30, జులై 2014, బుధవారం

వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 9

వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 9                   
ఆ తరువాత ముఖ్యమంత్రులయిన శ్రీయుతులు అంజయ్య, భవనం వెంకట్రాం, విజయభాస్కర రెడ్డి, ఎన్టీ రామారావు - తమ పేషీల్లో వ్యక్తిగత సిబ్బందిని తమకు ఇష్టం వున్నవారితో మార్పులు చేసుకున్నప్పటికీ పీ ఆర్ వొ గా మాత్రం, చెన్నా(రెడ్డి) నుంచి అన్నా(ఎన్టీయార్) వరకు మా అన్నయ్య పర్వతాలరావుగారే కొనసాగారు. ముఖ్యమంత్రులు, ఆఖరికి పాలించే పార్టీలు మారినా పీ ఆర్ వొ గా ఆయన కొనసాగడం అనేది ఇప్పటికీ ఒక రికార్డు.


తన అనుభవాలను ఏర్చి కూర్చి 'చెన్నా టు అన్నా' అనే గ్రంధాన్ని రాయాలనే తలంపు వున్నట్టు ఆయన అనేకసార్లు అనుకున్నారు. మా అన్నయ్య అని చెప్పడం కాదు కాని, పర్వతాలరావు గారు మంచి ధారణ కలిగిన వ్యక్తి. ఆంధ్ర ఆంగ్ల భాషల్లో మంచి ప్రవీణుడు. చక్కని రాయసకాడు. గేయం రాసినా, వ్యాసం రాసినా సుబోధకంగా వుండేది. ప్రసంగ వ్యాసాలు  రాయడంలో దిట్ట. 'ఈ చీకటి గొందులలో, లేఖినీలాస్యం,చెప్పు తెగింది' అనే గేయ సంపుటాలు, ప్రకాశం గాధాశతి, జై భీమ్ కధలు, పరమాచార్య పావన గాధలు, Charaka - Redactor, par excellence, Veena, Mrudangam, Leather Puppets, Dwakra Crafts అనే రచనలు చేశారు.
పర్వతాలరావు గారు నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. అయిదుగురు ముఖ్యమంత్రుల దగ్గర  అయిదేళ్లపాటు పనిచేసి, సమాచారశాఖ డైరెక్టర్ గా, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించి,  పదవీ విరమణ చేశారు. మొదటి ఉద్యోగం నుంచి చివరి ఉద్యోగం వరకు ప్రభుత్వ వాహనం, డ్రైవర్ సదుపాయాన్ని దాదాపు నాలుగు దశాబ్దాలపాటు అనుభవించి  రిటైర్ అయిన తరువాత హాయిగా సిటీ బస్సులు, ఆటోల్లో తిరగడం చూసి మాకే చిత్రమనిపించేది. రిటైర్ అయిన కొద్ది మాసాలకే నారసింహతత్వం అధ్యయనం నిమిత్తం దక్షిణ, ఉత్తర భారతంలోని అనేక నరసింహ దేవాలయాలను దర్శించి పరిశోధన చేసి 'నమో! నారసింహాయ!' అనే పేరుతొ ఆరు సంపుటాలను వెలువరించారు. చాప మీద కూర్చుని, తొడమీద కాగితాల బొత్తి పెట్టుకుని వేల పేజీలు వెనక్కి తిరిగి చూసుకోకుండా, ఎవరి సాయం తీసుకోకుండా ఆయన రాసిన తీరు అమోఘం. అలా ఆధ్యాత్మిక రచనా వ్యాసంగంలో తుచ్చ రాజకీయ రచనల వాసన ఆయనకు రుచించినట్టు లేదు. అందుకే కాబోలు 'చెన్నా టు అన్నా' వెలుగు చూడలేదు.

జీవిత చరమాంకంలో పుట్టపర్తిలో మా వొదినె సరోజినీదేవి  గారితో కలిసి ఓ చిన్నగదిలో వుంటూ, రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ, 2006 ఆగస్టు 21 వ తేదీన, తను ఇబ్బంది పడకుండా, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా  ఆకస్మిక గుండెపోటుతో కన్నుమూశారు.  మనిషి అనేవాడు మనీషిగా యెలా జీవించవచ్చో నిజం చేసి చూపాడు కాబట్టే ఆ సర్వేశ్వరుడు ఆయనకు అలాటి ఆనాయాస మరణం అనే వరాన్ని అనుగ్రహించాడు.         

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

'మనిషి అనే వాడు మనిషిగా ఎలా జీవించాలో నిజం చేసి చూపారన్నా మాటలు చాలు ఆయన వ్యక్తిత్వం తెలుసుకునేదుకు ....