26, జులై 2022, మంగళవారం

నన్ను మన్నించు! నన్ను క్షమించు!

 


గత మూడేళ్ళుగా ఈ మాటలు నాలోనేను ఎన్ని లక్షలసార్లు అనుకుని ఉంటానో, ఇంకా అనుకుంటూనే వున్నానో లెక్క లేదు. ఇప్పడు ఎన్ని అనుకున్నా, ఎన్నిసార్లు అనుకున్నా ఏమిలాభం, వినే మనిషి మనుషుల్లో లేకుండా పోయిన తర్వాత.  

భద్రాద్రి రాముడిని ప్రస్తుతిస్తూ రచించిన  దాశరధి శతకంలో కంచర్ల గోపన్న ఇలా అంటాడు.

“సిరిగల నాడు మైమరచి చిక్కిననాడు దలంచి పుణ్యముల్

పొరిబొరి సేయనైతినని పొక్కిన గల్గునె గాలి చిచ్చుపై

గెరలిన వేళ దప్పికొని కీడ్పడు వేళ జలంబు గోరి త

త్తరమున ద్రవ్వినం గలదె దాశరథీ కరుణాపయోనిధీ!”

శరీరానికి ముసలితనం వచ్చిన తరవాత, ఇప్పటి వరకు పుణ్యమైన పనులను ఏమీచేయలేకపోయానే అని ఎంత బాధపడినప్పటికీ ప్రయోజనం ఉండదు. అందువలన ఓపికగా ఉన్న రోజులలోనే భగవంతుడి మీద భక్తితో పుణ్యకార్యాలను చేయాలి. లేకపోతే బాధపడవలసి వస్తుంది  అనేది తాత్పర్యం.

భార్యాభర్తల్లో ఎవరు ముందో ఎవరు వెనకో ఎవరూ చెప్పలేరు. అంచేత జీవించి ఉన్నప్పుడే ఒకరినొకరిని  బాధ పెట్టే పనులు చేయకుండా, మనసును నొప్పించే మాటలు అనకుండా వుంటే తర్వాత బాధ పడాల్సిన అవసరం వుండదు.

అలా అని మా ఆవిడని నేనేదో నానా  బాధలు పెట్టానని కాదు, ఆమె జీవించి వుండగా  ప్రేమించాల్సినంతగా ప్రేమించలేదేమో అని, ఆదరంగా పలకాల్సిన పలుకులు పలకలేదేమో అని మనసు మూలల్లో ఓ బాధ.

ఇది తీరేది కాదు.

ఆగస్టు మాసం వస్తోంది అంటే ఇది మరింత సెల వేస్తుంది.



(26-07-2022)  

 

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

🙏

అజ్ఞాత చెప్పారు...

ఇంతగా అడిగినా మన్నించకుండా వుంటారాండి ? అదిన్నూ మీకని పుట్టిన వారు కదా వారు

'మన్నించే' వుంటారు.