3, జులై 2014, గురువారం

యెంత కష్టం యెంత కష్టం


ఆరు నెలల కిందట మేము ఈ ప్రాంతంలో అద్దెకు  వచ్చినప్పుడు మా అపార్ట్ మెంటుకు  ఐ మూలగా ఓ ఖాళీ స్థలం వుండేది. కొద్ది రోజుల్లోనే అక్కడ ఇంటి నిర్మాణం మొదలు పెట్టారు. హైదరాబాదు లాంటి నగరంలో ఇది కొత్త విషయం ఏమీ కాదు. కానీ కొత్తగా ప్రస్తావించుకోవడానికి కొత్త నేపధ్యం ఒకటి కలిసి వచ్చింది.


వరసగా కొన్ని గంటల పాటు కరెంటు లేకపోవడం వల్ల, ఎంతో ఖర్చు పెట్టి పెట్టించుకున్న ఇన్వర్టర్లు కూడా పనిచేయడం మానేసాయి. అంచేత ఎండ గాలో వడ గాలో ఏదో ఓ గాలి వస్తే చాలనుకుని పడక గది కిటికీ తెరిచాను. ఆర్నెల్ల కిందట ఆకారం కూడా లేని ఆ నిర్మాణం చిత్రంగా రెండంతస్తులు లేచింది. మూడో  దానిమీద పిల్లర్లు వేస్తున్నారు. ఓ యాభయ్ అరవై మంది కూలీలు ఆడా మగా సుశిక్షితులయిన వారి మాదిరిగా నిర్విరామంగా ఆ ఎర్రటి ఎండలో పనిచేస్తున్నారు. కొందరు కంకర ఎత్తి పోస్తుంటే మరికొందరు ఇసుక, సిమెంటు కొలిచి గుండ్రంగా తిరుగుతున్న ఓ మిక్సింగ్ యంత్రంలో పోస్తున్నారు. అలా తయారయిన కాంక్రీటును ఓ చిన్న లిఫ్ట్ లాంటి యంత్రం మూడో  అంతస్తుకు చేరుస్తోంది. అక్కడ దాన్ని దించుకున్న కూలీలు బొచ్చెల్లో తీసుకు వెళ్ళి పిల్లర్లను నింపుతున్న కూలీలకు అందిస్తున్నారు. అంతా ఒక క్రమ పధ్ధతి ప్రకారం జరిగిపోతోంది. బోలెడు కష్టపడిపోతున్న ఫీలింగు కూడా వారిలో వున్నట్టు దూరం నుంచి గమనిస్తున్న నా దృష్టికి ఆనలేదు. సరిగ్గా వొంటి గంట  కాగానే గంట  కొట్టినట్టు పనులు ఆగిపోయాయి. ఎవరికి వారు అక్కడ డ్రమ్ముల్లో వున్న నీళ్ళతో మొహం కాళ్ళూ చేతులూ కడుక్కుని ఇళ్లనుంచి తెచ్చుకున్న భోజనాలు చేశారు. చూడగలిగిన కళ్ళు వుండాలే కాని చుట్టూ వున్న ప్రపంచంలో చూడగలిగినవి ఎన్నో వున్నాయి. అయినా ఇంకా ప్రపంచం చుట్టిరావాలన్న యావ చావడం లేదు ఎందుకో అర్ధం కాదు.
కరెంటు వచ్చింది. ప్యాను తిరిగింది. వొళ్ళు చల్లబడింది. కానీ ఎర్రటి ఎండలో కూలీల చుట్టూ తిరిగొచ్చిన మనసు మాత్రం ఇంకా వేడిగానే వుంది. ఆవిర్లు కక్కుతూ నే వుంది.
అసలు విషయం ఇప్పుడు విప్పుతాను. మొదట్లో నేపధ్యం ఒకటుంది అని చెప్పాను గుర్తుంది  కదా! అదే ఇది.

మేముంటున్న ప్రాంతానికి దగ్గర్లోనే ఈమధ్య వార్తల్లో చోటుచేసుకుంటున్న గురుకుల్ అనండి  అయ్యప్ప సొసైటీ అనండి - అనేక ఇండ్లు కూల్చేసిన ప్రాంతం వుంది. ఫోటోల్లో చూసినప్పుడు, ఇదిగో ఇప్పుడు చెప్పానే మా ఇంటి దగ్గర నిర్మాణంలో వున్న ఇల్లు, దానికంటే అవి చాలా పెద్దవిగా అనిపించాయి.  ఆరునెలల నుంచి కడుతున్నా ఇది ఇంకా పూర్తి కాలేదు. అలాటిది ఆ కూల్చేసిన ఇళ్లు కట్టడానికి కనీసం ఏడాది పట్టి వుంటుంది. అన్నాళ్ళు అధికారులు, అనుమతులు లేకుండా జరుగుతున్న ఆ నిర్మాణాలను గమనించలేదా! లేదా కళ్ళుండి కూడా నేను గమనించనట్టు వాళ్ళూ చూడలేదా! ఒక్క ఇల్లు కట్టడానికే ఇంతమంది ఇంతటి ఎండాకాలంలో తమ రక్త మాంసాలను ఫణంగా పెట్టి ఎంతో శ్రమ పడుతున్నారు.   ఇసుక సిమెంట్ కంకరతో పాటు వారి స్వేదం కూడా ఆ నిర్మాణం అణువణువులో  వుంది. ఎంతో కష్టపడి కట్టిన ఇళ్లను ఏమాత్రం కష్టపడకుండా యంత్రాల సాయంతో కూల్చివేయడం ఏం న్యాయం?  ఎలాటి న్యాయం అనిపించుకుంటుంది. అంత డబ్బు అది ఎవరిదయినా కావచ్చు పూర్తిగా నీళ్లు  వొదులుకున్నట్టే కదా!    ఇన్నాళ్ళు అనుమతి లేని నిర్మాణాలను కాసులకు కక్కుర్తిపడి అనుమతిస్తూ వచ్చిన  అధికారులను, సిబ్బందిని వారు ఎవరయినా సరే, వారి వెనుక ఎవరు వున్నా సరే, కనీసం   ఓ యాభయ్ మందిని నిర్దాక్షిణ్యంగా  ఉద్యోగాలనుంచి ఉన్నపెట్టున శాశ్వితంగా  తొలగిస్తే మళ్ళీ ఇలాటి నిర్మాణాలు జరుగుతాయా! మిగిలిన అన్ని విషయాలు పక్కనబెట్టి  ఆలోచించండి.                   

4 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

"ఎంతో కష్టపడి కట్టిన ఇళ్లను ఏమాత్రం కష్టపడకుండా యంత్రాల సాయంతో కూల్చివేయడం ఏం న్యాయం?"

అయితే యంత్రాలు వాడకుండా గునపాలు వాడి కూల్చాలా?

అజ్ఞాత చెప్పారు...

ఏమి వాడి కూల్చాలో 2011 లో అడ్డం పడ్డ మీ కవితక్క ని అడిగితే బావుంటాది. ముందు , ఆ పని మీద ఉండండి ఇక్కడ నీతులు & questionings వదిలి.

అజ్ఞాత చెప్పారు...

శ్రమజీవుల స్వేదం వృధా అయిందనే మీ ఆలోచన బాగుంది.

చట్టం తన పని తాను "సమయానికి" చెయ్యకపోవటంవల్లనే ఈ వస్తు, కాల, శ్రమ వృధా.

nsvr murthy చెప్పారు...

ఉద్యోగులని మాత్రమే ఇంటికి పంపిస్తే లాభం ఏంటి? గల్లీ లోని చోటా లీడర్ నుండి కార్పొరేటర్ ఎం ఎల్ ఎ ఆపై మినిస్టెర్ స్థాయిలవరకు ఇందులో హస్తం ఉంది.. ఉద్యొగులపై ఒత్తిడి తేవడం వినకపోతే ట్రాన్స్ఫర్ కుదరకపోతే ఏ సీ బీ దాడులు చేయించడం.. తిమింగలాలను వదిలి చేపలని చంపడమేంటో?

ఏదైనా అక్రమ నిర్మాణాన్ని ఆపితే రాజకీయ నాయకులు చేసే హడావిడి తెలియదా మనకి?

హైదరాబాద్ లో ఎంతో మంది నాయకులు వీటిని అడ్డం పెట్టుకునే ఎదిగారు.. అది మనకందరికి తెలుసు వాళ్ళెవరనేది..

ఇప్పుడు టీ ఆర్ ఎస్ కూడా చేసేది ఆపనే.
గురుకుల్ ట్రస్ట్ భూములను ఖాళీ చేయిచేదెందుకంటే ఆంధ్రోళ్ళను ఖాలీ చెయించామంటూ తెలంగాణా లో పాతుకుపోవడానికే..

గురుకుల్ ట్రస్ట్ నిర్మాణాలని కూల్చినట్లు చేస్తే హైదరాబాద్ 80% ఖాళీ అవుతుంది.. కృష్ణా నగర్ బొరబంద యూసఫ్ గూడా జగద్గిరిగుట్ట ఇలా ఎన్నెన్నో ప్రాంతాలకు ప్రాంతాలే ఖాళీ అవుతాయి.. వీటన్నిటిని కూల్చే ధైర్యం ఉందా?