17, మే 2021, సోమవారం

అద్దంకివారి గేదె

 ఇది ఇప్పటి సంగతి కాదు, అరవై ఏళ్ళ పైమాటే!

ఖమ్మంజిల్లా దెందుకూరు నివాసి అద్దంకి రాఘవయ్య గారికి గేదెలు అంటే ప్రాణం. ఎక్కడెక్కడో తిరిగి బర్రెలు కొనుక్కు రావడం ఆయనకో వ్యాపకం. ఒకసారి అదేపని మీద బెజవాడ వెళ్ళారు. అద్దంకి శ్రీరామ మూర్తి గారు ప్రముఖ రంగస్థల నటులు. వారి అబ్బాయి కృష్ణ ప్రసాద్. ఇప్పడు ఏం చేస్తున్నారో తెలవదు కానీ, కొన్నాళ్ళు రేడియోలో వార్తలు చదివారు.
బెజవాడలో అద్దంకి శ్రీరామమూర్తి గారి బర్రెను బేరమాడి కొనుక్కున్నారు దెందుకూరు రాఘవయ్య గారు. అలా వేరే చోట కొన్న పశువుల్ని సొంత ఊరు తీసుకువెళ్ళాలి అంటే ‘రహదారి’ రాయించాలి. అంటే ‘ఆ పశువును దొంగతనంగా తీసుకువెళ్ళడం లేదు, డబ్బు పెట్టి కొనుక్కు వెదుతున్నట్టు తెలిపే పత్రం’ అన్నమాట. ఆ రాదారి రాయిస్తుంటే క్రయవిక్రయదారుల ఇంటి పేర్లు ‘ఒక్కటే’ అన్న విషయం బయట పడింది. అప్పుడెవరో అన్నారుట. ‘ పరవాలేదు, అద్దంకివారి గేదె తిరిగి అద్దంకి వారి ఇంటికే వెడుతోంది’ అని.
నేను రాసిన రేడియో న్యూస్ రీడర్లు అనే కధనం చదివి, ఖమ్మం నుంచి అద్దంకి కృష్ణ ప్రసాద్ అనే పెద్దమనిషి ఫోను చేసారు. ఆయన రాఘవయ్య గారి కుమారుడు. హెడ్ మాస్టర్ గా చేసి రిటైర్ అయ్యారు. అద్దంకి శ్రీరామమూర్తి గారి తనయుడు కృష్ణ ప్రసాద్ కూడా రేడియోలో వార్తలు చదివారని ఆయనే నాకు చెప్పారు. ఈ విషయం నిజంగా నాకు తెలియదు. మొత్తంమీద ‘రహదారి’ గురించి ఒక కొత్త విషయం అయితే తెలిసింది. అంతే చాలు.

కామెంట్‌లు లేవు: