12, ఏప్రిల్ 2020, ఆదివారం

వార్తలు చదువుతున్నది పార్వతీప్రసాద్! ఇకలేరు !


దుర్వార్తలకు గంధర్వుల శాపం ఉందేమో! మొదలు పెడితే చాలు వరసగా అవే.
ఆకాశవాణి న్యూస్ రీడర్ పార్వతి ప్రసాద్ గారు ఈ తెల్లవారుఝామున కన్నుమూసారు. గత కొద్దికాలంగా అస్వస్తులుగా వుంటున్నారు. ఆ సంగతి తెలిసినా పోలేని పరిస్తితి. డి. వెంకట్రామయ్య గారు పోయినప్పుడు ఆవిడ కలిసారు. సంస్మరణ సమావేశంలో పార్వతి గారే సర్వం చూసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే మాడపాటి సత్యవతి గారు, దుగ్గిరాల పూర్ణయ్య గారు, పొత్తూరి  వెంకటేశ్వర రావు గారు, సి.నరసింహారెడ్డి గారు, ఈరోజు పార్వతి గారు.
ఇంతమెల్లగా మృదువుగా మాట్లాడే పార్వతి గారు వార్తలు ఎలా చదువుతారు అనిపించేది. కానీ ఆవిడ రెడియోలోనే కాదు, దూరదర్సన్లో కూడా వార్తలు చదివారు.
ఒకసారి ఢిల్లీ నుంచి ఆలిండియా రేడియో డైరెక్టర్ జనరల్ వచ్చారు. ఆర్వీవీ కృష్ణారావు గారు, సీజీకే మూర్తిగారు అందరం కలిసి మాట్లాడుతుంటుంటే అప్పుడే రేడియోలో వార్తలు మొదలయ్యాయి. పార్వతిగారు చదువుతున్నారు. తెలుగు తెలియని డీజీ గారు శ్రద్ధగా వింటున్నారు. ఆవిడ స్టూడియో నుంచి రాగానే డీజీ లేచి నిలబడి ఆవిడని అభినందించారు. చక్కటి స్వరం అని మెచ్చుకున్నారు. ఆవిడ క్యాజువల్ న్యూస్ రీడర్ అని చెబితే రెగ్యులర్ రీడర్ల కంటే బాగా చదివారని ఆయన అందరిలో ప్రశంసించడం పార్వతి గారి ప్రతిభకి తార్కాణం.
‘బాగున్నారు కదా!’ అని ఆత్మీయంగా పలకరించే మనిషి ఇక కనబడరు. ఆవిడ సుస్వర స్వరం మరి వినపడదు.
పార్వతీ ప్రసాద్ గారి ఆత్మశాంతికి ప్రార్ధించడం మినహా ఈ కరోనా సమయంలో చేయగలిగింది లేదు.