16, మే 2021, ఆదివారం

కరెంటులో బల్లి పడింది

 

హైదరాబాదులో మీకు ఒక్కరికే అధికారులు స్పందిస్తారా అని ఒక మిత్రుడు కామెంటు పెట్టారు. ఒక్కోసారి నాకూ ఈ అనుమానం వస్తుంటుంది. జర్నలిస్టు అవతారం చాలించి జనసామాన్యంలో నలుగురితో నారాయణ అంటూ జీవితం ప్రారంభించి కూడా పదహారేళ్ళు దాటిపోయింది. నాకు తెలిసిన అధికారులు కూడా తదనంతర కాలంలో రిటైర్డ్ జాబితాలో చేరిపోయారు. నిజం చెప్పాలంటే చాలామంది ఫోన్ నెంబర్లు కూడా తెలవదు.
మళ్ళీ కరెంటు కోతలు మొదలయినట్టున్నాయే అని పెట్టిన పోస్టుకు ముగ్గురు ఉన్నతాధికారులు స్పందించడం నాకు ముచ్చట అనిపించింది. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నేను వాళ్లకి ఒకటే చెప్పాను. కరెంటు సరఫరా పునరుద్ధరణ అయిన దానికంటే కూడా మీ ప్రతిస్పందన నాకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిందని.
అందరికీ ఇలా జరుగుతుందా అనేది నిజంగా శేష ప్రశ్నే. నా దగ్గర కూడా జవాబు లేదు.
ఈ పోస్టుకు కూడా ఓ చిన్న నేపధ్యం వుంది.
కొద్ది సేపటి క్రితం ఆనంద్ గారనే పెద్ద మనిషి ఫోన్ చేశారు. ఆయన పెద్ద మనిషే కాదు, విద్యుత్ శాఖలో పెద్ద అధికారి కూడా. (SE).
రాత్రి ఓ బల్లి కారణంగా విద్యుత్ సరఫరాకు కొంత అంతరాయం కలిగిందని చెబితే ఆశ్చర్యపోయాను. చెట్ల కొమ్మల వల్ల అప్పుడప్పుడూ ఇలా జరుగుతుందని తెలుసు. కానీ బల్లిపాటు వల్ల కూడా కరెంటు ట్రిప్ అవుతుందన్న మాట.
సరే! ఈ సంగతి పక్కనపెడితే నేను చెప్పేది ఒక్కటే. స్పందించే అధికారులు, సిబ్బంది వుంటే ప్రజలకు ఓ భరోసా వుంటుంది. చెప్పింది వినే నాధుడు వుంటే సగం సమస్య తీరుతుందంటారు.
(16-05-2021)

కామెంట్‌లు లేవు: