18, మార్చి 2021, గురువారం

సోషల్ మీడియా

 

"సోషల్ మీడియాలో కొన్ని వాస్తవాలు
ఇంకొన్ని ఊహాగానాలు
మరికొన్ని అభూతకల్పనలు"
చివరిదానిపై తొందరపడి కామెంట్ చేయడం మంచిది కాదు.
ఇలా రాయడానికి ఓ నేపధ్యం వుంది. మొన్నీ మధ్య సుప్రీం కోర్టుకు సంబంధించి ఇద్దరు జర్నలిస్టులు వేర్వేరుగా పోస్టులు పెట్టారు.
పోటీ చేసిన అభ్యర్ధులు అందరికంటే నోటాకు ఎక్కువ వస్తే మళ్ళీ ఎన్నిక జరపాలని ఎలక్షన్ కమిషన్ ని ఆదేశించాలని కోరుతూ ఒకాయన కోర్టులు వెడితే, సుప్రీం కోర్టు సంబంధిత శాఖలకు నోటీసులు ఇచ్చింది. ఇదీ వార్త. కానీ ఆ ఇద్దరు సుప్రీం కోర్టు తీర్పుగానే పోస్టు పెట్టారు. ఒక జర్నలిస్టుకు, తెలిసిన వాడు కాబట్టి చెబితే సరిదిద్దుకున్నాడు. రెండో అతను తన పేరుకే జర్నలిస్టు అని ట్యాగ్ తగిలించుకున్నవాడు. చెప్పినా లాభం లేదని మానేశాను.
ఇన్ని రోజులైనా ఆయన తన పొరబాటు ఒప్పుకోలేదు సరికదా, సరిదిద్దుకోలేదు కూడా.
నాకు బాగా గుర్తు. గతంలో ‘కలం’ తిరిగిన పెద్ద పెద్ద సీనియర్ జర్నలిస్టులు కూడా ఆర్టికిల్ లేదా వార్త రాస్తూ ఏదైనా అనుమానం కలిగితే ఏమాత్రం భేషజం లేకుండా తమ దగ్గర పనిచేసే జూనియర్లను, లేదా ఫోను చేసి తోటి జర్నలిస్టులను అడిగి సందేహ నివృత్తి చేసుకునే వారు. తాము రాసిన దాంట్లో ఎలాటి పొరబాటు దొర్లకూడదు అనే నిబద్ధతే వారినలా చేయిస్తోంది అనుకునేవాడిని.
ఇప్పుడు సోషల్ మీడియా అలాంటి విషయాల్లో బాగా అక్కరకు వస్తోంది, సరిగా ఉపయోగించుకోవాలనే సదుద్దేశం ఉన్న పాత్రికేయులకు.నా రాతల్లో చిన్న పొరబాటు దొర్లినా వెంటనే ఎత్తి చూపుతున్నారు. ఇందుకు నేను చిన్నబుచ్చుకోవడం లేదు. పైగా సంతోషిస్తున్నాను. ఎందుకంటే దొర్లిన పొరబాట్లను సవరించుకోగల వెసులుబాటు వున్న మీడియం ఇది.
నాకు అర్ధం అయిందేమిటంటే ప్రస్తుతం సమాజంలో చైతన్యం బాగా పెరిగింది. ప్రతి ఒక్కరూ ప్రతి విషయాన్ని సునిశితంగా పరిశీలిస్తున్నారు. చూసినవీ, విన్నవీ, చదివినవీ చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటున్నారు. చక్రాంకితాలు వేసుకున్న కొందరు రాజకీయ పార్టీల అభిమానులని మినహాయిస్తే చాలామంది, చాలా వరకు చక్కని, విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అయితే కాస్తంత ఓపిక కావాలి, రాళ్ళల్లో నుంచి బియ్యం ఏరడానికి.
(18-03-2021)

కామెంట్‌లు లేవు: