16, ఆగస్టు 2022, మంగళవారం

పంద్రాాగస్ట్ ప్రభాత్ భేరీ - భండారు శ్రీనివాసరావు

 పంద్రాగష్టును మొదటిసారి పండుగ రూపంలో స్వతంత్ర భరత జాతి యావత్తు ఒక్కటై జరుపుకున్ననాటికి నేను ఏడాది శిశువుని. రెండో పండగ, రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవాన్ని తొలిసారి జరుపుకున్నప్పుడు నా వయస్సు అటూ ఇటుగా నాలుగేళ్ళు.

నాకు ఊహ తెలుస్తున్న వయస్సులో ఈ రెండు పండగలను యెంతో ఉత్సాహంతో జరుపుకున్న రోజులు యిప్పటికీ జ్ఞాపకం వున్నాయి. పొద్దున్నే లేచి బడికి వెళ్లి పంతులు గారు త్రివర్ణపతాకం చేతబట్టుకుని ముందు నడుస్తుంటే పిల్లలం అందరం ఊరేగింపుగా ఊరంతా తిరుగుతూ ప్రభాత్ భేరిలో పాల్గొనేవాళ్ళం.
ప్రభాత్ భేరి అనే మాటకు అర్ధం తెలియని వయసు. అయినా అలా ఊరేగింపుగా బయలుదేరి 'భారత్ మాతాకీ జై' అని నినాదాలు చేస్తూ వీధుల్లో తిరుగుతూ వుంటే ఊరంతా ఉత్సాహం ఉరకలెత్తేది. 'జనగణమన' గీతంలో, ఏ ఏ భాషల ప్రస్తావనవుందో, ఏ ఏ ప్రాంతాల ప్రసక్తి వుందో మాకు అప్పటికి తెలియదు. ఆ గీతాన్ని ఎవరు రాసారో, ఏ భాషలో రాసారో అంతకంటే తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే అది అందరి గీతం. జనగణమన చరణాలలోని, 'న' ను 'న' లాగా, 'ణ' ను 'ణ' లాగా, తప్పులు దొర్లకుండా ఎలా పాడాలన్న తపన ఒక్కటే మాకు తెలిసింది. ఢిల్లీ ఎక్కడ వుందో తెలియదు, ఎర్రకోట అంటే తెలియదు, కానీ దానిపై చాచా నెహ్రూ జండా ఎగురవేస్తాడని మాత్రం తెలుసు. ఏమీ తెలియని అజ్ఞానంలోని మధురిమను ఆస్వాదించడం కూడా ఒక మంచి అనుభవమే అని ఈనాడు ఆ రోజులను గుర్తుకు తెచ్చుకుంటే అనిపిస్తోంది.
అవును. ఎక్కడికి పోయాయి ఆ రోజులు?
'లేవరా నాన్నా! ఈరోజు స్కూల్లో జండా ఎగరేస్తారు తొందరగా వెళ్ళాలి' అని తల్లి అంటే- ‘కాసేపు పడుకోనీ మమ్మీ, ఈ రోజు సెలవే కదా!' అని పిల్లలు ముసుగేసి నసిగే రోజులు వచ్చేసాయి. పండగదినం స్తానంలో సెలవు రోజు వచ్చింది. తప్పులు లేకుండా ‘జనగణమన' పాడడం పోయి, ఆ గీతంలో తప్పులెన్నే రోజు వచ్చింది. ఏటేటా జరిగే పతాక ఆవిష్కరణలు మొక్కుబడిగా మారిపోయాయి. మర్నాడు ఆ జాతీయ పతాకాలను ఏ స్థితిలో చూడాల్సి వస్తుందో అనే బెంగ మాత్రం మిగిలిపోతుంది.
ఏమి చెప్పుదు సంజయా!
(16-08-2022)

కామెంట్‌లు లేవు: