22, మార్చి 2021, సోమవారం

ఇల్లెందుకే నీకు చిలకా! – భండారు శ్రీనివాసరావు

 'డెబ్బయ్ అయిదేళ్లు వచ్చాయి. సొంత ఇల్లంటూ వున్నట్టు లేదు. ఇలా ఎన్నాళ్ళు' అని శ్రేయోభిలాషులు తరచూ అడిగే ప్రశ్న.

మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాలరావు గారు అయిదుగురు ముఖ్యమంత్రుల దగ్గర వరసగా అయిదేళ్ళ పాటు పీఆర్వో గా పనిచేశారు. రాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ గా, ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా పదవీవిరమణ చేసి, సొంత గూడంటూ లేకుండా, సిటీ బస్సుల్లో తిరిగేవాడు. ఆయన్ని ఇలాగే అడిగేవారు, ‘ఇంతింత పెద్ద కొలువులు చేస్తున్నావు, ఇల్లేమైనా కట్టావా!’ అని. ‘కట్టాను, ఈ నెల అద్దె’ అంటూ ఆయన చిరునవ్వుతో ఇస్తుండే జవాబు నాకు బాగా గుర్తు. ఇల్లంటూ కట్టుకోకుండానే, ఏవీ కూడబెట్టుకోకుండానే దాటిపోయాడు. ఆయన ముందు పిపీలికాన్ని నేనెంత? పిల్లలు బాగా చూసుకుంటున్నారు. అదే పదివేలు. పోతే, ఈ ప్రశ్న ఎదురయినప్పుడల్లా ఎప్పుడో చదివిన ఓ ఇంగ్లీష్ కధ జ్ఞాపకం వస్తుంది. ఆ కధకు నా స్వేఛ్చానువాదం.
"అనగనగా ఓ రాజుగారు. ఆ రాజుదగ్గర ఓ పనివాడు. వాడిని చూసినప్పుడల్లా రాజుగారికి ఆశ్చర్యంతో కూడిన సందేహం. 'నాకింత హంగూ ఆర్భాటం వుంది. లేదనేది లేదు. అయినా ఏదో లోటు ఎప్పుడూ తొలుస్తూనే వుంటుంది. వీడేమిటి ఎప్పుడూ చూసినా మొహంలో అంత నిశ్చింత. రేపు యెలా గడుస్తుంది అన్న బాధ కనిపించదు. ఏవిటి వీడి వ్యవహారం?'
"రాజుగారి చింత మంత్రిగారు కనిపెట్టాడు. రాజుగారికి చెప్పి తొంభయ్ తొమ్మిది బంగారు మొహరీలు తెప్పించాడు. వాటిని ఓ సంచీలో వుంచి ఆ పనివాడి గుమ్మం ముందు వొదిలి పెట్టి రమ్మని భటులను ఆదేశించాడు.
"తెల్లారి లేచిన తరువాత పనివాడికి తన గుమ్మం ముందు పడివున్న సంచీ కనబడింది. లోపలకు తీసుకు వచ్చి విప్పి చూశాడు. కళ్ళు జిగేల్ మన్నాయి. అన్నీ బంగారు కాసులు. లెక్కబెట్టాడు. 99 వున్నాయి. అనుమానం వచ్చి మళ్ళీ లెక్కించాడు. పొరబాటు ఏమీ లేదు. 99 నాణేలు మాత్రమే వున్నాయి. మరి ఆ ఒక్క మొహరీ ఏమైంది?
"పనివాడికి మరోపని లేకుండా పోయింది. మరో ఆలోచన లేకుండా పోయింది. ఎలాగైనా ఆ ఒక్క నాణెం సంపాదించి మొత్తం నూరు నాణేలు సొంతం చేసుకోవాలి అన్న ధ్యాస పెరిగింది. ఈ యావలో పడి పెళ్ళాం పిల్లలతో అచ్చట్లు ముచ్చట్లు తగ్గిపోయాయి. సర్వం కోల్పోతున్న భావన. తెలియని దిగులుతో నిద్ర పట్టేది కాదు. అన్నం సయించేది కాదు.
"పనివాడిలో కనబడుతున్న మార్పు రాజుగారు గమనించాడు. మంత్రిగారు వచ్చి టీకా తాత్పర్యం చెప్పకుండానే ఆయనకు విషయం బోధపడింది.
ఏవీ లేనప్పుడు అ పనివాడికి ఏ చింతా లేదు. 99 నాణేలు సొంతం కాగానే వాటిని నూరు చేయాలన్న తాపత్రయం బాగా పెరిగిపోయింది. ఆశ దురాశగా మారితే మనుషులు యెలా మారిపోతారన్నది రాజు గారికి తెలిసివచ్చింది."
(22-03-21)

2 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

స్వగృహం అంటూ‌ ఒకటి కావాలనుకోవటం దురాశ అనో అత్యాశ అనో అనుకోలేమండీ. ఐతే స్వంత ఇల్లు అనే కల ఎంతమందికి నెఱవేరుతుందీ అన్నది సామాజికపరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది. ఏకం వాసం వనంవా పత్తనంవా అని ఒక నానుడి ఉంది. అది ఒక శ్లోకం లోనిది. ఐతే సమస్తభోగాకరం ఐన పట్టణంలో భోగిగానే లేదా కేవల విరాగిగా ఏదైనా అరణ్యంలోనో నివసించాలీ అని దీని తాత్పర్యం. అలా ఎందుకూ అంటే అరకొఱసౌకర్యాల బ్రతుకులో అసంతృప్తి పాత్ర అమితం‌ అని సూచించటానికి. అందరూ విరాగులూ కాలేరు. మూణ్ణాళ్ళ బ్రతుక్కి స్వంతం అంటూ ఏమిటీ స్వంత యిల్లు లేకున్నా ఏం మునిగిపోదు అనుకోలేరు. అందరూ భోగులు కాలేరు సమస్తసౌకర్యాలతో పన్నెండంతస్థుల పూర్తి సెంట్రల్ ఏసీ మేడమీద స్విమ్మింగ్‌పూల్ కట్టించుకొని హాయిగా ఉండగలగటానికి. ఏదో ఉన్నంతలో తృప్తిగా జీవించాలనే ఆలోచిస్తారు. ఆ సామాన్యమైన కోర్కెల్లో ఒకటి, ఎవరూ ఎప్పుడూ పొమ్మనని నా అనే ఇల్లు కూడా తప్పక ఉంటుంది.అంతకంటే మరేమీ లేదు.

Zilebi చెప్పారు...



ఇల్లు లేదా! అద్దె ఇంట్లో ఉన్నారా! అయితే అన్ని ఇళ్లూ మీవే ఉన్నంత దాకా :)

ఏ గూడైనా శాశ్వతం కాదోయ్ నరుడా :)



జిలేబి