29, మార్చి 2021, సోమవారం

వెలుగు చూడని వార్తలు - భండారు శ్రీనివాసరావు

 వై.ఎస్.ఆర్., చంద్రబాబు తమదైన స్టైల్లో  హాయిగా నవ్వేశారు. అయితే కలిసి కాదు. విడివిడిగా వేర్వేరు సందర్భాలలో.

రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా రెండో దఫా ఎన్నికలకు సిద్ధం అవుతున్న రోజులు.

ఏదో కార్యక్రమానికి వెళ్లి బేగంపేట లోని సీఎం క్యాంపు ఆఫీసుకు తిరిగివస్తున్నారు. ముందు సీట్లో కూర్చుని వున్న వై.ఎస్. ఆర్., యదాలాపంగా వెనక సీట్లో కూర్చున్న వ్యక్తిగత సిబ్బందిని అడిగారు రాష్ట్రంలో పరిస్తితి ఎలావుందని. ఐ.ఏ.ఎస్. అధికారి తడుముకోకుండా చెప్పేశారు, పరిస్తితులు పాలక పక్షానికి అనుకూలంగా వున్నాయని.

ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్సులు జనంలోకి బాగా వెళ్ళాయి. అలాగే సేద్యపు నీటి ప్రాజెక్టులు. ప్రజల్లో రవంత కూడా వ్యతిరేకత ఉన్నట్టుగా నాకనిపించడం లేదు. ధైర్యంగా ఉండొచ్చు’

మాట్లాడుతుండగానే క్యాంపు ఆఫీసు వచ్చింది. కారు దిగబోతుండగా ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుడు రవిచంద్ ఇలా అన్నారు.

దేనికయినా బుల్లెట్ ప్రూఫ్ వుంటుంది, పొగడ్తలకు తప్ప’

వై.ఎస్.ఆర్. కి రవిచంద్ మాటల్లో భావం బోధపడింది.

పెద్దగా నవ్వేశారు, తనదయిన స్టైల్లో.

సమైక్య రాష్ట్రంలో టీడీపీ ఏలుబడిలో వున్న కాలం. చంద్రబాబు ముఖ్యమంత్రి. సీపీఎం మిత్రపక్షం.

శాసనసభలో ఆ పార్టీ నాయకుడు నర్రా రాఘవరెడ్డి. ముఖ్యమంత్రితో ఓ రోజు పిచ్చాపాటీ సాగిస్తున్నారు.

లాభం లేదు రాఘవరెడ్డి గారు, ఇప్పుడు అంతా హైటెక్ కాలం నడుస్తోంది. పాత పద్దతులు పట్టుకుని వేల్లాడుతూ కూర్చుంటే ఉపయోగం ఉండదు. చప్పట్లు కొడితే వీధి దీపాలు వెలగాలి’ అన్నారు చంద్రబాబు.

సరే. కొట్టకుండా వెలగవు కదా! చప్పట్లు కొట్టడానికి అయినా ఓ మనిషి వుండాలి కదా! అందుకే చప్పట్లను కాదు, మనుషుల్ని నమ్ముకోవాలి’ అన్నారు రాఘవరెడ్డి..

ఇంకోరోజు వేరే విషయంలో నర్రా రాఘవరెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. ఆ విషయానికి సంబంధించిన పేపరు కటింగ్ చూపెట్టారు.

భలేవాళ్ళే రెడ్డి గారు మీరు. పేపరు చూసి రాజకీయాలు చేస్తే యెట్లా?’ అన్నారు నారా వారు.

అవునండీ మేము పేపరు చూసి రాజకీయాలు చేస్తాము, మీ పార్టీ వాళ్ళలాగ జేబులు చూసి కాదు’ అనేశారు నర్రావారు.

ఆ మాటలకు చంద్రబాబు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. నవ్వేశారు తనదైన స్టైల్లో చిరు మందహాసం చిందిస్తూ.

కామెంట్‌లు లేవు: