5, మే 2021, బుధవారం

ఒక రకంగా యుద్ధమే!

 పీఎం కేర్స్ (PMCARES) నిధులతో ఢిల్లీలోని AIMS, రాం మనోహర్ లోహియా ఆసుపత్రులలో రెండు భారీ ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన మొదలయిందని, రేపటి నుంచి రోగులకు ఆక్సిజన్ సరఫరా మొదలవుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియచేసింది. సంతోషం.

భారత సైన్యంలో EME అనే ఒక విభాగం వుంది. దాని ప్రధాన కార్యాలయం సికిందరాబాదు. రేడియో విలేకరిగా కొన్ని డజన్ల సార్లు ఈ విభాగం చేసే కార్యకలాపాలు దగ్గర నుండి చూసే అవకాశం నాకు లభించింది. సైన్యంలో ముందు భాగాన వుండి పోరాడే సైనికులకు అవసరం అయ్యే సరఫరాలను ఈ విభాగం కంటికి రెప్పలా కనిపెట్టి అందిస్తుంది. ఆయుధాలు, యుద్ధ పరికరాలు, వాటి నమూనాలు, అభివృద్ధి సమస్తం ఈ విభాగం ఆధ్వర్యంలో జరుగుతుంది. యుద్ధ రంగాల్లో అగ్రభాగాన నిలబడి పోరాడే సైనికులకు ఇది వెనకనుండి మద్దతు ఇస్తుంది. యుద్ధ సమయాల్లో దీని ప్రాధాన్యత చాలా వుంటుంది.
ఇప్పుడు దేశం సాగిస్తున్న కరోనాపై యుద్ధంలో కూడా ముందుండి పోరాడే డాక్టర్లు, నర్సులు, ఇతర సాంకేతిక వైద్య సిబ్బంది, రోగులకు అవసరం అయ్యే సరఫరాలను సరిగా అందేటట్టు చూడడానికి ఇటువంటి ప్రత్యేక విభాగం ఆవశ్యకత చాలా వుందనిపిస్తోంది.
దేశంలో అనేక చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతోంది. వాక్సిన్ అందుతోంది. ఇతర వైద్య పరికరాలు, ఔషధాలు సరిపడా ప్రస్తుతం లేకున్నప్పటికీ ముందు ముందు పరిస్థితులు బాగుపడే అవకాశాలు వున్నాయి. అయితే దేశంలో వివిధ రాష్ట్రాలలో అన్నిచోట్లా పరిస్థితులు ఒకే రకంగా లేవు. అవసరాలు కూడా విభిన్నంగా వున్నాయి.
రోగుల్ని గుర్తించడం, రోగ స్థాయిని నిర్దారించడం, వారి వైద్య అవసరాలను అంచనావేయడం, కావాల్సిన మందులు, పరికరాల సంఖ్యను గణించడం, ఆవశ్యకతని బట్టి వాటిని కాలయాపన జరగకుండా గమ్యస్థానానికి చేర్చడం ఇవన్నీ కరోనాపై చేసే యుద్ధంలో ప్రాధాన్యత కలిగిన అంశాలు.
అలాగే, ఒక చోట ఆక్సిజన్ అవసరం అవుతుంది. మరో చోట రెండెసివిర్ వంటి ఇంజెక్షన్లు అవసరం పడతాయి. ఇంకోచోట మరోటి అవసరం. ఈ అవసరాలు అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ సరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి. ఎక్కడా ఎవరికీ ఆలస్యం అన్నది జరగకుండా సరఫరాలు సాగాలి. ఎక్కడ ఎవరికీ ఏ పరిమాణంలో అవసరమో అక్కడికి అవి సత్వరం చేరేలా చూడాలి. దేశంలో ఎక్కడా, ఎవరూ తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామని బాధ పడే అవకాశం లేకుండా ఈ ఏర్పాట్లు పారదర్శకంగా వుండాలి. ఈ అవసరాలు అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ సరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి. ఎక్కడా ఎవరికీ ఆలస్యం అన్నది జరగకుండా సరఫరాలు సాగాలి. ఇందుకోసం అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఒక కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి.
ఇలాంటి విషయాల్లో మానవ సామర్ధ్యానికి సాంకేతిక వనరులు తోడయితే సత్వర ఫలితాలు సాధ్యం అవుతాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయడానికి ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి సాంకేతిక దేశీయ దిగ్గజాలు తలచుకుంటే చిటికెలో పని.
యుద్ధ ప్రాతిపదికన అనే పద ప్రయోగానికి నిజమైన అర్ధం ఇదే!
ఇవన్నీ ఒక పక్కన చేస్తూ మరో పక్కన అవసరం అనుకుంటే కర్ఫ్యూలు, లాక్ డౌన్ వంటి ప్రత్యామ్నాయాలు గురించి కూడా ఆలోచన చేయవచ్చు.
ఇక్కడ కేంద్రం, రాష్ట్రాలు అనే విభజన అనవసరం. చేస్తున్నది కరోనాపై యుద్ధం. జాతి యావత్తూ ఒక్కటై సాగించాల్సిన సమరం. పైగా గెల్చి తీరాల్సిన పోరాటం. మరో ప్రత్యామ్నాయం లేదు.
ఎన్నికల సమయంలోనే రాజకీయాలు, తరువాత పరిపాలన మాత్రమే అని రాజకీయ పార్టీల నాయకులు తరచూ చెబుతుంటారు. ఇప్పుడు ఇక కొత్తగా పెట్టే ఎన్నికలు కూడా లేవు. రాజకీయ నాయకులు తమ మాటల్లోని చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఇదే సరైన సమయం!
(05-05-2021)
కింది ఫోటో : ఢిల్లీలో నిర్మాణం పూర్తయిన ఆక్సిజన్ ప్లాంట్ ( కేంద్ర ఆరోగ్యశాఖ సౌజన్యం)



కామెంట్‌లు లేవు: