29, సెప్టెంబర్ 2018, శనివారం

సంచలన వార్తల సునామీలో తెలుగు మీడియా – భండారు శ్రీనివాసరావు

  
(Published in SURYA telugu daily on 30-09-18, SUNDAY)
గత కొద్ది రోజులుగా పట్టిన ‘వార్తల ముసురుతో’ తెలుగు రాష్ట్రాల్లో మీడియా తడిసి ముద్దవుతోంది.
ఒకదాని వెంట మరో వార్త ఎవరో తరుముతున్నట్టు వస్తూ ఉండడంతో మీడియా ఉడ్డుగుడుచుకుంటోంది.
మరో రెండు రోజుల్లో, అక్టోబరు రెండో తేదీన  పదవీవిరమణ చేయబోతున్న భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, కొద్ది రోజుల వ్యవధానంలోనే అతి ముఖ్యమైన అంశాలలో కీలకమైన పలు తీర్పులను వరసగా  వెలువరించి మీడియాకు మరింత పని ఒత్తిడి కలిపించారు.
స్వలింగ సంపర్కం  తప్పు కాదంటూ ఇచ్చిన తీర్పుపై రగిలిన రగడ చల్లారక ముందే వివాహేతర సంబంధాలు శిక్షార్హమైన నేరం కాదంటూ సుప్రీం ఇచ్చిన మరో తీర్పు అయోధ్య వివాదం పై తాజాగా  ఇచ్చిన మరో తీర్పును మరుగున పడేసింది. ఇదిలా ఉండగానే శబరిమల దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై వున్న నిషేధాన్ని సుప్రీం కొట్టివేయడం సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలకు ఊపిరి ఊదింది. భీమా కొరేగాం కేసుకు సంబంధించి వరవరరావు గృహ నిర్బంధాన్ని మరో మాసం పాటు పొడిగిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న నిర్ణయం కూడా ఈ వరుస లోనిదే.
దీనికి తోడు రెండు తెలుగు రాష్ట్రాలలో నియోజక వర్గాల పెంపు గురించి ఎప్పుడో పాతరేసిన మరో అంశానికి ఊపిరి పోస్తూ కేంద్రహోం శాఖ ఎన్నికల కమీషన్ ను నివేదిక కోరడం,  తెలంగాణలో ముందస్తు ఎన్నికల  ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ దాఖలయిన కేసులో వారం రోజుల లోగా వివరణ ఇవ్వాలని  తెలంగాణా ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి సుప్రీం నోటీసులు ఇవ్వడం, దరిమిలా ముందు అనుకున్న ప్రకారం ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అంశంపై అనుమాన మేఘాలు ముసురుకోవడం, ఇది ఇలా ఉండగానే,  నాలుగు ఇతర రాష్ట్రాలతో కలిపి తెలంగాణలో ఎన్నికలు నిర్వహించడానికి అన్నీ సక్రమంగా వున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు నివేదిక ఇవ్వడం ఇలా పరస్పర విరుద్ధమైన సమాచారాలు ఇప్పటికే  బాగా పేరుకుపోయిన  అయోమయ పరిస్తితిని మరింత పెంచుతూ పోతున్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్, టీడీపీ శాసన సభ్యుడు చింతమనేని ప్రభాకర్ నడుమ సాగుతున్న మాటల యుద్ధం రోజురోజుకూ తన స్వరూప స్వభావాలను మార్చుకుంటూ కొత్త వివాదాలకు, సరికొత్త రాజకీయ ఆరోపణలకు తెర తీస్తోంది. తనపై భౌతిక దాడులు జరుగుతున్నాయని, చంపడానికి కుట్ర జరుగుతోందని స్వయంగా పవన్ ప్రకటించడం ఆయన పార్టీ కార్యకర్తల్లో, అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆ స్థాయి నాయకుడు చేసిన ఇటువంటి ఆరోపణలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవడం అవసరమనిపిస్తోంది.
