చంద్రబాబు నాయుడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చంద్రబాబు నాయుడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, మే 2016, మంగళవారం

ఒక విలేకరి కధ


ఈ తరం జర్నలిష్టులకు అంతగా తెలియని పత్రికారచయిత జీ.కృష్ణ గారు. అక్షరాలా కీర్తిశేషులు. కీర్తి మినహా ఏమీ సొంతానికి మిగిల్చుకోకుండా దాటిపోయిన ‘కలం కూలీ’. ఇక, శ్రీ సామల సదాశివ. గొప్ప రచయిత. ఈయనా కృష్ణ గారి బాపతే. అందుకే ఇద్దరికీ అంత స్నేహం. కృష్ణ గారు రాసిన జ్ఞాపకాల సమాహారం – ‘విలేఖరి లోకం’ గ్రంధానికి, ‘అతనికి దిగులెక్కడిది?’ అనే ముందు మాట రాశారు సదాశివ గారు. అందులో..... రాసిన  కొన్ని వాక్యాలు.  (బ్రాకెట్లో నేను రాసినవి – సులభంగా అర్ధం కావడానికి)
“ఇంతకుముందు అతని (కృష్ణ గారి) కోసం ఎవరేది చేస్తానన్నా ఒప్పుకున్నాడా? వల్లమాలిన స్వాభిమానమాయే! మాజీ ముఖ్యమంత్రి అంజయ్య గారు (అధికారంలో వున్నప్పుడు) ఇల్లో ఫ్లాటో ఇస్తానంటే, ‘యెందుకు’ అని ఎదురు ప్రశ్న వేసినాడట. పోనీయండి.  ముఖ్యమంత్రి గారు (అప్పుడు చంద్రబాబు నాయుడు గారు) అతనికి (వైద్యపరంగా) చాలా సహాయం చేసాడని, చేస్తున్నాడని విన్నాను. ముఖ్యమంత్రి గారి దృష్టికి అతని పరిస్తితి తెచ్చిన పుణ్య పురుషుడు ధన్యుడు. ‘ఎవరి రాజ్యంలో కళాసాహిత్యవేత్తలు నిర్ధనులై కష్టపడతారో ఆ దోషం రాజుది’ అన్నాడు భర్తృహరి. ముఖ్యమంత్రి గారు ఈ ఒక్క సత్కార్యంతో ఆ దోషం తమకంటకుండా తొలగించుకున్నారు. ‘ముఖ్యమంత్రిగారు నా గదిలో ప్రవేశిస్తూ ‘ఏమండీ ఈ మాత్రం డబ్బు కోసం బెంగ  పెట్టుకుంటే యెలా? నేనున్నానుగా’ అని నాలో జీవితాశ కలిగించినారు’ అని కృష్ణ నాతో అన్నాడు. ‘మరి, మీ ఇంటికి సిరి వచ్చిన జాడ కనిపించదే’ అంటే ఎమిల్ జోలా కధ చెప్పినాడు” 
సదాశివ ఇంకా ఇలా రాశారు.
“కృష్ణ, కావ్యకంఠ గణపతిముని శిష్యుడు.
‘రంజ్ సే ఖోగర్ హువా ఇన్సాన్ తొ మిట్ జాతా హై రంజ్ - ముష్కిలే ఇత్నీ పడీ ముజ్ పర్ కే ఆసా హోగయీ – బాధలకు అలవాటు పడ్డ మనిషికి ఏదీ బాధ అనిపించదు. ఎన్ని కష్టాలు అనుభవించినానంటే ఇప్పుడు నాకేదీ కష్టమనిపించడం లేదు’ అన్నాడు మీర్జా గాలిబు. గాలిబుకు జీ. కృష్ణకు కొన్ని పోలికలున్నాయి. కృష్ణ కష్టాలకు అలవాటు పడ్డాడు. కాని బాధ పడ్డట్టు కనిపించలేదు. ‘మనసా ధారయన్ దుఃఖం’ అన్నారు రామున్ని గురించి. కృష్ణ ధీరుడే కాని దీనుడు కాదు.
“జీ కృష్ణకు హిపోక్రసీ నచ్చదు. దాపరికం లేని విలేఖరి. స్పష్టంగా తెలియని దోషాలు తమకు తెలిసినట్టు ఆరోపిస్తూ ఎవరినీ ఎండగట్టకూడదు. విలేఖరిగా కృష్ణ కొన్ని విలువలు పాటించాడు.తాను రాసే వాక్యాలకు జవాబుదారీ వహించే రాస్తాడు. బాధ్యతారహితంగా రాసే వాళ్లకి  ఈ ‘విలేఖరి లోకం’ రవంత వెలుగు చూపిస్తే సంతోషం.”


(ఒకనాటి ప్రెస్  క్లబ్ కార్యక్రమంలో కృష్ణగారిని సాదరంగా పలకరిస్తున్న నాటి ఆర్ధికమంత్రి శ్రీ రోశయ్య, క్లబ్  కార్యదర్శి ఎం.ఎస్. శంకర్, యూ.ఎన్.ఐ. విలేకరి శ్రీ పార్ధసారధి, వారి నడుమ క్లబ్ ఉపాధ్యక్షుని  పాత్రలో నేను) 



తోకటపా: నేను నార్లగారి స్కూలు కనుక ‘విలేకరి’ అనే రాస్తాను. ‘ఖరి’ అంటే ‘ఆడగాడిద’ అనేది వారి ఆంతర్యం.  

4, ఫిబ్రవరి 2015, బుధవారం

రాజకీయాల్లో 'ఉచితానుచితాలు'

(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY IN IT'S EDIT PAGE ON 05-02-2015, THURSDAY)



'గెలిపిస్తే వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తా' అన్నారు ఆ రోజుల్లో వై.యస్.ఆర్.
'అది అసాధ్యం' అన్నారు అప్పుడు  ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు.
తరవాత జరిగిన ఎన్నికల్లో కరెంటు ఉచితంగా ఇస్తానన్న వై.యస్.రాజశేఖర రెడ్డిని ప్రజలు గెలిపించారు. ఆ హామీ అసాధ్యం అన్న చంద్రబాబును ఓడించారు.
'మనమూ ఉచితం అంటే పోయేదేమో' అన్నారు చంద్రబాబు పార్టీవాళ్లు.
'అలా యెలా అంటాం . అది సాధ్యం కాని పని' అన్నారు అప్పట్లో చంద్రబాబు. 
పదేళ్ళు గడిచాయి. మరోసారి ఎన్నికలు వచ్చాయి.
రెండు తడవలుగా అధికారానికి దూరంగా వున్న చంద్రబాబు, 'నన్ను గెలిపిస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తా' అన్నారు.
'అది అసాధ్యం' అన్నారు వై.యస్. జగన్ మోహన రెడ్డి.
ఆ ఎన్నికల్లో చంద్రబాబు గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఓడిపోయి జగన్ ప్రతిపక్షనేత స్థానానికి పరిమితమయ్యారు.
'మేమూ రుణ మాఫీ అని వుంటే మేమే గెలిచేవాళ్ళం. అలా అబద్దం చెప్పలేకపోయాం' అని చింతించడం వై.యస్.ఆర్. పార్టీ వంతయింది.
హామీలు ఎన్నికల వైతరిణిని దాటిస్తాయా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేకపోవచ్చు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవహారం చూసిన తరువాత కాదని కూడా చెప్పలేని పరిస్తితి.
సర్వేల్లో గెలిచి అసలు ఎన్నికల్లో చతికిలపడిన వై.యస్.ఆర్.పార్టీకి ఓటమి అనేది జీర్ణించుకోలేని వ్యవహారమే.
సాధించిన ఓట్లశాతం బాగానే వున్నా, సీట్ల శాతం తగ్గిపోయి,  కనుచూపు దూరంలో అందివచ్చినట్టు కానవచ్చిన అధికార అందలం ఆఖరు నిమిషంలో చేజారిపోవడం ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేతకు కడుపు రగిలించే విషయమే.
అందుకే, టీడీపీ  అధికారంలోకి వచ్చిన కొత్తల్లో  రుణ మాఫీ అమలు  విషయంలో ఆ పార్టీ కిందమీదవుతూ కుదేలవుతున్న తీరు చూసి ఆదిలోనే ప్రతిపక్ష వై.యస్.ఆర్.సీ.పీ. ఆందోళనకు దిగింది.  'నరకాసుర వధ 'పేరుతొ ఆందోళన చేపట్టింది. టీడీపీ అధికార పీఠం ఎక్కి ఎక్కువ రోజులు గడవకముందే ఆందోళనకు దిగడం వల్లనో,   ఆరునూరయినా రుణ మాఫీ హామీని నూటికి నూరు శాతం అమలుచేసి తీరుతామని తెలుగుదేశం నాయకులు పదేపదే చేస్తూవస్తున్న ప్రకటనల కారణమో తెలియదు కానీ  జగన్ ఆందోళన పట్ల  జనం స్పందన అంతంత మాత్రమే కావడం  తెలుగుదేశం నేతలకు కాసింత  వూరట కలిగించింది. ఆ తరువాత కూడా ఏదో ఒక పేరుతొ వై.యస్.ఆర్.పార్టీ  అనేక సమస్యలను ఎత్తి చూపుతూ ఆందోళనలు, దీక్షాశిబిరాలు నిర్వహించింది.  ప్రతిపక్షంలో వున్న ఏ పార్టీ అయినా ఇలాగె చేస్తుంది. అది వాటి రాజకీయ ధర్మం.                
మరోపక్క హామీ అమలును టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని చర్యలు మొదలు పెట్టింది. కానీ ఎటు చూసినా అవరోధాలే. కేంద్రం నుంచి వస్తుందనుకున్న సాయం మాటలకే మిగిలిపోయింది. రిజర్వ్ బ్యాంక్ ససేమిరా అంది. ఇక రాష్ట్రంలోని బ్యాంకులతో ఎన్ని పర్యాయాలు చర్చలు జరిపినా వారు కొండెక్కి కూర్చున్నారు. కేంద్రంలో అధికారంలో వున్నది మిత్ర పక్షమే అయినా రుణ మాఫీ విషయంలో ప్రధాని మోడీ ఆలోచనలు వేరుగా వున్నట్టు వున్నాయి. ఇక దానితో తెలుగు దేశమే స్వయంగా రంగంలోకి దిగింది. కోటయ్య కమిటీ వేసింది. వాళ్లు సూచించిన దానికంటే ఎక్కువగానే ప్యాకేజీలు తయారు చేసింది. ఏమయితే మాత్రమేం అన్నీ అసలు హామీకి సరితూగనివే. అరకొర అనిపించే విధంగానే వున్నాయి. కొత్త రాష్ట్రం ఎదుర్కుంటున్న ఆర్ధిక ఇబ్బందులు వివరించి రుణ విమోచనకు కొన్ని  షరతులు పెట్టారు.  అయినా సరే, రైతుల నుంచి నిరసన వ్యక్తం కావడంలేదన్న ఒకే కారణం చూపి ప్రభుత్వం రోజులు దొర్లించింది.
మళ్ళీ ఇప్పుడు వై.యస్.ఆర్. పార్టీ అదే రుణ మాఫీ  అంశంపై తణుకులో గత వారం  రెండు రోజుల దీక్ష నిర్వహించింది.
ఈ దీక్షపట్ల ప్రజల స్పందన అమోఘం అని వై.యస్.ఆర్. పార్టీ సంబరపడుతుంటే అంత సీనేమీ లేదని  అధికారపక్షం ఎద్దేవా చేస్తోంది. రాజకీయాల్లో ఇదీ సహజమే.     
ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేసిన ఎన్నికల వాగ్దానం ఏదన్నా వున్నదంటే అది రైతుల రుణ మాఫీ హామీ ఒక్కటే. ఎన్నికల్లో ఎన్నెన్నో వాగ్దానాలు చేయడం అన్ని  రాజకీయ పార్టీలకి పరిపాటే. కాకపొతే, ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయగానే ఆ హామీల అమలు ఉత్తర్వులపై 'మొదటి సంతకం చేస్తాం, రెండో సంతకం చేస్తాం' అంటూ చేసే  ప్రకటనలే ఒక్కోసారి వాటి మెడకు చుట్టుకుంటాయి. తెలుగుదేశం విషయంలో జరిగింది ఇదే. 'అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తాము, త్వరలోనే అధికారంలోకి రాబోతున్నాము. త్వరపడి ఎవరూ రుణ బకాయిలు చెల్లించకండి' అని పిలుపు ఇచ్చింది కూడా ఆ పార్టీ అధినాయకులే.
నిజానికి తెలుగు దేశం పార్టీ ఇచ్చిన ఈ ఎన్నికల వాగ్దానం తప్పుపట్టాల్సిందేమీ కాదు. ఈ దేశంలో ఇటువంటి సాయానికి అర్హులైన వాళ్లు ఎవరయినా వున్నారంటే, వారిలో మొట్టమొదటి వాళ్లు మాత్రం  తిండి గింజలు పండించి జనాలకు ఇంత అన్నం పెడుతున్న వ్యవసాయదారులే. అందులో ఎంతమాత్రం సందేహం లేదు.  పంట పంటకీ అప్పులు చేస్తూ, పంట రాగానే వాటిని తీరుస్తూ, ప్రకృతి ప్రకోపించి వానలు, వరదలు, కరువులు కాటకాలతో పంటల్ని దెబ్బతీసినప్పుడు,  పెరిగిన వడ్డీలతో అప్పులు తీర్చలేక, వూరివారిలో తలఎత్తుకుని తిరగలేక వుసురు తీసుకోవడానికి కూడా సిద్ధమయ్యే రైతుల రుణాలు రద్దు చేస్తామని ఎవరయినా అంటే అది తప్పని అనేవారు వుండరు. అంటే మాత్రం వారిది పెద్దతప్పే.  
అయితే, అలాటి హామీ ఇచ్చి దాన్ని నిలబెట్టుకోవాలంటే అది రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలకి అలవిమాలిన పని. రైతుల రుణాలు రద్దుచేయడం అనేది ఒక ఫైలుమీద సంతకం చేయగానే జరిగిపోయే వ్యవహారం కాదు. అది అప్పులిచ్చిన బ్యాంకులతో ముడిపడిన విషయం. బ్యాంకుల మీద ఆజమాయిషీ చేయగలిగిన కేంద్ర ప్రభుత్వం కలగచేసుకోవాల్సిన అంశం. గతంలో రైతుల రుణాలు మాఫీ చేసిన దాఖలాలు లేకపోలేదు కానీ,  నూతన ఆర్ధిక సంస్కరణల నేపధ్యంలో ఇప్పుడా వెసులుబాటు కూడా  కానరావడం లేదు. రిజర్వ్ బ్యాంక్  నియమనిబంధల ప్రకారం నడుచుకోవాల్సిన పరిస్తితి. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష వై.యస్.ఆర్. పార్టీ అసాధ్యం అని కొట్టివేసినా, 'మనసుంటే మార్గం వుంటుందని, ఆరునూరయినా అమలుచేసి చూపుతాం' అంటూ టీడీపీ నాయకులు  బీరాలు పలికారు. ఎన్నికల్లో గెలిచి అధికార పీఠం ఎక్కిన తరువాత కానీ తత్వం బోధపడలేదు.  అందులో ముడిపడివున్న చిక్కుముడులన్నీ అవగతం కాలేదు.
తరువాత రకరకాల ఆలోచనలు చేశారు. నిజానికి ఈ విషయంలో చంద్రబాబు ఎన్ని పాట్లు పడాలో అన్నీ  పడ్డారు. బ్యాంకులను వొప్పించడం కోసం, కేంద్రాన్ని అర్ధించడం కోసం ఎక్కిన గడప ఎక్కకుండా కాలుకు బలపం కట్టుకుని తిరిగారు. సమావేశాలు పెట్టారు. సమీక్షలు జరిపారు. కానీ ఫలితం పూజ్యం. మరోపక్క కొత్త రాష్ట్రం  ఆర్ధిక పరిస్తితి చూస్తే మరింత అధ్వాన్నం. స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు, పోను పోను ఉద్యోగుల  నెల జీతాలు చెల్లించడం కూడా  గగనంగా మారే ప్రమాదం పొంచి వుందని. ఈ స్తితిలో వేల కోట్లు అవసరం అయ్యే రుణమాఫీకి నిధులు సమకూర్చుకోవడం అంటే మాటలు కాదు. అందుకే కాస్త మాట తప్పినట్టు అనిపించినా సరే, ఇచ్చిన మాటను ఎంతో కొంతయినా నిలబెట్టుకోవాలని చంద్రబాబు తాపత్రయపడ్డారు. ఈ క్రమంలో రుణమాఫీ పధకానికి ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. రైతుల రుణాలకు కొత్త భాష్యాలు చెప్పారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వంటి అర్ధం కాని మాటలు చెప్పారు. కుటుంబానికి ఒక రుణం అన్నారు. బంగారం తాకట్టు రుణాల మాట పక్కన బెట్టారు. డ్వాక్రా రుణాలు తరువాత చూస్తాం అన్నారు. దొంగ ఖాతాలు అన్నారు. ఆధార్  కార్డుల మెలిక పెట్టారు. బ్యాంకు ఖాతాలకే నేరుగా జమ చేశాం చూసుకొండన్నారు. ఇంత చేసినా, చివరికి  వ్రతం చెడ్డా ఫలం దక్కని చందం అయింది. నానా ఇబ్బందులు పడి ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగాం అని తృప్తి పడడమే మాత్రమే మిగిలింది.
ముఖ్యమంత్రిగా విశేష అనుభవం, పరిపాలనాదక్షుడిగా ఎంతో పేరూ వున్న చంద్రబాబు, ఒక్క హామీ కోసం ఇంతగా లాయలాస పడాలా అని అనుకున్నవాళ్ళు వున్నారు. 'ఆరునూరయినా సరే, రైతుల రుణ మాఫీ  హామీని నూటికి నూరుపాళ్ళు అమలుచేసి తీరుతాం' అని తెలుగుదేశం నాయకులు  పదేపదే ప్రకటనలు చేస్తూ పోవడంతో,  ఈ విషయంలో సన్నగిల్లిన రైతుల ఆశలు మళ్ళీ చిగుళ్ళు వేస్తూ వచ్చాయి. వున్న వాస్తవాన్ని ప్రజలకు వివరించి, హామీ అమల్లో వున్న ఇబ్బందులను విడమర్చి చెప్పి వుంటే రైతులు సకాలంలో తమ బకాయిలు ఏదోవిధంగా సర్దుబాటు చేసుకుని వుండేవారు. నిజానికి రుణమాఫీ చేయాల్సిందని రైతులు ఎప్పుడూ అడగలేదు. తన పాద  యాత్ర సమయంలో రైతుల కడగండ్లు గమనించి టీడీపీ అధినేత  అడక్కుండా ఇచ్చిన వరం అది.  బహుశా అందుకే కాబోలు ఆయన ఈ హామీ అమలుపట్ల అంతగా ప్రయాస పడివుంటారని అనుకోవాలి.
ప్రతి కధకూ ఒక నీతి వుంటుంది.
హామీల విషయంలో ప్రతి రాజకీయ పార్టీ కూడా నేర్చుకోవాల్సిన నీతి పాఠం వుందని ఈ రుణ విమోచన హామీ ఉదంతం తెలియచేస్తోంది.
అమలు చేయగలిగిన హామీ మాత్రమే ఇవ్వాలన్నది ఆ నీతి.
తమ పరిధిలో లేని, తమ చేతిలో లేని  హామీలు గుప్పిస్తూ పోతే, ఇదిగో  ఇలాటి అనుభవాలే మిగులుతాయి.



NOTE: COURTESY CARTOONIST

(04-02-2015)

12, అక్టోబర్ 2014, ఆదివారం

గుర్తొస్తున్న ఓ జ్ఞాపకం


చంద్రబాబు నాయుడు గారు తొలిసారో, మలిసారో యావత్ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి 'మీడియా సావీ ముఖ్యమంత్రి' గా ఎదురులేని పాలన సాగిస్తున్నప్పుడు, భవదీయుడికి ఒక 'ధర్మ సందేహం' కలిగింది. కరెంటు 'కట్లు' ఏ టైం లో ఎక్కడెక్కడ ఎంతసేపు ఉంటాయో రాష్ట్ర ప్రజలందరికీ ముందుగానే తెలియచేసి, తదనుగుణంగా వాటిని అమలు చేసే పని ముమ్మరంగా జరుగుతున్న  రోజులవి.  ఏమాటకామాటే చెప్పుకోవాలి. కరెంటు కొరత పుష్కలంగా ఉన్నప్పటికీ, కోతలు  మాత్రం ఠంచనుగా టైం ప్రకారం ఆయన హయాములో అమలయ్యేవి. ఆ కోతల సమయాలు పరికిస్తే, రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఒకే సమయంలో కరెంటు వుండే అవకాశం లేదు. కరెంటు లేకపోతే టీవీలు పనిచెయ్యవు. అయినా ముఖ్యమంత్రిగారు 'టీవీ' లకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు. అదీ,  నాక్కలిగిన ధర్మ సందేహం. 'వాళ్ళనీ వీళ్ళనీ ఎందుకు నేరుగా ఆయన్నే అడుగుదాం' అనుకుని ఒకోజు విలేకరుల సమావేశం ముగిసిన తరువాత ఆయన తన చాంబర్ కు వెడుతున్నప్పుడు మధ్యలో కలుసుకుని నా మనసులో మాట చెప్పాను. 'మీరు చెప్పేది ప్రజలకు చేరాలని అనుకుంటున్నారా లేక మీరు చెప్పేది మీరే చూడాలనుకుంటున్నారా?' అని. మడత పెట్టి అడిగినా నా ప్రశ్న లోని మర్మం తెలియనివాడు కాడు కనుక సమాధానంగా ఓ నవ్వు నవ్వి, ' సాంబశివరావుగారూ (ముఖ్యమంత్రి పేషీలో ఐ.ఏ.ఎస్. అధికారి) శ్రీనివాసరావు ఏదో అంటున్నాడు, కాస్త వినండి' అంటూ విషయం ఆయనకు వొప్పచేప్పి ఆయన లోపలకు వెళ్ళిపోయారు.
(తుపాను విరుచుకుపడబోయే ప్రాంతాలలో కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయనీ, అనేక ప్రాంతాలలో కరెంటు సరఫరాకు విఘాతం కలిగిందనీ వార్తలు వస్తున్ననేపధ్యంలో  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు వీడియో సందేశం ద్వారా విజ్ఞప్తి  చేసారని పత్రికల్లో చదివినప్పుడు ఈ సంగతి గుర్తుకు వచ్చింది)

20, ఆగస్టు 2013, మంగళవారం

బాబుగారితో ఓ సాయంత్రం


నిన్న సాయంత్రం ఒక టీవీ ఛానల్ నుంచి తిరిగి వస్తుంటే ఫోను.
చిరపరిచితమైన నెంబరు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీయార్ భవన్ నుంచి ఆ ఫోను.  అయిదేళ్ళ క్రితం వరకు ఆ నంబరు నుంచి రోజూ  అనేక ఫోన్లు వచ్చేవి. అప్పుడు నేను దూరదర్శన్/ ఆకాశవాణిలో విలేకరిగా పనిచేస్తున్నాను.
‘ఎడ్వైజర్ కృష్ణయ్య గారు మాట్లాడుతారు’ ఆపరేటర్ పలకరింపు.
టీటీడీ ఈవోగా, సీనియర్ ఐఏఎస్ అధికారిగా జర్నలిస్టులందరికీ కృష్ణయ్య గారు  చిరపరిచితులు. ఉన్నత ఉద్యోగం వొదులుకుని రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
‘రేపు (అంటే ఈ సాయంత్రం) నాలుగు గంటలకు బాబుగారు మీడియా విశ్లేషకులు కొందరితో ఇష్టాగోష్టిగా ముచ్చటించాలని అనుకుంటున్నారు. మీరు కూడా వస్తే బాగుంటుంది’
జర్నలిస్టుగా పదవీ విరమణ చేసినప్పటినుంచి మళ్ళీ ఏనాడు ఏపార్టీ గుమ్మం కూడా ఎక్కలేదు.
కానీ కాదనడానికి కూడా కారణం కనిపించలేదు. ఎందుకంటే అది విలేకరుల సమావేశం కాదు. పార్టీ ఆఫీసులో కూడా కాదు. చంద్రబాబునాయుడి గారి ఇంట్లో.


ఇంటికి వచ్చి చూస్తే టీవీల్లో స్క్రోలింగులు వస్తున్నాయి,  రాష్ట్ర రాజకీయ పరిస్తితులపై మీడియా విశ్లేషకులతో చంద్రబాబు సమావేశం అంటూ. ఆయన ఏం అడుగుతారు ? ఏం చెప్పాలి ?  ఇప్పటికే మీడియా  విశ్లేషకుల మీద సోషల్ మీడియాలో అనేక రకాల వ్యాఖ్యలు వెలువడుతున్నాయి, చక్రాంకితాలు కనబడని ఆయా పార్టీల అధికార ప్రతినిధులని.  
ముప్పయ్యేళ్ళ పైచిలుకు విలేకరి జీవితంలో కూడా ఏనాడు ప్రశ్నలు వేసే అలవాటు చేసుకోలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రులను, సీనియర్ అధికారులను వేలేకరుల సమావేశాల్లో  కొందరు ప్రశ్నించే తీరుతెన్నులు గమనించిన తరువాత ప్రశ్నలు అడిగే  పద్దతికే నేను స్వస్తి చెప్పాను. కీర్తిశేషులు హిందూ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ గా పనిచేసిన రాజేంద్రప్రసాద్ గారి నుంచి నేను నేర్చుకున్న పాఠం ఇది. ఆయన ఒకసారి నాతో  అన్నారు, ‘ఒక తమాషా చూశారా.  ఇప్పుడు ప్రశ్నలు అడుగుతున్నవారినీ, వారు అడిగే ప్రశ్నలను గుర్తు పెట్టుకోండి. రేపు వాళ్ల పత్రికల్లో వాటిని గురించి ప్రస్తావన ఏమైనా  వుంటుందేమో గమనించండి.’    
అయితే ఇది ఆయన చేసిన ఒక  సాధారణ పరిశీలనగానే పరిగణించాలి తప్ప  జర్నలిస్టులను అందరినీ ఉద్దేశించి  చేసినదిగా భావించనక్కరలేదు.
అయితే, ఆయన మరో మాట కూడా చెప్పారు. ‘
‘కొందరు విలేకరులు ఆర్భాటం కోసం వేసే ప్రశ్నలకు నాయకులు చెప్పే జవాబులను జాగ్రత్తగా గమనిస్తే మంచి వార్తను పట్టుకునే అవకాశం వుంటుంది. కాబట్టి ఎంతో అవసరం అనుకుంటే తప్ప ప్రశ్నల జోలికి పోకుండా ‘వినదగునెవ్వరుచెప్పిన’ పాలసీ పెట్టుకుంటే మనం సవివరమైన వార్త అందించడానికి వీలుంటుంది.’
చూసి నేర్చుకోవాలంటారు. కానీ వినడం ద్వారా కూడా నేర్చుకోవచ్చు.
ఏదిఏమైనా, చంద్రబాబు గారిని ఎన్నో ఏళ్ళ తరువాత కలుసుకోబోతున్నాను.
షరా మామూలుగా ఆయనే చెబుతారా లేక ఎవరైనా చెప్పింది వింటారా ?
వేచి చూడాలి.
(20-08-2013 – 10 AM)     

               

5, జులై 2013, శుక్రవారం

హెల్మెట్ - 1987


ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు హెల్మెట్ ధారణను  నిర్బంధం చేయడంతో సామాన్య ప్రజలనుంచే కాకుండా జర్నలిస్టుల నుంచి కూడా నిరసనలు మొదలయ్యాయి. కే.ఎస్. వ్యాస్ గారు ట్రాఫిక్ డీసీపీ. చాలా సమర్దుడయిన పోలీసు అధికారి.  హెల్మెట్ నిబంధనను అమలు చేసే విషయంలో కొత్త పుంతలు తొక్కారు. ప్రధాన కూడళ్ళలో ప్రత్యెకంగా పోలీసు బృందాలను ఏర్పాటు చేసి హెల్మెట్ లేని వాళ్ళను మోటారు సైకిళ్ళపై  వెంటాడి పట్టుకుని జరిమానాలు వేయడం మొదలు పెట్టారు. ఇది జనంలో చాలా అసహనానికి దారితీసింది. ఇంటలిజెన్స్ చీఫ్ హెచ్ జే దొరగారికీ, పోలీసు కమీషనర్ టీ ఎస్ రావు గారికీ విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. ఎందుకంటే రామారావుగారికి చెప్పగల ధైర్యం ఎవ్వరికీ లేదు. ఒకరోజు పొద్దున్నే నేను జూబిలీ హిల్స్ లోని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పోయి హెల్మెట్ విషయంలో జర్నలిస్టులు పడుతున్న ఇబ్బందులు  గురించి చెప్పాను. వారు విధి నిర్వహణలో భాగంగా ప్రతిరోజూ అనేక చోట్లకు వెళ్ళాల్సి ఉంటుందని, అసలే చాలీచాలని జీతాలతో వెళ్ళదీస్తున్న వారికి – హెల్మెట్ పోయినా, లేదా ఎక్కడయినా మరచిపోయినా అంతంత డబ్బులు పోసి  కొనుక్కోవడం కష్టంగా ఉంటుందని చెప్పాను. ఆయన అంతా విని దొరగారికి ఫోను చేసి,  ఏదయినా చేయొచ్చేమో చూడమని చెప్పారు.
బహుశా ఆ మరునాడే అనుకుంటాను. 1987 జులై 14  వ తేదీ.   ప్రస్తుత ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి తండ్రి, మాజీ మంత్రి, అప్పటి శాసనసభ్యులు అయిన ఎన్. అమర్ నాధ రెడ్డి గారు అకస్మాత్తుగా మరణించడంతో అసెంబ్లీ వాయిదా పడింది. రేడియో వార్తలకు ఇంకా చాలా వ్యవధానం వుండడంతో ఆంద్రభూమిలో పనిచేసే నా మిత్రుడు సూర్యప్రకాష్ ను ఇంట్లో దింపడానికి స్కూటర్ మీద విజయనగర్ కాలనీకి  బయలుదేరాను. మధ్యలో ట్రాఫిక్ పోలీసు హెల్మెట్ లేదని ఆపాడు. దగ్గరలో వున్న హుమాయూన్ నగర్ పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్ళాడు. నా వెంట వచ్చిన సూర్యప్రకాష్ ఇంటికి వెళ్లి,  నన్ను పోలీసులు పట్టుకుపోయిన విషయం ఇతర జర్నలిస్టులకు తెలియచేసాడు. అంతే! బిలబిల మంటూ అనేకమంది పాత్రికేయ సోదరులు అక్కడికి చేరుకొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు మొదలు పెట్టారు. నేను లోపల పోలీసు స్టేషన్ లో ఉన్నందువల్ల గమనించలేకపోయాను కానీ తరువాత తెలిసినదేమిటంటే చాలామంది సీనియర్ పాత్రికేయులు కూడా అక్కడికి వచ్చి నాకు మద్దతుగా నిలిచారని. వారిలో హిందూ రాజేంద్రప్రసాద్, ఎక్స్ ప్రెస్ సుందరం, జ్యోతి వెంకట్రావు, క్రానికల్ రబీంద్ర నాథ్, సింహం, కన్నన్, పేట్రియాట్ ప్రభాకరరావు, న్యూస్ టైం కే.శ్రీనివాసరెడ్డి (ఇప్పుదు రెసిడెంట్ ఎడిటర్ హిందూ, బెంగుళూర్ ఎడిషన్)  జర్నలిస్ట్  యూనియన్ నాయకులు కే. శ్రీనివాసరెడ్డి, దేవులపల్లి అమర్, కే.లక్ష్మారెడ్డి, నందిరాజు రాధాకృష్ణ, లక్ష్మీ ప్రసాద్, నర్సింగరావు  ఒకరా ఇద్దరా హైదరాబాదులో పేరుమోసిన పాత్రికేయులందరూ హుమాయూన్ నగర్ పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు. పరిస్తితిలోని తీవ్రత పోలీసులకు కూడా అర్ధం అయింది.

(హుమాయూన్ నగర్ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేసున్న జర్నలిస్టులు)

మొత్తం మీద జర్నలిస్టుల ఆందోళన కారణంగా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో  నన్ను విడిచిపెట్టారు. కానీ మరునాడు విలేకరులు  అసెంబ్లీ కార్యకలాపాలను బహిష్కరించారు. ప్రెస్ గ్యాలరీ ఖాళీగా వుండడం గమనించి స్పీకర్ జీ. నారాయణ రావు సభను వాయిదా వేసారు. అప్పుడు  ముఖ్యమంత్రి  రామారావు గారు  వెంటనే స్పందించారు. సంఘటనతో సంబంధం వున్న పోలీసు అధికారిని బదిలీ చేసారు. న్యాయ విచారణకు ఆదేశించారు.   కొత్తగా హోమ్  మంత్రి  బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కోడెల శివప్రసాద్ రావుకు ఈ పరిణామాలు సహజంగానే ఇబ్బందికరంగా పరిణమించాయి. హెల్మెట్ నిబంధనను ప్రభుత్వం ఎత్తివేయలేదు కాని దాన్ని అమలు చేసే పద్ధతిలో కొంత ఉదార వైఖరి చోటు చేసుకుంది. ఈ నడుమలో నాకు మాస్కో రేడియోలో ఉద్యోగం రావడం, నేను కుటుంబంతో సహా సోవియట్ యూనియన్ వెళ్ళిపోవడం జరిగింది.   
దరిమిలా  ఈ హెల్మెట్ అంశం రాజకీయ రంగును పులుముకుంది. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానాలలో హెల్మెట్ రద్దు అంశం కూడా చేర్చారు. ఆఎన్నికల్లో టీడీపీ వోడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.  చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే జరిగిన  విజయోత్సవ సభలో హెల్మెట్ నిబంధనను  రద్దు చేస్తున్నట్టు సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారని ఆయనకు పీ ఆర్ ఓ గా పనిచేసిన జ్వాలా నరసింహారావు మాస్కోలో వున్న నాకు ఫోనులో తెలియచేసాడు.
వాహనదారులకు రక్షణ కవచంలా ఉపయోగపడే హెల్మెట్ విషయంలో జర్నలిస్టులు ఇంత  గొడవ పడడం సబబా అన్న విమర్శలు కూడా వినపడ్డాయి. ఆ పూర్వాపరాలు మరో సారి. (05-07-2013)