది. ఆ ఎవరు, ఎవరన్నది అంత సులభంగా జవాబు చెప్పలేని ప్రశ్న. భవిష్యత్తులో  రాజకీయ పునరేకీకరణలపై  ఆ  సమాధానం  ఆధారపడి వుంటుంది. 
అయితే ఇక్కడ చిక్కుముడి ఎవరో కాదు.  పవన్ కల్యాణే.  పవనం అంటేనే గాలి. అది ఎటు  వీస్తుందో ఎవరికీ తెలియదు. పవన్ మనసులో ఏముందో పవన్ కే తెలియదని హాస్యోక్తిగా చెప్పుకుంటారు.
ఎన్నికలకు ముందు అట్టహాసంగా పార్టీ పెట్టారు. అప్పుడు పోటీ చేయలేదు. పెట్టిన రెండేళ్లకు స్పందించి, మరో మూడేళ్ళ తరువాత ఎన్నికల్లో  పోటీ చేస్తానని ఇప్పుడు తాజాగా  మరో ప్రకటన చేసారు. పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీకి సై అనడం మరో వింత.  రాజకీయాల్లో ఇవన్నీ కొత్త పుంతలు. ఆయనకి మాత్రమే ఇటువంటివి సాధ్యం. మరొకరెవరన్నా ఇటువంటి నిలకడ లేని ప్రకటనలు చేస్తుంటే అభాసుపాలయ్యే వారు. పవన్ కు వున్న అభిమానబలం ఆయన్ని విమర్శల బారినుంచి ఓ  రక్షరేకులా కాపాడుతోంది అనుకోవాలి. అయితే, ఈ సినీ అభిమానం అంతా మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగేవరకే. తరువాత సాధించే విజయాలే, రాజకీయాల్లో  మాట చెల్లుబడి కావడానికి  గీటురాయిగా మారుతాయి.   
రాజకీయ విశ్లేషణలు చేసేవారికి కూడా పవన్ కళ్యాణ్ ఒక పజిల్. ఒక పట్టాన  కొరుకుడు పడేరకం కాదు,  అందుకే అయన ఏం చెయ్యబోతున్నారన్నది ఊహకు అందని విషయం.
రాజకీయాల్లో వున్న తమాషా ఏమిటంటే, ముందు ఊహించినట్టు ఎప్పుడూ  నడవవు.  అవి తిరిగే మలుపులు అంచనా వేయడం చాలా  కష్టం. వాటి లెక్కలే వేరు.

కొసమెరుపు:
'జనసేన' వెబ్ సైట్ చూసిన వారికి ప్రముఖంగా ఒక వాక్యం కనిపిస్తుంది.
"నేను రాజకీయవాదిని కాను - పవన్ కళ్యాణ్"
(ఇప్పుడు వుందో లేదో తెలవదు)   

(16-04-2016)
రచయిత ఈ మెయిల్:  bhandarusr@gmail.com మొబైల్: 98491 30595






19, జులై 2015, ఆదివారం

అదిగో నవలోకం


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 23-07-2015, THURSDAY)

ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని 'అమరావతి' రూపురేఖలు గురించి సింగపూర్ ప్రభుత్వం రూపొందించిన 'సీడ్ క్యాపిటల్' ప్రణాళిక  రాష్ట్ర ప్రభుత్వానికి  అందింది. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ నాయకత్వంలో హైదరాబాదు వచ్చిన అధికారుల బృందం, ప్రత్యేక విమానంలో రాజమండ్రి  వెళ్ళి,  గోదావరి పుష్కర ఏర్పాట్ల పర్యవేక్షణ నిమిత్తం గత కొద్ది రోజులుగా అక్కడే మకాం వేసివున్న  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలుసుకుని ఈ ప్రణాళికను  అందచేసింది. అంతకుముందే 'సీడ్ క్యాపిటల్' గురించిన  ఊహా చిత్రాలను కొన్నింటిని  ఆ రాష్ట్ర ప్రభుత్వం మీడియాకు విడుదలచేసింది. ఇటువంటి అద్భుతమైన  రాజధానిని సొంతం చేసుకోబోతున్న ఆ రాష్ట్ర ప్రజలు ఎంతటి అదృష్టవంతులో కదా అని ఇతరులకు కన్నుకుట్టే  రీతిలో ఊహలకు రూపకల్పన చేశారు. ఈ ఊహల్ని వాస్తవం చేయగలిగితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల గుండెల్లోనే కాకుండా చరిత్ర పుటల్లో కూడా  శాశ్వితంగా మిగిలిపోతారు. రాజధానిని నిర్మించగలగడం అనే  అపూర్వ సువర్ణావకాశం ఒక్క  చంద్రబాబుకే  లభించింది. సమకాలీన రాజకీయ నాయకుల్లో ఎవ్వరికీ ఈ అవకాశం దక్కలేదన్న సంగతి గమనార్హం. ఈ రకంగా చూస్తే, ఈ కలని నిజం చేయగలిగితే  ప్రజలే కాదు ఆయన కూడా అదృష్టవంతుడే.   
'కలలు కనండి. ఆ కనే కలలు కూడా  గొప్పగా కనండి. కన్న  ఆ గొప్ప కలల్ని నిజం చేసుకోండి' అంటూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం  యువతీ యువకులకు సలహా ఇస్తుండడం అందరికీ తెలిసిందే.  ఈ ఊహా చిత్రాలు చూసిన వారికి చంద్రబాబు కూడా కలాం గారు చెప్పినట్టే గొప్ప కలలే కంటున్నారు అనిపిస్తుంది.  కాకపోతే వాటిని వాస్తవం చేసి చూపడం అన్న బాధ్యత ఒక్కటే ఆయన భుజ స్కంధాల మీద మిగిలివుంది. మరో రకంగా కూడా ఆయన అదృష్టవంతుడు.  ఆయన సమర్ధత మీద ఆయనకు వున్న నమ్మకాన్ని మించి ఆయన అభిమానులు మరింత నమ్మకం పెంచుకున్నారు. ఆయన ఒక్కరే రాజధాని నిర్మాణం పూర్తిచేయగలరన్న విశ్వాసంతో వున్నారు. ఫేస్ బుక్ వంటి మాధ్యమాల్లో ఈ విషయం ప్రస్పుటంగా కానవస్తుంది.   
ఈ ఊహా చిత్రాలతో పాటు విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం భవిష్యత్తులో నిర్మించబోయే ఆంధ్ర రాజధాని నగరం ఇలా వుంటుంది.




"కృష్ణానది ఒడ్డున గుంటూరు జిల్లా పరిధిలో ప్రధాన రాజధాని నగర నిర్మాణం జరుగుతుంది. దీని విస్తీర్ణం సుమారు పదిహేడు చదరపు కిలోమీటర్లు. (ఇది మరికొంత పెరిగిందని తాజా సమాచారం వల్ల తెలుస్తోంది) ఇందులో కొంత భాగంలో ప్రధానమైన ప్రభుత్వ పరిపాలనా భవన సముదాయాలు వుంటాయి. మిగిలిన ప్రదేశంలో ఐటీ సంబంధిత కార్యాలయాలు, కార్పోరేట్ సంస్థల ఆఫీసులు ఏర్పాటు అవుతాయి. రాజధాని నగరంలోని ప్రధాన రహదారులకు సమాంతరంగా కాలువలు  నిర్మిస్తారు. కృష్ణా నది నుంచి ఇందుకోసం నీటిని వాటిలోకి మళ్లిస్తారు. ఈ నీళ్ళు మళ్ళీ వెళ్ళి మరో వైపు కృష్ణా నదిలోనే కలుస్తాయి. కాలువలు, రహదారులకు ఇరువైపులా ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తారు. భవన పరిసరాలను మాత్రమే కాకుండా వాటిపైన కూడా ఆకు పచ్చని తివాచీ పరిచినట్టు పచ్చదనం తొణికిసలాడేలా పధకాలు సిద్ధం చేశారు. విహంగ వీక్షణం చేసేవారికి పైనుంచి కిందికి చూస్తే యావత్తు రాజధానీ  నగరం హరితవనం మాదిరిగా కానవస్తుంది. భవిష్యత్తులో సయితం భవననిర్మాణాలు, ఇతర నిర్మాణాలు     ప్రణాళికాబద్ధంగా  జరిగేందుకోసం మొత్తం ప్రధాన రాజధాని ప్రాంతాన్ని సెక్టార్లుగా విభజిస్తారు. ఆరు వరసల రహదారులు, వాటి పక్కనే నడక దారులు,  సర్వీసు రోడ్లు వుంటాయి. నగరం మధ్య నుంచి మెట్రో రైలు నిర్మాణం జరిగేలా రూపకల్పన చేశారు. మెట్రో స్టేషన్లు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా వుంటాయి.  రాజధాని నగరం మధ్యలో స్వచ్చమైన నీరు పారే కాలువలు, అక్కడక్కడా జలాశయాలు, వాటిని దాటి వెళ్ళడానికి వీలుగా ఊయల వంతెనలు ఓహ్! అమరావతి అంటే 'దేవతల  నగరం' అన్న పేరు సార్ధకం అయ్యేలా అనేక సుందర నిర్మాణాలకు ఈ కొత్త రాజధాని ఆవాసం కాబోతోంది. కృష్ణా గుంటూరు జిల్లాలను కలుపుతూ కృష్ణా నదిపై ఎత్తయిన వంతెన నిర్మాణం  కూడా ఈ పధకంలో భాగం. ఇంతేనా అంటే ఇంకా చాలా వుంది. ఈ సీడ్ క్యాపిటల్ కు అభిముఖంగా గుంటూరు జిల్లా వైపు నది మధ్యలో ఒక  ద్వీపాన్ని అత్యంత సుందరంగా అభివృద్ధి చేస్తారు. ఈ మొత్తం ప్రణాళికను రూపొందించింది సింగపూరు ప్రభుత్వం కాబట్టి ఆ దేశపు పొరుగున వున్న మలేసియాలోని జంట టవర్లను పోలిన రెండు ఎత్తయిన ఆకాశహర్మ్యాలు కూడా నూతన రాజధానికి అంతర్జాతీయ సొగసులను అద్దబోతున్నాయి."           
భారీగా నిర్మించిన సినిమాలను  విడుదల చేసే  ముందు 'టీజర్' పేరుతొ లఘు చిత్ర ప్రకటనలు  టీవీల్లో చూపించడం ఈరోజుల్లో అలవాటు. ఈ ఊహా చిత్రాలు చూస్తుంటే ఆ  విధానాన్ని  ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలకు కూడా వర్తింపచేస్తున్నారేమో అనిపించేలా వున్నాయి.
మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడి ఆస్థానంలో పనిచేసే గురువు, ఆయన శిష్యులు కలిసి నిమిషాల్లో ఓ మాయానగర్ నిర్మిస్తారు. ఆరోజుల్లో ప్రేక్షకులకు  ఆ దృశ్యాలు పరమాద్భుతంగా తోచాయి. ఇప్పుడీ ఊహా చిత్రాలు టీవీల్లో చూసిన వారికి అవి స్పురణకు వస్తే తప్పు ఎంచడానికి లేదు. అంత గొప్పగా వున్నాయి. అంతే కాదు  వీటిని నిజం చేయడం మానవ మాత్రుడుకి సాధ్యమా అనిపించేలా అపూర్వంగా అపురూపంగా వున్నాయి.
తెలుగుదేశం పార్టీ  అభిమానులనే కాదు, ప్రజలందరినీ అలరించేలా వున్నాయి ఈ ఊహా చిత్రాలు. ముందే చెప్పినట్టు ఈ విధంగా కాకపోయినా ఇందులో కొంతయినా నిజం చేస్తూ రాజధాని నిర్మాణం త్వరలో పూర్తి చేయగలిగితే 'ఆంధ్రులు యెంత అదృష్ట వంతులు' అని దేశవిదేశాల్లో గొప్పగా చెప్పుకోవడం ఖాయం. సమర్ధుడయిన ముఖ్యమంత్రి అన్న పేరు ఇప్పటికే తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబుకు, అమరావతి  రాజధాని నిర్మాణం సకాలంలో పూర్తిచేయగలిగితే ఆయనకు అంతకన్నా గొప్ప కీర్తి మరొకటి వుండదు.
కానీ, ఇది సామాన్యమైన వ్యవహారం కాదు. ప్రతిదీ డబ్బుతో ముడిపడి వుంటుంది. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంతో చూస్తారు. ప్రతి స్వల్ప విషయాన్ని భూతద్దంతో శోధిస్తారు. ప్రతిపక్షాల సంగతి సరే సరి. కాలం గడిచే కొద్దీ వీలును బట్టి  పుట్టుకొచ్చే 'విభీషణుల'తోనే అసలు చిక్కు.  పడగ నీడల్లో కొత్త రాజధాని నిర్మాణం సాగాల్సి వుంటుంది. నిజానికి ఇదంతా కత్తి మీద సాము.
సమర్ధుడన్న ఒక్క పేరు మినహా రాజధాని నిర్మాణంలో చంద్రబాబుకు కలిసి వచ్చే అంశాలు అంతగా లేవు. రాష్ట్ర ఖజానా బోసిపోయి వుంది. రాష్ట్ర విభజన వల్ల విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కలిసి వచ్చిందేమీ లేదు. ఇలాటి భారీ ఆలోచనలు సకాలంలో ఆచరణలోకి రావాలంటే ప్రధానంగా కావాల్సింది  కేంద్ర సాయం . కేంద్రంలో అధికారంలో  వున్నది టీడీపీ  మిత్ర పక్షమే అయినప్పటికీ, గత ఏడాది అనుభవాల నేపధ్యంలో  ఆ దిక్కుగా చూస్తే అంతగా కలిసివచ్చే అవకాశాలు కానరావడం లేదు. అధవా ఏదయినా చేసినా ఆ అరకొర సాయం ఇంతటి  భారీ ప్రణాళికలకు అక్కరకు రాకపోవచ్చు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుడికి రాజధాని విషయంలో సలహా ఇచ్చినట్టు పత్రికల్లో వచ్చింది. సింగపూరుతో పాటు ఈ మధ్య ఆయన పర్యటించి వచ్చిన కజకిస్తాన్, కీర్గిస్తాన్,  తుర్కుమిస్తాన్ మొదలయిన దేశాల రాజధానీ నగరాలను కూడా పరిశీలించడం మంచిదని ప్రధాని తనకు సూచించినట్టు చంద్రబాబే స్వయంగా తమ పార్టీ ఎంపీ లతో చెప్పినట్టు ఆ వార్త సారాంశం. పైగా  ప్రధాని సలహా మేరకు ఆ నగరాల పర్యటనకు ఏర్పాట్లు చేయాల్సిందని ఆదేశించినట్టు ఆ వార్త తెలుపుతోంది.
ఇప్పటికే అమరావతి రాజధాని విషయంలో అనేక విదేశాల పేర్లు వినబడుతూ వస్తున్నాయి. ఇప్పుడు అదనంగా మరికొన్ని దేశాలు అంటే,  మరికొంత కాలయాపన తప్పనిసరి అవుతుంది. అమరావతి అని పేరు పెట్టి తెలుగుతనం లేని మరో విదేశీ నగరాన్ని నిర్మించ బోతున్నారని ఇప్పటికే కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.   
ప్రభుత్వం చెబుతున్నట్టు  రాజధాని నిర్మాణం కోసం సమీకరణ పేరుతొ ప్రజలనుంచి సేకరించిన కొన్ని వేల  ఎకరాల  భూమి సిద్ధంగా వుంది. ఆ విషయంలో తలెత్తిన  రాజకీయ వివాదాలు యెలా వున్నా చివరికి ప్రభుత్వాల మాటే చెల్లుబాటు అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇక కావాల్సింది నిధులు. ఇక్కడే అసలు చిక్కు ఎదురవుతుంది.
గారెలు వండాలంటే నూనె, మూకుడు, పిండి వంటి సంబారాలు అనేకం కావాలి. గారెకు చిల్లి పెట్టడానికి 'వేలు' తప్ప వేరే ఏమీ లేదన్న చందంగా 'చంద్రబాబు సమర్ధత' తప్ప రాజధాని నిర్మాణానికి అవసరమైనవి ఏమీ ఆయనకు ప్రస్తుతం అందుబాటులో లేవు. ఇది వాస్తవం. ఇన్నిన్ని నిర్మాణాలు ఇంత అధునాతనంగా రూపుదిద్దుకోవాలంటే ఆషామాషీ  విషయం కాదు.
రాజమండ్రిలో ముఖ్యమంత్రిని కలవడానికి సింగపూరు బృందం వచ్చిన సందర్భంలో రాష్ట్ర సమాచార సలహాదారుడు పరకాల ప్రభాకర్ ఈ విషయంలో కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్టోబరు నెలలో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ముందుగానే 'మాస్టర్ డెవలపర్' ని ప్రభుత్వం ఎంపిక చేస్తుందని చప్పారు. జపాన్ తో సహా కొన్ని దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు. దీనిని బట్టి రాజధాని నిర్మాణం డెవలపర్ల చేతిలో వుంటుందని అర్ధం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత భూమి చూపించడం వరకు పరిమితం కావచ్చు. ప్రభుత్వానికి నిధుల భారం తగ్గిపోవచ్చు. స్విస్  ఛాలెంజ్ పద్ధతిలో అయితే రూపాయి ఖర్చు కూడా లేకపోవచ్చు. కానీ, ప్రజలనుంచి  సేకరించిన భూమిని మాస్టర్ డెవలపర్ చేతిలో పెట్టడం వల్ల  కొత్త వివాదాలు ఉత్పన్నం కావచ్చు. అందుకే కీడెంచి, అన్ని అంశాలను  అత్యంత జాగ్రత్తగా, పారదర్శకంగా, వివాద రహితంగా చేయడం మంచిది. నిధుల లేమి కారణంగానే ప్రభుత్వం, ఇప్పటికే 'రియల్ ఎస్టేట్' రంగంలో చలామణిలో వున్న 'డెవలప్ మెంటు'  విధానాన్ని 'స్విస్ ఛాలంజ్' అనే కొత్త పేరుతొ  ఎంచుకుని వుండవచ్చు. కానీ అవతల నిర్మాణ భాగస్వామి 'విదేశీ సంస్థ' అయినప్పుడు మరిన్ని జాగ్రత్తలు అవసరం.        
ప్రభుత్వం ఇవ్వచూపే భూమికి ఆకర్షితులై రాజధాని నిర్మాణానికి పెట్టుబళ్ళు పెట్టేవాళ్లు గొంతెమ్మ కోర్కెలు కోరడం సహజం. నిజంగానే చంద్రబాబు  నిజాయితీగా    ప్రయత్నాలు చేసినా సరే, ఈనాటి రాజకీయాల వరస చూస్తుంటే,   నిప్పులేకుండానే  పొగ రాజుకోవడం అంతే  సహజం. రాజకీయాల్లో కాకలు తీరిన చంద్రబాబుకు ఈ విషయం తెలియదనుకోలేము. అయినా సరే ఆయన ముందడుగు వేసే ధోరణిలోనే ముందుకు సాగుతున్నారు. అన్ని సందేహాలకు   ప్రభుత్వం దగ్గర, ఆయన దగ్గర  సమాధానాలు వుండి వుండవచ్చు. కానీ  సంతృప్తి కరమైన వివరణ మాత్రం ఇంతవరకు బయటకు రాని  మాట కూడా నిజమే. ఈ లావాదేవీల్లో ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకుని వ్యవహారాలు చక్కబెట్టి వుంటే అనవసరమైన రాద్ధాంతాలు కొన్ని తప్పేవి అన్న వాదన వుంది. అలా చేసివుంటే  భవిష్యత్తులో ఎదురయ్యే మంచి చెడులకు చంద్రబాబును ఒక్కరినే బాధ్యులను చేసే పరిస్తితి ఉత్పన్నం అవ్వదు కూడా.   
రాజధాని లేకుండా వేరు పడిన ఆంధ్ర రాష్ట్రానికి ఇంత చక్కని, భేషయిన రాజధాని నిర్మిస్తానని అంటుంటే అభ్యంతర పెట్టడం, విమర్శలు చేయడం  కూడా మంచిది కాదు. ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా ఇలాటి ప్రయత్నాలను  మనఃస్పూర్తిగా స్వాగతించాలి. అయితే ముఖ్యమంత్రి కూడా, రాజధాని యెలా వుంటుందో ప్రజలకు ముందుగానే  చూపెట్టినట్టే, వారిని విశ్వాసంలోకి తీసుకుని ఆ  రాజధాని నిర్మాణం యెలా జరుగుతుందో వెల్లడిస్తే అనుమానాలన్నీ పటాపంచలవుతాయి. కానిపక్షంలో,  ఇప్పుడున్న సందేహాలు ముదిరి అనుమానాలుగా మారతాయి. ఆ అనుమానాలు కాలక్రమంలో ఆరోపణలుగా రూపాంతరం చెందే అవకాశం కూడా వుంటుంది. ముఖ్య మంత్రి సమర్ధత మీద లేశ మాత్రం అనుమానం లేదని చెబుతున్నవారు కూడా ఈ మొత్తం వ్యవహారంలో తమకు ఎలాటి అనుమానాలు లేవని  గట్టిగా చెప్పలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు, ఆయన సలహాదారులు ఈ విషయం గమనంలో పెట్టుకోవాలి.
ముందే చెప్పినట్టు,  రాజధాని నిర్మాణం ఆయనకు ఒక్కరికే సాధ్యం అని నమ్మే వాళ్లకు ఈరోజుల్లో  కొదవ లేదు.ఈ రకంగా ఆయన అదృష్టవంతులు.   హైదరాబాదులో ఆయన హయాములో నిర్మితమైన హై టెక్ సిటీ గురించి ఇప్పటికీ జనాలు గొప్పగా చెప్పుకుంటూ వుంటారు. ఇంత నమ్మకం ప్రజల్లో  వున్నప్పుడు మరింత పారదర్శకంగా వ్యవహరిస్తే ఆయనకే మేలు జరుగుతుంది.          
రాజధాని అమరావతి ఊహా చిత్రాలు, ఇవన్నీ  ఉత్తుత్తి ప్రచారార్భాటం కింద ప్రత్యర్ధులు కొట్టివేస్తున్నారు. అరచేతిలో స్వర్గం చూపించడంలో చంద్రబాబుకు  సాటి రాగలవారు లేరని చెప్పడానికి కూడా ఈ ఊహా చిత్రాలను వారు ఉదహరిస్తున్నారు. ఆయన అభిమానులు సయితం అదే అంటున్నారు. సమర్ధత విషయంలో చంద్రబాబుకి ఎంతటి మంచి పేరు వుందో, ప్రచారం విషయలో ఆయనకు అంతటి బలహీనత వుందన్న విషయం రహస్యమేమీ కాదన్నది వారి ముక్తాయింపు.
రాజధాని విషయంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలు ఎవరివి యెలా వున్నా, సామాన్య జనం అందరూ ముక్త కంఠంతో కోరుకునేది మాత్రం, వేరుపడ్డ  రాష్ట్రానికి ఏదో ఒక రాజధాని తక్షణం కావాలనే. ఇక ఆ రాజధాని చంద్రబాబు ఊహల్లో వున్న అపురూప నగరం అయితే అంతకంటే కావాల్సింది వారికి మరోటి వుండదు.    
సమర్ధుడైన వాడికి లక్ష్యం ఒక్కటే ముఖ్యం. లక్ష్యశుద్ధి వుంటే గమ్యం చేరడం సులభం కాకపోయినా అసాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రస్తుత రాజకీయ వాతావరణం తీరుతెన్నులు చూస్తుంటే ఇదొక్కటే సరిపోకపోవచ్చు. వచ్చే ఎన్నికలదాకా ఈ ఊహల ప్రచారం రాజకీయంగా కొంత వూపు ఇవ్వొచ్చు. సాధారణ రాజకీయ నాయకులు ఇలాగే ఆలోచిస్తారు. వారికి ఈరోజు గడిస్తే చాలు.
మరి చంద్రబాబు ఈ కేటగిరీ కిందికి రావాలని అనుకుంటున్నారా? తనదయిన తరహాలో మరో మార్గాన్ని కోరుకుంటున్నారా?
కాలమే సమాధానం చెప్పాలి.
(21-07-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్:  98491 30595



Image Courtesy Culte.com


22, ఆగస్టు 2013, గురువారం

ఒకనాటి ఇద్దరు మిత్రులు

 సరిగ్గా   ముప్పయేళ్ళ క్రితం, మార్చి 15వ తేదిన - 'ఇద్దరు మిత్రులు ' రాష్ట్ర శాసనసభలో కొత్త సభ్యులుగా అడుగుపెట్టారు. ఆ ఇద్దరు - భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులు కాగలరని ఆనాడు ఎవ్వరూ వూహించి ఉండరు. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో తొలి అడుగులు కలిసి వేసిన ఆ ఇద్దరి దారులు అనతికాలంలోనే  వేరైపోతాయని కానీ, ఆ ఇరువురి మధ్య వెల్లి విరిసిన స్నేహం అంత త్వరగా ఆవిరి కాగలదని కానీ,  ఏమాత్రం అనుకోవడానికి అవకాశం లేని రోజులవి. ఆ ఇద్దరూ ఎవరన్నది పెద్ద ప్రశ్నా కాదు - సమాధానం చెప్పలేనంత క్లిష్టమైనది కాదు. కాకపోతే, ఒకప్పటి ప్రాణస్నేహితులయిన రాజశేఖరరెడ్డి - చంద్రబాబు నాయుడు,  కొన్ని విషయాలలో చాలా అదృష్టవంతులయిన రాజకీయ నాయకులనే చెప్పాలి.


(ఒకనాటి  మిత్రులు వై.ఎస్., బాబు)  

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు - ఆయన పార్టీకి ఆయనే  అధినేత - కేంద్రంలో సయితం ఆయిన కనుసన్నల్లో పనిచేసే ప్రభుత్వాలే కొనసాగాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్ టి రామారావుగారికి కూడా ఈ వైభోగం లేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఎప్పుడూ చుక్కెదురే. ఇక రాజశేఖరరెడ్డి విషయం తీసుకుంటే - ఆయన ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించేనాటికి - కాంగ్రెస్ పార్టి అధిష్టానం తీరుతెన్నులే పూర్తిగా మారిపోయాయి. తరచుగా ముఖ్యమంత్రులను మార్చే విధానానికి సోనియాగాంధి నాయకత్వంలోని ఆ పార్టీ  అధిష్టానం తిలోదకాలు ఇచ్చింది.
అందుకే - చంద్రబాబు - రాజశేఖరరెడ్డి అదృష్టవంతులయిన రాజకీయ నేతల కోవలోకి చేరిపోయారని చెప్పడం. పార్టీలో - ప్రభుత్వంలో ఎదురులేని స్థితికి చేరుకోవడం - అస్తిత్వానికి ముప్పులేకపోవడం - సహజంగానే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అవి అతిగా పెరిగిపోయి – అహంకారానికీ,  మితిమీరిన ఆత్మవిశ్వాసానికి దారితీయనంతకాలం - ఎలాంటి అనర్థాలకు అవకాశం ఉండదు. రెండోతరం చివరాఖరి దశలని మినహాయిస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబుది మరింత కలిసివచ్చిన కాలం. ఇంటా - బయటా ఆయన పేరు మారుమ్రోగిపోయింది. ప్రపంచపఠంలో   ఆంధ్రప్రదేశ్‌కి చోటు దక్కింది. ఎన్నారైలకి  రాష్ట్రంలో ఓటు హక్కు ఇస్తే - ఆయన మరికొన్ని దశాబ్దాలవరుకు ముఖ్యమంత్రిగా కొనసాగగలరన్న స్థాయిలో వూహాగానాలు ఊపిరి పోసుకున్నాయి.  ఆయన హయాంలోనే  ఆకాశానికి నిచ్చెనలు వేసి - అంధ్ర ప్రదేశ్‌ని పైకెక్కించే పధకాల రచనకు కంప్యుటర్ వేగంతో శ్రీకారం చుట్టారు.


(1996 లో కాలు విరిగి ఆసుపత్రిలో వున్నప్పుడు పరామర్శించడానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో)

ఆ తర్వాత జరిగింది చరిత్ర - మిత్రపక్షాలు వైరి పక్షాలుగా మారి వీధులకెక్కారు. ప్రకృతి కన్నెర్ర చేయడంతో - వరుస కరువులతో రైతాంగం వెన్ను విరిగింది. విధ్యుత్ కొరత  ప్రజల కడగండ్లని మరింత పెంచింది. ఆర్ధిక  సంస్కరణలు,  ధరల  పెంపుకు దోహదంచేసి - పరిస్థితులు మరింత దిగజారేలా చేశాయి. జరుగుతాయనుకున్న ఎన్నికలు మరింత దూరం జరగడం - తాత్కాలిక సర్కారు పాలనాధికారాలకు  ఎన్నికల కమీషన్ ముక్కుతాడు విధించడం - చంద్రబాబుని మరింత వుక్కిరి బిక్కిరి చేసాయి.  ముందరి కాళ్ళకు బంధాలు వేశాయి. ప్రత్యేక తెలంగాణా పేరుతో వుద్యమం ప్రారంభించి - ఎన్నికల్లో పోటీ చేసిన టీ.ఆర్.ఎస్. నేత చంద్రశేఖర రావుతో - కాంగ్రెస్ వ్యూహాత్మకంగా చేతులు కలపడంతో - రాష్ట్రంలో తెలుగుదేశం పరిపాలనకు చరమగీతం పాడినట్టయింది. కణకణమండే ఎండాకాలంలో రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో జరిపిన సుదీర్ఘ పాదయాత్రతో సాధించిన కాంగ్రెస్ విజయంతో - చంద్రబాబు పాలన - రెండో టరం వ్యవధి పూర్తికాకుండానే ముగిసిపోయింది.


(ముఖ్యమంత్రి వై.ఎస్.తో రచయిత)  

ఇక రాజశేఖరెడ్డి విషయానికి వస్తే - ఆయన సరైన సమయంలో రాష్ట్రానికి  ముఖ్యమంత్రి అయ్యారనే చెప్పాలి.  2004లో కాంగ్రెస్ గెలిచి వుండని పక్షంలో - భవిష్యత్తులో ఆయనకి   ఈ అవకాశం లభించే పరిస్థితి వుండేదికాదు.  గతంలో కూడా ముఖ్యమంత్రి రేసులో ఆయన లేకపోలేదు. అప్పుడే ఈ పదవి ఆయనికి లభించి ఉంటే, బహుశా, ఏ  రెండేళ్ళో, మూడేళ్ళో ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన కాంగ్రెస్ మాజీల జాబితాలో ఆయన చేరిపోయివుండేవారేమో. కాని ఈసారి, అంటే 2004లో,  సరైన తరుణంలో ముఖ్యమంత్రి కాగలిగారు  కనుకనే – అయిదేళ్ళ పదవీకాలాన్ని జయప్రదంగా పూర్తిచేసుకోవడమే కాకుండా  పూర్తి టర్మ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఒక రికార్డ్ ను  సృష్టించారు. అంతే కాకుండా,  ఒకనాటి తన  రాజకీయ మిత్రుడు చంద్రబాబు తరహాలోనే రెండో పర్యాయం కూడా తన పార్టీని వరసగా మరోమారు అధికార పీఠం ఎక్కించగలిగారు. హెలికాప్టర్ దుర్ఘటనలో ఆకస్మిక మరణం చెందకపోయివుంటే ,  సుదీర్ఘ కాలం రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరిట వున్న రికార్డును అధిగమించే అవకాశం కూడా  ఆయనకు దక్కి వుండేదేమో.

రాజకీయంగా విడిపోయిన ఈ రాజకీయ మిత్రులు ఇద్దరు  చివరికి భౌతికంగా కూడా విడిపోవడం విషాదకర విషయం.


(1982 లో అప్పుడు మంత్రిగా వున్న వై.ఎస్.తో రచయిత)




(ముప్పయ్ అయిదేళ్ళ  క్రితం  వీరిరువురూ, ‘ఒకే మంచం ఒకే కంచం’ చందాన స్నేహితులుగా వున్ననాటి రోజులకు ప్రత్యక్ష సాక్షిగా వున్న అనుభవంతో – భండారు శ్రీనివాసరావు)

20, ఆగస్టు 2013, మంగళవారం

బాబుగారితో ఓ సాయంత్రం


నిన్న సాయంత్రం ఒక టీవీ ఛానల్ నుంచి తిరిగి వస్తుంటే ఫోను.
చిరపరిచితమైన నెంబరు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీయార్ భవన్ నుంచి ఆ ఫోను.  అయిదేళ్ళ క్రితం వరకు ఆ నంబరు నుంచి రోజూ  అనేక ఫోన్లు వచ్చేవి. అప్పుడు నేను దూరదర్శన్/ ఆకాశవాణిలో విలేకరిగా పనిచేస్తున్నాను.
‘ఎడ్వైజర్ కృష్ణయ్య గారు మాట్లాడుతారు’ ఆపరేటర్ పలకరింపు.
టీటీడీ ఈవోగా, సీనియర్ ఐఏఎస్ అధికారిగా జర్నలిస్టులందరికీ కృష్ణయ్య గారు  చిరపరిచితులు. ఉన్నత ఉద్యోగం వొదులుకుని రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
‘రేపు (అంటే ఈ సాయంత్రం) నాలుగు గంటలకు బాబుగారు మీడియా విశ్లేషకులు కొందరితో ఇష్టాగోష్టిగా ముచ్చటించాలని అనుకుంటున్నారు. మీరు కూడా వస్తే బాగుంటుంది’
జర్నలిస్టుగా పదవీ విరమణ చేసినప్పటినుంచి మళ్ళీ ఏనాడు ఏపార్టీ గుమ్మం కూడా ఎక్కలేదు.
కానీ కాదనడానికి కూడా కారణం కనిపించలేదు. ఎందుకంటే అది విలేకరుల సమావేశం కాదు. పార్టీ ఆఫీసులో కూడా కాదు. చంద్రబాబునాయుడి గారి ఇంట్లో.


ఇంటికి వచ్చి చూస్తే టీవీల్లో స్క్రోలింగులు వస్తున్నాయి,  రాష్ట్ర రాజకీయ పరిస్తితులపై మీడియా విశ్లేషకులతో చంద్రబాబు సమావేశం అంటూ. ఆయన ఏం అడుగుతారు ? ఏం చెప్పాలి ?  ఇప్పటికే మీడియా  విశ్లేషకుల మీద సోషల్ మీడియాలో అనేక రకాల వ్యాఖ్యలు వెలువడుతున్నాయి, చక్రాంకితాలు కనబడని ఆయా పార్టీల అధికార ప్రతినిధులని.  
ముప్పయ్యేళ్ళ పైచిలుకు విలేకరి జీవితంలో కూడా ఏనాడు ప్రశ్నలు వేసే అలవాటు చేసుకోలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రులను, సీనియర్ అధికారులను వేలేకరుల సమావేశాల్లో  కొందరు ప్రశ్నించే తీరుతెన్నులు గమనించిన తరువాత ప్రశ్నలు అడిగే  పద్దతికే నేను స్వస్తి చెప్పాను. కీర్తిశేషులు హిందూ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ గా పనిచేసిన రాజేంద్రప్రసాద్ గారి నుంచి నేను నేర్చుకున్న పాఠం ఇది. ఆయన ఒకసారి నాతో  అన్నారు, ‘ఒక తమాషా చూశారా.  ఇప్పుడు ప్రశ్నలు అడుగుతున్నవారినీ, వారు అడిగే ప్రశ్నలను గుర్తు పెట్టుకోండి. రేపు వాళ్ల పత్రికల్లో వాటిని గురించి ప్రస్తావన ఏమైనా  వుంటుందేమో గమనించండి.’    
అయితే ఇది ఆయన చేసిన ఒక  సాధారణ పరిశీలనగానే పరిగణించాలి తప్ప  జర్నలిస్టులను అందరినీ ఉద్దేశించి  చేసినదిగా భావించనక్కరలేదు.
అయితే, ఆయన మరో మాట కూడా చెప్పారు. ‘
‘కొందరు విలేకరులు ఆర్భాటం కోసం వేసే ప్రశ్నలకు నాయకులు చెప్పే జవాబులను జాగ్రత్తగా గమనిస్తే మంచి వార్తను పట్టుకునే అవకాశం వుంటుంది. కాబట్టి ఎంతో అవసరం అనుకుంటే తప్ప ప్రశ్నల జోలికి పోకుండా ‘వినదగునెవ్వరుచెప్పిన’ పాలసీ పెట్టుకుంటే మనం సవివరమైన వార్త అందించడానికి వీలుంటుంది.’
చూసి నేర్చుకోవాలంటారు. కానీ వినడం ద్వారా కూడా నేర్చుకోవచ్చు.
ఏదిఏమైనా, చంద్రబాబు గారిని ఎన్నో ఏళ్ళ తరువాత కలుసుకోబోతున్నాను.
షరా మామూలుగా ఆయనే చెబుతారా లేక ఎవరైనా చెప్పింది వింటారా ?
వేచి చూడాలి.
(20-08-2013 – 10 AM)     

               

6, జూన్ 2013, గురువారం

చిన్నసార్లు వస్తున్నారు – భండారు శ్రీనివాసరావు


దేశంలో అతిపెద్ద రాష్ట్రం  అయిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అతిపిన్న వయస్కుడయిన అఖిలేష్ యాదవ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన దరిమిలా తలలు పండిన రాజకీయ నాయకుల్లో చిన్న కదలిక మొదలయింది.  రేపో మాపో తమ రాజకీయ వారసులను తెర మీదకు తీసుకు రావాలని పధకాలు రచిస్తున్న రాజకీయ పితాశ్రీలందరూ  ఆ పని ఇంకా ఎంతమాత్రం ఆలశ్యం చేయకుండా వెనువెంటనే ఆచరణలోకి తీసుకురావాలని తొందర పడుతున్నారు. ఈ  విషయంలో  మాత్రం అన్ని పార్టీల నాయకులదీ, ప్రత్యేకించి అవకాశం వున్న నాయకులందరిదీ ఒకే తీరు.
అఖిల భారత స్తాయిలో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ రాజకీయ రంగ ప్రవేశం అంతగా కలిసి రాకపోయినా ఆ పార్టీకి అంతకంటే ప్రత్యామ్నాయం లేదు. భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీని చూడడం ఒక్కటే ఆ పార్టీ శ్రేణుల లక్ష్యం. రాహుల్ గాంధీకి ఆ నాయకత్వ లక్షణాలు, ప్రతిభా పాటవాలు వున్నాయా లేదా అన్న దానితో వారికి నిమిత్తంలేదు. ఆ పార్టీకి చెందిన అధి నాయకులు, ముఖ్యమంత్రుల నుంచి అట్టడుగు నాయకులవరకు ఇదే వరస. ఎవరిని కదిలించినా ఇదే మాట చెబుతారు. ఇటీవల జరిగిన యూ పీ ఎన్నికల్లో మొత్తం బాధ్యతను రాహుల్  ఒంటి భుజం మీదకు ఎత్తుకుని వొంటరిగా  పాటుపడ్డా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరకలేదు. ఇదే వేరొకరయితే అతగాడి రాజకీయ భవితవ్యం పార్టీలో ప్రశ్నార్ధకంగా మారివుండేది. అధినేత్రి కుమారుడు కాబట్టి పరాజయ కారణాలకు అతడిని బాధ్యుడుడిని చేయలేదు. అందుకే ఇంకా ఆయన్ని భావి భారత ప్రధాని అభ్యర్ధుల జాబితానుంచి తొలగించలేదు.
అప్పుడప్పుడు, అడపాదడపా ప్రియాంకా గాంధీ పేరు నలుగుతున్నప్పటికీ, రాహుల్ మాత్రమే ఇప్పటికీ దారీ తెన్నూ లేని కాంగ్రెస్ పార్టీకి దారి చూపే  చుక్కాని. ప్రధాని అభ్యర్ధిగా పార్టీ శ్రేణులు రాహుల్ భజన చేస్తున్నప్పటికీ జనం ఆమోదం లభించడానికి మాత్రం మరో ఏడాది  వేచివుండక తప్పదు, గత్యంతరం లేక మధ్యంతరం ముంచుకు వస్తే తప్ప.
మరో జాతీయ పార్టీ బీజేపీకి ఈ ‘యువరక్తం’ గొడవలేదు. అక్కడి అగ్రనాయకులందరూ కురు వృద్ధులే. మోడీ పేరు మీడియాలో మోగుతున్నప్పటికీ, వయస్సు రీత్యా ఆయనంత కుర్రకారేమీకాదు. నడికారు దాటినవాడే.
ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే, యువతరం నాయకుడిగా జగన్ జనంలోకి దూసుకు పోతున్నాడు. ఆయన్ని ఎదుర్కునే రాజకీయ పార్టీలన్నీ గతంలో  చేసిన, లేదా ప్రస్తుతం  చేస్తున్న వ్యూహాత్మక తప్పిదాలే జగన్ పట్ల శ్రీరామరక్షగా మారుతూ వున్నాయి. పాతతరం నాయకులెవరికీ ఎన్నికల సమరంలో ఆయన్ని  ఎదిరించి నిలవగల సత్తా లేదని ఇటీవలి  గత చరిత్రే చెబుతోంది. వ్యక్తిగతంగా అన్ని మరకలు అంటి కూడా, అవినీతి ఆరోపణల్లో కూరుకుని పోయి కూడా, జైల్లో కాలుపెట్టి  సంవత్సర కాలం  దాటిపోతున్నా కూడా అన్ని పార్టీల్లో వున్న దిగువ స్థాయి కార్యకర్తల చూపు వై.ఎస్.ఆర్. పార్టీ వైపు వుండడం ఆయా పార్టీల అధినాయకులకు మింగుడు పడడం లేదు. వున్న పార్టీల్లో పొసగలేక, బయటకు పోయేదారిగా భావించి పోయేవాళ్ళేకానీ అలాటివారివల్ల తమ పార్టీలకు వచ్చే నష్టం ఏముండదు అని పైకి సర్ది చెప్పుకుంటున్నా లోలోపల ఎవరి భయాలు వారికి వున్నాయి. అందుకే ‘యువ రక్తం’ పేరుతొ కొత్త నాయకులను పార్టీలోకి తీసుకువస్తే  ఎన్నికల  ముహూర్తం నాటికయినా పరిస్తితి  కొంతలో కొంతయినా మారక పోతుందా అన్నది వారి ఆశ. ముఖ్యంగా ఎలాటి మచ్చా లేని, అవినీతి ఆరోపణల మరకలు అంటని విద్యాధిక యువకుడు రంగప్రవేశం చేస్తే జగన్ పార్టీని కట్టడి చేయడం సాధ్యమని భావించేవాళ్ళు కూడా లేకపోలేదు.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఈ ఆవశ్యకత హెచ్చుగావున్నట్టు తోస్తోంది. ఎందుకంటే టీడీపీ వంటి ప్రాంతీయ పార్టీ రెండు పర్యాయాలకంటే ఎక్కువ కాలం అధికార పీఠానికి దూరంగా వుండడం అంటే చాలా ఇబ్బంది. కాంగ్రెస్ పరిస్తితి వేరు. జాతీయ పార్టీ కాబట్టి, రాష్ట్ర స్థాయి నాయకులు కొంతకాలం అధికారానికి దూరంగా వున్నా ఏదోవిధంగా ఓపిక పట్టగల స్తితిలో వుంటారు. మళ్ళీ అధికారానికి వచ్చినప్పుడు చూసుకుందాంలే అనే భరోసా వారిలో పుష్కలం. ఎదుటివారి  వైఫల్యాలే వారికి  రక్షరేకు.  ప్రత్యామ్నాయం లేక  ప్రజలే  తమకు ఎప్పుడో ఒకప్పుడు ప్రభుత్వ పగ్గాలు అప్పగించక పోతారా అన్నది వారి మరో ధీమా.
కానీ టీడీపీ పరిస్తితి ఇందుకు విభిన్నం. గత ఎన్నికల్లో గెలుపు వూరించి వూరించి, కూతవేటు దూరంలో కనిపించిన అధికారం చేజారి పోయి మరో ‘చేతి’కి చిక్కిన విషయాన్ని తలచుకుని  టీడీపీ నేతలు ఇప్పటికీ చింతిల్లుతూ వుండడం చూస్తున్నాం. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అరంగేట్రం చేయడం వల్లనే మహాకూటమి మహా ఓటమి పాలయిందని లెక్కలు చెబుతుంటారు. ఇది ఒక రకంగా నిజం. కానీ, ప్రజాస్వామ్యంలో అంతా అంకెల మహత్యమే. ఒంటి చేత్తో లెక్కించగల అతికొద్ది వోట్ల తేడా వచ్చినా గెలుపు గెలుపే.
అందుకే, చంద్రబాబు నాయుడికి ఇప్పుడు ఒక కొత్త కార్డు కావాలి. టీడీపీ కంటే కూడా ఆయనకే వ్యక్తిగతంగా ఈ అవసరం ఎక్కువ. ఎన్టీ రామారావు గారు  తెలుగు దేశం పార్టీ పెట్టినప్పుడు ‘ఆంధ్రులు – ఆత్మగౌరవం’ నినాదంతో పాటు నెహ్రూ  కుటుంబం వారసత్వ రాజకీయాలను  ఎండగడుతూ చేసిన విమర్శలు కూడా  జనాలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పార్టీ స్తాపించిన తొమ్మిది నెలలల్లోనే  అధికార అందలం ఎక్కడానికి  ఎన్టీయార్  అనుసరించిన ఆ విధానం బాగా  దోహదపడింది. మరి ఇప్పుడు అదే పార్టీ  వారసత్వరాజకీయ  విధానాలను అనుసరిస్తే ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారన్నది బాబు  గుంజాటన. దీనికి తోడు పైకి వొప్పుకున్నా వొప్పుకోకపోయినా నందమూరి, నారా కుటుంబాల నడుమ చాపకింది నీరులా పాకుతున్న  వారసత్వ ‘రాజకీయాలు’ కూడా టీడీపీ అధినేత, తన కుమారుడి రాజకీయ రంగ ప్రవేశం విషయంలో మీనమేషాలు లెక్కించడానికి కారణమనే వారు కూడా వున్నారు.
ఏమయితేనేం, కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్టు చంద్రబాబు కుమారుడు నారా లోకేష్, ఎట్టకేలకు  ‘మంచు గడ్డను’ బద్దలు కొట్టారు. తాను టీడీపీ లో ‘కార్యకర్తగా’ పనిచేయబోతున్నట్టు ప్రకటించి ఆయన రాజకీయ అరంగేట్రం విషయంలో అలముకునివున్న అనుమానాలన్నింటినీ  ఆయనే పటాపంచలు చేశారు.        
పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగానే  పనిచేస్తానని ఓ పక్క చెప్పుకుంటూనే, యువతకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంటూ పార్టీలో తాను నిర్వహించబోయే పాత్ర ప్రాముఖ్యాన్ని చెప్పకనే లోకేష్  చెప్పారు.
అనేక అనూహ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతూ, భవిష్యత్తు పట్ల ఆందోళనతో వున్న టీడీపీ శ్రేణులకు   ఎంతో ఉత్సాహం, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి మరెంతో  వూరట కలిగించే విషయమే ఇది.  పార్టీ ప్రతిష్ట వేగంగా కొడిగడుతున్న తరుణంలో చంద్రబాబు ఇటీవల స్వయంగా పూనుకుని పునరుజ్జీవ చర్యలు చేపట్టారు. బీసీ డిక్లరేషన్, ఎస్సీ వర్గీకరణ,  తెలంగాణా పై కేంద్రానికి  మరో లేఖ ఇవ్వడం వంటి పలు కీలక నిర్ణయాలతో పాటు రికార్డు స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా   ‘పాదయాత్ర’ చేసి పార్టీ శ్రేణుల్లో ఆశలు చిగురింప చేశారు. దరిమిలా మార్పుచెందుతున్న రాజకీయ పరిణామాల  నేపధ్యంలో – లోకేష్ వంటి యువకుడి దన్ను వుంటే లభించే ప్రయోజనాన్ని  ఆయన అంచనా వేయకుండా వుండరు. వేయరని,  బాబు గురించి బాగా  తెలిసిన వారెవ్వరూ అనుకోరు.

అందుకే రానున్న ఎన్నికలకల్లా అన్ని పార్టీల్లో ‘చిన్నసార్లే’ కానవస్తారు.                                   

8, ఏప్రిల్ 2013, సోమవారం

భండారు బఠానీలు



‘పెద్దయ్యాక ఏమవుదామనుకుంటున్నావు?’  అనేది చిన్నప్పుడు స్కూల్లో అడిగే ప్రశ్న.
‘తెలుగు మాస్టారు’ ఠకీమని సమాధానం.
ప్రశ్న అడిగిన లెక్కల మాస్టారుకి ఎక్కడ కాలాలో అక్కడే కాలేది. తరువాత ఏదో తప్పువెతికి పట్టుకోవడం, చెయ్యి చాపమనడం, చాచిన చేతిని తిరగేయించడం,  దానిమీద డష్టరు తిరగేయడం - అది వేరే కధ.
తమదగ్గర  చదువుకునే పిల్లల్లో ఐ.ఏ.ఎస్. లు ఎంతమంది అవుతారన్నది వారికొచ్చిన  డౌటేహం కావచ్చు. వాళ్ళల్లో రాజకీయనాయకులు, జర్నలిస్టులు కొంతమంది అయినా కాకపోతారా అనే నమ్మకం కావచ్చు. అందుకే కాబోలు,  పిల్లలకు   వక్తృత్వపోటీలు పెట్టి, ‘కలం గొప్పదా? కత్తి గొప్పదా?’ – ‘అణ్వస్త్రాలు కావాలా?  అన్నవస్త్రాలు కావాలా?’ అని ప్రతి అంశానికి అనుకూలంగా ప్రతికూలంగా రెండు విధాలుగా చెప్పించేవారు. అప్పుడర్ధంయ్యేది కాదు కానీ ఇప్పుడు టీవీ చర్చల తీరుతెన్నులు, రాజకీయ నాయకుల ప్రకటనలు గమనిస్తుంటే  అందులోని తత్వం  నెమ్మది నెమ్మదిగా తలకెక్కుతోంది.
‘నరం లేని నాలుక ఏవిధంగానయినా మాట్లాడుతుందంటారు చూడండి. అలా రాజకీయ నాయకులు ‘మొన్న ఏం మాట్లాడాం, నిన్న ఏం చెప్పాం’ అన్నదానితో నిమిత్తం లేకుండా ‘ఈరోజు చెప్పిందే ఫైనల్’ అన్న పద్ధతిలో  బల్లగుద్ది వాదిస్తున్న విధం చూస్తుంటే రాజకీయాల్లో సోషలిజం, కమ్యూనిజం, క్యాపిటలిజం   కాకరకాయా ఏమీలేదు వొట్టి అవకాశవాదం తప్ప అనిపిస్తే ఆశ్చర్యపోవాల్సింది ఏమీ వుండదు.




‘మా నాన్నవల్ల ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కూలగొట్టడం నామతం కాదు,  అభిమతం కాదు, కాదెంతమాత్రం కానే  కాదం’టూ ఎక్కడలేని ధర్మపన్నాలు  వల్లించి ఆ తరువాత అనతికాలంలోనే  పోటీ పార్టీ పెట్టి సొంతపార్టీకి చిల్లి పెడుతున్న విధం చూస్తుంటే-  రెండు నాలికలతో  మాట్లాడడానికి  చిన్నప్పుడే స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?

‘అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ నాయకులను పంచెలూడతీసి తరిమికొడతాం!’ అంటూ పొడుగుపాటి డైలాగులు అలవోకగా జనం మీదకు వొదులుతూ, పార్టీ పెట్టిన  తొమ్మిదిమాసాల్లోనే అధికార పీఠం ఎక్కిన  ఎన్టీయార్ రికార్డుని బద్దలుకొట్టేసి,   రాజ్యాధికారంలోకి వద్దామనుకున్న కలలు కాస్తా   పార్టీ పారాణి ఆరకముందే కల్లలైపోవడంతో, ఇక  విధిలేక  ఆ కాంగ్రెస్ పంచనే చేరి, కేంద్రమంత్రి పదవిలో విదేశాల్లో  సేదతీరుతూ, తీరిగ్గా  సోనియా భజన చేస్తున్న వైఖరి చూస్తుంటే - రెండు నాలికలతో  మాట్లాడడానికి  చిన్నప్పుడు స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?

‘హెలికాప్టర్ దుర్ఘటనలో వైఎస్సార్ చనిపోయినప్పుడు, పట్టు చీరెల అంచులతో, ఖాదీ ఉత్తరీయాలతో కళ్ళు వొత్తుకుంటూ బుల్లితెరలమీద బారులుతీరి ‘అంతటి నాయకుడు ఇంతకు ముందు పుట్టలేదు ఇకముందు పుట్టడు’ అంటూ విలపించిన ఆయన  మంత్రివర్గ సహచరులే  ఇప్పుడు పల్లవి మార్చి ‘అవినీతిలో వైఎస్ ను మించినవాడు లేడం’టూ వైనవైనాలుగా శాపనార్ధాలు పెడుతున్న వైనం గమనిస్తుంటే - రెండు నాలికలతో  మాట్లాడడానికి  చిన్నప్పుడు స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?

‘తుది శ్వాస విడిచేవరకు తాత స్థాపించిన పార్టీలోనే వుంటానంటూ, ప్రత్యర్ధి పార్టీల ఫ్లెక్సీల్లో అభిమానుల పేరుతొ తన ఫోటోలు పెడుతుంటే మిన్నకుండిపోయి ముసిముసి నవ్వులు నవ్వడం చూస్తుంటే - రెండు నాలికలతో  మాట్లాడడానికి  చిన్నప్పుడు స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?
‘అల్లుడా రమ్మని పిల్లనిచ్చిన  మామ పిలిచి పార్టీ అందలం ఎక్కిస్తే, పార్టీని బతికించే నెపంతో పార్టీ సంస్తాపకుడి అంతాన్నే కళ్ళారాచూసి, ఇప్పడు మళ్ళీ పార్టీ పునరుద్దానానికి ఆ కీర్తిశేషుడి పేరునే వాడుకుంటూ, దానిపై పేటెంటు రైటు తమదే అంటూ వాడవాడలా  వూరేగుతున్న విపరీతాన్ని చూస్తున్నప్పుడు - రెండు నాలికలతో  మాట్లాడడానికి  చిన్నప్పుడు స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?

పార్టీలు, వ్యక్తుల భజనకోసం పెట్టిన టీవీ చానళ్ళలో పనిచేస్తూ, జీతాలకోసమో, హోదాలకోసమో వేరే చానళ్ళలో చేరి  పొగిడిన నోళ్లతోనే తెగుడుతున్న విధానాలను పరికిస్తుంటే - రెండు నాలికలతో  మాట్లాడడానికి  చిన్నప్పుడు స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?

ఇలాటి  చద్మ వేషధారుల, ఆషాఢభూతుల లీలలు చూపించి, వారి అసలు రూపాలను, స్వరూపాలను చూపించే విధంగా ఏ టీవీ వారయినా పుణ్యం కట్టుకుని, ‘అప్పుడు – ఇప్పుడు’ అనే కార్యక్రమం ప్రసారం చేస్తే యెంత బాగుంటుందో !   (08-04-2013)  
Note: Courtesy image owner