అలాగే విశాఖ ఒడిసా సరిహద్దుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు,  అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ ఇరువురూ ఒకేచోట, ఒకేరోజు మావోయిస్టుల  తుపాకుల బారినపడి , ఒకేసారి  అసువులు బాయడం ఆ ప్రాంతంలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో సయితం ప్రకంపనలు సృష్టించింది. ఒక గిరిజన ఎమ్మెల్యేను  మావోయిస్టులు మట్టుబెట్టడంలో పోలీసుల వైఫల్యం వుందని భావించిన గిరిజనులు ఒక్క పెట్టున అరకు పోలీసు స్టేషన్ పై దాడి చేసి దాన్ని ధ్వంసం చేయడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు.
ఈ నేపధ్యంలో అమెరికాలో జరిపిన ప్రతిష్టాత్మక  పర్యటన నుంచి స్వరాష్ట్రానికి తిరిగివచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇటువంటి సమస్యలు స్వాగతం పలకడంతో తన  పర్యటనలో సాధించిన విజయాలను, విశేషాలను ప్రజలకు తెలియప్పాలనే   ఉత్సాహంపై నీళ్ళు చల్లినట్టు వుండవచ్చు.  పులిమీద పుట్రలా  పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో, ఒకప్పుడు తమ పార్టీలో ఒక వెలుగు వెలిగి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న రేవంతరెడ్డి ఇంటిపైనా, ఆయన బంధువుల ఇళ్ళ మీదా  ఆదాయపు పన్ను(ఐటీ), ఎన్ఫోర్స్ మెంటు విభాగం (ఈడీ)  అధికారులు దాడులు జరపడం,  ఒక్క రేవంతరెడ్డి ఇంట్లోనే దాదాపు రెండు రోజులు ముమ్మరంగా సోదాలు చేయడం, అనేక గంటలపాటు రేవంత్ రెడ్డిని విచారించడం,  కోట్లరూపాయల్లో సాగిన   బినామీ లావాదేవీలకు సంబంధించిన సమాచారాలు బయటకు పొక్కుతూ వుండడం, అదే సమయంలో మరుగున పడిపోయిన ‘ఓటుకు కోట్లు’ కేసు మరోసారి తెర మీదికి వస్తూ వుండడం తెలుగుదేశం అధినేతకు ఈ తరుణంలో అంతగా రుచించని విషయాలే.
అందుకే ఆయన తన మనసులోని మాటను ఆచితూచినట్టుగా మాట్లాడుతూనే  బయట పెట్టారు కూడా. ‘దొంగలు, నేరగాళ్ళను పట్టుకోలేరు కానీ రాజకీయ వేధింపులకు మాత్రం ముందుంటున్నారు’ అని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టారు. ‘ఎన్నికలు రాగానే మొదలు పెడుతున్నారు. ఈ పద్దతులు దేశానికి మంచిది కావు. అవినీతిపరుల తాట తీస్తానని చెప్పిన ప్రధాని మోడీ ఇప్పుడు అదే అవినీతిపరులను కాపాడే ప్రయత్నం చేయడం వల్ల మోడీ విశ్వసనీయత కోల్పోయారని విమర్శించారు.
అయితే, అంతకు ఒక రోజు ముందే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ అధినేతపై ఇదే విధమైన విమర్శ చేయడం గమనార్హం. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు రౌడీలుగా ప్రవర్తిస్తున్నా అధినాయకుడు  పట్టించుకోవడం లేదని పవన్ తన ప్రజాపోరాటయాత్రలో ప్రసంగిస్తూ ఆరోపించారు. అవినీతిపరులను ముఖ్యమంత్రి కాపాడుతున్నారు అని అర్ధం వచ్చే రీతిలో ఆయన ప్రసంగం సాగింది.     
పొతే, రేవంతరెడ్డి ఉదంతం తెలంగాణలో భారీ స్థాయిలో  రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణా కాంగ్రెస్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో తలమునకలుగా వున్నప్పుడు ఐటీ, ఈడీ దాడులు గురించిన సమాచారం టీవీ ఛానళ్ళు ప్రసారం  చేయడం మొదలు పెట్టిన దాదిగా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి, సీనియర్  కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, దామోదర రాజ నరసింహ,  వీ. హనుమంతరావు, మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డాక్టర్ మల్లు రవి, డి. అరుణతో   సహా అనేకమంది   నేతలు రేవంతరెడ్డికి సంఘీభావం తెలిపారు. ఈ మొత్తం వ్యవహారాన్ని బీజేపీ, టీఆర్ఎస్ కలిసి చేస్తున్న  ఒక రాజకీయ కుట్రగా అభివర్ణించారు. లేనిపోని కేసులు పెట్టి తమ నాయకులను టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులను వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఇందుకు మద్దతుగా గండ్ర వెంకట రమణా రెడ్డి, జగ్గారెడ్డి కేసులను ఉదహరిస్తున్నారు.
కాంగ్రెస్ నాయకుల ఆరోపణలను టీఆర్ఎస్ నాయక శ్రేణులు ఖండిస్తున్నాయి. ఐటీ, ఈడీ విభాగాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి కావని, అవి కేంద్రప్రభుత్వ ఆధీనంలోనే పని చేస్తాయని పేర్కొంటూ రేవంత్ రెడ్డి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, తమ పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదని, కేవలం రాజకీయ లబ్దికోసం కాంగ్రెస్ నాయకులు ఇలాంటి ఆధార రహిత ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ బాల్క సుమన్ వంటి టీఆర్ఎస్ నాయకులు  ఎదురు దాడి మొదలు పెట్టారు.
ఇలాంటి సందర్భాలు గతంలో కూడా ఎదురయ్యాయి. అప్పుడూ రాజకీయాల రంగు అంటుకుని అవీ ఈనాటికీ కూడా ఒక దరీదాపూ చేరని అంశాలుగానే  ఉండిపోతున్నాయి.
ఏదైనా ఒక కేసు రాజకీయ రంగు పులుముకుందంటే ఇక అది  ఒక పట్టాన తేలదు అనే భావన సామాన్య ప్రజల్లో వుంది. రాజహంసలు పాలను, నీళ్ళనీ విడదీయగలిగిన చందంగా,  రాజకీయాల నుంచి  శిక్షార్హమైన కేసులను విడదీసి చూడగలిగిన  విజ్ఞత రాజకీయాల్లో రానంత కాలం  ప్రస్తుతం రాజకీయ రంగంలో కానవస్తున్న ఇటువంటి పెడ ధోరణులకు ముకుతాడు వేయడం సాధ్యం కాదన్నది అత్యధికుల అభిప్రాయంగా తోస్తున్నది. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని రాజకీయ కక్షలను తీర్చుకోవడం, లేదా పార్టీలను అడ్డు పెట్టుకుని  చట్టం నుంచి తమను తాము కాపాడుకోవడం ఈనాటి రాజకీయుల వైఖరిగా వుందని, అంచేతే నేరస్తులు తాము చేసిన నేరాలకు శిక్ష పడకుండా తప్పించుకోగలుగుతున్నారని, అదేసమయంలో   ప్రత్యర్ధులు చేయని నేరాలకు కూడా  తమ అధీనంలో ఉన్న  రాజ్యాంగ వ్యవస్థలను వాడుకుంటూ వారిని వేధింపులకు గురిచేస్తున్నారనీ  ఇలా రెండు రకాల అభిప్రాయాలు ప్రజల మనస్సులో నాటుకుపోయేలా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయనే  ఓ అపప్రధ కూడా వుంది. ‘చట్టం ఎవరికీ చుట్టం కాదని, అది తన పని తాను  చేసుకు పోతుందని అధికారంలో వున్నప్పుడు వ్యాఖ్యలు చేసిన నోటితోనే, అధికారంలో లేనప్పుడు అటువంటి కేసులను ‘రాజకీయ కుట్రగా అభివర్ణించడం’ గత కొన్నేళ్లుగా రాజకీయాలను శ్రద్ధగా గమనిస్తూ వచ్చేవారికి అనుభవైకవేద్యమే.    ఇటువంటి రాజకీయ ఎత్తుగడల కారణంగా నష్టపోయేది మన ప్రజాస్వామ్యమే. వ్యవస్తల పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లితే పరిణామాలు దారుణంగా ఉంటాయనే వాస్తవాన్ని ఈనాటి రాజకీయ పార్టీలవాళ్ళు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.  
జనాలకు ఏదీ కలకాలం జ్ఞాపకం వుండదనే ధీమా వారినిలా మాట్లాడిస్తుంది కాబోలు.
పరిస్తితులకు తగ్గట్టు  స్వరం మార్చడమే రాజకీయమా!
ఏమో! రాజకీయులే చెప్పాలి. కానీ వాళ్ళు చెప్పరు.Top of Form
                                                        
మనది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమని చెప్పుకుంటూ వుంటాం. నిజమే.  పెద్దప్రజాస్వామ్య దేశమే. కానీ అతి పెద్ద  రుగ్మతలతో అది కునారిల్లుతోందనే వాస్తవాన్ని విస్మరిస్తున్నాము. ప్రజాస్వామ్యానికి ఎన్నికలే మూలం. ఆ మూలంలోని లోపాలను సవరించుకోకపోగా , వాటిని రాజకీయ పార్టీలు తమ స్వార్ధానికి వాడుకోవడం మౌనంగా చూస్తూ వుండడం కూడా మన ప్రత్యేకత.
నేరం చేసినట్టు అభియోగాలు వున్నవాళ్ళు చట్ట సభల్లో ప్రవేశించకుండా, వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆంక్షలు విధించాలనే ప్రతిపాదన చాలాకాలంగా వుంది. నేరం రుజువై న్యాయ స్థానాల్లో శిక్షలు పడిన వాళ్ళకే ఈ అనర్హత నిబంధన వర్తింప చేయాలని మరి కొందరు అంటున్నారు. లేనిపక్షంలో అధికారంలో వున్నవాళ్ళు తమ ప్రధాన ప్రత్యర్ధులను ఏదో ఒక కేసులో ఇరికించి వారి బెడదను శాశ్వతంగా తొలగించుకునే ప్రయత్నం చేస్తారని వారి వాదన. అది సబబు అనుకుంటే మరో సమస్య వచ్చి పడుతుందని వారి ప్రత్యర్ధుల వాదన. న్యాయ స్థానాలలో ఏళ్ళతరబడి కేసులు పరిష్కారానికి నోచుకోకుండా ఉంటున్న విషయాన్ని వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. కేసులు ఒక కొలిక్కి వచ్చేలోగా వాటిని ఎదుర్కుంటున్న వ్యక్తుల రాజకీయ జీవితం ఎన్నేళ్ళు సాగినా దానికి  అడ్డంకి ఉండదని వాళ్ళ భావన.
మరి పాము చావకుండా, కర్ర విరక్కుండా పరిష్కారం ఎలా! అనేది మరో ప్రశ్న.
చట్టసభల్లో  సభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధాన మంత్రులు కావచ్చు ఒకటి రెండు పర్యాయాలకు మించి పదవుల్లో కొనసాగకుండా రాజ్యాంగ సవరణ చేసుకోవడం ద్వారా ఈ ప్రశ్నకు జవాబు లభిస్తుందని మరి కొందరి అభిప్రాయం. అలా చేసినా వారసుల సంగతేమిటి, వారసత్వంగా వాళ్ళ  అధికారం కొనసాగేలా చేసుకుంటే అప్పుడు ఏమి చేయాలి అనేది మరో జవాబు లేని ప్రశ్న.
ఇవన్నీ ప్రజాస్వామ్యప్రియులు మధన పడే విషయాలు. ప్రజాస్వామ్యం పేరుతొ పదవులు, అధికారాన్ని అనుభవించే రాజకీయుల అభిప్రాయాలు ఖచ్చితంగా ఇలా ఉండవని మాత్రం ఘంటాపధంగా చెప్పవచ్చు.     
ఎందుకంటే వారికి గమ్యం ముఖ్యం, మార్గం కాదు.

8 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

స్వలింగ సంపర్కం- ok. అక్రమ సంబంధం- ok, ఆలయంలోకి మెజార్టీ ప్రజలకు విరుద్ధంగా ప్రవేశం- ok. త్వరలో మాదక ద్రవ్యాలకు ఓకె అవుతుందేమో.అదేదో దేశంలో ఇప్పటికే ఒకే అన్నారంట. ఇప్పుడు జంతువులకు ఎల్జీబీటికి ఇతర వర్గాలకు ఉన్న హక్కులు సామాన్య మానవులకు లేవు.

అజ్ఞాత చెప్పారు...

>>ఆలయంలోకి మెజార్టీ ప్రజలకు విరుద్ధంగా ప్రవేశం- ok

దేశమంతా వన్యప్రాణి చట్టం అమలౌతున్నా, గుళ్ళల్లో మాత్రం ఏనుగుల్ని వాడుకోవచ్చు-ok

ఆవుమాంసం నిషేదించారు-ok



డిల్లీలో పొల్లుషన్ దెబ్బకి పగలే వాహనాలు కనిపించట్లేదు.. కాబట్టి.. దేశమంతా 4జి వాహనాలకి లైట్లు ఎప్పుడూ వెలిగే ఉండాలి - ok


>> త్వరలో మాదక ద్రవ్యాలకు ఓకె అవుతుందేమో

మా నాయకుడికి పెరుగు తింటం ఇష్టం లేదు.. అది నిషేదిస్తారు - ok

వారణాసిలో మాంసాహారం తినరు కాబట్టి.. దేశమంతా మాసాహార నిషేధం అమలు చేస్తాం - ok

అస్సలు అంతా అన్నం మానేసి, ఆలూ చపాతీ మాత్రమే తినాలని చట్టం తెస్తాం - ok

అజ్ఞాత చెప్పారు...

you forgot to mention -----------

"40 million cows to get Aadhaar-like number at cost of Rs 50 crore in 1st phase" --------

https://www.hindustantimes.com/india-news/40-million-cows-to-get-aadhaar-like-number-at-cost-of-rs-50-crore-in-1st-phase/story-9f50M1CkgBoCSym5SR1VzL.html


అజ్ఞాత చెప్పారు...

నేను ఇదికూడా పెట్టడం మర్చిపొయ్యాను: గోవు అడ్డంపెట్టుకోని, మేం చంపినవాల్లు 100 కి దగ్గరలో ఉన్నారు. Thank you dear Modi

విన్నకోట నరసింహా రావు చెప్పారు...


వాట్సప్ లో తిరుగుతున్న మెసేజ్ 👇 :-

స్వలింగ వివాహం - నేరం కాదు.
వివాహేతర సంబంధం - నేరం కాదు.
నేరారోపణలున్న వారు ఎన్నికలలో నిలబడడం - నేరం కాదు.

మరేవిటి నేరం? హెల్మెట్ పెట్టుకోకపోవడమా?

అజ్ఞాత చెప్పారు...

ఉడ్డుగుడుచుకుంటోంది- చీ పాడు ఏమిటీ కుర్ కురే మాటలు.

అజ్ఞాత చెప్పారు...

ధూ నీ యవ్వ. బుచికి తీర్పుల తోని సమాజాన్ని భ్రష్టు పట్టిస్తుంది.

సూర్య చెప్పారు...

ఒక సంచలన వార్తని మాత్రం రాయకుండా వదిలిపెట్టినట్లున్నారే. తెలియక కాదు...తెలిసే.. రాయటం ఇష్టం లేక.